Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Key Comments AT YSRCP local bodies Representatives Meeting Updates1
హ్యాట్సాఫ్‌.. మీ నిబద్ధతకు ఎప్పుడూ రుణపడి ఉంటా: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ పాలనలో పేదల నోట్లోకి నాలుగు ముద్దలు వెళ్లేవని.. కానీ కూటమి ప్రభుత్వం వాళ్ల ముందు నుంచి ఉన్న కంచం లాగిపడేసిందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో బుధవారం తాడేపల్లిలోని కేంద్రకార్యాలయంలో భేటీ అయిన ఆయన.. ఈ సందర్భంగా కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వాళ్ల తెగువను అభినందించారు.‘‘మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటాను, పార్టీకూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నాను. ఉప ఎన్నికల్లో మీరు చూసిన తెగువకు, ధైర్యానికి హాట్సాఫ్‌. మొత్తం 50 చోట్ల ఎన్నికలు జరిగితే, 39 స్థానాలు వైఎస్సార్‌సీపీ గెలిచింది. కార్యకర్తలు తెగింపు చూపారు. తెలుగుదేశం పార్టీకి ఈ స్థానాల్లో ఎక్కడా గెలిచే నంబర్లు లేవు. వారికి సంఖ్యా బలం లేనే లేదు. కానీ.. భయాందోళనల ఈ ప్రభుత్వం మధ్య ఎన్నికలు నిర్వహించాలనుకుంది. పోలీసులతో భయపెట్టి, బెదిరించారు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకుంటున్న చంద్రబాబుకి బుద్ధిలేదు. వాస్తవంగా ఈ ఎన్నికలను టీడీపీ వదిలేయాలి. కానీ అధికార అహంకారంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూశారు. నిజంగా ఇది ధర్మమేనా? న్యాయమేనా?. చంద్రబాబు(Chandrababu) అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడా ఒక నాయకుడిలా చంద్రబాబు వ్యవహరించలేదు. ప్రజలకిచ్చిన హామీల విషయంలో మోసం చేశారు. ప్రజలకు 143 హామీలు ఇచ్చి మభ్యపెట్టారు. చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలే కనిపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ పాలనలో ఏదో ఒక బటన్‌ నొక్కేవాళ్లం. ఏదోరూపంలో ప్రతి కుటుంబానికీ మంచి జరిగింది. నాలుగువేళ్లూ నోట్లోకి పోయే పరిస్థితి ఉండేది. చంద్రబాబు ఇప్పుడు ఉన్న ప్లేటును కూడా తీసేశాడు. ప్రజల్లోకి టీడీపీ కార్యకర్తలను కూడా పంపే పరిస్థితి ఆయనకు లేదు. తిరుపతి మున్సిపల్‌ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలను ప్రజలంతా చూశారు. విశాఖపట్నంలో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి, అక్కడ అక్రమాలు చేస్తున్నారు. మన కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నం మనవాళ్లు చేశారు. అక్కడ 40వ వార్డు కార్పొరేటర్‌ ఇంటికి వెళ్లి.. ఆయన భార్యను భయపెట్టే ప్రయత్నం పోలీసులు చేశారు. రామగిరిలో 10 ఎంపీటీసీల్లో 9కి వైయస్సార్‌సీపీవే. కాని అక్కడ ఎన్నిక జరగనీయకుండా అడ్డుకుంటున్నారు. భద్రత పేరుతో పోలీసులు తీసుకెళ్లి.. దారి మళ్లించి, స్వయంగా ఎస్సై ఎంపీటీసీలను కిడ్నాప్‌చేసే పరిస్థితి కనిపిస్తోంది. అప్పటికీ వినకపోతే, ఏకంగా మండల కార్యాలయంలో నిర్బంధించి బైండోవర్‌ చేశారు. అంతటితో ఆగకుండా లింగమయ్య అనే బీసీ నాయకుడ్ని చంపేశారు. ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు ఇలాంటి దారుణాలు చేయిస్తున్నారు. ప్రభుత్వం అంటే ఇలాంటి పాలన చేస్తుందా?.. .. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 16కు 16 ఎంపీటీసీలు మనవాళ్లే. ఆరుగుర్ని ప్రలోభపెట్టి.. తీసుకెళ్లిపోయాడు. మరో 9 మంది వైఎస్సార్‌సీపీతోనే ఉన్నారు. వాళ్లను ఎన్నికల కేంద్రానికి వెళ్లనీయకుండా పోలీసులు, టీడీపీ వాళ్లు అడ్డుకున్నారు. కోరం లేకపోయినా.. గెలిచామని డిక్లేర్‌ చేయించుకున్నారు. రాష్ట్రానికి సీఎం, కుప్పంకు ఎమ్మెల్యే చంద్రబాబే.. అయినా సరే ఒక చిన్నపదవికోసం ఇన్ని దారుణాలు చేశారు.ఈ ఎన్నికల్లో నా చెల్లెమ్మలు, నా అక్కలు మరింత గట్టిగా నిలబడ్డారు. దీనికి నేను గర్వపడుతున్నాను. ఇలాంటి ఘటనలు జరుగుతున్న పార్టీ ప్రజాప్రతినిధులు గట్టిగా నిలబడి స్ఫూర్తిని చూపించారు. వీరు చూపించిన స్ఫూర్తి చిరస్థాయిగా ఉంటుంది. కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ జగన్‌ ఎప్పుడూ రుణపడి ఉంటాడు. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాయి. P-4 అనే కొత్త మోసాన్ని మొదలుపెట్టాడు. సమాజంలో ఉన్న 20శాతం పేదవాళ్ల బాగోగులకు 10శాతం మందికి అప్పగిస్తాడంట!. రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డులు ఎన్ని ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా?. రాష్ట్రంలో 1.61 కోట్ల కుటుంబాలు ఉంటే అందులో 1.48శాతం కుటుంబాలకు తెల్ల రేషన్‌ కార్డుదారులు ఉన్నారు. వీరంతా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. రాష్ట్రంలో ఇన్‌కం ట్యాక్స్‌ కట్టేవారు ఎంతమంది ఉన్నారో చంద్రబాబుకు తెలుసా?. రాష్ట్రంలో 8.6 లక్షల మంది ఇన్‌కంట్యాక్స్‌ కడుతున్నారు. ఆయన చెప్పిన ప్రకారం.. ఈ 1.48 కోట్ల మంది కుటుంబాలను 8.6 లక్షల మందికి అప్పగించాలి కదా?. ఇన్ని రకాలుగా మోసాలు చేస్తాడు చంద్రబాబు. చివరకు చంద్రబాబు మీటింగ్‌ల నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారు. చంద్రబాబుకు అన్నీ తెలుసు, కాని కావాలనే మోసం చేస్తాడు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ గురించి అడిగితే రాష్ట్రం అప్పుల పాలు అంటాడు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ ఎగరగొట్టడానికి అప్పులపై అబద్ధాలు చెప్తున్నాడు. ప్రజలకు సమస్యలు వస్తే వాటి పరిష్కారంకోసం తపించే ప్రభుత్వం రావాలని ప్రజలు మళ్లీ కోరుకుంటారు. మాటచెప్తే.. ఆ మాటమీద నిలబడే ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తుంటారు. రాబోయే రోజులు మనవి. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. వైఎస్సార్‌సీపీ(YSRCP) అఖండ మెజార్టీతో గెలుస్తుంది. ఈసారి కార్యకర్తలకోసం కచ్చితంగా పార్టీ నిలబడుతుంది. కోవిడ్‌ కారణంగా నేను కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోవచ్చు. జగన్‌ 2.O దీనికి భిన్నంగా ఉంటుంది. కార్యకర్తలకోసం గట్టిగా నిలబడతాను’’ అని జగన్‌ అన్నారు.

Telangana High Court orders Congress govt on Kancha Gachibowli lands2
చెట్ల నరికివేత ఆపండి: హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్లు నరకడాన్ని వెంటనే ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు బుధవారం ఆదేశించింది. దీనిపై గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే వరకు అక్కడ ఎలాంటి పనులు చేయొద్దని ఏసీజే జస్టిస్‌ సుజోయ్‌ పాల్, జస్టిస్‌ రేణుక యారా ధర్మాసనం తేల్చిచెప్పింది. సుదీర్ఘ వాదప్రతివాదనల వల్ల సమయం ముగియడంతో తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎక రాల భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీజీఐఐసీ)కి బదిలీ చేసి చదును చేయడాన్ని వెంటనే ఆపాలని కోరుతూ హైకోర్టులో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్‌) దాఖలయ్యాయి. ‘ఐటీ, ఇతర అవసరాల కోసం ఎకరం రూ. 75 కోట్ల మేర సంస్థలకు కేటాయించేలా కంచ గచ్చిబౌలి సర్వే నంబర్‌ 25లోని 400 ఎకరాల అటవీ భూమిని టీజీఐఐసీకి సర్కార్‌ కేటాయించింది. ఈ మేరకు గతేడాది జూన్‌ 26న రెవెన్యూ శాఖ తీసుకొచ్చిన జీవో 54ను కొట్టేయాలి. అక్కడ 40 జేసీబీ తవ్వకాలతో సర్కార్‌ చెట్లను తొలగిస్తూ వృక్ష, జంతుజాలాన్ని నాశనం చేస్తోంది’ అని పిటిషనర్లు ఆరోపించారు.పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలి..పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు ఎస్‌.నిరంజన్‌రెడ్డి, ఎల్‌.రవిచందర్‌ వాదిస్తూ ‘ఆ 400 ఎకరాలు అటవీభూమి. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పులకు లోబడే ప్రభుత్వాలు పనిచేయాలి. 40కిపైగా జేసీబీలతో చెట్లు కొట్టేసి భూమిని చదును చేస్తున్నారు. సుప్రీం తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని చదును చేయాలంటే నిపుణుల కమిటీ వేయాలి. ఆ కమిటీ క్షేత్రస్థాయిలో నెలపాటు అధ్యయనం చేయాలి. ఈ అడవిలో బఫెలో, పీకాక్, ఎస్‌ఆర్‌ ప్రధాన సరస్సులు, ‘పుట్టగొడుగుల శిల’ వంటి ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణాలున్నాయి. ఇది 237 జాతుల పక్షులు, నెమళ్లు, చుక్కల జింకలు, అడవి పందులు, నక్షత్ర తాబేళ్లు, ఇండియన్‌ రాక్‌ పైథాన్, బోయాస్‌ వంటి వివిధ పాము జాతులకు పర్యావరణ నివాసం. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ‘అడవి’ అనే పదాన్ని ప్రభుత్వ రికార్డులు, చట్టపరమైన నోటిఫికేషన్లకే పరిమితం చేయకూడదని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. దీనికి విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. పర్యావరణ సమతౌల్యతను దెబ్బతీసే విధ్వంసాన్ని నిరోధించాలి’ అని నివేదించారు.ఆదాయం కోసం ఆరాటమే తప్ప..‘150 ఎకరాలకు మించి అటవీ ప్రాంతాన్ని చదును చేసేందుకు పర్యావరణ అధ్యయనం అవసరం. మీటర్‌ కంటే ఎక్కువ ఎత్తు కాండం పెరిగిన చెట్లును కొట్టాలంటే వాల్టా చట్ట ప్రకారం అనుమతి పొందాలి. లేకుంటే చట్టప్రకారం శిక్షార్హం. కానీ ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేదు. ఆదాయం కోసం ఆరాటమే తప్ప పర్యావరణ విధ్వంసం గురించి పట్టించుకోలేదు. హైదరాబాద్‌ నడిబొడ్డున 400 ఎకరాల్లో దశాబ్దాలకుపైగా ఉన్న భారీ వృక్షాలను తొలగిస్తే పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుంది. పక్కనే కాంక్రీట్‌ జంగిల్‌ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు ఊపిరి కూడా అందడం కష్టమవుతుంది. భవిష్యత్‌ తరాలు ఆక్సిజన్‌కు అవస్థ పడాల్సి వస్తుంది. ఒకపక్క కేసు హైకోర్టులో విచారణ సాగుతుండగానే అధికారులు రాత్రీపగలు చెట్ల నరికివేత చేపడుతున్నారు. ఈ పనులను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయండి’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు.క్రీడల పేరిట రూ. వేల కోట్ల భూములకు చంద్రబాబు..రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎ. సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ‘2003 ఆగస్టు 5న ఐఎంజీ అకాడమీస్‌ భారత ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఐఎంజీబీపీఎల్‌) ఏర్పాటైంది. ఆగస్టు 9న ఐఎంజీ భారతతో నాటి చంద్రబాబు ప్రభుత్వం (తాత్కాలిక ప్రభుత్వం) క్రీడల్లో ఇక్కడి యువతను చాంపియన్లుగా తీర్చిదిద్దే పేరుతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. స్పోర్ట్స్‌ అకాడమీలను నిర్మించడం, అభివృద్ధి చేయడం, నిర్వహించడం కోసమంటూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నంబర్‌ 25లోని 400 ఎకరాలను ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండలం మామిడిపల్లి సర్వే నంబర్‌ 99/1లోని మరో 450 ఎకరాలను అప్పగిస్తామని ఒప్పందం చేసుకుంది. అంతేకాదు.. ఐఎంజీ భారత అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన కార్యాలయం నిర్మించుకోవడానికి బంజారాహిల్స్‌ నుంచి మాదాపూర్‌ వెళ్లే మార్గంలో ఎకరం నుంచి 5 ఎకరాలను కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. 2004 ఫ్రిబవరిలో రూ. వేల కోట్ల విలువైన 400 ఎకరాలను స్వల్ప మొత్తానికి అంటే రూ. 2 కోట్లకు ఐఎంజీ భారతకు సేల్‌డీడ్‌ చేసింది. ఏమాత్రం అర్హతలేని, భూములు కొట్టేయడం కోసమే ఏర్పడిన కంపెనీ నుంచి ప్రభుత్వ ఆస్తులను కాపాడటం కోసం 2006లో నాటి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. 2007లో దీన్ని చట్టబద్ధం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆస్తి (పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం) చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ఐఎంజీ భారతకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన సేల్‌డీడ్‌తోపాటు ఎంఓయూ కూడా రద్దయ్యింది. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా రాజశేఖరరెడ్డి నిర్ణయాన్ని సమర్థించాయి. నాడు వైఎస్సార్‌ రక్షించిన ఆ 400 ఎకరాలు ఇండస్ట్రియల్‌ భూములే. నాడు పిల్‌ దాఖలు చేసిన వారు అర్హతలేని కంపెనీ, తక్కువ ధరనే సవాల్‌ చేశారు. హెచ్‌సీయూ భూములనిగానీ, పర్యావరణం దెబ్బతింటుందని కానీ ఎక్కడా పేర్కొనలేదు. నాడు ఒక దొంగ నుంచి మేము ఈ భూములను రక్షించినప్పుడు ఈ పిల్‌ దాఖలు చేసిన వారెవరూ కలసి రాలేదు. ఇప్పుడు పిల్‌లు దాఖలు చేసి ప్రశ్నిస్తున్నారు’ అని ఏజీ పేర్కొన్నారు.గూగుల్‌ ఫొటోలే ఆధారామా?‘గూగుల్‌ ఫోటోల ఆధారంగా అక్కడ ఫారెస్ట్‌ ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. రెవెన్యూ, ఇతర ఏ రికార్డుల్లోనూ అది అటవీ భూమిగా లేదు. గూగుల్‌ చిత్రాలు వానాకాలం ఒకలా, ఎండాకాలంలో మరోలా ఉంటాయి. గూగుల్‌ చిత్రాలు ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది. నా స్నేహితుడొకరు సభ్యుడిగా ఉన్న ఓ గోల్ఫ్‌ క్లబ్‌లోనూ నెమళ్లు, జింకలు, పాములు ఉన్నాయి. దాన్ని కూడా అటవీ ప్రాంతంగా డిక్లేర్‌ చేస్తారా? ఈ లెక్కన హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టొద్దు. గత పదేళ్లలో నాటి ప్రభుత్వం వేలాది ఎకరాలు విక్రయించినా నోరుమెదపని వారు ఇప్పుడు రూ.75 కోట్లకు ఎకరం విక్రయిస్తుంటే ప్రశ్నిస్తున్నారు. ఈ పిల్‌లు ప్రజాప్రయోజనం ఆశించి వేసినవి కావు. నిజాం కాలం నుంచి ఈ 400 ఎకరాలు గడ్డి భూములు. ఈ భూములకు ఆనుకొని ఉన్న హెచ్‌సీయూ స్థలంలో భారీ భవనాలు నిర్మించారు. నాలుగు హెలీప్యాడ్‌లు కూడా ఉన్నాయి’ అని ఏజీ చెప్పారు. కాగా, ఇది ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ అని సర్కార్‌ వద్ద రికార్డులున్నాయా? అని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సమయం ముగియడంతో తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది.

Sakshi Editorial On Uttar Pradesh Bulldozer demolitions3
ఇకనైనా అరాచకం ఆగేనా!

రాచరికాల్లో అధికారానికీ, దర్పానికీ, దానిద్వారా లభించే న్యాయానికీ రాజదండం చిహ్నం. ఈమధ్యకాలంలో బుల్‌డోజర్‌ అలాంటి పాత్ర పోషిస్తున్న వైనం కనబడుతోంది. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ పాలన మొదలయ్యాక బుల్‌డోజర్‌ అర్థం, దాని పరమార్థం మారిపోయాయి. ఆ రాష్ట్రాన్ని చూసి మరికొన్ని రాష్ట్రాలు వాతలు పెట్టుకోవటం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో 2021 మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అమానవీయంగా, చట్టవిరుద్ధంగా ఆవాసాలను కూల్చేసిన అధికారగణంపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయటంతోపాటు, ఇళ్లు కోల్పోయిన ఆరుగురు పిటిషనర్లకూ ఆరువారాల్లో రూ. 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు... ఈ ఉదంతం తమ అంతరాత్మను తీవ్రంగా కలవరపరిచిందని ధర్మాసనం తెలియజేసింది. అధికారమంటే ఇష్టానుసారం ఏదైనా చేయడానికి దొరికిన లైసెన్స్‌గా భావించే సంస్కృతి దేశంలో ముదిరిపోయింది. ఒక్క యూపీలోనేకాదు... మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌ వగైరాల్లో ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకున్న తీరు గమనిస్తే ఇదో అంటువ్యాధిగా మారిందన్న అభిప్రాయం కలుగుతుంది. ఏదైనా కేసులో నిందితులుగా ఉన్నా లేదా శిక్షపడినా... అధికార పక్షానికి అనుకూలంగా లేకపోయినా అలాంటివారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చేయడానికి బుల్‌డోజర్‌లు అత్యుత్సాహంతో ఉరుకుతున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. నిర్మాణ నిబంధనల్ని తీవ్రంగా ఉల్లంఘించారని తేలినా, ప్రభుత్వ భూమినో, మరొకరి భూమినో దురా క్రమించి కట్టారని తేలినా అలాంటివాటిని కూల్చేయటాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ అందుకొక విధానం ఉండాలి. చట్ట నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. తప్పు చేశారని ఆరోపణ లొచ్చినవారికి తగిన నోటీసులిచ్చి వారి సంజాయిషీ కోరాలి. సంతృప్తి చెందనట్టయితే ఆక్రమణ దారులకు హేతుబద్ధమైన వ్యవధినిచ్చి కూల్చివేత ప్రక్రియ ప్రారంభించాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు విచారిస్తున్న కేసు సంగతే తీసుకుంటే 2021 మార్చి 1న మొదటిసారి అక్కడ నివాసముంటున్నవారికి నోటీసులు వచ్చాయి. వారికి అంతకు దాదాపు మూణ్ణెల్ల ముందే... అంటే జనవరి 8న నోటీసులిచ్చినట్టు, అందులో ఆ నెల 27లోగా ఎవరికివారు సొంత ఖర్చులతో ఇళ్లు కూల్చేయాలని ఆదేశించినట్టు ఉంది. దానికి స్పందన రాకపోవటంతో తాజాగా నోటీసులు జారీచేశామని అందులో పేర్కొన్నారు. మరో ఆరు రోజుల్లో బుల్‌డోజర్‌లతో వచ్చి ఇళ్లు కూల్చేశారు. తొలుత నోటీసులు వ్యక్తిగతంగా ఇవ్వటానికి చేసిన ప్రయత్నం విఫలం కావటంతో ఇళ్ల దగ్గర అతికించామన్న ప్రభుత్వ వాదనను న్యాయమూర్తులు జస్టిస్‌ అభయ్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ లతో కూడిన బెంచ్‌ విశ్వసించలేదు. పిటిషనర్లకు సహేతుకమైన వ్యవధినిచ్చిన దాఖలా కనబడటం లేదని, ఇది పౌరులకు రాజ్యాంగంలోని 21వ అధికరణ ద్వారా సమకూరిన ఆవాస హక్కును ఉల్లంఘించటమేనని తేల్చిచెప్పింది. ఈ తీర్పు అనేకవిధాల ఎన్నదగినది. పిటిషనర్లకు ఆ స్థలంపై చట్టబద్ధమైన హక్కుందా లేదా అన్న అంశంలోకి ధర్మాసనం పోలేదు. దానిపై వారు విడిగా న్యాయస్థానాల్లో తేల్చుకోవాల్సిందే! 2023 ఏప్రిల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన రాజకీయ నాయకుడు, పలు కేసుల్లో నింది తుడైన అతీఖ్‌ అహ్మద్‌ అక్రమంగా ఆక్రమించుకున్న భూమిలో ఈ ఇళ్లున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఎన్నడో 1906లో అప్పటి అలహాబాద్‌ జిల్లా కలెక్టర్‌ షకీర్‌ అహ్మద్‌ అనే వ్యక్తికి 30 ఏళ్లకు లీజుకిచ్చి మరో రెండు దఫాలు పొడిగించుకునే వీలు కల్పించారని రికార్డులు చెబు తున్నాయి. 1960లో జిల్లా మేజిస్ట్రేట్‌ అనుమతితో షకీర్‌ దాని హక్కుల్ని వేరేవారికి బదలాయించాడు. ఆ తర్వాత క్రమంలో అది మరికొందరి చేతులు మారింది. చివరకు ప్రస్తుత పిటిషనర్లు దాన్ని కొనుగోలు చేశారు. ప్రభుత్వం వాదిస్తున్నట్టు ఆ కొనుగోలు చెల్లకపోవచ్చు. అది ప్రజా ప్రయోజనం కోసం వినియోగించాల్సిన భూమే కావొచ్చు. అంతమాత్రాన నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇళ్లు కూల్చటం సరైన చర్య కాదు. సుప్రీంకోర్టు తీర్పు దీన్ని తేటతెల్లం చేసింది.ఈ సందర్భంగా వేరేచోట బుల్‌డోజర్‌ కూల్చివేతలు సాగిస్తుండగా ఒకటో తరగతి బాలిక అనన్యా యాదవ్‌ తన స్కూల్‌ బ్యాగ్‌ను రక్షించుకోవటానికి మంటలంటుకున్న షెడ్‌ సమీపానికి వెళ్లిన వీడియోను న్యాయమూర్తులు ప్రస్తావించటం గమనార్హం. అలాంటి ఉదంతాలు అందరినీ దిగ్భ్రాంతిపరుస్తాయన్న వారి వ్యాఖ్యలతో ఏకీభవించని వారుండరు. గత నవంబర్‌లో జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం ఇటువంటి వ్యాఖ్యలే చేసింది. ‘ఇళ్లు కూల్చినప్పుడల్లా నిశిరాత్రిలో నడిరోడ్లపై చిన్నారులూ, మహిళలూ విలపిస్తున్న దృశ్యాలు అరాచకానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి’ అని ధర్మాసనం గుర్తు చేసింది. ఇలాంటి సంద ర్భాల్లో కూల్చివేతలకు పాల్పడిన అధికారుల నుంచి ఇళ్ల, దుకాణాల పునర్నిర్మాణానికి అయ్యే వ్యయం వసూలు చేయాలని కూడా చెప్పింది. ఇతర మార్గదర్శకాలు కూడా రూపొందించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలైనా ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. కేవలం అయిదేళ్ల కోసం ఎన్నికై అధి కారంలోకొచ్చిన ప్రభుత్వాలు శాశ్వతంగా నిలిచే రాజ్యాంగ విలువలను కాలరాయటం, ఇష్టాను సారం ప్రవర్తించటం తప్పుడు సంకేతాలిస్తుంది. సాధారణ పౌరుల్ని కూడా చట్ట ఉల్లంఘనలకు ప్రోత్సహిస్తుంది. అందుకే ప్రభుత్వాలు ఎంత త్వరగా మేల్కొంటే అంత మంచిది. నాలుగేళ్లు ఆలస్యమైనా సర్వోన్నత న్యాయస్థానంలో బాధితులకు సరైన న్యాయం దక్కటం హర్షించదగ్గది.

IPL 2025: Gujarat Titans Beat RCB By 8 Wickets4
IPL 2025: ఉతికి ఆరేసిన బట్లర్‌.. ఆర్సీబీపై గుజరాత్‌ ఘన విజయం

చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు) వేదికగా ఆర్సీబీతో ఇవాళ (ఏప్రిల్‌ 2) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి గుజరాత్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. లివింగ్‌స్టోన్‌ (40 బంతుల్లో 54; ఫోర్‌, 5 సిక్సర్లు), టిమ్‌ డేవిడ్‌ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మధ్యలో జితేశ్‌ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్‌) కూడా ఓ మోస్తరుగా బ్యాట్‌ ఝులిపించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో వీరు మినహా ఎవరూ రాణించలేదు. సాల్ట్‌ 14, విరాట్‌ కోహ్లి 7, పడిక్కల్‌ 4, పాటిదార్‌ 12, కృనాల్‌ పాండ్యా 5 పరుగులు చేసి ఔటయ్యారు. గుజరాత్‌ బౌలర్లలో సిరాజ్‌ 3 వికెట్లు తీయగా.. సాయికిషోర్‌ 2, అర్షద్‌ ఖాన్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, ఇషాంత్‌ శర్మ తలో వికెట్‌ పడగొట్టారు.170 పరుగుల నామ మాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్‌ బట్లర్‌ (39 బంతుల్లో 73 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్‌ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్‌), షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (18 బంతుల్లో 30 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు) గుజరాత్‌ను గెలిపించారు. తొలుత నిదానంగా ఆడిన బట్లర్‌.. ఆతర్వాత గేర్‌ మార్చి ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆఖర్లో రూథర్‌ఫోర్డ్‌ (ఇంపాక్ట్‌ ప్లేయర్‌) తనదైన శైలితో చెలరేగిపోయాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ తలో వికెట్‌ తీశారు. ఈ గెలుపుతో గుజరాత్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకి​ంది. టాప్‌ ప్లేస్‌లో ఉండిన ఆర్సీబీ మూడో స్థానానికి పడిపోయింది.

