Sitakka Supporting Congress MP Candidate Atram Suguna, Details Inside | Sakshi
Sakshi News home page

దేవుడి పేరుతో.. బీజేపీ రాజకీయం! : మంత్రి సీతక్క

Published Tue, Apr 30 2024 11:09 AM

Sitakka Supporting Congress MP Candidate Atram Suguna

రాష్ట్ర మంత్రి సీతక్క

జిల్లాలో పలుచోట్ల రోడ్‌షోలు

ఆదిలాబాద్‌: దేవుడి పేరు చెప్పి బీజేపీ రాజకీయం చేస్తుందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా మండలకేంద్రంలో సోమవారం నిర్వహించిన రోడ్‌షోలో ఆమె మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేసే బీజేపీని ఈ ఎన్నికల్లో ఓటుతో రద్దు చేయాలన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ రాజకీయంగా పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాందాస్, మండల అధ్యక్షుడు ఫైజుల్లాఖాన్, బ్లాక్‌ అధ్యక్షుడు గుండవార్‌ సంజయ్, నాయకులు రూపేశ్‌రెడ్డి, వామన్, శంకర్, చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి అడిగితే అక్షింతలు పంపుతున్నారు..
జైనథ్‌: అభివృద్ధి గురించి అడిగితే ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అక్షింతలు పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. మండల కేంద్రంలో ఎన్ని కల ప్రచారంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. అనంతరం నాయకులతో కలిసి సరదాగా డప్పు కొట్టి కార్యకర్తల్లో జోష్‌ పెంచారు. అంతకు ముందు మంత్రి లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఇందులో డీసీసీబీ చైర్మన్‌ అడ్డి భోజా రెడ్డి, జెడ్పీటీసీ అరుంధతి వెంకట్‌ రెడ్డి, గడ్డం జగదీశ్‌రెడ్డి,  తదితరులున్నారు.

రుణమాఫీకి కేరాఫ్‌ కాంగ్రెస్‌..
తాంసి: రైతు రుణమాఫీకి కేరాఫ్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా భీంపూర్‌ మండలంలోని అర్లి(టి),తాంసి మండలంలోని కప్పర్ల గ్రామాల్లో రోడ్‌షో చేపట్టారు. అనంతరం పార్టీలో చేరిన పలువురికి కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బోథ్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు, తలమడుగు జెడ్పీటీసీ గణేశ్‌రెడ్డి, నాయకులు నరేశ్‌ జాదవ్, తదితరులు పాల్గొన్నారు.

రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడడమే లక్ష్యం..
గుడిహత్నూర్‌: రాహుల్‌గాంధీని దేశ ప్రధానిగా చూడడమే మన లక్ష్యమని, కార్యకర్తలు ఆ దిశగా కృషి చేయాలని మంత్రి సీతక్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి సుగుణతో కలిసి మండల కేంద్రంలోని మాజీ ఏఎంసీ చైర్మన్‌ ఆడే శీల ఇంటికి చేరుకున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్‌ స్థానిక నాయకులను మంత్రికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. విభేదాలు పక్కన పెట్టి సుగుణ గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం స్థానిక యువకులు మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మాధవ్‌ మస్కే తదితరులు పాల్గొన్నారు.

ఆడబిడ్డను పార్లమెంట్‌కు పంపుదాం..
బోథ్‌: ఈ ప్రాంత ఆడబిడ్డ, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్‌కు పంపుదామని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం రాత్రి బోథ్‌ మండలంలోని ధన్నూర్‌ బి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సుగుణ విజయం దాదాపు ఖాయమైందని ఆశాభావం వ్యక్తం చేశారు. జొన్న పంట కొనుగోళ్లను ఎకరాకు 8 క్వింటాళ్ల నుంచి మరింత పెంచుతామని రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు పసుల చంటి, ఇంద్రారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి చదవండి: ప్రజలు కేసీఆర్‌నే కోరుకుంటున్నారు..
 

Advertisement
Advertisement