-
తిరుమలకు భారీగా పెరిగిన రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం కాగా, సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది.ఇక.. నిన్న(గురువారం) 76,369 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 41,927 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.63 కోట్లుగా లెక్క తేలింది.నేటి నుంచి పద్మావతి పరిణయోత్సవాలునేటి నుండి మూడు రోజులపాటు తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలునారాయణ గిరి ఉద్యాన వనంలో పరిణయోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు.మొదటి రోజు మలయప్ప స్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై దర్శనంమే 17 నుండి 19వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు.1992వ సంవత్సరం పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహిస్తున్న టీటీడీ. -
బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలోకార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేయబడతాయిసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి జూన్ 25వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు ● బ్రైడల్ మేకప్స్●● ఒబెసిటీ అండ్ న్యూట్రిషియన్ డైట్ ● హెయిర్ మసాజ్ ● కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్ ● ఫేషియల్స్ ● యాంటి యేజింగ్, థర్మో హెర్బ్ ఫేషియల్స్ ● త్రె డ్డింగ్ ● వ్యాక్స్ ● పెడిక్యూర్ ● మెనిక్యూర్ ● బ్లీచింగ్ ● స్కిన్ కేర్ ● హెయిర్ కేర్ ● వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్ ● డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్ ● హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ ● హెయిర్ కట్స్ ● హెయిర్ స్టైల్ ● హెన్నా ప్రిపరేషన్ ● డై అప్లికేషన్వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు24–05–2024 నుంచి 22–06–2024 వరకు, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకురిజిస్ట్రేషన్స్ మరియు శిక్షణా స్థలం : Ananga Beauty Studio @ institute, Biragipatteda, Arch Road, Above Canara Bank, Tirupatiసంప్రదించాల్సిన నంబర్లు : 95534 54335, 96666 97219 -
జిల్లాకు వర్ష సూచనలు
తిరుపతి అర్బన్: జిల్లాలో వర్షసూచనలు కనిపిస్తున్నాయని ఆ విభాగం అధికారులు తెలిపారు. బుధవారం పెళ్లకూరు మండలంలో 13 మి.మీ, పుత్తూరులో 7.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 20.4 మి.మీ వర్షం కురిసిందని వెల్లడించారు. అదేవిధంగా గురువారం పిచ్చాటూరులో 4.8 మి.మీ, తడలో 0.8 మి.మీ, సూళ్లూరుపేటలో 0.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వివరించారు. రానున్న పది రోజుల్లో వర్షపాతం మరింత పెరిగే అవకాశాలున్నట్లు వెల్లడించారు. నేటి నుంచి శ్రీపద్మావతి పరిణయోత్సవాలు తిరుమల: తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శుక్రవారం నుంచి శ్రీపద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభం కానున్నాయి. మే 19వ తేదీ వరకు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. పద్మావతి పరిణయోత్సవ మండపం అలంకరణలకు పెట్టింది పేరు. గతంలో పసుపు–కుంకుమ మండపం, గాజుల మండపం, రంగురాళ్ల మండపం, అష్టలక్ష్మీ మండపం, దశవతార మండపం వంటి నమూనాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా టీటీడీ ఉద్యానవన విభాగం చర్యలు చేపట్టింది. ఈ ఏడాది మొట్టమొదటి సారిగా కేరళ సంప్రదాయ ‘తెప్ప కోలం’ అలంకరణతో పాటు ఫలపుష్పాలు, విద్యుద్దీపాలతో భక్తులను ఆకట్టుకునేలా అలంకరించారు. ఇందులో రోజా, లిల్లీ, చామంతి వంటి రెండు టన్నుల సంప్రదాయ పుష్పాలు, 50 వేల కట్ ఫ్లవర్స్ (15 రకాలు), వివిధ రకాల ఫలాలు, ఏనుగులు, గుర్రాలు, చిన్నకృష్ణుడు వంటి సెట్టింగులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మండపం పైభాగంలో ఏర్పాటుచేసిన వెన్న ఉట్లు, వెండి గంటలు, పూల గుత్తులు ఆకట్టుకుంటున్నాయి. టీటీడీ గార్డెన్ విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు పర్యవేక్షణలో బెంగళూరుకు చెందిన 150 మంది నిపుణులైన సిబ్బంది, టీటీడీ గార్డెన్ విభాగానికి చెందిన మరో 50 మంది సిబ్బంది వారం రోజులుగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాల మండపాన్ని రూపొందిస్తున్నారు. ఈ మండప అలంకరణకు పూణేకు చెందిన వేంకటేశ్వర చారిటబుల్ ట్రస్టు వారు టీటీడీకి విరాళం అందించారు. జిల్లాలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తిరుపతి అర్బన్: జిల్లాలోని ఫెసిలిటేషన్ సెంటర్ల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరుపతికి తరలించారు. అలాగే గురువారం ఇతర జిల్లాలకు చెందిన ఓట్లను ఆయా నియోజకవర్గాల ఆర్వోలకు (రిటర్నింగ్ అధికారులకు) పంపించారు. పోస్టల్ బ్యాలెట్లను ప్రత్యేక బాక్సులలో భద్రపరిచారు. ఈ కసరత్తు మొత్తం ప్రత్యేక నిఘా నీడలో జరిగింది. అనంతరం ఆ బాక్సులకు సీల్ వేసి శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ సెంటర్కు తరలించారు. ఈ కసరత్తును జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్కుమార్ పర్యవేక్షించారు. దేశంలో బీజేపీకి వ్యతిరేక పవనాలు తిరుపతి కల్చరల్: మోదీది హోసేల్ అవినీతి అని, దేశంలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయ ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. గురువారం తిరుపతి సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ హోల్సేల్ అవినీతికి పాల్పడడంతో పాటు బ్లాక్ మనీ వైట్ మనీగా చేసుకోవడానికి అవకాశం కల్పించారని విమర్శించారు. -
19 నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు
రాపూరు: మండలంలోని పెంచలకోనలో వెలసిన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయి. 19న ఉత్సవ మూర్తులు గోనుపల్లి నుంచి పెంచలకోనకు వేంచేయనున్నారు. ఆ తర్వాత రాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. 20న ధ్వజారోహణం, రాత్రి శేష వాహనం, 21న ఉదయం హంస వాహనం, రాత్రి బంగారు హనుమంత వాహనం, 22న ఉదయం సింహ వాహనం, రాత్రి బంగారు గరుడ వాహన సేవ, 23న కల్యాణం, రాత్రి గజవాహనసేవ, 24న ఉదయం చక్రస్నానం, సాయంత్రం తెపోత్సవం, రాత్రి అశ్వ వాహనసేవ, 25న స్వామి,అమ్మవార్లు గొనుపల్లికి వేంచేపు, క్షేత్రోత్సం నిర్వహించనున్నారు. -
పాల వ్యాన్ ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ మృతి
శ్రీకాళహస్తి (తొట్టంబేడు) : పాలవ్యాన్ ఢీకొనడంతో ఆర్టీసీ హైయ్యబస్ డ్రైవర్ మృతిచెందిన ఘటన శ్రీకాళహస్తి మండలం, ముచ్చివోలు సమీపంలో గురువారం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి రూరల్ సీఐ అజయ్కుమార్ అందించిన వివరాల మేరకు.. ఏర్పేడు మండలం, పల్లంపేటకు చెందిన పోతల సుబ్రమణ్యం(28) శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో పరిధిలో హైయ్యర్ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం డ్యూటీ ముగించుకుని శ్రీకాళహస్తి నుంచి ద్విచక్ర వాహనంలో తన స్వగ్రామానికి వెళ్తున్నాడు. ముచ్చివోలు దాటగానే రోడ్డు మలుపునకు సమీపంలో ఎదురుగా వస్తున్న ఓ పాలవ్యాన్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో సుబ్రమణ్యం తీవ్రంగా గాయపడ్డాడు. 108లో చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే సుబ్రమణ్యం మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కలచివేసింది. కేసు దర్యాప్తులో ఉంది. కారులో మంటలు తిరుమల: తిరుపతిలోని అలిపిరి దగ్గర కారులో మంటలు చెలరేగిన ఘటన గురువారం చోటుచేసుకుంది. అగ్నిమాపక అధికారుల కథనం.. తిరుమల నుంచి అలిపిరి గరుడ సర్కిల్ దగ్గరకు రాగానే ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. వెంటనే కారు డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపివేశాడు. వెంటనే డ్రైవర్తో పాటు కారులో ఉన్న భక్తులందరూ బయటకు దిగి పరుగులు తీశారు. అందరూ చూస్తుండగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. భక్తులు తిరుమల నుంచి తిరుపతికి తిరిగి వస్తున్న సమయంలో ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే కారులో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. -
మీకు ప్రశ్నించే హక్కు ఉందా..?
● జిల్లాలో లక్షల మంది ఓటర్లు ఓటుకు దూరం ● అసెంబ్లీల పరిధిలో 3,87,319 మంది ఓటర్లు డుమ్మా ● తిరుపతి పార్లమెంట్కు 3,61,360 మంది ఎగనామంతిరుపతి అర్బన్: ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. తమకు ఇష్టమైన.. ప్రజాసేవకు అంకితమయ్యేవారిని తమ ఓటు హక్కుతో ఎన్నుకోవాలి. కానీ జిల్లాలో కొన్ని లక్షల మంది ఓటర్లు ఓటుకు దూరంగా ఉన్నారు. ఏడు అసెంబ్లీల పరిధిలో 3,87,319 మంది డుమ్మా కొట్టారు. అందులో పురుషులు 1,83,643 మంది ఉండగా.. మహిళలు 2,03,676 మంది ఉన్నారు. అదేవిధంగా తిరుపతి పార్లమెంట్కు సంబంధించి 3,61,360 మంది ఓటుకు ఎగనామం పెట్టారు. ఇందులో పురుషులు 1,69,645 మంది, మహిళలు 1,91,715 మంది ఉన్నారు. ఇప్పుడు జిల్లాలో దీనిపైనే చర్చించుకుంటున్నారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 1,10,946 మంది ఓటర్లు డుమ్మా కొట్టారు. అత్యల్పంగా సత్యవేడులో 31,699 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. అందులో 60శాతం మంది ఉన్నత స్థాయి వర్గాలకు చెందినవారు, మధ్యతరగతి స్థాయికి చెందిన వారు 28 శాతం, దిగువ స్థాయికి చెందిన వారు 12 శాతం మంది ఉన్నట్టు అధికారులు లెక్కలు గడుతున్నారు. ఓటుకు డుమ్మా కొట్టిన వారికి ఎమ్మెల్యే, ఎంపీలను ప్రశ్నించే హక్కు ఉందా..? అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోసారి ఇలాంటి పొరబాటు చేయొద్దని హితవు పలుకుతున్నారు. -
తిరుపతి గ్రామదేవతకు వేడుకగా భూమన కుటుంబం సారె
