‘ఖర్గే పొరపాటున మాట్లాడినా.. అది నిజమే!’: జైరాం రమేష్‌ | Sakshi
Sakshi News home page

‘ఖర్గే పొరపాటున మాట్లాడినా.. అది నిజమే!’: జైరాం రమేష్‌

Published Sun, Apr 7 2024 1:03 PM

Congress hits back at BJP on Kharge Article 370 remark - Sakshi

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంలోని 371వ ఆర్టికల్‌ను మార్చాలన్న మోదీ-షా గేమ్‌ ప్లాన్‌ను కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే అనుకోకుండా బయటపెట్టారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ అన్నారు. అయితే ఖర్గే 370 ఆర్టికల్‌ అనాల్సింది.. పొరపాటున ఆర్టికల్‌ 371 అన్నారని తెలిపారు.అయినప్పటికీ మోదీ- షా అసలు గేమ్‌ ప్లాన్‌ బయటపడిందని జైరాం రమేష్‌ అన్నారు.

ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే విరుచుకుపడ్డారు. కానీ నిజం ఏమిటంటే.. నాగాలాండ్‌కు సంబంధించిన ఆర్టికల్ 371-ఎ, అస్సాంకు చెందిన ఆర్టికల్ 371-బి, మణిపూర్‌కు సంబంధించిన ఆర్టికల్ 371-సి, సిక్కింకు చెందిన ఆర్టికల్ 371-ఎఫ్, మిజోరామ్‌కు సంబంధించిన ఆర్టికల్ 371-జిని మోదీ-షా మార్చాలనుకుంటున్నారని ఆరోపణలు చేశారు. అదేవిధంగా ఆర్టికల్ 371-హెచ్‌ అరుణాచల్ ప్రదేశ్‌కు సంబంధించిందని జైరాం రమేష్‌ అన్నారు. ఆర్టికల్‌ 371జే పూర్వపు హైరాబాద్-కర్ణాటక ప్రాంతానికి సంబంధించిందని ఆయన గుర్తు చేశారు. 

అనుకోకుండా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 371పై మోదీ-షా ప్లాన్‌ను బయటపెట్టడంతో ఆయన వ్యాఖ్యలపై ఒక్కసారిగా అమిత్‌ షా ఆందోళన పడ్డారని అన్నారు. అందుకే అమిత్‌ షా.. ఖర్గే మాటలను ఆర్టికల్‌ 370కి ముడిపెడుతున్నారని జైరాం రమేష్‌ మండిపడ్డారు.

మల్లికార్జున్‌ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై హోం మంత్రి అమిత్‌ షా స్పందించి కౌంటర్‌ ఇచ్చారు. ‘కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న పొరపాట్లు దశాబ్దాలుగా మన దేశాన్ని వెంటాడుతున్నాయి. ఇటాలియన్ సంస్కృతి కారణంగా ప్రతిపక్ష పార్టీ.. భరత దేశాన్ని సరిగా అర్థం చేసుకోలేదు’ అని అమిత్‌ షా మండిపడ్డారు.

ఖర్గే ఏమన్నారంటే...
మల్లికార్జున్‌ ఖర్గే రాజస్థాన్‌లోని జైపూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించి సభలో మోదీ-షాపై విరుచుకుపడ్డారు. ‘బీజేపీ వాళ్లు రాజస్తాన్‌ వచ్చి ఆర్టికల్‌ 371ను  రద్దు చేశామని చెబుతున్నారు. ఇక్కడి ప్రజలకు అసలు దానితో సంబంధం ఏమిటీ?. జమ్ము కశ్మీర్‌కు వెళ్లి అక్కడి ప్రజలకు దానికి గురించి మాట్లాడితే బాగుంటుంది’ అని ఖర్గే అన్నారు.

Advertisement
Advertisement