-
అల్లర్లకు పాల్పడితే జిల్లా బహిష్కరణ
చీరాల రూరల్: ఎన్నికల కౌంటింగ్ రోజు అల్లర్లు, గొడవలకు పాల్పడిన నిందితులను గుర్తించి రౌడీషీట్లు తెరవడమే కాకుండా నగర బహిష్కరణ కూడా చేస్తామని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్టి త్రిపాఠి పేర్కొన్నారు. శనివారం స్థానిక ఒన్టౌన్ పోలీసు స్టేషన్ను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్టి త్రిపాఠి, ఎస్పీ డాక్టర్ వకుల్ జిందాల్తో కలసి సందర్శించారు. నియోజకవర్గ పరిధిలోని పోలీసు అధికారులతో వారు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఎన్నికల రోజు జరిగిన తదనంతర పరిణామాలు, ఘర్షణలకు నమోదు చేసిన కేసుల వివరాలపై వారు సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందించారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తీసుకుంటున్న భద్రతా చర్యల గురించి సమీక్షించారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడారు. చీరాల నియోజకవర్గ పరిధిలో ఎన్నికల రోజున జరిగిన అల్లర్లు, గొడవలు, అరెస్టులపై కేసుల్లో జరుగుతున్న దర్యాప్తును పరిశీలించేందుకు ఐజీ త్రిపాఠి చీరాల పోలీసుస్టేషన్ను సందర్శించారని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా విధులు నిర్వర్తించేలా సిబ్బందికి సూచించినట్లు చెప్పారు. ఎన్నికల కౌంటింగ్ రోజు చీరాల నియోజకవర్గంలో సెక్షన్ 144 సీఆర్పీసీ, పోలీసు 30 యాక్టు అమలులో ఉంటుందని తెలిపారు. ఎక్కడా గుంపులు గుంపులుగా సంచరించరాదన్నారు. రాజకీయ నాయకులు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయరాదని సూచించారు. అలానే ర్యాలీలు, ఊరేగింపులకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కౌంటింగ్ రోజున ప్రజలు కూడా సంయమనంతో వ్యవహరించి కౌంటింగ్ సజావుగా సాగేందుకు సహకరించాలని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా అటువంటి వారిపై రౌడీ షీట్లు తెరుస్తామని, పలుమార్లు ఘర్షణలకు పాల్పడినవారిపై పీడీ చట్టం ప్రయోగించి జిల్లా బహిష్కరణ కూడా చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల రోజు ఘర్షణలకు పాల్పడిన వారిపై కలెక్టర్కు నివేదిక కూడా అందజేశామని త్వరలో చర్యలు చేపడతామని చెప్పారు. జిల్లాలో జూన్ 6 వరకు బాణసంచా విక్రయించరాదని నిర్వాహకులకు ఆజ్ఞలు జారీ చేసినట్లు చెప్పారు. పెట్రోలు బంకుల్లో బాటిళ్లలో లూజ్ పెట్రోలు విక్రయించరాదని సూచించామని, నిబంధనలు అతిక్రమించే బంకుల లైసెన్సులు కూడా రద్దు చేస్తామని చెప్పారు. కౌంటింగ్ రోజున ప్రశాంత వాతావరణం ఉండేలా ప్రజలు పోలీసులకు సహకారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ బేతపూడి ప్రసాద్, సీఐలు శేషగిరిరావు, సోమశేఖర్, బి.శ్రీనివాసరావు, ఎస్సైలు పాల్గొన్నారు.గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్టి త్రిపాఠి, ఎస్పీ వకుల్ జిందాల్ -
సొంత భవనంలోకి కేంద్రియ విద్యాలయం
● ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం ● ఇర్లపాడు వద్ద తుది దశకు నిర్మాణ పనులు నాదెండ్ల: చిలకలూరిపేట విద్యారంగంలో మణిహారమైన కేంద్రియ విద్యాలయం 2024 విద్యా సంవత్సరానికి సొంత భవనంలో ప్రారంభానికి సిద్ధమౌతోంది. మండలంలోని ఇర్లపాడులో సుమారు రూ.19.8 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. విద్యాలయం పనులు తుది దశకు చేరాయి. ఈ విద్యాసంవత్సరం నుండే విద్యాలయం ప్రారంభం కానుంది. 2018లో ఈ పాఠశాలకు అనుమతులు రాగా, 2019 నుంచి గణపవరంలోని సీఆర్ పాలిటెక్నిక్ కళాశాల భవనాల్లో తాత్కాలికంగా క్లాసులు నిర్వహిస్తున్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకూ ఇక్కడ తరగతులు నిర్వహించనున్నారు. నాణ్యమైన ఒత్తిడి లేని విద్యకు ఈ పాఠశాల మారుపేరుగా ఉంది. ఈ పాఠశాలలో సీటు రావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఆపై ఖాళీల్లో రిజర్వేషన్ వారీగా కేటాయింపులు చేస్తారు. 9.61 ఎకరాల విస్తీర్ణంలో... కేంద్రియ విద్యాలయానికి అనుమతులు రావాలంటే కనీసం పదెకరాలు స్థలం ఉండి తీరాలి. అప్పట్లో నాదెండ్ల రెవెన్యూ అధికారులు ఇర్లపాడు గ్రామ రెవెన్యూ పరిధిలో 10.10 ఎకరాల విస్తీర్ణాన్ని అప్పగించారు. సుమారు 50 సెంట్ల విస్తీర్ణంలో పక్కనే ఉన్న జగనన్న కాలనీకి అవసరమైన రోడ్లకు వదిలారు. ప్రస్తుతం 9.61 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రూ.19.8 కోట్ల వ్యయంతో... విద్యాలయంలో తరగతి గదులు, ల్యాబ్, లైబ్రరీ, ఉపాధ్యాయులకు అవసరమైన స్టాఫ్ రూమ్లతోపాటూ సిబ్బందికి అవసరమైన క్వార్టర్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి. తిరుపతికి చెందిన సీఎన్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు నిర్మాణ పనులు జరుపుతున్నారు. సీపీడబ్ల్యూడీ విజయవాడ డివిజన్ అధికారులు పనులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం గణపవరంలోని సీఆర్ కళాశాలలో విద్యాలయం తాత్కాలికంగా నడుస్తుండగా, 9వ తరగతి వరకూ విద్యాభ్యాసం కొనసాగుతోంది. 2024 విద్యాసంవత్సరంలో పదో తరగతి బ్యాచ్ ప్రారంభం కానుంది. 2025 నుండి ఇంటర్ మొదటి సంవత్సరం, ఆ తర్వాత ఏడాది ఇంటర్ రెండో సంవత్సరం బ్యాచ్ ప్రారంభం కానుంది. వీటికి సంబంధించి కూడా నిర్మాణ పనులు జరుగుతున్నాయి.నాణ్యమైన ఒత్తిడి లేని విద్య నాణ్యమైన ఒత్తిడి లేని విద్యతోపాటూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కేంద్రియ విద్యాలయం పెట్టింది పేరు. విద్యార్థుల అభ్యున్నతికి ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తాం. ప్రస్తుతం గణపవరంలో తాత్కాలిక భవనాల్లో నడుస్తున్న విద్యాలయంలో 2024 విద్యా సంవత్సరంలో నూతన భవనాల్లో ప్రారంభం కానుంది. – సునీతసింగ్, ఇన్చార్జి ప్రిన్సిపల్ -
ఘోర రోడ్డు ప్రమాదం
● ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి ● కారంచేడు రామానాయుడు వారధి వద్ద ఘటన చినగంజాం:కారంచేడు మండలం, రామానాయుడు వారధి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కారంచేడు గ్రామానికి చెందిన మరిపల్లి ఏడుకొండలు (50) ద్విచక్రవాహనంపై చీరాల వైపు వెళుతున్నాడు. అదే సమయంలో హైదరాబాద్కు చెందిన బి.సాధనరావు (28) మరో ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. ఇద్దరూ ఘటనా స్థలి వద్దకు రాగానే ఒక్కసారిగా ఎదురెదురుగా ఢీకొన్నారు. దీంతో ఏడుకొండలు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలతో పక్కన పడిపోయిన సాధనరావును చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఒకే ఘటనలో ఇద్దరు చనిపోవడంతో బంధువులు బోరున విలపిస్తున్నారు. ఏడుకొండలుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నట్లు తెలిసింది. సాధనరావు హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కారంచేడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
