ఒంగోలు టౌన్: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డాక్టర్ దుర్గాదేవి గురువారం కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను కలెక్టర్ అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీజీహెచ్లో చికిత్స కోసం వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య శ్రీ సేవలు గణనీయంగా పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని చెప్పారు. సూపర్ స్పెషాలిటీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.
తెలుగు తమ్ముళ్ల శవ రాజకీయం!
● అయ్యపురాజుపాలెంలో వృద్ధుడు మృతి
● ఆస్తి పంచాయితీ తేలేవరకు అంత్యక్రియలొద్దని మంకుపట్టు
మర్రిపూడి: మండలంలోని అయ్యపురాజుపాలెంలో తెలుగుతమ్ముళ్లు శవరాజకీయం చేశారు. రెండు రోజుల క్రితం మరణించిన వృద్ధుడిని ఖననం చేయనివ్వకుండా రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టి ఆస్తి పేరిట తెలుగు తమ్ముళ్లు కుటిల రాజకీయం చేశారు. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. మండలంలోని అయ్యపురాజుపాలెం గ్రామానికి చెందిన గుట్లపల్లి వెంకటేశ్వర్లు(72)కు ఆదే గ్రామానికి చెందిన రమణమ్మతో సుమారు 40 ఏళ్ల క్రితం వివాహమైంది. వివాహం అయిన కోద్దిరోజులకే భార్యాభర్తల మధ్య సంబంధం తెగిపోయింది. భర్తను వీడి భార్య రమణమ్మ మరో ప్రాంతానికి వెళ్లిపోయింది. ఒంటరి అయిన గుంట్లపల్లి వెంకటేశ్వర్లు తన అన్న వెంకయ్య వద్దే ఉంటున్నాడు. చేరదీశారన్న కృతజ్ఞతతో తన పేరిట ఉన్న నాలుగు ఎకరాల భూమిని అన్న కుమారులకు వెంకటేశ్వర్లు రిజిస్ట్రేషన్ చేశారు. విషయం తెలుసుకున్న రమణమ్మ ముగ్గురు కుమార్తెలు తరచూ అయ్యపురాజుపాలెం గ్రామానికి చేరుకుని టీడీపీ నేతల సహకారంతో గొడవకు దిగారు. ఈ క్రమంలో గుట్లపల్లి వెంకటేశ్వర్లు ఈ నెల 15న ఉదయం తన అన్న కొష్టంలో మరణించాడు. అన్న వెంకయ్య కుమారులు అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేస్తుండగా రమణమ్మ, ఆమె ముగ్గురు కుమార్తెలు అయ్యపురాజుపాలెం చేరుకుని అంత్యక్రియలను అడ్డుకున్నారు. వృద్ధుడు మృతి చెంది రెండు రోజులు కావడంతో దుర్వాసన వస్తోంది. మృతదేహం ఉన్న మంచాన్ని వెంకయ్య కుమారుల ఇంటి వద్దకు తీసుకెళ్లి ఆస్తి ఇస్తేనే అంత్యక్రియలు చేయనిస్తాం, లేదంటే శవం పూర్తిగా కుళ్లిపోయేవరకు ఇక్కడే ఉంటుందని భీష్మించారు. లేదా శవాన్ని మేమే ఖననం చేస్తాం.. మూడు నెలలు పాటూ ఈ ఇంట్లోనే ఉండనివ్వండి అని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై శివబసవరాజు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇరువర్గాలకు సర్దిచెప్పి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేయించారు.