-
విద్యాశాఖ కమిషనర్పై చర్య తీసుకోవాలి
ఖమ్మం సహకారనగర్ : రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతుల సంక్షోభానికి కారణమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వివాదం పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యాశాఖ కమిషనర్ను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి డిమాండ్ చేశారు. ఆదివారం సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత సెప్టెంబర్లో అర్ధంతరంగా నిలిచిపోయిన పదోన్నతులు కొనసాగింపునకు ఆటంకంగా ఉన్న టెట్పై ఎన్సీఈఆర్టీ వివరణ తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు కోరడంతో ఫిబ్రవరిలో క్లారిఫికేషన్ కోసం లేఖ రాసి రహస్యంగా ఉంచారని అన్నారు. ప్రధానోపాధ్యాయులకు పని చేస్తున్న పాఠశాలల స్థాయిలో మార్పు లేనప్పుడు పదోన్నతులకు టెట్ అవసరం లేదంటూ ఏప్రిల్ 8 న వచ్చిన వివరణ లేఖను వెల్లడించకుండా ఉపాధ్యాయులందరినీ మానసిక ఆందోళనకు గురి చేశారని ఆరోపించారు. అందరినీ టెట్కు దరఖాస్తు చేయించటం ద్వారా రూ.లక్షలు వృథా చేయించారని అన్నారు. ఎన్నికలు ముగిసేలోగా ఎన్సీఈఆర్టీ నుంచి మరికొన్ని అంశాలపై వివరణ తీసుకుని ఎన్నికలు ముగిసిన వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గాభవాని, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.వి. నాగమల్లేశ్వరరావు, పారుపల్లి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు బుర్రి వెంకన్న, కోశాధికారి వల్లంకొండ రాంబాబు, కార్యదర్శులు పి.సురేష్, ఉద్దండు షరీఫ్, డి. నాగేశ్వరరావు, ఎస్.సతీశ్ పాల్గొన్నారు. కాగా, టెట్ వివాదం పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యాశాఖ కమిషనర్ పై చర్య తీసుకోవాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగేశ్వరరావు, ఎస్.విజయ్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సెప్టెంబర్ లో బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని, విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలల్లో విద్యావలంటీర్లను నియమించి కొరత లేకుండా చూడాలని పేర్కొన్నారు. టీఎస్ యూటీఎఫ్, టీపీటీఎఫ్ నేతల డిమాండ్ -
‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు
● ప్రధాని నరేంద్ర మోదీ విజన్ ఉన్న నాయకుడు ● విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి నా ప్రాధాన్యాలు ● ఆరు గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదు .. ● బీజేపీని గెలిపించాలని ప్రజలు డిసైడ్ అయ్యారు ● బీఆర్ఎస్, కాంగ్రెస్లకు ప్రజల నుంచి స్పందన లేదు ●ప్రజాసేవ లక్ష్యంగా.. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చా. 2014 నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంటి ధార్మిక సంస్థల ద్వారా ఇన్స్పైర్ అయ్యా. స్పిరిచ్యువల్ కుటుంబంలో పుట్టిన నేను ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పెరిగా. సామాజిక సేవలోనే ఉన్నా. 2014 వరకు బిజినెస్లో కొంతమేర సెటిల్ అయ్యా. బిజినెస్ దాదాపుగా పక్కన పెట్టి.. పదేళ్లలో అనేక ఎన్జీవోస్లో పనిచేసిన అనుభవం, సంబంధాలతో ఖమ్మంను అభివృద్ధి చేయొచ్చనుకున్నా. ఆదిలాబాద్, వికారాబాద్, మెదక్లో జరిగిన అభివృద్ధి ఇక్కడ లేదు. ఇక్కడికి వచ్చి చూశాక అదే అర్థమైంది. జిల్లా బాగుపడాలంటే గ్రామ వికాసం ప్రధానం. ఇందుకు ప్రభుత్వం నుంచి పథకాలతో పాటు ఎన్జీవోల నుంచి కూడా యాక్టివిటీ ఉండాలి. కార్పొరేట్ సంస్థలు కూడా సీఎస్ఆర్ నిధులతో పనులు చేయాలి. అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. ●రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం.. సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ప్రజలు కచ్చితంగా నరేంద్రమోదీకి ఓటు వేయాలని డిసైడ్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాదని తెలిసి కూడా ఆరు గ్యారంటీలను ప్రచారం చేసింది. ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అంటే ప్రజలు తరిమికొడతారు. అందుకే వాటి జోలికి పోకుండా రిజర్వేషన్లు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దొంగ వీడియోలు, మార్ఫింగ్ వీడియోలను ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వారు అన్నింటికీ తెగించారు. శిక్ష పడినా ఏమవుతుందిలే.. ముందయితే పబ్బం గడుపుకోవాలనే ధోరణిలో ఉన్నారు. ●దేశం ఆర్థికంగా దూసుకెళ్తోంది.. పదేళ్ల క్రితం భారత ఆర్థిక వ్యవస్థ దిగువ ర్యాంకులో ఉంది. ఇప్పుడు ఐదో ర్యాంకులో ఉంది. రానున్న కాలంలో మూడో ర్యాంకుకు చేరుతుందని ప్రపంచ ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ మాత్రం బీజేపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగడం లేదని విమర్శిస్తున్నారు. ప్రపంచ నిపుణులే చెప్పిన తర్వాత కేసీఆర్ ఎంత. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో నరేంద్రమోదీ రాజకీయాల్లోకి వచ్చారు. నేను పదేళ్లుగా ప్రజాసేవ చేస్తున్నా. డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ను. నా సేవా తత్పరత చూసి ప్రజలు ఓటు వేస్తారు. స్కామ్లు చేసే వారికి అవకాశం ఇస్తే స్కామ్లే చేస్తారు. పని చేసే వారికి అవకాశం ఇస్తే పని చేస్తారు. ●అనుసంధానకర్తగా ఉంటా.. దక్షిణ అయోధ్యగా ఉన్న భద్రాచలం అభివృద్ధి చెందడం లేదంటున్నారు. ఇంకా అనేక సమస్యలు పరిష్కారం కావడం లేదంటున్నారు. అధికారంలో ఉన్న వారు కేంద్రాన్ని ఈ సమస్యలపై అడిగారా.? కేంద్రం ఏమైనా చేయాలంటే ఇక్కడ అధికారంలో ఉన్న వారు చొరవ తీసుకోవాలి. కేంద్ర మంత్రులను తీసుకురావాలి. వారికి సమస్యలు వివరించాలి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు హామీలతో పనులు చేయడం లేదు. ఇక్కడి నుంచి నన్ను గెలిపిస్తే సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా. ప్రజలకు, కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ఉంటా. ●ప్రజాదరణ బాగుంది.. నేను ప్రచారం చేస్తుండగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. వారి నుంచి ఆదరణ కనిపిస్తోంది. ఖమ్మం, సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం ఇలా ఎక్కడ నేను రోడ్షో చేసినా వేల మంది వచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్తో పోలిస్తే బీజేపీకే ఆదరణ ఎక్కువగా వస్తోంది. ఇక్కడ మూడు నెలల నుంచి తిరుగుతున్నా. మోదీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలకు అర్థమైంది. అందుకే ఆయన పార్టీ అభ్యర్థిని గెలిపించాలని నిర్ణయించుకున్నారు. బస్తర్ మహరాజ్ కమల్బంజ్ నియో ప్రచారానికి వస్తున్నారు. నాలుగు రోజులపాటు ఇక్కడే ఉంటారు. మిగిలిన ఈ రోజుల్లో ప్రచారాన్ని మరింత ఉధృతంగా చేస్తాం. పార్టీ కేంద్ర మంత్రులు, రాష్ట్ర, జిల్లా నాయకులతో ప్రచారం ఇప్పటి వరకు జోష్గా సాగింది. పార్లమెంట్ పరిధిలోని నేతలు, పార్టీ కార్యకర్తలు ప్రచారంలో కదం తొక్కుతున్నారు.సమస్యలపై దృష్టి పెడతా.. నన్ను గెలిపిస్తే సమస్యలపై దృష్టి పెడతా. కేంద్ర ప్రభుత్వం సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్, ఎన్జీవోల ను ప్రోత్సహించేలా చూస్తా. రైతులకు మార్కెట్ ను అనుసంధానం చేయాల్సి ఉంది. వారికి సహజ వనరులు అందుబాటులో ఉండేలా చూస్తా. పామాయిల్ బోర్డు ఏర్పాటుకు కృషిచేస్తా. ఫుడ్ప్రాసెసింగ్ ఇండస్ట్రీతో అనేక ఉపయోగాలున్నాయి. ఫుడ్పార్క్లు, ఎస్ఈజెడ్లు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసేలా కృషిచేస్తా. కొత్తగూడెంలో ఎయిర్పోర్టు, కొవ్వూరు రైల్వేలైన్ , గోదావ రి నీళ్లు సత్తుపల్లికి తరలించేందుకు, సత్తుపల్లిలో ఓపెన్కాస్ట్తో ఏర్పడుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు, కొత్తగూడెం వరకు ప్యాసింజర్ రైళ్లను నడిపించేందుకు, శాతవాహన రైల్స్టాప్లు పెంచేందు కు నావంతు ప్రయత్నాలు చేస్తా. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తా. -
జిల్లాలో అకాల వర్షం
● పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వడగండ్ల వాన ● విద్యుత్ సరఫరాకు అంతరాయం ● నేలరాలిన మామిడి ● ఉష్ణోగ్రతల నుంచి కాస్త ఉపశమనంఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం అకాల వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పాటు పలుచోట్ల పిడుగులు పడ్డాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో వర్షం కురవడంతో జిల్లా వాసులకు కొంత ఉపశమనం కలిగినట్లయింది. అయితే ఈదురుగాలులతో జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. చేతికందే దశలో ఉన్న మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోత దశలో ఉన్న మామిడి నేలరాలింది. పలుచోట్ల చివరి దశలో ఉన్న వరి కోతలు, ధాన్యం పనులకు ఆటంకం కలిగింది. కూలిన హోర్డింగ్లు.. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పలుచోట్ల హోర్డింగ్లు కూలిపోయాయి. ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోయాయి. కారేపల్లి మండలం గేటు కారేపల్లిలో రాత్రి 7 గంటల సయంలో 14.5 మి.మీ. వర్షపాతం నమోదు కాగా ఖమ్మం నగరంలోని ఖానాపురం వద్ద 13 మి.మీ., కామేపల్లి మండలం లింగాల వద్ద 8, ఖమ్మం నగరంలోని ప్రకాష్నగర్ వద్ద 7, రఘునాథపాలెం, ముదిగొండ మండలం పమ్మిలో 4.8, పంగిడిలో 4.5, నేలకొండపల్లిలో 3.5, చింతకాని మండలం నాగులవంచలో 2.8, చింతకానిలో 2.3, కొణిజర్లలో 1.5, ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ గెస్ట్హౌస్ వద్ద 0.8, బాణాపురం, బచ్చోడులలో 0.5 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. విరిగిపడిన విద్యుత్ స్తంభాలు.. ఈదురుగాలులు, అకాల వర్షంతో జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అనేక చోట్ల రహదార్ల వెంట చెట్లు కూలి విద్యుత్ లైన్లపై పడగా, పలుచోట్ల స్తంభాలు సైతం విరిగిపడ్డాయి. పలుచోట్ల రాత్రి 8 గంటల వరకు కూడా సరఫరా పునరుద్ధరించలేదు. ఖమ్మం నగరంలోని మమత రోడ్, ధంసలాపురం తదితర సబ్స్టేషన్లలో శనివారం అధిక ఉష్ణోగ్రతల కారణంగా పరికరాలు కాలిపోయి ఫీడర్లు దెబ్బతిన్నాయి. దీంతో పలుచోట్ల సరఫరాకు అంతరాయం కలిగింది. ఆ పనులు కొనసాగుతున్న సమయంలోనే ఆదివారం సాయంత్రం వర్షం, గాలులతో మరోసారి అంతరాయం వాటిల్లింది. ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం అకాల వర్షంతో ఉష్ణోగ్రతల నుంచి కొంత ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. ఈ ఏడాది రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నెలరోజులుగా ఆరెంజ్ అలర్ట్(40–45 డిగ్రీలు) ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మే నెల ఆరంభం నుంచి రెడ్ అలర్ట్కు పెరిగాయి. పలుచోట్ల 45 నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. నేలరాలిన మామిడి.. ఈదురుగాలులు, అకాల వర్షానికి ఖమ్మం, కూసుమంచి, మధిర, వైరా తదితర డివిజన్లలో కోత దశలో ఉన్న మామిడి పంట నేలరాలింది. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. శనివారం సత్తుపల్లి డివిజన్లోని పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, తల్లాడ, కల్లూరు మండలాల్లో ఈదురుగాలులు, అకాల వర్షానికి మామిడి నేల రాలగా, ఆదివారం జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో పంట దెబ్బతింది. -
నేడు జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
ఖమ్మంవన్టౌన్: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు బోనకల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు చింతకాని, 6 గంటలకు ముదిగొండలో పర్యటిస్తారు. ఫుట్బాల్ శిక్షణ శిబిరాలకు ఏర్పాట్లు ఖమ్మం స్పోర్ట్స్ : ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి కె.ఆదర్శ్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల సీనియర్ క్రీడాకారులు ఫుట్బాల్ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అంతేగాక ఫుట్బాల్ శిక్షణ శిబిరాలు నిర్వహించే వారికి ఉచితంగా ఫుట్బాల్ పరికరాలు అందజేస్తామని తెలిపారు. వివరాలకు 99896 47696 నంబర్లో సంప్రదించాలని కోరారు. నేటి నుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సులు బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ కోర్సుల 2వ, ఆరవ సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 6 నుంచి, నాలుగో సెమిస్టర్ల పరీక్షలు 7 నుంచి నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ తిరుమలాదేవి ఆదివారం తెలిపారు. 2వ సెమిస్టర్ల పరీక్షలు 6, 8, 10, 16, 18, 21, 25, 29 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు 7, 9, 15, 17, 20, 22, 28, 30 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆరో సెమిస్టర్ పరీక్షలు 6, 8, 10, 16, 18, 21, 25, 29, 31, జూన్ 7, 11, 12, 13 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని వివరించారు. రెండో సెమిస్టర్ పరీక్షలకు 68,139, నాలుగో సెమిస్టర్కు 56,899, ఆరో సెమిస్టర్కు 46,077 మొత్తం 1,71,115 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఉమ్మడి వరంగల్లో 44, ఉమ్మడి ఖమ్మంలో 30, ఉమ్మడి ఆదిలాబాద్లో 49 మొత్తం 123 సెంటర్లు ఏర్పాటు చేసి 123 మంది చీఫ్సూపరింటెండెంట్లను నియమించామని పేర్కొన్నారు. ఒక్కో సెంటర్కు ఒక అజ్జర్వర్, వర్సిటీ పరిధిలో పది ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నియమించినట్లు తెలిపారు. హాల్టికెట్లు కళాశాలల వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని, కళాశాలల నుంచి పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రేపు ఖమ్మానికి వెంకటేష్ రాకఖమ్మంమయూరిసెంటర్ : సినీ హీరో వెంకటేష్ మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు టూర్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తుంబూరు దయాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి వియ్యంకుడైన వెంకటేష్ ఆయన తరఫున ప్రచారం చేసేందుకు వస్తున్నట్లు తెలిపారు. 7వ తేదీ సాయంత్రం 5గంటలకు ఖమ్మం మయూరిసెంటర్ నుంచి ఇల్లెందు క్రాస్ రోడ్ వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారని, రాత్రి 8 గంటలకు కొత్తగూడెం క్లబ్లో జరిగే పుర ప్రముఖుల సమ్మేళనంలో పాల్గొంటారని తెలిపారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు, వెంకటేష్ అభిమానులు పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. -
ప్రశాంతంగా నీట్
ముందుగానే కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులుఖమ్మం సహకారనగర్ : నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ఆదివారం జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించగా ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 3, 260 మంది విద్యార్థులకు గాను 3,179 మంది హాజరు కాగా 81 మంది గైర్హాజరైనట్లు పరీక్షల జిల్లా కో ఆర్డినేటర్ ఆర్.పార్వతిరెడ్డి తెలిపారు. ముందస్తుగానే కేంద్రాలకు.. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు నిర్వహించగా, 11 గంటల నుంచి 1:30 గంటల వరకే కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పడంతో విద్యార్థులు ముందస్తుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఎండలు అధికంగా ఉంటున్న క్రమంలో విద్యార్థుల వెంట వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు పరీక్ష కేంద్రాల సమీపంలో చెట్ల కింద సేదదీరారు. ఎండల తీవ్రత నేపథ్యంలో కేంద్రాల సమీపంలో టెంట్లు వేయడంతో పాటు తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించారు. నిబంధనలు కఠినం.. నీట్కు నిబంధనలు కఠినతరంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో పరీక్ష కేంద్రాలకు చెవుల దిద్దులు, చైన్లు తదితర వస్తువులను ధరించి వచ్చిన వారిని అనుమతించని అధికారులు.. వాటిని తొలగించి రావాలని సూచించారు. దీంతో విద్యార్థులు చెవి దిద్దులు, షూ, చైన్లు, తదితర వస్తువులను తల్లిదండ్రులు, బంధువులకు అందించి పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
ఓసీపీ..ఉక్కిరిబిక్కిరి
‘నల్లసూరీడు’పై నజర్
తప్పక చదవండి
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
Advertisement