● హోరెత్తిన జాతర సంబరం ● ఆకట్టుకున్న జానపద కళా నృత్యరూపకం ● డప్పుదరువుల మధ్య శోభాయాత్ర ● అడుగడుగునా భక్తులు పసుపు నీళ్ల పులకింత డప్పు దరువులు, నవదుర్గలు, కాంతార కాంతులు, తీన్మార్ డ్యాన్స్లు, కొమ్ముకొయ్య నృత్యాలు, దింసా, పగటి వేషాలు, పులివేషాలు, గరగళ్లు, బోనాలు, కీలుగుర్రాల ఆటలు, తప్పిటగుళ్ల మోతలు, కోయ నృత్యాలు, కోలాట భజనలు అబ్బో.. తిరుపతిలో జాతర సంబరం హోరెత్తింది. గురువారం టీటీడీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కుటుంబ సమేతంగా తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మకు సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అడుగడుగునా హారతులు పట్టి, పసుపునీళ్లు పోసి భక్తులు తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. శోభాయాత్రకు పోటెత్తిన జనంతిరుపతి కల్చరల్: ‘గంగమ్మ తల్లి.. వెంకన్న చెల్లి.. జాతరో జాతర.. వేషాలు వేయరా.. మొక్కులు తీర్చరా.. అమ్మ కరుణను పొందరా..’ అంటూ అత్యంత ప్రతిష్టాత్మకంగా కరుణన్న సంకల్ప ప్రచారాలతో తిరునగరిలో గురువారం జాతర సంబరాలు జోరందుకున్నాయి. తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారికి సారె సమర్పించారు. ఇందులో భాగంగా పద్మావతీపురంలోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన సంప్రదాయ సారె పూజలో ఎంపీ డాక్టర్ గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి దంపతులు, డెప్యూటీ మేయర్, ఎమ్మెల్యే అభ్యర్థి భూమ న అభినయ్రెడ్డి దంపతులు, శ్వేత డైరెక్టర్ భూమన్ దంపతులు, భూమన కుటుంబీకులు సారెను నెత్తిన పెట్టుకొని భక్తి శ్రద్ధలతో కాలినడకన శోభాయాత్రగా ముందుకు కదిలారు. వివిధ దేవతామూర్తులు, అమ్మవారి విశ్వరూప కళాప్రదర్శనలు, లయబద్ధంగా నృత్యాల హోరుతో తిరుపతి పురవీ ధులు పులకించాయి. అన్ని వర్గాల ప్రజలు గంధంబొట్లు పెట్టుకొని, వేపాకు చేతబూని గంగమ్మ సారె శోభాయాత్రలో పాల్గొన్నారు. పద్మావతీపురం నుంచి శ్రీనివాస కల్యాణ మండపాలు, లక్ష్మీపురం సర్కిల్, ఎస్టీవీ నగర్, డీఆర్ మహల్, రైల్వేస్టేషన్, గ్రూప్ థియేటర్స్, పెద్దకాపు వీధి మీదుగా శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగింది. అడుగడుగునా భక్తులు పసుపునీళ్లతో స్వాగతం పలికి హారతులు సమర్పించారు. ప్రత్యేకంగా ముస్లింలు గంగమ్మసారె పట్ల చూపిన భక్తి భావం తమసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. డీఆర్ మహల్ వద్ద స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు ఎస్కే.బాబు, కార్పొరేటర్ కోటూరి ఆంజనేయులు, ముస్లిం మహిళలు అమ్మవారి సారెకు ఘన స్వాగతం పలికారు. సారె శోభాయాత్ర గంగమ్మ ఆలయం వద్దకు చేరుకోగానే భూమన కుటుంబానికి ఈవో కె.మమత, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సారెను అమ్మవారికి సమర్పించి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
గూడూరు రూరల్: గూడూరు రెండో పట్టణ పరిధిలోని మాళవ్యానగర్లో ఉన్న ఏటీడబ్ల్యూఆర్ (బాలికల) గురుకులంలో 2024–25 విద్యాసంవత్సరానికి గాను వివిధ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి విద్యార్థినుల తల్లిదండ్రుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పే.వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తరగతిలో 40, 4వ తరగతిలో 35, 5వ తరగతిలో 30, 6వ తరగతిలో 7, 7వ తరగతిలో 3 సీట్లు వంతున ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. 3వ తరగతిలో గల 40 సీట్లలో ఎస్టీకి 31, ఎస్సీ 5, బీసీ 2, ఓసీ 1, ఏఈక్యూ 1 చొప్పున భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. మిగిలిన తరగతుల్లో మిగిలిన ఖాళీలను కేవలం ఎస్టీ విద్యార్థినులచే మాత్రమే భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నామని వెల్లడించారు. దరఖాస్తు ఫారాలు గురుకుల పాఠశాలలో అందుబాటులో ఉన్నాయని, పూర్తి చేసిన దరఖాస్తులను స్వయంగా ప్రధానాచార్యుల కార్యాలయంలో ఈనెల 20వ తేదీలోగా సమర్పించాలని కోరారు. ఖాళీలకు మించి దరఖాస్తులు వస్తే వాటిని ఐటీడీఏ పీడీ(యానాదులు) నెల్లూరులోని కార్యాలయంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి సీట్లను కేటాయించనున్నట్టు పేర్కొన్నారు. వివరాలకు 8333925187, 8885372878, 9441596331 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
ముక్కోటి దేవతలకు ఆహ్వానం
తిరుపతి కల్చరల్: శ్రీగోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఆగమోక్తంగా ఆరంభమయ్యాయి. ఉదయం మిథున లగ్నంలో చేపట్టిన ధ్వజారోహణంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు. అనంతరం శ్రీవారి ఆస్థానాన్ని ఘనంగా చేపట్టారు. దీనికి ముందు శ్రీగోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై అధిరోహించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. అనంతరం అర్చకులు విష్వక్సేనారాధన, వాస్తు హోమం, గరుడ లింగ హోమం, గరుడ ప్రతిష్ట, రక్షా బంధనం చేపట్టారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ధ్వజారోహణం ఉద్దేశం. తర్వాత ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి ఉత్సవర్లకు వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం ఊంజల్ సేవ వేడుకగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు గురువారం రాత్రి స్వామివారు పెద్ద శేష వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. వాహన సేవలో కళా బృందాల ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఎప్ఏ అండ్ సీఏవో బాలాజీ, సీఈ నాగేశ్వరరావు, ఎస్ఈ–2 జగదీశ్వర్రెడ్డి, ఆగమ సలహాదారులు సీతారామాచార్యులు, మోహన్ రంగాచార్యులు, ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, కంకణభట్టార్ ఏ.నారాయణ దీక్షితులు, సూపరింటెండెంట్ మోహనరావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలకు శ్రీకారం ఘనంగా గోవిందరాజ స్వామి ధ్వజారోహణం -
కనిపించని ఏనుగు జాడ
పాకాల : మండలంలో హల్ చేస్తున్న ఒంటరి ఏనుగు జాడ కనిపించలేదు. దీంతో పలు గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక వణికిపోతున్నారు. ఇటీవల మండలంలోని చెన్నుగారిపల్లి పంచాయతీలోకి ఏనుగు ప్రవేశించింది. తర్వాత అది కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి అటవీశాఖ అధికారులు వెతుకుతూనే ఉన్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అటవీశాఖ పనబాక రేంజ్ డీఎఫ్వో చినబాబు గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. డ్రోన్ సహాయంతో మండలంలోని శ్రీరామపురం గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఏనుగు జాడను కనిపెట్టేందుకు సుమారు 30 మంది సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. డీఎఫ్ఓ సతీష్ ఆదేశాల మేరకు, ఎఫ్ఆర్ఓ మాధవి సూచనలతో ఈ గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఏనుగు తవణంపల్లిలోని ఏనుగుల గుంపు నుంచి తప్పిపోయి వచ్చినట్లు తెలుస్తోందన్నారు. శ్రీరామాపురం అటవీ ప్రాంతంలో రెండు చోట్ల ఏనుగు పేడను గుర్తించామని, ప్రస్తుతం దట్టమైన అడవిలో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఏనుగు ప్రశాంతంగా వేరే మార్గంలో వెళ్లి పోయి ఉండవచ్చని తెలిపారు. సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉండే నీటి జాడను గుర్తించే సామర్థ్యం దానికి ఉందన్నారు. శ్రీరామాపురం చుట్టు పక్కల గ్రామాల్లో మైకుల ద్వారా ప్రచారం చేశామని, గుట్టలకు పక్కనే ఉన్న గ్రామాల ప్రజలు రాత్రి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచినట్టు పేర్కొన్నారు. మరికొంత మంది ఏనుగును చూశామని తప్పుడు సమాచారం ఇస్తున్నారని, దీని వల్ల అటవీశాఖ సిబ్బంది సమయం వృథా అవుతోందని వాపోయారు. -
ఘనంగా చిన్నకొట్టాయి ఉత్సవం
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం చిన్నకొట్టాయి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పొగడ చెట్టు వద్దకు తీసుకొచ్చారు. మొదట స్వామి, అమ్మవార్లకు పలు రకాల అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విశేషంగా అలంకరిచారు. చతుర్వేద పారాయణం, మంత్రపుష్పం, నైవేద్యం, దీపారాధన, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోనే స్వామి, అమ్మవార్లను ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈఓ ఎస్వీ నాగేశ్వరరావు, పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, సభ్యులు పాల్గొన్నారు. -
చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి జైలు
తిరుపతి లీగల్: చెక్ బౌన్స్ కేసులో తిరుపతి రూరల్ మండలం, అవిలాల పంచాయతీ, శ్రీనగర్ కాలనీకి చెందిన నిరంజన్రెడ్డికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తిరుపతి రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి పల్లపోలు కోటేశ్వరరావు గురువారం తీర్పు చెప్పారు. తిరుపతి రూరల్ తారకరామనగర్కు చెందిన బీ.రామనాథ చౌదరి వద్ద నిరంజన్రెడ్డి 2008 సెప్టంబర్ 25వ తేదీన లక్షా 50 వేల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. ఆ సొమ్ము చెల్లించే క్రమంలో నిరంజన్రెడ్డి అసలు, వడ్డీ కలిపి నాలుగు లక్షలా 50 వేలకు చెక్కును రామనాథ చౌదరికి ఇచ్చాడు. అతను ఆ చెక్కును బ్యాంకులో వేయగా అది బౌన్స్ అయింది. దీనిపై రామనాథ చౌదరి కోర్టులో నిరంజన్రెడ్డిపై చెక్ బౌన్స్ కేసు దాఖలు చేశాడు. కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి నిరంజన్రెడ్డికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. శ్రీవారి పరకామణికి కరెన్సీ కౌంటింగ్ యంత్రం వితరణ తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పరకామణికి గురువారం రూ.9.33 లక్షల విలువైన కరెన్సీ కౌంటింగ్ యంత్రం విరాళంగా అందింది. నెల్లూరుకు చెందిన భక్తుడు కాకులూరు వసంతకుమార్, కర్పగవళ్లి దంపతులు ఈ యంత్రాన్ని తిరుమల శ్రీవారి పరకామణి డెప్యూటీ ఈఓ మల్లికార్జునకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు టీటీడీ అధికారులు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించారు. -
ముగ్గురూ ఆడపిల్లలైనా..
‘నీలకంఠా.. నిన్ను సేవించుకోవడానికి వస్తే నట్టేట ముంచేశావు కదయ్యా.. నీకు దీపం పెడదామని వస్తే మా ఇంటి దీపాలు ఆర్పేశావు కదయ్యా.. నీకిది న్యాయమా..’ అంటూ ఆ తల్లి గుండెలు పగిలేలా రోదించిన తీరు చూపరులకు కన్నీళ్లు తెప్పించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న ముగ్గురు కుమార్తెలు జలకంఠేశ్వర స్వామికి దీపారాధన కోసం వెళ్లి చెరువులో పడి మృతిచెందడం ఘటన స్థానికంగా కలకలం రేపింది. బిడ్డలను కాపాడేందుకు ఆ తల్లి చేసిన ప్రయత్నం వృథా అయింది. బిడ్డలు కళ్లముందే మునిగిపోవడంతో ఆ తల్లి కడుపుకోతతో తల్లడిల్లిపోయింది. ఈ ఘటన ఎస్బీఆర్పురంలో తీవ్ర విషాదం నింపింది. పుత్తూరు: జలకంఠేశ్వరస్వామికి పూజలు చేసి, చెరువులో దీపాలు పెట్టేందుకు వెళ్లిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు నీట మునిగి దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద సంఘటన వడమాలపేట మండలం ఎస్బీఆర్ పురంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే, ఎస్బీఆర్పురం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ పి.బాబు, విజయ దంపతులకు రూపిక(10), చరిత(13), యుషిక(17) ముగ్గురు కుమార్తెలు. ఆ దంపతులిద్దరూ శివభక్తులు. ఈ క్రమంలో నీలకంఠుడ్ని సేవించడానికి తిరుణామళ్లై వెళ్లాడు. విజయ తన ముగ్గురు కుమార్తెలతో గురువారం మధ్యాహ్నం గూళూరు చెరువు కట్టపైన ఉన్న శివుని గుడికి వచ్చి పూజలు చేసింది. పూజల అనంతరం ముగ్గురు కుమార్తెల చేతికి దీపాలు వెలిగించి ఇచ్చి చెరువులో వదలమని చెప్పింది. చెరువు మెట్లపై పాచి పట్టివుండడంతో కాలు జారి ఒకరి వెనక మరొకరు చెరువులోకి పడిపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన విజయ కేకలు వేస్తూ పిల్లలను రక్షించేందుకు చెరువులోకి దిగేసింది. అయితే అప్పటికే ముగ్గురు పిల్లలు మునిగిపోయారు. చుట్టుపక్కల ఉన్న వారు వచ్చి విజయను మాత్రం రక్షించగలిగారు. మునిగిపోయిన పిల్లలను వెలికి తీసి పుత్తూరు ఆస్పత్రికి ఆటోలో తరలించారు. వైద్యులు పరీక్షించి ముగ్గురూ అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ మేరకు వడమాలపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఆగని కన్నీటి సుడులునీకు దీపాలు తెస్తే.. మా ఇంటి దీపాలు ఆర్పేశావు మేమేమి పాపం చేశాం? ఇంత శిక్ష ఎందుకేశావు శివా అంటూ ఆ తల్లి రోదనలతో పుత్తూరు ఆస్పత్రి మార్మోగి పోయింది. నిన్నే నమ్మితే నీట ముంచావు కదయ్యా.. నీ కోసం దీపాలు తెస్తే.. మా ఇంటి దీపాలనే ఆర్పేశావు కదయ్యా... నన్ను తీసుకొనిపోయి, నా బిడ్డల్ని వదిలేసి ఉంటే ఏమయ్యా.. అంటూ ఆ తల్లి విలపించిన తీరు స్థానికులను కలచివేసింది. ఆర్ఎంపీ డాక్టర్గా గ్రామస్తులకు వైద్య సేవలందిస్తూ, వైఎస్సార్ సీపీ నాయకుడిగా ప్రజా సేవ చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న బాబుకు ముగ్గురూ కుమార్తెలే. అయినా వారికి ఏ మాత్రం తక్కువ చేయకుండా ఎంతో సంతోషంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ముగ్గురినీ పెద్ద చదువులు చదివించి, పెళ్లిళ్లు చేసి పంపాలని ఆశించారు. ఈ క్రమంలో చిన్న కుమార్తె రూపిక 5వ తరగతి, రెండవ కుమార్తె చరిత 9వ తరగతి చదువుతుండగా, పెద్ద కుమార్తె యుషిక ఈ సారి ఇంటర్మీడియెట్లో 900కు పైగా మార్కులు సాధించింది. బీటెక్ చదివించాలని కాలేజి అన్వేషణలో ఉండగా ఈ దుర్ఘటన ఆ కుటుంబాన్ని చిదిమేసింది. శివ భక్తులైన ఆ దంపతులు, శివుని సేవలోనే సర్వం కోల్పోయారు. -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూ ఏటీజీహెచ్ వద్దకు చేరింది. సోమవారం అర్ధరాత్రి వరకు 81,930 మంది స్వామివారిని దర్శించుకోగా 41,224 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.90 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. నారాయణగిరి వద్ద క్యూలో వేచి ఉన్న భక్తులు -
రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
చంద్రగిరి: రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుపతి రూరల్ మండలం రిక్షా కాలనీ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం.. సుమారు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, తెలుపు రంగు చొక్కా, నీలం రంగు లోయర్ ప్యాంటు వేసుకున్న గుర్తుతెలియని వ్యక్తి గురువారం మధ్యాహ్నం రిక్షా కాలనీ సమీపంలో వెళ్తున్న పామిని ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న చిత్తూరు రైల్వే ఎస్ఐ ప్రవీణ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతుడి ఆచూకీ కోసం పరిసరాలను పరిశీలించినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో గుర్తుతెలియని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు రైల్వే ఎస్ఐ ప్రవీణ్కుమార్ 94942 28854, పాకాల హెడ్ కానిస్టేబుల్ ఉదయ శేఖర్రెడ్డి 94004 16642 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
ఈచర్ వాహనాలు ఢీ: ఒకరి మృతి
