చంద్రబాబు ఒళ్లంతా దళితుల రక్తంతోనే తడిసింది  | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఒళ్లంతా దళితుల రక్తంతోనే తడిసింది 

Published Fri, Apr 19 2024 5:34 AM

Jupudi Prabhakar Rao comments over Chandrababu  - Sakshi

వైఎస్‌ కుటుంబానికి దళితులు బంధువులు.. ఆత్మ బంధువులు 

దళితులతో వియ్యమొందిన చరిత్ర బాబు, రామోజీలకు ఉందా? 

వైఎస్సార్‌సీపీ నేత జూపూడి ప్రభాకర్‌రావు

సాక్షి, అమరావతి: చంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిసిందన్న విషయం రామోజీరావు  మరిచిపోతే ఎలా అని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్‌రావు ప్రశ్నించారు. ఆయన గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. అన్నదమ్ములుగా బతుకుతున్న దళితుల్ని విడగొట్టింది బాబేనని చెప్పారు. వారిలో మనస్పర్ధలు తెచ్చి, కోర్టులకెక్కేలా చేసి, దాడులకు ఉసిగొల్పిందీ చంద్రబాబేనన్నారు. ఈ విషయాలు తెలిసి కూడా రామోజీరావుకు బాబు మంచోడులా కనిపిస్తాడన్నారు. సీఎం జగన్‌ పేదల పక్షాన నిలిచి, పనిచేస్తున్నారన్న విషయాన్ని ప్రతి పేద కాలనీల్లో అందరూ ఒప్పుకునే మాట అని చెప్పారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆలోచనలు, రాజ్యాంగ సూత్రాలను ముందుకు తీసుకెళ్లిన నాయకుడు వైఎస్‌ జగన్‌ ఒక్కరేనని చెప్పారు. దళిత బంధువైన సీఎం వైఎస్‌ జగన్‌పై ఈనాడు దినపత్రిక ద్వారా రామోజీ విషం కక్కారని అన్నారు. సీఎం జగన్‌ను దళితుల నుంచి దూరం చేయాలనే కుట్రకు దిగిందని, అందులో భాగంగా బాబు దళితుల ఆపద్బాంధవుడంటూ విచిత్రమైన కథనాన్ని రాసుకొచ్చిందని చెప్పారు. ఈ కథనం రాసిన ఈనాడు భయంకర కుట్రలకు వేదికగా చరిత్రలో నిలచిపోతుందన్నారు.

దళితుల్ని బాబు గుర్రాలతో తొక్కిస్తే వార్త రాయలేదెందుకు అని నిలదీశారు. అసలు ఏనాడైనా బాబు దళితుల్ని మనుషుల్లా చూశారా అని ప్రశ్ని0చారు. కారంచేడు, చుండూరు, పదిరికుప్పం బాబు సామాజికవర్గ దాషీ్టకాలేనన్నారు. కారంచేడులో ఏరులై పారింది దళితుల రక్తం కాదా? దళితుల్ని ముక్క­లుగా నరికి శవాల్ని మూటగట్టిన రక్తచరిత్ర మీది కాదా బాబూ అని నిలదీశారు.

చంద్రబాబు పాలనలో దళితులకు అడుగడుగునా అవమానాలే జరిగాయని తెలిపారు. వైఎస్‌ కుటుంబానికి దళితులు బంధువులని, ఆత్మ బంధువులని చెప్పారు. దళితులతో వియ్యమొందిన చరిత్ర చంద్రబాబు, రామోజీ కుటుంబాలలో ఉందా అని ప్రశంసించారు. ఈనాడు పుట్టిన దగ్గర్నుంచీ గడచిన 50 ఏళ్లల్లో ఈ రాష్ట్రంలో దళితులు వెనుకబడి ఉన్నారని, వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాల్సిన అవసరం ఉందని వార్త రాశావా రామోజీ అని నిలదీశారు. 

చంద్రబాబు రక్తంలోనే దళిత వ్యతిరేకత 
బాబుకు దళితులంటేనే గిట్టదని జూపూడి చెప్పారు. ఆయన రక్తంలోనే ఎస్సీ, ఎస్టీలపై వ్యతిరేకత ఉందన్నారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ సీఎం స్థానంలో కూర్చొని నోరుపారేసుకున్నారని చెప్పారు. ఇలాంటి వ్యక్తి నీచత్వాన్ని పక్కనబెట్టి, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ పేదలకు అండగా ఉండే సీఎం జగన్‌ని విమర్శిస్తూ రాసే మాయ రాతలను ప్రజలు నమ్మరని చెప్పారు. సామాజిక న్యాయ సూత్రాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాత్రమేనని తెలిపారు.

దళితుల అభ్యున్నతికి పాటుపడుతూ, దళితవాడల్లో అభివృద్ధి ఫలాల్ని పూయిస్తూ, పేద పిల్లల చదువు ఖరీదు కాకూడదని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చి వారికి ఇంగ్లిషు మీడియం విద్యాబోధన చేయించిన సీఎం వైఎస్‌ జగన్‌ అని తెలిపారు. వైద్యం, ఆరోగ్యం విషయంలోనూ ఎన్నడూ ఊహించని విధంగా గ్రామస్థాయిలో మార్పు తెచ్చిన సీఎం జగనే అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీఎం జగన్‌ని మరిచిపోయే దళి­తులు ఎవరైనా ఉంటారా అని ప్రశ్ని0చారు. రేపటి ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు వైఎస్సార్‌సీపీ గెలవబోతోందని చెప్పారు.

Advertisement
Advertisement