వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్‌ విమర్శలు | Sakshi
Sakshi News home page

వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్‌ విమర్శలు

Published Mon, Apr 29 2024 10:51 AM

BJP Arun Govil Leave Meerut For Mumbai Day After Polls

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ నుంచి పోటీ చేసిన నటుడు, బీజేపీ అభ్యర్థి అరుణ్‌ గోవిల్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే ముంబైకి వెళ్లిపోవడంపై కాంగ్రెస్‌ విమర్శల దాడి చేసింది.  ఆయన 'పారాచూట్ రాజకీయాలు' చేస్తున్నారని ఆరోపించింది.

“మీరట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉన్న అరుణ్ గోవిల్ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజునే ముంబైకి బయలుదేరినట్లు తెలిసింది. బహుశా ఆయన ప్రజల మధ్య ఉండడానికి కష్టపడి ఉండవచ్చు. ఈ వ్యక్తి నిన్న పోలింగ్ బూత్ లోపల వీడియోగ్రఫీ చేస్తున్నారు” అని యూపీ కాంగ్రెస్‌ చీఫ్ అజయ్ రాయ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

“అలాంటి నాయకుడు, నటుడి నుంచి దేవుడే మనల్ని రక్షించగలడు! చాలా మంది బీజేపీ నేతల విధానం ఇదే. వీరికి ప్రజల పట్ల, ప్రాంతం పట్ల పట్టింపు లేదు. వారు పారాచూట్ రాజకీయాలను మాత్రమే నమ్ముతారు” అని రాసుకొచ్చారు.

టీవీ సీరియల్స్‌లో రాముడి పాత్రధారిగా ప్రసిద్ధి చెందిన అరుణ్‌ గోవిల్‌ కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించారు. “మార్చి 24న హోలీ నాడు భారతీయ జనతా పార్టీ నా పేరును ప్రకటించింది. వారి సూచనల మేరకు నేను మార్చి 26న మీ మధ్యకు వచ్చాను. నెల రోజుల పాటు మీతో ఉండి మీ మద్దతుతో ఎన్నికల ప్రచారం చేశాను. ఎన్నికలు పూర్తయ్యాయి. మీ ప్రేమ, మద్దతు, గౌరవానికి నేను మీకు చాలా కృతజ్ఞుడను” అంటూ ‘ఎక్స్‌’ ద్వారా పేర్కొన్నారు.

“ఇప్పుడు, పార్టీ సూచనల మేరకు, ఇక్కడ నా బాధ్యతలను నెరవేర్చడానికి నేను ముంబైలో ఉన్నాను. ఎన్నికల ప్రచారానికి నన్ను ఇతర ప్రాంతాలకు పంపాలని పార్టీ యోచిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే, మీరట్ ప్రజలు, కార్యకర్తలతో కలిసి మీ మధ్యే ఉంటాను” అన్నారు.

Advertisement
Advertisement