-
ఆంగ్ల ఆధ్యాత్మికవాది
ఒక మనిషి ఇంత రాయగలడా అని ఆశ్చర్యానికి గురిచేసే రచయిత జి.కె. చెస్టర్టన్. ఇరవయ్యో శతాబ్దపు ఈ సుప్రసిద్ధ ఆంగ్ల రచయితకు ఇది 150వ జయంతి సంవత్సరం. 1874 మే 29న లండన్లో జన్మించిన గిల్బర్ట్ కీత్ చెస్టర్టన్ నవలలు, కథలు, నాటికలు, కవితలు, సాహిత్య విమర్శ, కళా విమర్శ, చరిత్ర, వ్యాసాలతో సుమారు 80 పుస్తకాలను వెలువరించారు. ‘నెపోలియన్ ఆఫ్ నాటింగ్ హిల్’, ‘ద మ్యాన్ హూ వజ్ థర్స్డే’ ఆయన గొప్ప నవలలు. ‘ది ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్’ పత్రికకు ఏకంగా 30 ఏళ్లపాటు; ‘డైలీ న్యూస్’కు 13 ఏళ్లపాటు వీక్లీ కాలమ్స్ రాశారు. మొత్తంగా సుమారు 4,000 వ్యాసాలు! ఆరడుగుల నాలుగు అంగుళాల ఎత్తు, 130 కిలోల బరువుండే ఈ భారీకాయుడు స్టేషన్లలో కూడా రాసేవారు. రాతలో ఎంతగా మునిగిపోయేవాడంటే, ప్రతిసారీ ఎక్కాల్సిన రైలును మిస్సయ్యేవారు. పలు కార్యక్రమాల్లో తలమునకలుగా ఉంటూ, తర్వాత ఏం చేయాలో మరిచిపోయేవారు. ఒకసారైతే, ‘హార్బరో మార్కెట్లో ఉన్నాను. నేనెక్కడ ఉండాల్సింది?’ అని భార్యకు టెలిగ్రామ్ పంపారు. భర్త అన్ని వ్యవహారాలనూ చూసుకునే ఫ్రాన్సెస్ ‘ఇంటికి వచ్చెయ్యండి’ అని జవాబిచ్చారు.‘ఆయన ప్రతిదాని గురించి ఎంతో కొంత, అలాగే దాన్ని అందరికంటే మెరుగ్గా చెప్పారు’ అంటారు చెస్టర్టన్ భావజాలాన్ని ప్రచారం చేయడానికి నెలకొల్పిన ‘అమెరికన్ చెస్టర్టన్ సొసైటీ’ సహవ్యవస్థాపకుడు డేల్ అహ్లిక్విస్ట్. క్రైస్తవ మతంలోని థీమ్స్, సింబాలిజం చెస్టర్టన్ రచనల్లో ఎక్కువగా కనబడతాయి. క్రైస్తవంలోని ప్రేమ, కారుణ్యం వైపు ఎందరినో ఆయన ఆకర్షించారు. నాస్తికుడైన బ్రిటిష్ రచయిత సి.ఎస్.లూయిస్ను తిరిగి క్రైస్తవుడిగా మారేట్టుగా చెస్టర్టన్ రచనలే ప్రభావం చూపాయి. సతతం విశ్వాసిగా మసలుకోవడమే కాక, ఎంతోమందిని విశ్వాసం వైపు మళ్లించడం, శత్రువులను కూడా ద్వేషించకపోవడం వంటి అంశాలను చూపుతూ చెస్టర్టన్ బీటిఫికేషన్కు యోగ్యమైన కారణాలున్నాయని వాదిస్తారు క్యాథలిక్ రచయిత జోసెఫ్ పియర్సీ. భిన్న భావజాలానికి చెందిన జార్జ్ బెర్నార్డ్ షా, హెచ్.జి.వెల్స్, బెర్ట్రాండ్ రసెల్ లాంటి రచయితలతో విభేదిస్తూ చెస్టర్టన్ తీవ్రమైన వాదాలు జరిపేవారు. అయినా వాళ్ల స్నేహం చెడలేదు. శత్రువును కూడా ప్రేమించమనే భావనే ఆయన్ని అలా మసలుకునేట్టు చేసింది. ఆయన ఈ ప్రేమగుణంలోంచి పుట్టిందే ప్రీస్ట్ డిటెక్టివ్ ‘ఫాదర్ బ్రౌన్’ పాత్ర. శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా కేసులను పరిశీలించే షెర్లాక్ హోమ్స్లా కాకుండా అనుమానం, ఆధ్యాత్మిక అవగాహనల ఊతంతో నేరస్థుల మనసుల్లోకి చొచ్చుకెళ్లి వారిని పట్టుకుంటాడు ఫాదర్ బ్రౌన్. చెస్టర్టన్ పారిశ్రామికీకరణను వ్యతిరేకించారు. ధార్మిక జీవితాన్ని ప్రవచించారు. ఐరిష్ జాతీయోద్యమానికి ఊతమిచ్చారు. ఐరిష్ ప్రజలు ఇంగ్లిష్వారికి భిన్నమైనవారనీ, వారు తమవైన సంప్రదాయాలను కాపాడుకుంటూ తమ సొంత దేశంలో సొంత విధానంలో స్వతంత్ర పాలనకు అర్హులనీ వాదించారు. అయితే, ఆయన్ని ఇరవయ్యో శతాబ్దపు విలువైన థింకర్గా పరిగణించడానికి ఒక కారణం– ‘డిస్ట్రిబ్యూటిజం’ (పంపిణీవాదం)ను ఆయన ఎత్తుకున్న తీరు! చెస్టర్టన్ సోదరుడు సీసిల్, అతడి స్నేహితుడు హిలైర్ బెల్లోక్ ‘డిస్ట్రిబ్యూటిజం’ ఆర్థిక తత్వాన్ని వృద్ధి చేశారు. మొదటి ప్రపంచ యుద్ధంలో సీసిల్ చనిపోయాక చెస్టర్టన్ దీనికి ప్రధాన ప్రచారకర్తగా మారడమే కాక, ప్రధానంగా ఈ భావధార ప్రచారం కోసం ‘జీకేస్ వీక్లీ’ నడిపారు. నియంత్రణ లేని క్యాపిటలిజం, సోషలిజాలకు భిన్నమైన మూడో పంథాగా ఉంటూ, ఆస్తులు, రాజకీయాధికారాల పంపిణీ జరగాలంటుంది ఈ వాదం. ‘మూడు ఎకరాలు – ఆవు’ అనేది వీరి స్లోగన్.సూత్రప్రాయంగా జాతీయవాదానికి చెస్టర్టన్ వ్యతిరేకి కాకపోయినా, తన మూలాలను విస్మరించే జాతీయవాదానికి అర్థం లేదంటారు. అందుకే భారత జాతీయోద్యమాన్ని ‘అది భారతీయమూ కాదు, అంత జాతీయమూ కాదు’ అని నిరసించారు. 1909లో ‘ది ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్’లో చెస్టర్టన్ రాసిన ఒక వ్యాసం మహాత్మా గాంధీ మీద ‘పిడుగుపాటు’లా పడింది. వెంటనే దానికి చిన్న పరిచయం రాస్తూ ‘ఇండియన్ ఒపీనియన్’లో పునర్ముద్రింపజేశారు. ‘వాళ్ల దేశానికి మన పార్లమెంట్ కావాలి, మన జ్యుడీషియరీ కావాలి, మన పత్రికలు కావాలి, మన సైన్స్ కావాలి. భారత జాతీయవాదులు ఇవన్నీ కోరుకోవడమంటే వాళ్లు ఇంగ్లిష్వారిలా ఉండాలనుకుంటున్నారు’ అన్నారు చెస్టర్టన్. అది సహేతుకమని గాంధీజీ బలపరుస్తూ, ‘స్వతంత్రంగా ఉండాలంటే ఇండియా తనకు తానుగా ఉండాలి, బ్రిటన్లా మారకూడదు. అదే పనిగా అనుకరిస్తే మన దేశం హిందుస్థాన్ కాదు, ఇంగ్లిషిస్థాన్ అవుతుంది’ అని రాశారు.విస్తృతిలో, భావధారలో తెలుగు సాహిత్య శిఖరం విశ్వనాథను కొంతవరకూ స్ఫురింపజేసే చెస్టర్టన్కు రావాల్సినంత కీర్తి రాలేదన్నది కొందరి వాదన. ఇరవయ్యో శతాబ్దపు గొప్ప రచయిత, ఆలోచనాపరుడు అయినా చెస్టర్టన్ విస్మరణకు గురికావడానికి ఆయన అన్ని రకాలుగా రాయడమే కారణమన్నది దీనికి వివరణ. ‘ఒక్కమాటలో రచయితలు ఫలానా వర్గంలోకి ఇట్టే ఒదగకపోతే వాళ్లు చీలికల్లోంచి కిందికి జారిపోయే ప్రమాదం ఉంది’ అంటారు అహ్లిక్విస్ట్. అయినా ఆయన్ని తలకెత్తుకునేవాళ్లు ఉంటూనే ఉన్నారు. చెస్టర్టన్ను ఎడ్గార్ అలెన్ పోతో పోల్చారు బోర్హెస్. ‘చెస్టర్టన్కు ప్రపంచం తగినంత కృతజ్ఞత చూపలే’దని అన్నారు జార్జ్ బెర్నార్డ్ షా. అయితే జాన్ పైపర్ వ్యాఖ్యానం చెస్టర్టన్కు తగిన నివాళి: ‘చెస్టర్టన్ కోసం నేను దేవుడికి కృతజ్ఞత చెబుతాను’ అన్నారాయన. -
Belli Lalitha: ముక్కలైన దేహానికి పాతికేళ్లు
పాటనే జీవితంగా మలుచుకొని చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించింది తెలంగాణ గానకోకిల బెల్లి లలిత. 1972 ఏప్రిల్ 29న భువనగిరిలో నిరుపేద కుటుంబంలో జన్మించింది. చదువులేని ఆమె పొట్టకూటి కోసం స్థానిక కాటన్ స్పిన్నింగ్ మిల్లులో కార్మికురాలిగా చేరింది. ఈ క్రమంలోనే సీఐటీయూలో సభ్యత్వం తీసుకొని కార్మిక హక్కుల సాధన కోసం పోరాడింది. అనంతరం ‘భువనగిరి సాహిత్య మిత్ర మండలి’లో చేరి ప్రజా సమస్యల పరిష్కారానికి పాటను తన అస్త్రంగా మార్చుకుంది. ‘తాగబోతే నీళ్లు లేవూ తుమ్మెదాలో... తడి గొంతూలారిపాయే తుమ్మెదాలో!’ అంటూ ఫ్లోరైడ్ నీటి సమస్యలపై గళమెత్తింది. 1996లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ ‘తెలంగాణ ఐక్య వేదిక’ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 1997 మార్చి 8న భువనగిరిలో జరిగిన ‘దగాపడ్డ తెలంగాణ’ సభలో బెల్లి లలిత కీలక భూమిక పోషించింది. ఆ తర్వాత 1997 ఆగస్టు 11న బహుజన నేత మారోజు వీరన్న సూర్యాపేటలో నిర్వహించిన ‘తెలంగాణ మహాసభ’తో పాటు 1997 డిసెంబర్ 28న వరంగల్లో జరిగిన బహిరంగ సభలో లలిత తన గానంతో గర్జన చేసింది. పీపుల్స్వార్ సానుభూతిపరుల ‘తెలంగాణ జనసభ’ అనుబంధ విభాగమైన ‘తెలంగాణ కళా సమితి’ కన్వీనర్గా ఊరూరా తిరిగి ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత వివరించింది. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఉద్ధృతం అవుతుండటం ఆనాటి సమైక్య పాలకులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటికే ప్రజా గాయకుడు గద్దర్ పై కాల్పులు జరిపి, బహుజన నేత మారోజు వీరన్నను పొట్టన పెట్టుకున్నారు. ఈ తరుణంలో1999 మే 26న ఇంటి నుండి వెళ్ళిన లలిత తిరిగిరాలేదు. 1999 మే 29న దర్గాబావిలో శరీర భాగాలు ఉన్నాయన్న వార్తతో భువనగిరి ఉలిక్కి పడింది. పదమూడు రోజులు గాలించగా పలు బావులు, చెరువుల్లో 17 ముక్కలైన లలిత శరీర భాగాలు లభ్యమయ్యాయి. 1999 జూన్ 11న జరిగిన అంత్యక్రియలకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. నాటి పాలకులే... మాజీ నక్సలైట్ను ఆయుధంగా మార్చుకొని లలితను పాశవికంగా హత్య చేయించారని ప్రజా సంఘాలు నిరసించాయి. ఆరు దశాబ్దాల ఆకాంక్షకై 17 ముక్కలైన లలిత అమరత్వానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ కనీస గౌరవం దక్కలేదు. – పి. నరేష్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి(నేడు బెల్లి లలిత 25వ వర్ధంతి) -
బొటాబొటిగా జాతీయం!
చండీగఢ్ టూ పట్నా. జాతీయ రాజకీయాలకు ఆయువుపట్టు. సారవంతమైన గంగా–యమునల మైదాన ప్రాంతం ఇదే. కొద్దిగా సింధూ బేసిన్ కూడా ఇందులో చేరి ఉండవచ్చు. కాస్త విస్తరిస్తే ‘కౌబెల్ట్’ అని కూడా పిలుస్తాము. మనం ఏ రకమైన మాంసం తినాలో, ఏ రకమైనది తినకూడదో తెలియజెప్పే కౌబాయ్స్కు ఇది పరమ పూజనీయమైన ప్రాంతం. అనాదిగా పిలుచుకుంటున్నట్టు ‘ఆర్యావర్తం’ కూడా ఇదే! ఈ ప్రాంతం మీద పట్టు సాధించకుండా దేశంలో రాజ్యాధికారాన్ని సంపాదించడం చాలా కష్టం.మొదటి ఐదు సాధారణ ఎన్నికల్లో ఆర్యావర్తం, ద్రవిడదేశం అనే తేడాల్లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరిచింది. ఆరోసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ జైత్రయాత్రకు కళ్లెం వేసిన జనతా పార్టీ మాత్రం అచ్చంగా ఉత్తరాది పార్టీయే! అప్పుడు జనతా పార్టీకి 295 లోక్సభ స్థానాలు దక్కాయి. ఇందులో వింధ్య పర్వతాలకు దిగువన గెలిచిన సీట్లు రెండు డజన్లు దాటలేదు. అవి కూడా ప్రధానంగా మహారాష్ట్రలో గెలిచినవే!భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి గడచిన పదేళ్లుగా అధికారంలో ఉన్నది. అయినప్పటికీ ఒక్క కర్ణాటక మినహా మిగిలిన దక్షిణాదిలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. ఈసారి అదనంగా తెలంగాణపై కూడా ఆశలు పెట్టుకున్నది. కానీ, మూడోసారి వరసగా అధికారాన్ని చేపట్టాలంటే కచ్చితంగా గోమాత ప్రాంతమే కాషాయ దళాన్ని కరుణించి కాపాడాలి. గత ఎన్నికల్లో భారీ సీట్లను ప్రసాదించిన ఈ ప్రాంతంలో బలమైన గండి పడితే మాత్రం ఇతర ప్రాంతాలు పూడ్చగలిగే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఈసారి కూడా ఆర్యావర్తం బీజేపీని గట్టెక్కిస్తుందా లేదా అన్నదే ముఖ్యమైన ప్రశ్న.చండీగఢ్ నుంచి హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ల మీదుగా బీహార్లోని పట్నా వరకు మొత్తం 157 స్థానాలను అప్పట్లో జనతా పార్టీ క్లీన్స్వీప్ చేసింది. ఇప్పటికీ అదే రికార్డు. ఇందిరాగాంధీ హత్యానంతరం వెల్లువెత్తిన సానుభూతి ప్రభంజనం (1984)లో కూడా ఈ రికార్డు చెక్కుచెదరలేదు. అప్పుడు యూపీ, బీహార్లలో ఎనిమిదిమంది ఇతర పార్టీల వారు గెలిచారు. కొత్త రాష్ట్రాలుగా అవతరించిన ఉత్తరాఖండ్, జార్ఖండ్లను కూడా కలుపుకొంటే ఇదే ప్రాంతంలో బీజేపీకి 2019లో 113 సీట్లు దక్కాయి. ఎన్డీఏ భాగస్వాములతో కలిసి 131 సీట్లలో గెలిచారు.ఇప్పుడా సంఖ్యను బీజేపీ నిలబట్టుకోగలదా? రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్లను కూడా కలిపి చూస్తే కౌబెల్ట్ పూర్తవుతుంది. ఇందులో రాజస్థాన్ (25), గుజరాత్ (26), హిమాచల్ (4)లో అప్పుడు బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. మధ్యప్రదేశ్ (29)లో 28, ఛత్తీస్గఢ్ (11)లో 9 సీట్లను గెలుచుకున్నది. ఈ దూకుడును ఇప్పుడు కూడా ప్రదర్శించగలుగుతుందా? దాదాపు 90 శాతం స్ట్రయిక్ రేట్తో విజృంభిస్తేనే కౌబెల్ట్లో బీజేపీ తన బలాన్ని నిలబెట్టుకోగలుగుతుంది.ఈ ప్రాంతంలో బలమైన సామాజిక వర్గాలుగా పేరున్న రాజ్పుత్, జాట్, యాదవ కులాలు బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఓబీసీ రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తున్న జాట్ నాయకులు రాజస్థాన్, హర్యానాల్లో ఇప్పటికే ‘ఇండియా’ కూటమికి మద్దతు ప్రకటించారు. పశ్చిమ యూపీలోని జాట్లు మాత్రం చరణ్సింగ్ పరివారానికి చెందిన ఆర్ఎల్డీతోనే ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ పార్టీ ఎన్డీఏలో చేరినందువల్ల యూపీ జాట్ల మద్దతు బీజేపీకి లభించవచ్చు.ఉత్తరాదిలో తొలి నుంచీ బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్న రాజ్పుత్ల తాజా వైఖరి ఆ పార్టీని కొంత కలవరపరుస్తున్నది. ఈ వర్గానికి ప్రాతినిధ్యం వహించే కర్ణిసేన సభ్యులు బహిరంగ సభలు పెట్టి మరీ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపునిస్తున్నారు. రాజ్పుత్ వర్గం మీద వీరి పిలుపు ప్రభావం చూపితే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలోని కనీసం 30 నియోజకవర్గాల్లో బీజేపీకి నష్టం జరిగే అవకాశం ఉన్నది. రాజ్పుత్ వర్గానికి చెందిన యోగీ బాబానే యూపీ సీఎంగా ఉన్నందువలన ఆ రాష్ట్రంలో పెద్దగా భయపడవలసిన అవసరం లేదని బీజేపీ భావిస్తున్నది.యూపీ, బీహార్లలో గణనీయమైన సంఖ్యలో ఉన్న యాదవులు చాలాకాలంగా ఎస్పీ, ఆర్జేడీల వెనుకనే సమీకృతమై ఉన్నారు. ఇప్పుడీ సమీకరణ మరింత సంఘటితంగా ఉన్నట్టు సమాచారం. అఖిలేశ్, తేజస్వీ యాదవ్లను వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రులను చేయాలనే పట్టుదల యువతలో కనిపిస్తున్నది. యాదవ వర్గం వ్యతిరేకతకు విరుగుడుగా యాదవేతర ఓబీసీలను మచ్చిక చేసుకుంటూ బీజేపీ ఇన్నాళ్లుగా నెట్టుకొస్తున్నది. బీజేపీ అధికారంలోకి వస్తే ఈసారి రిజర్వేషన్లు ఎత్తివేస్తారని జరిగిన ప్రచారం వల్ల ఈ వర్గం మద్దతును కూడా ఎంతోకొంత బీజేపీ కోల్పోవచ్చనే అభిప్రాయం బలపడుతున్నది. రిజర్వేషన్లు ఎత్తివేసే ఆలోచన తమకు లేదని ప్రధాని సహా పలువురు నేతలు వివరణ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.వాజ్పేయి హయాంలోని ఎన్డీఏ సర్కార్ చేసుకున్న ‘షైనింగ్ ఇండియా’ ప్రచారం వికటించినట్టుగానే మోదీ సర్కార్ చేస్తున్న ‘వికసిత భారత్’ కూడా వికటిస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. ఉపాధి రంగం దారుణంగా దెబ్బతిన్నది. పెద్దనోట్ల రద్దు, కోవిడ్ వరస దెబ్బలతో కుదేలైన చిన్న వర్తకులు ఇప్పటికీ కోలుకోలేదు. నిరుద్యోగిత రేటుపై నిన్ననే విడుదలైన పీరియాడిక్ లేబర్ శాంపుల్ సర్వే నివేదిక నిరాశాజనకంగానే ఉన్నది. ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో 38 శాతం మందికి క్యాంపస్ ప్లేస్మెంట్లు లభించలేదని వచ్చిన తాజా వార్త పరిస్థితికి అద్దం పడుతున్నది.ఉత్తరాది రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతకు సైనిక బలగాల్లో చేరడం ఒక ప్రత్యామ్నాయం. అందులో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నివీర్’ పథకం ఈ యువతను తీవ్రంగా నిరాశపరిచింది. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై ప్రపంచస్థాయి ఆర్థికవేత్తలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్స్ఫామ్ వంటి సంస్థలు క్రమం తప్పకుండా ఇచ్చే నివేదికల్లో ఈ అన్యాయాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఒకే దేశంలోని మనుషుల మధ్య వంద రెట్లు, వేయి రెట్లు కాదు లక్షల రెట్ల ఆర్థిక తారతమ్యాలు వెక్కిరిస్తున్నాయి.2012 నుంచి 2021 మధ్యకాలంలో భారత జాతి సృష్టించిన సంపదలో నలభై శాతం సొత్తు జనాభాలోని ఒకే ఒక్క శాతం కుబేరుల జేబుల్లోకి వెళ్లింది. యాభై శాతం మంది అడుగు జనాభా దోసిళ్లలో ఎంగిలి మెతుకులు రాలిపడ్డట్టు ఒకే ఒక్క శాతం సొమ్ము ఉమ్మడిగా జారిపడింది. దీన్నే కొందరు ’ట్రికిల్ డౌన్ థియరీ’గా పిలుచుకుంటున్నారు. ఈ రకమైన ఆర్థిక విధానాలతో ఎన్డీఏ రాజ్యమేలుతున్నది.ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే శామ్ పిట్రోడాతో సహా పలువురు ఆర్థికవేత్తలు కూడా దేశంలో వారసత్వ పన్ను విధించాలన్న ప్రతిపాదన చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి ఇటువంటి సూచనలపై విస్తృతమైన చర్చను ఆహ్వానించడం అవసరం. కానీ, పిట్రోడాకు ఉన్న కాంగ్రెస్ సంబంధాలను ఆసరా చేసుకొని స్వయంగా ప్రధానమంత్రే ఎదురుదాడికి పూనుకున్నారు. ‘ప్రతిపక్షం అధికారంలోకి వస్తే మీరు సంపాదించుకున్న సొమ్మును లాగేసుకుంటారట’ అంటూ రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారు. ఈ ప్రచారం బీజేపీకి మేలు చేసిందా... కీడు చేసిందా అనే విషయం ఓట్ల లెక్కింపు తర్వాత తేలిపోనున్నది.ఈ రకమైన సామాజిక – ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తన కంచుకోటలను ఏ మేరకు కాపాడుకోగలదన్న చర్చ జరుగుతున్నది. ప్రభుత్వానికి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఎటువంటి గాలి లేదని అభిప్రాయపడిన పక్షంలో గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కలిపి సుమారు 50 స్థానాలను బీజేపీ చేజార్చుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వీటితోపాటు మహారాష్ట్ర, కర్ణాటకల్లో కూడా గత ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలనే సాధించింది. ఈసారి రెండు రాష్ట్రాల్లో కనీసం 15 స్థానాల వరకు ఆ పార్టీ పోగొట్టుకోవచ్చనే అంచనాలున్నాయి.శరద్ పవార్, బాల్ఠాక్రేలు స్థాపించిన పార్టీలను చీల్చడం బీజేపీకి కలిసివచ్చే అంశం కాదనే అభిప్రాయం మహారాష్ట్రలో ఉన్నది. ఎన్నికల హామీల అమలులో చతికిలబడ్డ కర్ణాటక కాంగ్రెస్కు బీజేపీ మిత్రపక్షం జేడీఎస్ మళ్లీ ఊపిరిపోసింది. దేవెగౌడ పౌత్రరత్నం చేసిన నిర్వాకంపై కన్నడిగులు మండిపడుతున్నారు. ఇక బెంగాల్, ఒడిషా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఓ పదిహేను స్థానాలను బీజేపీ అధికంగా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కోల్పోయే అవకాశం ఉన్న సీట్లు 65 అనుకుంటే, అదనంగా తెచ్చుకునే సీట్లు పదిహేను వరకు ఉండవచ్చని అంచనా. అంటే కనీసం యాభై సీట్లను బీజేపీ నికరంగా కోల్పోతుంది.వ్యతిరేక గాలి బలంగా లేకపోతేనే గత ఎన్నికలతో పోలిస్తే యాభై స్థానాలను బీజేపీ కోల్పోవచ్చు. కూటమిలోని మిత్రపక్షాలన్నీ ఉమ్మడిగా మరో పాతిక, ముప్పయ్ సీట్లను గెలవచ్చు. ఇది దాదాపు తొంభై శాతం స్థానాలకు పోలింగ్ పూర్తయిన తర్వాత పరిశీలకుల్లో నెలకొని ఉన్న అభిప్రాయం. అంటే బొటాబొటి మెజారిటీతో ఎన్డీఏ మూడోసారి గద్దెనెక్కడానికి అవకాశాలు ఉన్నాయనుకోవాలి. బీజేపీకి సొంతంగా 370 సీట్లు కావాలనీ, కూటమికి 400 సీట్లు కావాలని ప్రధానమంత్రి చేసిన అభ్యర్థనను జనం పట్టించుకోలేదు. మూడింట రెండొంతుల మెజారిటీ లభిస్తే ఈ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చడానికి వెనకాడదనే వాదనను జనం విశ్వసిస్తున్నారనే అనుకోవాలి.విశ్వసనీయమైన ప్రత్యామ్నాయం, సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులో ఉండి ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రజలు కచ్చితంగా ఓడించేవారే. ప్రజల ఆకాంక్షలకు, ప్రభుత్వ విధానాలకు మధ్యన ఓ పెద్ద అగాధమే ఉన్నది. కానీ, ఇండియా కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన పార్టీగా మిగిలిపోయింది. సాధారణ మెజారిటీకి అవసరమైన 272 స్థానాల్లో కనీసం సగం సీట్లను కూడా కాంగ్రెస్ గెలవగలదన్న నమ్మకం ఎవరికీ లేదు. ఈ పరిస్థితుల్లో అతుకుల బొంతతో అస్థిర ప్రభుత్వ ప్రయోగాలకు మెజారిటీ ప్రజలు సిద్ధపడకపోవచ్చు. పార్టీ అధ్యక్షుడు ఖర్గేను ప్రధాని పదవికి ప్రతిపాదించి ఉంటే కూటమి సభ్యుల ఆమోదం లభించేది. సాహసోపేతమైన ఈ ప్రయోగాన్ని దేశ ప్రజలు స్వాగతించేవారు. కానీ రాహుల్గాంధీ మాటల్లో కనిపించేంత ఔదార్యం, అభ్యుదయం చేతల్లో కనిపించవు. అదే విషాదం. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో సెంచరీ కొట్టే ఒక మంచి అవకాశం దొరికింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిద్దాం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
కిర్గిజిస్తాన్ భద్రమేనా!
ఉపాధి కోసమో, విద్యార్జన కోసమో మనదికాని చోటుకు పిల్లలను పంపినప్పుడు కన్నవాళ్ల హృదయం వారి కోసం నిత్యం ఆరాటపడుతుంది. సక్రమంగా ఉన్నారా, తిన్నారా అన్న ఆలోచనలే అనుక్షణమూ వారిని వేధిస్తుంటాయి. ప్రపంచం మునపట్లా లేదు గనుక ఇటువంటి భయాందోళనలు ఇప్పుడు మరింత పెరిగాయి. దేశంలో ఉన్నత విద్యారంగం, మరీ ముఖ్యంగా వైద్య విద్య బాగా విస్తరిస్తే అందరికీ అందుబాటులోకొస్తే మన విద్యార్థులు దూరతీరాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలా లేకపోబట్టే విద్యార్థులు అనుకోకుండా జరిగే పరిణామాల్లో చిక్కుకుని అవస్థలు పడాల్సివస్తోంది. రెండున్నరేళ్లక్రితం ఉన్నట్టుండి ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ యుద్ధానికి తెగబడినప్పుడు అక్కడి మన వైద్య విద్యార్థులు ప్రాణాపాయంలో చిక్కుకోవటం, ఇబ్బందులు పడటం చూశాం. మన దేశంతోపాటు అన్ని దేశాలూ తమ తమ విద్యార్థులను సురక్షితంగా వెనక్కు తీసుకెళ్లగలిగాయి. సరిగ్గా వారం క్రితం కిర్గిజిస్తాన్లోనూ విద్యార్థులకు సమస్య ఎదురైంది. ఈనెల 13న పాకిస్తాన్, ఈజిప్టు విద్యార్థులతో ఏర్పడిన తగవు ఆసరా చేసుకుని వందలాదిమంది స్థానికులు విద్యార్థుల హాస్టళ్లపై విరుచుకుపడి ధ్వంసం చేశారు. అనేకమంది విద్యార్థులను గాయపరిచారు. విద్యార్థినులను సైతం వేధించటం, దౌర్జన్యం చేయటంతో ఎప్పుడేమవుతుందో తెలియక విద్యార్థులంతా ఏడెనిమిది గంటలపాటు చీకటి గదుల్లో ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. పోలీసులు రంగంలోకి దిగినా దుండగులను అదుపు చేయలేకపోయారు. ఆ తర్వాత అరెస్టులు జరిగాయి. అది వేరే సంగతి. హాస్టళ్లకూ, విదేశీ విద్యార్థులుండే అపార్ట్మెంట్లకూ రక్షణ కల్పిస్తున్నారు. కానీ ఘటన జరిగివారం కావస్తున్నా ఎక్కడా భయాందోళనలు చల్లారలేదు. దాంతో స్వస్థలాలకు పోవటమే ఉత్తమమని శుక్రవారం కూడా వందలాదిమంది పాకిస్తానీ విద్యార్థులు ఇంటి బాట పట్టారు. వారి ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. మన విదేశాంగశాఖ మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే బిషెక్లోని మన రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరింది. వేరే దేశాలకు పోయినప్పుడు అక్కడి భాష, సంస్కృతీ సంప్రదాయాలు, పద్ధతులపై అవగాహన పెంచుకుని వాటిని గౌరవించటం అలవాటు చేసుకోవాలి. తమ దేశానికి చెందినవారితోనే సన్నిహితంగా మెలగటం, స్థానికులను చిన్నచూపు చూసే స్వభావం అనవసరమైన అపార్థాలకు దారితీస్తుంది. తమ సంస్కృతే ఘనమైనదని, ఇతరులు అల్పులన్న భావన స్వదేశంలో ఎంతోకొంత చెల్లుబాటవుతుంది. వేరేచోట మాత్రం సమస్యలు తెస్తుంది. దీన్ని గుర్తించబట్టే విశ్వవిద్యాలయాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. స్థానికులతో కలిసిమెలిసివుండేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. కిర్గిజిస్తాన్లో మూడేళ్లక్రితం కూడా గొడవలు జరిగాయి. అప్పుడూ ఇప్పుడూ కూడా పాకిస్తాన్ విద్యార్థులే గొడవలకు కారకులయ్యారు. రౌడీయిజం, స్థానిక సంప్రదాయాలను కించపరచటం, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనటం వంటివి సమస్యలు తెచ్చిపెడుతున్నాయన్నది స్థానికుల ఆరోపణ. సాధారణంగా ఒకరిద్దరి ప్రవర్తన వల్ల గొడవ జరిగితే అది వారికే పరిమిత మవుతుంది. ఎవరో ఒకరి జోక్యంతో అంతా సద్దుమణుగుతుంది. కానీ సామాజిక మాధ్యమాల హవా పెరగటం, ఆ గొడవ తాలూకు వీడియో క్షణాల్లో అందరికీ చేరటం భావోద్వేగాలను రెచ్చగొడుతోంది. ఉద్రిక్తతలు రేపుతోంది. దీనికితోడు విదేశీ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు తమకు లేకపోవటం, వారి జీవన ప్రమాణాలు మెరుగ్గా కనబడటం ఆర్థికంగా అంతంతమాత్రంగా బతుకీడ్చే స్థానికులకు సహజంగానే ఆగ్రహం కలిగిస్తుంది. తమను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణిస్తూ విదేశీ విద్యార్థులను అందలం ఎక్కించటం అసంతృప్తికి దారితీస్తుంది. పుండు మీద కారం జల్లినట్టు వారిని కించపరచటం లాంటి చేష్టలకు పాల్పడితే ఇక చెప్పేదేముంది? ఇలాంటి సమయాల్లో కారకులెవరన్న విచక్షణ ఉండదు. విదేశీయులందరినీ ఒకే గాటనకడతారు. కనుక ఎవరికి వారు పద్ధతిగా ఉంటే సరిపోదు. తోటి విద్యార్థులపై ఓ కన్నేసివుంచాలి. సమస్య తలెత్తవచ్చన్న సందేహం కలిగితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. నిజానికి మధ్య ఆసియా దేశమైన కిర్గిజిస్తాన్ వేరే దేశాలతో పోలిస్తే ఎంతో ప్రశాంతమైనది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. స్థానికులు ప్రధానంగా సంచార జీవనానికి అలవాటుపడినవారు. విదేశీ అతిథులను ఆదరించటం, గౌరవించటంలో వారు ఎవరికీ తీసిపోరు. కిర్గిజిస్తాన్ విద్యాలయాల్లో మన విద్యార్థులు 15,000 మంది ఉంటారని అంచనా. పాకిస్తాన్ నుంచి వచ్చినవారి సంఖ్య 11,000. వీరుగాక ఇంకా బంగ్లాదేశ్, కొన్ని అరబ్, ఆఫ్రికన్ దేశాల నుంచి కూడా చదువుకోవటానికి వస్తారు. తమ దేశాల్లో వైద్య విద్య ఖరీదైన వ్యవహారంగా మారడమే ఇందుకు కారణం. పూర్వపు సోవియెట్ యూనియన్లో భాగం కావటం వల్ల పాశ్చాత్య దేశాలతో పోలిస్తే కిర్గిజిస్తాన్ వైద్య విద్య ఎంతో ప్రామాణికమైనది. అంతర్జాతీయంగా అనేక దేశాలతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు కూడా దానికివుంది. వేరే దేశాల్లో చదవాలని, ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలని తహతహలాడే పిల్లలు దూరాభారాలు లెక్కచేయక విదేశాలకు వెళ్తారు. కానీ ఇక్కడ చదువుకోవాలనుకునేవారికి మన వైద్యవిద్య అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవటం ప్రభుత్వాల బాధ్యత. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఈ విషయంలో ప్రత్యేకశ్రద్ధ పెట్టాయి. వేరే రాష్ట్రాలు కూడా ఆ పని చేయాలి. కేంద్ర ప్రభుత్వం అందుకు సహాయసహకారాలు అందించాలి. -
రిషి సాహసం!
వచ్చే జులై 4న బ్రిటన్ దిగువసభ ఎన్నికలు నిర్వహిస్తామంటూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ బుధవారం చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. కన్సర్వేటివ్ పార్టీ నిరంతరాయంగా పద్నాలుగేళ్లనుంచి అధికార పీఠాన్ని అంటిపెట్టుకుంది. అయిదేళ్ల గడువుకు అయిదు నెలల ముందే జరుగుతున్న ఈ ఎన్నికలు వారి పాలనకు చరమగీతం పాడతాయా, మరోసారి అందలమెక్కిస్తాయా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. కానీ కన్సర్వేటివ్లకు ఆ విషయంలో అనుమానం లేదు. ఓటమి ఖాయమన్న దిగులు ఆ పార్టీని ఆవరించింది. విశ్వవిఖ్యాత కవి, రచయిత విలియం షేక్స్పియర్ విరచిత ‘హామ్లెట్’ నాటకంలోని పాత్ర పలికిన ఆత్మగత సంభాషణలో ‘టు బీ ఆర్ నాట్ టు బీ...’ అందరికీ గుర్తుండిపోయే పదబంధం. బతకటమా, చావటమా అనే సందిగ్ధ స్థితిని అది చెబుతుంది. కన్సర్వేటివ్ పార్టీ ప్రస్తుతం ఆ సంకటస్థితిలోనే ఉంది. నిరుడు జులైలో దిగువ సభకు జరిగిన మూడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం ఒకటే గెల్చుకుంది. ఈ నెల మొదట్లో జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ దాని పరిస్థితి ఏమంత బాగులేదు. నిజానికి నిరుడూ, అంతకు ముందు సంవత్సరమూ దేశం అధిక ద్రవ్యోల్బణంతో కుంగిపోయింది. కానీ నెలరోజుల్లో ఉప ఎన్నికలుంటాయనగా అది చెప్పుకోదగ్గ మేర తగ్గింది. అయినా వోటర్లు కరుణించలేదు. మొన్న స్థానిక ఎన్నికల సమయానికి కూడా ఆర్థిక స్థితి మెరుగుపడిన సూచనలు కనబడ్డాయి. వృద్ధి రేటు బాగుందని జీడీపీ గణాంకాలు చాటాయి. ఆర్థిక మాంద్య ప్రమాదం తప్పిందన్న సంకేతాలు వెలువడ్డాయి. కానీ స్థానిక ఎన్నికల్లో జనం లేబర్ పార్టీవైపే మొగ్గారు. కన్సర్వేటివ్ పార్టీ రేటింగ్ కనీవినీ ఎరుగని రీతిలో 20 శాతానికి పడిపోయిందని, లేబర్ పార్టీ 44 శాతంతో ముందంజలో ఉన్నదని సర్వేలు చెబుతున్నాయి. బహుశా అందుకే కన్సర్వేటివ్ పార్టీ ఎంపీలూ, రిషి మంత్రివర్గ సహచరులూ గడువుకు ముందే పార్లమెంటు రద్దు చేయటం ప్రమాదకరమంటూ వాదించారు. అయితే రిషి సునాక్ లెక్కలు వేరు. సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు కొన్ని గంటల ముందు వెల్లడైన ఆర్థిక గణాంకాలు ఆయనకు ధైర్యాన్నిచ్చాయి. ద్రవ్యోల్బణం మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయిందని గణాంకాలు తేల్చాయి. 2022 అక్టోబర్లో 11.1 శాతం ఉన్న ద్రవ్యోల్బణం ప్రస్తుతం 2.3 శాతానికి దిగొచ్చింది. కన్సర్వేటివ్లు పెట్టుకున్న 2 శాతం లక్ష్యం కన్నా ఇది కాస్తా ఎక్కువే అయినా ఇంతకు మించి ఆశించకూడదన్న అభిప్రాయం అధికారపక్షంలో ఉంది. మరోపక్క అక్రమ వలసదారులను రువాండాకు సాగనంపే చట్టం ఆమోదం పొందాక ఆ తరహా వలసలు కొద్దో గొప్పో తగ్గాయి. ఈ నేపథ్యంలోనే రిషి అత్యుత్సాహంగా ఎన్నికల ప్రకటన చేశారు. అయితే ఈ పరిస్థితి నిలకడగా కొనసాగుతుందా... మళ్లీ దిగజారుతుందా అన్న సంశయం కన్సర్వేటివ్ శ్రేణులను పట్టి కుదుపుతోంది.అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా తప్పుడు సమాచారాన్ని జనం మెదళ్లకు ఎక్కించే ప్రయత్నం రివాజుగా మారింది. బ్రిటన్ కూడా అందుకు మినహాయింపు కాదు. దేశం ఎదుర్కొంటున్న సకల అరిష్టాలకూ యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో కొనసాగటమే కారణమన్న తప్పుడు ప్రచారాన్ని తలకెత్తుకున్నది కన్సర్వేటివ్ పార్టీయే. చివరకు వారి ఏలుబడిలోనే తప్పనిసరై ఆ తంతు ముగించారు. బ్రిటన్ స్వేచ్ఛాజీవి అయింది. అయినా ఆర్థిక ఒడుదొడుకులు దాన్ని పీడించాయి. అధిక ధరలు, నిరుద్యోగం పాలకపక్షాన్ని నిద్రపోనీయకుండా చేశాయి. వోటర్లలో కనబడిన అనాసక్తత వల్ల 2019 డిసెంబర్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవచ్చన్న అంచనాలు కూడా వచ్చాయి. కానీ అనూహ్యంగా కన్సర్వేటివ్ పార్టీ నికరమైన మెజారిటీతో బోరిస్ జాన్సన్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆర్థిక అవ్యవస్థను చక్కదిద్దలేక ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన స్థానంలో వచ్చిన లిజ్ ట్రస్ సైతం ప్రజల్ని నిరాశపరిచారు. కనుకనే ప్రధానిగా రిషి సునాక్ను కన్సర్వేటివ్ పార్టీ ఎంచుకుంది. కానీ పదవిలోకొచ్చింది మొదలు రిషికి సమస్యలు తప్పలేదు. జాన్సన్, ట్రస్ల మాదిరే ఆయనపై కూడా సాధారణ వోటర్లలో ఏవగింపు మొదలైంది. వ్యక్తిగతంగా రిషి రేటింగ్ కూడా తీసికట్టే! సర్వేలన్నీ వరసబెట్టి దీన్నే చాటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు సిద్ధపడటమంటే ఏ ప్రధానికైనా ఆత్మహత్యాసదృశమే. కానీ రిషి తెగింపు వెనక కారణం ఉంది. ప్రత్యర్థి లేబర్ పార్టీకి వోటర్ల ఆదరణ బాగానేవున్నా వ్యక్తిగతంగా ఆ పార్టీ నాయకుడు కియర్ స్టార్మర్ పై ప్రజలకంత విశ్వాసం లేదు. అందుకే ఎన్నికలకు ఇంతకన్నా మంచి ముహూర్తం ఉండబోదన్న నిర్ణయానికి రిషి వచ్చివుండొచ్చు. దానికితోడు స్టార్మర్ ప్రధాన నినాదం ‘ఆర్థిక సుస్థిరత’. అది ఇప్పటికే సాధించినట్టు గణాంకాలు చెబుతుండగా ఆ నినాదానికి విలువుండదని రిషి నమ్మకం.రష్యా దురాక్రమణ యుద్ధం, గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ, ఇరాన్ దూకుడు... మరో ప్రపంచయుద్ధానికి దారితీస్తాయన్న భయాందోళనలు అన్నిచోట్లా ఉన్నట్టే బ్రిటన్లోనూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మితవాద పార్టీ కన్సర్వేటివ్లు అధికారంలో ఉండటమే ఉత్తమమన్న వాదనను ఆ పార్టీ తెరపైకి తీసుకొస్తోంది. సైనిక వ్యయాన్ని అదుపు చేస్తామన్న లేబర్ పార్టీ వాగ్దానం ప్రమాదకరమని కూడా ఆ పార్టీ ప్రచారం మొదలుపెట్టింది. కనుక రాబోయే ఎన్నికలు రక్షణ, భద్రత చుట్టూ తిరిగే అవకాశం లేకపోలేదు. తనకొచ్చిన అవకాశాన్ని లేబర్ పార్టీ సద్వినియోగం చేసుకుని అధికారంలోకి వస్తుందా లేక వోటర్లను ఒప్పించలేక చతికిలపడుతుందా అన్నది మరికొన్నాళ్లలో తేలిపోతుంది. -
నోటిదురుసుకు ఇదా శిక్ష!
నోరు పారేసుకునే అలవాటున్న నేతలకు ఎన్నికలు ఎప్పుడూ పండగే. ఊరూరా తిరుగుతూ ప్రత్యర్థులను ఇష్టానుసారం దూషించటం ఒక్కటే ఆ బాపతు నేతలకు తెలిసిన విద్య. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ రిటైర్మెంట్కు కొన్ని నెలల ముందు పదవికి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ అలాంటి నేతలను తలదన్నారు. ఆలస్యంగా వచ్చినా ‘అన్నీ నేర్చుకునే’ వచ్చారని నిరూపించుకున్నారు. న్యాయమూర్తులుగా పనిచేసినవారు వెనువెంటనే రాజకీయాల్లోకి రావొచ్చా లేదా అన్నది వేరే చర్చ. అసలు జస్టిస్ అభిజిత్ వంటివారిని రానీయొచ్చా అనే సదసత్సంశయం అందరిలోనూ కలిగేలా చేసిన ఘనుడాయన. ఆయన దూషణలు ఎంత హీనాతిహీనంగా ఉన్నాయంటే...అవి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పరువు తీస్తాయని, దేశాన్ని అపఖ్యాతిపాలు చేస్తాయని ఎన్నికల సంఘం(ఈసీ) వ్యాఖ్యానించింది. ఉన్నత విద్యావంతుడై, దీర్ఘకాలం వృత్తిలో కొనసాగిన ఒక బాధ్యతగల వ్యక్తి నుంచి ఇలాంటి చవకబారు మాటలు రావటం బాధాకరమన్నది. అయితే ఆయన దూషణలపై ఇంత తీవ్రంగా స్పందించిన ఈసీ, తీరా ఆయన్ను 24 గంటలపాటు ప్రచారంలో పాల్గొనరాదంటూ నిషేధం విధించి ఊరుకోవటం విడ్డూరంగానే అనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి గత గురువారం ఆయన దూషణలకు దిగారు. ‘మీ రేటెంత మమతాజీ...ఎంతకు అమ్ముడుపోయారు? మేకప్ వేసుకుంటున్నారు గనుక పది లక్షలా! అసలామె మహిళేనా అని సందేహం కలుగుతుంది’ అని ఆయన మాట్లాడారు. ఆ వెంటనే ఈసీకి తృణమూల్ ఫిర్యాదు చేసింది. గతంలో సమాచారం తెలుసుకోవటం, నిర్ధారించుకోవటం కష్టమయ్యేది. సామాజిక మాధ్యమాలొచ్చాక మరుక్షణంలోనే ప్రపంచానికి తెలిసిపోతోంది. ఎన్నికల సంఘం దీన్నంత సీరియస్గా తీసుకుంటే 24 గంటల్లో నివేదిక తెప్పించుకుని చర్య తీసుకోవటం కష్టం కాదు. కానీ ఈసీకి దాదాపు అయిదు రోజులు పట్టింది. ఈలోగా ఆయన ప్రచారమూ యథావిధిగా సాగింది. స్వీయసమర్థన సరేసరి.మన సమాజం స్త్రీలను గౌరవిస్తుందని, పూజిస్తుందని ఘనంగా చెప్పుకుంటాం. కానీ మహిళలపై సాగుతున్న నేరాలు గమనిస్తే ఆ విషయంలో సందేహం కలుగుతుంది. బయటికెళ్తే ఎదురయ్యే సమస్యల గురించి ఏ బాలికను అడిగినా, మహిళను అడిగినా చెప్తారు. వీటిని రూపుమాపే ప్రభుత్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కఠిన నిబంధనలతో చట్టాలు కూడా వస్తున్నాయి. కానీ ఆశించిన ఫలితాలేవి? చట్టాలు ఒక్కటే సమాజాన్ని మార్చలేవు. బాధ్యతాయుత స్థానాల్లో ఉంటున్నవారు సక్రమంగావుంటే ఇతరులకు అదొక సందేశమవుతుంది. కానీ వారే విచ్చలవిడి చేష్టలతో, మాటలతో చెలరేగుతుంటే వీధుల్లో తిరిగే పోకిరీలు ఇక నేర్చుకునేదేముంటుంది? మహిళలను కించపర్చటంలో జస్టిస్ అభిజిత్ మొదటివారు కాదు... బహుశా చివరివారు కూడా కాకపోవచ్చు. సాధారణ సందర్భాల మాటెలావున్నా కనీసం ఎన్నికలప్పుడైనా ఈసీ తీవ్రంగా స్పందిస్తే కొద్దో గొప్పో ఫలితం ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలు పెద్దగా పట్టనివారు సైతం ఎన్నికలప్పుడు ఆసక్తి చూపుతారు. అందువల్లే ఈసీ కఠినంగా ఉండాలి. ఎన్నికల ప్రచారంలో పాటించే మార్గదర్శకాలేమిటో తమ అభ్యర్థులకూ, పార్టీ ప్రచారంలో పాల్గొనే ఇతరులకూ తెలియజేయాలని బీజేపీ అధినేత జేపీ నడ్డాకు ఈసీ సూచించింది. ఆ పార్టీ దాన్నెంతవరకూ పాటించిందో తెలియదు. అయినా ఇది ఈసీ చెబితేగానీ తెలియనంత విషయమేం కాదు. పార్టీలకు మందీమార్బలం ఉంటుంది. వివిధ హోదాల్లో ఉండేవారంతా బాధ్యతలు పంచుకుని తీరికలేకుండా ప్రచారంలో తలమునకలైన అధినేతలకు అవసరమైన విషయాలను చేరేస్తుంటారు. కానీ వారెవరికీ జస్టిస్ అభిజిత్ సంస్కారహీనమైన మాటలు తప్పనిపించినట్టు లేదు. సరిగదా...‘ప్రధానిని విపక్షాలు అంటున్న మాటలు మీకు వినిపించటంలేదా...కళ్లూ, చెవులూ మూతబడ్డాయా?’ అని బీజేపీ రాజ్యసభ ఎంపీ సమిక్ భట్టాచార్య ఈసీని ప్రశ్నించారు. ‘కంటి వైద్య నిపుణులతో చూపు సరిచేయించుకోండి’ అని కూడా ఉచిత సలహా ఇచ్చారు. తమది విభిన్నమైన పార్టీ అని తొలినాళ్లలో చెప్పుకున్న రాజకీయ పక్షం నుంచి ఇలాంటి సమర్థనలు ఆశించగలమా? జస్టిస్ అభిజిత్ ఇప్పుడే కాదు... న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు సైతం విమర్శలు ఎదుర్కొన్నారు. మమత ప్రభుత్వంపై వెలువరించే తీర్పుల్లో ఆయన వ్యాఖ్యలు మితిమీరుతున్నాయన్న అభిప్రాయం ఉండేది. ఆయన్ను సమర్థించే మీడియా మాత్రం ‘ప్రజా న్యాయమూర్తి’ అనే భుజకీర్తులు తగిలించింది. అది వేరే సంగతి. చిత్రమేమంటే ఆయన తీర్పులను గట్టిగా సమర్థించి, ఎవరు ఎప్పుడు పునః సమీక్షించినా అవి ప్రామాణికమైనవని నిర్ధారణవుతుందన్నవారు సైతం బీజేపీలో చేరటం ద్వారా వ్యవస్థ విశ్వసనీయతను జస్టిస్ అభిజిత్ తీవ్రంగా దెబ్బ తీశారని అభిప్రాయపడ్డారు. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేవారినీ, మహిళల వ్యక్తిత్వహననానికి పాల్పడేవారినీ ఉపేక్షించటం, నామమాత్రపు నిషేధాలతో సరిపెట్టడం న్యాయం కాదు. అవసరమైతే పోటీకి అనర్హులను చేయటంవంటి కఠిన చర్యలకు సిద్ధపడితే తప్ప ఇటువంటి నేతలు దారికి రారు. చట్టసభల్లో ఎలాగూ ఆరోగ్యవంతమైన చర్చలకు తావుండటం లేదు. కీలకమైన నిర్ణయాలు సైతం మూజువాణి ఓటుతో గట్టెక్కి చట్టాలుగా మారి సామాన్యులపై సవారీ చేస్తున్నాయి. కనీసం ఎన్నికల సమయంలోనైనా ఏ పార్టీ చరిత్రేమిటో, ఎవరివల్ల తమకు మేలు కలుగుతుందో నిర్ధారించుకునే అవకాశం ప్రజలకివ్వటం అవసరం. అందుకు నోటిదురుసు నేతలను కట్టడి చేయటం ఒక్కటే మార్గం. -
ఏం జరగనుంది?
ప్రపంచమంతటినీ ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసిన ప్రమాదం... విన్న వెంటనే రకరకాల ఆలోచనలు, అనుమానాలు తలెత్తిన అనూహ్య ఘటన... ప్రతికూల వాతావరణంలో చిక్కుకోవడంతో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీమ్ రైసీ, విదేశాంగమంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహియన్లు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాయవ్య ఇరాన్లో ఆదివారం కుప్పకూలిందన్న వార్త పలు పాత, కొత్త విషయాలను ఏకకాలంలో స్ఫురణకు తెచ్చిన సంచలనం. అంతర్జాతీయ ఆంక్షలు, విమానాల నిర్వహణలో కష్టాల వల్ల ఇరాన్లో విమానయాన భద్రత దీర్ఘకాలంగా పెనుసవాలైంది. తాజా ఘటనతో ఆ సంగతి మళ్ళీ రుజువైంది. గగనయానంలో గతంలో పలువురు ప్రముఖుల దుర్మరణాల మొదలు రైసీ హయాంలో ఇరాన్ ప్రస్థానం, రానున్న కాలంలో వచ్చే మార్పుల వరకు అనేకం చర్చనీయాంశాలయ్యాయి.ఇరాన్ – ఇరాక్ యుద్ధం నాటి నుంచి తన విపరీత వర్తనతో వార్తల్లో ఉన్న సంప్రదాయవాద మతబోధకుడు రైసీ దేశాధ్యక్షపదవిని చేపట్టింది 2021లోనే! ఆయన కన్నా ముందు మితవాది అయిన హసన్ రోహానీ ఎనిమిదేళ్ళు ఆ పదవిలో ఉన్నారు. చర్చల ద్వారా మార్పు తేవాలనీ, దేశాన్ని సుసంపన్నం చేయాలనీ భావించిన రోహానీకి పూర్తి భిన్నమైన వ్యక్తి రైసీ. కరడుగట్టిన ఛాందసం, హిజాబ్ «ధారణ సహా సమాజంలో కఠిన నిబంధనల అమలు, వందలాది ఉరిశిక్షలతో అంతులేని అపకీర్తి సంపాదించుకున్నారు. నిజానికి, అమెరికా సహా ప్రపంచ దేశాలతో అణు ఒప్పందంపై 2015లో రోహానీ సంతకం చేశారు. కానీ, ఆనక అమెరికా అధ్యక్షపీఠమెక్కిన ట్రంప్ మాటతప్పి, 2018లో ఇరాన్పై మళ్ళీ ఆంక్షలు విధించేసరికి దేశంలో చెల్లని కాసయ్యారు.ఫలితంగా మితవాదుల్ని తోసిపుచ్చి, ఛాందసులు పట్టు బిగించారు. మానవ హక్కుల సంఘాలు సహా అందరూ వ్యతిరేకించడంతో అంతకు ముందు ఒకటికి రెండు సార్లు ఎన్నికల్లో నెగ్గలేకపోయినప్పటికీ, ఎట్టకేలకు 2021లో రైసీ పీఠమెక్కారు. దేశాధ్యక్షుడిగా ఆయన వ్యవహరించింది కొద్ది కాలమే! ఆయన హయాంలో పొరుగున ఉన్న అరబ్ దేశాలతో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. అదే సమయంలో ఇజ్రాయెల్తో, పాశ్చాత్య ప్రపంచంతో ఘర్షణలు మరింత పెరిగాయి. ప్రాణాలు తీసిన హెలికాప్టర్ చాలా పాతదంటున్నారు. పాశ్చాత్య దేశాల కఠిన ఆంక్షల కారణంగా కొత్త ఛాపర్లు, విమానాలను ఇరాన్ సమకూర్చుకోలేకపోయిందట. అమెరికా మాటెలా ఉన్నా... చైనా, రష్యాలతో సాయిలా ఫాయిలాగా ఉంటున్న దేశానికి, అందులోనూ అసంఖ్యాకంగా డ్రోన్లు సహా అపమిత ఆయుధ సంపత్తి గల దేశానికి పాత ప్రయాణ సాధనాలే గతి అయ్యాయంటే ఆశ్చ ర్యమే. ఏమైనా, ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు హమాస్, హెజ్బుల్లా లాంటి వాటికి కొండంత అండగా నిలిచి రైసీ అక్షరాలా అమెరికాకు కంటిలో నలుసయ్యారు. అందుకే, హెలికాప్టర్ ప్రమాదంలో కుట్ర కోణం ఉండవచ్చనే అనుమానాలు వినవచ్చాయి. ఇటీవలి పశ్చిమాసియా పరిణామాలు... ఆ అను మానాలకు బలమిచ్చాయి. తమపై దాడి చేసిన హమాస్కు పెద్ద అండ ఇరాన్ గనక తెగబడి ఇజ్రా యెల్ గుట్టుగా హత్య చేయించి ఉండవచ్చనే పుకార్లు షికారు చేస్తున్నాయి. పైగా, గాజా చర్యల్లో ఇజ్రాయెల్ను బాహాటంగా సమర్థిస్తూ, దానితో వ్యూహాత్మక సహకారమున్న అజర్బైజాన్కు రైసీ వెళ్ళి వస్తున్నప్పుడే ఘటన జరగడం గమనార్హం. అయితే అనుమానాలకు తగిన ఆధారాలు కానీ, కనీసం ఇరాన్ నుంచి ఆరోపణలు కానీ... ఏవీ ఇప్పటి దాకా బయటకు రాలేదు. ఫలితంగా, దురదృష్టకర ప్రమాదంలోనే ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం పాలయ్యారని ప్రస్తుతానికి భావించాలి.ప్రమాదంపై లోతుగా దర్యాప్తు జరిపి, నిజానిజాలను సమగ్రంగా బయటపెట్టాల్సిన బాధ్యత ఇరాన్దే! ఏమైనా, అమెరికా ఆంక్షలు, ఆర్థికరంగంలో ఇక్కట్లు, సమాజంలో అసంతృప్తి, నెత్తిన పశ్చిమాసియా కుంపటితో అస్తుబిస్తు అవుతున్న వేళ ఈ దుర్ఘటన ఆ దేశానికి అశనిపాతం. ఇక, ప్రస్తుతానికి దేశ ఉపాధ్యక్షుడికి తాత్కాలిక అధ్యక్ష హోదా ఇచ్చారు. యాభై రోజుల సంతాప దినాల తర్వాత ఇరాన్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఆ దేశంలో అధినాయకుడి (అలీ ఖమేనీ)దే ఆఖరు మాట. అయినా అధ్యక్ష పదవి సైతం కీలకమే! దేశీయ, ప్రాంతీయ అనిశ్చితులు ఎన్నో ఉన్నా, రైసీ దుర్మరణంతో ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ రాజకీయాల్లో, విధానాల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయనీ అనుకోలేం. హెలికాప్టర్ ప్రమాదఘటన ఇరాన్కు తీరని విషాదమే తప్ప, రాజకీయ సంక్షోభం కాదని విశ్లేషకులూ తేల్చేస్తున్నారు. అధినాయకుడైన ఖమేనీకి ఆశ్రితుడిగా, ఆయన మాటను ధిక్కరించే ఆలోచనైనా లేని అధ్యక్షుడిగా, ఎనభై అయిదేళ్ళ వయసు మీద పడ్డ ఆయనకు అరవయ్యో పడిలోని వారసుడిగా అందరూ భావించిన రైసీ హఠాన్మరణంతో ఒక అధ్యాయమైతే ముగిసింది. ఇరాన్ చరిత్రలో కొత్త అధ్యాయం ఏమిటి, వారసుడెవరన్నది చర్చ. ఈ వారసత్వ రాజకీయాల కొత్త కూర్పులో ఖమేనీ కుమారుడు సయ్యిద్ మొజ్తబా హుసేనీ పైకి వస్తారని ఓ అంచనా. ఇస్లామిక్ ధర్మశాస్త్ర పాలన (వెలాయత్ ఎ ఫకీ) పేరిట మతాచార్యులకు పెద్ద అయిన షియా ధర్మశాస్త్రవేత్త అధినాయకుడిగా కొనసాగే పద్ధతి 1979లో ఇస్లామిక్ విప్లవం అనంతరం ఇరాన్లో వచ్చింది. అధినాయకుడు, ఆ తర్వాతే దేశాధ్యక్షుడు వగైరా అన్న విధానంపై విమర్శలు, చట్ట బద్ధతపై ప్రశ్నలు, అధికారానికి అనేక సవాళ్ళు వచ్చినా ఇన్నేళ్ళుగా అది కొనసాగింది. 1989 నుంచి ఖమేనీ కనుసన్నల్లోనే ఇరాన్ నడిచింది. కానీ, మారుతున్న భౌగోళిక రాజకీయాలు, దీర్ఘకాలంగా అణిచిపెడుతున్నప్పటికీ పెరుగుతున్న అంతర్గత అసంతృప్తి లాంటివి ఈ ఇస్లామిక్ దేశం ముందున్న పెనుసవాళ్ళు. వాటిని అధినాయకత్వం ఎలా దీటుగా ఎదుర్కొంటుందో కచ్చితంగా ఆసక్తికరం. -
నిజాయతీ నిరూపించుకోండి!
సాక్షాత్తూ ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఓ మహిళపై దాడి జరుగుతుందని ఊహించగలమా? అదీ స్వయంగా సీఎంకు కుడిభుజం లాంటి సహాయకుడే ఆ దురాగతానికి పాల్పడ్డాడంటే నమ్మగలమా? అందులోనూ తనపై అలా దాడి జరిగిందని ఆరోపిస్తున్న వ్యక్తి అధికార పార్టీకే చెందిన పార్లమెంట్ సభ్యురాలు కూడా అయితే, అవాక్కవకుండా ఉండగలమా? ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్)కి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్ సొంత పార్టీ వారిపైనే గత వారంగా చేస్తున్న ఆరోపణలు సంచలనం రేపుతున్నది అందుకే. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళితే ఆయన పీఏ విభవ్ కుమార్ అమానవీయంగా దాడి చేసి, కొట్టరాని చోటల్లా కొట్టి బయటకు గెంటించారన్న ఆరోపణలు ఏ రకంగా చూసినా అసాధారణమైనవే. అందులోనూ ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో అరెస్టయిన కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన వెసులుబాటు ఆసరాగా తీహార్ జైలు నుంచి బయటకు వచ్చీ రాగానే ఈ పరిణామం సంభవించడం ఆయననూ, ఆయన పార్టీనీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విభవ్ అరెస్ట్, స్వాతి కథను బీజేపీ రాజకీయం చేస్తోందంటూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ముట్టడికి ఆప్ యత్నాలతో వ్యవహారం మరింత ముదిరింది. కేజ్రీవాల్కు విభవ్ నమ్మినబంటు. పార్టీ విస్తరణ సహా అనేక బాధ్యతలను అతనికి అప్పగించారు. కేజ్రీవాల్ ఇంటిలోని క్యాంప్ ఆఫీస్ మొదలు ఢిల్లీ సెక్రటేరియట్లోని సీఎం ఆఫీస్ వ్యవహారాల దాకా రోజువారీ కార్యకలాపాలన్నీ అతని చేతుల మీదే నడుస్తుంటాయి. ఈ క్రమంలో స్వాతికీ, అతనికీ మధ్య గతంలో ఏం జరిగింది, దాడి ఘటన రోజున అసలేమైంది లాంటి అనేక ప్రశ్నలకింకా స్పష్టమైన సమాధానాలు దొరకాల్సి ఉంది. ఆరోపణలు వచ్చిన మొదట్లో పెదవి విప్పకుండా ‘ఆప్’ ఆలసించింది. ఆనక స్వాతిపై దాడి జరిగిందని గతవారం అంగీకరించింది. తీరా ఇప్పుడేమో ఇదంతా రాజకీయ కుట్రంటోంది. అదీ విడ్డూరం. అలాగని స్వాతి గత చరిత్ర సైతం గొప్పదేమీ కాదు. గతంలో ఢిల్లీ మహిళా కమిషన్కు సారథ్యం వహించిన ఆమె ఆ పదవిలో ఉండగా నియామకాల్లో అక్రమాలకు పాల్పడినట్టు నిందలొచ్చాయి. ఆ వ్యవహారంలో అరెస్టు తప్పదంటూ కాషాయపార్టీ బ్లాక్మెయిల్ చేసిందంటున్నారు. ఆ భయంతోనే ఆమె ఈ దాడి కథ వినిపిస్తోందనేది ‘ఆప్’ వాదన. నిజానికి, స్వాతి కూడా కేజ్రీవాల్కు సన్నిహితురాలే. ఆమె రాజకీయంగా ఎదిగి, రాజ్యసభ సభ్యురాలు కావడమే అందుకు ఉదాహరణ. మరి ఎక్కడ కథ అడ్డం తిరిగిందన్నది ఇప్పుడు బయటకు రావాల్సి ఉంది. దాడి జరిగిందని చెప్పిన స్వాతి పోలీసు ఫిర్యాదుకు ఆలస్యం చేయడం, తీరా దర్యాప్తు మొదలయ్యాక రోజుకో రకం వీడియోలు, కథనాలు బయటకు రావడం చూస్తుంటే, విషయం పైకి కనిపిస్తున్నంత పారదర్శకంగా లేదన్న అనుమానమూ వస్తోంది. పోలీసులు నిష్పాక్షికంగా, లోతైన దర్యాప్తు చేసి, నిజాలు నిగ్గుతేల్చాలి. అనుమానాలు ఏమైనా, కారణాలు ఎలాంటివైనా ఒక మహిళపై భౌతిక దాడికి దిగి గాయపరచడం, దుర్భాషలాడడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. అలాగే, ఈ కేసులో సాక్షాత్తూ సీఎం ఇంటిలోని సీసీటీవీ దృశ్యాలు సహా సాక్ష్యాధారాలను మాయం చేసే ప్రయత్నం జరిగిందంటూ వస్తున్న వార్తలు సైతం పాలక వ్యవస్థపై సామాన్య ప్రజల నమ్మకానికి గొడ్డలిపెట్టు. మరోపక్క విదేశాల నుంచి విరాళాలపై నిషేధం ఉన్నప్పటికీ ‘ఆప్’కు విదేశీ నిధులు వచ్చాయనీ, దాతల పేర్లను ఆ పార్టీ మరుగున పెట్టిందనీ, విదేశీమారకద్రవ్య నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) నిబంధనల్ని ఉల్లంఘించిందనీ తాజా ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమాచారం అందించినట్లు సోమవారం బయటకొచ్చిన వార్తలు కేజ్రీవాల్నూ, ఆయన పార్టీనీ మరింత ఇరుకునపెట్టేవే. పైగా, దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలా ఒకదాని వెంట మరొకటిగా వివాదాలు రేగి, వివరణ ఇవ్వాల్సిన పరిస్థితిలోకి నెట్టడం ఏ రాజకీయ పార్టీ విశ్వసనీయతకైనా ఇబ్బంది తెస్తాయి. తాజా పరిణామాలు ‘ఆప్’నే కాక, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిని సైతం ఇరుకున పెట్టాయి. మద్యం పాలసీ మొదలు స్వాతి ఆరోపణలు, తాజా ఈడీ వెల్లడింపు వార్తల దాకా వేటి మీదా కాంగ్రెస్ సహా కూటమి పార్టీలేవీ గొంతు విప్పట్లేదు. తమ వైఖరి చెప్పట్లేదు. దేశంలో బీజేపీ దూకుడుకు కళ్ళెం వేసి, మోదీని గద్దె దించడానికి తగిన సమయమని భావిస్తున్న వేళ ఇది ఆ పార్టీలేవీ ఊహించని దుఃస్థితి. ‘ఆప్’, బీజేపీల మాటల యుద్ధం మాత్రం రాజకీయ వాతావరణాన్ని రోజురోజుకూ వేడెక్కిస్తోంది. అయితే, ఈ నెల 25న ఢిల్లీలో లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ... ఈ వరుస వివాదాలు ఆకస్మికమనీ, పూర్తి యాదృచ్ఛికమనీ అనుకోవడం అమాయకత్వమే. నిజాయతీకి తాము నిలువుటద్దమని ‘ఆప్’, అలాగే అవినీతి చీడను తాము ఏరేస్తున్నామని బీజేపీ... దేనికది డప్పు కొట్టుకుంటున్నా, వాస్తవాలు అందుకు దూరంగా ఉన్నాయని ప్రజలకు అర్థమవుతూనే ఉంది. బీజేపీ రాజకీయ ప్రతీకారాన్ని బయటపెడతామంటూ కేజ్రీవాల్ గర్జిస్తున్నా, అది ప్రతిధ్వనిస్తున్న దాఖలాలు పెద్దగా కనబడట్లేదు. పదమూడేళ్ళ క్రితం 2011లో అవినీతిపై అన్నాహజారే ఉద్యమం నుంచి ఊపిరిపోసుకున్న ‘ఆప్’ ఇవాళ లక్ష్యం మరిచి, దారి తప్పిన బాటసారిగా మారిపోవడం సమకాలీన చారిత్రక విషాదం. హజారే ఉద్యమంలో బాసటగా నిలిచిన స్పూర్తిదాయకమైన స్వతంత్ర వ్యక్తులు ఇవాళ ‘ఆప్’లో లేకపోవడం, కేజ్రీవాల్ భజనపరులదే పార్టీలో రాజ్యం కావడం లాంటివే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. స్వాతి ఆరోపణల పర్వంలో లోతుపాతులు ఏమైనా, ‘ఆప్’ ప్రస్థానంలో లోటుపాట్లు అనేకం. తప్పులు దిద్దుకొని, నిజాయతీ నిరూపించుకోవడమే ప్రజాక్షేత్రంలో శ్రీరామరక్ష. -
మన బంగారం
బంగారం విలువైన లోహం మాత్రమే కాదు, సంపదకు మారుపేరు. బంగారం అంటే భవిష్యత్తుకు భరోసా. ప్రపంచవ్యాప్తంగా మనుషులకు బంగారం మీద ఎంత అనురాగం ఉన్నా, మన భారతీయులకు బంగారం మీద ఉండే మోజు అంతకు మించినది. ఎప్పటికైనా మంచిరోజులు వస్తాయనే ఆలోచనలతో బంగారు కలలు కనడం మనలో చాలామందికి అలవాటే! బంగారు ఆభరణాలు ఒంటికి అలంకరణలైతే, మన నుడికారంలో భాగమైన బంగారు సామెతలు, పదబంధాలు మన భాషకు అలంకరణలు. విపణిలో బంగారు ధగధగలు సరే, సాహితీ వీథుల్లోనూ కనకకాంతులు మిరుమిట్లు గొలుపుతాయి. ఒకానొక కాలంలో మన దేశంలో కవులకు కనకాభిషేకాలు చేసే రోజులు ఉండేవి. వేద పురాణాల నుంచి ప్రాచీన సాహిత్యంలో బంగారాన్ని గురించిన వర్ణనలు, బంగారంతో ముడిపడిన పోలికలు విరివిగా కనిపిస్తాయి. రామాయణ కాలం నాటికే బంగారం వినియోగం బాగా ఉండేది. సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్లిన హనుమంతుడు రావణుడి అంతఃపురంలో ధగధగలాడే బంగారు సోపానాలతో నిర్మించిన విశాలమైన వేదికలను చూశాడట! వాటినే వాల్మీకి ‘జ్వలనార్క ప్రతీకాశం సుకృతం విశ్వకర్మణా/ హేమ సోపాన సంయుక్తం చారుప్రవర వేదికమ్’ అని వర్ణించాడు.ఆదిశంకర విరచితమైన కనకధారా స్తవం తెలిసిందే! ఆదిశంకరులు భిక్షకు వెళ్లినప్పుడు ఒక నిరుపేదరాలు తన ఇంట ఏమీ లేకపోవడంతో ఒక ఉసిరికాయ దానం చేసింది. ఆమె దుఃస్థితికి చలించిన శంకరాచార్యులు లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకధారా స్తవం ఆశువుగా పలికినప్పుడు ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయలు వర్షించాయట! తెలుగు కవులలో కనకాభిషేక వైభోగాన్ని పొందిన తొలికవి బహుశా శ్రీనాథుడే కాబోలు. ‘దీనార టంకాల తీర్థమాడించితి దక్షిణాధీశు ముత్యాలశాల’ అని తానే స్వయంగా చెప్పుకున్నాడు. తర్వాతికాలంలో అంతటి వైభోగాన్ని పొందిన మరో కవి అడిదం సూరకవి. ‘రాజు కళంకమూర్తి రతిరాజు శరీర విహీను డంబికా/ రాజు దిగంబరుడు మృగరాజు గృహాంతర సీమవర్తి వి/భ్రాజిత పూసపా డ్విజయ నృపాలుడు రాజు కాక ఈ/ రాజులు రాజులా పెను తరాజులు గాక ధరాతలమునన్’ అని ఆశువుగా చెప్పిన పద్యానికి మెచ్చిన విజయరామరాజు అడిదం సూరకవికి కనకాభిషేకం జరిపించాడు. ఇప్పుడు బంగారు నాణేలే చలామణీలో లేవు. ఇక కనకాభిషేకాలెక్కడ? ఒకవైపు కవులకు కనకాభిషేకాలు జరుగుతున్న కాలంలోనే మరోవైపు ‘తోటకూరకైన దొగ్గలికైన/ తవుటి కుడుముకైన దవుటికైన/ గావ్యములను జెప్పు గాండ్యాలు ఘనమైరి’ అని వేమన నిరసించినట్లుగా నామమాత్ర ప్రతిఫలానికి కక్కుర్తి పడే చిల్లర కవులు కూడా ఎక్కువగానే ఉండేవాళ్లు.‘పట్టిందల్లా బంగారమే’ అని అంటారు. ఇది మన పలుకుబడిలో భాగం. అక్షరాలా పట్టిందల్లా బంగారమే అయిపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో గ్రీకు పురాణాల్లోని ‘మిడాస్ టచ్’ కథ చెబుతుంది. మిడాస్ అనే రాజుకు ముట్టుకున్నదల్లా బంగారమైపోతుందని అదృష్టదేవత వరం ఇచ్చింది. అప్పటి నుంచి అతడు తాకినదల్లా బంగారంగా మారిపోయేది. ఒకనాడు తన ముద్దుల కూతురును దగ్గరకు తీసుకుని ఎత్తుకోబోయాడు. ఆమె జీవంలేని బంగారుబొమ్మగా మారిపోయింది. బంగారం మీద అత్యాశ తెచ్చిపెట్టే అనర్థాలకు ఇదొక ఉదాహరణ.రాచరికాలు సాగిన కాలంలో రాజులు రత్నఖచిత కనకసింహాసనాల మీద కూర్చుని పరిపాలన సాగించేవాళ్లు. యోగ్యత కలిగిన వాళ్లు కనకసింహాసనాల మీద కూర్చుంటే జనాలు ఆమోదిస్తారేమో గాని, బొత్తిగా అప్రయోజకులు కనకసింహాసనాల మీదకెక్కి పెత్తనం చలాయిస్తే జనాలు ఊరుకోరు. ‘కనకపు సింహాసనమున/ శునకము గూర్చుండ బెట్టి శుభలగ్నమునన్/ దొనరగ పట్టము గట్టిన/ వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!’ అన్నాడు బద్దెన. కనక సింహాసనాసీనులైన శునకసమానులను ఎవరిని చూశాడో, ఎందరిని చూశాడో మరి! అంత తీవ్రంగా నిరసించాడు. బద్దెన పద్యంలోని కనకపు సింహాసనం ఒక ప్రతీక. అచ్చంగా బంగారంతో చేసినదే కానక్కర్లేదు. అధికార పీఠం ఏదైనా కావచ్చు. అప్రయోజకులు, అసమర్థులు అధిరోహించినప్పుడు ఒకవేళ అవి అచ్చంగా బంగారుపీఠాలే అయినా, వాటికి గౌరవభంగం తప్పదు.ఎవరెన్ని రకాలుగా పొగిడినా, ఇంకెవరెన్ని రకాలుగా తెగిడినా బంగారం బంగారమే! బంగారం డబ్బుకు పర్యాయపదం. ‘బంగారమే డబ్బు. మిగిలినదంతా అప్పు’ అన్నాడు అమెరికన్ ఆర్థిక వ్యాపారవేత్త జె.పి.మోర్గాన్. డబ్బుకు లోకం దాసోహం అనేమాట నిరాకరించలేని సత్యం. ‘కులము గలుగు వారు/ గోత్రంబు గలవారు/ విద్యచేత విర్రవీగు వారు/ పసిడి గల్గువాని బానిస కొడుకులు’ అని వేమన ఈ సత్యాన్నే కొంత నిష్ఠురంగా పలికాడు.బంగారానికి మెరుపు సహజలక్షణం. అలాగని ‘మెరిసేదంతా బంగారం కాదు’ అని అనుభవజ్ఞులైన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఈ సంగతినే ఇంగ్లిషువాళ్లు ‘ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్’ అన్నారు. బంగారానికి కుల మత ప్రాంత భాషా భేదాలేవీ లేవు. ఎవరి దగ్గర ఉంటే వారికి విలువ పెంచుతుంది. బంగారానికి ఎంత విలువైనా ఉండవచ్చు. ఎంత ధర అయినా ఉండవచ్చు. అదేదీ మనిషిలోని సుగుణానికి సాటిరాదు. ‘భూమి అట్టడుగున ఉన్న బంగారాన్ని, భూమిపై చలామణీలో ఉన్న బంగారాన్ని తెచ్చిపోసినా అదంతా ఒక్క సుగుణానికి ఖరీదు కట్టలేదు’ అన్నాడు ప్లాటో. అయినా మన బంగారం మంచిదైతే ఇంతమంది ఇన్ని సుద్దులు చెప్పాల్సిన పని ఉండేది కాదు. -
మహిళా చైతన్యంపై మారీచ మేఘం!
ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇప్పుడు పురుషులకంటే మహిళలే ఎక్కువగా చైతన్యం కనబరుస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ ధోరణి కనిపిస్తున్నది. సోమవారం ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో కూడా మొత్తం పోలైన ఓట్లలో పురుషుల కంటే ఒకటిన్నర శాతం మహిళల ఓట్లే ఎక్కువ. చైతన్యవంతమైన నాగరిక సమాజానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాల్లో మహిళా సాధికారత ప్రధానమైనది. అందుకు మార్గం అన్ని రంగాల్లో స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించడమేనన్న సంగతిని విజ్ఞులందరూ అంగీకరిస్తారు.ఈ సమానత్వం అనే అంశంపై ఐక్యరాజ్య సమితి గత సంవత్సరం విడుదల చేసిన నివేదికలో మన దేశం అట్టడుగు పొరల్లోనే కనిపించింది. 146 దేశాలతో పొందుపరిచిన స్త్రీ – పురుష సమానత్వ జాబితాలో మన దేశానికి 127వ స్థానం దక్కింది. సమానత్వపు సాధనలో మనం సాధించవలసిన లక్ష్యం ఇంకెంతో దూరం ఉన్నదని ఈ నివేదిక గుర్తు చేసింది. అమ్మవారిని ఆదిశక్తిగా ఆరాధించే దేశంలో ఈ దుర్గతి సంప్రాప్తమవడం ఒక విషాదం. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ మహిళ వేసే ప్రతి ముందడుగును ఈ దేశంలోని ప్రజాస్వామ్య ప్రియులందరూ స్వాగతిస్తారు. ఓటు హక్కు వినియోగంపై ఇప్పుడొస్తున్న వార్తలు కూడా అటువంటి ముందడుగులే.కేవలం ఓటుహక్కు వినియోగించుకోవడం వరకే ఈ ముందడుగు పరిమితం కాలేదు. ఓటు వేసే విషయంలో స్వతంత్ర నిర్ణయం తీసుకునే మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. ప్రతిష్ఠాత్మక సంస్థగా పేరున్న సీఎస్డీఎస్ వారు గత సాధారణ ఎన్నికల తర్వాత చేసిన పోస్ట్ పోల్ విశ్లేషణలో ఈ సంగతి వెల్లడైంది. స్త్రీ సమానత్వానికి సామాజిక–సాంస్కృతిక ప్రతిబంధకాలు బలంగా ఉన్న హిందూ మనుధర్మ సమాజంలో ఈమాత్రం పురోగతిని కూడా విప్లవాత్మకమైనదిగానే పరిగణించాలి. 55 నుంచి 60 శాతం మంది మహిళలు తమ సొంత అభిప్రాయాల మేరకే ఓటేస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది.భారతీయ మహిళల్లో క్రమంగా పెరుగుతున్న ఆర్థిక స్వావలంబన కూడా ఈ పరిణామానికి దారి తీసి ఉండవచ్చు. భద్రత, పిల్లల భవిష్యత్తు, ఉన్నంతలో గుట్టుగా బతకడం వంటి అంశాలకు మహిళలు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు దోహదపడే రాజకీయ పక్షాలను ఎన్నుకోవడంలో వారు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతకుముందుతో పోలిస్తే గత ఎన్నికల్లో (2019) బీజేపీకి మహిళల మద్దతు పెరిగిందని సీఎస్డీఎస్ తెలిపింది. ఉజ్వల్ యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్, జన్ధన్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, బేటీ బచావో – బేటీ పఢావో వంటి పథకాల ఫలితంగా మహిళా ఓటర్ల మద్దతు బీజేపీకి పెరిగిందట! ఈ పథకాలను వినియోగించుకోని మహిళలతో పోలిస్తే లబ్ధిదారులైన మహిళల్లో 8 శాతం ఎక్కువమంది బీజేపీకి ఓటు వేసినట్టు సీఎస్డీఎస్ అంచనా వేసింది.ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున బీజేపీకి ఓట్లు వేశారు. యోగీబాబా హయాంలో మెరుగైన శాంతిభద్రతల పరిస్థితే అందుకు కారణం. అంతే తప్ప యోగీజీ కాషాయ సిద్ధాంతం ఎంతమాత్రమూ కాదు. మహిళలు కోరుకుంటున్న భద్రత, పిల్లల భవిష్యత్తు, బతుకు భరోసా వంటి అంశాల్లో ఐదేళ్ల వైఎస్ జగన్ పరిపాలన మోదీ, యోగీల పాలన కంటే ఎన్నోరెట్లు ప్రభావవంతమైనది. అమ్మ ఒడి, 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వగైరా పథకాలు మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన అతిపెద్ద గేమ్ ఛేంజర్స్.మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘దిశ’ యాప్ను సుమారు కోటిన్నర మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. దాదాపు 32 వేల సందర్భాల్లో ‘దిశ’ యాప్ ద్వారా మహిళలు పోలీసు రక్షణ పొందగలిగారు. ‘దిశ’ యాప్ అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. అన్నిటినీ మించి విద్యారంగ సంస్కరణలు మహిళలను అపరిమితంగా ప్రభావితం చేసినట్టు కనిపిస్తున్నది. బిడ్డలకు అంతర్జాతీయస్థాయి ఇంగ్లిషు మీడియం చదువులు అందుబాటులోకి రావడం వారిలో సంతోషాన్ని నింపింది. అలాగే నాణ్యమైన ఆరోగ్య సేవలు. ఈ ఐదేళ్ల కాలంలో సుమారు 55 లక్షలమంది సిబ్బందిని అరోగ్య సేవల కోసం నియమించిన సంగతి తెలిసిందే. వైద్యశాఖలో ఇంత పెద్దఎత్తున నియామకాలు జరిపిన రాష్ట్రం మరొకటి లేదు. ‘నాడు–నేడు’ పథకం కింద వేలకోట్లు వెచ్చించి ప్రభుత్వాసుపత్రులను ఆధునీకరించారు. ఈ కార్యక్రమాలు కచ్చితంగా మహిళల ఆలోచనల్ని ప్రభావితం చేసేవే!వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన ఏపీలో 36 శాతం భూకమతాలకు మహిళలే సేద్య సారథ్యం వహిస్తున్నారు. కాలుష్య రహితమూ, పర్యావరణ హితమైన ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతులను అనుసరించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఏపీలో ఈ సాగు చేసే రైతుల్లో 80 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. సుస్థిర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో పురుషుల కంటే మహిళల్లోనే చైతన్యం ఎక్కువనేందుకు ఇదొక ఉదాహరణ. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మహిళలందరికీ ఆర్బీకే సెంటర్ల సేవలపై సదభిప్రాయం ఉన్నది.ఈ పరిణామాలన్నీ మహిళల రాజకీయ అభిప్రాయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజల ఓటింగ్ బిహేవియర్పై అధ్యయనం చేస్తున్న సంస్థల అంచనా ప్రకారం ఈ రాష్ట్రంలో 70 శాతానికి పైగా మహిళలు వారి సొంత అభిప్రాయాల మేరకే ఓట్లు వేశారు. వీరి ఓటింగ్ ఛాయిస్పై భర్తల లేదా కుటుంబ సభ్యుల ప్రభావం లేదు. అంటే దాని అర్థం కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా 70 శాతం మంది ఓటు వేశారని కాదు. ఇందులో దాదాపు 50 శాతం మంది కుటుంబ సభ్యులకు మహిళల అభిప్రాయాలతో ఏకీభావం ఉండవచ్చు. సుమారు 20 శాతం మంది మహిళలు వారి భర్తలు లేదా కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా, తమకు మేలు చేస్తారని భావించే పార్టీకి ఓటు చేసి ఉంటారని అంచనా.ఎన్నికలకు ముందు ప్రజాభిప్రాయం సేకరించిన ఒపీనియన్ పోల్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. వాటి సగటును తీసుకుంటే 48 నుంచి 50 శాతం మంది పురుషులూ, 54 నుంచి 56 శాతం మంది మహిళలూ ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేస్తారని ఆ సర్వేలు పేర్కొన్నాయి. పోలింగ్ సరళిని పరిశీలించిన అనంతరం ఈ అభిప్రాయాలను కొంతమంది పరిశీలకులు మార్చుకున్నారు. 50 శాతానికి పైగా పురుషులు, 60 శాతానికి పైగా మహిళలు వైసీపీకి ఓట్లు వేసి ఉంటారని అంచనాలు వెలువడుతున్నాయి. అంటే పోలైన ఓట్లలో 55 నుంచి 56 శాతం. ఈ అంచనాలే నిజమైతే వచ్చే ఫలితాన్ని సునామీగానే పరిగణించవలసి ఉంటుంది.జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల కారణంగా పేద వర్గాల్లోని మహిళల్లో, కష్టజీవుల్లో సింహభాగం ఓట్లు వైసీపీకే పడతాయనే అంచనా ఎన్నికలకు ముందే ఉన్నది. బీజేపీ, జనసేనలను కలుపుకొని కూటమిని ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు గెలుపుపై భరోసా కోసం కొంతకాలంగా వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిశోర్ను సంప్రదిస్తున్నారట! అప్పటికే బాబు కోసం పనిచేస్తున్న రాబిన్శర్మతో కలిసి పీకే అందజేసిన తుది నివేదికలో పై అంశం కూడా ప్రస్తావనకొచ్చింది.బలహీనవర్గాలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధుల ఓట్లను గణనీయమైన సంఖ్యలో పోలవకుండా చూస్తే తప్ప గెలుపు సాధ్యంకాదని ఈ వ్యూహకర్తలు కుండబద్దలు కొట్టారని సమాచారం. ఈ కార్యక్రమానికే వాళ్లు ‘ఎలక్షనీరింగ్’ అనే ముద్దుపేరు పెట్టుకున్నారు. ఎలక్షనీరింగ్ చేయడానికి ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయగలగాలి. అందుకోసం బీజేపీతో పొత్తు కావాలి. ఎన్నో అవమానాలు భరించి, అడిగినన్ని సీట్లిచ్చి, అందుకోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. షెడ్యూల్ విడుదలైన దగ్గర్నుంచీ మొదలుపెట్టిన ఎలక్షనీరింగ్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నుంచి ఉధృతమైంది. బాబు బంధువైన పురందేశ్వరి రాష్ట్ర బీజేపీకి అధ్యక్షురాలవడంతో ఆరెంజ్ బీజేపీపై యెల్లో బీజేపీదే పైచేయిగా మారింది.బడుగు బలహీనవర్గాల ప్రజలు ఎక్కువగా ఉండే అనేక ప్రాంతాల్లో పలువురు పోలీసు అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘానికి పురందేశ్వరి అర్జీలు పెట్టేవారు. అంతటితో ఆగకుండా ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలో సూచిస్తూ పేర్లను కూడా అందజేశారు. నియమించవలసిన అధికారుల పేర్లను ఒక పార్టీ అధ్యక్షురాలు సూచించడం న భూతో న భవిష్యతి! ఎన్నికల సంఘం కూడా ఆ అర్జీలను సవినయంగా స్వీకరించి శిరసావహించింది. పురందేశ్వరికి ఆ రికమండేషన్లు కరకట్ట ప్యాలెస్ నుంచే అందాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక ఎలక్షనీరింగ్ ప్రారంభమైంది. పోలింగ్ రోజున ఎంపిక చేసుకున్న ఏరియాల్లోకి తాము కోరుకునే అధికారులు వచ్చారు. వ్యూహకర్తల సూచన మేరకు తెలుగుదేశం అభిమానుల ఓట్లన్నీ తొలి మూడు గంటల్లోనే పోల్ చేసుకోవాలి. ఆ తర్వాత హింసాకాండను మొదలుపెట్టి బడుగు వర్గాల మహిళలు, వృద్ధుల ఓట్లు పోలవకుండా చూడాలి. వారి ఖర్మకాలి పొద్దున ఆరు గంటలకే బలహీనవర్గాల ప్రజలు, వృద్ధులు క్యూలైన్లలో నిలబడటం మొదలుపెట్టారు. దీంతో విచక్షణ కోల్పోయిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పోలింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే దాడుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.పల్నాడు జిల్లాలోని గణేశునిపాడు గ్రామంలో బీసీలను, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను పోలింగ్లో పాల్గొనవద్దని ముందురోజే బెదిరించారు. వాళ్లు బెదిరింపులను ఖాతరు చేయకుండా పొద్దున్నే వచ్చి ఓట్లు వేసి వెళ్లారు. దాంతో రెచ్చిపోయిన మూకలు గ్రామంపై దండెత్తి దాడులకు తెగబడ్డారు. అనంతపురం జిల్లాలో, చిత్తూరు జిల్లాలో ఇలా వీలైన ప్రతిచోట బలహీన వర్గాల ప్రజలను, మైనారిటీలను, ముఖ్యంగా మహిళలను ఓటింగ్లో పాల్గొనకుండా చూసేందుకు దాడులకు తెగబడ్డారు. ఉదయంపూటే పోలింగ్ కేంద్రాలకు రాలేకపోయిన మహిళలు సాయంత్రానికల్లా జట్లు జట్లుగా వచ్చి పోలింగ్ కేంద్రం క్యూలైన్లలో రాత్రి పొద్దుపోయే దాకా నిలబడి మరీ ఓట్లు వేశారు. ప్రజాస్వామ్య పతాకాన్ని సమున్నతంగా ఎగరేశారు.పెరుగుతున్న మహిళా చైతన్యంపై ఒక రాజకీయ పార్టీ కక్షకట్టడం, వారిని ఓట్లు వేయకుండా చూసేందుకు దాడులకు పూనుకోవడం క్షమించరాని నేరం. ఆడపిల్లలకు ఆస్తిహక్కును కల్పించి, వారి ఉన్నతికి అండగా నిలబడిన ఎన్టీఆర్ సిద్ధాంతాలను చంద్రబాబు సమాధి చేశారు. ఆ పార్టీకి పురుషాధిపత్య స్వభావాన్ని నూరిపోశారు. ఆయనే స్వయంగా పురుషాహంకారపూరితమైన వ్యాఖ్యానాలను పబ్లిగ్గానే చేసేవారు. ‘కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా’ అంటూ మాట్లాడిన తీరును తెలుగు సమాజం ఎలా మరిచిపోగలుగుతుంది? బహిరంగ వేదికల మీద బాబు బావమరిది బాలకృష్ణ మహిళలను కించపరిచిన వైనాన్ని ఎలా క్షమించగలదు? ఐదేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు మూడో వంతు సీట్లు రిజర్వు కానున్నాయి. అందుకోసం మహిళా నేతలను ఇప్పటి నుంచే సమాయత్తం చేయవలసిన అవసరం ఉన్నది. వారిలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించవలసిన అవసరం సమాజంపై ఉన్నది. ఇటువంటి కీలక దశలో పురుషాహంకార రాజకీయ పార్టీలు మనుగడ సాగించడం దేశానికి శ్రేయస్కరం కాదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
చైనా–రష్యా కరచాలనం!
తాము చైనాను పీపుల్స్ రిపబ్లిక్గా గుర్తించి 75 యేళ్లు అవుతుండగా... ఉక్రెయిన్ దురాక్రమణ యుద్ధంలో పట్టు సాధించిన ఛాయలు కనబడుతుండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటనలో ఇరు దేశాలమధ్యా వివిధ ఒప్పందాలు కుదరటంతోపాటు సంయుక్త ప్రకటన కూడా విడుదలైంది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంనాటి మనస్తత్వాన్ని విడనాడాలని రెండు దేశాలూ అమెరికాకు హితవు పలికాయి. ప్రాంతీయ భద్రత, రక్షణ బేఖాతరు చేస్తూ కొన్ని బృందాలకు మద్దతుగా నిలిచే వినాశకర విధానాలకు స్వస్తి పలకాలని సూచించాయి. పుతిన్ వరసగా ఆరోసారి ఎన్నికై దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి తొమ్మిది రోజులవుతోంది. 2030 వరకూ ఆయనదే రాజ్యం. అయితే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచం మునపట్లా లేదు. ఆంక్షల చక్రబంధంలో బిగించి రష్యాను పాదాక్రాంతం చేసుకోవాలని అమెరికా, దానికి మద్దతుగా నిలిచిన యూరొప్ దేశాలూ పట్టుదలగా వున్నాయి. పర్యవసానంగా రష్యా ఆర్థిక వ్యవస్థ బలహీనపడి వణుకుతోంది. ఆ దేశంతో ఎవరు లావాదేవీలు సాగించినా చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరిస్తోంది. రెండేళ్ల క్రితం రష్యా ఉక్రెయిన్పై దండెత్తటానికి కొన్ని రోజులముందు రష్యా–చైనాల మధ్య ‘హద్దుల్లేని వ్యూహాత్మక ఒప్పందం’ కుదిరింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ రెండు దేశాలూ ఇప్పటికీ ‘హద్దులెరగని’ బంధాన్ని కొనసాగిస్తాయా... రష్యాపై అమలవుతున్న ఆంక్షలకూ, అమెరికా హెచ్చరికలకూ చైనా తలొగ్గుతుందా అనే ప్రశ్నలు గత కొన్ని రోజులుగా పాశ్చాత్య ప్రపంచాన్ని వేధిస్తున్నాయి. పుతిన్కు బీజింగ్లో దక్కిన ఘనస్వాగతమూ, ఇరు దేశాల ఉమ్మడి ప్రకటనా, ఉభయ దేశాధినేతల ప్రసంగాలూ గమనించాక అమెరికా, యూరొప్ దేశాలకు అసంతృప్తే మిగిలివుంటుందన్నది వాస్తవం. అయితే 75 ఏళ్లక్రితం కొత్తగా ఆవిర్భవించిన చైనాను గుర్తించిననాటి సోవియెట్ యూనియన్కూ, ఇప్పటి రష్యాకూ పోలికే లేదు. అప్పట్లో అది అమెరికాతో ‘నువ్వా నేనా’ అన్నట్టు తలపడే తిరుగులేని శక్తి. అనంతర కాలంలో ఆ దేశం కుప్పకూలింది. చీలికలు పేలికలైంది. ఈ మూడు దశాబ్దాల్లో గత వైభవాన్ని సంతరించుకోవాలని చేసిన ప్రయత్నాలు ఎంతో కొంత ఫలిస్తున్న వైనం కనబడుతుండగానే క్రిమియా ఆక్రమణ, ఆ తర్వాత ఉక్రెయిన్పై దురాక్రమణ యుద్ధం రష్యాను సంక్షోభంలోకి నెట్టాయి. చైనా మాదిరే భద్రతామండలిలో రష్యా శాశ్వతసభ్య దేశమే కావొచ్చు. కానీ ఇప్పుడది దాదాపు ఒంటరి. చెప్పాలంటే చైనాకు జూనియర్ భాగస్వామి.తమది కూటమి కాదని, తమ స్నేహం వెనకున్న ఉద్దేశం దశాబ్దాల బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లటమేనని ఉభయ దేశాలూ చెబుతున్నాయి. కానీ ఆ రెండు దేశాల ఉమ్మడి ప్రత్యర్థి అమెరికాయేనని ప్రపంచానికంతకూ తెలుసు. డ్రోన్లు, క్షిపణి సాంకేతికత, ఉపగ్రహ నిఘా నివేదికలు, ఫైటర్ జెట్లకు పనికొచ్చే విడిభాగాలు, మైక్రోచిప్లు సరఫరా చేస్తూ దురాక్రమణ యుద్ధానికి చైనా ఆజ్యం పోస్తున్నదని అమెరికా అనుమానం. ఈ చైనా సంస్థలను నిషేధ జాబితాలో పెడతామని హెచ్చరిస్తోంది. ఇది ఎంతోకొంత పనిచేసింది. చైనా బ్యాంకులు రష్యా సంస్థలతో మొన్న మార్చినుంచి లావాదేవీలు బాగా తగ్గించాయి. పర్యవసానంగా ఇటీవల వాణిజ్యం మందగించింది. దీన్ని మళ్లీ యధాస్థితికి తీసుకెళ్లటం పుతిన్ ప్రాధాన్యాంశాల్లో ఒకటి. అందుకే ఆయన వెంట భారీ ప్రతినిధి బృందం బీజింగ్ వెళ్లింది. గత ఆర్థిక సంవత్సరం గణాంకాలు గమనిస్తే చైనాతో రష్యా వాణిజ్యం రికార్డు స్థాయిలో 24,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యే నాటికున్న వాణిజ్యంతో పోలిస్తే ఇది 60 శాతం అధికం. రష్యా ఎగుమతుల్లో చైనా వాటా 30శాతం కాగా,దాని దిగుమతుల్లో చైనా వాటా 40శాతం. ఆంక్షల బారిన పడకుండా వ్యాపార, వాణిజ్యాలను ఎలా కొనసాగించాలన్నదే ప్రస్తుతం రష్యా, చైనాల ముందున్న ప్రశ్న. ఇంధనం, పరిశ్రమలు, వ్యవసాయం, నిర్మాణ రంగాల్లో తమకు సహకరించాలని పుతిన్ అర్థించారు. అలాగే ఆంక్షల తర్వాత ఎలక్ట్రానిక్ ఉపకరణాల నుంచి కార్ల వరకూ అన్ని మార్కెట్లనుంచీ పాశ్చాత్య దేశాలు తప్పుకున్నాయి. ఆ లోటును చైనా తీరుస్తోంది. దాన్ని మరింత పెంచాలని ఉభయ దేశాలూ నిర్ణయించాయి. డాలర్లలో కాక తమ తమ కరెన్సీల్లోనే లావాదేవీలు జరుపుకుంటున్నాయి. జార్ చక్రవర్తుల కాలం నుంచీ పాశ్చాత్య దేశాలతో రష్యాకున్న వాణిజ్యబంధం ఇప్పుడు పూర్తిగా స్తంభించిపోయింది. ఇన్నాళ్లూ యూరొప్ దేశాలకు వెళ్లిన సహజవాయు ఎగుమతుల్ని చైనాకు మళ్లించేందుకు పుతిన్ సిద్ధపడినా ప్రస్తుతానికైతే ఒప్పందం ఖరారు కాలేదు. వ్లాదిమిర్ సోరోకిన్ అనే రచయిత 2028 నాటికి రష్యా పోకడలెలా వుంటాయో చిత్రిస్తూ 2006లో ‘డే ఆఫ్ ఆప్రిష్నిక్’ అనే నవల రాశాడు. అప్పటికల్లా చైనా సాంకేతికతే అన్ని రంగాల్లోనూ వర్ధిల్లుతుందనీ, కానీ జార్ సామ్రాజ్యానికి ఆద్యుడిగా భావించే మధ్యయుగాలనాటి మాస్కో ప్రిన్స్ ఇవాన్ను తలపించే అత్యంత క్రూరమైన పాలన సాగుతుందనీ ఆ కాల్పనిక ఇతివృత్తం చెబుతుంది. పుతిన్ ఎలా పరిణమిస్తారన్న సంగతలావుంచి చైనా సాంకేతికతలు ఇప్పటికే రష్యాకు వచ్చాయి. చైనా కార్లు రష్యా రోడ్లపై పరుగులెడుతున్నాయి. ప్రపంచం గతంలో మాదిరి లేదని, ఎవరినీ ఎవరూ శాసించలేరని అమెరికా, పాశ్చాత్య దేశాలు గుర్తించాలి. ఉద్రిక్తతలు ఉపశమింపజేసేందుకూ, శాంతి సాధనకూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించటం, రాజీకి సిద్ధపడటం అవసరమని ఇరు పక్షాలూ తెలుసుకోవాలి. అందుకు భిన్నమైన వినాశకర మార్గంలో పోతామంటే ప్రపంచ ప్రజానీకం క్షమించదు. -
ఉత్తరాఖండ్ నిర్లక్ష్యం
నిర్లక్ష్యం మంటల్లో నిత్యం దహించుకుపోతున్న ఉత్తరాఖండ్ అడవులపై సర్వోన్నత న్యాయస్థానం దృష్టిసారించటం, సంజాయిషీ కోరడం హర్షించదగిన పరిణామం. ఈ మంటల్లో చిక్కుకుని ఇంతవరకూ అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇతర జీవరాశులకు కలిగిన నష్టమెంతో తెలియదు. హిమాలయ సానువుల్లో కొలువుదీరి పర్యావరణ పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న ఈ అడవులపై అధికార యంత్రాంగం ప్రదర్శిస్తున్న అంతులేని నిర్లక్ష్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. వాతావరణపరంగా ఉత్తరాఖండ్లో, పొరుగునున్న హిమాచల్ప్రదేశ్లో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఈ రెండుచోట్లా శీతాకాలంలో భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన గాలులు వీస్తాయి. అంతకుముందు విపరీతంగా మంచుకురుస్తుంది. దేవదారు వృక్షాలనుంచి రాలిపడిన ఆకులతో కొండ ప్రాంతాలన్నీ నిండిపోతాయి. ఈ ఆకులు మామూలుగా అయితే చిన్న నిప్పురవ్వ తగిలినా భగ్గునమండుతాయి. కానీ ఆ సమయంలో పడే వర్షాలతో అటవీప్రాంతమంతా చిత్తడిగా మారిపోతుంది. వేసవిలో కూడా ఇదే స్థితి కొనసాగుతుంది. అయితే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఇదంతా తారుమారైంది. నవంబర్ నుంచే అడవుల్లో అగ్నికీలలు కనబడ్డాయి. ఈ పరిణామాన్ని అంచనా వేయటం పెద్ద కష్టం కాదు. కొండ ప్రాంతమంతా రాలిన ఆకులతో నిండినప్పుడు, ఎండలు మండుతున్నప్పుడు ఏం జరుగుతుందో గత అనుభవాలే చెబుతున్నాయి. దీనికితోడు పొగరాయుళ్లు నిర్లక్ష్యంగా పడేసే చుట్ట, బీడీ, సిగరెట్ వంటివి కూడా ప్రమాదాలు తెస్తున్నాయి. మాఫియాల బెడద సరేసరి. అటవీ భూములు అందుబాటులోకొస్తే కోట్లు గడించవచ్చని ఉద్దేశపూర్వకంగా అడవుల్ని తగలబెడుతుంటారు. వీరికి రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉంటాయి. ఇక కొండప్రాంతాలకు సమీపంలో పంట వ్యర్థాలను కళ్లాల్లోనే తగలబెట్టే అలవాటు అధికం. ఇది కూడా అడవులు అంటుకోవటానికి కారణమవుతోంది. ఇలాంటివారినుంచి అడవుల్ని కాపాడటానికీ, నిప్పు జాడ కనుక్కుని వెనువెంటనే ఆర్పడానికీ కొండలపై గార్డులు గస్తీ కాస్తుంటారు. కానీ వారంతా ఎన్నికల విధులు నిర్వర్తించటానికి తరలిపోయారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన దాఖలా లేదు. అందువల్లే ఈ దఫా ఇంతవరకూ 1,400 హెక్టార్ల అడవి తగలబడిందని ఒక అంచనా. గత నెలనుంచి చూసుకున్నా అడవులు అంటుకున్న ఉదంతాలు ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్లతో పోలిస్తే ఉత్తరాఖండ్లోనే అధికమని ఈమధ్య ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ) డేటా తెలిపింది. ఉత్తరాఖండ్లో దాదాపు 24,305 చదరపు కిలోమీటర్లమేర అడవులున్నాయి. రాష్ట్ర భౌగోళిక ప్రాంతంలో ఇది 44.5 శాతం. ఇంత విస్తారంగా అడవులున్న రాష్ట్రం వాటిని ప్రాణప్రదంగా చూసుకోవద్దా? కొండలపై రాలిపడే ఆకుల్ని ఏరేందుకూ, తామరతంపరగా పెరిగే గడ్డి మొక్కల్ని తొలగించటానికీ, అగ్ని ప్రమాదాల నివారణకూ మనుషుల్ని నియమించాలి. ఇందుకోసం ఏటా దాదాపు రూ. 9 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కానీ చిత్రమేమంటే ప్రభుత్వం కేవలం రూ. 3.15 కోట్లు మంజూరు చేసి చేతులు దులుపుకుంది. మంటల జాడ లేకుండా చూడాలే తప్ప, ఒకసారి అంటుకుంటే అదుపు చేయటం అంత సులభం కాదు. ఈ నెల మొదట్లో అడవులు తగలబడుతున్నప్పుడు వైమానిక దళ హెలికాప్టర్లు రంగంలోకి దిగి వేలాది లీటర్ల నీటిని వెదజల్లాయి.ఈ చర్య కొంతమేర ఉపయోగపడినా అనుకోకుండా కురిసిన భారీ వర్షంతో పరిస్థితి అదుపులోకొచ్చింది. ఇలా ప్రతిసారీ జరుగుతుందని ఆశిస్తూ కూర్చుంటే అంతా తలకిందులవుతుంది. తమకున్న అడవుల్లో కేవలం 0.1 శాతం ప్రాంతంలో మాత్రమే మంటల బెడద ఉన్నదని ఉత్తరాఖండ్ దాఖలుచేసిన అఫిడవిట్ తెలిపింది. ఎంత శాతమని కాక, ఏమేరకు ముందస్తు ప్రణాళికలు అమలు చేస్తున్నామో, వాటి లోటుపాట్లేమిటో అధ్యయనం చేస్తున్న దాఖలా లేదు. ఎంత ప్రాంతంలో వృక్షాలు దెబ్బతిన్నాయో లెక్కలు చెబుతున్నారు. కానీ పర్యావరణానికి కలిగే నష్టం ఎవరూ గమనించటం లేదు. అగ్ని ప్రమాదాలవల్ల వాతావరణంలో కార్బన్డై ఆక్సైడ్ పరిమాణం పెరుగుతుంది. నేలల్లో తేమ తగ్గిపోతుంది. పోషకాలు కూడా కనుమరుగవుతాయి. వీటికి సంబంధించిన డేటా ప్రభుత్వం దగ్గర ఉందో లేదో తెలియదు. నిజానికి ఇలాంటి డేటాతో స్థానిక ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే, అడవులు తగలబడటంవల్ల భవిష్యత్తులో ఎన్ని చిక్కులు ఏర్పడే అవకాశమున్నదో చెబితే వారే స్వచ్ఛంద సైనికుల్లా ముందుకొస్తారు. అడవులను కాపాడతారు. మాఫియాలను కట్టడి చేసేందుకు సైతం సంసిద్ధులవుతారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఆ రకమైన చొరవేది?ఉత్తరాఖండ్ అడవులు విశిష్ఠమైనవి. అక్కడ రెండు టైగర్ రిజర్వ్లున్నాయి. పక్షుల సంరక్షణ కేంద్రాలున్నాయి. ఇక్కడి గాలులు మోసుకెళ్లే ఆక్సిజన్ కారణంగానే కాలుష్యం కోరల్లో చిక్కుకున్న ఢిల్లీ నగరం ఆ మాత్రమైనా ఊపిరి పీల్చుకోగలుగుతోంది. ఇక్కడి వృక్షాలవల్ల హిమాలయాల్లోని మంచుపర్వతాలు ఒక క్రమపద్ధతిలో కరిగి జీవనదులు పారుతున్నాయి. ఇంతటి అపురూపమైన అడవులు మానవ నిర్లక్ష్యం కారణంగా నాశనం కావటం అత్యంత విషాదకరం.ఎంత ప్రాంతమని కాదు...అడవిలోని ఒక్క వృక్షమైనా మన నిర్లక్ష్యంవల్ల, తప్పిదాలవల్ల నేలకొరగరాదన్న దృఢ సంకల్పాన్ని ప్రదర్శిస్తే, దానికి అనుగుణమైన చర్యలు తీసుకుంటే అడవులు కళకళలాడతాయి. మనుషులు మాత్రమే కాదు...సకల జీవరాశులూ సురక్షితంగా ఉంటాయి. సర్వోన్నత న్యాయస్థానం జోక్యంవల్ల ఇదంతా నెరవేరితే అంతకన్నా కావాల్సిందేముంది? -
అమెరికా బెదిరింపు ధోరణి
అహంకారం తలకెక్కితే బుద్ధి మందగిస్తుంది. పెత్తనం చలాయించాలన్న యావ పరిధుల్ని మరిచిపోతుంది. భారత్–ఇరాన్ల మధ్య సోమవారం కుదిరిన ఒప్పందంపై అమెరికా స్పందించిన తీరు దాని అహంకారానికి నిలువెత్తు నిదర్శనం. ఇరాన్తో ఒప్పందానికి సిద్ధపడేవారు ఆంక్షలు ఎదుర్కొనక తప్పదంటూ అమెరికా విదేశాంగ ప్రతినిధి వేదాంత్ పటేల్ చేసిన వ్యాఖ్య బెదిరింపు ధోరణిలోవుంది. 2003లో వాజపేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఇరాన్తో చాబహార్ ఓడరేవు నిర్మాణంపై ఒప్పందం కుదిరింది మొదలు అమెరికా అడుగడుగునా అడ్డుపడుతోంది. అందువల్లే అయిదేళ్లలో పూర్తికావాల్సిన ప్రాజెక్టు కాస్తా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంది. 2018లో పూర్తయిందనిపించి లాంఛనంగా ప్రారంభించారు. కానీ దానికి సంబంధించి రోడ్లు, రైల్వేలైన్లు మొదలుకొని వివిధ మౌలిక సదుపాయాల కల్పన, యంత్ర సామగ్రి వగైరాల విషయం అనిశ్చితిలో పడింది. మొత్తంమీద ఇప్పటికి 21 ఏళ్లయింది. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ (ఐపీజీఎల్), ఇరాన్ పోర్టులు, నౌకా సంబంధ సంస్థల మధ్య ఓడరేవు టెర్మినల్ ప్రారంభంపై ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కింద ఐపీజీఎల్ 12 కోట్ల డాలర్ల (రూ. వెయ్యికోట్లుపైగా) పెట్టుబడి పెడుతుంది. మన దేశం మరో 25 కోట్ల డాలర్ల రుణం సమకూరుస్తుంది. చాబహార్ సమీపంలో నిర్మించిన ఈ షహీద్ బెహెస్తీ పోర్టు మన దేశానికి లాభదాయకమైన ప్రాజెక్టు. అంతేకాదు... మధ్య ఆసియా, పశ్చిమాసియా, యూరప్ దేశాలకు అది ‘బంగారువాకిలి’. ఈ ప్రాజెక్టు కింద నిర్మాణమయ్యే రోడ్లు, రైల్వేలైన్లు వివిధ ఓడరేవులతో అనుసంధానమవుతాయి. సరుకు రవాణా చకచకా సాగుతూ పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుంది.పెట్రో కెమికల్స్, ఉక్కు, ఎరువుల రంగాల్లో ఇరాన్ బ్రహ్మాండమైన అభివృద్ధి సాధిస్తుంది. మధ్య ఆసియా మార్కెట్లలో ఇప్పటికే తిష్ఠ వేసి, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టుతో బంగారు భవిష్యత్తును కలగంటూ అందరినీ మించి ఎదగాలని దూకుడుగా వెళ్తున్న చైనాకు చాబహార్ ఓడరేవు కంట్లో నలుసు. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో పనిచేయటం ప్రారంభిస్తే బీఆర్ఐ ప్రాజెక్టుకు పెద్ద విలువుండదు. ఇంతలోనే అమెరికా కొరడా ఝళిపించటం ప్రారంభించింది. ‘మేం ఇరాన్పై ఆంక్షలు విధించాం కనుక దానితో ఎవరూ వాణిజ్యబంధం నెలకొల్పుకోరాద’ంటూ ఫర్మానాలు జారీచేస్తోంది. రెండు సార్వభౌమత్వ దేశాల మధ్య ఒప్పందం కుదిరితే ఎందుకీ కడుపుమంట? ఏమిటీ బెదిరింపులు? ఇరాన్లో తనకు అనుకూలమైన మహమ్మద్ రెజా పహ్లావి (ఇరాన్ షా) పాలన సాగినంతకాలమూ అమెరికా ఆ దేశంతో సఖ్యంగా వుంది. ఇస్లామిక్ విప్లవం విజయవంతం కావటంతో ఆ పాలకుడు కాస్తా నిష్క్రమించాడు. ఆ తర్వాత ఖొమేనీ కనుసన్నల్లోకి ఇరాన్ వచ్చిననాటి నుంచీ ఆ దేశాన్ని అమెరికా అష్టదిగ్బంధం చేస్తోంది. ఏదో ఒక కారణంతో కయ్యానికి దిగుతోంది. తన సమస్యను ప్రపంచ సమస్య చేసి ఎవరూ ఆ దేశంతో వ్యాపార, వాణిజ్యాలను నడపరాదంటూ బెదిరిస్తోంది. పోనీ ఈ విషయంలోనైనా నిలకడగా వున్న చరిత్ర లేదు. 2003లో ఒప్పందం కుదిరినప్పుడు మౌనంగావున్న అమెరికా, ఆ తర్వాత కాలంలో ఇరాన్పై ఆంక్షలు విధించింది. పర్యవసానంగా ఆ ప్రాజెక్టు మూలనపడింది. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చేనాటికి అంతర్జాతీయంగా పరిస్థితులు చక్కబడ్డాయి. అమెరికా, యూరప్ దేశాలు ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకుని ఆంక్షలు సడలించాయి. మరుసటి ఏడాదికల్లా చాబహార్పై భారత్–ఇరాన్ ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది.కానీ 2017లో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఇరాన్తో కుదిరిన అణు ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ఆంక్షల పర్వం మళ్లీ మొదలైంది. కానీ మన దేశానికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. అప్పటికి అఫ్గాన్ ఆర్థికాభివృద్ధిని, దానికి అందాల్సిన మానవతా సాయాన్ని దృష్టిలో ఉంచుకుని మినహాయింపు ఇచ్చామని అమెరికా ప్రకటించింది. సారాంశంలో క్షణక్షణమూ మారే తన చిత్తానికి అనుగుణంగా ప్రపంచ దేశాలన్నీ మసులుకోవాలని అమెరికా వాంఛిస్తోంది. ఇలాంటి పోకడలను మొగ్గలోనే తుంచే ప్రయత్నం చేసివుంటే వేరుగా వుండేది. అది లేకపోవటం వల్లనే తాజాగా మరోసారి హూంకరిస్తోంది. దేశాలకు తమవైన విధానాలుంటాయి. ధూర్త దేశంగా మారి ఇరుగు పొరుగుకే కాక ప్రపంచ శాంతికే భంగంగా పరిణమించినప్పుడు ఎవరూ అలాంటి దేశంతో కలవాలనుకోరు. గతంలో ఇరాన్ విషయంలో భారత్కు ఇచ్చిన మినహాయింపులకు షరతులున్నాయి. ఇరాన్నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురును వెంటనే తగ్గించుకోవాలని, మున్ముందు ఆపేయాలని అప్పట్లో అమెరికా కోరింది. అప్పటికి రోజుకు ఏడు లక్షల చమురు బ్యారెళ్లు దిగుమతి చేసుకునే భారత్... చివరకు ఆ దిగుమతిని ఆపేసింది కూడా! ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపేయాలని అమెరికా కోరినా లెక్కచేయని భారత్... మొదటినుంచీ అన్ని విషయాల్లో మద్దతుగా నిలుస్తున్న తమ విషయంలో భిన్నంగా ఉంటున్నదని ఇరాన్ ఇప్పటికే విమర్శించింది. ఇరాన్ వైఖరేమిటన్న సంగతలావుంచి మన ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చి మనవైన విధానాలు రూపొందించుకోవటం తప్పనిసరి. విదేశాంగమంత్రి జైశంకర్ అన్నట్టు అంతర్జాతీయంగా ఎన్నో దేశాల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడే చాబహార్ పోర్టును అమెరికా సంకుచిత దృష్టితో చూడటం, మోకాలడ్డాలని ప్రయత్నించటం తగదు. మన దేశం ఇతర దేశాలతో కూడా ఈ విషయంలో చర్చించాలి. కాస్త వెనకా ముందూ కావొచ్చుగానీ ఇలాంటి అనారోగ్య ధోరణులు అందరికీ ముప్పు తెచ్చేవే! -
నేపాల్ కొత్త లడాయి
తీరి కూర్చుని సమస్యలు సృష్టించుకోవటంలో నేపాల్ ప్రధాని ప్రచండను మించినవారెవరూ ఉండరు. కనుకనే భారత్లోని ప్రాంతాలతో కూడిన వివాదాస్పద మ్యాప్తో కొత్త వంద రూపాయల నోటు విడుదల చేసి మరో గొడవకు తెరతీశారు. మన ఉత్తరాఖండ్లో భాగంగా... 372 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించివున్న లింపియాథుర, కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలను తనవిగా చెప్పుకుంటూ లడాయికి దిగడం నేపాల్కు కొత్త కాదు. నాలుగేళ్లక్రితం ఆ ప్రాంతాలతో కూడిన భౌగోళిక చిత్రపటాన్నీ, దానికి సంబంధించిన బిల్లునూ పార్లమెంటులో ప్రవేశపెట్టి ఏకగ్రీవ ఆమోదం కూడా పొందింది. నిజానికి అంతకుముందే 2014లో ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్లో పర్యటించి సరిహద్దు వివాదాల పరిష్కారానికి ఉభయ దేశాల ప్రతినిధులతో ఒక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించారు. అందుకు నేపాల్ కూడా ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవటంలో ఇరు దేశాలూ చొరవ తీసుకోలేదన్నది వాస్తవం. ఆ పని తక్షణం మొదలుకావాలని భారత్ను డిమాండ్ చేయటంలో తప్పులేదు. అందుకు దౌత్యమార్గంలో నిరంతర చర్చలు జరపటం కూడా అవసరం. కానీ దీన్ని వదిలి 2020లో ఏకపక్షంగా మ్యాప్ను విడుదల చేసి సమస్యను మరింత జటిలం చేయటానికే నేపాల్ మొగ్గుచూపింది. పాలక కూటమిలో అంతర్గత విభేదాలు వచ్చిన ప్రతిసారీ ప్రజల దృష్టి మళ్లించేందుకు భారత్తో వున్న సరిహద్దు సమస్యను ఎజెండాలోకి తీసుకురావటం తప్ప ఆ వివాదాన్ని చిత్తశుద్ధితో పరిష్కరించుకుందామన్న ఆలోచన పాలకులకు లేదనే విమర్శలు తరచు రావటానికి ఇదే కారణం. వంద రూపాయల నోటుపై వివాదాస్పద మ్యాప్ ఉండాలనుకోవటం వెనక కూడా ఇలాంటి ఉద్దేశమే ఉందన్నది విపక్షాల విమర్శ. తన ఏలుబడిలోని కూటమిలో భాగస్వామిగా వున్న జనతా సమాజ్వాదీ పార్టీ–నేపాల్ (జేఎస్పీ–ఎన్)లో కుమ్ములాట మొదలైన మరుక్షణమే ప్రచండ వివాదాస్పద మ్యాప్ను బయటకు తీశారు.భారత్ మద్దతున్న మాధేసి తెగల సమూహానికి ప్రాతినిధ్యంవహించే ఆ పార్టీలో అంతర్గత తగాదాలు బయల్దేరితే నేపాల్ రాజకీయాలపై వాటి ప్రభావం ఎక్కువేవుంటుంది. 2020లో సరిహద్దు సమస్యపై నేపాల్ పార్లమెంటులో బిల్లుపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించేలా చేయటంలో కీలకపాత్రపోషించిన అప్పటి ప్రధాని, సీపీఎన్ (యూఎంఎల్) నాయకుడు కేపీ శర్మ ఓలి రెండు నెలలక్రితం పాలక కూటమిలో చేరటం కూడా కొత్త కరెన్సీనోటు ముద్రణకు కారణమంటున్నారు. ‘దురాక్రమణలోవున్న నేపాల్ భూభాగాలను తిరిగి తీసుకురావటమే తమ కర్తవ్యమని సీపీఎన్(యూఎంఎల్) తన మేనిఫెస్టోలో ఇప్పటికే ప్రకటించివుంది. అయితే నేపాల్ పార్లమెంటు కొత్త మ్యాప్ను ఆమోదించినప్పుడు ప్రజల్లో కనిపించిన ఉత్సాహం, ఉద్వేగం ఇప్పుడు లేవు సరికదా...ప్రచండపై విమర్శలే అధికంగా వినిపిస్తున్నాయి. ఇలా అత్యుత్సాహంతో సొంత మ్యాప్లు రూపొందించుకోవటం ఒక్క నేపాల్కే కాదు...చైనా, పాకిస్తాన్లకు కూడా అలవాటే. మన అరుణాచల్ ప్రదేశ్లోని భౌగోళిక ప్రాంతాలకు తనవైన పేర్లు పెట్టుకుని, మ్యాప్లలో చూపుకోవటం చైనాకు అలవాటు. పాకిస్తాన్దీ అదే సంస్కృతి. అది జమ్మూ, కశ్మీర్లో కొంత ప్రాంతాన్ని ఏనాటినుంచో తన మ్యాప్లలో చూపుతోంది. దేశాలమధ్య సరిహద్దులకు సంబంధించి తలెత్తే వివాదాలు ప్రజలను రెచ్చగొడితే పరిష్కారం కావు. వాటిని దౌత్య స్థాయిలో అవతలి దేశంతో ఓపిగ్గా చర్చించి, చారిత్రక, సాంస్కృతిక ఆధారాల పరిశీలనకు నిపుణులతో ఉమ్మడి కమిటీలు ఏర్పాటుచేసుకోవాలి. ఆ మార్గాన్ని వదిలి ఇష్టానుసారం జనం భావోద్వేగాలను రెచ్చగొట్టాలనుకుంటే పరిష్కారానికి అందనంత జటిలంగా వివాదాలు మారతాయి. నిజానికి సరిహద్దు తగాదాలన్నీ మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వలసపాలకులు వదిలిపెట్టిపోయినవే. 1814–16 మధ్య సాగిన ఆంగ్లో–నేపాలీ యుద్ధంలో ఈస్టిండియా కంపెనీకి నేపాల్ ధారాదత్తం చేసిన ప్రాంతమే ప్రస్తుత వివాదానికి మూలం. వలసపాలకులు పోయిన ఏడున్నర దశాబ్దాల తర్వాత కూడా ఆ భూభాగంపై ఇరు దేశాల మధ్యా అవగాహన కుదరకపోవటం విచారించదగ్గదే. నిజానికి నేపాల్తో సరిహద్దు వివాదాలు అసలు పరిష్కారం కాలేదని చెప్పలేం. గత మూడు దశాబ్దాల్లో ఇరు దేశాలూ పరస్పరం చర్చించుకుని దాదాపు 98 శాతం సమస్యలను పరిష్కరించుకోగలిగాయి. మిగిలిన సమస్యల్ని సైతం ఈ దోవలోనే పరిష్కరించుకోవచ్చన్న ఇంగితజ్ఞానం నేపాల్ నేతలకు లేదు. దేశాధ్యక్షుడు రామచంద్ర పోద్వాల్కు ఆర్థిక సలహాదారుగా వున్న చిరంజీవి నేపాల్ సైతం కొత్త నోటు విడుదల తెలివితక్కువ నిర్ణయమని, రెచ్చగొట్టే చర్యని బాహాటంగా విమర్శించటం గమనించదగింది. అందువల్ల ఆయన తన పదవి పోగొట్టుకోవాల్సివచ్చినా ప్రభుత్వ నిర్ణయంపై జనంలో వున్న అసంతృప్తికి ఆ వ్యాఖ్యలు అద్దంపట్టాయి. ఇరుగు పొరుగు దేశాలతో వున్న సరిహద్దు తగాదాలను పరిష్కరించుకోవటంలో అలసత్వం చూపితే వాటిని చైనా తనకు అనుకూలంగా మలుచుకుంటుందని గుర్తించటంలో మన పాలకులు విఫలమవుతున్నారు. ఎప్పుడో 2014లో ఉమ్మడి కార్యాచరణ బృందం ఏర్పాటుకు ఇరుదేశాల మధ్యా ఒప్పందం కుదిరినా ఇంతవరకూ సాకారం కాకపోవటంలో నేపాల్తోపాటు మన బాధ్యత కూడా వుంది. ఈ విషయంలో నేపాల్ పాలకులకు ఎలాంటి స్వప్రయోజనాలున్నాయన్న అంశంతో మనకు నిమిత్తం లేదు. మన వంతుగా ఏం చేస్తున్నామో గమనించుకోవాలి. అటు నేపాల్ కూడా ఏకపక్ష చర్యలతో సాధించేదేమీ ఉండదని గ్రహించాలి. వివాదాలకు భావోద్వేగాలు జోడించటం ఎప్పటికీ పరిష్కారమార్గం కాదని గుర్తించాలి. -
పోటెత్తిన వోటర్లు!
సార్వత్రిక ఎన్నికల తొలి మూడు దశల తీరు వేరు... సోమవారంనాటి నాలుగో దశ పోలింగ్ తీరు వేరు. దేశవ్యాప్తంగా మొత్తం 96 లోక్సభ స్థానాల్లో జనం పెద్దయెత్తున వోటింగ్లో పాల్గొన్నారు. ఈ నాలుగో దశలో లోక్సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందుకోసమే కాక ఈ రాష్ట్రంవైపు దేశమంతా ఆసక్తిగా చూడటానికి ప్రత్యేక కారణం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అయిదేళ్ల పాలన తర్వాత ప్రజల ఆశీస్సులు కోరుతూ నిర్వహించిన ‘సిద్ధం’ సభలకూ, బస్సు యాత్రకూ పోటెత్తిన జనవాహినిని చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. ‘మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు వోటేయండి’ అంటూ ప్రజానీకానికి పిలుపునీయటం, అందుకు వచ్చిన సానుకూల స్పందన అసాధారణమైనవి. విపక్షం పూనకం వచ్చినట్టు వ్యక్తిగత దూషణలకు దిగినా, కులాల పేరిట ప్రాంతాల పేరిట చిచ్చురేపాలని చూసినా జగన్, ఆయన పార్టీ హుందాగా వ్యవహరించారు. ఈ ఎన్నికలు ‘పేదలకూ, పెత్తందార్లకూ జరిగే యుద్ధం...ఇందులో మీరు ఎటువైపో తేల్చుకోండ’ని ఇచ్చిన ఆయన పిలుపును పల్లెసీమల నుంచి నగరాలు, పట్టణాల వరకూ అన్నిచోట్లా అందరూ అందుకున్నారు. కొత్తగా వోటు హక్కు వచ్చిన యువత మొదలుకొని వృద్ధుల వరకూ...వికలాంగులు మొదలుకొని అనారోగ్యంతోవున్న పెద్దల వరకూ... వేసవి తీవ్రతను కూడా లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు తరలిరావటంలోని ఆంతర్యం అదే. కనుకనే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. వోటేయటానికి బారులు తీరిన మహిళలు, వృద్ధుల్ని చూసి టీడీపీ కూటమి వణికింది. దానికి తోడు గతంలో ఎవరూ సాహసించని, యోచించని ఒక వినూత్న ప్రయోగం చేశారు జగన్. అన్ని సామాజిక వర్గాలకూ పాలనలో సమ భాగస్వామ్యం కల్పించాలన్న పట్టుదలతో లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో దాదాపు సగభాగం అట్టడుగు వర్గాలకు కేటాయించారు. అందువల్లే జనం వైఎస్సార్ కాంగ్రెస్ను గుండెల నిండా హత్తుకున్నారు. సాధారణంగా అయిదేళ్ల పాలన ఏ ప్రభుత్వం పైన అయినా ఎంతో కొంత అసంతృప్తి తీసుకొస్తుంది. అత్యంత జనాకర్షణగల సినీ దిగ్గజం ఎన్టీరామారావు కొత్తగా పార్టీ స్థాపించినప్పుడు రోడ్లపైకి భారీయెత్తున వచ్చిన జనమే... ఆయన పాలన చూశాక మొహం చాటేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. దాన్నుంచి కోలుకుని ప్రజాభిమానాన్ని చూరగొనడానికి ఆయనకు మరో అయిదేళ్లు పట్టింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 4న వెల్లడయ్యాక దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది. జనరంజక పాలన అంటే ఏమిటో... ఏం చేస్తే ప్రజల ఆదరాభిమానాలు సాధించుకోవచ్చునో అన్ని రాష్ట్రాల రాజకీయ నాయకులూ గ్రహిస్తారు. సంక్షేమం అంటే కేవలం తాయిలాలు పంచటం కాదని, వారి భవిష్యత్తును వారే నిర్మించుకునే విధంగా ఆసరాగా నిలబడటమని నిరూపించిన జగన్ను ఇకపై వారంతా రోల్ మోడల్గా తీసుకుంటారు. పిల్లలు బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తేనే కుటుంబాలు బాగుపడతాయని గుర్తించి ఆ రంగాన్ని ప్రక్షాళన చేయటం, ప్రామాణికమైన విద్యనందించటం, ‘నాడు–నేడు’ పేరిట బడులన్నిటినీ తీర్చిదిద్దటం కనీవినీ ఎరుగనిది. వైద్యరంగంపైనా ఆయన అంతే శ్రద్ధ పెట్టారు. భారీయెత్తున సిబ్బందిని నియమించి ఆస్పత్రులను తీర్చిదిద్దటం, ఆధునాతన వైద్య పరికరాలు, ఔషధాలు సమకూర్చటం, పల్లెలకు సైతం వైద్య సేవలు చేరేయటం మామూలు విషయం కాదు. అలాగే రైతు కోసం ఏర్పాటైన వ్యవస్థలైతేనేమి... వలంటరీ వ్యవస్థద్వారా ప్రభుత్వ సేవలు ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లటమైతేనేమి జగన్ విజయాల్లో మచ్చుకు కొన్ని. దేశంలో ప్రజాభిమానాన్ని చూరగొనాలనుకునే నాయకులెవరైనా వీటిని అనుసరించక తప్పదు.అయితే జనం మనస్సుల్లోంచి దీన్నంతటినీ తుడిచేయాలని చూసిన జిత్తులమారి టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి గురించీ, వారి చేష్టలకు వంతపాడిన ఎన్నికల సంఘం గురించీ ప్రస్తావించుకోవాలి. వారి నుంచి ఫిర్యాదు రావటమే తడవుగా ఉన్నతాధికారులను బదిలీ చేయటం, అయిదేళ్ల నుంచి అమలవుతున్న పథకాలకు మోకాలడ్డటం,వారు కోరిన విధంగా అడ్డగోలుగా అధికారుల్ని నియమించటం... టీడీపీ పోకడలపై ఫిర్యాదు చేసినా బేఖాతరు చేయటం లేదా ఆలస్యంగా స్పందించటం తటస్థంగా వుండాల్సిన వ్యవస్థకు తగదు. సాక్షాత్తూ బాబే ఎన్నికల సభల్లో సీఎంనుద్దేశించి దూషించినా... ఆయన్ను రాళ్లతో కొట్టాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా బాబును ఆపే ప్రయత్నం చేయలేదు. వేరే రాష్ట్రాల్లో ప్రధానినుద్దేశించి చిన్న వ్యాఖ్య చేసినా నొచ్చుకున్న ఆ వ్యవస్థ ఏపీలో వీటన్నిటినీ ఎలా కొనసాగనిచ్చింది? అన్నీ ఒక ఎత్తయితే ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై బాబు అండ్ కో సాగించిన దుష్ప్రచారం, ప్రజలను భయపెట్టడం మరో ఎత్తు. బాబు, లోకేష్లపై కేసులు పెట్టాలని ఆదేశించారు సరే... కానీ ఆ తర్వాత అదే అంశంపై నిబంధనలకు విరుద్ధంగా మీడియాలో పూర్తి పేజీ ప్రకటనలిస్తే ఎందుకు సంజాయిషీ కోరలేదు? నిజానికి పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగిందంటే అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ సంయమనమే కారణం. అయినదానికీ, కానిదానికీ రాయలసీమపై అభాండాలేయటం బాబు దురలవాటు. కానీ చిత్రంగా అక్కడ అత్యంత ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఇతరచోట్లే టీడీపీ బరితెగింపుతో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈవీఎంల ధ్వంసం, పెట్రోల్ బాంబులతో దాడి, పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలను బెదిరించటం, బౌన్సర్లతో హడలెత్తించటం, పోలీస్ స్టేషన్పై దండయాత్ర చేయటం దేనికి సంకేతం? ఎన్ని అవరోధాలెదురైనా నిర్భయంగా పోటెత్తి వోటేసిన ప్రజానీకం అభీష్టానిదే అంతిమ విజయం. -
జనస్వామ్యమా! జయీభవ!!
ఏటా వచ్చే వేసవికి అదనంగా ఈసారి ఎన్నికల వేసవిని చవిచూస్తున్నాం. కాకపోతే రెంటి మధ్యా ఒక తేడా ఉంది. సూర్యతాపం ద్విగుణీకృతమవుతున్నకొద్దీ, వోటర్లలోనూ ఎన్నికల సమరోత్సాహం త్రిగుణీకృతమవుతుంది. అదే ప్రజాస్వామ్యంలోని అందమూ, చందమూ, ఆకర్షణా. ప్రజా స్వామ్యం అత్యుత్తమం కాకపోవచ్చుకానీ, ఇప్పటివరకూ అనుభవంలోకి వచ్చిన అన్ని వ్యవస్థల్లో అదే ఉత్తమమని పండితులెందరో తేల్చారు. ప్రజాస్వామ్యానికి ఎన్నికలే వెన్నెముక. తమ కలలు, కాంక్షలతో ముడిపడినవి కనుకే ఎన్నికలు జనానికి మండు వేసవిలోనూ మంచు లేపనమవుతాయి. రాచరికం, సైనిక నియంతృత్వం లాంటి చేదు అనుభవాల దరిమిలా ప్రజాస్వామ్యాన్ని తెచ్చు కున్నామని పొరబడేవారున్నారు. రాజ్యమూ, సామ్రాజ్యమూ ఉనికిలోకి రాకముందే, మనుషులు గుంపు కట్టడం నేర్చిన తొలి దశలోనే అంకురించిన తాత్వికత– ప్రజాస్వామ్యం. కాలికమైన అంతరాలను, అడ్డంకులను దాటుకుని నేటికీ పురివిప్పుతున్న రాజకీయ తాత్వికత అదే. వేట– ఆహార సేకరణ దశలో మనిషి ప్రకృతి శక్తులతో పోరాడుతున్నప్పుడే తోటి మనుషుల తోడు, తోడ్పాటుల విలువ గుర్తించాడు; అభిప్రాయాల కలబోతనూ, ఐక్య కార్యాచరణనూ అలవరచుకున్నాడు. అంద రినీ కలుపుకొనిపోయే నాయకత్వాన్నీ ఆనాడే ప్రతిష్ఠించుకున్నాడు. గణతంత్రం పేరిట సాముదా యికంగా అభివృద్ధి చేసుకున్న సమాజాలతోనే రాజకీయ చరిత్ర ప్రారంభమైందని విజ్ఞులంటారు. గణతంత్రంలో నాయకుడు సమానులలో మొదటివాడే తప్ప అసామాన్యుడూ కాదు, అడ్డు అదుపుల్లేని అధికార శ్రీమంతుడూ కాదు. నేడు ప్రతి వోటుకూ ఒకే విలువ ఉన్నట్టే, నాడు ప్రతి ఒకరికీ ఒకే విలువ. పురాణేతిహాసాల్లో ఇందుకు సాక్ష్యాలు కనిపిస్తాయి. రామాయణంలో దశరథుడు తన పెద్దకొడుకు రాముడికి పట్టాభిషేకం చేయడానికైనా; మహాభారతంలో యయాతి తన చిన్న కొడుకు పూరునికి రాజ్యం కట్టబెట్టడానికైనా పౌర, జానపదుల ఆమోదం తప్పనిసరి. సమష్టి స్థానంలో వ్యక్తి ప్రాధాన్యం పుంజుకున్న దశలోనూ మంత్రి పరిషత్తులో చర్చించే నిర్ణయాలు తీసుకు నేవారు. విభీషణ శరణాగతి ఘట్టంలో రాముడు వానరవీరుల అభిప్రాయాన్ని అడుగుతాడు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నో మలుపులూ, మరకలతోపాటు మెరుపులూ మన చూపుల్ని జిగేలుమనిపిస్తాయి. గణాలు వ్రాతాలుగా, వ్రాతాలు జనాలుగా, జనాలు మహాజనాలుగా మారే క్రమంలోనే సామ్రాజ్యాలు ఉనికిలోకి వచ్చాయి. మనదేశంలో మగధ సామ్రాజ్యావతరణకు ముందున్నది గణతంత్రమే. ఆనాడు దేశం పదహారు జనపదాలుగా ఉండేది. గ్రీస్, మెసపోటేమియాలలో గణతంత్ర రాజ్యాలు ఉండేవి. నాటి గ్రీస్లోని ఎథెన్స్ అధినేత పెరిక్లీస్ ప్రజాస్వామిక అనుభవాన్ని కొత్త పుంతలు తొక్కించి జనతంత్రానికే ఘన చిహ్నమయ్యాడు; సంపన్నుల ప్రతిఘటనకు ఎదురొడ్డుతూ పేదలవైపు నిలబడి కలబడడంలోనూ ప్రజానాయకులకు తొలిమూసై మణిపూస అయ్యాడు. బలవత్తరులైన పర్షియన్ల దాడిని దీటుగా తిప్పికొట్టినా, సాటి గ్రీసు రాజ్యమైన స్పార్టాతో యుద్ధమొచ్చిన దశలో ప్లేగు వాతబడి అతను కన్నుమూయడం ఎథెన్స్ స్వాతంత్య్రానికీ; ప్రజాస్వామ్యానికీ చితిపేర్చింది. ఆ తర్వాత, స్పార్టా సహా గ్రీస్ అలెగ్జాండర్ సామ్రాజ్యంలో, ఆ తర్వాత రోమన్ సామ్రాజ్యంలో చిన్న వలసగా మసకబారిపోయింది. అలా కొడిగట్టిన ప్రజా స్వామ్యం తిరిగి కాంతినీ, క్రాంతినీ తెచ్చుకోవడానికి రెండువేల సంవత్సరాలు పట్టింది. ఎథెన్స్ ప్రభవించిన తాత్విక శిఖరాలే సోక్రటిస్, ప్లేటో, అరిస్టాటిల్! సోక్రటిస్ ప్రజాస్వా మ్యాన్ని వ్యతిరేకించినా; ప్లేటో అన్ని అధికారాలనూ రాజ్యం చేతుల్లో పెట్టి, ఉదారవాద నియంతృత్వమనే ఊహాస్వర్గానికి నిచ్చెన వేసినా; అరిస్టాటిల్ మధ్యేమార్గంగా రాజ్యాంగబద్ధ ఆదర్శ రాజ్యాన్ని నొక్కి చెప్పినా– ముగ్గురూ పశ్చిమ దేశాల రాజకీయ తాత్విక చింతనను ఉద్దీపింపజేసిన వారే. ప్రత్యేకించి అరిస్టాటిల్ ఆధునిక కాలంలో జాన్ లాక్, మాంటెస్క్యూ వంటి ప్రజాస్వామ్య దిశానిర్దేశకులకు ఒరవడి అయ్యాడు. గ్రీకుల బహుళ దేవతారాధనను వ్యతిరేకించినందుకు సోక్ర టిస్ను ఉరితీయడం ఎథెన్స్ ప్రజాస్వామ్య పరిమితిని, అపరిణతిని నొక్కిచెప్పి; భావప్రకటనా స్వేచ్ఛలేనిది ప్రజాస్వామ్యమే కాదన్న నీతినీ బోధించింది. పౌర ప్రాతినిధ్యం నుంచి రాచరిక నియంతృత్వంలోకి జారిపోయిన రోమ్ అనుభవమూ ఇలాంటిదే. వ్యక్తులు ఉత్తములూ, ఉన్నత సంకల్పవంతులూ అయితే చాలదు; వ్యవస్థలను బలోపేతం చేస్తేనే ప్రజాస్వామ్యానికి ఉనికీ, మనికీ అన్నది రోమ్ నేర్పిన గుణపాఠం. యూరప్ అంతటా ప్రజాస్వామ్య వ్యవస్థల సంపూర్ణ పతనం; ప్రజాస్వామ్య పునరుజ్జీవనానికి ఇంగ్లండ్ వేగుచుక్క కావడం; ఫ్రెంచి విప్లవం తిప్పిన మలుపులు; ప్రజాస్వామ్య మార్గంలో అమెరికా వేసిన ముందడుగు– ఇదంతా మరో చరిత్ర. వోటుహక్కు చరిత్రనే తిరగేస్తే, ఎథెన్స్ ప్రజాస్వామ్యంలోనూ బానిసలకు వోటు హక్కు లేదు. ఆ తర్వాతా శ్రామికులకు, స్త్రీలకు వోటు హక్కు లభించడానికి పెద్ద పోరాటాలే జరిగాయి. యూరప్ దేశాలు అనేకం ప్రజాస్వామ్యంలోకి రావడానికి ఇరవయ్యో శతాబ్ది చివరి వరకూ ఎదురుచూశాయి. ఇలాంటి చీకటి వెలుగుల చిత్రపటంలో భారత్ ఉనికే ఉజ్వలమూ, ఉత్తేజవంతమూ! వోటు హక్కును సార్వత్రికం చేసిన తొలి ఘనత మనదే. భారత్ ఒక దేశంగా మారడాన్నే అనుమానించి అవహేళన చేసిన నాటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ సహా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రజాస్వామిక ప్రస్థానంలో ముందడుగు వేస్తూనే ఉన్నాం. బహుళ మతాలూ, భాషల వైవిధ్యం వైరుద్ధ్యం కాదనీ, ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువనీ ప్రపంచానికి చాటి చెప్పాం. భారత ప్రజాస్వామ్యమా! జయతు జయతు! -
పౌర సమాజమా... పారాహుషార్!