దుర్గమ్మ సేవలో చాగంటి కోటేశ్వరరావు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దంపతులు శనివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన వారికి ఆలయ ఈఓ కె.ఎస్.రామరావు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, ఈఓ రామరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలతో పాటు శ్రీకనకదుర్గ వైభవం పుస్తకాన్ని అందజేశారు. అనంతరం మల్లేశ్వర స్వామి వారితో పాటు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని చాగంటి కోటేశ్వరరావు దంపతులు దర్శించుకున్నారు. -
ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి
బాపట్ల: ఓట్ల లెక్కింపును అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా తెలిపారు. శనివారం కలెక్టరేట్ నుంచి ర్యాండమైజేషన్ నిర్వహించారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు ఓట్ల లెక్కింపు సిబ్బందిని నియమించారు. రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఆన్లైన్ విధానంలో అధికారులను కేటాయించారు. ఓట్ల లెక్కింపునకు నియమించిన అధికారులు జూన్ 4న బాపట్లలోని బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని స్ట్రాంగ్ రూముల వద్దకు ఉదయాన్నే చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సీహెచ్. శ్రీధర్, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్. సత్తిబాబు, ఆర్వోలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా -
సాగుకు సమాయత్తం
సాక్షి ప్రతినిధి,బాపట్ల: పది రోజుల కిందట జిల్లాలో అకాల వర్షాలు కురిశాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందడంతో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నుంచి జిల్లాలో తేలికపాటి వర్షాలు మొదలయ్యాయి. తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో రాబోయే రెండు రోజుల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. మరోవైపు తుఫాను ప్రభావంతో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముంది. ఈ ఏడాది ముందస్తు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జిల్లాలో ఖరీఫ్ సాగు ఆశాజనకంగా ఉండనుంది. వర్షాల నేపథ్యంలో అన్నదాతలు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చాలామంది రైతులు భూము లను దుక్కులు దున్నారు. మరోమారు వర్షం కురిస్తే మిగిలిన రైతులు పొలాలు దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేయనున్నారు. ఇప్పటికే వాతావరణం కొంత మేర చల్లబడింది. తుఫాను ప్రభావంతో మాగాణి పొలాలు మరింత పదునెక్కనున్నాయి. ఖరీఫ్ సాగు ఇలా.... జిల్లావ్యాప్తంగా ఖరీఫ్లో 1,41,916 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు కానున్నాయని వ్యవసాయశాఖ అంచనా. ఇందులో 1,03,790 హెక్టార్ల లో వరి పంట సాగు కానుంది. తర్వాత అత్యధికంగా పత్తి 4205 హెక్టార్లలో, మినుము 2275, కంది 1960, వేరుశనగ 926, మొక్కజొన్న 803 హెక్టార్ల లో సాగు కానుంది. వీటితోపాటు కూరగాయల పంటలు, సజ్జ, రాగి, సామ, ఆరిక పలురకాల పంటలు కలిపి 38,126 హెక్టార్లలో సాగుకానున్నాయి. కృష్టాడెల్టా కింద 2,59,475 ఎకరాల్లో వరిసాగు జిల్లాలో కృష్ణా వెస్ట్రన్ డెల్టా కింద అత్యధికంగా ఖరీప్ సీజన్లోనే 2,59,475 (1,03,790 హెక్టార్లు)ఎకరాల్లో వరిపంట సాగుకానుంది. ప్రధానంగా వేమూరు, రేపల్లె, బాపట్ల, చీరాల, పర్చూరు ప్రాంతాల్లో ఖరీఫ్లో వరి సాగవుతుంది. వేమూరు ప్రాంతంలో జూన్ నుంచే వరి పంట సాగు కానుండగా మిగిలిన చివరి ఆయకట్టు(టెయిలెండ్) ప్రాంతాలైన రేపల్లె, బాపట్ల, చీరాల, పర్చూరు ప్రాంతాల్లో జులై మొదలు ఆగస్టు వరకూ వరిపంట సాగువుతుంది. కృష్ణా నుంచి నీటి విడుదల ఆలస్యమైతే వరిసాగు మరింత ఆలస్యమవుతుంది. వరిసాగుకు పచ్చిరొట్ట ఎరువులు ఖరీఫ్ వరిసాగుకు కొంత సమయం ఉండడంతో తాజాగా కురిసిన వర్షాలతో పొలాలు సిద్ధం చేసుకున్న రైతులు సదరు పొలాల్లో పచ్చిరొట్ట ఎరువుల ఏర్పాటు కోసం జీలుగ, పిల్లిపెసర, మినుము పంటలను సాగుచేయడం పరిపాటి. ఇందుకోసం ప్రభుత్వం ప్రతిసంవత్సరం రైతులకు 50 శాతం సబ్సిడీతో పై మూడు రకాల విత్తనాలను అందిస్తోంది. ఇప్పటికే జిల్లాకు వెయ్యి క్వింటాళ్ల జీలుగ, వెయ్యి క్వింటాళ్ల జనుము, 800 క్వింటాళ్ల పిల్లిపెసర విత్తనాలను కేటాయించింది. అధికారులు వాటిని రైతులకు పంపిణీ చేస్తున్నారు. వర్షాలు అన్ని ప్రాంతాల్లో కురవగానే రైతులు విత్తనాలు సాగుచేస్తారు. 45 రోజుల తర్వాత ఆ పంటలను దుక్కికొట్టి పచ్చిరొట్ట ఎరువుకింద భూమిలో కలిపేస్తారు. ఇది వరిపంట సాగుకు సత్తువ కింద ఉపకరిస్తుంది. నాణ్యమైన విత్తనాలు అందించేందుకు కృషి మరోవైపు వరిసాగు సమయానికి ప్రభుత్వం నాణ్యమైన వరి విత్తనాలను రైతులకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా విత్తన ఉత్పత్తి కేంద్రాల నుంచి ఉత్పత్తి చేసిన విత్తనాన్ని రైతులకు అందించనున్నారు. శనివారం నుంచి జిల్లాలో వర్షాలు ఖరీఫ్ సాగుకు సిద్ధమైన రైతులు జిల్లాలో 1,41,916 హెక్టార్లలో వివిధ పంటల సాగు అత్యధికంగా 1,03,790 హెక్టార్లలో వరిసాగు ఇప్పటికే జీలుగ, జనుము, పిల్లి పెసర విత్తనాలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం మిగిలిన పంటలకు సబ్సిడీ విత్తనాలురైతులకు సబ్సిడీ విత్తనాలు ఖరీఫ్ సీజన్కు ముందే జిల్లాలో వర్షాలు కురవడం హర్షనీయం. వర్షాల రాకతో రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు. పొలాలను దుక్కులు దున్ని సాగుకు సిద్ధమయ్యారు. వరిసాగు నేపథ్యంలో రైతులందరికీ పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు వ్యవసాయశాఖ సిద్ధంగా ఉంది. ఇప్పటికే 1000 క్వింటాళ్లు జీలుగ, 1000 క్వింటాళ్లు జనుము, 800 క్వింటాళ్లు పిల్లిపెసర విత్తనాలను 50 శాతం సబ్సిడీతో రైతులకు పంపిణీ చేస్తున్నాం. అవసరమైన రైతులు రైతుభరోసా కేంద్రాల ద్వారా వీటిని పొందవచ్చు. – వై.రామకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి వరితోపాటు ఇతర పంటలసాగు జిల్లాలో వరిపంటతోపాటు ఖరీఫ్లో ఇతర పంటలు సాగు కానున్నాయి. ప్రధానంగా పత్తి, మినుము, వేరుశనగ, కంది, మొక్కజొన్న, పూలు, కూరగాయలు, కొర, సజ్జ తదితర పలురకాల పంటలు 95,315 ఎకరాల విస్తీర్ణంలో సాగు కానున్నాయి. జూన్ నెల నుంచే రేపల్లె, వేమూరు ప్రాంతాల్లోని లంక గ్రామాలతోపాటు బాపట్ల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో వివిధ రకాల పంటలు సాగు కానున్నాయి. తీర ప్రాంతాల పరిధిలోని దాదాపు అన్ని మండలాల్లో వేరుశనగ, కూరగాయలు, వివిధ రకాల పూల సాగు అధికంగా ఉంటుంది. మొత్తంగా ముందస్తు వర్షాల నేపథ్యంలో అన్నదాతలు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. -
పెదకాకానిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం
పెదకాకాని: పెదకాకాని గ్రామ శివార్లలో శనివారం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పెదకాకాని రాజరాజేశ్వరి ఆసుపత్రి వెనుకభాగంలో ఉన్న నిర్మాణుష్య ప్రాంతంలో వేపచెట్టు కింద మహిళ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సుమారు 25 సంవత్సరాల వయస్సు ఉన్న వివాహిత ముస్లిం మహిళగా గుర్తించారు. ముస్లిం మహిళలు సాంప్రదాయంగా ధరించే బుర్కాను మృతురాలు ధరించి ఉంది. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతరాలి నోటి వెంట నురగ వచ్చిన ఆనవాళ్లు ఉన్నాయి. నురగతో పాటు రక్తం కూడా రావడం చూస్తుంటే ఎవరైనా ఆ ప్రాంతానికి తీసుకు వచ్చి కొట్టి బలవంతంగా విషం తాగించి ఉంటారా, లేక ఆ మహిళే విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడిందా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి క్లూస్ టీం నిపుణులు చేరుకుని వేలిముద్రలు సేకరించారు. వాస్తవానికి శుక్రవారం సాయంత్రం నుంచే పొలాల్లో మహిళ మృతదేహం ఉందని పశువులు మేపుకొనే వారి ద్వారా సమాచారం అందినప్పటికీ ఆ ప్రాంతాన్ని పోలీసులు గుర్తించలేదు. స్థానిక వీఆర్ఓ నరసింహారావు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వీరాస్వామి తెలిపారు. మృతదేహాన్ని గుంటూరు మార్చురీకి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు -
మేనరిక వివాహాలపై అవగాహన అవసరం
నగరంపాలెం: మేనరిక వివాహాలతో పుట్టే పిల్లలు వైకల్యంతో జన్మిస్తున్నారని వికలాంగుల సంక్షేమం, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ సువార్త అన్నారు. కేంద్ర, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ తప్పిపోయిన బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో అవగాహనా సదస్సు నిర్వహించారు. సంస్థ జిల్లా కార్యదర్శి టి.లీలావతి అధ్య్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏడీ సువార్త మాట్లాడుతూ మేనరికం వివాహాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ట్రాన్స్జెండర్స్ తమ గుర్తింపు, ఆధార్, రేషన్ కార్డులు పొందవచ్చని చెప్పారు. ప్రతినెల పెన్షన్ పొందే అవకాశం ఉందన్నారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీదేవీ మాట్లాడుతూ బాల్య వివాహాలపై అవగాహన ఉండాలని అన్నారు. బస్సుల్లో, రైళ్లల్లో చిన్నారులను అపహరించి, వారితో చోరీలు చేయిస్తున్నారని, వాటిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ప్రమీల మాట్లాడుతూ తప్పిపోయిన పిల్లలను సాంకేతిక పరిజ్ఞానంతో వెంటనే గుర్తించే అవకాశం ఉందని అన్నారు. జిల్లా రక్షణ అధికారి విజయ్కుమార్, జిల్లా యాంటీ ట్రాపికింగ్ యూనిట్ అధికారిణి బేబీరాణిలు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతగా ఉండాలని అన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మత్తు పదార్ధాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. వివిధ నేరాల్లో బాధితులకు ప్రభుత్వం అందించే సహాయం, బాల నేరస్తుల చట్టం, సీనియర్ సిటిజెన్/బాల కార్మికుల హక్కులు, బాల్య వివాహాలు, బాలల హక్కులపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.లీలావతి వివరించారు. సదస్సులో క్రాఫ్ట్ జిల్లా సమన్వయకర్త సమీర్, కలెక్టర్ కార్యాలయం సూపరింటెండెంట్ లక్ష్మయ్య, ప్రభుత్వ అధికారులు, ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్స్ పాల్గొన్నారు. -
గొడవలు, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు
శావల్యాపురంః సార్వత్రిక ఎన్నికల అనంతరం గ్రామాల్లో గొడవులు అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వినుకొండ రూరల్ సీఐ ఉప్పుటూరి సుధాకరరావు హెచ్చరించారు. శని వారం మండలంలోని మతుకుమల్లి గ్రామంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టడంతో పాటు గ్రామంలో మరణాదాయులు,నాటు బాంబులు ఉన్నాయేమా అని ముందస్తు సోదాలు పోలీసులు చేశారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ సుధాకరరావు మాట్లాడుతూ ఎన్నికల అనంతరం గ్రామాల్లో శాంతి భద్ర తలు విఘాతం కలుగకుండా ఉండటానికి ఈ సోదాలు చేస్తున్నట్లు తెలిపారు. యువత ఇటువంటి రాజకీయ అల్లర్ల, గొడవులకు దూరంగా ఉండాలన్నారు. ఓటు వినియోగించుకోవటం ప్రతి పౌరు డు ప్రాథమిక హక్కు అయితే రాజకీయ గొడవులు, అల్లర్లకు దూరంగా ఉండటం నైతిక హక్కుగా ప్రతి ఒక్కరు భావించాలన్నారు. అనంతరం గ్రామంలో సరైనా పత్రాలు లేని బైకులు స్వాధీనం చేసుకొని పోలీసు స్టేషనుకు తరలించారు. ఎస్సైలు చల్లా సురేష్, లక్ష్మీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. గుండ్లపాడులో.. వెల్దుర్తి: గుండ్లపాడులో గ్రామంలో శనివారం మాచర్ల రూరల్ ిసీఐ సురేష్, ఎస్ఐ వెంకట్రావుల ఆధ్వర్యంలో ిసీఐఎస్ఎఫ్ పోలీసు సిబ్బందితో గ్రామంలో పోలీసు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సురేష్ మాట్లాడుతూ సమస్యాత్మక గుండ్ల పాడు గ్రామంలో కార్డన్ సెర్చ్ లో భాగంగా ఇళ్లలో తనిఖీలు నిర్వహించామన్నారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, వాహన యజమానులు సరైన ధృవీకరణ పత్రాలు చూపించి వాహనాలను తీసుకెళ్లాలన్నారు. ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. ఏఎస్పీ హనుమంతు, డీఎస్ిపీ శివరాజ్, ిసీఐలు సుబ్బారావు పాల్గొన్నారు. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు పిడుగురాళ్ల: ఎన్నికల కౌటింగ్ సమయంలో ఎవరైనా గొడవలకు పాల్పడితే అటువంటివారిపై శాఖ పరమైన చర్యలు తప్పవని పట్టణ ఎస్ఐ పఠాన్ రబ్బానీఖాన్ శనివారం తెలిపారు. మండలంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జరిగిన అల్లర్లకు పాల్పడిన సుమారు 40 మందిని అరెస్టు చేసి వారిని రాజమండ్రి, నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపించటం జరిగిందన్నారు. జూన్ 4వ తేదీన ఎన్నికల కౌటింగ్ జరుగుతుందని, కౌటింగ్ సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, యువకులు కానీ ఎవరైనా గొడవలకు, అల్లర్లకు పాల్పడితే అటువంటివారిపై కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. అవసరమైతే అల్లర్లకు పాల్పడిన వారిపై రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయటం జరుగుతుందని హెచ్చరించారు. -
