'జెస్సీ'గా వెండితెరకు పరిచయమై కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది హీరోయిన్ సమంత. 2010లో 'ఏ మాయ చేసావె' సినిమా ద్వారా అక్కినేని నాగ చైతన్యతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చి ఆపై తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. హీరోయిన్గా ఎన్నో విభిన్నమై చిత్రాల్లో నటించిన సమంత వ్యాఖ్యాతగా, వ్యాపారవేత్తగా కూడా రానించింది. తాజాగా టాలీవుడ్లో ఆమె మరో అడుగు ముందుకు వేసింది. త్వరలో నిర్మాతగా మారనుంది. ఈ మేరకు కొత్త ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు సమంత తెలిపింది. ఆ సంస్థకు 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' అనే పేరును కూడా ఆమె ఫైనల్ చేసింది.
ఇన్స్టాగ్రామ్లో తన సంస్థకు సంబంధించిన లోగోను కూడా సమంత షేర్ చేసింది. సినిమా ప్రపంచంలో కొత్త ప్రతిభను ప్రోత్సహించడమే కాకుండా అర్థవంతమైన, ప్రామాణికమైన, కథల్ని ఎంపిక చేసి ఈ వేదికపై నిర్మించనున్నట్లు సమంత తెలిపింది. కొత్త వారికి ఈ సంస్థ ఒక వేదిక అవుతుందని చెప్పింది. తన సంస్థకు 'ట్రాలాలా' అనే పేరు ఎంపికపై ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఆమె తెలిపింది. హాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ఇంగ్లిష్ పాప్ సాంగ్ 'బ్రౌన్ గర్ల్ ఇన్ ది రింగ్'లో వచ్చే లిరిక్స్ నుంచి 'ట్రాలాలా' అనే పదాన్ని తీసుకున్నట్లు సామ్ పేర్కొంది.
సినిమాలు నిర్మించే విషయంలో హైదరాబాద్కు చెందిన ఎంటర్టైన్మెంట్ కంపెనీ 'మండోవా మీడియా వర్క్స్తో' సమంత ఒప్పందం కుదుర్చుకుంది. సినిమా ఇండస్ట్రీలో ఈ సంస్థకు మంచి గుర్తింపే ఉంది. తమ భాగస్వామ్యంలో వెబ్ సిరీస్తో పాటు సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్ రూపొందించే అవకాశం ఉందని మండొవా మీడియా వర్క్స్ అధినేత హిమాంక్ దువుర్రు తెలిపాడు.