Sakshi News home page

వ్యభిచారాన్ని మళ్లీ నేరంగా పరిగణించాలి: కేంద్రానికి ఎంపీ ప్యానెల్ నివేదిక

Published Tue, Nov 14 2023 8:01 PM

Adultery Crime Again MPs Panel Contradicts Supreme Court Order - Sakshi

ఢిల్లీ: కొత్త నేర న్యాయ బిల్లులపై సమీక్ష చేపట్టిన పార్లమెంటరీ ప్యానెల్‌.. కీలక సవరణలు చేసింది. సుప్రీంకోర్టు కొట్టేసిన సెక్షన్ 497(వ్యభిచారం)ని మళ్లీ నేరంగా పరిగణించాలని అంటోంది. వివాహ వ్వవస్థ పవిత్రమైనది దానిని పరిరక్షించాలని పేర్కొంటూ భారతీయ న్యాయ సంహిత బిల్లులపై తన రిపోర్టును కేంద్రానికి సమర్ఫించింది. ప్రతిపాదిత సవరణలో లింగ-తటస్థ (gender-neutral ) నేరంగా పరిగణించాలని నివేదికలో పేర్కొంది. ఈ కేసుల్లో పురుషుడు, మహిళ సమాన బాధ్యత వహించాలని పిలుపునిచ్చింది.

భారతీయ న్యాయ సంహితపై తదుపరి పరిశీలన కోసం బీజేపీ ఎంపీ బ్రిజ్‌ లాల్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదికను ఒక వేళ పార్లమెంట్ ఆమోదం తెలిపితే.. వివాహేతర సంబంధాలపై 2018 నాటి సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పును పక్కకు పెట్టినట్లవుతుంది. 

బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలు.. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌ల స్థానంలో..  భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత- 2023, భారతీయ సాక్ష్య బిల్లు- 2023 లను కేంద్రం తేనుంది. వీటిని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి.. తదుపరి పరిశీలన కోసం బీజెపి ఎంపీ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి ఆగస్టులో పంపారు. 

సుప్రీం తీర్పు..
వివాహేతర సంబంధం నేరం కాదంటూ 2018 సెప్టెంబర్‌లో తీర్పు ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. ఓ ప్రవాస భారతీయుడు దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. వ్యభిచారం నేరంగా పేర్కొంటున్న ఐపీసీ సెక్షన్‌ 497 రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.  ‘‘మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్‌ 497కు కాలం చెల్లింది, అది రాజ్యాంగ విరుద్ధం’’ అని ప్రకటించింది. 

ఇదీ చదవండి: 377, 497 సెక్షన్లు మళ్లీనా?.. భారతీయ న్యాయ సంహిత బిల్లులో సవరణలతో చేర్చే ప్రతిపాదన!

Advertisement
Advertisement