Ananthapur
-
‘ఉపాధి’ని నిర్వీర్యం చేస్తున్నారు
అనంతపురం అర్బన్: గ్రామీణ పేదల వలసలు, ఆకలిచావులు నివారించేందుకు 100 రోజులు గ్యారెంటీ పనులు కల్పించే లక్ష్యంతో ఏర్పాటైన ‘ఉపాధి’ చట్టాన్ని పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక చర్యలను సంఘటితంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కృష్ణకళామందిర్లో బహిరంగసభ నిర్వహించారు. కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ, వ్యవసాయ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు జెల్లి విల్సన్, ఏఐసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, ఉప ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రావు మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. బడ్జెట్లో రూ.4.60 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉంటే ఏటా తగ్గిస్తూ ఈ ఏడాది రూ.86 వేల కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. కేంద్రానికి అనుకూలంగా రాష్ట్రప్రభుత్వం కూడా ఉపాధి చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మెటీరియల్ కాంపోనెట్ను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు. పథకంలో నిధులను కూలీలకే కేటాయించాలన్నారు. కుటుంబ జాబ్ కార్డుతో నిమిత్తం లేకుండా ప్రతి వయోజనుడికి విడిగా జాబ్కార్డు ఇవ్వాలన్నారు. రోజు కూలీ రూ.700 ఇవ్వాలన్నారు. ప్రతి గ్రూప్కు పని కల్పించకపోతే ఏడాదికి ప్రతి కూలీకి రూ.12 వేలు చొప్పున ఉపాధి భృతి చెల్లించాలన్నారు. సభలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, కాంగ్రెస్ మైనారిటీ సెల్ రాష్ట్ర చైర్మన్ దాదాగాంధీ, సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సహాయ కార్యదర్శి నారాయణస్వామి, శ్రీసత్యసాయి జిల్లా సీపీఐ కార్యదర్శి వేమయ్య, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున, సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక చర్యలను తిప్పికొట్టాలి బహిరంగసభలో వక్తల పిలుపు -
జిల్లా జడ్జిని కలిసిన ఎస్పీ
అనంతపురం: ఉమ్మడి జిల్లా నూతన ప్రధాన న్యాయమూర్తి భీమారావును ఎస్పీ పి.జగదీష్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టులోని చాంబర్లో జడ్జికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్రాయుళ్ల అరెస్ట్ బొమ్మనహాళ్: క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న యువకులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. ఉద్దేహాళ్లో మంగళవారం బెట్టింగ్కు పాల్పడుతున్న యువకులు చికెన్ కబాబ్ సెంటర్ వన్నూరుస్వామి, చిన్నా, ఇమ్రాన్, మహేష్ను రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటిపై పెట్రోల్తో దాడి తాడిపత్రి టౌన్: స్థానిక శ్రీనివాసపురంలో నివాసముంటున్న బేల్దారి మల్లికార్జున ఇంటిపై మంగళవారం అదే కాలనీకి చెందిన చాకలి రాముడు బంధువు భరత్, మరో వ్యక్తి పెట్రోల్తో దాడి చేసారు. రెండు నెలల క్రితం స్థానిక జేసీ పార్కు వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో చాకలి రాముడు మృతి చెందిన విషయం తెలిసిందే. తన బంధువు మరణానికి కారణం మల్లికార్జుననే కక్షతో భరత్ ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. దీంతో ఇంట్లో విలువైన సామగ్రి కాలిపోయింది. ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు. బీపీఈడీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో బీపీఈడీ నాలుగో సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య బి.అనిత మంగళవారం విడుదల చేశారు. మొత్తం 33 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 29 మంది ఉత్తీర్ణులయ్యారు. -
రూ.లక్షలు కట్టమంటున్నారు
నా భర్త బాలకృష్ణతో కలసి నేను వ్యవసాయ కూలి పనులకు వెళుతూ ఇద్దరు కుమార్తెలను పోషించుకుంటున్నాం. ఓ రోజు రాధమ్మ మాటలు నమ్మి నా భర్తకు తెలియకుండా బ్యాంకు బుక్, ఆధార్, ఏటీఎం కార్డు తీసుకెళ్లి ఇచ్చాను. తర్వాత ఫైనాన్స్ కంపెనీ వారు వచ్చారంటూ కబురు పెట్టడంతో వెళ్లి వారిచ్చిన కాగితాలపై సంతకాలు చేసి, ఫొటో దిగి వచ్చాను. అయితే రుణం డబ్బు మాత్రం చేతికి అందలేదు. అడిగితే రిజెక్ట్ అయిందని చెప్పింది. రాధమ్మ ఊరు విడిచి వెళ్లిపోయిన తర్వాత ఫైనాన్స్ కంపెనీ వారు వచ్చి నా పేరుపై రూ.1.25 లక్షల రుణం ఉందని, డబ్బు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆ డబ్బు ఎలా కట్టాలో దిక్కుతోచడం లేదు. – భవాని, జి.కొట్టాల, గుంతకల్లు మండలం -
దళిత కుటుంబంపై టీడీపీ నేత దాడి
ఉరవకొండ: వజ్రకరూరు మండలం చాబాల గ్రామంలో ఓ దళిత కుటుంబంపై ఆ గ్రామ టీడీపీ నేత, మాజీ సర్పంచ్ ఎర్రిస్వామి, ఆయన కుటుంబసభ్యులు దాడికి తెగబడ్డారు. బాధిత కుటుంబ యజమాని సురేష్బాబు తెలిపిన మేరకు... కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న సురేష్బాబు కుమార్తెను కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన యువకుడు తేజ వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. దీనిపై గతంలో వజ్రకరూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు. ఇటీవల సురేష్బాబు కుమార్తెను తేజ కలసి మైనారిటీ తిరగానే పెళ్లి చేసుకుంటానని, తనను ఎవరూ అడ్డుకోలేరంటూ అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళితే వారు తేజాను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు. అదే సమయంలో యువకుడి ఫోన్లో తనకు అడ్డంగా ఉన్న యువతి తండ్రి సురేష్బాబును హతమార్చేలా రూ.లక్ష సుపారీ ఇచ్చి ఒప్పందం చేసుకున్నట్లు ఉన్న ఆడియో బయటపడింది. ఈ ఆడియోను పోలీసులకు ఇవ్వడంతో యువకుడు మద్యం మత్తులో మాట్లాడి ఉంటాడని కొట్టి పడేశారు. అనంతరం రోజూ స్టేషన్కు వచ్చి సంతకం పెట్టి పోవాలని యువకుడికి పోలీసులు సూచించారు. ఈ వ్యవహారంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఎర్రిస్వామి జోక్యం చేసుకుని యువకుడిపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా బయటకు తీసుకొచ్చారు. ఇది అన్యామంటూ సుధాకర్బాబు కుటుంబసభ్యులు ఎర్రిస్వామిని నిలదీస్తే దళితులై ఉండి తన ఇంటి వద్దకు ఎలా వస్తారంటూ దూషణలకు దిగడమే కాక మహిళలని కూడా చూడకుండా ఎర్రిస్వామి, ప్రకాష్, హనుమేష్తో పాటు మరో 10 మంది ఇష్టారాజ్యంగా దాడి చేశారు. అక్కడితో ఆగకుండా చర్చి వద్ద ఉన్న సురేష్బాబుపై ఎర్రిస్వామి ఇనుప రాడ్తో దాడి చేశాడు. ఘటనలో సురేష్బాబుతో పాటు కుమార్తె, ఇతర కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై వజ్రకరూరు ఎస్ఐ నాగస్వామి మాట్లాడుతూ.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
ప్రాణాలు బలిగొన్న ఈత సరదా
గుమ్మఘట్ట: మండలంలోని పూలకుంటకు చెందిన వెంకటేశులు, గంగమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయ కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో జె.వెంటకంపల్లి సమీపంలో బీటీపీ ప్రధాన సాగునీటి కాలువలో మంగళవారం ఉదయం దుస్తులు ఉతకేందుకు తల్లి గంగమ్మతో పాటు కుమారుడు అభిరాం (8) వెళ్లాడు. కాలువ నీటిలో సరదాగా ఈత కొడుతున్న అభిరాం కాసేపటి తర్వాత నీటి మునిగాడు. గమనించిన గంగమ్మ గట్టిగా కేకలు వేయడంతో అక్కడికి సమీపంలో ఉన్నవ ఉన్నవారు వెంటనే కాలువలో దిగి బాలుడిని వెలికి తీశారు. అపస్మారక స్థితికి చేరుకున్న బాలుడిని చికిత్స నిమిత్తం రాయదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి.. బాధిత తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గుంతకల్లు రూరల్: మండలంలోని మైనాపురం గ్రామానికి చెందిన ఆదినారాయణ, ప్రభావతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి దగ్గర్లో ఉన్న పొలంలోని ఫారంపాండ్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో మంగళవారం ఈతకెళదామంటూ చిన్న కుమారుడు ప్రణీత్ (8) పట్టుబట్టాడు. దీంతో ప్రణీత్ను పిలుచుకుని నానమ్మ ఈరమ్మ ఫారంపాండ్ వద్దకు బయలుదేరింది. అయితే కాస్త దూరంగా ఉండగానే నానమ్మను వదిలి పరుగున వెళ్లిన ప్రణీత్.. ఫారంపాండ్లో దూకాడు. ఆ సమయంలో ఈరమ్మ గట్టిగా కేకలు వేయడంతో ఆ పక్కనే ఉన్న గొర్రెల కాపరులు అప్రమత్తమై నీటితో దూకి బాలుడిని వెలికి తీశారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న ప్రణీత్ను వెంటనే గుత్తితోని ప్రభుత్వాస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. చికిత్స మొదలుపెట్టేలోపు బాలుడు మృతి చెందాడు. వేర్వేరు ప్రాంతాల్లో నీట మునిగి ఇద్దరు బాలుర మృతి -
కలెక్టరేట్ ఎదుట ఆయుష్మాన్ సీహెచ్ఓల ధర్నా
అనంతపురం అర్బన్: తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆయుష్మాన్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎంసీఏ (ఏపీ మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సంఘం) జిల్లా అధ్యక్షుడు గణేష్కుమార్ మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం సీహెచ్ఓలకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఆరేళ్ల సర్వీసు దాటిని వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించి ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్నారు. ప్రతి నెలా వేతనంతో పాటు ఇన్సెంటీవ్, ఏటా 5 శాతం ఇంక్రిమెంట్ చెల్లించాలన్నారు. ఈపీఎఫ్ పునరుద్ధరించాలన్నారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలన్నారు. క్లినిక్ అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. నిర్ధిష్టమైన జాబ్ చార్ట్ అందించాలన్నారు. ఎఫ్ఆర్ఎస్ నుంచి సీహెచ్ఓలను మినహాయించాలన్నారు. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కరించాలన్నారు. హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, బదిలీలు, ఎక్స్గ్రేషియా, పితృత్వ సెలువులు, తదతర వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేవరకూ బాధ్యతతో కూడిన శాంతియుతమైన నిరసనలు కొనసాగిస్తామన్నారు. అనంతరం కలెక్టర్ వి.వినోద్కుమార్ను ఆయన చాంబర్ వద్ద నాయకులు కలసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కోశాధికారి గౌరి, కార్యనిర్వాహక కార్యదర్శి షీబా ప్రియాంక, జిల్లా నాయకులు హరినాథ్రెడ్డి, సుధీర్, నాగరాజు, లక్ష్మీనారాయణ, సుబహాన్, హరి, తదితరులు పాల్గొన్నారు. -
భువనేశ్వర్–యశ్వంత్పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా భువనేశ్వర్–యశ్వంత్పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ.శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మే 24 నుంచి జాన్ 28 వరకు ప్రతి శనివారం భువనేశ్వర్ (02811) జంక్షన్ నుంచి యశ్వంత్పూర్కు రైలు బయలుదేరుతుందన్నారు. అదేవిధంగా మే 26 నుంచి జూన్ 30 తేదీ వరకు ప్రతి సోమవారం యశ్వంత్పూర్ జంక్షన్ నుంచి బయలుదేరుతుందన్నారు. విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నరసరావుపేట, మార్కాపురం రోడ్డు, గిద్దలూరు, నంద్యాల, డోన్, ధర్మవరం జంక్షన్, శ్రీ సత్యసాయి నిలయం, హిందూపురం రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ–కేవైసీ చేయించుకోండి ● రేషన్ లబ్ధిదారులకు జేసీ శివ్ నారాయణ్ శర్మ సూచన అనంతపురం అర్బన్: రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు ఈనెల 30లోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షించి తగిన ఆదేశాలిచ్చారు. ఈ–కేవైసీతో పారదర్శకత పెరుగుతుందని, నకిలీలను నిరోధించవచ్చన్నారు. జిల్లాలో ఇంకా 1,38,186 మంది ఈ–కేవైసీ చేయించుకోలేదన్నారు. వారి జాబితా రేషన్ షాపు డీలర్, వీఆర్వో, పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దారు వద్ద ఉంటుందన్నారు. లబ్ధిదారులు సంబంధిత రేషన్ దుకాణం లేదా వీఆర్ఓ లేదా సచివాలయ సిబ్బంది వద్దకు వెళ్లి ఈ–పాస్ యంత్రంలో లేదా వీఎస్డబ్ల్యూఎస్ మొబైల్ యాప్లో వేలిముద్ర వేసి ఈ–కేవైసీ చేయించుకోవాలని చెప్పారు. నేడు ‘పది’ ఫలితాలు అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువుల్లో ఉత్తీర్ణతపై ఆందోళన నెలకొనగా... రాష్ట్రస్థాయిలో జిల్లా స్థానంపై విద్యాశాఖ అధికారులు కలవరపడుతున్నారు. గత నెల 17న ప్రారంభమైన పది పరీక్షలు ఈనెల 1తో ముగిశాయి. జిల్లాలో రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు 32,803 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇదే సమయంలో ఓపెన్ (సార్వత్రిక) పరీక్షలు జరిగాయి. రెగ్యులర్తో పాటు ఓపెన్ పది ఫలితాలు కూడా విడుదల చేయనున్నారు. ఫలితాలు ఇలా తెలుసుకోవచ్చు పదో తరగతి ఫలితాలు https://bse.ap. gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్సైట్లు, ‘మన మిత్ర’ (వాట్సాప్), ‘లీప్’ మొబైల్ యాప్లలో అందుబాటులో ఉంటాయని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్బాబు తెలిపారు. అలాగే వాట్సాప్లో 95523 00009 నంబర్కు ‘ఏజీ‘ అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, రోల్ నంబర్ను నమోదు చేస్తే ఫలితాల పీడీఎఫ్ పొందవచ్చని పేర్కొన్నారు. అలాగే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని, ‘లీప్’ మొబైల్ యాప్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్ల ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించారన్నారు. విద్యుదాఘాతంతో యువ రైతు మృతి రాయదుర్గం టౌన్/ బ్రహ్మసముద్రం: విద్యుత్ షాక్కు గురై ఓ యువ రైతు మృతి చెందాడు. వివరాలు... బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లికి చెందిన మాలింగ (32) వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం తాను సాగు చేసిన వరి పంటకు నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లిన ఆయన మోటారు ఆన్ చేసే క్రమంలో విద్యుత్ షాక్కు గురయ్యాడు. గుర్తించిన పక్క పొలంలోని రైతులు వెంటనే రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, మాలింగకు భార్య అంజినమ్మ, ఓ కుమారుడు ఉన్నారు. -
ఇంకెంత కాలం పస్తులుంచుతారు?
అనంతపురం అర్బన్: వేతనాలివ్వకుండా ఇంకెన్నాళ్లు శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా పథకం కార్మికులను పస్తులుంచుతారంటూ కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. తక్షణమే ప్రత్యేక నిధులు విడుదల చేసి కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాలు చెల్లించాలంటూ శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షుడు జి.ఓబుళు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.రాజారెడ్డి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్ మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో 600 మంది కార్మికులు వివిధ కాంట్రాక్ట్ ఏజెన్సీల కింద 16 ఏళ్లుగా పనిచేస్తున్నారన్నారు. వీరికి సంబంధించి నెలల తరబడి పీఎఫ్ బకాయిలు, వేతనాలు చెల్లించకుండా ఏజెన్సీల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పీఎఫ్, వేతనాలు చెల్లించని కాంట్రాక్టు ఏజెన్సీలపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వం స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించడం ద్వారా కార్మికులకు వేతన, పీఎఫ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ వినోద్కుమార్ను కలిసి నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు నాగమణి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, నీటి సరఫరా పథకం కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాము, ఇతర నాయకులు పాల్గొన్నారు. తాగునీటి పథకం కార్మికుల వేతనాలు తక్షణమే చెల్లించాలి ధర్నాలో కార్మిక సంఘాల నేతల డిమాండ్ -
ప్రభుత్వ సేవలపై ప్రజల్లో అసంతృప్తి
అనంతపురం అర్బన్: ప్రభుత్వ సేవలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారని, ఐవీఆర్ఎస్ సర్వేలో అధికారుల పనితీరుపై ఈ మేరకు అభిప్రాయం వెల్లడించారని కలెక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, విలేజ్ సర్వేయర్లు, ఇతర సిబ్బందితో ఐవీఆర్ఎస్కు సంబంధించి కౌన్సెలింగ్, అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే విధంగా పనిచేయాలన్నారు. రెవెన్యూ, సర్వే, పౌర సరఫరాల శాఖల అధికారుల పనితీరుపై నెగెటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశారు. తీరు మార్చుకుని ప్రజలు మెచ్చేలా పనిచేయాలని ఆదేశించారు. భూ సమస్యలు, భూ సర్వే నిమిత్తం రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారా.. ఈ–సేవకు సంబంధించి నిర్దేశించిన రుసుం కంటే రైతుల నుంచి ఎక్కువ వసూలు చేశారా.. అని ప్రజలకు ఫోన్ చేసి అడుగుతున్నారన్నారు. కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్లో 37 మంది, అనంతపురం డివిజన్లో 30 మంది, గుంతకల్లు డివిజన్లో 14 మంది విలేజ్ సర్వేయర్లపై నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అందిందన్నారు. కార్డుదారుల నుంచి అదనంగా డబ్బు వసూలు చేసిన ఎండీయూలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాలకు తహసీల్దార్లు, సీఎస్డీటీలు వెళ్లి విచారణ చేయాలని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోల, ఆర్డీఓ కేశవ నాయుడు, సర్వే భూ రికార్డుల శాఖ ఏడీ రూప్లానాయక్, డీఎస్ఓ జగన్మోహన్రావు, తహసీల్దార్లు, డీటీలు, తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ, పౌర సరఫరాల శాఖలపై వ్యతిరేక అభిప్రాయం తీరు మార్చుకుని మెరుగైన సేవలందించాలి కలెక్టర్ వినోద్కుమార్ ఢిల్లీ వెళ్లిన కలెక్టర్ కలెక్టర్ వి.వినోద్కుమార్ మంగళవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి యూపీఎస్సీ బుధవారం ఢిల్లీలో నిర్వహించనున్న సన్నాహక సమావేశంలో కలెక్టర్ పాల్గొంటారు. తిరిగి ఆయన ఈ నెల 24న విధులకు హాజరవుతారు. దేశవ్యాప్తంగా 77 జిల్లాల నుంచి కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రాష్ట్రం నుంచి అనంతపురం కలెక్టర్తో పాటు మరో మూడు జిల్లాల కలెక్టర్లు పాల్గొననున్నారు. -
జిల్లాలో మంగళవారం పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగాయి. వేసవితాపం అధికమైంది. నైరుతి దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
ఎస్కేయూలో సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోర్సు ప్రారంభం అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సంయుక్తంగా ‘సర్టిఫికెట్ కోర్సు ఇన్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ అండ్ టెస్టింగ్’ను ప్రారంభించాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, ఉద్యోగార్హత, పరిశ్రమల అనుసంధానం పెంచే లక్ష్యంతో ఈ కోర్సును ప్రవేశపెట్టారు. కళాశాల–పరిశ్రమల మధ్య ఉండే అంతరం తగ్గేలా నైపుణ్య ఆధారిత కోర్సును అందించేలా చర్యలు తీసుకున్నారు. గతంలో ప్రవేశపెట్టిన ‘ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ వెంచర్ డెవలప్మెంట్’ కోర్సు ద్వారా 400 మందికి పైగా విద్యార్థులు ప్రయోజనం పొందిన విషయం తెలిసిందే. తాజాగా రెండో కోర్సు సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ అండ్ టెస్టింగ్ కోర్సును మంగళవారం ఎస్కేయూ ఇన్చార్జి వీసీ ఆచార్య బి.అనిత చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, అటల్ ఇంక్యుబేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.నాగభూషణరాజు, ప్రిన్సిపాల్ ఎ.కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. రైళ్లల్లో పోలీసుల విస్తృత తనిఖీలు అనంతపురం సిటీ: స్థానిక రైల్వే స్టేషన్లో రైళ్లను ప్రత్యేక పోలీస్ బృందం సహా మూడో పట్టణ పోలీసులు మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకూ ఈ తనిఖీలు కొనసాగాయి. గంజాయి దిగుమతిని అడ్డుకునే క్రమంలో ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లన్నీ తనిఖీ చేశారు. ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు అనంతపురం మీదుగా వెళ్లే ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలుకు సంబంధించిన అన్నీ బోగీలను జల్లెడ పట్టారు. అనుమానాస్పద ప్రయాణికులు, వారి లగేజీని జాగిలంతో తనిఖీ చేయించారు. -
ఖాకీ డ్రెస్సు వేసుకుని డ్యూటీ చేయాల్సిన పోలీసులు... టీడీపీ నేతలకు వంగి వంగి సలాములు చేస్తున్న ఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్ల పనిమనిషిలా మారారంటూ విమర్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇప్పటివరకూ పని చేసిన ప్రతి చోటా విజయకుమార్పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో అనంతపురం ఎస్పీగా అంజనా సిన్హా ఉన్నప్పుడు ఈయన చెన్నేకొత్తపల్లి ఎస్ఐగా పనిచేశారు. ఆ సమయంలో స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆ మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేయగా, పోలీసు ఉన్నతాధికారులు అప్పట్లో కర్నూలుకు బదిలీ చేసి వీఆర్లో పెట్టారు. మైదుకూరులో డీఎస్పీగా పనిచేసినప్పుడు కూడా అవినీతి ఆరోపణలు రావడంతో శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేసి వీఆర్లో ఉంచారు. గార్లదిన్నెలో పదెకరాల భూమి! విజయకుమార్ పోలీసు ఉద్యోగంలో చేరిన తర్వాత అనంతపురం జిల్లాలోని గార్లదిన్నెలో హైదరాబాద్– బెంగళూరు జాతీయ రహదారికి దగ్గరగా పదెకరాల భూమి కొన్నట్టు ఇప్పటికీ పోలీసు వర్గాలు కథలు కథలుగా చెప్పుకుంటున్నాయి. ఇంత పెద్ద ఎత్తున భూమి కొనడంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరపత్రాల కలకలం గతంలో అనంతపురంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీఎస్పీగా విజయకుమార్ ఉన్న సమయంలో స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) డీఎస్పీగా గంగయ్య ఉండేవారు. అప్పట్లో గంగయ్యకు, విజయమార్కు మధ్య తీవ్ర స్థాయిలో వివాదాలు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే గంగయ్యపై కొన్ని కరపత్రాలు బయటకు వచ్చాయి. వీటిని విజయకుమార్ వేయించారనే విమర్శలున్నాయి. ఆ తర్వాత విజయకుమార్ బండారాలన్నీ బయటపెడుతూ బయటకు వచ్చిన కరపత్రాలు కలకలం రేపాయి. ప్రబోదానంద కేసులో సస్పెండ్.. తనకు నచ్చినవారి కోసం పరిధి దాటి ప్రవర్తిస్తారని విజయకుమార్కు పేరుంది. గతంలో జేసీ అనుచరులు ప్రబోదానంద ఆశ్రమంపై దాడి చేసిన సమయంలో విజయకుమార్ ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీగా ఉండేవారు. అయినా సరే తాడిపత్రి ఇన్చార్జ్ డీఎస్పీగా వెళ్లి ఆ కేసును డీల్ చేశారు. ఆ కేసులో తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారులు విజయకుమార్ను సస్పెండ్ చేశారు. మహిళా సీఐపై పరుషంగా.. ప్రస్తుతం పుట్టపర్తి డీఎస్పీగా ఉన్న విజయకుమార్ ఇప్పటికీ తన వివాదాస్పద తీరు మార్చుకోలేదని తెలిసింది. కొన్ని రోజుల క్రితం ఓ మహిళా సీఐపై ఇష్టారాజ్యంగా నోరుపారేసుకున్నారు. దీంతో మహిళా సీఐ తీవ్ర మనస్తాపం చెంది విజయకుమార్పై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే, మహిళా సీఐకి న్యాయం చేయాల్సిన ఉన్నతాధికారులు.. బాధిత సీఐనే వీఆర్కు పంపించడం శ్రీసత్యసాయి జిల్లా పోలీసుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రామగిరి హెలిప్యాడ్ ఘటనలో ఘోర వైఫల్యం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఇటీవల విజయకుమార్ను రామగిరి మండలం కుంటిమద్ది సమీపంలో హెలిప్యాడ్ వద్ద సెక్యూరిటీ ఇన్చార్జ్గా వేశారు. ఒక మాజీ సీఎం వస్తున్న నేపథ్యంలో నిక్కచ్చిగా బందోబస్తు చేపట్టాల్సిన డీఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో హెలికాప్టర్ వద్దకు వేలాదిగా జనం వెళ్లడంతో విండ్షీల్డ్ విరిగింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తప్పనిసరి పరిసితుల్లో రోడ్డుమార్గంలో బెంగళూరుకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఖాకీ డ్రెస్సు వేసు కున్న ఈ పోలీసు అధికారి ‘పచ్చ’చొక్కాల అడుగులకు మడుగులొత్తుతుండటం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.టీడీపీ ఎమ్మెల్యేలు ఆడినట్టే ఆట.. పాడినట్టే పాట పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్ వ్యవహార శైలిపై సర్వత్రా తీవ్ర చర్చ పల్లె రఘునాథరెడ్డి గీత గీస్తే దాటిపోకుండా డ్యూటీ గతంలోనూ పలు అవినీతి ఆరోపణలు ఇప్పటికీ తీరు మార్చుకోని వైనం -
జిల్లాలో గత పది నెలల్లో మహిళలకు సంబంధించి నమోదైన కేసుల వివరాలు..
అనంతపురం: ఆడపిల్లలకు భద్రత కరువైంది. బడిలో, బస్సులో ఇలా ఎక్కడ చూసినా పొంచి ఉన్న మృగాళ్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బిడ్డ ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి ఆమె తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులకు ఆందోళన తప్పడం లేదు. ఇక.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్న ‘పచ్చ’ నేతలు కొందరు తామేమి చేసినా చెల్లుబాటవుతుందనే అహంకారంతో బాలికలు, మహిళలపై కూడా అకృత్యాలకు దిగుతున్నారు. ఇటీవల బొమ్మనహాళ్ మండలంలో ఓ ‘పచ్చ’ నేత బాలికను మానసికంగా, శారీరకంగా హింసించడమే ఇందుకు నిదర్శనం. చట్టమున్నా భయమేదీ..? బాలికలు, చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడితే పోక్సో కేసు నమోదు చేస్తారని తెలిసినా మృగాళ్లు వెనక్కి తగ్గడం లేదు. గత పది నెలల కాలంలోనే 12 పోక్సో కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. ఇలాంటి కేసుల్లో జీవిత ఖైదు లేదా 7 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష పడే పరిస్థితి ఉన్నా లైంగిక దాడుల ఘటనలు చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. నేటి ‘స్మార్ట్’ యుగంలో చిన్న పిల్లలకు సైతం స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉండటం చేటు తెస్తోందని సైకాలజిస్టులు, విద్యావేత్తలు చెబుతున్నారు. పిల్లలు పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తున్నారో వారి ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి సారించాలంటున్నారు. 18 మహిళలపై హింస 45అత్యాచారం 12చిన్నారులపై లైంగిక దాడులు2వరకట్న వేధింపులు 06మిస్సింగ్, కిడ్నాపింగ్ మైనర్లపై పెరుగుతున్న అకృత్యాలు గత పది నెలల్లోనే 12 పోక్సో కేసులు బయటికెళ్లిన ఆడబిడ్డ ఇంటికి వచ్చేవరకు తల్లిదండ్రుల్లో ఆందోళన -
కత్తి పోటుకు గురైన యువకుడి మృతి
తాడిపత్రి టౌన్: ఈ నెల 16న కత్తి పోటుకు గురైన యువకుడు బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పామిడి గ్రామానికి చెందిన మహేష్కుమార్ (29)కు తాడిపత్రిలోని ఓం శాంతి నగర్లో నివాసముంటున్న మణితో వివాహమైంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన భార్యను పిలుచుకెళ్లేందుకు ఈ నెల 16న మహేష్కుమార్ తాడిపత్రికి వచ్చాడు. అదే రోజు తన అత్తింటి పక్కనే ఉన్న ఫైరోజ్ తన కుటుంబసభ్యులు రమీజా, ఖాజీబీతో గొడవపడుతుంటే మహేష్కుమార్ జోక్యం చేసుకుని విడిపించే ప్రయత్నం చేశాడు. అప్పటికే కూరగాయల కత్తితో తన కుటుంబసభ్యురాలిపై ఫైరోజ్ దాడి చేయబోతుండగా అడ్డుగా ఉన్న మహేష్కుమార్ పొట్టను తాకడంతో లోతైన గాటు పడింది. కుటుంబసభ్యులు వెంటనే స్థానిక (తాడిపత్రి) ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన అక్కడి వైద్యులు చిన్నపాటి గాయమేనంటూ మూడు కుట్లు వేసి ఇంటికి పంపారు.అయితే కడుపు నొప్పి అంటూ బాధపడుతుండడంతో మరుసటి రోజు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి పిలుచుకెళ్లారు. అక్కడ రెండు రోజుల పాటు అడ్మిషన్లో ఉంచుకుని సాధారణ చికిత్స అందిస్తుండడంతో పరిస్థితి కాస్త విషమించింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించిన అనంతరం కడుపులో పేగు తెగిందని నిర్ధారించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు తీసుకెళ్లాలని చేతులెత్తేశారు. దీంతో కుటుంబసభ్యులు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మహేష్కుమార్ సోమవారం మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గొడవ పడుతున్న వారిని విడిపించేందుకు యత్నించడమే శాపంగా మారిన వైనం -
డ్రిప్ మంజూరులో జిల్లాకు అగ్రస్థానం
● నాలుగో స్థానంలో ‘శ్రీసత్యసాయి’ అనంతపురం సెంట్రల్: డ్రిప్, స్పింక్లర్ల మంజూరులో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానం, జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచిందని ఏపీఎంఐపీ రాష్ట్ర ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం నగరంలో ప్రాంతీయ ఉద్యాన శిక్షణా సంస్థ కార్యాలయంలో మైక్రో ఇరిగేషన్ ఇంజినీర్లు, కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీసత్య సాయి జిల్లా రాష్ట్రంలో నాలుగు, జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో ఉందని అభినందించారు. రైతుల పొలాల్లో పరికరాలను త్వరితగతిన అమర్చి సకాలంలో పంటలు సాగు చేసుకునేందుకు సహకరించాలని సూచించారు. ఎస్సీ,ఎస్టీ రైతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వంద శాతం రైతులు డ్రిప్ వాడేలా చూడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ అనంతపురం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ రఘునాథరెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్, ఏపీఎంఐపీ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ ఫీజు చెల్లింపునకు నేడు ఆఖరు అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించేందుకు గడువు మంగళవారంతో ముగుస్తుందని ఇంటర్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం.వెంకటరమణ నాయక్ తెలియజేశారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మే 12 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు, ఇంప్రూవ్మెంట్ రాసే విద్యార్థులు వెంటనే పరీక్ష ఫీజు సంబంధిత కళాశాలలో చెల్లించాలని సూచించారు. ఫీజు బకాయి ఉందనే సాకుతో ప్రైవేట్ జూనియర్ కళాశాలల యజమాన్యాలు విద్యార్థుల నుంచి కట్టించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫెయిల్ అయిన విద్యార్థులందరూ తప్పనిసరిగా పరీక్ష ఫీజు చెల్లించేలా చూడాల్సిన బాధ్యత ఆయా కళాశాలల యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు. నేడు అనంత కోర్టుకు బోరుగడ్డ అనిల్ అనంతపురం: నగరంలోని మొబైల్ కోర్టుకు మంగళవారం బోరుగడ్డ అనిల్ హాజరుకానున్నారు. స్థానిక రామచంద్రానగర్ చర్చికి సంబంధించి ఆదాయం లెక్కింపు అంశంలో పోలీసులను దూషించాడనే అభియోగంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బోరుగడ్డ అనిల్ను పోలీసులు ఎస్కార్టుతో అనంతపురం కోర్టుకు తీసుకురానున్నారు. తగ్గుతున్న చింత పండు ధరలు హిందూపురం అర్బన్: హిందూపురం వ్యవసాయ మార్కెట్లో గత మూడు వారాలుగా చింత పండు ధరలు పడిపోతున్నాయి. సోమవారం 881.70 క్వింటాళ్ల చింత పండు వచ్చింది. మార్కెట్లో ఈ నామ్ పద్ధతిలో వేలం పాటలు సాగాయి. కరిపులి రకం క్వింటా గరిష్ట ధర రూ.19,500, కనిష్టం రూ.8 వేలు, సగటు రూ.15 వేలు పలికింది. అలాగే ప్లవర్ రకం క్వింటా గరిష్ట ధర రూ.12,500, కనిష్టం రూ.4,420, సగటు ధర రూ.8 వేలు పలికింది. గత వారంతో పోలిస్తే కరిపులి కరం క్వింటాపై రూ.1,000 తగ్గుదల కనిపించింది. వాతావరణ మార్పులు, చల్లదనంతో ధరలు తగ్గుముఖం పట్టినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. -
●21 మండలాల్లో అకాల వర్షం
పెద్దవడుగూరు మండలం అప్పేచర్లలో విరిగిపడిన బొప్పాయి చెట్లను చూపుతున్న బాధిత రైతు అనంతపురం అగ్రికల్చర్: ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు 21 మండలాల పరిధిలో 12.7 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఆత్మకూరులో 72.2 మి.మీ, గుంతకల్లు 68.2 మి.మీ భారీ వర్షం కురిసింది. వజ్రకరూరు 46.2 మి.మీ, శెట్టూరు 34.4,కుందుర్పి 29.6, కళ్యాణదుర్గం 29.4, కంబదూరు 18.6, బ్రహ్మసముద్రం 17, బెళుగుప్ప 15.2, గుత్తి 14.4, రాయదుర్గం, గుమ్మఘట్ట 10.2 మి.మీ వర్షం కురిసింది. రాప్తాడు, విడపనకల్లు, కణేకల్లు, పామిడి, ఉరవకొండ, డీ.హీరేహాళ్, పెద్దవడుగూరు, యాడికి, బొమ్మనహాళ్ మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీయడంతో రూ.2 కోట్ల మేర పంటనష్టం వాటిల్లినట్లు ఆయా శాఖల అధికారులు తెలిపారు. వరి, మొక్కజొన్న, పత్తితో పాటు అరటి, చీనీ, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. -
అధికార అండతో గత టీడీపీ ప్రభుత్వంలో సహజ వనరులను మామ కొల్లగొట్టాడు. తానేం తక్కువ అన్నట్లు అతని అల్లుడు కూడా ఇష్టారాజ్యంగా దోచేశాడు. జరిమానా విధిస్తే మామా అల్లుళ్లు పైసా కట్టలేదు. అలాంటి వారికి నియోజకవర్గ ప్రజా ప్రతినిధి కూడా సహకరిస్తుండటం విమర్శలకు దారి తీస
నేమకల్లు సమీపంలో ఏర్పాటైన క్రషర్ యూనిట్ సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఒకవైపు మామ.. మరోవైపు అల్లుడు కూడబలుక్కుని రాయదుర్గం నియోజకవర్గంలో సహజ వనరులకు నిలయమైన నేమకల్లును లూటీ చేశారు. అత్యంత నాణ్యమైన కంకర ఇక్కడ లభిస్తుంది. దీనికోసం కొండలను మొత్తం పిండిచేశారు. మామ టీవీఎస్ కాంతారావు, అల్లుడు రఘు ప్రతాప్లు నేమకల్లులో ఉన్న సహజ వనరులను పూర్తిగా ఊడ్చేశారు. పదుల సంఖ్యలో కంకర మిషన్లు, జేసీబీలు, రవాణా వాహనాలతో రాయదుర్గం నియోజకవర్గంలోని నేమకల్లు రణగొణ ధ్వనులతో మారుమోగిపోతోంది. యంత్రాల శబ్దాలు, కాలుష్యంతో చుట్టుపక్కల పల్లెలు అల్లాడిపోతున్నాయి. అనుమతి గోరంత..తవ్వింది కొండంత మామ కాంతారావు..అల్లుడు రఘుప్రతాప్ ఇద్దరూ మైనింగ్ మాఫియా డాన్లే. రఘుప్రతాప్కు సర్వే నంబర్ 253లో 4.6 హెక్టార్లలో మాత్రమే గతంలో మైనింగ్కు అనుమతి ఉండగా రమారమి 30 ఎకరాల్లో తవ్వినట్టు స్థానికులు చెబుతున్నారు. 2019లో అక్రమ మైనింగ్ జరిపారని అప్పటి మైనింగ్ అధికారులు విచారణ చేసి రూ.7.07 కోట్ల జరిమానా విధించారు. కానీ ఇప్పటివరకూ రఘుప్రతాప్ ఒక్కపైసా కట్టలేదు. పైగా ఇప్పుడు జరిమానా మాఫీ చేయించుకునేందుకు నేరుగా సీఎంఓ నుంచి పునః పరిశీలన అనుమతులు తెచ్చుకున్నారు. అప్పుడు జరిమానా విధించిన అధికారులతోనే ఇప్పుడు ఎలాంటి అక్రమాలు లేవని నివేదిక ఇప్పించేందుకు స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడి తెస్తున్నారు. దీంతో మామ కాంతారావు కట్టాల్సిన రూ.13 కోట్లు, అల్లుడు రఘుప్రతాప్ కట్టాల్సిన రూ.7 కోట్లలో ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అనుమతులు లేకుండానే మైనింగ్ ఓవైపు జరిమానాలు విధించారు. అవి ఇప్పటివరకూ కట్టనే లేదు. పోనీ కనీసం కొత్తగా అనుమతులైనా ఉన్నాయా అంటే అదీ లేదు. కూటమి సర్కారు వచ్చిన మరుసటి రోజు నుంచే మామా అల్లుళ్లు నేమకల్లు పరిసరాల్లో వాలిపోయారు. ఇక్కడ లభించే కంకరను కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే 40 ఎకరాల గుట్ట కరిగిపోయినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. భారీ వాహనాలతో రహదారులు ఛిద్రమయ్యాయి. నేమకల్లులో ఇలాగే మైనింగ్ కొనసాగితే భవిష్యత్తులో కొత్తగా ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు టిప్పర్ కంకర కూడా మిగిలేలా లేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. పెచ్చుమీరిన ఆగడాలు.. రాయదుర్గం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ గత కొన్ని నెలలుగా అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు. మరోవైపు అక్రమ మైనింగ్తో కొండలను పిండి చేస్తున్నారు. వీటన్నింటినీ ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా జరుగుతున్నా ‘కాలవ’ కిమ్మనడం లేదు. మైనింగ్ మాఫియాకు పూర్తి స్థాయిలో రాజకీయ అండదండలున్నట్టు విమర్శలున్నాయి. మైనింగ్ డీడీ ఉన్నా లేనట్టే... ఇటీవల జిల్లా గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్గా వెంకటేశ్వర్లు వచ్చారు. ఈయన ఆధ్వర్యంలో ఎక్కడా తనిఖీలు లేవు. ఎవరికి నచ్చినట్టు వారు దోపిడీ చేసుకోవచ్చు. దోపిడీ జరుగుతోందంటూ ఎవరైనా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. ప్రజాప్రతినిధులు ఎవరైనా ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే.. ‘నాకు ఇక్కడ పనిచేయాలని లేదు, ఎప్పుడు బదిలీ వచ్చినా వెళ్లిపోతా’ అని చెబుతున్నారు. నేమకల్లు పరిసరాల్లో దోపిడీపై వివరణ కోరేందుకు డీడీకి ఫోన్ చేసినా స్పందించలేదు. నేమకల్లు సహజవనరులను ఊడ్చేసిన రఘుప్రతాప్ మామ కాంతారావుతో కలిసి దోపిడీ ప్రతాప్ చెల్లించాల్సిన రూ.7 కోట్ల జరిమానాకు ఎగనామం అనుమతి లేకుండానే క్రషర్లతో కొండలను పిండిచేస్తున్న వైనం మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూస్తే ఒట్టు అండగా నిలిచిన ‘దుర్గం’ ప్రజాప్రతినిధి -
‘అనంత ఆణిముత్యాలు’ పునఃప్రారంభం
● కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రాప్తాడు: పేద విద్యార్థుల కోచింగ్లకు, కార్పొరేటు స్కూళ్లు, కళాశాలల్లో విద్యనభ్య సించేలా చేయూతనందించేందుకు ‘అనంత ఆణిముత్యాలు’ కార్యక్రమాన్ని పునఃప్రారంభించినట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీ చిన్మయనగర్లో ఆర్జేసీ కల్యాణ మండపంలో ‘అనంత ఆణిముత్యాలు ఎడ్యుకేషన్ సొసైటీ’కి రూ.1,34,116 మెగా చెక్కును కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2009లో సొసైటీ ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటికే ఏడుగురు విద్యార్థులు లబ్ధి పొందారన్నారు. అప్పట్లో అందిన విరాళాలతో సొసైటీ కార్యకలాపాలు బాగా నడిచాయని, తర్వాత కొన్నాళ్లకే ఆగిపోయా యన్నారు. పేద విద్యార్థులకు సాయమందించాలనే ఉద్దేశంతో పునఃప్రారంభించామన్నారు. తన వంతు సహాయంగా రూ.10 వేలు అందించినట్లు తెలిపారు. ఉద్యోగులు, ప్రజలు కూడా చేయూతనందించాలన్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్, అకౌంట్ నంబర్–1429 1001 1001 235, ఐఎఫ్ఎస్సీ కోడ్ యూబీఐఎన్ 0814296కు విరాళాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో జేసీ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ మలోల తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతాం
రాప్తాడు: ప్రతి అర్జీకి సత్వర పరిష్కారం చూపే బాధ్యత తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీలోని చిన్మయనగర్ ఆర్జేసీ కల్యాణ మండపంలో నిర్వహించిన ‘జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం అర్జీదారులతో కిటకిటలాడింది. కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే పరిటాల సునీత, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్, మల్లికార్జునుడు, రామ్మోహన్, డీఆర్వో మలోల ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 407 వినతులు అందాయి. ఎక్కువ భాగం భూ సమస్యలపైనే ఫిర్యాదులు ఉన్నాయి. కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అర్జీల్లో 70 నుంచి 80 శాతం పరిష్కారం చూపుతున్నారని, వంద శాతం పరిష్కరించేలా కృషి చేయాలని ఆదేశించారు. వినతుల్లో కొన్ని... ● రాప్తాడు సమీపంలో రైల్వే వంతెన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, పనులు ప్రారంభించి ఏడేళ్లవుతున్నా నేటికీ పూర్తి కాలేదని సర్పంచు సాకే తిరుపాల్ విన్నవించాడు. పండమేరు వంక (జేఎన్టీయూ) రహదారిలో బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని కోరాడు. వంక సమీపంలో ప్రభుత్వ స్థలం 25 ఎకరాల్లో పార్క్ మంజూరు చేయాలని, రాప్తాడు ఏపీ మోడల్ స్కూల్కు కాంపౌడ్ వాల్ ఏర్పాటు చేయాలన్నాడు. పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించాడు. ● రాప్తాడు మండలంలోని మరూరు రెవెన్యూ గ్రామంలో భూమి రిజిస్ట్రేషన్కు సబ్ రిజిస్ట్రార్ ఎకరాకు రూ.1.50 లక్షలు అడుగుతున్నారని మరూరు గ్రామానికి చెందిన నారాయణస్వామి, కొండారెడ్డి, వీర నారప్ప, ఆదినారాయణ, నరసింహులు తదితరులు ఫిర్యాదు చేశారు. ● అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి పంచాయతీ బీఎన్ఆర్ కాలనీలో 1996లో 3 సెంట్ల చొప్పున స్థలం పంపిణీ చేశారని, ఈ క్రమంలో తమకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని పలువురు కాలనీ వాసులు కోరారు. చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు పరదేశి లక్ష్మీదేవి. బుక్కరాయసముద్రం మండలం గాంధీనగర్వాసి. కుమారుడు గురుమూర్తి, కుమార్తె లక్ష్మీదేవిని వృద్ధురాలు ఎంతో గారాబంగా పెంచింది. ఇద్దరికీ వివాహాలు కూడా చేసింది. కుమారుడు గురుమూర్తి మృతి చెందాడు. కుమార్తె లక్ష్మీదేవి కొన్నేళ్ల క్రితం భర్తతో గొడవపడి బనగానపల్లి నుంచి వచ్చేసి తల్లి దగ్గర ఉండేది. తల్లిని నమ్మించి రూ.3 లక్షలు నగదు, 3 తులాల బంగారు నగలు, 2 సెంట్ల స్థలం, 1–25 సెంట్ల భూమిని స్వాధీనం చేసుకున్న లక్ష్మీదేవి... ఆ తర్వాత ఇంటి నుంచి ఆమెను బయటకు గెంటేసింది. ‘దిక్కున్న చోట చెప్పుకో ఇచ్చేదే లేదు’ అంటూ దాడి చేసింది. దీంతో దిక్కు తెలియని వృద్ధురాలు రాప్తాడులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తనకు న్యాయం చేయాలంటూ వినతి పత్రం సమర్పించింది. కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రాప్తాడులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక వివిధ సమస్యలపై 407 వినతులు -
దోచేందుకు చెత్త ఐడియా!
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో సంపాదనే పరమావధిగా అధికార పార్టీ నాయకులు ముందుకెళ్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే చందాన ప్రజాధనాన్ని ఊడ్చేస్తున్నారు. నగరంలో 50 డివిజన్ల నుంచి రోజూ 140 టన్నుల నుంచి 150 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. నిత్యం ఈ చెత్త తరలించేందుకు 30 అద్దె ట్రాక్టర్లను తీసుకోవాలని ఇటీవల నిర్ణయించారు. ఆరు నెలల పాటు ఒక్కో ట్రాక్టర్కు రోజు అద్దె రూ.2,100 చెల్లించేలా ఈ ఏడాది ఫిబ్రవరి 24న రూ.1.35 కోట్లతో టెండర్లను ఆహ్వానించారు. మార్చి నుంచి అద్దె ట్రాక్టర్ల ద్వారా చెత్త తరలించే పద్ధతి అమలులోకి వచ్చింది. అంతా మాయే.. చెత్త ట్రాక్టర్ల నిర్వహణకు సంబంధించి పెద్ద గోల్మాల్ నడుస్తోంది. ప్రతి డివిజన్లో రోజూ అద్దె ట్రాక్టర్లు 1,000 నుంచి 1,100కుపైగా ఇళ్లను కవర్ చేయాలి. ఈ విధంగా మూడు ట్రిప్పుల వరకు తిరగాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. డివిజన్లకు రోజు మార్చి రోజు అద్దె ట్రాక్టర్లు వస్తున్నాయి. ఇక.. చెత్త తరలించే ట్రాక్టర్లను చూస్తే ఎవరైనా నివ్వెర పోవాల్సిందే. ఇసుక తరలించే ట్రాక్టర్ల కంటే మరీ చిన్నవిగా ఉంటున్నాయి. అందులో కనీసం వంద ఇళ్ల చెత్త కూడా పట్టదు. దీంతో పాటు తడి, పొడి చెత్తను వేర్వేరుగా తీసుకెళ్లేలా ట్రాక్టర్లో ఏర్పాట్లు ఉండటం లేదు. అద్దె ట్రాక్టర్ల నిర్వాహకులు చెత్తను తరలించేందుకు సొంతంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నా.. చాలా మంది నగరపాలక సిబ్బందినే వాడుకుంటున్నారు. ట్రాక్టర్లకు ‘జీపీఎస్’ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా మారింది. అధికారుల కుమ్మక్కు.. నగరపాలక ఇంజినీరింగ్ విభాగంలో ఓ ఈఈ, డీఈ, ప్రజారోగ్యాధికారులు అద్దె ట్రాక్టర్ల కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టౌన్ ప్లానింగ్, రెవెన్యూ తదితర విభాగాల్లో కొందరు అధికారులు, సిబ్బంది టీడీపీ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చివరకు ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న చెత్త తరలింపు విషయంలోనూ అధికారులు వ్యవహరిస్తున్న తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అద్దె ట్రాక్టర్ల అడ్డగోలు బాగోతం రోజూ తిరగని వైనం జీపీఎస్ లేకుండా మాయ అధికారుల తీరుపైనా సందేహాలు రోజు మార్చి రోజు వస్తున్నారు చెత్త తరలించేందుకు వాహనాలు రోజూ రావడం లేదు. రోజు మార్చి రోజు వస్తున్నాయి. గతంలో ఇంటింటికీ వాహనాలు వచ్చేవి. చెత్తను ఎప్పటికప్పుడు తీసుకెళ్తే బాగుంటుంది. – కుళ్లాయప్ప, ఎర్రనేలకొట్టాలు, అనంతపురం -
రేపు షీప్ యూనియన్ మహాజన సభ
అనంతపురం అగ్రికల్చర్: గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘాల జిల్లా సమాఖ్య మహాజన సభ ఈ నెల 23న నిర్వహించనున్నారు. ఈ మేరకు యూనియన్ పర్సన్ ఇన్చార్జి డాక్టర్ వై.రమేష్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కేఎల్ శ్రీలక్ష్మి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అనంతపురంలోని పశుసంవర్ధకశాఖ జేడీ ప్రాంగణంలో ఉన్న యూనియన్ కార్యాలయంలో బుధవారం జరిగే వార్షిక మహాజన సభకు సహకార సంఘాల అఽధ్యక్షులు, పర్సన్ ఇన్చార్జిలు, డైరెక్టర్లు హాజరుకావాల్సి ఉంటుంది. కొత్తగా ఎన్నికై న అధ్యక్షులను అభినందించడం, పరిచయాలు, ఏడాది ప్రగతికి సంబంధించి ఆడిట్ రిపోర్టులు, ఎన్సీడీసీ రుణాల రికవరీలపై చర్చ, యూనియన్లో గౌరవ వేతనంతో పనిచేస్తున్న రామలింగయ్య జీతభత్యాల పెంపుపై చర్చ, జూన్లో ముగియనున్న సంఘాలకు ఎన్నికలు, జిల్లా సమాఖ్య ఎన్నికలు, యూనియన్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చకు అజెండా రూపొందించారు. బస్టాండ్లో ప్రయాణికురాలి మృతి తాడిపత్రి టౌన్: స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం ఓ గుర్తు తెలియని ప్రయాణికురాలు (70) మృతి చెందింది. ఆదివారం రాత్రి బస్టాండ్కు చేరుకున్న వృద్దురాలు కుర్చీలో కూర్చొని అలాగే కన్నుమూసింది. అయితే అర్ధరాత్రి కావస్తున్నా చలనం లేకపోవడంతో అనుమానం వచ్చిన ఆర్టీసీ సిబ్బంది ఆమెను పలకరించే ప్రయత్నం చేశారు. ఎలాంటి ఉలుకుపలుకు లేకపోవడంతో మృతి చెందినట్లుగా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే తాడిపత్రి పోలీసులను సంప్రదించాలని కోరారు. పొలంలో వ్యక్తి మృతదేహం పుట్లూరు: మండలంలోని జి.వెంగన్నపల్లి సమీప పొలంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. తెల్లని దుస్తులు ధరించిన దాదాపు 50 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి రెండు రోజుల క్రితం మృతి చెంది ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎండ తీవ్రతకు శరీరం నల్లబారి, బొబ్బలు తేలాయి. గుర్తు పట్టలేని స్థితిలో దుర్వాసన వెదజల్లుతోంది. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. వ్యక్తి మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే సంప్రదించాలని పుట్లూరు పోలీసులు కోరారు. -
బిందెడు నీటికి బండెడు కష్టాలు
రాయదుర్గం: ఉమ్మడి జిల్లాల్లోని రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాల పరిధిలో ఉన్న 727 గ్రామాల ప్రజల దాహార్తి తీర్చే శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. కూటమి సర్కార్ ఘోర వైఫల్యాల కారణంగా పల్లెలన్నీ గొంతెండుతున్నాయి. గుక్కెడు నీటి కోసం గ్రామస్తులు పొలాల వెంబడి పరుగు తీస్తున్నారు. 16 రోజులుగా నిలిచిపోయిన తాగునీటి సరఫరా లక్షలాది మంది గొంతు తడిపే అతిపెద్ద శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని అధికారం చేపట్టి పట్టుమని పది నెలల కాకనే చంద్రబాబు సర్కార్ అటకెక్కించింది. నిర్వహణ చేతకాక చేతులెత్తేసింది. నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో 16 రోజులుగా కార్మికులు సమ్మె బాటపట్టారు. దీంతో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా శ్రీరామరెడ్డి తాగునీటి పథకం లబ్ధి పొందుతున్న గ్రామాల్లో ప్రజలు కన్నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ బోర్లే దిక్కు ఉమ్మడి జిల్లాల్లోని చాలా గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. విద్యుత్ సరఫరా ప్రారంభం కాగానే పొలాల్లోకి పరుగులు తీస్తున్నారు. రైతుల నుంచి ఎదురయ్యే ఛీత్కారాలను మౌనంగా భరిస్తూ తమ నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. నీటి కష్టాలు చూసిన ట్యాంకర్ల నిర్వాహకులు ధర అమాంతం పెంచేశారు. పట్టణాల్లో ఒక్కో ట్యాంకర్కు రూ.800 నుంచి రూ. వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. అది కూడా అర్ధరాత్రి సమయంలో ట్యాంకర్లు వస్తుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సమ్మె విరమిస్తేనే ప్రయోజనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంలో 800 మంది కార్మి కులు పనిచేస్తుండగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వివిధ కారణాలతో ఆ సంఖ్య 630కి కుదించారు. సూపర్వైజర్లు మరో 20 మంది ఉన్నారు. నిత్యం 47 ఎంల్డీ నీటిని ఉరవకొండ నియోజకవర్గం పీఏబీఆర్ పంప్హౌస్ నుంచి పంపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కార్మికులకు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చింది. దీంతో కార్మికుల వేతన బకాయిలు రూ.8 కోట్లకు చేరుకుంది. పలు దఫాలుగా నిరసనలు వ్యక్తం చేసినా... చర్చల పేరుతో కార్మికులను మభ్య పెట్టారు తప్ప సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు. దీంతో గత్యంతరం లేని స్థితిలో కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. నిండు వేసవిలో 16 రోజులుగా తాగునీటి పథకం ద్వారా నీరందక పోవడంతో ప్రజల ఇక్కట్లు నానాటికీ జటిలమవుతున్నాయి. కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరితేగాని సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చాక శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం నిర్వీర్యం వేతనాలు అందించలేని దుస్థితిలో ‘బాబు’ సర్కార్ ఈ నెల 6 నుంచి సమ్మెలో కార్మికులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 727 గ్రామాలకు నిలిచిన తాగునీటి సరఫరా -
‘ప్రతి ఎకరాకూ కృష్ణా జలాలు అందించాలి’
గుంతకల్లు రూరల్: హంద్రీ–నీవా కాలువలో నీటి ప్రవాహ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రతి ఎకరాకు కృష్ణా జలాలు అందించాలని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.రాంభూపాల్ డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి.శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి మారుతీప్రసాద్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యుడు కసాపురం రమేష్తో కలసి సోమవారం ఆయన జి.కొట్టాల వద్ద చేపట్టిన హంద్రీ–నీవా కాలువ పనులను పరిశీలించి, మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు హంద్రీ–నీవా కాలువను 10వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యం ఉండేలా వెడల్పు చేయాలన్నారు. అప్పటి వరకూ కాలవకు లైనింగ్ పనులు చేయరాదన్నారు. రాగులపాడు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా వజ్రకరూరు, గుంతకల్లు, పామిడి మండలాల్లోని గ్రామాలకు తాగు, సాగునీటిని అందించాలన్నారు. -
ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
శ్రీరామిరెడ్డి పథకం తాగునీరే మాకు దిక్కు. ఊర్లో బోర్లలో నీరు ఉప్పుగా ఉంటున్నాయి. వాటిని తాగలేక పోతున్నాం. ఎండకాలంలో ఇంతటి కష్టం వస్తోందని అనుకోలేదు. – మారెక్క, గోనబావి, గుమ్మఘట్ట మండలం రెండు రోజుల్లో పరిష్కారం కార్మికులతో చర్చలకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. సమస్యకు ఒకట్రెండు రోజుల్లో పరిష్కారం దక్కుతుంది. రూ.8 కోట్ల వేతన బకాయిలు చెల్లించేలా నివేదికలు సమర్పించారు. త్వరలో కార్మికుల ఖాతాల్లో వేతనాలు జమ అవుతాయి. లీకేజీలు తాత్కలికంగా అరికట్టేలా చర్యలు తీసుకుంటాం. కొత్త లైన్ ఏర్పాటుకు ప్రణాళికలు చేపట్టాం. – శిరీష, శ్రీరామిరెడ్డి పథకం డీఈ, అనంతపురం -
అధికారులదీ అదే తీరు!
అనంతపురం అగ్రికల్చర్: పాలకుడు సమర్థుడైతే.. అధికారులు సైతం విధులు సక్రమంగా నిర్వరిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటారని పెద్దలు అంటుంటారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ పనితీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. యథా రాజా... తథా అధికారులు అనే విధంగా రైతు సంక్షేమాన్ని పట్టించుకోని కూటమి సర్కార్ బాటలోనే జిల్లా వ్యవసాయ శాఖ నడుస్తోంది. వ్యవసాయశాఖ అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు రైతు దరికి చేరడం లేదు. గత ఖరీఫ్, రబీలో పూర్తి స్థాయిలో రాయితీ విత్తన వేరుశనగ, పప్పుశెనగ, కందులు, అలాగే ప్రత్యామ్నాయ విత్తనాలు అందించకుండానే చేతులెత్తేశారు. తాజాగా జిల్లాకు కేటాయించిన రూ.3 కోట్లు యాంత్రీకరణ బడ్జెట్ కూడా ఖర్చు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. యాంత్రీకరణ కింద రోటావీటర్లు, వివిధ రకాల స్ప్రేయర్లు, టిల్లర్లు, ఇతరత్రా పనిముట్లు రైతులకు చాలా వరకు అవసరం ఉన్నా... ప్రచార లోపం, సమన్వయం కొరవడటంతో ఇంకా రూ.1.30 కోట్లు బడ్జెట్ మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. వ్యవసాయ యాంత్రీకరణ కింద 1,661 యూనిట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రహసనంలా డ్రోన్ల మంజూరు.. ఆర్కేవీవై కింద జిల్లాకు కమ్యూనిటీ హైయరింగ్ సెంటర్ల (సీహెచ్సీ) గ్రూపులకు 80 శాతం రాయితీతో కిసాన్ డ్రోన్లు మంజూరు చేస్తామంటూ ఆరు నెలలుగా చెబుతున్నా... ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. 35 కిసాన్ డ్రోన్లు మంజూరుకు గాను డ్రాగో కంపెనీ డ్రోన్ ఖరీదు రూ.9.80 లక్షలు, విహంగ కంపెనీ డ్రోన్ ఖరీదు రూ.9.81 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో ప్రస్తుతం రైతు గ్రూపులు తమ వాటా కింద 50 శాతం చెల్లించాలని, మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణసదుపాయం కల్పిస్తామంటున్నారు. డ్రోన్ ఇచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత రైతుకు రాయితీ జమ చేస్తామని మెలికపెట్టడంతో ఇప్పటికిప్పుడు రూ.5 లక్షలు కట్టడానికి రైతు గ్రూపులు మొగ్గు చూపడం లేదు. అక్కడక్కడ కొందరు రైతులు ముందుకు వస్తున్నా... వైఎస్సార్సీపీ ముద్ర వేసి తిరస్కరిస్తున్నారు. దీంతో కిసాన్ డ్రోన్ల మంజూరు కాస్త ఓ ప్రహసనంలా మారింది. నత్తనడకన రైతు విశిష్ట సంఖ్య నమోదు.. ప్రతి రైతుకూ ఆధార్ తరహాలో విశిష్ట గుర్తింపు సంఖ్య ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రక్రియ కాస్త సాంకేతిక సమస్యల కారణంగా మందకొడిగా సాగుతోంది. 3.40 లక్షల మందికి విశిష్ట సంఖ్య కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నా... 1.98 లక్షల మందికి పూర్తి చేశారు. దీని కోసం రైతులు ముందుకు వస్తున్నా యాప్ సక్రమంగా పనిచేయక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సమస్య పరిష్కారానికి అధికారులు మొగ్గు చూపకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అందుబాటులో లేని అధికారులు.. పీఎం కిసాన్ కింద తమకు రూ.2 వేలు సొమ్ము జమ కావడం లేదని రోజూ రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న రైతులకు అధికారులు అందుబాటులో ఉండటం లేదంటున్నారు. స్వయానా జిల్లా అధికారే కార్యాలయంలో గంట కూడా ఉండటం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. కలెక్టర్, కమిషనర్ సమీక్షలు, జూమ్ కాన్ఫరెన్స్లు, క్యాంప్లంటూ ఉన్న సమయమంతా వారికే కేటాయించేస్తున్నారు. అన్నదాత సుఖీభవ, ఇన్పుట్సబ్సిడీ, ఇన్సూరెన్స్, కరువు మండలాల ప్రకటన అంశంలో చంద్రబాబు ప్రభుత్వం రైతులను దగా చేస్తుంటే మరో పక్క వ్యవసాయశాఖ కూడా తన వంతు బాధ్యతగా సర్కారు బాటలోనే నడుస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ పథకాల అమలులో అడుగడుగునా అలసత్వం -
కాలువ లైనింగ్తో రైతులకు విఘాతం
అనంతపురం: హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులతో అనంత రైతన్న తీవ్రంగా నష్టపోతాడని జలసాధన సమితి నాయకుడు, ప్రముఖ న్యాయవాది రామకుమార్ అన్నారు. ‘రాయలసీమ కరువు– నీటి సవాళ్లు– వాటి పరిష్కార మార్గాలు – సాధ్యాసాధ్యాలు’ అంశంపై శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఏఐఎస్ఏ (ఆలిండియా స్టూడెంట్ అసోసియేషన్ ) రాష్ట్ర అధ్యక్షుడు వేమన ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాయలసీమలో ప్రతి ప్రాంతానికి హంద్రీ–నీవా ద్వారా నీరు ఇచ్చినప్పుడే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కుతుందన్నారు. ప్రస్తుతం 53 వేల ఎకరాల భూమితో పాటు అదనంగా మరో 44 వేల ఎకరాల భూమిని అమరావతి రాజధాని ప్రాంతానికి సేకరించి మరోసారి నిర్భంధ అభివృద్ధి కేంద్రీకరణ చేస్తున్నారన్నారు. ఫలితంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తీరని అన్యాయం చేస్తున్నారని రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డి అన్నారు. సిద్ధేశ్వరం వద్ద కృష్ణా నదిపై కేంద్రం నిర్మిస్తున్న నేషనల్ హైవేలో భాగంగా తీగల వంతెన నిర్మాణం బదులుగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వం కోరకపోవడం అన్యాయమన్నారు. కర్ణాటకలో చేటప్టిన అప్పర్భద్ర నిర్మాణాన్ని మన పాలకులు ఆపలేకపోవడంతో రాయలసీమ పశ్చిమ ప్రాంతానికి జీవనాధారమైన హెచ్చెల్సీ, ఎల్ఎల్సీ ఆయకట్టు పూర్తిగా ఎడారిగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ ఉద్యమానికి సోషల్ మీడియా ద్వారా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ నాయకుడు సాకే హరి, అశోక్ వర్ధన్, రామాంజినేయులు, రాహుల్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఏ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకులు వెంకటేశ్, లక్ష్మీవిశ్వనాథ్, హరిత, అరుణోదయ కళాకారులు చంద్రన్న, విజయ్ తదితరులు పాల్గొన్నారు. జల సాధన సమితి నాయకులు -
‘అపూర్వ’ సమ్మేళనం
ఉరవకొండ (వజ్రకరూరు): వజ్రకరూరులోని కాటవెంకటప్ప జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1978–79లో పదో తరగతి చదువుకున్న వారు ఆదివారం అదే పాఠశాల వేదికగా కలుసుకున్నారు. దాదాపు 46 ఏళ్ల తర్వాత కలుసుకున్న వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాటి చిలిపి పనులు గుర్తు చేసుకుని మురిసిపోయారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు నాగరాజుశర్మ, దత్తాత్రేయశర్మ, అక్కులప్ప, హనమంతప్ప తదితర ఉపాధ్యాయులకు పాదపూజ చేసి, జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. -
గోవుల సంరక్షణకు సహకరిస్తాం
● గోశాల నిర్వాహకులకు కలెక్టర్ వినోద్కుమార్ సూచన అనంతపురం అర్బన్: గోవుల సంరక్షణకు అవసరమైతే జిల్లా యంత్రాంగం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఇస్కాన్ గోశాల ఇన్చార్జి దామోదర్ గౌరంగదాస్కు కలెక్టర్ వి.వినోద్కుమార్ సూచించారు. కలెక్టరేట్ సమీపంలోని ఇస్కాన్ గోశాలను ఆదివారం కలెక్టర్ సందర్శించారు. గోవులకు పచ్చగడ్డి, అరటిపండ్లు, బెల్లం తినిపించారు. ఎంత విస్తీర్ణంలో గోశాల ఏర్పాటు చేశారు? ఎన్ని గోవులున్నాయి? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 2.70 ఎకరాల విస్తీర్ణంలో గోశాల ఏర్పాటు చేయగా... ప్రస్తుతం 440 ఆవులు ఉన్నాయని, గడ్డికి ఎలాంటి ఇబ్బంది లేదని గోశాల ఇన్చార్జి తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నగర రహదారులపై సంచరిస్తున్న పశువులకూ ఆశ్రయం కల్పించాలని సూచించారు. దీంతో గోశాలకు అదనపు భూమి కేటాయిస్తే వాటిని అక్కడ ఉంచి సంరక్షిస్తామని కలెక్టర్కు ఇన్చార్జి తెలిపారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ భూ కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తామన్నారు. అనంతరం గోశాలలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కేశవనాయుడు, నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, పశుసంవర్ధక శాఖ జేడీ వెంకటస్వామి, ఏడీ రత్నకుమార్, తహసీల్దార్లు పుణ్యవతి, మోహన్కుమార్, తదితరులు పాల్గొన్నారు. క్షతగాత్రుడి ప్రాణాలు కాపాడిన డీఎస్పీ రాప్తాడు: ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అసహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రుడిని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు సకాలంలో తన వాహనంలో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. వివరాలు.. రాప్తాడుకు చెందిన యువకుడు చెడిపోతుల కుళ్లాయప్ప ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వెళుతూ జేఎన్టీయూ మార్గంలోని భారత్ గ్యాస్ కార్యాలయం ఎదుట డివైడర్ను ఢీకొని తీవ్ర గాయాలతో పడిపోయాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి 108కు సమాచారం అందించారు. అయితే ఎంతకూ 108 వాహనం రాలేదు. ఈ లోపు కుళ్లాయప్ప పరిస్థితి విషమిస్తుండడంతో తన సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశులు అప్రమత్తయ్యారు. అప్పటికే ఇంటికి వాహనంలో బయలుదేరిన ఆయన వెంటనే ప్రమాదస్థలానికి చేరుకుని తీవ్ర గాయాలతో పడి ఉన్న కుళ్లాయప్పను స్థానికుల సాయంతో తానే పైకి లేపి తన వాహనంలో సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. యువకుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో స్థానికంగానే తొలుత ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అటు నుంచి బెంగళూరుకు కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. కాగా, క్షతగాత్రుడిని తన వాహనంలో ఆస్పత్రికి చేర్చిన డీఎస్పీ చొరవను స్థానికులు అభినందిచారు. ‘ఈ సార్ చాలా మంచోడు’ అంటూ కితాబునిచ్చారు. వైభవం.. సల్లాపురమ్మ జ్యోతుల ఉత్సవం పుట్టపర్తి అర్బన్: పెడపల్లిలో ఆదివారం సల్లాపురమ్మ జ్యోతుల ఉత్సవం వైభవంగా సాగింది. వేలాది కుటుంబాలు ఉన్న గ్రామంలో ప్రతి ఇంటి నుంచి జ్యోతులు, బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి వాటిని అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి మూలవిరాట్ను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన బోనాలను అమ్మవారికి సమర్పించిన అనంతరం భక్తులను దర్శనానికి వదిలారు. భక్తులు పెద్ద ఎత్తున బియ్యం, బేడలు, ఆకు వక్క తదితరాలను అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వద్ద పోతురాజు విన్యాసాన్ని ఆసక్తిగా తిలకించారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన తినుబండారాలు, ఆట బొమ్మల అంగళ్ల వద్ద కొనుగోలుదారులతో సందడి నెలకొంది. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
ఉరవకొండ: స్థానిక నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన మేరకు... వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి తండాకు చెందిన వెంకటేష్ నాయక్ (51) ఆదివారం వ్యక్తిగత పనిపై ద్విచక్ర వాహనంలో ఉరవకొండకు బయలుదేరాడు. మార్గమధ్యంలో పీసీ ప్యాపిలి వద్దకు చేరుకోగానే బస్సు కోసం వేచి ఉన్న అదే గ్రామానికి చెందిన శాంతమ్మ(33) అభ్యర్థన మేరకు ఆమెను తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని బయలుదేరాడు. ఉరవకొండ సమీపంలోని హంద్రీ–నీవా కాలువ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్పు ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, వెంకటేష్నాయక్ భార్య ఏడాది క్రితమే చెందింది. ఇద్దరు కుమారులు ఉన్నారు. పీసీ ప్యాపిలికి చెందిన శాంతమ్మ భర్త వన్నూరు స్వామి ఉరవకొండలోని ఓ హోటల్లో సప్లయిర్గా పనిచేస్తున్నాడు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తమ్ముడి నిశ్చితార్థానికి వెళుతూ.. అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో స్టాఫ్నర్సుగా పనిచేస్తున్న ప్రవల్లిక.. ఉరవకొండలో భర్త మల్లికార్జునతో పాటు కలసి నివాసముంటుంది. ఈ క్రమంలో రోజూ బస్సులో విధులకు వెళ్లి వచ్చేవారు. వజ్రకరూరు మండలం చాబాలలో ఉన్న తన తమ్ముడి వివాహ నిశ్చితార్థం ఉండడంతో ఆదివారం భర్తతో కలసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వేగంగా వచ్చిన ఆటో ఢీకొంది. ఘటనలో ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మల్లి కార్జునకు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకెళ్లారు. ఈ రెండు ఘటలపై సీఐ మహనంది కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
తల్లిదండ్రుల చెంతకు బాలిక
గుంతకల్లు: తప్పిపోయిన ఓ బాలికను గుంతకల్లు రైల్వే పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర తెలిపిన మేరకు... కర్ణాటకలోని గదగ్కు చెందిన ఎనిమిదేళ్ల వయసున్న రోకియ తప్పిపోయింది. దీంతో తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు డివిజన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న గుంతకల్లు జీఆర్పీ సిబ్బంది అప్రమత్తమై శనివారం రాత్రి రైల్వే స్టేషన్కు చేరుకున్న హుబ్లీ వైపు నుంచి వచ్చిన హంపి ఎక్స్ప్రెస్ (16591) రైలులోని బోగీలను పరిశీలించారు. ఓ బోగీలో దిగాలుతో కూర్చొని ఉన్న రోకియాను గుర్తించి తమ స్వాధీనంలోకి తీసుకుని సమాచారం ఇవ్వడంతో ఆదివారం ఉదయం గదగ్ పోలీసులు, తల్లిదండ్రులకు గుంతకల్లుకు చేరుకున్నారు. కౌన్సెలింగ్ అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.కండక్టర్పై ఖాకీ దౌర్జన్యంగుత్తి: టికెట్ తీసుకుని ప్రయాణం చేయాలని సూచించిన ఆర్టీసీ బస్సు కండక్టర్పై ఓ హెడ్ కానిస్టేబుల్ బూతులతో రెచ్చిపోయారు. వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున గుత్తి ఆర్టీసీ డిపో నుంచి ప్రయాణికులతో బయలుదేరిన బస్సు గార్లదిన్నె మండలం కల్లూరుకు చేరుకోగానే ఓ హెడ్ కానిస్టేబుల్ ఎక్కారు. టికెట్ తీసుకోవాలని కండక్టర్ గంగేశ్వర్ అడగడంతో తాను హెడ్ కానిస్టేబుల్నని, టికెట్ తీసుకునేది లేదని తెలిపారు. ‘అలా కాదు సార్.. వారెంట్ ఏదైనా ఉంటే చెప్పండి ఫ్రీ గా ప్రయాణం చేయవచ్చు. అలా కాదంటే టికెట్ తీసుకోవాల్సిందే’ అంటూ కండక్టర్ చెప్పగానే హెడ్ కానిస్టేబుల్ రెచ్చిపోయి బూతులతో విరుచుకు పడారు. ‘ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో.. అవసరమైతే కోర్డుకు పోతావా? పో’ అంటూ బెదిరింపులకు దిగారు. తాను లేకుండా బస్సు అక్కడి నుంచి ఎలా ముందుకెళుతుందో చూస్తానంటూ భీష్మించారు. దీంతో సహనం కోల్పోయిన కండక్టర్ టికెట్ తీసుకోవాల్సిందేనంటూ గట్టిగా పట్టుపట్టారు. హెడ్ కానిస్టేబుల్ నిర్వాకంతో బస్సు అక్కడే నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు కల్పించుకోవడంతో చివరకు హెడ్ కానిస్టేబుల్ టికెట్ తీసుకున్నారు. ఘటనపై పోలీసులతో పాటు ఆర్టీసీ డీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు కండక్టర్ గంగేశ్వర్ తెలిపారు. కాగా, వివాదస్పదమైన సదరు హెడ్ కానిస్టేబుల్ పేరు లక్ష్మీనారాయణ అని ప్రయాణికులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ పనిచేస్తున్నది తెలియదన్నారు. పోలీసు శాఖ ప్రతిష్టను దిగజారుస్తున్న ఇలాంటి వారిపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనంత వరకూ ఇలాంటి ఘటనలు తరచూ చూడాల్సి వస్తుందని పేర్కొన్నారు. -
టీడీపీ నేత జకీవుల్లా ఆకస్మిక మృతి
అనంతపురం క్రైం: టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ ఎంపీ కేఎం సైపుల్లా కుమారుడు జకీవుల్లా (51) ఆదివారం హైదరాబాదులో గుండెపోటుతో మృతి చెందారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరుచుకున్న కుటుంబం కావడంతో రాష్ట్ర వ్యాఫ్తంగా పార్టీ నేతలు బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సోమవారం జకీవుల్లా భౌతిక కాయాన్ని అనంతకు తీసుకురానున్నారు. పార్టీ శ్రేణుల సందర్శనార్థం స్వగృహంలో ఉంచనున్నారు. సైపుల్లాకు ఇద్దరు కుమారులు కాగా, పార్టీలో సౌమ్యుడిగా ఉన్న జకీవుల్లా మృతితో పలువురు పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. మంచి నాయకుడు.. జకీవుల్లా ఉన్నత భావాలు ఉన్న ఓ మంచి నాయకుడని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆదివారం జకీవుల్లా మృతి చెందిన విషయం తెలియగానే ఆయన సైఫుల్లా ఇంటికి చేరుకుని బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అలాగే పలువురు టీడీపీ నేతలు సైఫుల్లా, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. -
మేధస్సును కదిలించేది ‘శ్రమ కావ్యం’
అనంతపురం: మేధస్సును కదిలించేది ‘శ్రమ కావ్య గానం’ అని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక తేజ అన్నారు. ఆయన రచించిన శ్రమ కావ్యం గానం పుస్తక పరిచయ కార్యక్రమం అనంతపురంలోని జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో సీఐటీయూ, ఐద్వా, యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ, సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు గ్రహీత రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి నాయకురాలు డాక్టర్ ప్రగతి మాట్లాడుతూ... సుద్దాల అశోక్ తేజ సాహితీ ప్రస్థానాన్ని వివరించారు. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. సుద్దాల అశోక్ తేజ రచనలు శ్రమ శక్తిని చాటేలా ఉంటాయన్నారు. అనంతరం సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. శ్రమ కావ్యం గానం గురించి వివరించారు. శ్రమ అన్నది మేథో శ్రమ, శారీరక శ్రమ రెండు రకాలుగా ఉంటుందన్నారు. ఈ రెండు కలగలిసి ప్రయాణం సాగిస్తుంటాయని వివరించారు. శ్రమ ద్వారానే సామాజిక గమనం ఉంటుందనే అంశాన్ని శ్రమ కావ్యం గానం ద్వారా వివరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి, సీఐటీయూ ఆర్వీ నాయుడు, యూటీఎఫ్ లింగన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పరమేష్, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఓ.నల్లప్ప, సీఐటీయూ రాష్ట్ర నాయకులు వి.రాంభూపాల్, మానవ హక్కుల వేదిక నాయకులు ఎస్ఎం బాష, సామాజిక వేత్త బోస్, మానవతా రక్తదాత తరిమెల అమర్నాథ్ రెడ్డి, సీఐటీయూ జిల్లా నాయకుడు రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుద్దాల అశోక తేజ -
ప్రమాదంలో చిన్నారి మృతి
కొలిమిగుండ్ల: నంద్యాల జిల్లాలో కారు, బొలెరో పరస్పరం ఢీకొన్న ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ చిన్నారి మృతి చెందింది. మరో ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన చంద్రమోహన్రెడ్డి తన కుమార్తె జోష్యహర్షిణిరెడ్డి(6)ని నంద్యాలలోని మేనమామ ఇంట్లో ఉంచి చదివిస్తున్నాడు. ఈ క్రమంలో అమ్మవారికి మొక్కుబడి చెల్లించాల్సి ఉండడంతో తాత, విశ్రాంత ఉపాధ్యాయుడు రామసుబ్బారెడ్డి, బంధువులు వెంకటసుబ్బారెడ్డి, ఏటూరి శ్రీనివాసరెడ్డి, లక్ష్మీదేవితో కలసి కారులో నంద్యాల స్వగ్రామానికి జోష్యహర్షిణిరెడ్డి బయలుదేరింది. కొలిమిగుండ్ల మండలం రాఘవరాజుపల్లి శివారులోకి చేరుకోగానే అంకిరెడ్డిపల్లి నుంచి కొలిమిగుండ్లకు వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాద తీవ్రతకు కారు ఎగిరి రోడ్డు పక్కన బోల్తాపడింది. కారులో ఉన్న వారందరూ అందులో చిక్కుకుపోయారు. బొలెరో వాహనంలో ఉన్న అంకిరెడ్డిపల్లికి చెందిన యువకులు రాజకుళ్లాయి, బాలుకు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు కారులో చిక్కుకుపోయిన వారిని అతి కష్టంపై వెలికితీసి, తాడిపత్రిలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న జోష్యహర్షిణిరెడ్డిని మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న సీఐ రమేష్బాబు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రుడు ఏటూరి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
వైభవంగా కొల్హాపురి మహాలక్ష్మి ఉత్సవాలు
రొళ్ల: రత్నగిరి కొల్హాపురి మహాలక్ష్మీదేవి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.ఆదివారం సాయంత్రం ‘పోతులరాజు పుష్పాలంకరణ మహోత్సవం’లో భాగంగా మహాకాళి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా రాజవంశీకుల ఇంటి నుంచి పోతులరాజులు ప్రత్యేకంగా అలంకరించుకుని పురవీధుల గుండా నృత్యం చేస్తూ మంగళవాయిద్యాల నడుమ ఆలయం వద్దకు చేరుకుని ప్రదక్షిణలు చేసి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాలబావి సమీపంలో పోతులరాజు పుష్పాలంకరణ మహోత్సవాన్ని అశేష భక్తజనం మధ్య వైభవంగా నిర్వహించారు. మహిళలు దేవాలయ సమీపంలోని పాలబావిలో గంగపూజ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేపట్టారు. ఇలా చేయడం వల్ల సంతాన భాగ్యం లేని వారికి సంతాన ప్రాప్తి,దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతా యని భక్తుల విశ్వాసం. జాతరలో తినుబండారాల అంగళ్లు కిటకిటలాడాయి. భక్తులకు దాతల సహకారంతో అన్నదానం చేశారు. కార్యక్రమంలో రాజవంశీకుల కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోతులరాజు పుష్పాలంకరణ మహోత్సవ వేడుకల్లో జెడ్పీటీసీ సభ్యుడు అనంతరాజు పాల్గొన్నారు. ఉత్సవాల్లో సోమవారం పాలబావిలో గంగపూజతో పాటు రాత్రికి పోతులరాజు బండారు మహోత్సవం నిర్వహించనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు తెలిపారు. భక్తిశ్రద్ధలతో పోతులరాజు పుష్పాలంకరణ -
ఇక చాలు.. దయ చేయండి!
అనంతపురం: ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కూటమి ప్రభుత్వం మాట తప్పింది. పైగా ఇప్పటివరకూ ఉన్న ఉద్యోగాలకూ శఠగోపం పెట్టేలా వ్యవహరిస్తోంది. జేఎన్టీయూ (ఏ) పరిధిలో పనిచేస్తున్న 150 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సర్వం సిద్ధం చేయడమే ఇందుకు నిదర్శనం. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2008లో జేఎన్టీయూ(ఏ) ఏర్పాటైంది. వర్సిటీలో కార్యకలాపాల నిర్వహణకు అప్పట్లోనే అవుట్ సోర్సింగ్ కింద ఉద్యోగులను నియమించారు. ప్రస్తుతం వర్సిటీ పరిధిలో మొత్తం 650 మంది ఉన్నారు. కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో 120 మంది, పులివెందుల ఇంజినీరింగ్ కళాశాల 150, క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల 80, ఓటీఆర్ఐ 26, జేఎన్టీయూ (అనంతపురం నగరంలో)లో 274 మంది పనిచేస్తున్నారు. అంతలోనే ఎంత తేడా.. చిరుద్యోగులకు దన్నుగా నిలిచేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ‘ఆప్కాస్’ను ఏర్పాటు చేసి ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతం చెల్లించింది. ఉద్యోగాలను ఇష్టానుసారం తొలగించే పరిస్థితి లేకుండా భద్రత కల్పించింది. పీఎఫ్ సౌకర్యం ఉండేది. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. ‘ఆప్కాస్’ నుంచి జీతాలు చెల్లించలేమంటూ చేతులెత్తేసింది. దీంతో జేఎన్టీయూ అంతర్గత వనరుల నుంచి జీతాలు ఇవ్వాల్సి రావడంతో ఆ మేరకు ఆర్థిక వనరులు లేక ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయానికి ఉన్నతాధికారులు వచ్చారు. మూడు రోజుల క్రితం జరిగిన పాలకమండలి సమావేశంలో దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించాలని తీర్మానించినట్లు తెలిసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఉద్యోగుల్లో భయాందోళన నెలకొంది. ఎవరిని ఇంటికి పంపుతారో.. ఎవరిని ఉంచుతారోనంటూ బిక్కుబిక్కుమంటున్నారు.గత ప్రభుత్వ హయాంలో జేఎన్టీయూ(ఏ)లో ఇద్దరు, కలికిరిలో ఐదుగురిని మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. మిగిలిన 643 మంది చాలా ఏళ్ల నుంచి కొనసాగుతున్న వారే. ఈ క్రమంలో వర్సిటీ ఏర్పడినప్పటి నుంచి ఉన్న ఉద్యోగులకూ ఉద్వాసన తప్పదని తెలు స్తోంది. కూటమి ప్రభుత్వం వస్తే జీతాలు పెరుగుతాయని ఆశించామని, కానీ ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెడతారని కలలో కూడా ఊహించలేదంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జేఎన్టీయూ (ఏ) పరిధిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపునకు కసరత్తు 150 మందిని వెళ్లగొట్టేందుకు చర్యలు వేగవంతం చిరుద్యోగుల జీవితాలను చిదిమేసేలా త్వరలో ఉత్తర్వులు వర్సిటీ ఏర్పడినప్పటి నుంచి ఉన్న ఉద్యోగులకూ ఉద్వాసన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి 2008 నుంచి పనిచేస్తున్న వారికి జేఎన్టీయూ (ఏ) యాజమాన్యం వెన్నుదన్నుగా నిలవాలి. ఉద్యోగులను తొలగించే ప్రక్రియ మానుకోవాలి. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థలో దళారుల ప్రమేయం అధికంగా ఉండేది. సక్రమంగా జీతాలు చెల్లించేవారు కాదు. ‘ఆప్కాస్’ ద్వారా సక్రమంగా జీతాలు అందేవి.ఇటీవల ‘ఆప్కాస్’ నుంచి జీతాలు చెల్లించలేమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న ఉద్యోగులను తొలగించేలా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. – కే.విజయ్, ఉమ్మడి జిల్లా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ -
నేడు రాప్తాడులో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ప్రత్యేక ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం రాప్తాడు మండలంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసన్నాయపల్లి వద్ద ఉన్న ఆర్జేసీ కల్యాణ మండపంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారన్నారు. ప్రజలు తమ వివరాలతో పాటు సమస్యలను అర్జీ రూపంలో అందజేయాలన్నారు. సమస్యపై గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి స్లిప్, పాత రసీదు తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనప్పుడు ఫోన్కు సమాచారం వస్తుందని, కాబట్టి అర్జీదారులు తమ ఫోన్లోని మెసేజ్లను చూసుకోవాలన్నారు. నోటీసులు, ఎండార్స్మెంట్ను వాట్సాప్లో పంపిస్తామన్నారు. అర్జీ సమర్పించేప్పుడు కచ్చితమైన వివరాలను ఇవ్వాలని సూచించారు. రాప్తాడు మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిందాల్ కార్మికుడి అనుమానాస్పద మృతిబొమ్మనహాళ్: మండలంలోని హరేసముద్రం గ్రామ శివారులో ఉన్న జిందాల్ ఫ్యాక్టరీలో పనిచేసే ఓ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్ఐ నబీరసూల్ తెలిపిన మేరకు.. జార్ఖండ్ రాష్ట్రంలోని ఛత్రా జిల్లా ఖర్మహీ గ్రామానికి చెందిన అభిషేక్ భూయాన్ (36), తమ్ముడు గణేష్ భూయాన్తో కలిసి కొన్నేళ్ల క్రితం వలస వచ్చాడు. జిందాల్ ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు. ఇటీవల అభిషేక్ భూయాన్ మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 14న జీతం తీసుకున్నప్పటి నుంచి ఇంకా ఎక్కువగా మద్యం తాగేవాడు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం కనపడకుండా పోయిన ఇతను.. ఆదివారం ఫ్యాక్టరీ సమీపంలోనే విగతజీవిగా పడి కనిపించాడు. ఫ్యాక్టరీ కార్మికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గణేష్ భూయాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బళ్లారి విమ్స్కు తరలించారు. మద్యం ఎక్కువగా తాగి నీటి దాహానికి మృతి చెందాడా.. లేక ఎవరైనా హతమార్చారా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. భక్తులపై తేనెటీగల దాడి ● 20 మందికి గాయాలు ఉరవకొండ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తులపై ఆదివారం తేనెటీగలు దాడి చేశాయి. వివరాలు.. మండల పరిధిలోని వెలిగొండ గ్రామానికి చెందిన రాజశేఖర్, భాగ్యమ్మ, శ్రీలేఖ, రామాంజినేయులు, జయలక్ష్మి, రాజేశ్వరి, యుగంధర్, మల్లికార్జున, ప్రతాప్, ప్రభాస్, జనార్దన్ తదితర 20 మంది ఆదివారం పెన్నహోబిలం వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం పొట్టేలు బలి ఇచ్చి ఆలయం కింది భాగంలో వంట చేసుకుని విందు భోజనాలకు కూర్చున్నారు. ఈ క్రమంలోనే అక్కడే చెట్టు మీద ఉన్న పెద్ద తేనెతుట్టె నుంచి ఒక్కసారిగా తేనెటీగలు లేచి దాడి చేశాయి. హఠాత్పరిణామంతో ఆందోళనకు గురైన వారు కేకలు వేస్తూ పిల్లాపాపలతో కలిసి పరుగు తీశారు. స్థానికులు 108 సాయంతో గాయపడ్డ వారిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
చుక్కలు.. తొలగని తిప్పలు
అనంతపురం అర్బన్: రైతులకు చుక్కల భూముల తిప్పలు తొలగడం లేదు. ఫైళ్ల పరిష్కార ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ప్రతి శుక్రవారం చుక్కల భూముల ఫైళ్లను పరిష్కరిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ ఆ సంఖ్య నాలుగైదు మించి ఉండడం లేదు. చుక్కల భూములకు సంబంధించి 1,397కు పైగా ఫైళ్లు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. అత్యధికంగా అనంతపురం రెవెన్యూ డివిజన్లో, అత్యల్పంగా గుంతకల్లు రెవెన్యూ డివిజన్ పరిధిలో చుక్కల భూములు ఉన్నాయి. గుంతకల్లు డివిజన్కు సంబంధించి ఉన్న ఏడు ఫైళ్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తెలిసింది. డబ్బులిస్తేనే సక్రమంగా.. చుక్కల భూముల ఫైళ్ల పరిష్కారానికి కలెక్టర్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నప్పటికీ ఆశించిన ఫలితం రావడం లేదు. ఇందుకు మండల, డివిజన్ స్థాయిలోని కొందరు సిబ్బంది అవినీతి అక్రమాలే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ఫైళ్లు సిద్ధం చేసే క్రమంలో కొందరు సిబ్బంది సంబంధిత రైతుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ముడుపులు ఇవ్వని రైతు ఫైలు సక్రమంగా సిద్ధం చేయకుండా తిరస్కరణకు గురయ్యేలా చేస్తున్నారనే విమర్శలున్నాయి. చుక్కల భూమి అంటే... నిషేధిత భూములు (22ఏ), చుక్కల భూములు (డాటెడ్ ల్యాండ్) రెండూ ఒకేరకం కాదు. వీటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది.1954, జూన్ 18కి ముందు అసైన్డ్ చేసిన ప్రభుత్వ భూములు 22ఏ జాబితా కిందకు వస్తాయి. ఇక చుక్కల భూముల విషయానికి వస్తే.. ప్రభుత్వ భూమిగా చెప్పబడే భూమి వివరం ఆర్ఎస్ఆర్ (రీ సెటిల్మెంట్ రిజిస్టర్)లో చుక్కలుగా చూపించి ఉండాలి. ఆ భూమి ఎవరికీ అసైన్డ్ చేసి ఉండకూడదు. ఇలాంటి భూమిని అనుభవించేవారు దరఖాస్తు చేసుకుంటే.. డీఎల్సీ సమావేశంలో నిర్ణయం తీసుకుని జాబితా నుంచి తొలగిస్తారు. ఆమోద ముద్రకు నిబంధనలిలా... చుక్కల భూముల జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్న వారికి నిబంధనల ప్రకారం డీఎల్సీ ఆమోద ముద్ర వేస్తుంది. ● సాగు చేస్తున్నట్లుగా చెప్పబడే ప్రభుత్వ భూమి వివరం ఆర్ఎస్ఆర్లో చుక్కలుగా ఉండాలి. ఆ భూమి ఎవరి పేరునా అసైన్డ్ చేసి ఉండకూడదు. ● డాటెడ్ ల్యాండ్ చట్టం–2017 ప్రకారం... ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న వ్యక్తి చట్టం వచ్చే నాటికి 12 ఏళ్ల ముందు ఆ భూమిపై హక్కు, అనుభవం కలిగి ఉండాలి. ● చట్టం నిబంధనల ప్రకారం సాగు చేస్తున్న వారు తహసీల్దారు వద్ద దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై సమగ్ర విచారణ నిర్వహించి ఆర్డీఓకు తహసీల్దారు నివేదిస్తారు. దానిని ఆర్డీఓ విచారణ చేసి కలెక్టర్ కార్యాలయానికి పంపిస్తారు. ● ఇక్కడ జిల్లాస్థాయి కమిటీ వాటిని విచారణ చేసి నిబంధనల ప్రకారం అన్ని సక్రమంగా ఉన్నవాటిని జాబితా నుంచి తొలగిస్తూ ఆమోద ముద్ర వేస్తుంది. మందకొడిగా ఫైళ్ల పరిష్కార ప్రక్రియ డీఎల్సీలో నాలుగైదు మించి పరిష్కారం కాని వైనం పెండింగ్లో 1,390కు పైగా ఫైళ్లు వేగవంతానికి చర్యలు చుక్కల భూముల ఫైళ్లకు వేగవంతంగా పరిష్కారం చూపుతాం. డీఎల్సీ సమావేశానికి ఉంచే ఫైళ్ల సంఖ్య పెంచాలని తహసీల్దార్లు, ఆర్డీఓలను ఆదేశించాం. మండలాలవారీగా షెడ్యూల్ ఇచ్చి ప్రతి శుక్రవారం డీఎల్సీ సమావేశం నిర్వహిస్తూ ఫైళ్లు పరిష్కరిస్తున్నాం. ఫైళ్లు ఎలా సిద్ధం చేయాలనే దానిపై మండల, డివిజన్ స్థాయి రెవెన్యూ సిబ్బందికి వారం క్రితం శిక్షణ ఇచ్చాం. – వి.వినోద్కుమార్, కలెక్టర్ -
మట్టి దోపిడీని అరికట్టేవారేరీ?
పెద్దవడుగూరు : కూటమి పాలనలో అభివృద్ధి పనుల మాటున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. సాధారణంగా అభివృద్ధి పనుల కోసం అయితే ఇసుక, మట్టి తరలించుకునేందుకు అధికారుల నుంచి అనుమతి పొందాలి. అయితే ఎటువంటి అనుమతులు లేకున్నా మండల కేంద్రం పెద్దవడుగూరు సమీపంలోని దేవదాయ భూముల్లో జేసీబీ సాయంతో నాణ్యమైన ఎర్రమట్టిని యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. పెద్ద పెద్ద గోతులు ఏర్పడినా అధికారులెవ్వరూ ఇటువైపు తొంగిచూసిన దాఖలాలు లేవు. ఇక పి.వీరన్నపల్లి, కొండూరు, చిత్రచేడు గ్రామాల నుంచి పెన్నానది పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుక పెద్ద ఎత్తున తవ్వి తీసుకెళ్తున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. రాత్రి వేళల్లో పోలీస్ స్టేషన్ మీదుగాను ఎర్రమట్టి లోడ్లతో వాహనాలు వెళ్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అనుమతి లేకున్నా దేవదాయ భూమిలో ఎర్రమట్టి తవ్వకం రాత్రికి రాత్రే తరలించి సొమ్ము చేసుకుంటున్న టీడీపీ కార్యకర్తలు ఇసుకను కొల్లగొడుతున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారులు -
ఇంటర్లో హాస్టల్ విద్యార్థుల ప్రతిభ గర్వకారణం
అనంతపురం అర్బన్: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి 900కు పైగా మార్కులు సాధించడం గర్వకారణమని కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఆప్తాల్మిక్ టెక్నీషియన్లో 905 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించిన బి.హేమలతను ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలోని 18 మంది విద్యార్థులు ఇంటర్మీడియేట్లో 900 పైగా మార్కులు సాధించడంతో రాష్ట్రంలోనే జిల్లా రెండవ స్థానంలో నిలవడం సంతోషంగా ఉందన్నారు. చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేనివారిని తన దృష్టికి తీసుకొస్తే వారు ఎంతవరకు చదవాలనుకుంటారో అంతవరకు చదివిస్తామని చెప్పారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాధిక, గిరిజన సంక్షేమాధికారి రామాంజనేయులు, ఆర్ఐఓ వెంకటరమణ నాయక్, హెచ్డబ్ల్యూఓలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
బ్రహ్మసముద్రం : ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లికి చెందిన రంగస్వామి (35) కర్ణాటకలో వివాహం చేసుకున్నాడు. అక్కడే ఉంటూ వ్యవసాయం చేసుకుని జీవించేవాడు. ఇటీవలే స్వగ్రామం చెలిమేపల్లికి వచ్చాడు. శనివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి గోవిందయ్య దొడ్డి సమీపంలోని ఓ బావిలో ఈతకు వెళ్లాడు. అక్కడ నీటిలోకి దూకిన రంగస్వామి ఎంతకూ పైకి రాలేదు. స్నేహితులు వెదికినా కనిపించకపోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని కళ్యాణదుర్గం ఫైరింజన్ సిబ్బదికి సమాచారం తెలిపారు. ఫైరింజన్ సిబ్బంది, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి అడుగున ఇరుక్కున్న రంగస్వామి మృతదేహాన్ని బయటకు తీశారు. ఎస్ఐ నరేంద్రకుమార్, పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రంగస్వామికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి దుర్మరణం రాయదుర్గంటౌన్: మండలంలోని 74 ఉడేగోళం గ్రామం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు దుర్మరణం చెందింది. గుమ్మఘట్ట మండలం భూపసముద్రం గ్రామానికి చెందిన ఈరక్క (72) 74 ఉడేగోళం గ్రామం వద్ద రోడ్డుపై నడుచుకుని వెళుతుండగా ద్విచక్రవాహనంపై వస్తున్న మారెంపల్లికి చెందిన ఈశ్వర్ ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడ్డారు. స్థానికులు గుర్తించి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈరక్క పరిస్థితి విషమించి మృతి చెందింది. ఈమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్యోగం రాలేదని బలవన్మరణం తాడిపత్రిటౌన్: ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఓ యువకుడు అర్ధంతరంగా తనువు చాలించాడు. పట్టణంలోని జయనగర్ కాలనీకి చెందిన కరుణాకర్, ఇందిర దంపతుల కుమారుడు సపారే నరసింహ (22) బీటెక్ పూర్తి చేశాడు. పలు కంపెనీల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అయితే ఎక్కడా జాబ్ రాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన నరసింహ శనివారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విద్యుత్ షాక్తో రజకుడి మృతి పామిడి: దుస్తులు ఇసీ్త్ర చేస్తున్న రజకుడు కరెంట్ షాక్తో మృతి చెందాడు. పామిడిలోని వీకే ఆదినారాయణరెడ్డి కాలనీకి చెందిన చాకలి లక్ష్మన్న (62), రమాదేవి దంపతులు. వీరు రజకవృత్తి చేసుకుంటూ జీవనం సాగించేవారు. శనివారం రాత్రి లక్ష్మన్న కరెంటు ఐరన్ బాక్స్తో దుస్తులు ఇసీ్త్ర చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐరన్బాక్స్ గుండా విద్యుత్ ప్రసారమవడంతో లక్ష్మన్న షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు కుమారులు సంజీవ, ఈశ్వరయ్య, కుమార్తె సునీత సంతానం. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని కమ్యూనిటీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గుర్తుతెలియని మహిళ శవం లభ్యం ఉరవకొండ (వజ్రకరూరు): వజ్రకరూరు మండలం పందికుంట సమీపంలోని పొలిమేర రిజర్వు ఫారెస్టులో గుర్తు తెలియని మహిళ శవాన్ని శనివారం పోలీసులు గుర్తించారు. వయసు 40 నుంచి 50 సంవత్సరాలలోపు ఉంటుందని, బ్లూ కలర్ ప్యారగాన్ చెప్పులు, తెలుపు రంగు పంజాబీ డ్రస్, టాప్ ధరించి ఉందని పేర్కొన్నారు. కుడి, ఎడమ చేతికి రబ్బరు గాజులు ఉన్నాయి. ఈమె ఆచూకీ తెలిస్తే వజ్రకరూరు ఎస్ఐ (94409 01867), ఉరవకొండ రూరల్ సీఐ (94407 96856)కు సమాచారం అందించాలని కోరారు. అరటి పిలకల ఏజెంట్ టోకరా గార్లదిన్నె: కల్లూరు చెందిన ఇద్దరు రైతులకు అరటి పిలకల ఏజెంట్ టోకరా వేశాడు. రైతులు గాంధీ, దస్తగిరి 18వేల అరటి పిలకల కోసం నార్పల మండలం గొల్లపల్లికి చెందిన ఏజెంట్ శివయ్యను సంప్రదించారు. ఒక మొక్క రూ.15 చొప్పున మాట్లాడుకున్నారు. అడ్వాన్స్గా రూ.2లక్షల రూపాయలను శివయ్య అసిస్టెంట్కు గత నెలలో ఫోన్ పే చేశారు. ఏప్రిల్ ఎనిమిదో తేదీన బెంగళూరు నుంచి అరటిపిలకలు సరఫరా చేస్తానని ఏజెంట్ చెప్పాడు. అయితే చెప్పిన సమయానికి సరఫరా కాలేదు. దీంతో రైతులు సదరు ఏజెంట్ ఇంటి వద్దకెళ్లి విచారించగా.. తన దగ్గర డబ్బు లేదని, తర్వాత ఇస్తానని చెప్పాడు. తమను నమ్మించి మోసం చేశారని గ్రహించి లబోదిబోమన్నారు. -
కూటమి కక్ష.. నెరవేరని పేదల కాంక్ష
పేదలపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఈ నిర్మాణాలు పూర్తయితే వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందన్న అక్కసుతో పేదలకు సొంతిల్లు దక్కకుండా చేస్తోంది. దీంతో అసంపూర్తిగా నిలిచిన నిర్మాణాల్లో అల్లరిమూక వికృత చేష్టలకు పాల్పడుతూ విలువైన సామగ్రిని అపహరించుకెళుతోంది. అనంతపురం రూరల్ మండలం కొడిమి లే అవుట్ జగనన్న కాలనీలో ఇలాంటి విధ్వంసాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి ఘటనలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం కొడిమి జగనన్న కాలనీలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు దొంగల పాలవుతున్న కంకర -
వక్ఫ్ సవరణ చట్టం రద్దయ్యే వరకు పోరాటం
గుంతకల్లుటౌన్: తమ హక్కులను కాలరాస్తున్న వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాడతామంటూ ముస్లింలు నినదించారు. శనివారం గుంతకల్లు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు, నల్లజెండాలు, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. వీరికి వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఎమ్మార్పీఎస్, ఇతర ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపారు. ఈద్గా మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీచౌక్, మెయిన్ రోడ్డు మీదుగా పొట్టిశ్రీరాములు సర్కిల్ వరకు సాగింది. ఈ సందర్భంగా గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ పోరాటాలు వైఎస్సార్సీపీకి కొత్త కాదన్నారు. అన్యాయానికి గురవుతున్న ప్రజల పక్షాన పోరాడతామన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేసే వరకు ముస్లిం మైనార్టీలతో కలిసి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ముందుకు నడుస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ముస్లింల హక్కులను హరిస్తోందని మండిపడ్డారు. మైనార్టీ వర్గాలను అణగదొక్కాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. అధికారమెప్పుడూ శాశ్వతం కాదని కూటమి నేతలు గ్రహించాలని హితవు పలికారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ నదీమ్ అహ్మద్ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలతో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్లు కలిసిరావాలని, లేకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. వక్ఫ్ ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టడానికే మోదీ కుట్ర చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు డి.జగదీష్ విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు వి.రాంభూపాల్ మాట్లాడుతూ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్న సీఎం చంద్రబాబు గురించి దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు మైమూన్, నైరుతిరెడ్డి,ఖాజీ సయ్యద్ రజాక్పీర్సాబ్, అదనపు ఖాజీ సత్తార్సాబ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రభాకర్, ముస్లిం జేఏసీ కన్వీనర్ సద్దామ్, మైనార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ముస్లింల హక్కులను హరించే అధికారం మీకెవరిచ్చారు? గుంతకల్లులో కదం తొక్కిన ముస్లింలు -
రాజధాని పేరిట మభ్యపెడుతున్న బాబు
అనంతపురం కార్పొరేషన్: అమరావతి పేరిట సీఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్ష ఎకరాలు, రూ.లక్ష కోట్లతో అమరావతిని నిర్మిస్తామని, రెండో సారి భూమి పూజకు ప్రధాని మోదీని పిలుస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుండటం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధి అంటే కేవలం అమరావతి మాత్రమే కాదని, అన్ని జిల్లాలను పరిగణనలోకి తీసుకోవాలని హితవు పలికారు. ఇప్పటికే 53 వేల ఎకరాలను సేకరించింది కాక తాజాగా మరో 43 వేల ఎకరాలను సేకరించాల్సి ఉందని సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ చెప్పడం అన్యాయమన్నారు. మేధావులు సైతం కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారన్నారు. రాజధాని పేరిట అప్పులు చేసి భవిష్యత్తులో ఆ అప్పును తీర్చలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. గన్నవరంలో ఇది వరకే ఎయిర్పోర్టు ఉన్నా.. రాజధానిలో 5 వేల ఎకరాలతో ఎయిర్పోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పడం ఏంటో అర్థం కావడం లేదన్నారు.గతంలో రాజధాని కోసం భూములిచ్చిన ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. అందులో 10 వేల మంది రాష్ట్రాన్నే విడిచి వెళ్లినట్లు తెలిసిందన్నారు. శాశ్వత భవనాల పేరున చదరపు అడుగుకు ఇస్తున్న ధరలను చూసి అందరూ విస్తుపోతున్నారన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటే భయమేస్తోందని ఓ వైపు చెబుతూనే.. మరోవైపు ప్రజలను మభ్యపెడుతుండటం దుర్మార్గమన్నారు. సీఎం చంద్రబాబుకు రాజధాని తప్ప మరేమీ కన్పించడం లేదా అని ప్రశ్నించారు. గిట్టుబాటు ధరల్లేక రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, ఇరిగేషన్ ప్రాజెక్ట్లను గాలికొదిలేసి నట్టేట ముంచారన్నారు. జనవరి నుంచి ఉపాధి హామీ బకాయిలు రూ.37 కోట్లు ఇంత వరకు చెల్లించకపోవడం అన్యాయమన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ‘నాడు–నేడు’లో పాఠశాలలు, ఆస్పత్రుల నిర్మాణాలు ఆగిపోయాయని, హంద్రీ–నీవా కాలు వను వెడల్పు చేసి లైనింగ్ పనులు చేయమంటే కమీషన్ల కోసం లైనింగ్ పనులు మాత్రమే చేపడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరు మారకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న తదితరులు పాల్గొన్నారు. లక్ష ఎకరాలు, రూ.లక్ష కోట్లతో అభివృద్ధా? మాజీ ఎమ్మెల్యే విశ్వ ధ్వజం -
అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠాలో ‘పచ్చ’ నేత!
సాక్షి టాస్క్ఫోర్స్: అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠాలో ఓ ‘పచ్చ’ నేత ఉండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. మంత్రి పయ్యావుల కేశవ్తో సదరు ‘పచ్చ’ నేత దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వివరాలు.. వజ్రకరూరు మండలం వీపీపీ తాండా (వెంకటాంపల్లి పెద్దతండా)కు చెందిన టీడీపీ నాయకుడు ఎస్కే మహేష్నాయక్ బంజారా గిరిజన సమాఖ్య (బీజీఎస్) ఏర్పాటు చేశాడు. సమాఖ్యకు జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. మంత్రి పయ్యావుల కేశవ్, ఆయన సోదరుడు పయ్యావుల శ్రీనివాసులుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందాడు. మహేష్నాయక్ కొన్నాళ్ల క్రితం తెలంగాణకు చెందిన కొందరితో జట్టు కట్టాడు. తెలంగాణతో పాటు మన రాష్ట్రంలో రాత్రి వేళ పెట్రోల్ బంకుల వద్ద, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీలను టార్గెట్ చేసేవాడు.కారులో వచ్చి లారీల నుంచి డీజిల్ను దొంగతనం చేసి ఉడాయించేవాడు. దొంగిలించిన డీజిల్ను బయట మార్కెట్లో విక్రయించి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. పలువురి ఫిర్యాదు మేరకు ఈ ముఠాపై నిఘా ఉంచిన కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు పక్కా సమాచారంతో కొందరు ముఠా సభ్యుల్ని ఇటీవల పట్టుకున్నారు. ముఠాలో మహేష్నాయక్ ముఖ్య నాయకుడిగా చెలామణి అవుతున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. బ్లాక్మెయిలింగ్లు.. సెటిల్మెంట్లు మహేష్నాయక్ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జిల్లా గిరిజన శాఖలో అధికారులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకునేవాడని తెలిసింది. దీంతో పాటు తన సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని పంచాయితీలు, సెటిల్మెంట్లు చేసేవాడని సమాచారం. ఏది ఏమైనా.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ‘పచ్చ’ నేతల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ‘తమ్ముళ్లు’ చేస్తున్న అరాచకాలు, అక్రమాలను చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. -
స్వచ్ఛతకు పాటుపడదాం
అనంతపురం కార్పొరేషన్: స్వచ్ఛతకు పాటుపడి, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుందామని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మేయర్ వసీం పిలుపునిచ్చారు. శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్’ కార్యక్రమంలో భాగంగా స్థానిక జెడ్పీ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి నగరపాలక సంస్థ వరకు ర్యాలీ నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ–వేస్ట్ కలెక్షన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ అంబికా మాట్లాడుతూ ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి కంపోస్టు యార్డును మరో ప్రాంతానికి తరలిస్తామని, త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వంకల వద్ద రక్షణ గోడలను నిర్మిస్తామన్నారు. మేయర్ వసీం మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.వెయ్యికోట్లతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ప్రధాన నగరాలను తలదన్నేలా అభివృద్ధి చేసి చూపామన్నారు. కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ మాట్లాడుతూ ఈ–వేస్ట్ సేకరణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల వాడకం అధికమైందని, వాడిన పరికరాలను మూలకు వేయకుండా ఈ– వేస్ట్ సెంటర్లో ఇస్తే అందులో బాగా ఉన్న పార్ట్స్ను వాడేందుకు వీలుగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, కమిషనర్ బాలస్వామి, డీపీఓ నాగరాజు, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏడు నెలలు.. మద్యం ఏరులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి సర్కారు పుణ్యమా అని ఉమ్మడి అనంతపురం జిల్లా మద్యం మత్తులో ఊగిపోతోంది. పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా మద్యం దుకాణాల వద్ద మందుబాబులతో జాతర వాతావరణం తలపిస్తోంది. రోడ్డుమీదే తాగుతూ చిందులేస్తున్నారు. పట్టణాల్లో పర్మిట్ రూములు, పల్లెటూళ్లలో బెల్టుషాపులు.. ఇదీ దుస్థితి. నాలుగు వందల జనాభా ఉన్న గ్రామంలో కూడా రెండు, మూడు బెల్టుషాపులు పెట్టి రేషన్ బియ్యం తరహాలో ఇంటింటికీ మద్యం అమ్ముతున్నారు. టీడీపీ నేతల ఆధ్వర్యంలో అడ్డూ అదుపు లేకుండా జరుగుతున్న మద్యం వ్యాపారంతో వేల కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఏడు నెలల్లో 1.16 కోట్ల లీటర్ల మద్యం.. కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో ఎప్పుడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. గత ఏడాది సెప్టెంబర్ 15 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 15 వరకూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1.16 కోట్ల లీటర్ల మద్యం తాగించేశారు. దీన్ని ఐదు వేల లీటర్ల నీటి ట్యాంకర్లతో పోలిస్తే 2,337 ట్యాంకర్ల మద్యం తాగినట్టు లెక్క కావడం గమనార్హం. రోజుకు సగటున రెండు జిల్లాల్లో 55,658 లీటర్ల మద్యం వినియోగమవుతోంది. ఇదికాకుండా ఏడు నెలల్లో 39 లక్షల లీటర్ల బీర్లు తాగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రోజు రోజుకూ మద్యానికి అలవాటు పడుతున్న యువకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేతల షాపులపై కన్నెత్తి చూడరు.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 230 వరకూ మద్యం షాపులున్నాయి. వీటిలో మెజారిటీ షాపులు టీడీపీ ఎమ్మెల్యేలవే. ఈ దుకాణాలకు అనుబంధంగా బెల్టుషాపులు కూడా నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎకై ్సజ్ అధికారులు వాటి వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎవరైనా అటువైపు వెళితే బదిలీ చేస్తామని ‘పచ్చ’ నేతలు బెదిరిస్తున్నారు. సాధారణంగా ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకే మద్యం షాపులను ఓపెన్ చేయాలి. కానీ రాప్తాడు, రాయదుర్గం లాంటి నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకే తెరుస్తున్నా పట్టించుకునే దిక్కులేదు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూములు ఏ సమయంలో చూసినా జనంతో కిక్కిరిసి ఉంటు న్నాయి. యథేచ్ఛగా సాగుతున్న మద్యం అమ్మకాలతో సామాన్య కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. మద్యం కారణంగానే ఇటీవల కుటుంబ తగాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. 1.16 కోట్ల లీటర్ల మద్యం తాగేశారు రోజుకు సగటున 55 వేల లీటర్లకు పైగా వినియోగం మరో 39 లక్షల లీటర్ల బీర్లు కూడా.. పల్లెటూళ్లలో బెల్టుషాపులు.. పట్టణాల్లో పర్మిట్ రూములు విచ్చలవిడి మద్యం అమ్మకాలతో వీధిన పడుతున్న పేదల కుటుంబాలు -
‘ప్రపంచంలో ఎక్కడా లేని ధరలతో బాబు అమరావతి నిర్మాణాలు !’
సాక్షి, అనంతపురం: అమరావతి నిర్మాణంలో పెద్ద కుంభకోణం ఉందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి. ప్రపంచంలో ఎక్కడా లేని ధరలతో చంద్రబాబు అమరావతి నిర్మాణాలు చేపట్టారని అన్నారు. అమరావతి నిర్మాణం కోసం అప్పులు చేస్తున్నారు.. కానీ, సూపర్ సిక్స్ హామీలను చూస్తే భయం వేస్తోందని చంద్రబాబు అంటున్నారు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా ధనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అస్మదీయులకు దోచి పెడుతున్నారు. సూపర్ సిక్స్ హామీలను చూస్తే భయమేస్తోందని చంద్రబాబు చెబుతున్నారు. మరోవైపు వేల కోట్లతో అమరావతిలో కట్టడాలు జరుగుతున్నాయి. రాజధాని అమరావతిలో లక్ష ఎకరాల్లో లక్ష కోట్లతో నిర్మాణం అవివేకం. గన్నవరం ఉండగా అమరావతిలో మరో విమానాశ్రయం ఎందుకు?. 10 మాసాల్లో 1.53 లక్షల కోట్లు అప్పు చేశారు.. ఆ డబ్బు ఏమైంది?. చంద్రబాబుకు అమరావతి తప్ప.. మిగిలిన జిల్లాల అభివృద్ధి అక్కర్లేదా? అని ప్రశ్నించారు.అలాగే, రాష్ట్ర విభజన పాఠాలు చంద్రబాబు నేర్చుకోలేదు. అభివృద్ధి-అధికార వికేంద్రీకరణ అవసరం లేదా?. శ్రీకృష్ణ, శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు?. ప్రపంచంలో ఎక్కడా లేని ధరలతో చంద్రబాబు అమరావతి నిర్మాణాలు చేస్తున్నారు. అమరావతి నిర్మాణం కోసం అప్పులు చేస్తున్నారు.. కేంద్రం నుంచి గ్రాంట్ ఎందుకు సాధించడం లేదు?. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయడం లేదు. టీసీఎస్ పేరుతో 29 ఎకరాల భూమిని 29 రూపాయలకే ఇవ్వడం ఏంటి? ఇది అనుమానాస్పదంగా ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
టీడీపీలో పొలిటికల్ వార్.. ఎమ్మెల్యే కారణంగా కీలక నేతల రాజీనామా!
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనలో పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, వారి ప్రవర్తన కారణంగా.. టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీటీసీ సైతం రాజీనామా చేశారు.వివరాల ప్రకారం.. శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిపై టీడీపీ కార్యకర్తల తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యే శ్రావణి కార్యకర్తల కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారని పచ్చ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం వచ్చిన మంత్రి టీజీ భరత్కు స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం, ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు.దీంతో, అక్కడే ఉన్న పోలీసులు.. టీడీపీ కార్యకర్తలను ఈడ్చి పడేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఎమ్మెల్యే శ్రావణి వైఖరికి నిరసనగా వెస్ట్ నరసాపురం టీడీపీ ఎంపీటీసీ అంజినమ్మ రాజీనామా చేశారు. ఇదే సమయంలో 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమకు కనీస గుర్తింపు ఇవ్వలేదని టీడీపీ నేతలు వాసాపురం బాబు, కనంపల్లి ప్రసాద్ ధర్నాకు దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టిడిపి ఎమ్మెల్యే బండారు శ్రావణి కు సొంత కార్యకర్త నుంచి నిరసన సెగ. పార్టీ కోసం చాలా కష్టపడ్డాను కానీ గుర్తింపు ఇవ్వడం లేదు.- టిడిపి కార్యకర్త pic.twitter.com/ZibwkRqIZv— రాజా రెడ్డి YSRCP (@rajareddzysrcp) April 18, 2025 -
ఇంగ్లిష్ సార్లు లేరిక్కడ!
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని పలు ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ పాఠ్యాంశాలు బోధించే టీచర్లు లేరు. ఫలితంగా పదో తరగతి విద్యార్థులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారు. 2023 జూన్లో అన్ని సబ్జెక్టులకు పదోన్నతులు కల్పించినా... హై కోర్టులో వివాదం కారణంగా ఇంగ్లిష్ టీచర్ల పదోన్నతులకు బ్రేక్ పడింది. ఇంగ్లిష్ పదోన్నతులు తమకు మాత్రమే కల్పించాలంటూ డిగ్రీలో ఇంగ్లిష్ ప్రధాన అంశంగా ఉన్న ముగ్గురు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పదోన్నతులు జరగకుండా హైకోర్టు స్టే విధించింది. అప్పట్లో 230 ఎస్జీటీలకు ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు దక్కాల్సి ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 280కు చేరింది. వాస్తవానికి 2023, జనవరిలో సీనియార్టీ జాబితా తయారు చేసి తాత్కాలిక పదోన్నతులు కల్పించారు. జూన్లో రెగ్యులర్ పదోన్నతులు ఇచ్చే సమయంలో కోర్డు కేసు కారణంగా ఈ ప్రక్రియ కాస్త ఆగిపోయింది. నష్టపోతున్నది విద్యార్థులే ఉమ్మడి జిల్లాలోని టి.వీరాపురం, నేత్రపల్లి, 74–ఉడేగోళం, డి.కొండాపురం, భూపసముద్రం, గుమ్మఘట్ట, గోనబావి, గొల్లపల్లి, కలుగోడు, తాళ్లకెర, రంగచేడు, భూపసముద్రం, పూలకుంట, గొల్లపల్లి, మురడి, మండ్లి, అపిలేపల్లి, బసాపురం, బెస్తరపల్లి, యర్రగుంట, మలయనూరు, తెంగల్లు, లక్ష్మంపల్లి, కనకూరు, వలస, ఆగ్రహారం, కె.శివరం, హేమావతి, బుచ్చయ్యగారిపల్లి, బాచేహల్లి, శెట్టూరు, తిప్పనపల్లి గ్రామాల్లోని జిల్లాపరిషత్ యాజమాన్యంలోని ఉన్నత పాఠశాలలతో పాటు కేపీ దొడ్డి, తూముకుంట, మహనంతపురం, కరిగానపల్లి తదితర గ్రామాల్లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ సబ్జెక్ట్ టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. కుందుర్పి మండలంలోని ఆరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలుండగా ఏ ఒక్క స్కూల్లోనూ ఇంగ్లిష్ టీచరు లేరు. అక్కడక్కడా కొన్ని పాఠశాలల్లో ఇతర పాఠ్యాంశాల టీచర్లతో ఇంగ్లిష్ బోధించేలా సర్దుబాటు చేసి విద్యాశాఖ అధికారులు మిన్నకుండిపోయారు. ఇంగ్లిష్ టీచర్ల కొరత కాస్త విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఆటంకంగా మారింది. వీడని చిక్కుముడి.. ఇంగ్లిష్ టీచర్ల పదోన్నతుల వివాదంపై ఈ ఏడాది ఫిబ్రవరి 5న హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పదోన్నతులపై దాఖలైన కేసులన్నీ డిస్పోజ్ చేస్తూ ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పదోన్నతులు కల్పించాలని తుది తీర్పునిచ్చింది. ఈ తీర్పు వెలువడి ఇప్పటికీ రెండు నెలలు దాటినా చిక్కుముడి వీడలేదు. మరోవైపు అర్హులైన ఎస్జీటీలకు అన్యాయం జరిగింది. మిగిలిన సబ్జెక్టులతో పోల్చుకుంటే ఇంగ్లిష్ పదోన్నతులు పొందే వారు రెండేళ్ల సీనియార్టీని కోల్పోయారు. వీరిలో కొందరు ఉద్యోగ విరమణ పొందారు. అయినా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికీ మేల్కొనలేదు. ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ పాఠ్యాంశాల బోధనకు తీవ్ర ఆటంకం తీవ్రంగా నష్టపోతున్న విద్యార్థులు ఉమ్మడి జిల్లాలో ఆగిన పదోన్నతులు హైకోర్టు ఉత్తర్వులిచ్చినా పదోన్నతుల్లో వీడని చిక్కుముడి రాష్ట్రంలో ఒక్క ఉమ్మడి ‘అనంత’ జిల్లాలోనే ఈ దుస్థితి -
నాటుసారా కేసుల్లో పట్టుబడితే రూ.లక్ష జరిమానా
అనంతపురం: నాటు సారా కేసుల్లో పట్టుబడితే రూ.లక్ష జరిమానా విధిస్తామని ప్రొహిబిషన్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య హెచ్చరించారు. నవోదయం 2.0 కార్యక్రమంపై ఎకై ్సజ్ అధికారులతో స్థానిక ఆ శాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన సమీక్షించారు. పాత నేరస్తులు, అనుమానితులపై నిఘా ఉంచి, వారిని బైండోవర్ చేయాలన్నారు. తిరిగి నాటు సారా కేసుల్లో పట్టుబడితే రూ.లక్ష జరిమానా చెల్లించేలా కఠినంగా వ్యవహరించాలన్నారు. నాటుసారా తయారు చేసినా, రవాణా చేసినా పీడీ చట్టం కింద కేసు నమోదుకు సిఫారసు చేయాలన్నారు. కర్ణాటక మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. జిల్లాలో కల్తీ కల్లు పూర్తిగా నిర్మూలించాలన్నారు. మద్యంషాపులు, బార్లలో ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లాప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి. రామమోహన్ రెడ్డి, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రేవతి, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీరామ్, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, టాస్క్ఫోర్స్ సీఐ జయంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతి
బత్తలపల్లి: విద్యుత్ షాక్కు గురైన వివాహితను కాపాడే ప్రయత్నంలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇదే ఘటనలో గాయపడిన ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు... బత్తలపల్లి మండలం ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన కేశవనాయుడు రామాపురం గ్రామానికి చెందిన రామాంజనేయులు పొలాన్ని కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంట సాగు చేశాడు. ఈ క్రమంలో అడవి పందులు పంటను నాశనం చేస్తున్నాయని గుర్తించిన ఆయన జీఏ వైరుతో పొలం చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం గొర్రెల కాపరులు మేపునకు జీవాలను తోలుకు రావడంతో వారు ప్రమాదం బారిన పడకూడదని భావించిన ఆయన నాలుగు రోజుల క్రితం పొలం చుట్టూ విద్యుత్ కంచెను తొలగించాడు. అయితే విద్యుత్ స్తంభం నుంచి పొలం వరకూ లాగిన వైరును తొలగించడం మరచిపోయాడు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన వివాహిత లక్ష్మి శుక్రవారం దుస్తులు ఉతికేందుకు అటుగా వెళ్లింది. ఆమె వెంట వెళ్లిన కుమారుడు విద్యుత్ తీగ వైపుగా వెళుతుండడం గమనించి కాపాడే ప్రయత్నంలో అటుగా అడుగు వేసింది. అయితే అక్కడ నేల తేమగా ఉండడంతో షాక్కు గురైంది. ఆ సమయంలో గట్టిగా కేకలు వేయడంతో అక్కడికి సమీపంలో ఉన్న నాగభూషణ వెళ్లి కట్టెతో తీగను కొట్టాడు. ఆ సమయంలో తీగ ఎగిరి నాగభూషణను తాకడంతో షాక్కు గురై కుప్పకూలాడు. విషయాన్ని గమనించగానే తల్లిదండ్రులు ఓబులేసు (69), లింగమ్మ ఒకరి వెనుక మరొకరు పరుగున వెళ్లి నాగభూషణు పైకి లేపే ప్రయత్నం చేయడంతో వారు కూడా షాక్కు గురయ్యారు. విషయాన్ని అక్కడికి సమీపంలో ఉన్న రవీంద్రారెడ్డి గమనించి వెంటనే ట్రాన్స్ఫార్మర్ వద్దకెళ్లి విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. షాక్కు గురైన నలుగురూ అపస్మారక స్థితిలో ఉండడంతో గ్రామస్తులు వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందేలోపు ఓబులేసు మృతి చెందాడు. మిగిలిన ముగ్గురికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆర్డీటీ ఆస్పత్రికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న ట్రాన్స్కో ఏఈ శివయ్య గ్రామానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. ఘటనపై బత్తలపల్లి ఎస్ఐ సోమశేఖర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
‘ఉపాధి’ డిమాండ్ల సాధనకు 21న పాదయాత్ర
అనంతపురం అర్బన్: ఉపాధి కూలీల సమస్యల పరిష్కారానికి, డిమాండ్ల సాధనకు ఈ నెల 21న ‘కష్టజీవుల పాదయాత్ర’ చేపట్టనున్నట్లు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాసం) రాష్ట్ర కార్యదర్శి బి.కేశవరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపాఽధి పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులేస్తున్నాయని మండిపడ్డారు. ఉపాధి భృతిగా ప్రతి కూలీకి ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ కూలీలకు బకాయి పడిన రూ.37 కోట్ల వేతనాన్ని తక్షణమే చెల్లించాలన్నారు. డిమాండ్ల సాధనకు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకెళ్లే క్రమంలో కష్టజీవుల పాదయాత్రను నాడు ఉపాధి హామీ పథకం ప్రారంభించిన నార్పల మండలం బండ్లపల్లి గ్రామం నుంచి ఈ నెల 21న ప్రారంభించనున్నామన్నారు. 22 సాయంత్రం 4.39 గంటలకు అనంతపురంలోని కృష్ణకళామందిర్లో బహిరంగసభ ఉంటుందన్నారు. కార్యక్రమానికి వ్యకాసం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు, మాజీ ఎంపీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్, వ్యకాసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, తదితరులు పాల్గొంటారన్నారు. బహిరంగసభకు పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు నాగరాజు, పెద్దయ్య, రామాంజనేయులు, నరేష్ పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కేశవరెడ్డి -
చర్చిపై నుంచి పడి యువకుడి మృతి
తాడిపత్రి టౌన్: గుడ్ ప్రైడే వేళ చర్చిపై నుంచి కిందపడి ఓ యువకుడు మృతిచెందాడు. వివరాలు.. తాడిపత్రిలోని నందలపాడులో నివాసముంటున్న జయమ్మ, మనోహర్ దంపతుల కుమారుడు విక్టర్కుమార్ (25)కు మతిస్థిమితం సరిగా లేదు. గుడ్ ఫ్రైడే ని పురస్కరించుకుని గురువారం రాత్రి చర్చి అలంకరణలో భాగంగా పిల్లలతో చాలా సేపు ఆడుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున చర్చిపైకి చేరుకున్న విక్టర్కుమార్.. ప్రమాదవశాత్తు అదుపు తప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికుల సాయంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ లోపు పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వృద్ధురాలి ఆత్మహత్య యల్లనూరు: మండలంలోని గడ్డంవారిపల్లికి చెందిన రాగిపిండి చిన్న అంకిరెడ్డి భార్య వెంగమ్మ (80) ఆత్మహత్య చేసుకుంది. గత నెలలో చెయ్యి విరిగిన ఆమెకు కుటుంబసభ్యులు చికిత్స చేయించారు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆమె శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త అంకిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. రైల్లో ప్రయాణికుడి మృతి గుత్తి: రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఉన్నఫళంగా మృతి చెందాడు. వివరాలు.. తెలంగాణలోని యాదాద్రికి చెందిన భీమన్న (42) బెంగుళూరుకు వలస వెళ్లి బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజులు క్రితం సొంతూరుకు వెళ్లిన ఆయన శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి రైలులో బెంగళూరుకు ప్రయాణమయ్యాడు. గుత్తి జీఆర్పీ పరిధిలో ప్రయాణిస్తుండగా బోగీలోనే కుప్పకూలాడు. రైలు స్టేషన్కు చేరుకోగానే వైద్యులు చేరుకుని పరీక్షించారు. అప్పటికే గుండెపోటుతో భీమన్న మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఘటనపై జీఆర్పీ ఎస్ఐ నాగప్ప దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి దుర్మరణం అనంతపురం: నగర శివారులో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన మేరకు... రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన ఎర్రగుంట్ల రంగారెడ్డి (46) శుక్రవారం ఉదయం అనంతపురంలో జరుగుతున్న శుభకార్యానికి హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. 44వ జాతీయ రహదారిపై ఆర్కే ఫంక్షన్ హాల్ ఎదురుగా ప్రయాణిస్తుండగా ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన చంద్రబాబు కొట్టాలకు చెందిన బైక్ మెకానిక్ షేక్ రహమాన్ ఢీకొన్నాడు. ఘటనలో కిందపడిన రంగారెడ్డి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మామిడి చెట్ల నరికివేత పెద్దవడుగూరు: మండలంలలోని గ్రామానికి చెందిన సూర్యనారాయణ, లక్ష్మన్న, పుల్లన్న, సన్న నారాయణ, పెద్ద నారాయణ, అనిల్కు చెందిన 105 మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. మూడేళ్ల క్రితం పెన్నానదీ పరివాహక ప్రాంతంలో మామిడి మొక్కలు నాటుకున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మొక్కలను నరికి వేయడంతో రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం, స్నిప్పర్ డాగ్ను రంగంలో దించి నిందితుల ఆధారాలను సేకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
క్రేజీ గేమ్ క్రికెట్. పొట్టి ఫార్మాట్, వన్డే, టెస్టు ఏదైనా సరే ఆట చూసేందుకు అభిమానులు అమితాసక్తి కనబరుస్తారు. ఆటను ఆటగా ఆస్వాదించినంత వరకు బాగానే ఉంటుంది. అయితే కొంతమంది కుర్రాళ్లు ఆ ఆటపై పందెం కాసి సునాయాసంగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. పాకెట్ మనీ
● రోజూ రూ.150 కోట్ల వ్యాపారం ● తాడిపత్రి కేంద్రంగా భారీగా బెట్టింగ్ ● ఆర్థికంగా చితికి... చైన్స్నాచర్లుగా మారుతున్న యువత ● ఇంటర్మీడియెట్ విద్యార్థులూ బెట్టింగ్ మీద ఆసక్తి ● ఐపీఎల్ మ్యాచ్లతో ఆర్థికంగా పతనావస్థకు సాక్షి ప్రతినిధి, అనంతపురం : క్రికెట్.. ప్రేక్షకులను రంజింపచేయడమేమో కానీ బెట్టింగ్ రూపంలో పలువురి జీవితాలను కబళిస్తోంది. కుటుంబాలకు కుటుంబాలే దుఃఖసాగరంలో మునిగిపోతున్న దుస్థితి. ఎక్కడో జరుగుతున్న ఆటపై ఇక్కడ పందెం కాస్తూ క్రికెట్ను అతిపెద్ద జూద స్థావరంగా మార్చుకున్న యువతకు ఇదొక శాపంగా పరిణమించింది. పండ్ల తోటలు, మెట్ట పైర్లకు వేదికగా, కరువు ప్రాంతంగా ముద్రపడిన ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు అతిపెద్ద బెట్టింగ్ కేంద్రంగా మారి వందలాది కుటుంబాలను చిదిమేస్తోంది. ఐపీఎల్ మ్యాచ్లు ఒక్కరోజులోనే ఎంతోమంది యువకుల జీవితాలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఒక్కో మ్యాచ్కు రూ.150 కోట్ల బెట్టింగ్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక్కో ఐపీఎల్ మ్యాచ్కు రూ.150 కోట్లకుపైగా బెట్టింగ్ జరుగుతున్నట్టు అంచనా. బెట్టింగ్లో ఎక్కువగా 30 ఏళ్లలోపు యువత పాల్గొంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మ్యాచ్ మొత్తానికి ఒక పందెం, ఓవర్ టు ఓవర్ ఇలా రకరకాలుగా పందెం కాస్తున్నారు. నాలుగు రోజుల కిందట పంజాబ్ కింగ్స్ లెవెన్, కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరిగింది. ఇందులో పంజాబ్ కింగ్స్ లెవెన్ 111 పరుగులు మాత్రమే చేసింది. కోల్కతా గెలుస్తుందని వెయ్యికి లక్ష రూపాయలు పందెం జరిగింది. పంజాబ్ ఓడిపోతుందని బెట్టింగ్ కాసిన వాళ్లు బికారులైపోయారు. ఆర్థికంగా చితికి దొంగలుగా మారి.. నాలుగు రోజుల క్రితం ఆరుగురు చైన్స్నాచర్లను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. వీరి పూర్వాపరాలు ఆరా తీస్తే.. అందరూ క్రికెట్ బెట్టింగ్ ఆడి ఆర్థికంగా అప్పులపాలైన వారే. అప్పుల నుంచి గట్టెక్కేందుకు చైన్స్నాచర్లుగా మారారు. ఎక్కడ ఒంటరి మహిళలు కనిపించినా బంగారు గొలుసులు లాక్కెళ్లడం, వచ్చిన డబ్బుతో జల్సా చేయడం.. ఇదీ పరిస్థితి. వీళ్లే కాదు ధర్మవరం, కదిరి, హిందూపురం, అనంతపురం, ఉరవకొండ ఇలా పలు ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగుల్లో నష్టపోయిన వారు దొంగలుగా మారారు. కొంతమంది అప్పుల వారి నుంచి ఒత్తిడి భరించలేక బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులకు గర్భశోకం మిగుల్చుతున్నారు. తాడిపత్రి కేంద్రంగా బుకీలు గంజాయి, మట్కాకే కాదు ఇప్పుడు బుకీలకూ తాడిపత్రి కేంద్ర బిందువైంది. గొలుసు దొంగలు (చైన్స్నాచర్లు) దొరికిన రెండు రోజులకే తాడిపత్రిలో క్రికెట్ బుకీలు పోలీసులకు చిక్కారు. దొరికింది ఏడుగురే అయినా ఇంకా చాలామంది ఉన్నట్టు పోలీసుల అంచనా. అమాయక యువకులకు ఆశ చూపి బెట్టింగ్ ఉచ్చులోకి దించుతున్నారు. సర్వస్వం కోల్పోయాక కానీ కుర్రాళ్లు తెలుసుకోలేరు. ఇంటర్మీడియెట్ కుర్రాళ్లు సైతం బెట్టింగ్ ఉచ్చులో ఇరుక్కుని విలవిలలాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ఒక విషవలయంలా మారింది. జీవితాలు ఫణంగా పెట్టొద్దు పంపాచారి, షాకీర్, నాగార్జున, ఫజిల్ అహ్మద్ ఈ నలుగురూ పేకాట, క్రికెట్ బెట్టింగ్లలో నష్టపోయి దొంగలుగా మారారు. ఈజీ మనీకోసం ఇలా బెట్టింగ్.. ఆ తర్వాత దొంగతనాలు చేయడం జరుగుతోంది. యువత కెరీర్ చూడాలి కానీ బెట్టింగ్ వైపు కాదు. క్రికెట్ బెట్టింగ్ ప్రమాదకరం. ఆటను ఆటవరకే ఆస్వాదించాలి కానీ బెట్టింగ్వైపు చూడకూడదు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆర్థిక స్థితిగతులపై ఒక నిఘా వేసి ఉంచాలి. పేకాట, బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్వైపు వెళ్లి జీవితాలు ఫణంగా పెట్టకండి. –పి.జగదీష్, ఎస్పీ, అనంతపురం -
వడదెబ్బతో వృద్ధురాలి మృతి
బుక్కరాయసముద్రం: తీవ్రమైన ఎండల తో ఓ వృద్ధురాలు వడదెబ్బకు గురై మృతి చెందింది. ఓబులాపురం గ్రామానికి చెందిన మహానందరెడ్డి శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తోటకు వెళ్లారు. కాసేపటి తర్వాత ఆయన తల్లి రామక్క (80) కూడా నడుచుకుంటూ తోటకు వెళ్లింది. కాసేపు తోటంతా కలియదిరిగి 11.30 గంటల తర్వాత తిరిగి ఆమె నడుచుకుంటూ ఇంటికి చేరుకుంది. భగభగమండే ఎండలోనే తిరగడంతో ఆమె వడదెబ్బకు గురైంది. కాస్త అలుపు వచ్చినట్టవడంతో ఇంటి బయటే మంచంపై పడుకుంది. గంట తర్వాత కుమారుడు, కోడలు వచ్చారు. నీళ్లు తాగాలని చెబుతూ లేపడానికి ప్రయత్నించగా ఆమెలో చలనం లేదు. నిశితంగా పరిశీలించగా అప్పటికే ఆమె ఊపిరి ఆగిపోయింది. వడదెబ్బతోనే ప్రాణం విడిచిందని నిర్ధారించుకున్నారు. ఈమెకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి ఓబులాపురం వెళ్లి రామక్క మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న నాన్టీచింగ్ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సమగ్రశిక్ష ఏపీసీ టి.శైలజ సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు www.samagrashik shaatp.blogspot.com వెబ్సైట్ ద్వారా శనివారం నుంచి ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 42 ఏళ్ల వరకు అర్హులని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగినులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుందని తెలిపారు. రోస్టర్ వారీగా పోస్టుల వివరాలు, గౌరవ వేతనం, విద్యార్హత వివరాలు వెబ్సైట్లో ఉంచిన నోటిఫికేషన్ ద్వారా పొందాలని ఏపీసీ వివరించారు. ఖాళీల వివరాలు ఇలా... ● టైప్–3లో మొత్తం 43 ఖాళీలు (హెడ్కుక్– 8, అసిస్టెంట్ కుక్–19, డేఅండ్నైట్ వాచ్ ఉమెన్–5, స్వీపర్–6). ● టైప్–4లో మొత్తం 28 ఖాళీలు (హెడ్కుక్–6, అసిస్టెంట్ కుక్–14, చౌకీదార్–8) ‘కూలీల హాజరు పెంచండి’ ఆత్మకూరు: ఉపాధి కూలీల హాజరు శాతాన్ని పెంచాలని సంబంధిత అధికారులను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ మల్లెల శివప్రసాద్ ఆదేశించారు. గొరిదిండ్ల పంచాయతీలో చేపట్టిన ఉపాధి పనులను శుక్రవారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. ప్రతి పంచాయతీలో కూలీల సంఖ్య పెంచి పనుల లక్ష్యం త్వరగా పూర్తి చేయాలన్నారు. రైతులు తమ పొలాల్లో నీటి కుంటలను ఏర్పాటు చేసుకుంటే భూములు సారవంతమవుతాయన్నారు. డ్రైల్యాండ్ హార్టీకల్చర్లో భాగంగా మెట్ట భూముల్లో పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ సలీంబాషా, ఏపీడీ చెన్నకేశవులు, ఈసీ బబ్లు, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీలు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఆదాయానికి ‘ప్రైవేటు’ గండి
ఉరవకొండ: ప్రైవేట్ వాహనాల దెబ్బతో ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతోంది. అధికార పార్టీ అండదండలతో ప్రైవేట్ ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా ప్రయాణికులను చేరవేస్తున్నారు. ఉరవకొండ ఆర్టీసీ డిపోలో సూపర్ లగ్జరీ–4, అల్ట్రా డీలక్స్–4, ఎక్స్ప్రెస్–7 ఆర్డినరీ –44 చొప్పున మొత్తం 59 బస్ సర్వీసులు ఉన్నాయి. రోజూ 21వేల కిలోమీటర్లు తిరుగుతూ 20 వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ప్రతి నెలా ఆర్టీసీకి రూ.10 లక్షల వరకు ఆదాయం వస్తుండేది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారిపోయింది. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం అధికార టీడీపీ నాయకులతో ప్రైవేట్ ఆపరేటర్లు ఒప్పందం కుదుర్చుకుని ఏడు సీట్ల సామర్థ్యం కలిగిన 10 ఎర్టిగా కార్లను కొనుగోలు చేశారు. వీటిని ఉరవకొండ – అనంతపురానికి 8 సింగిల్స్ తిప్పుకోవాలని నిర్ణయించారు. సాధారణంగా ఉరవకొండ నుంచి అనంతపురానికి ఆర్టీసీ బస్సులో టిక్కెట్ ధర రూ.85 ఉంది. ఎర్టిగా వాహనంలో ఒక్కొక్కరికి వంద రూపాయల చార్జీ వసూలు చేస్తున్నారు. చిన్న, పెద్ద అందరికీ ఇదే ధర వర్తిస్తుంది. నిబంధనల ప్రకారం ప్రైవేట్ వాహనాలు ప్రయాణికులను తరలించాలంటే ఎల్లో బోర్డు ఉండాలి. అయితే వైట్బోర్డు కలిగిన వాహనంలోనే యథేచ్ఛగా తరలించేస్తున్నారు. అంతేకాదు పెట్రోలుతో నడిచే ఈ వాహనాలను ఆపరేటర్లు ఆదాయం కోసం గ్యాస్ సిలిండర్లను అమర్చుకుని తిప్పుతున్నారు. నాన్స్టాప్ కావడం, సమయం కలిసి రావడంతో ధర ఎక్కువైనా కొందరు ప్రయాణికులు వీటిలో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రైవేట్ వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా తిప్పడం వల్ల ఆర్టీసీ ఆదాయానికి నెలకు రూ.2.50 లక్షల దాకా కోత పడుతోంది. ఎక్కడైనా అధికారులు పట్టుకుంటే తమ పేరు చెప్పాలని టీడీపీ నాయకులు చెప్పడంతో ప్రైవేట్ ఆపరేటర్లు రెచ్చిపోతున్నారు. ఆదాయం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిపో ఎదుటే ప్రైవేట్ వాహనాల హల్చల్ ఆర్టీసీ ప్రయాణికులను ఎక్కించుకుంటున్న వైనం టీడీపీ నాయకుల అండతో నిబంధనల ఉల్లంఘనప్రైవేట్ వాహనాలను కట్టడి చేస్తాం ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ప్రైవేట్ వాహనాలను కట్టడి చేస్తాం. ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టాలని చూస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఉరవకొండ డిపో నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకొచ్చేలా కృషి చేస్తాం. – హంపన్న, డిపో మేనేజర్, ఉరవకొండ ఆ వాహనాలను సీజ్ చేస్తాం ఉరవకొండ ఆర్టీసీ డిపో వద్దనే ప్రైవేట్ వాహనాలు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న విషయం మా దృష్టికి వచ్చింది. వైట్ బోర్డులు పెట్టుకుని ఇష్టారాజ్యంగా ఏడు నుంచి ఎనిమిది మందిని ఒకే వాహనంలో తీసుకెళ్తూ ఆర్టీసీకి నష్టం కల్గిస్తున్నారు. త్వరలోనే దాడులు నిర్వహించి ఆ వాహనాలను సీజ్ చేస్తాం. – రాజాబాబు, ఆర్టీఓ, గుంతకల్లు -
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
అనంతపురం: టీడీపీ నేతల్లో విభేదాలు భగ్గుమన్నాయి. ప్రజాప్రతినిధులు తమను గుర్తించడం లేదని, పోస్టులు, పనుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని రభస చేశారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి టీజీ భరత్ సమక్షంలోనే లుకలుకలు బయటపడ్డాయి. శుక్రవారం అనంతపురంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో జిల్లా ఇన్చార్జ్ మంత్రి సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రీవెన్స్ చేపట్టారు. శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీపై పలువురు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో మండల ఇన్చార్జ్గా ఉంటూ ఇబ్బందులు పడుతూనే పార్టీ కోసం కష్టపడ్డామని, ఇప్పుడు తమను ఏమాత్రమూ గుర్తించకుండా ఎమ్మెల్యే అన్యాయం చేస్తున్నారని యల్లనూరు మండలానికి చెందిన వాసాపురం బాబు అలియాస్ మనోహర్ నాయుడు ఫిర్యాదు చేశారు. స్టోర్ డీలర్షిప్పులు, ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాల్లో తమ వర్గానికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే వర్గానికి చెందిన బొప్పేపల్లి రవికుమార్ రెడ్డి కల్పించుకోవడంతో వాగ్వాదం మొదలైంది. వాసాపురం బాబు, రవికుమార్రెడ్డి పరస్పరం దాడి చేసుకునే స్థాయికి వెళ్లారు. ఇన్చార్జ్ మంత్రి కల్పించుకుని ఇద్దరినీ అతిథిగృహం నుంచి బయటకు పంపించారు. బయటకు వచ్చిన వాసాపురం బాబుపై బొప్పేపల్లి రవికుమార్రెడ్డి తన అనుచరులతో కలసి దాడికి యత్నించాడు. దీంతో రవికుమార్రెడ్డి చొక్కాను వాసాపురం బాబు అనుచరులు గట్టిగా పట్టుకోగా.. అది చిరిగిపోయింది. సమీపంలోనే ఎస్పీ కార్యాలయం ఉన్నప్పటికీ అక్కడే రాళ్లు రువ్వుకునే స్థాయికి వెళ్లారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవను సద్దుమణిగించారు. అనంతరం శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, రవికుమార్రెడ్డి కలసి వెళ్లి ఎస్పీ కార్యాలయంలో వాసాపురం బాబుపై ఫిర్యాదు చేశారు. తన్నుకున్న తమ్ముళ్లు జిల్లా ఇన్చార్జ్ మంత్రి సమక్షంలోనే రభస నాయకుల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులు లీలావతి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తోంది శింగనమల: ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీని డమ్మీ చేసి తల్లి బండారు లీలావతి పెత్తనం చెలాయిస్తున్నారని టీడీపీకి చెందిన వెస్ట్ నరసాపురం ఎంపీటీసీ సభ్యురాలు అంజినమ్మ, ప్రసాద్నాయక్ దంపతులు ఆరోపించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం దక్కడం లేదని వారు శుక్రవారం అనంతపురం ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో జిల్లా ఇన్చార్జ్ మంత్రి టీజీ భరత్కు ఎమ్మెల్యే సమక్షంలోనే ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి పది నెలలైనా ప్రజా సమస్యల గురించి ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ప్రజా సమస్యలు తీర్చకుండా పదవిలో ఉండి అవమానం పొందడం కన్నా ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసి, వ్యక్తిగత గౌరవం కాపాడుకుంటామని స్పష్టం చేశారు. టూమెన్ కమిటీకి ప్రాధాన్యత ఏదీ? శింగనమల నియోజకవర్గంలో ఫీల్డ్ అసిసెంట్ పోస్టులను ఎమ్మెల్యే వర్గానికి చెందినవారితోనే భర్తీ చేశారని, టూమెన్ కమిటీ సిఫార్సు చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఓ టీడీపీ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. తన గోడును ఇన్చార్జ్ మంత్రికి తెలియజేసేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సదరు కార్యకర్త తీవ్రస్థాయిలో వాగ్వాదం చేశాడు. పోలీసులు జోక్యం చేసుకుని అతనికి మంత్రిని కలిసే అవకాశం కల్పించారు. -
కూటమిలో సమస్యలు చిన్నవే
అనంతపురం టవర్క్లాక్: కూటమి పార్టీల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని సర్దుకుంటూ ముందుకెళ్తామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా అనంతపురం వచ్చిన ఆయన ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. నామినేటెడ్ పదవుల భర్తీ, తదితర విషయాల్లో కూటమి నేతల మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. ఇలాంటి వాటిని పరిష్కరించేందు కోసమే ప్రతి జిల్లాకూ ఇన్చార్జ్ మంత్రులను నియమించారన్నారు. టీటీడీ గోశాలపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలూ లేవని, గోవుల మృతికి కారణాలు అనుకోకుండా జరిగేవేనని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, గుమ్మనూరు జయరామ్, బండారు శ్రావణిశ్రీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ పాల్గొన్నారు. -
తప్పులకు ఎంఈఓలు, హెచ్ఎంలదే బాధ్యత
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖలో 117 జీఓకు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పకడ్బందీగా, పారదర్శకంగా జరగాలని, ఏ చిన్న తప్పు జరిగినా ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులదే పూర్తి బాధ్యత అని అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల విద్యాశాఖ అధికారులు ఎం.ప్రసాద్బాబు, క్రిష్టప్ప హెచ్చరించారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్న నేపథ్యంలో పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ వేగవంతం చేశారు. తుదిదశకు చేరుకోవడంతో ఎలాంటి తప్పులూ ఉండకూడదనే ఉద్దేశంతో శుక్రవారం అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో ఉమ్మడి జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రెండు జిల్లాల విద్యాశాఖ అధికారులతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లు హాజరయ్యారు. 15 రోజుల నుంచి సాగుతున్న ఎక్సర్సైజ్లో భాగంగా చిన్నచిన్న పొరపాట్లు జరిగాయని, డీఎస్పీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన సమయం దగ్గర పడడంతో స్కూళ్ల వారీగా ఎన్ని పోస్టులున్నాయి... ఎన్ని ఖాళీలున్నాయనేది పక్కాగా తేల్చాల్సి ఉందని డీఈఓలు స్పష్టం చేశారు. హెచ్ఎంలు, ఎంఈఓలు ప్రతిపాదించిన స్కూళ్ల వివరాలు, నిబంధనల ప్రకారం జరిగాయా లేదా? అని పరిశీలించారు. గుర్తించిన తప్పిదాలను సవరించారు. అన్నమూ లేదు.. తాగునీళ్లూ లేవు విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ సమావేశానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాజరైన ఎంఈఓలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంటెంట్లకు కనీసం భోజన వసతి కల్పించలేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమావేశంలో పాల్గొన్నారు. అసలే ఎండవేడిమి దంచేస్తోంది. మధ్యాహ్నం వరకు కనీసం తాగేనీళ్లు కూడా అందుబాటులో ఉంచలేదు. సమావేశానికి హాజరైన వారు తరచూ నీళ్ల కోసమని బయటకు వెళ్లడం కనిపించింది. మధ్యాహ్నం పైన చల్లని తాగునీరు ఏర్పాటు చేశారు. రెండు జిల్లాల విద్యాశాఖ అధికారులు ఉన్నా...మధ్యాహ్నం భోజనం విషయం గురించి పట్టించుకోలేదు. నిబంధనల మేరకే పునర్వ్యవస్థీకరణ ఉమ్మడి జిల్లా డీఈఓల ఆదేశం -
తలపై రాయిపడి యువకుడి మృతి
కళ్యాణదుర్గం రూరల్: నిద్రిస్తున్న యువకుడి తలపై రాయిపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్యాణదుర్గం మండలం మల్లాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వేణు, సునందమ్మ దంపతులు కరూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. బుధవారం రాత్రి భోజనం ముగించుకున్న అనంతరం ఇంటి ఆవరణలో నిద్రకు ఉపక్రమించారు. అర్థరాత్రి సమయంలో మిద్దైపె నుంచి ప్రమాదవశాత్తు రాయి నిద్రిస్తున్న వేణు తలపై పడడంతో తీవ్ర గాయమైంది. భార్య గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని వెంటనే స్థానిక సీహెచ్సీకి తరలించారు. అధిక రక్తస్రావంతో అప్పటికే వేణు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య గుంతకల్లు: బీటెక్లో ఒక సబ్జెక్ట్ తప్పడంతో మనస్తాపం చెంది ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... కూడేరుకు చెందిన జాఫర్వలి కుమారుడు పి.మహమ్మద్ జావేద్ (18) గుత్తిలోని గేట్స్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. గుంతకల్లులోని ద్వారాక నగర్లో నివాసముంటున్న బంధువుల ఇంట్లో ఉంటూ రోజూ కళాశాలకు వెళ్లి వచ్చేవాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినట్లుగా గుర్తించి మానసికంగా కుదేలయ్యాడు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం 7 గంటలకు బయటకు వచ్చిన జావేద్ రాత్రి 9 గంటలవుతున్నా ఇంటికి చేరుకోలేదు. ఎన్ని సార్లు ఫోన్ చేసిన జావేద్ లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే కుటుంబసభ్యులు వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జావేద్ సెల్ఫోన్ లోకేషన్ ఆధారంగా తిమ్మనచెర్ల రైల్వేస్టేషన్ సమీపంలో చేరుకుని పరిశీలించగా పట్టాలపై రెండుగా విడిపోయిన జావేద్ శరీర భాగాలు కనిపించాయి. ఘటనపై జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. యువకుడి దుర్మరణం పామిడి: అతి వేగం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని అశోక్నగర్కు చెందిన శివకుమార్ కుమారుడు సుమంత్ (25) వ్యక్తిగత పనిపై గురువారం ఉదయం గుంతకల్లుకు వెళ్లాడు. పని ముగించుకున్న అనంతరం ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన.. పామిడి గ్రామ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై అయ్యప్ప స్వామి ఆలయం వద్దకు చేరుకోగానే వేగాన్ని నియంత్రించుకోలేక నేరుగా వెళ్లి కల్వర్టు రక్షణ గోడను ఢీకొన్నాడు. ఘటనలో సుమంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలను బట్టి సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
బాధితులకు ఇదేనా మీరు చేసే న్యాయం?
అనంతపురం అర్బన్: ‘మీకు ఎస్సీ, ఎస్టీలన్నా, వారి సమస్యలన్నా చిన్న చూపు. బాధితుల సమస్యలు పరిష్కరించడంపై శ్రద్ధ చూపరు. ఏళ్లు గడుస్తున్నా సమస్యలను పరిష్కరించడం లేదు’ అంటూ అధికారులను సంఘాల నాయకులు నిలదీశారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్లో కలెక్టర్ వి.వినోద్కుమార్తో పాటు జిల్లా ఎస్పీ పి.జగదీష్, డీఆర్ఓ ఎ.మలోల, ఆర్డీఓ కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్, సాంఘిక సంక్షేమశాఖాధికారి రాధిక, అదనపు ఎస్పీ డీవీ రమణమూర్తి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 238 అర్జీలు అందాయి. ఒక బాధితురాలికి న్యాయం చేసే విషయంలో డీఆర్ఓతో ఎరికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా వీరా వాగ్వాదానికి దిగారు. నగర పరిధిలో నివాసముంటున్న ఎరికల కులానికి చెందిన మహిళ సామూహిక అత్యాచారానికి గురైందన్నారు. అప్పట్లో పోరాటం చేస్తే రూ. లక్ష ఆర్థిక సాయం అందించారన్నారు. జీఓ 95 ప్రకారం బాధితురాలికి ఐదు సెంట్ల స్థలం ఇవ్వాల్సి ఉందని, తొమ్మిదేళ్లుగా అర్జీలిస్తున్నా బాధితురాలికి న్యాయం చేయలేద న్నారు. ఈ విషయంలో ఆర్డీఓ, తహసీల్దారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. డీఆర్ఓ మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటానన్నారు. వినతుల్లో కొన్ని... ● తమ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించారంటూ కళ్యాణదుర్గం మండలం లక్ష్మీపురం ఎస్టీ కాలనీకి చెందిన వాలేనాయక్ ఫిర్యాదు చేశాడు. కంబదూరు మండలం పాలూరు గ్రామ పొలం సర్వే నంబరు 80–1లో 3.50 ఎకరాల భూమి తన తల్లి పేరిట ఉందని, ఈ భూమిని గ్రామంలోని ఒక వ్యక్తి, తహసీల్దారు కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగులు కలిసి ఆక్రమించారని తెలిపారు. దీనిపై ఆర్డీఓ, తహసీల్దారు, పోలీసులు భూమి హద్దులు వేసినా ఆక్రమణ దారులు తొలగించారని, భూమిలోకి వస్తే చంపుతామంటూ బెదిరిస్తున్నారని వాపోయాడు. ● 20 నెలలుగా తనకు వేతనం అందడం లేదంటూ నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ ఉద్యోగి సూర్యనారాయణ విన్నవించాడు. డ్యూటీపై ఎక్కడా తిరగనివ్వడం లేదని, ఆఫీసులో కూర్చోబెడుతున్నారని వాపోయాడు. ● రుణానికి సంబంధించి సబ్సిడీ మంజూరులో అధికారులు జాప్యం చేస్తున్నారని యల్లనూరు మండలం పాతపల్లికి చెందిన పి.విజయ ఫిర్యాదు చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రుణం మంజూరైందని, అయితే సబ్సిడీ మంజూరు క్రమంలో ఫైల్ను బ్యాంకుకు పంపకుండా ఎంపీడీఓ కార్యాలయ అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులను నిలదీసిన ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు ప్రత్యేక గ్రీవెన్స్లో 238 వినతులు భద్రతా ప్రమాణాలు పాటించాలి పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆరు నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. రసాయనాలపై కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత జిల్లా మినరల్ ఫండ్ ద్వారా తాగునీరు, విద్య, వైద్యానికి సంబంధించి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కల్యాణ యోజన (పీఎంకేకేకేవై)పై గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, హిందూపురం ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, జేసీ అస్మిత్రెడ్డి, దగ్గుపాటి ప్రసాద్తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 31 నాటికి రూ.52.66 కోట్ల నిధులు నూతన పనులకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇందులో నియోజకవర్గానికి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల పనులు మంజూరు చేసేందుకు కమిటీ ప్రతిపాదన చేసిందని చెప్పారు. సమావేశంలో గనుల శాఖ డీడీ వెంకటేశ్వర్లు, తాడిపత్రి ఏడీ ఓబుళరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఉరకలెత్తిన దున్నలు
కణేకల్లు: స్థానిక చిక్కణ్ణేశ్వరస్వామి ఉత్సవాల సందర్భంగా గురువారం నిర్వహించిన దున్నపోతుల రాతిదూలం పోటీలు ఆసక్తిగా సాగాయి. స్థానిక జెడ్పీఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదిగా పోటీలు నిర్వహించారు. హోరాహోరీగా సాగిన పోటీల్లో రాతి దూలాన్ని లాగుతూ దున్నపోతులు ఉరకలేయడాన్ని చూసి ప్రజలు కేకలు, ఈలలతో హోరెత్తించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోటీలు సాయంత్రం 4 గంటలకు ముగిసాయి. రైతు కె.ముజ్జుకు చెందిన దున్నపోతులు 15 నిమిషాల వ్యవధిలో 2,608.10 అడుగుల మేర దూరాన్ని రాతిదూలాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. మరో రైతు తిప్పేష్కు చెందిన దున్నపోతులు ద్వితీయ స్థానంలో, రైతు జి.రిజ్వంత్కు చెందిన దున్నపోతులు మూడో స్థానంలో నిలిచాయి. విజేత దున్నల యజమానులను అభినందిస్తూ సర్పంచ్ దంపతులు నిర్మల, డాక్టర్ సోమన్నతో నగదు పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో కణేకల్లు మేజర్ పంచాయతీ ఈఓ ప్రసాద్, కణేకల్లు చెరువు సంఘం అధ్యక్షుడు బీటీ రమేష్, స్థానికులు లాలెప్ప, అనిల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాతిదూలం లాగుతున్న దున్నపోతులు -
మొక్కజొన్న పంట దగ్దం
రాయదుర్గం టౌన్: మండలంలోని కదరంపల్లి గ్రామంలో రైతు కుమారస్వామి సాగు చేసిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో శరవేగంగా మంటలు వ్యాపించి 9 ఎకరాల్లోని మొక్కజొన్న పంటను చుట్టుముట్టాయి. విషయం తెలుసుకున్న రైతు స్థానికుల సాయంతో మంటలు అదుపు చేశారు. ఈ లోపు 5 ఎకరాల్లోని పంట పూర్తిగా కాలిపోయింది. మరో రెండు రోజుల్లో మొక్కజొన్న కంకులు కోయాల్సి ఉండగా ఈ ఘటన జరగడంతో రూ.8 లక్షల మేర నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు. ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్లో ఇద్దరికి చోటు అనంతపురం అర్బన్: అఖిల భాతర కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ కౌన్సిల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. తమిళనాడులోని నాగపట్నంలో మూడు రోజులుగా ఏఐకేఎస్ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. చివరి రోజు గురువారం కౌన్సిల్ జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో సభ్యులుగా రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు అన్నగిరి కాటమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జునకు చోటు దక్కింది. -
వేర్వేరు ప్రమాదాల్లో అన్నదమ్ముల మృతి
ముదిగుబ్బ: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వేర్వేరు ప్రమాదాల్లో చనిపోయారు. దీంతో దొరిగిల్లు క్వార్టర్స్లో విషాదఛాయలు అలముకున్నాయి. స్థానికుల వివరాల మేరకు.. దొరిగిల్లుకు చెందిన రమణయ్య (46) బుధవారం వ్యవసాయ పనులకు వెళ్లి పనులు ముగిసిన తరువాత స్నానం చేసేందుకు తోట సమీపంలోని గుర్రాల మడుగులోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. రోడ్డు ప్రమాదంలో తమ్ముడు.. నాలుగు రోజుల క్రితం రమణయ్య సోదరుడు మునికృష్ణ (45) మొలకలచెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఒకే రోజు అన్నదమ్ములిద్దరూ చనిపోవడంతో దొరిగిల్లులో విషాదఛాయలు అలముకున్నాయి. రమణయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే మునికృష్ణ భార్య ఇప్పటికే చనిపోగా ఓ కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శివరాముడు తెలిపారు. ● నీటి మడుగులో ఒకరు.. రోడ్డు ప్రమాదంలో మరొకరు ● దొరిగిల్లులో విషాదం -
హోరీహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
గుంతకల్లు రూరల్: కాశిరెడ్డి నాయన నూతన ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా గుంతకల్లు మండలం పాతకొత్తచెరువు గ్రామంలో గురువారం గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి 14 జతల దేశం ఎద్దులను పోటీలకు రైతులకు తీసుకువచ్చారు. కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందిన రైతు హుసేనప్ప ఎద్దులు మొదటి స్థానంలో, డి.హీరేహాల్ మండలం ఉద్యాల గ్రామ రైతు నరసింహులు ఎద్దులు ద్వితీయ స్థానంలో నిలిచాయి. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఎద్దుల యజమాలను గ్రామ సర్పంచ్ మల్లికార్జున, మాజీ సర్పంచ్ రాజన్న, వైఎస్సార్సీపీ బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు రంగనాయకులు, పరశురాముడు, వెంకటరాముడు, పందికోన శివ.. నగదు పురస్కారాలతో సత్కరించారు. విద్యుదాఘాతంతో రైతు మృతి రాయదుర్గం: మండలంలోని కాశీపురం గ్రామానికి చెందిన రైతు కావలి ఎర్రిస్వామి (54)విద్యుత్ షాక్తో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గురువారం ఉదయం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఎర్రిస్వామి.. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజులు ఎగిరిపోయినట్లుగా గుర్తించి, వాటిని వేస్తున్న క్రమంలో షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఈపీఎఫ్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా
అనంతపురం సిటీ: స్తానిక రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న ఈపీఎఫ్ కార్యాలయం వద్ద శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు గురువారం ధర్నా నిర్వహించారు. బకాయి వేతనాలు పీఎఫ్ ఖాతాల్లో జమ చేయకుండా కాంట్రాక్టర్లు తప్పుడు ఆరోపణలు చేయడం, వారికి అధికారులు వత్తాసు పలుకడాన్ని నిరసిస్తూ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర నాయకత్వంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు. తమకు చెల్లించాల్సిన వేతన బకాయిలతో పాటు పీఎఫ్ డబ్బులు తమ ఖాతాల్లో జమ చేయాలని నినాదాలు చేశారు. నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా అధికారులు, కాంట్రాక్టర్లు పరస్పరం నిందలు వేసుకుంటున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు అధికారులు తొత్తులుగా మారి పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ సమస్యలను తక్షణం పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజనేయులు, శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికుల సంఘం అధ్యక్షుడు ఎర్రిస్వామి, కార్యదర్శి రాము, కోశాధికారి వన్నూరుస్వామి తదితరులు పాల్గొన్నారు. -
రూ.10 లక్షల విలువైన బైక్ల స్వాధీనం
బత్తలపల్లి: ద్విచక్ర వాహనాలను అపహరించుకెళ్లే యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బత్తలపల్లి పీఎస్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ ప్రభాకర్, ఎస్ఐ సోమశేఖర్ వెల్లడించారు. అనంతపురం నగరానికి చెందిన ప్రణయ్, ధనూష్, సిద్ది వినయ్ వ్యసనాలకు బానిసలుగా మారి జులాయిగా తిరుగుతూ తమ జల్సాలకు అవసరమైన డబ్బు కోసం ద్విచక్ర వాహనాలను అపహరించడాన్ని పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు మైనర్లను కలుపుకున్నారు. వీరంతా కలసి ఓ ముఠాగా ఏర్పడి ద్విచక్ర వాహనాలను అపహరించుకెళ్లి తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. అనంతరం ఇతర రాష్ట్రాలకు చేరుకుని జల్సాలు చేసేవారు. ఈ క్రమంలో బత్తలపల్లిలోని జాతీయ రహదారి కూడలిలో గురువారం ఉదయం వాహన తనిఖీలు చేపట్టిన సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై ఆరుగురు వెళుతుండగా స్థానిక పోలీసులు అడ్డుకుని విచారణ జరిపారు. ఆ సమయంలో వారు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. బత్తలపల్లి, ధర్మవరం, అనంతపురం నగర పరిధిలో అపహరించిన 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.10 లక్షలుగా ఉంటుందని నిర్ధారించారు. వీరిపై బత్తలపల్లిలో రెండు, ధర్మవరం టూ టౌన్ పరిధిలో మూడు కేసులు, అనంతపురంలో ఐదు కేసులున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మైనర్లను బాలుర పరివర్తన కేంద్రానికి తరలించారు. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన ఎస్ఐ సోమశేఖర్, సిబ్బందిని సీఐ ప్రభాకర్ అభినందిస్తూ రివార్డులను అందజేశారు. ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఆరుగురి అరెస్ట్ -
కనెక్షన్ కింగ్లు!
● తారస్థాయికి విద్యుత్ అధికారుల అక్రమాలు ● ఇష్టారాజ్యంగా వసూళ్లు ● డబ్బు దండుకుని అక్రమంగా కనెక్షన్లు ● పైసలివ్వకుంటే అంతులేని జాప్యం అనంతపురం టౌన్:విద్యుత్ శాఖ అధికారుల చేతివాటం తారస్థాయికి చేరింది. ముడుపులు ముట్టజెబితే తప్ప ముందుకెళ్లని పరిస్థితి నెలకొంది. స్వయంగా ఉన్నతాధికారులే వసూళ్లు చేస్తుండడంతో వారిని ఆదర్శంగా తీసుకుని కింది స్థాయి సిబ్బంది సైతం జేబులు నింపుకుంటున్నారు. అనంతపురం నగర పరిధి రోజు రోజుకూ విస్తరిస్తోంది. పెద్ద పెద్ద భవనాలు, వెంచర్లు, డూప్లెక్స్ ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. ఇదే అదునుగా విద్యుత్ శాఖ అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ముందు అనుమతుల పేరిట కొర్రీలు విధిస్తూ.. ముడుపులు అందగానే అన్నీ సక్రమంగా ఉన్నాయంటూ కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. డీ 2, డీ3 సెక్షన్లలో అపార్ట్మెంట్లను సైతం వదలడం లేదని తెలిసింది. ‘మీరు 4 ఫ్లోర్లకు మాత్రమే అనుమతి తీసుకున్నారు.. ఇక్కడ మాత్రం 5 ఫ్లోర్లు నిర్మించారు.. 5వ ఫ్లోర్కు విద్యుత్ సర్వీసు ఇవ్వం’ అంటూ బెదిరించడం.. డబ్బు అందగానే వాటికి సైతం సర్వీసు మంజూరు చేయడం షరామామూలుగా మారింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆరుకు పైగానే సర్వీసులు మంజూరు చేస్తున్నట్లు తెలిసింది. ఇక.. 100 కిలోవాట్ల విద్యుత్ వాడకం ఉన్న అపార్ట్మెంట్లకు 60, 40 కిలోవాట్లకు మాత్రమే ఎస్టిమేషన్లు వేస్తున్నట్లు సమాచారం. సంస్థపై పెనుభారం.. విద్యుత్ అధికారుల బాగోతంతో ఎస్పీడీసీఎల్ సంస్థపై అదనపు భారం పడుతోంది. ఇష్టారాజ్యంగా సర్వీసులు ఇస్తుండడంతో లో ఓల్టేజీ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో సమస్యను అధిగమించేందుకు ఎస్పీడీసీఎల్ రూ.కోట్లు ఖర్చు చేస్తూ అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాల్సిన దుస్థితి నెలకొంది. కళ్యాణదుర్గం రోడ్డు బాలాజీ విల్లాస్ వెనుక భాగంలో నాలుగేళ్ల క్రితం వెలసిన వెంచర్ ఇది. కళ్యాణదుర్గం రోడ్డుకు చెందిన ఓ బిల్డర్ ఇక్కడ కొన్ని ప్లాట్లు కొనుగోలు చేశాడు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు విద్యుత్ సర్వీస్ కోసం డీ–5 సెక్షన్కు వెళ్లి దరఖాస్తు చేసుకున్నాడు. వెంటనే విద్యుత్ శాఖ టౌన్ 2లో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. వెంచర్కు అనుమతులు లేవు.. విద్యుత్ సర్వీస్ ఇచ్చేందుకు నిబంధనలు అనుమతించవని చెప్పారు. ఈ క్రమంలో ఉన్నతాధికారికి సదరు బిల్డర్ రూ.2 లక్షలకు పైగా ముడుపులివ్వగా.. వెనువెంటనే సర్వీస్ మంజూరు చేశారు. నారాయణపురంలో సైతం ఇలాగే ఓ వెంచర్ నిర్వాహకుడి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు తెలిసింది. అపార్ట్మెంట్లకు సైతం అనుమతుల నెపంతో ఆయన భారీగా వసూళ్లు చేస్తున్నట్లు విద్యుత్ శాఖలో చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న షూమార్టును అనంతపురం సుభాష్ రోడ్డులో ఇటీవలే ప్రారంభించారు. భవనానికి విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో టౌన్–1లో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 40 కిలోవాట్ల విద్యుత్ వాడకం ఉంటుందని, 63 కిలోవాట్ల సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకోవాలని బిల్డింగ్ నిర్వాహకుడికి చెప్పారు. ఈ క్రమంలో నిర్వాహకుడు రూ.5 లక్షలకు పైగా చెల్లించగా.. వెంటనే సిటీమీటర్ను రిలీజ్ చేసి సర్వీస్ మంజూరు చేశారు. విద్యుత్ శాఖ నిబంధనల మేరకు ట్రాన్స్ఫార్మర్ను చార్జ్ చేసిన తర్వాతనే సర్వీస్ మంజూరు చేయాలి. అయితే ముడుపులు అందడంతో అవన్నీ గాలికి వెళ్లిపోయాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇటీవల సుభాష్రోడ్డు, కమలానగర్ ప్రాంతాల్లో లో ఓల్టేజీ సమస్య తలెత్తుతుండటం గమనార్హం. చర్యలు తీసుకుంటాం విద్యుత్ సర్వీసుల మంజూరు కోసం వెంచర్ల నిర్వాహకుల నుంచి అక్రమంగా వసూళ్లు చేస్తున్న ఉద్యోగులపై విజిలెన్స్ విచారణ చేపడతాం. వాస్తవమని తేలితే చర్యలు తీసుకుంటాం. ట్రాన్స్ఫార్మర్లు చార్జ్ చేసిన తర్వాతే సిటీ మీటర్లు రిలీజ్ చేయాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం. – శేషాద్రిశేఖర్, ఎస్ఈ -
జిల్లా అంతటా గురువారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. వేసవితాపం కొనసాగుతోంది. గంటలకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా గాలి వీచింది.
అనంతపురం నుంచి బెంగళూరుకు రైలు ● కొత్తగా ఏడు స్టేషన్లలో స్టాపింగ్ అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. శ్రీసత్యసాయి జిల్లా ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరు వరకు నడిచే మెమూ రైలును అనంతపురం వరకు పొడిగించారు. దీంతో పాటు అనంతపురం నుంచే బెంగళూరుకు బయలుదేరేలా దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేయడంపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం–బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు నడపాలంటూ ప్రజాప్రతినిధులు, అధికారులను ఎప్పటి నుంచో ఈ ప్రాంతవాసులు కోరుతూ వచ్చారు. వారి విజ్ఞప్తిని అధికారులు ఎట్టకేలకు మన్నించారు. త్వరలోనే రైలు అనంతపురం నుంచి బయలుదేరేలా ప్రణాళిక రచించారు. ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరు మధ్య ఇప్పటి వరకు ఉన్న స్టాపింగులతో పాటు అదనంగా ప్రసన్నాయపల్లి, జంగాలపల్లి, చిగిచెర్ల, బాసంపల్లె, కొత్తచెరువు, విదురాశ్వర్థం, సోమేశ్వరలో స్టాపింగ్ సదుపాయం కల్పించారు. సామాన్య ప్రయాణికులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు రైలు ఎంతో సౌకర్యంగా ఉండనుంది. అతి త్వరలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి చేతుల మీదుగా అనంతపురం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం రైల్వే స్టేషన్ మేనేజర్ మాసినేని అశోక్ కుమార్ వేర్వేరుగా తెలిపారు. అనంతపురంలో మధ్యాహ్నం 2.10 గంటలకు బయలుదేరి రాత్రి 7 గంటలకు బెంగళూరు చేరుకునేలా షెడ్యూల్ రూపొందించారు. -
గంజాయి మహమ్మారిని నిర్మూలిద్దాం
అనంతపురం: గంజాయి మహమ్మారి నిర్మూలనకు సమష్టిగా పనిచేద్దామని అడిషనల్ ఎస్పీ డీవీ రమణమూర్తి పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం వివిధ ప్రభుత్వ శాఖలు, ఎన్జీఓలతో అడిషనల్ ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గంజాయి రవాణా నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారి గుర్తింపునకు డోర్ టు డోర్ సర్వే చేయాలన్నారు. పోలీస్, ఎకై ్సజ్, జిల్లా ఈగల్ సెల్, విద్యాశాఖ, గ్రామ, వార్డు సెక్రటరీలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో సీఐలు హరినాథ్, వెంకటేశ్ నాయక్, జయపాల్ రెడ్డి, జిల్లా ఈగల్ సెల్ ఆర్ఎస్ఐ హనుమంతు తదితరులున్నారు. -
క్రీస్తు త్యాగాలకు ప్రతీక గుడ్ ఫ్రైడే
అనంతపురం కల్చరల్: క్రైస్తవ సమాజంలో అత్యంత ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడే గుడ్ ఫ్రైడే రానే వచ్చింది. క్రైస్తవ విశ్వాసం ప్రకారం సమాజంలో నెలకొన్న చెడును తొలగించడానికి ఈ రోజున తన జీవితాన్ని యేసు క్రీస్తు త్యాగం చేశాడు. ఆ త్యాగాలను మననం చేసుకుంటూ ప్రత్యేక ప్రార్థనలతో యేసుక్రీస్తుపై విశ్వాసం ప్రకటించేందుకు క్రైస్తవులు సిద్ధమయ్యారు. క్షమ, కరుణకు ప్రతిరూపంగా నిలిచిన యేసు క్రీస్తు.. లోకంలో పాపులను పరిశుద్ధులను చేసే క్రమంలో సిలువపై రక్తం చిందించిన దైవ కుమారుడిగా మరణించి కూడా పునరుత్థానుడై లేచిన సంఘటన ప్రపంచ చరిత్రలో మరెక్కడా కనిపించదు. ఆ ఘట్టాలను వివరించే గుడ్ ఫ్రైడే నుంచి ఆదివారం వచ్చే ఈస్టర్ పర్వదినం వరకు సాగే వేడుకలకు జిల్లాలోని ప్రతి ప్రార్థనామందిరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. నేనే మార్గం – నేనే జీవం పాపులను పరిశుద్ధులను చేసేందుకు కరుణామయుడైన క్రీస్తు సిలువనెక్కిన రోజున గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటున్నట్లు పలువురు పాస్టర్లు తమ సందేశాలలో చెపుతున్నారు. నేనే మార్గం.. నేనే జీవం అని సమస్త మానవాళిలో స్థైర్యం నింపుతూ యేసయ్య చిరునవ్వుతో తన దేహాన్ని బలిదానంగా అర్పించిన రోజు శుభ శుక్రవారంగా మారిందని, ఉపవాసాలతోనే ఆయనను మెప్పించాలని పేర్కొన్నారు. ముస్తాబైన చర్చిలు సాధారణంగా ఇతర పండుగలకు భిన్నంగా గుడ్ఫ్రైడే ఆనందోత్సాహాలతో కాకుండా క్రీస్తు త్యాగానికి ప్రతీకగా కనపడుతుంది. కాబట్టే ఈ దినాల నాడు ఉపవాసాలుండడం ఆనవాయితీగా వస్తోంది. క్రీస్తు చివరిసారి సిలువపై పలికిన ఏడు వ్యాక్యాలు ప్రార్థనామందిరాలలో ఇప్పటికే ప్రతిధ్వనిస్తున్నాయి. అనంతలోని పురాతన మందిరాలైన సీఎస్ఐ చర్చిలో పెద్ద ఎత్తున క్రైస్తవులతో రెవరెండ్ బెనహర్బాబు నేతృత్వంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మరో ప్రాచీన ప్రార్థనామందిం ఎస్ఐయూ చర్చిలో బెంగళూరు నుంచి విచ్చేసే అంతర్జాతీయ సువార్తీకులు స్టీఫెన్ బాబ్, సంఘ కాపరి పాస్టర్ సంపత్కుమార్తో కలసి వల్యక్యోపదేశం చేయనున్నారు. రామచంద్ర నగర్లోని కార్మియల్ మాత మందిరంలో క్రీస్తు జీవితాన్ని సజీవంగా ఆవిష్కరించే లఘు నాటికను ప్రదర్శించనున్నారు. కోర్టురోడ్డు, గుల్జార్పేట్లోని గాస్పెల్ హాల్, కళాకారుల కాలనీలోని రేమా చర్చి సామూహిక ప్రార్థనలకు సిద్ధమయ్యాయి. క్రీస్తు సిలువపై పలికిన చివరి మాటల ప్రాశస్త్యాన్ని తెలుసుకోవడానికి ప్రార్థనల్లో విరివిగా పాల్గొనాలని పాస్టర్లు పిలుపునిచ్చారు. సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న చర్చిలు ప్రత్యేక ప్రార్థనలతో యేసుక్రీస్తుపై విశ్వాసం ప్రకటించనున్న క్రైస్తవులు -
వైభవంగా జ్యోతుల ఉత్సవం
రొళ్ల: రత్నగిరిలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం జ్యోతుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రొళ్ల మండలం హనుమంతనపల్లి, వన్నారనపల్లి, హులీకుంట, దొమ్మరహట్టి, కొత్తపాళ్యం, కొడగార్లగుట్ట, కొత్తపాళ్యంతాండ, రొళ్లకొండ, అలుపనపల్లి, ఏ.వడ్రహట్టి, దాసప్పపాళ్యం, క్యాతప్పపాళ్యం, వన్నప్పపాళ్యం, జీఎన్ పాళ్యం, బాజయ్యపాళ్యం, పి.గొల్లహట్టి, గొట్టుగుర్కి, రంగనపల్లి, వెంకటంపల్లి తదితర గ్రామాల్లో ఉత్సవాన్ని జరుపుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున జ్యోతులతో ఆలయానికి చేరుకొని అమ్మవారికి సమర్పించారు. -
పండ్ల తోటల్లో డ్రోన్ సర్వే
గార్లదిన్నె: పండ్ల తోటల్లో డ్రోన్ సర్వే నిర్వహించనున్నట్లు ఉద్యాన శాఖ అధికారి రత్నకుమార్ పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రంలోనే మొట్టమొదటిగా గార్లదిన్నె మండలంలోని ముకుందాపురాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేశారన్నారు. స్థానిక రైతు సేవా కేంద్రంలో గురువారం ఉద్యాన శాఖ, ఎఫ్పీఓలు, ఏపీఎంఐపీ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రైతులకు చేరువ చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. 17 బృందాలు ముకుందాపురంలో చీనీ తోటలను సందర్శించి జీపీఎస్ ట్రాకింగ్ చేస్తాయన్నారు. చీనీ తోటలకు ఆశించే చీడపీడలు, యాజమాన్య పద్ధతులపై ఎప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్లేషించి రైతులకు సలహాలు, సూచనలు అందిస్తాయన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని ‘జూమ్’ ద్వారా ఏపీఎంఐపీ డైరెక్టర్ రఘునాథ్ రెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఫిరోజ్ ఖాన్, ఐటీ (ఇంటెలిజెన్స్) శ్రీహరి పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ మైక్రో ఇరిగేషన్ అధికారులు మధు, గణేష్, నాగార్జున, ఎఫ్పీఓలు పాల్గొన్నారు. రాష్ట్రంలో పైలట్ గ్రామంగా ముకుందాపురం ఎంపిక -
విశ్వాసముంచితేనే నిత్య జీవము
‘ఎదుటి వారి కష్టాలను పంచుకోవడంలోనే శాంతి దాగుంది’ అనే పరమ సత్యాన్ని చాటడానికే క్రీస్తు సిలువనెక్కి రక్షకుడయ్యాడు. ఆయన పరిశుద్ధుడు, ఏ పాపము చేయనివాడు కనుకనే తనకు తానే సిలువకు అప్పగించుకున్నాడు. మనుష్యుల పట్ల అవ్యాజ్యమైన ప్రేమ, త్యాగము క్రీస్తు జీవితంలో మాత్రమే చూడగలం. విశ్వాసముంచితేనే నిత్య జీవము అనే క్రీస్తు బోధనల సారమే గుడ్ఫ్రైడే పర్వదినం. గుల్జార్పేట్లోని గాస్పెల్ అసెంబ్లీ హాలులో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో అందరూ పాల్గొనండి. – ఫిలిఫ్, దైవజనులు -
ఊరించి ఉసూరుమనిపించారు..
●పట్టుమని పది నెలల్లోనే టీడీపీకి దూరమైన ‘అనంతపురం’ నేతలు ●తాజాగా జరిగిన క్లస్టర్ ఇన్చార్జ్ల సమావేశానికి డుమ్మా ●అధిష్టానం సీరియస్గా ఉందని హెచ్చరించినా బేఖాతరు ●ఎన్నికల ముందు ఊరించి ఉసూరుమనిపించారంటూ ఆవేదన ●అన్ని ఆదాయ వనరులూ ఒకరికే చెందుతున్నాయని నిట్టూర్పు సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీలో అప్పుడే అసమ్మతి సెగలు రేగాయి. కూటమి సర్కారు ఏర్పడి పట్టుమని పది నెలలు కూడా కాకుండానే టీడీపికి చెందిన ముఖ్య నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. గత రెండు మాసాలుగా కేడర్కూ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కూ ఎడమొహం పెడమొహం అన్నట్లుగా ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కేడర్లో ఏ ఒక్కరికీ పనులు కావడం లేదని, అన్నీ ఎమ్మెల్యే మనుషులకే దక్కుతున్నాయని, ఈ మాత్రం దానికి తామెందుకు పార్టీ కోసం కష్టపడాలని అసమ్మతి నేతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సభ్యత్వ నమోదు కూడా తూతూమంత్రంగా జరిగినట్లు తెలిసింది. సమావేశానికి రాంరాం.. రెండు రోజుల క్రితం అనంతపురం టీడీపీ పరిశీలకుడు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో క్లస్టర్ ఇన్చార్జ్ల సమావేశం జరిగింది. ఇందుకు అర్బన్ నియోజకవర్గ ముఖ్య నాయకులెవరూ హాజరు కాలేదు. మాజీ మేయర్ స్వరూప, సుధాకర్ నాయుడు, ఆదెన్న, బుగ్గయ్య, రాయల్మురళి, జేఎల్ మురళి వంటి వారు ఆ వైపు చూడలేదు. వీళ్లందరూ ఇటీవలి వరకూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వారే. అలాంటి నేతలు నేడు ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నారు. మార్కెట్ యార్డు చైర్మన్గిరీ.. అన్ని చోట్లా వారికే..! అనంతపురం మార్కెట్ యార్డ్ తనకే దక్కుతుందని టీడీపీకి చెందిన ఓ మహిళ ప్రచారం చేసుకుంటోంది. ఇప్పటికే సంబంధిత ప్రజాప్రతినిధికి రూ.65 లక్షలు ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. సదరు మహిళ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు. ఇప్పటికే రాప్తాడు మార్కెట్ కమిటీ చైర్మన్గిరీని కమ్మ సామాజిక వర్గ నేతకే కట్టబెట్టారు. ఈ క్రమంలో అనంతపురంలో కూడా అదే సామాజిక వర్గ నేతకు పదవి ఎలా అప్పజెబుతారని కేడర్ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఆ మహిళకు ఇవ్వకపోతే తన సమీప బంధువు కోనంకి గంగారాంకు పదవి కట్టబెట్టాలని ఎమ్మెల్యే యోచిస్తున్నట్లు తెలిసింది. గంగారాం కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో కాపు, ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన వారు గుర్రుమంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఒప్పుకునేది లేదని బహిరంగంగానే స్పష్టం చేస్తున్నారు. దీంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇదిలా ఉండగా దగ్గుపాటి ప్రసాద్కు సొంత పార్టీలోనే బద్ధశత్రువుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వచ్చే నెల నుంచి జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ‘ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డాం.. ఎన్నికల ముందు మాకు ఎన్నో హామీలిచ్చారు. పదవులు ఇస్తామన్నారు.. ఈ క్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త వ్యక్తి అయినా దగ్గరుండి గెలిపించాం.. కానీ ఇప్పుడు పదవులూ లేవు, ఆదాయమూ లేదు’ అంటూ ఓ టీడీపీ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డామని.. అప్పులు చేసి ఖర్చు పెడితే ఇప్పుడా అప్పులకు వడ్డీలు కడుతున్నామని కమ్మ సామాజిక వర్గానికే చెందిన ఒక నాయకుడు వాపో యారు. ‘ఆదాయమొచ్చే పనులు ఎమ్మెల్యేకు, కష్టం మాకా’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే ఎమ్మెల్యే పాల్గొంటున్న సమావేశాలకు వెళ్లడం లేదని మరో నాయకుడు తెగేసి చెప్పారు. కేడర్ ఎవరూ ఇష్టంగా పనిచేసేందుకు ముందుకు రావడం లేదని, ఎమ్మెల్యే వ్యవహార శైలే కారణమని కాపు సామాజిక వర్గ నేత చెప్పారు. -
ఏడుగురు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
తాడిపత్రి టౌన్: క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ఏడుగురిని గురువారం తాడిపత్రి పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రోహిత్కుమార్ వివరాలు వెల్లడించారు. పట్టణ శివారులోని రజక కల్యాణ మంటపం వద్ద ‘ఏస్ టీకింగ్’ క్రికెట్ బెట్టింగ్ యాప్ ఏజెంట్ మకందర్ సంధానీ తచ్చాడుతుండగా... అనుమానంతో ఎస్ఐ గౌస్బాషా అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఈజీ మనీ కోసం సెల్ఫోన్లలో మట్కా, యాప్ల ద్వారా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లుగా నిర్ధారణ కావడంతో అతను ఇచ్చిన సమాచారం మేరకు అతని స్నేహితులు బలపనూర్ షబ్బీర్, మకందర్ జిలానీ, మకందర్ మహబూబ్బాషా, డోంగ్రీ హరూన్, పోస నరేష్ బాబు, షేక్ ముజీబ్, పామిడి మహమ్మద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.4.20 లక్షలు నగదుతో పాటు 10 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అందరూ జేసీ అనుచరులే అరెస్ట్యిన వారిలో మకందర్ సంధానీ క్రికెట్ బుకీ కాగా, డోంగ్రీ హరూన్ తాడిపత్రిలో హరూన్ మోటార్స్ పేరుతో ఎలక్ట్రికల్ బైక్లు విక్రయిస్తున్నాడు. అతనికి పార్టనర్గా మకందర్ జిలానీ ఉన్నారు. హరూన్ మోటార్స్లో డ్రైవర్గా షేక్ ముజీబ్ పనిచేస్తున్నాడు. హరూన్కు బలపనూర్ షబ్బీర్ స్నేహితుడు. పామిడి మహమ్మద్ మెడికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇతనికి పోస నరేష్బాబు స్నేహితుడు. వీరంతా స్థానిక మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరులే కావడం గమనార్హం. 4.20 లక్షలు నగదు, 10 సెల్ఫోన్లు స్వాధీనం -
కలవరపెడుతున్న మధుమేహం
అనంతపురం నగరానికి చెందిన రంగనాథ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. వయసు 32 ఏళ్లు. మూడేళ్ల క్రితం పెళ్లయింది. ఎందుకో అనుమానమొచ్చి ఇటీవల ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా షుగర్ ఉన్నట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా అతను ఖిన్నుడయ్యాడు.నగరానికి చెందిన మటన్ వ్యాపారి గౌస్మొహిద్దీన్కు 37 ఏళ్లు కూడా లేవు. ఇద్దరు పిల్లలున్నారు. సరైన వ్యాయామం లేక ఒత్తిడికి గురై బీపీ, షుగర్ రెండూ వచ్చాయి. ఇటీవల సరిగా నిద్రపట్టడం లేదని బాధితుడు వాపోతున్నాడు. వీరే కాదు.. ఉమ్మడి జిల్లాలో మధుమేహం, రక్తపోటు బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంత పురం జిల్లాలో మధుమేహ జబ్బు చాపకింద నీరులా విస్తరిస్తోంది. జనాభా పెరుగుదల రేటుతో పోల్చి చూస్తే డయాబెటిక్ బారిన పడుతున్న వారే ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. యువకులు సైతం జీవనన శైలి జబ్బుల బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో 40 ఏళ్లు నిండిన వారిలో ఎక్కువగా ఆయా జబ్బుల బారిన పడేవారు. కానీ, ఇటీవల 30 ఏళ్లు దాటని వారూ వీటి కోరల్లో చిక్కుతున్నారు. ఈ విషయం వైద్యులను కూడా విస్మయానికి గురి చేస్తోంది. గ్రామీణులూ బాధితులే.. మధుమేహం, రక్తపోటు తదితర జబ్బులతో బాధపడే వారు ఒకప్పుడు పట్టణాలు, నగరాల్లోనే ఎక్కువగా ఉండేవారు. పని ఒత్తిడితో సతమతమవడం కారణంగా వీటి బారిన పడేవారు. కానీ, ఇప్పుడు ఆయా రోగాలు పల్లెలకూ విస్తరించడం గమనార్హం. ఈ క్రమంలోనే డయాబెటిక్, బీపీ మందుల ధరలు పెరగడం సామాన్యులకు కొరకరాని కొయ్యగా మారింది. అవగాహన లేకే.. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) బాధితులు 27 శాతం పైగానే ఉన్నట్టు తేలింది. పట్టణాల్లో అయితే ఇది 30 నుంచి 32 శాతం కూడా ఉన్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. ఇక.. షుగర్, హైపర్టెన్షన్ జబ్బులు నియంత్రణలో లేనివారు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో శరీరంలో ఇతర అవయవాలపై ప్రభావం పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జబ్బుల నియంత్రణపై అవగాహన లేకపోవడం అనర్థాలకు దారి తీస్తోంది. అలవాట్లు మార్చుకోవాలి మధుమేహం, హైపర్ టెన్షన్ ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. బాధితులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లేని ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు. పొగ తాగడం చాలా ప్రమాదకరం. –డా.సుధాకర్రెడ్డి, గుండె వైద్య నిపుణులు సమస్యలెన్నో.. » షుగర్ నియంత్రణలో లేకుంటే కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. » కంటిచూపుపై దు్రష్పభావం పడుతుంది. » శరీరంలో గాయాలైనప్పుడు మానడం చాలా కష్టం. » మధుమేహం అదుపులో లేకపోతే » గుండె జబ్బులొచ్చే అవకాశాలు ఎక్కువ. » అధిక రక్తపోటు వల్ల బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. » నరాల వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. -
వేరుశనగకు పంట రుణం రూ.38 వేలు
అనంతపురం అగ్రికల్చర్: ఈ ఏడాది వేరుశనగ పంటకు సంబంధించి ఎకరాకు రూ.38 వేల ప్రకారం రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు ఆదేశాలు అందాయి. ఖరీఫ్, రబీలో పంటల వారీగా రైతులకు ఎంత మొత్తంలో రుణాలివ్వాలనే అంశంపై గరిష్ట రుణ పరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) ఖరారైనట్లు బ్యాంకర్లు తెలిపారు. గతేడాది కన్నా పంట పెట్టుబడులను బట్టి 10 నుంచి 20 శాతం రుణ పరిమితి పెంచారు. జిల్లాలోని బ్యాంకుల్లో రైతులకు సంబంధించి ఖరీఫ్ పంట రుణాల రెన్యువల్స్, కొత్త రుణాల పంపిణీ ప్రారంభమైనట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్కు అదనంగా 15 శాతం అధికంగా ఇచ్చే వెసులుబాటు కల్పించినట్లు సమాచారం. పంటల వారీగా ఇలా: వర్షాధారంగా సాగు చేసే వేరుశనగ ఎకరాకు రూ.38 వేలు, నీటి వసతి కింద అయితే రూ.41 వేల ప్రకారం రుణం ఇవ్వనున్నారు. కంది పంట వర్షాధారంగా ఎకరాకు రూ.29 వేలు, నీటి వసతి కింద రూ.30 వేలు, ఆముదం రూ.22 వేలు, పప్పుశనగ రూ.37 వేలు, పత్తి రూ.51 వేలు– 55 వేలు, విత్తనోత్పత్తి పత్తి రూ.1.60 లక్షలు, వరి రూ.52 వేలు, విత్తన వరి రూ.55 వేలు, జొన్న రూ.25 వేలు, రాగి రూ.22 వేలు– 25 వేలు, సజ్జ రూ.21 వేలు– 24 వేలు, కొర్ర రూ.17 వేలు– 21 వేలు, వర్షాధారంగా మొక్కజొన్న రూ.31 వేలు, నీటి వసతి కింద రూ.47 వేలు, విత్తన మొక్కజొన్నకు రూ.50 వేలుగా నిర్ణయించారు. ఉద్యాన, కూరగాయల పంటలకు.. పచ్చిమిరపకు రూ.1.10 లక్షలు, ఎండుమిరప రూ.1.75 లక్షలు, టమాట ట్రెల్లీస్ లేకుండా రూ.41 వేలు, ట్రెల్లీస్ టమాట రూ.65 వేలు, హైబ్రీడ్ టమాట రూ.78 వేలు, ట్రెల్లీస్ హైబ్రీడ్ టమాట రూ.1.25 లక్షలు, వంకాయ రూ.54 వేలు, హైబ్రీడ్ వంకాయ రూ.67 వేలు, బెండ రూ.36 వేలు, హైబ్రీడ్ బెండ రూ.50 వేలు, ఉల్లి రూ.60 వేలు,మునగ రూ.49 వేలు,వర్షాధారంగా బేబీకార్న్కు రూ.28 వేలు, నీటి వసతి కింద రూ.44 వేలు, కరివేపాకు రూ.60 వేలు, ధనియాలు రూ.24 వేలు, సోయాబీన్స్ రూ.17 వేలు, అరటి ఎకరా రూ.1.10 లక్షలు, టిష్యూ కల్చర్ అరటి రూ.1.36 లక్షలు, దానిమ్మ రూ.1.60 లక్షలు, చీనీ రూ.71 వేలు, నిమ్మ రూ.85 వేలు, బొప్పాయి రూ.1.20 లక్షలు, మామిడి రూ.55 వేలు, సపోట రూ.43 వేలు, ద్రాక్ష రూ.1.25 లక్షలు, రేగు రూ.34 వేలు, కళింగర రూ.54 వేలు, దోస రూ.66 వేలు, జామ రూ.55 వేలు, అంజూర రూ.42 వేలు, సీతాఫలం రూ.27 వేలు, డ్రాగన్ఫ్రూట్ రూ.77 వేలు, చింత రూ.27 వేలు, కొబ్బరి రూ.70 వేలు, మల్లెపూల తోటల సాగుకు రూ. లక్ష, రోజాపూలు రూ.43 వేలు – 66 వేలు, బంతిపూలు రూ.55 వేలు, చామంతి రూ.60 వేలు, కనకాంబరాలు రూ.39 వేలు, గడ్డి సాగు రూ.36 వేలు, మల్బరీ సాగుకు రూ.1.20 లక్షల మేర స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేశారు. 10 నుంచి 20 శాతం పెరిగిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ప్రారంభమైన పంట రుణాల రెన్యువల్స్ -
గడువులోపు పరిష్కారం చూపాలి
గుంతకల్లు: రెవెన్యూ పరమైన అంశాల్లో అర్జీదారులు ఇచ్చిన వినతులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ వి. వినోద్కుమార్ ఆదేశించారు. గుంతకల్లు రెవెన్యూ డివిజన్ పరిధిలో నెలకొన్న రెవెన్యూ సమస్యలపై స్థానిక శ్రీశంకరానంద గిరి స్వామి డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన ఆర్ఓ కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు. భూతగాదాలు,రస్తా సమస్యలు,ఇంటి స్థలాలు... తదితర సమస్యలు ఎంత మేరకు పరిష్కారం అయ్యాయంటూ అధికారులతో ఆరా తీశారు. రెవెన్యూ పరమైన భూసేకరణ, ఆర్ఓఆర్ సమస్యలు తదితర విషయాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణీత సమయంలోపు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్, మల్లికార్జున, గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాస్, సర్వే ఏడీ రూప్లానాయక్ తదితరులు పాల్గొన్నారు. నక్కనదొడ్డి తండాలో పర్యటించిన కలెక్టర్ గుంతకల్లు రూరల్: ఆర్ఓ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం గుంతకల్లుకు వచ్చిన కలెక్టర్ వినోద్కుమార్... అనంతరం ఇదే మండలంలోని నక్కనదొడ్డి తండాలో పర్యటించారు. గ్రామానికి చెందిన రైతు మునే నాయక్ సర్వే నంబర్ 342లో ఉన్న తన భూమిని రీ సర్వే చేయడంతోపాటు, సబ్ డివిజన్ కూడా చేయాలని కోరుతూ ఇటీవల కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్లో అర్జీ ఇచ్చాడు. ఈ క్రమంలో నక్కనదొడ్డి తండాకు చేరుకున్న కలెక్టర్... క్షేత్రస్థాయిలో సర్వే నంబర్ 342లోని భూములను పరిశీలించారు. మునేనాయక్కు చెందిన భూమి వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతు ఇచ్చిన అర్జీ మేరకు సదరు భూమిని వెంటనే సబ్ డివిజన్ చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ రమాదేవి, ఇతర సిబ్బంది ఉన్నారు. కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ నక్కనదొడ్డి తండాలో పర్యటన -
కఠిన చర్యలు తీసుకుంటాం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్, రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వసూళ్ల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. సాధారణంగా భూమి రిజిస్ట్రేషన్ జరిగితే.. ఒరిజనల్ డాక్యుమెంటు అందుకునేందుకు వారం నుంచి 10 రోజులు పడుతుంది. కానీ రూ.1,000 కొడితే సాయంత్రానికే సిబ్బంది ఇచ్చేస్తున్నారు. డబ్బులివ్వకుంటే ఆలస్యం చేస్తున్నారు. ఈ నెల 8న భూముల రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఇప్పటికీ డాక్యుమెంట్ రాకపోవడమే ఇందుకు ఉదాహరణ. సిబ్బంది అక్రమ వ్యవహారంతో సామాన్యులు విసుగెత్తిపోతున్నారు. అన్ని విషయాలు ఆయా సబ్ రిజిస్ట్రార్లకు తెలిసే జరుగుతున్నట్టు సమాచారం. నకళ్లకు వంద... స్థిరాస్తులకు సంబంధించిన నకళ్లు (సర్టిఫైడ్ కాపీలు) కావాలంటే రూ.500 చలానా చెల్లించి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రూ.150 చెల్లిస్తే డాక్యుమెంటు ఇస్తారు. కానీ కొంతమంది ఔట్సోర్సింగ్ సిబ్బంది రూ. వంద తీసుకుని.. డాక్యుమెంటు నంబర్ ద్వారా వాట్సాప్లో పీడీఎఫ్ కాపీలు పంపిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి చలానాల రూపంలో అందే ఆదాయం పడిపోతోంది. ఇక.. పక్కాగా ఉన్న డాక్యుమెంటు రిజిస్ట్రేషన్కు అయినా సబ్ రిజిస్ట్రార్కు ముడుపులు చెల్లించాల్సి వస్తోందనే విమర్శలు ఉన్నాయి. లేదంటే ‘కామా లేదు, ఫుల్స్టాప్ లేదు, దిశలు సరిగా లేవు’ అని కొర్రీలు పెట్టి తిప్పుకుంటున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అనంతపురం అర్బన్, రూరల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడుతున్నారు. సబ్ రిజిస్ట్రార్లు ఏమీ తెలియనట్టే ఉంటూ కిందిస్థాయి సిబ్బంది ద్వారా పిండుకుంటున్నారు. జీపీఏలు చూసి రిజిస్ట్రేషన్.. సామాన్యులకు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాక రిజిస్ట్రేషన్లు చేస్తున్న అనంతపురం రూరల్, అర్బన్ రిజిస్ట్రేషన్ అధికారులు.. ఇటీవల జీపీఏను చూపించినా భారీగా రిజిస్ట్రేషన్లు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. శోత్రియం భూములపై రాప్తాడుకు చెందిన కొంతమంది టీడీపీ నాయకులు జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ)లు సృష్టించారు. వీటిని అడ్డు పెట్టుకుని సబ్ రిజిస్ట్రార్లు కోట్లాది రూపాయల విలువ చేసే భూములను ‘పచ్చ’ నేతల సొంతం చేశారు. ఈ క్రమంలో ఆయా భూములు కొన్న వారు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మరో నాలుగు చోట్లా ఇంతే.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల తీరు మారడం లేదు. ఎన్ని సంస్కరణలు తెచ్చినా వసూళ్లు మాత్రం ఆగడం లేదు. ఉరవకొండ, కళ్యాణదుర్గం, తాడిపత్రి,రాయదుర్గం కార్యాలయాల్లోనూ పరిస్థితి అధ్వానంగా ఉంది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు వెళ్లిన వారికి ఆయా కార్యాలయాల సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. ఏసీబీ దాడులు జరిగినా, విజిలెన్స్ సోదాలు నిర్వహించినా మూణ్నాళ్ల ముచ్చటే అవుతోంది. అనంతపురం అర్బన్, రూరల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వసూళ్ల పర్వం ఒకేరోజులో డాక్యుమెంటు కావాలంటే ఒకరేటు సర్టిఫైడ్ కాపీ వాట్సాప్లో పంపేందుకు ఇంకో రేటు.. ఇప్పటికే జీపీఏల ద్వారా రూ. కోట్ల విలువైన భూముల రిజిస్ట్రేషన్ అనంతపురం నగరంలోని సిండికేట్నగర్లో వారం రోజుల క్రితం ఓ వ్యక్తి నాలుగు సెంట్ల స్థలం కొన్నారు. అదే రోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి స్థలానికి సంబంధించి డాక్యుమెంటు కావాలని అడిగితే మొదట ససేమిరా అన్నారు. సదరు వ్యక్తి రూ. 2 వేలు ఇచ్చేసరికి సాయంత్రానికే మహిళా సిబ్బంది డాక్యుమెంటు అందించారు. రాప్తాడు రూరల్ పరిధిలో రెండెకరాల వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్కు వచ్చింది. ఇటీవల భూమి కొనుగోలుదారుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లి డాక్యుమెంటు కావాలని కోరగా మొదట ఎవరూ స్పందించలేదు. తర్వాత కొంతసేపటికే ఆఫీసు సిబ్బంది అతడి దగ్గరికి వెళ్లి రూ.5 వేలు చెల్లిస్తే సాయంత్రానికి ఇస్తామని చెప్పారు. డబ్బు తీసుకుని చెప్పిన టైంకి అందించారు. మచ్చుకు ఇవి రెండు ఉదాహరణలే.. ఇలాంటివి అనంతపురం అర్బన్, రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిత్యం పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. గతంలో మాదిరి డాక్యుమెంట్లు ఎక్కువ రోజులు పట్టడం లేదు. అయినా డబ్బు తీసుకుని ఒక్క రోజులో ఇవ్వడం సరి కాదు. సర్టిఫైడ్ కాపీలు వాట్సాప్లో పంపడం నేరం. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. –భార్గవ్, జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి -
1.20 కోట్ల పనిదినాలు..రూ.368 కోట్ల నిధులు
రాయదుర్గం: ఉపాధి హామీ పథకం కింద పని దినాల లక్ష్యం ఖరారైంది. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.368 కోట్లతో 1.20 కోట్ల పని దినాలు కల్పించేలా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ క్రమంలో జూన్ ఆఖరుకు జిల్లాలోని 31 మండలాల్లో 68 లక్షల పనిదినాలు పూర్తి చేసేలా ఉన్నతాధికారులు లక్ష్యం నిర్దేశించారు. ఒక్కో కూలీకి సగటు వేతనం రూ.307 చెల్లించేలా కార్యాచరణ చేపట్టారు. ఇంకుడు గుంతలు, పశువుల షెడ్లు, నర్సరీల్లో మొక్కల పెంపకం, చెక్డ్యాంలు, వ్యక్తిగత మరుగు దొడ్లు, పంట పొలాలకు అనుసంధానంగా రోడ్లు, నీటి కుంటల నిర్మాణాలు, మొక్కలు నాటడం లాంటి పనులకు పెద్దపీట వేయనున్నట్లు తెలిసింది. దొంగ మస్టర్ల కలకలం.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉపాధి నిధులు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.చాలా చోట్ల గత వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన పనుల వద్దే మళ్లీ తూతూమంత్రంగా పనులు చేస్తున్నారని, మరి కొన్నిచోట్ల వృథా పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలున్నాయి.ఇటీవల కొన్ని మండలాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల దొంగ మస్టర్ల మాయాజాలం కలకలం రేపింది. కూలీలు పనులకు రాకున్నా హాజరు వేస్తూ డబ్బులు మింగేస్తున్న వైనం అందరినీ విస్మయానికి గురి చేసింది. జిల్లా సరిహద్దు మండలాల్లో అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక.. కూటమి ప్రభుత్వంలో కొత్తగా పుట్టుకొచ్చిన శ్రమశక్తి సంఘాల ముసుగులో అర్హులకు అన్యాయం జరిగే అవకాశం లేకపోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పనులను అధికారులు నిత్యం తనిఖీ చేయడంతో పాటు ప్రతి మస్టర్ను నిశితంగా పరిశీలించాకే వేతనాలు జమ చేయాలని ఉపాధి కూలీలు డిమాండ్ చేస్తున్నారు. ‘ఉపాధి’ ప్రణాళిక ఖరారు సగటు వేతనం రూ.307కు పెంపు జూన్ ఆఖరుకు 68 లక్షల పనిదినాలు పూర్తి చేసేలా కార్యాచరణ అక్రమాలు లేకుండా చర్యలు తీసుకోవాలంటున్న కూలీలుఅక్రమాలకు తావులేదు ఉపాధి పథకంలో ఈ ఏడాది లక్ష్యం మేరకు పనులు కల్పిస్తాం. అడిగిన ప్రతి కూలీకి పని చూపుతాం. సగటు వేతనం రూ.307 పొందేలా అవగాహన కల్పిస్తున్నాం. గతేడాది 1.10 కోట్ల పని దినాలు ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.20 కోట్లకు పెంచాం. మస్టర్లలో అవకతవకలు జరగకుండా పటిష్ట చర్యలు చేపడతాం. పనులకు రాకుండా వేతనాలు జమ చేసినట్టు తేలితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు. – సలీమ్బాష, డ్వామా పీడీ -
ఉన్నతాధికారుల పేరుతో నకిలీ ఖాతాలు
● అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ వినోద్కుమార్ సూచన అనంతపురం అర్బన్: కలెక్టర్, ఇతర జిల్లా ఉన్నతాధికారుల పేర్లపై సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఖాతాలు సృష్టించారని కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. ఆ ఖాతాలు, ఫోన్ ద్వారా డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇలాంటి వాటి పట్ల ఉద్యోగులు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మెసేజ్లు వస్తే సహ ఉద్యోగులైనా, తెలిసిన వారైనా నిర్ధారించుకోకుండా తొందరపడి డబ్బు పంపరాదన్నారు. వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. నేడు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ అనంతపురం అర్బన్: కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారం కోసం గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాధిక తెలిపారు. కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో కలెక్టర్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్జీలను సమర్పించుకోవాలని సూచించారు. తపాలా ఎస్పీగా రాజేష్ అనంతపురం సిటీ: అనంతపురం డివిజన్ తపాలా సూపరింటెండెంట్గా రాజేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కడప డివిజన్ రెగ్యులర్ సూపరింటెండెంట్గా కొనసాగుతున్న ఆయనకు అనంతపురం డివిజన్ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవల ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు తపాలా ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు బ్రహ్మానందరెడ్డి, కృష్ణయ్య యాదవ్ తదితరులు వేర్వేరుగా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇప్పటి వరకూ ఆ స్థానంలో కొనసాగిన గుంపస్వామి బుధవారం రాత్రి రిలీవ్ అయ్యారు. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆయనపై ఫిర్యాదులు వెల్లువెతిన నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్ సర్కిల్ పరిధిలోని ఆదిలాబాద్ డివిజన్కు ఉన్నతాధికారులు బదిలీ చేశారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు పెద్దవడుగూరు: రైతులకు నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులను గుంటూరు నుంచి వచ్చిన వ్యవసాయ శాఖ కమిషనరేట్ ఏడీఏ రమణమూర్తి, గుత్తి ఏడీఏ వెంకట్రాముడు హెచ్చరించారు. పెద్దవడుగూరులోని ఉమామహేశ్వర ఫర్టిలైజర్ షాపును బుధవారం వారు ఆకస్మిక తనిఖీ చేశారు. విక్రయిస్తున్న విత్తనాలు, పురుగు మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. విక్రయించే ప్రతి విత్తనమూ నాణ్యతగా ఉండాలని సూచించారు. నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేస్తే సహించబోమని హెచ్చరించారు. పత్తి విత్తనాల కొనుగోలు సమయంలో రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని అక్కడి రైతులకు సూచించారు. రసీదు లేకుండా ఎవరైనా విత్తనాలు విక్రయిస్తే వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు.కార్యక్రమంలో కమిషనరేట్ ఏఓ సుకుమార్, అనంతపురం జేడీఏ కార్యాలయ టీఏఓ రాకేష్నాయక్, ఏఓ మల్లీశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు. వ్యవసాయ యంత్ర పరికరాలకు దరఖాస్తు చేసుకోండి అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద వ్యక్తిగతంగా పరికరాలు అవసరమైన రైతులు ఆర్ఎస్కేల్లో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేటాయించిన రూ.3 కోట్ల బడ్జెట్లో ఇప్పటికే రూ.1.60 కోట్ల మేర అవసరమైన పరికరాలు కావాలని రైతులు తమ వాటా కింద సొమ్ము చెల్లించి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఇంకా బడ్జెట్ ఉన్నందున సాధ్యమైనంత తొందరగా స్ప్రేయర్లు, టిల్లర్లు, తదితర వాటికి 50 శాతం మేర రైతు వాటా చెల్లించి దరఖాస్తు చేసుకుంటే పరికరాలు అందజేస్తామని పేర్కొన్నారు. -
●చౌడేశ్వరీ.. నమోస్తుతే..
అమడగూరు: చల్లని తల్లి చౌడేశ్వరమ్మ జ్యోతుల వెలుగుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అమడగూరులో వెలసిన చౌడేశ్వరీ దేవి వార్షిక ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయ ధర్మకర్త, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పొట్టా పురుషోత్తమరెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జ్యోతి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. జ్యోతి ఉత్సవంలో అమ్మవారిని దర్శించుకుంటే అంతా శుభమే జరుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో, అమ్మవారిని మల్లెపూలతో ప్రత్యేకంగా అలంకరించారు. జ్యోతిదర్శనంతో పులకించిన భక్తజనం ఉత్సవంలో భాగంగా తొలుత అమ్మవారి విగ్రహాన్ని పూలపల్లకీపై కొలువుదీర్చి ఆలయం నుంచి గ్రామ నడిబొడ్డున ఉన్న ఉట్టి వరకూ ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి పల్లకీ ముందు జ్యోతిని రగిలించారు. జ్యోతి ముందు వెళ్తుండగా... ఆ వెలుగుల్లో చౌడేశ్వరీదేవి భక్తులను దర్శనమిచ్చారు. ఈ క్రమంలో జ్యోతిని చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. డప్పు, మంగళవాయిద్యాలు, బాణసంచా పేలుళ్ల మధ్య యువకులు చిందులేస్తూ ఆడి, పాడారు. భక్తుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన కోలాటలు, భజనలు, హరికథలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చీకిరేవులపల్లి యూత్ సభ్యులు భక్తులకు అన్నదానం చేశారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు గురువారం అశ్వవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
వృద్ధురాలిని ఏమార్చి చైన్ స్నాచింగ్
గార్లదిన్నె: వృద్ధురాలిని ఏమార్చి ఆమె మెడలోని బంగారు గొలుసును దుండగుడు అపహరించుకెళ్లాడు. పోలీసులు తెలిపిన మేరకు గార్లదిన్నె మండలం గుడ్డాలపల్లికి చెందిన వృద్ధురాలు నీలావతి బుధవారం మండల కేంద్రంలో కిరాణా సరుకులు కొనుగోలు చేసి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో 44వ జాతీయ రహదారిపై గుడ్డాలపల్లి క్రాస్ వద్ద ఆటో కోసం వేచి ఉన్న సమయంలో తలకు హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనంపై వచ్చిన యువకుడు వృద్ధురాలి పక్కనే వాహనాన్ని ఆపి తాను కూడా గుడ్డాలపల్లికి వెళుతున్నట్లు నమ్మబలికి ఆమెను ఎక్కించుకుని ముందుకు కదిలాడు. రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే వాహనాన్ని ఆపి తనకు ఫోన్కాల్ రావడంతో వెనక్కి వెళ్లాల్సి ఉందని తెలపడంతో వృద్ధురాలు కిందకు దిగింది. ఆ సమయంలో ఆమె మెడలోని 5 తులాల బంగారు చైన్ను లాక్కొని ద్విచక్ర వాహనంపై వేగంగా జాతీయ రహదారి వైపుగా ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. పాఠశాలలో ఆకతాయిల విధ్వంసం ఉరవకొండ: స్థానిక 8వ వార్డు పాతపేటలోని మండల పరిషత్ ప్రాథమిక సెంట్రల్ పాఠశాలలో ఆకతాయిలు, తాగుబోతులు మంగళవారం రాత్రి విధ్వంసానికి పాల్పడ్డారు. తొలుత పాఠశాల గ్రౌండ్ ప్లోర్లోని వరండా ఇనుప గ్రిల్ తలుపును విరగొట్టి లోపలికి ప్రవేశించారు. తరగతి గదిలోని రెండు సీలింగ్ ఫ్యాన్లు తొలగించి పక్కన పడేశారు. అనంతరం విద్యుత్ స్విచ్ బోర్డుతో పాటు నీటి మోటార్కు చెందిన స్టార్టర్ బోర్డును పగులగొట్టారు. ప్లోరింగ్ టైల్స్ బండరాళ్లతో ధ్వంసం చేశారు. తరగతి గదిలోనే మద్యం తాగి అక్కడే సీసాలు పగులగొట్టి, మూత్ర విసర్జన చేశారు. బుధవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయులు అక్కడి విధ్వంసాన్ని గుర్తించి ఎంఈఓ ఈశ్వరప్ప దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్రస్థాయిలో ఎంఈఓ పరిశీలించిన అనంతరం హెచ్ఎం నసీరాబేగంతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొత్త పింఛన్లు మంజూరు చేయాలి
● ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి డిమాండ్ ఉరవకొండ: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా సామాజిక భద్రతా పింఛన్ల మంజూరుపై దృష్టి సారించడం లేదని, ఫలితంగా అర్హులైన లక్షలాది మంది నిరాశ నిస్పృహలతో జీవనం సాగిస్తున్నారని శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త పింఛన్ కోసం ఎంతో మంది వితంతువులు, దివ్యాంగులు, డయాలసిస్ రోగులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. అర్హులైన వీరికి పింఛన్ అందిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజురు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్కళ్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికు లేఖలు రాసినట్లు తెలిపారు. తల్లిదండ్రుల చెంతకు ఇంటర్ విద్యార్థి తాడిపత్రి టౌన్: ఇంటర్ ఫెయిల్ కావడంతో ఇంట్లో చెప్పకుండా వెళ్లిన విద్యార్థి ఆచూకీని 24 గంటల్లోపే గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. వివరాలు... తాడిపత్రి మండలం బొడాయిపల్లికి చెందిన పుల్లారెడ్డి కుమారుడు నాగవర్దన్రెడ్డి తాడిపత్రి లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 12న ఫలితాలు వెలువడడంతో తన ఉత్తీర్ణతను తెలుసుకునేందుకు తాడిపత్రికి వచ్చిన నాగవర్దన్రెడ్డి ఫెయిల్ అయినట్లుగా నిర్ధారించుకుని ఎటో వెళ్లిపోయాడు. రోజు గడిచినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తెలిసిన వారి వద్ద ఆరా తీశారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఫెయిల్ అయిన కుమారుడు ఏ అఘాయిత్యం చేసుకున్నాడోనని కన్నీరుమున్నీరవుతూ ఈ నెల 14న తండ్రి తాడిపత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తిరుపతిలో ఉన్న నాగవర్దన్రెడ్డిని అక్కడి పోలీసుల సాయంతో గుర్తించి మంగళవారం రాత్రి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. బుధవారం తాడిపత్రి పీఎస్కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ అనంతరం తండ్రి పుల్లారెడ్డికి అప్పగించారు. సకాలంలో స్పందించి తమ కుమారుడిని సురక్షితంగా అప్పగించేలా చొరవ చూపిన ఎస్ఐ గౌస్బాషాకు పుల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
అంతర జిల్లా చైన్స్నాచర్ల అరెస్ట్
అనంతపురం: ఒంటరిగా వెళ్లే మహిళల్ని టార్గెట్ చేసి వారి మెడలోని బంగారు గొలుసులను లాక్కొని ఉడాయించే అంతర జిల్లా చైన్స్నాచర్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి మొత్తం రూ.32.40 లక్షల విలువ చేసే 36 తులాల బంగారం, నగదు, మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో అనంతపురం శివారులోని రాజీవ్ కాలనీకి చెందిన కె.పంపాచారి అలియాస్ నరేష్, రాయల్ నగర్కు చెందిన షేక్ షాకీర్, ప్రియాంకనగర్ నివాసి షేక్ ఫజిల్ అహమ్మద్ అలియాస్ షేక్ ఫజిజ్ అహమ్మద్, శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ నివాసి కంబం నాగార్జున అలియాస్ చిన్నా ఉన్నారు. బుధవారం డీపీఓలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఎస్పీ పి.జగదీష్ వెల్లడించారు. అందరూ 24 నుంచి 30 ఏళ్ల లోపు వారే పట్టుబడిన నిందితులందరూ 24 నుంచి 30 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. కె.పంపాచారి కార్పెంట్ వృత్తితో పాటు డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పేకాట, క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి సంపాదన మొత్తం వ్యసనాలకే ఖర్చు పెట్టేవాడు. ఇతనికి నాలుగు నెలల క్రితం కంబం నాగార్జున పరిచయమయ్యాడు. నాగార్జున సొంతూరు శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ కాగా, ఏడాదిన్నర క్రితం కుటుంబంతో సహా అనంతపురానికి వలస వచ్చి సుఖ్దేవ్నగర్లో నివాసముంటున్నాడు. డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పంపాచారి పరిచయమైన తర్వాత ఇద్దరూ కలసి పేకాట, ఆన్లైన్ జూదం ఆడుతూ సంపాదన మొత్తం పోగొట్టుకుని అప్పుల పాలయ్యారు. రాయల్ నగర్కు చెందిన షేక్ షాకీర్... కార్పెంటర్గా పనిచేసేవాడు. ఈ క్రమంలో సొంతంగా ఓ ఫర్నీచర్ షాప్ ఏర్పాటు చేసుకుని అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం కోసం అన్వేషిస్తుండగా పంపాచారి, నాగార్జున పరిచయమయ్యారు. ముగ్గురు కలసి వ్యక్తిగత అవసరాలకు, అప్పులు తీర్చేందుకు చైన్స్నాచింగ్లకు సిద్ధమయ్యారు. అనంతరం వీరందరూ కలసి బృందాలుగా విడిపోయి చైన్స్నాచింగ్కు పాల్పడేవారు. ప్రైవేట్ వాహన డ్రైవర్గా పనిచేస్తున్న షేక్ ఫజిల్ అహమ్మద్ సైతం ఆన్లైన్ బెట్టింగ్, పేకాట తదితర వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో పాటు ఇటీవల పెళ్లి సంబంధం కూడా ఖాయమైంది. పెళ్లి ఖర్చులకు డబ్బు లేకపోవడంతో చైన్స్నాచర్గా మారాడు. ఒంటిరిగా వెళ్లే మహిళలే లక్ష్యంగా..పంపాచారి ద్విచక్ర వాహనంపై ఒక్కడే వెళుతూ శివారు కాలనీలు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలోని బంగారు నగలను లాక్కొని అదే టూవీలర్పై ఉడాయించేవాడు. 2023 నుంచి కురుగుంట, మన్నీల, రాప్తాడు, అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డు, గణేష్ నగర్, లలితానగర్, ఒకటో రోడ్డు, తదితర ప్రాంతాల్లో 10 చైన్ స్నాచింగ్లు చేశాడు. అనంతరం షేక్ షాకీర్తో కలసి బైక్పై వెళుతూ కళ్యాణదుర్గం రోడ్డు, ద్వారకా విల్లాస్లో రెండు స్నాచింగ్లు, కంబం నాగార్జునతో కలసి హెచ్చెల్సీ రోడ్డు, స్టాలిన్ నగర్, బుక్కరాయసముద్రం, బి.కొత్తపల్లి గ్రామాల్లో నాలుగు స్నాచింగ్లు చేశాడు. మొత్తం 16 కేసుల్లో పంపాచారి నిందితుడు. ఇందులో రెండు కేసుల్లో షేక్ షాకీర్, నాలుగు కేసుల్లో కంబం నాగార్జున నిందితులుగా ఉన్నారు. షేక్ ఫజిల్ అహమ్మద్ ఎవరూ గుర్తుపట్టకుండా తలకు ఎరుపు రంగు క్యాప్ పెట్టుకుని, ముఖానికి ఖర్చీఫ్ కట్టుకుని చైన్స్నాచింగ్లకు పాల్పడేవాడు. అనంతపురంలోని శ్రీశ్రీ నగర్, హెచ్చెల్సీపై సచివాలయ మహిళా ఉద్యోగిని మెడలో ఉన్న బంగారు చైన్ అపహరణ, ఇతర మూడు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. నిందితులు నలుగురూ వేర్వేరుగా పట్టుబడ్డారు. చైన్స్నాచర్ల అరెస్ట్లో చొరవ చూపిన సీఐలు ఎన్.శేఖర్, కె.సాయినాథ్, ఇస్మాయిల్, జయపాల్రెడ్డి తదితరులను ఎస్పీ అభినందించారు. రూ.32.40 లక్షల విలువ చేసే 36 తులాల బంగారం, నగదు, మూడు బైక్ల స్వాధీనం వ్యసనాలతో అప్పులపాలై చైన్స్నాచర్లుగా మారిన యువకులు -
లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు
అనంతపురం మెడికల్: లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, ఆ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి పేర్కొన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. డొకాయ్ ఆపరేషన్లు చేపట్టి లింగ నిర్ధారణ స్కానింగ్లకు పాల్పడుతున్న సెంటర్లపై చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. అలాగే లింగ నిర్ధారణ చట్టం ఉల్లంఘనకు ఎలాంటి శిక్షలు ఉంటాయనే అంశంపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. సమావేశంలో డీఐఓ డాక్టర్ యుగంధర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవిశంకర్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రవికుమార్, గైనకాలజిస్టు డాక్టర్ రేణుక, పెథాలజిస్టు డాక్టర్ శ్రావణి పాల్గొన్నారు. 64 గ్రామాల్లో రక్తపూతలు సేకరించాలి ఉమ్మడి అనంతపురం జిల్లాలో దోమకాటు వ్యాధులు అధికంగా నమోదవుతున్న 32 మండలాల్లోని 64 గ్రామాల్లో పైలేరియా వ్యాధిని గుర్తించేందుకు రక్తపూతల సర్వే చేపట్టాలని సంబంధిత అధికారులను డీఐఓ ఓబులు ఆదేశించారు. బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో మలేరియా సబ్ యూనిట్ అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఈ నెల 25న ప్రపంచ మలేరియా దినంలో భాగంగా ప్రతి పీహెచ్సీ పరిధిలో ర్యాలీ, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో సహాయ మలేరియా సబ్ యూనిట్ అధికారులు మద్దయ్య, మునాఫ్, బత్తుల కోదండరామిరెడ్డి, తిరుపాల్, నాగేంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి -
మద్యం మత్తులో గొడవ
● ఇటుకతో బాదడంతో వ్యక్తి మృతి హిందూపురం: మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. ఓ వ్యక్తి సహనం కోల్పోయి ఇటుక పెళ్లతో బాదడంతో సుబ్బరాయప్ప(65) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన హిందూపురం మండలం గోళాపురం గుడ్డంపల్లిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గోళాపురం గుడ్డంపల్లి కర్ణాటక సరిహద్దున ఉండటంతో పాటు గ్రామంలో బెల్టుషాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే బంధువులైన సుబ్బరాయప్ప, నంజేగౌడ మంగళవారం పూటుగా మద్యం సేవించారు. ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో కుటుంబ విషయాలు ప్రస్తావనకు రావడంతో పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన నంజేగౌడ ఇటుక పెళ్లతో సుబ్బరాయప్ప తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయమైంది. బంధువులు హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా మారడంతో రాత్రి మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. హతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు. -
●తప్పతాగి... హల్చల్ చేసి
కూటమి పాలనలో తాగుబోతుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. బుధవారం రాత్రి అనంతపురంలోని రైల్వే స్టేషన్ కూడలిలో ఓ యువకుడు మద్యం మత్తులో నడిరోడ్డుపై హంగామా సృష్టించాడు. ఒంటిపై చొక్కా విప్పేసి దర్జాగా రోడ్డుపై పడుకుని వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించాడు. రాష్ట్రంలో సంపద సృష్టి అంటే యువకులను మద్యానికి బానిసలను చేయడం కాదని, ఇప్పటికై నా ప్రభుత్వం మత్తు వదిలి మద్యం విక్రయాలను కట్టడి చేయాలని ఈ సందర్భంగా అటుగా వెళుతున్న వారు వ్యాఖ్యానించడం గమనార్హం. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురంమహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ ధర్మవరం రూరల్: మండలంలోని రేగాటిపల్లి పొలాల్లో గత నెల 16న దారుణ హత్యకు గురైన చిట్రా అక్కమ్మ (57) కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. వివరాలను బుధవారం స్థానిక పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మవరం రూరల్ పీఎస్ సీఐ ఎన్.ప్రభాకర్ వెల్లడించారు. రావులచెరువు గ్రామానికి చెందిన చిట్రా అక్కమ్మకు 30 సంవత్సరాల క్రితం మేడాపురం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. దాదాపు 27 ఏళ్ల క్రితం అక్కమ్మ తన భర్త, పిల్లలను వదిలేసి ధర్మవరంలోని తిక్కస్వామి నగర్లో అద్దె ఇంటికి మకాం మార్చింది. ఈ క్రమంలో బతుకు తెరువు కోసం కళాజ్వోతి సర్కిల్లో వ్యభిచారం సాగిస్తుండేది. గత నెల 16న సాయంత్రం కళాజ్వోతి సర్కిల్లో విటుల కోసం వేచి ఉన్న ఆమెను స్థానిక శాంతినగర్కు చెందిన ఆటో డ్రైవర్ కట్టుబడి షెక్షావలి, టీచర్స్ కాలనీలోని చౌడమ్మ గుడి వద్ద నివాసముంటున్న తలారి లోకేంద్ర ఆటోలో ఎక్కించుకుని రేగాటిపల్లి పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ అక్కమ్మతో లోకేంద్ర లైంగిక కోరిక తీర్చుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో షెక్షావలి సాయంతో అక్కమ్మ తలపై లోకేంద్ర రాయితో కొట్టి గాయపరిచాడు. అనంతరం తన వద్ద ఉన్న కత్తితో ఆమె గొంతు కోసి హతమార్చాడు. మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు కత్తితో ముఖంపై ఉన్న చర్మాన్ని తొలగించి అక్కడ నుంచి ఉడాయించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డీఎస్పీ హేమంత్కుమార్ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టి పక్కా ఆధారాలతో నిందితులను గుర్తించారు. బుధవారం ఉదయం సీతారంపల్లి వద్ద జాతీయ రహదారిపై తచ్చాడుతున్న షెక్షావలి, లోకేంద్రను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. కాగా, నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన సీఐ ఎన్.ప్రభాకర్, ఎస్ఐ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు బాబ్జాన్, రాజప్ప, షాకీర్, అనిల్కుమార్, రాఘవేంద్ర, బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ చత్రూనాయక్, రామాంజినేయులను ఎస్పీ రత్న, డీఎస్పీ హేమంత్కుమార్ అభినందించారు. -
అంగన్వాడీ టీచర్లు, ఆయాల సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
● ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన వారిలో కలవరం ● ఇప్పటికే రాజీనామా చేసిన ఓ అంగన్వాడీ టీచర్ ● విచారణకు ముందుగానే రాజీనామా చేద్దామనే యోచనలో మరికొందరు సర్టిఫికెట్లను పరిశీలిస్తున్న ఐసీడీఎస్ సూపర్వైజర్లు డైరెక్టరేట్ ఆదేశాల మేరకు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన టీచర్లు, ఆయాలపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు వారి వద్ద ఉన్న సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ చేపట్టాం. ఎలాంటి వివక్ష చూపకుండా సర్టిఫికెట్లను పరిశీలించాలని సూపర్వైజర్లను ఆదేశించాం. ఫేక్సర్టిఫికెట్తో ఉద్యోగం పొందారని నిర్ధారణ అయితే శాఖాపరమైన చర్యలు తప్పవు. ఈ నెల 22వ తేదీ లోపు సర్టిఫికెట్లు అందజేయాలి. అందజేయని వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేయనున్నాం. – సాజిదాబేగం, సీడీపీఓ, తాడిపత్రి ప్రాజెక్టు తాడిపత్రి రూరల్: ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం ఐసీడీఎస్ను కుదిపేస్తోంది. ఫేక్ సర్టిఫికెట్లతో అంగన్వాడీ టీచర్లుగా, ఆయాలుగా ఉద్యోగాలు పొందిన వారిలో కలవరం మొదలైంది. ఐసీడీఎస్ డైరెక్టరేట్ ఆదేశాల మేరకు తాడిపత్రిలోని ఆ శాఖ కార్యాలయంలో మంగళవారం సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ చేపట్టారు. తాడిపత్రి ప్రాజెక్టు పరిధిలోని తాడిపత్రి టౌన్, తాడిపత్రి మండలం, పెద్దపప్పూరు, యాడికి, పెద్దవడుగూరు మండలాలకు చెందిన దాదాపు 302 అంగన్వాడీ సెంటర్లకు చెందిన టీచర్లు, ఆయాలు స్థానిక ఐసీడీఎస్ కార్యాలయానికి చేరుకుని తమ పదవ తరగతి మార్కుల జాబితా, స్టడీ సర్టిఫికెట్లు, ఉద్యోగం పొందిన ఆర్డర్ కాపీలను ఒరిజనల్తో పాటు గెజిటెడ్ సంతకంతో కూడిన జిరాక్స్ కాపీలను అందజేసేందుకు తరలిరావడంతో కార్యాలయం మంగళవారం కిక్కిరిసింది. సూపర్వైజర్లు తమకు కేటాయించిన క్లస్టర్ పరిధిలోని టీచర్లు, ఆయాలకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనలో నిమగ్నమయ్యారు. రాష్ట్రాన్ని కుదిపేసిన తాడిపత్రి ఘటన ఉమ్మడి జిల్లాలోని ఐసీడీఎస్ కార్యాలయాల పరిధిలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించిన ఫేక్ సర్టిఫికెట్ల డొంక కదులుతోంది. తాడిపత్రి ఐసీడీఎస్ ప్రాజెక్టులో ప్రారంభమైన ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా విచారణకు కారణమైంది. ప్రకాశం జిల్లాలోనూ పలువురు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందినట్లుగా గుర్తించిన అధికారులు అక్కడ సైతం విచారణ చేపట్టారు. దీంతో తాడిపత్రి ప్రాజెక్ట్లో కొందరు కోర్టును ఆశ్రయించిన తరహాలోనే అక్కడి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు హైకోర్టు మెట్లు ఎక్కారు. ఇది కాస్త ఐసీడీఎస్ డైరెక్టరేట్కు తలనొప్పి మారడంతో ఈ వివాదానికి పుల్స్టాప్ పెట్టేలా ఫేక్ సర్టిఫికెట్లను సమర్పించి ఉద్యోగం పొందిన టీచర్లు, ఆయాలను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ విచారణ బాధ్యతను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు అప్పగించడంతో సర్టిఫికెట్ల పరిశీలన వేగవంతమైంది. స్పష్టమైన ఆదేశాలు జారీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూపర్వైజర్లకు స్పష్టమైన అదేశాలు అందాయి. గతంలో వెలుగు చూసిన ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంపై అప్పట్లో జిల్లా ఐసీడీఎస్ అధికారులు చేపట్టిన పరిశీలన ప్రక్రియ కాస్త యూనియన్ నాయకుల ఒత్తిళ్ల కారణంగా నీరుగారిపోయింది. పలు కారణాలు చూపుతూ అప్పట్లో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారు శాఖపరమైన చర్యల నుంచి తప్పించుకున్నారు. తాజాగా ఈ వివాదం రాష్ట్రస్థాయి సమస్యగా మారడంతో స్వయంగా డైరెక్టరేట్ జోక్యం చేసుకుని పునర్విచారణకు ఆదేశించడంతో అక్రమార్కుల గుండెల్లో దడ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ అక్రమార్కులకు అండగా నిలిచిన వారు సైతం చేతులెత్తేశారు. రాజీనామా బాటలో.. వ్యక్తిగత కారణాల పేరుతో ఇప్పటికే అంగన్వాడీ టీచర్ ఒకరు రాజీనామా చేశారు. అయితే ఫేక్ సర్టిఫికెట్ల కారణంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటే ఉన్న పరువు కాస్త పోతుందన్న ఆలోచనతో ఆమె రాజీనామా చేసినట్లుగా వదంతులు వ్యాపించాయి. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన మరికొందరు కూడా ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు యూనియన్ నాయకులతో మంతనాలు జరుపుతుండగా, మరికొందరు పరువు పోకుండా ముందస్తుగానే రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి వారు తొలిరోజు సర్టిఫికెట్ల పరిశీలనకు దూరంగా ఉన్నట్లు సమాచారం. -
సమ్మె బాటలో ఎంఎల్హెచ్పీలు
● స్తంభించిపోనున్న ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్ సేవలు అనంతపురం మెడికల్: మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు (ఎంఎల్హెచ్పీ) సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సేవలు (గతంలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లు) స్తంభించిపోనున్నాయి. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్/కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయం ఆవరణలో ఎన్హెచ్ఎం ఆఫీసర్ డాక్టర్ రవిశంకర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు గణేష్, కార్యనిర్వహణ కార్యదర్శి షేబా ప్రియాంక, కోశాధికారి గౌరి మాట్లాడుతూ ఎన్హెచ్ఎం ఉద్యోగులకు 23 శాతం జీతం పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులకు అతీగతి లేకుండా పోయిందని, ఆరేళ్లుగా పని చేస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రెగ్యులరైజేషన్, జాబ్ చార్ట్ తదితర వాటిపై స్పష్టత లేదన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బుధవారం ఆన్లైన్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 17న పీహెచ్సీల వద్ద ధర్నా, 19న డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట నిరసన, 21న పోస్టుకార్డు ఉద్యమం, 22న జిల్లా కేంద్రంలో ధర్నా, 24న నిరవధిక సమ్మెలోకి వెళ్తామని వెల్లడించారు. -
పీ4 పేరుతో చంద్రబాబు వంచన
అనంతపురం అర్బన్: రాష్ట్రంలో పీ4 అమలుతో పేదరికం పోగొడతానంటూ ప్రజలను సీఎం చంద్రబాబు వంచనకు గురి చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. అనంతపురంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ మోదీ, చంద్రబాబు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల కారణంగా పేదలు, ధనవంతుల మధ్య తారతమ్యం పెరుగుతోందన్నారు. దేశ, రాష్ట్ర సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతూ పేదరికం పెంచుతున్నట్లుగా గొప్పలకు పోతున్నారని విమర్శించారు. వక్ఫ్ చట్టం సవరణ పేరుతో రాజ్యాంగం, లౌకికవాదంపై కేంద్రంలోని కూటమి ప్రభుత్వం దాడి చేస్తోందన్నారు. ఇది ఇక్కడితో ఆగదని, ముస్లింల తర్వాత చర్చిల భూములు, అటు తర్వాత హిందు ఆలయాల భూములపై కేంద్ర ప్రభుత్వం ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. దెబ్బతిన్న పంటలపై శ్రద్ధ చూపని ప్రభుత్వం కూడేరు: ప్రకృతి వైపరీత్యాలతో అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో దెబ్బతిన్న తోటలు, ఇతర పంటలపై నష్టం అంచనా వేయించి ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని రామకృష్ణ మండిపడ్డారు. మంగళవారం ఆయన కూడేరు మండలం ముద్దలాపురం, కడదరకుంట, చోళసముద్రం గ్రామాల్లో పర్యటించి, మూడు రోజుల క్రితం పెను గాలులు, వర్షానికి దెబ్బతిన్న అరటి, మొక్కజొన్న పంటలను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.35 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేస్తోందని, అయితే ఈ సాయం రైతులకు ఏ లెక్కన సరిపోదన్నారు. పంటను బట్టి నష్టపరిహారం అందివ్వడంతో పాటు మళ్లీ ఉద్యాన పంటలు సాగుకు ఆర్ధిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, నాయకులు కేశవరెడ్డి, గోపాల్, రమణ, రాజేష్గౌడ్, కుళ్లాయిస్వామి, కృష్ణుడు, ఆంజనేయులు, సంగప్ప, మలరాయుడు తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం -
స్వల్పంగా పెరిగిన స్కేల్ ఆఫ్ రిలీఫ్
అనంతపురం అగ్రికల్చర్: ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆస్తి, పంట, పశువులు, జీవాలు, కోళ్ల నష్టానికి వర్తింపజేసే ఎక్స్గ్రేషియా (స్కేల్ ఆఫ్ రిలీఫ్) స్వల్పంగా పెంచుతూ రాష్ట్ర ప్రకృతి విపత్తుల విభాగం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం ప్రతి రెండు, మూడు సంవత్సరాలకు స్కేల్ ఆఫ్ రిలీఫ్ ఖరారు చేస్తారు. ఈ క్రమంలోనే తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. పెరిగిన స్కేల్ ఆఫ్ రిలీఫ్ 2024 ఆగస్టు నుంచి వర్తిస్తుందని పేర్కొన్నారు. ● పాడి ఆవు లేదా గేదె చనిపోతే రూ.50 వేలు, ఎద్దుకు రూ.40 వేలు, దూడలకు రూ.25 వేలు, గొర్రెలు, మేకలకు రూ.7,500, కోడికి రూ.100 ప్రకారం గరిష్టంగా రూ.10 వేలు, పశువుల పాక నష్టానికి రూ.5 వేల ప్రకారం వర్తింపజేశారు. ● మనిషి చనిపోతే రూ.5 లక్షలు, ఇళ్లు కూలినా, దెబ్బతిన్నా రూ. 10 వేలు, కిరాణా కొట్టుకు రూ.25 వేలు, రూ.40 లక్షల వార్షిక టర్నోవర్ కలిగిన కుటీర పరిశ్రమలకు రూ.50 వేలు, రూ.1.50 కోట్ల లోపు టర్నోవర్ కలిగిన వాటికి రూ.లక్ష, రూ.ఒకటిన్నర కోటికి పైగా టర్నోవర్ కలిగిన వాటికి రూ.1.50 లక్షలు, ద్విచక్రవాహనాలకు రూ.3 వేలు, త్రిచక్ర వాహనాలకు రూ.10 వేలు, తోపుడు బండ్లకు రూ.20 వేలు, చేనేతలకు రూ.25 వేలు, పాక్షికంగా బోట్లు దెబ్బతింటే రూ.9 వేలు, వలలకు రూ.5 వేలు, బోట్లు, వలలు పూర్తిగా దెబ్బతింటే రూ.20 వేలు, మోటార్ బోట్లు, వలలు దెబ్బతింటే రూ.25 వేలు, చేపల చెరువుకు రూ.18 వేలు, పట్టు రైతులకు 25 వేల ప్రకారం నష్ట ఉపశమనం వర్తింపజేస్తారు. ● వేరుశనగ, పత్తి, వరి, చెరకు హెక్టారుకు రూ.25 వేల ప్రకారం లెక్కకట్టి ఇస్తారు. సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, కంది, కుసుమ, సోయాబీన్, పొద్దుతిరుగుడు, పొగాకు, ఆముదం, కొర్ర, సామ, జూట్ పంటలు హెక్టారుకు రూ.15 వేల ప్రకారం స్కేల్ ఆఫ్ రిలీఫ్ ఖరారు చేశారు. ● అరటి,మామిడి, దానిమ్మ, జామ, ఉసిరి, సపోటా, రేగు, డ్రాగన్ ఫ్రూట్, జీడిపప్పు, కాఫీ, పసుపు, మిరపహెక్టారుకు రూ.35 వేలు,కళింగర,కర్భూజా, దోస, బొప్పాయి, టమాట, పూలు, ఉల్లి, ధనియాలు, కూరగాయలకు రూ.25 వేలు, సెంటు విస్తీర్ణంలో ఉన్న ఆకుతోటలకు రూ.300 ప్రకారం గరిష్టంగా రూ.75 వేల వరకు ఇస్తారు. కర్రపెండలం రూ.10 వేలు, ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.1,500 ప్రకారం ఖరారు చేశారు. -
‘కామన్ సీనియారిటీ వర్తింపజేయాలి’
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని డీఎస్సీ 2008 హామీ పత్ర ఉపాధ్యాయులకు కామన్ సీనియార్టీ అమలు చేయాలని ఏపీటీఎఫ్(1938) నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్బాబును మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘టిస్’లో బాధిత ఉపాధ్యాయులకు ఎడిట్ ఆప్షన్ కల్పించాలన్నారు. 2023 వేసవి సెలవుల్లో ఇండక్షన్ ట్రైనింగ్లో మొదటి మూడు విడతలకు హాజరైన డీఎస్సీ 1998, 2008 ఉపాధ్యాయులకు మాత్రమే ఐదు రోజుల వేతనం మంజూరుకు ఉత్తర్వులు ఇచ్చారని, 4, 5 విడతలకు హాజరైన డీఎస్సీ 1998, 2008 ఉపాధ్యాయులకు కూడా ఐదు రోజుల వేతనం మంజూరుకు ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఈఓ స్పందిస్తూ త్వరగతిన ఉత్తర్వులు విడుదల చేస్తామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస నాయక్, డీఎస్సీ 2008 హామీ పత్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జిల్లాకు వర్షసూచన
బుక్కరాయసముద్రం: ఉమ్మడి జిల్లాలో రానున్న 5 రోజుల్లో చిరు జల్లులు పడే అవకాశం ఉన్నట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్బాబు, వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 40.2–41.3, రాత్రి 23.9–24.7 డిగ్రీల సెల్సియస్ నమోదు కావొచ్చన్నారు. రూ.2.91 కోట్ల పంట నష్టం అనంతపురం అగ్రికల్చర్: అకాల వర్షం, ఈదురుగాలుల కారణంగా సోమవారం సాయంత్రం రూ.2.91 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. శింగనమల, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, అనంతపురం, యల్లనూరు, ఉరవకొండ, కూడేరు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, గుమ్మఘట్ట, గుంతకల్లు, పెద్దవడుగూరు మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో అరటి, మామిడి, బొప్పాయి, కళింగర, మునగ తదితర పంటలు 95 హెక్టార్లలో దెబ్బతినడంతో 115 మంది రైతులకు రూ.1.50 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. అలాగే, శింగనమల, నార్పల, గార్లదిన్నె, కంబదూరు, బెళుగుప్ప మండలాల్లో 173 హెక్టార్లలో మొక్కజొన్న, వరి, పత్తి పంటలు దెబ్బతినడంతో 92 మంది రైతులకు రూ.1.41 కోట్ల నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. మెట్ట భూముల సాగుకు తోడ్పాటు : డ్వామా పీడీ అనంతపురం టౌన్: మెట్ట భూముల్లో మామిడి, నిమ్మ, జామ, బత్తాయి, సపోటా తదితరాలు సాగు చేసేవారికి ఉపాధి హామీ పథకం ద్వారా తోడ్పాటునందిస్తామని డ్వామా పీడీ సలీంబాషా తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 8 వేల ఎకరాల మెట్టభూముల్లో ఉద్యాన పంటలు అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. ఐదు ఎకరాల్లోపు మెట్ట భూములున్న రైతులు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ ఏడాది మామిడి, చీనీ, దానిమ్మ, నిమ్మ, జామ, అల్లనేరుడు, డ్రాగన్ ఫ్రూట్, సపోట, అంజూర సాగుకు అవకాశం కల్పించినట్లు వివరించారు. రైతులే మొక్కలను కొనుగోలు చేసుకుంటే వారి ఖాతాల్లో నిధులు జమ చేస్తామన్నారు. ఎకరా లోపు పొలం ఉన్న రైతులు సైతం మునగ, పూల మొక్కల సాగుకు దరఖాస్తులు అందజేయాలని సూచించారు.అక్రమాలకు పాల్పడొద్దు అనంతపురం అర్బన్: పింఛన్ల పంపిణీలో అవినీతి, అక్రమాలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ వి.వినోద్కుమార్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. పింఛను లబ్ధిదారులతో గౌరవంగా మాట్లాడాలన్నారు. డీఆర్ఈఏ పీడీ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
మొదటి సంతకంతోనే మోసం
అనంతపురం ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో మొదటి సంతకంతోనే డీఎస్సీ అభ్యర్థులకు చంద్రబాబు మోసం చేశారని డెమోక్రటిక్ యూత్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్ఐ) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అభ్యర్థులతో కలిసి మంగళవారం అనంతపురం నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, జిల్లా కన్వీనర్ కసాపురం రమేష్, జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ మాట్లాడుతూ పది నెలలు గడిచినా ముఖ్యమంత్రి మొదటి సంతకాన్ని అమలు చేసే పరిస్థితి లేనప్పుడు వారంలోనే మెగా డీఎస్సీని విడుదల చేస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అనేక ప్రకటనలతో నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారన్నారు. వెంటనే మెగా డీఎస్సీ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. అప్పటికీ దిగిరాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనలను అడ్డుకుంటామన్నారు. అనంతపురం జిల్లాకు డీఎస్సీలో వెయ్యి ఎస్జీటీ పోస్టులు పెంచాలన్నారు. జిల్లా అభ్యర్థులందరికీ ఒకే పేపర్ ఉండేలాగా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో కూడా ద్వితీయ ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయాలన్నారు. అనంతరం డీఈఓ ప్రసాద్బాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు నూరుల్లా, సురేంద్రబాబు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిద్దు, పరమేష్, తరిమెల గిరి, భీమేష్, సాయి పాల్గొన్నారు. నిరుద్యోగులను వంచించిన చంద్రబాబు డీఈఓ ఆఫీస్ను ముట్టడించిన డీఎస్సీ అభ్యర్థులు -
హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్
బొమ్మనహాళ్: మండలంలోని కల్లుహోళ గ్రామంలో టీడీపీ నేత సోమన్నగౌడ్పై హత్యాయత్నం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం స్థానిక పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఎస్ఐ నబీరసూల్ వెల్లడించారు. గ్రామానికి చెందిన హనుమక్కతో పదేళ్లుగా వివాహతేర సంబంధం కొనసాగిస్తూ వచ్చిన సోమన్నగౌడ్ చివరకు అమెకు అన్యాయం చేసి, మతిస్థిమితం కోల్పోయేలా చేశాడని, దీంతో గ్రామంలో పరువు పోయిందన్న అక్కసుతో సోమన్న గౌడ్పై హనుమక్క మేనల్లుడు గోవిందు కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వన్నప్ప సహకారంతో ఆదివారం రాత్రి తన ఇంటి ఎదుట నిద్రిస్తున్న సోమన్నపై పిడిబాకుతో దాడి చేశారు. సోమన్నగౌడ్ కేకలు వేయడంతో పరారయ్యారు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... మంగళశారం ఉదయం నేమకల్లు గ్రామ రహదారిలో తచ్చాడుతున్న గోవిందు, వన్నప్పను అరెస్ట్ చేసి, పిడిబాకు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఆటో బోల్తా...రైతు మృతి రాప్తాడు రూరల్: ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ రైతు మృతిచెందాడు. పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామానికి చెందిన పలువురు మంగళవారం ఉదయం వ్యక్తిగత పనిపై అదే గ్రామానికి చెందిన దూదుకుల భక్తర్ ఆటోలో అనంతపురానికి బయలుదేరారు. గ్రామ శివారులోని సచివాలయం దాటిన తర్వాత రోడ్డు పక్కన మట్టి లేకపోవడంతో కిందకు దిగిన ఆటో తిరిగి రోడ్డు ఎక్కే క్రమంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో రైతు ఎర్రముద్దయ్యగారి వెంకట్రాముడు (59) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన పలువురిని స్థానికులు వెంటనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. ఘటనపై ఇటుకలపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 15 మంది విద్యార్ధులకు గాయాలు బొమ్మనహాళ్: పాఠశాల విద్యార్ధులను తరలిస్తున్న ఆటో బోల్తా పడడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వివరాలు.. బొమ్మనహాళ్ మండలం కానాపురం, కొత్తూరు గ్రామాలకు చెందిన పలువురు విద్యార్థులు డి.హీరేహాళ్ మండలం సోమలాపురంలోని ప్రఝఝబుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో రోజూ ఆటోలో పాఠశాలకు వెళ్లి వచ్చేవారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం పాఠశాల నుంచి స్వగ్రామాలకు తిరుగు ప్రయాణమైన విద్యార్థులు.. కానాపురం సమీపంలోని మలుపు వద్ద డ్రైవర్ చంద్ర వేగ నియంత్రణ కోల్పోవడంతో ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో విద్యార్థులు శ్రీకాంత్, కావ్య, జయలత, భూమిక, గణేష్, హుసేన్, పర్వీన్, కావేరి, మహాలక్ష్మి, ఈశ్వరమ్మ, సింధు, శంకర్, సంతోష్, అభయ్, నరేష్ తదితరులు గాయపడ్డారు. గాయపడిన విద్యార్దులను స్ధానికులు బళ్లారిలోని విమ్స్కు తరలించారు. నేడు బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సేవా శిబిరం అనంతపురం సిటీ: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) వినియోగదారుల సమస్యల పరిష్కార శిబిరం బుధవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ శాఖ డివిజనల్ ఇంజినీర్ డి.గోపాల్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కస్టమర్ సర్వీస్ మాసంలో భాగంగా అనంతపురంలోని ఆదిమూర్తినగర్లో ఉన్న వేమన భవన్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం నిర్వహించనున్నారు. మొబైల్ సిమ్ సేవలు, ఎఫ్టీటీహెచ్(ఫైబర్ ఇంటర్నెట్), ఇతర సేవలకు సంబంధించిన సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చు. -
జిల్లా జడ్జికి ఘన సన్మానం
అనంతపురం: ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ సేవలు ప్రశంసనీయమని ఎస్పీ పి.జగదీష్ కొనియాడారు. బదిలీపై వెళ్తున్న జడ్జి జి.శ్రీనివాస్ను మంగళవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ.. న్యాయమూర్తి జి.శ్రీనివాస్ మార్గదర్శకంలో జిల్లా పోలీసు, న్యాయశాఖలు పరస్పర సహకారంతో బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేశాయన్నారు. కఠిన నేరాల్లో ముద్దాయిలకు కఠిన శిక్షలు వేయడాన్ని గుర్తు చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి పెద్దపప్పూరు: మండలంలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో మంగళవారం చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... శింగనమల మండలం జలాలపురం గ్రామానికి చెందిన గిరిస్వామి (60) మంగళవారం వ్యక్తిగత పనిపై తాడిపత్రికి వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన ముచ్చుకోట అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన గిరిస్వామిని అటుగా వెళుతున్న వారు గుర్తించి వెంటనే అనంతపురంలోని అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. గుండెపోటుతో విశ్రాంత ఉపాధ్యాయుడి మృతి యల్లనూరు: మండలంలోని పాతపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకట కొండారెడ్డి(86) సోమవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. మండలంలోని జంగంపల్లి, పాతపల్లి, కాచర్లకుంట తదితర గ్రామాల్లోని పాఠశాలల్లో ఆయన ఉపాధ్యాయుడుగా విధులు నిర్వర్తించారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో స్థిరపడిన ఆయన అకాల మృతితో పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన అంత్యక్రియలను స్వగ్రామం పాతపల్లిలో నిర్వహించారు. -
ఉమ్మడి అనంతలో చాపకింద నీరులా విస్తరిస్తున్న షుగర్ వ్యాధి
● అనంతపురం నగరానికి చెందిన రంగనాథ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. వయసు 32 ఏళ్లు. మూడేళ్ల క్రితం పెళ్లయింది. ఎందుకో అనుమానమొచ్చి ఇటీవల ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా షుగర్ ఉన్నట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా అతను ఖిన్నుడయ్యాడు.సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంత పురం జిల్లాలో మధుమేహ జబ్బు చాపకింద నీరులా విస్తరిస్తోంది. జనాభా పెరుగుదల రేటుతో పోల్చి చూస్తే డయాబెటిక్ బారిన పడుతున్న వారే ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. యువకులు సైతం జీవనన శైలి జబ్బుల బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో 40 ఏళ్లు నిండిన వారిలో ఎక్కువగా ఆయా జబ్బుల బారిన పడేవారు. కానీ, ఇటీవల 30 ఏళ్లు దాటని వారూ వీటి కోరల్లో చిక్కుతున్నారు. ఈ విషయం వైద్యులను కూడా విస్మయానికి గురి చేస్తోంది.గ్రామీణులూ బాధితులే..మధుమేహం, రక్తపోటు తదితర జబ్బులతో బాధపడే వారు ఒకప్పుడు పట్టణాలు, నగరాల్లోనే ఎక్కువగా ఉండేవారు. పని ఒత్తిడితో సతమతమవడం కారణంగా వీటి బారిన పడేవారు. కానీ, ఇప్పుడు ఆయా రోగాలు పల్లెలకూ విస్తరించడం గమనార్హం. ఈ క్రమంలోనే డయాబెటిక్, బీపీ మందుల ధరలు పెరగడం సామాన్యులకు కొరకరాని కొయ్యగా మారింది.అవగాహన లేకే..అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) బాధితులు 27 శాతం పైగానే ఉన్నట్టు తేలింది. పట్టణాల్లో అయితే ఇది 30 నుంచి 32 శాతం కూడా ఉన్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. ఇక.. షుగర్, హైపర్టెన్షన్ జబ్బులు నియంత్రణలో లేనివారు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో శరీరంలో ఇతర అవయవాలపై ప్రభావం పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జబ్బుల నియంత్రణపై అవగాహన లేకపోవడం అనర్థాలకు దారి తీస్తోంది.సమస్యలెన్నో..షుగర్ నియంత్రణలో లేకుంటే కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి.కంటిచూపుపై దుష్ప్రభావం పడుతుంది.శరీరంలో గాయాలైనప్పుడు మానడం చాలా కష్టం.మధుమేహం అదుపులో లేకపోతే గుండె జబ్బులొచ్చే అవకాశాలు ఎక్కువ.అధిక రక్తపోటు వల్ల బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.నరాల వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది.అలవాట్లు మార్చు కోవాలిమధుమేహం, హైపర్ టెన్షన్ ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. బాధితులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లేని ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు. పొగ తాగడం చాలా ప్రమాదకరం. – డా.సుధాకర్రెడ్డి, గుండె వైద్య నిపుణులు -
గిన్నిస్ బుక్లో రైల్వే ఉద్యోగికి చోటు
గుంతకల్లు: స్థానిక భాగ్యనగర్కు చెందిన రైల్వే ఉద్యోగి సునీల్కుమార్కు గిన్నిస్బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. చైన్నెలో ఉద్యోగం చేస్తున్న ఆయన గత ఏడాది డిసెంబర్ 1న 1,090 మంది విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు గంట పాటు కీబోర్డు వాయించి అందరినీ ఆకట్టుకున్నారు. దీంతో సోమవారం హైదరాబాద్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అతిథులుగా పాస్టర్ అనిల్కుమార్, అగస్టిన్ దండింగి చేతుల మీదుగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు పత్రాన్ని ఆయన అందుకున్నారు. -
రైతుల సమస్యలు పట్టని బ్యాంక్ అధికారులు
బ్రహ్మసముద్రం : మండలంలోని వేపులపర్తి గ్రామంలోని యూనియన్ బ్యాంక్ అధికారులకు రైతుల సమస్యలు పట్టడం లేదని మండల వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు గోపాలరెడ్డి, రైతులు మండిపడ్డారు. పంట రుణాల రెన్యువల్లో బ్యాంక్ అధికారుల అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం యూనియన్ బ్యాంక్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గోపాలరెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం రైతులు తీసుకున్న పంట రుణాల రెన్యువల్ జరుగుతున్నాయని జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో రైతుల నుంచి కేవలం వడ్డీ మాత్రమే తీసుకుని రుణాలను రెన్యువల్ చేస్తున్నారని తెలిపారు. అయితే స్థానిక యూనియన్ బ్యాంక్ అధికారులు మాత్రం రుణం మొత్తం చెల్లించాల్సిందేనంటూ వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి రైతుల పట్ల నిర్ధయగా వ్యవహరిస్తున్న బ్యాంక్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తే కేసులే..
ఉరవకొండ: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే కేసులు నమోదు చేయాల్సి ఉంటుందంటూ ఉరవకొండ రూరల్ సీఐ సయ్యద్ చిన్నగౌస్ హెచ్చరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఉరవకొండ పట్టణంలోని బీబీ జైనబ్బీ దర్గాలో రెండు రోజుల క్రితం సీఐ అధ్యక్షతన మైనార్టీల సమావేశం జరిగింది. అనధికారికంగా జరిగిన ఈ సమావేశానికి మత పెద్దలతో పాటు ముస్లింలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా సీఐ చిన్నగౌస్ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. రాజకీయంగా దీన్ని వాడుకోవాలని చూస్తే కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని బెదిరించారు. మైనార్టీల అభివృద్ధి కోసం మంత్రి పయ్యావుల కేశవ్ కృషి చేస్తున్నారని, టీడీపీతోనే మైనార్టీల అభ్యున్నతి సాధ్యమవుతుందంటూ టీడీపీ నాయకుడి తరహాలో సీఐ మాట్లాడడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీకి తొత్తుగా.. సీఐ సయ్యద్ చిన్నగౌస్ టీడీపీ తొత్తుగా పనిచేస్తున్నారనే విమర్శలున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఉరవకొండలో టీడీపీ గెలుపు కోసం పార్టీ అభ్యర్థితో సమానంగా వ్యూహాలు రచించి అమలు చేశారని ఆ పార్టీ ముఖ్య నేతలే చెబుతున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన కొందరు నాయకులను సీఐ బెదిరించి టీడీపీ కండువా వేసుకునేలా చేయడంతో పాటు ఉరవకొండలో తాను చెప్పిందే వేదమనేలా వ్యవహరిస్తున్నారు. రాజకీయ అరంగేట్రం కోసమేనా? మంత్రి కేశవ్కు నమ్మిన బంటుగా పేరుగాంచిన సీఐ చిన్నగౌస్ మరో నెలలో ఉద్యోగ విరమణ చేయబోతున్నారు. అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే మొదటిసారిగా ముస్లింలతో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. త్వరలో అన్ని సామాజిక వర్గాలతోనూ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో ఇప్పటికే సీఐ గౌస్ తనదైన శైలిలో టీడీపీ నేత తరహాలో చక్రం తిప్పుతున్నట్లు విమర్శలున్నాయి. ఉరవకొండ రూరల్ సీఐ చిన్నగౌస్ వివాదాస్పద వ్యాఖ్యలు -
హంద్రీ–నీవాకు లైనింగ్ వద్దు
అనంతపురం అర్బన్: హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులు చేపట్టి రైతుల బతుకులతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఏఐకేకేఎంఎస్ (అఖిల భారత వ్యవసాయ కూలీ సంఘం) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గిరీష్, నాగముత్యాలు మండిపడ్డారు. లైనింగ్ కారణంగా భూగర్భజలాలు అడుగంటి రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే లైనింగ్ పనులు ఆపి, కాలువ వెడల్పు పనులు చేపట్టాలని, హంద్రీ–నీవాకు 40 టీఎంసీల నీటిని కేటాయించాలనే డిమాండ్లతో సంఘం ఆధ్వర్యంలో నాయకులు, రైతులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడారు. హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ చేపట్టడమంటే రైతులకు భవిష్యత్తు లేకుండా చేయడమేనని మండిపడ్డారు. హంద్రీ–నీవా కాలువ పరిసరాల్లోని వై.కొత్తపల్లి, పంపనూరు, పంపనూరు తండా, వేపచెర్ల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరగడంతో రైతులు పంటలు పండించుకోగలుగుతున్నారని తెలిపారు. ఫేజ్–2లో భాగంగా హంద్రీ–నీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ చేపట్టడం ద్వారా భూగర్భజలాలు అడుగంటి పండ్ల తోటలు, ఇతర పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్రనష్టపోతారన్నారు. అలాగే గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతుందన్నారు. రైతులు వ్యవసాయం వదులుకుని ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లే పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని లైనింగ్ పనులు ఆపి, 8వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యాంతో కాలువను వెడల్పు చేయాలని, ఏటా 40 టీఎంసీల నికర జలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ వినోద్కుమార్కు అందజేశారు. కార్యక్రమంలో ఎస్యూసీఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర, నాయకులు వెంకటేష్ నాయక్, రమేష్, రామకృష్ణ, ఎర్రిస్వామి, రైతులు పాల్గొన్నారు. ఏఐకేకేఎంఎస్ నాయకుల డిమాండ్ పనులు ఆపి, కాలువ వెడల్పు చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా -
వడ్డీతో రుణాలు రెన్యువల్ చేయండి
అనంతపురం అగ్రికల్చర్: రైతులకు సంబంధించి బ్యాంకుల్లో బంగారు నగల తాకట్టు రుణాలతో పాటు పంట రుణాలను కేవలం వడ్డీ కట్టించుకుని రెన్యువల్ చేయాలని బ్యాంకర్లకు ఏపీ రైతు సంఘం నాయకులు విన్నవించారు. ఈ మేరకు... రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఎం.బాలరంగయ్య, ఎం.కృష్ణమూర్తి, బీహెచ్ రాయుడు, వలీ తదితరుల బృందం ఎస్బీఐ, కెనరాబ్యాంకు, ఏపీజీబీ, యూనియన్ బ్యాంకు రీజనల్ మేనేజర్లను మంగళవారం కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరువు పరిస్థితులు ఏర్పడటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, పెట్టుబడిసాయం లాంటివి అందక రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారు రుణాలు, పంట రుణాలు పూర్తిగా చెల్లించి రెన్యువల్ చేసుకోవాలంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. దీని వల్ల రైతులు మరింత కష్టాల్లో పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పట్ల మానవత్వంతో వ్యవహరించి కేవలం వడ్డీ కట్టించుకుని రుణాలను రెన్యువల్ చేయాలని కోరారు. అసలు, వడ్డీ చెల్లించాలని బలవంతం చేయడం మంచిదికాదన్నారు. ఖరీఫ్ వస్తున్నందున బ్యాంకుల్లో ఇక నుంచి జోరుగా రెన్యువల్ కొనసాగుతాయన్నారు. బ్యాంకుల వద్ద తాగునీరు, నీడ సదుపాయం కల్పించాలని కోరారు. బ్యాంకుల్లో వచ్చిన సర్కులర్లు, నోటీసులు తెలుగులో ముద్రించి పెట్టాలన్నారు. ప్రతి రైతుకూ కిసాన్ క్రెడిట్ కార్డు అందించాలని, మార్టిగేజ్ లేకుండా రూ.5 లక్షల వరకు పంట రుణాలు ఇవ్వాలని కోరారు. బ్యాంకర్లకు రైతు సంఘం వినతి పత్రం -
యువతలో నైపుణ్యాలు పెంపొందించాలి
అనంతపురం అర్బన్: ఉపాధి కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను పెంపొందించాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జాబ్మేళాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా నైపుణ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్, మే, జూన్కు సంబంధించి 8 జాబ్మేళాలు నిర్వహించాల్సి ఉందన్నారు. నైపుణ్యాభివృద్ధిపై కార్యాచరణ పక్కాగా అమలు చేయాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు పరిశ్రమలను అనుసంధానించాలన్నారు. ‘పీఎం విశ్వకర్మ యోజన’ కింద శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇప్పటికే పథకం ద్వారా 205 బ్యాచ్ల్లో 6 వేల మందికి శిక్షణ ఇచ్చారని, 111 మందికి శిక్షణ కొనసాగుతోందన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కింద కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. రతన్టాటా ఇన్నోవేషన్ సెంటర్ ల్యాబ్ ఏర్పాటు పనులు వేగంగా చేపట్టాలన్నారు. అనంతరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసిక జాబ్మేళా క్యాలెండర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతపురం అర్బన్కు సంబంధించి ఏప్రిల్ 25న, రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి మే 2న, కళ్యాణదుర్గానికి సంబంధించి మే 16, రాయదుర్గం మే 23, గుంతకల్లు మే 30, తాడిపత్రి జూన్ 6, శింగనమల జూన్ 13, ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి జూన్ 27న జాబ్మేళా నిర్వహిస్తారన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఈశ్వరయ్య, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ప్రతాపరెడ్డి, జేఎన్టీయూ ప్లేస్మెంట్ సీఈఓ శ్రీనివాసులు, ఎస్కేయూ అధికారి సీహెచ్కృష్ణ, మెప్మా పీడీ విశ్వజ్యోతి, పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాసయాదవ్, జిల్లా ఉపాధి కల్పనాధికారి కళ్యాణి, జేడీఎం సూర్య నారాయణ, కార్మిక శాఖ ఏసీ రమాదేవి, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రామమూర్తి, రూడ్సెట్ డైరెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. కలెక్టర్ వినోద్కుమార్ ‘ఉల్లాస్’ లక్ష్యం సాధించాలి ‘ఉల్లాస్’ కార్యక్రమం కింద నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని సూచించారు. జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 16 నుంచి ఆరు రోజుల పాటు సర్వే నిర్వహించి నిరక్షరాస్యులను గుర్తించాల్సి ఉందన్నారు. మే 5 నుంచి సెప్టెంబరు వరకు అక్షరాస్యత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో వయోజన విద్య డీడీ ఆంజనేయులు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
చంద్రబాబు పీ4 విధానం ఓ బోగస్: సీపీఐ రామకృష్ణ
సాక్షి, అనంతపురం: వక్ఫ్ బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు ఇవ్వడం దుర్మార్గమంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. వక్ఫ్ బిల్లులో సవరణలు చేయకుండానే ఎందుకు మద్దతు ఇచ్చారో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. వక్ఫ్ బిల్లు దేశంలో లౌకిక వాదాన్ని దెబ్బతీసేలా ఉంది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు ఏం పని?’’ అంటూ రామకృష్ణ ప్రశ్నించారు.‘‘హిందూ ధార్మిక సంస్థల్లో ముస్లింలకు చోటిస్తారా?. ముస్లిం, క్రైస్తవ ఆస్తులపై బీజేపీ ప్రభుత్వం కన్నేసింది. చంద్రబాబు పీ4 విధానం ఓ బోగస్. తిరుపతిలో గోవుల మరణాలపై సమగ్ర విచారణ చేయాలి’’ అని రామకృష్ణ డిమాండ్ చేశారు.‘‘భూమన కరుణాకరరెడ్డి ఆరోపణలపై పాజిటివ్గా స్పందించాలి. సీఎం చంద్రబాబు, ఈవో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. ప్రతి విషయం వైఎస్ జగన్కు ఆపాదించడం మంచి పద్ధతి కాదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమ వైఖరి మార్చుకోవాలి’’ అని రామకృష్ణ హితవు పలికారు. -
హిందూపురంలో పోలీసుల అత్యుత్సాహం
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త దీపిక భర్త వేణురెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న(సోమవారం) ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు బేడీలు వేసి నడిపించుకుంటూ పోలీసులు తీసుకెళ్లారు. పోలీసుల వైఖరికి నిరసనగా ఇవాళ వైఎస్సార్సీపీ నేత వేణరెడ్డి ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.ధర్మవరం నియోజకవర్గంలో రెచ్చిపోయిన టీడీపీ నేతలుమరో వైపు, మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్ జగన్ ఫోటోను వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్న బాబ్జన్పై దాడి చేశారు. ఆయనకు తీవ్ర గాయాలు కాడంతో కదిరి ఆసుపత్రికి తరలించారు. ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బలో ఘటన జరిగింది. ఫోన్లో దూషించిన టీడీపీ నేతలు.. అనంతరం దాడి చేశారు. -
యువ కౌలు రైతు ఆత్మహత్య
నార్పల: కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు... స్థానిక సుల్తాన్పేటకు చెందిన నాగభూషణం కుమారుడు కురువ చరణ్ (23) మామిడి తోటలను కౌలుకు తీసుకొనేవాడు. అలా ఈ ఏడాది తెలిసిన వారి దగ్గర అప్పు తీసుకుని దాదాపు 15 ఎకరాలు లీజుకు తీసుకున్నాడు. పంట బాగా వచ్చేందుకు పురుగు మందులు కొట్టడంతో పాటు కూలీలతో ఇతర పనులు చేయించాడు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో పంట సరిగా రాలేదు. దీనికితోడు దళారుల మోసంతో మామిడికి సరైన ధరలు కూడా దక్కలేదు. దీంతో దాదాపు రూ.20 లక్షల నష్టం వచ్చింది. ఈ క్రమంలో అప్పులు కట్టే దారి కానరాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన చరణ్ జంగంరెడ్డిపల్లి వద్ద తాను కౌలుకు తీసుకున్న మామిడితోటలో సోమవారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. గమనించిన చుట్టుపక్కల రైతుల వారు వెంటనే అతడిని జల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స ఫలించక ప్రాణాలు విడిచాడు. చరణ్ మృతదేహం వద్ద తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. -
కొల్లగొట్టు కాంతారావ్!
ప్రకృతిని చెరబట్టాడు. కొండలను కరిగించేశాడు. ప్రజలపై దుమ్ము కొట్టాడు. అందిన కాడికి వెనకేసుకున్నాడు. అతని విశృంఖలత్వాన్ని చూసి అధికారులే విస్తుబోయారు. ఏకంగా రూ. 13 కోట్లకు పైగా ఫైన్ విధించారు. సదరు వ్యక్తి నుంచి ముక్కు పిండి ఆ మొత్తాన్ని వసూలు చేయాల్సి ఉండగా.. కూటమి సర్కారు మాత్రం కరుణ చూపుతోంది. మన వాడే కదా.. అని ఏకంగా జరిమానాను రద్దు చేసేలా పావులు కదుపుతోంది.సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో మైనింగ్ మాఫియా డాన్గా పేరుగాంచిన టీవీఎస్ కాంతారావుకు కూటమి సర్కారు దన్నుగా నిలుస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన టీవీఎస్ కాంతారావు గతంలో బొమ్మనహాళ్ మండలం నేమకల్లు కేంద్రంగా భారీ దోపిడీ సాగించారు. కొండలను కొల్లగొట్టి రూ. కోట్లు కూడగట్టారు. అక్రమంగా కంకర, గ్రావెల్ను ఓబులాపురం మీదుగా కర్ణాటకకు తరలించారు. ఇతనిపై ఫిర్యాదుల నేపథ్యంలో 2019లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మైనింగ్ అధికారులు నేమకల్లు వద్ద తనిఖీలు నిర్వహించారు. కాంతారావు అక్రమాలు చూసి ఆశ్చర్యపోయారు.పూర్తిస్థాయి విచారణ అనంతరం రూ.13.19 కోట్ల జరిమానా విధించారు. కానీ ఇప్పటికీ పైసా కూడా ప్రభుత్వానికి చెల్లించలేదు.జరిమానాపై పునఃపరిశీలన..కూటమి సర్కారు కొలువుదీరిన మూడు నెలలకే అంటే 2024 సెప్టెంబర్ 7న గతంలో కాంతారావుకు విధించిన జరిమానాను మళ్లీ పరిశీలించాలని ప్రభుత్వం జిల్లా గనుల శాఖను ఆదేశించింది. 2019లో గనులశాఖ అధికారులు స్వయంగా వారం రోజులు పరిశీలించి.. భారీగా అక్రమ మైనింగ్ జరిగిందని నిర్ధారించి... ఆ మేరకు నివేదిక ఇచ్చిన తర్వాత వేసిన జరిమానాపై పునఃపరిశీలించాలని ఆదేశాలు జారీ చేయడం చూస్తే... దాన్ని పూర్తిగా మాఫీ చేసే తలంపులో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. దీనికితోడు అప్పట్లో రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆస్తులు కూడా జప్తు చేయాలని, ఆ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఇచ్చిన నివేదికను కాదని ఇప్పుడు మళ్లీ పరిశీలించమన్నారంటే ఏ స్థాయిలో మైనింగ్ డాన్కు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందో ఊహించుకోవచ్చు.కూటమి సర్కారు రాగానే స్టార్ట్..కాంతారావుకు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అండగా నిలుస్తున్నారని, ప్రభుత్వ ఉత్తర్వుల వెనుక ఆయన పాత్ర ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి కాంతారావు నిధులు సమకూర్చారని, అందుకే ‘రివిజన్’ చేస్తున్నారని టీడీపీ నాయకులే విమర్శిస్తున్నారు. బొమ్మనహాళ్ మండలం నేమకల్లు వద్ద కొండలు, గుట్టల్ని పిండి చేసి ఏళ్ల తరబడి రూ.కోట్లు దోచుకున్న కాంతారావు.. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం రాగానే అనుమతులు లేకున్నా యథేచ్ఛగా ప్రకృతి వనరులను కొల్లగొట్టడం ప్రారంభించడం గమనార్హం. సర్కారు కొలువుదీరిన మరుసటి రోజే నేమకల్లు పరిసరాల్లో జేసీబీలు, క్రషర్లు గద్దల్లా వాలినట్లు తెలిసింది. -
అల్ట్రాసౌండ్కు గంటలు... 2డీ ఎకోకు చుక్కలు
అనంతపురం మెడికల్: కూటమి ప్రభుత్వంలో సర్వజనాస్పత్రిలో రోజు రోజుకు వైద్య ప్రమాణాలు సన్నగిల్లుతున్నాయి. పబ్లిక్ హాలీడే పేరుతో సోమవారం వైద్యులు, సిబ్బంది జాలీగా బయటకు వెళ్లిపోవడంతో రోగులు నరకయాతన అనుభవించారు. వేచి ఉన్న సహాయకులకు చుక్కలు కనిపించాయి. ఆస్పత్రిలోని 2డీ ఎకో, అల్ట్రాసౌండ్ స్కాన్లు తీవ్ర జాప్యమయ్యాయి. ‘2డీ ఎకో’ టెక్నీషియన్ గంటల తరబడి పత్తా లేకుండా పోవడంతో రోగులు వేచి ఉండాల్సి వచ్చింది. వాస్తవంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారు, అత్యవసర సర్జరీ కేసులకు 2డీ ఎకో తప్పనిసరి. అటువంటి కేసులను సకాలంలో చేయాల్సి ఉన్నా ఆ పరిస్థితి లేకుండా పోయింది. అపస్మారక స్థితిలో ఉన్న వారిని గంటల తరబడి గదుల ముందు ఉంచేశారు. 2డీ ఎకో కోసం రెండు సార్లు వార్డు నుంచి రావాల్సి వచ్చిందని శెట్టూరు మండలం మాకొడికి గ్రామానికి చెందిన చంద్రనాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు. పీజీలే దిక్కు.. సర్వజనాస్పత్రి అల్ట్రాసౌండ్ స్కాన్లో పీజీలే దిక్కుగా మారారు. రేడియాలజిస్టు డాక్టర్ కల్యాణ్ కానరాకపోవడంతో అల్ట్రాసౌండ్ స్కాన్లు నెమ్మదిగా సాగాయి. 50 మందికిపైగా రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. విద్యార్థి దశలో ఉన్న వారి దగ్గరుండి స్కాన్లు ఏ విధంగా తీయాలో నేర్పించాల్సిన రేడియాలజిస్టులు విధులను నిర్లక్ష్యం చేయడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ఇక.. డాప్లర్ స్కాన్కు గత మూడు రోజులుగా తిప్పుతున్నారని పూలకుంటకు చెందిన లత వాపోయింది. తీరు మార్చుకోని సర్వజనాస్పత్రి వైద్యులు రోగులకు తప్పని కష్టాలు -
మందకొడిగా రైతు రిజిస్ట్రేషన్లు
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ చేపట్టిన రైతు రిజిస్ట్రేషన్ల కార్యక్రమం మందకొడిగా కొనసాగుతోంది. ఆధార్కార్డు మాదిరిగా ప్రతి రైతుకూ 11 నంబర్లతో కూడిన ప్రత్యేక విశిష్ట సంఖ్య (ఫార్మర్ రిజిష్ట్రీ ఐడీ) కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అయితే, ఇందులో భాగంగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ (ఏపీఎఫ్ఆర్) అగ్రీ స్టాక్ యాప్ నెల రోజులుగా సక్రమంగా పని చేయడం లేదని చెబుతున్నారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలంటూ వ్యవసాయశాఖ అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో ఆర్ఎస్కే సిబ్బంది సతమతమవుతున్నారు. రైతు పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్కార్డు, వాటికి అనుసంధానం అయిన మొబైల్ నెంబరు ద్వారా రిజిస్టరేషన్ చేసిన తర్వాత రైతుకు 11 నంబర్లతో కూడిన ఐడీ నంబరు కేటాయిస్తున్నారు. ఇందుకు మూడు సార్లు ఓటీపీ సక్సెస్ కావాల్సివుంటుంది. చాలా వరకు రెండు ఓటీపీలు సక్సెస్ అవుతున్నా మూడోసారి ఓటీపీ కావడం లేదని తెలిసింది. దీంతో అంతరాయం ఏర్పడుతోందని సిబ్బంది వాపోతున్నారు. భవిష్యత్తులో ఇన్పుట్సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్, పావలావడ్డీ, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, యాంత్రీకరణ, రాయితీ విత్తనాలు, పంట ఉత్పత్తుల అమ్మకాలు తదితర వ్యవసాయ అనుబంధ శాఖల పరిధిలో ప్రభుత్వ ఫలాలు వర్తించాలంటే రైతుకు విశిష్ట సంఖ్య తప్పనిసరిగా ఉండాలని చెబుతున్నారు. రెండు నెలల్లో 60 శాతమే.. జిల్లా వ్యాప్తంగా 3,42,666 మందికి విశిష్ట సంఖ్య కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 1.97 లక్షల మందికి కేటాయించారు. అంటే గత రెండు నెలలుగా చేస్తున్నా 60 శాతం పూర్తీ చేశారు. ఇంకా 40 శాతం పెండింగ్ ఉండటంతో ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే, ఆ లోపు కూడా ప్రక్రియ పూర్తి కావడం కష్టమేనని చెబుతున్నారు. ఇప్పటివరకూ పెద్దవడుగూరు మండలంలో 94 శాతం పూర్తి కావడంతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. పెద్దపప్పూరులో 90 శాతం, గుత్తి 88, రాయదుర్గం 83, యాడికి 83, తాడిపత్రి 79, గుంతకల్లు 78 శాతం ఇలా కొన్ని మండలాల్లో రిజిస్ట్రేషన్లు బాగానే జరిగాయి. అయితే గుమ్మఘట్ట 33 శాతం, కుందుర్పి 36, వజ్రకరూరు 37, బుక్కరాయసముద్రం 38, బెళుగుప్ప 39, కళ్యాణదుర్గం 40 శాతం... ఇలా కొన్ని మండలాల్లో మందకొడిగా కొనసాగుతోంది. యాప్ సరిగా పనిచేయక సిబ్బంది సతమతం ఇప్పటి వరకు 60 శాతం పూర్తయినట్లు వెల్లడి -
అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం
అనంతపురం: విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయమని ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ అన్నారు. సోమవారం నగరంలోని ఆ శాఖ కార్యాలయంలో అగ్ని మాపక వారోత్సవాల ప్రారంభోత్సవంలో జిల్లా జడ్జి పాల్గొన్నారు. వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. 2024లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఫైర్ ఫైటింగ్ చేస్తూ అమరులైన సిబ్బందికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది ప్లకార్డులు చేతబట్టి నగరంలో ర్యాలీ నిర్వహించి, కరపత్రాలు పంచారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఫైర్ సర్వీస్ సిబ్బంది, అధికారులు, విశ్రాంత అధికారులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఏడీఎఫ్ఓ లింగమయ్య, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఎం. భూపాల్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి వి. శ్రీనివాస రెడ్డి, ఎస్ఆర్ఐటీ, బాలాజీ విద్యా సంస్థలు, ట్రెల్లీస్ స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎం పదోన్నతుల సీనియార్టీ జాబితా సిద్ధం అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లా పరిషత్, మునిసిపాలిటీ, అనంతపురం కార్పొరేషన్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించేందుకు సీనియార్టీ జాబితాను తయారు చేశారు. deoanantha puramu.blogspot.com వెబ్సైట్లో ఉంచినట్లు డీఈఓ ప్రసాద్బాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే ఆధారాలతో ఈనెల 19లోపు ఫిర్యాదు చేయాలని డీఈఓ సూచించారు. కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు అనంతపురం రూరల్: విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. సోమవారం నగరంలోని సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహం–1, 2లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు.విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో పాల్గొనాలని, దీంతో శారీరక, మానసికోల్లాసం కలుగుతుందన్నారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలపై విద్యార్థినులు అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం విద్యార్థినులతో కలసి వసతి గృహంలోనే భోజనం చేశారు. కార్యక్రమంలో జేసీ శివ్నారాయణశర్మ, ఆర్డీఓ కేశవనాయుడు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ (ఇన్చార్జ్) రాధిక తదితరులు పాల్గొన్నారు. -
మట్టి తోలితే.. మనల్నెవడ్రా ఆపేది..?!
సాక్షి టాస్క్ఫోర్స్: ‘మేమేం చేసినా మమ్మల్ని అడిగేవారు లేరు.. ఆపేవారు అంతకన్నా లేరు.. అంతా మా ఇష్టం’ అన్న తరహాలో ఆత్మకూరు మండలంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం ఎక్కడికై నా మట్టి తోలాలంటే ముందుగా రెవెన్యూ అధికారులు, మైనింగ్ శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అలాంటి నిబంధనలేమీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా మట్టిని అక్రమంగా తరలిస్తూ ఓ తెలుగు తమ్ముడు జేబులు నింపుకుంటున్నాడు. ఆత్మకూరు మండలం వడ్డుపల్లి సమీపంలో టీడీపీ నాయకుడు కృష్ణమోహన్ నెల రోజుల నుంచి మట్టిని కొల్లగొడుతున్నాడు. ఇప్పటివరకూ దాదాపు 500 టిప్పర్ల వరకు అక్రమంగా మట్టి తరలించినట్లు తెలి సింది. ఒక టిప్పర్ రూ.7 వేల వరకు విక్రయిస్తూ రూ. లక్షలు వెనకేసుకుంటున్నాడు. గత వైఎస్సార్సీపీ హయాంలో గ్రామంలో శ్రీ కృష్ణుని గుడి నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డి భూమి పూజ చేయగా.. అప్పట్లో సదరు కృష్ణమోహన్ వేరే వారితో ఫోన్లో మాట్లాడుతూ తమ ప్రభుత్వం వస్తే గుడి కట్టినా, బడి కట్టినా కూల్చేస్తాం అన్న మాటలు పెద్ద దుమారమే లేపాయి. చోద్యం చూస్తున్న అధికారులు.. నిత్యం వందల మట్టి టిప్పర్లు అనుమతి లేకుండా హైవేపైనే వెళ్తున్నా.. సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆత్మకూరు మండల రెవెన్యూ అధికారు లకు విషయం తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వడ్డుపల్లి సమీపంలో టిప్పరుతో అక్రమంగా మట్టి తరలిస్తున్న దృశ్యం -
స్ఫూర్తిప్రదాత అంబేడ్కర్
అనంతపురం సిటీ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తిప్రదాత అని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పరిషత్ క్యాంపస్లో గల డీపీఆర్సీ భవన్లో ఆదివారం అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ వినోద్కుమార్, ఉభయ జిల్లాల జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తదితరులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళిత సంఘాల ప్రతినిధులు అనేక సమస్యలను తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. శ్మశాన వాటికల ఏర్పాటుపై దృష్టి పెట్టామన్నారు. బదిలీలు, పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తామని వెల్లడించారు. సబ్ ప్లాన్కు సంబంధించి మూడు నెలలకోసారి సమీక్ష నిర్వహిస్తామని, సివిల్ రైట్స్ డేని ఏప్రిల్ నుంచి ప్రతి తహసీల్దార్, ఎస్హెచ్ఓ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇల్లు లేని వారిని గుర్తించి న్యాయం చేస్తామన్నారు. బడుగు, బలహీన వర్గాలు రాజకీయంగా ఎదుగుతున్నారంటే అంబేడ్కర్ భిక్షేనని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. అనంతపురంలోని అంబేడ్కర్ భవనానికి రూ.12 లక్షలు ఎంపీ ల్యాడ్స్ కింద మంజూరు చేస్తున్నట్లు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. కస్తూర్బాగాంధీ గురుకులాలతో పాటు మోడల్ స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం సీట్లను పెంచేలా చూస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హామీ ఇచ్చారు. అంతకుముందు సందర్భంగా జెడ్పీ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కమలమ్మ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రోత్సాహం విభిన్న ప్రతిభావంతులకు ప్రోత్సాహం అందిస్తామని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ క్యాంపస్లోని డీపీఆర్సీ భవన్లో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు స్వయం ఉపాధి పథకం రుణాలు, ఉపకరణాల పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 12 మంది విభిన్న ప్రతిభావంతులకు ఎన్డీఎఫ్డీసీ కింద రూ.27.55 లక్షల రుణాలు మంజూరైనట్లు తెలిపారు. డిగ్రీ, ఇతర వృత్తి విద్య కోర్సులు అభ్యసిస్తున్న 25 మంది విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.9.50 లక్షల విలువ చేసే ల్యాప్ ట్యాప్లు, నలుగురు బధిరులకు రూ.58 వేల విలువ చేసే టచ్ ఫోన్లు, మరో ఐదుగురికి రూ.56 వేల విలువ చేసే వీల్ చైర్లను పంపిణీ చేసినట్లు వివరించారు. కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ -
ఆగని ‘కూటమి’ కక్ష సాధింపులు
● ఉరవకొండలో మరికొందరు వైఎస్సార్సీపీ నేతలకు పోలీసు నోటీసులు ఉరవకొండ: వైఎస్సార్ సీపీ నాయకులపై కూటమి సర్కారు కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ గత ఏడాది డిసెంబర్ 27న ఉరవకొండలో పోరుబాట పేరుతో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ శ్రేణులే కాకుండా ప్రజలు కూడా కదం తొక్కడంతో కార్యక్రమం విజయవంతమైంది. ఈ క్రమంలో దీన్ని ఓర్వలేని స్థానిక టీడీపీ నేతలు విద్యుత్ అధికారిపై ఒత్తిడి చేసి కేసు పెట్టించారు. ర్యాలీతో ట్రాఫిక్కు ఇబ్బంది కలిగిందంటూ ఓ ‘పచ్చ’ నాయకుడి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. దీనిపై ఫిబ్రవరి 2న కొంతమంది వైఎస్సార్సీపీ నాయ కులను పిలిచి విచారణ చేపట్టిన పోలీసులు తిరిగి సోమవారం మరో 10 మంది పార్టీ ముఖ్య నాయకులకు నోటీసులు అందించడం గమనార్హం. ఈ సందర్భంగా నోటీసులు అందుకున్న వైఎస్సార్సీపీ నాయకులు బసవరాజు, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ ఈడిగప్రసాద్ మాట్లాడుతూ అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరు కొనసాగిస్తామన్నారు. ఉరవకొండలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, మంత్రి కేశవ్ అండతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని విమర్శించారు. నోటీసులు అందుకున్న వారిలో ఉరవకొండ రూరల్, మండల కన్వీనర్లు ఎర్రిస్వామిరెడ్డి, మూలగిరిపల్లి ఓబన్న, నాయకులు శింగనమల్ల ఉస్మాన్, సుద్దాల వెంకటేష్, వడ్డే ఆంజినేయులు, వెలిగొండ నాగన్న, అనిల్, బూదగవి ధనంజయలు తదితరులు ఉన్నారు. -
టీడీపీ నేతపై హత్యాయత్నం
బొమ్మనహాళ్: మహిళ పరువు తీశాడన్న కక్షతో టీడీపీ నేతపై బాధితురాలి సంబంధీకులు కత్తితో దాడి చేశారు. పోలీసులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం కల్లుహోళ గ్రామానికి చెందిన టీడీపీ నేత సోమన్నగౌడ్... అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో గుట్టుగా వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. ఈ విషయం వెలుగు చూడడంతో కొన్నేళ్ల క్రితం పెద్ద మనుషుల పంచాయితీ నిర్వహించి ఇద్దరినీ మందలించారు. ఇటీవల సోమన్నగౌడ్ మళ్లీ ఆమెతో మాట్లాడుతుండడం సదరు మహిళ మేనల్లుడు గోవిందు గమనించాడు. దీంతో గ్రామంలో తమ మేనత్త పరువు తీయడమే కాక మళ్లీ ఆమెతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నిస్తుండడాన్ని జీర్ణించుకోలేక అదే గ్రామానికి చెందిన బి.వన్నప్పతో కలసి ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత తన ఇంటి ఎదుట నిద్రిస్తున్న సోమన్నగౌడ్పై కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో సోమన్నగౌడ్ దాడిని ప్రతిఘటిస్తూ గట్టిగా కేకలు వేయడంతో కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారు మేల్కొనడంతో గోవిందు, వన్నప్ప అక్కడి నుంచి పారిపోయారు. క్షతగాత్రుడిని కుటుంబసభ్యులు వెంటనే బళ్లారిలోని విమ్స్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. అంబేడ్కర్ జయంతి వేడుకల్లో అపశ్రుతి ఉరవకొండ: పట్టణంలో సోమవారం నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో దళిత సంఘం నాయకుడు, పెద్ద ముష్టూరు గ్రామానికి చెందిన నాగరాజు (49) గుండెపోటుతో మృతి చెందాడు. ముందుగా ర్యాలీలో పాల్గొన్న ఆయన అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తుండగా ఒక్క సారిగా ఛాతి పట్టుకుని కుప్పకూలాడు. గమనించిన నాయకులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్దారించారు. నాగరాజు మృతిపై దళిత సంఘం నాయకులు, ఉద్యోగ జేఏసీ నాయకులు సంతాపం తెలిపారు. పెనుగాలుల బీభత్సం గార్లదిన్నె: మండల కేంద్రం గార్లదిన్నెతో పాటు కల్లూరులో సోమవారం సాయంత్రం పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. కల్లూరులో 44వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన హోర్డింగ్ కూలి రోడ్డు మీద పడింది. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు రాకపోకలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. దీంతో గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. అలాగే గార్లదిన్నెలోని డ్యాం రోడ్డు రైల్వే గేట్ వద్ద పురాతన వేపవృక్షం విరిగి పడింది. గ్రామాల్లోని పలు తోటల్లో చెట్లు విరిగి పడినట్లు రైతులు తెలిపారు. పామిడిలో గాలీవాన పామిడి: మండల కేంద్రం పామిడిలో సోమవారం సాయంత్రం గాలీవాన బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా బలమైన గాలులు వీయడంతో ఇళ్ల రేకులు, పీఓపీ సీట్లు ఎగిసి పడ్డాయి. రేకుల షెడ్లు నేల కొరిగాయి. -
జాతీయ హోమియో వైద్యుల సంఘంలో జిల్లా వాసులకు చోటు
అనంతపురం మెడికల్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజీషియన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీలో జిల్లా వాసులకు చోటు దక్కింది. ఈ నెల 13న గుంటూరులో అఖిల భారత హోమియో వైద్యుల సంఘం 18వ రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జిల్లాకు చెందిన సీనియర్ హోమియోపతి వైద్యుడు డాక్టర్ పోగుల కుమారయ్య, రాష్ట్ర విభాగం కో ఆర్డినేటర్గా డాక్టర్ ఎం.శాంతిప్రియకు అవకాశం దక్కింది. డాక్టర్ పోగుల కుమారయ్య మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో హోమియో వైద్యం ప్రాముఖ్యత, నూతన ఆవిష్కరణలు, సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నగదు అపహరణ కేసులో నిందితుడి అరెస్ట్ నార్పల: నగదు అపహరణ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నార్పల పీఎస్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐ సాగర్ వెల్లడించారు. గతేడాది అక్టోబర్లో వెంకటాంపల్లికి చెందిన శ్రీనివాసులు, తన భార్యతో కలసి నార్పలలోని స్టేట్బ్యాంకులో ఉన్న తన ఖాతా నుంచి రూ.3 లక్షలు డ్రా చేసి ద్విచక్ర వాహనంలోని బ్యాగ్లో ఉంచుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో నార్పల సంతలో నిత్యావస సరుకులు తీసుకునేందుకు వాహనాన్ని ఆపాడు. ఆ సమయంలో చిన్నా అనే యువకుడు నగదు అపహరించాడు. ఘటనపై అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి సంచరిస్తున్న చిన్నాను.. సోమవారం నార్పల క్రాస్ సమీపంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు. -
రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం
అనంతపురం కార్పొరేషన్: ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన భారత రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం కాలరాస్తూ రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, అనంతపురం నగర పాలక సంస్థ మేయర్ వసీం ధ్వజమెత్తారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సోమవారం పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కక్ష సాధింపులు, దౌర్జన్యాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించారన్నారు. అన్నివర్గాల అభ్యున్నతికి వైఎస్ జగన్ పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. రూ.2.75 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేయడం ద్వారా పేదరికం నిర్మూలనకు కృషి చేశారన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్ మాట్లాడుతూ.. పారదర్శకత, అవినీతిరహిత పాలనను జగనన్న అందిస్తే.. ఇందుకు విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కూటమి సర్కార్ పాలన సాగుతోందని మండిపడ్డారు. రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమం అనంతరం జెడ్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి, అనుబంధ విభాగాల రాష్ట్ర నాయకులు కాగజ్ఘర్ రిజ్వాన్, పెన్నోబులేసు, కృష్ణవేణి, వేముల నదీం, అనుబంధ సంఘాల అధ్యక్షులు మల్లెమీద నరసింహులు, వైపీ బాబు, శ్రీదేవి, సైఫుల్లాబేగ్, అమర్నాథ్ రెడ్డి, చంద్రలేఖ, నాయకులు ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, వెన్నపూస రామచంద్రారెడ్డి, మీసాల రంగన్న, పసులూరు ఓబులేసు, దాదు, తలారి వెంకటేష్, మారుతీనాయుడు, తనీష, మాల్యవంతం మంజుల, ఫయాజ్, సతీష్, లక్ష్మణ్, శోభారాణి , శోభాబాయి, కార్పొరేటర్లు కమల్భూషణ్, దుర్గాదేవి, రహంతుల్లా, రాజేశ్వరి పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆశయాలను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఘనంగా అంబేడ్కర్ జయంతి -
అంబేడ్కర్ కాలనీ నేమ్బోర్డు ఏర్పాటుపై ఉద్రిక్తత
రాయదుర్గం టౌన్: మండలంలోని రాయంపల్లి ఎస్సీ కాలనీ ప్రవేశ మార్గంలో ‘అంబేడ్కర్ కాలనీ’ నేమ్ బోర్డు ఏర్పాటుపై సోమవారం ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన కొందరు కూటమి నాయకులు నేమ్బోర్డును దౌర్జన్యంగా పెకలించారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. జిల్లా కలెక్టర్గా గంధం చంద్రుడు పనిచేసిన సమయంలో దళిత, ఎస్సీ కాలనీలను ఆ పేర్లతో పిలవకూడదన్న ఉద్దేశంతో జాతీయ నాయకుల పేర్లతో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయించారు. ఈ నేపథ్యంలోనే రాయంపల్లి ఎస్సీ కాలనీకి ‘అంబేడ్కర్ కాలనీ’గా నామకరణం చేసి నేమ్బోర్డు ఏర్పాటు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు బోర్డు పడిపోవడంతో కొందరు యువకులు మరమ్మతు చేయించి.. అంబేడ్కర్ జయంతి రోజున అదే స్థలంలో మళ్లీ ఏర్పాటు చేశారు. దీనిని జీర్ణించుకోలేని గ్రామానికి చెందిన కొందరు కూటమి నాయకులు దళితులతో ఘర్షణకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గొడవను సద్దుమణిగించారు. కాగా, ‘అంబేడ్కర్ కాలనీ’ నేమ్బోర్డు ఏర్పాటు చేస్తే అంతు చూస్తామంటూ కులం పేరుతో దూషించి న కూటమి పార్టీల నాయకులు శీనప్ప, మద్దానప్ప, హనుమంతప్ప, జయన్న, ఆంజనేయులు, బోయ దొడ్డపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు దళితులు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తిప్పేరుద్ర, వన్నూరుస్వామి, కిష్టప్ప, రుద్రన్నతో పాటు మరో 12 మంది డిమాండ్ చేశారు. -
19న వివాహం... యువతి బలవన్మరణం
రాప్తాడు రూరల్: పెళ్లి భజంత్రీ మోగాల్సిన ఇంట కాబోయే పెళ్లికూతురు బలవన్మరణంతో తీవ్ర విషాదం నెలకొంది. అనంతపురం రూరల్ మండలం పూలకుంటలో సోమవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన మేరకు... పూలకుంట గ్రామానికి చెందిన కురుబ నారాయణస్వామికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్దమ్మాయికి వివాహమైంది. రెండో అమ్మాయి రేణుక (24) ఆకుతోటపల్లి–1 సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పని చేస్తోంది. ఈమెకు ఓ ప్రభుత్వ ఉద్యోగితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఈ నెల 19న పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకోసం ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. కుటుంబసభ్యులు ఓవైపు పెళ్లి పత్రికల పంపిణీ చేస్తూనే మరోవైపు పెళ్లికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటికి బంధువుల రాక కూడా మొదలైంది. పెళ్లంటే ఇష్టం లేక.... అయితే రేణుకకు పెళ్లంటే ఇష్టం లేదు. ఇదే విషయాన్ని పలుమార్లు సచివాలయంలో సహచర ఉద్యోగులతో చెప్పేది. ‘పెళ్లి చేసుకున్న తర్వాత జీవితం ఎలా ఉంటుందో...అత్త మామలు ఎలా ఉంటారో....ఇప్పుడున్నట్లు పెళ్లి చేసుకున్న తర్వాత ఉండేందుకు ఉండదు... కొత్తగా పెళ్లి చేసుకున్న వారి కాపురాలు చాలా చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి ఎందుకు చేసుకోవాలో?’ అని చర్చించేది. మరోవైపు పెళ్లి తేదీ దగ్గరకు వస్తుండడంతో హడావుడి పెరిగిపోయింది. ఇక పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని, తల్లిదండ్రులకు చెప్పుకోలేక తీవ్ర ఆందోళనకు గురైన ఆమె సోమవారం ఉదయం మేడపై ఉన్న గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని ఫ్యానుకు ఉరి వేసుకుంది. ఎంతసేపటికీ కిందకు రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు పైకి వెళ్లి చూడగా ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమార్తె కనిపించింది. సమాచారం అందుకున్న ఇటుకలపల్లి ఎస్ఐ విజయ్కుమార్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పెళ్లి భజంత్రీ మోగాల్సిన ఇంట విషాదం మృతురాలు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ -
ప్రాణం పోసిన మెడిసిన్ వైద్యులు
అనంతపురం మెడికల్: ప్రాణాపాయ స్థితిలో చికిత్స ఆస్పత్రికి చేరుకున్న రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించడం ద్వారా అతని ప్రాణాలను ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని మెడిసిన్ విభాగం వైద్యులు కాపాడారు. కంబదూరు మండలం ఒంటిరెడ్డిపల్లికి చెందిన 34 ఏళ్ల వయసున్న నాగేంద్ర.. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఉన్నఫళంగా కాళ్లు చేతులు పడిపోయి, మాట రాకపోవడంతో ఈ నెల 7న కుటుంబసభ్యులు సర్వజనాస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు అక్యూట్ మెడికల్ కేర్లో అడ్మిట్ చేసుకుని మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ భీమసేనాచార్ నేతృత్వంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పావని తదితరులు చికిత్స మొదలు పెట్టారు. గులియన్ బరీ సిండ్రోమ్తో బాధపడుతున్నట్లుగా నిర్ధారణ అయిన తర్వాత పీజీ వైద్యులు, స్టాఫ్నర్సులు నాగేంద్రకు రౌండ్ ద క్లాక్ సేవలందించారు. రూ.7వేలు విలువ చేసే ఇంజెక్షన్లను క్రమం తప్పకుండా 20కి పైగా అందించాల్సి వచ్చింది. వెంటిలేటర్పై ఉన్న నాగేంద్ర కోలుకోవడంతో వార్డుకు షిప్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. తమకు ముగ్గురు పిల్లలున్నారని, ఆస్పత్రి వైద్యులు తన భర్తకు ఊపిరి పోశారని, వారి మేలును ఎన్నడూ మరవనంటూ వైద్యులు, స్టాఫ్నర్సులు, తదితర సిబ్బందికి భార్య సుకన్య కృతజ్ఞతలు తెలిపింది. ప్రైవేట్గా ఈ తరహా వైద్యం పొందాలంటే రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఆస్పత్రి వైద్యులంటున్నారు. -
90
జేఎన్టీయూ (ఏ) పరిధిలో అనుబంధ కళాశాలలుఅనంతపురం: ఇంజినీరింగ్ కష్టమనే అపోహను విద్యార్థుల్లో తొలగిపోయేలా మానసికంగా సంసిద్ధం చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆదేశించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. కాగా, ఐఐటీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో చోటు చేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యలను పరిగణనలోకి తీసుకుని గత రెండేళ్లుగా ఏఐసీటీఈ జరిపిన అధ్యయనాల్లో బోధనా ప్రణాళికతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్న విషయం వెల్లడైంది. జాతీయ విద్యా విధానంలో వస్తున్న మార్పులపై తొలి దశలోనే అవగాహన కల్పించకపోవడమే ఇందుకు కారణంగా గుర్తించి ప్రాక్టికల్ నాలెడ్జ్తో కూడిన విధానం అందుబాటులోకి తెచ్చేలా మార్గదర్శకాలను జారీ చేశారు. ఇంజినీరింగ్ రెండో ఏడాది నుంచే పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో పాఠ్య ప్రణాళికలో మార్పు చేశారు. దీంతో ఇంజినీరింగ్ విద్యార్థులు మూస విధానం నుంచి బయటపడి స్వతహాగా ఆలోచించే విద్యా విధానంలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైంది. అయితే ఇది కూడా మానసిక ఒత్తిళ్లకు కారణమవుతోందని ఏఐసీటీఈ జరిపిన మరో అధ్యయనంలో తేలింది. దీంతో తరగతుల ప్రారంభానికి ముందే అన్ని విధాలుగా విద్యార్థులను సంసిద్ధులను చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. బ్యాక్లాగ్స్ భారమై.. ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు కేవలం 18 నుంచి 20 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు. సింహభాగం విద్యార్థులు మొదటి సంవత్సరంలోనే ఫెయిల్ అవుతున్నారు. ఇంటర్మీడియట్ విద్యా ప్రణాళిక, బీటెక్ విద్యా ప్రణాళిక విభిన్నంగా ఉండడమే ఇందుకు కారణం. ఇంటర్మీడియట్ వరకు బట్టీ పద్ధతిలో చదువుతున్నారు. ఇంజినీరింగ్లో బట్టీ విధానం ఉండదు. కంప్యూటర్ సైన్స్లో గణితం ఒక్కసారిగా మారిపోతుంది. రెండో ఏడాదికి వచ్చే సరికి అనేక కంప్యూటర్ లాంగ్వేజ్లను విద్యార్థులు నేర్చుకోవాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ప్రయోగాత్మకంగా ఫలితాలూ సాధించాల్సి ఉంటుంది. సివిల్, మెకానికల్లోనూ ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తిగతంగా స్కిల్ పెంచుకుంటే తప్ప ముందుకెళ్లని పరిస్థితి. ఈ కారణంగా బీటెక్ మొదటి, రెండో సంవత్సరాల విద్యార్థులకు బ్యాక్లాగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఇదే వారి మానసిక ఒత్తిళ్లకు కారణమవుతోంది. అధునాతన కోర్సులకు అధ్యాపకుల కొరత.. పోటీ ప్రపంచానికి దీటుగా కంప్యూటర్ సైన్సెస్ కోర్సు, దాని అనుబంధ కోర్సులకు విపరీతమైన క్రేజీ ఏర్పడింది. గత మూడేళ్లుగా డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ కోర్సులు భోదించే అధ్యాపకుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఈ అంతరాన్ని పూడ్చడానికి రెండో ఏడాది నుంచే సంబంధిత రంగాల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేలా ప్రాజెక్ట్లు పూర్తి చేయాలనే నిబంధన విధించారు. దీంతో ఏటా మార్కెట్లోకి వస్తున్న విద్యార్థుల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే నైపుణ్యత కలిగి ఉంటున్నారని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఫలితంగా ప్రతి ఆరు నెలలకోసారి విద్యార్థి మానసిక ధోరణిని పరిశీలించాలని ఏఐసీటీఈ సూచించింది. విద్యార్థుల శ్రేయస్సుపై ప్రత్యేక దృష్టి విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఇంజినీరింగ్ విద్యా ప్రణాళికపై తరగతుల ప్రారంభానికి ముందే వారిలో అవగాహన పెంచేలా చర్యలు తీసుకున్నాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అన్ని విధాలుగా విద్యార్థులను తీర్చిదిద్దుతాం. – హెచ్.సుదర్శనరావు, వీసీ, జేఎన్టీయూ(ఏ) ఇంటర్, బీటెక్ విద్యా ప్రణాళికలు విభిన్నం దీంతో ఇంజినీరింగ్ కష్టమనే అపోహ అపోహలు తొలగిపోయేలా విద్యార్థులకు ముందస్తుగా కౌన్సెలింగ్ క్యాంపస్ కళాశాలలో సీట్ల పెంపుదలకు కసరత్తు జేఎన్టీయూ(ఏ) క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రస్తుతం ఒక్కో బ్రాంచ్కు 60 సీట్లు ఉండగా, వీటిని 120కు పెంచేలా పాలక మండలి సభ్యులు ఆమోదం తెలిపారు. సోమవారం వర్సిటీ వీసీ ప్రొఫెసర్ హెచ్ .సుదర్శనరావు అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరిగింది. అలాగే స్నాతకోత్సవం నిర్వహణపై కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది. పులివెందుల కళాశాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు వర్సిటీనే నిధులు అందించేలా చర్యలు తీసుకున్నారు. -
మహిళా కమిషన్ సభ్యురాలిని పరామర్శించిన వైఎస్ జగన్
గుత్తి: ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు, గుత్తి పట్టణానికి చెందిన రుఖియాబేగం ఆదివారం శ్రీకాళహస్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తిరుపతిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను సోమవారం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. రుఖియా బేగంకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.మద్యం అడిగితేఇవ్వలేదని వ్యక్తిపై దాడియాడికి: తాగేందుకు మందు ఇవ్వలేదన్న అక్కసుతో ఖాళీ మద్యం బాటిళ్లతో వ్యక్తిపై దాడి చేసిన ఘటన యాడికిలో సంచలనం రేకెత్తించింది. బాధితుడు తెలిపిన మేరకు.. యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన మంగల గంగాధర్ సోమవారం వ్యక్తిగత పనిపై మండల కేంద్రానికి వచ్చాడు. మధ్యాహ్నం కుంటకు వెళ్లే మార్గంలో ఉన్న బ్రాందీ షాపులో మద్యం బాటిల్ కొనుగోలు చేసి, ఆ పక్కనే మిగిలిన వారితో కలసి తాగుతూ కూర్చొన్నాడు. అదే సమయంలో గంగాధర్తో ఎలాంటి ముఖపరిచయం లేని యాడికి గ్రామానికి చెందిన మహేష్ అక్కడకు చేరుకుని తనకూ తాగేందుకు మద్యం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇందుకు గంగాధర్ నిరాకరించడంతో మహేష్ వాగ్వాదానికి దిగాడు. దుర్భాషలాడుతూ ఆ పక్కనే పడి ఉన్న ఖాళీ మద్యం గాజు బాటిల్ తీసుకుని గంగాధర్ తలపై బలంగా బాదాడు. దీంతో గంగాధర్ తలకు తీవ్ర రక్తగాయమైంది. సమాచారం అందుకున్న గంగాధర్ సమీప బంధువు అక్కడకు చేరుకుని వెంటనే క్షతగాత్రుడిని స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. విషయం తెలుసుకున్న యాడికి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దాడికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహేష్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.పేలుడు పదార్థం తిని గొర్రె మృతిఎన్పీ కుంట: అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన పేలుడు పదార్థం తిని ఓ గొర్రె మృతి చెందింది. ఎన్పీ కుంటకు చెందిన గొర్రెల కాపరి భాస్కర్ సోమవారం ఉదయం తన గొర్రెలను రోడ్డుకు సమీపంలోని చవట గుంతల వద్ద మేపుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై గొర్రెల కాపరులు ఆందోళన వ్యక్తం చేశారు. జీవాలు మేపు సమయంలో నల్లమందు ఉంటలపై కాలు పెట్టినా పేలుడు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుందన్నారు. -
వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే జయరాం.. ఉద్యోగం పేరుతో లక్షల్లో డబ్బులు..
సాక్షి, అనంతపురం: ఏపీలో గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదంలో చిక్కుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం విషయంలో జయరాం తనను మోసం చేశారని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో, అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం..‘గుత్తి మండలం మామడూరు గ్రామానికి చెందిన బోలే యల్లప్ప ఉరేసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. యల్లప్ప ఆత్మహత్యయత్నం చేయడానికి టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కారణమని అన్నారు. ఎమ్మెల్యే జయరాం.. యల్లప్ప నుంచి నాలుగు లక్షల రూపాయలు తీసుకుని ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత అదే ఉద్యోగాన్ని 8 లక్షలకు మరొకరికి ఇచ్చేశారు. ఈ కారణంగా ఉద్యోగం పోయిందనే ఆవేదనతో యల్లప్ప ఇలా చేశాడని తెలిపారు. ఈ క్రమంలో జయరాం పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పుకొచ్చారు. -
వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
సీతమ్మధార(విశాఖ)/అనంతపురం కార్పొరేషన్: వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం విశాఖపట్నం, అనంతపురం నగరాల్లో ముస్లిం మైనారిటీలు భారీ ర్యాలీలు నిర్వహించారు. విశాఖ నగరంలోని డాబా గార్డెన్స్ ఎల్ఐసీ బిల్డింగ్ వద్ద గల డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాది మహమ్మద్ గౌస్ ముద్దిన్ ఖాన్ మాట్లాడుతూ వక్ఫ్ చట్ట సవరణ ద్వారా ముస్లింల మత, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక గుర్తింపును బలహీనపరిచే అవకాశం ఉందని చెప్పారు. వక్ఫ్ సవరణ చట్టం అనేది రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే కాకుండా మైనారిటీల మతపరమైన హక్కులకు ముప్పు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ముస్లిం నాయకులు హైదర్ అలీ సింకా, జహీర్ అహ్మద్, అహ్మదుల్లా ఖాన్, మునీర్, మహమ్మద్ ఇబ్రహీం, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఫారూఖి తదితరులు పాల్గొన్నారు. అనంతపురంలో... వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దుచేయాలని అనంతపురంలో యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యాన నిర్వహించిన భారీ ర్యాలీలో వేలాది మంది ముస్లిం మైనారిటీలు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అనంతపురం నగర మేయర్ వసీం, వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.అవకాశ లౌకికవాది చంద్రబాబు»ఆయనకు సిద్ధాంతాలు, విలువలు లేవు »2019 ఎన్నికల్లో ప్రధాని మోదీని ఉగ్రవాది »అన్న నోటితో ఇప్పుడు పొగుడుతున్నారు »బీజేపీతో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా లౌకిక వాదానికి అర్థం మారుస్తారు »వివాదాస్పద వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇస్తూ బీజేపీ వైపు దృఢంగా నిలబడ్డారు » ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ సాక్షి, అమరావతి:ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు తప్ప సిద్ధాంతాలు, విలువలు లేవని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ పేర్కొన్నారు. తన యూట్యూబ్ ఛానల్లో తాజాగా ఈ మేరకు వీడియో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే.. ‘2019 ఎన్నికల్లో బీజేపీపై ఆధారపడే అవసరం లేదని, మతతత్వ బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలని పిలుపునిచ్చిన చంద్రబాబు.. ఒకానొక సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉగ్రవాదిగా పేర్కొన్నారు. రాజకీయ మనుగడ మాత్రమే చంద్రబాబు ఏకైక ప్రాధాన్యత. లౌకిక వాదం విషయంలోనూ ఆయన అంతే. తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి దానిని ఒక కళారూపంగా మార్చుకున్నారు. లౌకిక వాదానికి అర్థం చంద్రబాబు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు మరో రకంగా మారిపోతుంది. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా.. వారి పదవులు కాపాడుకునే అంశంగా లౌకిక వాదాన్ని చంద్రబాబు మార్చేశారు.అవకాశ లౌకిక వాదిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారు. లౌకిక వాదానికి, మత స్వేచ్ఛకు భంగం కలిగించే వివాదాస్పద వక్ఫ్ బిల్లును పార్లమెంట్లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు బీజేపీకి దృఢమైన మద్దతుదారుగా చంద్రబాబు నిలబడ్డారు. బిల్లులో కొన్ని సవరణలు సూచించడం ద్వారా ముస్లిం సమాజానికి తాము మంచి చేశామని చంద్రబాబు, బిహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ చెప్పుకున్నారు. చంద్రబాబుది ట్రికీ కేస్స్టడీ. రాజకీయాల్లో సుదీర్ఘంగా కొనసాగడానికి ఎన్ని రంగులు మార్చడానికైనా ఆయన వెనకాడరు. లౌకిక వాదం విషయంలో ఆయన విధానం ఎప్పుడూ ప్రశ్నార్థకమే. రాజకీయాల్లో నిబద్ధత స్థానంలో అవకాశ వాదం, అవసరం వచ్చి చేరాయి. రాజకీయ విధానాల్లో నిబద్ధత అత్యంత ముఖ్యమనే విషయాన్ని ఎప్పుడో మర్చిపోయారు. వారు అనుభవించే పదవులను బట్టి లౌకిక వాదానికి అర్థం మారిపోతుంది’ అని చంద్రబాబు తీరును ఎండగట్టారు. -
సజావుగా ఫ్లాగ్షిప్ పరీక్ష
అనంతపురం అర్బన్:యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం ఫ్లాగ్షిప్ పరీక్షలు సజావుగా జరిగాయి. సీడీఏ పరీక్షకు అభ్యర్థుల హాజరు శాతం 45.07, ఎన్డీఏ పరీక్షకు 65.42 శాతం నమోదైంది. అనంతపురం కేఎస్ఎన్ పీజీ మహిళా కళాశాలలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), నావెల్ అకాడమీ (ఎన్ఏ), ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాలలో కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ (సీడీఏ) పరీక్షలు నిర్వహించారు. రెండు సెషన్లుగా ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు పోలీసులు పటిష్ట బందోబస్తు కల్పించారు. సీడీఏ పరీక్షకు 94 మంది హాజరవ్వాల్సి ఉండగా పేపర్–1కు 41 మంది,పేపర్–2 కు 48 మంది హాజరయ్యారు. పేపర్–3 పరీక్షకు 37 మందికి 15 మంది హాజరయ్యారు. ఎన్డీఏ, ఎన్ఏ పరీక్షకు 269 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. పేపర్–1కు 178, పేపర్–2కు 174 మంది హాజరయ్యారు.ఎం.రామ్మోహన్,డి.తిప్పేనాయక్లు పరీక్షలను పర్యవేక్షించారు. ప్రశాంతంగా గురుకులాల ప్రవేశ పరీక్ష అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఆదివారం రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 5వ తరగతి ప్రవేశానికి 7,595 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 6,972 మంది హాజరయ్యారు. 625 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షకు 4,945 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 4,099 మంది హాజరయ్యారు. 847 మంది గైర్హాజరయ్యారు. బి.పప్పూరు, కొర్రపాడు, కురుగుంట స్కూళ్లలో కేంద్రాలను రాష్ట్ర పరిశీలకులు క్లారెన్స్ రాజు పరిశీలించారు. కురుగుంట కళాశాల కేంద్రంతో పాటు తిమ్మాపురం, అమరాపురం, నల్లమాడ పాఠశాలల కేంద్రాలను అంబేడ్కర్ గురుకుల పాఠశాలల ఉమ్మడి జిల్లా సమన్వయకర్త జయలక్ష్మీ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. నేడు ఫిర్యాదుల స్వీకరణ ఉండదు అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుల స్వీకరణ ఈ సోమవారం ఉండదని కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందని, ఈ నేపథ్యంలో కలెక్టరేట్లో జరగాల్సిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావొద్దని సూచించారు. వృద్ధ దంపతుల ఆత్మహత్య ● అనారోగ్యంతో మనస్తాపం చెంది బలవన్మరణం అనంతపురం: అనారోగ్యంతో మనస్తాపం చెందిన వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అనంతపురం త్రీటౌన్ సీఐ కే.శాంతిలాల్ తెలిపిన మేరకు.. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వీవర్స్ కాలనీ చెందిన దేవా శివానంద (70), దేవా శాంతమ్మ (60) దంపతులు. వీరికి దేవా గోపాల్, దేవా చంద్రశేఖర్ సంతానం కాగా, హిందూపురంలో కుమారులు ఒక చోట, తల్లిదండ్రులు మరో చోట నివాసం ఉంటున్నారు. ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేసి పదవీ విరమణ పొందిన శివానందకు ఇటీవల షుగర్ ఎక్కువైంది.కిడ్నీ కూడా దెబ్బతినడంతో అనంతపురం సవేరా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడలేదు. శాంతమ్మ కూడా షుగర్ వ్యాధితో బాధపడేవారు. ఈ క్రమంలోనే ఈ నెల 11న దంపతులిద్దరూ ఇంటికి తాళం వేసి అనంత పురం చేరుకున్నారు. నగర సమీపంలోని నేషనల్ పార్కు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయారు. గుర్తించిన స్థానికులు వెంటనే ఇద్దరినీ అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించగా, చికిత్స ఫలించక శివానంద అదే రోజు ప్రాణాలు విడిచారు. శాంతమ్మ ఆదివారం మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. -
పరిస్థితి దారుణంగా ఉంది
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చీనీ తోటలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 93 వేల ఎకరాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 37,250 ఎకరాల భారీ విస్తీర్ణంలో చీనీ పంట సాగవుతోంది. వాటి ద్వారా ఏటా 7.20 లక్షల టన్నుల మేర దిగుబడి వస్తోంది. ఏటా సరాసరి రూ.2,000 కోట్ల నుంచి రూ.2,200 కోట్ల టర్నోవర్ ఉన్నట్లు ఉద్యానశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలంలో 18 వేల ఎకరాలు, యల్లనూరు 11,296, కూడేరు 9,300, పామిడి 5,300, నార్పల 5,200, పుట్లూరు 5 వేలు, ఆత్మకూరు 4,200, అనంతపురం 3,900, పెద్దపప్పూరు 3,500 ఎకరాల్లో చీనీ తోటలు ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో తాడిమర్రి, బత్తలపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి తదితర మండలాల్లో చీనీ అత్యధికంగా సాగులో ఉంది. ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి.. ఉమ్మడి జిల్లాలో పండించే చీనీలో 70 నుంచి 80 శాతం వరకు ఢిల్లీలో ఉన్న అజాద్పూర్ మార్కెట్కు, ఆ తర్వాత రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. అయితే ఈ సారి మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఎక్కువ దిగుబడి రావడంతో వ్యాపారులు అక్కడికి వెళుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల మార్కెట్లకు సరుకు విపరీతంగా వెళుతుండటంతో సమస్య ఉత్పన్నమవుతోందని మార్కెట్యార్డు ఉన్నతశ్రేణి సెక్రటరీ కె.గోవిందు తెలిపారు. ఇటీవల జిల్లా నుంచి అక్కడకు వెళ్లిన 50 నుంచి 70 లారీల సరుకు ఇంకా అన్లోడ్ కాలేదని, దీంతో ధరలు పెరగడం లేదని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో గరిష్ట ధరలు పలికేవి. కానీ, ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ధరలు పెరగడం అటుంచి తగ్గుదల కనిపిస్తుండటంతో అన్నదాతలు దిక్కులు చూస్తున్నారు. ఏప్రిల్లో టన్ను రూ.40 వేలకు పైగా పలకాల్సివుండగా... గత రెండు నెలలుగా టన్ను రూ.20 వేల నుంచి రూ.25 వేలకు మించి పలకడం లేదు. అనంతపురం వ్యవసాయ మార్కెట్యార్డుకు ఇటీవల నిత్యం 1,000 నుంచి 1,500 టన్నుల సరుకు వస్తోంది. ఈ క్రమంలో శనివారం టన్ను గరిష్ట ధర రూ.20 వేల లోపే పలికింది. సరాసరి ధర రూ.13 వేలు మాత్రమే పలకడంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. దీనికి తోడు శనివారం మార్కెట్యార్డులో జీవాల సంత ఉండటంతో చీనీ అమ్మకాలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. చాలా వాహనాల్లోని సరుకును కిందికి దించి అమ్మకాలు చేసేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ఇలా రోజురోజుకు కష్టాలు ఎక్కువ అవుతుండటంతో చీనీ రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ‘అనంత’ రైతులకు ఒకప్పుడు లాభాల తీపి పంచిన చీనీ ఇప్పుడు చేదెక్కింది. మంచి ధర కోసం వారాలు, నెలల తరబడి కాయలు కోయకుండా ఎదురుచూసినా ఫలితం కానరాకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మార్కెటింగ్ పరిస్థితి దారుణంగా ఉన్నా కూటమి సర్కారు నుంచి స్పందన లేకపోవడంతో రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ధరలు మరింత పతనం గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణ పరిస్థితులు రైతుల్లో తీవ్ర ఆందోళన గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి చీనీ రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. రంజాన్, ఉగాది, హోలీ పండుగలు అన్నీ వెళ్లినా... ధరలు మాత్రం పెరగడం లేదు. తోటల్లోనే టన్ను రూ.25 వేలకు మించి అడగడం లేదు. దానికి డబుల్ సూట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే నెల పాటు కాయలు కోయకుండా ధరల కోసం ఎదురుచూసినా ఫలితం కానరాలేదు. నాకు ఏడెకరాల చీనీ తోట ఉంది. దిగుబడి బాగానే ఉన్నా ధరలు చూస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదు. టన్ను రూ.40 వేలు అటుఇటుగా పలికితే తప్ప గిట్టుబాటు కాదు. గతంలో కన్నా ఈ సారి చీడపీడల తాకిడి ఎక్కువ కావడంతో పురుగుల మందుల ఖర్చు బాగా పెరిగింది. – కుళ్లాయిరెడ్డి, చీనీ రైతు, కునుకుంట్ల గ్రామం, తాడిమర్రి మండలం -
వక్ఫ్ యాక్ట్ వాపస్ లేలో..
అనంతపురం కార్పొరేషన్: ‘వక్ఫ్ యాక్ట్ వాపస్ లేలో.. హమ్ కిసీకో డర్తా నహీ (వక్ఫ్ చట్టాన్ని ఉపసంహరించుకోండి.. మేం దేనికీ భయపడేది లేదు)’ అంటూ ముస్లింలు నినదించారు. అనంతపురం నగరంలో ఆదివారం యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ విజయ వంతమైంది. ర్యాలీలో వేలాదిగా ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ప్రజా, కుల సంఘాలు వీరికి మద్దతు తెలిపాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి క్లాక్టవర్, రఘువీరా కాంప్లెక్స్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వక్ఫ్ చట్టం తీసుకొచ్చిందన్నారు. 11 ఏళ్లుగా ముస్లిం మైనార్టీలను బీజేపీ ఇబ్బంది పెడుతోందని, తమ పూర్వీకుల ఆస్తులను కాజేసేందుకు తాజాగా కుట్ర చేస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతోంది అదానీ, అంబానీలని, రానున్న రోజుల్లో ‘వక్ఫ్’ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పచెబుతారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా వక్ఫ్ చట్టాన్ని తెచ్చారన్నారు. ఉర్దూ అకాడమీ రాష్ట్ర మాజీ చైర్మన్ నదీం అహ్మద్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముస్లింలకు న్యాయం చేయాలని ఉంటే రంగనాథ్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప మాట్లాడుతూ ‘వక్ఫ్’ చట్టం ఉపసంహరించుకునే వరకు ముస్లింలకు అండగా ఉంటామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ మాట్లాడుతూ ప్రధాని మోదీకి రాబోయే రోజుల్లో తప్పక బుద్ధి చెబుతామన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్, తబ్లిక్ జమాత్, సున్ని జమాత్ మతపెద్దలు, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకులు నియాజ్, వేమల నదీం, ఏకేఎస్ ఫయాజ్, ఖాజా, తనీష, పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాబేగ్, ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల నాయకులు సాకే హరి, ఇండ్ల ప్రభాకర్ రెడ్డి, నాయకులు తాజుద్దీన్, హారూన్ రషీద్, సూఫీ ఖాజా, జావెద్, జక్రియా, షమీ, అలీ, అల్లీపీరా, ఐఎంఎం బాషా, చామలూరు రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
తీర్థయాత్రలో విషాదం
పుంగనూరు: నూతనంగా కొనుగోలు చేసిన కారులో తీర్థయాత్రకు వెళ్లి వస్తున్న ఉపాధ్యాయ దంపతులు ప్రమాదానికి గురయ్యారు. భార్య అక్కడికక్కడే మృతి చెందగా... విషమ పరిస్థితుల్లో భర్త, కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు... అన్నమయ్య జిల్లా కలకడ మండలం ఎర్రయ్యగారిపల్లికి చెందిన వెంకటరమణ, శారద (45) దంపతులకు కుమార్తె కీర్తన, కుమారుడు శ్రీకర్ ఉన్నారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో నివాసముంటూ అదే మండలం బాలప్పగారిపల్లిలో ఉపాధ్యాయురాలిగా శారద, అన్నమయ్య జిల్లా సోంపల్లిలో స్కూల్ అసిస్టెంట్గా వెంకట రమణ పనిచేస్తున్నారు. కీర్తన ఇటీవల ఇంటర్ పరీక్షలు రాసింది. శ్రీకర్ గుడివాడలోని ఓ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల ఉపాధ్యాయ దంపతులు నూతనంగా ఓ కారును కొనుగోలు చేశారు. తమిళనాడులోని తిరువణ్ణామలైకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ లోపు శనివారం ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యాయి. కుమార్తె కీర్తన అత్యధిక మార్కలతో ఉత్తీర్ణత సాధించడంతో ఎంతో సంతోషపడిన ఉపాధ్యాయ దంపతులు తిరువణ్ణామలైకు వెళ్లి పూజదికాలు ముగించుకుని ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. మార్గ మధ్యంలో పుంగనూరు మండలం సుగాలీమిట్ట వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన ఐచర్ వాహనం ఢీకొంది. ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. శారద అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ, కుమారై కీర్తనను స్థానికులు గమనించి మదనపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఇద్దరినీ మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, శారద అంత్యక్రియలను వెంకటరమణ స్వగ్రామం కలకడలో నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. మహిళా ఉపాధ్యాయురాలు మృతి భర్త, కుమార్తె పరిస్థితి విషమం -
సంక్షోభంలో రవాణా రంగం
హిందూపురం అర్బన్: లారీ రవాణా రంగం ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. రాష్ట్రంలో విజయవాడ తరువాత పదేళ్ల క్రితం వరకూ హిందూపురం రవాణా రంగంలో రెండో స్థానంలో ఉండేది. డీజిల్ ధరలు పెరగడం.. టోల్ గేట్ల మోత.. లోడింగ్– అన్లోడింగ్ల ఖర్చు, జీఎస్టీల భారంతో కనీస ఖర్చులు కూడా చేతికి అందడం లేదని లారీ యజమానులు వాపోతున్నారు. ఉన్నవి నడపడమే గగనం గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 12వేలకు పైగా లారీలు ఉండేవి. ప్రధానంగా విజయవాడ, బెంగళూరు, నాగపూర్, కొలకత్తా, చైన్నె, కొచ్చికి ఇక్కడి నుంచి సరుకు ఎగుమతి, దిగుమతులు ఎక్కువగా జరిగేవి. దీంతో పదేళ్ల క్రితం వరకు లారీల నిర్వాహకులకు ఆదాయం బాగుండేది. ఈ క్రమంలో చాలా మంది ఫైనాన్స్ కింద లారీలు కొనుగోలు చేసి సరుకు రవాణా రంగంలో స్థిరపడ్డారు. కాలక్రమేణా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరుల కారణంగా సరుకు రవాణా వ్యవస్థ కుదేలవుతోంది. కొత్తగా లారీలు కొనుగోలు చేసేవారి సంగతి పక్కన ఉంచితే... ఉన్నవాటిని నడపడమే గగనంగా మారుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4 వేల వరకు లారీలు ఉన్నాయి. కాలం మారినా అవే బాడుగలు రవాణా రంగంలో నెలకొన్న తీవ్ర పోటీ కారణంగా ఐదారేళ్ల క్రితం ఉన్న కిరాయినే ఇప్పటికీ ఉంది. లోడింగ్లు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. సీజన్లో కాస్త మెరుగనిపించినా ఆ తర్వాత లారీలన్నీ ట్రాన్స్పోర్టు కార్యాలయం ఎదుటే ఉంటున్నాయి. సరుకు రవాణాకు ఇప్పుడు రైళ్లను ఎక్కువగా ఎంచుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పెరిగిన ఇన్సూరెన్స్, పన్నులు లారీ విలువను బట్టి రెండేళ్ల క్రితం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కింద రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు బీమా ప్రీమియంను యజమానులు చెల్లించేవారు. ఇప్పుడు ఇదే ప్రీమియం రూ.40 వేల నుంచి రూ.75 వేల వరకు చేరింది. 22 చక్రాల కొత్త లారీకి ఇన్సూరెన్స్ కింద రూ.1.25 లక్షల ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. అలాగే లారీని బట్టి మూడు నెలలకు ఒకసారి స్టేట్ పర్మిట్ కింద పన్ను రూ.8 వేల నుంచి 13 వేల వరకు చెల్లించాలి. నేషనల్ పర్మిట్ అయితే మరింత ఎక్కువవుతుంది. ఇక ఏడేళ్లు దాటిన లారీలకు పన్నులకు అదనంగా గ్రీన్ ట్యాక్స్ తప్పక చెల్లించాల్సి వస్తోంది. పెరిగిన ఇంధనం, టైర్లు, విడి పరికరాల ధరలు కూలీలతో లోడింగ్, అన్లోడింగ్ కష్టాలు ఈఎంఐలు కట్టలేక రోడ్డు మీద పడే దుస్థితి రేపటి నుంచి కర్ణాటకకు నో ఎంట్రీ పెరిగిన విడిభాగాల ధరలు ఇంజన్ ఆయిల్తో పాటు లారీల విడిభాగాల ధరలు దాదాపు 22 శాతం మేర పెంచారు. దీంతో లారీ సామర్థ్యాన్ని బట్టి నెలవారీ నిర్వహణ ఖర్చు రూ.20వేల నుంచి రూ.25 వేల వరకు వస్తోంది. టైర్ల ధరలు మూడేళ్ల క్రితం రూ.16,500 ఉంటే ఇప్పుడు అవే టైర్లు రూ.21,500కు చేరుకున్నాయి. రేడియల్ టైర్లయితే రూ.26వేలు ఖర్చవుతోంది. రోడ్డుపై లారీ తీసిన ప్రతిసారీ పోలీస్, రవాణా అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సి వస్తోంది. మోయలేని ఆర్థిక భారం రవాణా రంగంపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న నాలుగు శాతం వ్యాట్ తగ్గించాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే దీని ధర ఎక్కువ. విడి భాగాల ధరలు సైతం అందుబాటులో లేవు. అంతేకాక కొందరిని నమ్మి లారీలు అప్పజెప్పే కాలమూ పోయింది. ఓనర్లే తిప్పడమో లేదా డ్రైవర్తో పాటు వెళ్లడం చేస్తున్నారు. జీఎస్టీతో యజమానులపై మోయలేని ఆర్థిక భారం పడుతోంది. వీటిని తగ్తిస్తే ఎంతో వెసులుబాటుగా ఉంటుంది. – షేక్ ఇందాద్, హిందూపురం లారీ అసోసియేషన్ అధ్యక్షుడు గ్రీన్ ట్యాక్స్ పేరుతో బాదుడు 10 ఏళ్ల క్రితం లీటర్ డీజిల్ ధర రూ.68 ఉండేది. అప్పట్లో విజయవాడకు టన్ను సరకు రవాణాకు రూ.1,600 ఇచ్చేవారు. అంటే లారీకి 15 టన్నులు వేసినా రూ.24 వేలు వచ్చేది. రానూపోను రూ.48 వేలు దక్కితే ఖర్చులు పోను రూ.15వేలు మిగిలేది. ఇప్పుడు లీటరు డీజిల్ రూ.100కు చేరువలో ఉంది. విజయవాడకు కిరాయి టన్నుకు రూ.14 వేలు ఇస్తున్నారు. ఈ లెక్కన రానూపోను రూ.42 వేలు వస్తుంది. ఖర్చులన్నీ పోనూ యజమానికి మిగిలిదే ఏదీ ఉండదు. దీనికి తోడు గ్రీన్ట్యాక్స్ను అమాంతం పెంచేశారు. – షౌకత్ అలీఖాన్, లారీ ఓనర్, హిందూపురంప్రజా జీవితంలో రవాణా రంగం కీలక భూమిక పోషిస్తోంది. ఎంతోమంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా సంక్షోభంలో కూరుకుపోతోంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేశారు. రకరకాల పన్నుల పేరుతో అధిక మొత్తంలో నగదు వసూళ్లతో రవాణా రంగం కుదేలవుతోంది.15 నుంచి కర్ణాటకకు లారీల బంద్ రవాణా రంగాన్ని కలవర పెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు నిరసనగా ఈ నెల 14న అర్ధరాత్రి నుంచి రవాణా కార్యకలాపాలు విరమించాలని ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక స్టేట్ లారీ ఓనర్స్, ఏజెంట్స్ అసోషియేషన్ నిర్ణయించింది. ఇందుకు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. లీటర్ డీజల్పై రూ. 5 అదనంగా పెంచడం, టోల్గేట్ల వద్ద బలవంతపు వసూళ్లు, బెంగళూరులో అశాసీ్త్రయమైన నో ఎంట్రీ నిబంధనలు, అప్పు కింద కొనుగోలు చేసిన లారీ యజమానులపై ఫైనాన్స్ వారి వేధింపులు.. తదితరాలను నిరసిస్తూ కర్ణాటక లారీ అసోసియేషన్ ఈ మేరకు ఉద్యమానికి పిలుపునిచ్చింది. దీంతో ఈ నెల 15 నుంచి కర్ణాటకకు లారీల రాకపోకలు నిలిపివేయనున్నారు. -
నెట్టికంటుడికి కిలో వెండి వితరణ
గుంతకల్లు రూరల్: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన మౌనిక, రాకేష్ దంపతులు ఆదివారం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి కిలో బరువున్న వెండిని అందజేశారు. అంతకు ముందు దాతల కుటుంబసభ్యుల పేరున ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. లైంగిక వేధింపులపై కేసు నమోదు గార్లదిన్నె: మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళను లైంగికంగా వేధిస్తున్న పి.కొత్తపల్లి గ్రామానికి చెందిన యువకుడు భాస్కర్పై కేసు నమోదు చేసినట్లు గార్లదిన్నె పీఎస్ ఎస్ఐ గౌస్ మహమ్మద్బాషా తెలిపారు. భాస్కర్ యర్రగుంట్ల గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ మహిళను లైంగిక వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. కుటుంబ సభ్యులతో కలసి బాధిత మహిళ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్తో ఉపాధ్యాయుడి మృతి గుత్తి రూరల్: మండలంలోని బాచుపల్లి జంగాల కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎన్.కాంతారావు (58) ఆదివారం కన్నుమూశారు. మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండే వారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం కుటుంబసభ్యులు చేర్పించారు. పరిస్ధితి విషమించడంతో ఆదివారం ఉదయం 6.30 గంటలకు బ్రెయిన్ స్ట్రోక్తో ఆయన మృతి చెందారు. ఆయన మృతిపై వైఎస్సార్టీఏ జిల్లా కార్యదర్శి శ్రీధర్గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓబులేసు, వెంకటరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. -
●వైభవం.. చిక్కణ్ణేశ్వరుడి రథోత్సవం
కణేకల్లు మండల కేంద్రంలో ఆదివారం చిక్కణ్ణేశ్వర స్వామి రథోత్సవం కనుల పండువగా జరిగింది. రథోత్సవాన్ని చూసేందుకు తరలివచ్చిన భక్తులతో కణేకల్లులో సందడి నెలకొంది. ‘చిక్కణ్ణేశ్వరా.. శరణు’ అంటూ భక్తులు చేసిన ఘోషతో పురవీధులు మార్మోగాయి. స్వామి వారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన అనంతరం ఉత్సవ విగ్రహాన్ని రథంలో ఆశీనులు గావించి ఉత్సవం ప్రారంభించారు. రథోత్సవం సాగుతున్నంత సేపూ శివన్నామస్మరణ చేసుకుంటూ భక్తులు తన్మయత్వం చెందారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. – కణేకల్లు: -
48 ఏళ్ల తర్వాత...
● అ‘పూర్వ’ సమ్మేళనంపెద్దవడుగూరు: స్థానిక జెడ్పీహెచ్ఎస్లో 1992లో పదో తరగతి చదివిన వారు ఆదివారం అదే పాఠశాల వేదికగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని సరస్వతీ దేవి విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ పంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాలకు చేరుకుని తమతో పాటు చదువుకుని అకాల మృత్యువాత పడిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందజేశారు. రూ.40 వేలతో పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పూర్వ విద్యాఉ్థలు అనిల్, రాజేశ్వరమ్మ ముందుకు వచ్చారు. అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని శ్రీపొట్టి శ్రీరాములు నగర పాలకోన్నత పాఠశాలలో 1976–1977లో 10వ తరగతి చదివిన వారు ఆదివారం అదే పాఠశాల వేదికగా కలుసుకున్నారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ జీవితంలో స్థిరపడిన వారు 48 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. చాలామంది విద్య, వైద్యం, న్యాయ శాఖ, రెవెన్యూ, ఆడిట్, అటవీ శాఖ, పోస్టల్, బీఎస్ఎన్ఎల్ తదితర రంగాల్లో సేవలందించి ఉద్యోగ విరమణ సైతం పొందారు. తమ చిన్ననాటి అల్లర్లను, గురువులతో వారికున్న సత్సంబంధాలను గుర్తు చేసుకున్నారు. గురువులు సూర్యనారాయణ శాస్త్రి, రంగప్ప, కృష్ణమూర్తి, గంగాచారిని ఘనంగా సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హై కోర్టు విశ్రాంత న్యాయమూర్తి శ్యామసుందర్, అటవీ శాఖ అధికారి ఆంజనేయులు, వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షకులు మనోహర్, పోస్టల్ శాఖ వన్నప్ప, ఆడిటర్ హరినాథ్, విశ్రాంత తహసీల్దార్ సిరాజుద్దీన్, విద్యా శాఖ షేక్ మహబూబ్బాషా, రియాజుద్దీన్, రక్షణ శాఖ లక్ష్మీకాంత రెడ్డి, వ్యాపారవేత్త అబ్దుల్ ఖయూమ్తో పాటు మరో 50 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం గురువులు పుల్లన్న, పద్మనాభ శాస్త్రి, చిన్నకేశవులు ఇళ్ల వద్దకు వెళ్లి ఘనంగా సత్కరించారు. -
టీడీపీ నాయకుడి ఆత్మహత్యాయత్నం
● కుమారుడి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని తొలగించారని అఘాయిత్యం ● డబ్బు ముట్టజెప్పినా.. మరొకరితో మళ్లీ వసూలు చేసి అన్యాయం చేశారు: బాధిత కుటుంబీకుల ఆరోపణ గుత్తి రూరల్: డబ్బు ముట్టజెప్పి కుమారుడికి ఇప్పించిన ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని.. వేరొకరితో మళ్లీ వసూళ్లకు పాల్పడి తొలగించారని మనస్తాపం చెందిన ఓ టీడీపీ నాయకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మండలంలోని మాముడూరు గ్రామంలో కలకలం రేపింది. బాధితుడి కుటుంబసభ్యులు తెలిపిన మేరకు..మామడూరుకు చెందిన బోలే ఎల్లప్ప టీడీపీలో చాలాకాలంగా చురుగ్గా పనిచేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎల్లప్ప కుమారుడు బోలే గిరిష్ని ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా నియమించారు. ఇందుకోసం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు, అప్పటి గుత్తి పార్టీ ఇన్చార్జ్ గుమ్మనూరు నారాయణ రూ.4 లక్షలు తీసుకొన్నారు. ఇటీవల నారాయణ స్థానంలో గుత్తి ఇన్చార్జ్గా బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్యే కుమారుడు గుమ్మనూరు ఈశ్వర్.. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం నుంచి బోలే గిరిష్ని తొలగించి అదే గ్రామానికి చెందిన మరొకరిని నియమించారు. ఇందుకు ఆయన రూ.8 లక్షలు తీసుకొన్నారు. తన కుమారుడిని ఉద్యోగం నుంచి తొలగించడాన్ని ఎల్లప్ప అవమానంగా భావించాడు. ఆదివారం తన భార్య లక్ష్మిదేవి, గ్రామంలోని సన్నిహితులు, ఇతర పార్టీ నాయకులకు ఫోన్ చేసి మాట్లాడిన అనంతరం గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకొన్నాడు. ఈ క్రమంలోనే హుటాహుటిన అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు కొన ఊపిరితో ఉన్న ఎల్లప్పను కిందికి దించి వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ఘనంగా కదిరప్పస్వామి రథోత్సవం
గుంతకల్లు రూరల్: మండలంలోని నాగసముద్రం గ్రామంలో వెలసిన కదిరప్పస్వామి రథోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేడుకలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. వేకువజామునే ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహ మూలవిరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చి కల్యాణం జరిపించారు. సాయంత్రం ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి రథంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజల అనంతరం గోవింద నామస్మరణతో భక్తులు ముందుకు లాగారు. జీఓ 77ను రద్దు చేయాలి : పీడీఎస్యూ అనంతపురం ఎడ్యుకేషన్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి పీజీ విద్యార్థులను దూరం చేసే జీఓ 77ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్ డిమాండ్ చేశారు. ఆదివారం అనంతపురంలోని జార్జిరెడ్డి కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కె.భాస్కర్తో పాటు పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరేంద్ర ప్రసాద్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.3,600 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయన్నారు. ఫీజు బకాయిలు విడుదల చేస్తామన్న విద్యాశాఖ మంత్రి లోకేష్ మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు. యువగళం పాదయాత్రలో జీఓ 77 రద్దు చేస్తామంటూ ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడిచినా ఇంతవరకూ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయకుండా పాలకులు కాలయాపన చేస్తున్నారన్నారు. వీసీ నియామకాలపై యూజీసీ నూతన ప్రతిపాదనలను వ్యతిరేకించి, యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడాలన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని, జీఓలు 107, 108ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తల్లికి వందనం పథకాన్ని తక్షణమే అమలు చేయాలన్నారు. సమావేశంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల ప్రసాద్, కోశాధికారి బండారి శంకర్, నాయకులు తేజ, ఉదయ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమణ పాల్గొన్నారు. ఏడుగురిపై కేసు నమోదు తాడిపత్రి టౌన్: ఈ నెల 11న తాడిపత్రి పట్టణ పోలీస్స్టేషన్ ఎదుట బంగారం వర్తకుడు గౌసుల్లా ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సాయిప్రసాద్ ఆదివారం తెలిపారు. నిందితుల్లో తాడిపత్రికి చెందిన జిలాన్, రఫీ, హజీ, రసీద్, గౌస్, ఇంతియాజ్, రబ్బాన్నీ ఉన్నారని పేర్కొన్నారు. -
విద్యా విధానంలో.. గందరగోళ నిర్ణయాలు తగదు
● రాష్ట్రోపాధ్యాయ సంఘం అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని విద్యా విధానంలో రోజురోజుకూ గందరగోళ నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇలాంటి నిర్ణయాలు సముచితం కాదని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు మండిపడ్డారు. ఆదివారం విజయవాడ వేదికగా జరిగిన ఎస్టీయూ రాష్ట్ర కార్య వర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు కాబోతున్న విద్యా విధానంలో ఉపాధ్యాయులకు అన్యాయం జరిగేలా అధికారిక నిర్ణయాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 117 జీఓను రద్దు చేస్తామని, ప్రతి పంచాయతీకి ఓ మోడల్ పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. మరోసారి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న కారణంగా ప్రతి పంచాయతీకి మోడల్ పాఠశాల ఏర్పాటు చేయలేమని, ఆ గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించడం చాలా దుర్మార్గమన్నారు. ఈ విధానాలతో ఉపాధ్యాయుల మీద ఒత్తిళ్లు పెరిగిపోతాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా పునరాలోచించి జీఓ 117ను రద్దు చేసి విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి పంచాయతీకి ఒక మోడల్ పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ప్రాథమిక పాఠశాలలు అందుబాటులో ఉంచి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. రామాంజనేయులు, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి జి. సూర్యుడు, రాష్ట్ర కార్యదర్శి కె. చంద్రశేఖర్ పాల్గొన్నారు. రైతు ఆత్మహత్య పెద్దవడుగూరు: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దవడుగూరు మండలం చింతలచెరువు గ్రామానికి చెందిన బోయ రామాంజనేయులు (49)కు భార్య రమాదేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తమకున్న ఐదు ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో పంట పెట్టుబడులు, కుమార్తెల పెళ్లిళ్లు, అనారోగ్యంతో బాధపడుతున్న భార్య చికిత్సకు తెలిసిన వారి వద్ద రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. గ్రామంలో వ్యవసాయ పనులు సక్రమంగా లేకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన ఆయన శనివారం రాత్రి పురుగుల మందు తాగాడు. అపస్మారకంగా పడి ఉన్న ఆయనను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. -
‘కూటమి విజయంలో బీజేపీదే కీలక పాత్ర.. టీడీపీ ఓవరాక్షన్ ఎక్కువైంది’
సాక్షి, అనంతపురం: ఏపీలో అధికార కూటమి పార్టీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా టీడీపీ నేతల తీరుపై ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడానికి బీజేపీనే కీలక పాత్ర పోషించింది. అలాంటి బీజేపీ నాయకులపై ఎందుకంత చిన్న చూపు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిలపై బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాడిపత్రిలో బీజేపీ నేతలకు కనీస గౌరవం లేదని అసహనం ప్రదర్శించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ..‘టీడీపీ కూటమి అధికారంలోకి రావడంలో బీజేపీ పాత్ర కీలకం. మేము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో బీజేపీ కార్యకర్తలతో సమానంగా టీడీపీ, జనసేన శ్రేణులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. మరి మీరెందుకు బీజేపీ నాయకులపై చిన్నచూపు చూస్తున్నారు?. తాడిపత్రి బీజేపీ నేతల సమస్యలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం అని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు కూడా ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మధ్య మాటల యుద్ధం నడిచింది. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధిపై మీనాక్షి నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తరువాత ఒకలా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే పార్థసారధి వైఖరి సరైంది కాదు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కూటమి ఎమ్మెల్యే అని మరచి పోతున్నాడు. ఎమ్మెల్యే పార్థసారథి వాస్తవాలు చెప్పాలి. ఏది పడితే అది చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రభుత్వ కార్యక్రమాలకు నన్ను పిలువకుండా దూరం పెట్టారు. టీడీపీ వారికి ఏ పనులు చేయడం లేదు. ఇలాగే కొనసాగితే మున్ముందు ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడికి ఎమ్మెల్యే పార్థసారధి తిరిగి కౌంటర్ ఇస్తూ.. తాను చెప్పిందే వినాలి అన్నట్లు మీనాక్షి నాయుడు వ్యవహరిస్తున్నారని.. బీజేపీలో, జనసేనలో ఏ వర్గాలు లేవు. కాని టీడీపీలో ఐదు వర్గాలు ఉన్నాయి. పది శాతం తన గురించి ఆలోచిస్తే 90 శాతం బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తల గురించే ఆలోచిస్తాను. సమస్య అంతా మీనాక్షినాయుడుతోనే ఉంది. కూటమి కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహంగా ఉన్నారు. కార్యక్రమాలకు నేను పిలుస్తున్నా వాళ్లే రావడం లేదని అన్నారు. -
ఈయన సక్సెస్ నెవర్ ఎండ్
అనంతపురం కల్చరల్: భారతదేశ సంప్రదాయ పానీయం గోలీసోడా. సుయ్మంటూ శబ్దం చేస్తూ గోలీని కిందికి దించి సోడా తాగుతుంటే దాని రుచి అద్భుతం. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ ఓ వెలుగు వెలిగిన సోడా దాహార్తి తీర్చే పానీయంగానే కాదు.. భోజనం అరగకపోయినా గోలీసోడా తాగి ఉపశమనం పొందేవారు. అయితే మారిన కాలానికి అనుగుణంగా పలు రకాల కూల్డ్రింక్స్ మార్కెట్లోకి రావడంతో 140 ఏళ్ల చరిత్ర కల్గిన గోలీసోడా ప్రాభవం తగ్గింది. అలాంటి గోలీసోడాకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన యువ పారిశ్రామికవేత్త ఉదయ్కిరణ్రెడ్డి పూర్వవైభవం తీసుకొచ్చారు. ‘నెవర్ ఎండ్’ పేరుతో స్టార్టప్ కంపెనీగా మొదలై ‘గోలీసోడా’ను కొత్త పుంతలు తొక్కించారు. వివిధ రకాల ఫ్లేవర్లు, అద్భుతమైన రుచితో గోలీసోడాను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.గోలీ సోడా ప్రస్థానమిలా..బ్రిటీష్ వలస పాలకులు రాజ్యమేలుతున్న రోజుల్లో హిరమ్ కాడ్ అనే విదేశీయుడు భారతదేశంలో గోలీసోడా ప్రవేశపెట్టాడు. అనతికాలంలోనే ఈ సంప్రదాయ పానీయం గురించి దేశమంతటా పాకిపోయింది. ఆ తర్వాత గోలీసోడా లేని రోజులను ఊహించుకోలేకపోయారు. బ్రాండెడ్ కూల్డ్రింక్స్ ఎన్నొచ్చినా గోలీ సోడా అంటే ఇష్టపడే వారు దాన్ని ఎక్కడ అమ్ముతున్నా వెళ్లి తాగొచ్చేవారు.స్టార్టప్తో ఆకట్టుకుని..శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం కొత్తూరుకు చెందిన పల్లి రమణారెడ్డి, అనూరాధ దంపతుల కుమారుడు ఉదయ్కిరణ్రెడ్డి.. ఆయన తన సోదరుడు జయదీప్రెడ్డితో కలిసి స్టార్టప్ కంపెనీగా ‘నెవర్ ఎండ్’ పేరుతో గోలీసోడా ఉత్పత్తులను ప్రారంభించారు. ‘కూల్ డ్రింక్లు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ పాత సోడా అంటే ఏం క్లిక్ అవుతుంది’ అని పెదవి విరిచిన వాళ్లే గోలీసోడా రుచికి ఫిదా అయిపోయారు. అనంతపురం నుంచి దేశ నలుమూలలే కాదు మలేషియా, అమెరికా (టెక్సాస్, డల్లాస్), దుబాయ్ వంటి విదేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. మొత్తం 150 ఫ్యాక్టరీలు.. 99 రకాల ఫ్లేవర్లు.. నిత్యం లక్షలాది మంది గోలీసోడా తాగే కస్టమర్లు.. ఇదేమీ చిన్న విషయం కాదు. ఈ ప్రస్థానం వెనుక అంతులేని శ్రమ ఉంది.రసాయనాలు లేకుండా..మాది సాధారణ కుటుంబం. చిన్నప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించాం. ఉన్నత చదువులు అభ్యసించిన తర్వాత స్టార్టప్ కంపెనీ పెట్టాలని భావించి.. సమగ్ర అధ్యయనం చేశాం. ఇందులో గోలీసోడా కాన్సెఫ్ట్ బాగా నచ్చింది. అనుకున్నదే తడవుగా పరిశ్రమను ఏర్పాటు చేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ నేడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాం. విదేశాల్లోనూ మా ఫ్రాంచైజీ తీసుకుంటున్నారు. మేము ఒక్కో బాటిల్ను 14 సార్లు శుభ్రపరిచి రీఫిల్ చేస్తాం. సోడా తయారీలో ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజసిద్ధమైన పండ్ల రసాల రుచులనందిస్తున్నాం.– ఉదయ్కిరణ్రెడ్డి, ‘నెవర్ ఎండ్’ గోలీసోడా యజమాని -
మెరిసిన మట్టిలో మాణిక్యాలు
అనంతపురం ఎడ్యుకేషన్: వారు లక్షలాది రూపాయల ఫీజులు కట్టలేదు. అంతా కూలినాలి చేసుకుని కుటుంబాలను పోషించుకునే వారే. చాలామంది తల్లిదండ్రులు నిర్లక్షరాస్యులే. వారికి చదువులు లేవు కానీ పిల్లలపై గంపెడాశలైతే ఉన్నాయి. అందుబాటులో ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో చదివిస్తున్నారు. తమ కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడి ఉండొచ్చుకానీ తమ చదువుకు ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం ఆటంకం కావని నిరూపించారు ఆ విద్యార్థులు. శనివారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోని వివిధ ప్రభుత్వ యాజమాన్యాల కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లాను కాదని ఎక్కడో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, కర్నూలు లాంటి నగరాల్లో లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ విద్యార్థులు మార్కులు సాధించారు. వారితో పోటీపడీ మార్కులు సాధించి పలువురితో ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ విద్యార్థులకు వచ్చిన మార్కులు చూసి వారికి చదువులు చెప్పిన అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తుండగా.... తల్లిదండ్రులు సంబరపడిపోతున్నారు. పైసా ఖర్చు లేకుండా తమ విద్యార్థులు సత్తా చాటారంటూ ప్రిన్సిపాళ్లు ధీమాగా చెబుతున్నారు. పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్, ప్రైవేట్తో పోటీ ఇంటర్లో రాణించిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు -
హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
తాడిమర్రి: మండల కేంద్రం తాడిమర్రిలో శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శనివారం డీసీఎంఎస్ మాజీ చైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహించారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎనిమిది జతల వృషభాలు పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో అనంతపురం జిల్లా యాడికి మండలం యంగన్నగారిపల్లి వాసుదేవరెడ్డి వృషభాలు నిర్ణీత 20 నిమిషాల్లో 1,550 అడుగులు లాగి ప్రఽథమ స్థానంలో నిలిచాయి. సోమలదొడ్డి గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి వృషభాలు 1,500 అడుగులు లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన నాగరాజు యాదవ్ వృషభాలు 1,250 అడుగులు లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. అనంతరం విజేత వృషభాల యజమానులకు ప్రథమ బహుమతి కింద రూ.70వేలు, ద్వితీయ బహుమతి కింద రూ.50 వేలు, తృతీయ బహుమతి కింద రూ.30 వేలుతో పాటు నాలుగో బహుమతి కింద రూ.20వేలు, ఊదో బహుమతి కింద రూ.10 వేలు చొప్పున అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువ నాయకులు తాడిమర్రి మనోజ్రెడ్డి, చెన్నారెడ్డి, ఎంపీపీ పాటిల్ భువనేశ్వర్రెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు విజయభాస్కర్రెడ్డి, వైటీ చంద్రశేఖర్రెడ్డి, సాయినాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. నిందితుడి అరెస్ట్ నార్పల: బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను నార్పల పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వెంకటేశ్వర్లు సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐ సాగర్తో కలిసి మీడియాకు వెల్లడించారు. బుక్కరాయసముద్రం మండలం సంజీవపురం గ్రామానికి చెందిన మహేష్ శుక్రవారం నార్పలలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి నిందితుడు మహేష్ను నార్పల శివారులో పోలీసులు అరెస్టు చేశారు. -
రమణీయం.. రంగనాథుడి కల్యాణం
తాడిపత్రి: జయ జయ రంగనాథస్వామి నామ సంకీర్తనలు.. వేదపండితుల వేదోక్త మంత్రాల నడుమ రంగనాథుడి పరిణయ వేడుక రమణీయంగా జరిగింది. ఆలూరు కోన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని, చైత్ర శుద్ధ పౌర్ణమి శనివారం ఉదయం మీన లగ్నంలో వేకువజామున 4.45 గంటలకు వజ్రవైఢూర్యాలు, బంగారు నగలు ధరించి రంగనాథుడు, నవ వధువుగా శ్రీదేవి, భూదేవిలు ముస్తాబయ్యారు. పండితులు వేద మంత్రాలు పఠిస్తుండగా, ఆలయ ప్రధాన అర్చకులు స్వామి వారికి యజ్ఞోపవీతం చేశారు. వెంటనే సకల దేవతల ఆశీస్సులతో వేద మంత్ర పఠనంతో శ్రీ వారు అమ్మవారికి, అమ్మవార్లు శ్రీ వారికి జీలకర్ర బెల్లం పెట్టిన తంతును కనులపండువగా జరిపించారు. మంగళ వాయిద్యాలు, సన్నాయి మేళాలు మోగుతుండగా శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల మెడలో మాంగల్యధారణ గావించారు. రంగనాథస్వామి, అమ్మవార్లకు తలంబ్రాల వేడుకను నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సాయంత్రం స్వామి వారి రథోత్సవం ఘనంగా జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలను తీసుకున్నారు. రూరల్ సీఐ లక్ష్మికాంతరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు -
పోలీసులు వేధిస్తున్నారు!
తాడిపత్రిటౌన్: ‘పంచాయితీ’ పేరుతో పోలీసులు వేధింపులకు గురి చేయడంతో బంగారు వ్యాపారి గౌసుల్లా శుక్రవారం స్టేషన్ ఎదుటే సైనేడ్ తాగి బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. అయితే పోలీసులు తనను వేధిస్తున్న తీరు, తన కటుంబ పరిస్థి తి గురించి గౌసుల్లా కన్నీరుపెట్టుకుంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో ఒకటి శనివారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవిస్తూ బతుకుతున్నానని, పుట్టిన పిల్లల్లోనే సంతోషం చూసుకుంటూ వారి కోసం బతుకుతున్నాని, అయితే పోలీసుల తీరు కలచివేస్తోందని చెప్పుకొచ్చాడు. ‘సార్ (పోలీసులను ఉదేశించి) మీరు ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవాలి. వాడు మంచివాడా చెడ్డావాడా.. వాడు ఎలా బతుకుతున్నాడు తెలుసుకొని విచారించాలి. డబ్బులు తీసుకురా.. అది దొంగ బంగారు అంటే ఎలా సార్. తెలిసినవ్యక్తి బ్యాంకులో వేలంలో బంగారు పోతుంది అంటే.. వారికి సాయం చేసినట్లు ఉంటుందని ఆరోజు డబ్బులు ఇచ్చి కొన్నాను. అదే నా తప్పు అయ్యింది. అది దొంగ బంగారు అని ఎలా తెలుస్తుంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తప్పక న్యాయం చేస్తాం పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకున్న గౌసుల్లా కుటుంబానికి తప్పక న్యాయం చేస్తామని సీఐ సాయిప్రసాద్ తెలిపారు. శనివారం పట్టణంలోని పెద్దబజార్లో ఉన్న గౌసుల్లా ఇంటి వద్దకు సీఐ వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. వీఆర్కు హెడ్కానిస్టేబుల్ బంగారు వ్యాపారిని పంచాయితీ పేరుతో వేధించిన తాడిపత్రి పట్టణ పోలీస్స్టేషన్ హెడ్కానిస్టేబుల్ రెహమాన్ను ఎస్పీ ఆదేశాల మేరకు వీఆర్కు పంపారు. విచారణ చేసి వాస్తవాలు తెలుసుకోండి ఆత్మహత్యకు ముందు బంగారు వ్యాపారి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ -
‘కూటమి’ డైవర్ట్ పాలిటిక్స్.. వైఎస్ జగన్పై పెద్ద కుట్రే జరుగుతుందా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ఏదైనా పెద్ద కుట్ర జరుగుతోందా? లేక ఏపీ ప్రజల అసంతృప్తిని కప్పిపుచ్చి డైవర్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం చూస్తోందా? వైఎస్ జగన్ రాప్తాడు పర్యటనను తెలుగుదేశం మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతులు కవర్ చేసిన తీరు చూస్తే ఎవరికైనా ఈ అనుమానాలు రాకమానవు. హోంశాఖ మంత్రి అనిత, టీడీపీ లోక్సభ సభ్యుడు లావు కృష్ణదేవరాయళ్ల వ్యాఖ్యలు అనుమానాలను మరింత బలపరిచేవిగా ఉంటున్నాయి. రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైసీపీ నేత కురుబ లింగమయ్య బీసీ వర్గపు నేత. ఆ ప్రాంతంలో ఈ వర్గానికి మంచి పట్టే ఉంది. హత్య వెనుక రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గానికి చెందిన కొందరు ఉన్నారన్నది అభియోగం. మొత్తం ఇరవై మందిపై ఫిర్యాదు చేస్తే ఇద్దరిపైనే కేసు పెట్టారట. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్లడానికి సిద్దమైన రోజు నుంచి పరిటాల సునీత ఆయనపై పలు విమర్శలు చేశారు. కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలూ చేశారు.దానికి అక్కడి వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇది ఒక నియోజకవర్గానికి పరిమితం అనుకుంటే, దానిని హోం మంత్రి రాష్ట్రస్థాయి వివాదంగా మార్చితే, టీడీపీ ఎంపీ జాతీయ స్థాయికి తీసుకువెళ్లే యత్నం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఆయన లేఖ రాసిన తీరు, అందులో ప్రస్తావించిన అంశాలు అన్ని కూడా జగన్ కు వ్యతిరేకంగా పెద్ద కుట్రకు ఏమైనా ప్లాన్ చేశారా అన్న సందేహం వస్తుంది. విశేషం ఏమిటంటే గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి వారు పల్నాడు ప్రాంతంలో కక్షల రాజకీయాలను ఎగదోసేలా వ్యాఖ్యలు చేసినప్పుడు , ఆయా చోట్ల పోలీసులపై దూషణలకు దిగినప్పుడు ఇదే లావు శ్రీకృష్ణదేవ రాయలు వైసీపీ ఎంపి. టీడీపీ నేతలపై ఆయన కూడా విమర్శలు చేసే ఉంటారు కదా! అదే రాయలును ప్రయోగించి టీడీపీ నాయకత్వం కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయించింది. నిజానికి జగన్ టూర్ సందర్భంగా జరిగిన ఘటనలపై కేంద్రానికి ఫిర్యాదు చేయవలసినంత పరిస్థితి ఏమిటో అర్థం కాదు. పైగా అందులో కేవలం రాప్తాడు అంశంతో ఆపకుండా, గత ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీ చేసే పిచ్చి ఆరోపణలన్నిటిని కలగలిపి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. అవసరం రీత్యా టీడీపీ అధినేత చంద్రబాబుతో బీజేపీ అధిష్టానం పొత్తుకు సిద్దమైంది తప్ప, ఆయనపై నమ్మకం, విశ్వాసంతో కాదన్న సంగతి అందరికి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీని, అమిత్ షా ను చంద్రబాబు ఎంతగా దూషించింది వారికి తెలియదా? జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయినా, ఎన్నడూ అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. బీజేపీ పెద్దలు కూడా జగన్ పై ఆ గౌరవం చూపుతూ వచ్చారు.ఇప్పుడు తెలుగుదేశం వ్యూహాత్మకంగా జగన్ పై వారికి ఉన్న సదభిప్రాయాన్ని చెడగొట్టి, ఏదో రకంగా కేసులు పెట్టించి రాజకీయంగా దెబ్బ కొట్టాలన్న దురుద్దేశంతో ఇలా లేఖలు రాయిస్తున్నట్లు కనబడుతుంది. జగన్ ప్రజలలో తిరుగుతుంటే వస్తున్న ఆదరణ చూసి కూటమి నేతలు ఖంగు తింటున్నారు. జగన్ది నిజంగానే కుట్ర స్వభావమై ఉంటే, అసలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు బీజేపీ పంచన చేరే అవకాశం ఎందుకు రానిస్తారు? ఆయనే ఎన్డీయే కూటమిలో చేరి ఉండేవారు కదా! కాని ఒక సిద్దాంతానికి కట్టుబడి ఆయన అందులో చేరలేదు. అంశాల వారిగా మద్దతు ఇవ్వడం లేదా, వ్యతిరేకించడం చేస్తూ వచ్చారు. ఉదాహరణకు వక్ఫ్ బిల్లుపై వైసీపీ స్పష్టంగా వ్యతిరేకిస్తే, దానిని కూడా వక్రీకరించడానికి టీడీపీ మీడియా ఎన్ని పాట్లు పడింది చూశాం. అదే చంద్రబాబు గతంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక ట్రిపుల్ తలాఖ్, ముస్లింలకు సంబంధించిన ఇతర అంశాల్లోనూ బీజేపీని, మోడీని ఎంతో ఘాటుగా విమర్శించారు. కాని ఇప్పుడు ఎన్డీయేతో కలిసి, కిక్కురుమనకుండా కేంద్రానికి మద్దతు ఇచ్చారు. దీనిపై రాష్ట్రంలో ముస్లిం వర్గాలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.జగన్ పై 11 సీబీఐ కేసులు, 9 ఈడి కేసులు ఉన్నాయని రాయలు ఇప్పుడు ఆ లేఖలో పేర్కొనడమే కుట్ర. అన్ని కేసులు ఉన్నప్పుడే వైసీపీలో చేరి ఈయన ఎంపీ అయ్యారు కదా! అసలు ఆ కేసులన్నీ కక్ష పూరితమని బీజేపీ నేత, దివంగత సుష్మా స్వరాజ్ పార్లమెంటులోనే చెప్పిన విషయం ఈయనకు తెలియదా? జగన్ను ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్ అంటూ రాసిన లేఖపై కృష్ణదేవరాయలు సంతకం చేశారంటే ఆయనకు ఆత్మ అనేది ఉందా అన్న సందేహం వస్తుంది. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్ని కుట్రలు చేసిందీ... ఎన్ని అక్రమాలకు పాల్పడిందీ ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకంలోనే ఉన్నాయి కదా? సొంత మామను పదవి నుంచి తోసేసి ఎలాంటి కుట్రలేదని తన తండ్రి రత్తయ్యతో చెప్పించి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన 1996లో లక్ష్మీపార్వతి ఆధ్వర్వంలోని ఎన్టీఆర్ టీడీపీ తరపున పోటీ చేశారు. లావుకు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇస్తూ చంద్రబాబుపై పలు కేసులు ఉన్నాయని, ఆయన కూడా బెయిల్ పై ఉన్నారని, కనుక ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్ అని ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. జగన్ ప్రజలలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారట. ఎంత దుర్మార్గపు ఆరోపణ. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మతం పేరుతో, కులం పేరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంత దారుణమైన రాజకీయం చేసింది లావుకు తెలియదా? వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబందించి కూడా జగన్పై నీచంగా లేఖలో ప్రస్తావించడం ద్వారా టీడీపీ ఏదో కుట్ర చేస్తోందన్న అనుమానం కలగదా? విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్లు ఏ మాదిరిగా పోలీసులను తిట్టింది ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయే. పోలీసులను జగన్ కక్ష సాధింపులకు వాడుకున్నారట. ఆ పని నిజంగా చేసిఉంటే చంద్రబాబు, లోకేశ్ పవన్ కళ్యాణ్లపై అప్పట్లో ఎన్ని కేసులు వచ్చి ఉండాలి? ఇప్పుడు రెడ్ బుక్ పేరుతో జరుగుతున్న అరాచకాలను గమనిస్తే జగన్ టైమ్లో ఎక్కడైనా ఒకటి, అరా జరిగాయేమో తప్ప, రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. అయినా కార్యకర్తలను రెచ్చగొట్టి కేసులు పెట్టించుకోవాలని సూచించింది చంద్రబాబు, లోకేశ్లు కాదా? ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవి ఇస్తానని ఆఫర్ చేసింది వారు కాదా? ఐదేళ్ల క్రితం ఏదో అన్నారనో, లేక ఏదో జరిగిందని, ఇప్పుడు తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ కేసులు పెట్టడాన్ని కక్ష రాజకీయాలు అంటారా? లేక అలాంటి కేసులే పెట్టని జగన్ పాలనను కక్ష పూరిత పాలన అంటారా? జగన్ భద్రతకు సంబంధించి లావుతో పాటు మంత్రి అనిత కూడా ఏదో వాదన చేశారు. ఈ ఒక్కదానికి సమాధానం చెప్పగలరా? 250 మంది పోలీసులు జగన్ హెలికాఫ్టర్ వద్ద నిజంగా ఉండి ఉంటే, అక్కడ చేరిన వంద మంది,లేదా రెండు వందల మందిని వెనక్కి పంపించలేకపోయారా? వారిని అక్కడకు రాకుండా ఆపలేకపోయారా? ఏపీ పోలీసులు అంత అసమర్థులని వీరు చెబుతున్నారా? హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడంతో వీఐపీలను తీసుకువెళ్లడం రిస్కు అని పైలట్ అన్నారే తప్ప, తాము వెళ్లలేమని ఎక్కడైనా చెప్పారా? ఇంతకు ముందు కూడా జగన్ ఆయా చోట్లకు హెలికాఫ్టర్ లో వెళ్లి వచ్చారు కదా? అక్కడ కూడా ఇలాగే జరిగిందా? లేదే! జగన్ పోలీసులందరిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏదో భూకంపం వచ్చేసినట్లుగా దీనికి కవరేజీ ఇస్తోంది. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న పోలీసులను ఉద్దేశించి జగన్ అన్నారు. మరి చంద్రబాబు, లోకేశ్లు పోలీసు అధికారులను అంతకన్నా దారుణంగా దూషించిన వీడియోలు కనబడుతున్నాయి కదా?పోలీసు అధికారుల సంఘం కూడా వాటిని ఎందుకు ప్రస్తావించడం లేదు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా జగన్ నే విమర్శించారు తప్ప, అంతకు ముందు చంద్రబాబు దూషణల గురించి మాట్లాడడం లేదే! హోం మంత్రి అనిత అయితే ఏకంగా టీడీపీని భుజాన వేసుకుని మోస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్న ఎస్.ఐ.ని దమ్మున్నోడు అని ప్రశంసించారంటే ఇంతకన్నా సిగ్గు చేటైన విషయం ఏమి ఉంటుంది? అసలు హోం శాఖలో ఏమి జరుగుతోందో అమెకు తెలుసా అన్నది ఒక సందేహం. ఎందుకంటే రెడ్ బుక్ పేరుతో మొత్తం హోం శాఖను నడుపుతున్నది లోకేశే అని అంతా చెబుతున్నారు. మీడియాతో మాట్లాడేటప్పుడు వ్యవస్థను పాడుచేసేలా ఒక మంత్రే మాట్లాడిన తీరు చూస్తే తెలుగు దేశం ఆధ్వర్యంలో వ్యవస్థలు ఎంతగా దిగజారాయో అవగతం అవుతుంది. పనిలో పని లావు కృష్ణదేవ రాయలు, కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో సరికొత్త రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని అమిత్ షా కు తెలియచేసి ఆయన మెప్పు పొందగలిగితే బాగుండేది కదా? ఒక వైపు చంద్రబాబు ఆయా స్కామ్ లలో నిందితుడుగా ఉన్నారు. ఆయన కూడా బెయిల్ పైనే ఉన్న విషయం జనం మర్చిపోయారన్నది వారి ఉద్దేశం కావచ్చు. ఆయా స్కాములను నీరుకార్చే పనిలో ఉండి ఉండవచ్చు. వాటన్నిని కప్పిపుచ్చి జగన్ పై తట్టెడు బురద వేయడం ద్వారా వైసీపీని దెబ్బ తీయాలని అనుకుంటే అది అంత తేలిక కాదు. సూపర్ సిక్స్ గురించి కాని, కక్ష రాజకీయాల గురించి కాని ప్రజలలో ఈ ప్రభుత్వం పట్ల ఏహ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి కొత్త కుట్రలకు ఎల్లో మీడియాతో కలిసి కూటమి ప్రభుత్వం తెరదీసింది. ఈ తరహా వ్యూహాలలో చంద్రబాబును మించిన నేత దేశంలోనే మరెవ్వరైనా ఉన్నారా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఉద్యాన రైతులూ అప్రమత్తంగా ఉండండి
అనంతపురం అగ్రికల్చర్: వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, పెను గాలులు, వడగండ్లు, అకాల వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ఉద్యాన తోటలు సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని రెండు జిల్లాల ఉద్యానశాఖ అధికారులు జి.చంద్రశేఖర్, జి.ఫిరోజ్ఖాన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధానంగా పంట చేతికివచ్చే సమయం కావడంతో చీనీ, మామిడి, అరటి, బొప్పాయి, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అరటి, బొప్పాయి పంటలు నేలవాలకుండా సరైన పోట్లు ఏర్పాటు చేసుకుంటే నష్ట తీవ్రత బాగా తగ్గుతుందని తెలిపారు. తోట చుట్టూ వెలుపలి ప్రాంతంలో నీటి తడి ఇస్తే సుడిగాలి తీవ్రత బాగా తగ్గిపోతుందన్నారు. పెను గాలులకు దెబ్బతిన్న తోటల్లో వెంటనే కాయలు, గెలలు తొలగించి, కొమ్మలను బయట పడేయాలన్నారు. చీడపీడల బారి నుంచి రక్షించుకునేందుకు లీటర్ నీటికి 2.5 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలన్నారు. నిల్వ ఉన్న వర్షపు నీరు ఆవిరైన తర్వాత పైపాటుగా ఎకరాకు 10 కిలోల యూరియా చల్లుకోవాలన్నారు. తోటల చుట్టూ అవిశె, సుబాబుల్ లాంటి రక్షణ పంటలు వేసుకుంటే పెనుగాలుల బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చన్నారు. అవకాశం ఉన్న రైతులు కొన్ని మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే వేసవి సమస్యల నుంచి గట్టెక్కవచ్చని పేర్కొన్నారు. -
‘అనంత’లో జోయాలుక్కాస్ షోరూం ప్రారంభం
● ప్రదర్శనలో 150 కేజీల బంగారం, వజ్రాలు, వెండి ఆభరణాలు అనంతపురం కార్పొరేషన్: బంగారు, వజ్రాభరణాల అతి పెద్ద షోరూంల్లో ఒక్కటైన జోయాలూక్కాస్... అనంతపురంలోని రాజు రోడ్డులో తన నూతన బ్రాంచ్ను శుక్రవారం ప్రారంభించింది. జోయాలుక్కాస్ గ్రూప్ ఆఫ్ ఛైర్మన్, ఎండీ జాయ్ అలూక్కాస్తో కలసి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింధూరరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన జోయాలుక్కాస్ షోరూంను జిల్లాలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జోయాలుక్కాస్ ఎండీ మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 175 షోరూంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తక్కువ బరువుతో ఉన్న ప్రపంచ స్థాయి మోడల్స్తో డైమండ్, గోల్డ్, సిల్వర్ జ్యువెలరీను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అనుగ్రహ టెంపుల్ జ్యువెలరీ, ప్రైడ్ డైమండ్స్, ఎలిగంజా పోల్కి డైమండ్స్, యవ ఎన్విరిడే జ్యువెలరీ, అపూర్వ యాంటిక్ కలెక్షన్, రత్న ప్రెషన్ స్టోన్ జ్యూవెలరీ తదితర 150 కిలోల ఆభరణాలను ప్రదర్శనలో ఉంచామన్నారు. తమ ఉత్పత్తులకు రిటర్న్ విలువ ఉంటుందన్నారు. -
జగన్ను విమర్శించే స్థాయి నీకెక్కడది?
ఉరవకొండ: జనంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్కు లేదని శాసనమండలి ప్రివిలైజ్ కమిటీ చైర్మెన్/ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి అన్నారు. వజ్రకరూరు మండలం కొనకొండ్లలోని తన స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీకి తొత్తులుగా మారిన కొందరు పోలీసులను ఉద్దేశించి తప్పు చేసిన పోలీసులైన చట్టం ముందు సమానమేనని, వారి యూనిఫాం తీసేయిస్తామని వైఎస్ జగన్ వ్యాఖ్యానిస్తే... దానిని కూటమి ప్రభుత్వం వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలుగా చంద్రబాబు, లోకేష్, పవన్కళ్యాణ్కు పటిష్ట భద్రతను అప్పటి సీఎం వైఎస్ జగన్ కల్పించారని గుర్తు చేశారు. ఈ అంశంపై అప్పట్లో ఒక్క ఆరోపణ కూడా లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో అడుగడుగునా భద్రతా వైపల్యం కనిపిస్తోందన్నారు. వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటనలో 1,100 మంది పోలీసులను, 200 మందిని హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు చేసినట్లుగా పేర్కొంటూ భద్రతా వైపల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కేవలం అభిమానులను, కార్యకర్తలను ఆపడానికి పోలీసులను మోహరించారు కానీ, మాజీ సీఎం భద్రతకు కాదనే విషయం క్షేత్ర స్థాయిలో బట్టబయలైందన్నారు. వైఎస్ భారతిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఏ పార్టీలోనైనా మహిళల వ్యక్తిత్వాన్ని తప్పు పట్టేలావ్యాఖ్యలు చేయడం తగదని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎస్ఐ సుధాకర్ యాదవ్పై ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మండిపాటు తప్పు చేస్తే పోలీసులైనా చట్టం ముందు సమానమే నేర నిరూపణ అయితే యూనిఫాం తీసేసి శిక్ష అనుభవించాల్సింది -
కలల సాకారానికి ఈ–సెట్
అనంతపురం: ఉన్నత కలలకు ఏపీ ఈ–సెట్ తొలిమెట్టుగా నిలుస్తోంది. పేరెన్నికగల కళాశాలల్లో బీటెక్, బీఈ పూర్తి చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అదే ఏపీ ఈఏపీసెట్ (ఎంసెట్) ద్వారా గణనీయమైన ర్యాంకు సాధిస్తే ఈ కలను సాకారం చేసుకోవచ్చు. అయితే ఈఏపీసెట్కు పోటీ అధికంగా ఉంటుంది. కానీ, మంచి కళాశాలల్లో ఇంజినీరింగ్ సీటు దక్కించుకునేందుకు ఏపీ ఈ–సెట్ మరో చక్కటి మార్గం. ఏపీ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈ–సెట్)లో సత్తా చాటితే నేరుగా బీటెక్ సెకండియర్లో అడ్మిషన్ పొందవచ్చు. డిప్లొమా పూర్తి చేసిన వారు, బీఎస్సీ(మేథమేటిక్స్) పూర్తి చేసినవారు ఇందుకు అర్హులు. ఫార్మసీ కోర్సుల్లో సైతం అడ్మిషన్లు పొందడానికి ఈ–సెట్ దోహదపడుతుంది. యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలల్లోనూ సీట్లు దక్కించుకోవచ్చు. మొత్తం సీట్లలో 10 శాతం ఈ–సెట్ ర్యాంకర్లకు కేటాయిస్తున్నారు. దీంతో ఈ–సెట్ అనేది డిప్లొమా విద్యార్థులకు వరంలా మారింది. లేటరల్ ఎంట్రీ ద్వారా అవకాశం ఇంజినీరింగ్ కోర్సులో లేటర్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలోకి అడ్మిషన్ పొందడానికి అవకాశం కల్పిస్తూ నిర్వహిస్తున్న ఏపీ ఈ–సెట్–2025కు భారీగా దరఖాస్తులు అందాయి. ఈ ఏడాది మొత్తం 33,454 మంది దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్ ఇంజినీరింగ్ విభాగానికి–143, బీఎస్సీ(మేథమేటిక్స్) –41, సిరామిక్ టెక్నాలజీ–3, కెమికల్ ఇంజినీరింగ్ –290, సివిల్ ఇంజినీరింగ్ –2,874, కంప్యూటర్ సైన్సెస్–10,639, ఈఈఈ–5492, ఈసీఈ–9,024, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ –54, మెకానికల్ ఇంజినీరింగ్ –4,424, మెటలార్జీ –97, మైనింగ్–66, ఫార్మసీ విభాగానికి –307 చొప్పున మొత్తం 33,454 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు చేసుకునేందుకు గడువును మరింత పెంచడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ నెల 12వ తేదీ వరకు రూ.వెయ్యి అపరాధ రుసంతో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 17వ తేదీ వరకు రూ.2వేలు, 24వ తేదీ వరకు రూ.4వేలు, 28వ తేదీ వరకు రూ.10 వేల అపరాధ రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి మే 6వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. జేఎన్టీయూకు అవకాశం ఏపీ ఈ–సెట్ను ఇప్పటి వరకూ 8 దఫాలుగా నిర్వహించే అవకాశం జేఎన్టీయూ (ఏ)కు దక్కింది. 2015 నుంచి 2020 వరకు ఏపీ ఈసెట్ను రాష్ట్ర కన్వీనర్గా ప్రొఫెసర్ పీఆర్ భానుమర్తి , 2021లో ప్రొఫెసర్ సి. శశిధర్, 2024లో ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి విజయవంతంగా నిర్వహించారు. తాజాగా ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ను ఈసెట్ కన్వీనర్గా నియమించారు. క్రేజీ కంప్యూటర్ సైన్సెస్ఇంజినీరింగ్లో కంప్యూటర్ సైన్సెస్కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో బీటెక్ కంప్యూటర్ సైన్సెస్ కోర్సుల్లో అడ్మిషన్ పొందాలంటే ఏపీఈఏపీ సెట్లో గణనీయమైన ర్యాంక్ను సాధించాల్సి ఉంటుంది. అదే డిప్లొమో కంప్యూటర్ సైన్సెస్ పూర్తి చేసిన వారు ఈ–సెట్ ద్వారా మంచి కళాశాలల్లో కంప్యూటర్ సైన్సెస్ కోర్సు దక్కించుకోవచ్చు. గతేడాది కంటే ఈ ఏడాది ఈ–సెట్ కంప్యూటర్ సైన్సెస్ బ్రాంచ్కు దరఖాస్తులు పెరగడమే ఇందుకు కారణం. ఇంజినీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్లోకి అడ్మిషన్ డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు సువర్ణ అవకాశం జేఎన్టీయూ(ఏ) ఆధ్వర్యంలో ఏపీ ఈసెట్ నిర్వహణ -
వైభవంగా సీతారామాంజనేయ విగ్రహ ప్రతిష్ట
బుక్కరాయసముద్రం: మండలంలోని రోటరీపురంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట్ర కార్యక్రమం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. గ్రామంలో 3 రోజుల పాటు ఆగమ శాస్త్ర సంప్రదాయాలతో పూజలు జరిగాయి. ఆలయ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం కో–ఆర్డినేటర్ ఆలూరి సాంబశివారెడ్డి రూ.30 లక్షల విరాళం ఇచ్చారు. శుక్రవారం ఆలయంలో మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరి సాంబశివారెడ్డి, ఆలూరి రమణారెడ్డి ప్రత్యేక పూజల అనంతరం నేత్రపర్వంగా సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ రోటరీపురంలో ఎంతో సుందరంగా సీతారామాలయం రూపుదిద్దుకోవడం అభినందనీయమన్నారు. గ్రామంలో శనివారం రథోత్సవం నిర్వహించన్నట్లు తెలిపారు. -
బాల కార్మికులకు పునరావాసం కల్పించాలి
అనంతపురం సిటీ: జిల్లాలో బాల కార్మికులకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించి, వారికి పునరావాసం కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అంశంపై కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్శర్మతో కలసి కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి బాల కార్మికుని ప్రొఫైల్, ట్రాక్ రికార్డు మెయింటెన్ చేయాలన్నారు. ప్రాసిక్యూషన్, మినిమం వేజెస్, బాల కార్మికులకు అందజేసిన సహాయక చర్యలకు సంబంధించిన నివేదికలను సమర్పించాలన్నారు. ప్రతి బాల కార్మికుడిని పునరావాసం కల్పించి, తిరిగి పని ప్రదేశానికి వెళ్లకుండా కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ–శ్రమ్ పోర్టల్ ద్వారా అర్హత కలిగిన అసంఘటిత రంగ కార్మికులందరి వివరాలు నమోదు చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, మున్సిపల్, ప్లాన్ అప్రూవల్ అథారిటీలందరూ ప్రతి నిర్మాణంపై మొత్తం వ్యయంలో ఒక శాతం సెస్ను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు జమ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ లలిత, డీఎంహెచ్ఓ డాక్టర్ ఈబీ దేవి, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, కార్మిక శాఖ అధికారులు లక్ష్మీ,నర్సయ్య, రాధా రమాదేవి, సుజాత, ప్రతాప్ నాయుడు, వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, డీఈఓ ప్రసాద్, చేనేత శాఖ ఏడీ శ్రీనివాసరెడ్డి, డ్వామా, డీఆర్డీఏ, మెప్మా పీడీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రైతులకు పరిహారం అందించాలి
రాయదుర్గం నియోజకవర్గంలో కురిసిన వడగండ్ల వర్షం, ఈదురుగాలుల బీభత్సానికి పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పరిహారం అందించి ఆదుకోవాలి. బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లో చేతికొచ్చిన వరి పంట నేలపాలు కావడం బాధాకరం. రాయదుర్గం, గుమ్మఘట్ట, డీ హీరేహాళ్ మండలాల్లోనూ మొక్కజొన్న, ఉద్యాన పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రతి రైతుకూ న్యాయం చేకూర్చేలా కలెక్టర్కు విజ్ఞప్తి చేశాం. – మెట్టు గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాయదుర్గం -
11 మండలాల్లో నీటిమట్టం తగ్గుముఖం
అనంతపురం అగ్రికల్చర్: భూగర్భజలాల పరిస్థితి ఆశాజనకంగానే కనిపిస్తున్నా.. 11 మండలాల్లో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. భూగర్భజలశాఖ తాజాగా 97 ఫిజోమీటర్ల నుంచి సేకరించిన గణాంకాల ప్రకారం జిల్లా సగటు నీటిమట్టం 11.86 మీటర్లుగా నమోదైంది. సగటు నీటి మట్టం కన్నా 11 మండలాల్లో భూగర్భజలాలు కాస్తంత తగ్గుముఖం పట్టినట్లు స్పష్టమవుతోంది. ఈ వర్షపు సంవత్సరంలో ఇప్పటి వరకు 463.1 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉడగా 30.3 శాతం అధికంగా అంటే 603.6 మి.మీ నమోదైంది. దీంతో పాతాళగంగ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా అంతటా 40.94 టీఎంసీలు అందుబాటులో ఉండగా అందులో 14.45 టీఎంసీలు వినియోగిస్తున్నారు. ఇంకా 26.49 టీఎంసీల భూగర్భజలాలు మిగులు కింద ఉన్నట్లు ఆ శాఖ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. డేంజర్ జోన్లో నార్పల అత్యధిక నీటివినియోగం కలిగిన నార్పల మండలం పూర్తి డేంజర్ జోన్లో ఉంది. అలాగే బ్రహ్మసముద్రం, డీ.హీరేహాళ్, కళ్యాణదుర్గం, కూడేరు, కుందుర్పి, పామిడి, పుట్లూరు, శెట్టూరు, తాడిపత్రి, యాడికి మండలాల్లో కూడా నీటి వినియోగం అధికంగా ఉండటంతో భూగర్భజలాలు తగ్గుముఖం పడుతున్నట్లు గుర్తించారు. 20 మండలాల్లో ఫిజోమీటర్ల ద్వారా 8 నుంచి 20 మీటర్లలో నీటిమట్టం కనిపిస్తోందని చెబుతున్నారు. ● జిల్లా వ్యాప్తంగా బోరుబావులు 1,87,610 వినియోగిస్తుండగా, భూమి, నీరు, చెట్టు చట్టం (వాల్టా) కింద 13 గ్రామ పంచాయతీల్లో బోరుబావుల తవ్వకాన్ని నిషేధించారు. వేసవి కావడం వల్ల ఏప్రిల్, మే నెలల్లో మరింత తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. వర్షాలు వచ్చే పరిస్థితి ఉన్నందున జూన్ నుంచి తిరిగి భూగర్భజలాలు పెరగవచ్చని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 13 గ్రామపంచాయతీల్లోబోరుబావుల తవ్వకం నిషేధం జూన్లో భూగర్భజలాలు పెరిగే చాన్స్