AUS vs IND: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియా కెప్టెన్గా విధ్వంసకర ఆటగాడు!
Published
Fri, Nov 10 2023 3:32 PM
వన్డే ప్రపంచకప్-2023 ముగిసిన తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా తలపడనుంది. నవంబర్ 23న విశాఖపట్నం వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, బుమ్రా, షమీ, సిరాజ్లకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు చీలమండ గాయంతో వరల్డ్కప్ నుంచి మధ్యలోనే తప్పుకున్న భారత వైస్ కెప్టెన్, స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా కంగారూలతో సిరీస్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. కాగా గత కొన్ని సిరీస్ల నుంచి రోహిత్ గైర్హజరీలో భారత సారధిగా హార్దిక్ పాండ్యనే వ్యవహరిస్తున్నాడు.
అయితే ఇప్పుడు హార్దిక్ కూడా దూరమయ్యే సూచనలు కన్పిస్తుండడంతో.. ఆసీస్ సిరీస్లో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్కు అప్పజెప్పాలని సెలక్షన్ కమిటీ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.