పట్టుదల, ఏకాగ్రతతో ఐఏఎస్ సాధ్యమే
గుంటూరు ఎడ్యుకేషన్: సివిల్స్ సాధనకు పట్టుదల, ఏకాగ్రతతో కూడిన సన్నద్ధత అవసరమని పొగాకుబోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అద్దంకి శ్రీధర్బాబు పేర్కొన్నారు. కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ సంయుక్త ఆధ్వర్యంలో టెన్త్ ఆపైన చదువుతున్న విద్యార్థులకు సివిల్స్ సన్నద్ధతపై బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఉచిత అవగాహన తరగతుల్లో అద్దంకి శ్రీధర్బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఐఏఎస్ సాధించాలంటే ఉన్నత వర్గాలు, ఆర్థికంగా స్థితిమంతులే కానవసరం లేదని, ఏ భాషలోనైనా కనీస డిగ్రీ విద్యార్హతగా సరైన శిక్షణతో ఐఏఎస్ సాధించవచ్చన్నారు. ప్రతి ఏటా యూపీఎస్సీ ద్వారా 10 లక్షల మంది దేశవ్యాప్తంగా పరీక్షలు రాస్తే అనేక వడపోతల ద్వారా కేవలం 60 మంది ఐఏఎస్కు ఎంపికవుతున్నారని తెలిపారు. సివిల్స్లో ఐఏఎస్తోపాటు ఐపీఎస్, ఐఆర్ఎస్ వంటి సర్వీసులు సైతం ఉన్నాయని వివరించారు. కేవీఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ కరెంట్ అఫైర్స్పై పూర్తిస్థాయి ఆధిపత్యం కనబరిచే వారికి ఐఏఎస్ సాధించటం ఎంతో సులభతరమన్నారు. ఆంగ్లభాషపై పట్టు, భావవ్యక్తీకరణ, దినపత్రికలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే పుస్తకాలు చదవటంతో పాటు అంతర్జాతీయంగా, జాతీయంగా రోజువారీ జరిగే సంఘటనలపై అవగాహన కలిగి ఉండటం ఐఏఎస్ పరీక్షలకు ప్రధాన అర్హతగా ఉంటాయని వివరించారు. ‘సన్‘ కో–ఆర్డినేటర్స్ ఆశిష్, హరీష్, సంధ్య, బ్లెస్సీ తదితరులు పాల్గొన్నారు. పొగాకుబోర్డు ఈడీ డాక్టర్ అద్దంకి శ్రీధర్బాబు -
ఎస్సీ అట్రాసిటీ కేసును విచారించిన డీఎస్పీ
ఈపూరు: ఎస్సీ అట్రాసిటీ కేసును విచారించేందుకు శనివారం మండలంలోని కొండ్రముట్ల ఎస్సీ కాలనీని డీఎస్పీ సుధాకర్ సందర్శించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎస్సీ కాలనీకి చెందిన మక్కెన శౌరిని గ్రామానికి చెందిన కొందరు కులం పేరుతో దూషించి దాడికి దిగారని, దీంతో ఆయన కులం పేరుతో దూషించినందుకు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదు మేరకు నరసరావుపేట డీఎస్పీ సుధాకర్ కాలనీని సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆయన వెంట రూరల్ సీఐ సుధాకర్, ఎస్ఐ మహమ్మద్ ఫిరోజ్ఖాన్ తదితరులు ఉన్నారు. వేల్పూరులో శావల్యాపురం: మండల పరిధిలోని వేల్పూరులో ఎన్నికల నేపథ్యంలో ఎస్సీ వర్గీయులపై దాడికి పాల్పడిన సంఘటనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు ఘటనపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నామన్నా రు. అలాగే జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున సభలు సమావేశాలు నిర్వహించరాదన్నారు. అనంతరం ఎస్సీ కేసులో జరిగిన సమగ్ర వివరాలను పోలింగ్ కేంద్రం అవరణలో సంఘటన సమయంలో ఉన్ననటు వంటి వారి ద్వారా వివరాలు అడిగి తెలుసుకొని నమోదు చేసుకున్నారు. ఆయనతో పాటు వినుకొండ రూరల్ సీఐ ఉప్పటూరి సుధాకరరావు, ఎస్సై చల్లా సురేష్, సిబ్బంది ఉన్నారు. వేర్వేరు గ్రామాల్లో డీఎస్పీ విచారణ బొల్లాపల్లి: ఎన్నికల అనంతరం జరిగిన దాడుల పై నమోదైన కేసులపై నర్సరావుపేట డీఎస్పీ ఎం సుదాకరరావు శనివారం సాయంత్రం విచారణ చేపట్టారు. గుట్లపల్లి, బొల్లాపల్లి ఎస్సీ కాలనీలను సందర్శిచి బాధితులను, గ్రామస్తులను విచారించారు. దాడికి గురైన బాధితుల నుంచి వివరాలు సేకరించారు. -
నకిలీ మిర్చి విత్తనాలు స్వాధీనం
నగరంపాలెం: నకిలీ మిర్చి విత్తనాలను విక్రయించే ఓ వ్యక్తిని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. రూ.2.61 లక్షలు విలువ చేసే నకిలీ విత్తనాలు సీజ్ చేసి, అతనిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు ఏటుకూరు రోడ్లోని సింధూరి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో శనివారం గుంటూరు రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కె.ఈశ్వరరావు సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నకిలీ మిర్చి విత్తనాలు విక్రయిస్తున్నారనే సమచారంతో తనిఖీ చేయగా, 8.70 కిలోల కల్తీ/నకిలీ మిర్చి విత్తనాలు ప్యాకింగ్కు సిద్ధం చేసినట్లు గుర్తించారు. బెంగళూరు నుంచి కిలో రూ.20 వేలు చొప్పున కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. వాటిని ఆకర్షణీయమైన ప్యాకెట్లల్లో ప్యాకింగ్ చేసి, కిలో రూ.80 వేల నుంచి లక్ష వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించారు. విత్తనాలను విడిగా కొనుగోలు చేసి, ప్యాకింగ్ చేసి విక్రయించడం విత్తన చట్ట ప్రకారం నేరమని, ఈ క్రమంలో రూ.2.61 లక్షలు ఖరీదు చేసే 8.70 కిలోల మిర్చి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాలపై నిందితుడిపై 6ఏ కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఏఓ రమణకుమార్, ఎస్ఐ ఎం.రామచంద్రయ్య, స్థానిక వ్యవసాయ అధికారి బి.అంజిరెడ్డి అధికార సిబ్బంది పాల్గొన్నారు. రూ.2.61 లక్షల విలువైన విత్తనాలు పట్టుకున్న విజిలెన్స్ సిబ్బంది -
చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు
కర్లపాలెం: చట్టాన్ని అతిక్రమించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ హెచ్చరించారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని ఏట్రవారిపాలెంలో శనివారం రాత్రి డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఒక ఎస్సై, వంద మంది పోలీసు సిబ్బంది కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ నెల 13న ఎన్నికలు జరిగిన రోజు గ్రామంలో గొడవలు జరగటంతో మళ్లీ అలాంటి గొడవలు పునరావృతం కాకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి వీధిలో తిరిగి అనుమానిత ప్రాంతాలను, వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గ్రామస్తులందరూ శాంతీయుతంగా ఉండాలని, ఆవేశాలకు లోను కావద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం ఇన్చార్జ్ ఎస్ఐ అనిల్కుమార్, బాపట్ల రూరల్ సీఐ శ్రీహరి, టౌన్ సీఐ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా చైతన్యమేప్రజా నాట్యమండలి లక్ష్యం ఆవిర్భావ సభలో ఇప్టా తెలంగాణ కార్యదర్శి వేముల కొండలరావు తెనాలి: భారతదేశంలో 1943లో ఆవిర్భవించిన ప్రజాకళా సంస్థ ‘ఇప్టా’ (ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్) తన సుదీర్ఘ ప్రయాణంలో ప్రజాచైతన్యం కోసం ఎంతగానో కృషి చేసిందని తెలంగాణ రాష్ట్ర ప్రజానాట్యమండలి కార్యదర్శి వేముల కొండలరావు అన్నారు. స్థానిక గాంధీనగర్లోని ఇస్కఫ్ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఇప్టా ఆవిర్భావ సభకు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి గుంటూరు జిల్లా కార్యదర్శి దేవరపల్లి నీలాంబ్రం అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి కొండలరావు మాట్లాడుతూ, దేశభక్తులైన కళాకారులు ఎందరో నాటకం, నృత్యం, జానపద కళా ప్రదర్శనలతో ప్రజాచైతన్యం కలిగించారని చెప్పారు. ప్రజాపోరాటాల వెనుక కళాకారుల పాత్ర ఉందన్నారు. ప్రజల బాధలు, గాధలను ఇతివృత్తంగా తీసుకుని నేటికీ దేశమంతా కళాప్రదర్శనలను ఇస్తున్నారని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ శాఖలు కలిగిన కళాకారుల సంస్థ కేవలం ఇప్టా మాత్రమేనని చెప్పారు. రాబోయే కాలంలో ప్రజల సమస్యలపై మరింత ఉధృతంగా కళారూపాలను తీసుకొస్తూ ప్రజలముందు ప్రదర్శించాలని సూచించారు. అందుకు ప్రజానాట్యమండలి ప్రధాన భూమిక నిర్వహిస్తుందని చెప్పారు. బెల్లంకొండ వెంకట్, పాతూరి సుబ్రహ్మణ్యకవి, బొల్లిముంత కృష్ణ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాగేయాలను ఆలపించారు. -
నేటి నుంచి ప్రతిష్టా మహోత్సవాలు
తాడేపల్లిరూరల్: దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరులో వేంచేసి యున్న మహంకాళి అమ్మవారి 47వ ప్రతిష్ట వార్షికోత్సవాలను ఈనెల 26నుంచి 30వ తేదీ గురువారం వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి డీసీహెచ్ వెంకటరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అమ్మవారికి ఆదివారం ఉదయం లక్ష్మీదేవి అలంకరణ, సోమ వారం సరస్వతీదేవి అలంకరణ, మంగళవారం రాజరాజేశ్వరిదేవి అలంకరణ, బుధవారం ధనలక్ష్మీ దేవి అలంకరణ, గురువారం గాయత్రీ దేవి అలంకరణలు నిర్వహిస్తామని, 30వ తేదీ సాయంత్రం అమ్మవారి విశేష అలంకారంతో గ్రామోత్సవం నిర్వహించనున్నామన్నారు. -
కారెంపూడి అల్లర్ల కేసుల్లో 25 మంది అరెస్టు
కారెంపూడి: సార్వత్రిక ఎన్నికల అనంతరం కారెంపూడిలో గత 14వ తేదీ చెలరేగిన అల్లర్లు ఆస్తుల విధ్వంసాల కేసులకు సంబంధించి ఇప్పటి వరకు 25 మందిని అరెస్టు చేశామని కారెంపూడి ఎస్ఐ కె అమీర్ శనివారం తెలిపారు. మూకుమ్మడిగా కారెంపూడిలో పలు షాపులు, ఇళ్లపై దాడులకు పాల్పడడం, పార్క్ చేసిన వాహనాలను నిప్పంటించి దహనం చేయడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడిన రెండు ఘటనలకు సంబంధించి రెండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆ కేసుల్లో నిందితులను గుర్తించి అరెస్టులు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రెండు కేసుల్లో 25 మంది నిందితులను ఆరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచడం జరిగిందని ఎస్ఐ అమీర్ వెల్లడించారు. అలాగే మండలంలోని ఒప్పిచర్ల గ్రామ ప్రాథమిక పాఠశాలలోని ఒక పోలింగ్ బూత్లో 13వ తేదీ పోలింగ్ నాడు ఈవీఎం పగులగొట్టిన కేసులో గ్రామానికి చెందిన ఒకరిని అరెస్టు చేయడం జరిగిందని ఎస్ఐ అమీర్ పేర్కొన్నారు. ద్విచక్రవాహనం ఢీకొని మహిళకు గాయాలు నాదెండ్ల: రహదారిని దాటుతున్న మహిళను ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రి పాలైన సంఘటన శుక్రవారం రాత్రి సాతులూరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జెట్టిపాటి శివమ్మ పన్నెండేళ్ళ క్రితం తన పక్కింటి మహిళకు రూ.10 వేలు అప్పుగా ఇచ్చింది. డబ్బులు తిరిగి ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేకపోవటంతో పెద్దలను ఆశ్రయించింది. గ్రామ పెద్దలైన గద్దె కోటేశ్వరరావు, రావుల శ్రీనివాసరావు, పాటిబండ్ల శేఖర్ వద్దకు వెళ్లి విషయం తెలిపి సహాయం కోరింది. అప్పు తీసుకున్న వారితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో తిరిగి తన ఇంటికి బయలు దేరింది. ఈ క్రమంలో గుంటూ రు నుంచి ఇసప్పాలెంకు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. దీంతో తీవ్రగాయాలపాలైన శివమ్మను స్థానికులు 108 సాయంతో చిలకలూరిపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరులో మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి భర్త జెట్టిపాటి అంకారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జె బలరామ్రెడ్డి తెలిపారు. -
పాత పగలతోనే ప్రశాంత్ హత్య
బాపట్ల టౌన్: పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఈనెల 15న జరిగిన నాయుడుకుప్పం ప్రశాంత్ అలియాస్ మారి హత్య పాత కక్షల నేపథ్యంలోనే జరిగిందని డీఎస్పీ సీహెచ్. మురళీకృష్ణ తెలిపారు. నిందితుల్ని గురువారం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు చెప్పారు. పట్టణ పోలీస్స్టేషన్లో హత్య కేసు వివరాల్ని వెల్లడించారు. హత్యకు గురైన ప్రశాంత్, అతని పిన్ని కొడుకు రామ్చరణ్ నెల్లూరు జిల్లా, మైపాడు రోడ్డు, వైకుంఠపురంలో నివాసం ఉంటారు. గతేడాది అక్టోబర్ 19న స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో తలెత్తిన వివాదంలో మహీధర్ అలియాస్ మహీధర్రెడ్డిని ప్రశాంత్, రామ్చరణ్లు హత్య చేశారు. ఈ కేసులో జైలుకెళ్లిన ఇద్దరూ జనవరిలో బెయిల్పై విడుదలయ్యారు. అప్పటి నుంచి మహీధర్ బాబాయి అదిపరెడ్డి కృష్ణ అలియాస్ కృష్ణారెడ్డి , ప్రశాంత్లు ఒకరినొకరు చంపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగా ఈనెల 14న ప్రశాంత్ బాపట్లలోని తండ్రి దగ్గరకు వచ్చిన విషయం ప్రశాంత్ స్నేహితుడైన కోమరిక ఈశ్వర్కు తెలిసింది. అతడు మహీధర్ స్నేహితులైన రేణుమడుగు లక్ష్మయ్య, బెల్లంకొండ అంకయ్య, పంగా రోహిత్లకు తెలియజేశాడు. దీంతో వెంటనే వీరంతా కలిసి ప్రశాంత్ బాపట్లలో ఉన్న విషయాన్ని మహీధర్ బాబాయి కృష్ణారెడ్డికి చెప్పారు. అతడు స్నేహితుడైన ద్వారకచర్ల లక్ష్మణ్ అలియాస్ లక్ష్మణ్రెడ్డిలను కలుపుకొని అంతా కావలి టోల్ప్లాజా వద్దకు చేరుకున్నారు. రోహిత్కు తెలిసిన వాళ్ల దగ్గర కారు తీసుకొని బాపట్ల వచ్చారు. బాపట్ల చేరుకున్న తర్వాత ప్రశాంత్కు కోమరిక ఈశ్వర్తో ఫోన్ చేయించారు. బాపట్లలోని పాత బస్టాండ్ ఎస్బీఐ ఏటీఎం ముందు ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న వెంటనే అదే కారులో అక్కడికి చేరుకున్నారు. రోడ్డుపై నిలబడి ఉన్న ప్రశాంత్ను కారుతో ఢీకొట్టి వారి వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణారహితంగా నరికి చంపారు. హత్య కేసులో ముద్దాయిల కోసం అప్పటి నుంచి పోలీసులు గాలిస్తున్నారు. పట్టణంలోని విలియం బూత్ కళాశాల సమీపంలో గురువారం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హత్య కేసులో నిందితులుగా గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసులో కృష్ణారెడ్డి, రేణుమడుగు లక్ష్మయ్య, ద్వారకచర్ల లక్ష్మణ్, పంగా రోహిత్, బెల్లంకొండ అంకయ్య, కోమరిక ఈశ్వర్లతోపాటు కారును స్వాధీనం చేసుకొని కోర్టుకు హాజరుపరిచామని చెప్పారు. హత్య కేసును ఛేదించిన బాపట్ల పట్టణ సీఐ యు. శ్రీనివాసులు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పట్టణ పోలీసులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ సీహెచ్. మురళీకృష్ణ -
‘ఆమంచి’పై చర్యలు తీసుకోండి
చీరాల: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల రోజున నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్లలో అనుచరులతో వెళ్లి దౌర్జన్యం చేశారని వేటపాలేనికి చెందిన జర్నలిస్ట్ నాయుడు నాగార్జునరెడ్డి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు గురువారం ఫిర్యాదు చేశారు. అధికారుల్ని బెదిరించడం ద్వారా ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగనీయకుండా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని, ఆమంచిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ముందురోజు ఆయన అనుచరులు చీరాల మండలం ఈపూరుపాలెం, వేటపాలెం మండలం దేశాయిపేటలో ఓట్లు కొనుగోలు చేస్తూ పట్టుబడ్డారన్నారు. దీనిపై ఈపూరుపాలెం, వేటపాలెం పోలీస్స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదు అయిందని తెలిపారు. ఎన్నికల రోజున వేటపాలెం, చీరాల పట్టణంలోని పోలింగ్ బూత్ల వద్ద ఇతర పార్టీల అభ్యర్థుల అనుచరులపై మారణాయుధాలతో భౌతికదాడులకు దిగారని, టూటౌన్ పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయిందని నాగార్జునరెడ్డి వివరించారు. -
విధ్వంసానికి పక్కా ప్లాన్
మాచర్ల: మాచర్ల నియోజకవర్గంలో విధ్వంసానికి టీడీపీ పక్కా ప్రణాళికను రూపొందించింది. దీంతో భాగంగానే ఫ్యాక్షనిస్టు జూలకంటి బ్రహ్మానందరెడ్డిని నియోజకవర్గానికి తీసుకొచ్చారు. అతను నియోజకవర్గంలో అడుగుపెట్టినది మొదలు గొడవలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలో 2004 నుంచి ఇప్పటి వరకు టీడీపీ విజయం సాధించలేదు. నిరాశలో ఉన్న టీడీపీకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రజాభిమానాన్ని పొందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ ఎన్నికలలో ఎలాగైనా అడ్డగించాలని మాస్టర్ ప్లాన్ వేశారు. పిన్నెల్లి హవాను అడ్డగించాలంటే బ్రహ్మారెడ్డి తప్పా ఎవరి వల్ల కాదని భావించి టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం పన్నారు. ఇందులో భాగంగా ఏడాదిన్నర కిందట బ్రహ్మారెడ్డిని పిలిచి ‘నిన్ను ఇన్ఛార్జిగా నియమిస్తా, నీకు అన్ని రకాలుగా పార్టీ అండదండలతోపాటు ఆర్థిక సహకారం అందిస్తా’మని భరోసా ఇచ్చారు. అక్కడే కథ మొదలైంది. అప్పటి నుంచి మొదటగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన కారంపూడి మండలం నుంచి నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఆ రోజే పిన్నెల్లికి సంబంధించిన వ్యాపార సంస్థ ముందు ఈలలు వేసి రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు. అక్కడ నుంచి జూలకంటి ప్రతి గ్రామంలో పర్యటిస్తూ ‘మీకెందుకు నేనున్నా గొడవలు పెట్టుకోండి మనకు పైనుంచి డబ్బులు వస్తాయ’ంటూ రెచ్చగొట్టారు. ప్రతి గ్రామంలో చిచ్చు రేపారు. ఏ చిన్న గొడవ జరిగినా అది అధిష్టానానికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో చంద్రయ్య హత్యను హైలెట్గా చిత్రీకరించారు. జంగమహేశ్వరపాడులో గొడవ సృష్టించి పారిపోయిన వ్యక్తికి మద్దతు పలికాడు. అక్కడ నుంచి వెల్దుర్తి, బోదిలవీడు, శిరిగిరిపాడు, లోయపల్లితోపాటు అనేక గ్రామాల్లో విధ్వంసాలకు తెరతీశాడు. కారంపూడి మండలం ఒప్పిచర్ల, ఓబులేశునిపల్లె, చింతపల్లి, పేటసన్నిగండ్లలో, రెంటచింతల మండలంలోని తుమృకోట, పాలవాయి గేటుతోపాటు అనేక కమ్మ సామాజిక వర్గానికి చెందిన గ్రామాలకు వెళ్లి ఈసారి మనదే గెలుపంటూ వారిని ఉసిగొలిపి గొడవలు చేయించారు. ప్రతి గొడవకు పీఆర్కే కారణమంటూ ప్రచారం చేయించారు. ప్రతి రోజూ ఎల్లో మీడియాలో ఆయన మీద బురదచల్లుతూ ప్రెస్మీట్లు పెట్టి నానా రచ్చ చేశారు. అనేక గ్రామాలలో రచ్చను పెంచిన ఆయన ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు మద్దతు వచ్చాక మరింత రెచ్చిపోయారు. ఎన్నికల ముందు రోజు నుంచి ఒక పథకం ప్రకారం గొడవలు సృష్టించారు. అందులో భాగంగానే పాలవాయి గేటులో బీభత్సం, తుమృకోటలో ఈవీఎంల ధ్వంసం, జెట్టిపాలెంలో ఘర్షణ, గుండ్లపాడులో ఒక వైపు వ్యవహరించేలా ఒక వర్గాన్ని ప్రోత్సహించారు. సొంతూరైన వెల్దుర్తిలో రిగ్గింగ్ చేసుకొని కండ్లకుంట, కొత్తపుల్లారెడ్డిగూడెంలో సంబంధం లేని ఇద్దరిని కూర్చోబెట్టి రగడకు ప్రయత్నించారు. ఇదంతా తమకు అనుకూలమైన పోలీసులతో కలిసి ముందుగానే సిద్ధం చేసుకొన్నారు. మాచర్ల మండలం కొత్తపల్లి, అలుగురాజుపల్లి, కంభంపాడు, రాయవరం గ్రామాలలో అలజడులు సృష్టించారు. అన్నిచోట్ల టీడీపీ ఆధిపత్యం కోసం ప్రయత్నించారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. దీంతో వ్యాపారులతోపాటు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పటి ఎస్పీపై ఎన్నికల సంఘం వేటు వేసి కొత్త ఎస్పీని నియమించడంతో పరిిస్థితి అదుపులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వ్యూహాత్మకంగా బ్రహ్మారెడ్డిని రంగంలోకి దించిన టీడీపీ అతనికి ఆర్థికంగా అండదండలు జూలకంటి రాకతోనే అల్లర్లు ప్రారంభం భయపడుతున్న నియోజకవర్గ ప్రజలు -
ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
కలెక్టర్ పి.రంజిత్ బాషా బాపట్ల: ఓట్ల లెక్కింపునకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గురువారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌటింగ్ ఏర్పాట్లపై జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా రంజిత్బాషా మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో నిబంధనల మేరకు టేబుల్స్ ఏర్పాటు చేశామని వివరించారు. ఓట్ల లెక్కింపునకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామంటూ నివేదించారు. సమావేశంలో జేసీ శ్రీధర్, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్. సత్తిబాబు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య పాల్గొన్నారు. ఓటమి భయంతోనే కూటమి గందరగోళం ● ఎమ్మెల్యే కోన రఘుపతి బాపట్ల: ఓటమి భయంతోనే మాచర్లలో టీడీపీ కూటమి గందరగోళం సృష్టించిందని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పేర్కొన్నారు. గురువారం స్థానికంగా ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాచర్లలో జరిగిన వివాదం పూర్తిస్థాయి సీసీ పుటేజీ ఇవ్వకుండా కొద్దిమేరకు మాత్రమే బయటపెట్టి నాటకాలకు తెరతీస్తున్నారని కోన దుయ్యబట్టారు. పూర్తిస్థాయి సీసీ పుటేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఒక శాతం ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీతో పొత్తు పెట్టుకుని వ్యవస్థను మేనేజ్ చేయాలని చూసిందని కోన విమర్శించారు. కొన్నిచోట్ల కావాలని గొడవకు ప్రత్యక్షంగా కారణం కాగా మరికొన్ని పరోక్షంగా వివాదాలకు దిగారని ఆరోపించారు. బాపట్ల ప్రాంతంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కోన చెప్పారు. బాపట్ల పట్టణంలో విలువైన తూర్పుసత్రాన్ని అన్యాక్రాంతం కాకుండా అడ్డుకుంటామని తెలిపారు. అక్కడ మినీ స్టేడియం, అపరకర్మశాల నిర్మాణం చేపడుతామని చెప్పారు. ఐఓసీ కంపెనీకి తూర్పు సత్రం కట్టబెట్టేందుకు చేసే ప్రయత్నాల్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. -
భక్తజన భావపురి
● వైభవంగా భావదేవుడి రథోత్సవం ● జనసంద్రంగా రథం బజార్ ● ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు ● మొక్కులు చెల్లించుకున్న భక్తులు బాపట్ల: భావపురి నడిబొడ్డున కొలువుతీరిన భావదేవుడి రథోత్సవం గురువారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. శ్రీమత్సుందరవల్లీ రాజ్యలక్ష్మీసమేత శ్రీక్షీరభావన్నారాయణ స్వామికి గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆలయ అర్చకుల సమక్షంలో అంగరంగవైభవంగా కల్యాణాన్ని నిర్వహించారు. అనంతరం స్వామిని గరుడ వాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. 1431వ నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం నుంచి రథోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భావదేవుడికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యే కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవాన్ని తిలకించేందుకు బాపట్ల నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి తరలిరావడంతో రథం బజార్ సెంటర్ కిక్కిరిసిపోయింది. ఉత్సవం ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేంత వరకు స్వామి రథాన్ని లాగేందుకు పోటీ పట్టారు. క్షీరభావన్నారాయణ స్వామి నామాన్మి స్మరిస్తూ దేవాలయం నుంచి రథం బజార్ సెంటర్ మీదుగా ఆంజనేయస్వామి దేవాలయం వరకు రథోత్సవాన్ని నిర్వహించారు. ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత భక్తులు స్థానిక భావన్నారాయణస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రథానికి కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. -
500 మందిపై బైండోవర్ కేసుల నమోదు
సత్తెనపల్లి: నియోజకవర్గంలోని సత్తెనపల్లి రూరల్, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో 500 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు సత్తెనపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.రాంబాబు గురువారం పేర్కొన్నారు. వీరిలో కొంత మంది ఎన్నికలకు సంబంధం ఉన్న కేసుల్లో కూడా ఉన్నారన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ముప్పాళ్లలో 11 మందికి బాండ్స్ అమౌంట్ చెల్లించమని తహసీల్దార్ నోటీసులు జారీ చేశారన్నారు. రాజుపాలెంలో ఐదుగురికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. వారిపై రౌడీషీట్స్ ఓపెన్ చేయనున్నట్లు వెల్లడించారు. మరికొందరిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసేందుకు పోలీసు ఉన్నతాఽధికారులకు ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు తెలియజేశారు. ఎవరైనా గొడవలను ప్రోత్సహించినా, గొడవలు చేసినా వారిపై కఠినమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 42 మంది అరెస్టు పిడుగురాళ్ల: ఈ నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గొడవలకు దిగిన రాజకీయపార్టీలకు చెందిన ముఖ్యులను గురువారం అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు పట్టణ ఎస్ఐ పఠాన్ రబ్బానీ ఖాన్ తెలిపారు. మండలంలోని పెద అగ్రహారం గ్రామానికి చెందిన ఇరుపార్టీలకు చెందిన 30 మంది, కరాలపాడు గ్రామానికి చెందిన 12 మంది మొత్తం 42 మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వీరిని రాజమండ్రి సెంట్రల్ జైలు, నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు. ఎవరైనా ఓట్ల లెక్కింపు రోజున గొడవలకు, అల్లర్లకు పాల్పడితే అటువంటివారిపై కఠిన చర్యలు తీసుకొని వారిని కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నట్లు తెలిపారు. రాజకీయ గొడవలకు పాల్పడితే వారి జీవితం జైలు పాలు కావాల్సి వస్తుందని, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని హెచ్చరించారు. -
తిరుపతికి వెళ్లి వస్తూ అనంత లోకాలకు..
కారంచేడు: తిరుపతిలో బిడ్డ పుట్టు వెంట్రుకలు తీయించుకొనేందుకు వెళ్లిన కుటుంబం దైవ దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. కారంచేడుకు చెందిన పొత్తూరి సత్యనారాయణ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు. చిన్న బడ్డీ కొట్టు ఆధారంగా కష్టపడి చదివించారు. పిల్లలు కూడా చక్కగా చదువుకొని మంచి ప్రయోజకులయ్యారు. ఒకరు బెంగళూరులో, మరొకరు హైదరాబాద్లోను స్థిరపడి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న పొత్తూరి వెంకట శివసుబ్రహ్మణ్యం భార్య రేఖ ప్రియాంక (32), వారి సంతానం అయిన ఐదు సంవత్సరాల నిక్షిత్, మూడు సంవత్సరాల తేజవర్ధన్తో కలిసి కారులో తిరుపతి వెళ్లారు. చిన్న కుమారుడి పుట్టు వెంట్రుకలు తీయించుకొని, దైవదర్శనం అనంతరం వారు మరలా హైదరాబాద్కు బుధవారం రాత్రి బయలుదేరారు. గురువారం వేకువజామున నల్గొండ జిల్లా తిప్పర్తి వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రేఖ ప్రియాంక అక్కడికక్కడే మృతి చెందగా, భర్త సుబ్రహ్మణ్యానికి తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలియడంతో కారంచేడులోని చినవంతెన సెంటర్లో వారు నివాసముండే ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. బంధువులు వెంటనే సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం కారంచేడు మహిళ మృతి -
రెండు కార్లు ఢీ : మహిళ మృతి
వేటపాలెం: ఎదురెదురుగా వేగంగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్న సంఘటనలో మహిళ మృతి చెందింది. ఈ ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లి దగ్గరలో జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో జంగిలి కేఫ్ టీ స్టాల్ దగ్గరలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తెనాలి నుంచి కారులో వేటపాలెం సముద్రతీరానికి ఐదుగురు యువకులు వచ్చారు. బైపాస్ రోడ్డు పక్కనే ఉన్న జంగిల్ కేఫ్ టీస్టాల్ వద్ద కారు ఆపి టీ తాగారు. అనంతరం తిరిగి తెనాలి వైపు బయలు దేరారు. అదే సమయంలో కనిగిరికి చెందిన మన్నెపల్లి శిరీష (30) మరో వ్యక్తితో కలసి బాపట్ల వెళ్లి తిరిగి కనిగిరికి వెళుతున్నారు. జంగిల్ కేఫ్ టీస్టాల్ దగ్గరకి వచ్చే సరికి రెండు కార్లు వేగంగా ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. దీంతో ముందు భాగాలు భారీగా దెబ్బతిన్నాయి. కనిగిరి వెళుతున్న కారులో ఉన్న శిరీష తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వీరితో పాటు ఎదురుగా వచ్చిన కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వేటపాలెం ఎస్ఐ ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు కార్ల డోర్లు పగలగొట్టి అందులో ఇరుక్కుపోయిన వారిని 108లో చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకొని, శిరీష మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. -
సప్లిమెంటరీకి సర్వంసిద్ధం
టెన్త్, ఇంటర్ అడ్వాన్స్డ్ గుంటూరు ఎడ్యుకేషన్: ఈనెల 24 శుక్రవారం నుంచి జరగనున్న 10వ తరగతి, ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అధికారులు పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్ట వసతులు కల్పించారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను డీజీఈ.ఏపీ.జీవోవీ.ఇన్ సైట్తో పాటు ఇంటర్ హాల్ టికెట్లను బీఐఈ.ఏపీ.జీవోవీ.ఇన్ సైట్లలో అందుబాటులో ఉంచారు. వాటిని విద్యార్థులు డౌన్లోడ్ చేసుకుని, నేరుగా పరీక్షలకు హాజరు కావచ్చు. టెన్త్ పరీక్షలకు 27 పరీక్ష కేంద్రాలు ఈనెల 24 నుంచి జూన్ 3 వరకు జరగనున్న 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 6,373 మంది విద్యార్థులు హాజరు కానుండగా, 27 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల విధులకు 27 మంది చొప్పున చీఫ్ సూపరింటెండెంట్లు, శాఖాధికారులు సహా 280 మంది ఇన్విజిలేటర్లను విద్యాశాఖాధికారులు నియమించారు. ఇంటర్కు 36 పరీక్ష కేంద్రాలు ఈనెల 24 నుంచి జరగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17,776 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 36 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్న ప్రథమ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలకు ఫెయిలైన వారితో పాటు బెటర్మెంట్ రాస్తున్న విద్యార్థులను కలుపుకుని 15,291 మంది హాజరు కానున్నారు. అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనున్న ద్వితీయ సంవత్సర పరీక్షలకు 2,485 మంది హాజరు కానున్నారు. రేపటి నుంచి పరీక్షలు ఎస్ఎస్ఎస్సీ, ఇంటర్ బోర్డు సైట్లలో హాల్ టికెట్లు టెన్త్ పరీక్షలకు హాజరు కానున్న 6,373 మంది ఇంటర్ పరీక్షలకు 17,776 మంది పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు -
27 నుంచి మార్టూరులో నాటిక పోటీలు
మార్టూరు: మండల కేంద్రం మార్టూరులో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో నాటిక పోటీల్ని 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు శ్రీకారం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అన్నారు. స్థానిక ఎఫర్ట్ కార్యాలయ ఆవరణలో బుధవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 14వ తెలుగు రాష్టాల స్థాయి నాటిక పోటీల్ని శ్రీకారం స్వచ్ఛంద సంస్థ, మార్టూరు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 11 నాటికల్ని ప్రదర్శన కోసం ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. మార్టూరు పరిసర మండలాల కళాకారులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. విజేతలకు రోటరీ జిల్లా పీస్ కమిటీ చైర్మన్ కె. విక్రమ్ రెడ్డి, శ్రీమతి వైజయంతి విక్రమ్ రెడ్డి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయనున్నట్లు సాంబశివరావు తెలిపారు. కార్యక్రమంలో ఎఫర్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జె.వి.మోహనరావు, మార్టూరు రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు తాళ్లూరి సాంబశివరావు, మద్దుమాల కోటేశ్వరరావు, రోటరీ క్లబ్ ప్రతినిధులు ఇంటూరి ఆంజనేయులు, శానంపూడి లక్ష్మయ్య, దొడ్డా రమేష్, ఆజా హుస్సేన్, శ్రీకారం సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. పోటీలలో ప్రదర్శించనున్న నాటికలు 27వ తేదీ: రాత్రి 8: 30 గంటలకు శ్రీ అమృత లహరి ఆర్ట్స్ విజయవాడవారి ‘నాన్నా! నేను వచ్చేస్తా’ నాటిక, రాత్రి 10 గంటలకు తెలుగు కళాసమితి విశాఖవారి ‘ నిశ్శబ్దమా... నీ ఖరీదెంత?’ నాటిక, రాత్రి 11 గంటలకు కళానికేతన్ వీరన్నపాలెం వారి ‘రాజుగారి గోచి’ ప్రదర్శిస్తారు. 28వ తేదీ : రాత్రి 8: 30 గంటలకు శ్రీకారం, రోటరీ కళాపరిషత్ మార్టూరు వారి ‘ రైతు భారతం’ నాటిక, రాత్రి 10: 30 గంటలకు రసఝరి పొన్నూరి నాటిక ‘కాపలా’ 11: 30 గంటలకు కళాంజలి హైదరాబాదు వారి‘ రైతే రాజు’ 12: 30 గంటలకు మైత్రి కళానిలయం విజయవాడ వారి ‘బంధం’ నాటిక ప్రదర్శిస్తారు. 29వ తేదీ : రాత్రి 8: 30 గంటలకు అభినయ గుంటూరి వారి ‘ఇంద్రప్రస్థం’, 10: 30 గంటలకు చైతన్య కళాభారతి కరీంనగర్ వారి ‘చీకటి పువ్వు నాటిక’, 11: 30 గంటలకు శ్రీ సాయి ఆర్ట్స్ పొలకలూరు వారి ‘కౌసల్యా సుప్రజా రామ’, 12: 30 గంటలకు వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ వారి ‘రాత’ నాటికలు ప్రదర్శించనున్నారు.
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
ఇక మళ్లీ భానుడి సెగ
విదేశీ ఉద్యోగాలతో జర భద్రం
ఈరోడ్లో వేడుకగా రెక్లాన్ పోటీలు
తంజావూరులో గురు పూజా మహోత్సవం
గెలుపే కరుణకు కానుక
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు సిద్ధం
తిరుత్తణికి పోటెత్తిన భక్తజనం
పెరమానళ్లూరులో తాగునీరు కలుషితం
తప్పక చదవండి
- యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
- అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
- శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
- పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
- భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
- ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
- అదిరిపోయే ఫీచర్లతో.. త్వరలో విడుదల కానున్న మరో రెడ్మీ సిరీస్ ఫోన్
- గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
- ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Advertisement