Kurnool
-
కూటమిలో కమీషన్ల కొట్లాట!.. ఇన్ఛార్జ్ మంత్రికి షాక్
సాక్షి, అమరావతి / కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో కమీషన్లు, వాటాల పంపకంలో తేడాలతో కూటమి పార్టీల నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. అనేక నియోజకవర్గాల్లో నేతల మధ్య పొసగక బహిరంగంగానే ఘర్షణలకు దిగుతున్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో మంగళవారం జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత సమక్షంలోనే రెండు వర్గాల నేతలు గొడవకు దిగారు. అక్కడి టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి వర్గాలు ఒకరిపై ఒకరు దూసుకు రావడంతో సమావేశం రసాభాసగా మారింది.ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి వేదికపై నుంచి దిగిపోవాలని బీటెక్ రవి వర్గం గొడవకు దిగడంతోపాటు ఆయనపై దాడికి యత్నించింది. మంత్రి సవిత, ఇతర నేతలు ఎంత సర్దిచెప్పినా, ఇరు వర్గాల మధ్య తోపులాట, తిట్లవర్షం కొనసాగింది. మద్యం, ఇసుక, మైనింగ్లో వచ్చిన అవినీతి డబ్బు పంపకాలు, కమీషన్ల తేడాలతో ఇరు వర్గాల మధ్య చాలా రోజులుగా పరస్పరం దూషణలు, ఆరోపణలు చేసుకుంటున్నాయి. అవి శ్రుతిమించడంతో మంగళవారం విభేదాలు రచ్చకెక్కాయి. మంత్రి నిమ్మలను నిలదీసిన ఆదోని టీడీపీ శ్రేణులు కర్నూలు స్టేట్ గెస్ట్హౌస్ వేదికగా టీడీపీ, బీజేపీ నేతల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. ఏకంగా మంత్రి నిమ్మల రామానాయుడినే టీడీపీ శ్రేణులు నిలదీశాయి. బీజేపీకి చెందిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తమను పట్టించుకోవడం లేదంటూ టీడీపీ క్యాడర్ ఆందోళనకు దిగింది. ఆదోని ఎమ్మెల్యే డౌన్ డౌన్.. అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ఆదోని టీడీపీ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు, ఎమ్మెల్యే పార్థసారథి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పార్థసారథి టీడీపీ నేతలను దూరం పెట్టడం, కాంట్రాక్టర్లు, పనుల్లో వారికి వాటాలు ఇవ్వనీయక పోవడంతో వారు తీవ్ర స్థాయిలో గొడవకు దిగారు.‘ఆదోని నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ బి.పార్థసారథి మమ్మల్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఆదోనిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బిచ్చగాళ్లు అయిపోయారు. ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదు. ఏ పనిలోనైనా 70 శాతం టీడీపీ, మిగిలిన 30 శాతం ఎమ్మెల్యేకు అప్పగించాలి. మేము లేకుంటే బీజేపీ ఎలా గెలిచేది? దమ్ముంటే ఆయన రాజీనామా చేసి మళ్లీ బీజేపీ తరఫున గెలవాలని సవాల్ చేస్తున్నాం. ఎక్కడో ఉన్న ఆయన్ను తీసుకువచ్చి మా నెత్తిన కూర్చోబెట్టారు’ అంటూ మంత్రిని చుట్టుముట్టారు. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తూ నాలుగు మాటలు మాట్లాడి, మంత్రి గెస్ట్హౌస్లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు చొచ్చుకు రావడంతో గెస్ట్హౌస్ డోర్ ఆద్దాలు పగిలిపోయాయి. తిరువూరులో తారాస్థాయికి విభేదాలు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, అక్కడి పార్టీ క్యాడర్ మధ్య మొదటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. క్యాడర్కు వ్యతిరేకంగా కొలికిపూడి నియోజకవర్గంలో వీరంగం వేయడం, వారు తిరుగుబాటు చేయడంతో అక్కడ పరిస్థితి చేయిదాటి పోయింది. క్యాడర్ అంతా కలిసి కొలికపూడి తమకు వద్దని నియోజకవర్గంతోపాటు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి ఆందోళనలు చేసింది. దీంతో రెండు వర్గాలను బుజ్జగించడం, చివరికి కొలికపూడిని పిలిచి విచారించడం మినహా పార్టీ అధిష్టానం ఏమీ చేయలేకపోయింది. వర్మ వర్సెస్ జనసేన కాకినాడ జిల్లా పిఠాపురంలో ఇటీవల టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన క్యాడర్ మధ్య విభేదాలు రాజుకుంటున్న విషయం తెలిసిందే. వర్మకు వ్యతిరేకంగా జనసేన ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం నాగబాబు పిఠాపురంలో పర్యటించగా, టీడీపీ శ్రేణులు ఆయన్ను అడ్డుకుని నినాదాలు చేశాయి. వర్మకు మద్దతుగా వారు నాగబాబును నిలదీయడం చర్చనీయాంశమైంది. అనేక నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నేతల మధ్య వివాదాలు సర్వసాధారణంగా మారాయి.ఇన్ఛార్జి మంత్రిని లెక్క చేయని చిత్తూరు ఎమ్మెల్యేలు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న మండిపల్లి రాంప్రసాద్రెడ్డిని ఆ జిల్లా ఎమ్మెల్యేలు అసలు పట్టించుకోక పోవడం చర్చనీయాంశంగా మారింది. తనకు మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆ జిల్లా సీనియర్ నేత, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి మంత్రిని లెక్క చేయడం లేదు. ఇంత వరకు సమన్వయ కమిటీ సమావేశమే మంత్రి నిర్వహించలేకపోయారు. ఏ నియోజకవర్గంలోనూ ఆయన పర్యటించేందుకు ఎమ్మెల్యేలు ఒప్పుకోవడం లేదని సమాచారం. అందుకే టీడీపీ ఎమ్మెల్యే లేని పుంగనూరుకు వెళ్లి, మొక్కుబడిగా మాట్లాడి వచ్చేస్తున్నారు. ఇతరత్రా ఎక్కడికైనా మంత్రి వెళితే ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. మీరు కూడా వెళ్లొద్దంటూ వారి ముఖ్య అనుచరులను ఆదేశిస్తున్నట్లు సమాచారం. -
మేం ఉద్యోగం చేయలేం
వెల్దుర్తి: కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లెలో తాము ఉద్యోగం చేయలేమని సచివాలయ ఉద్యోగులు మంగళవారం సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. గ్రామంలో హత్యోదంతం అనంతరం తమపై టీడీపీ కార్యకర్తలు కక్షగట్టి వ్యవహరిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ సెక్రటరీ మల్లికార్జున, వెల్ఫేర్ అసిస్టెంట్ సురేంద్ర రెడ్డి, వీఏఏ సుదీర్ రెడ్డి, జీఎమ్ఎస్కె (మహిళా పోలీసు) రేణుక, డిజిటల్ అసిస్టెంట్ బి.సునీత, ఏహెచ్ఏ ఇంద్రజ, వీఆర్వో బోయ వాణి, వీఎస్ రమేశ్లు తమ వినతి పత్రాన్ని, ఫిర్యాదును ఎంపీడీవో సుహాసిని, తహశీల్దార్ చంద్రశేఖర్ వర్మ, సీఐ మధుసూదన్ రావు, ఎస్ఐ అశోక్, ఏవో అక్బర్బాషాలకు అందజేశారు.సోమవారం ఉదయం గ్రామ సచివాలయంలో తాము విధి నిర్వహణలో ఉండగా 15–20 మంది గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు మద్యం మత్తులో మూకుమ్మడిగా నాటుకట్టెలతో వచ్చి సచివాలయం నుంచి బయటకు వెళ్లకుంటే కొట్టి చంపుతామని బెదిరించి, తమను దుర్భాషలాడారని వాపోయారు. తాము భయపడి సచివాలయం నుంచి బయటకు వెళ్తుండగా కర్రలతో కొట్టే ప్రయత్నం చేశారన్నారు. తాము తప్పించుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవాల్సి వచ్చిందన్నారు. ఇకపై ఆ గ్రామంలో ఉద్యోగం చేయలేమని, తమపై దాడికి దిగిన వారిలో ప్రధానమైన ఎంజీ నాగరాజు, కె.శ్రీనాథ్లపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తమకు రక్షణ కల్పించకపోతే బొమ్మిరెడ్డిపల్లె సచివాలయానికి హాజరు కాబోమని, అంతవరకు ఎంపీడీవో కార్యాలయంలో విధులకు హాజరవుతామన్నారు. వినతిపత్రం, ఫిర్యాదు అందుకున్న సంబంధిత అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. దీంతో బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో రెండ్రోజులుగా సచివాలయ, ఆర్బీకే సేవలు నిలిచిపోయాయి. ఆర్బీకే భవనానికి తాళం వేసి ఉండగా, సచివాలయ భవనంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. -
పొలం ఆన్లైన్ చేయాలంటే పక్కలోకి రమ్మంటున్నారు
కోడుమూరు రూరల్: కోర్టులో న్యాయ పోరాటం చేసి సాధించుకున్న నాలుగెకరాల భూమిని రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో నమోదు చేయకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం జరిగింది. కోడుమూరు మండలం ప్యాలకుర్తికి చెందిన చాకలి పెద్ద సవారన్నకు ఇద్దరు భార్యలు. రెండో భార్య రాములమ్మ కుమార్తె హైమావతికి, మొదటి భార్య సంతానం మధ్య భూముల పంపకంలో వివాదం ఏర్పడి 2011లో కోర్ట్ ను ఆశ్రయించారు. ఏడాది కిందట ఆస్తిలో సగభాగమైన 4ఎకరాల భూమి హైమావతికి చెందుతుందంటూ కోర్టు తీర్పు ఇచ్చింది.కోర్టు తీర్పు మేరకు తండ్రి నుంచి తనకు సంక్రమించిన 94, 95, 116 సర్వే నంబర్లలోని నాలుగెకరాల భూమిని తన పేరిట ఆన్లైన్ చేయాలంటూ హైమావతి కోడుమూరు తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ పెట్టుకుంది.రెవెన్యూ అధికారులు రూ.లక్ష లంచం అడగ్గా.. ఆ మొత్తం ఇచ్చానని.. డబ్బు తీసుకోవడంతో పాటు తమ పక్కలోకి వస్తేనే సదరు భూమిని ఆన్లైన్ చేస్తామని వీఆర్వోలు వేధిస్తున్నారని..రెవెన్యూ అధికారుల వేధింపుల వల్ల తనకు చావే శరణ్యమంటూ మంగళవారం తహసీల్దార్ వెంకటేష్ నాయక్ ఎదుట ఫినాయిల్ తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. తహసీల్దార్ ఆమె చేతిలోని ఫినాయిల్ డబ్బాను లాక్కుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: తహసీల్దార్ ఈ ఘటనపై తహసీల్దార్ వెంకటేష్ నాయక్ వివరణ ఇస్తూ.. కోర్టు తీర్పు హైమావతికి అనుకూలంగా వచ్చిన మాట వాస్తవమేనన్నారు. అయితే సదరు భూమి ప్రభుత్వ భూములకు కేటాయించే 20001901 (రెండు కోట్ల) ఖాతాలో ఉన్నందున హైమావతి పేరును ఆన్లైన్ అడంగల్లో నమోదు చేయడం సాధ్యం కాదన్నారు. కోడుమూరు, పులకుర్తి వీఆర్వోలపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
రసాయన ఎరువుల వినియోగం ఇలా..
● మళ్లీ పెరిగిన రసాయన ఎరువుల వినియోగం ● రైతులకు భారంగా మారిన పెట్టుబడి వ్యయం ● ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహకాలు అరకొరే! ● గాడి తప్పిన గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ విధానం ● స్పందించని రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరాల వారీగా (టన్నుల్లో).. ఎరువు పేరు 2023–24 2024–25 యూరియా 56,468 63,178 డీఏపీ 16,130 18,081 ఎంవోపీ 1,722 2,731 కాంప్లెక్స్ 1,27,452 1,47,430 ఎస్ఎస్పీ 2,546 2,717 కంపోస్ట్ --- 4 ఎఫ్వోఎం --- 3 మొత్తం 2,04,318 2,34,144కర్నూలు(అగ్రికల్చర్): రసాయన ఎరువుల వినియోగంతో ఎన్నో అనర్థాలు ఉన్నాయనే విషయాన్ని చాలా మంది రైతులు గుర్తించలేకపోతున్నారు. వివిధ పంట ల్లో ఉత్పాదకతను పెంచుకునేందుకు విచ్చలవిడిగా వాడుతున్నారు. దీంతో భూమి స్వభావం దెబ్బతింటోంది. చాలా చోట్ల పొలాలు చౌడుబారుతున్నాయి. పర్యావరణం కూడా కలుషితం అవుతోంది. పంట ఉత్పత్తుల్లో కెమికల్స్ అవశేషాలు ఉండటంతో మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 2023–24లో 2,04,318 టన్నుల రసాయన ఎరువులు వాడగా.. 2024–25లో 2,34,144 టన్నులు వినియోగించారు. మొత్తం 29,826 టన్నుల వినియోగం పెరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. రైతులకు అవగాహన కల్పించడం.. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహకాలు పెంచడం... తదితర విషయాలపై దృష్టిసారించడం లేదు. ఎకరాకు 185 కిలోల రసాయన ఎరువులు రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 96 వేల ఎకరాల్లో మిర్చి సాగైంది. పత్తి కూడా జిల్లాలో అత్యధికంగా సాగు అవుతోంది. 2024 ఖరీఫ్లో 10,55,517 ఎకరాలు, రబీలో 2,14,692 ఎకరాలు ప్రకారం మొత్తంగా 12,70,209 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. నీటిపారుదల కింద సాగు చేసే పంటలకు విపరీతంగా రసాయన ఎరువులు వినియోగిస్తున్నారు. సగటున ఎకరాకు 160 కిలోల వరకు రసాయన ఎరువులు వాడవచ్చు. అయితే 2024–25లో ఎకరాకు సగటున 185 కిలోల రసాయన ఎరువులు వినియోగించారు. 2024–25లో భూసార పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహించి.. వాటి ఫలితాలను రైతులకు అందజేసినప్పటికీ రసాయన ఎరువుల వినియోగం పెరిగిపోయింది. ఖర్చు తడిసి మోపెడు రసాయన ఎరువుల వినియోగం భారీగా పెరుగుతుండటంతో వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. వివిధ కంపెనీలు రసాయన ఎరువుల ధరలు ఇష్టానుసారంగా పెంచుతున్నాయి. 10–26–26, 12–32–16 రసాయన ఎరువుల 50కిలోల బస్తా ధర రూ.1,720 ఉందంటే ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో తెలుస్తోంది. దీంతో రైతులకు ఖర్చు తడిసిమోపెడు అవుతోంది. మిర్చి, వరి సాగులో అడ్డుగోలుగా రసాయన ఎరువులను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పండించిన పంటల్లో కూడా కెమికల్స్ అవశేషాలు ఉంటున్నట్లుగా శాసీ్త్రయంగా నిర్ధారణ అవుతోంది. ‘ప్రకృతి’ సాయం కరువే! రసాయన ఎరువుల వినియోగం లేకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తే ప్రజారోగ్యానికి పెద్దపీట వేసినట్లే. అయితే జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. కాగితాల్లో వేలాది ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం కనిపిస్తోంది. 2024–25లో 50 వేల ఎకరాలకుపైగా ప్రకృతి వ్యవసాయం చేసినట్లు లెక్కలు ఉన్నప్పటికీ వాస్తవం నామమాత్రమే. స్వచ్ఛందంగా ప్రకృతి వ్యవసాయం చేసేవారు జిల్లాలో 70 నుంచి 80 మంది వరకు ఉన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహించకపోవడం, విరివిరిగా సాయం అందక పోవడం.. తదితర కారణాలతో చాలా మంది రైతులు ముందుకు రావడం లేదు. గ్యాప్..తూచ్ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ (గ్యాప్) కింద ప్రతి మండలంలో పొంలబడి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చేసిన సిఫార్సుల మేరకే కెమికల్స్ వాడాలి. ప్రతి మండలంలోని 50 నుంచి 100 ఎకరాల వరకు ‘గ్యాప్’ కింద ఆహార పంటలు సాగు చేశారు. ప్రతి వారం పొలంబడి కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చినప్పటికీ రసాయన ఎరువులు వాడకం తగ్గలేదు. పలు పంటల శ్యాంపుల్స్లో కెమికల్స్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. చర్యలు తీసుకుంటున్నాం 2024–25 సంవత్సరంలో సాగు విస్తీర్ణం పెరిగినందున రసాయన ఎరువుల వినియోగం పెరిగింది. 2023–24 సంవత్సరంతో పోలిస్తే దాదాపు 30 వేల టన్నులు అదనంగా వినియోగించారు. కెమికల్స్ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ కింద రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు పొలంబడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు దేశంలో నంద్యాల రెండో స్థానం రసాయన ఎరువుల వినియోగంలో నంద్యాల జిల్లా రికార్డుల్లోకి ఎక్కింది. 2024–25 వ్యవసాయ సంవత్సరంలో రాష్ట్రంలోనే ఎరువుల వినియోగంలో మొదటి స్థానంలో నిలిచింది. మరో విశేషమేమిటంటే దేశంలోనే ఎరువుల వినియోగంలో నంద్యాల జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. ఈ విషయా న్ని కేంద్ర వ్యవ సాయ, రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ మంత్రి జేపీ నడ్డా పార్లమెంటు వేదికగా ఇటీవల ప్రకటించారు. ఈ జిల్లాలో ప్రధానంగా వరి సాగు చేస్తా రు. కాగా యూరియా 3 బస్తాల వేయాల్సి ఉండ గా... 10 బస్తాల వరకు వినియోగించారు. రికార్డు స్థాయిలో నంద్యాల జిల్లాలో 3.75 లక్షల టన్నులు వినియోగించిట్లు సమాచారం. ఎరువులు ఈ స్థాయిలో వినియోగించారంటే ఆహార పంటల్లో కెమికల్స్ అవశేషాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇవీ నష్టాలు.. మిర్చి, పత్తి, వరి, మొక్కజొన్న, వివిధ కూరగాయల పంటలకు రసాయన ఎరువుల వాడకం ఎక్కువగా ఉంటోంది. దీంతో ఈ పంట ఉత్పత్తుల్లో కెమికల్స్ అవశేషాలు ఉంటున్నట్లు తెలుస్తోంది. కెమికల్స్తో పండించిన ఆహార ఉత్పత్తులు తీసుకుంటే ప్రజలు పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. గతంలో పశువుల ఎరువులు వాడేవారు. అలాగే పొలాల్లో నాలుగైదు రోజుల పాటు గొర్రెల మందను ఉంచేవారు. కెమికల్స్ లేని ఆహారం తీసుకోవడంతో అప్పటి వారు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంటున్నారు. ప్రస్తుతం పలు రసాయన ఎరువులు, మందులతో పండించిన ఆహారం తీసుకుంటుండటంతో జబ్బులు పెరిగిపోతున్నాయి. -
గొడవలకు దిగితే కఠినంగా వ్యవహరిస్తాం
వెల్దుర్తి: గొడవలకు దిగితే కఠినంగా వ్యవహరిస్తామని, ఇరువర్గాలు సంయమనంతో ప్రశాంత వాతావరణంలో కలసిమెలసి జీవించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్పాటిల్ అన్నారు. మండల పరిధిలోని బొమ్మిరెడ్డిపల్లెలో పది నెలల తర్వాత హైకోర్టు ఉత్తర్వులతో వైఎస్సార్సీపీ వర్గీయులు గ్రామానికి చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం చోటు చేసుకున్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో జిల్లా ఎస్పీ మంగళవారం గ్రామాన్ని సందర్శించారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, వెల్దుర్తి, కర్నూలు వన్టౌన్, ఎస్బీ సీఐలు మధుసూదన్రావ్, రామయ్యనాయుడు, తేజోమూర్తి, వెల్దుర్తి, కృష్ణగిరి, ఎస్బీ ఎస్ఐలు అశోక్, మల్లికార్జున, ఖాజావలితో కలిసి ఎస్పీ వీధివీధినా తిరిగారు. గ్రామానికి చేరుకున్న బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఇకపై ప్రశాంత జీవనం గడపాలని సూచించారు. టీడీపీ నాయకుడు సుబ్బరాయుడుతో మాట్లాడుతూ గ్రామంలో ఇకపై ఎలాంటి అల్లర్లు జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుందని, అనుచరులను అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు. కోర్టు ఆదేశాలను అందరూ గౌరవించాలని, హద్దు మీరితే కేసులు తప్పవన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పికెట్ నిర్వహించాలని, ఇరువర్గాల నాయకులతో మాట్లాడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. బొమ్మిరెడ్డిపల్లెలో పర్యటించిన జిల్లా ఎస్పీ -
జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం
కర్నూలు కల్చరల్: జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశం నిర్వహించారు. సమీక్షలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలతో పాటు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జేసీ డాక్టర్ బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్యా భరద్వాజ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జి మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి కర్నూలు జిల్లా తలమానికమన్నారు. కర్నూలు జిల్లా పరిశ్రమల హబ్, డ్రోన్ హబ్గా తీర్చిదిద్దాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పేదరిక నిర్మూలనకు సంబంధించిన పీ–4లో కూడా జిల్లా ముందంజలో ఉండాలని మంత్రి పేర్కొన్నారు. రూ.14 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ● మంత్రి భరత్ మాట్లాడుతూ పారిశ్రామికంగా, నీటిపారుదల ప్రాజెక్టుల పరంగా జిల్లా ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. తద్వారా జిల్లాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి వలసల నివారణకు వీలవుతుందన్నారు. ● ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ మిర్చి పంట అధికంగా పండించడం వల్ల నిల్వ చేసుకోవడం కష్టంగా ఉందన్నారు. రైతులు గుంటూరులో స్టోర్ చేసుకునేందుకు వెళ్తూ మార్గమధ్యంలో ప్రమాదాలు జరిగి చనిపోతున్నారన్నారు. కర్నూలు మార్కెట్ యార్డులో అసంపూర్తిగా ఉన్న కోల్డ్ స్టోరేజ్ను వెంటనే పూర్తి చేయాలన్నారు. ● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ జొన్న దిగుబడులను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. కేజీబీవీల్లో పది శాతం సీట్లు పెంచాలని, ఆలూరు, చిప్పగిరి మండలాల్లో కొత్తగా మోడల్ స్కూళ్ల ఏర్పాటు చేయాలని కోరారు. దేవనకొండ మండలంలో 25 చెరువులకు హెచ్ఎన్ఎస్ఎస్ నీరు ఇచ్చే విధంగా కాల్వ విస్తరణకు చర్యలు తీసుకోవాలన్నారు. ● కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ ఇరిగేషన్ పరంగా జిల్లాకు కొన్ని ప్రాజెక్టుల అవసరముందన్నారు. వేదవతి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికి రూ.110 కోట్లతో పనులు జరిగాయన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే 80 వేల ఎకరాలకు సాగు నీటిని ఇవ్వగలుగుతామన్నారు. ● జిల్లాపరిషత్ చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ జూరాల నుంచి 17 టీఎంసీలు, శ్రీశైలం ప్రాజెక్టుకు 300 టీఎంసీల నీళ్లు వచ్చాయని, ఎన్ని నీళ్లు వచ్చినా జిల్లాలో ప్రస్తుతం సాగు, తాగునీటికి ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాలో అవసరమైన నీటి స్టోరేజీ రిజర్వాయర్లు లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. ● కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి మాట్లాడుతూ కోడుమూరులో వారానికి, పది రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని చుట్టూ నీళ్లు ఉన్నా నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. దేవమడ నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ● ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ పాణ్యం నియోజయక వర్గ పరిధిలో 16 వార్డులు, కోడుమూరులో 3 వార్డులు కర్నూలు కార్పొరేషన్లో విలీనమై చాలా ఏళ్లు అవుతున్నా నీటి సమస్య వేధిస్తుందని, వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. డీఆర్సీలో జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు -
అరాచక పాలనలో అభివృద్ధి ఏదీ
● పది నెలలకే కూటమి ప్రభుత్వ డొల్లతనం బయట పడింది ● ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి ● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి పాణ్యం: అరాచక పాలనలో ప్రతిపక్ష పార్టీ నేతలపై దౌర్జన్యాలు, దాడులు తప్ప అభివృద్ధి ఏదని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నెరవాడ గ్రామంలో జరుగుతున్న శ్రీరామ నవమి వేడుకల్లో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ముందుగా చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పది నెలలకే కూటమి ప్రభుత్వ డొల్లతనం బయట పడిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి కూటమి నేతల అక్రమార్జనే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారన్నారు. పాణ్యం నియోజకవర్గంలో యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి టిప్పర్లతో గ్రావెల్ తరలిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు. అక్రమ తవ్వకాలు, అధికారులపై త్వరలోనే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్రంలో సామాన్యుడి జీవనం భారంగా మారుతోందన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. గ్రామాల్లో కక్షలు పెంచుతున్నారు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కూటమి నాయకులు కక్షలు పెంచుతున్నారని కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. ఇందుకు కొందరు అధికారులు తోడయ్యారన్నారు. అధికారులు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నేతల ఆగడాలు, దౌర్జన్యాలను ప్రోత్సహించే అధికారులను న్యాయస్థానం ఎదుట నిలబెడతామన్నారు. ఆయన వెంట మాజీ జెట్పీటీసీ సభ్యుడు సద్దల సూర్యనారాయణరెడ్డి, ఎంపీపీ ఉసేన్బీ, వైస్ ఎంపీపీ పార్వతమ్మ, మాజీ సర్పంచ్లు శేషిరెడ్డి, ప్రతాప్రెడ్డి, రమణారెడ్డి, రాంభూపాల్రెడ్డి, ప్రసాద్రెడ్డి, నాగిరెడ్డి , వడ్డుగండ్ల రాముడు, రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కరుణాకర్రెడ్డి, కో–ఆప్షన్ సభ్యులు జాకీర్ఉసేన్, నాయకులు ఎల్లగౌడ్, సుబ్రహ్మణ్యం, ఆటో మాబు, విష్ణు తదితరులు ఉన్నారు. -
కోలుకోలేక విద్యార్థి మృతి
ఎమ్మిగనూరురూరల్: తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి కోలుకోలేక మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని గుడేకల్ గ్రామానికి చెందిన వీరేష్, నాగమణి దంపతుల కుమారుడు శ్రీనాథ్(13) స్థానిక జెడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 6న శ్రీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురికావటంతో కుటుంబ సభ్యులు ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం డాక్టర్లు కర్నూలుకు తరలించారు. అక్కడ కోలుకోలేక సోమవారం రాత్రి మృతిచెందాడు. వడదెబ్బ తగటంతోనే తీవ్ర అస్వస్థకు గురైనట్లు వైద్యులు తెలిపారని మృతుడి తల్లిదండ్రులు తెలిపారు. -
విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం రానివ్వొద్దు
● ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ప్రతాప్ రెడ్డి ఆలూరు రూరల్/దేవనకొండ: సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ప్రతాప్రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన ఆలూరులోని కేజీబీవీ, గిరిజన బాలికల, బాలుర, సమీకృత హాస్టళ్లతోపాటు దేవనకొండలోని అంగన్వాడీ కేంద్రాలు, జెడ్పీహెచ్ మెయిన్ స్కూల్, రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు. పౌష్టికాహారం పెట్టట్లేదని, తమరు వస్తున్నట్లు తెలుసుకునే కాస్త నాణ్యతతో భోజనం వండినట్లు ఆలూరు గిరిజన బాలికల పాఠశాల కమిటీ చైర్మన్ శంకర్ నాయక్ విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఫిర్యాదు చేయగా విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆలూరులోని 32 షాపును తనిఖీ చేశారు. స్టాకు వివరాలు తనిఖీ చేశారు. తూకాల్లో తేడాలు లేకుండా నిత్యావసర సరులకు సరఫరా చేయాలన్నారు. అంతకు ముందు మొలగవల్లి గ్రామంలో ఇంటింటి రేషన్ పంపిణీని పరిశీలించారు. తహసీల్దార్ గోవింద్ సింగ్, సీఎస్ డీటీ దీపా, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ రఘురామి రెడ్డి, ఎంఈఓ కోమలాదేవి, ఆర్ఐ బసవన్న గౌడ్, సీఐ రవిశంకర్ రెడ్డి ఆయా హాస్టళ్ల వార్డెన్లు, హెచ్ఎంలు ఉన్నారు. -
ఈ ఎంపీపీ మాకొద్దు
● తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఎంపీటీసీలు ● సర్వసభ్య సమావేశానికి గైర్హాజర్ ● భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు ఎంపీపీ తొగురు సరోజినీ వర్జీనియపై ఎంపీటీసీ సభ్యులు తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్యసమావేశానికి మూకుమ్మడిగా గైర్హాజరయ్యారు. ప్రత్యేకంగా సమావేశమై ఎంపీపీ వ్యవహారం శైలిపై తిరగబడాల్సిందేనని నిర్ణయించుకున్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఎంపీపీ తీరును నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు. – పాములపాడు మండలంలో 12 మంది ఎంపీటీసీ సభ్యులున్నారు. ఒక్కరు మినహా అందరూ వైఎస్సార్సీపీ నుంచే గెలుపొందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీపీ తొగురు సరోజినీ వర్జీనియ, ఎంపీటీసీలు తుమ్మలూరు హాజిరాబీ, వేంపెంట నాగలక్ష్మమ్మ, యర్రగూడూరు దర్గాబాయి టీడీపీలో చేరగా బానుముక్కల ఎంపీటీసీ వెంకటేశ్వర్లు(వైస్ ఎంపీపీ) కాంగ్రెస్ పార్టీలో చేరారు. రుద్రవరం అరుణ స్వతంత్య్ర అభ్యర్థిగా గెలుపొంది టీడీపీలో చేరారు. కాగా పాములపాడు రమాదేవి, మిట్టకందాల మూర్తుజాజీ, మద్దూరు బషీరాహ్మద్, వానాల సరస్వతమ్మ, చెలిమిల్ల సురేష్, జూటూరు–1 వరలక్ష్మి(వైస్ ఎంపీపీ–2), కో ఆప్షన్ సభ్యుడు మూర్తుజావలి వైఎస్సార్సీపీలోనే కొనసాగుతున్నారు. ఎంపీపీ నిరంకుశ వైఖరీ..? ఎంపీపీ తొగురు సరోజినీ వర్జీనియ తన స్వార్థం కోసం పార్టీ మారిందనే భావన అందరిలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. తామంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎంపీపీ తమ పట్లే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సభ్యుల ఆరోపణ. దీనికి తోడు 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.35 లక్షలు నిధులు మంజూరు కాగా ఏ మాత్రం సమాచారమివ్వక పోగా.. ఏయే గ్రామాలకు ఎంతెంత నిధులు కేటాయిస్తున్నారో కూడా సభ్యులకు చెప్పలేదు. ఇక టీడీపీ నాయకులకు, తనకు సన్నిహితంగా ఉంటున్న సర్పంచులకు మాత్రమే నిధులు మంజూరు చేస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ సభ్యులు ఆరోపిస్తున్నారు. అవిశ్వాసానికి సిద్ధం? ఎంపీపీ తీరు మార్చుకోకుండా టీడీపీ నాయకుల చెప్పు చేతుల్లో ఉంటూ వారు చెప్పిన వారికే నిధులు కేటాయిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ఎంపీటీసీ సభ్యులందరూ సమాలోచనలో పడినట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ టీడీపీలో స్వార్థం కోసం చేరిన ఆమెను ఎంపీపీగా ఎందుకు కొనసాగించాలని వారిలో వారు చర్చించుకుంటున్నట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానానికి వెళదామని కూడా ఎంపీటీసీ సభ్యులందరూ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మండలంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నది ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. సర్వసభ్య సమావేశం వాయిదా స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం జరగాల్సిన సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. అధికారులు, సర్పంచులు మాత్రమే హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి చూసి కోరం లేనందున సమావేశం బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీఓ చంద్రశేఖర్ ప్రకటించారు. కాగా సర్వ సభ్య సమావేశానికి గైర్హాజరైన ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ తొగురు సరోజినీ వర్జీనియాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇప్పటి వరకు మండలానికి నిధులు ఎన్ని మంజూరయ్యాయని, దేనికెంత ఖర్చు చేశారని, తమకెందుకు చెప్పలేదని నిలదీశారు. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న ఎంపీటీసీ సభ్యులు -
నిప్పుల్లో కాలుతూ.. చల్లని గాలినిస్తూ!