అఖిలాంధ్ర జనులారా! అప్రమత్తంగా ఉండండి! గోముఖ వ్యాఘ్రాలు అంబారావాలు చేస్తున్నాయ్, తప్పుదోవ పట్టిస్తున్నాయ్. తేనె పూసిన కత్తులు కోలాటమాడు తున్నాయ్, కనికట్టు చేస్తున్నాయ్. జన తటాకపు గట్టు మీద మూడు కొంగలు నిలబడి దొంగజపం చేస్తున్నాయ్. జాగ్తే రహో!మతోన్మాదులు – కులోన్మాదులు జెండా గుడ్డలతో కొంగులు ముడేసుకొని అడుగులు వేస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి.నాజీలను మించిన కులోన్మాదులు, ఫాసిస్టులను తల దన్నే మతోన్మాదులు ఉమ్మడిగా, కలివిడిగా ఉన్మత్త ప్రచారపు విషవాయువులను ప్రయోగిస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త!విష ప్రచారపు ప్రయోగ వేదికలైన యెల్లో మీడియా కార్ఖానాల్లోంచి రోజుకు లక్ష క్యూబిక్ మీటర్ల పాయిజనస్ గ్యాస్ వెలువడుతున్నది. ఆ గాలి సోకితే జ్ఞానేంద్రియాలు పనిచేయవు, జరభద్రం!మన జ్ఞానేంద్రియాలు పని చేయకూడదనేదే వారి కోరిక. పని చేస్తే వారి నిజస్వరూపం మనం గుర్తిస్తామన్న భయం.ఈ మతోన్మాద, కులోన్మాద ఉమ్మడి ముఠాను నడిపించేది అంతా కలిపి పిడికెడు మందే! వారే పెత్తందార్లు. వారే పెట్టుబడిదార్లు. ముఠాలోని మిగిలిన పరివారంలో మతం అనే మత్తుమందుకు బానిసలు కొందరు. కులం అనే దురద రోగపు బాధితులు కొందరు.ఈ బానిసల్నీ, బాధితుల్నీ వెంటేసుకొని పెత్తందారీ కాలకూట విషకూటమి దండయాత్రకు బయల్దేరింది. ప్రపంచ యుద్ధాల్లో కూడా కొన్ని రకాల కెమికల్ వెపన్స్ వాడకంపై నిషేధాలుంటాయి. కానీ రోగ్ కంట్రీస్ ఖాతరు చేయవు. మన హెజెమోనిక్ రోగ్స్ కూడా అంతే! ప్రచారపు విధి నిషేధాలను ఖాతరు చేయరు, చేయట్లేదు.మన పెత్తందారీ కూటమి యుద్ధానికి తెగబడింది ఎవరి మీద? ఎవరిని తెగటార్చడానికి భగభగమండే పగతో సెగలుగక్కుతున్నారు?ఇంకెవరి మీద? పేదసాదల మీద, వారి సాధికారతా స్వప్నాల మీద! బడుగు బలహీన వర్గాల మీద, వారి జీవన వికాసపు ఆకాంక్షల మీద! కోట్ల జతల కనురెప్పల మాటు నున్న కలల మీద ఒకేసారి దాడి చేయడం ఎట్లా?వారికి ఆలంబనగా నిలబడిన వెన్నెముకను విరి చేయాలి. ఆ వెన్ను ఎముకే... వైఎస్ జగన్ ప్రభుత్వం.ఇంకెందుకు ఆలస్యం. బొంబార్డ్ ది హెడ్ క్వార్టర్స్. ప్రజల పక్షాన నిలబడిన ప్రభుత్వాన్ని కూలదోస్తే సరిపోతుంది. ఈ ఎన్నికల్లో కూల్చివేయాలి. పెత్తందారీ కూటమి తలపోత ఇది.తలపోసినంత మాత్రాన కుదురుతుందా? కోట్లాది మంది జీవితాలను క్రాంతి మార్గానికి మళ్లిస్తున్న సర్కార్కు వారు అండగా నిలబడరా? అశేష జనావళి మద్దతున్న జగన్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఎలా ఓడించగలరు?బలరామదేవుడి ముక్కోపానికి విరుగుడు మంత్రం ఉండనే ఉన్నది కదా ముఖస్తుతి అంటాడు ‘మాయాబజార్’ శకుని మామ. ఆ లెక్కన ప్రజాభిమానానికీ విరుగుడు ఉంటుంది కదా! ప్రజల్లో అపోహలు సృష్టించడం, అను మాన బీజాలు నాటడం! అసత్య ప్రచారంతో చీలికలు తేవడం వగైరా. కూటమిలోని శకుని మామలు పాచికలు విసరడంలో ఆశ్చర్యమేమున్నది?ప్రజలను ఆకట్టుకోగల నినాదం ఈ కూటమికి ఒక్కటి కూడా లేదు. ప్రజలకు మేలు చేసే విధానమూ లేదు. అరువు తెచ్చుకున్న అతుకుల బొంత మేనిఫెస్టో మాత్రం ఉన్నది. అందులోని అంశాలు అరచేతిలో వైకుంఠాన్ని చూపే టక్కు టమారం బాపతు. ఈ గారడీ సంగతి ముందే తెలిసిన జనం దాన్ని బొత్తిగా పట్టించుకోలేదు. క్రెడిబిలిటీ టెస్ట్లో కూటమి మేనిఫెస్టో డకౌటయింది.కూటమి నేతలు కూడా మేనిఫెస్టోను నమ్ముకోలేదు. యెల్లో మీడియా నేతృత్వంలో వెలువడే విషవాయు ప్రచా రాన్నే ఆయుధంగా ఎక్కుపెట్టారు. జగన్ పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనమైపోయిందంటారు. ఎలా అని అడగ కూడదు. తర్కానికి తావులేదు. సర్వనాశనం అనే మాటను అష్టోత్తర శతనామంలా ప్రతివాడూ నూటా ఎనిమిది సార్లు జపించాలి. అంతే!జగన్ హయాంలో అభివృద్ధి శూన్యమంటారు. దాని పైనా చర్చ ఉండదు. ఆధారాలుండవు. గణాంకాల జోలికి వెళ్లొద్దు. ఫీల్డ్ విజిట్ చేయొద్దు. రోజూ ఓపికున్నంత సేపు రామకోటి రాసుకున్నట్టుగా ‘అభివృద్ధి లేదు’ అనే మాటను రాసుకోవాలి. పంచాక్షరి మంత్రంలా పవిత్రంగా ఉచ్ఛరించి నెత్తిన నీళ్లు చల్లుకోవాలి.సర్వనాశనం, అభివృద్ధి శూన్యం అనే రెండు మాటల్ని మన యెల్లో మీడియా, టీడీపీ నేతలు నమలడం మొదలు పెట్టి ఇప్పటికి నాలుగేళ్లు దాటింది. నమలడం, నెమరు వేయడం అనే కార్యక్రమం అప్పటి నుంచి నిరాటంకంగా సాగుతూనే ఉన్నది. చూసేవాళ్లకు రోత పుట్టినా వాళ్లు మాత్రం ఈ పాచిపాటను ఆపలేదు.ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచీ మరీ ఘోరం. ఆ పత్రికలు చదవాలన్నా, ఆ ఛానెళ్లు చూడాలన్నా అల్ప ప్రాణులకు జడుపు జ్వరం వచ్చే పరిస్థితిలోకి తీసుకెళ్లారు. అభూతకల్పనలు, అభాండాలు, బట్టకాల్చి మీద వేయడం నిత్యకృత్యంగా మారింది.‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ అనే నల్ల చట్టాన్ని జగన్ మోహన్రెడ్డి తీసుకొచ్చారట. దాని ఆధారంతో ఆయన అర్ధరాత్రి వేళల్లో గ్రామాలకు కన్నంవేసి కంటికి నచ్చిన భూమినల్లా తవ్వుకొని, మూట కట్టుకొని వెళ్లిపోతారట! ఇదీ వీళ్లు ప్రచారం చేస్తున్న వార్త సారాంశం.మనిషి జన్మ ఎత్తిన వాడికి కొన్ని లక్షణాలు తప్పని సరిగా ఉంటాయని ఆశిస్తాము. సిగ్గూ–లజ్జ, మానము– మర్యాద, అభిమానం – గౌరవం వంటివి వాటిలో మచ్చుకు కొన్ని! యెల్లో మీడియా, దేశం కూటమి ఈ తరహా లక్షణా లను పూర్తిగా విసర్జించాయి. విలువల్నీ, వలువల్నీ విప్పేసి అవతలపారేశారు. దిగంబర వీరంగాలతో జుగుప్సాకరంగా తయారయ్యారు. నడివీధుల్లో నగ్నంగా నర్తిస్తున్నారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భూయజమానులకు మేలు చేస్తుందనీ, ఇంతకాలం ఈ చట్టాన్ని తేకపోవడమే పొరపాటనీ ఈ దేశంలోని బుద్ధిజీవులందరూ అభిప్రాయ పడుతున్నారు. ప్రపంచంలో సగానికి పైగా దేశాల్లో ఇప్పటికే ఈ చట్టం అమల్లో ఉన్నది.ఏపీ శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఈ చట్టానికి మద్దతు ప్రకటించింది. ఇప్పటికింకా మూడో వంతు గ్రామా ల్లోనే భూసర్వే పూర్తయింది. అన్ని గ్రామాల్లో సర్వే పూర్త యితే తప్ప మరో రెండేళ్లకు గానీ ఈ చట్టం అమల్లోకి రాదు.చట్టం లక్ష్యమే యజమానికి భూమిపై సర్వహక్కులు కల్పించడం. ఆ హక్కులకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం. అందుకు గుర్తుగానే సర్వే పూర్తయిన చోట ఇచ్చే పాస్ పుస్తకాలపై సీఎం బొమ్మను ముద్రిస్తున్నారు. అది ఆ యజ మాని హక్కుకు ప్రభుత్వ గ్యారంటీ. దాని మీద జరిగిన వక్రప్రచారం, చంద్రబాబు నోటి వెంట వచ్చిన బూతులు కూటమి దివాళాకోరుతనానికి రుజువు.అవ్వాతాతల పెన్షన్ల పంపిణీ విషయంలో కూటమి – యెల్లో మీడియా ఎంత అమానవీయంగా ప్రవర్తించాయో రాష్ట్ర ప్రజలు గమనించారు. వలంటీర్ల విషయంలో ఎన్ని పిల్లిమొగ్గలు వేశాయో గమనించారు.ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ లబ్ధిదారులకు దక్కకుండా ఈసీపై నెరిపిన ఒత్తిడి రాజ కీయం కూటమి వారి దింపుడు కళ్లెం ఆశల దిగజారుడు తనాన్ని ఎత్తిచూపింది.ఇసుక సరఫరాపై విషం చిమ్ముతూ గత నాలుగేళ్లుగా చందమామ కథలు నెలనెలా ప్రచారం చేయడాన్ని ఎలా మర్చిపోగలం?మద్యం వ్యాపారుల మాఫియా కోసం మద్య నియంత్రణపై వెళ్లగక్కిన అక్కసు గుర్తు చేసుకోండి. తను అధికా రంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని చంద్రబాబు అంది స్తారట. ప్రాణాలకు హానికరమైన లిక్కర్కు నాణ్యతా ప్రమాణాలేమిటి?విచ్చలవిడి లాభాల కోసం వ్యాపారులు వేలాది బెల్ట్ షాపులు కూడా నడిపి మద్యాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు ప్రజల ఆరోగ్యం అద్భుతంగా ఉందట. మద్యాన్ని అందు బాటులో లేకుండా చేసి, బెల్టుషాపులు ఎత్తివేసి నియంత్రిత వేళల్లో మాత్రమే, లాభాపేక్ష లేని ప్రభుత్వ షాపుల్లోనే అమ్ముతుంటే మాత్రం కాలేయాలు, కిడ్నీలు పాడైపోతు న్నాయనే కాకమ్మ కథలను ప్రచారంలో పెట్టిన వైనాన్ని గమనించండి.పరిశ్రమల విషయంలోనూ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేశారు. గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణా త్మకం చేస్తే సహించలేకపోయారు. ఏ వివక్ష లేకుండా, పుట్టిన ప్రతిబిడ్డకూ నాణ్యమైన విద్యను ప్రాథమిక హక్కుగా మార్చితే పెత్తందారీ కూటమి భరించలేకపోతున్నది. ప్రభు త్వంపై యుద్ధం ప్రకటించింది.పేద వర్గాల ప్రజలు, మహిళలు నిటారుగా నిలబడ టానికి సాధికారతను సంతరించుకోవడానికి ఉపయోగపడే ఒక విప్లవకర ఎజెండాను జగన్ ప్రభుత్వం అమలుచేసింది. ఈ ఎజెండా కొనసాగవలసిన అవసరం పేదవర్గాలు, బలహీనవర్గాల ప్రజలకున్నది.ఈ ఎజెండా కొనసాగితే పెత్తందార్లకు ఆకలి తీరదు. అందుకే కట్టుకథలతో ముందుకు వస్తున్నారు. పేదవర్గాల ప్రజలను ఏమార్చాలని చూస్తున్నారు. మభ్యపెట్టాలని చూస్తున్నారు. మరోసారి దారుణంగా మోసం చేయాలని కపట నాటకమాడుతున్నారు.వారు ప్రజలకు మిత్రులు కారు... శత్రువులు. మాన వీయ విలువలు లేశమాత్రం లేనివారు. పేద బిడ్డలు మంచి చదువులు చదివితే ఓర్చుకోలేరు.మిత్రులారా! ఏదైనా జరగరాని పొరపాటు జరిగి కూటమి గెలిస్తే సర్కారు బడులు మళ్లీ పాడుబడిపోతాయి. పేద బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం రద్దవుతుంది. విద్య ప్రైవేట్ పరమవుతుంది.ఈ లక్ష్యం కోసమే కార్పొరేట్ విద్యా సంస్థల యజమా నులు కూటమి గెలుపు కోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నారు. అర్థం చేసుకోండి.ప్రభుత్వ వైద్యరంగం నిర్వీర్యమవుతుంది. ‘ఫ్యామిలీ డాక్టర్’ అదృశ్యమవుతాడు. కార్పొరేట్ మాఫియా వైద్యరంగాన్ని మళ్లీ ఆక్రమించుకుంటుంది. ‘రైతు భరోసా’ ఎగిరి పోతుంది. ఆర్బీకే సెంటర్లు అదృశ్యమవుతాయి.అధికార వికేంద్రీకరణకు అద్దం పట్టిన గ్రామ సచివాల యాలు మాయమవుతాయి. వలంటీర్ వ్యవస్థను ఎత్తి వేస్తారు. ఎందుకంటే అధికార వికేంద్రీకరణ అనేది పేద వర్గాలను బలోపేతం చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది. ఈ పరిణామం పెత్తందారీ వర్గాలకు గిట్టదు.అందుకే ఈ కూటమి పలుమార్లు వికేంద్రీకరణపై అవాకులు చెవాకులు పేలిన విషయం మరిచిపోరాదు.సమస్త వనరుల మీద తమ పెత్తనం కోసం పెత్తందార్లు పరితపిస్తారు. అందుకోసం నిరంతరం వేటాడుతూనే ఉంటారు. బలహీనవర్గాలకు అధికారంలో వాటా పెరిగితే ఈ వేటగాళ్ల ఆటలు సాగవు.అందుకే జగన్ ప్రభుత్వ విధానాలపై పెత్తందార్లు యుద్ధం ప్రకటించారు. వారి మాయ నాటకాలకు లొంగి పోతే పేదవర్గాల విజయ ప్రస్థానం ఆగిపోతుంది. సామా జిక విప్లవానికి ఎదురుదెబ్బ తగులుతుంది. పేద ప్రజల విచక్షణ మీద, ఆలోచనాశక్తి మీద పెత్తందార్లకు చిన్నచూపు. అందుకే మిమ్మల్ని ప్రలోభపెట్టాలని చూస్తున్నారు. మిత్రులారా! మీ చైతన్య స్థాయిని చాటిచెప్పండి. విప్లవకర ఎజెండాను జెండాగా ఎగరేయండి! వర్దెల్లిమురళి -
చిక్కుల్లో హరియాణా సర్కారు!
రాష్ట్రాల్లో అవకాశం చిక్కినచోటల్లా విపక్ష ప్రభుత్వాలను అస్థిరపరిచి, అధికారాన్ని చేజిక్కించు కోవటం అలవాటైన బీజేపీకి తొలిసారి సంకటస్థితి వచ్చిపడింది. హస్తినకు కూతవేటు దూరంలోవున్న హరియాణాలో ఆ పార్టీ ప్రభుత్వం సమస్యల్లో చిక్కుకుంది. సార్వత్రిక ఎన్నికల వేళ... రోడ్ షోలతో హోరెత్తించాల్సిన సమయంలో బీజేపీకి ఇదేమంత మంచి శకునం కాదు. అసలే ఉత్తరాదిలో బీజేపీ బలహీనపడిందని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. కనుక హరియాణా మాత్రమే కాదు... ఎన్నికలు జరగాల్సిన వేరే రాష్ట్రాల్లో కూడా వోటర్లకు వేరే సంకేతాలు వెళ్తాయి.ఈ నెల 25న ఆ రాష్ట్రంలోని పది లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతుండగా మంగళవారం ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు. దాంతో 90 మంది సభ్యులున్న హరియాణా అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. పైకి గంభీరంగా కనబడుతున్నా లోక్సభ ఎన్నికల హడావుడిలో తలమునకలైన బీజేపీకి దీంతో ఊపిరాడటం లేదు. ఎంపీలుగా పోటీ చేసేందుకు ఇద్దరు బీజేపీ సభ్యులు రాజీనామా చేయటంతో అసెంబ్లీలో ప్రస్తుతం 88 మంది సభ్యులున్నారు. ప్రభుత్వం సాగాలంటే బీజేపీకి 45 మంది మద్దతు అవసరం కాగా ఇద్దరు ఇండిపెండెంట్లు, హరి యాణా లోక్హిత్ పార్టీ సభ్యుడు బీజేపీకి మద్దతునిస్తున్నారు. అంటే బీజేపీ బలం 43కి పడిపోయింది. రెండు నెలల క్రితం బీజేపీ–జేజేపీ కూటమి సర్కారుకు నాయకత్వం వహిస్తున్న ఖట్టర్ను తొలగించి ఆయన స్థానంలో బీజేపీ అధిష్టానం నయాబ్సింగ్ సైనీని తీసుకొచ్చింది. దాంతోపాటు పదిమంది ఎమ్మెల్యేలున్న జన్నాయక్ జనతాపార్టీ (జేజేపీ)తో తెగతెంపులు చేసుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో వున్న పది స్థానాలూ గెల్చుకున్న బీజేపీ ఈసారి ఎన్నికల్లో జేజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వదల్చుకోలేదు. సహజంగానే అంతవరకూ ఉపముఖ్యమంత్రిగా వున్న జేజేపీ నేతదుష్యంత్ చౌతాలాకు ఇది ఆగ్రహం తెప్పించింది. కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా చలవతోనే ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీ సర్కారుకు మద్దతు ఉపసంహరించు కున్నారన్నది వాస్తవం. అయితే కాంగ్రెస్ గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే మద్దతిస్తామంటున్న జేజేపీ వాస్తవ బలమెంతో చెప్పలేం. ప్రస్తుత బేరసారాల్లో ఆ పార్టీకున్న పదిమంది ఎమ్మెల్యేల్లో ఎందరు మిగులుతారన్నది అనుమానమే. వారిలో నలుగురి మద్దతు తమకే వున్నదని సైనీ చెప్పు కుంటున్నారు. వారిని అనర్హులుగా ప్రకటించాలని జేజేపీ కోరినా అది బీజేపీకే తోడ్పడుతుంది. ఉన్న 88 మందిలో నలుగుర్ని అనర్హులను చేయగానే సభలో సభ్యుల సంఖ్య 84కి పడిపోతుంది. దాంతో 43 మంది మద్దతున్న బీజేపీ ప్రభుత్వం సునాయాసంగా బయటపడుతుంది.లోక్సభ ఎన్నికల ప్రచారం హోరెత్తుతుండగా ప్రభుత్వ అస్తిత్వానికే ముప్పు ఏర్పడటం హరి యాణా ప్రజానీకానికి మంచి సంకేతం పంపదు. ఎమ్మెల్యేల బేరసారాలు కళ్లముందు స్పష్టంగా కన బడుతుండగా సుదీర్ఘ క్యూ లైన్లలో ఓపిగ్గా నిలబడి వోటేసేంత ఉత్సాహం ఎందరికుంటుంది? వచ్చే అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా ఈ కుర్చీలాట మొదలుకావటం వింత. రాష్ట్రంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదనటానికి ఈ సంక్షోభం సంకేతమని కాంగ్రెస్ నాయకుడు హుడా చెబుతున్నారు. నిజానికి జనం అలా అను కోవాలని, లోక్సభ ఎన్నికల్లో తమకే పట్టం కట్టా లని ఆయన ఆత్రుత పడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఫిరాయింపులకు ఎవరు పాల్పడినా తప్పే. వేరే రాష్ట్రాల్లో బీజేపీ చేసినప్పుడు విమర్శించిన కాంగ్రెస్ హరియాణాలో అదే పనికి పూనుకోవటం నైతికంగా సరైందేనా? రాష్ట్రపతి పాలన కాంగ్రెస్ ఉద్దేశమని కొందరంటున్నారు. అందుకే మద్దతిస్తా మంటూ జేజేపీ ముందుకొచ్చినా హుడా సాను కూలత చూపలేదని వారి వాదన. లోక్సభ ఎన్నికల జంజాటం లేకపోతే కొన్ని గంటల్లోనే బీజేపీ సునాయాసంగా చక్కదిద్దగలిగేది. కేంద్రంలో తాముండగా హరియాణాలో సొంత ప్రభుత్వాన్ని దించి రాష్ట్రపతి పాలనకు బీజేపీ సిద్ధపడటం కల్ల. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టీ హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయపై పడింది. బీజేపీకి లబ్ధి చేకూరేందుకు వీలుగా ప్రస్తుత ఎన్నికలు ముగిసేవరకూ సంక్షోభాన్ని కొనసాగించటం మాత్రం మంచిది కాదు. పాలకపక్షం సత్తాపై సంశయం ఏర్పడినప్పుడు నేరుగా అసెంబ్లీలోనే బలపరీక్షకు సిద్ధపడాలని కోరటం అన్నివిధాలా శ్రేయస్కరం. సంక్షోభాన్ని కొనసాగనిస్తే అనారోగ్యకర పరిణా మాలకు చోటిచ్చినట్టవుతుంది. ప్రభుత్వాల బలాబలాలు చట్టసభల్లో తేలాలి తప్ప రాజ్భవన్లలో కాదని చాన్నాళ్ల క్రితమే సుప్రీంకోర్టు చెప్పింది. ఒకవేళ వెంటనే బలపరీక్ష నిర్వహించటం సాధ్యంకాదనిపిస్తే కొంత వ్యవధి తీసుకోవచ్చు. అయితే ఈలోగా రాష్ట్రపతి పాలన విధించటమే ఉత్తమం. కేంద్రం తీసుకొచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పంజాబ్ రైతులతోపాటు హరియాణా రైతులు కీలక పాత్ర పోషించారు. ఇటీవలి రైతు ఉద్యమంలో కూడా వారి పాత్ర తక్కు వేమీ కాదు. రిజర్వేషన్లు కావాలంటూ 2016లో జాట్లు సాగించిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. అది కులాల మధ్య కుంపట్లు రాజేసింది. మరోపక్క ఉపాధి అవకాశాలు కరువై యువ తలో తీవ్ర నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి. ఖట్టర్ను సీఎం పదవి నుంచి తొలగించి సైనీని ప్రతిష్టించటం జాట్లకు ఆగ్రహం కలిగించిందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయపు టెత్తుల్లో అధికార, విపక్షాలు రెండూ తలమునకలైతే ఇప్పటికే ఉన్న సమస్యలు రెట్టింపవుతాయి. కనుక ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే కోణంలో కాకుండా సాధ్యమైనంత త్వరగా ఈ రాజకీయ సంక్షోభానికి ముగింపు పలకాలి. -
భరోసా కావాలి!
పిల్ల పోయినా... పురుటి కంపు పోలేదని ఒక ముతక సామెత. కరోనా అనే మాట క్రమంగా విన మరుగవుతూ వస్తున్నా, దాని ప్రకంపనలు మాత్రం మానవాళిని ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నాయి. కరోనా టీకా కోవిషీల్డ్పై తాజాగా వస్తున్న వార్తలే అందుకు తార్కాణం. సదరు టీకా తీసుకోవడం వల్ల మనిషిలో రక్తం గడ్డలు కట్టడం, రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడం (వైద్య పరిభాషలో ‘థ్రోంబో సైటోపేనియా సిండ్రోమ్’ – టీటీఎస్) లాంటి అరుదైన దుష్ప్రభావాలుంటాయని దాన్ని రూపొందించిన బ్రిటన్ దిగ్గజ ఔషధ సంస్థ ఆస్ట్రాజెనెకా లండన్ కోర్టులో ఒప్పుకుంది. దాంతో గత వారం గందరగోళం మొదలైంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఆ టీకాను ఉపసంహరిస్తు న్నట్టు ఆస్ట్రాజెనెకా బుధవారం ప్రకటించడంతో, భారత్లో కోవిషీల్డ్గా, యూరప్లో వాక్స్జెవ్రి యాగా అమ్ముడైన కోవిడ్ టీకాపై రచ్చ పరాకాష్ఠకు చేరింది. కరోనా టీకాల భద్రతపై చాలాకాలంగా జరుగుతున్న చర్చలకు తాజా పరిణామాలు యాదృచ్ఛికంగా కొత్త ఊపిరినిచ్చాయి. మన దేశంలో సుప్రీమ్ కోర్ట్ సైతం ఆస్ట్రాజెనెకా టీకాపై వచ్చిన పిటిషన్ విచారణకు అంగీకరించడం గమనార్హం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే – కోవిడ్ మహమ్మారితో ప్రపంచం అల్లాడుతున్న సమయంలో ప్రజారోగ్యంలో ఆక్స్ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా టీకా కీలక భూమిక పోషించింది. క్లినికల్ పరీక్షల అనంతరం 2021 జనవరి 4న టీకా తొలి డోస్ వినియోగించారు. ఆ ఒక్క ఏడాదే దాదాపు 250 కోట్ల డోసులు వేశారు. లక్షలాది ప్రాణాలను కాపాడారు. 2021 ప్రథమార్ధంలో భారతదేశంలో డెల్టా వేరియంట్ పెచ్చరిల్లినప్పుడు కూడా ఇదే సంజీవని. ప్రపంచదేశాల మధ్య టీకాల సరఫరాలో చిక్కులున్నప్పుడూ ఆ మానవతా సంక్షోభ పరిష్కారానికి అందుబాటులో ఉన్న కొన్నిటిలో ఇదీ ఒకటి. ఫైజర్, మోడర్నా, నోవావ్యాక్స్, వగైరాల లానే ఈ టీకా కూడా అనేక స్థాయుల పరీక్షలకు లోనైంది. మూడు విడతల ట్రయల్స్లో వేలాది ప్రజలపై పరీక్షలు చేసి, సురక్షితమనీ, ప్రభావశీలమనీ తేలాకనే అను మతులిచ్చారు. బ్రిటన్ సహా యూరప్లోని పలు దేశాల్లో 2021 ఆరంభంలో దీన్ని పంపిణీ చేశారు.నిజానికి, ఈ టీకా వినియోగం వల్ల కొన్ని దుష్ఫలితాలు ఉండవచ్చని బ్రిటన్ ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలోనే చెప్పింది. కానీ, ప్రపంచవ్యాప్తంగా వారానికి 40 లక్షల కొత్త కేసులొస్తూ, కరోనా తీవ్రత భయం రేపుతున్న సమయమది. దిక్కుతోచని ఆ పరిస్థితుల్లో... టీకాతో అరుదుగా వచ్చే ముప్పు కన్నా ఉపయోగాలే ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటివి భావించాయి. పైగా, మహిళలు వాడే గర్భనిరోధక మాత్రల లాంటి అనేక ఇతర ఔషధాలతో పోలిస్తే ఈ టీకాతో రక్తం గడ్డలు కట్టే రేటు బాగా తక్కువనీ, ప్రతి వెయ్యిమందిలో ఒక్కరికే ఆ ప్రమాదం ఉంటుందనీ లెక్కల్లో తేల్చారు. అందుకే, ప్రపంచ క్షేమం కోసం ఈ టీకాను కొనసాగించారు. ఇక, భారత్ సంగతెలా ఉన్నా విదేశాల్లో కరోనా టీకాతో సహా ఏ ఔషధంతో ఇబ్బంది తలెత్తినా బాధితులకు నష్టపరిహార పథకాలున్నాయి. అయితే, అక్కడ కూడా నష్టపరిహారం అందడంలో చిక్కులు ఎదురవడంతో సమస్య వచ్చింది. టీటీఎస్ వల్ల బ్రిటన్లో కనీసం 81 మంది చనిపోగా, వందల మంది అనారోగ్యం బారిన పడ్డారు. నష్టపరిహారం కోరుతూ బాధిత కుటుంబాలు కోర్టుకెక్కాయి. అలా దాదాపు 51 కేసులు ఎదుర్కొంటున్న ఆస్ట్రాజెనెకా లండన్లోని హైకోర్ట్లో తొలిసారిగా టీకా దుష్ప్రభావాలను అంగీకరించింది. సహజంగానే ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా 175 కోట్లకు పైగా కోవిషీల్డ్ టీకా డోసులు తీసుకున్న మన దేశ ప్రజానీకంలో కలకలం రేపింది. ఒక దశలో లక్షలాది ప్రజానీకాన్ని కాపాడి, ప్రపంచానికి రక్షాకవచంగా కనిపించిన టీకా ఇప్పుడిలా భయాందోళనలకు కారణం కావడం విచిత్రమే. కానీ, ప్రాణాంతక మహమ్మారిని కట్టడి చేసేందుకు మరో మార్గం లేని దశలో ఈ టీకాలే దిక్కయ్యాయని మర్చిపోరాదు. ప్రాణరక్షణ కోసం ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలూ, ఔషధ సంస్థలూ టీకాలను తీసుకురావడంలో కొంత హడావిడి పడివుండవచ్చు. లాభనష్టాలపై ప్రజల్ని మరింత చైతన్యం చేసి, టీకా కార్యక్రమం చేపట్టి ఉండవచ్చు. అయితే, కోట్లాది ప్రాణాలకు ముందుగా ప్రాథమిక భద్రతే ధ్యేయంగా టీకాల వినియోగం త్వరితగతిన సాగిందని అర్థం చేసు కోవాలి. పైగా, టీకా దుష్ప్రభావాలు అత్యంత అరుదుగా కొందరిలోనే కనిపిస్తాయని వైద్య నిపు ణులు ఇప్పటికీ స్పష్టం చేస్తున్నందున అతిగా ఊహించుకొని ఆందోళన చెందడం సరికాదు.ఆస్ట్రాజెనెకా వారి టీకా మంచిదే అయినా, ఫైజెర్, మోడర్నా లాంటి ఇతర టీకాలు మెరుగైనవని నిపుణుల మాట. మరింత భద్రత, ప్రభావశీలత ఉన్న ఎంఆర్ఎన్ఏ వెర్షన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దానికి తోడు బాధితుల కేసులు. ఫలితంగా, ఆస్ట్రాజెనెకా తన టీకాలను ఉపసంహ రించుకోక తప్పలేదు. కోర్టు కేసులకూ, తమ ఉపసంహరణకూ సంబంధం లేదనీ, రెండూ కాకతాళీ యమేననీ ఆ సంస్థ చెబుతున్నా, ఇదంతా నష్టనివారణ చర్యల్లో భాగంగానే కనిపిస్తోంది. అది అటుంచితే, రోగుల భద్రతే తమ ప్రాధాన్యమని ఆస్ట్రాజెనెకా పునరుద్ఘాటిస్తే సరిపోదు. టీకా వాడకం వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్యలకు విరుగుడు ఆలోచించి, ప్రజల్లో భరోసా పెంచాలి. బాధ్యత వహించి, బాధిత రోగులకు సత్వర నష్టపరిహారం చెల్లించి తీరాలి. టీకాలో లోపమెక్కడ జరిగిందో క్షుణ్ణంగా పరిశోధించాలి. ప్రభుత్వాలు సైతం ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. టీకా వినియోగం సురక్షితమేనని ప్రకటించడానికి అనుసరిస్తున్న ప్రమాణాలేమిటో ఒకసారి సమీక్షించాలి. కఠినమైన ప్రమాణాలు పాటించకుండానే కోవిషీల్డ్ వినియోగానికి పచ్చజెండా ఊపిన నియంత్రణ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే, ప్రస్తుత పరిణామాలతో ప్రజలకు టీకాల పైన, వాటి తయారీదార్లపైన, చివరకు ఆరోగ్య వ్యవస్థ మీదే నమ్మకం సడలితే అది మరింత ప్రమాదం. -
అన్నీ తెలిసినా అలసత్వమే!
సమస్య తెలుసు... దానికి పరిష్కారమూ తెలుసు... తక్షణమే అందుకు నడుము కట్టకపోతే మానవాళి జీవనానికే ప్రమాదమనీ తెలుసు. అన్నీ తెలిసినా ప్రపంచ దేశాలు ఇప్పటికీ ఒక్కతాటి మీదకు రాలేకపోతున్నాయంటే ఏమనాలి? ప్రపంచాన్ని పీడిస్తున్న ప్లాస్టిక్ కాలుష్యభూతంపై పరిస్థితి సరిగ్గా అదే! సరికొత్త అంతర్జాతీయ ఒడంబడిక నిమిత్తం గత వారం ఒట్టావాలో జరిగిన సమావేశం స్పష్టమైన నిర్ణయాలేమీ తీసుకోకుండానే చప్పగా ముగిసింది. అందరిలోనూ అసంతృప్తి మిగిల్చింది. 192 దేశాల ప్రతినిధులు వారం పాటు సమావేశమై చర్చలు జరిపినా, ఆఖరి రోజున సమావేశాన్ని అర్ధ రాత్రి దాకా పొడిగించినా ఫలితం లేకపోయింది. ఒప్పందంపై ఒక నిర్ణయం కుదరలేదు. ప్లాస్టిక్ భూతాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందని అధిక భాగం దేశాలు అంగీకరించినప్పటికీ, ఉత్పత్తిపై పరిమితులు విధించడం మీద ఒక్కతాటిపైకి రాలేకపోయాయి. ఇది నిరాశ కలిగించే పరిణామం.పెట్రోలియమ్ ఉప ఉత్పత్తులైన ప్లాస్టిక్లపై దేశాల ఆలోచనలు వేర్వేరుగా ఉన్నాయి. అభివృద్ధి చెందిన అనేక ధనిక దేశాల్లో ప్లాస్టిక్ల తయారీ, పంపిణీ పరిశ్రమ జోరుగా సాగుతోంది. సహజంగానే పెట్రోకెమికల్ పరిశ్రమ వృద్ధిచెందిన ఆ దేశాలు, పారిశ్రామిక గ్రూపులేమో ప్లాస్టిక్ ఉత్పత్తిపై పరిమితి విధించాలనే యోచనను వ్యతిరేకించాయి. ప్రస్తుతానికి వాటి మాటే పైచేయి కాగా, ఒడంబడికపై నిర్ణయం అక్కడికి ఆగింది. ప్లాస్టిక్పై అంతర్జాతీయ ఒడంబడిక ప్రక్రియ 2022లోనే మొదలైంది. ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి, వాటి ఉత్పత్తిని ఆపేయడానికి ఒక నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. అందుకోసం ప్రభుత్వ ప్రతినిధులతో కూడిన అంతర్ ప్రభుత్వ చర్చల కమిటీని ఏర్పాటు చేశాయి. ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఒడంబడికను ఖరారు చేయాల్సి ఉంది. అందులో భాగంగానే తాజాగా ఒట్టావాలో నాలుగో విడత చర్చలు జరిగాయి. ఇవాళ వివిధ రకాల ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోయింది. అందుబాటు ధరల్లో ప్రత్యామ్నా యాలు లేని పరిస్థితి. ఇది పెద్ద ఇబ్బంది. గణాంకాలలో చెప్పాలంటే... ఏటా ప్లాస్టిక్ ఉత్పత్తి 1950లో 20 లక్షల టన్నులుండేది. 2019 నాటికి 4600 లక్షల టన్నులకు చేరింది. వచ్చే 2060 నాటికి అది అంతకు మూడింతలు అవుతుందని అంచనా. దానికి తోడు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నానాటికీ తీసి కట్టుగా మారింది. పైపెచ్చు, భూమిలో కలవని ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రస్తుతం ఏటా 740 టన్నులుండగా, రానున్న 2050 నాటికి అది ఏటా 1220 లక్షల టన్నులకు చేరనుంది. విధానపరమైన మార్పులు చేపట్టకుంటే ఇది పెను సమస్యే. అందుకే, వ్యర్థాల లోపభూయిష్ట నిర్వహణను వచ్చే 2040 కల్లా సున్నా స్థాయికి తేవాలనేది లక్ష్యంగా ఒడంబడిక ప్రక్రియకు రెండేళ్ళ క్రితమే శ్రీకారం చుట్టారు. వ్యర్థాలే కాదు... అసలు ప్లాస్టిక్ ఉత్పత్తే పర్యావరణానికి పెను ప్రమాదం. ప్లాస్టిక్ భూమిలో కలసిపోదు గనక పర్యావరణానికీ, ప్రజారోగ్యానికీ పెద్ద దెబ్బ. ప్లాస్టిక్ ఉత్పత్తితో గ్రీన్ హౌస్ వాయు వులు వెలువడి భూతాపం పెరుగుతుంది. ప్లాస్టిక్ ఉత్పత్తికి ఉపకరించే పెట్రోకెమికల్స్ తయారీకై శిలాజ ఇంధనాల వెలికితీత, రిఫైనింగ్తో ఒక్క 2019లోనే 2.24 గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలోకి వదిలినట్టయిందట. పాత లెక్కల వంతున ఏటేటా 4 శాతం ప్లాస్టిక్ ఉత్పత్తి పెరిగినా సరే, వచ్చే 2050 నాటికి ఇది మూడు రెట్లై ఈ గ్రీన్హౌస్ వాయువుల పరిమాణం 6.78 గిగా టన్నులకు చేరుతుంది. ఒడంబడికతో ఈ పరిమాణాన్ని 26 శాతం మేర తగ్గించాలని లక్షించారు. మనం వాడే ప్లాసిక్లలో 16వేల రకాల రసాయనాలుంటాయి. వాటిలో కనీసం 4200 విషపూరితమే. వాటి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో 2015లో అమెరికాలో 9200 కోట్ల డాలర్ల పైగా ఖర్చయింది. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్ల వినియోగం తగ్గించాలనీ, వాటిని రీసైక్లింగ్ చేయాలనీ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కానీ, అవేవీ ఇప్పటి దాకా అనుకున్నంత విజయం సాధించలేదు. ఉత్పత్తిపై పరిమితులు విధించడం కన్నా, వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగంపై దృష్టి పెట్టాలని తాజా భేటీలోనూ ప్రధాన దేశాలు పట్టుబట్టాయి. అయితే, కేవలం వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్లతో ప్లాస్టిక్ సంక్షోభానికి ఫుల్స్టాప్ పెట్టడం జరగని పని. నిష్ఠురమైనా అది నిజం. ప్రపంచంలో పోగైన ప్లాస్టిక్ వ్యర్థాల్లో 10 శాతమే ఇప్పటి దాకా పునర్వినియోగమైంది. మిగతా వ్యర్థాలన్నీ సముద్రాలు, నేలల్లో మిగిలాయి. ప్లాస్టిక్ ఉత్పత్తి మాత్రం ఏటేటా పెరుగుతూ పోతోంది. అందుకే, ప్లాస్టిక్ల ఉత్పత్తిపై నియంత్రణకు ప్రపంచ దేశాలు వీలైనంత తొందరగా ఒక అంగీకారానికి రావాల్సి ఉంది. ఒట్టావా సమావేశంలో కొంత పురోగతి సాధించినట్టు ఐరాస అంటున్నా, అది వట్టి కంటి తుడుపే!కొన్నేళ్ళుగా మైక్రో, నానో ప్లాస్టిక్లు మానవ రక్తంలో, చివరకు గర్భిణుల మావిలోనూ కనిపిస్తు న్నాయని శాస్త్రవేత్తల మాట. ఇది ఆందోళనకర పరిణామం. అందుకే, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ చాలదు. ఉత్పత్తిని బాగా తగ్గించడమే దీర్ఘకాలంలో ఉపయోగం. మన దేశం 2022లోనే ‘ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు’ తీసుకొచ్చి, 19 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించింది. అయితే, ప్రాంతానికో రకం నిబంధనలున్నందున వాటి వినియోగం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. దీనిపై దృష్టి సారించాలి. ప్రపంచ దేశాలు ఈ ఏడాదిలోనే మరో విడత బుసాన్లో సమావేశం కానున్నాయి. అప్పటికైనా అవి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మొదలైన వందేళ్ళ లోపలే మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిన ప్లాస్టిక్లపై పోరుకు ఒక్క మాట మీద నిలవాలి. ధనిక దేశాలు తమ వాణిజ్య ప్రయోజనాలకు పక్కనబెట్టి మరీ ప్లాస్టిక్ భూతాన్ని పారదోలే పనిలో మిగతా దేశాల చేయి పట్టుకొని ముందుకు నడవాలి. ప్రమాదం తెలుస్తున్నా పట్టించుకోకుండా, పరిష్కారంపై చర్చలను ప్లాస్టిక్ లాగా సాగదీస్తూ పోతే మనకే కష్టం, నష్టం. -
గుట్టలుగా... అవినీతి కట్టలు
ఆరు కౌంటింగ్ మిషన్లు... పదుల కొద్దీ సిబ్బంది... 12 గంటల పైగా లెక్కింపు... 32 కోట్లకు పైగా విలువైన నగదు... దాదాపు అన్నీ అయిదొందల నోట్లు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని గాడీఖానా చౌక్లోని ఆ చిన్న రెండు బెడ్రూమ్ల ఫ్లాట్లో అంత పెద్ద మొత్తం, పెద్ద పెద్ద సంచీల కొద్దీ నోట్ల కట్టలు ఉంటాయని ఎవరూ ఊహించరు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో పేరుకుపోయిన అవినీతికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం నాటి సోదాల్లో ఎదురైన దృశ్యాలే కళ్ళుచెదిరే సాక్ష్యాలు. సదరు శాఖ మంత్రి గారి వ్యక్తిగత కార్యదర్శి ఇంట, ఆ కార్యదర్శికి పనివాడి ఫ్లాట్లో, ఇతరుల వద్ద సోదాల్లో మొత్తం కలిపి రూ. 35 కోట్ల పైనే బయటపడేసరికి అంతా అవాక్కయ్యారు. అంతలేసి ధనం లెక్కాపత్రం లేకుండా ఎవరింట్లోనైనా ఉందంటే, అది అక్రమధనం కాక మరేమిటి? ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్’ (పీఎంఎల్ఏ) కింద వారిద్దరినీ అరెస్ట్ చేశారు. ఇక, మంగ ళవారం రాంచీలో మరో 5 చోట్ల సోదాలు జరిపితే, ఓ కాంట్రాక్టర్ వద్ద 1.5 కోట్లు దొరికాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్... ఇలా ప్రాంతాలు, ప్రభుత్వాలు ఏవైనా సోదా చేస్తే చాలు... నల్లధనం విశ్వరూపం గుట్టల కొద్దీ కట్టల రూపంలో సాక్షాత్కరిస్తున్న తీరు ఆందోళనకరం.జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పై నుంచి కింద దాకా సమస్తం అవినీతిమయమేనని ఈడీ మాట. తీగ లాగితే డొంకంతా కదలడానికి తాజా కేసు ఉదాహరణ. గత ఏడాది ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర∙గ్రామీణాభివృద్ధి శాఖలో ఛీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్ను ఈడీ అరెస్ట్ చేసింది. కేవలం పదివేల రూపాయల లంచం తీసుకున్నందుకు జరిగిన ఆ అరెస్టు కథ చివరకు అనూహ్యంగా ఇంత పెద్ద కరెన్సీ గుట్టు విప్పింది. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో చిన్నస్థాయిలోనే ఉన్నప్పటికీ, అవినీతి పరులైన ఉద్యోగులు నిఘా సంస్థల కంటబడకుండా తమ అక్రమార్జనను ఎలా తరలిస్తున్నదీ వీరేంద్రరామ్ విచారణలో తెలిసింది. సంక్లిష్టమైన అవినీతి వ్యవస్థలో తాను, తన లాంటి అధికారుల కోటరీ ఎలా భాగమైనదీ, టెండర్ల ప్రక్రియ సందర్భంగా లంచం సొమ్మును వివిధ మార్గాల్లో తరలించే పద్ధతీ ఆయన బయటపెట్టారు. ఆ వివరాలకు తగ్గట్లే... గ్రామీణాభివృద్ధి శాఖలో విస్తృతంగా అవినీతి సాగుతోందని గ్రహించిన ఈడీ తగిన చర్య చేపట్టాల్సిందిగా గత ఏడాది మేలోనే రాష్ట్ర సర్కారుకు గోప్యంగా లేఖ రాసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పెద్దగా స్పందించలేదు. పైగా, నిఘా నీడలోని అవినీతి అధికారుల చేతిలోనే ఆ లేఖ పడడం విడ్డూరం.తిరుగులేని సాక్ష్యాధారాలు లభించడంతో గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగిర్ ఆలమ్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్లాల్ సహా పలువురు కీలక అనుమానితులపై ఈ సోమవారం ఈడీ దాడులు జరిపింది. కాంట్రాక్టులు ఇస్తూ అవినీతి ముఠాలో కీలకంగా వ్యవహరిస్తూ, లాల్ కోట్లు కూడ బెట్టారట. లాల్ పనివాడి ఇంట్లో ఏకంగా రూ. 32 కోట్ల పైగా డబ్బు గుట్టలుగా దొరకడంతో వ్యవహారం సంచలనమైంది. ఇదికాక, మరో వ్యక్తి ఇంట్లో మరో 3 కోట్లు దొరికిందంటే, అక్కడి ప్రభుత్వ శాఖలో ఏ స్థాయిలో అక్రమాలు, అవినీతి రాజ్యమేలుతున్నాయో అర్థమవుతోంది. ఈడీ దాడుల్లో లభించిన దస్తావేజులను బట్టి ముందుగా ఊహించిట్టే ఇందులో మంత్రి గారి హస్తం ఉండనే ఉందని రుజువవుతోంది. ఆయన మెడకు ఉచ్చు బిగుస్తోంది. జార్ఖండ్లోని పాకూర్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డెబ్భై ఏళ్ళ ఈ సీనియర్ కాంగ్రెస్ నేతను ఈడీ ప్రశ్నించడమే ఇక బాకీ. పనివాడినీ, అతని ఇంటిని అవినీతి సొమ్ముకు గిడ్డంగిగా మార్చిన వ్యక్తిగత కార్యదర్శినీ అరెస్ట్ చేసినా అమాత్యవర్యులు అదరక, బెదరక అమాయకత్వం ప్రకటిస్తుండడం విడ్డూరం. జార్ఖండ్లోని చంపాయ్ సోరెన్ ప్రభుత్వంపై పడ్డ ఈ అవినీతి మచ్చ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి బాగా అంది వస్తోంది. కాంగ్రెస్కు పెద్దదిక్కయిన గాంధీ కుటుంబానికి సన్నిహితులైన వారి ఇళ్ళల్లోనే గతంలోనూ, మళ్ళీ ఇప్పుడూ... ఇంత భారీగా అక్రమ ధనం లభించడాన్ని వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రస్తావిస్తున్నారు. అవినీతిని ఆపడానికి తాను ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తమను విమర్శిస్తున్నాయని ఆయన వాదన. కాగా, ఇదంతా ప్రత్యర్థులే లక్ష్యంగా మోదీ సర్కార్ సాగిస్తున్న దర్యాప్తు సంస్థల దుర్వినియోగమని ప్రతిపక్ష కూటమి ఆరోపణ. గత డిసెంబర్లో జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూకు చెందిన ఒడిశా మద్యం డిస్టిలరీల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిపితే, కనివిని ఎరుగని రీతిలో రూ. 350 కోట్ల పైగా మొత్తం దొరికిన సంగతి తెలిసిందే. పరస్పర ఆరోపణలెలా ఉన్నా, ఈ ఘటనలన్నీ ప్రమాదకరమైన పరిణామాన్ని సూచిస్తు న్నాయి. అక్రమధనంపై దీర్ఘకాలంగా దేశవ్యాప్త ఉద్యమం జరుగుతూనే ఉంది. దర్యాప్తు సంస్థలు చురుగ్గానే ఉన్నాయి. అయినా సమస్య తీరకపోగా, కొత్తవి బయటపడడం పెను సవాలు. అవినీతిని అంతం చేసి, అక్రమధనాన్ని అందరికీ పంచిపెడతామంటూ ప్రగల్భాలు పలికిన నేతలు గత పదేళ్ళుగా గద్దె మీదే ఉన్నారు. అవినీతి, కుటుంబ పాలనపై పోరాటమని చెబుతూనే వస్తున్నారు. ఫలితం శూన్యం. పెద్దనోట్ల రద్దు లాంటివి ఎంత విఫలయత్నాలో అర్థమవుతూనే ఉంది. ఈడీ, ఐటీ, సీబీఐ కేసుల్లో నిందితులైన నేతలు సైతం జెండా మార్చి, కాషాయం కప్పుకుంటే పరమ పునీతులైపోతున్న పరిస్థితులూ చూస్తున్నాం. ఏలికల చేతుల్లో ఏజెన్సీలు, పీఎంఎల్ఏ లాంటి అసమంజస కఠిన చట్టాలున్నా సమస్య తీరకపోవడానికి కారణమేమిటో ఆలోచించాలి. ఇవాళ వ్యాపారం, రాజకీయాలు, సమాజం ఏ స్థితికి చేరాయో గ్రహించాలి. నేతలు, అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై ఒకరి కోసం ఒకరు నడిచే తీరు దేశానికి క్షేమం కాదు. ఎన్నికల వేళ ఈ అక్రమధనం పెనుసమస్య. దాని పర్యవసానాలు ఎన్నికలపైనే కాదు, ఆ తర్వాతా ఉంటాయని విస్మరించరాదు. -
రాయ్బరేలీ వ్యూహం
ఎట్టకేలకు ఒక చర్చ ముగిసింది, మరో చర్చ మొదలైంది. కాంగ్రెస్ నేత, గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ శుక్రవారం రాయ్బరేలీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడంతో ఉత్తర ప్రదేశ్లో ఆయన పోటీ చేస్తారా, లేదా అన్న చర్చకు ఫుల్స్టాప్ పడింది. అదే సమయంలో 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతీ ఇరానీ చేతుల్లో ఓటమి పాలైన అమేథీని కాకుండా, ఇటీవల రాజ్యసభకు వెళ్ళేంత వరకు తన తల్లి ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీని ఆయన ఎన్నుకోవడంతో కొత్త చర్చ మొదలైంది. భారత రాజకీయాలకు గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్ నుంచి మళ్ళీ పోటీ చేసేందుకు రాహుల్ తీసుకున్న నిర్ణయంపై అంచనాలున్నాయి, అనుమానాలూ ఉన్నాయి. ఈ పోటీతో ఎన్నికల వ్యూహంలోనూ, ఇటు విస్తృత రాజకీయ కథనంలోనూ కాంగ్రెస్ పార్టీ గట్టి మార్పు తెస్తున్నట్టు కనిపిస్తోంది. ఉత్తరాదిన పార్టీకి మళ్ళీ జవసత్వాలు అందించడానికి దీన్ని ఒక అవకాశంగా కాంగ్రెస్ భావిస్తోంది. అమేథీ స్థానంలో కాకున్నా కుటుంబానికి కలిసొచ్చిన రాయ్బరేలీని ఎంచుకోవడం ద్వారా యూపీ ఎన్నికల క్షేత్రంలో పార్టీకి రాహుల్ కొత్త ఉత్సాహం తెచ్చారనుకోవాలి. చిరకాలంగా గాంధీ కుటుంబ వారసులే పోటీ చేస్తున్న కంచుకోట లాంటి అమేథీ స్థానాన్ని... నియోజకవర్గం బాగోగులు చూసే మరో విధేయ నేత కేఎల్ శర్మకు కట్టబెట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 20 ఎన్నికల్లో 17 సార్లు కాంగ్రెస్కే జై కొట్టిన స్థానం రాయ్బరేలీ. ప్రధాని ఇందిరాగాంధీ మొదలు పలువురు గాంధీ కుటుంబ సభ్యులకు పట్టం కట్టిన మరో కంచుకోట. అక్కడ పోటీ ద్వారా యూపీలో క్రియాశీలకంగా నిలవడమే కాక, తనపై బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు రాహుల్ వీలు చిక్కించుకున్నారు. అయితే, ఆఖరు నిమిషంలో ప్రకటించిన ఈ అభ్యర్థిత్వంతో అనేక సవాళ్ళూ తప్పవు. వాటిని ఎలా అధిగమించి, సంక్లిష్ట సామాజిక – రాజకీయ కోణాలున్న హిందీ హార్ట్ల్యాండ్లో పట్టు సాధిస్తారన్నది చూడాలి. ఆ రాష్ట్రంలో బీజేపీకి ఉన్నంత బలమైన ఎన్నికల యంత్రాంగం, పార్టీ వ్యవస్థ ప్రస్తుతం కాంగ్రెస్కు లేకపోవడం లోటు. వాటిని అధిగమించి, ప్రస్తుత ఉత్సాహాన్ని ఎన్నికల లబ్ధిగా ఎలా మలచగలుగుతారో వేచిచూడాలి. నిజానికి, క్రితంసారి ఉత్తరాదిన కాంగ్రెస్ ఊపు తగ్గినా దక్షిణాదిలో ఉనికి నిలిపిన కేరళలోని వయనాడ్ స్థానమంటే సహజంగానే రాహుల్కు ప్రత్యేక అభిమానం. అది ఆయన మాటల్లో, చేతల్లో కనిపిస్తూనే ఉంటుంది. దక్షిణాదిన హస్తం హవా కొనసాగేందుకు వయనాడ్ భావోద్వేగ బంధంగా ఉపకరిస్తుందని ఆయన ఆలోచన. అందుకే, ఈసారీ ఆయన అక్కడ నుంచి కూడా పోటీ చేశారు. వయనాడ్లో రాహుల్ స్థానికేతరుడనీ, యూపీలో గెలిస్తే ఈ స్థానాన్ని వదిలేస్తాడనీ ప్రత్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నందు వల్లే అక్కడ ఎన్నికలయ్యేంత వరకు తెలివిగా తన రాయ్బరేలీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదు. ఆఖరి వరకూ అమేథీ, రాయ్బరేలీలలో పోటీ అంశాన్ని సస్పెన్స్లోనే ఉంచుతూ, అధికార పార్టీని ఇరుకునపెట్టారు. బీజేపీ సైతం పోటీకి భయపడి రాహుల్ వెనుకంజ వేస్తున్నారన్న ప్రచారంతో ఒత్తిడి పెంచింది. ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ, ముఖాముఖి పోరుకు వెరవడం లేదని నిరూపించేందుకు రాహుల్కు ఈ రాయ్బరేలీ అభ్యర్థిత్వం ఉపకరించనుంది. హస్తం పార్టీకి రాయ్బరేలీ ఎంత అడ్డా అయినా, రాహుల్ పోటీలో రిస్కులూ ఉన్నాయి. యూపీలోని మొత్తం 80 లోక్సభా స్థానాల్లో క్రితంసారి 64 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి అంతకు మించి ఫలితాలు సాధించాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయన అలవాటైన స్థానం వదిలేసి, సాహసించారు. కానీ, ఆయన ఛరిష్మా, కాంగ్రెస్కు చిరకాలంగా ఉన్న స్థానిక సంబంధాలు పనికొస్తాయని భావిస్తున్నారు. అసలు అమేథీలో ప్రియాంక, రాయ్బరేలీలో రాహుల్ పోటీ చేయాలన్న ఆలోచనా ఒక దశలో జరిగింది. కానీ, ప్రతిపక్షం ఆరోపిస్తున్న వారసత్వ రాజకీయాలు, బంధుప్రీతికి ఊతమిచ్చినట్టు అవుతుందని దానికి స్వస్తి చెప్పారు. ఇక, అమేథీలో పోటీచేస్తున్న కేఎల్ శర్మ పంజాబ్ నుంచి వచ్చినవారైనప్పటికీ, ఇరుగుపొరుగు స్థానాలైన అమేథీ, రాయ్బరేలీల్లో గత 30 ఏళ్ళుగా పార్టీ తరఫున పనిచేస్తున్నారు. జనంతో, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలున్న ఆయన, స్టార్ అభ్యర్థి స్మృతీ ఇరానీపై గెలుస్తారని కాంగ్రెస్ ఆశ. 1977లో ఇందిరా గాంధీపై రాజ్నారాయణ్, గడచిన 2019లో రాహుల్పై స్మృతి గెలిచినట్టే, రేపు స్మృతిపై శర్మ గెలవకూడదని ఏమీ లేదు. అధిక సంఖ్యాక ప్రజల మద్దతే కీలకమైన ప్రజాస్వామ్యంలో ఏమైనా జరగవచ్చు. అసలు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది సదరు వ్యక్తుల, పార్టీల నిర్ణయం. అయితే, దేశంలోని అనేక ప్రధాన సమస్యల కన్నా అమేథీ, రాయ్బరేలీలలో రాహుల్ పోటీ చేస్తారా, లేదా అన్నదే ముఖ్యమన్నట్టుగా జాతీయ టీవీ ఛానళ్ళు దీనిపైనే చర్చోపచర్చలు చేయడం విచిత్రం. 1952లో ఫిరోజ్ గాంధీ, తర్వాత ఇందిర, అటుపైన సోనియా, ఇప్పుడు రాహుల్ పోటీతో రాయ్బరేలీతో కాంగ్రెస్ బంధం అమేథీ కన్నా పాతది, పట్టున్నది. కానీ, ఇల్లలకగానే పండగ కాదు. సాక్షాత్తూ ప్రియాంక యూపీ ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ 398 స్థానాల్లో పోటీ చేసినా, రెండంటే రెండింట్లో గెలిచింది. ఇప్పుడు లోక్సభకు 17 స్థానాల్లో బరిలో నిలిచింది. అభ్యర్థుల పేర్లు కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. ఒకవేళ రేపు వయనాడ్, రాయ్బరేలీ – రెంటిలోనూ రాహుల్ గెలిస్తే, దేన్ని వదులుకోవాలన్నదీ చిక్కే. రాగల రోజుల్లో మరిన్ని విడతల పోలింగ్తో ఎన్నికల వేడి పెరిగాక కానీ, యూపీలో రాహుల్ పోటీ తాలూకు సిసలైన ప్రభావమేమిటో అర్థం కాదు. ఒకవేళ పాచిక పారి, రాయ్బరేలీలోనే కాక యూపీ అంతటా రాహుల్ ప్రభావం కనిపిస్తే రాజకీయాలు మళ్ళీ మలుపు తిరుగుతాయి. హస్తం పార్టీ ఆశ కూడా అదే! -
వేసవి అభ్యాసం
‘జాగ్రత్తమ్మా సుభద్ర... అక్కడకు వెళ్లాక ఆ వైభోగంలో మమ్మల్ని మర్చిపోతావేమో’ అంటుంది రేవతి పాత్రధారి ఛాయాదేవి సుభద్ర పాత్రధారైన ఋష్యేంద్రమణితో ‘మాయాబజార్’లో. అప్పటికి పాండవుల స్థితి చెడలేదు. ఇంద్రప్రస్థం నుంచి పుట్టిల్లైన ద్వారకకు సుభద్ర రాకపోకలు సాగుతున్నాయి. సోదరులైన బలరాముడు, కృష్ణుడు ఆదరిస్తున్నారు. మేనకోడలైన శశిరేఖను తన కుమారుడైన అభిమన్యుడికి చేసుకోవాలని సుభద్ర తలపోస్తోంది. రేవతి ఉబలాటపడుతోంది. పిల్లలు ముచ్చటపడి ఆశ కూడా పెట్టుకున్నారు. కాని ఒక్కసారిగా పరిస్థితి మారి జూదంలో పాండవుల రాజ్యం పోయింది. అడవుల పాలు కావాల్సి వచ్చింది. ఒకనాడు సుభద్ర రాకకోసం వేయికళ్లతో ఎదురు చూసిన రేవతి ఇప్పుడామె చెడి పుట్టింటికి చేరితే ఏం చేసింది? దొంగ శిరోభారంతో పడకేసింది. పొడ గిట్టనట్టుగా చూసింది. మనుషులు అలా ఉంటారు.పాండవులకు అన్యాయం జరిగిందని తెలిసి బలరామ పాత్రధారి గుమ్మడి వీరావేశంతో కౌరవుల భరతం పట్టడానికి బయలుదేరినప్పుడు భయంతో దుర్యోధన పాత్రధారి ముక్కామల కంపిస్తే, శకుని పాత్రధారి సి.ఎస్.ఆర్. ‘భయమెందుకు? ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది’ అని ఊరుకోబెడతాడు. వేంచేసిన బలరాముడిపై పూలవర్షం కురిపించి, కన్యకామణుల చేత పన్నీరు చిలకరింపచేసి ప్రసన్నం చేసుకుంటాడు. భరతం పడతానన్న బలరాముడే ‘ధర్మజూదంలో జయించడం ధర్మయుద్ధంలో జయించినంత పుణ్యమే’ అని రాజ్యం లాక్కున్న కౌరవులను ప్రశంసిస్తాడు. అంతేనా? దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుడికి తన కుమార్తె శశిరేఖను కట్టబెట్టే వరం ఇస్తాడు– చెల్లెలు సుభద్రకు ఇచ్చిన మాట మరిచి. మనుషులు అలా కూడా ఉంటారు.ధర్మరాజు రాజసూయం చేయడం, మయసభ కట్టడం దుర్యోధనుడికి కంటగింపు అయ్యింది. కయ్యానికి అసలు కారణం అదే. ద్రౌపది నవ్వు మిష. అది గమనించిన శకుని ‘తలలో ఆలోచనలు చేతిలో పాచికలు... వీటితో పాండవులను సర్వనాశనం చేస్తాను’ అన్నప్పుడు ప్రకృతి కలవరపడి వెర్రిగాలితో వద్దు వద్దు అని సంకేతం ఇస్తుంది. కాని దుర్యోధనుడు వినడు. శకుని విననివ్వడు. సిరిని ప్రదర్శనకు పెట్టి ధర్మరాజు చెడ్డాడు. అది చూసి అసూయతో దుర్యోధనుడు మునిగాడు. ‘రాజ్యాలు పోయినా పరాక్రమాలు ఎక్కడికి పోతాయి’ అని సుభద్ర అంటుంది కాని పరాక్రమం లేకపోయినా అందలం ఎక్కాలనుకునేవారు ఉంటారు. వారికి భజన చేసి పబ్బం గడుపుకునేవారూ ఉంటారు. లక్ష్మణ కుమారుడు రేలంగి ఎప్పుడూ అద్దం ముందే ఉంటాడు. అలంకరణప్రియుడు వీరుడే కాదు. మరి ఇతని గొప్పతనమో? ‘అటు ఇద్దరె ఇటు ఇద్దరె అభిమన్యుని బాబాయిలు. నూటికి ఒక్కరు తక్కువ బాబాయిల సేన తమకు’. ఇతనికి స్తోత్రాలు వల్లించే శర్మ, శాస్త్రులు ఉద్దండ పండితులేగాని ‘ప్రభువుల ముందు పరాయి వారిని పొగడకూడదనే’ ఇంగితం లేని వారు. అందుకే శకుని ‘మీకు పాండిత్యం ఉంది కాని బుద్ధి లేదయ్యా’ అని చివాట్లు పెడతాడు. బుద్ధి లేని మనుషులు బుద్ధి ఉన్న మనుషుల్ని పితలాటకంలో పెట్టడమే లోకమంటే.స్వభావరీత్యా చెడ్డవాళ్లు, పరిస్థితుల రీత్యా చెడ్డతనం ప్రదర్శించేవాళ్లు... వీళ్లు మాత్రమే కిటకిటలాడితే జనులు నిండిన ఈ భూమి భ్రమణాలు చేయకపోవును. కష్టంలో ఉన్నప్పుడు సాయానికి వచ్చే మనుషులు తప్పక ఉంటారు. అడవులు పట్టిన సుభద్ర, అభిమన్యుల కోసం హిడింబి, ఘటోత్కచుడు, చిన్నమయ్య, లంబు, జంబు వీరితోపాటు దుందుభి, దుందుభ, ఉగ్ర, భగ్ర, గందరగోళక, గగ్గోలక తదితర అసుర సేన పరిగెత్తుకొని రాలేదూ? వీరందరి కంటే అందరి మొర వినే మురారి ఉండనే ఉన్నాడాయె. చివరకు కౌరవుల ఆటకట్టి సుభద్ర పౌరుషం నిలిచి శశిరేఖ ఆమె కోడలు కావడంతో ‘మాయాబజార్’ ముగుస్తుంది.తెలుగు వారికి మాత్రమే దొరికిన అమూల్యమైన వ్యక్తిత్వ వికాస సంగ్రహం ‘మాయాబజార్’ చిత్రం. అస్మదీయులను కలుపుకు వెళ్లి, తస్మదీయులతో జాగ్రత్తగా మెసలి, పైకి ఒకలాగా ఆంతర్యాలు వేరొకలాగా ఉండేవారిని కనిపెట్టుకుంటూ, ప్రగల్భాలరాయుళ్లను గమనించుకుంటూ, ఉబ్బేసే వాళ్ల ఊబిలో పడకుండా, దుష్ట పన్నాగాలతో బతికే వారితో దూరంగా ఉంటూ, అనూహ్యంగా మారిపోతూ ఉండే మనుషుల చిత్తాలను అర్థం చేసుకుంటూ, చిన మాయల పెను మాయల నడుమ ముందుకు సాగడం ఎలాగో ఈ సినిమా చెబుతుంది. అది కూడా ఏదో శాస్త్రం చెప్పినట్టుగా ‘నిష్కర్షగానూ కర్కశంగానూ’ కాదు. ‘సౌమ్యంగా సారాంశం’ అందేలాగానే. వేసవి వచ్చింది. నెల సెలవులున్నాయి. పిల్లలకు అందాల్సిన చాలా వాటిని నాశనం చేశాం. దుంప తెంచి ధూపం వేశాం. కనీసం ఈ సినిమా చూపించండి. వారు ఘటోత్కచుణ్ణి చూసి ‘హై హై నాయకా’ అంటారు. భక్ష్యాలకూ చిత్రాన్నాలకు తేడా తెలుసుకుంటారు. శాకాంబరీ దేవి ప్రసాదాన్ని నాలుక మీద వేసి ‘ఠ’ అంటూ లొట్టలు వేస్తారు. తల్పం గిల్పం కంబళి గింబళి చూసి కిలకిలా నవ్వుతారు. ఆ రోజుల్లోనే వీడియో కాల్ చేయగలిగిన ‘ప్రియదర్శిని’ పెట్టెకు నోళ్లు తెరుస్తారు. ‘సత్యపీఠం’ అను ‘లైడిటెక్టర్’తో సైన్స్ ఊహలు చేస్తారు. ‘ముక్కుకు తగలకుండా నత్తును కొట్టే’ ప్రావీణ్యం విద్యలో కలిగి ఉండాలని తెలుసుకుంటారు. తియ్యటి తెలుగుల ధారలలో లాహిరీ విహారం చేస్తారు. తెలుగు నేల మీద ఎప్పుడు వేసవి వచ్చినా పిల్లలకు ప్రిస్క్రయిబ్ చేయాల్సిన తొలి అభ్యాసం ‘మాయాబజార్’. అది చూసిన పిల్లలకు ఒక వీరతాడు, చూపించిన తల్లిదండ్రులకు రెండు వీరతాళ్లు. మాయాబజార్... నమో నమః -
తోడేళ్ళను తరిమే రోజు!
ఒక్కసారి మనం డెబ్బయ్యేళ్లు వెనక్కు వెళ్లాలి. వర్తమాన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనల్ని ఆ జ్ఞాపకం వైపు బలవంతంగా నెడుతున్నాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి 1953లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. తెలంగాణతో కలిసి ఇంకా ఆంధ్ర ప్రదేశ్గా అవతరించకముందు 1955లో శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. నాటి ఆంధ్ర రాష్ట్రం, నేటి ఆంధ్ర ప్రదేశ్ల భౌగోళిక స్వరూపం ఒక్కటే!ఆ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రభంజనం కనిపించింది. అప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా కూడా కమ్యూనిస్టులు బ్యాలెట్ ద్వారా అధికారంలోకి వచ్చిన ఉదంతాలు లేవు. ఆ విషయంలో ఆంధ్ర రాష్ట్రం రికార్డు సృష్టించ బోతున్నదనే అంచనాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రిగా సుందరయ్య, హోంమంత్రిగా చండ్ర రాజేశ్వరరావు, ఆర్థిక మంత్రిగా మాకినేని బసవపున్నయ్య వగైరా పేర్లతో కేబినెట్ కూర్పుపై కూడా ప్రచారం జరిగింది. సరిగ్గా ఈ దశలోనే పెత్తందారీ ముఠా, వారి అజమాయిషీలోని మీడియా రంగప్రవేశం చేశాయి.అప్పట్లో దున్నేవానికే భూమి అనేది కమ్యూనిస్టుల నినాదం. ఆ మేరకు భూసంస్కరణలు అమలు చేస్తామని వారు వాగ్దానం చేశారు. ఇది చాలు పెత్తందార్లకు! వారి చేతుల్లో వున్న ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి ఆనాటి ప్రముఖ పత్రికలు ఆయుధాలు బయటకు తీశాయి. కమ్యూనిస్టులు గెలిస్తే రైతుల భూములను లాక్కుంటారు. కమ్యూనిస్టులు గెలిస్తే ప్రజల ఇళ్లలో ఉన్న డబ్బును, బంగారాన్ని ఎత్తుకుపోతారు. వృద్ధులు పని చేయలేరు కనుక వారిని ప్రత్యేక క్యాంపుల్లో పెడతారు లేదా చంపేస్తారు. రష్యాలో, చైనాలో ఇలాగే చేస్తున్నారు. చివరికి మీ భార్యల్ని కూడా జాతీయం చేస్తారు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్న మవుతుంది... ఈ రకమైన అభాండాలను అచ్చేసి అడ్డగోలుగా ప్రచారంలో పెట్టారు.ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేంత పబ్లిసిటీ దన్ను ఆనాడు కమ్యూనిస్టులకు లేదు. వాళ్లకున్నది ‘విశాలాంధ్ర’ ఒక్కటే. పార్టీ ముద్ర కారణంగా దానికీ పరిమితులున్నాయి. ఇటువంటి నిస్సహాయ స్థితిలోనే మహాకవి శ్రీశ్రీ గుండెలోంచి తన్నుకొచ్చిన ఆక్రోశం చాలామందికి గుర్తున్నది. ‘పెట్టుబడికీ కట్టుకథకూ పుట్టిన విషపుత్రిక ఆంధ్రపత్రిక’ అని ఈసడించుకున్నారు. నాటి ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ల అరాచకాన్ని ఒక లక్షతో హెచ్చ వేస్తే నేటి ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’, ‘టీవీ5’, ‘ఏబీఎన్’, ‘ఈటీవీ’ల అరాచకం విలువెంతో తెలుస్తుంది. ఆ ప్రత్యేక సందర్భం తర్వాత∙నాటి పత్రికలు మళ్లీ తటస్థ స్థితికి చేరు కున్నాయి. కానీ మన యెల్లో మీడియా మాత్రం గత పదేళ్లుగా ఆదే యజ్ఞంలో తలమునకలై ఉన్నది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పెత్తందారీ వర్గాల ప్రతినిధిగా, ప్రయోక్తగా, ప్రవక్తగా గడిచిన మూడు దశాబ్దాల్లో చంద్రబాబు ఇంతింతై అన్నట్టుగా ఇనుమడించడం మనకు తెలిసిన సంగతే. ఇదే కాలంలో మన యెల్లో మీడియా చంద్రబాబు తరఫున గ్రామ సింహాల పాత్రను పోషిస్తే, బదులుగా ఆయన వారికి సెక్యూరిటీ గార్డు పాత్రను పోషిస్తూ వస్తున్నారు. ఈ ముప్ప య్యేళ్లలో పధ్నాలుగేళ్లపాటు బాబు ముఖ్యమంత్రి పాత్రను పోషించారు. ఆయనకు వాలతుల్యుడనదగ్గ కిరణ్కుమార్ రెడ్డి కాంగ్రెస్ తరఫున నాలుగేళ్లు గద్దె మీద కూర్చున్నారు. రాష్ట్రంలోని పేదల అభ్యున్నతి కోసం, సాధికారత కోసం అమలైన కార్య క్రమాలన్నీ వీరి కాలం మినహా మిగిలిన సమయంలోనే జరగడం ఎవరైనా గమనించవచ్చు.ప్రజలందరికీ విద్య, వైద్యసేవలు అందజేయడం ప్రభుత్వ బాధ్యతగా నాగరిక సమాజం గుర్తిస్తున్నది. ఆ రంగాల్లో సేవలు ప్రభుత్వం బాధ్యత కాదని బాహాటంగా ప్రకటించి, వాటిని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు నర్తనశాలగా మార్చిన అనాగరిక రాజకీయవేత్త చంద్రబాబు. ఫలితంగా ప్రభుత్వ బడులు కునారిల్లిపోయాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల్ని ప్రైవేట్ బడులకు పంపి అప్పులపాలయ్యారు. నిరు పేదల బిడ్డలు చదువుకు దూరమయ్యారు. ఒక తరం పేద, మధ్యతరగతి వర్గాల కలలను కాటేసిన చరిత్ర చంద్రబాబుది. అలాగే ప్రైవేట్ వైద్యసేవల బలిపీఠాన్నెక్కి లక్షలాది కుటుంబాలు కృశించి, నశించిపోయాయి.వ్యవసాయం దండగనేది ఆయన చేసిన ఒక క్రూర పరిహాసం. ఫలితంగా రైతులు పిట్టల్లా రాలిపోవడం బాబు జమానాలోనే ప్రారంభమైంది. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు, నకిలీ మందులకు వ్యవసాయం వేదికైంది. రైతులను భూముల నుంచి వెళ్లగొట్టి వేల ఎకరాల భూములను కార్పొరేట్ శక్తులకు కైంకర్యం చేసే విధానాలను బాబు అవలంబించారు. ఈ క్రమంలోనే ఫిలిం సిటీ పేరుతో రామోజీ దాదాపు మూడువేల ఎకరాలు పోగేశారు. అన్నిరకాల భూచట్టాలూ రామోజీ భూదాహం ముందు చట్టుబండలయ్యాయి. వేలాది ఎకరాల్లో వ్యవసా యాన్ని అటకెక్కించి కార్పొరేట్ సంస్థలు కంచెలు వేసు కున్నాయి. పేదల జీవితాలను కాల్చుకుతింటున్న చంద్ర బాబులో పచ్చమీడియాకు ఓ విజనరీ కనిపించాడు.ఐదేళ్ల కింద ఆంధ్రప్రదేశ్లో ఒక తేడా వచ్చింది. చంద్రబాబుకూ, యెల్లో మీడియాకూ అది చిన్న తేడా ఏమీ కాదు. యెల్లో ‘విజనరీ’ విధానాలను కొత్త ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి తలకిందులు చేశారు. ప్రజలిచ్చిన అధికారం గుప్పెడుమంది పెత్తందార్ల కోసం కాదు, పురోగ మనం కోసం పోరాడుతున్న విశాల ప్రజానీకం కోసం అనేది ఆయన విధానం. జగన్మోహన్రెడ్డి విధానాలకు, మన పెత్తందారీ ఏజెంట్ల విధానాలకు ఘర్షణ ఏర్పడింది. పెత్తందార్ల కూటమి జగన్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించింది. జగన్ ప్రభుత్వ విధానాల వల్ల ఊపిరి పీల్చుకున్న పేదవర్గాల ప్రజలు ఆయన వెనుక సైన్యంగా మోహరించారు. పేదలు – పెత్తందార్ల మధ్య మహాయుద్ధానికి ముహూర్తం ఖాయమైంది.ఈ అయిదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వంపై యెల్లో మీడియా సాగించిన దుష్ప్రచారం అన్ని రికార్డులనూ బద్దలు కొట్టింది. గోబెల్స్ బతికి వుంటే సిగ్గుపడి ఉండేవాడు. శ్రీశ్రీ బతికి ఉంటే ఏమని కామెంట్ చేసేవాడో ఊహించుకోవలసిందే. తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా ప్రచారం చేయని రోజు ఈ అయిదే ళ్లలో ఒక్కటీ లేదు. అయినా ప్రజాభిప్రాయాన్ని యెల్లో మీడియా పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నది. దీంతో వారిలో నిస్పృహ ఆవరించింది. అన్ని విలువల్నీ వదిలేశారు. వస్త్రవిసర్జన చేసి దిగంబర వీధినర్తనం మొదలుపెట్టారు. పోలింగ్ పది రోజులుందనగా తయారుచేసిన రెండు వింత కథల మీద ప్రాణం పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. ఇందులో మొదటిది ఏమాత్రం క్రియేటివిటీ లేకుండా అల్లిన ఓ కట్టుకథ. ‘మీ భూమి మీది కాదు’ అనే పేరుతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ‘బాధితుల’ కథనాలను ‘ఈనాడు’ అచ్చేసింది. చట్టం పేరులోనే దాని ప్రాముఖ్యత ఉన్నది. భూమిపై రైతుకున్న యాజమాన్య హక్కును గుర్తిస్తూ ప్రభుత్వం హామీ పడి ధ్రువీకరించే చట్టం. ఒకసారి ఈ చట్టం అమలులోకి వస్తే భూ వివాదాలు శాశ్వతంగా పరిష్కారమవుతాయి. దొంగ కాగితాలు సృష్టించి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే చార్మినార్కు కూడా సేల్ డీడ్ ఇచ్చే అధ్వాన్నమైన పరిస్థితులు ఎన్నిసార్లు ఎదురు కావడం లేదు? నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకులను కొల్లగొట్టే దళారీల వృత్తాంతాలు ఎన్ని బయటకు రావడంలేదు? ఎన్ని వేల భూతగాదాలు కోర్టు వ్యాజ్యాల్లో దశాబ్దాల తరబడి నలిగి పోవడం లేదు? గొడవలతో ఎంత రక్తం పారి ఉంటుంది? ఎన్ని హత్యలు జరిగి ఉంటాయి? ఇదిగో ఇటువంటి వివాదాలను పరిష్కరించే సమగ్ర హక్కులను యజమానికి కల్పించి, అందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. ఇందులో భాగంగా మొదట భూముల సమగ్ర సర్వే జరుగుతోంది. గ్రామ ప్రజల సమక్షంలో సరిహద్దులను నిర్ధారించి రైతుకు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. వందేళ్ల తర్వాత సర్వే జరిపి యాజమాన్య హక్కును గుర్తిస్తూ ప్రభుత్వం ఇస్తున్న పాస్బుక్ ఇది. ఆ హక్కుకు ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీకి గుర్తుగా సర్వే జరిగిన కాలపు ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి ఫోటోను కూడా పాస్బుక్పై ముద్రిస్తున్నారు. దీన్ని కూడా టీడీపీ – యెల్లో మీడియా వివాదం చేయడం చూస్తున్నాము.అన్ని గ్రామాల్లో సర్వే పూర్తిగా జరిగిన తర్వాత చట్టం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసి, వాటిపై గ్రామసభల్లో చర్చలు జరిగిన తర్వాత తుది మార్గదర్శకాలు జారీ అవుతాయి. ఆ తర్వాతనే చట్టం అమల్లోకి వస్తుంది.ఇదంతా జరగడానికి ఇంకో ఏడాది పట్టవచ్చు. రెండేళ్లు పట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వంలోని ‘నీతి ఆయోగ్’ సూచనలకు అనుగుణంగా ఈ చట్టం రూపకల్పన జరుగుతున్నది. అన్ని రాష్ట్రాల్లోనూ భూయజమానికి మేలు చేసే ఈ చట్టం వచ్చి తీరుతుంది. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను ముందుకు కదిలించింది. దీన్ని వ్యతిరేకిస్తున్న యెల్లో కూటమి పార్టీ ఎన్డీఏలో భాగంగా ఉన్నది. కానీ ఇంత వరకు ఈ చట్టంపై తమ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వంతో ప్రస్తావించకపోవడం తెలుగుదేశం అవకాశవాద వైఖరికి పరాకాష్ఠ. పచ్చమీడియా కూడా ఈ చట్టంపై ఒక్క మాటయినా కేంద్రం ప్రస్తావన చేయకపోవడం వెనకనున్న రహస్యమేమిటి?ఇక శనివారం నాడు ‘ఈనాడు’ రాసిన ‘మీ భూమి మీది కాదు’ అనే కల్పిత కథ జర్నలిజం ప్రమాణాలను పాతాళంలోకి తొక్కేసింది. ఇందులో ముగ్గురు బాధితుల పేర్లు రాశారు.అందులో అమలాపురం సుబ్బారావు ఒకరు. ఆయన భూమి ఎక్కడో చెప్పలేదు. సర్వే నెంబర్ తెలియదు. ఆయన భూమి తనదంటూ ఎవరో అధికారులకు దరఖాస్తు చేసుకున్నారట! ఆయనెవరో చెప్పలేదు. ఎవరికి దరఖాస్తు చేశాడో చెప్పలేదు. రెండేళ్ల తర్వాత సుబ్బారావు స్పందించలేదంటూ దరఖాస్తు చేసుకున్న వారి పేరు మీద భూమిని రాసేశారట! ఇదంతా ల్యాండ్ టైట్లింగ్ చట్టం మహత్యమట. అమల్లోకే రాని చట్టం రెండేళ్ల కిందనే పనిచేయడం ప్రారంభించిందని ‘ఈనాడు’ ఉవాచ!ఇక సాంబశివుడిది శ్రీకాకుళం జిల్లాలోని ఒక పల్లెనట! ఈ పల్లె పేరు చెబితే రామోజీ తల వెయ్యి ముక్కలవుతుంది కాబోలు. చెప్పలేదు! ఆయన భూమిని అమ్మడానికి వెళితే, ‘కొత్త రిజిస్టర్లో నీ పేరు లేద’ని అధికారులు చెప్పారట. అసలటు వంటి కొత్త రిజిస్టరు తమ దగ్గర ఏదీ లేదని అధికారులు ప్రకటించారు. గోవిందరెడ్డిది కర్నూలు జిల్లా. ఏ ఊరో చెప్పలేదు. ‘ఈనాడు’ ఆంధ్రా ఎడిషన్లోనే ఆయన గోవిందరెడ్డి. తెలంగాణ ఎడిషన్లో మాత్రం గోవిందయ్య. అంటే తెలంగాణకు వెళ్లిన ప్పుడల్లా ఆయన కులం తోకను కత్తిరించుకుంటాడు కాబోలు. ఆయన తన భూమిని తనఖా పెట్టాలనుకున్నాడట! బ్యాంకులో ఉండే డిస్ప్యూట్ రిజిస్టర్లో ఆయన పేరు ఉన్నదట! టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర క్లియరెన్స్ సర్టిఫికెట్ తెమ్మని బ్యాంకు వారు చెప్పారట. దాంతో గోవిందరెడ్డి ఉరఫ్ గోవిందయ్య ఆంధ్రాలో ఒకసారి, తెలంగాణలో ఒకసారి గొల్లుమన్నాడట! అసలు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనే పోస్ట్ అమల్లోకే రాలేదు. డిస్ప్యూట్ రిజిస్టరూ లేదు. చదివేవాడు వెర్రి వాడయితే... రాసేవాడు రామోజీ!పెన్షన్ల వ్యవహారంపై తెలుగుదేశం – యెల్లో మీడియాలు నడిపిస్తున్న వ్యవహారంలో మరో వింతకథ. వలంటీర్ వ్యవస్థకే ఈ పెత్తందార్లు వ్యతిరేకం. తమ వ్యతిరేకతను వాళ్లు దాచుకోనూ లేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్లు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు గమనించారు. ఇంటి దగ్గరే ఒకటో తారీఖు పొద్దున్నే వలంటీర్లు గత ఐదేళ్లుగా పింఛన్లు అంద జేస్తున్నారు. దాంతో అవ్వాతాతలు, దివ్యాంగులు భరోసాతో బతుకుతున్నారు. వలంటీర్లు విధుల్లో పాల్గొనకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ తరఫున వారి ఏజెంటు నిమ్మగడ్డ రమేశ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనికి యెల్లో మీడియా వంత పాడింది. దాంతో వలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.ఈసీ సూచనల మేరకు ఏప్రిల్లో విలేజ్ సెక్రటేరియట్లలో పెన్షన్లు అందజేశారు. దీనిపై వృద్ధుల్లో వ్యతిరేకత వచ్చింది. గాభరాపడ్డ తెలుగుదేశం బృందం మళ్లీ నిమ్మగడ్డను పంపించి బ్యాంకు ఖాతాల్లో జమ చేయించాలని ఈసీకి దరఖాస్తు పెట్టారు. ఈసీ సూచనలకు అనుగుణంగా మే నెలలో బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేశారు. ఇక వృద్ధుల బాధలు వర్ణనాతీతం. వారి శాపనార్థాలతో కంగారు పడిన యెల్లో ముఠా వృద్ధుల బాధలకు జగన్ ప్రభుత్వమే కారణమనే విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. దొంగతనం చేసినవాడే ‘దొంగా దొంగా’ అని అరిచినట్టు! జగన్మోహన్రెడ్డి సభలకు మండుటెండల్లో కూడా వెల్లువెత్తుతున్న జనప్రవాహంతో కూటమి వణికిపోతున్నది. ఈ రెండు అంశాలపై అబద్ధాలను ప్రచారం చేసి గట్టెక్కాలన్న దింపుడు కల్లం ఆశ దానిలో కనిపిస్తున్నది.ఇంకో వారం రోజుల్లో పోలింగ్ జరగబోతున్నది. ఇది పేద వర్గాలకు అందివచ్చిన అద్భుతమైన అవకాశం. పేద బిడ్డల ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తున్న, వారి నాణ్యమైన చదువు లను వ్యతిరేకిస్తున్న పెత్తందార్లను చావచితక్కొట్టడానికి ఇదో అవకాశం. పేదల సాధికారతను, మహిళల సాధికారతను సహించలేకపోతున్న పెత్తందార్లను పరుగెత్తించడానికి ఇంకో వారం రోజుల్లో అమూల్యమైన అవకాశం ఉన్నది. బలహీన వర్గాలకు ఉన్నత పదవులు ఇస్తే, ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యే టిక్కెట్లు, ఎంపీ టిక్కెట్లు కేటాయిస్తే ఓర్వలేకపోతున్న పెత్తందార్లకు బుద్ధి చెప్పడానికి ఇదో గొప్ప అవకాశం. అబద్ధాలనూ, అభూత కల్పనలనూ, కట్టుకథలనూ ప్రచారంలో పెడుతూ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమే గాక సమాజంలో అశాంతిని రేకెత్తి స్తున్న పెత్తందారీ తోడేళ్లను తరిమి తరిమి కొట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది?వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
రగులుతున్న క్యాంపస్లు!
గాజాలో ఇజ్రాయెల్ అమానుష హత్యాకాండ మొదలైనప్పటినుంచీ అమెరికన్ విద్యాసంస్థల్లో అలుముకున్న అశాంతి ఈ వారం తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచంలోనే పేరెన్నికగన్న విశ్వవిద్యా లయాలు విద్యార్థి ఉద్యమాలతో అట్టుడుకుతున్నాయి. వియత్నాంను వల్లకాడు చేస్తున్న అమెరికా సైనిక దురాక్రమణకు వ్యతిరేకంగా 1968లో తిరుగుబాటు జెండా ఎగరేసిన విద్యార్థుల పోరాటాన్నీ, 1980ల్లో దక్షిణాఫ్రికా జాత్యహంకార ప్రభుత్వం నెల్సన్ మండేలాను దీర్ఘకాలం చెరసాలలో బంధించటాన్ని నిరసిస్తూ సాగిన ఉద్యమాలనూ గుర్తుచేస్తున్నాయి. అప్పటిమాదిరే ఈ ఉద్యమాలు అట్లాంటిక్ మహా సముద్రం ఆవలితీరాల్లోని యూనివర్సిటీ క్యాంపస్లకు సైతం విస్తరించాయి.ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాల్లో మాత్రమేకాదు... పశ్చిమాసియాలోని బీరూట్, కువైట్, లెబనాన్, ట్యునీ సియా యూనివర్సిటీలు కూడా రగులుతున్నాయి. లాఠీచార్జిలు, బాష్పవాయు గోళాలు ఎవరినీ భయపెట్టడం లేదు. వేలాదిమంది విద్యార్థులను అరెస్టుచేస్తూ ఉద్యమాలను చల్లార్చాలని పోలీసులు ప్రయత్నిస్తున్నా సాగటం లేదు. వీటి తీవ్రత పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు. ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి ప్రవచనాలు చెప్పే అమెరికా తన క్యాంపస్లను ప్రస్తుతం పోలీసు శిబిరాలుగా మార్చింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు 1,200మంది పౌరులను కాల్చిచంపి, దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లిన ఉదంతాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందరూ తీవ్రంగా ఖండించారు. స్వతంత్ర పాలస్తీనా కోసం సాగుతున్న ఉద్యమాలను ఇలాంటి దుందుడుకు చర్యలు బలహీనపరుస్తాయని హెచ్చరించారు. దాన్ని సాకుగా తీసుకుని ఇజ్రాయెల్ గత ఆర్నెల్లుగా సాగిస్తున్న మారణహోమం తక్కువేమీ కాదు. ఇంతవరకూ 35,000మంది పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ సైనిక దళాల దాడుల్లో మరణించారని చెబుతున్నారు.ఇందులో అత్యధికులు నిరాయుధులైన స్త్రీలు, పిల్లలే. చివరికి బాంబుదాడుల్లో శిథిలమైన జనావా సాల్లో బాధితులకు అండగా నిలబడుతున్న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలను సైతం ఇజ్రాయెల్ సైన్యం వదిలిపెట్టడం లేదు. కావాలని ఉద్దేశపూర్వకంగా వారిని కాల్చిచంపుతూ పాలస్తీనా పౌరులకు బాసటగా నిలబడాలన్న సంకల్పంతో వచ్చేవారిని భయభ్రాంతుల్ని చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోపక్క అనేకమంది హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టా మని చెప్పుకుంటోంది. ఇజ్రాయెల్కు ఎడాపెడా మారణాయుధాలు సరఫరా చేస్తూ, భద్రతామండలి వంటి అంతర్జా తీయ వేదికలపై అది సాగిస్తున్న నరమేథాన్ని నిలువరించే అన్ని రకాల ప్రయత్నాలకూ మోకా లడ్డుతూ మద్దతుగా నిలబడుతున్న అమెరికా అప్పుడప్పుడు కోమానుంచి నిద్రలేచిన రోగి మాదిరిగా శాంతి వచనాలు వల్లిస్తోంది. ఇది సబబేనా? నిరాయుధ సాధారణ పౌరులను కాల్చిచంపటం ప్రపంచమంతా మౌనంగా వీక్షిస్తూ ఉండాల్సిందేనా? ఈ ప్రశ్నలే విశ్వవిద్యాలయాల విద్యా ర్థులను కలవరపరిచాయి. తాము మూగసాక్షులుగా మిగిలిపోలేమంటూ ఆ విద్యార్థులు గొంతెత్తటం వెనకున్న నేపథ్యం ఇదే. జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ఏంజెలస్ (యూసీఎల్ఏ), కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వగైరా ఉన్నతశ్రేణి విద్యాసంస్థలు నినాదాలతో మార్మోగుతున్నాయి. పేరెన్నికగన్న హార్వర్డ్, బర్క్లీ, యేల్ వర్సిటీలు సైతం రణక్షేత్రాలయ్యాయి. అమెరికా ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నాయి. ఈ విశ్వవిద్యాల యాలు సాధారణమైనవి కాదు. పేరెన్నికగన్న ప్రపంచశ్రేణి సంస్థలు. ఉదాహరణకు యూసీఎల్ఏ 16 మంది నోబెల్ బహుమతి గ్రహీతలను తయారుచేసింది. ఆ సంస్థనుంచి ఇంతవరకూ 15 మంది మెక్ఆర్థర్ ఫెలోషిప్లను అందుకున్నారు. అసాధారణ ప్రతిభాపాటవాలున్నవారికి ఈ ఫెలోషిప్లు ఇస్తారు. ఇక్కడి పట్టభద్రుల్లో క్రీడల్లో రాణించి ఒలింపిక్స్లో పతకాలు అందుకున్నవారెందరో! ఎన్నో దేశాలు అందుకునే పతకాల సంఖ్యతో పోలిస్తే ఈ యూనివర్సిటీ పట్టభద్రులు సాధించే పతకాలే ఎక్కువంటారు. ఇలాంటిచోట చదువుకునే పిల్లలు సమాజ పరిణామాలపట్ల ఇంతగా కలవరపడటం బహుశా మన దేశంలో చాలామందిని ఆశ్చర్యపరిచి వుండొచ్చు. విద్యార్థి ఉద్యమ కేంద్రాలుగా ముద్రపడిన ఢిల్లీలోని జేఎన్యూ, జమియా మిలియా, కోల్కతాలోని జాదవ్పూర్ యూనివర్సి టీలను ఛీత్కరించటం అలవాటు చేసుకున్న మర్యాదస్తులకు ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయాల వర్త మాన పోకడలు మింగుడుపడకపోవచ్చు. అయోమయానికి గురిచేయవచ్చు. కానీ అమెరికా తదితర దేశాల విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఎప్పుడూ ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహిస్తూనే వున్నాయి. ఇప్పుడు సాగుతున్న విద్యార్థి ఉద్యమాలతో ప్రొఫెసర్లు సైతం గొంతు కలపటం, అరెస్టుకావటం యాదృచ్ఛికం కాదు. ఈ నిరసనలను యూదు వ్యతిరేక ఆందోళనలుగా చిత్రించి అధికారుల, రిపబ్లి కన్ పార్టీ శ్రేణుల ప్రాపకంతో పోటీ ఉద్యమాలను నిర్వహిస్తున్న విద్యార్థులు లేక పోలేదు. పాలస్తీనా సంఘీభావ ఉద్యమకారులపై వారు దాడులకు కూడా వెనకాడటం లేదు. ఇది విచారకరం.పిల్లి కళ్లు మూసుకుని పాలుతాగుతూ ఎవరూ చూడటంలేదని భ్రమపడుతుంది. అమెరికా ప్రభుత్వం ఈ ధోరణిని విరమించుకోవాలి. తన ఆయుధ పరిశ్రమ లాభార్జనకు తోడ్పడుతున్నా యన్న ఏకైక కారణంతో ఇజ్రాయెల్, ఉక్రెయిన్ తదితర దేశాలకు అమెరికా భారీగా సైనిక సాయం అందించటం అనైతికం, అమానుషం. విద్యార్థి ఉద్యమాలు పంపుతున్న సందేశాన్ని సక్రమంగా అర్థం చేసుకుని ప్రపంచశాంతికి దోహదపడటం అగ్రరాజ్యంగా తన బాధ్యతని ఇప్పటికైనా ఆ దేశం గుర్తించాలి. లేకుంటే మున్ముందు ఈ ఉద్యమాలు మరింత విస్తరిస్తాయి.
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- స్వాతిమలివాల్పై దాడి.. కేజ్రీవాల్ సహాయకుడికి నో బెయిల్
- యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
- అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
- శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
- పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
- భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
- ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
- గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
- ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Advertisement