గుడిపాల: రెండు ఈచర్ వాహనాలు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసరావు కథనం మేరకు, హైదరాబాద్ నుంచి తమిళనాడులోని చైన్నె సమీపంలోని పుదుపైటెకు ఈచర్ వాహనం బయల్దేరింది. చైన్నె నుంచి బెంగళూరుకు మరో ఈచర్ వాహనం బయల్దేరింది. ఈ రెండు వాహనాలు చైన్నె– బెంగళూరు జాతీయ రహదారిపై నరహరిపేట చెక్పోస్ట్ సమీపంలోని భద్రకాళమ్మ గుడి వద్ద ఉదయం ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఇందులో పాండిచ్చేరికి చెందిన సుదర్శన్(32) అక్కడికక్కడే మృతి చెందాడు. షాక్దావిద్ అనే మరో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇతన్ని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతి చెందిన డ్రైవర్ సుదర్శన్ను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
హుండీలో చోరీ చేసిన వ్యక్తికి జైలు
తిరుపతి లీగల్: తిరుమల శ్రీవారి హుండీలో సొమ్మును అపహరించిన కేసులో తమిళనాడు, తేన్కాశి సుందరకట్టు వీధికి చెందిన అర్ముగంకు మూడు నెలల జైలు శిక్ష, రూ.100 జరిమానా విధిస్తూ తిరుపతి రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి పల్లపోలు కోటేశ్వరరావు గురువారం తీర్పుచెప్పారు. ఈ ఏడాది మార్చి 22న తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీవారి లక్ష్మీ హుండీలో నిందితుడు ఆర్ముగం రూ.8,300 అపహరించాడు. సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన సిబ్బంది విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అతన్ని అదుపులోకి తీసుకొని తిరుమల వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా.. కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
రఘుపతినాయుడు కుటుంబానికి అండగా ఉంటాం
● వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ● దశదిన కర్మలకు హాజరైన ప్రజాప్రతినిధులు చౌడేపల్లె: తెలుగుదేశం పార్టీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి మృత్యువుతో ఐదురోజులు పోరాడి కన్నుమూసిన వైఎస్సార్సీపీ నాయకుడు బోయకొండక్రాస్కు చెందిన రఘుపతినాయుడు కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం బోయకొండ క్రాసులో నిర్వహించిన దశదిన కర్మక్రియలకు ఆయనతోపాటు జెడ్పీటీసీ సభ్యుడు దామోదరరాజు, పార్టీ మండల కన్వీనర్ అంజిబాబు, పాల ఏకరి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ లడ్డు రమణ, పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు హాజరయ్యారు. రఘుపతినాయుడు మృతితో పార్టీ మంచి నేతను కోల్పోయిందని, ఆయన లేని లోటును పూడ్చలేమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారం ఎప్పటికీ ఉంటుందని, అండదండలు ఉంటాయన్నారు. అనంతరం రఘుపతినాయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ రవిచంద్రారెడ్డి, నేతలు మల్లికార్జునరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ రమేష్బాబు, చిన్నప్ప, మునికృష్ణమనాయుడు, బాబురెడ్డి, గిరిబాబు, రాజశేఖర్రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
రైలు ఢీకొని యువకుడి మృతి
నాయుడుపేటటౌన్: నాయుడుపేట రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో రైలు కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. సూళ్లూరుపేట రైల్వే ఇన్చార్జ్ ఎస్ఐ కే.కొండప్పనాయుడు తెలిపిన మేరకు వివరాలిలా.. గూడూరు రూరల్ మండలం వెందోడు గ్రామానికి చెందిన శెట్టి వెంకటేశ్వర్లు, అంజనా దంపతుల కుమారుడు శెట్టి రాజేష్ ఇటీవల తెలంగాణలోని గద్వాల్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. రోజువారీ లాగే ఎలక్ట్రీషియన్ పనులు ముగించుకుని మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన రాజేష్ అర్ధరాత్రి 1.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై మృతి చెంది ఉండడాన్ని రైల్వేసిబ్బంది గుర్తించి స్టేషన్ ఎస్ఏం లక్ష్మీనారాయణకు సమాచారం అందించారు. రైల్వే ఎస్ఐ కొండప్పనాయుడు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని రాజేష్ మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజేష్ ప్రేమ వివాహం చేసుకుని నెల రోజులు కూడా కాలేదని భార్య, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రైల్వే ట్రాక్పై మృతదేహం సూళ్లూరుపేట రూరల్: సూళ్లూరుపేట రైల్వేస్టేషన్, గొల్లలమలుపు ఎల్సీ గేట్ మధ్యలో దిగువ రైలు మార్గంలోని 40–50 ఏళ్ల వయసు గల వ్యక్తి గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. 14వ తేదీ సాయంత్రం మృతదేహాన్ని గుర్తించినట్లు రైల్వే పోలీసులు బుధవారం తెలిపారు. మృతుడు ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆచూకీ లభించలేదని, సున్తీ చేసుకుని తెల్లని వెంట్రుకలు, గడ్డం కలిగి ఉన్నాడని తెలిపారు. ఆచూకీ తెలిసిన వ్యక్తులు వెంటనే 9573245266 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
భార్య లేదన్న మనస్థాపంతో..
● ఆత్మహత్య చేసుకున్న భర్త ● అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులు వెంకటగిరిరూరల్: కుటుంబంలో తలెత్తిన చిన్నపాటి మనస్పర్థల కారణంగా క్షణికావేశంలో భార్యను చంపి జైలు పాలయ్యాడు ఓ వ్యక్తి. ఇటీవల జైలు నుంచి విడుదలైన అతనికి భార్య లేని లోటు కనిపించింది. దీంతో మనస్థాపానికి గురై అతడు కూడా ఉరేసుకుని తనువు చాలించాడు. తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన వారి పిల్లలు ఇద్దరు అనాథలుగా మారిన ఘటన వెంకటగిరి పట్టణంలోని బొగ్గుల మిట్ట ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వెంకటగిరి పట్టణం బొగ్గుల మిట్ట ప్రాంతానికి చెందిన రాయని వీరభద్రయ్య (38) బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి, గత ఆర్నెళ్ల కిందట స్వగ్రామానికి వచ్చాడు. అయితే ఇంట్లో భార్య శాంతితో అతనికి చిన్నపాటి మనస్పర్థలు రావడంతో క్షణికావేశంలో ఆమెను చంపేశాడు. ఈ కేసులో అతను జైలుకు కూడా వెళ్లాడు. గత వారం కిందట వీరభద్రయ్య జైలు నుంచి విడుదలయ్యాడు. మంగళవారం రాత్రి అతని తల్లి సుబ్బమ్మ, ఇద్దరు చిన్నారులతో బయట నిద్రిస్తుండగా వీరభద్రయ్య భార్య లేదని మనస్థాపానికి గురై ఇంటి పైకప్పునకు ఉన్న ఇనుప చువ్వకు చీరతో ఉరేసుకున్నాడు. అనుమానం వచ్చి తల్లి సుబ్బమ్మ తలుపు తట్టినా ఎంతకీ తీయకపోవడంతో కిటికీలో నుంచి చూసింది. కొడుకు వీరభద్రయ్య ఉరేసుకున్న విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఏఎస్ఐ బీవీ రమణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. -
సూడో జర్నలిస్టులను ఎండగడతా
● నేను పాత్రికేయులకు మిత్రుడిని ● పాత్రికేయ వృత్తి చేసిన వాడిని ● ప్రత్యర్థులకు అమ్ముడుపోయి లేనిపోనివి రాస్తే ఊరుకోం ● మావాళ్లు వారి ఇళ్లవద్ద భయభ్రాంతులకు గురిచేస్తున్నారనడం దుర్మార్గం ● ప్రత్యర్థి నాయకులపై కూడా మేం ఎలాంటి ఘర్షణలకు పాల్పడలేదు ● మీడియాతో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తిరుపతి మంగళం: జర్నలిస్టు ముసుగు వేసుకుని భూ కబ్జాలు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సూడో జర్నలిస్టులను ఎండగడుతానని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. తనపై కొందరు ఎస్పీకి ఫిర్యాదు చేయడంపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘జర్నలిస్టు ముసుగులో కొందరు చేస్తున్న అక్రమాలను బయటపెట్టినందుకు మేమేదో ఉత్తమ జర్నలిస్టులపై ఆరోపణలు చేసినట్లుగా కొందరు ఇతర జర్నలిస్టులు వారికి వత్తాసు పలకడం బాధాకరం. దాంతోపాటు కొందరు పాత్రికేయుల ఇళ్ల వద్దకు మేము మావాళ్లు కొందిరిని బైక్లపై పంపి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఎస్పీకి ఫిర్యాదుచేసి సానుభూతి పొందాలని చూస్తున్నారు. గత ఐదేళ్లలో మా ప్రత్యర్థి నాయకులపై కూడా ఏనాడు ఎలాంటి ఘర్షణలకూ పాల్పడని నైజం మాది. మా ప్రత్యర్థులకు అమ్ముడుపోయి ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తూ కథనాలు రాయడం దుర్మార్గం. జర్నలిస్టు ముసుగు వేసుకుని అక్రమాలకు పాల్పడుతున్న వారు సమాజానికి చీడపురుగులాంటి వారు. అలాంటి సూడో జర్నలిస్టులను ఎండగడుతాం. జర్నలిస్టులంటే నాకు ఎంతో గౌరవం. నేను కూడా పాత్రికేయ వృత్తి చేసినటువంటి వాడిని. పాత్రికేయ వృత్తిలో ఎంత గొప్పగా ఉండాలో తెలుసుకున్నటువంటి వ్యక్తిగా జర్నలిస్టు పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న వారి దుర్మార్గాలను ఎండగట్టకపోతే మొత్తం పాత్రికేయులందరికీ ఆ మరక అంటుకుంటుంది. వీరి అవినీతి అక్రమాలు ఎవ్వరో చెబితే చెప్పింది కాదు. వారితో కలసి పనిచేసే వారే స్వయంగా చెప్పినవి. నేను జర్నలిస్టులకు డబ్బులిచ్చి నా గురించి గొప్పగా రాయించుకునే రాజకీయ నాయకుడినికాదు. ఉద్యమ, పోరాటాలతో రాజకీయంలోకి వచ్చిన వ్యక్తిని’’ అని చెప్పారు. -
దరఖాస్తుల ఆహ్వానం
తపాలాశాఖలో డైరెక్ట్ ఏజెన్సీలకు నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుపోస్టల్ అధికారి వసంత తెలిపారు. – 10లోభక్తుల కొంగుబంగారంగా, సాక్షాత్తు కలియుగ వైకుంఠుడైన శ్రీవేంకటేశ్వరస్వామి వారి స్వయాన చెల్లెలు, శక్తి స్వరూపిణి అయిన శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి రోజు బైరాగి వేషధారులతో పట్టణంలో సందడి నెలకొంది. ఐదు రోజుల పాటు భక్తులు ఒక్కో రోజు ఒక్కో వేషధారణలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. గంగజాతరను ఈ ప్రభుత్వం రాష్ట్రస్థాయి పండుగగా గుర్తించిన నేపథ్యంలో మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు జరగనున్నాయి. -
నీటి గుంతలో పడి వ్యక్తి గల్లంతు
చిట్టమూరు( చిల్లకూరు): స్నానం చేసేందుకు నీటి గుంతలో దిగిన ఓ వ్యక్తి గల్లంతైన సంఘటన చిట్టమూరు మండలంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. మండలంలోని సోమసముద్రానికి చెందిన ఈదూరు సుబ్బరాయులు(39) కూలీ పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న కమాన్ గుంతలో స్నానానికి దిగాడు. అయితే ఈ గుంతలో ఇసుక ఎక్కువ ఉండడంతో అతను పైకి రాలేక గల్లంతయ్యాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అగ్నిమాపక సిబ్బందితో వచ్చి సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. సుబ్బరాయులుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో భార్యబిడ్డలు అనాథలు అయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. -
