భువనేశ్వర్: ఒడిశా రాజకీయాల్లో లుంగీల వార్ నడుస్తోంది. అధికార బీజేడీ నేతలు లుంగీలు కట్టుకుని బీజేపీకి కౌంటర్ ఇస్తున్నారు. అసలీ లుంగీల గోల ఏంటి.. బీజేడీ నాయకులు సంప్రదాయ కుర్తా పైజామా, ప్యాంట్-షర్ట్ కాకుండా లుంగీలు ఎందుకు ధరిస్తున్నారో ఈ కథనంలో చూద్దాం.
ఒడిశాలో 21 లోక్సభ స్థానాలతో పాటు 147 అసెంబ్లీ సీట్లకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ ఓటర్లను ఉద్దేశించి ఒక వీడియోలో ప్రసంగించారు. ఇందులో ఆయన లుంగీ కట్టుకొని కనిపించారు. పార్టీ గుర్తైన శంఖం ఉన్న ప్లకార్డులను పట్టుకుని లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
నవీన్ పట్నాయక్ లుంగీ కట్టుకొని వీడియోలో మాట్లాడటాన్ని బీజేపీ నేత, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎద్దేవా చేశారు. దీంతో ధర్మేంద్ర ప్రధాన్కు కౌంటర్గా బీజేడీ నాయకులు సస్మిత్ పాత్ర, స్వయంప్రకాశ్ మహోపాత్ర లుంగీలు ధరించి ప్రెస్మీట్ నిర్వహించారు. నవీన్ పట్నాయక్ ఫొటో ముందు లుంగీలతో పోజులిచ్చారు. దీంతో ఇప్పుడు బీజేపీ, బీజేడీ మధ్య లుంగీ వార్ ముదురుతోంది.