అవన్నీ అబద్ధాలు.. అసలు అగార్కర్‌..: రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

అవన్నీ అబద్ధాలు.. అసలు అగార్కర్‌..: రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు

Published Thu, Apr 18 2024 10:59 AM

Havent Met Anyone Agarkar In Dubai Dravid: Rohit Rubbishes T20 WC Meeting - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2024 నేపథ్యంలో టీమిండియా ఎంపిక గురించి వస్తున్న వార్తలపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. ఈ విషయం గురించి తాను ఇప్పటి వరకు మేనేజ్‌మెంట్‌తో ఎలాంటి చర్చలు జరుపలేదన్నాడు.

అదే విధంగా.. హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌తో గత వారం తాను సమావేశమైనట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశాడు. జట్టు ఎంపిక గురించి తాము అధికారిక ప్రకటన చేసినపుడు మాత్రమే అవి నిజాలని నమ్మాలని విజ్ఞప్తి చేశాడు.

కాగా ఐపీఎల్‌-2024కు మే 26న తెరపడనుండగా.. జూన్‌ 1 నుంచి ప్రపంచకప్‌-2024 టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈవెంట్‌ మొదలైన ఐదో రోజున టీమిండియా ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో తమ ప్రయాణం ఆరంభించనుంది.

కెప్టెన్‌గా రోహిత్‌ శర్మనే
ఇక ఈ మెగా టోర్నమెంట్లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మనే ఉంటాడని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2024 ప్రదర్శన ఆధారంగానే వరల్డ్‌కప్‌ జట్టు ఎంపిక ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో గత వారం ముంబైలో రోహిత్‌, ద్రవిడ్‌, అగార్కర్‌ సమావేశమై జట్టు కూర్పు గురించి జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఓపెనర్‌గా విరాట్‌ కోహ్లి ఫిక్స్‌ అని.. బౌలింగ్‌ చేసే విషయంపైనే ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఎంపిక ఆధారపడి ఉంటుందని ఊహాగానాలు వినిపించాయి.

అసలు అగార్కర్‌ ఇక్కడ లేనేలేడు
ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్వయంగా ఈ విషయాలపై స్పందించాడు. ‘‘నేను ఎవరినీ కలవలేదు. అజిత్‌ అగార్కర్‌ అక్కడెక్కడో దుబాయ్‌లో ఉన్నాడు. ఇక రాహుల్‌ ద్రవిడ్‌ తన పిల్లల ఆట చూసేందుకు బెంగళూరులోనే ఉండిపోయాడు.

అయితే.. తన కుమారుడి కోసం బహుశా ముంబై వచ్చి ఉంటాడు. ఎర్రమట్టి పిచ్‌పై ఆడించేందుకు ఇక్కడికి తీసుకువచ్చాడేమో! అంతే. అంతకు మించి ఏమీ లేదు. మేము అసలు ఒకరినొకరం కలుసుకోలేదు.

అవన్నీ అబద్దాలే
ఈరోజుల్లో నేనో, ద్రవిడో, అగార్కరో లేదంటే బీసీసీఐ స్వయంగా స్పందిస్తేనే అవి నిజాలు. మిగతావన్నీ ఫేక్‌’’ అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. క్లబ్‌ ప్రైరీ ఫైర్‌ అనే పాడ్‌కాస్ట్‌లో మైకేల్‌ వాన్‌, ఆడం గిల్‌క్రిస్ట్‌లతో మాట్లాడుతూ రోహిత్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా రోహిత్‌ ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ ఆటగాడిగా ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌తో బిజీగా ఉన్నాడు.

చదవండి: #Rishabh Pant: పిచ్చి పట్టిందా? కుల్దీప్‌ ఆగ్రహం.. పంత్‌ రియాక్షన్‌ ఇదే

Advertisement
Advertisement