Royal Challengers Bangalore lost to Gujarat Titans by 8 wickets5
బెంగళూరుకు సిరాజ్‌ షాక్‌

ఏడేళ్ల పాటు బెంగళూరు ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన మొహమ్మద్‌ సిరాజ్‌... తొలిసారి ఆ జట్టుకు ప్రత్యర్థిగా ఆడుతూ నిప్పులు చెరిగాడు. గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున తన పాత సహచరులపై బుల్లెట్‌ బంతులతో ప్రతాపం చూపాడు. ఫలితంగా ఐపీఎల్‌లో టైటాన్స్‌ రెండో విజయం నమోదు చేసుకోగా... రెండు విజయాల తర్వాత బెంగళూరుకు తొలి ఓటమి ఎదురైంది. సిరాజ్‌ ధాటికి ఓ మాదిరి స్కోరుకే పరిమితమైన బెంగళూరు జట్టు... ఆ తర్వాత బౌలింగ్‌లో కూడా ఎలాంటి మెరుపులు లేకుండా ఓటమిని ఆహ్వానించింది. బ్యాటింగ్‌లో బట్లర్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో మరో 13 బంతులు మిగిలుండగానే గుజరాత్‌ గెలుపొందింది. బెంగళూరు: వరుస విజయాలతో జోరుమీదున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)కు ఐపీఎల్‌ 18వ సీజన్‌లో తొలి ఓటమి ఎదురైంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన బెంగళూరు... బుధవారం జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓటమి పాలైంది. గత సీజన్‌ వరకు ఆర్‌సీబీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్‌ సిరాజ్‌ (3/19) గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున చెలరేగిపోగా... అతడి బౌలింగ్‌ను ఆడలేక బెంగళూరు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. మొదట బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్‌ (40 బంతుల్లో 54; 1 ఫోర్, 5 సిక్స్‌లు) అర్ధశతకం సాధించగా... జితేశ్‌ శర్మ (33; 5 ఫోర్లు, 1 సిక్స్‌), టిమ్‌ డేవిడ్‌ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (7), దేవదత్‌ పడిక్కల్‌ (4) కెప్టెన్ రజత్‌ పాటీదార్‌ (12), ఫిల్‌ సాల్ట్‌ (14), కృనాల్‌ పాండ్యా (5) విఫలమయ్యారు. గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సిరాజ్‌ 3 వికెట్లు, సాయికిషోర్‌ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్‌ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. బట్లర్‌ (39 బంతుల్లో 73 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), సాయి సుదర్శన్‌ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్స్‌), రూథర్‌ఫోర్డ్‌ (18 బంతుల్లో 30 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. సూపర్‌ సిరాజ్‌... టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. అర్షద్‌ ఖాన్‌ వేసిన రెండో ఓవర్‌లో అనవసర షాట్‌కు యత్నించిన కోహ్లి ఫైన్‌ లెగ్‌లో ప్రసిధ్‌ చేతికి చిక్కాడు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. తదుపరి ఓవర్‌లో పడిక్కల్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన సిరాజ్‌ టైటాన్స్‌ ఆనందాన్ని రెట్టింపు చేశాడు. ఇక కొన్ని మంచి షాట్లు ఆడిన సాల్ట్‌ను కూడా సిరాజ్‌ బుట్టలో వేసుకున్నాడు. ఈ మధ్య పాటీదార్‌ను ఇషాంత్‌ శర్మ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో... బెంగళూరు జట్టు 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జితేశ్‌ శర్మ, లివింగ్‌స్టోన్‌... చివర్లో డేవిడ్‌ ధాటిగా ఆడారు. 15 ఓవర్లు ముగిసేసరికి 105/6తో ఉన్న ఆర్‌సీబీ... చివరి 5 ఓవర్లలో 64 పరుగులు జోడించింది. రషీద్‌ ఖాన్‌ వేసిన 18వ ఓవర్లో 3 సిక్స్‌లు బాదిన లివింగ్‌స్టోన్‌ను తదుపరి ఓవర్‌లో సిరాజ్‌ అవుట్‌ చేశాడు. చివరి ఓవర్‌లో డేవిడ్‌ 4, 6, 4 కొట్టడంతో బెంగళూరు ఆ మాత్రం స్కోరు చేసింది. అలవోకగా... ఛేదనలో గుజరాత్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురుకాలేదు. లక్ష్యం చిన్నది కావడంతో ఆ జట్టు ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేయలేకపోయిన ఆర్‌సీబీ... బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కెప్టెన్ శుబ్‌మన్‌ గిల్‌ (14) త్వరగానే అవుటైనా... మరో ఓపెనర్‌ సాయి సుదర్శన్‌తో కలిసి బట్లర్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో చెలరేగిన ఈ జంట రెండో వికెట్‌కు 47 బంతుల్లో 75 పరుగులు జతచేసింది. అనంతరం సుదర్శన్‌ అవుట్‌ కాగా... రూథర్‌ఫోర్డ్‌తో కలిసి బట్లర్‌ మూడో వికెట్‌కు 32 బంతుల్లోనే 63 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (బి) సిరాజ్‌ 14; కోహ్లి (సి) ప్రసిధ్‌ కృష్ణ (బి) అర్షద్‌ 7; దేవదత్‌ పడిక్కల్‌ (బి) సిరాజ్‌ 4; పాటీదార్‌ (ఎల్బీ) (బి) ఇషాంత్‌ 12; లివింగ్‌స్టోన్‌ (సి) బట్లర్‌ (బి) సిరాజ్‌ 54; జితేశ్‌ శర్మ (సి) తెవాటియా (బి) సాయికిషోర్‌ 33; కృనాల్‌ పాండ్యా (సి అండ్‌ బి) సాయికిషోర్‌ 5; టిమ్‌ డేవిడ్‌ (బి) ప్రసిధ్‌ కృష్ణ 32; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–8, 2–13, 3–35, 4–42, 5–94, 6–104, 7–150, 8–169. బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–19–3; అర్షద్‌ ఖాన్‌ 2–0–17–1; ప్రసిధ్‌ కృష్ణ 4–0–26–1; ఇషాంత్‌ 2–0–27–1; సాయికిషోర్‌ 4–0–22–2; రషీద్‌ ఖాన్‌ 4–0–54–0. గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాయి సుదర్శన్‌ (సి) జితేశ్‌ శర్మ (బి) హాజల్‌వుడ్‌ 49; గిల్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) భువనేశ్వర్‌ 14; బట్లర్‌ (నాటౌట్‌) 73; రూథర్‌ఫోర్డ్‌ (నాటౌట్‌) 30; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.5 ఓవర్లలో 2 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–32, 2–107. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–23–1, హాజల్‌వుడ్‌ 3.5–0–43–1; యశ్‌ దయాళ్‌ 3–0–20–0; రసిక్‌ సలామ్‌ 3–0–35–0; కృనాల్‌ పాండ్యా 3–0–34–0; లివింగ్‌స్టోన్‌ 1–0–12–0. ఐపీఎల్‌లో నేడుకోల్‌కతా X హైదరాబాద్‌వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Sakshi Guest Column On Justice Nirmaljit Kaur6
ఎంత ‘నిర్మల’మైన న్యాయం?!

ఇంట్లో గోనె సంచుల్లో నోట్ల కట్టలు తగులబడిన జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ కథ ఇంకా మరిచిపోక ముందే, దాని అడుగుజాడల్లోనే, థ్రిల్లర్‌ సినిమాను మైమరపింపజేసే మరొక న్యాయమూర్తి రసవత్తరమైన కథ గురించి చెప్పుకోవ లసి వస్తున్నది. ‘తీగలాగితే డొంక కదిలింది’ అనే సామెతను అక్షరాలా నిజం చేసే వాస్తవ కథనం ఇది. సినిమా కథలు తిరిగినన్ని మలుపులు, అనూహ్య సంఘ టనలు, తారుమారు పరిణామాలు ఎన్నో ఉన్న ఈ అవినీతి కథ ఒక తారుమారు తమాషాతో మొదలయింది. పంజాబ్‌– హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ నిర్మల్‌జిత్‌ కౌర్‌ 2008 జూలై 10న పదవి స్వీకరించారు. తర్వాత నెల రోజు లకు, 2008 ఆగస్ట్‌ 13న ఆమె ఇంటికి ఒక వ్యక్తి వచ్చి ‘నిర్మల్‌ జీకి ఇమ్మని ఢిల్లీ నుంచి ఈ పార్సెల్‌ వచ్చింది’ అని ఒక ప్లాస్టిక్‌ కవర్‌ ఇచ్చాడు. అమ్రిక్‌ సింగ్‌ అనే వాచ్‌మన్‌ ఆ పార్సెల్‌ లోపలికి తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు విప్పితే, అందులో నుంచి అక్షరాలా పదిహేను లక్షల రూపాయలు బైటపడ్డాయి. ఆ పార్సెల్‌ తెచ్చిన ప్రకాష్‌ అనే వ్యక్తిని పోలీసులకు అప్పగించి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విషయం తెలియజేశారు. పోలీసులు ప్రకాష్‌ను ప్రశ్నించగా, అతను పంజాబ్‌ హైకోర్టులో అడ్వకేట్‌ జనరల్‌గా ఉన్న సంజీవ్‌ బన్సాల్‌ దగ్గర గుమాస్తా అని తేలింది. పోలీసులు బన్సాల్‌ను ప్రశ్నించగా, అవి తన డబ్బులు కావని, ఢిల్లీకి చెందిన హోటల్‌ యజమాని రవీందర్‌ సింగ్‌ తనకు పంపి, జస్టిస్‌ నిర్మల్‌ యాదవ్‌కు అంద జేయమని చెప్పాడని, తన గుమాస్తాకు ‘జస్టిస్‌ నిర్మల్‌ జీకి ఇవ్వు’ అని పంపిస్తే, పొరపాటున జస్టిస్‌ నిర్మల్‌జిత్‌ జీకి ఇచ్చా డని చెప్పాడు. అంటే ఆ సొమ్ము వాస్తవంగా చేరవలసింది జస్టిస్‌ నిర్మల్‌ యాదవ్‌ అనే మరొక న్యాయమూర్తికన్నమాట. గుమాస్తా చేసిన చిన్న పొరపాటువల్ల, ఇద్దరు న్యాయమూర్తుల పేర్లలో నిర్మల్‌ ఉండడం వల్ల ఈ అవినీతి బయటపడింది. జస్టిస్‌ నిర్మల్‌జిత్‌ కౌర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో, రెడ్‌ హ్యాండెడ్‌గా పదిహేను లక్షల రూపాయలు, అది పట్టుకొచ్చి ఇచ్చిన వారు, పంపించినవారు దొరికారు గనుక పోలీసు కేసు నమోదయింది. కాని, న్యాయమూర్తి, అడ్వకేట్‌ జనరల్‌లకు ఇందులో భాగం ఉంది గనుక పది రోజుల్లో ఈ కేసును పోలీ సుల నుంచి సీబీఐకి బదిలీ చేశారు. తర్వాత సీబీఐ చేసిన దర్యాప్తులో సంజీవ్‌ బన్సాల్, రాజీవ్‌ గుప్తా కలిసి హరియాణా లోని పంచ్‌ కులాలో కొన్న ఒక భూమి కేసులో, జస్టిస్‌ నిర్మల్‌ యాదవ్‌ వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, అందుకు ప్రతిఫలంగా ఈ లంచం పంపించారని తేలింది. అది మాత్రమే కాక, జస్టిస్‌ నిర్మల్‌ యాదవ్‌ విదేశీ ప్రయాణపు టికెట్లు, విదే శాలలో ఆమె వాడిన మొబైల్‌ ఫోన్‌ కార్డ్‌ కూడా సంజీవ్‌ బన్సాల్‌ కొనిపెట్టాడని సీబీఐ సాక్ష్యాధారాలు సేకరించింది. నిందితులకు, న్యాయమూర్తికి మధ్య జరిగిన సంభాషణల ఫోన్‌ రికార్డులను కూడా సీబీఐ సేకరించింది. చివరికి అవినీతి నిరోధక చట్టం కింద, భారత శిక్షా స్మృతి కింద జస్టిస్‌ నిర్మల్‌ యాదవ్‌ మీద, మిగిలిన నిందితుల మీద కేసు పెట్టవచ్చునని సీబీఐ నిర్ధారించింది. ఇక్కడిదాకా సాఫీగా సాగిన కథ తర్వాత ఎన్నో ఉత్కంఠ భరితమైన మలుపులు తిరిగింది. న్యాయమూర్తి మీద ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇమ్మని కోరుతూ సీబీఐ స్థానిక అధికా రులు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఆ నివేదికకు జవాబిస్తూ సీబీఐ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ నిందితుల మీద కేసు నడపడానికి తగిన ఆధారాలు లేవని అన్నారు. కాని ఆ సమయంలో సీబీఐకి డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి ఇది తప్పకుండా ప్రాసిక్యూట్‌ చేయవలసిన అవినీతి నేరమే అన్నారు. సీబీఐ ఉన్నతాధికారులిద్దరు ఇలా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, మూడో అభిప్రాయం కోసం అప్పటి అటార్నీ జనర ల్‌కు పంపారు. అదే ప్రతిని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు కూడా పంపారు. అటార్నీ జనరల్‌ కూడా ఈ కేసులో పస లేదు అన్నారు. ఈ వ్యవహారం బయటకు పొక్కి, ‘హైకోర్టు న్యాయమూర్తి మీద కేసు నడపడానికి తిరస్కరించిన సీబీఐ’ అని హిందుస్థాన్‌ టైమ్స్‌ 2009 జూన్‌ 6న ఒక వార్త రాసింది. అది చూసిన అప్పటి న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ, ఇంత తీవ్రమైన వ్యవహారంలో కేసు నడపకపోవడం తప్పు అనీ, అలా చేస్తే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుందనీ తీవ్ర పదజాలంతో న్యాయశాఖ కార్యదర్శికి నోట్‌ పెట్టి, దర్యాప్తు చేసి నివేదిక ఇమ్మన్నారు. అప్పుడు సీబీఐ మళ్లీ కొత్తగా వచ్చిన అటార్నీ జనరల్‌ సలహా కోసం వెళ్లింది. కొత్త అటార్నీ జనరల్‌ కూడా కేసు అవసరం లేదు అంటూ పాత అటార్నీ జనరల్‌ అభిప్రాయాన్నే ప్రకటించారు. దానితో తర్వాత సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో కేసును ఉపసంహరించుకుంటున్నానని (క్లోజర్‌ రిపోర్ట్‌) సీబీఐ తెలిపింది. ఇక్కడ కథ మరొక మలుపు తిరిగి, సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి క్లోజర్‌ రిపోర్ట్‌ను తిరస్కరించి, కేసు నడపవల సిందే అన్నారు. అప్పుడు సీబీఐ మరొకసారి అనుమతి కోసం దరఖాస్తు... పైకి పంపించింది. దాన్ని పరిశీలించిన న్యాయ శాఖ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని నిర్ణయించగా, రాష్ట్రపతి 2011 మార్చ్‌లో అనుమతి ఇచ్చారు. అంటే రెడ్‌ హ్యాండెడ్‌గా అవినీతి పట్టు బడినా కేసు ప్రారంభించడానికే మూడు సంవత్సరాలు పట్టిందన్న మాట. అప్పుడు సీబీఐ చార్జిషీట్‌ వేసింది. అప్పటికే ఈ కేసు నడపడానికి వీలులేదని ఎన్నో పిటిషన్లు దాఖలు చేసిన జస్టిస్‌ నిర్మల్‌ యాదవ్‌ ఇప్పుడు ఈ అనుమతి చెల్లదని హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు అనుమతి చెల్లుతుందని తేల్చి చెప్పింది. ఆ తీర్పును నిర్మల్‌ యాదవ్‌ సుప్రీం కోర్టులో సవాలు చేయగా, అక్కడ కూడా ఆమెకు చుక్కెదురయింది. కేసును తాత్సారం చేయడానికి ఆమె వేసిన మరెన్నో పిటిషన్లు కూడా గడిచిన తర్వాత, చివరికి 2013 మేలో నెల లోపు దర్యాప్తు, చార్జెస్‌ ఫ్రేమ్‌ ప్రక్రియలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలా అవినీతి సొమ్ము దొరికిన ఐదు సంవత్సరాల తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టులో కేసు మొదలయింది. ఏడున్నర సంవ త్సరాల తర్వాత చార్జెస్‌ ఫ్రేమ్‌ అయి విచారణ మొదలయింది. ఈలోగా జస్టిస్‌ నిర్మల్‌ యాదవ్‌ పదవీ విరమణ జరిగింది. సంజీవ్‌ బన్సాల్‌ మరణించాడు. డబ్బు పట్టుకొచ్చిన గుమాస్తా మరణించాడు. నలుగురు కీలక సాక్షులు అడ్డం తిరిగారు. న్యాయస్థానం దాదాపు 70 మంది సాక్షులను విచారించింది. ఇలా ఎన్నెన్నో అవరోధాలు దాటి, ఘటన జరిగిన 17 సంవత్సరాల తర్వాత, కేసు మొదలైన 14 సంవత్సరాల తర్వాత... ఎట్టకేలకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అల్కా మాలిక్‌ సరిపోయినన్ని సాక్ష్యాధారాలు లేవని, సాక్షుల వాఙ్మూలాల్లో వైరుద్ధ్యాలున్నాయని కేసు కొట్టేశారు. ఎంత నిర్మలమైన న్యాయం!!ఎన్‌. వేణుగోపాల్‌ వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Major Earthquake In Japan7
జపాన్‌లో భారీ భూకంపం

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. జపాన్‌లోని క్యూషు కేంద్రంగా భూమి కంపించింది. ఈ ఏడాది జనవరిలో కూడా జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. భూకంపం ప్రభావంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా, ఆస్తి నష్టం జరిగింది.గత ఏడాది ఆగస్టులోనూ జపాన్‌లో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. 6.9, 7.1 తీవ్రతతో ఏర్పడిన రెండు శక్తిమంతమైన భూకంపాలు నైరుతి దీవులైన క్యూషు, షికోకులను ప్రభావితం చేశాయి. గత ఏడాది జనవరి 1న 7.6 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంలో 300 మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, భూకంపాల పరంగా జపాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జోన్‌లో ఉంది. ఇక్కడి సముద్ర తీరప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం 80 శాతం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి.ఏఎఫ్‌పీ (Agence France-Presse) తెలిపిన వివరాల ప్రకారం జపాన్ ప్రభుత్వ సంస్థ భవిష్యత్‌లో మెగా భూకంపం రానున్నదని అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ భారీ భూకంపం భూమిపై అపరిమిత వినాశనాన్ని కలిగిస్తుందని, మూడు లక్షల మంది మరణానికి కారణమవుతుందని తెలిపింది. ఈ భారీ భూకంపం కారణంగా సునామీ సంభవిస్తుందని, ఇది అనేక నగరాలను సముద్రంలో కలిపేస్తుందని పేర్కొంది. ‘మెగా క్వేక్ అనేది చాలా శక్తివంతమైన భూకంపం. దీని తీవ్రత 8 లేదా అంతకన్నా అధిక తీవ్రతతో ఉంటుంది. ఇది భారీ విధ్వంసానికి కారణంగా నిలుస్తుంది. సునామీని కూడా సృష్టిస్తుందని పేర్కొంది.కాగా, ఇటీవల మయన్మార్‌ (Myanmar)లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. వేలాది మంది ప్రస్తుతం ఆస్పత్రులలో జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నారు. లెక్క లేనంత మంది గల్లంతయ్యారు. పలు నగరాల్లో, ఎత్తైన భవనాలు, ఇళ్లు, దేవాలయాలు శిథిలమయ్యాయి. మయన్మార్‌లో సంభవించిన భూకంపం థాయిలాండ్‌లోనూ వినాశనాన్ని మిగిల్చింది. బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చింది.

Poonam Gupta appointment as RBI Deputy Governor8
ఆర్‌బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్‌.. ఎవరీ పూనమ్‌ గుప్తా?

ఢిల్లీ : కేంద్రం మరో మహిళా అధికారిణికి కీలక బాధ్యతలు అప్పగించింది. ఇటీవల 2014 బ్యాచ్‌కు చెందిన ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌ అధికారిణి నిధి తివారీని ప్రధాని మోదీ ప్రైవేట్‌ సెక్రటరీగా నియమించింది. తాజాగా, పూనమ్ గుప్తా అనే అధికారిణిని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 7 నుంచి 9 మధ్య మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముందు ప్రస్తుతం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకానమిక్ రీసెర్చ్ డైరెక్టర్‌ జనరల్‌ పూనమ్‌ గుప్తాను ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆమె ఈ ఏడాది జనవరిలో రిటైరైన ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైకల్ పత్రా స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్‌ గుప్తా మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. పూనమ్ గుప్తా ఎవరు?కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ పూనమ్ గుప్తా నియామకాన్ని ఆమోదించింది. ఆమె ప్రస్తుతానికి ప్రధానమంత్రికి ఆర్థిక సలహా కౌన్సిల్ సభ్యురాలు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకానమిక్ రీసెర్చ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా బాధత్యలు స్వీకరించే ముందు ఆమె ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో గ్లోబల్ మాక్రో, మార్కెట్ రీసర్చ్ లీడ్ ఎకానమిస్ట్‌గా పనిచేశారు. భారత అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల పరిశోధనా మండలిలో ప్రొఫెసర్‌గా, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌ బోధించడంతో పాటు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌లో పరిశోధకురాలిగా పనిచేశారు. ఆమె 16వ ఫైనాన్స్ కమిషన్ సలహా మండలిలో సభ్యురాలిగా ఉన్నారు.ఇక ఆమె చదువు విషయానికి వస్తే ఎకానమిక్స్‌లో పీహెచ్‌డీ : యూనివర్శిటీ ఆఫ్ మారీల్యాండ్, కాలేజ్ పార్క్ (1998)స్పెషలైజేషన్: మాక్రో ఎకానమిక్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ,ఇంటర్నేషనల్ ట్రేడ్ఎం.ఎ ఎకానమిక్స్ : యూనివర్శిటీ ఆఫ్ మారీల్యాండ్, కాలేజ్ పార్క్ (1995)ఎం.ఎ ఎకానమిక్స్‌ : ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ (1991)బీఏ ఎకానమిక్స్‌ : హిందూ కాలేజ్, ఢిల్లీ యూనివర్శిటీ (1989)ఆమె 1998లో అంతర్జాతీయ ఆర్థికశాస్త్రంపై చేసిన పీహెచ్‌డీకి EXIM బ్యాంక్ అవార్‌ను గెలిచారు

Team India Upcoming Home Season Schedule Released, India To Play West Indies, South Africa At Home9
భారత్‌లో పర్యటించనున్న వెస్టిండీస్‌, సౌతాఫ్రికా.. షెడ్యూల్‌ విడుదల

ఈ ఏడాది భారత క్రికెట్‌ జట్టు హోం సీజన్‌ (స్వదేశంలో ఆడే మ్యాచ్‌లు) షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (ఏప్రిల్‌ 2) ప్రకటిం​చింది. అక్టోబర్‌లో వెస్టిండీస్‌.. నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో సౌతాఫ్రికా క్రికెట్‌ జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి.విండీస్‌ క్రికెట్‌ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో తొలి టెస్ట్‌ అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 2-6 మధ్య తేదీల్లో జరుగనుంది. రెండో టెస్ట్‌ కోల్‌కతా వేదికగా అక్టోబర్‌ 10-14 మధ్య తేదీల్లో జరుగుతుంది. టెస్ట్‌ సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ భారత్‌లో పర్యటించడం 2018 తర్వాత ఇదే మొదటిసారి. ఆ సిరీస్‌లో భారత్‌ 2-0 తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది.అనంతరం నవంబర్‌ నెలలో సౌతాఫ్రికా జట్టు మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా రెండు టెస్ట్‌లు.. మూడు వన్డేలు.. ఐదు టీ20లు ఆడనుంది. నవంబర్‌ 14-18 మధ్య తేదీల్లో న్యూఢిల్లీలో తొలి టెస్ట్‌ జరుగనుంది. నవ​ంబర్‌ 22 తేదీన గౌహతి వేదికగా రెండో టెస్ట్‌ ప్రారంభం కానుంది.నవంబర్‌ 30, డిసెంబర్‌ 3, డిసెంబర్‌ 6 తేదీల్లో రాంచీ, రాయ్‌పూర్‌, వైజాగ్‌ వేదికలుగా మూడు వన్డేలు జరుగనున్నాయి. డిసెంబర్‌ 9, 11, 14, 17, 19 తేదీల్లో కటక్‌, చండీఘడ్‌, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్‌ వేదికలుగా ఐదు టీ20లు జరుగనున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో భారత్‌, శ్రీలంకల్లో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ దృష్ట్యా ఈ టీ20 సిరీస్‌ను షెడ్యూల్‌ చేశారు.కాగా, భారత క్రికెట్‌ జట్టు ఐపీఎల్‌ 2025 తర్వాత ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన నెలన్నర పాటు సాగనుంది. మధ్యలో భారత్‌ జట్టు ఆగస్ట్‌, సెప్టెంబర్‌ నెలల్లో ఖాళీగా ఉంటుంది. ఆతర్వాత హోం సీజన్‌ ప్రారంభమవుతుంది. భారత్‌లో వెస్టిండీస్‌ పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌ల షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ఇటీవలే విడుదల చేసింది.ఆస్ట్రేలియాలో భారత్‌ పర్యటన షెడ్యూల్‌..అక్టోబర్‌ 19- తొలి వన్డే (డే అండ్‌ నైట్‌)- పెర్త్‌అక్టోబర్‌ 23- రెండో వన్డే (డే అండ్‌ నైట్‌)- అడిలైడ్‌అక్టోబర్‌ 25- మూడో వన్డే (డే అండ్‌ నైట్‌)- సిడ్నీఅక్టోబర్‌ 29- తొలి టీ20- కాన్‌బెర్రాఅక్టోబర్‌ 31- రెండో టీ20- మెల్‌బోర్న్‌నవంబర్‌ 2- మూడో టీ20- హోబర్ట్‌నవంబర్‌ 6- నాలుగో టీ20- గోల్డ్‌ కోస్ట్‌నవంబర్‌ 8- ఐదో టీ20- బ్రిస్బేన్‌

Ysrcp Chief Ys Jagan Condemns Visakha Incident10
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం.. వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

సాక్షి, తాడేపల్లి: విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్కా దీపిక కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని ఘటన మరవకముందే.. విశాఖలో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు.విశాఖలో ప్రేమోన్మాది దాడిలో యువతి తల్లి నక్కా లక్ష్మి ప్రాణాలు కోల్పోవడం, యువతి దీపిక ప్రాణాపాయ స్థితిలో ఉండటం ఆవేదన కలిగిస్తోందన్నారు. ప్రేమోన్మాది నవీన్‌ను కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లక్ష్మి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement