
ఆర్టీసీ బస్సులో చోరీ
● రూ.6 వేల నగదు అపహరణ
ఆదోని అర్బన్: ఆర్టీసీ బస్సులో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఆదోని పట్టణానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ కం కండెక్టర్ మధుసూదన్రెడ్డి తెలిపిన వివరాలు.. ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో ఆదోనికి బయలుదేరారు. కోడుమూరులో ఓ వ్యక్తి తన పేరు శ్రీనివాస్ అని, సత్తివీడుకు చెందిన ఆర్టీసీ ఎంప్లాయినంటూ డూప్లికేట్ ఆర్టీసీ పాస్ చూపించి బస్సు ఎక్కాడు. గోనెగండ్లలో డ్రైవర్ కం కండెక్టర్ ప్రయాణికులకు టికెట్ కొడుతుండగా శ్రీనివాస్ డ్రైవింగ్ సీటు వద్ద నగదు ఉన్న బ్యాగు, సెల్ఫోన్ తీసుకుని బస్సు దిగి వెళ్లిపోయాడు. టికెట్లు పూర్తి చేసుకుని బస్సును కాస్త ముందుకు నడుపుకుంటూ వచ్చిన కాసేపటికి బ్యాగు లేదని గమనించిన డ్రైవర్ కం కండెక్టర్ వెంటనే మరో బస్సు డ్రైవర్కు సమాచారం చేరవేశాడు. అతడు గోనెగండ్లలో బ్యాగుతో ఉన్న వ్యక్తిని పట్టుకునేందుకు వెళ్లేలోపే సెల్ఫోన్ పడేసి బ్యాగ్తో పరారయ్యాడు. బ్యాగులో రూ.6 వేల నగదు ఉందని, తెలిసిన వారితో అప్పు చేసి కౌంటర్లో కట్టానని డ్రైవర్ కం కండెక్టర్ మధుసూదన్రెడ్డి తెలిపాడు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సలహాతో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు.
నువ్వుల కట్టెకు నిప్పు
ఆత్మకూరు రూరల్: మండల పరిధిలోని అమలాపురం గ్రామానికి చెందిన రైతు స్వామన్న పొలంలో కోత కోసి కుప్ప నూర్చేదుకు సిద్ధంగా ఉంచిన నువ్వుల కట్టెకు సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. బాధితుడు తెలిపిన వివరాలు.. తనకు ఉన్న పొలంతో పాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని నువ్వుల పంట సాగుచేశాడు. పైరును ఇటీవల కోసి కుప్ప నూర్చేందుకు సిద్ధం చేశాడు. అంతలోనే గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో దాదాపు 10 క్వింటాళ్ల నువ్వులు బూడిద పాలయ్యాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా స్వామన్న వైఎస్సార్సీపీ గ్రామ నాయకుడు కావడం, ఇటీవల గ్రామంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనల నేపథ్యంలోనే ఓర్వలేని వారు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.
వీఆర్ఓ
అనుమానాస్పద మృతి
హాలహర్వి: మండల కేంద్రానికి చెందిన వీఆర్ఓ కె.సత్యనారాయణరావు(44) సోమవారం అనుమానాస్పదంగా మృతిచెందారు. కె.సత్యనారాయణరావు కొంతకాలంగా మద్యానికి బానిస అయ్యాడు. ఈవిషయమై భార్య భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో భార్య రూప భర్తకు దూరంగా పుట్టినిల్లు ఎమ్మిగనూరులో ఉంటోంది. కాగా మద్యం తాగి విధులకు హాజరవుతుండటంతో సత్యనారాయణరావును అధికారులు సస్పెండ్ చేశారు. ఈక్రమంలో సోమవారం ఇంట్లో విగతజీవిగా పడివున్న సత్యనారాయణరావును గుర్తించిన స్థానికులు అతని భార్యకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆమె హాలహర్వికి చేరుకుని భర్త మృతదేహంపై పడి బోరున విలపించింది. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆర్టీసీ బస్సులో చోరీ

ఆర్టీసీ బస్సులో చోరీ