ఒక్కటేమిటి.. ఇలా చెప్పుకుంటూ పోతే నాతో బోలెడు ఉపయోగాలు. ఎన్నో ఏళ్లుగా నీడనిస్తూ, ఆరోగ్యాన్ని పంచుతున్న నన్నెందుకిలా కాల్చేస్తున్నారు. కడుపులో అగ్గిపెట్టి నిలువునా దహించివేస్తున్నారు. మీ ఊపిరి నిలుపుతున్నందుకా? మీ ఉనికిని కాపాడుతున్నందుకా? తరతరాల నేస్తం.. కాలరాయకు పచ్చదనం. శ్రీ మద్దిలేటి నరసింహ స్వామి ఆలయానికి వెళ్లె రహదారిలోని ఓ పంట పొలంలో వేప చెట్టు మంగళవారం అగ్నికి ఆహుతైంది. చెట్టు మొదలుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పచ్చని భారీ వృక్షం నిప్పుల్లో వణికిపోతున్న దృశ్యం ప్రకృతి ప్రేమికులను కలచివేసింది. – బేతంచెర్ల వర్షం పడుతుందంటారు.. పరుగుతీస్తూ నా పంచన తలదాచుకుంటారు.. మండుతున్న ఎండలంటారు.. వెతుక్కుని మరీ నా నీడన సేదతీరుతారు.. పిల్లలు ఏడుస్తున్నారంటారు.. నా కొమ్మలకు ఊయలకట్టి జోల పాడతారు.. వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతారు.. నా గాలి పీల్చుకొని ఊరట పొందుతారు.. పంటి నొప్పితో బాధ పడతారు.. వేప పుళ్లతో తోముకొని కుదుటపడతారు.. ఒళ్లంతా అనారోగ్యమంటారు.. లేలేత ఆకులతో నయమైందంటారు.. -
టీబీ డ్యామ్కు 5,215 క్యూసెక్కుల ఇన్ఫ్లో
● అకాల వర్షాలతో జలాశయానికి నీరు రాక ● 7.310 టీఎంసీలకు చేరిన నీటి నిల్వలు హొళగుంద: కర్ణాటక రాష్ట్రం హొస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర జలాశయానికి (టీబీ డ్యాం) మూడు నెలల తర్వాత మంగళవారం ఇన్ఫ్లో మొదలై 5,215 క్యూసెక్కుల నీరు జలాశయానికి వస్తున్నాయి. ఎగువ భాగంగలో వర్షాలు తగ్గడంతో జనవరి నుంచి జలాశయానికి ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. ఆ సమయంలో 77.776 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ఇన్ఫ్లో లేకపోవడంతో ప్రస్తుతం 7.310 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. వేసవి మొదలవడం, సాగు నీటి డిమాండ్ పెరగడంతో నీటి నిల్వల్లో నుంచి రోజుకు ఒక టీఎంసీ వరకు తగ్గుతూ వస్తోది. కాగా డ్యాం ఎగువ భాగంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో మంగళవారం 5,215 క్యూసెక్యుల ఇన్ఫ్లో ఉంది. టీబీ బోర్డు అధికారులు ఈనెల 10న ఎల్లెల్సీకి నీటి సరఫనాను నిలిపేయాల్సి ఉండగా మరో రెండు వారాలు కొనసాగించే అవకాశాలున్నాయి. ఎల్లెల్సీలో తగ్గిన నీటిమట్టం తుంగభద్ర దిగువ(ఎల్ల్సెల్సీ) కాలువ హొళగుంద సెక్షన్లో మంగళవారం దాదాపు రెండడుగుల మేర నీటిమట్టం తగ్గింది. కర్ణాటక కోటా నీరు ఈ నెల 5కే ముగియడంతో పాటు అక్కడి రైతులకు నీటి అవసరం లేకపోవడం తదితర కారణాల వల్ల టీబీ బోర్డు అధికారులు ఆంధ్ర కోటా నీరును మాత్రమే వదిలి కర్ణాటక కోటా నీటిని బంద్ చేశారు. దీంతో కాలువలో నీటిమట్టం తగ్గింది. వేసవి కావడం, టీబీ డ్యాంలో నీటి మట్టం పడిపోతుండండంతో మరికొద్ది రోజుల్లో ఎల్లెల్సీకి నీటి సరఫరాను పూర్తిగా నిలిపి వేయనున్నారు. అందులో భాగంగా ఇప్పటి నుంచే కాలువకు నీటిమట్టాన్ని తగ్గిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయిలో నీరు చేరడంతో దిగువ కాలువ(ఎల్లెల్సీ) కింద రైతులు రెండు కార్ల పంటలు పండిస్తున్నారు. ఈ నెలాఖరికి రబీ కోతలు ప్రారంభం కాన్నాయి. టీబీ డ్యాంలో నీటి నిల్వ టీబీ డ్యాంలో మంగళవారం ఉదయం 1,633 అడుగులకు గాను 1584.98 అడుగులతో 105.788 టీఎంసీలకు గాను 7.310 టీఎంిసీల నీరు నిల్వ ఉండగా ఇన్ఫ్లో 5,215 క్యూసెక్కులు, అవుట్ఫ్లో రూపంలో 4,202 క్యూసెక్కుల నీటిని వివిధ కాలువలకు విడుదల చేస్తున్నారు. గతేడాది ఇదే సమయానికి టీబీ డ్యాంలో 4.117 టీఎంసీలు మాత్రమే ఉండేది. ఇక ఎల్లెల్సీ పరిధిలో ఆంధ్ర కాలువ ప్రారంభం (హన్వాళ్ సెక్షన్) 250 కి.మీ వద్ద 622 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. హొస్పేట్ వద్ద ఉన్న టీబీ డ్యామ్లో తగ్గిన నీటిమట్టం -
విద్యుత్ షాక్తో రైతు మృతి
వెల్దుర్తి: పూలతోటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి మోటార్ ఆన్ చేసే ప్రయత్నంలో విద్యుత్ షాక్ గురై ఓ రైతు మృత్యువాత పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ.. మండల పరిధిలోని రామళ్లకోటకు చెందిన సంజామల మాబాషా, గౌసియా దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహం కాగా.. కుమారుడు సంజామల మొహమ్మద్ రసూల్(21) తల్లిదండ్రులతో కలిసి పొలం పనులు చేస్తున్నాడు. పుల్లగుమ్మి రోడ్డు రేగులకుంట వద్ద వారికున్న 3ఎకరాల పొలంలో కనకాంబరాల తోటకు నీళ్లు కట్టేందుకు మంగళవారం ఉదయం 6గంటలకు బయలుదేరాడు. మోటార్ ఆన్ చేసేందుకు స్టార్టర్ స్విచ్ వేసే ప్రయత్నంలో విద్యుత్ షాక్తో అక్కడికక్కడే కూలబడ్డాడు. కొద్దిసేపటి తర్వాత చుట్టుపక్కల దాయాది రైతులు గమనించి విషయాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు. తండ్రి తోట వద్దకు వచ్చి హుటాహుటిన వెల్దుర్తి సీహెచ్సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు చెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ అశోక్ కేసు నమోదు చేసుకున్నారు. -
కార్పొరేట్ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తాం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను 2029 నాటికి కార్పొరేట్ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ అన్నారు. మంగళవారం ఆయన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజి విభాగంలో ఏర్పాటు చేసిన నూతన 2డీ ఎకో కలర్ డాప్లర్ మిషన్ను జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన 2డీ ఎకో మిషన్ వల్ల శిశువుల నుంచి పెద్దల వరకు గుండె సమస్యలను తెలుసుకునే వీలుందన్నారు. ఈ నెల 19న ఆరోగ్యశాఖ మంత్రి స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను సందర్శిస్తారన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గతంలో ఉన్న మిషన్ 15 సంవత్సరాల వయస్సు గల వారికి ఉపయోగపడేదని, ఈ మిషన్ నెలలోపు పిల్లలను కూడా పరీక్షించేందుకు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, కార్డియాలజి విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పి. చంద్రశేఖర్, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో నెమలి మృతి
ఉయ్యాలవాడ: మండలంలోని పెద్దయమ్మనూరు గ్రామ సమీపంలోని పంట పొలాల్లో మంగళవారం జాతీయ పక్షి నెమలి విద్యుదాఘాతంతో మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు కానాల శ్రీనివాసరెడ్డి పొలంలోని విద్యుత్ స్తంభంపై విగతజీవిగా ఉన్న నెమలిని చూసి గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు అటవీ శాఖ అధికారులకు తెలియజేయగా వారు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడే నెమలికి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈతకు వెళ్లి బాలుడి మృతి పెద్దకడబూరు: ఎల్ఎల్సీలో ఈతకు వెళ్లి మంగళవారం బాలుడు మృత్యువాతపడ్డాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామానికి చెందిన హనుమంతు, నాగలక్ష్మి చిన్నకుమారుడు హనమేష్(8) పుట్టుకతో మూగ, చెవిటి. స్థానిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. ఒంటిపూట బడి కావడంతో మధ్యాహ్నం బడి వదిలిన తరువాత తోటి పిల్లలతో కలిసి సమీపంలోని ఎల్ఎల్సీకి వెళ్లాడు. ఈత రాకపోవడంతో ఒడ్డున కూర్చున్నాడు. కొంతసేపు తరువాత తోటివారితో కలిసి నీటిలో దిగాడు. కొంచెం లోపలికి పోవడంతో నీటిలో కొట్టుకుపోయాడు. గమనించిన తోటి పిల్లలు పెద్దగా అరవడంతో అక్కడ ఉన్నవారు కాలువలో దిగి వెతికినా లాభం లేకపోయింది. దాదాపు 500 మీటర్ల దూరంలో పిల్లవాడి ఆచూకీ లభించినా అప్పటికే విగతజీవిగా మారాడు. దీంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మూడిళ్లలో చోరీ ఆదోని అర్బన్: పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో రెండిళ్లతోపాటు తిరుమలనగర్లో మరో ఇంటిలో పట్టపగలే చోరీ జరిగింది. ఎన్జీవోస్ కాలనీకి చెందిన మహాబలేశ్వరప్ప, సుజాత దంపతులిద్దరూ ప్రయివేట్ సంస్థలో ఉద్యోగం రీత్యా ఇంటికి తాళాలు వేసి వెళ్లారు. వారి ఇంటి తాళాలను దొంగలు పగలగొట్టి లోపలకు ప్రవేశించి బీరువాలో ఉన్న రూ.60 వేల నగదు, ఏడు తులాల బంగారం, సెల్ఫోన్ను అపహరించారు. పక్క ఇంట్లో నివాసం ఉండే వేర్హౌస్లో పనిచేస్తున్న గోపాల్, నాగవేణి దంపతులు పనినిమిత్తం ఊరికి వెళ్లగా వారి ఇంటి తాళాలు పగలగొట్టి స్టీల్ డబ్బాలో దాచిపెట్టిన రూ.లక్ష నగదు, ఐదు గ్రాముల బంగారు ఉంగరాన్ని చోరీ చేశారు. తిరుమలనగర్లో నివాసం ఉండే కాత్రికి హరిశ్చంద్రారెడ్డి ఇంటికి తాళం వేసి పొలం పనులకు వెళ్లొచ్చేలోగా 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.60 లక్షల నగదు చోరీకి గురైంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీటౌన్ పోలీసులు తెలిపారు. -
ప్రజలను మోసగించిన కూటమి నేతలు
కొలిమిగుండ్ల: ఎన్నికల సమయంలో కూటమి నాయకులు మాయ మాటలు చెప్పి ప్రజలు మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. మంగళవారం కొలిమిగుండ్లలోని పార్టీ కార్యాలయంలో జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డితో కలిసి వైఎస్సార్సీపీ అనుబంధ విభాగా మండల అధ్యక్షులు, పార్టీ నూతన మండల కమీటీలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాటసాని మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి కార్యకర్తలే పట్టుకొమ్ములన్నారు. పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు కొత్తగా ఎన్నికై న అనుబంధ విభాగాల నాయకులు కష్టపడాలని సూచించారు. ప్రతి చిన్న విషయానికి పోలీస్ స్టేషన్లో తమ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి బీసీ ఉన్నారనే అండతో స్టేషన్లో పోలీసులు రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారన్నారు. పార్టీ శ్రేణుల కోసం ఏదైనా అవసరం అనుకుంటే తానే స్వయంగా స్టేషన్ ఎదుట ధర్నా చేసేందుకై నా సిద్ధమని భరోసా ఇచ్చారు. అరాచకాలు, వేధింపులకు రాబోయే రోజుల్లో వంద శాతం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సిమెంట్ యాజమాన్యాల తీరు సరికాదు వైఎస్సార్సీపీ హయాంలో అన్ని విధాలా మద్దతిచ్చి రామ్కో, అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీల పరిశ్రమలు ఏర్పాటుకు సహకరించామని కాటసాని రామిరెడ్డి అన్నారు. అప్పట్లో పెట్నికోట సమీపంలో ఏర్పాటువుతున్న అల్ట్రాటెక్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణ సభకు హాజరైన బీసీ జనార్దనరెడ్డి ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నట్లు బహిరంగంగా చెప్పారన్నారు. వద్దన్న వాళ్లకే యాజమాన్యాలు పనులు కట్టబెడుతూ వైఎస్సార్సీపీ నాయకులకు మొండిచేయి చూపిన తీరు సరికాదన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ మహేశ్వరరెడ్డి, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి సిద్దంరెడ్డి రామ్మోహన్రెడ్డి, యువజన విభాగం నియోజవర్గ అధ్యక్షుడు పేరం నందకిషోర్రెడ్డి, మాజీ ఎంపీపీ రామాంజనేయులు, వైస్ఎంపీపీ క్రిష్టారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు సోమశేఖరరెడ్డి పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి -
నేషనల్ డేటా బేస్లో కార్మికుల నమోదు
కర్నూలు(అర్బన్): రాష్ట్రవ్యాప్తంగా అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలను నేషనల్ డేటా బేస్లో నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు సంయుక్త కార్మిక కమిషనర్ ఎం.బాలునాయక్ చెప్పారు. ఈ – శ్రమ్ పోర్టల్లో ప్లాట్ ఫాం, గిగ్ కార్మికుల పేర్లను నమోదు చేసే కార్యక్రమానికి సంబంధించి సోమవారం నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక వెంకటరమణ కాలనీలోని బిగ్ బాస్కెట్ కార్మికుల నమోదు ప్రక్రియ కార్యక్రమంలో జాయింట్ లేబర్ కమిషనర్ బాలునాయక్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అసంఘటిత రంగాల్లోని కార్మికులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. కార్మికులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో ఈ– శ్రమ్ పోర్టల్ వేదికను రూపొందించిందన్నారు. ఆధార్కార్డు, 16 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండి, ఈఎస్ఐ, పీఎఫ్ నమోదు కాని వారు ఈ పోర్టల్లో నమోదు కావాలని సూచించారు. సీఎస్సీ, గ్రామ/వార్డు సచివాలయాలు, సమీపంలోని కార్మిక శాఖ కార్యాలయాల్లో పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కేశన్న తదితరులు పాల్గొన్నారు. -
చిర్తనకల్లులో రేషన్ బియ్యం పంపిణీ
కోసిగి: మండల పరిధిలోని చిర్తనకల్లు గ్రామంలో దాదాపు 110 మంది కార్డుదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేయకుండా కోటా అయిపోయిందంటూ డీలర్ చేతులెత్తేశాడు. బాధితుల ఆవేదనను ఈ నెల 6వ తేదీన ‘సాక్షి’ దినపత్రిక ‘రేషన్.. పరేషాన్’ పేరిట కథనం ప్రచురించి వెలుగులోకి తెచ్చింది. ఇందుకు స్పందించిన తహసీల్దార్ రుద్రగౌడ, ఆర్ఐ శ్రీరాములు, వీఆర్వో రామాంజనేయులు గ్రామానికి చేరుకుని డీలర్ వద్ద రేషన్ బియ్యం కోటాపై విచారణ చేపట్టారు. నెలకొకరు చొప్పున డీలర్ మారుతూ బియ్యం పంపిణీ చేస్తుండడంతో బ్యాక్లాగ్ కోటాను ఎవరికి వారే కాజేశారు. దీంతో ఈ నెలలో 110 మంది రేషన్ కార్డుదారులకు బియ్యం తక్కువ వచ్చింది. దీంతో డీలర్లపై తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనున్న మరో రేషన్ డీలర్ వద్ద నుంచి ఎండీయూ వాహనంలో బియ్యం తీసుకొచ్చి పోర్టబుల్ కింద చిర్తనకల్లు గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు. రేషన్ బియ్యం అందడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేసిన ‘సాక్షి’ దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. -
శ్రీశైలం డ్యాం ఈఈగా వేణుగోపాల్
శ్రీశైలంప్రాజెక్ట్: నీలం సంజీవరెడ్డి ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ)గా ఎం.వేణుగోపాల్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత కొద్ది సంవత్సరాలుగా ప్రాజెక్టుకు ఈఈ లేకపోవడంతో డ్యాంకు సంబంధించిన మెయింటెనెన్స్, అదనపు పనులను చేపట్టలేక పోతున్నారు. దీంతో నంద్యాల ఎస్ఆర్బీసీ సర్కిల్–1, డివిజన్–3లో ఈఈగా పనిచేస్తున్న వేణుగోపాల్రెడ్డిని ఫుల్ అడిషనల్ చార్జ్ ఈఈగా శ్రీశైలం డ్యాంకు నియమించారు. బాధ్యతలు చేపట్టిన ఈఈ వేణుగోపాల్రెడ్డిని డ్యాం డివిజన్ ఉద్యోగులు శాలువాతో సత్కరించారు. -
అక్రమ తవ్వకాల అడ్డగింత
ఓర్వకల్లు: మండలంలోని ఉప్పలపాడు రెవెన్యూ పరిధిలో మట్టి అక్రమ తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. స్థానికుల కథనం మేరకు.. రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉప్పలపాడు గ్రామానికి చెందిన సుమారు 800 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. సదరు భూములు నిరుపయోగంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూములు అధికార పార్టీ నాయకులకు ఆర్థిక వనరులుగా మారాయి. ఈ క్రమంలో సర్వే నంబర్ 437లో గల బీడు భూముల్లో కొద్ది రోజుల క్రితం స్థానిక కర్రెమ్మ గుడి వద్ద నుంచి ఏపీఐఐసీ భూముల్లోకి యంత్రాల సాయంతో దారి ఏర్పాటు చేసుకొని టీడీపీ నాయకులు గుట్టు చప్పుడు కాకుండా మట్టి తవ్వకాలు చేపట్టారు. ఈ మట్టిని గుట్టపాడు వద్ద గల స్టీల్ ప్లాంట్ అవసరాల కోసం చేపట్టిన పైపులైన్ నిర్మాణ పనుల కొరకు తరలిస్తున్నటు్ల్ స్థానికులు గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం ఇటాచీలు, జేసీబీలు, టిప్పర్లతో మట్టిని తరలిస్తుండటంతో స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు మధు మరికొంత మంది స్థానికులు అక్కడికి చేరుకొని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్థానికులకు టీడీపీ నాయకుడి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామంలో పశువులు మేత మేసేందుకు కూడా అనుమతించని భూముల్లో ఏపీఐఐసీ అధికారులు మట్టి తవ్వకాలకు అనుమతి ఎలా ఇస్తారని నిలదీశారు? విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని మట్టి తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సిందిగా నిర్వాహకులకు సూచించారు. ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ విద్యాసాగర్ను వివరణ కోరగా.. ఆ భూములు ఏపీఐఐసీకి సంబంధించినవి కావడంతో ఏపీఐఐసీ వారు అంతర్గత రోడ్ల నిర్మాణాలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ వారికి ఏ మాత్రం సంబంధం లేని విషయమని పేర్కొన్నారు. అధికార పార్టీ అండతో చెలరేగిపోతున్న మట్టి మాఫియా ఉప్పలపాడు నుంచి స్టీల్ ప్లాంట్ పైపులైన్ నిర్మాణ పనులకు మట్టి తరలింపు చోద్యం చూస్తున్న ఏపీఐఐసీ అధికారులు -
పొట్టేళ్ల పందెం అదుర్స్
పగిడ్యాల: శ్రీరామనవమి తిరునాల పురస్కరించుకుని సోమవారం స్థానిక బస్టాండు ఆవరణలో ఏర్పాటు చేసిన పొట్టేళ్ల పందెం అదుర్స్ అనిపించింది. పొట్టేళ్లు ఢీ అంటే ఢీ అంటూ ఒకదానికి ఒకటి ఢీకొట్టుకోగా వీక్షకులు ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు. ఆహుతుల హర్షధ్వానాల మధ్య పోటీలు ఉత్కంఠగా సాగాయి. పోటీల్లో అల్లర్లు చోటుచేసుకుండా ముచ్చుమర్రి పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి 12 పొట్టేళ్లు పోటీపడగా మొదటి బహుమతి చెరుకుచెర్ల, రెండవ బహుమతి ప్రాతకోట, మూడవ బహుమతి పగిడ్యాల గ్రామాలకు చెందిన పొట్టేళ్ల యజమానులకు లభించాయి. విజేతలైన పొట్టేళ్ల యజమానులకు ఈడిగ సుధాకర్గౌడ్ నగదు బహుమతులను అందజేశారు. కారులో చెలరేగిన మంటలు ● ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ముగ్గురు నందికొట్కూరు: మిడుతూరు మండల పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద కారులో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న ముగ్గురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కర్నూలు జిల్లా సి.బెళగల్కు చెందిన అమానుల్లా మిడుతూరు మండలంలోని బైరాపురం యువతిని వివాహం చేసుకున్నారు. రంజాన్ పండుగకు భార్య పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు భర్త కారులో వచ్చాడు. కారు రిపేరు కావడంతో మరో ఇద్దరు బంధువులతో కలిసి బైరాపురం నుంచి నందికొట్కూరుకు మెకానిక్ కోసం వచ్చారు. రాత్రి వేళ మెకానిక్ అందుబాటులో లేకపోవడంతో బైరాపురం గ్రామానికి తిరిగి వస్తుండగా నందికొట్కూరు–మిడుతూరు మార్గ మధ్యలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ముగ్గురు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మంటల్లో కారు పూర్తిగా దహనమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. -
హైకోర్టు ఆదేశించినా బేఖాతరు
కర్నూలు(సెంట్రల్): కల్లూరు మండలం మార్కాపురం, తడకనపల్లె డీలర్లు మద్దిలేటి, సత్యనారాయణమ్మను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించినా రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సోమవారం జేసీ డాక్టర్ బి.నవ్యకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం సమర్పించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతారు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ డీలర్లను తొలగించి టీడీపీ అనుకూల వ్యక్తులకు ఇన్చార్జ్ ఇప్పించుకొని వారి ఇళ్ల దగ్గరే చౌక సరుకులను వేస్తున్నారని, ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో హైకోర్టుకు వెళ్లినట్లు వివరించారు. ఇదిలాఉండగా కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ పి.రంజిత్బాషా, జేసీ డాక్టర్ బి.నవ్య ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. నిర్ధేశిత సమయంలోపు అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ వారంలో 104 వినతులు రీఓపెన్ అయినట్లు చెప్పారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని -
మెరుగైన జీవన విధానంతోనే ఆరోగ్యం
కర్నూలు(హాస్పిటల్): ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, అందుకు అనుగుణంగా జీవన విధానాన్ని మలచుకోవాలని రాష్ట్ర భారీ పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కర్నూలు డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో బ్లడ్బ్యాంకులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 38 మంది దివ్యాంగులకు మంత్రి చేతుల మీదుగా చక్రాల కుర్చీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయని, ఇందులో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ముందుంటుందని కొనియాడారు. త్వరలో కర్నూలుకు స్కిన్ సెంటర్ రావడం ఆనందకరమని, ఇది రాష్ట్రంలోనే మొదటిది అవుతుందన్నారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ రయీస్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. -
టెన్నిస్ క్రీడాకారిణికి అభినందన
కర్నూలు(సెంట్రల్): జాతీయస్థాయి టెన్నిస్ పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించిన డెఫ్ క్రీడాకారిణి షేక్ జఫ్రిన్ను సోమవారం జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా ప్రత్యేకంగా అభినందించారు. ఈమె అహ్మదాబాద్లో మార్చి 20 నుంచి 23వ తేదీ వరకు జరిగిన పోటీల్లో మహిళల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్లో బంగారు పతకాలు సాధించింది. డబుల్స్లో నంద్యాలకు చెందిన సాయి చందన్తో కలిసి ప్రతిభ చాటింది. దీంతో 2025 నవంబర్లో జపాన్లో జరిగే బధిరుల ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో క్రీడాకారిణి జఫ్రిన్ను జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా, జేసీ డాక్టర్ బి.నవ్య కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సన్మానించి అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్లో పతకం సాధించి దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్టాప్లు, సెల్ఫోన్ల పంపిణీ విభిన్న ప్రతిభావంతులకు ప్రోత్సాహకంగా 3 ల్యాప్టాప్లు, 2 సెల్ఫోన్లను కలెక్టర్ పి.రంజిత్బాషా అందించారు. సోమవారం కలెక్టరేట్లో లబ్ధిదారులకు వాటిని అందజేసి చదువులో ఉన్నతంగా రాణించాలని ఆకాక్షించారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్వో సీ.వెంకటనారాయణమ్మ, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు రాయిస్ఫాతిమా, కో–ఆపరేటివ్ అధికారులు రామాంజనేయులు పాల్గొన్నారు. -
తల్లి మందలించిందని ఆత్మహత్య
ఆదోని అర్బన్: స్థానిక క్రాంతినగర్కు చెందిన ఉరుకుందప్ప కుమార్తె ఇందూ (20) తల్లి మందలించడంతో ఇంట్లో నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఔట్పోస్టు కానిస్టేబుల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇందూ ఇంట్లో సెల్ఫోన్ చూస్తుండటంతో తల్లి స్వాతి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన యువతి నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబసభ్యులు మంటలు ఆర్పి చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలోనే యువతి మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఔట్పోస్టు కానిస్టేబుల్ తెలిపారు. యువకుడి అదృశ్యం ఆదోని అర్బన్: పట్టణంలోని శివశంకర్నగర్ కాలనీకి చెందిన రామాంజనేయులు, మహాలక్ష్మి దంపతుల కుమారుడు అభిరామ్ ఆదివారం నుంచి కనిపించడం లేదని తల్లిదండ్రులు టూటౌన్ పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. ఉపాధ్యాయుడైన తండ్రి రామాంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం అభిరామ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడని రాత్రయినా తిరిగి రాకపోవడంతో స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి విచారించినా ఆచూకీ తెలియలేదన్నారు. రాత్రి టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు చెప్పారు. అభిరామ్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడన్నారు. సంగమేశ్వరాలయానికి విద్యుత్ సౌకర్యం కొత్తపల్లి: మండలంలోని సప్తనది సంగమేశ్వరాలయం కృష్ణాజలాల నుంచి పూర్తిగా బయటపడింది. దీంతో ఆలయంలో భక్తుల పూజలు మొదలయ్యాయి. ఆలయంలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ విద్యుత్ శాఖ వారితో మాట్లాడి ఎగువ నుంచి ప్రాచీన ఆలయానికి సోమవారం విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పాయి. గర్భాలయంలో, ముఖ మండపంలో, ఆలయ ప్రాంగణంలో విద్యుత్ సౌకర్యం కల్పించారు. -
న్యాయవాదిగా రిటైర్డు ఉపాధ్యాయుడు
పత్తికొండ రూరల్: వృద్ధాప్యం బద్దకానికే గానీ మన ప్రయత్నానికి కాదని రిటైర్డు టీచర్ నిరూపించారు. గురువుగా పదవీ విరమణ పొంది 74 ఏళ్ల వయసులో న్యాయవాద వృత్తిని స్వీకరించి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు. పత్తికొండలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయవాదిగా సోమవారం రిటైర్డు టీచర్ బోయ వీరస్వామి 74 ఏళ్ల వయసులో సభ్యత్వం తీసుకున్నారు. ఈయన 1984లో ఉపాధ్యాయుడుగా పత్తికొండ మండల పరిధిలోని కోతిరాళ్ల గ్రామంలో విధుల్లో చేరి మళ్లీ అదే గ్రామంలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా 2009లో పదవీ విరమణ పొందారు. ఆ తరువాత న్యాయవాద వృత్తిని స్వీకరించాలని 2014–17లో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. హైకోర్టులో ఎన్రోల్మెంట్ చేసుకుని స్థానిక కోర్టులోని బార్ అసోసియేషన్లో నూతన అధ్యక్షుడు మధుబాబు చేతుల మీదుగా సభ్యత్వం తీసుకున్నారు. రిటైర్డు టీచర్ న్యాయవాద వృత్తిలోకి రావడం పత్తికొండ కోర్టులో ఇదే తొలిసారి అని సీనియర్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. పత్తికొండ కోర్టులో తొలిసారి సభ్యత్వం -
వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడి హౌస్ అరెస్ట్
కల్లూరు: కూటమి నేతలు గ్రామాల్లోనూ రాజకీయ చిచ్చు రగులుస్తున్నారు. వైఎస్సార్సీపీకి అండగా నిలుస్తున్న గ్రామాలపై పగబడుతున్నారు. టీడీపీ నేతల నిర్ణయానికి పోలీసులు కూడా వంత పాడుతుండటం విమర్శలకు తావిస్తోంది. తాజాగా కొంగనపాడులో శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే రథోత్సవానికి వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి పాల్గొనకుండా అడ్డుకున్నారు. పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేసి కనీసం దర్శనానికి కూడా వెళ్లకుండా చేశారు. శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని కల్లూరు మండలం కొంగనపాడు గ్రామంలో సీతారాముల రథోత్సవం నిర్వహిస్తారు. సోమవారం సాయంత్రం నిర్వహించనున్న ఈ రథోత్సవానికి కాటసాని రాంభూపాల్రెడ్డి హాజరయ్యేందుకు సిద్ధమవ్వగా కర్నూలు పోలీసులు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కల్లూరులోని ఆయన నివాసానికి భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కాటసాని మీడియాతో మాట్లాడారు. తాను 2009 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా ఉన్నా.. లేకున్నా ప్రతి ఏడాది జరిగే సీతారాముల రథోత్సవానికి హాజరవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు. 2014–2019 మధ్య టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ రథోత్సవంలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. పొరపాటున కూడా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. 2024 ఎన్నికల్లో కూడా గ్రామంలో మెజార్టీ వచ్చిందని, దీన్ని జీర్ణించుకోలేకనే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, పోలీసులు గ్రామంలో ఉన్నది ప్రభుత్వ దేవాలయం కాదని తెలుసుకోవాలన్నారు. పోలీసుల సహకారంతో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తనను అడ్డుకుంటున్నారన్నారు. రథానికి డబ్బులు ఇచ్చింది కూడా ఎక్కువ శాతం తన అనుచరులేనన్నారు. తమ ప్రభుత్వంలో ఇలాంటి దుశ్చర్యలకు ఎప్పుడూ పాల్పడలేదని, అందరికీ దర్శనాలకు అవకాశం కల్పించామన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ఆయన వెంట నాయకులు కాటసాని శివనరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ రేణుక, పలువురు కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు. రథోత్సవంలో పాల్గొనకుండా పోలీసుల నోటీసులు -
కక్ష కట్టి.. పంటను నీట ముంచి
పగిడ్యాల: పాత ముచ్చుమర్రిలో వైఎస్సార్సీపీ నాయకుడు, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గీయుడైన చల్లా శ్రీనివాసరెడ్డిపై రాజకీయ ప్రత్యర్థులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. చల్లా శ్రీనివాసరెడ్డి దాదాపు ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని రబీ సీజన్లో కంది సాగు చేశాడు. పంట కోత దశకు రాగా ఈనెల 4న కోత కోసి పొలంలోనే కుప్పలు వేసి సొంత పని మీద కడపకు వెళ్లాడు. ఆయన ఊర్లో లేని సమయం చూసి రాజకీయ ప్రత్యర్థులు ఆదివారం కోసిన కంది పంట కుప్పలపై నీరు పారించారు. సాయంత్రం గ్రామానికి రాగానే పొలానికి వెళ్లి చూడగా తన పొలమంతా నీరు పారి కంది కట్టె కుప్పలు కుళ్లిపోయి కనిపించాయి. గింజలు ఉబ్బిపోయి మొలకలు రావడంతో కన్నీరుమున్నీర య్యాడు. ప్రస్తుతం ఎకరాకు 9 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా.. దాదాపు 40 క్వింటాళ్ల మేర నష్టం వాటిల్లింది. పెట్టుబడి ఖర్చులు, కౌలు రూ.2 లక్షలు చెల్లించి పంట దిగుబడి కోసం నిరీక్షించగా అంతా నీటిపాలు చేశారని బాధితుడు వాపోయాడు. జరిగిన ఘటనపై ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ శరత్కుమార్రెడ్డి సిబ్బందితో పంటను పరిశీలించారు. కంది కుప్పలపై నీరు పారించిన రాజకీయ ప్రత్యర్థులు వైఎస్సార్సీపీ నేతకు చెందిన ఐదు ఎకరాల్లో పంట నష్టం -
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
● నంద్యాలలో గరిష్టంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కర్నూలు (అగ్రికల్చర్): ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈ నెలలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరే అవకాశమున్నట్లు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కర్నూలులోని ప్రధాన కూడళ్లలో ఎట్టకేలకు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తుండటం విశేషం. సోమవారం నంద్యాలలో 41.5 డిగ్రీలు, రుద్రవరంలో 41.1, కౌతాళంలో 41.1 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా రానున్న రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. డీబీసీడబ్ల్యూఈఓ బాధ్యతల స్వీకరణ కర్నూలు(అర్బన్): జిల్లా బీసీ సంక్షేమం, సాధికారత అధికారిణిగా కే.ప్రసూన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బీసీ సంక్షేమ శాఖల్లో ఇటీవల జరిగిన పదోన్నతుల్లో భాగంగా నెల్లూరు సహాయ బీసీ సంక్షేమ శాఖ అధికారిణిగా ఉన్న ప్రసూనను డీబీసీడబ్ల్యూఈఓగా పదోన్నతి కల్పించి ప్రభుత్వం ఇక్కడకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని సహాయ బీసీ సంక్షేమాధికారులు, బీసీ వసతి గృహ సంక్షేమాధికారుల సంఘం నేతలు ఆమెను కలిసి అభినందనలు తెలిపారు. సహాయ బీసీ సంక్షేమాధికారులు ఆంజనేయులునాయక్, రాజా కుళ్లాయప్ప, అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు పాలెగార్ సత్యనారాయణరాజు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. నూతన డీబీసీడబ్ల్యూఓ మాట్లాడుతూ.. జిల్లాలోని వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. శరవేగంగా పది మూల్యాంకనం కర్నూలు సిటీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం శరవేగంగా కొనసాగుతోంది. ఈ నెల 3వ తేదీన మొదలైన స్పాట్ సోమవారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది. మొదటి రోజున హిందీ, తెలుగు, సోషల్ సబ్జెక్టులకు సిబ్బంది కొరత వచ్చింది. కస్తూర్బా స్కూళ్ల టీచర్లతో పాటు, మరి కొంత మందికి ఉత్తర్వులు ఇవ్వడంతో వారు విధులు చేరడంతో రెండో రోజు నుంచి మూల్యాంకనంలో వేగం పుంజుకుంది. ఈ నెల 9వ తేదీన క్యాంపు ముగించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చేశారు. 1,44,180 పేపర్లు జిల్లాకు రాగా, ఇందులో 75.31 శాతం మూల్యాంకనం పూర్తి చేసినట్లు డీఈఓ ఎస్.శామ్యూల్పాల్ తెలిపారు. ఇందు లో మొత్తం 116 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 690 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 202 మంది స్పెషల్ అసిస్టెంట్లు పాల్గొన్నారని, సిబ్బందికి ఎక్కడా కూడా అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ పేర్కొన్నారు. -
రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు
● ఎస్పీని ఆశ్రయించిన బాధితుడు కర్నూలు(టౌన్): రైల్వేలో డబుల్ ట్రాక్ లైన్ పని చేయించేందుకు సూపర్వైజర్ ఉద్యోగమిస్తామని చెప్పి జొహరాపురానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి రూ.1.20 లక్షలు తీసుకుని మోసం చేశాడని కల్లూరు మండలం చెంచునగర్కు చెందిన పి.ప్రసాద్ ఎస్పీని కలసి వినతిపత్రం అందజేశారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధ్యక్షతన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నుంచి వచ్చిన పలువురు బాధితులు ఎస్పీని కలిసి వినతిపత్రాలు అందజేశారు. తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 125 ఫిర్యాదులు అందాయన్నారు. వీటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చట్టపరంగా బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుసేన్ పీరా, సీఐలు శ్రీనివాస నాయక్, ఇబ్రహీం పాల్గొన్నారు. మరింత పడిపోయిన మిర్చి ధర కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి ధరలు మరింత పడిపోయాయి. మిర్చిలో తేజ, బ్యాడిగ, ఆర్మూర్ తదితర రకాల్లో ఏ ఒక్క రకం ధర రూ.10 వేలు దాటలేదు. ఎరుపు రకానికి గరిష్ట ధర రూ.9,999, బ్యాడిగ రకానికి రూ.9,411 వరకు ధర లభించింది. మిగిలిన రకాలకు ధరలు మరింత అధ్వానంగా లభించడం గమనార్హం. రెండు నెలల కిత్రం మిర్చి రైతులను ఆదుకుంటామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హంగామా చేశాయి. ధరలు పడిపోయి రైతులు అల్లాడుతున్నప్పటికీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. మిర్చితో పాటు వేరుశనగ, ఉల్లి, సజ్జలు, కందుల ధరలు మరింత పడిపోయాయి. -
పేదరికం.. అపహాస్యం!
పీ–4 ముసుగులో ప్రభుత్వం దగా ● ఎన్నికల హామీలను విస్మరిస్తున్న నేతలు ● ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎత్తుగడ ● ప్రైవేటు చేతికి ప్రజల సమాచారం ● అత్యంత నిరుపేదలుగా 1.15 లక్షల కుటుంబాలు కర్నూలు(అగ్రికల్చర్): 2024 ఎన్నికల సమయంలో అధికారమే లక్ష్యంగా ఇబ్బడిముబ్బడిగా హామీలను గుప్పించిన కూటమి నేతలు ఇప్పుడు చేతులెత్తేస్తున్నారు. ప్రధాన హామీలు అమలు కాకుండానే సంవత్సరం గడుస్తోంది. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకూ చాపకింది నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదో చేస్తున్నారనే భ్రమ కల్పిస్తున్నారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పీ–4 సర్వేను తెరపైకి తీసుకొచ్చారు. పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్, పార్ట్న్ర్షిప్ పేరుతో పేదలకు ఏదో చేయబోతున్నట్లు హంగామా చేస్తున్నారు. పీ–4 కార్యక్రమం కింద ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, సంపన్నులు, సంస్థల ద్వారా పేదరిక నిర్మూలన చేస్తామంటూ ఇటీవల చంద్రబాబు చేస్తున్న హడావుడి చూసి ప్రజలు విస్తుపోయే పరిస్థితి ఏర్పడింది. 1.15 లక్షల కుటుంబాలు ఎంపిక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు జిల్లాలో 5,40,248 కుటుంబాలను పీ–4 కోసం సర్వే చేశారు. ఇంట్లో టీవీ, ఫ్రిజ్, గ్యాస్, విద్యుత్ కనెక్షన్తో పాటు మంచినీటి కుళాయి, సొంత ఇల్లు లేని వారిని అత్యంత నిరుపేదలుగా పరిగణిస్తారు. నేడు గుడిసెల్లో నివాసం ఉన్నవారు కూడా టీవీ, గ్యాస్ వినియోగిస్తున్నారు. కరెంటు లేని ఇళ్లు దాదాపుగా కనిపించవు. అత్యంత నిరుపేదలుగా జిల్లాలో 1.15 లక్షల కుటుంబాలను గుర్తించారు. అట్టడుగున ఉన్న ఈ కుటుంబాలను కార్పొరేట్, ప్రైవేటు కంపెనీలు, అత్యంత సంపన్నులతో అనుసంధానం చేసి వారి ద్వారా దారిద్య్ర రేఖపైకి తీసుకురావాలనేది ప్రధాన లక్ష్యం. ఈ సర్వే వివరాలను ప్రభుత్వమే ప్రైవేటు కంపెనీలకు, వ్యక్తులకు అప్పగిస్తోంది. పేదరిక నిర్మూలన అనేది పూర్తిగా ప్రభుత్వ బాధ్యత. కానీ కూటమి ప్రభుత్వం ఈ బాధ్యత నుంచి తప్పుకొని ప్రజల సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వమే సేకరించి ప్రైవేటుకు అప్పగిస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక బాధ్యత విస్మరించిన కంపెనీలు పీ–4 కోసం జిల్లా యంత్రాంగం 14 కంపెనీలను ఎంపిక చేసింది. నిబంధనల ప్రకారం కార్పొరేట్ కంపెనీలు, పెద్దపెద్ద సంస్థలు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రభుత్వ ప్రమేయం లేకుండానే పేదరిక నిర్మూలనకు ముందుకు రావచ్చు. అయితే కొన్ని కంపెనీలు తమ బాధ్యతను పూర్తిగా విస్మరించాయి. పన్నుల నుంచి మినహాయింపు పొందేందుకు కొన్ని సంస్థలు పిసరంత చేసి కొండంత ప్రచారం చేసుకుంటున్నాయి. బంగారు కుటుంబాలుగా మారుస్తారంట... జిల్లాలో పూరెస్ట్ ఆఫ్ పూర్ కింద ఎంపిక చేసిన 1.15 లక్షల కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మారుస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ కుటుంబాల్లోని సభ్యులు దాదాపు జిల్లాలో దాతలుగా ఎంపిక చేసిన కంపెనీలు, సంస్థలు తదితరుల వద్ద పని చేస్తున్న వారే కావడం గమనార్హం. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీలను అమలు చేస్తే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది. కానీ వీటిని పూర్తిగా పక్కన పెట్టిన పీ–4 ముసుగులో ప్రయివేటును తెరపైకి తీసుకొస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లు ప్రకటించిన విధంగా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేసింది. ఈ పథకాల వల్ల పేదరికం గణనీయంగా తగ్గింది. అయితే ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు అధికారం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల కంటే ఎక్కువగా ఇస్తామని ప్రజలను నమ్మించారు. ఇందులో భాగమే సూపర్–6 హామీ. అధికారంలోకి రాగానే ఈ పథకాలను కూటమి ప్రభుత్వం గంగలో కలిపేసింది. అయితే ప్రజల దృష్టి మరల్చేందుకు పేదరిక నిర్మూలన పేరిట హడావుడి చేస్తుండటం గమనార్హం. కూటమి ప్రభుత్వం విస్మరించిన ప్రధాన హామీలు కొన్ని.. ● అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20వేలు. ● అడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1,500. ● తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ ఏడాదికి రూ.15వేలు. ● ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి. ● మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ● 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛను.జిల్లాలో ఎంపిక చేసిన కంపెనీలు రాయలసీమ ఆల్కాలీస్ కెమికల్స్ రాయలసీమ హై స్ట్రెంత్ హైపో లిమిటెడ్ రాయలసీమ గ్రీన్ స్టెల్లో ఇండస్ట్రీస్ మారుతి ఇస్పాత్ ఎనర్జీ లిమిటెడ్ అదాని విల్మార్ ప్రైవేటు లిమిటెడ్ ప్రెస్బౌల్ హార్టికల్చర్ జయరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ సిగాచి ఇండరిస్టీస్ లిమిటెడ్ జియో మైసూర్ సర్వీస్ గ్రీన్కో ఐఆర్ఈపీ చాంబర్ ఆఫ్ కామర్స్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రైస్ మిల్స్ అసోసియేషన్ -
మంత్రి పేరు చెప్పుకొని ఓ టీడీపీ నేత మున్సిపల్ కార్పొరేషన్లో చక్రం తిప్పుతున్నాడు. వెనుకా ముందు ఆలోచించకుండా అధికారులు సైతం ఆయనకే వంతపాడుతున్నారు. ఈయన తీరుపై అధికార పార్టీకే చెందిన ఇద్దరు నేతలు ఫిర్యాదు చేసే స్థాయికి ఆయన దందా చేరుకుంది. ఇతను కార్పొరేటర్
కార్పొరేషన్లో చక్రం తిప్పుతున్న ఓ టీడీపీ నేత ● మున్సిపల్ అధికారులు సైతం ఆయనకే వత్తాసు ● ఏకంగా మంత్రి సిఫారసు లేఖకే దిక్కులేదు ● ఉన్న వాళ్లను తొలగించి కొత్త నియామకాలు ● ఇందుకోసం భారీ ఎత్తున వసూళ్లు ● కోడి వ్యర్థాల టెండర్, జంగిల్ క్లియరెన్స్పై దృష్టి -
హైకోర్టు చెప్పినా ససేమిరా!
వెల్దుర్తి : హైకోర్టు తీర్పు ఇచ్చినా తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం రెడ్బుక్ రాజ్యాంగాన్నే అమలుచేస్తున్నారు. తాము చెప్పిందే తీర్పు.. చేసేదే పాలన.. హైకోర్టు, పోలీసులతో ఏమాత్రం పనిలేదన్నట్లు అరాచకంగా వ్యవహరిస్తున్నారు. కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లెలో గత ఏడాది ఎన్నికల తర్వాత జరిగిన ఓ హత్యోదంతం అనంతరం 37 మందిని ఊరు నుంచి టీడీపీ నేతలు తరిమేశారు. వీరిని తిరిగి ఊళ్లోకి పంపాలని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది.టీడీపీ నేతలు మాత్రం ససేమిరా అన్నారు. అయినా, భారీ పోలీసు బందోబస్తు మధ్య బాధితులు సోమవారం ఊళ్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే రాళ్ల దాడికి తెగబడ్డారు. పోలీసులు అడ్డుపడినా ఖాతరుచేయలేదు. చివరికి.. వీరిలో కొంతమంది ఇళ్లకు చేరుకుంటే, ఇంకొందరు వారి గడప తొక్కకుండానే వెనుదిరిగారు. కర్నూలు జిల్లాలో సోమవారం ఉద్రిక్తతకు దారితీసిన ఈ ఘటన వివరాలు.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.. పత్తికొండ నియోజకవర్గం బొమ్మిరెడ్డిపల్లెలో గత ఏడాది ఎన్నికల కౌంటింగ్ ముగిశాక గ్రామంలో గిరినాథ్ చౌదరి అనే వ్యక్తి ఓ ఇంట్లోకి వెళ్లి మహిళపై అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె భర్త కర్రతో దాడిచేశారు. దీంతో గిరినాథ్ చనిపోయాడు. ఈ ఘటన అప్పట్లో గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. హత్య తర్వాత నిందితులతో పాటు వైఎస్సార్సీపీ సర్పంచ్, వార్డు మెంబర్లు, ఇతర నేతలు 11మందిని అక్రమంగా కేసులో ఇరికించారు. మొత్తం 37 మందిని ఊరు నుంచి తరిమేశారు. శాంతిభద్రతల పేరుతో పోలీసులు కూడా అప్పట్లో వీరిని గ్రామంలోకి అనుమతించలేదు.దీంతో పదినెలలుగా వీరంతా పిల్లలను వేరేచోట చదివించుకుంటూ, పొలాలను బీడుగా వదిలి గ్రామంలోకి రాకుండా అజ్ఞాతంలో ఉంటున్నారు. ఈ క్రమంలో వీరిలో 32 మంది హైకోర్టును ఆశ్రయించారు. బాధితుల పక్షాన సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. ‘పోలీసులు, వైరివర్గాలు 10 నెలలుగా బాధితులను గ్రామంలోకి రానివ్వలేదని, వారంతా బంధువుల ఇళ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని’ వాదించారు. పొన్నవోలు వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్.. పిటిషనర్లు గ్రామంలోకి వెళ్లేలా మార్చి 26న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు కాపీలతో బాధితులు వెల్దుర్తి పోలీసుస్టేషన్ చుట్టూ పలుమార్లు తిరిగినా శాంతిభద్రతల పేరుతో పోలీసులు వారిని గ్రామంలోకి పంపకుండా జాప్యంచేశారు. బాధితులు తిరిగి హైకోర్టుకు వెళ్తామని హెచ్చరించడంతో ఎట్టకేలకు సోమవారం వారిని బందోబస్తు మధ్య గ్రామంలోకి పంపేందుకు ప్రయత్నించారు. -
లారీ ఢీకొని గొర్రెల కాపరి మృతి
నందవరం: లారీ ఢీకొని కురవ లింగారావు(20)అనే గొర్రెల కాపరి మృతి చెందగా, మరో ముగ్గురు గొర్రెల కాపర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన మండల పరిధిలోని ముగతి గ్రామ సమీపంలోని 167వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కేశవ తెలిపిన వివరాలు ఇవి.. ధర్మపురం గ్రామానికి చెందిన 130 గొర్రెలకు కాపర్లుగా ఎమ్మిగనూరు మండలం కే. తిమ్మపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, ఆస్పరి మండలం జొహరాపురం గ్రామానికి చెందిన కురవ లింగారావు అలియాస్ లింగప్ప, బోయ నరసన్న, గొల్ల నరసప్ప, కురవ బడేసాబ్లను కూలీలుగా పెట్టుకున్నారు. ఆదివారం కావడంతో ధర్మాపురం టోల్గేట్ వద్ద నుంచి నలుగురు కాపర్లు తెల్లవారుజామున గొర్రెల మందతో ఎమ్మిగనూరు సంతకు బయలు దేరారు. ముగతి గ్రామ సమీపంలోని 167వ జాతీయ రహదారిపై ఎడమవైపు వెళ్లుతున్న గొర్రెల మందతో పాటు కాపర్లును వెనుక నుంచి గుర్తుతెలియని లారీ ఢీకొట్టుకుంటూ వెళ్లింది. తలకు తీవ్ర రక్త గాయం కావడంతో లింగారావు అక్కడిక్కడే మృత్యువాత పడ్డాడు. శ్రీనివాసులుకు కుడి మణికట్టు దగ్గర, కుడి కాలు భాగంలో మోకాలి వద్ద రక్త గాయాలయ్యాయి. బోయ నరసన్నకు మెడ, నడుముకు గాయాలు కాగా, గొల్ల నరసన్న ఎడమ కాలు పాదం దగ్గర ఎముక విరిగింది. కురవ బడేసాబ్కు ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదంలో మూడు గొర్రెలు మృత్యువాత పడగా, 20 గొర్రెలు గాయపడినట్లు ఎస్ఐ తెలిపారు. క్షతగాత్రులను అంబులెన్స్లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన గొల్ల నరసప్ప, బోయ నరసన్నలను చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రేఫర్ చేశారు. బాధితుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకుకేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మరో ముగ్గురికి గాయాలు ముగతి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై దుర్ఘటన -
రేపు జల వనరుల శాఖ మంత్రి రాక
కర్నూలు సిటీ: జల వనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు రేపు(మంగళవారం)జిల్లాకు రానున్నారు. కర్నూలు స్టేట్ గెస్ట్హౌస్కి చేరుకుని ‘కూటమి’ నేతలతో సమావేశం అవుతారు. అనంతరం జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లతో సమావేశం నిర్వహించనున్నారు. డీఆర్సీ సమావేశంలో పాల్గొననున్నారు. డోన్ రైల్వే స్టేషన్కు చేరుకుని రైలులో విజయవాడకు బయలుదేరనున్నారు. ఇంటి పైకప్పు కూలి వ్యక్తి మృతి బొమ్మలసత్రం: పట్టణంలోని స్థానిక అంజుమన్ వీధిలో ఆదివారం ఇంటి పైకప్పు కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. సీఐ సుధాకర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. అంజుమన్ వీధికి చెందిన రఫీ అహమ్మద్ (54) తన స్నేహితులతో కలిసి వీధి చివరలో ఉన్న ఓ పాతభవనం కింద నిలబడి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో భవనం పైకప్పు కూలి అతని తలపై పడింది. వెంటనే స్నేహితులు చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. తలకు బలమైన గాయం కావటంతో కోలుకోలేక మృతిచెందాడు. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. అనారోగ్యంతో ఆత్మహత్య నందవరం: అనారోగ్యంతో నల్లబోతు మహేష్(32) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్మ చేసుకున్నాడు. ఎస్ఐ కేశవ, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు మేరకు.. మహేష్ గత కొన్ని నెలలుగా కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ ఉండేవాడు. కొన్ని రోజుల క్రితం ఎమ్మిగనూరు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా తగ్గకపోవడంతో జీవితం మీద విరక్తి పొంది శనివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఉదయం చూసి..పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహానికి ఆదివారం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోర్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మహేష్కు భార్య జ్యోతి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పండుగ పూట విషాదం ● గేదే ఢీకొని విద్యార్థి దుర్మరణం కొలిమిగుండ్ల: ఇంటిల్లిపాది పండుగను సంతోషంగా జరుపుకునే సమయంలో గేదే రూపంలో ఓవిద్యార్థిని మృత్యు కబళించింది. ఈవిషాదకర సంఘటన ఆదివారం నందిపాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గుండ్ర నాగన్న, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు నాగార్జున(16) బనగానపల్లె పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతూ ఇటీవలనే పబ్లిక్ పరీక్షలు రాసి ఇంటికొచ్చాడు. ఉదయం పని మీద బైక్పై సమీపంలోని తిమ్మనాయినపేట జంక్షన్ వరకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఊరి శివారులోకి వచ్చే సరికి పొలాల్లో నుంచి గేదే వేగంగా ప్రధాన రహదారిపైకి దూసుకొచ్చి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో నాగార్జున ఎగిరి కింద పడటంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ప్రమాద స్థలానికి చేరుకున్నారు. రక్తపుమడుగులో అచేతనంగా పడి ఉన్న కుమారుడి మృతదేహం మీద పడి తల్లి లక్ష్మీదేవి విలపించిన తీరు గ్రామస్తులను కలచివేసింది. పదో తరగతి పరీక్ష ఫలితాలు రాగానే మంచి కళాశాలలో కుమారుడిని ఇంటర్లో చేర్పించాలని తల్లిదండ్రులు కలలు కన్నారు. పండుగ రోజే మృత్యుఒడికి చేరడంతో వారి ఆవేదనకు అంతులేకుండా పోయింది. ప్రమాద విషయం తెలుసుకున్న సీఐ రమేష్బాబు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. -
పొలంలో అనుమానాస్పద మృతి
ఆస్పరి: దేవనకొండ మండలం తెర్నేకల్లు గ్రామానికి చెందిన ఉప్పర ఉమాపతి (30) అనే వ్యక్తి ములుగుందం నుంచి ఆగ్రహారం వెళ్లే రోడ్డు పక్కన ఉన్న పొలంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆస్పరి సీఐ మస్తాన్వలి తెలిపిన వివరాలు మేరకు.. తెర్నేకల్లుకు చెందిన ఉప్పర ఉమాపతి ఈనెల 5వ తేదీ తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఈయనకు మతిస్థిమితం సరిగ్గా లేదు. ములుగుందం నుంచి ఆగ్రహారం వెళ్లే రోడ్డు పక్కన పొలంలో ఉమాపతి మృతదేహం ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కర్నూలు నుంచి క్లూస్ టీం, డ్వాగ్ స్క్వాడ్ వచ్చి పరిశీలించినట్లు సీఐ తెలిపారు. ఉమాపతికి భార్య సుజాత, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు.హాస్టల్ విద్యార్థి నిజాయితీ వెల్దుర్తి: తనకు దొరికిన సెల్ఫోన్ను ఓ హాస్టల్ విద్యార్థి వార్డెన్ను అందించి నిజాయతీ చాటుకున్నాడు. వెల్దుర్తి ఎస్సీ బాలుర హాస్టల్లో ఆదివారం ఉదయం విద్యార్థులు పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. హాస్టల్తోపాటు చుట్టుపక్కల ఆవరణలో చెత్తాచెదారం తొలగించారు. ఈ సందర్భంగా 8వ తరగతి చదువుతున్న శాంతిరాజుకు సెల్ఫోన్ కనబడింది. నిజాయతీతో సెల్ఫోన్ను తమ వార్డెన్ ఉస్మాన్ బాషాకు అప్పగించాడు. విద్యార్థిని అభినందించిన వార్డెన్.. సెల్ఫోన్లో ఉన్న నంబర్ల ద్వారా యజమాని విజయ్కుమార్కు ఫోన్ చేశాడు. గుంటూరు కాచిగూడ ఎక్స్ప్రెస్ రైలులో గిద్దలూరుకు నుంచి శనివారం రాత్రి హైదరాబాద్లోని ఉప్పల్కు వెళ్తుండగా సెలఫోన్ను పోగొట్టుకున్నామని తెలిపారు. కొరియర్ ద్వారా సెల్ఫోన్ను పంపనున్నట్లు విజయకుమార్కు వార్డెన్ చెప్పారు. -
ఆరోగ్యమే మహాభాగ్యం!
కర్నూలు(హాస్పిటల్): ఆస్తులు, అంతస్తులు లేకపోయినా ఫర్వాలేదు...మంచి ఆరోగ్యముంటే చాలనే మాట ఇటీవల చాలా మందిలో వినిపిస్తోంది. ఎందుకంటే సమాజంలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఏదో ఒక జబ్బుతో ప్రస్తుతం బాధపడుతున్నారు. దీంతో వారి విలువైన జీవితాన్ని, కాలాన్ని కోల్పోతున్నారు. ఆనందమయంగా జీవించలేకపోతున్నారు. అందుకే నేడు చాలా మంది ఆరోగ్యమే మహాభాగ్యం అనే ధోరణితో బతుకుతున్నారు. అనేక ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినంగా నిర్వహిస్తున్నారు. ఎన్సీడీ 2.ఓలో భాగంగా అసంక్రమిత వ్యాధులపై జిల్లాలో సర్వే నిర్వహిస్తున్నారు. 18 ఏళ్లు పైబడిన వారు ఇందులో 19,12,227 మంది ఉన్నారు. ఇందులో 5,50,034 మందికి పరీక్ష చేయగా 29.40 శాతం మందికి బీపీ, 17.85 శాతం మందికి షుగర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వీరితో పాటు 1,817 మందికి నోటి క్యాన్సర్, 1,063 మందికి రొమ్ము క్యాన్సర్, 862 మందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. 45,040 మంది గర్భిణులు రిజిస్టర్ కాగా అందులో 10,072 మంది గర్భిణులు హైరిస్క్లో ఉన్నట్లు తేల్చారు. అలాగే జిల్లాలో ప్రస్తుతం 3,077 మందికి టీబీ, 395 మందికి కొత్తగా కుష్టు వ్యాధి ఉండగా, ఏఆర్టీ కేంద్రాల్లో నమోదైన 18,843 మందిలో 7,485 మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారు. దోమల కారణంగా వచ్చే వ్యాధులైన డెంగీతో 400 మంది గత సంవత్సరం బాధపడ్డారు. పై వ్యాధులన్నీ అధిక శాతం జీవనశైలి కారణంగా వచ్చినవే. కొన్ని వంశపారంపర్యంగా, ఇంకొన్ని సీజనల్ వ్యాధులు, పోషకాహారలోపం కారణంగా వస్తున్న వ్యాధులు. వీటన్నింటినీ అధిగమించాలంటే సరైన జీవనవిధానం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ● మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో వ్యాయామ మూ అంతే ముఖ్యం. వారానికి కనీసం 150 నిమిషా లు వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ● రోగనిరోధక వ్యవస్థ చక్కగా ఉండాలన్నా, మానసిక ప్రశాంతంగాకు నాణ్యమైన నిద్ర ఉండాలి. ● ధూమ, మద్యపానంతో ఊపరితిత్తుల క్యాన్సర్, శ్వాసకోశ, గుండె, కాలేయ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఈ దురలవాట్లకు దూరంగా ఉంటే మంచిది. ● శరీరంతో పాటు ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముందస్తుగా కొన్ని రకాల హెల్త్ చెకప్లు అప్పుడప్పుడూ చేయించుకోవాలి. ● ఒంటరితనం అనారోగ్యానికి బాటలు వేస్తుంది. సామాజిక సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. పది మందిని కలుస్తూ స్నేహ జీవితాన్ని కొనసాగించాలి.సమతుల ఆహారం తినాలి ప్రతి ఒక్కరూ నిత్యం సమతుల ఆహారం తీసుకోవాలి. తినే ఆహారంలో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కోడిగుడ్లు, చికెన్ వంటికి తినాలి. దీంతో పాటు ప్రతి రోజూ 8 గ్లాసుల నీటిని కచ్చితంగా తాగేలా చూసుకోవాలి. –డాక్టర్ రవికళాధర్రెడ్డి, జనరల్ ఫిజీషియన్, కర్నూలు మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి ఆధునిక సమాజంలో ఒత్తిడి తో కూడిన జీవితం ప్రతి ఒక్కరికీ ఎక్కువవుతోంది. దీర్ఘకాలంగా ఉండే ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ఊబకాయం, గుండెజబ్బులు, డిప్రెషన్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం, ప్రాణా యామాలు, యోగా, పచ్చని ప్రకృతిలో గడపడం వంటివి చేయాలి. –డాక్టర్ బీఎస్. ప్రవీణ్కుమార్, కార్డియాలజిస్టు, కర్నూలు ఆరోగ్యంపై ప్రజల్లో పెరిగిన శ్రద్ధ ఆహారపు అలవాట్లలో మార్పు వ్యాయామానికి ప్రాధాన్యం నేడు ప్రపంచ ఆరోగ్య దినం -
ప్రలోభాలతో మేయర్ పదవిని లాక్కునేందుకు టీడీపీ కుట్ర
కర్నూలు(సెంట్రల్): అప్రజాస్వామికంగా మేయర్ పదవి నుంచి తనను దించేందుకు టీడీపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య ఆరోపణలు చేశారు. టీడీపీ నాయకుల ప్రలోభాలకు నికార్సయిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు లొంగడం లేదని దీంతో ఎల్లో మీడియాలో కథనాలు రాయించి దుష్ప్రచారం చేయిస్తున్నారన్నారు. ఆదివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ కర్నూలు నగర కార్పొరేటర్లు, పార్టీ నాయకులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల ఎల్లో మీడియాలో తనపై వచ్చిన కథనాలకు వివరణ ఇచ్చారు. తాను 1987 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, రెండుసార్లు ఎంపీగా పోటీ చేశానని, ఒక్కసారి జెడ్పీ ఫ్లోర్ లీడర్గా పనిచేశానని, ప్రస్తుతం కర్నూలు మేయర్గా ఉన్నానని తెలిపారు. అవినీతి మరక లేకుండా 30 ఏళ్ల నుంచి ప్రజల పక్షాన రాజకీయాలు చేస్తున్నానని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కర్నూలు మేయర్ పదవి కోసం అడ్డదారులు తొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానుగాని, తమ పార్టీ కార్పొరేటర్లుగాని వారికి సహకరించకపోవడంతో ఎల్లో మీడియాలో లేనిపోని ఆరోపణలు చేస్తూ కథనాలను రాయిస్తున్నారని చెప్పారు. తమ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఉన్నాయని, తన భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అని, ఆమె రిటైర్మెంట్ బెనిఫిట్స్తోనే ఇటీవల తాను రెండు ప్లాట్లను చట్టబద్ధంగా కొనుగోలు చేశానన్నారు. అలాగే బాలసాయిబాబా ట్రస్టు నుంచి తాను రూ.77 లక్షలను అప్పుగా చెక్రూపంలో తీసుకున్నానని, అయితే అది టీడీఆర్ బాండ్ సొమ్ము అని టీడీపీ నాయకులు ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. కోటి రూపాయల టీడీఆర్ బాండ్ విలువలో రూ.77 లక్షల సొమ్మును లంచంగా ఎలా ఇస్తారన్న ఇంకితజ్ఞానం టీడీపీ నాయకులకు లేదా అని ప్రశ్నించారు. తాను తీసుకున్నదని అప్పు అని, అప్పు ఇచ్చే వారు ఎలా తెచ్చి తనకు ఇచ్చిన తనకేమి సంబంధమని ప్రశ్నించారు. టీడీఆర్ బాండ్ల సొమ్ములో అక్రమాలు జరిగాయనుకుంటే విచారణ చేయించాలని, అందులో తన పాత్ర ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. టీడీపీ నాయకుల రెడ్బుక్ రాజ్యాంగాలకు భయపడేది లేదని, అవసరమైతే జైలుకు వెళ్లడానికై నా..లేదంటే ప్రత్యర్థులపై కలబడడానికై నా తాను సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు. తాను మాత్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాటను విడిచి పెట్టనని, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా భయపడనని, దమ్ముంటే తన పదవిపై అవిశ్వాస తీర్మానం పెట్టుకోవాలని టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు. ఒకరిద్దరూ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అమ్ముడు పోయినంత మాత్రన అందరూ వెళ్తారన్న భ్రమలో ఉన్నారని, అందులో భాగంగా బేరసారాలు వేసి తెల్లముఖాలు వేశారని ఎద్దేవా చేశారు. నెల్లూరు నుంచి బతకడానికి కర్నూలు వచ్చిన ఓ వ్యక్తి కనీసం కార్పొరేటర్గా కూడా గెలవలేదని, ఆయన కూడా తనపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని, పద్ధతిగా మాట్లాడకపోతే తగిన బుద్ధి చెబుతానని పరోక్షంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లును హెచ్చరించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తలొగ్గరు ఎల్లో మీడియాలో అంతా దుష్ప్రచారమే ‘రెడ్బుక్’కు భయపడేది లేదు విలేకరుల సమావేశంలో కర్నూలు మేయర్ బీవై రామయ్య వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను ఎవరూ కొనుగోలు చేయలేరు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను ఎవరూ కొనుగోలు చేయలేరని, తామంతా మేయర్ బీవై రామయ్యపై పూర్తి విశ్వాసంతో ఉన్నామని డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుకరెడ్డి అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా తామంతా వైఎస్సార్సీపీ కొనసాగుతామని చెప్పారు. బీసీ కావడంతోనే.. మేయర్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో టీడీపీ నాయకులు, ఇతర కూటమి నేతలు టార్గెట్ చేశారని వైఎస్సార్సీపీ నాయకుడు సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. ఆ పదవి నుంచి అయన్ను తప్పించేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీతో పాటు బీసీ, బోయ సామాజిక వర్గాలు మేయర్కు అండగా ఉంటాయన్నారు. కార్పొరేటర్లు దండు లక్ష్మీకాంతరెడ్డి, నారాయణరెడ్డి, లక్ష్మీరెడ్డి, గాజుల శ్వేతారెడ్డి, విక్రమసింహారెడ్డి, కృష్ణకాంత్, షేక్ అహ్మద్, యూనూస్, నాయకులు పెద్దన్న, కటారి సురేష్, మల్లి, రైల్వే ప్రసాదు, ప్రశాంత్, బెల్లం మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇక గృహ వినియోగదారుల దోపిడీ
డివిజన్ వారీగా ఉమ్మడి జిల్లాలో బిగించిన స్మార్ట్ మీటర్లు ఆదోని 17,950 డోన్ 13,570 కర్నూలు 21,864 ఆత్మకూరు 9,945 నంద్యాల 35,890 ఎమ్మిగనూరు 12,670 మొత్తం 1,11,889వ్యాపారులపై విద్యుత్ పిడుగు ● స్మార్ట్ మీటర్లతో ఇబ్బడిముబ్బడిగా బిల్లులు ● సంక్షోభంలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ● గతంలో నెలవారీ బిల్లు రూ.2వేల నుంచి రూ.10వేలలోపే ● రెండు నెలలుగా బిల్లులు రూ.30 వేలపైనే ● గగ్గోలు పెడుతున్న వ్యాపార, పారిశ్రామిక వేత్తలుకర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లతో వినియోగదారులను దోపిడీ చేస్తోంది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. గతంలో వీటిని వ్యతిరేకించిన టీడీపీ కూటమి నేతలు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత స్మార్ట్ మీటర్ల టెక్నాలజీలో మార్పులు తెచ్చి మొదటి దశలో కమర్షియల్ కనెక్షన్లు కేటగిరి–2, పరిశ్రమల కనెక్షన్లు కేటగిరి–3లకు స్మార్ట్ మీటర్లు బిగించింది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ఒక్కసారిగా నాలుగు అంకెల్లో ఉన్న బిల్లులు ఐదు అంకెల్లోకి వెళ్లిపోయాయి. దీంతో వ్యాపార, పారిశ్రామిక వేత్తల్లో ఆందోళన మొదలైంది. 2024 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని టీడీపీ అధినేత ప్రచారాన్ని ఊదరగొట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం మోపడం చూస్తుంటే సంపద సృష్టి అంటే ఇదా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అడ్డుగోలుగా వస్తున్న విద్యుత్ బిల్లులపై ఫిర్యాదు చేయడానికి వెళితే స్పందించే అధికారులు కూడా కరువయ్యారనే ఆందోళన వినియోగదారుల్లో వ్యక్తమవుతోంది. 1.07 లక్షల కేటగిరీ–2 కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 17,06,665 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 12,67,748 హౌస్హోల్డ్ కనెక్షన్లు. కమర్షియల్ కేటగిరీ–2 కింద 1,58,252, పరిశ్రమల కేటగిరీ–3 కింద 9,698 ఉన్నాయి. ఇప్పటి వరకు కేటగిరి–2, కేటగిరి–3 కనెక్షన్లకు 1.11 లక్షల స్మార్ట్ మీటర్లు బిగించారు. డిసెంబర్ నుంచి స్మార్ట్ మీటర్లను బిగించే కార్యక్రమం జరుగుతోంది. స్మార్ట్ మీటర్ల బిగింపుతో వ్యాపార, పారిశ్రామికవేత్తల్లో అలజడి మొదలైంది. స్మార్ట్ మీటర్లు బిగించక ముందు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు వస్తున్న విద్యుత్ బిల్లులు ఒక్కసారిగా రూ.30 వేలు దాటుతున్నాయి. దీంతో వ్యాపారులు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల యజమానులు బెంబేలెత్తుతున్నారు. స్మార్ట్ మీటర్లు వద్దని.. వెనక్కు తీసుకోవాలని విద్యుత్ అధికారుల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని, ఎంత బిల్లు వస్తే అంత గడువులోపు చెల్లించకపోతే కనెక్షన్ తొలగిస్తామని అధికారులు తేల్చి చెబుతుండటం గమనార్హం. నెపం కెపాసిటర్లపైకి.. ● విద్యుత్ బిల్లులు అధిక మొత్తంలో రావడానికి స్మార్ట్ మీటర్లు కారణం కాదని.. కెపాసిటర్ల వల్లే అలా వస్తున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ● సాధారణంగా రీడింగ్ను బట్టి బిల్లులు రావాల్సి ఉంది. ● సామర్థ్యం ఎక్కువగా ఉంటే స్మార్ట్ మీటర్లు రీడింగ్ను బట్టి కాకుండా కేపాసిటర్ సామర్థ్యాన్ని బట్టి బిల్లు ఇస్తుంది. ● కేపాసిటర్ల సామర్థ్యం ఎక్కువగా ఉన్న వారు దానిని తగ్గించుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ● స్మార్ట్ మీటర్ల వల్ల మొదటి నెలలోనే సగటున వినియోగదారుడిపై రూ.50 వేలకుపైగా భారం పడింది. మీటరు రీడర్ల ఉపాధిపై దెబ్బ గ్రామ, పట్టణాల్లో కనెక్షన్లను బట్టి మీటర్లు రీడర్లు ఉపాధి పొందుతున్నారు. ప్రతి నెలా 1 నుంచి 6 తేదీల మధ్య వీరు ఇంటింటికీ వెళ్లి రీడింగ్ను బట్టి బిల్లులు ఇస్తున్నారు. స్మార్ట్ మీటర్లు బిగించడం ద్వారా మీటరు రీడర్లతో అవసరం ఉండదు. ప్రతి నెలా 1వ తేదీ రాత్రికే విద్యుత్ అధికారులు ఆఫీసుల నుంచే వినియోగదారుల సెల్ నెంబర్కు వాట్సాప్ ద్వారా బిల్లులు పంపుతారు. తద్వారా మీటరు రీడర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రకటించిన కూటమి నేతలు, ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను కూడా తొలగిస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కర్నూలు నగరంలోని సంతోషనగర్కు చెందిన జె.ఉస్మాన్కు కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ ఉంది. ఈయనకు గత ఏడాది నవంబర్లో రూ.3,380, డిసెంబర్లో రూ.7,223 బిల్లు వచ్చింది. అదే నెలలో విద్యుత్ అధికారులు స్మార్ట్ మీటరు బిగించారు. జనవరి 2న వచ్చిన బిల్లు చూసి ఉస్మాన్ షాక్కు లోనయ్యాడు. ఏకంగా రూ.30,758 బిల్లు వచ్చింది. ఫిబ్రవరిలో వచ్చిన బిల్లు కూడా రూ.29,524 ఉంది. అధికారులను సంప్రదిస్తే ఏమీ చేయలేమని చేతులు ఎత్తేశారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో కూటమి ప్రభుత్వం గృహ వినియోగదారులను సైతం దోపిడీ చేస్తోంది. మొదటి విడతలో 200 యూనిట్లు, ఆపైన వాడకం ఉన్న వినియోగదారుల నివాసాల్లో స్మార్ట్ మీటర్లు బిగించే ప్రక్రియ మొదలైంది. వినియోగదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ట్రూ అఫ్ చార్జీలు.. 2022, 2023, 2025 సర్దుబాటు చార్జీల పేరిట వినియోగదారులపై సగటున రూ.500 నుంచి రూ.1500 వరకు భారం మోపుతోంది. స్మార్ట్ మీటర్లు బిగిస్తే రానున్న రోజుల్లో విద్యుత్ బిల్లులు ఏ స్థాయిలో ఉంటాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి బంద్
కర్నూలు(హాస్పిటల్): పేదలు ఆరోగ్యశ్రీ కార్డు జేబులో పెట్టుకుని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా అధునాతన వైద్యం అందుకునే రోజులు పోయాయి. ఈ పథకాన్ని సమూలంగా తీసివేసి దాని స్థానంలో బీమా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. బకాయిలు చెల్లించలేదంటూ నెట్వర్క్ ఆసుపత్రులు సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) సేవలు నిలుపుదల చేస్తున్నాయి. ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి సమ్మె నోటీసు కూడా అందజేశాయి. ఇదీ పరిస్థితి.. ● కర్నూలు జిల్లాలో మొత్తం 6,49,333 ఎన్టీఆర్ వైద్యసేవ కార్డులు ఉండగా 128 నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. ఇందులో ఐదు ప్రభుత్వ ఆసుపత్రులు, ఒక ఏరియా ఆసుపత్రి, ఐదు సీహెచ్సీలు, 58 ప్రైవేటు హాస్పిటల్స్, 34 పీహెచ్సీలు, 25 డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి. ● నంద్యాల జిల్లాలో మొత్తం 5,36,887 ఎన్టీఆర్ వైద్యసేవ కార్డులుండగా, 101 నెట్వర్క్ హాస్పిటల్స్ కొనసాగుతున్నాయి. ఇందులో 65 ప్రభుత్వ ఆసుపత్రులు 24 ప్రైవేటు ఆసుపత్రులు, 12 డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి. ● ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు ఈ నెల 7వ తేఈ(సోమవారం) నుంచి ఎన్టీఆర్ వైద్యసేవలు నిలిపివేస్తున్నాయి. ● రాష్ట్ర వ్యాప్తంగా రూ.3,500కోట్ల బకాయిలు ప్రైవేటు ఆసుపత్రులకు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఎలాంటి స్పందన లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి. అత్యవసర సేవలను కూడా బహిష్కరించనున్నట్లు తెలిపాయి. స్పందించని ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ సేవలను సోమవారం నుంచి నిలిపివేసేందుకు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు నిర్ణయం తీసుకోగా దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కనీసం ప్రత్యామ్నాయ చర్యలకూ ఉపక్రమించలేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యసేవలు నిలిచిపోతే అక్కడ చికిత్స చేయించుకోవడానికి డబ్బులు లేని నిరుపేదలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వస్తారు. ఈ మేరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎలాంటి చర్యలూ తీసుకునేందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వలేదు. జిల్లా ఆరోగ్యశ్రీ అధికారులకు సైతం సమ్మె విషయమై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడం గమనార్హం. గతంలో మహా నగరాల్లోనూ ఉచిత వైద్యం ఆరోగ్యశ్రీ పేరు చెబితే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి గుర్తుకు వస్తారు. ఆయన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకానికి వన్నెలు అద్దారు. ఆరోగ్యశ్రీ కేసుల సంఖ్యను 3,200లకు పెంచారు. అలాగే నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యను పెంచి పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చారు. హైదరాబాద్, బెంగళూరు, చైన్నె వంటి నగరాల్లోనూ ఈ పథకం ద్వారా పేదలు ఉచితంగా వైద్యం అందుకునేలా చేశారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని ప్రభుత్వం -
కార్మికుల పేర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు
కర్నూలు(అర్బన్): ఈ– శ్రమ్ పోర్టల్లో ఫ్లాట్ ఫాం కార్మికులు, గిగ్ కార్మికుల పేర్లను నమోదు చేయించేందుకు ఈ నెల 7 నుంచి 17వ తేదీ వరకు ప్రత్యేక నమోదు శిబిరాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఉప కార్మిక కమిషనర్ కే వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ – శ్రమ్ పోర్టల్లో కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం సమీపంలోని కార్మిక శాఖ కార్యాలయం, మెప్మా, డీఆర్డీఏ అధికారులను సంప్రదించాలని సూచించారు. కర్నూలుకు చెందిన వారు 9492555168, ఆదోనికి చెందిన వారు 9492555170 నంబర్లను సంప్రదించి వివరాలను పొందాలని కోరారు. శ్రీశైలంలో 15న కుంభోత్సవం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 15న భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. దేవస్థాన పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. కుంభోత్సవం నిర్వహించే రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అమ్మవారి ఆలయ మెట్ల మార్గంలో అదనపు క్యూలైన్లను ఏర్పాటు చేయాలన్నారు. దేవదాయ చట్టాన్ని అనుసరించి క్షేత్ర పరిధిలో జంతు, పక్షి బలులు, జీవహింస పూర్తిగా నిషేధించామన్నారు. క్షేత్రంలోని ప్రధాన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో కూడా పోలీసు, రెవెన్యూ సిబ్బంది తనిఖీలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో దేవస్థాన వైదిక సిబ్బంది, శాఖాధిపతులు, విభిన్న విభాగాల పర్యవేక్షకులు, తహసీల్దార్ కేవీ శ్రీనివాసులు, సీఐ ప్రసాదరావు పాల్గొన్నారు. టైర్ పేలి స్కార్పియోను ఢీకొట్టిన లారీ● యువకుడి దుర్మరణంఎమ్మిగనూరురూరల్: టైర్ పేలిన లారీ..స్కార్పియోను ఢీ కొట్టడంతో తల్లికి తీవ్ర గాయం కాగా ఆమె కుమారుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన ఎమ్మిగనూరు మండలం కోటేకల్ కొండల సమీపంలోని ఫారెస్ట్ దగ్గర ఆదివారం చోటుచేసుకుంది. కిడ్నీలో రాళ్లు ఉండటంతో తల్లి మంగమ్మకు కర్నూలులో ఆపరేషన్ చేశారు. దీంతో ఆదోని పట్టణానికి చెందిన ప్రహ్లాద్(30) తన తల్లితో కర్నూలు నుంచి స్కార్పియోలో ఆదోనికి వస్తున్నారు. కోటేకల్ కొండల సమీపంలో వేగంగా ఎమ్మిగనూరు వైపు వస్తున్న లారీ టైర్ పేలిపోవటంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న స్కార్పియోను ఢీ కొట్టింది. దీంతో స్కార్పియోలో డ్రైవింగ్ చేస్తున్న ప్రహ్లాద్ సీట్లో ఇరుక్కుపోవటం, తలకు బలమైన గాయం కావటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కనే కూర్చున్న మృతుడి తల్లి మంగమ్మకు తలకు గాయమైంది. ప్రమాద విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదాన్ని పరిశీలించారు. అతి కష్టం మీద సీట్లో ఇరుక్కుపోయిన ప్రహ్లాద్ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య శ్రావణి, ఇద్దరు సంతానం ఉన్నారు. గాయపడ్డ మంగమ్మను ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు విలేకరులకు తెలిపారు. వారిది ఆత్మహత్యాయత్నం పాములపాడు: ఇస్కాల గ్రామంలో సోమేశ్వరుడు అనే రైతు నలుగురు కుటుంబ సభ్యులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని డీఎంఅండ్హెచ్ఓ వెంకటరమణ తెలిపారు. గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అతిసార లక్షణాలతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడంతో డీఎంఅండ్హెచ్ఓ ఆదివారం ఇస్కాలను సందర్శించారు. అయితే గ్రామంలో డయేరియా కేసులు లేవని నిర్ధారించారు. సోమేశ్వరుడు అప్పులబాధతో కుటుంబసభ్యులతో కలసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసిందన్నారు. విషయాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారికి సమాచారం ఇచ్చామన్నారు. -
అక్షరాలతో రామాయణ చరిత్ర
నంద్యాల(అర్బన్): శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణానికి చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ రామచరిత్రను తెలుగు అక్షరాలతో శ్రీరాముని ఊహా చిత్రాన్ని గీచారు. ఏ3 డ్రాయింగ్ షీట్పై మైక్రో పెన్నుతో 3 గంటలు శ్రమించి గీచిన చిత్రం పలువురి మన్ననలు అందుకుంది. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ శ్రీరాముని జననం నుంచి పట్టాభిషేకం వరకు అక్షరాలతో ఊహా చిత్రాన్ని గీచానన్నారు. మహావిష్ణువు ప్రేతాయుగంలో శ్రీరాముడిగా లోక కల్యాణం కోసం అవతరించాడని, శ్రీరామచంద్రుడు సద్గుణవంతుడు, ఆదర్శప్రాయుడు, తండ్రి మాట జవదాటని తనయుడిగా ఒకే మాట, ఒకే బాణం, ఒకే సతీతో ఆదర్శంగా నిలిచారన్నా రు. ధర్మం తప్ప కుండా మనిషి ఎలా జీవించాలో లోకానికి చాటి చెప్పిన కారణజమ్ముడు శ్రీరాముడన్నారు. కుక్క దాడిలో ఐదుగురికి గాయాలు కొలిమిగుండ్ల: బెలుం శింగవరంలో వీధి కుక్క దాడి చేయడంతో శనివారం ఐదుగురికి గాయాలయ్యాయి. ఉదయం ఎవరి పని మీద వాళ్లు వీధుల్లో వెళుతుండగా దాడి చేసి గాయపర్చింది. నారాయణరెడ్డి, భూపాల్రెడ్డి, రంగేశ్వరరెడ్డితో ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. చికిత్స కోసం కుటుంబ సభ్యులు వారిని కొలిమిగుండ్ల పీహెచ్సీకి తీసుకెళ్లారు. గ్రామంలో వీధుల్లో కుక్కల బెడద కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. ఎప్పుడు జనాల మీద దాడి చేస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. -
న్యాయశాఖ ఉద్యోగుల కార్యవర్గ ఎన్నిక
కర్నూలు(సెంట్రల్): జిల్లా న్యాయశాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శనివారం జిల్లా కోర్టుకు ఎదరుగా ఉన్న క్లబ్ క్యాంటీన్లో న్యా యశాఖ ఉద్యోగులు సమావేశమయ్యారు. స మావేశంలో జిల్లా న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఎకై ్సజ్ కోర్టులో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఈ.దేవేంద్రగౌడ్, జనరల్ సెక్రటరీగా పీడీఎం కోర్టు స్టెనోగ్రాఫర్ ఎన్.గోపాల్, ట్రెజరర్గా ప్రిన్సిపల్ కోర్టు జూనియర్ అసిస్టెంట్ ఎం.శివరాముడులతోపాటు ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, కమిటీ సభ్యుల ను అందరి ఆమోదంతో ఎన్నుకున్నారు. ఇంట్లో ఆరడుగుల కోడెనాగు మహానంది: శ్రీనగరం గ్రామానికి చెందిన కృష్ణకుమారి ఇంట్లో శనివారం సాయంత్రం పెద్ద నాగుపాము కనిపించింది. ఇంట్లో ఉన్న ఓ బాలుడిని కాటేసేందుకు ప్రయత్నించగా త్రుటిలో తప్పించుకున్నాడు. పాము బయటి కి వెళ్లకపోవడంతో అయ్యన్ననగర్ గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ మోహన్కు సమాచారం అందించగా అతడు అక్కడికి చేరుకుని ఆరు అడుగుల నాగుపామును పట్టుకుని సమీపంలోని నల్లమల అడవిలో వదిలేశాడు. వ్యక్తి ఆత్మహత్య ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని ముగతి పేటలో ఉరివేసుకొని బాలచంద్ర(37) ఆత్మహత్య చేసుకున్నట్లు టౌన్ సీఐ వి. శ్రీనివాసులు శనివారం రాత్రి తెలిపారు. ముగతి పేటకు చెందిన బాలచంద్ర, గౌతమిలకు ఇద్దరు కుమారులు. మగ్గం వేసుకుంటూ జీవనం సాగించేవాడు. స్థానిక హెడ్డీఎఫ్సీ బ్యాంకులో రూ.1.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇంటి ఖర్చులు, కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగోలేకపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు కిందకు దించి పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. భార్య గౌతమి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
నాటుసారా స్థావరాలపై దాడులు
కర్నూలు (టౌన్): నగర పరిధిలోని బంగారుపేటలో నాటు సారా స్థావరాలపై శనివారం ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నవోదయం కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు, కళాజాతా ద్వారా నాటు సారా నిర్మూలనపై అవగాహన కల్పించారు. 600 లీటర్ల ఊట, 10 లీటర్ల నాటు సారా ధ్వంసం చేశారు. నీలి షికారీ కాజల్ను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సబ్ ఇన్స్పెక్టర్ రెహెనా తెలిపారు. దాడుల్లో ఎకై ్సజ్ సిబ్బంది చంద్రహాస్, రామలింగమయ్య, సుదర్శన్, రాజు, రామచంద్రుడు పాల్గొన్నారు. కొనసాగుతున్న సోదాలు కర్నూలు (సెంట్రల్): అక్రమ రేషన్ బియ్యంపై విజిలెన్స్, పౌర సరఫరాల అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. శనివారం 86, 87, 51 రేషన్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో 86వ షాపులో 89 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉండటంతో 6ఎ కేసు నమోదు చేశారు. 51వ రేషన్ షాపులో ఈ–పాస్ మిషన్తో పోల్చితే స్టాక్ సరితూగింది. అలాగే కేఎల్ 82067 అనే ఎండీయూ వాహనాన్ని తనిఖీ చేయగా కొలతల్లో తేడాలు లేనట్లు అధికారులు గుర్తించారు. సోదాల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. -
ముగిసిన వీరభద్ర, కాళికాదేవిల బ్రహ్మోత్సవాలు
ఆస్పరి: మండలంలోని కై రుప్పలలో వెలసిన వీరభద్రస్వామి, కాళికాదేవిల బ్రహ్మోత్సవాలు ముగిశాయి. గత నెల 28న ప్రారంభమైన ఉత్సవాలు చివరి రోజు శనివారం వసంతోత్సవంతో పూర్తయ్యాయి. ఉత్సవాలలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పూజా రి మల్లప్ప.. స్వామి వారికి గంగ, ఆకు పూజ, పంచామృతాభిషేకం, మంగళహారతులు నిర్వహించారు. అంతకుముందు తెల్లవారుజామున వీరభద్రస్వామి చెక్క గుర్రంపై ఊరేగుతున్నట్లుగా అలంకారం చేసి గ్రామంలో ఊరేగించారు. స్వాముల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో మేళతాళాలతో ఊరేగించారు. భక్తులు నందికోలు ఆట ఆడారు. అనవాయితీగా స్వాములకు రంగులు వేసి వసంతోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఒకరిపై ఒకరు రంగులు వేసుకుంటూ ఆనందోత్సవాల మధ్య వేడుకలు ముగించారు. -
తర్తూరు జాతర చూసొద్దాం రండి!
జూపాడుబంగ్లా మండలం మీదుగా వెళ్తున్న కర్నూలు–గుంటూరు రహదారికి 1.50 కిలోమీటర్ల దూరంలో తర్తూరు గ్రామం ఉంది. సుమారు 735 ఏళ్ల క్రితం గ్రామంలోని ఉల్ఫా వంశానికి చెందిన రాజారెడ్డికి తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన రంగమ్మతో వివాహమైంది. ఏటా హోలీ పున్నమినాడు దంపతులు ఇద్దరు పుట్టినిల్లు శ్రీరంగాపురంలో జరిగే శ్రీలక్ష్మిరంగనాథస్వామి ఉత్సవాలకు వెళ్లేవారు. వేడుకల అనంతరం ఆడ బిడ్డకు పుట్టింటివారు ఒడిబియ్యం పెట్టడం ఆనవాయితీగా ఉండేది. ఆ సందర్భంగా రంగమ్మకు ఒడిబియ్యం పెట్టి పండంటి బిడ్డ పుట్టాలని ఆడబిడ్డ రూపంలో ఉన్న ఓ చెక్కబొమ్మను పెట్టేవారు. తర్తూరు వచ్చిన తర్వాత రంగమ్మ పుట్టినింటి నుంచి తెచ్చిన ఒడిబియ్యాన్ని విప్పి చూడగా అందులో ఆడరూపంలో ఉన్న బొమ్మ మగరూపంలోకి మారుతుండటంతో మెట్టినింటివారు కోడలిని మందలించేవారు. ఒడిబియ్యంలోని మగరూపంలో ఉన్న చెక్కబొమ్మను పారవేసేవారు. దీంతో వారి వంశస్తులు ఎవ్వరో ఒకరు చనిపోతుండటంతో పాటు అనారోగ్యాల బారిన పడుతుండేవారు. ఇలా మూడు, నాలుగు పర్యాయాలు జరగడంతో కోపంతో వారు చెక్కబొమ్మను పశువుల గాడిలోకి విసిరివేయటంతో రంగనాథస్వామి పూనకం వచ్చి తాను శ్రీరంగనాథస్వామినని తెలిపారు. తాను తర్తూరులోనే కొలువుంటానని, తనకు ఏటా జాతర నిర్వహిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించటంతో పాటు పాడిపంటలు వృద్ధిచెందేలా చేయటంతో పాటు వంశాభివృద్ధి చెందుతుందని ఆయన ఆశీర్వదించాడు. అప్పటి నుంచి ఉల్ఫా వంశస్తులు స్వామివారు కొలువుదీరిన ఇంటితోపాటు 60 ఎకరాల పొలాన్ని స్వామివారికి దారాధత్తం చేసి ఏటా జాతర నిర్వహించేవారు. కల్యాణం శ్రీరంగాపురంలో.. శ్రీలక్ష్మీరంగనాథునికి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహించి అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తున్నప్పటికీ కల్యాణం ఇక్కడ నిర్వహించకపోవటం గమనార్హం. శ్రీలక్ష్మీరంగనాథస్వామి తెలంగాణలోని శ్రీరంగాపురం నుంచి హోలీపౌర్ణమి అనంతరం నంద్యాల జిల్లాలోని తర్తూరు గ్రామానికి చేరుకుంటాడు. ఇక్కడ స్వామివారిని పెళ్లికుమారునిగా ముస్తాబు చేసి పదిరోజులపాటు పలురకాల వాహనాలపై ఊరేగిస్తూ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తర్తూరులో పెళ్లి కుమారుడైన స్వామివారు నెల్లూరు జిల్లాలోని శ్రీరంగాపురం వెళ్లి అక్కడ శ్రీలక్ష్మీదేవి అమ్మవారితో కల్యాణం జరిపించుకుంటారని పూర్వికులు పేర్కొంటున్నారు. 13న రథోత్సవం నేటి నుంచి ప్రారంభమయ్యే తర్తూరు శ్రీలక్ష్మీరంగనాథస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 13న స్వామివారి దివ్యమంగళ రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన పూజారి ఈశ్వరరెడ్డి, ఫెస్టివల్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి తెలిపారు. కొలిచిన వారికి కొంగుబంగారం లక్ష్మీరంగనాథస్వామి నేటి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం 13న రథోత్సవం కొలిచిన వారికి కొంగుబంగారమై శ్రీలక్ష్మీరంగనాథస్వామి తర్తూరు గ్రామంలో దేదీప్యమానంగా విరాజిల్లుతున్నాడు. భక్తులతోపాటు అన్నదాతలకు ఆరాధ్యదైవమై వెలుగొందుతూ పాడిపంటలు వృద్ధిచెందేలా అన్నదాతలను ఆశీర్వదిస్తున్న రంగనాథస్వామివారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమై ఈనెల 15 వరకు కొనసాగనున్నాయి. ఈనెల 13న స్వామి వారి రథోత్సవం అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే తర్తూరు జాతరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరుంది. ఈ జాతరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని నలుమూల ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు. – జూపాడుబంగ్లా -
ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ
కర్నూలు (టౌన్): ఇంట్లో అందరూ ఉన్నారు.. తలుపు గడియ కూడా పెట్టుకున్నారు.. అయినా శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ జరిగింది. రూ. 5.5 లక్షల నగదు, 8 తులాల బంగారు అపహరణ చేశారని ఉపాధ్యాయుడు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలులోని ధనలక్ష్మీనగర్ నివసించే కడబూరు చంద్రశేఖర్ రెడ్డి కల్లూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రించాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటల సమయంలో ఇంటికి ఉన్న ప్రధాన ధ్వారం (మెయిన్ డోర్ ) పక్కన ఉన్న కిటీకీ అద్దాలు పగల కొట్టి ఒక దొంగ.. ఇంట్లోకి ప్రవేశించాడు. బెడ్రూమ్లో డ్రస్సింగ్ టేబుల్ వద్ద ఉన్న తాళాలు బీరువా తెరచి.. అందులో ఉన్న రూ.5.50 లక్షల నగదు, 8 తులాల బంగారం తీసుకొని ఉడాయించారు. ఈ విషయాన్ని గమనించిన ఉపాధ్యాయుడు.. కర్నూలు మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనం జరిగిన ఇంటిని సీఐ శేషయ్య పరిశీలించారు. వేలి ముద్రలు సేకరించారు. పక్క ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఒక దొంగ చోరీ చేసినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రూ. 5.5 లక్షల నగదు, 8 తులాల బంగారు అపహరణ -
వీకర్ సెక్షన్ కాలనీలో కార్డెన్ సెర్చ్
కర్నూలు (టౌన్): నాలుగో పట్టణ పోలీసులు స్థానిక వీకర్ సెక్షన్ కాలనీలో శనివారం కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రౌడీషీటర్లు, అనుమానితులు, ట్రబుల్ మాంగర్స్ ఇళ్లల్లో తనిఖీలు చేసి, కాలనీలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఎరుకలి నరసింహ వద్ద 20 ప్యాకెట్ల స్టోర్ బియ్యం స్వాధీనం చేసుకుని, అతనిపై కేసు నమోదు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని పది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కర్నూలు టౌన్ డీఎస్పీ బాబుప్రసాద్ మాట్లాడుతూ ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లో కర్నూలు నాలుగో పట్టణ సీఐ మధుసూదన్ గౌడ్, ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్, కోడుమూరు సీఐ తబ్రేజ్, కర్నూలు సబ్ డివిజన్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
కుటుంబంలో ఐదుగురికి అస్వస్థత
● ఆహారం విషతుల్యమే కారణమంటున్న వైద్యులు పాములపాడు: మండలంలోని ఇస్కాల గ్రామంలో ఒకే కుటుంబంలో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. ఈనెల 4న ఉదయం గ్రామానికి చెందిన సోమేశ్వరుడు, అతని తల్లి శివమ్మ, భార్య లావణ్య, కూతురు నిఖిత, కుమారుడు భరత్ సద్దన్నం (ఎగ్ రైస్, టమాటా రైస్గా చేసుకొని) తిన్నారు. వీరందరికి వాంతులు, విరేచనాలు కావడంతో స్థానిక పీహెచ్సీని ఆశ్రయించారు. డాక్టర్లు నాగలక్ష్మి, గులాబ్షా ప్రథమ చికిత్స చేసి ఆత్మకూరుకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. స్థానిక వైద్యులు నాగలక్ష్మి, గులాబ్షా మాట్లాడుతూ అస్వస్థతకు విషతుల్యమైన ఆహారం తినడమే కారణమని, అయని ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. రైలు ఢీకొని వ్యక్తి మృతి ఆదోని సెంట్రల్: పట్టణంలోని అమరావతినగర్కు చెందిన ముల్లనూర్ మొహమ్మద్(32) శనివారం రైల్వే ట్రాక్ దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొని మృతిచెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే ఎస్ఐ గోపాల్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
స్వర్ణ రథోత్సవం.. దేదీప్యమానం
శ్రీశైలంటెంపుల్: రుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో శనివారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం దేదీప్యమానంగా నిర్వహించారు. హర..హర.. మహాదేవ, ఓం నమఃశివాయ అంటూ శివనామస్మరణ చేస్తూ నీరాజనాలు సమర్పించారు. వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు చేశారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం స్వర్ణ రథంపై ఉత్సవమూర్తులను అధిష్టింపజేసి విశేషపూజలు నిర్వహించారు. ఆలయ మహాద్వారం ముందుభాగం నుంచి నంది మండపం వరకు మాడవీధుల్లో రథోత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవంలో కోలాటం, చెక్కభజన.. తదితర జానపద కళారూపాలు అలరించాయి. శ్రీశైల దేవస్థాన సహాయ కమిషనర్ ఇ.చంద్రశేఖరరెడ్డి, పండితులు, అర్చకులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.దేశ భక్తిని పెంచే రాష్ట్ర సేవికా సమితి కర్నూలు (సెంట్రల్): దేశ భక్తిని రాష్ట్ర సేవికా సమితి పెంపొందిస్తుందని సమితి ప్రాంత సహ కార్యవాహిక ఉజ్వల అన్నారు. రాష్ట్ర సేవికా సమితి ప్రారంభమై 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ సంఘం సభ్యులు సంబరాలు చేసుకున్నారు. కర్నూలు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ముఖ్య వక్తగా సమితి ప్రాంత సహ కార్యవాహిక ఉజ్వల మాట్లాడుతూ.. 90 సంవత్సరాలుగా మహిళలను చైతన్యం చేస్తూ రామాయణం, భాగవతాలను వివరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో స్వర్ణలత, అన్నయ్య, వసంతలక్ష్మి పాల్గొన్నారు. నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు కర్నూలు(అగ్రికల్చర్): వేసవి ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత నేటి నుంచి పెరుగనున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఉమ్మడి జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడటంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. శనివారం కూడా ఎండల తీవ్రత, వడగాల్పులు పెరిగాయి. కోసిగి, కర్నూలు అర్బన్, కోడుమూరు, దొర్నిపాడు, గడివేముల, కొత్తపల్లిలలో 39 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 6 నుంచి ఉమ్మడి జిల్లాలో ఎండలు, వడగాల్పుల తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ అథారిటీ ప్రకటించింది. ఉపాధి పనులకు వెళ్లే కూలీలు, రైతులు, ఇతరులు వడగాల్పుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సాయంత్రం వేళల్లో అకాల వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. -
మద్దిలేటయ్య క్షేత్రంలో భక్తుల రద్దీ
బేతంచెర్ల: శ్రీ మద్దిలేటి నరసింహస్వామి క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ కనిపించింది. చైత్ర మాసం కావడంతో నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లకు దర్శించుకున్నారు. పంచామృతాభిషేకం, కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించారు. స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజ చేయడంతోపాటు మహా మంగళహారతి ఇచ్చారు. దాతలు సహకరించాలి శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో గదులు నిర్మించిన దాతలు భక్తుల రద్దీ దృష్ట్యా సహకరించాలని ఆలయ ఉపకమిషనర్, ఈఓ రామాంజనేయులు శనివారం తెలిపారు. గతంలో దాతలకు ఏడాదిలో ఐదుసార్లు ఉచితంగా గదులను ఇచ్చేవారమన్నారు. ప్రస్తుతం పెరిగిన భక్తుల రద్దీ దృష్ట్యా పాసులను నెల ముందు పంపాలని సూచించారు. ఒక్కసారి పాసు వాడిన తరువాత మరొక పాసుకు వ్యవధి 10 వారాలు ఉండాలన్నారు. వైభవంగా వసంతోత్సవం బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో శ్రీ చౌడేశ్వరి దేవి రాయబారాది జ్యోతి మహోత్సవాలు వసంతోత్సవంతో శనివారం ముగిశాయి. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ.. ఉదయం శ్రీ చౌడేశ్వరిదేవి, శ్రీ చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి సమీపంలో ఉన్న కోనేరు వరకు వసంతోత్సవం నిర్వహిస్తూ తీసుకెళ్లారు. అనంతరం కోనేరులోని నీటితో విగ్రహాలను శుభ్రం చేసి మళ్లీ ఆలయానికి తీసుకొచ్చారు. భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేతపై హత్యాయత్నం దారుణం
● నిందితులను కఠినంగా శిక్షించాలి ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డిబొమ్మలసత్రం: వైఎస్సార్సీపీ శిరివెళ్ల మండల కన్వీనర్ ఇందూరి ప్రతాప్రెడ్డిని హత్య చేసేందుకు టీడీపీ నాయకులు యత్నించడం దారుణమని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. రామాలయంలో పూజలు చేస్తున్న వ్యక్తిని హత్య చేయాలనే ఆలోచనలు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నంద్యాల ఎస్పీ అధిరాజ్సింగ్రాణాను కోరారు. నంద్యాల పట్టణంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో కాటసాని రాంభూపాల్రెడ్డితో పాటు ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి.. ఎస్పీ కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గోవిందపల్లె గ్రామంలోని రామాలయంలో ఇందూరి ప్రతాప్రెడ్డి పూజలు చేస్తుండగా దుండగులు హత్యా యత్నానికి పాల్పడటం దారుణమన్నారు. పోలీస్ పికెట్ ఉన్న కొంత దూరంలోనే దుండగులు ఇంతటి దారుణానికి ఒడిగట్టడం బాధాకరమన్నారు. కేసును నీరుగార్చేలా, కోర్టులో ప్రతాప్రెడ్డి సాక్షాలు చెప్పకుండా భయబ్రాంతులకు గురి చేసేలా హత్యాయత్నం చేశారన్నారు. జిల్లాలో ఇప్పటికే వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నేతలు తరచూ దాడులకు పాల్పడుతూనే ఉన్నారన్నారు. వీరిపై జిల్లా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఐదుగురిపై కేసు నమోదు శిరివెళ్ల: వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఇందూరి ప్రతాపరెడ్డిపై హత్యాయత్నం ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్న పీరయ్య శనివారం తెలిపారు. గ్రామానికి చెందిన రవిచంద్రారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, లక్ష్మీరెడ్డి, రమణారెడ్డి, మరో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. ఘటనను ప్రత్యక్షంగా చూసిన కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. అండగా ఉంటాం గోస్పాడు: ఇందూరి ప్రతాపరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన ఇందూరి ప్రతాపరెడ్డిని నంద్యాల పట్టణంలోని ఉదయానంద ఆసుపత్రిలో పరామర్శించారు. -
అడుగడుగునా అన్నదాతలు దోపిడీకి గురవుతున్నారు. విత్తనాల కొనుగోలు నుంచి దిగుబడి అమ్ముకునే వరకు మాటు వేసి దోచుకుంటున్నారు. ఆరుగాలం రెక్కల కష్టంతో పండించిన దిగుబడిని అమ్ముకుందామన్నా దళారులు, వ్యాపారులు నట్టేట ముంచుతున్నారు. దళారులు కందుల కొనుగోలు కేంద్రాల నిర్
కొనుగోలు కేంద్రాల వివరాలు జిల్లా కేంద్రాలు ఇప్పటి వరకు కొనుగోళ్లు (టన్నులు) కర్నూలు 25 4,289 నంద్యాల 12 2,800 ● కందుల కొనుగోలు కేంద్రాల్లో దళారీల హల్చల్ ● రైతుల నుంచి రూ.7,200 ధరతో కొనుగోలు ● కొనుగోలు కేంద్రాల్లో రూ.7,550 మద్దతు ధరతో అమ్మకం ● దళారీల నుంచి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న మార్క్ఫెడ్ అధికారులుకొనుగోలు కేంద్రాల్లో దోపిడీ.. కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరతో అమ్ముకుందామని వెళ్లిన రైతులను నిలువునా ముంచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కందులను 50 కిలోల ప్రకారం తూకం వేస్తారు. సంచి బరువుకు అదనంగా 650 గ్రాములు తీసుకోవాలి. అయితే కొన్ని మండలాల్లో క్వింటాకు 1500 గ్రాముల వరకు అదనంగా తీసుకుంటున్నారు. అంటే క్వింటాలుకు దాదాపు 3 కిలోల వరకు అదనంగా తీసుకుంటుండటం గమనార్హం. కర్నూలు జిల్లా పత్తికొండ, నంద్యాల జిల్లా ప్యాపిలి మండలాల్లో కొనుగోలు కేంద్రాలకు దళారీల బెడద ఎక్కువగా ఉంది. అధికారులకు తెలిసినప్పటికీ చూసిచూడనట్లు పోతుండటం గమనార్హం. ప్యాపిలి మండలం బోయిన్చెర్వుపల్లి గ్రామంలో బహిరంగంగానే దళారీల నుంచి కందులు కొనుగోలు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కర్నూలు(అగ్రికల్చర్): కందుల కొనుగోలు కేంద్రాలు అక్రమాలకు కేరాఫ్గా మారాయి. మార్క్ఫెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా దళారీలు, వ్యాపారులే మద్దతు పొందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరందురూ టీడీపీ మద్దతుదారులు కావడం గమనార్హం. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కూడా దళారీల నుంచి కొనుగోలుకు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. క్వింటా ప్రకారం ఇచ్చే గుడ్విల్ కోసమేనని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కందుల ధర పడిపోయింది. ధరలు పడిపోయి రైతులు నష్టపోతున్నా.. ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టి...రేయింబవళ్లు కష్టించిన రైతుకు అంతంత మాత్రం ధర లభిస్తుండగా... దళారీలు మాత్రం ప్రయోజనం పొందుతున్నారు. 2023–24లో కందుల ధర రికార్డు స్థాయికి ఎక్కింది. 2024–25 సంవత్సరంలో కూడా ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉందని భావించిన రైతులు పెద్దఎత్తున సాగు చేశారు. 2024 డిసెంబరు నెల వరకు కూడా కందుల క్వింటాలుకు రూ.9,000 వరకు లభించింది. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ధర పతనం అయింది. కాగా వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయంటే చాలు ప్రతి గ్రామంలో దళారీలు, వ్యాపారులకు మంచి సీజన్ వంటిది. ధరలు తగ్గడం మొదలైన వెంటనే దళారీలు రైతులను భయబ్రాంతులకు గురి చేశారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పడిపోతాయి.. ఇపుడు మంచి ధర ఉంది.. అమ్మకోవాలని నమ్మించారు. వారి మాటలు నమ్మిన రైతుల నుంచి క్వింటా రూ.6,800 నుంచి రూ.7,200 వరకు మేర కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. అలా కొనుగోలు చేసిన దళారీలు ఇపుడు మార్క్ఫెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధర రూ.7,550 ప్రకారం అమ్ముకుంటున్నారు. కష్టించి పండించిన రైతుకు నష్టం రాగా.. దళారీలు మాత్రం రూపాయి పెట్టుబడి పెట్టకుండా క్వింటాపై సగటున రూ.200 నుంచి రూ.600 వరకు లాభం పొందుతున్నారు. దళారీలు నుంచి కొనుగోలు చేయడం వల్ల అధికారులకు కూడా ముడుపులు ముడుతుండటం గమనార్హం. అంతా రైతుల పేరు మీదనే.... దళారీలు/ వ్యాపారులు అంతా రైతుల పేర్ల మీదనే అమ్మకాలు సాగిస్తున్నారు. ఏఏ రైతు నుంచి కందులు కొనుగోలు చేశారో వారి నుంచి ముందు జాగ్రత్తగా ఆధార్, పట్టాదారు పాసుపుస్తకాల నకళ్లను కూడా సేకరించుకుంటున్నారు. రెండు, మూడు లారీలు సిద్ధం అయిన తర్వాత రైతుల పేరు మీదనే కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నాయి. రైతులకు తెలిసిన వారే కాబట్టి దళారీలకు సహకరిస్తున్నారు. అయితే కొనుగోలు కేంద్రానికి ఒరిజినల్ రైతులు రారు. దళారీలు వారి భూములకు సంబంధించిన వివరాలు ముందుగానే సిద్ధం చేసుకుంటున్నందున అమ్మకం ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. కందులు అమ్మిన తర్వాత నగదు రైతు ఖాతాకే జమ అవుతుంది. దళారీల నుంచే 40 శాతం కొనుగోలు కర్నూలు జిల్లాలో 25 మండలాల్లో కందుల కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది. నంద్యాల జిల్లాలో 12 మండలాల్లో జరుగుతోంది. నంద్యాల జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో దళారీలే హవా నడిపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో పత్తికొండ, దేవనకొండ, చిప్పగిరి, ఆదోని, క్రిష్ణగిరి, సి.బెళగల్ తదితర మండలాల్లో దళారీలదే పెత్తనం నడుస్తోంది. 2024–25లో ఉమ్మడి జిల్లాలో 2,65,214 ఎకరాల్లో కంది సాగు అయింది. కర్నూలు జిల్లాలో 1,58,749 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 1,06,465 ఎకరాల్లో కంది సాగు అయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2022–23, 2023–24 సంవత్సరాల్లో కందుల ధర మురిపించింది. 2023–24లో రికార్డు స్థాయిలో క్వింటాలుకు రూ.13,500 వరకు వెళ్లింది. 2024–25లో పండించిన కందులు మార్కెట్లోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గుముఖం పట్టాయి. రానున్న రోజుల్లో జరిగే కొనుగోళ్లలో 60 శాతం దళారీల నుంచే కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 3,242 మంది రైతుల నుంచి 4,289 టన్నుల కందులు కొనుగోలు చేశారు.నంద్యాల జిల్లాలో దాదాపు 2,650 మంది రైతుల నుంచి 2,800 టన్నులు కొనుగోలు చేశారు. ఇందులో 40 శాతం వరకు దళారీల నుంచి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ● పత్తికొండ మండలానికి చెందిన ఒక వ్యాపారి ఆరేడు మంది రైతుల పాసు పుస్తకాలు తీసుకెళ్లి ఒకే రోజు 200 క్వింటాళ్లకు పైగా కందులను అమ్ముకున్నారు. ఈ వ్యాపారి ఇలా చాల రోజులుగా కొనుగోలు కేంద్రంలో హల్చల్ చేశారు. ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ చేతులు తడిపినట్లు తెలుస్తోంది. ఆయన టీడీపీ నేతల మద్దతు ఉన్నట్లు సమాచారం. -
ఆయకట్టు.. పండితే ఒట్టు!
జిల్లోలో ఆయకట్టు వివరాలు... ప్రాజెక్టు, కాలువ పేరు విస్తీర్ణం ఎకరాల్లో.. కేసీకేసీ కెనాల్ 3,763 తుంగభద్ర దిగువ కాలువ 1,51,134 ఆలూరు బ్రాంచ్ కెనాల్ 14,255 హంద్రీనీవా కాలువ 60,000 గాజులదిన్నె ప్రాజెక్టు 24,372 చిన్న నీటిపారుదల శాల పరిధి 27,707 ఎత్తిపోతల పథకాల కింద 20,000● నీటి మూటలైన టీడీపీ నేతల హామీలు ● పూర్తికాని సాగునీటి పథకాలు ● అరకొర సాగునీటి విడుదల ● పొలాల్లో ఎండుతున్న పంటలు కర్నూలు సిటీ: తాము అధికారంలోకి వస్తే రాయలసీమలో పెండింగ్ సాగుప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు హామీ ఇచ్చారు. గాలేరు– నగరి, హంద్రీ– నీవా ప్రాజెక్టుల్లో పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని మెనిఫేస్టోలో ప్రకటించారు. ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని బహిరంగంగా ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ మరచిపోయారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. రైతులకు ఇచ్చిన మాటలు నీటిమూటలయ్యాయి. సాగునీరు అందక కళ్ల ముందే పంటలు ఎండుతుండటంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రైతుల క‘న్నీటి’ కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తాత్కాలిక బడ్జెట్, వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టినా సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులో మొండిచేయి చూపారు. ఇదీ దుస్థితి.. ● తుంగభద్ర నదిలో నీటి లభ్యత ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ఆయకట్టుకు కేటాయించిన నీటిని అందించలేకపోయారు. ● ఈ ఏడాది తుంగభద్ర దిగువకాలువకు 22.47 టీఎంసీలు కేటాయించారు. కేటాయింపులో తాగు నీటికి పోగా.. 18 టీఎంసీలకుపైగా ఆయకట్టుకు అందించాలి. జలవనరుల శాఖ అధికారుల గణాంకాల ప్రకారమే ఖరీఫ్, రబీలో సగం ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేకపోయారు. ● టీబీ డ్యాంలో 2 టీఎంసీలకుపైగా నీటి వాటా ఉంది. సకాలంలో వినియోగించుకోకపోవడంతో ఆ నీటిని సైతం కోల్పోయే పరిస్థితులు వచ్చాయి. ● తుంగభద్ర దిగువ కాలువ కింద ఆయకట్టుకుప్రస్తుతం నీటిని బంద్ చేశారు. కేవలం తాగుకు మాత్రమే ఈ నెల 10 వరకు కాలువకు నీరు ఇస్తున్నారు. ● తుంగభద్ర జలాశయం నుంచి కేసీ కెనాల్కు 9.363 టీఎంసీల నీరు కేటాయించారు. ఇందులో 3.5 టీఎంసీల నీరు హెచ్చెల్సీకి మళ్లించారు. మిగిలిన నీటిలో గత నెలలో 1.61 టీఎంసీలు విడుదల చేస్తే జిల్లాకు 0.6 టీఎంసీ నీరు కూడా చేరలేదు. దీంతో జిల్లా పరిధిలోని కేసీ ఆయకట్టుకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ● శ్రీశైల జలాలపై ఆధారపడిన హంద్రీ– నీవా కాలువకు సమృద్ధిగా నీరు ఇవ్వడం లేదు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా గత నెల రెండో వారానికి నీటిని బంద్ చేశారు. హంద్రీ– నీవా కాలువ వెంబడి సాగు చేసిన రైతులు, హాలహర్వి మండలంలోని చింతకుంట గ్రామంలో సుమారు 600 ఎకరాలకుపైగా వరి పంటను కోల్పోయారు. ● గాజులదిన్నె ప్రాజెక్టుకు కేటాయించిన 3 టీఎంసీలు ఇవ్వలేకపోయారు. హంద్రీ– నీవా కాలువ నుంచి కూడా మూడు నెలలు ఆలస్యంగా గాజులదిన్నె ప్రాజెక్టుకు నీరు ఇచ్చారు. దీంతో 24 వేల ఎకరాల్లో సగం ఆయకట్టుకే నీటిని సరిపెట్టారు. కష్టాలు ఇవీ.. ఖరీఫ్లో భారీ వర్షాలు కురిసి సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు చేరినప్పటికీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు. దీంతో ఆయకట్టులో చివరి దశలో ఉన్న పంటలు ఎండిపోయాయి. రైతులకు క‘న్నీటి’ కష్టాలు మిగిలాయి. గ్రామీణ ప్రాంతాలకు గుక్కెడు తాగునీటిని ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. నీటి వనరుల కొరతతో రైతులు, ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలో వేలాది కుటుంబాలు పొట్టచేత పట్టుకొని వలసలు పోతున్నాయి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు చేపట్టిన వేదావతి ప్రాజెక్టుకు భూసేకరణ సమస్య వేధిస్తోంది. పనులు వేగంగా చేసేందుకు ఏజేన్సీ ఆసక్తి చూపడం లేదు. ఆర్డీఎస్ కుడి కాలువకు సైతం భూసేకరణ సమస్య ఉంది. పక్క రాష్ట్రం ఫిర్యాదుతో పనులు జరగడం లేదు. బడ్జెట్ రావాల్సి ఉంది ఇటీవలే వేదావతి ప్రాజెక్టుకు కొంత బడ్జెట్ కేటాయించారు. ఆర్థిక సంవత్సరం మొదలైంది. బడ్జెట్ వస్తే పనుల విషయం తెలుస్తుంది. తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టుకు నీరొస్తుంది. కేసీ పరిధిలో 0 నుంచి 120 కి.మీ వరకు రబీ ఆయకట్టు లేదు. అయినా కొన్ని తడులకు నీరిచ్చాం. – కబీర్ బాషా, సీఈ, జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్సు -
బాబూ జగ్జీవన్రామ్ ఆశయ సాధనకు కృషి
కర్నూలు(అర్బన్): డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ ఆశయ సాధనకు, సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య పిలుపునిచ్చారు. శనివారం బాబూ జగ్జీవన్రామ్ 118వ జయంతి సందర్భంగా స్థానిక ఆర్ఎస్ రోడ్డులోని ఆయన విగ్రహానికి పెద్ద సంఖ్యలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిస జయంతి సభలో జేసీతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జె.రంగలక్ష్మిదేవి, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, డీఎస్పీ మహబూబ్బాషా తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో కోడుమూరు, పాణ్యం ఎమ్మెల్యేలు బొగ్గుల దస్తగిరి, గౌరు చరితారెడ్డి, మాజీ మంత్రి ఎం.మారెప్ప పాల్గొన్నారు. జేసీ నవ్య మాట్లాడుతూ నేటి విద్యార్థులు కూడా జగ్జీవన్రామ్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మనిషి అభివృద్ధికి పేదరికం అడ్డురాదని జగ్జీవన్రామ్ నిరూపించారన్నారు. ఆయన పేదరికాన్ని అధిగమించి బనారస్ విశ్వ విద్యాలయం నుంచి పట్టభద్రులు అయ్యారన్నారు. సుదీర్ఘకాలం కేంద్రంలో అనేక మంత్రిత్వ శాఖలను నిర్వహించి ఆయా శాఖల్లో తనదైన ముద్రను వేశారన్నారు. ● పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ బాబూ జగ్జీవన్రామ్ గొప్ప సంఘ సంస్కర్త అన్నారు. 40 సంవత్సరాలు ఓటమి ఎరుగని నాయకుడిగా ఆయన దేశంలోనే గుర్తింపు పొందారన్నారు. ఆయన కుమార్తె మీరా కుమారి పార్లమెంట్ స్పీకర్గా ఉండి తన ప్రతిభనుచ కనబరిచారన్నారు. ● కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ అంటరానితనం పోవాలని పోరాటాలు నిర్వహించిన దళిత ముద్దు బిడ్డ జగ్జీవన్రామ్ అని కొనియాడారు. 1937లో అతి చిన్న వయస్సులోనే బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారన్నారు. ● ఇదిలాఉంటే ఉత్సవాలకు తనకు ఆహ్వానం లేదని మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్బాబు అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వేదిక ఎక్కకుండా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుర్చీలోనే కూర్చొన్నారు. కార్యక్రమంలో ప్రజా, దళిత సంఘాల నాయకులు సోమసుందరం మాదిగ, అనంతరత్నం మాదిగ, రాజ్కుమార్, వేల్పుల జ్యోతి, నాగేశ్వరి, ఎన్సీహెచ్ బజారన్న, ఆర్.కై లాస్నాయక్, ఆర్.చంద్రప్ప, ఎం.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
జీవం పోసి.. జీవితం చాలించి!
కోసిగి: పేదరికం ఆమె పాలిట శాపంగా మారింది. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినా ఆమె బతకలేకపోయారు. కనీసం బిడ్డను చూడకుండానే మృతిచెందారు. ఈ దుర్ఘటన కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. కోసిగి మండలం డి.బెళగల్ గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ (22)తో ఆదోని మండలం సంతెకుడ్లూరు గ్రామానికి చెందిన హెబ్బటం రమేష్తో రెండేళ్ల క్రితం వివాహమైంది. మెదటి కాన్పు నిమిత్తం ఆమె ఐదో నెల క్రితం పుట్టినిల్లు డి.బెళగల్ గ్రామానికి వెళ్లారు. తల్లిదండ్రులు పేదలు కావడంతో బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. పుంటింట్లో ఆమె తోడుగా తమ్ముడు మాత్రమే ఉండేవారు. ఆమెకు సరైన పోషకాహారం అందేది కాదు. గర్భంతో ఉన్నా ప్రతి రోజూ ఆమె కూలి పనులకు వెళ్లేవారు. ఇటీవల జరిగిన ఉగాది పండుగకు తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున నాగేంద్రమ్మకు పురిటి నొప్పులు రావడంతో కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. సురక్షిత కాన్పు జరిగి మగ శిశువుకు ఆమె జన్మిచ్చింది. కాన్పు వెంటనే ఆమెకు ఫిట్స్ రావడంతో కోలుకోలేక మృతి చెందినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మనోజ్కుమార్ తెలిపారు. బిడ్డ ముఖం చూడకుండా తల్లి మృతిచెందడంలో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమైయ్యారు. ఆమె మృతదేహాన్ని సంతెకుడ్లూరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. పేదరికంతో గర్భిణికి అందని పౌష్టికాహారం బిడ్డకు జన్మనిచ్చి తనువుచాలించిన మహిళ -
అకాల వర్షం.. అపార నష్టం
కర్నూలు(అగ్రికల్చర్)/నంద్యాల (అర్బన్): పొలంలో చేతికొచ్చిన పంటలు నీటమునిగాయి. కల్లాల్లో అమ్మకానికి ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కాయలతో కళకళలాడుతూ ఉండే అరటి, మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. పసుపు పంట పూర్తిగా పనికిరాకుండా పోయింది. అకాల వర్షంతో రైతుల రెక్కల కష్టం నేలపాలైంది. అన్నదాతల్లో ధైర్యం తొలగి దైన్యమే మిగిలింది. గురువారం మధ్యాహ్నం నుంచి మొదలైన అకాల వర్షాల ప్రభావం శుక్రవారం ఉదయం వరకు కొనసాగింది. ఉరుములు, మెరుపులు, పెనుగాలులతో కురిసిన అకాల వర్షాలతో మిర్చి, ఉల్లి, అరటి, వరి, మినుము పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఏ పంటలు ఎలా దెబ్బతిన్నాయంటే.. ● కర్నూలు జిల్లాలో కోడుమూరు, సి.బెళగల్, గోనెగండ్ల, చిప్పగిరి మంత్రాలయం తదితర ప్రాంతాల్లో మిర్చి చివరి దశలో ఉంది. పలు ప్రాంతాల్లో రైతులు మిర్చిని పొలాల్లోనే ఆరబెట్టుకున్నారు. ఊహించని విధంగా వర్షాలు పడటంతో మిర్చి పంట పూర్తిగా తడిచిపోయింది. ● ఇటీవలి వరకు ఉల్లి ధరలు ఆశాజనకంగా ఉండటంతో లేట్ రబీలో ఈ పంట ఎక్కువగా సాగు చేశారు. కోసి ఆరబెట్టిన ఉల్లిని వర్షాలు తడిపేశాయి. ● గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎమ్మిగనూరు మండలంలో అరటి భారీగా నేల కూలింది. అయితే ఉద్యాన అధికారులు 5 హెక్టార్లలోనే అరటి దెబ్బతిన్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ● సి.బెళగల్ మండలంలో మునగ, కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. అయితే అధికారులు మాత్రం మునగ ఒక హెక్టారు, కూరగాయల పంటలు ఒక హెక్టారులో దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. వ్యవసాయ పంటలకు ఎటువంటి నష్టం లేదని ప్రకటించారు. ● నంద్యాల జిల్లాలో రబీ సీజన్లో వరి ఎక్కువగా సాగైంది. ప్రస్తుతం పాల కంకి దశలో ఉంది. బండిఆత్మకూరు, గడివేముల, మహానంది, వెలుగోడు మండలాల్లో 5 వేల హెక్టార్లలో వరి దెబ్బతినింది. అయితే వ్యవసాయ అధికారులు మాత్రం 2,158 హెక్టార్లు అని గుర్తించారు. అలాగే మినుము 10 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. ● నంద్యాల జిల్లాలో అరటి కూడా భారీగా దెబ్బతినింది. సంజామల మండలంలోని నొస్సం, గిద్దలూరు, రామభద్రునిపల్లి గ్రామాల్లో అరటి తోటలు ఎక్కువగా ఉన్నాయి. వర్షాలు, గాలి తీవ్రతకు అరటి తోటలు నేల కూలాయి. ఉద్యాన అధికారులు 16.8 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. ● ఉమ్మడి కర్నూలు జిల్లాలో మామిడి ఈ సారి నిరాశాజనకంగా ఉంది. అంతంతమాత్రం ఉన్న కాపు గాలుల తీవ్రత, వర్షాలుకు నేల రాలిపోయింది. బేతంచెర్ల, ఓర్వకల్లు, ప్యాపిలి, డోన్, గోనెగండ్ల, సి.బెళగల్ తదితర మండలాల్లో పెనుగాలులకు మామిడి చెట్లు, కాయలు నేల రాలాయి. అయినా ఉద్యానశాఖ అధికారులు పరిగణనలోకి తీసుకోకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి అధికార అంచనా 2,158 హెక్టార్లు మాత్రమే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నేలకొరిగిన అరటి తోటలు పాడైపోయిన మిర్చి, ఉల్లి పంటలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందేనా?వర్షపాతం వివరాలు (మి.మీ).. మండలం వర్షపాతం వెలుగోడు 56.8 కోడుమూరు 46.4 నందికొట్కూరు 46.2, సి.బెళగల్ 37.8 బండిఆత్మకూరు 37.0 సంజామల 30.6 మిడుతూరు 26.4 మహానంది 25.2 కొలిమిగుండ్ల 24.2 గోనెగండ్ల 24.2 కర్నూలు అర్బన్ 23.6 చిప్పగిరి 22.8 ప్యాపిలి 22.4 -
70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆరోగ్య బీమా
కర్నూలు(అర్బన్): కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎంజేఏవై (ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన) వయో వందనలో భాగంగా 70 ఏళ్లు దాటిన వయో వృద్ధులకు రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమాను వర్తింపజేయనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ఫాతిమా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 02వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. మొబైల్ ఫోన్ అప్లికేషన్ (ఆయుష్మాన్ యాప్) లేదంటే వైబ్సైట్ పోర్టల్ beneficiary.nha.gov.inతో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆయుష్మాన్ కార్డుల జారీకి ఆధార్ ఆధారిత ఈ–వేవైసీ తప్పనిసరి తెలిపారు. వన్టైం ఆప్షన్ ద్వారా ఈ పథకంలో చేరేందుకు అవకాశాన్ని కల్పిస్తారని పేర్కొన్నారు. 50 శాతం సబ్సిడీతో స్ప్రింక్లర్లు కర్నూలు(అగ్రికల్చర్): రైతులకు 2025–26 సంవత్సరానికి సంబంధించి 50 శాతం సబ్సిడీతో స్ప్రింక్లర్లు అందజేయనున్నట్లు ఏపీఎంఐపీ అధికారులు తెలిపారు. అలాగే ఐదు ఎకరాలలోపు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీపై సూక్ష్మ సేద్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ఇందులో కేంద్రప్రభుత్వం వాటా 33 శాతం ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం 67 శాతం భరిస్తుందని తెలిపారు. ఇతర సన్న, చిన్నకారు రైతులకు ఐదు ఎకరాల వరకు 90 శాతం సబ్సిడీపై సూక్ష్మ సేద్యం కల్పిస్తారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. బాల్య వివాహాలు నేరం ● ఐసీడీఎస్ పీడీ పి.నిర్మల కర్నూలు(అర్బన్): బాల్య వివాహాలు చేయడం నేరమని, చట్టం ప్రకారం రూ.లక్ష జరిమానాతో పాటు రెండు సంవత్సరాల శిక్ష ఉంటుందని ఐసీడీఎస్ పీడీ పి.నిర్మల పేర్కొన్నారు. బి.క్యాంప్లోని ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్ట్ కార్యాలయంలో బాల్య వివాహాల నిర్మూలనపై శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని 102 సచివాలయాల మహిళా పోలీసులు, అర్బన్ ఐసీడీఎస్ సూపర్వైజర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కిశోర బాలికల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి సచివాలయంలో మహిళా పోలీసులను నియమించారన్నారు. అర్బన్ సీడీపీఓ అనురాధ మాట్లాడుతూ.. చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమస్యలు వస్తే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098కి తెలియజేయాలని జిల్లా బాలల పరిరక్షణ అధికారి టి.శారద అన్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్లు, డీసీపీయూ సిబ్బంది శ్వేత, కీర్తి, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు. డీబీసీడబ్ల్యూఈఓగా కె.ప్రసూన కర్నూలు(అర్బన్): జిల్లా బీసీ సంక్షేమం, సాధికారత అధికారిణిగా కె.ప్రసూనను నియమిస్తూ బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎ.మల్లికార్జున ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ సంక్షేమ శాఖలో ఇటీవల జరిగిన పదోన్నతుల్లో భాగంగా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో సహాయ బీసీ సంక్షేమాధికారిగా విధులు నిర్వహిస్తున్న ప్రసూనకు డీబీసీడబ్ల్యూఈఓగా పదోన్నతి కల్పిస్తూ కర్నూలుకు నియమించారు. ఇక్కడ రెగ్యులర్ డీబీసీడబ్ల్యూఈఓగా విధులు నిర్వహించిన పి.వెంకటలక్షుమ్మను నెల్లూరుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు ఇన్చార్జి డీబీసీడబ్ల్యూఈఓగా వ్యవహరించారు. ప్రసూన ఈ నెల 7, 8 తేదిల్లో ఇక్కడ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. డైట్ కాలేజీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు సిటీ: ప్రభుత్వ డైట్ కాలేజీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ఫారిన్ సర్వీస్ కింద డిప్యూటేషన్ ద్వారా భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఖాళీల వివరాలు www.deokml13.blogspot.comలో చూసుకోవచ్చునని తెలిపారు. దరఖాస్తూను హెచ్ఎం, ఎంఈఓ, డిప్యూటీ డీఈఓలతో ధ్రువీకరించి, బి.తాండ్రపాడులోని ప్రభుత్వ డైట్ కాలేజీలో అందజేయాలన్నారు. -
ఎన్నో సమస్యలతో.. ప్రమాదాల బారిన.. దిక్కులేని స్థితిలో మరణిస్తే, ఆ తర్వాత కూడా మరో చావు కళ్ల ముందు కనిపిస్తోంది. ఇంతటితో విముక్తి పొందినాం అనుకునేందుకు వీలులేకుండా ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. అందరినీ దుఃఖసాగరంలో ముంచిపోయాం అనే బాధకంటే.. చచ్చినా ఏడుపు తప్ప
పోస్టుమార్టం నిర్వహించడమే మా పని మార్చురీకి వచ్చిన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడమే ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యుల బాధ్యత. మార్చురి నిర్వహణ అంతా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ చూసుకోవాలి. అయినా వాక్ ఇన్ కూలర్ రిపేరికి చర్యలు తీసుకున్నాం. రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి వస్తుంది. – డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రిన్సిపల్, కేఎంసీ, కర్నూలు ఫోరెన్సిక్ మెడిసిన్ పరిధిలోనే మార్చురీ మార్చురీ వ్యవహారమంతా కర్నూలు మెడికల్ కాలేజీలోని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం పరిధిలోనే ఉంటుంది. నిర్వహణ బాధ్యత పూర్తిగా వారిదే. మాకు సంబంధం లేదు. బాడీ ఫ్రీజర్లు, వాక్ ఇన్ కూలర్లు పనిచేయించేందుకు ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడితో మాట్లాడి పరిష్కరిస్తా. – డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, జీజీహెచ్, కర్నూలు జీజీహెచ్ మార్చురీలో పనిచేయని ఫ్రీజర్లు ● రోజూ ఆరు నుంచి పది మృతదేహాలకు పోస్టుమార్టం ● నెలలో ఐదు వరకు అనాథ మృతదేహాలు ● ఫ్రీజర్లు లేకపోవడంతో కుళ్లుతున్న శవాలు ● మార్చురీ చుట్టుపక్కల భరించలేని దుర్గంధం ● ఎవరికీ పట్టని మార్చురీ నిర్వహణ కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు చుట్టుపక్క జిల్లాల్లో ఎక్కడ ప్రమాదాలు, ఆత్మహత్యలు చేసుకున్నా పోస్టుమార్టం కోసం కర్నూలు మార్చురీకే తీసుకొస్తారు. ప్రతిరోజూ ఆరు నుంచి 10 వరకు మృతదేహాలకు ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తారు. ఇందుకు ఆరు నుంచి 32 గంటల సమయం పడుతుంది. ఘటన జరిగిన ప్రాంతానికి సంబంధించిన పోలీసులు వచ్చి పంచనామా చేసి ఆ నివేదికను ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులకు ఇస్తే అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అప్పగిస్తారు. పోస్టుమార్టం నిర్వహించేంత వరకు మృతదేహాలు కుళ్లిపోకుండా ఉండేందుకు వాటిని బాడీ ఫ్రీజర్లలో భద్రపరుస్తారు. నెలకు నాలుగు నుంచి ఆరు అనాథ మృతదేహాలను వీటిలోనే ఉంచుతారు. మార్చురీలో ఒక వాక్ ఇన్ కూలర్ ఉంది. అందులో 10 నుంచి 15 మృతదేహాలను భద్రపరచవచ్చు. ఇది కాకుండా మూడు బాడీ ఫ్రీజర్లు ఉండగా.. 18 మృతదేహాలను ఉంచవచ్చు. కానీ ప్రస్తుతం ఇవన్నీ పనిచేయని పరిస్థితి. వాక్ ఇన్ కూలర్ ఏడాది కాలంగా పనిచేయడం లేదు. ఒక బాడీ ఫ్రీజర్ రెండు నెలలుగా, మరో బాడీ ఫ్రీజర్ 15 రోజులుగా, ఇంకో బాడీ ఫ్రీజర్ రెండు రోజులుగా పనిచేయడం లేదని తెలుస్తోంది. శవాలు కుళ్లికంపుకొడుతున్నాయి మార్చురీలో వాక్ ఇన్ కూలర్, బాడీ ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో వాటిని మూలనపడేశారు. దీంతో మార్చురీకి వచ్చిన మృతదేహాలను సెప్టిక్ మార్చురీలో ఉంచుతున్నారు. దాదాపుగా మెడికో లీగల్ కేస్ మృతదేహాలన్నింటికీ 24 గంటల్లోపు పోస్టుమార్టం పూర్తవుతుంది. సుదూర ప్రాంతాల నుంచి పోలీసులు రావాల్సి ఉన్న పరిస్థితిలో 36 నుంచి 48 గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. అటువైపు వెళ్లాలంటే నరకం చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం చేయించుకుని తీసుకెళ్లేందుకు వచ్చిన కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో పాటు పంచనామా చేయడానికి వచ్చిన పోలీసులతో మార్చురీ నిత్యం కిటకిటలాడుతుంది. ప్రస్తుతం మార్చురీ కుళ్లిన కంపు వాసన వస్తుండటంతో వారు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ దుర్వాసన మరింత ఎక్కువ అవుతోంది. పోస్టుమార్టం ముగిసి మృతదేహాన్ని తీసుకెళ్లేంత వరకు ఈ నరకం తప్పడం లేదు. అనాథ మృతదేహాలకు దిక్కేలేదు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు చుట్టుపక్క ప్రాంతాల నుంచి మార్చురీకి అనాథ మృతదేహాలు ప్రతి నెలా నాలుగు నుంచి ఆరు దాకా వస్తుంటాయి. నిబంధనల మేరకు వీటిని కుటుంబసభ్యుల కోసం మూడు రోజుల పాటు మార్చురీలో ఉంచి ఆ తర్వాత అనాథ మృతదేహాలుగా పరిగణించి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఈ మేరకు గతంలో ఆసుపత్రి సూపరింటెండెంట్తో ఒక వ్యక్తి కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. ఒక్కో అనాథ మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. అయితే ఒక్కో మృతదేహం తీసుకెళ్తే గిట్టుబాటు కావడం లేదని.. ఒకేసారి మూడు, నాలుగు అనాథ మృతదేహాలు తోడయ్యాక తీసుకెళ్తున్నారు. ఈ కారణంగా వాటిని తీసుకెళ్లేందుకు నెలరోజుల సమయం పడుతోంది. అప్పటి వరకు మార్చురీలో శవాలు కుళ్లి కంపుకొడుతున్నాయి. కొన్నిసార్లు పురుగులు పట్టిపోతుండటం గమనార్హం.ఎవ్వరికీ పట్టని మార్చురీ మృతదేహాలు ప్రభుత్వాసుపత్రి నుంచి వస్తాయి. మార్చురీ సైతం ప్రభుత్వాసుపత్రి ఆవరణలోనే ఉంది. పోస్టుమార్టం నిర్వహించేది మాత్రం కర్నూలు మెడికల్ కాలేజిలోని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం వైద్యులు. ఈ కారణంగా మార్చురీ నిర్వహణ ఎవరు చేయాలన్నది కొన్ని దశాబ్దాలుగా అంతుబట్టడం లేదు. ఫలితంగా మార్చురిలో మృతదేహాలను పోస్టుమార్టంకు సిద్ధం చేసేందుకు అవసరమైన సహాయకుల పోస్టులు మంజూరు కాని పరిస్థితి. ప్రస్తుతం అనధికారికంగా ముగ్గురు వ్యక్తులు సహాయకులుగా పనిచేస్తున్నారు. వీరికి జీతాలను వైద్యులే సమకూరుస్తున్నారు. -
‘ఈ–శ్రమ్’తో అసంఘటిత కార్మికుల గుర్తింపు
కర్నూలు(అర్బన్): అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల పేర్లను ఈ– శ్రమ్ పోర్టల్లో నమోదు చేయించాలని ఏపీ ప్రభుత్వ కర్మాగార, బాయిలర్స్, బీమా, మెడికల్ సర్వీసెస్ అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన కార్మిక శాఖ ఉప కమిషనర్లు, సహాయ కమిషనర్లు, సహాయ కార్మిక శాఖ అధికారులు, ఫ్యాక్టరీల యజమానులు, సీఐటీయు, ఏఐటీయుసీ కార్మిక సంఘాల నాయకులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గంధం చంద్రుడు మాట్లాడుతూ ఏదైనా సంస్థలో పది కంటే ఎక్కువ మంది కార్మికులు పని చేస్తుంటే, వారి నెల జీతం రూ.21 వేల లోపు ఉంటే ఈఎస్ఐ చట్టం కింద పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. కార్మిక, కర్మాగారాల, బీమా, మెడికల్ సర్వీసెస్ శాఖల సమన్వయంతో అర్హత ఉన్న కార్మికుల పేర్లను రాబోవు రెండు నెలల్లో పేర్లను నమోదు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా బాల కార్మికులు పని చేస్తుంటే వారికి చట్ట ప్రకారం రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమలు, కర్మాగారాల్లో పనిచేసే మహిళలకు కనీసం మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి కర్మాగారాలను గుర్తించి మరుగుదొడ్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కర్నూలు జోన్ సంయుక్త కార్మిక కమిషనర్ యం బాలునాయక్, విజయవాడ సంయుక్త కమిషనర్లు ఎస్ లక్ష్మినారాయణ, ఏ గణేషన్, సహాయ కార్మిక కమిషనర్ ఆదినారాయణ, ఉమ్మడి నాలుగు జిల్లాల ఉప కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. కార్మికుల పేర్లను నమోదు చేయాలి ఏపీ ప్రభుత్వ కార్మిక శాఖ అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు -
ఎకై ్సజ్లో 44 మందికి ఎస్ఐలుగా అడ్హాక్ పదోన్నతి
కర్నూలు: ఎకై ్సజ్ శాఖ ఫోర్త్ జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న ఎస్ఐ పోస్టులను భర్తీ చేస్తూ ఆ శాఖ నోడల్ అధికారి (డిప్యూటీ కమిషనర్) శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తున్న 29 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 15 మంది క్లర్కులకు అడ్హాక్ పద్ధతిలో పదోన్నతి కల్పించి బదిలీల్లో భాగంగా వారికి స్టేషన్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ మహిళా ఎస్ఐలకు సంబంధించి మరో నాలుగు పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీరి సీనియారిటీ జాబితా త్వరలోనే రూపొందించి ఆయా పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి తెలిపారు. పదోన్నతి పొందిన వారందరికీ శుక్రవారం మధ్యాహ్నం తన కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ప్రమోషన్తో పాటు పోస్టింగ్ కాపీ అందజేశారు. స్టేషన్లు కేటాయిస్తూ నోడల్ అధికారి ఉత్తర్వులు ఉమ్మడి జిల్లాలో 12 మందికి స్థానచలనం -
రైతు ఆత్మహత్యలకు ఎన్డీఏ సర్కారే కారణం
కర్నూలు(సెంట్రల్): దేశంలో రైతు ఆత్మహత్యలకు ఎన్డీఏ సర్కార్ విధానాలే కారణమని కేరళ వ్యవసాయ శాఖమంత్రి ప్రసాదు అన్నారు. శుక్రవారం కర్నూలులోని లక్ష్మీనరసింహ కల్యాణ మండపంలో ఏపీ రైతు సంఘం గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య అధ్యక్షతన జాతీయ రైతు సదస్సును నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా కేరళ వ్యవసాయ శాఖమంత్రితో పాటు ఏపీ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాదు మాట్లాడుతూ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ దొడ్డిదారిలో రైతు వ్యతిరేక చట్టాల అమలుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేరళ భూసంస్కరణల్లో సీపీఐ కీలకపాత్ర పోషించిందని, మార్కెటింగ్ విధానంతో రైతులకు కేరళ ప్రభుత్వ అండగా ఉందని చెప్పారు. ● మాజీ మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఏపీలో రైతుల స్థితిగతులు అగమ్యగోచరంగా ఉన్నాయన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. మిర్చి సాగుచేసిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. అన్నదాతలు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం అన్యాయమన్నారు. ● ఏపీ రైతు సంఘం గౌరవాధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం మాట్లాడుతూ ఏపీలో అమల్లో ఉన్న ప్రభుత్వం రైతులను తీవ్రంగా మోసం చేస్తోందని విమర్శించారు. ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. ● సమావేశంలో మాజీ మంత్రి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు. -
కుంటలో విద్యుత్ తీగ పడి..
కొత్తపల్లి: కుంటలో నీళ్లు తాగేందుకు వెళ్లి ఓ గేదె, రెండు నక్కలు మృత్యువాత పడ్డాయి. బావాపురం గ్రామానికి చెందిన వెంకటరెడ్డి అనే రైతుకు చెందిన గేదె గురువారం సాయంత్రం ఇంటి నుంచి మేత మేసేందుకు పొలాల్లోకి వెళ్లి రాత్రి అయినా తిరిగి రాలేదు. శుక్రవారం ఉదయాన్నే రైతు గేదె కోసం గాలిస్తుండగా గ్రామ పొలిమేరలోని కురుకుంద చెరువు అలుగు వాగులో గేదె, పక్కనే మరో రెండు నక్కలు కూడా మృత్యువాత పడినట్లు గమనించాడు. వాగులో విద్యుత్ తీగ పడి ఉండటంతో విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు భావించాడు. గురువారం సాయంత్రం మండలంలో ఈదురుగాలులతో కూడిన చిన్నపాటి వర్షం కురిసింది. ఈ ఈదురుగాలులకు పొలాల్లోని విద్యుత్ తీగ తెగి వాగులోని నీటి కుంటలో పడింది. దీంతో నీరు తాగేందుకు వెళ్లిన గేదె, నక్కలు విద్యుత్ షాక్తో మృత్యువాతతో చనిపోయినట్లు తెలుస్తోంది. గేదె, రెండు నక్కలు మృత్యువాత -
రైల్వే సామగ్రి చోరీ కేసులో ఐదుగురు అరెస్ట్
● 1.5 టన్నుల బరువైన 240 ఇనుప రాడ్లు స్వాధీనం● పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపుమహానంది: గాజులపల్లె రైల్వేస్టేషన్ సమీపంలో ఇటీవల రైల్వే ఇనుప సామగ్రిని చోరీ చేసిన కేసులు శుక్రవారం ఐదుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గత నెల 31న గాజులపల్లె ఆర్ఎస్ సమీపంలో కిలో మీటర్ మేరకు రైల్వేట్రాక్కు సపోర్టుగా ఏర్పాటు చేసిన ఇనుప బారికేడ్లను తొలగించి అపహరించారు. వీటి విలువ సుమారు రూ. 1.10 లక్షలు ఉంటుంది. సైట్ ఇంజనీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం సీతారామాపురం సమీపంలో కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద అనుమానాస్పదంగా ఉన్న గోపవరం గ్రామానికి చెందిన పిన్నాపురం తిరుమలేసు, నాగసరపు అశోక్, మాచర్ల ఆదికేశవ, షేక్ సద్దాంహుసేన్, శివను అదుపులోకి విచారించగా చోరీ వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి 1.5 టన్నుల బరువున్న 240 ఇనుపరాడ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. వారిని నంద్యాల జేఎఫ్సీఎం కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించారన్నారు. మరో నిందితుడు విక్రమ్ను పరారీలో ఉన్నాడని, త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. -
కుంటలో విద్యుత్ తీగ పడి..
కొత్తపల్లి: కుంటలో నీళ్లు తాగేందుకు వెళ్లి ఓ గేదె, రెండు నక్కలు మృత్యువాత పడ్డాయి. బావాపురం గ్రామానికి చెందిన వెంకటరెడ్డి అనే రైతుకు చెందిన గేదె గురువారం సాయంత్రం ఇంటి నుంచి మేత మేసేందుకు పొలాల్లోకి వెళ్లి రాత్రి అయినా తిరిగి రాలేదు. శుక్రవారం ఉదయాన్నే రైతు గేదె కోసం గాలిస్తుండగా గ్రామ పొలిమేరలోని కురుకుంద చెరువు అలుగు వాగులో గేదె, పక్కనే మరో రెండు నక్కలు కూడా మృత్యువాత పడినట్లు గమనించాడు. వాగులో విద్యుత్ తీగ పడి ఉండటంతో విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు భావించాడు. గురువారం సాయంత్రం మండలంలో ఈదురుగాలులతో కూడిన చిన్నపాటి వర్షం కురిసింది. ఈ ఈదురుగాలులకు పొలాల్లోని విద్యుత్ తీగ తెగి వాగులోని నీటి కుంటలో పడింది. దీంతో నీరు తాగేందుకు వెళ్లిన గేదె, నక్కలు విద్యుత్ షాక్తో మృత్యువాతతో చనిపోయినట్లు తెలుస్తోంది. గేదె, రెండు నక్కలు మృత్యువాత -
సిల్వర్ జూబ్లీ ప్రవేశాలకు 6 నుంచి దరఖాస్తులు
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని సిల్వర్జూబ్లీ డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకు సిల్వర్సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.వి.ఎస్.కుమార్ శుక్ర వారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ ఏపీ విభజన తరువాత రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు మాత్రమే ఈ ఏడాది నుంచి కళాశాలలో ప్రవేశం కల్పిస్తున్నామన్నారు. ఈ నెల 6 నుంచి 30వ తేదిలోపు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. వచ్చే నెల 18న అర్హత పరీక్ష నిర్వహిస్తామన్నారు. 280 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆన్లైన్ ద్వారా అర్హత పరీక్ష నిర్వహిస్తామని, పూర్తి వివరాలకు https://cuklap.ac.in,https://www.sjgckurnool.edu.in వెబ్సైట్ను సందర్శించాలన్నారు. మరిన్ని వివరాలకు 9059305168ను సంప్రదించవచ్చన్నారు. విలేకరుల సమావేశంలో సిల్వర్ సెట్ కన్వీనర్ డాక్టర్ మహమ్మద్ వాహిద్, తదితరులు పాల్గొన్నారు. -
వారికి తీరక లేదు.. వీరికి జీతాలు రావు
కర్నూలు సిటీ: హొళగుంద కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ టి.శ్రీనివాసులు గత నెలలో తనిఖీకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న కొందరు ఉద్యోగులు ‘సార్..మాకు ఐదు నెలలుగా జీతాలు రావడం లేదు. రోజు పని చేస్తున్నా వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒక్క కేజీబీవీలోనే కాదు.. ఉమ్మడి జిల్లాలోని 55 కస్తూర్బాల్లో గతేడాది నవంబరులో నియమించిన 130 మంది టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు వేతనాలు రావడం లేదు. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి చిరుద్యోగులు తీసుకపోయినా కూడా అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. ఐదు నెలలుగా వారికి జీతాలు ఎందుకు రావడం లేదో తెలిసినా కూడా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం లేదు. వేతనాలు అందక పోవడంతో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. పండగలు సైతం చేసుకోలేక పోయామంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన నియామకాల్లో ఉద్యోగాలు పొందిన వారికి ఎక్కడా కూడా జాప్యం లేకుండా మొదటి నెల నుంచే వేతనాలు అందుతున్నాయి. కర్నూలు జిల్లాలో 26, నంద్యాల జిల్లాలో 27 కస్తూర్బాలు ఉన్నాయి. ఈ స్కూళ్లలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు గతేడాది అక్టోబరు నెలలో నోటిఫికేషన్ ఇచ్చి..అర్హుల జాబితాను కొంత ఆలస్యంగానే ప్రకటించారు. కర్నూలు జిల్లాలో 47 మంది, నంద్యాల జిల్లాలో 83 మందిని నియమించారు. అయితే ఆ సమయంలో ఎంపికై న వారి జాబితా కలెక్టర్ ఆమోదం తీసుకుని నియామక పత్రాలను అందజేశారు. ఆ తరువాత ఎంపికై న వారి బ్యాంకు, తదితర వివరాలను సేకరించి పూర్తి వివరాలతో ఈ ఏడాది జనవరి నెలలో ఆప్కాస్లో వారిని చేర్చేందుకు జాబితాను పంపించారు. అయితే ఆ జాబితాకు జిల్లా ఇన్చార్జ్ల మంత్రి ఆమోదం లేక వెనక్కి పంపించేశారు. అప్పటి నుంచి సుమారుగా రెండు నెలలుగా కర్నూలు జిల్లా ఇన్చార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, నంద్యాల జిల్లా ఇన్చార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ చుట్టూ సంతకాలు కోసం అధికారులు తిరుగుతున్నారు. కానీ జాబితాలపై సంతకాలు చేసేందుకు వారికి తీరిక లేదని మంత్రుల పేషీ నుంచి సమాధానాలు వస్తున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇన్చార్జ్ మంత్రుల ఆమోదం లేదని వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యోగుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వేతనాల కోసం కేజీబీవీల్లో ఉద్యోగుల నిరీక్షణ గతేడాది నవంబర్లో నియామకాలు ఆప్కాస్లో చేర్చేందుకు జాబితా పంపిన సమగ్ర శిక్ష అధికారులు ఇన్చార్జ్ మంత్రుల ఆమోదం లేదని వెనక్కి వచ్చిన ఫైల్ వైఎస్సార్సీపీ హయాంలో నియమించిన వారికి మొదటి నెల నుంచే వేతనాలు జమచర్యలు తీసుకుంటున్నాం కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో కొత్తగా నియమించిన టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు త్వరలో వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. వేతనాలు చేసేందుకు జాబితా ఆస్కాస్కి పంపగా, ఆ జాబితాకి జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆమోదం పొందిన తరువాత జీతాలు చెల్లిస్తామని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో ఇన్చార్జ్ మంత్రి జిల్లాకు రానున్నారు. వచ్చిన తరువాత సంతకం చేయించిన వెంటనే వేతనాలు వచ్చే అవకాశం ఉంది. – టి.శ్రీనివాసులు, సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
కర్నూలు: పాతబస్తీలోని గడ్డా వీధిలో నివాసముంటున్న షేక్ అక్బర్ మియా (75) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈయన గతంలో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ప్రస్తుతం ఇంటి వద్ద ఖాళీగానే ఉంటున్నాడు. నలుగురు ఆడపిల్లలు, ఒక కొడుకు సంతానం. గురువారం కల్లూరు ఇందిరమ్మ కట్ట వద్ద సొహైల్ అనే వ్యక్తి బైక్ వెనుక కూర్చొని పాత ఈద్గా వైపు వెళ్తున్నాడు. బిస్మిల్లా హోటల్కు ఎదురుగా రోడ్డుకు అడ్డంగా కుక్క అడ్డు రావడంతో సొహైల్ కుక్కను తప్పించబోయి పక్కనున్న డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో ఇద్దరూ కింద పడి గాయాలకు గురయ్యాడు. బైక్ నడుపుతున్న సొహైల్కి స్వల్ప గాయాలు కాగా వెనుక కూర్చున్న షేఏక్ అక్బర్ తలకు బలమైన గాయాలయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే స్థానికులు ఇద్దరినీ 108 అంబులెన్స్లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్యాజువాలిటీ వార్డులో చికిత్స పొందుతూ తెల్లవారుజామున షేక్ అక్బర్ మియా మృతిచెందారు. కుమారుడు మహబూబ్ బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ కేంద్రానికి తరలించి భద్రపరిచారు. ప్రమాద సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విరుచుకుపడిన వరుణుడు!
