శ్రీకాళహస్తి (తొట్టంబేడు) : పాలవ్యాన్ ఢీకొనడంతో ఆర్టీసీ హైయ్యబస్ డ్రైవర్ మృతిచెందిన ఘటన శ్రీకాళహస్తి మండలం, ముచ్చివోలు సమీపంలో గురువారం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి రూరల్ సీఐ అజయ్కుమార్ అందించిన వివరాల మేరకు.. ఏర్పేడు మండలం, పల్లంపేటకు చెందిన పోతల సుబ్రమణ్యం(28) శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో పరిధిలో హైయ్యర్ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం డ్యూటీ ముగించుకుని శ్రీకాళహస్తి నుంచి ద్విచక్ర వాహనంలో తన స్వగ్రామానికి వెళ్తున్నాడు. ముచ్చివోలు దాటగానే రోడ్డు మలుపునకు సమీపంలో ఎదురుగా వస్తున్న ఓ పాలవ్యాన్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో సుబ్రమణ్యం తీవ్రంగా గాయపడ్డాడు. 108లో చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే సుబ్రమణ్యం మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కలచివేసింది. కేసు దర్యాప్తులో ఉంది.
కారులో మంటలు
తిరుమల: తిరుపతిలోని అలిపిరి దగ్గర కారులో మంటలు చెలరేగిన ఘటన గురువారం చోటుచేసుకుంది. అగ్నిమాపక అధికారుల కథనం.. తిరుమల నుంచి అలిపిరి గరుడ సర్కిల్ దగ్గరకు రాగానే ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. వెంటనే కారు డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపివేశాడు. వెంటనే డ్రైవర్తో పాటు కారులో ఉన్న భక్తులందరూ బయటకు దిగి పరుగులు తీశారు. అందరూ చూస్తుండగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. భక్తులు తిరుమల నుంచి తిరుపతికి తిరిగి వస్తున్న సమయంలో ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే కారులో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు.