
వక్ఫ్ యాక్ట్ వాపస్ లేలో..
అనంతపురం కార్పొరేషన్: ‘వక్ఫ్ యాక్ట్ వాపస్ లేలో.. హమ్ కిసీకో డర్తా నహీ (వక్ఫ్ చట్టాన్ని ఉపసంహరించుకోండి.. మేం దేనికీ భయపడేది లేదు)’ అంటూ ముస్లింలు నినదించారు. అనంతపురం నగరంలో ఆదివారం యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ విజయ వంతమైంది. ర్యాలీలో వేలాదిగా ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ప్రజా, కుల సంఘాలు వీరికి మద్దతు తెలిపాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి క్లాక్టవర్, రఘువీరా కాంప్లెక్స్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వక్ఫ్ చట్టం తీసుకొచ్చిందన్నారు. 11 ఏళ్లుగా ముస్లిం మైనార్టీలను బీజేపీ ఇబ్బంది పెడుతోందని, తమ పూర్వీకుల ఆస్తులను కాజేసేందుకు తాజాగా కుట్ర చేస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతోంది అదానీ, అంబానీలని, రానున్న రోజుల్లో ‘వక్ఫ్’ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పచెబుతారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా వక్ఫ్ చట్టాన్ని తెచ్చారన్నారు. ఉర్దూ అకాడమీ రాష్ట్ర మాజీ చైర్మన్ నదీం అహ్మద్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముస్లింలకు న్యాయం చేయాలని ఉంటే రంగనాథ్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప మాట్లాడుతూ ‘వక్ఫ్’ చట్టం ఉపసంహరించుకునే వరకు ముస్లింలకు అండగా ఉంటామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ మాట్లాడుతూ ప్రధాని మోదీకి రాబోయే రోజుల్లో తప్పక బుద్ధి చెబుతామన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్, తబ్లిక్ జమాత్, సున్ని జమాత్ మతపెద్దలు, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకులు నియాజ్, వేమల నదీం, ఏకేఎస్ ఫయాజ్, ఖాజా, తనీష, పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాబేగ్, ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల నాయకులు సాకే హరి, ఇండ్ల ప్రభాకర్ రెడ్డి, నాయకులు తాజుద్దీన్, హారూన్ రషీద్, సూఫీ ఖాజా, జావెద్, జక్రియా, షమీ, అలీ, అల్లీపీరా, ఐఎంఎం బాషా, చామలూరు రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

వక్ఫ్ యాక్ట్ వాపస్ లేలో..