కర్నూలు(అగ్రికల్చర్)/సాక్షినెట్వర్క్: జిల్లాలోని వి విధ ప్రాంతాల్లో అకాల వర్షాలు కురవడంతో అన్నదాతకు నష్టం వాటిల్లింది. దేవనకొండ, సి. బెళగల్, కోడుమూరు మండలాల్లో కోసి ఆరబెట్టిన ఉల్లి పూర్తిగా తడిచిపోయింది. కొన్ని చోట్ల టార్పాలిన్లు కప్పుకున్నా ఫలితం లేకుండా పోయింది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయం నుంచి వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అలాగే రాత్రి 7 నుంచి 11 గంటల వరకు అకాల వర్షాలు కురిశాయి. దేవనకొండ మండలం ఈదులదేవరబండ గ్రామంలో 42.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. సి.బెళగల్ మండలంలో 21.5 మి.మీ., ఎమ్మిగనూరు మండలంలో 20.5 మి.మీ., గూడూరు మండలంలో 10 మి.మీ. ప్రకారం అకాల వర్షాలు కురిశాయి. కోడుమూరు, ఆదోని, గోనెగండ్ల, పత్తికొండ, కర్నూలు తదితర మండలాల్లో కూడా వర్షాలు కురిశాయి. నష్టాలు ఇలా.. ● సి.బెళగల్ మండలంలో గురువారం సాయంత్రం కురిసన గాలివానతో పొలాల్లో ఉన్న పైర్లు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఉన్న మిరప, పొగాకు దిగుబడులు తడిసిపోయాయి. తుంగభద్ర నదితీర గ్రామాల్లో రబీలో సాగు చేసిన వరి పైరు నేలకొరిగింది. ● దొర్నిపాడు, క్రిష్టిపాడు, డబ్ల్యూ గోవిందిన్నె గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. భారీ గాలులకు మిరప కాయలన్నీ రాలిపోయాయి. కల్లాల్లో ఉన్న మిరప పూర్తిగా తడిసి పోయింది. ● కొలిమిగుండ్ల, కల్వటాల, నందిపాడు, తిమ్మనాయినపేట, కమ్మవారిపల్లె, అబ్దులాపురం గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. పసుపు పంటను కోసిన రైతులు ఉడికించేందుకు తిమ్మనాయినపేట గ్రామం శివారులో ఆరబెట్టుకున్నారు. ఉన్నట్లుండి ఆకాల వర్షం కురవడంతో రైతులు పరుగులు పెట్టి తడవకుండా పట్టలు కప్పుకోవాల్సి వచ్చింది. ● మహానంది మండలంలో గురువారం సాయంత్రం అరగంట పాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. తిమ్మాపురం, బుక్కాపురం తదితర గ్రామాల్లోని పొలాల్లో ఆరబెట్టిన పసుపు తడిచిపోపోయింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ● బండిఆత్మకూరు మండలంలో ఊహించని విధంగా ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. కడమల కాలువ, వెంగళరెడ్డి పేట, ఈర్నపాడు, సింగవరం గ్రామాల్లో కొన్నిచోట్ల వరి నేల కొరిగింది. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ● కోవెలకుంట్ల వ్యవసాయ సబ్డివిజన్లోని పలు మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మొక్కజొన్న పంటలో కోత, నూర్పిడి పనులు కొనసాగుతున్నాయి. మిరపలో చివరి కోత పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. వర్షం కారణంగా కల్లాల్లో ఆరబోసిన మిరప, మొక్కజొన్న దిగుబడులు తడవకుండా పట్టలు కప్పుకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు. పొట్టదశలో ఉన్న వరి నేలవాలడంతో వడ్లు రాలిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● నందవరం మండలంలో నాగలదిన్నె, పెద్దకొత్తిలి, జొహరాపురం, గంగవరం, రాయచోటి, నందవరం, నదికై రవాడి తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఽమొక్కజొన్న గింజలు, ఎండుమిర్చి తడిసిపోకుండా పట్టలు కప్పుకుంటూ అన్నదాతలు నానా అవస్థలు పడ్డారు. వరి, మొక్కజొన్న, మిరప పంటలు తిన్నాయి. ఆశలు వర్షార్పణం పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు -
మార్కెటింగ్ శాఖకు పెరిగిన ఆదాయం
కర్నూలు(అగ్రికల్చర్): 2024–25 సంవత్సరంలో మార్కెటింగ్ శాఖకు ఆదాయం పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలపై వ్యాపారుల నుంచి సంబంధిత మార్కెట్ కమిటీలు 1 శాతం ఫీజు వసూలు చేస్తారు. ఆ ప్రకారం రూ.36.18 కోట్ల ఫీజు వసూలు లక్ష్యం కాగా, రూ.39.36 కోట్లు వసూలైంది. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ మార్కెట్ కమిటీలు లక్ష్యాలను అధిగమించగా.. మంత్రాలయం, కోడుమూరు, ఆలూరు మార్కెట్లు వెనుకబడినట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ నారాయణమూర్తి తెలిపారు. విజిబుల్ పోలీసింగ్ మరింత బలోపేతం కర్నూలు: విజిబుల్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని క్షేత్రస్థాయి పోలీసు అధికారులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా అంతటా పోలీసు అధికారులు గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను విచారించి వాహన రికార్డులను పరిశీలించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వా హనదారులు తప్పనిసరిగా హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్టు ధరించాలని సూచించారు. సెల్ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్కు దూరంగా ఉండాలని తనిఖీల సందర్భంగా డ్రైవర్లకు సూచించారు. రహదారి భద్రతా నియమాలు పాటించకపోతే చర్యలు తప్పవని స్టేషన్ల వారీగా హెచ్చరించారు. 5న బాబు జగ్జీవన్రామ్ 118వ జయంతి కర్నూలు(అర్బన్): మాజీ ఉప ప్రధాని దివంగత డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ 118వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జె.రంగలక్ష్మిదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అధ్యక్షతన స్థానిక ఆర్ఎస్ రోడ్డులోని బాబు జగ్జీవన్రామ్ విగ్రహం కూడలిలో జయంతి కార్యాక్రమలను నిర్వహిస్తామన్నారు. ముందుగా జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం అక్కడే జయంతి సభను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమానికి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, దళిత, ప్రజా సంఘాలకు చెందిన నాయకులు, ప్రజలు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు హాజరు కావాలని జేడీ కోరారు. మెరిట్, ఎంపిక జాబితా విడుదల కర్నూలు(హాస్పిటల్): ఉద్యోగాల భర్తీకి ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ విడుదల చేసినట్లు కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్, జనరల్ హాస్పిటల్స్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి 2023 నవంబర్ 20న నోటిఫికేషన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మొత్తం 11 కేటగిరీల అభ్యర్థుల ఫైనల్ మెరిట్, సెలక్షన్ జాబితాను https:// kurnool. ap. gov. in, https:// nandyal. ap. gov. in, https:// kurnoolmedical. ac. inలల వెబ్సైట్లో అప్లోడ్ చేశామమని పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల నకలు సర్టిఫికెట్లతో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు ఉదయం 10.30 గంటలకు కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కార్యాలయంలో నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరుకావాలన్నారు. హాజరుకాని అభ్యర్థుల ఎంపిక రద్దు చేస్తామన్నారు. రైతుసేవా కేంద్రాల్లో జొన్నల కొనుగోలు కర్నూలు(సెంట్రల్): రైతుసేవా కేంద్రాల్లో మహేంద్ర రకం జొన్నలు కొనుగోలు చేస్తున్నట్లు జేసీ డాక్టర్ బి.నవ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ–క్రాప్, ఈకేవైసీ చేయించుకున్న రైతులు తమ పేర్లను సచివాలయాల్లో నమోదు చేసుకుంటే క్వింటా జొన్నలు రూ.3,371 ప్రకారం కొనుగోలు చేస్తామన్నారు. నిర్దేశించిన మేరకు నాణ్యత ఉండే జొన్నలనే కొనుగోలు చేస్తామని.. హమాలీ, రవాణా ఖర్చులను పౌరసరఫరాల సంస్థ భరిస్తుందన్నారు. -
చేతులెత్తి మొక్కుతూ.. మనసారా అభివాదం చేస్తూ.. చిరునవ్వులతో స్వాగతిస్తూ.. అభిమాన తరంగం ఉవ్వెత్తున ఎగిసింది. జగమంత కుటుంబం ఆత్మీయత పంచగా.. అడుగడుగునా ఆప్యాయత స్వాగత తోరణమైంది.
● మాజీ సీఎం వైఎస్ జగన్ను చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు ● వివాహ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి ● అభిమానులతో కిటకిటలాడిన కన్వెన్షన్ హాలు ● పాల్గొన్న ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు, వైఎస్సార్సీపీ నేతలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు భారీగా తరలి వచ్చిన ప్రజలుకర్నూలు (టౌన్): మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ‘జై జగన్.. సీఎం..సీఎం’ అంటూ నినాదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రితో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. భారీగా అభిమానులు రావడంతో రోడ్లు కిక్కిరిసి పోయాయి. కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక గురువారం కర్నూలు నగర శివారులోని జీఆర్సీ కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. వివాహ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. నూతన దంపతులు శ్రేయ, వివేకానంద విరూపాక్షిని ఆశీర్వదించా రు. వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రిని చూసేందుకు, సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ప్రజలు భారీగా తరలి రావడంతో కన్వెన్షన్ హాలు కిక్కిరిసిపోయింది. ఆప్యాయంగా పలకరించి.. తాడేపల్లి నుంచి కర్నూలు నగరంలోని మైపర్ మైదానం హెలిపాడ్కు చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాఅధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డి, కాటసాని రాంభూల్రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, బూసినె విరూపాక్షి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ స్వాగతం పలికారు. మాజీ ఎంపీలు బుట్టా రేణుక, పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్ఖాన్, సాయి ప్రసాద్రెడ్డి, కంగాటి శ్రీదేవి, ఎర్రకోట చెన్న కేశవరెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రామిరెడ్డి, బిజేంద్రా రెడ్డి, శిల్పా రవికిషోర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మేయర్ బీవై రామయ్య, పార్టీ నేతలు ఆదిమూలపు సతీష్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, దార సుధీర్, పార్టీ రాష్ట్ర నాయకులు తెర్నేకల్ సురేంద్ర రెడ్డి, సుభాష్ చంద్రబోస్, విజయ మనోహారి, శశికళ, గాజుల శ్వేతారెడ్డి స్వాగతం పలికారు. పూలబోకేలు ఇచ్చి శాలువాలు కప్పారు. ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్యాయంగా పలకరించారు. ప్రతి ఒక్కరి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆత్మీయత.. అభిమానం హెలిపాడ్కు భారీగా చేరుకున్న ప్రజలు ‘సీఎం.. సీఎం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జొహరాపురం రోడ్డు జనంతో నిండిపోయింది. హెలిపాడు నుంచి అందరికీ అభివాదం చేసుకుంటూ కారులో జీఆర్సీ కన్వెన్షన్కు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బయలు దేరారు. అందరికీ అభివాదం చేశారు. జననేతను చూసేసరికి అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో ఆద్యంతం ఆత్మీయత, అభిమానం కనిపించింది. అభివాదం చేస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి -
మూల్యాంకనం ప్రారంభం
కర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం గురువారం ప్రారంభమైంది. నగర శివారులోని ఓ ప్రైవేటు స్కూల్లో స్పాట్ క్యాంపును ఏర్పాటు చేశారు. జిల్లాకు 1,93,747 సమాధాన పత్రాలు వివిధ జిల్లాల నుంచి వచ్చాయి. మూల్యాంకనం చేసేందుకు నియమించిన ఉపాధ్యాయులు మొదటి రోజున 89 చీఫ్ ఎగ్జామినర్లు, 537 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 145 మంది స్పెషల్ అసిస్టెంట్లు విధుల్లో చేరారు. వారిని సర్దుబాటు చేసే ప్రక్రియ కొంత ఆలస్యమైంది. క్యాంపు ఆఫీసర్గా వ్యవహారించిన డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ ముందుగా విధుల్లో చేరిన వారితో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. ప్రతి రోజు ఎన్ని పేపర్లు మూల్యాంకనం చేయాలో కచ్చితంగా నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేయాలన్నారు. ఆ తరువాత మొదలైన స్పాట్లో మొదటి రోజు సోషల్, ఒకేషనల్ మినహా 11,081 వేల పేపర్లను మూల్యాంకనం చేశారు. అదే విధంగా ఓపెన్ టెన్త్ పేపర్లు 16,220 సమాధాన పత్రాలు జిల్లాకు రాగా, మూల్యాంకనం చేసేందుకు 15 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 82 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లను నియమించగా, మొదట రోజున 1,275 పేపర్లను మూల్యాంకనం చేశారు. రేపు శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవంశ్రీశైలంటెంపుల్: ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆనవాయితీ ప్రకారం ఈనెల 5న రోజున శ్రీశైల మహా క్షేత్రంలో స్వామి అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు లాగి అనంతరం తిరిగి యథాస్థానానికి చేర్చనున్నట్లు తెలిపారు. రెండు రేషన్ షాపులపై 6ఏ కేసులు కర్నూలు(సెంట్రల్): ఉండాల్సిన దాని కంటే త క్కువగా బియ్యం ఉన్న మరో రెండు రేషన్ షాపులపై పౌరసరఫరాల ఽఅధికారులు 6ఏ కేసులు నమోదు చేశారు. గురువారం నగరంలోని 53వ నంబరు రేషన్ షాపులో డీఎస్ఓ రాజారఘువీర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా 3290 కేజీల బియ్యం, 604 కేజీల జొన్నలు తక్కువగా ఉన్నాయి. అలాగే రేషన్ షాపు నంబర్ 162లో 1800 కేజీల బియ్యం, 286 ప్యాకెట్ల చక్కెర ఉండడంతో యాజమాని రవిపై కేసు నమోదు చేశారు. దాడుల్లో ఏఎస్ఓ రామాంజనేయరెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు. -
వీరభద్రా.. శరణు.. శరణు !
తుగ్గలి: ఎదులదొడ్డిలో వెలిసిన వీరభద్రస్వామి రథోత్సవం వైభవంగా సాగింది. గురువారం వేకువజామున వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీ కాళికామాతా సమేత శ్రీ వీరభద్రస్వామి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. స్థానికులతో పాటు వివిధ గ్రామాల పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించు కున్నారు. సాయంత్రం స్వామి ఉత్సవమూర్తులను పూలతో అలంకరించిన రథంలో ఉంచి భక్తులు రథాన్ని లాగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పత్తికొండ రూరల్ సీఐ పులిశేఖర్ పర్యవేక్షణలో తుగ్గలి ఎస్ఐ కృష్ణమూర్తి, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ప్రమాదాన్ని తరిమేలా.. ప్రాణాలు రక్షించేలా!
● కులుమాలలో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు ● అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం ● రూ. 2.50 లక్షల సొంత నిధులతో సమస్యను పరిష్కరించిన బుట్టా రేణుక గోనెగండ్ల: ‘సార్.. విద్యుత్ తీగలు ఇళ్ల ముందర వేలాడుతున్నాయి. మిద్దెలపైకి వెళ్లాంటే భయమేస్తోంది. విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి చనిపోయాడు’ అని అధికారులకు ప్రజలు మొరపెట్టుకున్నా స్పందించ లేదు. చివరకు సమస్య వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బుట్టా రేణుక దృష్టికి వెళ్లడంతో ఆమె సొంత నిధులతో పరిష్కరించారు. కులుమాల గ్రామంలోని బీసీ కాలనీలో గత 20 ఏళ్లుగా 11 కేవీ విద్యుత్ తీగలు ఇళ్లపై వెళ్లడం ద్వారా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటిపైకి వెళ్లాలంటే ఆ తీగలు తగిలి ప్రాణాలు పోతాయని భయపడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. ఆ తీగలు తగిలి ఓ వ్యక్తి ప్రాణాన్ని కోల్పోయాడు. మరికొందరు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. చివరకు గ్రామంలో నెలకొన్న విద్యుత్ తీగల సమస్యను పరిష్కరించాలని ఆ గ్రామస్తులు వైఎస్సార్సీపీ జిల్లా ఆక్టివిటి కార్యదర్శి నాగేష్ నాయుడు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బుట్టా రేణుక దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె సంబంధిత అధికారులతో మాట్లాడి సొంత నిధులు రూ.2.50 వెచ్చించి సమస్యను పరిష్కరించారు. రెండు రోజుల క్రితం కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి 11కేవీ విద్యుత్ తీగలను సురక్షిత మార్గంలో మార్పు చేసి సమస్యను పరిష్కరించడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ మేరకు బుట్టా రేణక, నాగేష్ నాయుడికి గ్రామస్తులతో పాటు వైఎస్సార్సీపీ మండల ఉపాధ్యక్షుడు పేట అల్లా బకాష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొల్ల నరసింహుడు, వీరేష్, మద్దిలేటి, మద్ది, రాజు, దుబ్బన్న, మల్లికార్జున, రామాంజిని తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. -
వడదెబ్బతో యాచకుడి మృతి
కోవెలకుంట్ల: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని యాచకుడు గురువారం వడదెబ్బతో మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. 60 సంవత్సరాలకు పైబడిన ఓ గుర్తు తెలియని యాచకుడు కొన్ని రోజుల క్రితం భిక్షాటనకు కోవెలకుంట్లకు వచ్చాడు. ప్రతి రోజు పట్టణంలో భిక్షాటన చేసుకుని రాత్రి సమయాల్లో బస్టాండ్ పరిసరాల్లో నిద్రించేవాడు. రోజులాగే గురువారం ఉదయం భిక్షాటన నిమిత్తం వెళ్లి ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురయ్యాడు. అనారోగ్యంతోనే బస్టాండ్ వద్దకు చేరుకుని కుప్పకూలిపోయి మృతి చెందాడు. ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ మల్లికార్జునరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని యాచకుడి చిరునామా వివరాలు ఆరా తీశారు. వివరాలు లభ్యం కాకపోవడంతో మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
జిల్లా స్థాయి సైన్స్ ఎక్స్పోలో ప్రతిభ
కర్నూలు సిటీ: స్థానిక ప్రభుత్వ బాలికల హైస్కూల్లో గురువారం నిర్వహించిన ఎంటర్ ప్రిన్యూర్షిప్ మైండ్ సెట్ జిల్లా స్థాయి సైన్స్ ఎక్స్పో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. ఎస్ఈసీఆర్టీ కొన్ని అంశాలను ఎంపిక చేసి తయారు చేసిన వీడియోలను ప్రతి శుక్రవారం తరగతి గదుల్లో ప్రదర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ మేరకు 40 స్కూళ్లకు చెందిన విద్యార్థులు ఆవిష్కరించిన ప్రదర్శనలను జిల్లా స్థాయి సైన్స్ ఎక్స్పోలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను బీఈడీ కాలేజీ (ఐఏఎస్ఈ)ప్రిన్సిపాల్ ఆదినారాయణ రెడ్డి, అధ్యాపకురాలు డి.పార్వతిదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ ప్రదర్శనలో ప్రథమ విజేతగా కోడుమూరు మండలం కల్లపరి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఎం.శిరీషా, బి.లక్ష్మీ, హర్షవర్ధన్, ద్వితీయ విజేతగా కర్నూలు నగరంలోని ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ మొమోరియల్ హైస్కూల్కి చెందిన ఎం.మేఘన, ఎస్.సనా ముస్కాన్, ఆర్.అంజలీనా, తృతీయ విజేతగా గోనెగండ్ల మండలం గంజిహళ్లి జెడ్పీ హైస్కూల్కి చెందిన విద్యార్థులు పి.సౌమ్య, ఎ.శ్రావణి, ఎస్.రాజేష్ నిలిచారు. కార్యక్రమంలో ఎంటర్ప్రిన్యూర్షిప్ మైండ్సెట్ జిల్లా కో–ఆర్డినేటర్ గోపాలకృష్ణ, జిల్లా సైన్స్ కో–ఆర్డినేటర్ రంగమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
కర్నూలు: కోడుమూరు మండలం లద్దగిరి హాస్టల్లో 9వ తరగతి చదువుతున్న నరేష్ అలియాస్ నాని (15) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. వెల్దుర్తి మండలం నరసాపురం గ్రామానికి చెందిన బజారి, మహదేవి దంపతులకు ఇద్దరు కూతుర్లు, కుమారుడు నరేష్ ఉన్నారు. మహదేవి ఐదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అప్పటి ఆమె పిల్లలు కృష్ణగిరి మండలం రామకృష్ణాపురంలో మేనమామ మధు సంరక్షణలో ఉంటున్నారు. కాగా బజారి కర్నూలు వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన లిల్లీని వివాహం చేసుకుని ఇక్కడే ఉంటున్నాడు. నరేష్ లద్దగిరి హాస్టల్లో చదువుకుంటూ తరచూ కర్నూలులో ఉన్న తండ్రి దగ్గరకు వచ్చేవాడు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం హాస్టల్ నుంచి పారిపోయి తండ్రి బజారి వద్దకు వచ్చాడు. గురువారం అనుమానాస్పద స్థితిలో ఇంట్లో చనిపోయాడు. కాగా మొదటి భార్య చనిపోయినప్పుడు పిల్లలకు బజారి 3 ఎకరాల పొలాన్ని రాసిచ్చాడు. అందుకు సంబంధించిన పత్రాలు తీసుకురావాలని కుమారుడు నరేష్పై తండ్రి బజారి ఒత్తిడి పెంచి కొట్టి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లు మేనమామ మధు ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కమనీయం.. రథోత్సవం
ఆస్పరి: కై రుప్పల గ్రామంలో గురువారం అశేష జనవాహని మధ్య వీరభద్రస్వామి రథోత్సవం కనుల పండవగా జరిగింది. వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముందుగా ఆలయంలో వీరభద్రస్వామి, కాళికాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి ఉత్సవ విగ్రహలను మేళతాళాలతో ఊరేగించారు. రథం ముందు పురోహితుడు మల్లికార్జున స్వామి పూజలు నిర్వహించి రథంపై ఉత్సవ విగ్రహలను చేర్చారు. అనంతరం జయ జయ ధ్వానాల మధ్య స్వామి వారి రథోత్సవం ప్రారంభమైంది. బసవన్న దేవాలయం వరకు, తిరిగి రథశాల వద్దకు లాగారు. రథోత్సవాన్ని చూడటానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు కదిలి వచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ తిమ్మక్క, ఆలూరు ఎమ్మెల్యే తనయుడు చంద్రశేఖర్, వెంగళాయిదొడ్డి ఆయకట్టు చైర్మన్ బసవరాజు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. -
చౌడేశ్వరిదేవికి ప్రణమిల్లి..
బనగానపల్లె: అర్ధరాత్రి భక్తి కెరటం ఎగిసింది. జ్యోతులు దేదీప్యమానంగా వెలుగొందాయి. ‘చల్లగా దీవించు తల్లీ’ అంటూ.. భక్తజనం చౌడేశ్వరి దేవి ముంగిట ప్రణమిల్లారు. నందవరంలో వెలిసిన చౌడేశ్వరిదేవి అమ్మవారి జ్యోతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గత నెల 30వ తేదీన ప్రారంభమైన ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన జ్యోతుల సమర్పణ కార్యక్రమానికి కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భక్తజనం తరలివచ్చారు. బుధవారం అర్ధరాత్రి నుంచి జ్యోతి మహోత్సవం కనులపండువగా సాగింది. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ, ఆలయ అర్చకులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సల్లో భాగంగా ముందుగా భాస్కరయ్య ఆచారి అమ్మవారికి దిష్టిచుక్క పెట్టు కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం ఒంటిగంట నుంచి గ్రామంలోని శ్రీ చెన్నకేశస్వామి దేవస్థానం తొగటవీర క్షత్రి యులు, భక్తులు జ్యోతులు తలపై పెట్టుకొని భక్తి గీతాలు పాడుకుంటూ మేళతాళాలతో బయల్దేరారు. మొదట సర్కార్ వారి జ్యోతి బయలుదేరగా.. మిగతా జ్యోతులు గ్రామ చావిడి, బస్టాండ్ మీదుగా చౌడేశ్వరిదేవి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నాయి. దేవస్థానం ముందు ఏర్పాటు చేసిన అగ్ని గుండంలో భక్తులు నడుచుకుంటూ వచ్చి ఆలయ గర్భగుడిలో కొలువైన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఉత్సవంలో తొగటవీర క్షత్రియులు ప్రదర్శించిన కత్తి సాము ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. సర్కార్ వారి జ్యోతి వద్ద భక్తుల రద్దీని నివారించేందుకు డోన్ డీఎస్పీ శ్రీనివాసులు, బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్రెడ్డి, ఎస్ఐ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సుమారు 750 జ్యోతులకుపైగా రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. జ్యోతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ అమ్మవారికి జ్యోతిని సమర్పించారు. గురువారం సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ముస్తాబు చేసి రఽథోత్సవాన్ని నిర్వహించారు. గ్రామ ముఖద్వారం వరకు భక్తులు రథాన్ని లాగారు. శుక్రవారం తిరుగు రథోత్సవం నిర్వహించన్నారు. ఈనెల 5వ తేదీన ఉత్సవాలు ముగియనున్నాయి. వైభవంగా జ్యోతి మహోత్సవం అబ్బుర పరిచిన తొగటవీర క్షత్రియుల విన్యాసాలు కిటకిటలాడిన నందవరం -
నందికొట్కూరులో చోరీ
నందికొట్కూరు: పట్టణంలోని సాయిబాబాపేటలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. స్థానికంగా నివాసముంటున్న షేక్ మహబూబ్బాషా ఇటీవల తన తమ్ముడు షేక్ రహంతుల్లా కుమారుడు అబ్దుల్లా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాగా ఆర్ఆర్ వెంచర్లో ఉన్న తమ్ముడి ఇంటికి మహబూబ్బాషా కుటుంబ సభ్యులందరూ ప్రతి రోజు రాత్రి తోడుగా వెళ్లి నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని 60 తులాల వెండి, రూ. 50 వేలు, విలువైన రెండు గడియారాలు, ముక్కుపుడక అపహరించారు. గురువారం ఉదయం ఇంటికి వచ్చి చూసుకునే సరికి తలుపు తెరిచి ఉండటంతో చోరీ జరిగిందని భావించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ పరిశీలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. క్రీడా కేంద్రానికి ఇద్దరు ఎంపిక నంద్యాల(న్యూటౌన్): భారత క్రీడల శాఖ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కర్నూలులో ఉన్న తైక్వాండో కేంద్రానికి నంద్యాలకు చెందిన పవన్తేజ, జంషీద్ హుసేన్ ఎంపికై నట్లు నంద్యాల లయన్స్క్లబ్ కార్యదర్శి రమేష్, నంద్యాల జిల్లా పారా ఒలంపిక్ కార్యదర్శి రమణయ్యలు పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులను గురువారం ఐఎంఏ మాజీ అధ్యక్షుడు రవికృష్ణ తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు క్రమశిక్షణతో కూడిన పాఠశాలలో నిరంతర సాధన కృషి చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. కార్యక్రమంలో వెలుగోడు మాజీ జెడ్పీటీసీ లాలుస్వామి, కోచ్లు మహబూబ్బాషా, ఉదయ్కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ శాఖ స్కాలర్షిప్ మంజూరు కర్నూలు(అర్బన్): పోస్టల్ శాఖ 2024–25 సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన దీనదయాళ్ స్పర్శ్ యోజన స్కాలర్షిప్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పోస్టల్ సూపరింటెండెంట్ జీ.జనార్దన్రెడ్డి నగదు ఉపకార వేతనంతో పాటు ప్రశంసా పత్రాలను అందించారు. గురువారం స్థానిక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పరీక్షల్లో నగరంలోని ఎన్ఆర్ పేటలోని సెయింట్ జోసఫ్ ఇంగ్లీషు మీడియం స్కూల్కు చెందిన షేక్ మహ్మద్ ఫైజాన్, ఎం.జ్యోతి స్వరూప్రెడ్డి ప్రతిభ చాటారన్నారు. వీరికి రూ.6 వేల నగదు, ప్రశంసా పత్రాలను అందించామన్నారు. ఈ నేపథ్యంలోనే పోస్టల్ శాఖ అందిస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. స్టాంపుల సేకరణ, మై స్టాంప్, ధాయి ఆఖర్ లెటర్ రైటింగ్ గురించి అవగాహన కల్పించారు. -
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. కొత్త జంటకు ఆశీర్వాదం
సాక్షి, తాడేపల్లి/కర్నూలు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలు చేరుకున్నారు. జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో కుడా మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకులు కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధువరులు శ్రేయ, వివేకానందలను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. ఈ వేడుకలు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. -
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
పగిడ్యాల: భార్య కాపురానికి రావడంలేదనే మనస్తాపానికిలోనైన భర్త ఆత్మ హత్యకు పాల్పడిన ఘటన మండలంలోని పాతముచ్చుమర్రి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన శాలుబాషా కుమారుడు నరేంద్ర(28)కు సి.బెళగల్కు చెందిన పవిత్రతో వివాహమైంది. వీరికి ఏడాది కుమార్తె ఉంది. భార్యా, భర్తల మధ్య కుటుంబ కలహాలు నెలకొనడంతో పవిత్ర కొంతకాలం క్రితమే పుట్టినింటికి వెళ్లింది. పలుమార్లు పెద్దమనషులతో పంచాయితీ చేసినా ఆమె రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికిగురైన నరేంద్ర మంగళవారం రాత్రి అందరూ నిద్రిస్తుండగా ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్సనిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ముచ్చుమర్రి పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
అగ్ని వీర్లో మెరిసి.. ఆదర్శమై నిలిచి!
● సత్తా చాటిన ఆస్పరి యువకులు ● వీరంతా మోడల్ స్కూల్ పూర్వ విద్యార్థులే .. ● హర్షం వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు ఆస్పరి: వారి కుటుంబాలకు వ్యవసాయమే ఆధారం. తల్లిదండ్రులు పడే కష్టాలు కళ్లారా చూశారు. అయినా తమ పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో అప్పోసప్పో చేసి చదివించారు. వారి నమ్మకాన్ని ఆ పిల్లలు వమ్ము చేయలేదు. అగ్రివీర్లో ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచారు. గత మార్చి 28న గుంటూరులో కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన అగ్నిపథ్ సెలక్షన్స్లో ఆస్పరి మండలానికి చెందిన ఐదుగురు యువకులు సత్తా చాటి జీడీ(జనరల్ డ్యూటీ) ఉద్యోగాలు సాధించారు. వీరంతా వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారు కావడంతోపాటు టెన్త్, ఇంటర్ మండలంలోని పుటకలమర్రి సమీపంలో ఉన్న ఆదర్శ పాఠశాలలోనే పూర్తి చేశారు. ఒకేసారి ఐదుగురు తమ పాఠశాల పూర్వ విద్యార్థులు ఇండియన్ ఆర్మీకి ఎంపికై తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవడంతో ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉద్యోగాలు సాధించిన యువకుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. -
విద్యార్థుల చేతికి ట్యాబ్లు
డోన్ టౌన్: విద్యార్థుల నుంచి తీసుకున్న ట్యాబ్లను ఎట్టకేలకు తిరిగిచ్చేశారు. గత వైఎస్సార్సీసీ ప్రభుత్వం హయాంలో విద్యార్థుల భవిష్యత్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో అప్పట్లో 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను అందించిన సంగతి తెలిసినదే. ఈనెల 1న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగియడంతో విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేనప్పటికీ స్థానిక ఏపీ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాలలోని విద్యార్థినుల నుంచి ట్యాబ్లు లాగేసుకున్నారు. ఈ విషయమై కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్ద నరసనలు వ్యక్తం చేసినా ఎలాంటి స్పందన లేక పోవడంతో విషయం తెలుసుకున్న సాక్షి దినపత్రిక.. ‘ట్యాబ్లు లాగేసుకుంటున్నారు’ శీర్షికతో కథనం ప్రచురించింది. దీంతో అధికారులు స్పందించారు. ఇంటెలిజెన్స్, విద్యాశాఖ అధికారులు విచారణ చేసి ట్యాబ్లు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు. దీంతో బుధవారం హెచ్ఎం సుస్మితతో పాటు ట్యాబ్లు తీసుకున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు ఫోన్ చేసి పాఠశాలకు పిలిపించి ట్యాబ్లు ఇచ్చేశారు. -
పట్టుదలతో సాధన చేశా
అమ్మ బోయ లక్ష్మి, నాన్న రామన్నకు వ్యవసాయమే జీవనాధారం. నేను మోడల్ స్కూల్లో 2021 – 2023 మధ్య ఇంటర్ ఎంఈసీ పూర్తి చేశాను. ప్రస్తుతం గుంతకల్లులోని బీసీ హాస్టల్లో ఉంటూ ఎస్కేపీ డిగ్రీ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాను. ప్రతి రోజు ఉదయం పరుగు, షాట్ పుట్ సాధన చేసేవాడిని. ఆర్మీకి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ట్రైనింగ్ నిమిత్తం ఈనెల 26న బెంగళూరుకు వెళ్తున్నా. – మహీంద్రా, చిన్నహోతూరు గ్రామం, ఆస్పరి మండలం -
తప్పిపోయిన పిల్లలు తల్లిదండ్రుల చెంతకు
కర్నూలు: ఏపీ పొల్యూషన్ బోర్డు వద్ద ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న పి.ప్రశాంతి (10), 3వ తరగతి చదువుతున్న పి.ప్రదీప్ తప్పిపోయినట్లు తెలుసుకున్న పోలీసులు గంట వ్యవధిలోనే వారి ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు. ఓర్వకల్లు మండలం లొద్దిపల్లె గ్రామానికి చెందిన ప్రభుదాస్ కర్నూలు వీనస్ కాలనీలో ఉన్న బాలాజీ నివాస్ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య మాధవి కూడా అక్కడే ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారిద్దరి పిల్లలు మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఆడుకుంటూ బయటకు వెళ్లి తప్పిపోయారు. సమీపంలోని సాయిసదన్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న బంధువుల ఇంటికి వెళ్లారు. అయితే వారు లేకపోవడం, కింద చీకటిగా ఉండటంతో భయపడి మూడో అంతస్థులోనే ఉండిపోయారు. తల్లిదండ్రులు రెండో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే సమయంలో వెంకటరమణ కాలనీలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్న సీఐ నాగరాజరావు తన సిబ్బందితో చిన్నారులను వెతికిపట్టుకుని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. సరదాగా ఆడుకుంటూ ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేని స్థితిలో ఉన్న పిల్లల ఆచూకీ కనుగొని తల్లిదండ్రుల చెంతకు చేర్చినందుకు సీఐతో పాటు గస్తీ సిబ్బందిని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు. -
రేపు కర్నూలులో జాతీయ రైతు సదస్సు
కర్నూలు(సెంట్రల్): ఈనెల 4న కర్నూలులో నిర్వహించే జాతీయ రైతు సదస్సును జయప్రదం చేయాలని ఏపీ రైతుసంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య కోరారు. నగరంలోని లక్ష్మీనరసింహ కల్యాణ మండపంలో జరిగే సదస్సుకు కేరళ, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రులు పి.ప్రసాదు, తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఉమ్మడి ఏపీ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, రఘువీరారెడ్డి, కిసాన్ సభ జాతీయ కార్యదర్శి రావుల వెంకయ్య హాజరవుతున్నట్లు తెలిపారు. బుధవారం సీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 15, 16, 17 తేదీల్లో తమిళనాడులోని నాగపట్నంలో ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ మహాసభలు జరగనున్న నేపథ్యంలో కర్నూలులో 4న జాతీయ రైతు సదస్సును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాతబస్టాండులోని శ్రీలక్ష్మీనరసింహ కల్యాణ మండపంలో జరిగే సదస్సులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి జాతీయ మహాసభల్లో తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా పంట రుణాలను మాఫీ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పంపన్న గౌడ్, ఎస్.మునెప్ప, పి.రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
సచివాలయమే.. నమ్మండి!
ఇదేదో టీడీపీ కార్యాలయం అనుకుని పొరపాటు పడేరు. ముమ్మాటికీ సచివాలయమే..నమ్మండి. కాకపోతే కూటమి ప్రభుత్వంలోని అరాచకాలకు ఇక్కడ ఎగరేసిన పచ్చ జెండానే నిదర్శనం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేసుకన్న పాలకులు ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ కార్యాలయాలను సైతం ‘పచ్చ’పాతంగా మార్చేస్తున్నారు. వెల్దుర్తి మండలం పుల్లగుమ్మి గ్రామంలోని సచివాలయం వద్ద ఇటీవల టీడీపీ నాయకులు తమ పార్టీ ఆవిర్భావ వేడుకలు చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఏకంగా అక్కడ శాశ్వత దిమ్మ ఏర్పాటు చేసి టీడీపీ జెండా ఆవిష్కరించడం చూసి ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. ఎంత బరితెగింపు పనికిరాదని ఈసడించుకుంటున్నారు. మరోవైపు సచివాలయ ఉద్యోగులు, సంబంధిత అధికారులు తమకెందుకొచ్చిందంటూ చూసీచూడనట్లు విధులకు వచ్చిపోతున్నారు. – వెల్దుర్తి -
సూక్ష్మ సేద్యం పరికరాల్లో నాణ్యత ప్రధానం
కర్నూలు(అగ్రికల్చర్): సూక్ష్మ సేద్యం పరికరాల్లో నాణ్యత ప్రమాణాలు ఉండాలని, అప్పుడే డ్రిప్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేస్తుందని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ సేద్య లక్ష్యం 7,000 హెక్టార్లు ఉండగా ... 5,653 హెక్టార్లకు పరిపాలన అనుమతులు తీసుకున్నామన్నారు. బుధవారం కర్నూలులోని ఉద్యానభవన్లో ఉద్యాన అధికారులు, డ్రిప్ కంపెనీల ఇంజినీ ర్లు, జిల్లా కో–ఆర్డినేటర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఏపీఎంఐపీ పీడీ పాల్గొని ప్రసంగించారు. పరిపాలన అనుమతులు పొ ందిన వారందరికీ మే చివరిలోపు డ్రిప్ పరికరాలు సరఫరా చేసి, అమర్చాలని కంపెనీల కో–ఆర్డినేటర్లను ఆదేశించారు. ఏపీడీ రాజాకృష్ణారెడ్డి మాట్లాడుతూ సూక్ష్మ సేద్యం ప్రగతిలో కర్నూలు జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో ఉందన్నారు. ఇందుకు సహకరించిన కంపెనీల కో–ఆర్డినేటర్లను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి పి.రామాంజనేయులు, సూ క్ష్మనీటి అభివృద్ధి అధికారి జయరాంరెడ్డి పాల్గొన్నారు. -
లక్ష్మమ్మ అవ్వకు బంగారు కిరీటం
ఆదోని అర్బన్: ఆదోని ఇలవేల్పు శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వకు బంగారు కిరీటం తయారయ్యింది. మేలో జరగబోవు అవ్వ 93వ రథోత్సవం సందర్భంగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రాచోటి రామయ్య కేజీ మూడు గ్రాములు బంగారు కిరీటాన్ని చేయించారు. కిరీటాన్ని దేవదాయ శాఖ అధికారుల అనుమతితో చేయించినట్లు రాచోటి రామయ్య బుధవారం తెలిపారు. కిరీటాన్ని తయారు చేయడానికి సహకరించిన బంగారు దుకాణాదారులకు, ఎండోమెంట్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రశాంతంగా ‘జేఈఈ మెయిన్స్’ కర్నూలు సిటీ: జాతీయ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి జేఈఈ మెయిన్స్ తుది విడత పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్ష సమయానికి గంటన్నర ముందుగానే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. వేళకు 40 నిమిషాల ముందు నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ పరీక్షలు మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు నిర్వహించారు. కర్నూలులోని నంద్యాల చెక్పోస్టుకు సమీపంలోని సనత్నగర్లోని ఐయాన్ డిజిటల్ జోన్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉదయం 274 మందికిగాను 259 మంది, మధ్యాహ్నం 263 మందికిగాను 249మంది హాజరయ్యారు. ఈ పరీక్షలు ఈనెల 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఆర్యూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని వర్సిటీ ఇన్చార్జ్ వైస్చాన్స్లర్ ఆచార్య వి.ఉమ సూచించారు. ఆర్యూ, క్లస్టర్ (సీయూ) యూనివర్సిటీలకు ఇన్చార్జ్ వీసీగా నిమియతులైన ఆమె బుధవారం ఆర్యూను సందర్శించారు. వీసీ చాంబర్లో రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయకుమార్ నాయుడు, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీవీ కృష్ణారెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎన్.నరసింహులు, డీన్ ఆఫ్ ఎగ్జామినేష న్స్ ఆచార్య సీవీ సుందరనాంద్, రీసెర్స్ డైరెక్టర్ ఆచార్య సి.విశ్వనాథరెడ్డి, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య ఆర్.భరత్కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లుతో సమావేశమై వర్సిటీకి సంబంధించిన విషయాలను చర్చించారు. క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కె.వెంకటేశ్వర్లుతో పాటు వర్సిటీలోని వివిఽ ద విభాగాల అధ్యాపకులు, బోధనేతర ఉద్యోగులు ఇన్చార్జ్ వీసీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
మద్దతిస్తే తీవ్ర పరిణామాలు
కర్నూలు (సెంట్రల్): పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని ఎస్డీపీఐ రాష్ట్ర నాయకుడు అమీర్ హెచ్చరించారు. వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం కలెక్టరేట్ గాంధీ విగ్రహం ఎదుట ఎస్డీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లౌకికవాదం ముసుగు వేసుకుని వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతివ్వడం అన్యాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు జుబేర్ ఖాన్, ప్రధాన కార్యదర్శి సలీం బాషా పాల్గొన్నారు. -
ఈ ప్రభుత్వాన్ని గెలిపించినా ఏమీ లాభం లేదు
కర్నూలు(సెంట్రల్): కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగ, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించినా ఏమీ లాభం లేదని, పది నెలలకే ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని ఫ్యాప్టో రాష్ట్ర కో–చైర్మన్ కె.ప్రకాష్రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్ గాంధీ విగ్రహం ఎదుట ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వ మోసానికి నిరసనగా మోకాళ్లపై నిల్చొని ఆందోళన చేపట్టారు. అనంతరం ఫ్యాప్టో జిల్లా చైర్మన్, జనరల్ సెక్రటరీలు సేవాలాల్ నాయక్, జి.భార్గవ్ అధ్యతన జరిగిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కో–చైర్మన్ ప్రకాష్రావు మాట్లాడుతూ పదినెలలు గడిచినా 12వ పీఆర్సీ చైర్మన్ను నియమించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ● 30 శాతం ఐఆర్ను ప్రకటించాలని కోరుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. ● పెండింగ్ డీఏలు ఇవ్వాలని కోరుతున్నా వినిపించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ● ఉద్యోగులకు సంబంధించి రూ.30 వేలకోట్ల బకాయిలు ఉండగా.. ఇటీవల రూ.6 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం అన్యాయమన్నారు. ● సీపీఎస్, జీపీఎస్, యూపీఎస్ వద్దని, ఓపీఎస్ కావాలని కోరుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియానికి సమాంతరంగా తెలుగు మీడియం ప్రవేశపెట్టాలని కోరుతున్నా లెక్క చేయడంలేదన్నారు. ● యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మూడళ్లే వరకు తమకు ఎలాంటి పోరాటాలు చేసే అవసరం తలెత్తలేదని.. ఈ ప్రభుత్వంలో 10నెలలకే ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరాటాల బాట పట్టాల్సి వచ్చిందన్నారు. ● కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు గోకారి, జనార్ధన్, యూటీఎఫ్ నాయకులు రవికుమార్, నవీన్, ఏపీటీఎఫ్ నాయచకులు రంగన్న రవికుమార్, ఇస్మాయిల్, మరియానందం, హెచ్ఎంఏ నాయకుడు నారాయణ, తిమ్మన్న తదిరులు పాల్గొన్నారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో భారీ ధర్నా -
వైద్యుల నియామకాలు, పదోన్నతులు గత ప్రభుత్వంలోనే..
కర్నూలు మెడికల్ కాలేజీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఏకంగా 126 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జరిగింది. ఈ మేరకు అప్పటి వరకు అసోసియేట్గా పదోన్నతులు లభించని అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పించి ఖాళీలు భర్తీ చేశారు. దీంతో పాటు అదనంగా నాలుగు ప్రొఫెసర్, 22 అసోసియేట్, 61 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మంజూరు చేసి భర్తీ చేశారు. వైద్యులకు సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పించేందుకు ముందుగా దీర్ఘకాలంగా ఒకేచోట ఉన్న వారిని బదిలీ చేశారు. అనంతరం సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పించి కౌన్సెలింగ్ ద్వారా స్థానాలు కేటాయించారు. ఆ తర్వాత పరస్పర బదిలీలనూ నిర్వహించారు. ఈ క్రమంలో కోరుకున్న ప్రాంతానికి చాలా మంది వైద్యులు చేరుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో పోస్టుల భర్తీ లేదు, పదోన్నతుల ఊసే లేకపోవడం గమనార్హం. ఆసుపత్రిలో నిలిచిపోయిన ఐపీ భవనం పనులుసమస్యల వలయంలో పెద్దాసుపత్రి ● బోధనాసుపత్రిపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు ● నిధులు కేటాయించక నిలిచిన నిర్మాణాలు ● నత్తనడకన సాగుతున్న డ్రగ్ కంట్రోల్ ల్యాబ్ ● గత ప్రభుత్వంలో నాడు–నేడుతో ఎనలేని ప్రగతి ● ఆసుపత్రి చరిత్రలోనే అత్యధికంగా పోస్టుల భర్తీ ● నేడు పీజీ సీట్లు కోల్పోయే పరిస్థితికర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సమస్యల వలయంలో చిక్కుకుంది. ఎక్కడికక్కడ నిలిచిపోయిన భవనాలు, పాత భవనాల్లో చాలీ చాలని వసతులు, మందుల కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళాశాలపై చిన్నచూపు చూడటమే ఈ పరిస్థితికి కారణమవుతోంది. రూ.500కోట్ల అంచనాతో చేపట్టిన అభివృద్ధి పనులను పట్టించుకోకపోవడం వల్ల ఆసుపత్రిలో అడుగడుగునా ఇబ్బంది తలెత్తుతోంది. రాజధాని కర్నూలు నుంచి హైదరాబాద్కు తరలిన నేపథ్యంలో ఏర్పాటైన కర్నూలు మెడికల్ కాలేజి, జనరల్ హాస్పిటల్ అభివృద్ధి నత్తనడకన సాగింది. 50 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభమైన ఈ కళాశాల ప్రస్తుతం 250 సీట్లకు నోచుకుంది. అది కూడా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చొరవతో 50 సీట్లు వచ్చాయి. గతంలో సూపర్స్పెషాలిటి పీజీ చదవాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితిలో గత ప్రభుత్వం దాదాపు అన్ని విభాగాల్లో పీజీ సీట్లను మంజూరు చేసింది. అలాగే స్పెషాలిటీ కోర్సుల్లోని పీజీ సీట్లు 2019కి ముందు 138 మాత్రమే ఉండగా.. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అదనంగా మరో 26 సీట్లు పెరిగి మొత్తం పీజీ సీట్ల సంఖ్య 164కు చేరింది. 2019కి ముందు ఆసుపత్రిలో 300 వరకు మాత్రమే స్టాఫ్నర్సులు ఉండగా.. ఆ సంఖ్యను గత ప్రభుత్వం 800లకు చేర్చింది. ఫలితంగా రోగులకు నర్సింగ్ సేవలు చేరువయ్యాయి. ఇక 2019 వరకు 140 దాకా ఉన్న పీజీ సీట్ల సంఖ్య గత ప్రభుత్వంలో మ రో 35 మంజూరయ్యాయి. అదేవిధంగా 2019 వరకు కేవలం నాలుగు మాత్రమే ఉన్న సూపర్స్పెషాలిటీ సీట్ల సంఖ్య ఏకంగా 19కి చేరుకోవడం గత వైఎస్సార్సీపీ ఘనతగా ఆసుపత్రిలోనే చర్చ జరుగుతోంది. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి గండం ఆసుపత్రిలోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) గండం పొంచి ఉంది. గత ప్రభుత్వంలో ఈ విభాగంలో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండేవారు. దీంతో పాటు ఈ విభాగానికి పీజీ సీట్లు కూడా మంజూరు కావడంతో అధిక సంఖ్యలో పీజీ వైద్యులు ఉన్నారు. దీనివల్ల ఇక్కడ సేవలు గణనీయంగా పెరిగాయి. ఆ తర్వాత కొంత కాలానికి ఇక్కడ పనిచేసే ప్రొఫెసర్ రిటైర్ కావడం, ఇద్దరు అసిస్టెంట్లు లాంగ్ లీవ్ పెట్టడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఒక్కరే అన్ని పనులూ చేయాల్సి వస్తోంది. రోగులకు వైద్యం అందిస్తూ పీజీలకు పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో టీచింగ్ ఫ్యాకల్టీ లేరని చెబుతూ ఉన్న పీజీ సీట్లను ఎన్ఎంసీ రద్దు చేసే ప్రమాదం పొంచి ఉందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. నత్తనడకన రీజినల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబోరేటరీ పనులు నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగానే రీజినల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబోరేటరీకి 2019లోనే నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. 2023లో ఇందుకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నాక పనులు ప్రారంభమయ్యాయి. రూ.1.79కోట్లతో ఈ పనులు కొంత కాలం వేగంగా కొనసాగాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. పనులు పూర్తయితే ఔషధ నియంత్రణ శాఖ పరిపాలనా విభాగంతో పాటు రాయలసీమ స్థాయిలో ఔషధాలను పరీక్షించేందుకు ల్యాబోరేటరీ కూడా అందుబాటులోకి రానుంది. బిల్లుల పెండింగ్ వల్లే ఆలస్యం ఆసుపత్రిలోని ఐపీ భవనం, లెక్చరర్ గ్యాలరీ తదితర పనులు నిధుల లేమి వల్లే నిలిచిపోయాయి. ఈ రెండు పనులూ ఒకే అగ్రిమెంట్ కింద అయ్యాయి. ఒకే కాంట్రాక్టర్ పని చేస్తున్నాడు. అతనికి రూ.17.89కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటికోసం ఎదురుచూస్తూ పనులు నిదానం చేస్తున్నారు. బిల్లులు రాగానే పనుల్లో వేగం పుంజుకునే అవకాశం ఉంది. – ఎస్.కరీముల్లా, ఏపీఎంఎస్ఐడీసీ ఇన్చార్జి ఈఈ, కర్నూలు ఆగిపోయిన అభివృద్ధి పనులు గత వైసీపీ ప్రభుత్వం నాడు–నేడులో భాగంగా కర్నూలు మెడికల్ కాలేజి, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పలు నిర్మాణాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రూ.350కోట్లు నిర్మాణాలకు, రూ.150కోట్లు పరికరాలకు కేటాయించారు. ఇందుకు సంబంధించి ఐపీ భవనం, కళాశాలలో లెక్చరర్ గ్యాలరీలు, సెమినార్హాల్స్, హాస్టళ్ల నిర్మాణాల పనులు కొనసాగాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వీటి నిర్మాణాలు ఆగిపోయాయి. శరవేగంగా పనులు జరుగుతున్న ఐపీ భవనం, 80 శాతానికి పైగా పూర్తయిన లెక్చరర్ గ్యాలరీ, డ్రగ్ కంట్రోల్ టెస్టింగ్ ల్యాబ్ పనులు నిలిచిపోయాయి. ఐపీ భవన నిర్మాణం ఆగిపోవడం వల్ల పాత భవనాల్లో ఇరుకు పరిస్థితుల్లోనే రోగులకు చికిత్స చేస్తున్నారు. -
నేడు కర్నూలుకు మాజీ సీఎం వైఎస్ జగన్
కర్నూలు(టౌన్): మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గురువారం కర్నూలుకు రానున్నారు. ఉదయం 9.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.30 గంటలకు కర్నూలులోని జొహరాపురం రోడ్డులో ఉన్న మైపర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నగర శివారులోని జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో కుడా మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకులు కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో మాజీ సీఎం పాల్గొంటారు.వధూవరులను ఆశీర్వదించి వైఎస్సార్ సీపీ నాయకులతో మాట్లాడిన అనంతరం ఆయన తిరిగి 12.50 గంటలకు తాడేపల్లికి బయలుదేరి వెళ్తారు. మాజీ సీఎం పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ పనులను వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమూలపు సతీష్లు పరిశీలించారు. ఏర్పాట్లపై కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్తో చర్చించారు. -
బాధను భరిస్తూ పరీక్షకు హాజరు
ప్యాపిలి: పట్టణానికి చెందిన షాకీర్ బాఫా, శాలిబీ దంపతుల కుమారుడు రియాజ్ బాషా స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. సోమవారం ఇంటి వద్ద ఆడుకుంటూ కిందపడ్డాడు. దీంతో అతని రెండు చేతులు విరిగాయి. వైద్యులు అతన్ని పరీక్షించి రెండు చేతులకు కట్లు కట్టారు. చేతులకు కట్లు కట్టడంతో మంగళవారం చివరి పరీక్ష (సోషల్) రాయలేని పరిస్థితి ఉండటంతో అధికారులు ఈ విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేశారు. రియాజ్ బాషా ప్రశ్నలకు సమాధానాలు చెప్పగా అధికారులు తొమ్మిదో తరగతి విద్యార్థితో పరీక్ష రాసే ఏర్పాటు చేశారు. రెండు చేతులకు కట్లతో రియాజ్ బాషా -
తెగ తాగేశారు!
● పండుగల కిక్కు రెండు రోజుల్లో రూ.17 కోట్లు ● మద్యం విక్రయాల్లో రికార్డు బద్దలు ● 22,600 బాక్సుల మద్యం.. 12,400 బాక్సుల బీర్లు ఖాళీ ● ఎకై ్సజ్ అధికారులకు టార్గెట్లు విధించిన ప్రభుత్వం రెండు రోజుల్లో మద్యం విక్రయాలు ఇలా... కర్నూలు: కొత్త మద్యం పాలసీ... 24 గంటలూ అందుబాటులో మద్యం... ఆపై తెలుగు సంవత్సరాది ఉగాది.. మర్నాడు రంజాన్.. ఇంకేముంది మద్యం ప్రియులు మనసారా తాగేశారు, ఊగిపోయారు.. ఎంతగా అంటే రెండు రోజుల్లో ఏకంగా రూ.17.05 కోట్లు విలువైన మద్యం, బీర్లు తాగేశారు. ఇది జిల్లాలో సరికొత్త రికార్డు. ప్రజలకు దాహమేస్తే పాలకులు బిందెడు నీళ్లు ఇస్తున్నారో లేదో కానీ.. మద్యం ప్రియులు అడగకున్నా అర్ధరాత్రి వరకు మద్యాన్ని అందుబాటులో ఉంచిన కూటమి ప్రభుత్వం రూ.కోట్లు కొల్లగొట్టింది. జిల్లా చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో వరుసగా వచ్చిన రెండు పండుగల వేళ మద్యం విక్రయాల్లో రికార్డు బద్దలుకొట్టింది. ఒకటి, రెండు కాదు... ఏకంగా రూ.17.05 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. స్టేషన్ల వారీగా అధికారులకు టార్గెట్లు... ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ ఏడాది ఉగాది పండుగ వేళ జరిగిన మద్యం విక్రయాలు గతంలో ఎప్పుడూ జరగనంతగా రికార్డు స్థాయిలో జరిగాయి. వారం రోజుల ముందు నుంచే స్టేషన్ల వారీగా మద్యం దుకాణాల సంఖ్యను బట్టి గతంలో జరిగిన విక్రయాలకు అదనంగా 30 శాతం పెంచాలని అధికారులకు ప్రభుత్వం లక్ష్యాలు (టార్గెట్) విధించింది. దీంతో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు కూడా పరోక్షంగా బెల్టు దుకాణాదారులకు సహకారం అందిస్తున్నారనే ప్రచారముంది. గోదాములు కిటకిట... కూటమి ప్రభుత్వం ముందుగానే డిస్టిలరీల నుంచి భారీగా మద్యాన్ని డిపోలకు, అక్కడి నుంచి జిల్లాలోని 225 ప్రైవేటు మద్యం దుకాణాలు, 60 బార్లకు మద్యం తరలించారు. ఉమ్మడి జిల్లాలో రెండు ఐఎంఎల్ డిపోలు ఉన్నాయి. వాటి ద్వారా ఉగాది పండుగకు రెండు రోజుల ముందే రూ.20 కోట్ల విలువ చేసే మద్యం లిక్కర్ షాపులకు చేరింది. ఆ నిల్వలు సరిపోవని భావించిన ప్రభుత్వం పండుగ రోజుల్లో కూడా దుకాణాలకు అదనపు మద్యాన్ని తరలించేలా వ్యాపారులపై అధికారుల చేత ఒత్తిడి పెంచింది. ఈ సందర్భంగా జిల్లాలోని రెండు మద్యం డిపోలు కిటకిటలాడాయి. ఇందులో కర్నూలు డిపోలో రెండు రోజుల్లో సుమారు రూ.12 కోట్లు, నంద్యాల డిపోలో సుమారు రూ.10 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇన్వాయిస్ ధరపై... డిపోలనుంచి వ్యాపారులకు ఇన్వాయిస్ ధరపై మ ద్యం అందిస్తుండగా వాటికి తమ లాభ శాతం జోడించి ఎమ్మార్పీ ధరకు విక్రయించాల్సి ఉంది. ఉగాదికి రెండు రోజుల ముందు రూ.22 కోట్ల విలువ చేసే మద్యాన్ని వ్యాపారులు డిపోల నుంచి ఇన్వాయిస్ ధరపై కొనుగోలు చేసి విక్రయాలు జరిపారు. అదనపు ధరలకు బెల్టు షాపులకు కూడా విక్రయించి సొమ్ము చేసుకున్నారు. సాధారణ రోజుల్లో ఉమ్మడి జిల్లాలో సరాసరి రూ.4 నుంచి రూ.5 కోట్ల మేర అమ్మకాలు జరిగితే పండుగ సందర్భంగా మందుబాబులు రెట్టింపు స్థాయిలో తాగేశారు. అధికారులకు లక్ష్యాలు విధించడంతో రోజుకు అదనంగా రూ.3.50 కోట్ల అమ్మకాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కట్టడి... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలను కట్టడి చేయగా కూటమి సర్కార్ వచ్చాక విచ్చలవిడిగా అందుబాటులోకి తెచ్చింది. ప్రతి 10 వేల మంది జనాభాకు ఓ మద్యం దుకాణం ఏర్పాటు చేసింది. అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో ఊరూరా బెల్టు దుకాణాలు వెలిశాయి. దీంతో పండుగను పురస్కరించుకుని వ్యాపారులు మద్యాన్ని ఊరూవాడా ఏరులై పారించారు. జిల్లాలో టీడీపీ మద్యం సిండికేట్లకు డబ్బుల పంట పండింది. ప్రభుత్వ ఉద్దేశ్యం గుర్తించిన ఎకై ్సజ్ అధికారులు అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లా మద్యం కేసులు బీరు కేసులు విలువ కర్నూలు 10,677 6,451 రూ.8.24 కోట్లు నంద్యాల 11,914 5,939 రూ.8.81 కోట్లు మొత్తం 22,591 12,390 రూ.17.05 కోట్లు -
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి
కర్నూలు(హాస్పిటల్): ‘రోజురోజుకూ వాతావరణంలో మార్పులతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. తీవ్ర ఎండ వేడిమితో ప్రజలు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంది. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ తగలకుండా చూసుకోవచ్చు’ అని డీఎంహెచ్వో డాక్టర్ పి. శాంతికళ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. †తలనొప్పి, తలతిరగడం, నీరసం, నాలుక ఎండిపోవడం, తీవ్రమైన జ్వరం, మత్తు నిద్ర, కలవరింతలు, ఫిట్స్, పూర్తి అపస్మారక స్థితి వడదెబ్బ లక్షణాలన్నారు. †ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తెలుపు రంగు ఉన్న పల్చటి కాటన్ వస్త్రాలను ధరించాలన్నారు. †తలకు టోపీ పెట్టుకోవాలని, రుమాలు కట్టుకోవాలని సూచించారు. †ఉప్పు కలిపిన మజ్జిగ లేదా ఓఆర్ఎస్ నీటిని తాగాలన్నారు. †వడదెబ్బకు గురైన వారిని నీడగా ఉన్న చల్లటి ప్రాంతానికి వెంటనే చేర్చాలని, వారిని తడిగుడ్డతో శరీరమంతా తుడవాలన్నారు. వారు సాధారణ స్థితికి రాకపోతే శీతల వాతావరణంలో దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలన్నారు. †వడదెబ్బ తగలకుండా మంచినీరు వీలైనన్నిసార్లు తాగాలని, ఎండ నుంచి వచ్చిన వెంటనే నిమ్మరసం, కొబ్బరినీరు, నీరు తాగాలని సూచించారు. †ఎండలో బయట నుంచి వచ్చిన వెంటనే తీపి పదార్థాలు, తేనె తీసుకోకూడదని, శీతల పానియాలు, మంచుముక్కలు వంటివి తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయన్నారు. †ముఖ్యంగా చిన్నారులు, గర్భిణిలు, బాలింతలు, వృద్ధులు వడదెబ్బకు గురిగాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అన్ని సచివాలయాలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభిస్తాయన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ పి. శాంతికళ -
● రూ. 2 లక్షలు, 8 తులాల బంగారు ఆభరణాలు అపహరణ
ఎమ్మిగనూరులో పట్టపగలు చోరీ ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని సాయినగర్లో మంగళవారం పట్టపగలు ఓ ఇంట్లో చోరీ జరిగింది. స్థానికంగా నివాసముంటుంన్న మల్లారి అర్జున్రావు సోమప్ప సర్కిల్ ప్రాంతంలో హార్ట్వేర్ షాప్ను నిర్వహిస్తున్నాడు. భార్య, పిల్లలు ఊరికెళ్లటంతో ఇంటికి తాళం వేసి అతను షాప్కు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇల్లును లూటీ చేశారు. సాయంత్రం ఇంటికి వెళ్లి చూడగా తాళం పగలగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూశాడు. బీరువా తీసి ఉండటం, వస్తువులు చెల్లాచెదారుగా పడి ఉండటంతో పట్టణ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెళ్లి చోరీ జరిగిన తీరును పరిశీలించారు. రూ. 2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్ణణ సీఐ వి. శ్రీనివాసులు రాత్రి తెలిపారు. పాలీసెట్ ఎంరట్రెన్స్కు ఉచిత శిక్షణ కర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షలు రాసి పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న వారికి బుధవారం నుంచి పాలీసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జి.పుల్లారెడ్డి పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వీ.ఎస్.ఎస్.ఎన్ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తరగతులు ఉంటాయన్నారు. పదో తరగతి పరీక్షలకు హాజరై, పాలీసెట్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 94924 03015ను సంప్రదించాలని సూచించారు. -
అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీ భ్రమరాంబా దేవి అమ్మ వారికి మంగళవారం కొబ్బరి కాయలు సమర్పించారు. చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారం రోజున (ఏ రోజుముందుగా వస్తే ఆ రోజు) శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 15న ఈ కుంభోత్సవం నిర్వహించారు. ఈ అమ్మవారికి సాత్త్వికబలి నిర్వహించేందుకు (కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మొదలగునవి సమర్పించడం) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితీ. కుంభోత్సవం రోజున సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించడం జరుగుతోంది. కార్యక్రమంలో ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో వాటికి పూజలు జరిపించారు. తరువాత అమ్మవారికి ఈ కొబ్బరికాయలు సమర్పించారు. డైట్ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(న్యూటౌన్): ఉమ్మడి జిల్లాలోని డైట్ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేసేందుకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ జనార్ధన్రెడ్డి మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 10వ తేదీ వరకు గడువు ఉందన్నారు. 11న దరఖాస్తుల పరిశీలన, 16, 17 తేదీల్లో రాత పరీక్ష, 19న ఇంటర్వ్యూలు, ఎంపికై న వారికి 21న డిప్యూటేషన్ ఆర్డర్లు, 22న కేటాయించిన డైట్ కళాశాలలో చేరాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా, కన్వీనర్గా విద్యాశాఖ అధికారి, సభ్యులుగా డైట్ ప్రిన్సిపాళ్లు వ్యవహరిస్తారన్నారు. అర్హత ఉన్న వారు 55 శాతం మార్కులు, స్కూల్ అసిస్టెంట్గా కనీసం ఐదేళ్లు అనుభవం ఉండాలన్నారు. వయస్సు 58 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు. మరింత సమాచారం కోసం డీఈఓ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. -
నిత్య అతిథికి హారమై..
ఈ చిత్రాన్ని చూస్తుంటే సకల జీవరాశులు మనుగడకు కారణమైన సూర్య భగవానుడికి పక్షుల సమూహం హారమై నిలిచి వందనం చేస్తున్నట్లుగా ఉంది కదూ. సూర్యాస్తమయ సమయంలో నిత్య అతిథికి వీడ్కోలు పలుకుతూ ‘ఓ భానుడా మళ్లీ ఉదయించు’ అన్నట్లుగా వందల సంఖ్యలో పక్షులు తీగలపై నిలిచి కనిపించాయి. ఉదయం నుంచి ఆహారాన్వేషణలో అలసిన పక్షులు చీకటి పడుతున్న సమమంలో అన్నీ గూటికి చేరినట్లుగా విద్యుత్ తీగలపై వాలి సేద తీరాయి. కనువిందు చేసిన ఈ దృశ్యాలు మహానంది సమీపంలో మంగళవారం సాయంత్రం కనిపించాయి. – మహానంది -
నీరు నిలిచి.. పంట ఎండి
హరివరం చానల్ పరిధిలో ఎండిన వరి పైరు చేతికందాల్సిన వరి పైరుకు నీరందక ఎండిపోతోంది. పాలకుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు కన్నీళ్లు కష్టాలు తప్పడం లేదు. సాగునీటి విడుదలపై ప్రణాళికపోవడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. నీరందక కేసీ ఆయకట్టుకు ముప్పు ఏర్పడింది. దొర్నిపాడు మండంలో కేసీ కింద సుమారు 550 ఎకరాలకు పైగా రైతులు వరి సాగుచేశారు. కానీ మంచి అదునులో నీరు కాక పోవడంతో పంటంతా ఎండిపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి రూ.30 వేలకు వెచ్చించిన పెట్టుబడులు చేతికందని పరిస్థితి ఏర్పడింది. – దొర్నిపాడు -
విలవిల.. వెలవెల
● కళా విహీనంగా జూనియర్ కళాశాలలు ● మొదలైన ఇంటర్ సెకండియర్ తరగతులు ● తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులు ● మొదటి రోజు హాజరు 4.3 శాతం మాత్రమే కర్నూలు సిటీ/నంద్యాల(న్యూటౌన్): ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఇంటర్ సెకండియర్ తరగతులను మంగళవారం ప్రారంభించడంతో విద్యార్థులకు కష్టాలు తప్పలేదు. ‘పుస్తకాలు ఇవ్వలేదు..సారోళ్లు రాలేదు.. ఇలాగైతే ఎలా చదవాలి’’ అంటూ చాలా మంది విద్యార్థులు విలవిల ఏడ్చారు. చాలా జూనియర్ కాలేజీలకు విద్యార్థులు రాకపోవడంతో తరగతులు వెలవెల కనిపించాయి. ఇంటర్మీడియట్ విద్యలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి సంస్కరణలపై విద్యార్థులకు ఆసక్తి చూపడం లేదు. కొత్తగా 2025–26 విద్యా సంవత్సరం అకడమిక్ ఇయర్ క్యాలెండర్లో మార్పులు చేశారు. వేసవిలో కూడా తరగతులు నిర్వహించేలా ఉత్తర్వులు ఇచ్చారు. జూనియర్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు మంగళవారం సెకండియర్ తరగతులు ప్రారంభించారు. కాలేజీలు ప్రారంభించిన మొదటి రోజునే విద్యార్థుల చేతిలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం కింద పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, రికార్డులు అందజేస్తామని ప్రకటించారు. కానీ అసలు జిల్లాకు ఒక్క పుస్తకం కూడా రాలేదు. ఎలాంటి ముందస్తూ కసరత్తు లేకుండా, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా పబ్లిక్ పరీక్షలు ముగిసి రెండు వారాలకే తరగతులు ప్రారంభించడంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం మొదటి రోజు హాజరును బట్టి తెలుస్తుంది. ఇంటర్మీడియట్ విద్యలో ఎన్సీఈఆర్టీ సిలబస్ను అమలు చేసి, సిలబస్ను, పరీక్ష నమూనాలోను మార్పులు చేశారు. ఇదీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే. అయితే సెకండియర్ సిలబస్, పరీక్షల నమూనాలో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ అకడమిక్ క్యాలెండర్లో చేసిన మార్పులకు అనుగుణంగా తరగతులను ప్రారంభించడం, గత నెల మొదటి వా రం జరిగిన పరీక్షల మూల్యాంకనం ఇంకా పూర్తి కాక ముందే విద్యా సంవత్సరం మొదలు కావడంపై అధ్యాపకులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు హాజరు 4.30 శాతమే! జిల్లాలో 23 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 16 ఏపీ మోడల్ స్కూల్ కాలేజీలు, కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలు 26, ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు రెండు, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలు 8, మహత్మజ్యోతిరావు ఫూలే కాలేజీలు 01, ఎయిడెడ్ కాలేజీలు 04 మొత్తం 80 కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీలకు చెందిన సుమారు 7,769 మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాశారు. వీరిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 4,099 మందికిగాను కేవలం 175 మంది మాత్రమే హాజరయ్యారు. మిగిలిన కాలేజీలు ప్రారంభం అయినా విద్యార్థులు హాజరుకాలేదు. విద్యార్థులు హాజరైన కాలేజీల్లో కూడా రెండు, మూడు చోట్ల మాత్రమే మధ్యాహ్న భోజనాన్ని పెట్టారు. జీరో శాతం హాజరు ఉన్న జూనియర్ కళాశాలల వివరాలు.. జిల్లాకు చేరని పుస్తకాలు ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద ఉచితంగా కిట్లను పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ మేరకు జిల్లా పాఠ్యపుస్తకాలు 85,345, నోటు పుస్తకాలు 1,73,532, రికార్డులు 17,629 అవసరమని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారులు ఇండెంట్ పెట్టారు. వీటిలో ఒక్కటి కూడా జిల్లాకు చేరలేదు. పది రోజులకే తరగతులా? మొదటి సంవత్సరం ఇంటర్ ఫలితాలు వచ్చిన తర్వాత రెండో సంవత్సరం తరగతులు నిర్వహిస్తే మంచిది. మొదటి సంవత్సరం పరీక్షలు రాసి 10 రోజులు గడవకముందే రెండో సంవత్సరం తరగతులు నిర్వహించడంతో ఇబ్బంది. మొదటి రోజు కాలేజీలు ప్రారంభం రోజున 16 మంది విద్యార్థులు హాజరయ్యారు. ముగ్గురు లెక్చరర్లు, ప్రిన్సిపాల్ కాలేజీకి వచ్చారు. ఇంటర్ రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఏం చదవాలో, రాయాలో అర్థం కాలేదు. – లలిత, నంద్యాల ఎలా చదవాలి? పరీక్షలు ముగిశాయి. ఇంటర్ రెండో సంవత్సరం కళాశాలలో తరగతులు ప్రారంభమయ్యాయి. పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. ఎలా చదవాలి? ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 273 మంది విద్యార్థులకు గాను 16మంది మొదటి రోజు హాజరయ్యారు. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు అందజేస్తామని ప్రభుత్వం చెప్పింది. ప్రారంభమైన రోజున పుస్తకాలు ఇవ్వలేదు. –యాకూబ్, వెంకటేశ్వరపురం, నంద్యాల -
ముగిసిన పదో తరగతి పరీక్షలు
కర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షలు మార్చి 17వ తేదీన ప్రారంభమై మంగళవారంతో ముగిశాయి. మొదటి రోజు రెండు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఓ టీచర్ సస్పెండ్ అయ్యారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఫర్నిచర్ లేకుండా పరీక్షలు రాయించినందుకు ఇద్దరు సీఎస్లను విధుల నుంచి తొలగించారు. జిల్లాలో 172 కేంద్రాల్లో జరిగిన పరీక్షలను నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన పరీక్షకు 32,420 మందికి గాను 31,990 మంది హాజరై 430 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు కేంద్రాల దగ్గర కేరింతలు కొడుతూ గెంతులేశారు. ఇదిలా ఉండగా.. కర్నూలులోని దామోదరం సంజీవయ్య స్మారక మున్సిపల్ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ రంజిత్బాషా తనిఖీ చేశారు. కాగా.. జిల్లాకు ఇప్పటి వరకు 2 లక్షల వరకు పదో తరగతి జవాబు పత్రాలు వచ్చాయని, రేపటి నుంచి మూల్యాంకనం జరుగుతుందని డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ తెలిపారు -
పదవీ విరమణ సమస్యలుంటే నేరుగా కలవండి
● రిటైర్డ్ పోలీసు అధికారులకు ఎస్పీ సూచన కర్నూలు: జిల్లా పోలీసు శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన వారు బెనిఫిట్స్ (ప్రయోజనాలు) సంబంధించిన సమస్యలేవైనా ఉంటే నేరుగా తనను కలవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. సుదీర్ఘకాలం పోలీసు శాఖలో పనిచేసి కర్నూలు పీసీఆర్ ఎస్ఐ పుల్లన్న నాయక్, ఏఆర్ఎస్ఐ ఎల్ఎల్ రంగారెడ్డి, ఏఆర్పీసీ కె.వెంకటరామిరెడ్డి మంగళవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా కర్నూలు నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో వారిని సన్మానించారు. వారిని శాలువ, పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ అందజేశారు. అనంతరం ఘనంగా వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులతో కలసి శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని వారికి ఎస్పీ సూచించారు. సమస్యలు ఉంటే తనను నేరుగా కలవొచ్చని తెలిపారు. కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, డీపీఓ ఏఓ విజయ్కుమార్ నాయుడు, ఎస్బీ సీఐలు కేశవరెడ్డి, తేజమూర్తి, ఆర్ఐ నారాయణ, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
రమణీయం.. రాయబారాది మహోత్సవం
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో శ్రీ చౌడేశ్వరిదేవి రాయబారాది మహోత్సవం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథం(తేరుబండి)పై ముస్తాబు చేశారు. అనంతరం అష్టపుర గ్రామానికి చెందిన ప్రజలు ఎండ్ల బండ్ల ప్రదర్శనతో రాయబారాది కార్యక్రమానికి తరలి వెళ్లారు. గ్రామ సమీపంలోని గంగమ్మ గుడి వద్ద ఉన్న వేపచెట్టు వద్ద అమ్మవారికి రాయబారాది కార్యక్రమాన్ని నిర్వహించారు. మళ్లీ ఆలయం వద్దకు చేరుకోవడంతో ఈ కార్యక్రమం ముగిసింది. -
కాళ్లు కదపలేక.. మెట్లు ఎక్కలేక!
పింఛన్ల పంపిణీ అభాసుపాలు ● ఇంటిదగ్గర పింఛన్ల పంపిణీ నామమాత్రమే ● అధిక శాతం సచివాలయాల వద్దే.. ● సర్వర్ పనిచేయక లబ్ధిదారుల పడిగాపులుకర్నూలు(అగ్రికల్చర్): ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీ చేస్తామని ప్రభు త్వం చెప్పినా, క్షేత్రస్థాయిలో అభాసుపాలు అవుతోంది. సచివాలయ ఉద్యోగులు ఇళ్ల వద్దకు రాకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు ఇక్కట్ల పాలయ్యారు. నడకలేక, సచివాలయం మెట్లు ఎక్కలేక అవస్థలుపడ్డారు. చాలాచోట్ల రచ్చబండల దగ్గర పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. నివాసానికి 300 మీటర్ల దూరంలో పంపిణీ చేసే వెసులుబాటు కల్పించడంతో దాదాపుగా ఇంటి దగ్గర పింఛన్ల పంపిణీ నామమాత్రానికే పరిమితమైంది. సర్వర్ పనిచేయకపోవడంతో పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు పంపిణీ ముందుకు సాగని పరిస్థితి. ఇదిలాఉంటే జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కర్నూలు నగరంలోని సాయి బాబా సంజీవయ్య నగర్లో పింఛన్లు పంపిణీ చేశా రు. పంపిణీ తీరుతెన్నులపై ఆయన లబ్ధిదారులతో ఆరా తీశారు. సాయంత్రం 6 గంటల సమయానికి కర్నూలు జిల్లాలో 93.35 శాతం, నంద్యాల జిల్లాలో 92.02 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయింది. -
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రూ.3 కోట్లు స్వాహా
ఆదోని అర్బన్: ప్రభుత్వ భూమిని సొంత భూమి అంటూ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, వాటితో బ్యాంక్ను మోసం చేశారు. రూ.కోట్ల రుణం తీసుకుని చెల్లించకపోవడంతో అధికారుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వన్టౌన్ సీఐ శ్రీరామ్ తెలిపిన వివరాల మేరకు.. స్థానిక శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ కో ఆపరేటివ్ బ్యాంకులో రూ.3.24 కోట్లు రుణం తీసుకున్న నలుగురిపై వన్టౌన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. బ్యాంకు చైర్మన్ రాచోటి సుబ్బయ్య ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పట్టణానికి చెందిన యలే మల్లేశప్ప, యలే చెన్నబసప్ప, యలే చైత్ర ప్రభుత్వ స్థలాన్ని తమ సొంత స్థలమంటూ మూడు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. బ్యాంకు సీఈఓ గట్టు మురళి సహకారంతో రూ.3.24 కోట్లు రుణం తీసుకున్నారు. అయితే ఆ రుణాన్ని ఇంతవరకు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఆ స్థలాన్ని వేలం వేయడానికి సిద్ధమయ్యారు. అయితే ప్రభుత్వ స్థలాన్ని వేలం ఎలా వేస్తారని ప్రభుత్వ ఉద్యోగులు అడ్డుకున్నారు. ల్యాండ్ డాక్యుమెంట్ డేటా తీయగా, ఆ మూడు డాక్యుమెంట్లు నకిలీవిగా తేలింది. బ్యాంకు చైర్మన్ రాచోటి సుబ్బయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేయగా.. బ్యాంకు సీఈఓ గట్టు మురళి పాత్ర వెలుగులోకి వచ్చింది. అతని సహకారంతో నకిలీ డాక్యుమెంట్లతో రూ.3.24 కోట్ల రుణాన్ని నిందితులు తీసుకున్నారు. తీసుకున్న రుణం చెల్లించగకుండా, బ్యాంక్ను మోసం చేసిన యలే మల్లేశప్ప, యలే చెన్నబసప్ప, యలే చైత్ర, వారికి సహకరించి రుణం ఇప్పించిన బ్యాంకు సీఈఓ గట్టు మురళిపై చీటింగ్, ఫోర్జరీ, తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ప్రభుత్వ భూమిని సొంత భూమిగా మార్చిన వైనం ఆ పత్రాలతో అవ్వా బ్యాంకులో రూ.3.24 కోట్ల రుణం బ్యాంకు సీఈఓతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు -
ధూమపానం వల్ల క్యాన్సర్
బీడీ, సిగరెట్ తాగే వారిలో క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, స్వరపేటిక, అన్నవాహిక, జీర్ణాశయం, మూత్రాశయ క్యాన్సర్లు వస్తాయి. బీడి, సిగరెట్ అధికంగా తాగే వారిలో చేతులు, కాళ్లలోని నరాలు మూసుకుపోతాయి. ఫలితంగా కాళ్లు, చేతుల్లో రక్తప్రసారం తగ్గిపోతుంది. దీనివల్ల కాళ్లు, చేతులు నల్లగా మారిపోయి తీవ్ర నొప్పిని కలుగజేస్తున్నాయి. గ్యాంగ్రిన్గా మారిన కాలు, చేతిని తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. – డాక్టర్ సి.వాసురెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్టు, కర్నూలు గుండె సమస్యలకు దారి తీస్తుంది రోజూ ధూమపానం చేసే వారిలో, చేయని వారితో పోలిస్తే గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. సిగరెట్ తాగడం వల్ల గుండెపోటుతో పాటు బ్రెయిన్స్ట్రోక్, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, కాళ్లలో ధమనులు గట్టిగా మారడం సంభవిస్తాయి. ధూమపానం గుండె కండరాలకు ఆక్సిజన్ తీసుకెళ్లే రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటానికి కారణం అవుతుంది. ఈ కారణంగానే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధూమపానానికి దూరంగా ఉండాలి. ఒకవేళ అలవాటుంటే నెమ్మదిగా దానికి దూరం కావాలి. – డాక్టర్ లక్ష్మణస్వామి, కార్డియోవాస్కులర్ సర్జన్, కర్నూలు -
అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి
● ఎంగేజ్మెంట్కు ఒక రోజు ముందు ఘటన ఎమ్మిగనూరురూరల్/పెద్దకడుబూరు: పెద్దకడుబూరు మండలం హెచ్.మురవణి గ్రామ పరిధిలో ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పట్టణంలోని వెంకటాపురం కాలనీకి చెందిన కె. రంగన్న, కె.జయమ్మకు ముగ్గురు కుమారులు. పెద్దకుమారుడు కె. వీరనాగన్న (26) డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఎటువంటి ఉపాధి లేకపోవటంతో పట్టణంలో హమాలీ పనికి వెళ్లేవాడు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో భోజనం చేసి ఇంటి మిద్దైపె పడుకోవటానికి వెళ్లాడు. సోమవారం ఉదయం కనిపించకపోవటంతో బయటకు వెళ్లాడేమో అని కుటుంబ సభ్యులు భావించారు. అయితే వెంకటాపురం సమీపంలోని హెచ్.మురవణి పరిధిలోని తమ పొలంలో ఓ చెట్టు కింద వీరనాగన్న విగత జీవిగా పడి ఉన్నాడు. సమీపంలోని రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ శ్రీనివాసులు వెంకటాపురానికి పోలీసులను పంపి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మృతి చెందిన సంఘటన స్థలం పెద్దకడుబూరు పోలీస్స్టేషన్ పరిధిలోకి వస్తుండటంతో కోసిగి సీఐ మంజునాథ్, పెద్దకడుబూరు ఎస్ఐ నిరంజన్రెడ్డి ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మార్చురీలోని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం పక్కన పురుగు మందు డబ్బా ఉందని, శరీరంపై గాయాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరనాగన్నకు కోసిగి మండలం పల్లెపాడు గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి కుదిరింది. మంగళవారం ఎంగేజ్మెంట్ జరగాల్సి ఉంది. ఇంతలోనే యువకుడు మృతి చెందటంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పెద్దకడుబూరు ఎస్ఐ నిరంజన్రెడ్డి తెలిపారు. -
రామ ఫలం ఎంతో రుచి..
సీతా ఫలం తిన్నాము కానీ... రామ ఫలం ఎప్పుడూ చూడలేదు.. తినలేదు అనుకుంటున్నారా.. అవును ఇది మన ప్రాంతంలో పండదు. ఉత్తరాంధ్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో లభిస్తాయి. అయితే తినాలనుకంటే సూపర్ మార్కెట్లలో, ఆన్లైన్లో లభిస్తాయి. పేరుకు తగ్గట్టే ఈ పండులో ఎన్నో పోషకాలు ఉండి ఆరోగ్యాన్ని సంరక్షిస్తోంది. ముఖ్యంగా క్యాన్సర్ను నివారించే గుణాలు ఈ పండులో ఉన్నాయి. ఇప్పుడు ఈ పండు గురించి ప్రస్తావన ఎందుకంటే.. మండల కేంద్రమైన జూపాడుబంగ్లా శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో నివాసముంటున్న లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి పన్నెండేళ్ల క్రితం రామఫలం మొక్కను నాటగా ఇది ఇప్పుడు పెరిగి కాయలు కాస్తోంది. వీటి తొడిమె గుండ్రంగా ఉండి పండు ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఎన్నో ఔషధగుణాలు ఉన్న రామఫలం వృక్షాన్ని ప్రతి ఇంటి పెరటిలో పెంచుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. – జూపాడుబంగ్లా -
పత్రికా స్వేచ్ఛపై దాడి అనైతికం
● గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ గడివేముల: పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ వ్యవహరించడం అనైతికమని ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ విమర్శించారు. సోమవారం గడివేముల మూల పెద్దమ్మ దర్శనానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల సాక్షి కార్యాలయంపై ఆమె దాడికి యత్నించడం సబబుకాదన్నారు. పత్రికలు, టీవీల్లో వ్యతిరేక కథనాలు రాస్తే దాడులు చేస్తామనే భయాన్ని జర్నలిస్టుల్లో కలిగించేందుకు ఆమె యత్నిస్తున్నారన్నారు. వాస్తవాలు రాసే మీడియాపై దాడులు ఎంతవరకు సమంజసమన్నారు. మీడియాలో వ్యతిరేక వార్తలు వస్తే దానికి ఖండన కోరడం, లీగల్ నోటీసులు ఇవ్వాలనే కానీ.. గూండాగిరికి యత్నించడం సరికాదన్నారు. అఖిలప్రియ సాక్షి కార్యాలయంపై దాడిచేసేందుకు వస్తుంటే పోలీసులు ఆమెను గృహ నిర్బంధం చేయకుండా ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఇది పరోక్షంగా దాడికి సహకరించడమేనన్నారు. కోలుకోలేక రిటైర్డ్ ఏఎస్ఐ మృతి ఆదోని అర్బన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిటైర్డ్ ఏఎస్ఐ నారాయణమూర్తి(77) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. శనివారం ఆయన మాతా శిశు ఆసుపత్రి వద్ద వస్తుండగా బైకు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పోలీసుల అదుపులోని దొంగలు పరార్? ● ఆలస్యంగా వెలుగులోకి.. పాణ్యం: విద్యుత్ తీగల దొంగలు పోలీసుల కళ్లు గప్పి పరారయ్యారు. పట్టుబడిన దొంగలను వాహనంలో స్టేషన్కు తరలిస్తుండగా అదును చూసి తప్పించుకున్నారు. పాణ్యం పోలీసు స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిన్నాపురం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు విద్యుత్ తీగలు చోరీ చేసి విక్రయించినట్లు పోలీసులకు సమాచారం అందింది. వారిపై నిఘా పెట్టిన పోలీసులు ఆదివారం గ్రామానికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. వారిని జీపులో స్టేషన్కు తరలిస్తుండగా పాణ్యం సర్వీస్ రోడ్డు వద్ద స్పీడ్ బ్రేకర్ ఉండటంతో వాహన వేగం తగ్గింది. ఆ క్రమంలో జీపులో ఉన్న దొంగలు వెంటనే దిగి పరుగులు తీశారు. అయితే ప్రధాన నిందితుడు పోలీసులు ఆదుపులో ఉన్నట్లు సమాచారం. -
‘స్పాట్’కు స్కూల్ అసిస్టెంట్లు కావలెను
నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి జవాబు పత్రాలు మూల్యాంకన ప్రక్రియలో స్కూల్ ఆసిస్టెంట్ల (ఎస్ఏ) పాత్ర చాలా కీలకం. మూల్యాంకనంలో ప్రతి ముగ్గురు ఏఈ (అసిస్టెంట్ ఎగ్జామినర్లు)లకు ఒక స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) నియమించాల్సి ఉంది. ఏప్రిల్ 3 నుంచి జిల్లాలో పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం కానుంది. జిల్లాకు దాదాపు 2 లక్షలకు పైగా జవాబు పత్రాలు రానున్నాయి. ఇప్పటికే తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, గణితం, బాటనీ పరీక్షల జవాబు పత్రాలు చేరాయి. నంద్యాలలోని ఎస్డీఆర్ పాఠశాలలోని స్ట్రాంగ్ రూంలో వీటిని భద్రపరిచారు. అయితే స్పాట్కు సుమారు 200 మందికి పైగా స్కూల్ అసిస్టెంట్లు అవసరం కాగా, ఇప్పటి వరకూ ఆ విధులు నిర్వర్తించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఏటా ఇదే తంతు కొనసాగుతూ వస్తున్నా... గత అనుభవాలతో విద్యాశాఖ అధికారులు గుణపాఠం నేర్పు కోకపోవడం గమనార్హం. స్కూల్ అసిస్టెంట్ల విషయంలో ఈసారి కూడా గత ఏడాది పరిస్థితులే ఎదురయ్యాయి. ముందుగానే అప్రమత్తమవుతున్నామని విద్యా శాఖ అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి మండలం నుంచి కనీసం 10 మంది టీచర్లను ఎంపిక చేసి స్కూల్ అసిస్టెంట్ల విధులకు పంపాలని డిప్యూటీ విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మంత్రాంగం ఎంత మాత్రం పని చేస్తుందనేది మూల్యాంకనం ప్రారంభమైన తొలిరోజు తెలిసిపోతుంది. స్కూల్ అసిస్టెంట్ల విధులు ఇలా.. మూల్యాంకనంలో చిన్నపాటి తప్పిదం జరిగినా నష్టపోయేది విద్యార్థులే. అసిస్టెంట్ ఎగ్జామినర్లు (ఏఈ) పేపర్లు దిద్ది మార్కులు వేసిన తర్వాత ఆ జవాబు పత్రాన్ని స్కూల్ అసిస్టెంట్లు తీసుకుని మార్కుల పోస్టింగులు, టోటలింగ్ పరిశీలించాల్సి ఉంటుంది. చిన్నపాటి తప్పిదాలకు తావివ్వకుండా ఏఈలు దిద్దిన జవాబు పత్రాలను స్కూల్ అసిస్టెంట్లు మరోసారి పరిశీలించి మార్కుల వివ రాలను ధ్రువీకరించాల్సి ఉంది. అయితే మూ ల్యాంకన ప్రక్రియలో పాల్గొంటున్న ఇతర అన్ని కేడర్ల కంటే స్కూల్ అసిస్టెంట్లకే రెమ్యూనరేషన్ తక్కువ. పైగా డీఏ వెసులుబాటు ఉండదు. మండుతున్న ఎండలకు తోడు ఆశించిన స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడంతో చాలా మంది టీచర్లు స్కూల్ అసిస్టెంట్లు ఆసక్తి చూపడం లేదు. సమస్యను అధిగమిస్తాం ఏప్రిల్ 3న పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుంది. స్పెషల్ అసిస్టెంట్లుగా వచ్చేందుకు ఉపాధ్యాయులు ఆసక్తి చూపక పోవడమనేది ప్రతి ఏటా ఎదురవుతున్న సమస్యనే. ఈసారి ఈ సమస్యను అధిగమిస్తాం. వీలైనంత మందిని నియమించేందుకు చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే డీవైఈఓలు, ఎంఈఓలకు లేఖలు రాశాం. ప్రతి మండలం నుంచి కనీసం పదిమంది టీచర్లను స్పెషల్ అసిస్టెంట్లుగా పంపాలని చెప్పాం. – జనార్ధన్రెడ్డి, డీఈఓ, నంద్యాల ఏప్రిల్ 3 నుంచి పది మూల్యాంకనం ప్రారంభం స్కూల్ అసిస్టెంట్లుగా వచ్చేందుకు ఆసక్తి చూపని ఉపాధ్యాయులు ఏటా ఇదే తంతు... గత అనుభవాలతో గుణపాఠం నేర్వని విద్యాశాఖ -
వైభవంగా శ్రీరంగనాథ పార్వేట
మద్దికెర: పెరవలి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీరంగనాథుడు ఉగాది సంబరాల్లో భాగంగా సోమ వారం స్వామి వారు పార్వేటను వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి బిందెసేవతో పాటు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని పల్లకీలో గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం గ్రామ శివారులోని గోదా చెరువు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ చెరువులో కుందేళ్లను వదిలి పట్టుకునే పార్వేట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ వీరయ్యతోపాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
పప్పు.. తప్పు ప్రకటన
కర్నూలు(సెంట్రల్): ఒక్కో కార్డుకు కేజీ కంది పప్పు ఇస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అధికారులు సైతం ఆదేశించారు. అయితే మంత్రి చెప్పిన మాటలు తప్పు అని తేలుతోంది. మూడు నెలల నుంచి జిల్లాకు బ్యాళ్ల కేటాయింపులే జరగడం లేదు. పేదలకు ఇచ్చే బియ్యం, చక్కెరలోనూ భారీ కోతలు విధించారు. గతంలో బియ్యానికి బదులుగా కార్డుకు రెండు, మూడు కేజీల చొప్పున జొన్నలు, రాగులు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ విధానాన్ని పూర్తిగా నిలిపి వేశారు. జిల్లాలో 6,34,631 మంది రేషన్ కార్డుదారులు ఉండగా.. ఒక్కో కార్డుకు కేజీ కంది పప్పు రూ.67 చొప్పున ఇవ్వాల్సి ఉంది. జిల్లాకు 600 టన్నుల బ్యాళ్లను ఇవ్వకపోవడంతో పంపిణీ చేయడం లేదు. బయటి మార్కెట్లో కిలో రూ.135పైగా ధరతో కొనుగోలు చేయలేక పేదలు పప్పన్నానికి దూరమవుతున్నారు. ● జిల్లాకు ఏప్రిల్ కోటాకు సంబంధించి బియ్యం కేటాయింపుల్లో 2,900 టన్నుల కోత పడింది. మార్చిలో 11,746 టన్నులు బియ్యం ఇవ్వగా ఏప్రిల్కు సంబంధించి 8,747 టన్నులు కేటాయించారు. ఫలితంగా ఏప్రిల్లో పేదలకు బియ్యం లేదనే చెప్పే అవకాశం ఉంది. ● ప్రతి కార్డుదారుడికి అర్ధకేజీ చక్కెర రూ.17.50 చొప్పున ఇవ్వాల్సి ఉంది. జిల్లాకు 350 టన్నుల అవసరం ఉండగా 200 టన్నులు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. బ్యాళ్ల సరఫరా ఉండదు ఏప్రిల్ నెలలో రేషన్ కార్డు దారులకు బ్యాళ్లసరఫరా ఉండదు. బియ్యంలో సరఫరాలో ఇబ్బందులు ఉండవు. చక్కెర అందుబాటులో ఉంటుంది. జొన్నలు, రాగులు అస్సలు లేవు. – ఎం.రాజారఘువీర్, డీఎస్ఓ, కర్నూలు మూడు నెలల నుంచి బ్యాళ్ల సరఫరా నిలుపుదల నేటి నుంచి రేషన్ సరుకుల పంపిణీ -
ఉపాధ్యాయ సమస్యలపై రేపు నిరసన
కర్నూలు కల్చరల్: ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి బుధవారం కల్టెరేట్ వద్ద నిరసన చేపడుతున్నట్లు ఫ్యాప్టో రాష్ట్ర కో చైర్మన్ కె. ప్రకాష్రావు, రాష్ట్ర ఎగ్జిక్యుటివ్ కమిటీ సభ్యులు జి.హృదయ రాజు తెలిపారు. ఎస్టీయూ భవన్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కరోనా కాలం నుంచి కొందరు ఉపాధ్యాయులు, ఉద్యోగులు మృతిచెందారని, కారుణ్య నియామకాల్లో భాగంగా వారికి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. సరెండర్ లీవ్ బకాయిలు 2022 నుంచి పెండింగ్లో ఉన్నాయని వాటిని చెల్లించాలని కోరారు. ఫ్యాప్టో జిల్లా చైర్మన్ సేవలాల్ నాయక్, ఆర్థిక కార్యదర్శి రంగన్న, నాయకులు రవికుమార్, నవీన్పాటిల్, గోకారి, జనార్దన్, శ్రీనివాసరెడ్డి, వెంకటరాముడు, నందీశ్వరుడు పాల్గొన్నారు. -
పిడకల సమరం.. ప్రేమదే విజయం
ఆస్పరి: ప్రేమికులను విడదీసే పెద్దలు చూసుంటాం.. విషాదాంతం అయిన ప్రేమ కథలను వింటూ ఉంటాం. ప్రేమను గెలిపించే పోరాటం అరుదుగా కనిపిస్తుంది. అలాంటి పోరాటమే ఒకటి ఆచారంగా ప్రతి ఏటా ఆస్పరి మండలంలోని కై రుప్పల గ్రామంలో కొనసాగుతోంది. వీరభద్రస్వామి, కాళికాదేవి బ్రహోత్సవాలు సందర్భంగా సోమవారం రెండు వర్గాల భక్తుల మధ్య ఉత్కంఠ భరితంగా పిడకల సమరం సాగింది. ఆచారం ప్రకారం కారుమంచి నుంచి పెద్దరెడ్డి వంశస్తుడైన నరసింహారెడ్డి గుర్రంపై మందీ మార్బలంతో ఊరేగింపుగా కై రుప్పల గ్రామానికి వచ్చారు. వీరభద్రస్వామి ఆలయంలోకి వెళ్లి పూజలు చేసి వెనుతిరిగారు. ఆతరువాత పిడకల సమరం మొదలైంది. రెండు వర్గాలుగా విడిపోయిన గ్రామస్తులు పరస్పరం ఒకరిపై ఒకరు పిడకలతో దాడి చేసుకున్నారు. వందల సంఖ్యలో గాల్లోకి పిడకలు లేచి ప్రత్యర్థి వర్గంపై పడుతుంటే ఉత్సాహం రెట్టింపు అయ్యింది. పిడకల దుమ్ము అకాశాన్నంటింది. తమను తాము రక్షించుకుంటూ ఎదుటి వారిపై పిడకలు విసురుకుంటూ గుంపులు, గుంపులుగా కదిలారు. ఒక సారి ఒక వర్గం వారిది పైచేయి అయితే, మరో సారి మరో వర్గం వారిది పైచేయిగా నిలిచింది. దెబ్బలు తగిలిన వారు స్వామి వారి బండారు పూసుకున్నారు. ఈ సమరాన్ని జనం ఆసక్తిగా చూశారు. కేకలు, ఈలలతో హోరెత్తించారు. పిడకల సమరంలో రెండు వర్గాలకు చెందిన 30 మంది స్వల్పంగా గాయపడ్డారు. జనంతో కై రుప్పల కిట కిటలాడింది. సమరంలో గొరవయ్యల నృత్యం ఆకట్టుకుంది. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆలయ కార్యనిర్వహణాధికారి రాంప్రసాద్, సర్పంచ్ తిమ్మక్క గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య, ఆస్పరి సీఐ మస్తాన్వలి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. పోరు ముగిసిన తర్వాత గ్రామ పెద్దలు.. ప్రేమికులైన వీరభద్రస్వామి, కాళికాదేవిలకు వివాహం చేసేందుకు నిశ్చయించారు. -
15 మండలాల్లో కరువు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2024–25 రబీ సీజన్కు సంబంధించి 15 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రబీలో వర్షాభావ ప్రభావం దాదాపు అన్ని మండలాలపై తీవ్రంగా ఉంది. సాగు విస్తీర్ణం తగ్గిపోగా దిగుబడులు కూడా పడిపోయాయి. అయితే కర్నూలు జిల్లాలో పది మండలాలు, నంద్యాల జిల్లాలో ఐదు మండలాల్లోనే కరువు ప్రభావం ఉందని ఆయా జిల్లా అధికారులు ఇటీవల ప్రభుత్వానికి నివేదిక పంపారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఆయా మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తిస్తూ విపత్తుల నిర్వహణ శాఖ జీవో ఎంఎస్ 3 జారీ చేసింది. డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి, డోన్ మండలాలు పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ మండలాలు కరువు ప్రాంతాల జాబితాలో చేర్చకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కర్నూలు జిల్లాలో కరువు మండలాలు: ఆస్పరి, కల్లూరు, కర్నూలు రూరల్, కర్నూలు అర్బన్, మద్దికెర, ఓర్వకల్, గూడూరు, కోడుమూరు, వెల్దుర్తి, పత్తికొండ. నంద్యాల జిల్లాలో కరువు మండలాలు: కొలిమిగుండ్ల, సంజామల, బనగానపల్లి, ఉయ్యలవాడ, బేతంచెర్ల.పండుగ రోజూ రిజిస్ట్రేషన్లు కర్నూలు(సెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రంజాన్ పండుగ ఉన్నా ఆదివారం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 24 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేశాయి. మొత్తం 100 వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. కాగా.. కర్నూలు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో టైం స్లాట్ బుకింగ్ను పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నారు. గతం నుంచే ఈ విధానం అమల్లో ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మొట్ట మొదటిసారి ప్రవేశపెట్టారని ప్రచారం చేసుకోవడం గమనార్హం. 10 నుంచి ఎల్లెల్సీకి నీటి సరఫరా బంద్ హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ)కు ఈ నెల 10వ తేదీన నీటి సరఫరాను నిలిపివేయనున్నారు. ఆలస్యంగా సాగు చేసిన పైర్లు దెబ్బ తింటాయని, మరి కొద్ది రోజులు నీటిని వదలాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయం(టీబీ డ్యాం)లో 11 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఎండ తీవ్రత ఎక్కవగా ఉండటంతో డ్యాంలో నీరు అవిరవుతోంది. పంటలు ఎండుతున్న నేపథ్యంలో ఎల్లెల్సీకి నీటి విడుదలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. -
కుట్ర కని‘పింఛన్’
వైఎస్సార్సీపీ పాలనలో ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్లు ఇవ్వడం విశేషం. ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో కొత్త పింఛన్లను అర్హులకు అందించారు. రాజకీయాలకు అతీతంగా.. అర్హతే ప్రామాణికంగా పింఛన్లకు ఎంపిక చేశారు. గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే చాలు వలంటీర్లు ఇంటి వద్దకే మంజూరు పత్రం అందించిన రోజులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.నమ్మించి మోసగించారు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై పది నెలలు అవుతోంది. ఇంతవరకు కొత్త పింఛన్ల ఊసే ఎత్తడం లేదు. నాకు 57 ఏళ్లు పూర్తయ్యాయి. టీడీపీ ప్రకటించిన ప్రకారం నాకు పింఛనుకు అర్హత ఉంది. సచివాలయానికి వెళితే దరఖాస్తు కూడా తీసుకోవడం లేదు. ఆకు వక్క, బీడీ కోసం ఇతరులపై ఆధారపడాల్సి ఉంది. నమ్మించి మోసం చేయడం తగదు. – యు.సురేష్, ఆర్లబండ, కోసిగి మండలం ఇంటింటికీ పింఛన్ల పంపిణీ నామమాత్రమే! ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ క్రమంగా కొండెక్కుతోంది. పింఛను పొందుతున్న లబ్ధిదారుల ఇళ్లను జియో ట్యాగింగ్ చేశారు. ఆ ప్రాంతం నుంచి 300 మీటర్ల( మూడు పర్లాంగులు) పరిధిలో పింఛను పంపిణీ చేసే వీలుకల్పించారు. అయినప్పటికీ ఆ దిశగా కూడా చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. 80 శాతం పింఛన్ల పంపిణీ గ్రామ, వార్డు సచివాలయాలు.. రచ్చబండల వద్దే జరుగుతోంది. ఈ విషయమై అధికారులు ప్రశ్నిస్తే.. సచివాలయ ఉద్యోగులు నెట్వర్క్ సమస్య, ఇతరత్రా ఇబ్బందులను చెబుతున్నట్లు తెలుస్తోంది. పది నెలల్లో 14,497 పింఛన్ల తొలగింపు ● వెరిఫికేషన్ ముసుగులో కోతలు ● ఎన్నికలకు ముందు 50 ఏళ్లకే పింఛను ప్రచారం ● ఇప్పటి వరకు కొత్త పింఛన్ల ఊసే కరువు ● 3.50లక్షల మంది ఎదురుచూపులు ● గ్రీవెన్స్ల్లోనే 1.56 లక్షల దరఖాస్తులు జిల్లా గత ఏడాది జూన్లో పింఛన్లు ఈ ఏడాది ఏప్రిల్లో పింఛన్లు కర్నూలు 2,45,687 2,38,302 నంద్యాల 2,21,702 2,14,590పింఛన్ల కోత ఇలా.. కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం ఏర్పాటై పది నెలలు గడుస్తున్నా కొత్త పింఛన్ల ఊసే కరువైంది. ఇదే సమయంలో ప్రతినెలా ఉన్న పింఛన్లనే తొలగిస్తున్న పరిస్థితి. తాజాగా పింఛన్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టడంతో వస్తున్న పింఛను ఉంటుందో, ఊడుతుందోననే ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొంది. ఆకు, వక్కలు కొనాలన్నా దిక్కులు చూడాల్సి వస్తోందని.. ఇక ఆరోగ్యం బాగోలేక మందులు కొనాలంటే ఎవరిని అడిగేదని అవ్వాతాతలు కన్నీరు పెడుతున్నారు. సూపర్–6 మాయలో పడి మోసపోయామని ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు లబోదిబోమంటున్నారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని ఎన్నికల ముందు కూటమి నేతలు ఆశలు రేకెత్తించారు. ఇప్పుడు కొత్త పింఛనల మాట దేవుడెరుగు, ఉన్న పింఛన్లనే తొలగిస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతినెలా పింఛన్లలో కోత పడుతోంది. 10 నెలల కాలంలో గుట్టు చప్పుడు కాకుండా 14,497 పింఛన్లు తొలగింపులకు గురయ్యాయి. గత ఏడాది జూన్ నెలలో 4,67,389 పింఛన్లు ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్ నెల నాటికి పింఛన్ల సంఖ్య 4,52,892కు పడిపోయింది. తొలగించిన వారి స్థానంలో కొత్త పింఛన్లు ఇచ్చినా కొంతమందికై నా న్యాయం జరుగుతుంది. అలాకాకుండా పింఛన్లలో కోత విధిస్తూ, కొత్త పింఛన్ల ఊసెత్తకపోవడం గమనార్హం. కొనసా..గుతున్న వెరిఫికేషన్ ప్రక్రియ దివ్యాంగులు, హెల్త్ పింఛను లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నారనే నిర్ధారణకు వచ్చిన కూటమి ప్రభుత్వం వెరిఫికేషన్కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతోంది. వారంలో మంగళ, బుధ, గురువారాల్లో పింఛన్లను మెడికల్ బోర్డుకు పిలిపించి రీ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 6వేలు, నంద్యాల జిల్లాలో 5వేల పింఛన్లను మాత్రమే వెరిఫై చేశారు. ఇంకా దాదాపు 48వేల పింఛన్లను పరిశీలించాల్సి ఉంది. ఆ తర్వాత వితంతు పింఛన్లను కూడా పరిశీలించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పింఛన్ల కోసం వినతుల వెల్లువ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 50 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు అవ్వతాతలు దాదాపు 3.50 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో 60 శాతం మందికి పింఛన్లకు అర్హులే. అయితే వీరిని పట్టించుకున్న దాఖలాలులేవు. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాలు, మండల పరిషత్ కార్యాలయాల్లో నిర్వహించే గ్రీవెన్స్కు పింఛను వినతులు వెల్లువెత్తుతున్నాయి. గత జూన్ నెల 12 నుంచి ఇప్పటి వరకు కొత్త పింఛన్ల కోసం దాదాపు 1.56 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. -
ఆరు జిల్లాల్లో కరువు
సాక్షి, అమరావతి: వర్షాలు లేక, పంటలు పండక ఆరు జిల్లాల్లో కరువు తాండవిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తేల్చింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గత ఖరీఫ్ సీజన్లోనూ ప్రభుత్వం 49 కరువు మండలాలను ప్రకటించింది. రబీ సీజన్లో వాటి సంఖ్య ఇంకా పెరిగింది. ప్రస్తుతం ఆరు జిల్లాల పరిధిలోని 51 మండలాల్లో కరువు ఉన్నట్లు నిర్ధారించింది. వాటిలోని 37 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉండగా.. 14 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు పేర్కొంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో ఈ మండలాలు ఉన్నాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 17, కర్నూలు జిల్లాలో 10, వైఎస్సార్ జిల్లాలో 10 తీవ్ర కరువు, కరువు మండలాలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే అనంతపురం జిల్లాలో 7, నంద్యాల జిల్లాలో 5, శ్రీ సత్యసాయి జిల్లాలో 2 మండలాల్లో తీవ్ర కరువు, కరువు పరిస్థితులు ఉన్నాయని వెల్లడించింది. లోటు వర్షపాతం, ఎండిపోయిన పంటల పరిస్థితితో పాటు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా రెవెన్యూ శాఖ కరువు మండలాలను నిర్ధారించింది. ఆయా ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. -
అంగరంగ వైభవంగా పిడకల సమరం
కర్నూలు జిల్లా, సాక్షి: ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో పిడకల సమరం అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులు రెండువర్గాలుగా ఏర్పడి పిడకలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ పిడకల సమరంలో పాల్గొనేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. యుద్ధ వాతావరణాన్ని తలపించే ఈ పిడకల సమరంలో గాయాలవుతున్నా భక్తులు పిడకల్ని విసిరారు. -
దుకాణంలో అగ్ని ప్రమాదం
● రూ. 2.50 లక్షల ఆస్తి నష్టం బేతంచెర్ల: స్థానిక కొత్త బస్టాండు సమీపంలోని శివ శక్తి బైక్ జోన్ దుకాణంలో ఆదివారం మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగింది. ఉగాది పండుగ కావడంతో నిర్వాహకుడు బాల కృష్ణారెడ్డి ఆదివారం ఉదయం పూజ నిర్వహించి దుకాణానికి తాళం వేసి వెళ్లాడు. అయితే కొద్ది సేపటి తర్వాత విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దుకాణంలో పొగలు రావడంతో స్థానికులు గమనించి యజమానికి సమాచారం ఇచ్చారు. దుకాణం తెరిచి చూసే సరికి మంటలు ఎక్కువై అందులోని రేడియం కటింగ్ మిషన్లు, ల్యాప్ టాప్, ఇన్వర్టర్, బ్యాటరీ, సీసీ కెమెరాలు రూ. 30 వేల నగదు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 2.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. -
‘విశ్వావసు’కు భక్తి పూర్వక స్వాగతం
కోడుమూరులో అశేషజనం మధ్య సాగుతున్న శ్రీవల్లెలాంబాదేవి రథోత్సవం‘విశ్వావసు’ నామ సంవత్సరానికి జిల్లా ప్రజానీకం భక్తి పూర్వక స్వాగతం పలికింది. ఆదివారం భక్తులు తమ ఇష్ట దేవతామూర్తుల ఆలయాల్లో పూజలు నిర్వహిస్తూ నూతన తెలుగు సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. గ్రామ దేవతలు సుంకులమ్మ, రేణుకా ఎల్లమ్మ, సవారమ్మ, మారెమ్మ, జంబులమ్మ, తదితర జగన్మాతలకు చీరెలు, సారెలు, నైవేద్యాలు సమర్పించారు. రైతులు తమ వృషభాలను ప్రత్యేకంగా అలంకరించి గ్రామాల్లో ఊరేగిస్తూ ఆలయాలను సందర్శించి కొబ్బరి కాయలు సమర్పించారు. పొలాలకు వెళ్లి సేద్యం చేసి ఈఏడాది సాగును ప్రారంభించారు. ప్రముఖ ఆలయాల్లో వేద పండితులు, మిగతా ఆలయాల్లో అక్కడి పురోహితులు పంచాంగ శ్రవణం చేశారు. – సాక్షి, నెట్వర్క్ -
భార్య హత్య కేసులో భర్త అరెస్ట్
ఆత్మకూరురూరల్: వెలుగోడు మండలం తిమ్మనపల్లె గ్రామంలో కట్టుకున్న భార్యను అంతమొందించిన భర్తను వెలుగోడు పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ సురేష్కుమార్రెడ్డి నిందితుడి వివరాలను మీడియాకు వివరించారు. అనుమానంతో ఈనెల 28వ తేదీన భార్య లక్ష్మీదేవిని ఆమె భర్త పసుపుల మధుకృష్ణ గొడ్డలి కామాతో తలపై మోదడంతో ఆమె చనిపోయింది. మృతురాలి తల్లి వెంకట సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం మధుకృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుచగా రిమాండ్కు ఆదేశించారు. నాలుగు గడ్డివాములు దగ్ధం డోన్ టౌన్: యర్రగుంట్ల గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు అన్నదమ్ములకు చెందిన గడ్డి వాములు అగ్నికి ఆహుతయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వన్నేపోగు మద్దిలేటి కుమారులు తిమ్మయ్య, మద్దయ్య, లక్ష్మన్న, ఎర్రమల పశుగ్రాసాన్ని కల్లం దొడ్డిలో నిల్వ చేసుకున్నారు. అయితే ఆదివారం ఓ గడ్డి వామి మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది ఫైరింజన్లతో హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే నాలుగు గడ్డివాములకు మంటలు వ్యాపించి దగ్ధమయ్యాయి. ప్రమాదవశాత్తూ మంటలు వ్యాపించాయా, ఎవరైనా నిప్పు పెట్టారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 5 లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతులు చెబుతున్నారు. సచివాలయ ఉద్యోగి బలవన్మరణం ఆదోని అర్బన్: పట్టణంలోని శ్రీనివాస్నగర్కు చెందిన నారాయణరావు, సరోజబాయి దంపతుల కుమారుడు మధు(26) ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. త్రీటౌన్ సీఐ రామలింగమయ్య తెలిపిన వివరాల మేరకు.. మధు అనే యువకుడు ఆదోని మండలం కపటి గ్రామంలోని సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి పడుకోవడానికి మేడపైకి వెళ్లి ఆదివారం ఉదయం ఎంత సేపటికి కిందికి రాలేదు. తల్లిదండ్రులు మిద్దైపెకి వెళ్లి చూస్తే గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయి ఉన్నాడు. మృతికి గల కారణాలు పని ఒత్తిడో, ప్రేమ వ్యవహారమో తెలియదని, ప్రస్తుతానికి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు. -
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
శ్రీశైలంప్రాజెక్ట్: సున్నిపెంట మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల సమీపంలో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుమారు 50 సంత్సరాల వయస్సు కలిగి ఉన్న ఈ వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ ఇనుప కడ్డీకి పంచెతో ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో టూటౌన్ ఎస్ఐ బీవీ సుబ్బారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సున్నిపెంట కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. మృతుడు కర్ణాటక లేదా మహారాష్ట్రకు చెందిన వాడై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కర్నూలు: కర్నూలు శివారులోని సంతోష్నగర్ జంక్షన్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వహీద్(57) కోలుకోలేక మృతిచెందాడు. గీతాముఖర్జీ నగర్లో నివాసముంటున్న ఈయన రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఒక కొడుకు, కూతురు సంతానం. శనివారం రాత్రి గీతా ముఖర్జీ నగర్లోని తన ఇంటి నుంచి బైరెడ్డి రైస్మిల్ వద్ద ఉన్న మసీదుకు వెళ్లి ప్రార్థన ముగించుకుని సంతోష్ నగర్ కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా బెంగళూరు నుంచి హైదరాబాదు వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న తన కుమారుడు సద్దాం ప్రమాదానికి గురైన తండ్రిని ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీ కేంద్రానికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమను గెలిపించే పిడకల సమరం
ఆస్పరి: శ్రీ వీరభద్రస్వామి, కాళికాదేవి మధ్య ప్రేమ వివాహం విజయం కావడం.. ఇందుకు పిడకల సమరం దోహదపడటంతో ప్రతి ఏటా కై రుప్పల గ్రామంలో పెద్ద నుగ్గులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సోమవారం వేడుకను నిర్వహించేందుకు గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలుత శ్రీ వీరభద్రస్వామి, కాళికాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం సర్పంచ్ తిమ్మక్క, ఆలయ కార్యనిర్వహణ అధికారి రాంప్రసాద్, గ్రామపెద్దల ఆధ్వర్యంలో వేలాది మంది జనం మధ్య పిడకల సమరం (పెద్ద నుగ్గులాట) జరగనుంది. పిడకల సమరాన్ని చూడడానికి కర్నూలు జిల్లాప్రజలేకాకుండా కర్ణాటక, తెలంగాణ తదిత ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు రానున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కై రుప్పలలో పిడకల సమరం జరగడం ప్రత్యేకతగా నిలిచింది. చారిత్రక నేపథ్యమిదీ.. పిడకల సమరానికి చారిత్రక నేపథ్యం ఉందని స్వామి భక్తులు తెలిపారు. విహార యాత్రకు వెళ్లిన వీరభద్రస్వామి తనకు తారాస పడిన కాళికాదేవితో ప్రేమలో పడి వివాహం చేసుకుంటున్నానని మాట ఇచ్చాడట. అయితే ఆ తర్వాత స్వామి ఇచ్చిన మాట తప్పడంతో కాళికాదేవి వర్గీయులకు తీవ్ర ఆగ్రహంతో పిడకలతో స్వామి వర్గీయులపై దాడికి దిగిరాట. స్వామి వర్గీయులు కూడా పిడకలతో ఎదురు దాడికి దిగారాట. సమరాన్ని ఆపించి పెద్దలు పంచాయితీ చేసి వీరభద్రస్వామి, కాళికాదేవి వివాహం చేశారని పెద్దలు చెబుతున్నారు. వీరభద్రస్వామి, కాళికాదేవి ప్రేమ వ్యవహారం కారణంగా భక్తులు పిడకల సమరం చేసుకోవడం ఆచారంగా వస్తోంది. సమరం సాగుతుంది ఇలా.. పుప్పాలదొడ్డి, చెన్నంపల్లి, అలారుదిన్నె, వెంగళాయదొడ్డి, కారుమంచి, కలపరి గ్రామాల ప్రజలు తమ కోరికలను తీర్చిన వీరభద్రుడికి మొక్కుబడి సమర్పించేందుకు ఒక నెల నుంచే పశువుల పేడతో పిడకలు తయారు చేస్తారు. వాటిని ఉగాది మరుసటి రోజు దేవుడి సన్నిధికి చేరుస్తారు. పిడకల సమరానికి ముందు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకుంటారు. దెబ్బలు తగలకుండా టవాళ్లతో ముసుగు తొడుక్కుంటారు. అరగంట పాటు జరిగే పిడకల సమరంలో చాలా మంది భక్తులు గాయపడుతారు. గాయానికి స్వామివారి బండారం రాసుకుని ఇంటి ముఖం పడతారు. ‘కారుమంచి’ ఆచారం కారుమంచి గ్రామానికి చెందిన పెద్దరెడ్డి వంశస్థుల్లో ఒకరు పిడకల సమరం రోజు శిరస్సున కిరీటం ధరించి, ఖడ్గం చేత పట్టుకుని అశ్వంపై కై రుప్పల గ్రామానికి తన అనుచరులతో వస్తారు. అనంతరం వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కారుమంచి వైపు వెళ్తారు. తర్వాత పిడకల సమరం మొదలవుతుంది. ఆలయ అభివృద్ధిలో పెద్దరెడ్డి వంశస్థులు కీలక పాత్ర పోషించారు. ఆ కుటుంబానికి స్వామి ఉత్సవాల్లో ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారు. నేడు కై రుప్పలలో నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేసిన గ్రామస్తులు -
హోటళ్లపై ఫుడ్ ఇన్స్పెక్టర్ల దాడులు
శ్రీశైలం: శ్రీశైలంలోని పలు హోటళ్లపై ఆదివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు రాజగోపాల్ (కర్నూల్), నంద్యాల జీఎఫ్ఐ వెంకట్ రాముడు, ఎన్.రాముడు, ఎఫ్ఎస్ఓ బృందం సభ్యులు దాడులు నిర్వహించారు. బస్టాండ్ సమీపంలోని కృష్ణవేణి హోటల్లో గోబీ మంచూరియాలో కృత్రిమ కలర్లను వినియోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే కర్ణాటక సత్రం వద్ద ఉన్న మంజునాథ స్వీట్ షాపులో బఠానీలకు సింథటిక్ ఫుడ్ కలర్ వినియోగిస్తున్నట్టు గుర్తించారు. వాటన్నిటిని చెత్తకుప్పలో పారబోయించారు. అలాగే మరి కొన్ని హోటళ్లలో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నట్లు గుర్తించి పారబోయించారు. అనంతరం వారు మాట్లాడుతూ తనిఖీల్లో పలు హోటళ్ల నుంచి ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. -
అన్ని రంగాల్లో జిల్లాను అభివృది ్ధచేస్తాం
కర్నూలు(సెంట్రల్): అన్ని రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్ అన్నారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఆదివారం ఉగాది వేడుకలు నిర్వహించారు. తెలుగు సంప్రదాయాలకు విలువను ఇచ్చి పట్టు పంచలు, అంగీలు, పైజామాలతో ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ సాగుతోందన్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్లో పరిశ్రమలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లా వృద్ధి రేటు 11.56గా ఉందని, దానిని ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 16 శాతానికి తీసుకెళ్తామన్నారు. ● ఒక వేద పండితునితోపాటు ముగ్గురు అర్చకులను సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. సన్మాన గ్రహీతలకు ఒక్కొకరికి రూ.10,116 సంభావన, శాలువలను ఇచ్చారు. ● వివిధ రంగాల్లో నిష్ణాతులైన 11 మందిని జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికార యంత్రాంగం ఉగాది పురస్కారాలకు ఎంపిక చేసింది. వారందరినీ మంత్రి, కలెక్టర్ సన్మానించి పురస్కారాలు అందజేశారు. సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు నిర్వహించిన వారికి, గొరవయ్యలకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, కర్నూ లు ఆర్డీఓ సందీప్కుమార్, కర్నూలు మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు పాల్గొన్నారు. వేడుకల్లో కలెక్టర్ దంపతులు ఆకర్షణగా నిలిచారు. ప్రజాప్రతినిధుల డుమ్మా... రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకలకు ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కర్నూలులోనే నివాసం ఉంటున్నా హాజరు కాలేదు. మంత్రి టీజీ భరత్ -
ఆర్యూ డిగ్రీ ఫలితాలు విడుదల
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో గతేడాదిలో జరిగిన డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ ఇన్చార్జ్ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ వి. ఉమ ఆదేశాల మేరకు ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. ఫలితాలు https:// rayalseemauniversity. ac. in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. టీబీ డ్యాం నుంచి రోజుకు 5 వేల క్యూసెక్కులు కర్నూలు(అర్బన్): జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజలతో పాటు కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు ఆదివారం నుంచి తుంగభద్ర డ్యాం నుంచి రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇరిగేషన్ చీఫ్ ఇంజినీరు ప్రత్యేక చొరవ చూపడంతో ఈ ప్రవాహం ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. తాగునీటి అవసరాల కోసం రోజుకు 5 వేల క్యూసెక్కుల ప్రకారం మొత్తం 2 టీఎంసీల నీటిని టీబీ డ్యాం నుంచి విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. నదితీర ప్రాంతాల్లోని ఎస్ఎస్ ట్యాంకులను నింపుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ పర్యవేక్షక ఇంజినీరు బీ నాగేశ్వరరావు క్షేత్ర స్థాయి అధికారులను కోరారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఎల్ఎల్సీకి నీటి విడుదల ఉన్న నేపథ్యంలో ఆయా ఎస్ఎస్ ట్యాంకుల్లో నీటి నిల్వలు తగ్గిన సందర్భాల్లో ఎప్పటికప్పుడు నింపుకోవాలన్నారు. టీబీ డ్యాం నుంచి తుంగభద్ర నదికి నీరు విడుదల చేయడంతో ప్రస్తుత వేసవిలో నది తీర ప్రాంతాల్లోని ప్రజలకు, ముఖ్యంగా రైతులకు సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడనున్నాయి. నేటి ‘పరిష్కార వేదిక’ రద్దు కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రంజాన్ పండుగ నేపథ్యంలో ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వ్యయప్రయాసలతో ప్రజలు జిల్లా కేంద్రానికి రావొద్దని సూచించారు. ఉపాధికూలీల వేతనం రూ.307కు పెంపు కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులకు హాజరయ్యే కూలీలకు చెల్లిస్తున్న వేతనాలను కేంద్ర ప్రభుత్వం స్వల్పంగా పెంచింది. ప్రస్తుతం ఉపాధి కూలీలకు రోజు వారీగా చెల్లిస్తున్న గరిష్ట వేతనం రూ.300 ఉంది. దీనిని రూ.307 పెంచుతూ.. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రోజుకు కేవలం రూ.7 మాత్రమే పెంచింది. వివిధ రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే ఉపాధి కూలీల వేతనాలు తక్కువగా ఉన్నాయి. 2024 మార్చిలో ఉపాధి కూలీల గరిష్ట వేతనం రూ.272 ఉంది. ఈ మొత్తాన్ని అప్పుడు రూ.300కు పెంచింది. అంటే రోజుకు రూ.28 పెంచింది. ఇప్పుడు నామమాత్రంగా కేవలం రూ.7 మాత్రమే పెంచడం పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పెంచిన వేతనాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటి వరకు గరిష్ట వేతనం రూ.300 ఉన్నా... టీడీపీ అనుకూల ఫీల్డ్ అసిస్టెంట్లు టీడీపీ సానుభూతి పరుకులకు మాత్రమే గరిష్ట వేతనం లభించే విధంగా కొలతలు నమోదు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇతరులకు రూ.100 నుంచి రూ.150 వరకు మాత్రమే లభిస్తోంది. రిజిస్ట్రేషన్లకు స్పందన నిల్ కర్నూలు (సెంట్రల్): ఆర్థిక సంవత్సరం ముగింపు రోజుల్లో పండుగ సెలవులు ఉన్నా రిజిస్ట్రేషన్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆదివారం ఉగాది పండుగ అయినా కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తెరుచుకున్నాయి. అయితే క్రయవిక్రయదారుల నుంచి స్పందన కనిపించ లేదు. ఉమ్మడి జిల్లాలోని 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో కేవలం 60 రిజిస్ట్రేషన్లు మాత్రమే అయ్యాయి. వాటిలో కూడా కొంతమంది సబ్ రిజిస్ట్రార్లు బలవంతంగా డాక్యుమెంట్ రైటర్లకు ఫోన్లు చేసి రిజిస్ట్రేషన్లు పెట్టించారు. అయితే పండుగ రోజు కూడా రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. సోమవారం రంజాన్ పండుగ నేపథ్యంలో పబ్లిక్ హాలిడే ఉన్నా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మాత్రం తెరుచుకునేలా ఆదేశాలు ఉన్నాయి. దీంతో సోమవారం రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని, ప్రజలు స్పందించి క్రయవిక్రయాలకు డాక్యుమెంట్లను రాయించుకోవాలని అధికారులను సూచించారు. -
సుభిక్షం కాదు.. అంతటా సం‘క్షోభ’మే!
● నేటితో 2024–25 ఆర్థిక సంవత్సరానికి ముగింపు ● సంక్షేమ పథకాలకు పాతరేసిన కూటమి ప్రభుత్వం ● ప్రతి పేద కుటుంబానికి రూ.75 వేల వరకు నష్టంకర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు సంక్షోభమే మిగిలింది. ఎన్నికల సమయంలో టీడీపీ ఆధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు చాలా వరకు ఇప్పటి వరకు అమలు కాలేదు. ఆర్థిక సంవత్సరం సోమవారంతో ముగియనుంది. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం మొండిచెయ్యి చూపించింది. పది నెలల కాలంలో పేదరిక నిర్మూలన కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయినా టీడీపీ అనుకూల పత్రికలు మాత్రం పది నెలల్లోనే రాష్ట్రం సుభిక్షంగా మారినట్లు కథనాలు రాస్తున్నాయి. ఈ విషయమై ఎవరిని కదిలించినా అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కనిపించని సంక్షేమ పథకాలు.. ● ఆడబిడ్డ నిధి కింద కుటుంబంలో 18 నుంచి 59 ఏళ్లలోపు మహిళలు ఉంటే ప్రతి ఒక్కరికి నెలకు రూ.1,500 ప్రకారం ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అలాగే తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15,000 చెల్లిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక వీటి గురించి మరచిపోయారు. ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు సగటున ఏడాది రూ.75 వేల వరకు ఆర్థిక లబ్ధి చేకూరింది. ఒక్కో కుటుంబానికి మూడు నుంచి నాలుగు సంక్షేమ పథకాలు అందాయి. ఎన్నికల సమయంలో సూపర్–6 తో పాటు ఎన్నో హామీలను టీడీపీ నేతలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను పూర్తిగా పక్కన పెట్టారు. దీంతో పేదలు ఏడాదికి సగటున రూ.75 వేల వరకు నష్టపోయారు. ● నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3,000 ప్రకారం చెల్లిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దీనికి 2025–26లో బడ్టెట్ కేటాయింపులు లేవు. ● మహిళలకు ఉచిత బస్సు హామీ కూడా కొండెక్కింది. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు బడ్జెట్లో అరకొరగానే కేటాయింపులు ఉన్నాయి. ● 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీలందరికీ వృద్ధాప్య పింఛన్లు ఇస్తామంటూ ప్రకటించిన హామీ అమలు కాలేదు. ● ప్రమాదవశాత్తు జరిగే మరణాలకు రూ.10 లక్షలకు, సహజ మరణాలకు రూ.5 లక్షలకు బీమా సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చినా అమలుపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రమాదవశాత్తు, సాధారణ మరణాలు 1500 వరకు ఉన్నాయి. వీరికి ఎలాంటి చేయూత లేకండా పోయింది. ● స్వయం సహాయక సంఘాలకు రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ ఆధినేత చంద్రబాబు హమీ ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 25 వేల స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.1000 కోట్ల వరకు లింకేజీ రుణాలు పొందారు. సున్నా వడ్డీ జాడ లేకపోవడంతో వారిపై వడ్డీ భారం పడుతోంది. మోసం చేశారు అన్ని వర్గాల ప్రజలను నమ్మించి టీడీపీ ఆధినేత చంద్రబాబు మోసం చేశారు. సంక్షేమ పథకాల అమలును పట్టించుకోకపోవడం లేదు. రైతులకు కూటమి ప్రభుత్వం ఇసుమంత కూడా చేయూత ఇవ్వలేదు. మహిళల సంక్షేమాన్ని పక్కన పెట్టారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలోనైనా సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెడుతారా అంటే ప్రశ్నార్థకంగానే ఉంది. బడ్జెట్లో అసలు కేటాయింపులే లేవు. – నారాయణ నాయక్, రైతు, జాప్లాతండా, తుగ్గలి మండలం 64 మంది రైతుల బలవన్మరణాలు గత ఏడాది జూన్ నెలలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 10 నెలలు అవుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉమ్మడి జిల్లాలో 64 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. కర్నూలు జిల్లాలో 42, నంద్యాల జిల్లాలో 22 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2024–25లో వ్యవసాయం కలసి రాలేదు. పత్తి, వేరుశనగ, ఆముదం, మొక్కజొన్న తదితర పంటల్లో దిగుబడులు పడిపోయాయి. అంతంతమాత్రం వచ్చిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. -
‘సేవ’కు పోటు.. జీవితాలపై వేటు!
నియోజకవర్గాల వారీగా పనిచేసిన వలంటీర్లు ... నియోజకవర్గం మొత్తం వలంటీర్లు ఆదోని 1,073 ఆలూరు 1,383 కోడుమూరు 1,174 కర్నూలు 1,308 మంత్రాలయం 1,096 పాణ్యం 1,344 పత్తికొండ 1,310 ఎమ్మిగనూరు 1,382 మొత్తం: 10,070రోడ్డున పడిన వలంటీర్లు ● దగా చేసిన కూటమి ప్రభుత్వం ● ఉగాది సాక్షిగా మాట నిలుపుకోని నేతలు ● మొత్తం వ్యవస్థనే లేకుండా చేసిన వైనం ● చిరుద్యోగులతో రాజకీయం కర్నూలు(అర్బన్): కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్కొక్క హామీకి నీళ్లొదులుతోంది. అధికారంలోకి రాగానే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు అండ్ కో.. ఉన్న ఉద్యోగ్యులను కూడా వీధిన పడేస్తోంది. దేశానికే ఆదర్శగా నిలిచిన వలంటీరు వ్యవస్థకు రూపమే లేదని కూ టమి ప్రభుత్వం కూల్చేసింది. గత ప్రభుత్వంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను అర్హులైన పే ద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు పారదర్శకంగా ఇళ్ల వద్దకు చేర్చిన వలంటీర్లపై కూటమి ప్రభుత్వం కక్షకట్టింది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీరు వ్యవస్థను కొనసాగిస్తామని, పారితోషకాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని నమ్మబలికింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు వలంటీరు వ్యవస్థపై ఎటూ తే ల్చలేక, చివరకు ఈ వ్యవస్థకు చట్టబద్ధత లేదని తేల్చేసింది. ‘వలంటీరు వ్యవస్థే లేనప్పుడు ఎలా కొనసాగిస్తామని, లేని పిల్లాడికి ఏమి పేరు పెట్టాలన్నట్లు ఉందని ’ సాక్షాత్తూ మంత్రి డోలా వీరాంజనేయస్వామి చేత శాసనమండలిలో చెప్పించడం గమనార్హం. కొనసాగుతున్న పోరాటాలు ... ఐదేళ్లు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా సేవలు అందించిన తమను తిరిగి కొనసాగించాలని, ఇచ్చిన మాట ప్రకారం పారితోషకాన్ని రూ.10 వేలకు పెంచాలని వలంటీర్లు పోరాటాలను కొనసాగిస్తూనే ఉన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి సంఘాలుగా ఏర్పడి ఉద్యమాన్ని బలోపేతం చేస్తున్నారు. వీరి ఉద్యమాలకు కామ్రేడ్లు కూడా తోడు కావడంతో ఉద్యమ్యం ఉద్ధృతమవుతోంది. నమ్మించి గొంతు కోశారు వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, వీరి సేవలను ఉపయోగించుకుంటాం, నెలకు రూ.10 వేలు పారితోషకం అందిస్తామని నమ్మించి గొంతు కోశారు. తక్కువ వేతనమైనా, సొంత గ్రామంలో ఉపాధి లభించడంతో పాటు అనేక మంది సొంత గ్రామస్తులకు సేవలు అందిస్తున్నామనే తృప్తి ఉండేది. అలాంటి మాపై ప్రభుత్వం కక్షతో వ్యవహరించడం సమంజసం కాదు. – హమీద్, ప్యాలకుర్తి, కోడుమూరు మండలం తెల్లవారక ముందే అవ్వా, తాతలను నిద్రలేపి నిస్వార్థంగా పెన్షన్లు అందించిన వలంటీర్ల సేవలను రాజకీయ స్వార్థం కబళించింది. నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల పిల్లల చదువులకు అవసరమైన సర్టిఫికెట్లను ఇంటి ముంగిళ్లలోనే అందించిన వారిపై వేటు పడింది. గత ప్రభుత్వం అందించిన అనేక సంక్షేమ పథకాలను ఎలాంటి లాభాపేక్ష లేకుండా అతి తక్కువ గౌరవ వేతనంతో అనేక రకాల సేవలు అందించిన వలంటీర్లపై కూటమి ప్రభుత్వం కరుణ చూపాల్సింది పోయి కాఠిన్యం ప్రదర్శించింది. కరోనా కష్టకాలంలో సొంత కుటుంబ సభ్యులు కూడా వారి వద్దకు వెళ్లలేని పరిస్థితుల్లో తమ ప్రాణాలను లెక్క చేయకుండా సేవలందించిన వలంటీర్ల జీవితాలనే ఈ ప్రభుత్వం కూల్చేసింది. -
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
● గోస్పాడులో 43.. కర్నూలులో 42 డిగ్రీలు నమోదు కర్నూలు(అగ్రికల్చర్): భానుడి భగభగలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎండల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శనివారం గోస్పాడులో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం గమనార్హం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండవేడిమి అధికంగా ఉంటోంది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. ప్రాంతం ఉష్ణోగ్రత గోనవరం 42.83 (పాణ్యం మండలం) కోసిగి 42.7 సంజామల 42.7 బనగానపల్లె 42.62 ఆళ్లగడ్డ 42.44 నందికొట్కూరు 42.43 కర్నూలు 42 -
కూటమి నేతల మాటలు నమ్మి మోసపోయాం
కర్నూలు(సెంట్రల్): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ల మాటలు నమ్మి మోసపోయామని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఉగాది రోజు వారు ఇచ్చిన హామీని నమ్మి దగా పడ్డామని, రోడ్డున పడి అడుక్కుతుంటున్నామని వాపోయారు. ఈ ఉగాది వలంటీర్లకు ఉగాది కాదని, దగాది అని వ్యాఖ్యానించారు. శనివారం కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు వలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నూర్ అహ్మద్ మాట్లాడుతూ పోయిన ఉగాదిన సీఎం, డిప్యూటీ సీఎంలు వలంటీర్లకు రూ.10 వేల వేతనంతో కొనసాగిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి రాగానే సాకులు వేతికి ఉద్యోగులను తొలగించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో సరైన జీఓలు ఇవ్వలేదని చెప్పడం అన్యాయమన్నారు. అలాంటప్పుడు ఆ ప్రభుత్వం తమను ఐదేళ్లపాటు ఎలా కొనసాగించిందని ప్రశ్నించారు. ఎలాంటి జీఓలు లేనప్పుడు తమ సేవలను విజయవాడ వరదల సమయంలోఎలా వినియోగించుకున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వస్తుందన్నారు. కార్యక్రమంలో వలంటీర్లు శివ, అనిల్,సునీత, ప్రభావతి, అజ్మతుల్లా, వెంకటేశ్ పాల్గొన్నారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట వలంటీర్ల ధర్నా -
సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి
కోసిగి: నాటు సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్ ఎం. సుధీర్ బాబు తెలిపారు. శుక్రవారం కోసిగి ఎకై ్సజ్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 110 గ్రామాల్లో నాటుసారా తయారీ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆయా గ్రామాల్లో నవోదయం 2.0లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎకై ్సజ్ పోలీసులతో, ప్రచారం రథం ద్వారా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. నాటుసారా స్థావరాలపై ముమ్మరంగా దాడులు చేస్తున్నామన్నారు. కర్ణాటక , తెలంగాణ రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా పూర్తి తగ్గి పోయిందన్నారు. కర్ణాటక టెట్రా ప్యాకెట్లు అక్కడక్కడ సరఫరా అవుతోందని, వాటిని అరికట్టేలా సిబ్బందికి సూచించినట్లు తెలిపారు. మద్యం అమ్మకాలతో జిల్లా ఆదాయం రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందన్నారు. కోసిగి ఎకై ్సజ్ సీఐ భార్గవ్ రెడ్డి, జిల్లా ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ సీఐ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. -
పెట్రోల్ బంకులో దోపిడీ దొంగల బీభత్సం
ఆదోని రూరల్: పెట్రోల్ బంకులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సిబ్బంది గొంతుపై కత్తులు పెట్టి బెదిరించి రూ.60 వేల నగదు, రెండు సెల్ఫోన్లను చోరీ చేశారు. పెద్దతుంబళం గ్రామంలోని మాధవరం రోడ్డులో ఉన్న ఎస్సార్ పెట్రోల్ బంకుకు శుక్రవారం తెల్లవారుజామున బొలెరో వాహనంలో ఏడుగురు వచ్చారు. వారిలో ఐదుగురు పెట్రోల్ బంకులోకి చొరబడి తమ వాహనానికి పెట్రోల్ వేయాలని నిద్రిస్తున్న పెట్రోల్ బంకు సిబ్బంది ఈరన్న, తాయప్పలను లేపారు. పెట్రోల్ కొట్టించుకున్న అనంతరం సిబ్బంది గొంతుపై కత్తులు పెట్టి డబ్బులు ఎక్కడున్నాయో చూపించాలని బెదిరించారు. పెట్రోల్ బంకులో బీరువాను పగులగొట్టారు. సీసీ ఫుటేజీ బాక్సు, విద్యుత్ సరఫరా వైర్లను కత్తిరించి క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.60 వేలు, రెండు సెల్ఫోన్లను దొంగలించుకుని వెళ్లారు. బొలెరో వాహనంలో కోసిగి వైపు వెళ్లిపోయినట్లు సీసీ ఫుటేజీలో తేలిందని ఎస్ఐ తెలిపారు. ఈరన్న, తాయప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. రూ.60 వేల నగదు, రెండు సెల్ఫోన్ల చోరీ -
హడావుడిగా ‘మీ సమస్య–మా పరిష్కారం’
కర్నూలు(సెంట్రల్): రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ శుక్రవారం నిర్వహించిన మీ సమస్య – మా పరిష్కారం కార్యక్రమం హడావుడిగా సాగింది. ప్రజల నుంచి అర్జీ రాగానే సంబంధిత అధికారులకు అప్పగించి పరిష్కారం అవుతుందని బాధితులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంగా..11.15 గంటలకు మొదలైంది. అప్పటి నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మౌర్య ఇన్ హోటల్లోని ఆర్య ఫంక్షన్ హాలులో నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు మంత్రి టీజీ భరత్ అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ వారే అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు చెప్పుకునే ప్రయత్నం మంత్రి చేశారని తెలుస్తోంది. కార్యక్రమంలో కలెక్టర్ పి.రంజిత్బాషా, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు, టౌన్ డీఎస్పీ బాబు ప్రసాదు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రెండున్నర గంటల్లో ముగిసిన మంత్రి టీజీ భరత్ కార్యక్రమం -
బాల్యమిత్రుల ఆర్థిక సాయం
హొళగుంద: అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితునికి బాల్యమిత్రులు రూ.41 వేలు ఆర్థిక సహాయం చేశారు. ధైర్యంగా ఉండాలని, తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005–06లో మార్లమడికి గ్రామానికి చెందిన రామంజితో పాటు పలువురు చదువుకున్నారు. క్యాన్సర్తో బాధపడుతూ రామంజి.. కర్నూలులోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న 50 మంది బాల్య స్నేహితులు తలా ఇంత ఇచ్చి.. రూ.41 వేలు చేశారు. అందరి తరఫున శుక్రవారం స్నేహితులు పెద్దహ్యాట మల్లయ్య, వార్డు సభ్యుడు చిన్న మల్లయ్య, తిమ్మారెడ్డి, సుధాశెట్టి, ద్యావన్నలు కర్నూలుకు వెళ్లి రామాంజిని పరామర్శించి రూ. 41,000 నగదును అతని చేతికి అందజేశారు. విద్యుత్ చార్జీల భారం తగ్గించాలికర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం ప్రజలపై వేసిన విద్యుత్ ట్రూ అఫ్ చార్జీలను, సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్భవన్ ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.ప్రభాకర్రెడ్డి, జిల్లా కార్యదర్శి గౌస్దేశాయ్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచబోమని చెప్పిన కూటమి నాయకులు తర్వాత ట్రూ అప్చార్జీలు, సర్దుబాటు పేరుతో అడ్డుగోలుగా చార్జీలు పెంచడం దారుణమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను వ్యతిరేంచిన టీడీపీ నేడు వాటిని ఏర్పాటు చేస్తూ వినియోగదారులపై భరించలేని భారం మోపుతోందని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల వల్ల వ్యాపార, పారిశ్రామికవేత్తలపై ప్రతి నెలా రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు భారం పడుతుందన్నారు. అలాగే స్మార్ట్ మీటర్ల వల్ల వేలాది మంది మీటర్ రీడింగ్ సిబ్బంది ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టీ.రాముడు, రాధాకృష్ణ, ఎండీ ఆనంద్, ఓల్డ్సీటీ కార్యదర్శి రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు అరుణ, గురుశేఖర్, విజయ్ పాల్గొన్నారు. అనుమానం పెనుభూతమై.. వెలుగోడు:మోత్కూరు మజారా గ్రామమైన తిమ్మనపల్లి గ్రామంలో ఓ వివాహిత దారుణహత్యకు గురైంది. కట్టుకున్న భర్తనే భార్యను కడతేర్చాడు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. రుద్రవరం మండలం చిన్న కంబలూరు గ్రామానికి చెందిన పసుల లక్ష్మీదేవి (32)కి తిమ్మనపల్లి గ్రామానికి చెందిన మధు చిన్ని కృష్ణతో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరి సంసారం కొన్ని సంవత్సరాలు సజావుగా సాగింది. కాగా భార్యపై అనుమానం పెనుభూతమైంది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం మధు చిన్ని కృష్ణ తన భార్య లక్ష్మీదేవి తలపై గొడ్డలి కామాతో దాడి చేయగా తీవ్ర రక్త గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్ కుమార్ రెడ్డి, వెలుగోడు ఏఎస్ఐ శేషా వలి గ్రామానికి చేరుకుని హత్యకు కారణాలపై ఆరా తీశారు. మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
‘ఉపాధి’లో రూ.1.74 లక్షల అవినీతి
● పీడీ వెంకటరమణయ్య మంత్రాలయం: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరిగిన పనుల్లో రూ.1,74,469 అవినీతి జరిగినట్లు నిర్ధారించగా.. వాటిని వెంటనే రీకవరీ చేయించాలని డ్వామా పీడీ వెంకటరమణయ్య ఆదేశించారు. శుక్రవారం మంత్రాలయం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీడీఓ రాధ ఆధ్వర్యంలో 18వ విడత సామాజిక తనిఖీ బహిరంగ సమావేశం నిర్వహించారు. రికార్డులు సరిగ్గా లేనట్లు తేల్చారు. రూ.1,74,469 అవినీతి జరగగా రికవరీ చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రూ.33వేలు అపరాధ రుసుం విధించినట్లు చెప్పారు. ఇందులో అడిషనల్ పీడీ మాధవీలత, ఏపీడీ లోకేశ్వర్, ఏపీఓ తిమ్మారెడ్డి, ఈసీ శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన విద్యుదాఘాతం
దేవనకొండ: గ్రామసభ కోసం వేసిన టెంటును తొలగిస్తూ విద్యుదాఘాతంతో కింద పడి ఒక యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన తెర్నెకల్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఉదయం గ్రామసభను నిర్వహించి రాత్రి 7:30 గంటల సమయంలో టెంటును తొలగిస్తున్నారు. ఈ క్రమంలో టెంటుపైభాగాన ఉన్న హెవీ విద్యుత్ లైన్కు గిరిపోగు ప్రతాప్ ప్రతాప్ (30) చేయి తగిలింది. విద్యుదాఘాతంతో ఆ యువకుడు 12 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా సీసీ రోడ్డుపై పడ్డాడు. తలకు బలమైన గాయాలు తగలడంతో దేవనకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. గిరిపోగు ప్రతాప్కు వివాహం కాలేదు. తల్లి మునెమ్మ, ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. -
ఆడపడుచుకు అగ్రాసనం
శ్రీశైలంటెంపుల్: కన్నడిగుల భక్తి భావంతో శ్రీగిరి క్షేత్రం పరవశించిపోతుంది. వందల కి.మీ పాదయాత్రగా చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించిపోతున్నారు. ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు భ్రమరాంబాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ప్రత్యేకంగా తమ ఇంటి నుంచే సారెను తీసుకువస్తారు. ఈ సారెలో బియ్యం, బెల్లం, శనగబ్యాళ్లు, గోధుమపిండి, కొబ్బరిగిన్నె, పూలు, రవిక, చీర, తమ పొలాల్లో పండిన ధాన్యాన్ని తీసుకువచ్చి ఐదు రోజుల పాటు శ్రీశైలంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఈ సారెను అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే మల్లికార్జున స్వామి స్వరూపంగా భావించే కంబికి (పల్లకీ) ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పాదయాత్రగా తరలివచ్చే భక్తులు ఈ కంబిని తమ సొంత గ్రామాల నుంచి భుజాన మోసుకుంటూ వస్తారు. ఈ కంబికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉగాది ఉత్సవాలు ముగిసే వరకు పూజలు నిర్వహిస్తారు. శ్రీశైలం నుంచి తిరిగివెళ్లే సమయంలో భక్తులు తమ తోబుట్టువులు, ముత్తైదువుల కోసం ప్రత్యేక వాయనం తీసుకెళ్తారు. చీర, జాకెట్, గాజులు, పూలు, పసుపు, కుంకుమ, బెల్లం, విభూది, వివిధ రకాల పండ్లతో వాయనం తీసుకెళ్తారు. ఈ వాయనానికి తమ ఇంటి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తమ వారికి నూతన చాటల్లో అందిస్తారు. ఈ చాటలను కూడా శ్రీశైలం నుంచి తీసుకెళ్తారు. దీంతో శ్రీశైలంలో చాటల వ్యాపారం బాగా జరుగుతోంది. శ్రీశైలంలో ఎక్కడ చూసినా చాటల విక్రయాలే కనబడుతున్నాయి. కన్నడిగులు అధికసంఖ్యలో చాటలను కొనుగోలు చేస్తున్నారు. అలాగే అమ్మవారి గుర్తుగా బొమ్మను కొనుగోలు చేస్తారు. శ్రీశైల భ్రమరాంబాకు కన్నడిగుల సారె తిరుగు ప్రయాణంలో తోబుట్టువులకు వాయనంతో స్వగ్రామానికి శ్రీశైలంలో చాటలకు పెరిగిన డిమాండ్ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆస్పరి: ఆదోని – పత్తికొండ మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆస్పరి సీఐ మస్తాన్వలి తెలిపిన వివరాల మేరకు.. పత్తికొండ మండలం అటికెలగుండు గ్రామానికి చెందిన బోయ మహానంది (40) గురువారం పని నిమిత్తం బైక్పై ఆస్పరికి చేరుకున్నారు. పని ముగించుకొని రాత్రి స్వగామానికి బైక్పై తిరిగి వెళ్తుండగా పత్తికొండ నుంచి ఆస్పరి వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహానందిని ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేసి ఆదోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లు సూచన మేరకు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందతూ కొలుకోలేక మృతి చెందాడని సీఐ తెలిపారు. మృతుడుకి భార్య, ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
కన్నీటి సాగు.. కనిపించదా కరువు!
● కేవలం 15 మండలాల్లోనే కరువు ఉన్నట్లు ప్రతిపాదనలు ● నేడో, రేపో కరువు మండలాలను ప్రకటన ● రబీలో తీవ్రంగా నష్టపోయిన రైతులు ● రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు రావద్దనే తప్పుడు లెక్కలు కర్నూలు(అగ్రికల్చర్): వరుణుడు కరుణించడు.. సాగునీరు పారదు.. పొలం పండదు.. అన్నదాతకు అప్పులే మిగులుతున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి కరువు కనిపించదు. కేవలం కొన్ని మండలాల్లో మాత్రమే కరువు ఉన్నట్లు ఒక ప్రకటన వస్తుంది. ఖరీఫ్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అన్ని మండలాల్లో కరువు పరిస్థితి ఉండగా కేవలం రెండు మండలాల పేర్లు వచ్చాయి. రబీ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్టోబరు నుంచి మార్చి నెల వరకు డిసెంబరు నెలలో మాత్రం ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. మిగిలిన నెలల్లో వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. పంటలు వేసినా దిగుబడులు రాక.. గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నా.. కేవలం 15 మండలాల్లోనే కరువు ఉన్నట్లు నివేదికలు వెళ్లాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు రావద్దనే సూచనలతో అధికారులు తప్పుడు లెక్కలు పంపారనే విమర్శలు ఉన్నాయి. ఇదీ దుస్థితి.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 55 మండలాలు ఉన్నాయి. పంటలు పండక, దిగుబడులు రాక రైతులకు తీవ్ర నష్టాలు వచ్చినప్పటికీ 2024 ఖరీఫ్ సీజన్లో కౌతాళం, పెద్దకడుబూరు మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా గుర్తించారు. రబీ సీజన్లో వర్షాలు లేక సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. సాగు చేసిన పంటలు కూడా పొగమంచు కారణంగా దెబ్బతిన్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పడి పోయినా కేవలం 15 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రతిపాదించారు. ● కర్నూలు జిల్లాలో కల్లూరు, కర్నూలు రూరల్, కర్నూలు అర్బన్, కోడుమూరు, గూడూరు, ఓర్వకల్లు, ఆస్పరి, వెల్దుర్తి, మద్దికెర, పత్తికొండ మండలాలను మాత్రమే కరువు మండలాలుగా గుర్తించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. ● నంద్యాల జిల్లాలో సంజామల, బనగానపల్లె, ఉయ్యాలవాడ, కొలిమిగుండ్ల, బేతంచెర్ల మండలాలను ప్రతిపాదించారు. ● డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి, డోన్ మండలాలు పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి ఉన్నాయి. రబీలో ఈ మండలాల్లో సాగు భారీగా తగ్గిపోయింది. ఈ మండలాలను జిల్లా యంత్రాంగం పక్కన పెట్టడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ● జిల్లా యంత్రాంగం పంపించిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో కరువు మండలాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ● కర్నూలు జిల్లాలో కరువు తీవ్రతను తగ్గించి కేవలం 10 మండలాలను, నంద్యాల జిల్లాలో 5 మండలాలను చేర్చారు. దిగులే మిగిలింది! రబీ సీజన్ అక్టోబరు నుంచి మొదలై మార్చి వరకు కొనసాగుతుంది. కరువు ప్రాంతాలను గుర్తించాలంటే ఆయా నెలల్లో నమోదైన వర్షపాతం వివరాలను పరిగణనలోకి తీసుకుంటారు. డిసెంబరు నెలలో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అక్టోబరు, నవంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వర్షాలు లేవు. ఐదు నెలల పాటు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు 27 శాతం లోటు వర్షపాతం ఉంది. జనవరి నుంచి మార్చి వరకు ప్రతి నెల 47 శాతం లోటు వర్షపాతం ఉంది. వర్షాభావంతో శనగ, జొన్న, మినుముల్లో దిగుబడులు 60 శాతం వరకు పడిపోయాయి. ఈ విషయాన్ని పంట కోత ప్రయోగాలు స్పష్టం చేస్తున్నాయి. దిగుబడులు లేక రైతుకు దిగులే మిగిలినా రాష్ట్ర ప్రభుత్వం కరుణ చూపకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కరువున్నా కరుణ ఏదీ? గత ఏడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. చెరువులు, కుంటలు ఎండిపోయి ఇప్పటికే వందలాది గ్రామాల్లో తాగునీటికి తీవ్ర సమస్య ఏర్పడింది. పశువులకు సైతం నీరు అందని దుస్థితి నెలకొంది. కరువు మండలాలను గుర్తించడంలో భూగర్భ జలాలు కీలకం. అయి నా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. కర్నూలు జిల్లాలోని వివిధ మండలాల నుంచి గత ఏడాది నవంబరు నెల నుంచే వలసలు మొదలయ్యాయి. కోసిగి, ఆదోని, పెద్దకడుబూరు, కౌతాళం, హాలహర్వి, హొళగుంద, మద్దికెర, దేవనకొండ, తుగ్గలి, హాలహర్వి తదితర మండలాల నుంచి వ్యవసాయ కూలీలు, సన్న, చిన్నకారు రైతులు వలస వెళ్లిపోయారు. రబీ కరువు ప్రతిపాదనల్లో జిల్లా పశ్చిమ ప్రాంతంలోని పలు మండలాలు లేవు. జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి పెద్దకడుబూరు, కౌతాళం కరువు మండలాలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కోసం జిల్లా యంత్రాంగం డిసెంబరు నెలలోనే ప్రతిపాదనలు పంపింది. ఇంతవరకు రూ.25.24 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఊసే లేకుండా పోయింది. 2023 ఖరీఫ్ కరువు మండలాలకు సంబంధించి 41,857 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో తప్పులు ఉన్నందున రూ.60.59 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల కాలేదు. జిల్లా అధికారులు ఖాతాలను సరిచేసి పంపినప్పటికీ నిధుల విడుదల అతీగతీ లేకుండా పోయింది. 2023–24 రబీ కరువు మండలాలకు దాదాపు లక్ష మంది రైతులకు రూ.98 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ విడుదల పెండింగ్లో ఉండిపోయింది. 2023 ఖరీఫ్ సీజన్, 2023–24 రబీ సీజన్, 2024 ఖరీఫ్ సీజన్లకు సంబందించి పంటల బీమా పరిహారం విడుదల పెండింగ్లోనే ఉంది. భూగర్భ జలాల దుస్థితి ఇదీ... సాగు విస్తీర్ణం హెక్టార్లలో హాలహర్వి మండలం చింతకుంట్ల సమీపంలో వరి పైరును జీవాలు మేస్తున్న దృశ్యం -
డిజిటల్ చెల్లింపులు.. ‘ఖాతా’కు చిల్లులు!
డబ్బులు ఏట్లో పారేసినా లెక్క పెట్టి పారేయాలన్నది పెద్దల మాట. అంటే చేతితో డబ్బులు లెక్క పెట్టి పారేస్తూ ఉంటే దాని విలువ తెలుస్తుందని భావన. అలాగే మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయినీ ఏదైనా పుస్తకంలో రాసుకుంటే నెల చివరలో దేనికెంత ఖర్చు పెట్టాము.. ఎక్కడ అనవసరంగా ఖర్చు చేస్తున్నాము.. ఏ ఖర్చులు తగ్గించుకోవాలి.. ఎక్కడ మిగిలించాలనే విషయాలు తెలుస్తాయి. దీన్ని బట్టే ఫ్యామిలీ బడ్జెట్ రూపొందించుకోవచ్చు. కానీ ఇటీవల డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ కొనుగోళ్ల పుణ్యమా అని ఎంత డబ్బు వస్తున్నా ఇట్టే అయిపోతోంది. లెక్క పెట్టకుండా ఖర్చు చేయడం వల్లే ఈ సమస్య వస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.కర్నూలు(హాస్పిటల్): కర్నూలు జిల్లాలో ప్రస్తుతం అన్ని రకాల వ్యాపారాలు ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ ద్వారానే సాగుతున్నాయి. ఒకప్పుడు ఫోన్ పే, గూగుల్ పే లాంటివి ఉపయోగించాలంటే భయపడే జనం ఇప్పుడు అవలీలగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఎంతగా అంటే రూ.5 నుంచి వేల రూపాయల వరకు ఆన్లైన్లోనే చెల్లింపులు చేస్తున్నారు. ఏదైనా కొనుగోలు చేసినా, ఎవరికైనా డబ్బు పంపాలన్నా, అప్పు ఇవ్వాలన్నా, తీసుకున్న రుణం తీర్చాలన్నా, ఇతర ఎలాంటి లావాదేవీలైనా సరే డిజిటల్ పేమెంట్ తప్పనిసరి అవుతోంది.అయితే పెట్టే ఖర్చు మొత్తం బ్యాంకు ఖాతా ద్వారానే జరుగుతోంది. దీన్నిబట్టి ఎవరికి ఎంత డబ్బులు వస్తున్నా యి, ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎంత ఏఏ ఖాతాలకు మళ్లిస్తున్నారు, ఎవరెవరికి చెల్లిస్తున్నారు, వీరికి ఎవరి నుంచి డబ్బులు వస్తున్నాయనే విషయాలన్నీ బ్యాంకుల వారికి తెలిసిపోతోంది. అది చిన్న మొత్తమైనా, పెద్ద మొత్తమైనా సరే అన్ని వివరాలు ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా మనకు తెలియకుండానే బ్యాంకులకు/ప్రభుత్వానికి చెప్పేస్తున్నాయన్న మాట. కోవిడ్ తర్వాత ఊపందుకున్న పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ రూపంలో పదేళ్ల క్రితం డెబిట్, క్రెడిట్కార్డులు, గిఫ్ట్కార్డులు వచ్చాయి. కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసి వాటిని వ్యాపార దుకాణాల్లో స్క్రాచ్ చేసి డబ్బులు చెల్లించేవారు. కొంత కాలం తర్వాత ఇవే కార్డుల ద్వారా ఆన్లైన్లోనే వస్తువులను కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. కోవిడ్ అనంతరం వ్యాపార లావాదేవీల్లో మరింత సరళతరం వచ్చింది. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ల ద్వారా జనం డబ్బు చెల్లించడం, తీసుకోవడం ప్రారంభించారు. ఎంతగా అంటే రూ.5ల కొనుగోలుకు సైతం ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. మొదట్లో ఇలా డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడని వ్యాపారులు సైతం క్రమంగా అంగీకరించక తప్పని పరిస్థితి. చిల్లర కొరత కారణంగా కూడా డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాయి.» కర్నూలు నగరంలోని ఎ.క్యాంపునకు చెందిన వెంకట్ ఓ ప్రైవేటు కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. ఆయన జీతం నెలకు రూ.60వేలు. వచ్చిన జీతంతో ఇంట్లోని నలుగురు కుటుంబసభ్యులతో హాయిగా జీవిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో నెలాఖరుకు అకౌంట్లో డబ్బులన్నీ అయిపోయినట్లు గమనిస్తున్నాడు. ఇంత డబ్బు ఏమైందని పరిశీలిస్తే అదంతా డిజిటల్ పేమెంట్స్ ద్వారా తానే ఖర్చు చేసినట్లు నిర్ధారించుకున్నాడు.» ఆదోనికి చెందిన నాగేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. చిరుద్యోగమే అయినా 20 ఏళ్లకు పైగా సీనియారిటీ ఉండటంతో జీతం రూ.లక్షకు పైగా వస్తోంది. మొదట్లో తాను ఖర్చుచేసిన ప్రతిదీ ఓ పుస్తకంలో రాసుకునే అలవాటు ఉండేది. అన్ని ఖర్చులు పోను నెలకు 30శాతం దాకా మిగిలేది. కానీ ఇటీవల డిజిటల్ అకౌంట్లో ఖర్చు పెడుతూ లెక్క రాసుకోవడం మానేశాడు. నెల తిరిగేసరికి బ్యాంకు ఖాతా ఖాళీ అవుతోంది. ఎందుకిలా అని ప్రశ్నించుకుంటే ఆన్లైన్లో తెలియకుండానే తానే ఖర్చు చేస్తున్నట్లు తెలుసుకున్నాడు.లెక్కలేకుండా ఖర్చు పెట్టేస్తున్నారు ఆన్లైన్ లావాదేవీల కారణంగా బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యేవరకు మనం ఎంత ఖర్చు పెట్టామో తెలియని పరిస్థితి. దీనికితోడు ఏ వస్తువును ఎంతకు కొనుగోలు చేస్తున్నారో కూడా తెలియకుండా, బేరమాడకుండా కొనేస్తున్నారు. సాధారణంగా మనం కిరాణా దుకాణానికి వెళ్తే సరుకులకు దేనికి ఎంత బిల్లు వేశాడో చూస్తాము. కానీ డిజిటల్ పేమెంట్స్ కారణంగా ఇవేమీ పట్టించుకోవడం లేదు. షాపువారు ఎంత చెబితే అంత చెల్లించి వచ్చేస్తున్నారు. దీనివల్ల డబ్బు విలువ చాలా మందికి తెలియకుండా పోతోంది. ముఖ్యంగా ఈ తరం యువతకు అస్సలు తెలియడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్యాంకుల్లోనూ పలుచబడిన జనం ఒకప్పుడు బ్యాంకులకు వెళ్తే అక్కడ పనిపూర్తి చేసుకుని తిరిగి రావడానికి గంట నుంచి రెండు గంటల సమయం పట్టేది. కోవిడ్ తర్వాత ఈ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. అప్పటి వరకు వివిధ రకాల పథకాల సొమ్ము అకౌంట్లో ప్రభుత్వం వేస్తే దానిని తీసుకోవడానికైనా బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్లేవారు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ కారణంగా డబ్బు ఎలా వస్తుందో, ఎలా పోతుందో కూడా తెలుసుకోలేకపోతున్నారు. దాదాపుగా అన్ని చోట్లా ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రుణాలను సైతం బ్యాంకు యాప్ల ద్వారానే నిమిషాల్లో తీసుకునే సౌలభ్యం వచ్చింది. కేవలం కరెంట్ బ్యాంకు ఖాతాలు ఉన్న కొద్ది మంది వ్యాపారులు మాత్రమే పెద్ద మొత్తంలో డబ్బులు వేయడానికి, డ్రా చేయడానికి మాత్రమే బ్యాంకులకు వెళ్తుండటం గమనార్హం. ఖాతాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి, అనుమానాలు తీర్చుకోవడానికి మాత్రమే బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. ఎంత ఖర్చు చేస్తున్నామో తెలియట్లేదు గతంలో డబ్బు చేతిలో ఉంటే చూసి ఖర్చు పెట్టేవారం. నగదు రూపంలో డబ్బులు ఉండటం వల్ల దేనికెంత ఖర్చు చేస్తున్నామో తెలిసేది. కానీ ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్ కావడంతో ఎంత ఖర్చు చేస్తున్నామో అర్థంకాని పరిస్థితి. తెలియకుండానే నెలలో 20 నుంచి 30 శాతం ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం. – సాయిరామ్, ప్రభుత్వ ఉద్యోగి, కర్నూలు -
బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
కర్నూలు(సెంట్రల్): కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం(బార్ అసోసియేషన్) నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా పి.హరినాథ్చౌదరి, వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 856 మంది ఓటర్లు ఉండగా 767 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష స్థానం కోసం పోటీ పడిన పి.హరినాథ్చౌదరి తన సమీప ప్రత్యర్థి బి.మురళీమోహన్పై 92 ఓట్లతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శి స్థానానికి జరిగిన పోటీలోఎం. వెంకటేశ్వర్లు తన ప్రత్యర్థి ఎం.ఆంజనేయులుపై 76 ఓట్లతో విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీ స్థానానికి పోటీ చేసిన ఎం. బాలసుబ్రమణ్యం తన ప్రత్యర్థి బీకే నాగారుజుపై 411 ఓట్లతో గెలిచారు. లైబ్రరీ సెక్రటరీ స్థానానికి పోటీలో ఉన్న పి.చంద్రశేఖర్ తన ప్రత్యర్థి సంపత్పై భారీ ఓట్లతో విజయం సాధించారు. ఉపాధ్యక్ష, కోశాధికారి, క్రీడా కార్యదర్శి మహిళాప్రతినిధి స్థానాలకు త్రివిక్రమ్, గౌతంమానె, బెస్త సుధాకర్, కె. అరుణలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గెలుపొందిన వారికి ఎన్నికల అధికారులు జి.విజయకుమార్, కె.రంగనాథ్,సి. ప్రభాకరరెడ్డి డిక్లరేషన్ పత్రాలను అందజేశారు. అధ్యక్ష, కార్యదర్శులుగా హరినాథ్, వెంకటేశ్వర్లు -
జవాబుదారీతనంతో పనిచేయండి
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహ కార కేంద్రబ్యాంకును ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి జవాబుదారీతనంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్, పర్సన్ ఇన్చార్జీ కమిటీ చైర్మన్ బి.నవ్య అన్నారు. గురువారం డీసీసీబీ బోర్డు సమావేశం, మహా జనసభలు జేసీ ఆధ్వర్యంలో జరిగాయి. రికవరీలను ముమ్మరం చేసి ఇటు సంఘాలు, అటు డీసీసీబీ బలోపేతానికి తోడ్పడాలని జేసీ పేర్కొన్నారు. కంప్యూటరీకరణలో భాగంగా 68 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఈ–ప్యాక్స్లుగా మారాయన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరం తయారు చేసిన బడ్జెట్ ప్రతిపాదనలను జేసీ ఆమోదించారు.కర్నూలు, నంద్యాల డీసీవోలు ఎన్.రామాంజనేయు లు, వెంకటసుబ్బయ్య, డీసీసీబీ సీఈవో విజయకుమార్, జనరల్ మేనేజర్ పి.రామాంజనేయులు పాల్గొన్నారు. -
చెక్కుచెదరని ప్రజాభిమానం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి కర్నూలు (టౌన్): ఎన్ని కుయుక్తులకు పాల్పడినా వైఎస్సార్సీపీపై ప్రజాభిమానం చెక్కుచెదరలేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి అన్నా రు. జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడిగా ఏక గ్రీవంగా ఎన్నికై న మదర్థాన్ ఇలియాస్ ఖాన్, జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి కలిసి గురువారం సాయంత్రం కర్నూలు గిప్సన్ కాలనీలో ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డిని కలిశారు. శాలువా కప్పి సన్మానించారు. గెలుపొందిన జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యున్ని ఎస్వీ సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. ‘కూటమి’ నేతలు ఎన్ని కు ట్రలు చేయాలని చూసినా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచారన్నారు. విజయంలో కీలకంగా వ్యవహరించిన పత్తికొండ మాజీ ఎ మ్మెల్యే కంగాటి శ్రీదేవి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. జిల్లా పరిషత్, మండల పరిషత్ పరిధిలో ఖాళీగా ఉన్న అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. జెడ్పీ, కృష్ణగిరి కోఆప్షన్ సభ్యులుగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. నిత్యం ప్రజ
● ఎదురులేని ఫ్యాన్● నాలుగు స్థానాల్లోను వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం ● జెడ్పీ కోఆప్షన్ సభ్యునిగా ఎం. ఇలియాజ్ఖాన్ ● జెడ్పీ చైర్మన్తో పాటు 37 మంది జెడ్పీటీసీ సభ్యులు హాజరు ● వెల్దుర్తి, తుగ్గలి ఎంపీపీలుగా దేశాయి లక్ష్మిదేవమ్మ, రాచపాటి రామాంజినమ్మ ● కృష్ణగిరి కోఆప్షన్ సభ్యునిగా షేక్ చిన్న షాలు తుగ్గలిలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న నూతన ఎంపీపీ, వైఎస్సార్సీపీ నాయకులుకర్నూలు(అర్బన్): జిల్లాలోని స్థానిక సంస్థల్లో ఏర్పడిన నాలుగు ఖాళీలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లా పరిషత్, కృష్ణగిరి కోఆప్షన్ సభ్యులతో పాటు తుగ్గలి, వెల్దుర్తి ఎంపీపీ స్థానాలకు, జిల్లాలోని ఐదు గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ స్థానాలకు ఎన్నికలను నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటలను చోటు చేసుకోకుండా, ఆయా ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తును నిర్వహించారు. జెడ్పీ, కృష్ణగిరి కోఆప్షన్ సభ్యులతో పాటు తుగ్గలి, వెల్దుర్తి మండల పరిషత్తుల్లో వైఎస్సార్సీపీకి విశేషమైన బలం ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించారు. జెడ్పీ కోఆప్షన్ సభ్యునిగా మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్ జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యునిగా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడుకు చెందిన మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన అభ్యర్థిత్వాన్ని వెలుగోడు జెడ్పీటీసీ అమీరున్బీ ప్రతిపాదించగా, మహానంది జెడ్పీటీసీ కేవీఆఆర్ మహేశ్వరరెడ్డి బలపరిచారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 10 గంటల్లోపు నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డితో కలిపి 37 మంది జెడ్పీటీసీ సభ్యులు హాజరై ఇలాయాజ్ఖాన్కు మద్దతు ప్రకటించారు. ఇలియాజ్ఖాన్ నామినేషన్ను స్క్రూటినీ చేసిన అనంతరం వాలీడ్ నామినేషన్గా డిక్లేర్ చేసి జిల్లా కలెక్టర్ పీ రంజిత్బాషా ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. జెడ్పీ కోఆప్షన్ సభ్యునిగా ఇలాయాజ్ఖాన్ను ప్రకటించి డిక్లరేషన్ ఫారం అందించి ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఏకగ్రీవంగా తుగ్గలి, వెల్దుర్తి ఎంపీపీలు తుగ్గలి మండల పరిషత్ అధ్యక్షురాలిగా మండలంలోని శభాష్పురం ఎంపీటీసీ సభ్యురాలుగా రాచపాటి రామాంజినమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో మొత్తం 17 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా, ఒకరు గైర్హాజరు కాగా మిగిలిన వారంతా రామాంజనమ్మ అభ్యర్థిత్వానికి మద్దతుగా చేతులెత్తి తమ అంగీకారాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, హెచ్ఎన్ఎస్ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అజయ్కుమార్ ఆమెను ఎంపీపీగా డిక్లేర్ చేసి ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. అలాగే వెల్దుర్తి మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీటీసీలు ఎంపీపీ ఎన్నికకు గైర్హాజరయ్యారు. మిగిలిన 14 మంది వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎల్ నగరం ఎంపీటీసీ దేశాయి లక్ష్మిదేవమ్మను ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కే తులసీదేవి ఎంపీపీగా ఎన్నికై న లక్ష్మిదేవమ్మకు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. కృష్ణగిరి కోఆప్షన్ సభ్యునిగా వైఎస్సార్సీపీ మద్దతుదారుడు చిన్నషాలును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి, సెట్కూరు సీఈఓ డా.కే వేణుగోపాల్ ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. ఐదు పంచాయతీల్లో ఉప సర్పంచుల ఎన్నిక... జిల్లాలోని ఐదు గ్రామ పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో సభ్యులు.. ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా లక్ష్మమ్మ, ఆలూరు మండలం మొలగవెళ్లి ఉప సర్పంచ్గా గరక షాకీరా, కర్నూలు మండలం సుంకేసుల ఉప సర్పంచ్గా వడ్డే నీలమ్మ, వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి ఉప సర్పంచ్గా ఎం రామాంజనేయులు, దేవనకొండ మండలం వెలమకూరు ఉప సర్పంచ్గా ఉప్పర సరస్వతిని ఎన్నుకున్నారు. -
భృంగివాహనంపై మల్లన్న
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం ఉగాది మహోత్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ నెల 31 వరకు ఐదు రోజుల పాటు ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని కన్నడ భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. శ్రీశైల భ్రామరి మహాలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి భృంగివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ నిర్వహణలో భాగంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, స్థానాచార్యులు, అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయప్రాంగాణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు. లోకక్షేమాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పఠించారు. ఈ సందర్భంగా చండీశ్వరునికి ప్రత్యేకంగా పూజాదికాలు నిర్వహించారు, అనంతరం కంకణాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అధికారులు, అర్చకస్వాములు ధరించారు. రుత్వికులకు దీక్షావస్త్రాలను అందజేశారు. అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చన పూజలను జరిపించారు. అనంతరం ఉగాది మహోత్సవాలకు అంకురార్పణ చేశారు. మహాలక్ష్మీ అలంకారంలో భ్రామరి ఉగాది మహోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శ్రీశైల భ్రమరాంబాదేవి మహాలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చతుర్బుజాలు కలిగిన దేవి పై రెండు చేతులలో పద్మాలను, కింది చేతులలో కుడివైపున అభయహస్తం, ఎడమవైపున వరముద్రతో దర్శనం ఇచ్చారు. మహాలక్ష్మీ స్వరూపాన్ని దర్శించడం వల్ల శత్రుబాధలు నివారించబడి, సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. కనుల పండువగా భృంగివాహన సేవ ఉగాది మహోత్సవాల్లో భాగంగా శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామికి భృంగివాహనసేవ నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగివాహనంపై ఆశీనులను చేసి అలంకార మండపంలో పూజాదికాలు నిర్వహించారు. భృంగీవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను దర్శించడం వలన పనులలో ఏకాగ్రత లభిస్తుందని, పాపాలను హరించబడుతాయని భక్తుల విశ్వాసం. అనంతరం ప్రత్యేక అలంకీకృతులైన అమ్మవారికి, వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు గ్రామ పురవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీశైలంలో నేడు ఉత్సవాల్లో రెండవ రోజు శుక్రవారం భ్రమరాంబాదేవికి మహాదుర్గ అలంకారం, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారికి కైలాసవాహనసేవ నిర్వహించనున్నారు. గ్రామోత్సవం నిర్వహిస్తారు.శాస్త్రోక్తంగా ప్రారంభమైన ఉగాది మహోత్సవాలు ఐదు రోజుల పాటు నిర్వహణ మహాలక్ష్మీ అలంకారంలో శ్రీశైల భ్రామరి శ్రీగిరి క్షేత్రానికి పోటెత్తిన కన్నడ భక్తులు -
కోర్టును తనిఖీ చేసిన జిల్లా జడ్జి
పత్తికొండ రూరల్: పత్తికొండలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టును గురువారం జిల్లా జడ్జి కబర్ధి తనిఖీ చేశారు. రెవెన్యూ డివిజన్ కేంద్రమైన పత్తికొండలో సబ్కోర్టు ఏర్పాటు ప్రతిపాదనల నేపథ్యంలో భవనం, స్థలం తదితర వివరాలను న్యాయవాదులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక సబ్జైలుకు వెళ్లి అక్కడ ఖైదీలకు అందుతున్న సౌకర్యాలను సూపరింటెండెంట్తో అడిగి తెలుసుకున్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రంగస్వామి, సీనియర్ న్యాయవాదులు సురేష్, రమణ, కృష్ణ, రవిప్రకాశ్ పాల్గొన్నారు. విద్యాశాఖ ఉద్యోగుల అవస్థలు ● మూడు రోజులుగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కర్నూలు(సిటీ): జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గత మూడు రోజులుగా కరెంటు లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షార్ట్ సర్క్యూట్తో విద్యుత్ తీగలు కాలిపోవడం, తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టినా ఫలితం లేకపోవడంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతోంది. గురువారం పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉద్యోగులు అవస్థలు పడుతూ డిప్యూటీ డీఈఓ ఆఫీస్లో కూర్చొని పని చేసుకున్నారు. అయితే ఆఫీసులో విద్యుత్ సరఫరా లేకపోవడంతో కంప్యూటర్లు పనిచేయక పూర్తిస్థాయిలో పనిచేయలేని పరిస్థితి నెలకొంది. -
ఈ–శ్రమ్తో సామాజిక భద్రత
కర్నూలు(అర్బన్): అసంఘటి త రంగాల్లోని, వలస కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ–శ్రమ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో ఈ–శ్రమ్ నమోదు లక్ష్యం 14,07,281 కాగా, ఈ నెల 25వ తేది వరకు 6,39,247 మంది నమోదు చేసుకున్నారు. నమోదుకు ఈ నెలాఖరు వరకు సమ యం ఉన్నట్లు కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ –శ్రమ్ నమోదుతో కార్మికులు దురదృష్టవశాత్తూ మృతి చెందినా, అంగవైకల్యం ఏర్పడినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందన్నారు. ఎవరు అర్హులంటే ... ● 16 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు వారై ఉండాలి. ● అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఈపీఎఫ్ సభ్యత్వం లేని వారు, ఆదాయ పన్ను పరిధిలోకి రాని వారు. ● ఉపాధిహామీ కూలీలు, మత్స్యకారులు, భవన నిర్మాణ, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల్లోని మహిళ లు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, వ్యవ సాయ, ఉద్యాన, పాడి పరిశ్రమ కూలీలు, కుమ్మరి, స్వర్ణకారులు, ఇతర చేతివృత్తుల వారు, వాహన చోద కులు, వీధి వ్యాపారులు, సేవా రంగంలో ఉన్న వారు. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే.. ● ప్రమాదవశాత్తూ మృతి చెందినా, శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ.2 లక్షలు, పాక్షికంగా గాయపడితే రూ.లక్ష ఆర్థిక సహాయం అందుతుంది. ● వలస కార్మికులకు రాష్ట్రంలో లేదా వారి సొంత ప్రాంతంలో ఎక్కడా రేషన్కార్డు లేకుంటే పౌర సరఫరాల శాఖ ద్వారా మంజూరు చేసే నిత్యావసర సరుకులు అందజేస్తారు. ● ప్రభుత్వ వృత్తి నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ఇలా నమోదు చేసుకోవాలి ... ఈ–శ్రమ్ నమోదుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్లు లేదా కార్మిక శాఖ కార్యాలయాల్లో సంప్రదిస్తే ఆన్లైన్ పద్ధతిలో నమోదు చేస్తారు. నామినీ ఆధార్ వివరాలను అందజేయాల్సి ఉంటుంది. నమోదు పూర్తయిన అనంతరం యూఏఎన్ గుర్తింపు కార్డు జారీ అవుతుంది. నమోదుకు ఈ నెలాఖరు వరకు అవకాశం