స్పెక్ట్రమ్ వేలంలో జియో ముందంజ | Sakshi
Sakshi News home page

స్పెక్ట్రమ్ వేలంలో జియో ముందంజ

Published Fri, May 17 2024 9:25 AM

Reliance Jio Tops Spectrum Auction With Rs 3,000 Crore EMD

మొబైల్ ఫోన్ సేవల స్పెక్ట్రమ్ బ్యాండ్‌ల వేలంలో రిలయన్స్ జియో ముందంజలో నిలించింది. టెలికాం డిపార్ట్‌మెంట్ తాజాగా ప్రచురించిన వివరాల ప్రకారం..  రాబోయే స్పెక్ట్రమ్ వేలం కోసం ధరావతు సొమ్ము కింద రిలయన్స్ జియో అత్యధికంగా రూ. 3,000 కోట్లను డిపాజిట్ చేసింది.

టెలికమ్యూనికేషన్స్‌ విభాగం విడుదల చేసిన ప్రీ-క్వాలిఫైడ్ బిడ్డర్ వివరాల ప్రకారం.. భారతి ఎయిర్‌టెల్ రూ. 1,050 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 300 కోట్ల విలువైన మనీ డిపాజిట్‌ను సమర్పించాయి. కంపెనీలు డిపాజిట్ చేసిన ఈఎండీ మొత్తం ఆధారంగా పాయింట్లను పొందుతాయి. ఇది వారికి కావలసిన సర్కిల్‌ల సంఖ్య, స్పెక్ట్రమ్ పరిమాణానికి వేలం పాడేందుకు వీలు కల్పిస్తుంది. ఎన్ని ఎక్కువ పాయింట్లు ఉంటే వేలం దక్కించుకునేందకు అంత సామర్థ్యం ఉంటుంది.

రిలయన్స్ జియో ఇప్పటి వరకు పాల్గొన్న అన్ని స్పెక్ట్రమ్ వేలంలో చార్ట్‌లో ముందుంది. జియో నెట్‌వర్త్‌ రూ.2.31 లక్షల కోట్లు కాగా, ఎయిర్‌టెల్ నెట్‌వర్త్‌ రూ.86,260.8 కోట్లు. ఇక వొడాఫోన్‌ ఐడియా నెట్‌వర్త్‌ విషయానికి వస్తే రూ. 1.16 కోట్ల వద్ద ప్రతికూల జోన్‌లో ఉంది.

జూన్ 6 నుంచి సుమారు రూ.96,317 కోట్ల బేస్ ధరతో మొబైల్ ఫోన్ సేవల కోసం ఎనిమిది స్పెక్ట్రమ్ బ్యాండ్‌లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పెక్ట్రమ్ 20 సంవత్సరాల పాటు కేటాయిస్తారు. దక్కించుకున్న బిడ్డర్లు 20 సమాన వార్షిక వాయిదాలలో చెల్లింపులు చేయవచ్చు. వేలం ద్వారా పొందిన స్పెక్ట్రమ్‌ను పదేళ్ల తర్వాత సరండర్‌ చేసే అవకాశం ఉంటుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement