బేబీ రాబోతోంది.. నొప్పులు మొదలయ్యాయి: సాక్షి ధోని పోస్ట్‌ వైరల్‌ | Sakshi
Sakshi News home page

బేబీ రాబోతోంది.. నొప్పులు మొదలయ్యాయి:ధోని భార్య సాక్షి పోస్ట్‌ వైరల్‌

Published Mon, Apr 29 2024 11:23 AM

సాక్షి ధోని పోస్ట్‌ వైరల్‌ (PC: Insta/X)

ఐపీఎల్‌-2024లో వరుసగా రెండు పరాజయాల తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌ మళ్లీ గెలుపు బాట పట్టింది. చెపాక్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించి సొంతగడ్డపై సత్తా చాటింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆరు నుంచి ఏకంగా మూడో స్థానానికి దూసుకువచ్చింది.

హైదరాబాద్‌లో తమకు సన్‌రైజర్స్‌ చేతిలో ఎదురైన పరాభవానికి సీఎస్‌కే బదులు తీర్చుకోవడంతో జట్టు సంబరాల్లో మునిగిపోయింది. అభిమానుల ఆనందానికి కూడా హద్దుల్లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో... సీఎస్‌కే విజయానికి చేరవవుతున్న క్రమంలో చెన్నై స్టార్‌ మహేంద్ర సింగ్‌ ధోని భార్య సాక్షి షేర్‌ చేసిన ఇన్‌స్టా స్టోరీ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

రుతురాజ్‌ గైక్వాడ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌
కాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (54 బంతుల్లో 98) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. డారిల్‌ మిచెల్‌(32 బంతుల్లో 52) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. శివం దూబే మరోసారి ధనాధన్‌ ఇన్నింగ్స్‌(20 బంతుల్లో 39 నాటౌట్‌) దుమ్ములేపాడు.

134 పరుగులకే 
ఇక లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌.. సీఎస్‌కే బౌలర్ల దెబ్బకు 18.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరుగా ఉన్న రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో 32 టాప్‌ స్కోరు(ఐడెన్‌ మార్క్రమ్‌)గా నమోదైంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

చెన్నై బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే నాలుగు వికెట్లతో చెలరేగగా.. ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌, మతీశ పతిరణ చెరో రెండు, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. వీరి అద్భుత ప్రదర్శన కారణంగా హైదరాబాద్‌ జట్టు 78 పరుగుల తేడాతో ఓడిపోయింది.

పురిటి నొప్పులు మొదలయ్యాయి
ఈ నేపథ్యంలో సాక్షి సింగ్‌ ధోని.. ‘‘ఈరోజు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మ్యాచ్‌ పూర్తి చేయండి. చిన్నారి రాబోతోంది... పురిటి నొప్పులు మొదలయ్యాయి. కాబోయే మేనత్త నుంచి మీకిదే నా అభ్యర్థన’’ అంటూ సాక్షి సింగ్‌ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. సీఎస్‌కే విజయం తర్వాత ఆమె పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. చెన్నై గెలుపు నేపథ్యంలో.. ‘‘కాబోయే అత్తకు రెండు శుభవార్తలు.. కంగ్రాట్స్‌’’ అంటూ ఫ్యాన్స్‌ విష్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement