మదనపల్లె సిటీ : వేసవి సెలవులను పురస్కరించుకుని ఈనెల 20న ఊటీకి ప్రత్యేక బస్సు సర్వీసు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. 20న రాత్రి 9 గంటలకు బయలుదేరి 21న ఊటీకి చేరుకుంటుందన్నారు. ఆ రోజు ఊటీలో ఉండి 22న ఉదయం బయలుదేరి మైసూర్కు వస్తుందని, అక్కడ ప్రదేశాలు, సాయంత్రం బృందావన్ గార్డెన్స్లో లైటింగ్ షో చూసుకుని రాత్రి బయలుదేరి 23న ఉదయం మదనపల్లెకు చేరుకుంటుందన్నారు. రాను,పోను చార్జీ రూ.2,800 చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు 7382875034, 7382876658, 9441646104 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
నేటి నుంచి
క్షయ టీకా కార్యక్రమం
రాయచోటి అర్బన్ : జిల్లా వ్యాప్తంగా ఈనెల 16వ తేది నుంచి వయోజనులకు క్షయ టీకా నిర్దేశించిన ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో వేయనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొండయ్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ శైలజ, జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారిణి /ఉషశ్రీలు తెలిపారు. టీబీ ముక్త్భారత్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 16 నుండి మధుమేహ గ్రస్తులను, ధూమపానం చేసేవారిని, టీబీ మందులు వాడి తగ్గినవారిని, 60 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి, బాడీమాస్ ఇండెక్స్ 18లోపు ఉన్నవారికి టీకా ఉచితంగా వేయనున్నట్లు వివరించారు. ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖసిబ్బందికి బాసిల్లే కాల్మెట్–గ్యురిన్ (బీసీజీ) టీకా కార్యక్రమానికి సంబంధించిన శశిక్షణ పూర్తయిందని తెలిపారు. వ్యాక్సిన్ను, ఇతర సామగ్రిని కూడా పీహెచ్సీలకు తరలించామన్నారు.ప్రతి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఆరోగ్యసిబ్బంది వ్యాక్సిన్ను అందుబాటులో ఉంచుకుని ప్రతిగురువారం వయోజనులకు వాక్సిన్ వేయాలని సూచించారు.
దరఖాస్తుల ఆహ్వానం
కడప రూరల్ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం, ట్రావెల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని సహాయ ఆచార్యులు డాక్టర్ పి.శర్వానంద్ తెలిపారు. బుధవారం వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్స్ మేనేజ్మెంట్ నెల్లూరులో ఉందన్నారు. నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, ప్లేస్మెంట్స్ కల్పించడమే ఈ విద్యా సంస్థ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. 2024–25 విద్యా సంవత్సరానికిగాను ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్), బీబీఏ (టూరిజం అండ్ ట్రావెల్) కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంబీఏ కోర్సుకు ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలన్నారు. పూర్తి వివరాలకు 9966462786, 9490787854 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
నేటి నుంచి వేసవి
విజ్ఞాన శిబిరాలు
కడప కల్చరల్: వైఎస్సార్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో కడప నగరంలోని ప్రధాన కార్యాలయంతోపాటు జిల్లాలోని అన్ని శాఖా గ్రంథాలయాల్లో గురువారం నుంచి వేసవి విజ్ఞాన శిబిరాలను నిర్వహించనున్నట్లు సంస్థ జిల్లా కార్యదర్శి అమీరుద్దీన్ తెలిపారు. తమ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలను జూన్ 7వ తేది వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతిరోజు విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంచే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. పిల్లల్లో చదివే అలవాటును పెంచేందుకు ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమం కింద పుస్తక పఠనం చేయించడం శిక్షణలో ముఖ్యమైన అంశమన్నారు. జూన్ 7న కార్యక్రమాల ముగింపు సందర్బంగా అతిథులతో వారికి శిక్షణలో పాల్గొన్న సర్టిఫికెట్లను ప్రదానం చేయనున్నట్లు, వలంటీర్ల సేవలకు గుర్తింపుగా ప్రశంసాపత్రాలను అందజేయనున్నట్లు వివరించారు.
సీబీఎస్ఈ ఫలితాల్లో మెరిసిన ఏపీ బాలిక
బ్రహ్మంగారిమఠం : తెలంగాణా రాష్ట్రంలో టెన్త్ సీబీఎస్ఈ ఫలితాల్లో వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డిపల్లె పంచాయతీ గంగిరెడ్డిపల్లెకు చెందిన పోలు బ్రహ్మనందరెడ్డి కుమార్తె వైష్ణవి 500లకు 496మార్కులు సాధించింది . తెలంగాణా రాష్ట్రంలో మొదటి ర్యాంక్ రావడంతో గ్రామంతో పాటు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.