తపాలా ఏజెన్సీలకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి(అలిపిరి): తపాలాశాఖలో డైరెక్ట్ ఏజెన్సీలకు అర్హులైన నిరుద్యోగ యువత నుంచి ఈ నెల 19వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్ జేఎం వసంత తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ ఇన్సూరెన్స్ సేకరణ కోసం ఏజెన్సీ నియామకాలు చేపడుతున్నామని.. పదో తరగతి పాసై ఇతర బీమా కంపెనీలలో పనిచేయకుండా, 18 ఏళ్లు పైబడిన వారు అర్హులన్నారు. నిరుద్యోగ యువతతోపాటు అంగన్వాడీ కార్యకర్తలు, రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఇందుకు అర్హులని తెలిపారు. ఈనెల 18వతేదీ లోపు దరఖాస్తులను తిరుపతిలోని హెడ్పోస్టాఫీసులో అందజేయాలని కోరారు. 22వ తేదీన ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహించి డైరెక్టు ఏజెన్సీలను ఎంపిక చేస్తామన్నారు. ఎంపికై న అభ్యర్థులు సెక్యూరిటీ సేవింగ్స్ కింద రూ.5 వేలు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ రూపంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. ఎంపికై న వారికి పోస్టల్ కోడ్ అందిస్తామని, ఆ కోడ్ను ఉపయోగించి పాలసీ సేకరణ చేయవచ్చన్నారు. సేకరించిన ప్రీమియంపైన ఆకర్షణీయమైన ఇన్సెంటివ్ అందించనున్నట్లు తెలిపారు. మొదటి సంవత్సరం సేకరించిన ప్రీమియంకు 4 శాతం నుంచి 20 శాతం వరకు కమీషన్, రెండో సంవత్సరం నుంచి 1 శాతం కమీషన్ అందుతుందన్నారు. రూరల్లో సేకరించిన ప్రీమియంకు మొదటిగా 10 శాతం, రెండో సంవత్సరం నుంచి 20 శాతం కమీషన్ అందుతుందని తెలిపారు. ● సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్ వసంత సుకన్య సమృద్ధి యోజనతో భవిష్యత్ తపాలశాఖలో 2014 డిసెంబర్లో ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లల భవిష్యత్తుకు మంచి భరోసా కలిగిస్తోందని జేఎం వసంత తెలిపారు. పదేళ్లలోపు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కేవలం రూ.250తో ఖాతాను తెరవవచ్చన్నారు. గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్ నుంచి మార్చి వరకు)లో రూ.1,50,000 వరకు ఈ ఖాతాలో డిపాజిట్ చేయొచ్చని.. దీనికి అత్యఽధికంగా 8.2 శాతం వడ్డీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 15 ఏళ్ల వరకు ఖాతాలో సొమ్ము జమ చేయాల్సి ఉంటుందని 21 ఏళ్ల తరువాత పథకం పూర్తి కాగానే సొమ్ము చెల్లించనున్నట్లు తెలిపారు. అయితే ఆడపిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం అప్పటివరకు జమచేసిన మొత్తంలో 50 శాతం తీసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. సెక్షన్ 80–సీ ప్రకారం ఖాతాలోని సొమ్ము మొత్తంపై పన్ను మినహాయింపు ఉంటుందని తెలిపారు. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకంలో మహిళలు, ఆడపిల్లలు ఈ ఖాతాను రూ.1000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఖాతాను ప్రారంభించవచ్చన్నారు. రెండేళ్ల తరువాత వడ్డీతో పాటు సొమ్ము చెల్లించడం జరుగుతుందన్నారు. తపాలా శాఖలోని పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు సమీపంలోని తపాలా కార్యాలయాలను సంప్రదించవచ్చని కోరారు. -
వైఎస్సార్సీపీ ఏజెంట్లుగా కూర్చున్నందుకే మాపై కేసు
రామచంద్రాపురం: అనుప్పల్లి పంచాయతీలో పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ తరపున ఏజెంట్లుగా కూర్చున్నందుకే తమపై కక్షగట్టి కేసులు పెడుతున్నారని ఆ పార్టీ మండల కన్వీనర్ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. స్థానిక ఎస్ఐ చిరంజీవి, పద్మావతి మహిళా వర్సిటీ స్టేషన్ ఎస్ఐ రామాంజనేయులు బుధవారం మండల కన్వీనర్ చంద్రశేఖర్రెడ్డితోపాటు 11 మందిని ఆర్సీపురం పోలీస్ స్టేషనుకు తీసుకువచ్చి విచారించారు. ఈ సందర్భంగా ఆయ న విలేకరులతో మాట్లాడుతూ మహిళా విశ్వవిద్యా లయం వద్ద జరిగిన సంఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయినా పోలీస్ స్టేషనుకు పిలిపించి విచారించడం ఏమిటని ప్రశ్నించారు. అనుప్పల్లిలో వైఎస్సార్సీపీకి భారీ మెజార్టీ వస్తుందని, దీన్ని ఓర్వలేకనే ఇలాంటి పనులకు పూనుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నిరాధారమైన కేసులు పెట్టడం దురదృష్టకరమన్నారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చంద్రశేఖర్రెడ్డి
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
ధాన్యం సేకరణ సాఫీగా సాగాలి
పాఠశాలల ప్రారంభం లోగా పనులు పూర్తి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
4,63,983 మంది ఓటుకు దూరం
ప్రణాళిక సిద్ధం
డెంగీ నివారణకు సహకరించాలి
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు
తప్పక చదవండి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement