-
No Headline
కొత్త మొక్కలుగానే.. ● 50 ఏళ్ల వయస్సు పైబడి కాపునకు రాని చెట్లతో పాటు కొత్త తోటల్లోని పనికిరాని చెట్ల పునరుద్ధరణకు ఈ పద్ధతి ఎంతో ఉపయోగం. ● చెట్లను పూర్తిగా తొలగించకుండా భూమికి మీ టరున్నర ఎత్తు వరకు కొమ్మలను తొలగించాలి. ● కొమ్మలు తొలగించిన తర్వాత నీళ్లు కడితే సెప్టెంబర్, అక్టోబరు నెలలకు కొత్త చిగుళ్లు వస్తాయి. ● ఆ సమయంలో రైతుకు ఏ మామిడి రకంపై ఆసక్తి ఉందో ఆ రకం చెట్టులోంచి 15 నుంచి 20 చిన్న, చిన్న అంట్లు సిద్ధం చేసుకోవాలి. ● వీటి ఆకులను తొలగించి ఆరు రోజులకు కొత్త చిగుళ్లు వచ్చిన కొమ్మలపై పెన్సిల్ సైజులో రంధ్రాలు వేసి అంట్లను అందులో గ్రాపింగ్ చేసుకోవాలి. ● నాటిన కొద్ది రోజులకే చిగుళ్లు వస్తాయి. ఎక్కడైతే నాటామో అక్కడి నుంచే పెరుగుదల మొదలవుతుంది. ● కొత్తగా నాటిన మొక్కల తరహాలో ఇవి కూడా పెరుగుతాయి. అంటుకట్టు పద్ధతితో అభివృద్ధి చెందిన మామిడిఅంటుకట్టు పద్ధతి ద్వారా వచ్చిన కొమ్మలు -
అంటుకట్టుతో మేలైన దిగుబడులు
మా తోటల్లో 30 చెట్లు ఎన్ని యాజమాన్య పద్ధతులు పాటించినా కాపునకు రావడం లేదు. అంటుకట్టు పద్ధతి ఫలితం ఇస్తుందని తెలిసి ప్రయత్నం చేశాం. నాలుగైదేళ్ల క్రితం పనికి రాని చెట్టు కొమ్మలను పూర్తిగా తొలగించి మంచి బేనిషా రకాలతో అంటుకట్టాం. కొత్త చిగుళ్లు వచ్చి చెట్లు అయ్యాయి. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో 15 చెట్లు దెబ్బతిన్నాయి. మిగిలిన చెట్లకు దిగుబడులు వస్తున్నాయి. చెట్లను పూర్తిగా తొలగించే బదులు అంటు కట్టుకుంటే ఎంతో లాభం. – రాంమోహన్రెడ్డి, పాలకొలను గ్రామం, ఓర్వకల్లు మండలం -
ఒక్క రోజు ఆదాయం రూ.7.14 లక్షలు
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివార్లలో వెలసిన శ్రీలక్ష్మీ గణమద్దిలేటి నరసింహస్వామి క్షేత్రానికి వైశాఖ మాసం శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి, అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల వివిధ సేవలు నిర్వహించుకోవడంతో క్షేత్రానికి రూ.7,14,815 ఆదాయం వచ్చినట్లు ఉప కమిషనర్, ఆలయ ఈఓ రామాంజనేయు లు, చైర్మన్ రామచంద్రుడు తెలిపారు. గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామానికి చెందిన గుండం పాటి బాల తిమ్మయ్య జ్ఞాపకార్థం భార్య శివలక్ష్మమ్మ ఆలయ అభివృద్ధికి రూ. 50 వేల విరాళం అందజేశారు. నిత్యాన్నదాన సత్రానికి నంద్యాల పట్టణానికి చెందిన మద్దిలేటి 6 క్వింటాళ్ల బియ్యం సమర్పించారు. ప్రశాంతంగా సప్లిమెంటరీ పరీక్షలు నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో పది, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రెండవ రోజు శనివారం ప్రశాంతంగా కొనసాగాయి. జిల్లాలో పదో తర గతి హిందీ పరీక్ష 27 కేంద్రాల్లో నిర్వహించినట్లు డీఈఓ సుధాకర్రెడ్డి తెలిపారు. 1,888 మంది విద్యార్థులకు గాను 671 మంది హాజరు కాగా 1,217 మంది గైర్హాజరయ్యారన్నారు. 36 శాతం మంది హాజరైనట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు 13 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అలాగే ఇంటర్మీడియెట్ పరీక్షలకు 4,764 మందికి గాను 4,560 మంది హాజరు కాగా 11 మంది గైర్హాజరైనట్లు డీవీఈఓ సునీత తెలిపారు. ఓకేషనల్ పరీక్షకు 300 మందికి గాను 279 మంది హాజరు కాగా 27 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. తళుక్కుమంటున్న అదృష్టంతుగ్గలి: తొలకరి వర్షాలకు వజ్రాల పంట పండుతోంది. ఈ ఏడాది ముందస్తు వర్షా లు బాగా కురుస్తుండడంతో విలువైన వజ్రాలు తళుక్కుమంటున్నాయి. జిల్లాలోని తుగ్గలి, మద్దికెర మండలాల్లో పలు గ్రామాల్లో ఎర్రనేలల్లో వజ్రాలు లభ్యమవుతుంటాయి. తుగ్గలి మండలంలో చెన్నంపల్లిలో 15 రోజుల క్రితం పొలం పనులకెళ్లిన ఓ మహిళకు రూ. 3.96 లక్షల విలువ చేసే వజ్రం, నాలుగు రోజుల క్రితం రామాపురంలో ఓ పొలానికి వెళ్లిన మరో మహిళకు రూ. 50 వేల విలువ చేసే వజ్రం లభ్యమైంది. మద్దికెర మండలం మదనంతపురంలో మూడు రోజుల క్రితం ఓ వ్యక్తి తనకు దొరికిన వజ్రాన్ని రూ.6.50 లక్షలకు విక్రయించారు. ఇదే గ్రామంలో శనివారం పొలం చూసేందుకు వెళ్లిన ఓ రైతుకు విలువైన వజ్రం లభ్యమైనట్లు సమాచారం. ఈ వజ్రాన్ని రూ.15 లక్షలు, 10 తులాల బంగారం ఇచ్చి ఓ వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలిసింది. అలాగే జొన్నగిరిలో లభ్యమై న వజ్రాన్ని రూ.15 వేలకు, పగిడిరాయిలో ఓ మహిళకు దొరికిన వజ్రాన్ని రూ.12 వేలకు వజ్రాల వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ సారి ముందస్తు వర్షాలు కురుస్తుండడంతో రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక నుంచి జనం ఇక్కడి వచ్చి వజ్రాన్వేషణ చేస్తున్నారు. అనంతపురం జిల్లా గుత్తి, వజ్రకరూర్ మండలాల్లో కూడా విలువైన వజ్రాలు లభ్యమవుతున్నట్లు తెలుస్తోంది. -
విషాదం
ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య ● జలదుర్గంలో ఘటన ప్యాపిలి: ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.. మరో వైపు కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో దిక్కుతోచని ఆ దంపతులు పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. మండల పరిధిలోని జలదుర్గం గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సుంకన్న (50), లక్షీదేవి (45) దంపతులకు మధుశేఖర్, మధుకృష్ణ, మహేశ్వరి సంతానం. వీరందరికీ వారు వివాహాలు చేశారు. కుమారులు, కోడళ్లతో సంతోషంగా ఉండాల్సిన ఆ దంపతులకు కొన్నాళ్లకే ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. రెండు ఎకరాల పొలంలో పంట సాగుకు, కుటుంబ పోషణకు స్థానికంగా అప్పులు చేశారు. వాటిని తీర్చే విషయంలో తరచూ కుటుంబ సభ్యుల మధ్య వివాదం జరుగుతోంది. ఈనెల 23వ తేది రాత్రి ఇదే విషయంపై తండ్రి, కుమారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయంలో మనస్తాపానికి గురైన ఇంటి పెద్దలు సుంకన్న, లక్ష్మీదేవి అదేరోజు రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి సమయంలో సుంకన్న మృతి చెందాడు. భర్త మృతి చెందిన కొద్ది గంటలకే లక్ష్మీదేవి కూడా తనువు చాలించింది. మృతుల కుమారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జలదుర్గం ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. తరలివచ్చిన గ్రామస్తులు సుంకన్న, లక్ష్మీదేవిల ఆత్మహత్యతో జలదుర్గంలో తీవ్ర విషాదం నెలకొంది. పోస్టుమార్టం అనంతరం శనివారం సాయంత్రం అంబులెన్స్లో మృతదేహాలను తీసుకురాగానే చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పలువురు మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. -
నేడు బ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
కర్నూలు(అర్బన్): జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన బ్రాహ్మణ విద్యార్థినీ, విద్యార్థులకు ఈ నెల 26న (ఆదివారం) ప్రతిభా పురస్కారాలను అందించనున్నట్లు బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షులు సండేల్ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడంతో పాటు విద్యాపరంగా మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్థానిక పెద్ద మార్కెట్, వాసవీ మహిళా డిగ్రీ కళాశాల సమీపంలోని బ్రాహ్మణ వీధి ఉత్తరాధిమఠంలో ఈ కార్యక్రమాన్ని సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నామన్నారు. ఆయా తరగతుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మెమొంటో, గిఫ్ట్ అందించి శాలువాలతో సత్కరిస్తామన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భోజన ఏర్పాట్లు చేశామన్నారు. గిరిజన యువకుడిపై ఎలుగుబంటి దాడి శ్రీశైలంప్రాజెక్ట్: ఇష్టకామేశ్వరీమాత ఆలయానికి 10 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో గిరిజన యువకుడిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. ప్రకాశంజిల్లా ఎర్రగొండపాలెం మండలం గాంధీనగర్కు చెందిన యువకుడు బయన్న ఇష్టకామేశ్వరీమాత ఆలయం సమీపంలో అటవీ ఫలాల సేకరణకు వెళ్లాడు. అదే ప్రాంతంలో ఉన్న ఎలుగుబంటి అకస్మాత్తుగా ఆ యువకుడిపై దాడి చేసి గాయపరిచింది. సమాచారం తెలుసుకున్న అట వీ సిబ్బంది బయన్నను సున్నిపెంట ప్రభుత్వా సుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు. చిన్నారులందరికీ టీకాలు వేయించాలి కర్నూలు(హాస్పిటల్): గర్భిణులు, చిన్నారులందరికీ సమయానుసారంగా టీకాలు వేయించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వై. ప్రవీణ్కుమార్ చెప్పారు. శనివారం స్థానిక రోజా వీధిలోని సచివాలయం–2లో జరుగుతున్న టీకాల కార్యక్రమాన్ని ఆయ న తనిఖీ చేసి వ్యాక్సినేషన్ రికార్డులు, రిపోర్టులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏఎన్ఎంలు తమ పరిధిలో అర్హులైన గర్భిణులు, చిన్నపిల్లలందరికీ వ్యాక్సిన్లు వేయాలన్నారు. -
మామిడిలో పాత తోటల పునరుద్ధరణ
● కాపునకు రాని చెట్లను తొలగించాల్సిన అవసరం లేదు ● అంటుకట్టుతో కొత్త చెట్ల తరహాలో దిగుబడులు ● ఒకే చెట్టుపై 10–15 వైరెటీల వరకు మామిడి అభివృద్ధి ● ఉమ్మడి జిల్లాలో 2వేల చెట్లలో విజయవంతం వైరెటీ కాయలు పండించవచ్చు తొలుత మా పెరట్లో ఉన్న ఒక మామిడి చెట్టుకు అంటుకట్టే పద్ధతి ద్వారా 12 రకాల వైరెటీలను అభివృద్ధి చేశాం. ఒక్కో రకానికి ఒక మొక్క నాటుకోవాలంటే స్థల సమస్య ఉంటుంది. అంటుకట్టుతో వైరెటీ కాయలను పండించుకోవచ్చు. తోటల్లో కూడా పనికి రాని చెట్లకు ఈ పద్ధతి ఎంతో ఉపయోగం. తక్కువ ఖర్చుతో మేలైన దిగుబడులు సాధ్యం. – నాగశేషులు, జూపాడుబంగ్లా కర్నూలు(అగ్రికల్చర్): మామిడిలో 50 ఏళ్లు పైబడిన చెట్లను తొలగించడం సహజం. ఇలాంటి చెట్లు కొద్ది వరకు కాపునకు వచ్చినా దిగుబడులు నామమాత్రంగా ఉంటాయి. కొత్త తోటల్లోనూ కొన్ని పనికిరాని చెట్లు కనిపిస్తుంటాయి. ఈ చెట్లు ఇక అనవసరం అనే అభిప్రాయానికి రైతులు వచ్చేస్తుంటారు. ఇక మీదట ఇలాంటి అభిప్రాయాన్ని మార్చుకోక తప్పదు. పాత చెట్లను కూడా అంటుకట్టు పద్ధతితో కొత్త చెట్లుగా అభివృద్ధ్ది చేసుకునే వీలుండటమే అందుకు కారణం. బేనిషా వంటి మంచి రకాలను కూడా వృద్ధి చేసుకొని మంచి దిగుబడులు పొందవచ్చు. మామూలుగా అయితే ఒక్కో రకానికి ఒక మొక్క నాటి పెంచుకోవాల్సి ఉంది. స్థలాభావం వల్ల ఎక్కువ వైరెటీలను అభివృద్ధి చేసుకోలేం. అయితే అంటు కట్టుతో ఒక చెట్టుపైనే ఏకంగా 10–12 రకాల మొక్కలను కూడా అభివృద్ధి చేసుకొని మంచి దిగుబడులు పొందుతుండటం విశేషం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 25 వేల ఎకరాల వరకు మామిడి తోటలు ఉన్నాయి. ఇందులో 50 ఏళ్ల వయస్సు పైబడిన చెట్లు దాదాపు 5వేల ఎకరాల్లో ఉంటున్నాయి. వయస్సు పెరిగే కొద్దీ దిగుబడులు తగ్గుతుండటం, అస్సలు పూత రాకపోతుండటంతో పాత చెట్లను తొలగించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గత ఐదారేళ్లలో దాదాపు 1,400 ఎకరాల్లో మామిడి చెట్లను తొలగించారు. ఇప్పుడు పాత మామిడితోటలను పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేకుండా అంటుకట్టు పద్ధతిని ఉపయోగించి కొత్త తోటలుగా మార్చుకోవడం ద్వారా రైతుల దశ తిరుగుతోంది. ‘చిరు’ సాయం నంద్యాల జిల్లా మండల కేంద్రమైన జూపాడుబంగ్లాకు చెందిన నాగశేషులు ఉద్యాన శాఖలో చిరుద్యోగి. అయితే అంటుకట్టు పద్ధతిలో అపారమైన అనుభవం గడించారు. తొలగించడానికి సిద్ధమైన అనేక పాతతోటల్లో వందలాది చెట్లను అంటుకట్టు పద్ధతితో తిరిగి ప్రాణం పోశారు. ఇప్పటి వరకు దాదాపు 2వేల పనికిరాని చెట్లకు అంటు కట్టి కొత్త తోటల అభివృద్ధికి తోడ్పాటును అందించారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 30–40 మంది రైతులు తమ తోటల్లో పనికి రాని చెట్ల స్థానంలో అంటుకట్టు పద్ధతి పాటిస్తున్నారు. ఇలాంటి చెట్లు గత ఏడాది నుంచి కాపునకు వస్తున్నాయి. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ప్యాపిలి: మండల పరిధిలోని బోంచెర్వుపల్లి గ్రామానికి చెందిన వెంకటరాముడు (41) అనే వ్యక్తి శనివారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటరాముడు లక్ష్మితండా సమీపంలో ఉన్న తన పొలానికి నీరు కట్టేందుకు వెళ్లాడు. స్టాటర్ బాక్స్లో ఉన్న స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. ఇంటి పెద్ద మృతితో కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది. మృతుడికి భార్య లక్ష్మిదేవి, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాచర్ల పోలీసులు తెలిపారు. -
ఓట్ల లెక్కింపులో నిబంధనలు పాటించండి
నంద్యాల: జూన్ 4వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్నికల కమిషన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు రిటర్నింగ్ అధికారులు, ఏఆర్ఓలు, అడిషనల్ ఏఆర్ఓలను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుపై సంబంధిత అధికారుల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ రాహుల్కుమార్రెడ్డి, డీఆర్ఓ పద్మజ, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలవుతుందని, అరగంట అనంతరం 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపును ప్రారంభించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అప్రమ త్తంగా ఉండాలన్నారు. కౌంటింగ్ సిబ్బంది అందరూ ఉదయం ఆరు గంటలకే లెక్కింపు కేంద్రాల వద్దకు చేరుకొని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో కౌంటింగ్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమన్నారు. ఎక్కడా సొంత నిర్ణయాలను తీసుకోకూడదని స్పష్టం చేశారు. ఎలాంటి చిన్న పొరపాట్లకు కూడా తావివ్వకుండా లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు , ఇతర అధికారులు తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డు కలిగి ఉండాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈవీఎంలలో ఓట్లను లెక్కించడానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రం, ఆ నియోజకవర్గంలో పార్లమెంటుకు పోలైన ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. అంతకు ముందు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కౌంటింగ్ సిబ్బంది విధులు, నిబంధనలు, కౌంటింగ్ హాళ్లు, పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎం ఓట్లు లెక్కించే విధానం, టేబుళ్ల ఏర్పాటు, చెల్లని ఓట్లు, చెల్లినవి గుర్తించడం, వాటిని వేరు చేయడం, ఫలితాల నివేదికను సిద్ధం చేయడం, బోర్డుపై వెల్లడించడం, అవసరమైన పత్రాలను పూర్తి చేయడం, తిరిగి ఈవీఎంలను సీల్ చేయడం, స్ట్రాంగ్ రూములోకి తరలించడం తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో అప్రమత్తం అధికారులు, సిబ్బంది, ఏజెంట్లకు ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు -
వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయాడు
కర్నూలు(హాస్పిటల్): నగరంలోని కిమ్స్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు చనిపోయాడని రిటైర్డ్ ఉద్యోగి డి.పి. స్వామన్న వాపోయారు. న్యాయం కోసం ఆసుపత్రి యాజమాన్యం చుట్టు తిరిగినా పట్టించుకోవడం లేదని అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కుమారుడు డి. సురేష్బాబు(50)ను 3వ తేది రాత్రి 9 గంటల సమయంలో స్పృహలేని పరిస్థితిలో చికిత్స నిమిత్తం కిమ్స్ ఆసుపత్రిలో చేర్చాను. అతనికి సిటీ స్కాన్, ఎక్స్రే తదితర పరీక్షలన్నీ చేశారు. అందులో ఊపిరితిత్తులకు జబ్బు ఉందని, వెంటనే ఊపిరితిత్తుల నిపుణులు డాక్టర్ వెంకటచలమయ్యను పిలిపిస్తామని, అందుకు ఫీజు రూ.8,250 అవుతుందంటే వెంటనే చెల్లించా. మెడిక ల్ ఐసీయూలో ఉంచి కుటుంబసభ్యులను ఎవ్వరినీ రానివ్వలేదు. మరునాడు (4వ తేది)ఉదయం10 గంటల వరకు కూడా నా కుమారుడిని చూసేందు కు డాక్టర్ వెంకటచలమయ్య రాలేదు. కానీ మందు లు మాత్రం తెప్పిస్తూనే ఉన్నారు.చివరకు నా కుమారుడు చనిపోయాడని ముగ్గురు డాక్టర్లు వచ్చి చెప్పారు’అని ఆవేదన వ్యక్తం చేశారు. వస్తానన్న డాక్టర్ వెంటనే రాకపోవడం, వైద్యులు సరిగా స్పందించకపోవడమే సురేష్బాబు మృతికి కారణమని ఆరోపించారు. ఈ విషయమై ఆసుపత్రి సీఈఓ సునీల్ను ‘సాక్షి’ వివరణ కోరగా రోగి ఆసుపత్రికి వచ్చిన సమయంలోనే సీరియస్ కండీషన్లో ఉన్నట్లు చెప్పారు. అవసరమైన అన్ని రకాల వైద్యసేవలు అందించినా కోలుకోలేక చనిపోయాడన్నారు. ఈ విషయంలో తమ వైద్యుల నిర్లక్ష్యం లేదని వెల్లడించారు. కుమారుడి మృతిపై తండ్రి ఆవేదన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
ఆదోనిలో దొంగలు హల్చల్
ఆదోని అర్బన్: పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు. చిరు వ్యాపారులకు సంబంధించి ఐదు దుకాణాల్లో చొరబడి కొంత నగదు, స్వీట్స్ అపహరించుకెళ్లారు. శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆస్పరి రోడ్డులో బైపాస్కు సమీపంలో చిన్నపాటి బేకరీ, బీడీ బంకు, టీ స్టాల్, కూల్డ్రింక్ షాపు, మెస్ దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాల డబ్బా రేకులను కోసి లోపలికి దూరి కొంతనగదుతో పాటు స్వీట్స్, కూల్ డ్రింక్స్, బీడీలు, సిగరెట్లు ఎత్తుకెళ్లారు. ముందు జాగ్రత్తగా పోలీసులకు దొరకకుండా దుండగులు సమీపంలోని సీసీ కెమెరాలను సైతం పగలగొట్టినట్లు బాధితులు లక్ష్మి, మల్లికార్జున తెలిపారు. తర్వాత చోరీ ఘటనపై చిరువ్యాపారులు టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. -
ఉపాధి నిధులతో పండ్లతోటల అభివృద్ధి
● జాబ్ కార్డు కలిగి ఉండి... 5 ఎకరాల్లోపు భూమి కలిగిన వారందరూ అర్హులే ● జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ అమరనాథరెడ్డి సూచనలు కర్నూలు(అగ్రికల్చర్): కరువు ప్రాంతాల్లో 2024–25 సంవత్సరానికి పండ్లతోటలను 100 శాతం సబ్సిడీతో అభివృద్ధి చేసుకోవచ్చని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ అమరనాథరెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఏడాది 10 వేల ఎకరాల్లో పండ్లతోటలు అభివృద్ధి చేయాలనేది లక్ష్యమని, ఇప్పటి వరకు 3,500 ఎకరాలను గుర్తించామన్నారు. జిల్లాలో ఆశాజనకంగా వర్షాలు పడుతుండటం పండ్లతోటల అభివృద్ధికి చక్కటి అవకాశమన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులతో పాటు చిన్న, సన్నకారు రైతుల స్థిరాస్తిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పండ్లతోటల సాగును ప్రోత్సహిస్తోందన్నారు. 100 శాతం సబ్సిడీతో 17 రకాల పండ్లతోటల అభివృద్ధికి అవకాశం ఉందన్నారు. మామిడి, బత్తాయి, నిమ్మ, జామ, సపోట, కొబ్బరి, సీతాఫలం, దానిమ్మ, నేరేడు, చింత, ఆపిల్బేర్(రేగు), డ్రాగన్ప్రూట్స్, అంజూర, పూలతోటలకు సంబందించి గులాబి, మల్లె తోటలు అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ఉపాధి హామీ జాబ్కార్డుతో పాటు భూమి పట్టాదారు పాసుపుస్తకం ఉంటే వంద శాతం సబ్సిడీ లభిస్తుందన్నారు. మెట్టభూములు, చౌడు భూముల్లోనూ పండ్లతోటలు అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. వివరాలకు 9121103297ను సంప్రదించాలని తెలిపారు. -
ఇసుక, మద్యం అక్రమ రవాణాపై సెబ్ దాడులు
కర్నూలు: ఇసుక, మద్యం అక్రమ రవాణాపై సెబ్ అధికారులు దాడులు విస్త్రృతం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ ఆదేశాల మేరకు శనివారం కూడా జిల్లా వ్యాప్తంగా విస్త్రృత తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 9 మందిపై కేసులు నమోదు చేసి 36 టన్నుల ఇసుకను సీజ్ చేశారు. 9 ట్రాక్టర్లు జప్తు చేసి రూ.90వేలు అపరాధ రుసుం విధించి ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. కర్నూలు సెబ్ స్టేషన్ పరిధిలోని తుంగభద్ర, హంద్రీ నదుల నుంచి ఇసుక తరలిస్తున్న కర్నూలు మండలం శింగవరం గ్రామానికి చెందిన బోయ వీరాంజనేయులు, మదనగోపాల్, లక్ష్మీపురం గ్రామానికి చెందిన సంజన్న, బీరయ్య, కర్నూలుకు చెందిన ఓంనాథ్ తదితరులకు చెందిన 5 ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. అలాగే పొరుగు రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక నుంచి మద్యం తరలిస్తున్న వారిపై నిఘా ఉంచి నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 157 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా స్థావరాలపై కూడా దాడులు కొనసాగుతున్నాయి. దాదాపు 1400 లీటర్ల నాటుసారాకు ఉపయోగించే బెల్లంఊటను ధ్వంసం చేశారు. 40 లీ టర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని ఇద్దరి అమ్మకందారులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు కర్నూలు సెబ్ సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. -
ఆన్లైన్లో మూల్యాంకనం
అధ్యాపకులకు అవగాహన సదస్సు సప్లిమెంటరీ జవాబుపత్రాలను ఆన్లైన్ ద్వారానే మూల్యాంకనం చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు అందాయి. ఈ ఆన్లైన్ విధానంపై అవవగాహన కల్పించేందుకు నంద్యాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం. అన్ని యాజమాన్యాల కళాశాలల నుంచి ఒక్కో అధ్యాపకుడు కచ్చితంగా హాజరయ్యారు. వర్చువల్ విధానంలో బోర్డు అధికారులు అవగాహన కల్పించారు. –సునీత, డీవీఈఓ, నంద్యాల నంద్యాల(న్యూటౌన్): ఇంటర్ బోర్డు చరిత్రలో సరికొత్త అధ్యాయానికి అధికారులు నాంది పలికారు. ఇక నుంచి ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం ఆన్లైన్ విధానంలో చేపట్టడానికి సర్వం సిద్ధం చేశారు. ఈనెల 24 నుంచి జరుగుతున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను ఆన్లైన్లోనే దిద్దేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో ప్రతి జిల్లాలోనూ మూల్యాంకనం కేంద్రం ఏర్పాటు చేసేవారు. వార్షిక పరీక్షలకు 20 రోజులు, సప్లిమెంటరీ పరీక్షలకు 12 రోజుల పాటు మూల్యాంకనం జరిగేది. సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయిన తర్వాత చేపట్టే మూల్యాంకనం సరిగ్గా జూన్ 1 నుంచి మొదలవుతుంది. అప్పడప్పుడే జూనియర్ కళాశాలలు పునః ప్రారంభమవుతుండటంతో ఆ సమయంలో విద్యార్థుల అడ్మిషన్లు జరుగుతుంటాయి. అయితే అధ్యాపకులందరూ స్పాట్ కేంద్రంలో ఉండాల్సి రావడంతో ఓ వైపు తరగతుల నిర్వహణకు ఆటంకంతో పాటు మరోవైపు అడ్మిషన్లకు ఇబ్బందిగా మారుతోంది. ప్రభుత్వ కళాశాలల్లో ఈ సమస్యను అధిగమించి అధ్యాపకులందరూ కళాశాలల్లో అందుబాటులో ఉండేందుకే ఆన్లైన్ మూల్యాంకనం విధానం తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికితోడు ఎలాంటి పొరపాట్లకు తావు ఉండదు. మ్యానువల్గా మూల్యాంకనం చేసే సమయంలో మార్కుల కూడికలో పొరపాట్లు, కొన్ని ప్రశ్నలకు మార్కులు మరిచి పోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. గతంలో ఒక విద్యార్థికి 70 మార్కులు వస్తే మొత్తం మార్కులు వేసే సమయంలో పొరపాటున సున్నా ఎగిరిపోయి 7 మార్కులు మాత్రమే వేశారు. తర్వాత రీ వెరిఫికేషన్లో అసలు విషయం బయట పడింది. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. ప్రశ్నలు డిస్ప్లే ఇలా.. ఆన్లైన్లో మూల్యాంకనం చేసేటప్పుడు మొదటి ప్రశ్న డిస్ప్లే వచ్చిన తర్వాత ఎగ్జామినర్ పరిశీలించిన తర్వాతనే రెండో ప్రశ్న వస్తుంది. ఇలా ప్రతి ప్రశ్న తప్పనిసరిగా పరిశీలించిన తర్వాతనే ఫైనల్ సబ్మిట్ చూపిస్తుంది. విద్యార్థి జవాబు రాసినా, రాయకపోయినా అన్ని ప్రశ్నలూ పరిశీలించాల్సి ఉంటుంది. దీనిద్వారా ఏ ఒక్క ప్రశ్న మరిచిపోయే అవకాశం ఉండదు. మార్కుల విషయంలో ఒక ప్రశ్నకు మ్యాగ్జిమం వేయాల్సిన మార్కులంటే ఎక్కువ వేసినా తీసుకోదు. తరగతుల నిర్వహణకు ఆటంకం లేకుండా.. ఆన్లైన్లో పేపర్లు దిద్దే ఎగ్జామినర్లు ఎట్టి పరిస్థితుల్లో కళాశాలల్లో విద్యార్థుల తరగతలకు ఆటంకం కలిగించకూడదు. ఉదయం 8 గంటలలోపు, తర్వాత కళాశాల నుంచి వచ్చిన తర్వాత మూల్యాంకనం చేసుకోవచ్చు. కళాశాలలో తరగతులు లేని సమయంలోనూ చేసుకోవచ్చు. ప్రతి ఎగ్జామినర్ టీక్యూఐడీ ద్వారా లాగిన్ అయిన వెంటనే పాస్వర్డ్ మార్చుకోవాలి. తర్వాత వెబ్ కెమెరా ముందు తన ఫొటో క్యాప్చర్ చేసి లాగిన్ అవుతారు. ముందుగా ఐదు ప్రాక్టీస్ పేపర్లు మూల్యాంకనం చేసిన తర్వాత రెగ్యులర్ పేపర్లు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో ఎగ్జామినగర్కు రోజుకు గరిష్టంగా 50 జవాబు పత్రాలుఅందుబాటులో ఉంటాయి. డీఆర్డీసీ స్థానాల్లో ఆర్ఆర్ఎస్సీలు.. మ్యానువల్ మూల్యాంకనం సమయంలో ప్రతి జిల్లాలోనూ డీఆర్డీసీ జిల్లా రీకలెక్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉండేది. దీని ద్వారా జిల్లాలోని అన్ని జవాబు పత్రాలను కలెక్షన్ చేసి ఎంపిక చేసిన జిల్లాలకు పంపేవారు. ఇప్పుడు రీజనల్ రెసిప్షన్ స్కానింగ్ సెంటర్ (ఆర్ఆర్ఎస్సీ)లు అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ముగిసిన తర్వాత స్పీడ్ పోస్ట్ ద్వారా ఎంపిక చేసిన ఆర్ఆర్ఎస్సీలకు జవాబు పత్రాలు పోతాయి. అక్కడ ఆన్లైన్లో నమోదు చేసి మూల్యాంకనానికి చర్యలు తీసుకుంటారు. సాంకేతికతను అందిపుచ్చుకున్న ఇంటర్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల నుంచే శ్రీకారం జవాబు పత్రాలను ఆన్లైన్లో దిద్దనున్న వైనం -
వైభవం.. పాండురంగడి రథోత్సవం
● జనసందోహం నడుమ ముందుకు సాగిన రథం ● అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు కోవెలకుంట్ల: పట్టణంలోని రంగరాజుపేటలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరుడి స్వామి రథోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రితో స్వామి వారి వాహన సేవలు ముగియగా తొమ్మిదవ రోజు స్వామివారి రథోత్సవం నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు వేణుగోపాలాచార్యులు, సుదర్శనాచార్యులు ఉదయం 11గంటలకు హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాలు, డ్రమ్స్, డప్పులతో అశేష జనవాహిని మధ్య రథోత్సవం సాగింది. ఆలయం నుంచి రంగరాజుపేట, సంతపేట, అమ్మవారిశాల, గాంధీసెంటర్ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పట్టణ ప్రజలే కాకుండా చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రథోత్సవాన్ని పురస్కరించుకుని మైదుకూరు, బెంగళూరుకు చెందిన కళాకారులు కాళికాశక్తి, భధ్రకాళి, బుట్టబొమ్మలు, తదిర వేషాధారణలు, చెక్క భజన కార్యక్రమాలు అలరించాయి. హైదరాబాద్ నుంచి తెప్పించిన డ్రోన్ ద్వారా భక్తులపై పన్నీరు చల్లించారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కోవెలకుంట్ల సీఐ జయచంద్ర, సర్కిల్ ఎస్ఐలు వరప్రసాద్, రాజ్కుమార్, రాంమోహన్రెడ్డి, రమేష్రెడ్డి తమ సిబ్బందితో గట్టి బందోబస్తు చేపట్టారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మైలతేరు కార్యక్రమం జరుగుతుంది. -
అనుమతులు పొందిన విత్తనాలనే విక్రయించాలి
నంద్యాల(అర్బన్): ప్రభుత్వ అనుమతులు పొందిన రకాల విత్తనాలనే మార్కెట్లో విక్రయించాలని మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు సూచించారు. శనివారం పట్టణంలోని పలు విత్తన శుద్ధి కేంద్రాల్లో వ్యవసాయాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏఓ ప్రసాదరావు ఆధ్వర్యంలో జనార్ధన్రెడ్డి సీడ్స్, ధనలక్ష్మి అగ్రోటెక్, నాగ అగ్రిటెక్లలో ప్రాసెసింగ్, డిస్పాచ్, ఫౌండేషన్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం విత్తన ప్రాసెసింగ్ విధానంపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. విత్తన నాణ్యత ప్రమాణాలను తెలుసుకునేందుకు ఆయా కేంద్రాల్లో విత్తన నమూనాలను తీసి ప్రయోగశాలకు పంపారు. అనంతరం ఏఓ మాట్లాడుతూ విత్తనాలు ప్రాసెసింగ్ చేసే వారు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. కల్తీ లేకుండా చూడాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలను తయారు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. -
మధ్యాహ్నం వరకు ఎండ.. సాయంత్రానికి వాన
కర్నూలు(అగ్రికల్చర్): ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. 10 రోజుల తర్వాత శుక్రవారం ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. వడగాలుల తీవ్రత అధికమైంది. ఎండల వేడిమి, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు సాయంత్రానికి ఉపశమనం దక్కింది. 6 గంటల ప్రాంతం నుంచి కర్నూలు సహా వివిధ మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది. కర్నూలు జిల్లా మంత్రాలయంలో 41.6 డిగ్రీలు, కర్నూలులో 41.4, కౌతాళంలో 41.2 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా బనగానపల్లిలో 42.2, మిడుతూరులో 41.7, పాణ్యంలో 41.4, డోన్లో 41.1 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
రుచి.. చిగురించె!
గోస్పాడులో రహదారి వెంబడి పూత, చిగురుతో కళకళలాడుతున్న చింత చెట్లుచింత చిగురుతో చేసిన వంటకం ఏదైనా సరై ఆ పేరు వింటే భోజన ప్రియులకు నోరూరాల్సిందే. ఏటా ఏప్రిల్ మెదలుకొని జూలై నెల వరకు చిగురు కోతకు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా చిగురు విక్రయదారులు కనిపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చింత కూపుల నుంచి చిగురు సేకరించి పట్టణాల్లో విక్రయిస్తున్నారు. చిన్న చిన్న కుప్పలుగా వేసి రూ. 15 నుంచి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. రుచితో పాటు పోషకాలు మెండుగా ఉండటంతో చిగురు వినియోగం పెరిగిపోయింది. కాయగూరల్లోనే కాదు.. చేపలు, రొయ్యలు, మటన్ వంటి మాంసాహార వంటకాల్లోనూ జత చేస్తారు. అలాగే చిగురుతో చెట్నీ, పులిహోర, రసం పొడి తయా రు చేస్తారు. ఇందులో విటమిన్–సీ కూడా లభ్యమవుతుందని, మనిషిలో నష్టపోయిన కణజాలన్ని సరి చేస్తుందని, ముఖ్యంగా ఎముకలు, దంతాలు గట్టిగా ఉండేలా దోహదం చేస్తుందని సీజనల్గా వచ్చే చిగురును ప్రతి ఒక్కరూ వాడటం మంచిదేనని గోస్పాడు వైద్యాధికారి డాక్టర్ గోపాల్ చెబుతున్నారు. – గోస్పాడు -
సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో ఇంటర్, పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పదో తరగతి పరీక్షలకు సంబంధించి జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 2,968 మంది విద్యార్థులకు గాను 1,207 మంది పరీక్షకు హాజరయ్యారు. 1,761 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ సుధాకర్రెడ్డి తెలిపారు. విద్యార్థుల హాజరు 41 శాతంగా నమోదైందన్నారు. జిల్లా వ్యాప్తంగా మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు 13 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు.. జిల్లాలో ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగినట్లు డీవీఈఓ సునీత తెలిపారు. జిల్లాలో మొదటి సంవత్సరం తెలుగు పరీక్షకు 2,215 మందికి గాను 2,078 మంది హాజరు కాగా 134 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన రెండో సంవత్సరం తెలుగు పరీక్షకు 89 మందికి గాను 82 మంది హాజరు కాగా ఏడుగురు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల ఎదుట 144 సెక్షన్ అమలులో ఉందని డీవీఈఓ తెలిపారు. -
ఓట్ల లెక్కింపునకు మొదటి ర్యాండమైజేషన్ పూర్తి
నంద్యాల: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బందికి సంబంధించి మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్రెడ్డితో కలిసి కౌంటింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి భారత ఎన్నికల కమిషన్ సూచించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. కౌంటింగ్ కోసం 813 మంది సిబ్బందిని సీపీఎంఎస్ సాఫ్ట్వేర్లో ఆన్లైన్ ద్వారా అత్యంత పారదర్శకతతో ఈ ప్రక్రియను చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ, డోన్, నందికొట్కూరు, బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు మల్లికార్జున్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ఎం.దాసు, కామేశ్వరావు, ఎన్ఐసీ నెట్వర్క్ ఇంజినీర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు -
కౌంటింగ్కు పకడ్బందీ చర్యలు
పాణ్యం: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఈవీఎంలు భద్రపరిచిన ఆర్జీఎం, శాంతిరామ్ కళాశాలను తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్లను కంట్రోల్ రూమ్ నుంచి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జూన్ 4 తేదీన కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో బాణాసంచా పేల్చేందుకు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు. అనంతరం కౌంటింగ్ కేంద్రాల వద్ద వాహనాల పార్కింగ్కు స్థలాలను కేటాయించారు. ఆయన వెంట అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, సంతోష్, పాణ్యం సీఐ నల్లప్ప ఉన్నారు. నిలకడగా ఎండుమిర్చి ధరలు నంద్యాల(సెంట్రల్): పట్టణంలోని మిర్చి యార్డులో ఎండుమిర్చి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. శుక్రవారం యార్డులో సూపర్–10 రకం జనరల్ క్వింటాలు గరిష్ట ధర రూ.17,000, మధ్యస్థ ధర రూ.14,100, కనిష్ట ధర రూ.12,000గా పలికినట్లు యార్డు ఎంపిక శ్రేణి కార్యదర్శి కల్పన తెలిపారు. నేడు మధ్యప్రదేశ్ సీఎం రాక శ్రీశైలం: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనార్థమై మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శనివారం ఉదయం శ్రీశైలం చేరుకుంటారని ఆలయ అధికారులు తెలిపారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం చేరుకు ని అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 10.45 గంటలకు సున్నిపెంట చేరుకుంటారని చెప్పారు. ఉదయం 11 గంటలకు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటారని తెలిపారు. ఐదుగురు డిబార్ కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన పరీక్షలకు 88 శాతం హాజరు నమోదైనట్లు వర్సిటీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం సెషన్లో జరిగిన డిగ్రీ రెండవ సెమిస్టర్ పరీక్షలకు 3,452 మందికి 3,054 మంది, మధ్యాహ్నం సెషన్లో జరిగిన నాల్గవ సెమిస్టర్ పరీక్షలకు 8,306 మందికి 7,635 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. కర్నూలు డిగ్రీ కళాశాల, సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాల, పత్తికొండ శ్రీ రాఘవేంద్ర డిగ్రీ కళాశాల, ఆళ్లగడ్డ అనంత డిగ్రీ కళా శాల, నంద్యాల ఎస్పీవై రెడ్డి డిగ్రీ కళాశాలల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు విద్యార్థులు చూచిరాతలకు పాల్పడగా డిబార్ చేసినట్లు పేర్కొన్నారు. ఎంటీపీ యాక్ట్కు రిజిస్ట్రేషన్ చేయించాలి కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో కాంప్రహెన్సివ్ అబార్షన్ కేర్(ఎంటీపీ యాక్ట్) రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆసుపత్రుల యాజమాన్యాలకు డీఎంహెచ్ఓ డాక్టర్ వై.ప్రవీణ్కుమార్ సూచించారు. శుక్రవారం మెడికల్ కాలేజీలోని ఓల్డ్ లెక్చర్ గ్యాలరీలో ఎంటీపీ యాక్ట్, బేటీ బచావో బేటీ పడావో అంశాలపై ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యులు, మేనేజర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంటీపీ యాక్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న వాటిని జిల్లా స్థాయి కమిటీ ఆమోదం అనంతరం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నట్లు తెలిపారు. -
హైదరాబాద్ నుంచి ఏపీఈఆర్సీకి విముక్తి
జూన్ 2న కర్నూలు నుంచి ఏపీఈఆర్సీ సేవలు ● రూ.23 కోట్లతో నిర్మించిన విద్యుత్ నియంత్రణ మండలి భవనాన్ని ప్రారంభించిన చైర్మన్ నాగార్జునరెడ్డి ● నిరాడంబరంగా ప్రారంభోత్సవ కార్యక్రమం కర్నూలు(అగ్రికల్చర్): పదేళ్లుగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) కర్నూలు కేంద్రంగా పనిచేయడానికి రంగం సిద్ధమైంది. రూ.23 కోట్లతో నిర్మించిన ఏపీఈఆర్సీ భవనాన్ని చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం నిరాడంబరంగా సాగింది. హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ చంద్రబాబు అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను 2015లోనే ఏపీకి తరలించారు. ఒక్క విద్యుత్ నియంత్రణ మండలి మాత్రమే హైదరాబాద్లో కొనసాగుతోంది. ఉమ్మడి రాజధాని గడువు జూన్ 2న ముగియనుండటంతో కర్నూలులో ఏర్పాటు కానుంది. ఎన్నికల కోడ్ ఉండటం వల్ల ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఏపీఈఆర్సీ చైర్మన్ నాగార్జునరెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ప్రారంభోత్సవం చేపట్టారు. కర్నూలు శివారులోని ఏపీ ట్రాన్స్కోకు చెందిన 220 కేవి కార్బైడ్ సబ్ స్టేషన్కు చెందిన 2 ఎకరాల భూమిలో ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జూన్ 2వ తేదీ నుంచి కర్నూలు కేంద్రం ఏపీఈఆర్సీ పనిచేస్తుందని తెలిపారు. 2023 జూన్లో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, ఏడాదిలోపే భవన నిర్మాణం పనులు పూర్తి కావడం అభినందనీయమన్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉన్న ఏపీఈఆర్సీ కార్యాలయం సామగ్రిని వెంటనే కర్నూలుకు తరలిస్తామన్నారు. ఏపీఈఆర్సీ ద్వారా విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మెంబరు టెక్నికల్ రాంసింగ్, ఫైనాన్స్ మెంబర్ పీఆర్కే రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్రావు, విద్యుత్ శాఖ సివిల్ ఎస్ఈ భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రౌండ్ల వారీగా ఫలితాలు నమోదు చేయండి
నంద్యాల: సార్వత్రిక ఎన్నికలు–2024 కౌంటింగ్కు సంబంధించి ఎన్నికల ఫలితాలు రౌండ్ల వారీగా ఎప్పటికప్పుడు నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి కౌంటింగ్ కంప్యూటర్ సహాయకులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి జిల్లాలోని ఆరు అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఆన్లైన్లో డేటా ఎంట్రీ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు సంబంధించి వివరాలను రౌండ్ల వారీగా ప్రజలు ఎప్పటికప్పుడు results.eci.gov.in వెబ్సైట్లో, Voter Helpline యాప్లో, Election Trends Tvలో తెలుసుకునేందుకు వీలుగా జాగ్రత్తగా నమోదు చేయాలని శిక్షణ పొందుతున్న కౌంటింగ్ కంప్యూటర్ సహాయకులకు సూచించారు. ఈ డేటా ఎంట్రీతో ప్రజలు ఎక్కడి నుంచైనా ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుందన్నారు. ఈ సమయంలో కంప్యూటర్ సహాయకులు అప్రమత్తంగా ఉండి వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి పద్మజ, మున్సిపల్ ఇంజనీర్ మధు కుమార్, అన్ని నియోజకవర్గాల కౌంటింగ్ కంప్యూటర్ సహాయకులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి -
No Headline
● ఒక జిల్లా–ఒక ఉత్పత్తి కింద బనగానపల్లె ఏరియా చేనేత వస్త్రాలు ఎంపిక ● జాతీయ స్థాయి అవార్డుకు ప్రతిపాదనలు ● జిల్లాలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి అవకాశం ● ‘నేతన్న నేస్తం’తో కార్మికులకు ప్రభుత్వ ప్రోత్సాహంకర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల జిల్లాలో చేనేత పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు చేనేత, జౌళిశాఖ చర్యలు చేపట్టింది. కర్నూలు జిల్లాతో పోలిస్తే నంద్యాల జిల్లాలో చేనేత పరిశ్రమ అంతగా అభివృద్ధి చెందలేదు. ఈ క్రమంలో నంద్యాల జిల్లాలో కూడా చేనేత వస్త్రాల ఉత్పత్తి, మార్కెటింగ్ను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ‘ఒక జిల్లా – ఒక ఉత్పత్తి’ కింద నంద్యాల జిల్లా బనగానపల్లె ఏరియాలో ఉత్పత్తి అవుతున్న చేనేత వస్త్రాలకు జాతీయ అవార్డు కోసం చేనేత, జౌళిశాఖ ప్రతిపాదనలు పంపింది. జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ చేనేత, జౌళి శాఖ ఉమ్మడిగానే ఉంది. నంద్యాల జిల్లాలోని బనగానపల్లె ప్రాంతంలో నందివర్గం, కోవెలకుంట్ల, ఇల్లూరు కొత్తపేట, పలుకూరు, బిజినవేముల ప్రాంతాల్లో 150 కుటుంబాలు చేనేత వృత్తిపైనే ఆధారపడ్డాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం కింద చేనేత పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం బనగానపల్ల్లె క్లస్టర్ డెవలప్మెంటు ప్రోగ్రామ్ను అమలు చేసింది. ఇందులో 97 మంది వీవర్లు సభ్యులుగా ఉన్నారు. వీరికి అధునాతన చేనేత మగ్గాలు, ఇతర పరికరాలను రూ.1.20 కోట్లతో అమలు చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇది వరకే మొదటి విడత కింద రూ.44.42 లక్షలతో చేనేత మగ్గాలు, పరికరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా నంద్యాల జిల్లాలో చేనేత పరిశ్రమ ఊపిరి పోసుకుంది. చేనేత పరిశ్రమకు మరింత ప్రాచుర్యం కల్పించడానికి ‘ఒక జిల్లా – ఒక ఉత్పత్తి’ కింద జాతీయ స్థాయిలో అవార్డు కోసం నివేదిక పంపడం విశేషం. జాతీయ స్థాయి పురస్కారం లభిస్తే చేనేత పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నివేదికలో చేనేత వస్త్రాల ఉత్పత్తి, వాటి నాణ్యతా ప్రమాణాలు, మార్కెటింగ్ తదితర వివరాలు వివరించారు. రూ.కోటి విలువైన వస్త్రాల ఉత్పత్తి.. బనగానపల్లె ప్రాంతంలో చేనేత పరిశ్రమ గడిచిన ఐదేళ్లలో విశేషంగా అభివృద్ధి చెందింది. 2018–19 వరకు ఈ ప్రాంతంలో చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరకపోయింది. కేవలం 50 కుటుంబాల వరకు చేనేతలు ఉండగా, వస్త్రాల ఉత్పత్తి రూ.30 లక్షల విలువ వరకు కూడా లేదు. 2019 – 20 నుంచి చేనేత పరిశ్రమ అభివృద్ధికి వైఎస్సార్ నేతన్న నేస్తం అమలు చేయడంతో ఒక్క బనగానపల్లె ప్రాంతమైన నందివర్గం, కోవెలకుంట్ల, ఐ.కొత్తపేట, పలుకూరు. బిజినవేమలలో చేనేత వస్త్రాల ఉత్పత్తి రూ.కోటికి చేరింది. నందివర్గం చేనేత సహకారం సంఘం మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. చేనేత పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ఒక జిల్లా– ఒక ఉత్పత్తి కింద కేంద్ర ప్రభుత్వం అవార్డుకు ప్రతిపాదన చేయడం విశేషం. ఈ ప్రాంతంలో కేవలం టువాళ్లు, లుంగీలు ప్రధానంగా ఉత్పత్తి చేస్తారు. వీటితో పాటు ఖాదీ వస్త్రాలు కూడా ఉత్పత్తి అవుతున్నాయి. చేతులతో అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఉత్పత్తి చేస్తున్న టువాళ్లు, లుంగీలు, ఖాదీ వస్త్రాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చేనేత వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు చేపట్టినా... నందివర్గం చేనేత సహకార సంఘం ఉత్పత్తి చేసిన ఉత్పత్తులు విధిగా ఉంటాయి. మరింత గుర్తింపు లభిస్తుంది ఒక జిల్లా – ఒక ఉత్పత్తి కింద బనగానపల్లె ఏరియాలో ఉత్పత్తి అవుతున్న చేనేత వస్త్రాలకు జాతీయ అవార్డు కోసం ప్రతిపాదనలు పంపాం. జాతీయ స్థాయి అ వార్డు లభిస్తే ఇక్కడ ఉత్పత్తి అయ్యే వస్త్రాలకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. నంద్యాల జిల్లాలో చేనేత అభివృద్ధికి అవకాశం ఉంటుంది. – హరికృష్ణ, సహాయ సంచాలకులు చేనేత, జౌళిశాఖ, ఉమ్మడి కర్నూలు జిల్లా -
లారీ– బైక్ ఢీ
● ముగ్గురు విద్యార్థులకు గాయాలు తుగ్గలి: పదో తరగతి పరీక్షలు రాసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన శుక్రవారం జొన్నగిరి–గిరిగెట్ల మధ్య చోటు చేసుకుంది. సూర్యతండాకు గణేష్నాయక్, బాటతండాకు చెందిన రమావత్ చరణ్ నాయక్ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు సూర్యతండాకు చెందిన 9వ తరగతి విద్యార్థి ముడావత్ చరణ్తో కలిసి బైక్పై తుగ్గలి పరీక్షా కేంద్రానికి బయలు దేరారు. మార్గమధ్యలో గిరిగెట్ల సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ – బైక్ ఢీకొన్నాయి. ప్రమాదంలో విద్యార్థులు తీ వ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న కు టుంబ సభ్యులు బాధిత విద్యార్థులను గుత్తి ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సూర్యతండాకు చెందిన గణేష్నాయక్, ముడావత్ చరణ్నాయక్లను కర్నూలుకు తరలించారు. తుగ్గలి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
లోన్ ఇస్తామంటూ బురిడీ
● రూ.5 లక్షలు లోన్ ఇస్తామంటూ రూ.లక్ష కాజేసిన సైబర్ నేరగాళ్లు ● సైబర్ నేరగాళ్ల మోసానికి బలైన ఆదోనివాసి ఆదోని అర్బన్: లోన్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తిని బురిడీ కొట్టించారు. ప్రాసెసింగ్ ఫీజు పేరుతో విడతల వారీగా ఫోన్ పే ద్వారా రూ.1లక్ష కాజేసిన తర్వాత బాధితుడికి జ్ఞానోదయమైంది. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాలు.. స్థానిక ఇందిరా నగర్లోని ఎరుకల కాలనీకి చెందిన వెంకటరాముడికి ఈనెల 20న ఓ ఫోన్ వచ్చింది. తాము బజాజ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని, రూ.5 లక్షలు లోన్ ఇస్తామని నమ్మబలికారు. ప్రాసెసింగ్ ఫీజు కింద ముందు రూ.3,500 ఫోన్పే ద్వారా పంపాలని కోరారు. ఇలా వారు అడిగిన ప్రకారం మూడు రోజుల్లో విడతల వారీగా మొత్తం రూ.1.07 లక్షలు బాధితుడు ఫోన్ పే చేశాడు. ఇంత డబ్బు వేసినా కూడా లోన్ మంజూరు కాలేదని శుక్రవారం ఫోన్ చేసి ప్రశ్నించాడు. చివరిగా రూ.17 వేలు ఫోన్ పే చేస్తే రూ.5 లక్షల లోన్తో పాటు ఫోన్ పే చేసిన మొత్తం అమౌంట్ వేస్తామని చెప్పడంతో బాధితుడు మోసపోయానని తెలుసుకున్నాడు. స్థానిక త్రీటౌన్ పోలీస్స్టేషన్ను ఆశ్రయించాడు. ఈ విషయంపై త్రీటౌన్ సీఐ నరసింహరాజు మాట్లాడుతూ బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- స్వాతిమలివాల్పై దాడి.. కేజ్రీవాల్ సహాయకుడికి నో బెయిల్
- యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
- అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
- శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
- పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
- భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
- ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
- గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
- ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Advertisement