Sakshi News home page

ముఖ్తార్‌ అన్సారీ మృతిపై విచారణ జరిపించాలి: మాయావతి

Published Fri, Mar 29 2024 12:24 PM

Mayawati Demands Inquiry Of Mukhtar Ansari Death - Sakshi

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నేత 'ముఖ్తార్‌ అన్సారీ' గుండెపోటుతో గురువారం (మార్చి 28) సాయంత్రం మృతి చెందారు. గుండెపోటుతో ఆయన తుది శ్వాస విచినట్లు అధికారులు చెబుతుంటే.. తన తండ్రికి స్లో పాయిజన్‌ ఇచ్చి చంపేశారంటూ ముఖ్తార్‌ కుమారుడు 'ఉమర్' ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై కోర్టును సంప్రదిస్తానని చెప్పారు. ఈ విషయం మీద బీఎస్‌పీ అధ్యక్షురాలు మాయావతి స్పందించారు. 

ముఖ్తార్‌ అన్సారీ మృతిపైన విచారణ జరిపించాలని మాయావతి డిమాండ్ చేశారు. ఈ కేసులో నిజానిజాలు ప్రజల ముందుకు రావాల్సి ఉందన్నారు. అన్సారీ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని భీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ కూడా డిమాండ్ చేశారు.

మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ అకాల మరణం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ.. ఎక్స్ (ట్విటర్) వేదికగా చంద్రశేఖర్ ఆజాద్ ట్వీట్ చేశారు. 

అన్సారీ మౌ సదర్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అతను 2005 నుంచి ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లో జైలులో ఉన్నాడు. అతనిపై 60కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సెప్టెంబరు 2022 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని వివిధ న్యాయస్థానాలు అతనికి ఎనిమిది కేసుల్లో శిక్ష విధించాయి.

Advertisement
Advertisement