![వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/15/14ndk41a-200056_mr.jpg.webp?itok=9ViIuWJJ)
పగిడ్యాల: పడమర ప్రాతకోటలో వైఎస్సార్సీపీ కార్యకర్త చాకలి విజయుడుపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. తలకు తీవ్ర గాయం కావడంతో కర్నూలుకు తరలించారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయుడు గంగి హరిప్రసాద్ గత రెండు రోజులుగా వాట్సాప్ స్టేటస్లో నందికొట్కూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దారా సుధీర్, సచివాలయ మండల కన్వీనర్ రమేష్నాయుడును ధూషిస్తూ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా పోస్టింగ్లు పెడుతున్నాడు. అలాంటి పోస్ట్లు పెట్టవద్దని హరిప్రసాద్ తండ్రి గంగిరమణను మంగళవారం రమేష్నాయుడు సూచించాడు. అయితే ఈ విషయంపై వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రమేష్నాయుడు అనుచరుడు చాకలి విజయుడు పగిడ్యాలకు వెళ్తుండగా సంతమార్కెట్ వద్ద తెలుగు వెంకటేశ్వర్లు, గంగి హరిప్రసాద్, గంగి రమణ, తెలుగు లక్ష్మన్న, కర్ణ, చిన్నస్వాములు దుర్భాషలాడుతూ రాళ్లతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే బాధితుడిని నందికొట్కూరు ఆసుప్రతికి తరలించగా, అక్కడ ప్రాథమిక చికిత్స చేసి కర్నూలుకు తరలించారు. సమాచారం తెలుసుకున్న ముచ్చుమర్రి ఎస్ఐ జయశేఖర్ సీఆర్పీ బలగాలతో పర్యవేక్షించి గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
నలుగురిపై కేసు నమోదు:
ముచ్చుమర్రి స్టేషన్ పరిధిలోని పడమర ప్రాతకోట గ్రామంలో మంగళవారం ఉదయం తెలుగు బలరాముడు అనే వ్యక్తిని కాళ్లు, చేతులతో తన్ని, కొట్టిన నలుగురి నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జయశేఖర్ తెలిపారు. గ్రామానికి చెందిన రమేష్నాయుడు, నరసింహ, స్వాములు, మల్లయ్యలు బలరామడుపై దాడికి పాల్పడినట్లు బాధితుడు స్టేషన్లో ఫిర్యాదు చేశాడన్నారు. ఈ మేరకు నలుగురు నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్ఐ పేర్కొన్నారు.
● తలపై బండరాయితో మోదిన టీడీపీ వర్గీయులు