Lok Sabha Election 2024: డ్రమ్స్‌.. ధూం ధాం | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: డ్రమ్స్‌.. ధూం ధాం

Published Thu, May 16 2024 4:49 AM

Lok Sabha Election 2024: Women in Dhakis rock and roll during polling season

బెంగాల్‌ ప్రచారంలో మహిళా ఢాకీలు 

సంప్రదాయ చీరలు. భుజానికి డోలు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కంటే ముందే దర్శనమిస్తారు. అభ్యరి్థది ఏ పార్టీ అయినా సరే, వీరు మాత్రం ఉండాల్సిందే. వారే మహిళా ఢాకీలు. ఈసారి పశి్చమబెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్న కళాకారులు వీళ్లు. ఢాకీ చప్పుడు దుర్గ పూజ సమయంలో ప్రజలను మేల్కొలిపే సంబరం. 

‘ధునుచి నాచ్‌’లాగే డ్రమ్స్‌ వాయించడం దుర్గ పూజలో ముఖ్యమైన అంశం. సాధారణంగా దుర్గ పూజ సమయంలో స్త్రీలు నృత్యకారిణులుగా, పురుషులు ఢాకీలుగా ఉంటారు. కొంతకాలం కింద మహిళలు ఈ సంప్రదాయాన్ని బద్దలు కొట్టారు. దుర్గ పూజల్లో డ్రమ్స్‌ వాయిస్తూ ఢాకీలుగా ఉపాధి పొందుతున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రచారంలో కీలకంగా మారారు. దాదాపుగా అన్ని పారీ్టలూ వీరిని పిలుస్తున్నాయి. 

వీళ్లు ముఖ్యంగా రోడ్‌ షోల్లో పాల్గొంటున్నారు. అయితే అదంత సులువైన వ్యవహారం కాదు. రోజంతా డ్రమ్‌ భుజానికి తగిలించుకునే ఉండాలి. మరోవైపు తీవ్రమైన వేడి. అయినా ఉపాధి దొరుకుతుండటంతో మహిళలు ఢాకీ ధరించి ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఢాకీ వాయిస్తూ రోజుకు రూ.700 నుంచి రూ.800 దాకా సంపాదిస్తున్నారు. దుర్గాపూజ వేళ వీరికి 5 రోజులకు రూ.8 వేల నుంచి రూ.10 వేల దాకా వస్తాయి. ఇతర రాష్ట్రాల్లో,  విదేశాల్లో అయితే ఆదాయం ఇంకాస్త ఎక్కువ వస్తుంది. గతేడాది హైదరాబాద్‌లోనూ దసరా ఉత్సవాల్లో మహిళా ఢాకీలు సందడి చేశారు! 

డిమాండ్‌ పిరిగింది... 
ఎన్నికల ప్రచారంలో గతంలో మహిళా ఢాకీలకు ఇంత డిమాండ్‌ ఉండేది కాదంటున్నారు శివ్‌పాద్‌ దాస్‌. ఆయన మాచ్‌లాండ్‌పూర్‌లో ఢాకీ శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నారు. ‘‘ఈసారి మహిళా ఢాకీలకు పారీ్టల నుంచి బాగా డిమాండ్‌ ఉంది. సామాన్యులు కూడా మహిళా ఢాకీలనే ఇష్టపడుతున్నారు. పురుషుల సంగీత వాయిద్యాలను మహిళలు తమ భుజాలపై వేసుకుని వాయిస్తుండటంతో చూసేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు’’ అని శివ్‌పాద్‌ చెప్పారు. ‘‘భర్తతో పాటు కుటుంబాన్ని ఆదుకోవడానికి ఢాకీలుగా పని చేస్తున్నాం. పిల్లల చదువుల ఖర్చుతో కుటుంబ అవసరాలను తీర్చగలుగుతున్నాం. ఒకేసారి వేల రూపాయలు సంపాదించగలగడం ఆనందాన్నిస్తోంది. ఇప్పుడు ఎన్నికల సీజన్‌ గనుక తినడానికి, తాగడానికి కూడా సమయం ఉండటం లేదు. రోజూ ఏదో ఒక పార్టీ ప్రచార కార్యక్రమానికి డ్రమ్‌ భుజాన వేసుకుని వెళ్తూనే ఉన్నాం’’ అని ఆనందంగా చెబుతున్నారు మహిళా ఢాకీలు. 

14 ఏళ్ల కిందట మొదలై... 
ప్రముఖ ఢాకీలలో ఒకరైన గోకుల్‌ చంద్ర దాస్‌ పద్నాలుగేళ్ల కిందట తన కుటుంబంలోని మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. కోడలు ఉమా దాస్, కుమార్తె టుకుతో కలిసి మహిళా ఢాకీల బృందాన్ని ప్రారంభించారు. 2011లో దుర్గా పూజ పండల్‌లో తొలిసారి ప్రదర్శన ఇచ్చినప్పుడు అంతా ఆశ్చర్యపోయి చూశారు. అయితే బెంగాలీ టాలెంట్‌–హంట్‌ షోలో మహిళా ఢాకీలు కనిపించిన తరువాత పరిస్థితి మారింది. వారిని దుర్గా పూజలకు పిలవడం మొదలైంది. ఇప్పుడు బెంగాల్లో అనేక మహిళా ఢాకీ శిక్షణా కేంద్రాలున్నాయి. 
                   
 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement
 
Advertisement
 
Advertisement