Kurnool District News
-
టమాట ధర ఎరుపెక్కుతోంది!
కర్నూలు(అగ్రికల్చర్): టమాట కొరత ఏర్పడటంతో ధర రోజురోజుకు పెరిగిపోతోంది. టమాట సాగుకు పెట్టింది పేరైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేడు కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఆస్పరి, దేవనకొండ, పెద్దకడుబూరు, హాలహర్వి, హొళగుంద, పత్తికొండ, మద్దికెర, డోన్, ప్యాపిలి, ఓర్వకల్, క్రిష్ణగిరి, కోడుమూరు, బేతంచెర్ల మండలాల్లో టమాట ఎక్కువగా సాగవుతోంది. మామూలుగా అయితే వేసవిలో టమాట కొరత ఏర్పడకుండా రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఇచ్చి నీటి వసతి కింద సాగు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ బాధ్యతను విస్మరించింది. ఫలితంగా నేడు ఒక్క ఎకరాలో కూడా టమాట కనిపించని పరిస్థితి ఏర్పడింది. మదనపల్లి, చిత్తూరు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పండించిన టమాట జిల్లాలోకి దిగుమతి అవుతోంది. బుధవారం కర్నూలులోని రైతుబజార్లలో కిలో ధర రూ.40 పలికింది. బయట రూ.50 నుంచి రూ.60 ధరతో అమ్మకాలు సాగిస్తున్నారు. రానున్న రోజుల్లో టమాట ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
మాకే మార్కులు తక్కువ వేస్తారా?
కర్నూలు(హాస్పిటల్): ‘చూడండి సార్..! పారిశుద్ధ్యంలో తక్కువ మార్కులు ఇస్తున్నారు. దీనివల్ల సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మేము చెబితే వినడం లేదు. మీరైనా గట్టిగా చెప్పండి’ అంటూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అధికారులపై పద్మావతి శానిటేషన్ ఏజెన్సీ నిర్వాహకులు మంత్రి టీజీ భరత్కు ఫిర్యాదు చేశారు. బుధవారం ఆసుపత్రి అభివృద్ధి పనులపై కర్నూలు మెడికల్ కాలేజీలోని కౌన్సిల్ హాల్లో మంత్రి టీజీ భరత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనుల గురించి చర్చించారు. చివరగా పద్మావతి శానిటేషన్ ఏజెన్సీ నిర్వాహకులు లేచి పై విధంగా ఫిర్యాదు చేశారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు సమాధానమిస్తూ తాము మార్కులు మరీ తక్కువేమీ వేయడం లేదని, 94 వేశామన్నారు. దీనికి నిర్వాహకులు కలుగజేసుకుంటూ 94 వేస్తే ఎలా? కనీసం 95 వేస్తే పూర్తిగా డబ్బులు వస్తాయని బదులిచ్చారు. మంత్రి కలుగజేసుకుంటూ మార్కులు తక్కువ వేస్తే వారికి నష్టం వస్తుంది కదా? చూసి వేయండి అంటూ బదులిచ్చారు. దీనికి సూపరింటెండెంట్ కలుగజేసుకుంటూ 94 మార్కులు వేస్తే వారికి కొద్ది శాతం మాత్రమే కోత పడుతుందని, వారు చెబుతున్నట్లుగా పూర్తిగా డబ్బులు రాకుండా పోవన్నారు. పైగా ఆసుపత్రిలో పారిశుద్ధ్యం బాగాలేదని, స్వయంగా తాము తనిఖీలకు వెళ్లినప్పుడు పరిశీలనలో వెల్లడైందన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు, పారిశుద్ధ్య ఏజెన్సీ నిర్వాహకుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చివరగా మంత్రి స్పందిస్తూ అధికారులు సూచించినట్లు తప్పులు సరిచేసుకుంటే మార్కులు పూర్తిస్థాయిలో పడతాయి. ఆ విధంగా నడుచుకోవాలని చెప్పి వెళ్లిపోయారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ లక్ష్మిబాయి, అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రవీణ్, సాయిప్రదీప్, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సీఎస్కే ప్రకాష్, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ చిరంజీవులు, డీఎంహెచ్ఓ డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి అనుచరులు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించి నిర్వహించిన అధికారిక సమావేశంలో అధిక సంఖ్యలో మంత్రి టీజీ భరత్ అనుచరులు హాజరుకావడం విమర్శలకు తావిస్తోంది. సమావేశానికి వచ్చిన అధికారులు, వైద్యుల కంటే అనుచరులే అధిక సంఖ్యలో సీట్లలో ఆశీనులయ్యారు. పైగా చర్చ జరుగుతున్నంత సేపు కొందరు ముఖ్య అనుచరులు అధికారులను ప్రశ్నించడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. తాము ఇలాంటి సమావేశం ఎప్పు డూ చూడలేని ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. మార్చురీలో వర్కర్ల నియామకానికి గ్రీన్సిగ్నల్ ప్రభుత్వాసుపత్రి మార్చురీపై ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనాలను మంత్రి టీజీ భరత్ వద్ద అధికారులు ప్రస్తావించారు. అనధికారింగా 15 ఏళ్ల నుంచి ఎలా పనిచేయించుకుంటున్నారని, ఇప్పుడు వారిని అక్కడ నుంచి తీసేస్తే పని కష్టం అవుతుంది కదా అని ప్రశ్నించారు. కాబట్టి వారిని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. వారిని ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులుగా చేర్చుకుని మార్చురీలో పనిచేయించుకోవాలన్నారు. అనంతరం వారు ప్రజల నుంచి డబ్బులు తీసుకోకుండా చూడాలని చెప్పారు. మంత్రి టీజీ భరత్ ముందు అధికారులను నిలదీసిన పద్మావతి శానిటేషన్ ఏజెన్సీ నిర్వాహకులు పారిశుద్ధ్యం బాగా లేకపోతే ఎలా వేయాలని బదులిచ్చిన అధికారులు వాడీవేడిగా ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం -
అ‘పూర్వం’.. మధుర జ్ఞాపకం
సంజామల: మండల పరిధిలోని నొస్సం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వవిద్యార్థులు 31 సంవత్సరాల తరువాత తిరిగి కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. 1994–1995 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు బుధవారం నొస్సం పాఠశాల వేదికగా కలుసుకున్నారు. నాటి ఉపాధ్యాయులు లక్ష్మిరెడ్డి, రామిరెడ్డి, దినకర్ నాయుడు, కృష్ణ మూర్తి, నాగయ్య, సుబ్రమణ్యం, ఖాజ హుస్సేన్, రామచంద్రయ్యను నొస్సం బురుజు వద్ద నుంచి పాఠశాల వరకు బ్యాండ్మేళంతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆహ్లాదంగా గడిపారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. వివిధ హోదాలలో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. పూర్వ విద్యార్ధులు రజనీ, సాయికుమారి, శివశంకర్ రెడ్డి, సుబ్బరంగయ్య, రామకృష్ణరెడ్డి, సంజీవ, హైదర్ బాష, ఆలీబాషా, జగదీష్, తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ సిలిండర్లు పేలి అగ్నిప్రమాదం
రేకుల షెడ్డులో చెలరేగుతున్న మంటలుకాలిపోయిన సామగ్రిని చూస్తున్న కార్మికులుమంత్రాలయం రూరల్: మండల కేంద్రంలో బుధవారం ఉదయం 11.40 గంటల సమయంలో మాధవరం రోడ్డులోని శ్రీమఠం నరహరి తీర్థ వసతి గృహం పక్కన రేకుల షెడ్డులో 3 చిన్న గ్యాస్ సిలిండర్లు (ఒక్కోటి 2 కేజీలు) పేలాయి. వివరాలు.. శ్రీమఠం భవనాల్లో పనులు చేసేందుకు వచ్చిన యూపీ, బీహార్కు చెందిన దాదాపు 50 మంది కూలీలు ఇక్కడి షెడ్లలో ఉంటున్నారు. బుధవారం వీరందరూ పనులకు వెళ్లిన సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించి ఉండొచ్చని సీఐ, ఎస్ఐ తెలిపారు. కార్మికులందరూ ఉదయాన్నే పనులకు వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. ప్రమాదంలో దుస్తులు, బియ్యం, పెయింటింగ్ మిషన్, వంట సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న సీఐ దస్తగిరిబాబు, ఎస్ఐ మల్లికార్జున ఆగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చేలోపు కర్ణాటక గెస్ట్హౌస్లోని బోరుతో మంటలను అదుపు చేశారు. తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి పూర్తిగా ఆర్పివేశారు. హెచ్పీ గ్యాస్ సిబ్బంది ఘటనా స్థలంలోని 15 కేజీల సిలిండర్కు మంటలు వ్యాప్తించకుండా సకాలంలో బయటకు తీసుకొచ్చారు. అలాగే బాధితులకు సీఐ చేతుల మీదుగా రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించారు. బాధితులకు సాయం అందిస్తాం: పీఠాధిపతి ప్రమాద సమాచారం తెలుసుకున్న శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. శ్రీమఠం పనికి వచ్చిన కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. బాధితులకు అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలని శ్రీమఠం అధికారులను ఆదేశించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో శ్రీమఠం క్వార్టర్స్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. మఠం మేనేజర్ ఎస్కె.శ్రీనివాసరావు, ఇంజినీర్ సురేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
గ్యాస్ సిలిండర్ల కోసం పడిగాపులు
బనగానపల్లె: మండలంలో గ్యాస్ వినియోగదారుల కష్టాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. సిలిండర్ బుక్ చేసి 30 – 40 రోజులైనా వినియోగదారులకు అందడం లేదు. అయితే బుకింగ్ చేసిన వారం రోజులకే సిలిండర్ను డెలివరీ చేసినట్లు వినియోగదారుల మొబైల్స్కు మెసేజ్లు వస్తుండటం గమనార్హం. గ్యాస్ సిలిండర్లను డెలివరీ బాయ్లు వినియోగదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఏజెన్సీ కార్యాలయం వద్దకు వెళ్లి సిబ్బందితో గొడవకు దిగిన వారికి మాత్రం అప్పటికప్పుడు డెలివరీ రిసిప్ట్ ఇచ్చి గోడౌన్ వద్దకు వెళ్లి తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో గౌడౌన్ ఉంది. అక్కడికి వెళ్లి సిలిండర్ తెచ్చుకునేందుకు మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం గౌడౌన్ వద్ద భారీ ఎత్తున వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో క్యూ లో వేచి ఉన్నారు. వారంతా ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజల కష్టాలు అధికారులకు తెలిసినా సదరు డీలర్పై చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా గోడౌన్ వద్ద సిలిండర్లు పంపిణీ చేస్తున్నారని, ఎదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. వ్యాపారులకు ఫుల్గా గ్యాస్ ప్రభుత్వం సుమారు 40 రోజులుగా వాణిజ్య గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయడంలేదు. అయినా ఆహార వ్యాపారుల వద్ద గృహ వినియోగ సిలిండర్లు ఫుల్గా ఉంటాయి. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు బ్లాక్లో వ్యాపారులకు ఒక్కో సిలిండర్ రూ.1700–1900 ఆదాయంతో విక్రయిస్తున్నట్లు వ్యాపారులే చెబుతున్నారు. ఇళ్లకు సిలిండర్ల పంపిణీ సక్రమంగా జరగకపోవడంతో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారులు మంగళవారం ఏజెన్సీ వద్దకు వచ్చి రికార్డులను తనిఖీ చేసి గౌడౌన్ను పరిశీలించి డీలర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు చేపట్టి గ్యాస్ సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. -
‘పచ్చ’పాత పోలీసులపై పోరాటం
కర్నూలు(టౌన్): ‘జిల్లాలో టీడీపీ నాయకుల ఒత్తిడితో పోలీసులు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలోనే నంద్యాలలో కొత్తపల్లి సుబ్బరాయుడు, ఆలూరు నియోజకవర్గంలో బండారి ఈరన్న దారుణంగా హత్యకు గురయ్యారు. కర్నూలు నగర యువజన విభాగం అధ్యక్షులు బాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా పోలీసులు వేధించారు. పోలీసుల వేధింపులను నిరసిస్తూ గురువారం కర్నూలు మూడవ పట్టణ పోలీసు స్టేషన్ ఎదుట మహా ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ధర్నాలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రసిడెంట్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి పాల్గొంటారన్నారు. బుధవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లోని సమావేశ హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి లోకేష్కు పోలీసు డిపార్ట్మెంట్ దాసోహం అయ్యిందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసు లు పెట్టి వేధించడం పనిగా పెట్టుకున్నారన్నారు. సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేసినా కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కర్నూలు 10 వార్డు కార్పొరేటర్ షేక్ యూనుస్ బాషా కార్యాలయంపై మంత్రి అనుచరులు దాడి చేసి ధ్వంసం చేస్తే.. ఈ ఘటనలో బాధితుడి మీదనే హత్యాయత్నం కేసు నమోదు చేశారన్నారు. అధికార పార్టీ నేతలు భూ కబ్జాలకు సైతం పోలీసులను పంపుతు ండటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.రెండేళ్లు భరించాం.. సహనం నశించింది! ‘అధికార పార్టీ వేధింపులు, దౌర్జన్యాలు రెండేళ్లు చూశాం.. సహనం నశించింది.. ఇక పోరాటం ఎంచుకున్నాం’ అని ఎస్వీ మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని, వెనుకడుగు వేసే ప్రసక్తి లేదదన్నారు. అవసరమైతే జైళ్లకు సైతం వెళ్లేందుకు వెనుకాడమన్నారు. కర్నూలు యువజన విభాగం నగర అధ్యక్షులు బాలాంజనేయులు ఆలియాస్ బాలు వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్టు అని, వైఎస్సార్సీపీలో చురుగ్గా పనిచేస్తున్నాడని ఆయన కారులో సారా ఉందని అక్రమ కేసు పెట్టారన్నారు. వారం క్రితం పోలీసుల వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శ్రీరామనగర్లో ఐటీడీపీ జిల్లా అధ్యక్షులు గట్టు తిలక్ మృతికి ముందు లేఖలో రాసినా ఎటువంటి చర్యలు లేవన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మణిరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీలో బలంగా పనిచేసే నాయకులు, కార్యకర్తలను టీడీపీ నాయ కులు టార్గెట్ చేసి పోలీసులు ద్వారా వేధించడంతో పాటు, అక్రమ కేసులకు పాల్పడుతున్నారన్నారు. సమావేశంలో పార్టీ సీఈసీ సభ్యులు రాంపుల్లయ్య యాదవ్, గడ్డం రామకృష్ణ, షరీఫ్, కిషన్, శ్రీనివాసరెడ్డి, అనిల్కుమార్, మాజీ కార్పొరేటర్లు కృష్ణకాంత్ రెడ్డి, షేక్ యూనుస్ బాషా, షాషావలీ, సాయి పాల్గొన్నారు. మూడవ పట్టణ పోలీసు స్టేషన్ ఎదుట నేడు మహా ధర్నా పాల్గొననున్న యువజన రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, బైరెడ్డి సిద్దార్థరెడ్డి భారీగా తరలి రావాలని వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి నాయకులకు పిలుపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డి -
‘గాలి’ వైద్యం!
సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్నా మనిషి మూఢనమ్మకాలను వీడలేకపోతున్నాడు. ఇప్పటికీ దెయ్యం పట్టిందనే అపోహతో నాటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. తాయత్తులు, అంత్రాలు కట్టించుకొని నయమైనట్లుగా భ్రమపడుతున్నారు. చివరకు వ్యాధి ముదిరి మానసిక వైద్యులను సంప్రదిస్తున్నారు. బుధవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని సర్జికల్ విభాగం వద్ద కొందరు మహిళలు ఓ మహిళను జుట్టు పట్టుకొని కొడుతున్నారు. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఈమెను విడిచి పో అంటూ గట్టిగా కేకలు వేస్తున్నారు. అక్కడున్న వారంతా ఈ దృశ్యాన్ని వేడుకగా చూస్తున్నారు. ఏమైందోనని ‘సాక్షి’ ఆరా తీయగా.. ఆమెకు కొద్ది రోజులుగా మానసిక సమస్య ఉన్నట్లు తెలిపారు. ఆసుపత్రిలోని మానసిక వ్యాధుల విభాగంలో చేర్చినా ఉండటం లేదన్నారు. గాలి సోకినట్లుగా భావించి ఇలా చేయిస్తున్నట్లు ఆమె సంబంధీకులు చెప్పడం గమనార్హం. – కర్నూలు(హాస్పిటల్) -
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
కోడుమూరు రూరల్: స్వచ్ఛ పథం కార్యక్రమంలో భాగంగా ప్రజలంతా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జెడ్పీ సీఈఓ రమణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కోడుమూరులో నిర్వహిస్తున్న స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని జెడ్పీ సీఈఓ రమణారెడ్డి, డీఎల్డీఓ ఆశ్వినికుమార్ పరిశీలించి పారిశుద్ధ్య సిబ్బందికి పలు సూచనలిచ్చారు. జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య సిబ్బంది ప్రతిరోజు సకాలంలో వీధులను శుభ్రం చేయడంతో పాటు, ఇంటింటి నుంచి చెత్తను సేకరించి చెత్త నుంచి తయారీ కేంద్రానికి తరలించాలని ఆదేశించారు. అలాగే ప్రజలు కూడా తమ వద్ద వేస్ట్ పొడి చెత్త, పాత పుస్తకాలు, అట్టపెట్టెలు, ఇనుము, ప్లాస్టిక్ బాటిళ్లను స్వచ్ఛ రథంలో అప్పగించి పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలని కోరారు. అనంతరం సీఈఓ కోడుమూరులో జరుగుతున్న జనగణన కార్యక్రమాన్ని తనిఖీ చేసి త్వరితగతిన మ్యాపు చేయబడిన సర్వేను పూర్తి చేయాలని ఎనుమరేటర్లకు సూచించారు. అలాగే మేజర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సీఈఓ సందర్శించారు. కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించాలని, చెత్తను ఉపయోగించి వర్మీ కంపోస్టు ఎరువును తయారు చేయాలని ఎంపీడీఓ రాముడుకు సూచించారు. పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. -
బైకులకు నిప్పు
ఆదోని అర్బన్: పట్టణంలోని వసంత టాకీస్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రెండు బైకులకు నిప్పు పెట్టి పరారయ్యాడు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని వసంత టాకీస్ సమీపంలో కిషోర్ అనే వ్యక్తి ఇంటి ముందు రెండు బైకులు నిలిపి ఉంచారు. బుధవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఓ వ్యక్తి వచ్చి బైక్లకు నిప్పు పెట్టాడు. మంటలు చెలరేగడంతో వెంటనే అక్కడినుంచి పరారయ్యాడు. మంటలను గమనించిన స్థానికులు బైకు యజమానిని లేపారు. మంటలో ఒక బైక్ పూర్తిగా దహనం కాగా, మరో బైకు సగభాగం కాలిపోయింది. ఘటనపై వన్టౌన్ పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి పరిశీలించి వెళ్లారని బైకు యజమాని కిషోర్ తెలిపారు. ట్రాక్టర్ను ఢీకొన్న బస్సు ● ఒకరికి తీవ్ర గాయాలు చాగలమర్రి: మండలంలోని చిన్నబోధనం గ్రామ సమీపంలో 40వ నంబరు జాతీయ రహదారిపై ట్రాక్టర్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాదు నుంచి పాండిచ్చేరికి వెళ్తున్న ట్రావెల్స్ బస్సు బుధవారం తెల్లవారుజామున రాంపల్లె నుంచి చిన్నబోధనం గ్రామంలోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న ట్రాక్టర్ను అతివేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ ఓబులేసు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ ఓబులేసును టోల్ప్లాజా అంబులెన్సులో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సులోని వారికి ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పొగాకు ఉత్పత్తులతో ఫ్లోరోసిస్ ముప్పు కర్నూలు(హాస్పిటల్): బీడీ, చుట్టా, సిగరెట్, జరదా, తంబాకు, పాన్ మసాలా, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు వాడితే ఫ్లోరోసిస్ వ్యాధి సమస్యలు వస్తాయని ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ డాక్టర్ సుధాకర్ చెప్పారు. బుధవారం నగర శివారులోని ప్రజానగర్లో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో నిర్వహించిన సంచార చికిత్స కార్యక్రమంలో ఆయన ఫ్లోరోసిస్పై అవగాహన కల్పించారు. అధిక స్థాయిలో ఫ్లోరైడ్ కలిగిన ఆహార పదార్థాలు, నీరు తీసుకోవడం వల్ల ఫ్లోరోసిస్ వ్యాధికి గురవుతారన్నారు. దీనివల్ల వికారం, వాంతులు, ఆకలి మందగించడం, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, దంతాల రంగు మారడం, తరచూ మూత్రం రావడం, అధికంగా దాహం వేయడం, కండరాలు, కీళ్ల నొప్పులు, ఎక్కువగా నడవలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఫ్లోరోసిస్కు గురైన వారు తాజా ఆకుకూరలు, పాలపదార్థాలు, తాజా పండ్లు, విటమిన్–సి ఉన్న ఆహార పదార్థాలు (ద్రాక్ష, ఉసిరి, నిమ్మకాయలు) తప్పకుండా తీసుకోవాలన్నారు. ఎక్కువగా మరగకాచిన టీ, కాఫీ, డికాషన్ తీసుకోవడం వల్ల కూడా ఫ్లోరోసిస్కు గురవుతారని తెలిపారు. వైద్యులు నందిని, క్షేత్రస్థాయి పర్యవేక్షకులు ఎస్తేర్ రాణి, సామాజిక ఆరోగ్య అధికారులు అనిత, మహేశ్వరి, ఆశా కార్యకర్తలు, జమృత్, భారతి, ప్రొజెక్షనిస్టు ఖలీల్ పాల్గొన్నారు. -
15 నుంచి ఎల్ఆర్ఎస్ మేళా
కర్నూలు టౌన్: నగరపాలక సంస్థ నూతన కౌన్సిల్ హాలులో ఈనెల 15, 16 తేదీల్లో ఎల్ఆర్ఎస్ మేళా నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనధికారిక లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారు త్వరితగతిన పరిష్కరించుకోవాలన్నారు. ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్లకు పూర్తి చట్టబద్ధత లభిస్తుందని, భవిష్యత్తులో రిజిస్ట్రేషన్, భవన నిర్మాణ అనుమతులు, బ్యాంకు రుణాలు, ఆస్తి బదలాయింపు వంటి ప్రక్రియలు సులభమవుతాయన్నారు. గృహ నిర్మాణ సమస్యలపై కాల్ చేయండి కర్నూలు(అర్బన్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో గృహాలు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు తమ సమస్యలు, సందేహాలను నివృత్తికి ఈ నెల 14న 08518– 257481 నెంబర్కు ఉదయం 10 నుంచి 11 గంటల్లోపు కాల్ చేయాలని హౌసింగ్ పీడీ చిరంజీవి తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన సిమెంట్, స్టీల్ తదితర గృహ నిర్మాణ సామగ్రి, బిల్లుల గురించి ఫోన్ చేసి తెలుసుకోవచ్చ న్నారు. అలాగే పీఎంఏవై 2.0 అర్బన్ గృహాలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా సంప్రదించాలని పేర్కొన్నారు. డీఈఓ వెబ్సైట్లో సీనియారిటీ జాబితాలు కర్నూలు సిటీ: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్, సెకండ్ గ్రేడ్ టీచర్లు, తత్సమాన టీచర్లందరి తుది సీనియారిటీ జాబితాలను డీఈఓ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు డీఈఓ ఎల్.సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా సబ్జెక్టులతో సహా జాబితాలను రూపొందించామన్నారు. ఈ జాబితాలను www.deokrnl13.blogspot.com అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 19 లోపు (పని దినాల్లో మాత్రమే) డీఈఓ కర్నూలు (ఉమ్మడి జిల్లా) ఆఫీస్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు తగిన ఆధారాలతో సమర్పించవచ్చన్నారు. గడువు తరువాత ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని పేర్కొన్నారు. ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు కర్నూలు(సెంట్రల్): మే 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ పబ్లిక్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 57 కేంద్రాల్లో సప్లిమెంటరీ పరీక్షలకు 15,834 మంది జనరల్ విద్యార్థులు, 1,815 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరవుతారన్నారు. రెండో సంవత్సరానికి 7,374 మంది జనరల్ విద్యార్థులు, 775 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా కేంద్రాలకు అనువుగా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ సి.వెంకటనారాయణమ్మ, ఆర్ఐఓ లాలెప్ప, కర్నూలు నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ కృష్ణ, కార్మిక శాఖాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పాలనలో మోదీ విఫలం ● సీపీఐ జాతీయ కార్యదర్శి అన్నె రాజా పత్తికొండ రూరల్: విశ్వగురువుగా ప్రచారం చేసుకునే నరేంద్రమోదీ దేశ ఆర్థిక, ప్రజా సమస్యలను గాలికొదిలేసిన అసమర్థుడుని, పాలనలో ఘోరంగా విఫలమయ్యారని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శిఏ. రాజా విమర్శించారు. బుధవారం కర్నూలులో ఆమె విలేకరులతో మాట్లాడారు. రైతులు, వ్యాపారులు, కార్మికులు, మధ్యతరగతి వర్గాల వారందరూ మోదీ అవలంబిస్తున్న విధానాలతో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మోదీ వెన్నెముక లేని రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో అన్ని వర్గాల ప్రజల ఇబ్బందులు, మతోన్మాదంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు దేశవ్యాప్తంగా ఆగస్టు 6 నుంచి 15 వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాదయాత్రలు చేపడుతామని తెలిపారు. విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
పగిడ్యాల: భార్యతో గొడవ పడి భర్త ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పగిడ్యాల అంబేడ్కర్ కాలనీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుని భార్య నాగమణి తెలిపిన వివరాలు.. స్థానిక అంబేడ్కర్ కాలనీకి చెందిన నాగరాజు అలియాస్ ఏసు(29) మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం నందికొట్కూరులో బీరు తెచ్చుకుని తాగి తనతో గొడవ పడినట్లు తెలిపింది. ఇంతకుముందు ఫోన్ పే చేసిన రూ.12 వేలు ఇవ్వాలని వేధించడంతో చిన్న మామ సామేలు ఇంటి వద్దకు వెళ్లినా వదలకుండా వెంటపడి కొట్టాడని వివరించింది. దెబ్బలకు తట్టుకోలేక ఇంటి వెనుక కల్లంలో దాక్కున్నట్లు తెలిపింది. ఈక్రమంలో నాగరాజు తాను ఉరి వేసుకుంటున్నట్లు బంధువులకు సమాచారం ఇవ్వగా వారు తనకు చెప్పడంతో వెళ్లి చూడగా అప్పటికే మృతిచెంది ఉన్నట్లు భార్య నాగమణి తెలిపింది. కాగా నాగరాజు మృతిపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఏసీబీకి పట్టుబడిన ఏఈఓ
● అదుపులో మరో వ్యక్తి ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని వ్యవసాయ కార్యాలయంలో బుధవారం సాయంత్రం రూ.30 వేలు లంచం తీసుకుంటున్న ఏఈఓ నరసింహులు, కార్యాలయంలో ఉన్న అనధికార వ్యక్తి మోహన్ను ఏసీబీ అధికారులు రెడ్ వ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన ఈడిగ రంగన్న గౌడ్ అంబేద్కర్ సర్కిల్లో మహలక్ష్మీ ట్రేడర్స్ ఫర్టిలైజర్ షాప్ను నిర్వహిస్తున్నాడు. షాప్ లైసెన్సు రెన్యూవల్తో పాటు ఇదే షాప్లో పెస్టిసైడ్స్ విక్రయించేందుకు కొత్తగా లైసెన్స్ కోసం వ్యవసాయ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే లైసెన్సు మంజూరు చేయాలంటే రూ. 35 వేలు ఇవ్వాలని ఏఈఓ నరసింహులు.. డీలర్ రంగన్నగౌడ్కు చెప్పాడు. దీంతో ఆయన ఏసీబీ అధికారులను సంప్రదించాడు. పక్కా ప్లాన్తో బుధవారం సాయంత్రం ఏఈఓకు రూ. 30 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏఈఓతో పాటు కార్యాలయంలో ఉన్న అనధికార వ్యక్తి మోహన్ దగ్గర రూ. 73,600ను స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ఏ కార్యాలయంలోనైనా పనులకు లంచం అడిగితే నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదింవచ్చునని సూచించారు. దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్ఐ సుబ్బారాయుడుతోపాటు సిబ్బంది ఉన్నారు. అయితే ఏసీబీ దాడులు జరిగినప్పుడు ఏడీఏ, ఏఓ కార్యాలయాల్లో లేకపోవటం గమనార్హం. -
ఉల్లి డీహైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో వచ్చే మంగళవారం నాటికి ఉల్లి డీహైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఉద్యాన, ఫుడ్ ప్రాసెసింగ్, మెప్మా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఉల్లి సాగు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉల్లి సాగులో దిగుబడిని పెంచడానికి నాణ్యమైన విత్తనాలను నాటడం, సీడ్ డ్రిల్లర్ యంత్రాలను సబ్సిడీపై రైతులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఉద్యాన శాఖాధికారులను ఆదేశించారు. సమావేశఃలో ఉద్యాన శాఖాధికారి రాజాకృష్ణారెడ్డి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, మెప్మా పీడీ శ్రీనివాసులు పాల్గొన్నారు. 17న కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు కర్నూలు(అర్బన్): కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 17న ఉదయం 10 గంటలకు పెద్దపాడు రోడ్డులోని ఏపీ మోడల్ స్కూల్ పక్కనున్న శ్రీ భీర లింగేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కురువ సంఘం ప్రధాన కార్యదర్శి ఎంకే రంగస్వామి తెలిపారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులను విద్యాపరంగా మరింత ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు పెద్ద సంఖ్యలో కురువ సామాజిక వర్గ ప్రజలు హాజరు కావాలని కోరారు. సమావేశంలో సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, ఉపాధ్యక్షులు ధనుంజయ, కోశాధికారి కేసీ నాగన్న తదితరులు పాల్గొన్నారు. ఏపీ పీఆర్ రాష్ట్ర అసోసియేషన్లో జిల్లాకు చోటు కర్నూలు(అర్బన్): ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు చోటు లభించింది. ఇటీవల గుంటూరు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఎన్నికలు నిర్వహించి, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యవర్గంలో కర్నూలు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆర్.మధు వెంకటేశ్వరరావును రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, జిల్లా పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆర్బీవీ కృష్ణారావును రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలి సి.బెళగల్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచాలని ఉపాధ్యాయులకు డీఈఓ సుధాకర్ సూచించారు. మండల విద్యాశాఖ అధికారులు జ్యోతి, ఆదామ్బాషా ఆధ్వర్యంలో మంగళవారం పొలకల్లో బడిపిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. డిప్యూటీ ఈఓ శ్రీధర్బాబుతో కలిసి డీఈఓ తనిఖీ చేశారు. అనంతరం స్థానిక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో రెమిడియల్ తరగతులను తనిఖీ చేసి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. హెచ్ఎంలు తిమ్మన్న, వరలక్ష్మమ్మ, మునిస్వామి, సీఆర్పీలు పాల్గొన్నారు. వడదెబ్బతో వ్యక్తి మృతి పాములపాడు: వడదెబ్బతో కోల్స్ ఆనందాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ విజయానందం(54) మృతి చెందాడు. సోమవారం ఉదయం ఉపాధి పనులకు, మొక్కజొన్న మిషన్ పనులకు వెళ్లి ఎండలు ఎక్కువగా ఉండటంతో అస్వస్థతకు గురై మంగళవారం తెల్లవారు జామున మృతి చెందాడు. -
ఇళ్లు తనఖా పెట్టించి ఘరానా మోసం
వెల్దుర్తి: పలు ప్రైవేట్ బ్యాంకులలో గ్రామస్తుల ఇళ్లు తనఖా పెట్టించి లోన్ మంజూరు చేయించాడు. అందులో సగం తీసుకుని, మిగతా సగం కూడా తనకే ఇస్తే అధిక వడ్డీ చెల్లిస్తానని ఆశ జూపి మొత్తం కాజేశాడు. లోన్కు సంబంధించి పూర్తి ఈఎంఐ తానే కట్టేస్తానని నమ్మబలికి చివరకు పత్తా లేకుండా పోయాడు. ఈ క్రమంలో రుణం తీసుకున్న వారికి ఈఎంఐ చెల్లించాలంటూ బ్యాంకు వారు ఒత్తిడి చేస్తుండటంతో మోసపోయినట్లు తెలుసుకుని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటనపై బాధితులు పాండు, మల్లయ్య, గిడ్డయ్య, ఎల్లయ్య, రాజు, రామాంజనేయులు, మాదన్న, మనోహర్, రామలింగం తదితరులు తెలిపిన వివరాల మేరకు.. మల్లెపల్లె గ్రామానికి చెందిన ఏజెంట్ బురకల శాంతకుమార్ దాదాపు 4 ఏళ్ల నుంచి డోన్కు చెందిన ఓ ప్రైవేట్ బ్యాంకులో, మరిన్ని బ్యాంకులలో ఇళ్లు తనఖా పెట్టి లోన్ ఇప్పిస్తానని, అందులో సగం తాను తీసుకుని, లోన్ మొత్తం కంతుల వారీగా బ్యాంకుకు చెల్లిస్తానని ఆశ చూపాడు. దీంతో మల్లెపల్లెలోని దాదాపు 70 మందికి పైగా గ్రామస్తులు తమ ఇళ్లు, ఇతర ఆస్తి పత్రాలు శాంతకుమార్కు అప్పగించారు. వాటిని ప్రైవేట్ బ్యాంకులలో తనఖా పెట్టించి (మార్టిగేజ్ చేయించి) దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లోన్ మంజూరు చేయించాడు. సొమ్ము లబ్ధిదారుల ఖాతాలో జమ కాగానే ఒప్పందం ప్రకారం సగం తీసుకున్నాడు. మిగతా సగం కూడా తనకే ఇస్తే అధిక వడ్డీ చెల్లిస్తానని ఆశ చూపి మొత్తం కాజేశాడు. మొదట్లో లోన్ ఈఎంఐ సక్రమంగా కడుతూ ఇతరుల నమ్మకం పెంచుకున్నాడు. నమ్మకం మరింత పెరిగేలా ఇళ్లు తనఖా పెట్టిన వారికి బాండ్ సైతం రాసిచ్చాడు. దీంతో వందల సంఖ్యలో మల్లెపల్లెతో పాటు మండల పరిధిలోని చెరుకులపాడు, రామళ్లకోట, కలుగొట్ల, పుల్లగుమ్మి, బుక్కాపురం ఇలా పలు గ్రామాల వాసులు ఇతని ద్వారా హోమ్లోన్ తీసుకుని నగదు సమర్పించుకున్నారు. క్షేత్రస్థాయి విచారణ లేకుండా కేవలం ధ్రువపత్రాలను చూసి లోన్ మంజూరు చేయడంపై ఈ స్కామ్లో బ్యాంకు వారి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పత్రాలు లేకపోయినా ఏజెంట్ శాంతకుమార్ అధికారుల వద్దకు తిరిగి మరీ ఏర్పాటు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఎమ్మిగనూరు, కోడుమూరు, వెల్దుర్తి తదితర మండలాల్లో ఈ తరహాలో రూ.కోట్లలో స్కామ్ జరిగినట్లు చెప్పారు. ఈ స్థితిలో శాంతకుమార్ పత్తా లేకుండా పోవడంతో గత వారం నుంచి తమకు బ్యాంకుల నుంచి ఈఎంఐ కట్టాలంటూ ఒత్తిడి ఎక్కువైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబంలో ఒకరు పేడ రంగు తాగి ఆత్మహత్యకు సైతం ప్రయత్నించినట్లు చెప్పారు. తమ పరిస్థితీ అదేనని, అధికారులు చర్యలు చేపట్టి న్యాయం చేయాలని కోరారు. ఘటనపై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వందల మందికి రూ.కోట్లలో కుచ్చుటోపీ పరారీలో ఏజెంట్ ఈఎంఐ కట్టాలని బ్యాంకుల నుంచి ఒత్తిడి -
క‘నీట్’ సుడులు!
కర్నూలు సిటీ: వైద్య విద్యను అభ్యసించాలనేది ఎంతో మంది విద్యార్థుల కల. ఇందుకోసం రేయింబవళ్లు కష్టపడుతున్న విద్యార్థులు కోకొల్లలు. ఆ దిశగా తొలి అడుగు వేస్తున్న తీరుణంలో నీట్ రద్దు వార్త విద్యార్థులను కన్నీళ్లు పెట్టిస్తోంది. రాజస్థాన్లో పేపర్ లీక్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈనెల 3న నిర్వహించిన వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీ–2026 రద్దయింది. ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి శిక్షణ ఇప్పించిన తల్లిదండ్రులు ఈ వార్తతో ఆందోళన చెందుతున్నారు. ప్రశ్నపత్రం మధ్యస్తంగా ఉండటంతో చాలా మంది విద్యార్థులు మంచి మార్కులు వస్తాయని, ఇక వైద్య విద్యను అభ్యసించవచ్చని ఎంతో ఆశతో ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెలువడిన రద్దు వార్త విద్యార్థుల కళ్లలో కన్నీటి సుడికి కారణమైంది. మళ్లీ ఆ స్థాయిలో పరీక్ష రాస్తామో, లేదోనని ఆందోళన వ్యక్తమవుతోంది. నీట్ పరీక్షకు కర్నూలులో 16 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 4,928 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 4,807 మంది హాజరయ్యారు. మా అబ్బాయి గత నెల 3న జాతీయ స్థాయిలో జరిగిన నీట్ యూజీ–2026 ప్రవేశ పరీక్ష రాశారు. మంచి మార్కులు వస్తాయని అనుకుంటున్న సమయంలో రాజస్థాన్లో నీట్ ప్రశ్నపత్రం లీకై ందని ఎన్టీఏ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసింది. ఈ పరిస్థితుల్లో పరీక్ష రాసిన విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా కాకుండా ఎక్కడైతే నీట్ ప్రశ్నపత్రం లీకై ందని తెలుస్తుందో అక్కడ మాత్రమే రద్దు చేస్తే బాగుంటుంది. – డా.చైతన్య కుమార్, గుండె వైద్య నిపుణులు, విద్యార్థి తండ్రి నీట్ పరీక్షకు కష్టపడి సిద్ధమయ్యాను. పరీక్ష రాసిన ఆనందం ఎన్నో రోజులు నిలువలేదు. నేను అనుకున్న మార్కులు సాధిస్తాననే నమ్మకం ఉంది. ఇక వైద్య విద్యను అభ్యసించవచ్చని ఆశించా. ఇప్పుడు పేపర్ లీక్ అయిందని పరీక్ష రద్దు చేయడం తెలిసి చాలా బాధ కలుగుతోంది. రీ ఎగ్జామ్లో పేపర్ ఎలా వస్తుందో తెలియదు. అమ్మానాన్న ధైర్యం చెబుతున్నా కోలుకోలేకపోతున్నా. – పి.ప్రవళ్లిక, బోడబండ, ఎమ్మిగనూరు మండలం మా కుమార్తె సిరిసౌమ్య ఎంతో కష్టపడి చదివి నీట్ పరీక్ష రాసింది. రాజస్థాన్లో పేపర్ లీకై ందని పరీక్షను రద్దు చేయడంతో ఎంతో మంది విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురైయ్యే అవకాశం ఉంది. మొదటిసారి పరీక్ష రాసినంత ఉత్సాహం రెండోసారి ఉండదు. ఒత్తిడికి లోనవుతారు. పరీక్ష రద్దు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమే. – బోరెల్లి సోమన్న, కోడుమూరు మా అమ్మాయి షేక్ యాస్మిన్ మెడిసిన్ చేయాలనే లక్ష్యంతో నెలల తరబడి చాలా కష్టపడి చదివి నీట్ పరీక్ష రాసింది. మంచి మార్కులు వస్తాయనే నమ్మకంతో సంతోషంగా ఉన్న సమయంలో పరీక్ష రద్దు అని ప్రకటించడం చాలా బాధాకరం. ప్రభుత్వాలు గతంలో లీక్ అయిన సమయంలో కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. – అబ్బాస్, పెరవలి గ్రామం మద్దికెర మండలం పరీక్ష బాగా రాశామని చాలా మందిలో సంతోషం వైద్య విద్యను అభ్యసించేందుకు నిరీక్షణ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు నిరాశ కలిగించిన పరీక్ష రద్దు మళ్లీ ఆ స్థాయిలో రాయగలమో లేదోనన్న సంశయం -
కొండలు పిండి.. సంపద కొల్లగొట్టి
కొచ్చేర్వు, కన్నపకుంట గ్రామల మధ్య అక్రమ మైనింగ్ చిన్న మల్కాపురం గ్రామంలో అక్రమ మైనింగ్ జరుగుతున్న దృశ్యండోన్ రూరల్: నంద్యాల జిల్లా డోన్ మండలంలోని పచ్చని కొండల్ని అధికార పార్టీ నాయకులు అక్రమ మైనింగ్ చేస్తూ పిండి చేస్తున్నారు. భూగర్భంలో ఇమిడి ఉన్న విలువైన ఖనిజ సంపదను కొల్లగొడుతూ అక్రమంగా కోట్లు గడిస్తున్నారు. ప్రభుత్వానికి నయాపైసా రాయాల్టీ, వే బిల్లుల రూపంలో చెల్లించకుండానే యాథేచ్ఛగా ఖనిజాన్ని తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. మండలంలోని కన్నపకుంట, కొచ్చెర్వు, మల్కాపురం, పరదేశిబావి, పెద్ద మల్కాపురం, డోన్ శివారులోని వెంకటనాయునిపల్లె, గుడితిప్ప ప్రాంతాల్లోని అ టవీ, రెవెన్వూ భూముల్లో ప్రభుత్వం నుంచి ఎలా ంటి అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు సా గిస్తూ విలువైన ఖనిజాలను కొల్లగొడుతున్నారు. కళ్లు మూసుకున్న అటవీ, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు జరిపేందుకు రెవెన్యూ శాఖ నుంచి ఎన్ఓసీ (నో అబ్జెక్షన్) సర్టిఫికెట్ పొందకుండా, ఏడీఎంజీకి రాయల్టీ బిల్లులు చెల్లించకుండా, సేల్ ట్యాక్స్ నుంచి వే బిల్లులు లేకుండానే ఖనిజాలను అక్రమంగా తవ్వుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. కొచ్చెర్వు, కన్నపకుంట అటవీ భుముల నుంచి డోలమైట్, వైట్ సెల్, లైమ్ స్టోన్లతో పాటు వివిధ రంగుల రాళ్లను అక్రమంగా తరలిస్తున్నారు. పట్టణ శివారుతో పాటు పలు ప్రాంతాల్లో లైసెన్స్లు పొందకుండానే గనుల్లో బ్లాస్టింగ్ (పేల్లుళ్లు)కు పాల్పడుతున్నారు. అటవీ, రెవెన్యూ, ఎడీఎంజీ, సేల్స్ ట్యాక్స్ అధికారులు కళ్లుండి చూడలేని కబోదుల్లా మారడంతో అధికార పార్టీ నేతల అక్రమార్జనకు అంతులేకుండా పోతోంది. ఈ విషయంపై నోరు మెదిపేందుకు కుడా సంబంధిత అధికారులు ఇష్టపడటం లేదు. ఖనిజాల అక్రమ తవ్వకం ద్వారా కోట్లు గడిస్తున్న టీడీపీ నాయకులు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి మొద్దు నిద్రలో ఏడీఎంజీ, అటవీ, రెవెన్యూ అధికారులు -
పండ్ల దుకాణాల్లో తనిఖీలు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరంలో నిబంధనలకు విరుద్ధంగా పండ్లను మాగిస్తున్న దుకాణాలపై మంగళవారం ఆహార భద్రత విభాగం (ఫుడ్ సేఫ్టీ) అధికారులు తనిఖీలు నిర్వహించారు. నగరంలోని మండిబజార్లో ఉన్న గౌస్ ఫ్రూట్స్ కంపెనీ, షమీవుల్లా ఫ్రూట్ మర్చంట్ దుకాణాల్లో తనిఖీలు చేసి అరటి, మామిడి పండ్లు మాగిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఇథలిన్ గ్యాస్ను గదిలోకి పంపి పండ్లను మాగించకుండా ఇథలిన్ పౌడర్ను నీళ్లలో కలిపి అందులో పండ్లను మాగించడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇలా మాగించిన పండ్లను తినడం వల్ల వ్యాధులు వస్తాయని ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ చెప్పారు. ఈ మేరకు అరటి, మామిడి పండ్లను శాంపిల్ తీసి ల్యాబోరేరీకి పంపించారు. డిస్ట్రిక్ట్ కన్జూమర్ సెక్రటరీ శివమోహన్రెడ్డి తదితరులు వెంట ఉన్నారు. -
ఉమ్మడి జిల్లాలో నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు
● 2025 ఖరీఫ్లో 2,86,622 హెక్టార్లలో పత్తి సాగు ● ఈ సారి సాగు మరింత పెరిగే అవకాశం ● కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీగా పత్తి విత్తన ప్యాకెట్లు డంప్ ● గుట్టుచప్పుడు కాకుండా హెచ్టీ పత్తి సాగు ● సొంత ధృవీకరణతోనే మార్కెట్లోకి బీటీ పత్తిన ప్యాకెట్లు కర్నూలు(అగ్రికల్చర్): 2025 ఖరీఫ్ సీజన్లో ఉమ్మడి జిల్లాలో పత్తి 2,86,622 హెక్టార్లలో సాగయింది. ఈ సారి పత్తి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నీటి వసతి కింద ముందస్తు ఖరీఫ్లో పత్తి సాగు చేయడం విశేషం. 2026లో కర్నూలు జిల్లాలో 3 లక్షల హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 20వేల హెక్టార్లలో పత్తి సాగయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడే హైబ్రిడ్ పత్తి, బీటీ పత్తి విత్తనోత్పత్తి కూడా అధికం. బీటీ–2 పత్తి విత్తనాల మార్కెటింగ్కు రాష్ట్రం మొత్తం మీద జరిగే మార్కెటింగ్ ఒక ఎత్తు అయితే ఉమ్మడి జిల్లాలో జరిగే మార్కెటింగ్ మరో ఎత్తు. ఉమ్మడి జిల్లాలో పత్తి విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు 9 మాత్రమే ఉన్నాయి. ఈ కంపెనీల్లో ఇప్పటికే ప్యాకింగ్ కూడా పూర్తయింది. అయితే జిల్లాలో 250 కంపెనీలు దాదాపు 1000 దాకా బీటీ పత్తి విత్తన రకాలను మార్కెట్లోకి విడుదల చేశాయి. తెలంగాణా కేంద్రంగా ఉన్న వందలాది కంపెనీలు ఉమ్మడి కర్నూలు జిల్లాను మార్కెటింగ్కు కల్పతరువుగా వినియోగించుకుంటున్నాయి. గుజరాత్ కంపెనీలతో కన్సల్టెన్సీ, సబ్ డీలర్స్ లైసెన్స్ పేరుతో వందలాది కంపెనీలు బీటీ పత్తి విత్తన ప్యాకెట్ల మార్కెటింగ్లో నిమగ్నమయ్యాయి. గుజరాత్ కంపెనీలకు రాయల్టీ చెల్లిస్తూ.. ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. నాణ్యత దేవుడికెరుక పత్తి విత్తన నాణ్యతతో వ్యవసాయ శాఖకు ఎలాంటి సంబంధం లేదు. ఆయా కంపెనీలే సొంతంగా ధృవీకరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు, నాలుగేళ్ల క్రితం కావేరి–జాదు రకం బీటీ పత్తి విత్తనాలతో వేలాది మంది రైతులు నష్టపోయారు. పరిహారం చెల్లించాలని కోర్టులు ఆదేశించినప్పటికీ కంపెనీలు చేతులెత్తేశాయి. 2024 ఖరీఫ్ సీజన్లో కూడా ఒక పేరొందిన కంపెనీ విత్తనంతో సాగు చేసిన పత్తి పలు చోట్ల దెబ్బతినింది. అయితే ఆ కంపెనీ పెద్దలు వ్యవసాయ యంత్రాంగాన్ని ముడుపులతో లోబరుచుకొని ఇతర కారణాలతో పంట దెబ్బతిన్నట్లు రిపోర్టు ఇవ్వడం గమనార్హం. పత్తిలో కలుపు సమస్య అధికం. హెచ్టీ పత్తిలో కలుపు నివారణకు గ్లైపోసేట్ మందును పిచికారి చేస్తే కలుపు నాశనం అవుతుంది తప్ప.. పత్తి పంటకు ఏమీ కాదు. హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ పత్తి విత్తనాలు జీవవైవిధ్యానికి ప్రమాదకరమనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వీటికి అనుమతివ్వలేదు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఏర్పాటు తర్వాత అనుమతి లేకపోయినప్పటికీ కొన్ని కంపెనీలు రైతులతో హెచ్టీ పత్తి సాగు చేస్తుండటం గమనార్హం. ఇటీవల ఆదోనిలో నిర్వహించిన హెచ్టీ పరీక్షల్లో గ్లైపోసేట్ ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో 2500 బీటీ–2 విత్తన ప్యాకెట్ల అమ్మకాలను నిలిపి వేశారు. కర్నూలులోని వివిధ కంపెనీల్లో హెచ్టీ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. పత్తిలో నకిలీ విత్తనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ అధికారులతో ఆరు అంతర్రాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటు చేశాం. కర్నూలు, ఆదోనిల్లో పత్తి విత్తన ప్రాసెసింగ్ యూనిట్ల వారీగా తనిఖీ బృందాలు ఏర్పాటయ్యాయి. విత్తన దుకాణాల్లో ఇంటర్నల్ స్క్వాడ్లతో తనిఖీలు చేయిస్తున్నాం. హెచ్టీ పత్తి సాగును నియంత్రించేందుకు 175 శాంపుల్స్ సేకరించి పరీక్షించాం. కల్లూరులో రెండు, ఆదోనిలో నాలుగు హెచ్టీ పాజిటివ్ వచ్చింది. ఆ మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. – సీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు -
కోనేరులో జారిపడి వ్యక్తి మృతి
బనగానపల్లె: మండలంలోని నందవరం చౌడేశ్వరి ఆలయం ఎదురుగా ఉన్న కోనేటిలో మంగళవారం నడిగంటి బాలనరసింహుడు (43) ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. వివరాలు.. వైఎస్సార్ కడప పట్టణంలోని అంగన్ వీధిలో నివసించే బాల నరసింహుడు మొక్కుబడి తీర్చుకునేందుకు కుటుంబంతో సహా చౌడేశ్వరి ఆలయానికి వచ్చారు. కోనేటిలో దిగి కాళ్లు, ముఖం శుభ్రం చేసుకుంటుండగా ప్రమాద వశాత్తు నీటిలో పడిపోయారు. ఆ సమయంలో కాపాడేందుకు ఎవరూ లేకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. కొంత సేపటికి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా శవమై తేలాడు. సమాచారం అందుకున్న పోలీసులు కోనేటిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
నాటి దానం నేటికీ పదిలం
● అహోబిలం ఆలయ కుడ్యంపై 500 ఏళ్ల క్రితం నాడు కురుకుంద వాసి దానంపై శాసనంఆత్మకూరురూరల్: కృష్ణా తీరం వెంట ఉన్న ప్రాంతాలను వేల సంవత్సరాలుగా బాదామి చాళుక్యులు, హోయసలలు, రాష్ట్రకూటులు, కాకతీయులు, రెడ్డి రాజులు వంటి అనేక రాజవంశాలు పాలించినట్లు చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలోని ధనవంతులు ధర్మవితరణ చేసేవారనే సత్యం ఇటీవల బయల్పడిన ఒక శాసనం ద్వారా తెలుస్తోంది. దిగువ అహోబిలం ఆలయ గోపురం కుడివైపు గోడపై ఉన్న శాసనాలను స్పష్టంగా చదవడం కోసం రసాయనాలతో శుద్ధీకరణ జరిపారు. అందులో ఒక శాసనంలో ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామ ప్రసక్తి ఉండడమే ఈ వార్తాంశం అయ్యింది. కన్నడ భాష లిపి ఉన్న ఈ శాసనం క్రీ.శ 1553 జులై 2న శనివారం వేయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామానికి చెందిన దళవాయి లింగరస, గురజాల నరసనాయన కుమారుడైన పోచిరాజ నరసరాజయ మహా అరసు పుణ్యం కోసం అహోబిల నరసింహుడికి ప్రతిరోజు సహస్త్రనామ పూజ నిర్వహించేందుకు 12 వరమా – గద్వాణాలను దానంగా ఇచ్చినట్లు ఈ శాసనంలో ఉంది. దీన్ని భారత పురావస్తు శాక సర్వేక్షణ శాఖ డైరెక్టర్ (ఎఫిగ్రఫి) పరిష్కరించారు. కురుకుంద గ్రామంలో 500 ఏళ్ల నాటి గురుతులు ఏవీ ఇప్పుడు కనిపించక పోయినా ఈ గ్రామంలోనూ, పరిసరాల్లో ఉన్న రెండు చెరువులకు మాచా వీరప్ప చెరువులుగా పేరుండటం అవి ఎప్పటివో ఎవరు చెప్పలేకపోవడం, ఇప్పటికీ ఇవి వందల ఎకరాలకు జీవనాధారంగా ఉండడం వంటివి గ్రామ ప్రాచీనతను చాటుతున్నాయి. -
ఏపీ ఈఏపీసెట్కు తొలిరోజు 92.5 శాతం హాజరు
కర్నూలు సిటీ: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్–ఫార్మాసీ కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లాలో ఆరు, నంద్యాల జిల్లాలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరిగిన పరీక్షలకు మొత్తం 3,432 మందికిగాను 3,173 మంది హాజరయ్యారు. కర్నూలు నగరంలో నాలుగు, ఎమ్మిగనూరు, ఆదోనిలలో ఒకొక్క కేంద్రం ఏర్పాటు చేయగా ఉదయం 1,011 మందికిగాను 926 మంది, మధ్యాహ్నం పరీక్షకు 1382 మందికిగాను 1266 మంది హాజరయ్యారు. నంద్యాల జిల్లాలో మూడు కేంద్రాల్లో ఉదయం 369 మందికి 346 మంది, మధ్యాహ్నం పరీక్షకు 670 మందికి 635 మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలిరోజు పరీక్ష కేంద్రాల దగ్గర సందడి నెలకొంది. ఉదయం 7.30 గంటల నుంచే కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థిని తనిఖీ చేసి కేంద్రంలోకి పంపించారు. -
హరిత మంత్రాలయంగా తీర్చిదిద్దుతాం
● రూ.15లక్షలతో పనులకు శ్రీకారం చుట్టిన పీఠాధిపతి మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి వెలసిన ప్రాంతాన్ని హరిత మంత్రాలయంగా తీర్చిదిద్దుదామని మఠం పీఠాధిపతులు సుబుధేంద్రతీర్థులు తెలిపారు. డీజీవీ అతిథి గృహం వద్ద హైవే రోడ్డులో డివైడర్ మధ్యలో ఉన్న మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసే పనులకు మంగళవారం పీఠాధిపతులు శ్రీకారం చుట్టారు. మంత్రాలయం పట్టణంతో పాటు మఠం అతిథి గృహాలు, తులసీ వనం, గోశాల, బృందావన్ గార్డెన్, సుశమీంద్రతీర్థుల పార్క్, గురునివాస్, ప్రధాన రహదారుల్లో మొక్కలు నాటడం, వాటిని సంరక్షించే బాధ్యత పీవీ బద్రినాథ్ రావు తీసుకున్నారు. ఈ పనులకు రూ.15లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఆయనను పీఠాధిపతి శాలువ, పూలమాలలు వేసి, అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. -
మార్చురీకి సిబ్బంది కేటాయింపు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలోని మార్చురీకి అవసరమైన సిబ్బందిని కేటాయిస్తూ మంగళవారం కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 9న ‘మార్చురీలో రాబందులు’ శీర్షికన ప్రచురించిన కథనానికి ఆమె స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చురీలో ప్రభుత్వ సిబ్బంది లేకపోవడంతో అనధికార వ్యక్తులు వచ్చి పోస్టుమార్టం విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వీరి స్థానంలో కళాశాలలో పనిచేసే ఇద్దరు శానిటేషన్ వర్కర్లు, నలుగురు సెక్యూరిటీ గార్డులు, నలుగురు తోటీలు, ఒక ఆఫీస్ సబార్డినేట్ను కేటాయించారు. -
జిల్లాలోకి తెలంగాణ, కర్ణాటక విత్తనాలు
వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం హెక్టారుకు 5 ప్యాకెట్ల బీటీ–2 పత్తి విత్తనాలు వినియోగించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాకు దాదాపు 30 లక్షల ప్యాకెట్లు అవసరం కాగా.. వ్యవసాయ అధికారులు కర్నూలు జిల్లాకు 11 లక్షల ప్యాకెట్లు, నంద్యాల జిల్లాకు 50 వేల ప్యాకెట్లు కేటాయించాలని వ్యవసాయ శాఖను కోరారు. దీంతో జిల్లాలో పత్తి విత్తనాల కొరత ఏర్పడే పరిస్థితి నెలకొంది. దీనిని అవకాశంగా తీసుకొని అక్రమార్కులు తెలంగాణ, కర్ణాటక నుంచి అనధికార బీటీ–2 విత్తనాలను జిల్లాలోకి డంప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదోని, కౌతాళం, పెద్దకడుబూరు, మంత్రాలయం, దేవనకొండ, కోడుమూరు, సి.బెళగల్, కల్లూరు, క్రిష్ణగిరి మండలాల్లోకి అనధికార పత్తి విత్తన ప్యాకెట్లు పెద్ద ఎత్తున డంప్ అయినట్లు సమాచారం. వందల కంపెనీలు, అనేక రకాల పేర్లతో పత్తి విత్తన ప్యాకెట్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నా వ్యవసాయ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. -
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.2.78 కోట్లు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రాఘవేంద్రస్వామి హుండీ ఆదాయం రూ.2,78,19,526 సమకూరింది. మంగళవారం శ్రీమఠం రాజాంగణ భవనంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు సంబంధించి 20 రోజుల హుండీ కానుకలు శ్రీమఠం అధికారులు లెక్కగట్టారు. అందులో నగదు రూపేణా రూ 2,69,28,176, నాణేలా రూపంలో రూ.8,91,350 వచ్చిందన్నారు. అలాగే 15 గ్రాముల బంగారం, 751గ్రాముల వెండి కానుకలు సమకూరినట్లు మేనేజర్ ఎస్.కె శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–2 వెంటేష్ జోషి, ఇంజనీర్ సురేష్కోనాపూర్ పాల్గొన్నారు. కొత్తిమీర ధరకు రెక్కలు ● ఒక మడి ధర రూ.1600 గోనెగండ్ల: కొత్తిమీర ధరకు రెక్కలు వచ్చాయి. ఒక మడి ధర రూ. 1500 నుంచి రూ.1600 వరకు పలుకుతోంది. ఎండలు ఎక్కువకావడం, బోర్లు, బావుల్లో నీరు ఎండిపోవడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొత్తిమీరకు డిమాండ్ పెరిగింది. గోనెగండ్ల మండలంలో ప్రస్తుతం బోర్లు, బావుల కింద 100 ఎకరాల్లో ఈ పంట సాగులో ఉంది. ఒక ఎకరా సాగుకు రూ.40 వేల పెట్టుబడి వస్తుంది. ఈ ఏడాది ఉల్లి తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండు రోజుల నుంచి కొత్తిమీరకు ధర పెరగడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడిన టీడీపీ నాయకులపై కేసు వెల్దుర్తి: మల్లెపల్లె వైఎస్సార్సీపీ కార్యకర్త వీరేశ్ ఆచారిపై సోమవారం దాడికి పాల్పడిన అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రామదుర్గనాయుడు, అయ్యన్న, చంద్రారెడ్డి, మాధవ్పై కేసు నమోదు చేసి నట్లు ఎస్ఐ నరేశ్ మంగళవారం తెలిపారు. హైవే 44 పక్కన మల్లెపల్లె స్టేజ్ సమీపంలో వీరేశ్ ఆచారి, భార్య గాయత్రి, ఇద్దరు పసిపిల్లలతో కలిసి బైక్పై వస్తుండగా నిందితులు దారికాచి బైక్ను అటకాయించి వీరేశ్ ఆచారిపై దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. జరిగిన సంఘటనపై గాయత్రి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. -
ఏపీవీఏ ఫోర్త్ ఉపాధ్యక్షుడిగా రవిబాబు
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ అసోసియేషన్ (ఏపీవీఏ) ఫోర్త్–4 ఉపాధ్యక్షుడిగా సహాయ సంచాలకులు గుండంపాటి రవిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన నంద్యాల జిల్లా పొన్నాపురం గ్రామానికి చెందిన వారు. కర్నూలు పశువ్యాధి నిర్ధారణ కేంద్రం వెటర్నరీ అసిస్టెంటు సర్జన్గా, సహాయ సంచాలకులుగా దాదాపు 15 ఏళ్లపాటు పనిచేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా పశువ్యాధి నిర్ధారణ కేంద్రం సహాయ సంచాలకులుగా పనిచేస్తున్నారు. ఇటీవల ఏపీ వెటర్నరీ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఫోర్త్–4 (రాయలసీమ) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ... రాయలసీమ స్థాయిలో పశువైద్యులు ఎదుర్కొంటున్న వివిద సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి
ఓర్వకల్లు: జాతీయ రహదారిపై కాల్వబుగ్గ వద్ద సోమవారం రాత్రి హైవే పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. కాల్వబుగ్గలో భిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న మహిళకు ఓ వ్యక్తి పరిచయయ్యాడు. సోమవారం సాయంత్రం వ్యక్తితో ఆమె గొడవ పడింది. అతను దాడి చేయగా ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు రోడ్డు దాటుతుండగా హైవే పెట్రోలింగ్కు చెందిన బొలెరో వాహనం మహిళను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను పోలీసులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతిచెందిన మహిళ, ప్రమాదానికి కారణమైన హైవాహనం -
నిర్లక్ష్యం రోగానికి మందులు బూడిద
పాములపాడు: ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో పేదలకు అందాల్సిన మందులు, సూదులు బూడిదపాలయ్యాయి. మద్దూరు గ్రామంలోని సచివాలయంలో నిర్వహిస్తున్న ఆరోగ్య ఉప కేంద్రం సిబ్బంది సోమవారం గుట్టుగా విలువైన మందులకు నిప్పుపెట్టి తగులబెట్టారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం వేల రూపాయల ప్రజా ధనం బూడిదపాలైంది. ఆసుపత్రికి వచ్చే రోగులకు మందులు స్టాక్ లేవు.. బయటకొనుక్కోండి.. అని సలహాలు ఇచ్చే సిబ్బంది విలువైన మందులను ఆసుపత్రి వెనుక కుప్పగా పోసి తగలబెట్టారు. ఆ ప్రాంతంలో ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఉన్నాయి. గడువు ముగిసిన మందులను నిబంధనల ప్రకారం డిస్పోజ్ చేయాల్సి ఉండగా, తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో గుట్టుచప్పుడు కాకుండా నిప్పు పెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు స్టాక్ ఉన్నప్పుడే రోగులకు ఎందుకు పంపిణీ చేయలేదు? అవి గడువు ముగిసే వరకు ఎందుకు నిల్వ చేశారు? అనే ప్రశ్నలకు సిబ్బంది వద్ద సమాధానం లేదు. ఈ ఘటనపై వైద్యాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
శిథిలావస్థలో ఎల్లెల్సీ వంతెన
పిల్లర్ రాళ్లు ఊడి పడిన దృశ్యం హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)పై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. హొళగుంద మండలంలోని బళ్లారి రోడ్డులో ఉన్న ఈ వంతెన మీదుగా వందలాది వాహనాలు వెళ్తుంటాయి. వంతెన పిల్లర్ల రాళ్లు ఊడి పడి ప్రమాదకరంగా ఉండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లెల్సీపై ఈ వంతెనను 1947లో నిర్మించారు. వాహనాలు తిరిగితే వంతెన నుంచి వింత శబ్దాలు వినిసిస్తున్నాయి. టీబీ బోర్డు అధికారులు స్పందించి రెండు లైన్ల కొత్త వంతెనను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. -
వ్యవసాయానికి గడ్డుకాలం
కర్నూలు(అగ్రికల్చర్): గత ఏడాది మే నెలలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ సారి మే నెలలో గాలుల తీవ్రత ఉన్నా.. చినుకు జాడ కరువైంది. ఎల్నినో ప్రభావం మొదలు కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 2026–27 సంవత్సరంలో ఎల్నినో ప్రభావంతో కరువు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. మామూలుగా జూన్ 1వ తేదీ నుంచి తొలకరి మొదలవుతుంది. నైరుతి రుతుపవనాలు మే నెల చివరికే విస్తరించాల్సి ఉంది. ఈ సారి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చే పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజులు ఆలస్యంగా వచ్చినా చురుగ్గా ఉండే అవకాశం లేదు. ఎల్నినోపై రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో కనీసం తాగునీటికి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నా ఆ దిశగా కూడా చర్యలు కరువయ్యాయి. అయితే నీటి వసతి కింద ఉల్లి, పత్తి, వరి పంటలు సాగు చేయవద్దని ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా ప్రచారం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో పత్తి, ఉల్లి, మిర్చి, వరి, వేరుశనగ, మొక్కజొన్న తదితరాలు ప్రధాన పంటలు. ఎల్నినో కారణంగా వర్షాధార పంటలకే కాకుండా నీటి ఆధారిత పంటలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పొడి వాతావరణం, అధిక వేడి వల్ల కొన్ని రకాల పురుగులు, తెగుళ్లు సోకి పంటలను మరింత దెబ్బతీసే ప్రమాదం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంటల సాగు పడిపోయే ప్రమాదం 2025 ఖరీఫ్లో కర్నూలు జిల్లాలో 4,49,858 హెక్టార్లలో, నంద్యాల జిల్లాలో 2,78,204 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ సీజన్లోనూ ఇదే స్థాయిలో పంటలు సాగవుతాయి. నంద్యాల జిల్లాలో నీటి ఆధారం పంటలే ఎక్కువ. ఎల్నినో ప్రమాదం వల్ల నంద్యాల జిల్లాలో వ్యవసాయం ప్రశ్నార్థకమవుతోంది. ఈసారి సాగు విస్తీర్ణం పడిపోయే ప్రమాదం ఏర్పడింది. వర్షాలు పడుతాయా లేదోన్న ఉద్దేశంతో విత్తుకు రైతులు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. కొన్ని పంటలు జూలై చివరి వరకు, మరికొన్ని ప ంటలు ఆగస్టు చివరి వరకు వేసుకునే అవకాశం ఉంది. వాతావరణ శాస్త్రవేత్తల సమాచారం మేరకు ఆగ స్టు వరకు ఎల్నినో ప్రమాదం ఉండటం వల్ల వివిధ పంటల సాగుకు అవకాశమే లేనట్లు తెలుస్తోంది. నీటి వసతి పంటలు కూడా కష్టమే.. ఉమ్మడి జిల్లాలో నీటి వసతి కింద వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి తదితర పంటలు సాగు చేస్తారు. ఇక్కడి సాగు నీటి ప్రాజెక్టులు నిండాలంటే ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో భారీ వర్షాలు కురవాల్సి ఉంది. ఎల్నినో ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలపైనా ఉండటంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇందువల్ల వర్షాధార పంటలకే కాకుండా నీటి ఆధారిత పంటల సాగుకూ గడ్డుకాలం తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు నీటి ఆధారిత పంటలు వద్దు.. తక్కువ తేమతో సాగుకు అవకాశం ఉన్న స్వల్పకాలిక పంటలు సాగు చేసుకోవాలని సూచిస్తుండటం గమనార్హం. అంటే ఈ ఖరీఫ్లో నీటి ఆధారం కింద వరి, ఇతర పంటలకు అవకాశం లేనట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సారి ఎల్నినో ప్రభావం ఆగస్టు వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ ప్రభావం వల్ల వర్షాలు సాధారణం కంటే తక్కువగా కురిసే అవకాశం కనిపిస్తోంది. ఒకే రోజు కనీసం 40 మి.మీ వర్షపాతం నమోదైనప్పుడే పత్తి, ఇతర పంటలు సాగు చేసుకోవాలి. జిల్లాలో ప్రధాన పంట పత్తి అయినందున ఈ పంటలో జొన్న, సజ్జ, ఆముదం వంటి అంతర పంటలు సాగు చేయాలి. నీటి వినియోగం ఎక్కువగా ఉండే పంటలు సాగు చేయవద్దని రైతులకు చెబుతున్నాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు నాకు మూడు ఎకరాల పొలం ఉంది. పత్తి, కంది సాగు చేస్తుంటా. ఈసారి వర్షాలు ఉండవని చెబుతున్నారు. ఇప్పటికే ఆ పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు లేదు. ఉచిత పంటల బీమాను అమలు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. స్వల్పకాలిక పంటల సాగుకు 75 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయాలి. – ఎంబాయి రామాంజనేయులు, అమీనాబాద్, తుగ్గలి మండలంముంచుకొస్తున్న ఎల్నినో కర్నూలు జిల్లా పంట సాగు(హెక్టార్లలో.) పత్తి 280086 కంది 68854 ఉల్లి 24810 మిర్చి 17998 వేరుశనగ 44541 నంద్యాల జిల్లా పంట సాగు(హెక్టార్లలో.) వరి 95031 మొక్కజొన్న 98171 కంది 47691 మినుము 11134 నందికొట్కూరు సమీపంలో పొలంలో పంట వ్యర్థాలను తొలగిస్తున్న కూలీలు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంటల బీమా, ఉచిత పంటల బీమాకు మంగళం పలకడంతో కరువు నుంచి బయటపడే అవకాశం లేకుండా పోయింది. ఈ సారి ఎల్నినో ప్రమాదం పొంచి ఉండటం రైతులను ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మామూలుగా ఈ సమయానికి రైతులు పత్తి, ఉల్లి తదితర విత్తనాలు సిద్ధం చేసుకుంటారు. ఇప్పుడు మాత్రం వర్షాలు కురిసిన తర్వాత విత్తనాలు తీసుకుందామనే అభిప్రాయంలో ఉన్నారు. నీటి వసతి ఉన్న రైతులు పత్తి విత్తనాలు కొంటున్నారు తప్ప వర్షాధారం కింద సాగు చేసే రైతులు విత్తన సేకరణకు ఆసక్తి చూపని పరిస్థితి. ఎల్నినో సమయంలో వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అధిక ఉష్ణోగ్రత నేలలోని తేమను త్వరగా ఆవిరి చేస్తుందనే ఆందోళన నెలకొంది. -
ప్రారంభించారు.. వదిలేశారు!
కోసిగి: దాదాపు 45 రోజుల క్రితం ‘ఊరికి రోడేస్తున్నాం’. అంటూ కూటమి నేతలు హడావుడి చేశారు. ఆర్భాటంగా పూజలు చేసి రోడ్డు పనులకు టెంకాయ కొట్టారు. త్వరలో పనులు పూర్తయి రోడ్డు సమస్య పరిష్కారమవుతుందని ప్రజలు సంతోషపడ్డారు. అయితే నెలన్నర రోజులు గడుస్తున్నా పనులు అడుగు కూడా కదలలేదు. తుంబిగనూరు గ్రామ మధ్యలో 25/6 కిలో మీటరు నుంచి కందుకూరు శివారు 33/4 కిలో మీటరు వరకు ఆర్అండ్బీ కింద నిధులు కేటాయించారు. ఇందులో అగసనూరు, సాతనూరు గ్రామాల్లో 900 మీటర్లు సీసీ రోడ్డుకు రూ.2.5 కోట్లు, మిగిలిన 8.1 కిలో మీటర్లు బీటీ రోడ్డుకు రూ.3 కోట్లు బడ్జెట్ కేటాయించారు. ఆయా గ్రామాల మధ్య రోడ్డు కంకర తేలి గుంతలు గుంతల మయంగా తయారైంది. ఏళ్ల తరుబడి రోడ్డు వసతి లేక ప్రయాణికులు , వాహనదారులు రోడ్డు పై వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్నారు. కూటమి నాయకులు భూమి పూజ చేయడంతో రోడ్డు ఏర్పాటు చేస్తారని సంతోషపడ్డారు. కానీ ఇంతవరకు పనులు ప్రారంభం కాకపోవడంతో రోడ్డు వేస్తారా లేదా కేవలం ఆర్భాటమేనా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్అండ్బీ ఏఈ నరేష్ను వివరణ కోరగా.. తుంబిగనూరు – కందుకూరు గ్రామ శివారు వరకు 9 కిలోమీటరుల రోడ్డు వేసేందుకు నిధులు మంజూరయ్యాయని, రోడ్డు అడుగు భాగాన వేసేందుకు గ్రావెల్ లభించడం లేదన్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో కొరత ఉందని, తవ్వకాలకు మైనింగ్ అనుమతి కావాల్సి ఉందని చెప్పారు. -
కరువు శాసనం.. కన్నీటి పయనం!
● ‘ఉపాధి’కి టీడీపీ నాయకుల అడ్డుకట్ట ● వలసబాట పట్టిన జగదుర్తి గ్రామస్తులు డోన్: అధికారంలో ఉన్నామని, తాము ఏం చేసినా ఎవరూ ప్రశ్నించకూడదని టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. పేదలకు ఉపాధిహామీ పథకాన్ని దూరం చేస్తూ కరువు శాసనం రాశారు. తమ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా మంది దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వీరి వెంట చిన్నారులు, వృద్ధులు వస్తున్నారు. డోన్ మండలం జగదుర్తి గ్రామంలో ఈ దుస్థితి నెలకొంది. ఈ గ్రామంలో మొత్తం 1,200 మంది ఉండగా వీరిలో అత్యధికమంది పేదలు. వేసవి కాలంలో వీరికి గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు అండగా నిలిచాయి. ఈ పథకం లక్ష్యం నీరుగార్చేందుకు టీడీపీ నాయకులు ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. అక్రమార్జన కోసం మేటీ, ఫీల్డ్ అసిస్టెంట్ పదవుల కోసం పోట్లాడుతూ పేదలకు పనులు కల్పించకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో జగదుర్తి గ్రామస్తులు చాలా మంది పనుల కోసం ఆదివారం గుంటూరు, బెంగళూరు ప్రాంతాలకు వెళ్తేందుకు డోన్ రైల్వేషన్కు వెళ్లారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని, దొంగ మస్టర్లతో కూలీల డబ్బులు కాజేస్తున్నారని ప్రజలు ఆరోపించారు. గ్రామస్తులు వలస వెళ్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఏపీఎం సుకూర్ను ప్రశ్నించగా జగదుర్తి పంచాయతీ పరిధిలో ఉపాధి హామీపనులు ఇంతవరకు జరగని మాట వాస్తవమని పేర్కొన్నారు. గ్రామ పెద్దలతో చర్చించి కూలీలు పనుల కోసం వలస వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ఎమ్మిగనూరు రూరల్: అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండల పరిధిలో ని కె.నాగలాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రా మానికి చెందిన కె. రామాంజనేయులు(38)కు భార్య లక్ష్మీ, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. తనకున్న 2 ఎకరాల పొలానికి తోడు మరో 4 ఎకరాలు కౌలు తీసుకొని పత్తి, మిరప, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నాడు. పెట్టుబడులు, ఇంటి ఖర్చులకు బయటి వ్యక్తుల వద్ద దాదాపు రూ.8 లక్షలకు పైగా అప్పులు చేశాడు. పంటలు రాక చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఈ నెల 9వ తేది రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పపడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం అర్థరాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు సోమవారం సాయంత్రం తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జీల బదిలీ కర్నూలు: జిల్లాలో జూనియర్ సివిల్ జడ్జీ పోస్టుల ను భర్తీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఉత్తర్వు లు జారీ చేసింది. కర్నూలు ప్రిన్సిపల్ జూనియర్ సి విల్ జడ్జిగా పనిచేస్తున్న ఎం.సరోజినమ్మను ఖాళీ గా ఉన్న రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కో ర్టుకు బదిలీ చేసి ఆమె స్థానంలో తిరుపతిలో పనిచేస్తున్న ఎం.సంధ్యారాణిని బదిలీ చేసింది. నూతనంగా మంజూరైన 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు గొల్లపూడి స్రవంతిని, గుంటూరు నుంచి బదిలీ చేసి నియమించారు. ఖాళీగా ఉన్న కోవెలకుంట్ల జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు అనంతపురంలో పనిచేస్తున్న జి.మంజులను బదిలీ చేసి నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 మంది జూనియర్ సివిల్ జడ్జిలను రాష్ట్ర హైకోర్టు బదిలీ చేస్తూ విజిలెన్స్ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన న్యాయాధికారులు ఈనెల 18వ తేదీ లోగా వారి స్థానాల్లో చేరాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. -
ఐచర్ వాహనం దగ్ధం
పత్తికొండ రూరల్: అటికెలగుండు గ్రామ బ్రిడ్జి సమీపంలో సోమవారం ఐచర్ వాహనంలో మంటలు చెలరేగి వాహనం దగ్ధమైంది. తాడిపత్రికి చెందిన ఐచర్ వాహనం సిమెంట్ లోడుతో ఆస్పరికి వెళ్లి అక్కడే అన్ లోడింగ్ చేశారు. తిరిగి వస్తున్న సమయంలో షార్ట్సర్క్యూట్ సంభవించి ఇంజన్లో వైర్లు కాలిపోయి మంటలు వ్యాపించాయి. డ్రైవర్ కంబయ్య వాహనంలో మంటలను గమనించి కిందకు దిగి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కొద్దిసేపటికే వాహనం మొత్తం మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దారి వెంట వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అయితే అప్పటికే వాహనం దగ్ధమైపోయింది. ప్రయాణికురాలి బ్యాగ్కు కన్నం హొళగుంద: బస్టాండులో దొంగలు బస్సెక్కుతున్న మహిళా బ్యాగుకు కన్నం వేసి బంగారు చైను, నగదు కొట్టేసిన సంఘటన సోమవారం ఉదయం హొళగుందలో చోటు చేసుకుంది. స్థానిక తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ) పక్కన వన్నూరు కొట్టాలకు వెళ్లే దారిలో నివాసం ఉంటున్న వట్టికుట్టి శాంతమ్మ అనే మహిళ ఉదయం ఆదోని వెళ్లేందుకు హొళగుంద బస్టాండుకు వచ్చింది. బస్సు రాగానే అందరితో కలసి బస్సెక్కి సీట్లో కూర్చుంది. టికెట్ కోసంఆధార్ కార్డు తీసేందుకు బ్యాగ్ చూడగా చిరిగి ఉండటం, అందులో రెండు తులాల బంగారు చైనుతో పాటు దాదాపు రూ.10 వేలుకు పైగా ఉన్న నగదు కనబడలేదు. వెంటనే ఆమె బస్సు దిగి భర్త వట్టికుట్టి ప్రభాకర్కు ఫోన్ చేసి విషయం చెప్పగా ఆయన అక్కడికి చేరుకుని విచారించి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బస్టాండ్లో చోరీ జరగడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. 21 మందికి కారుణ్య నియామకాలు కర్నూలు(సెంట్రల్): కారుణ్య నియామకాల కింద వివిధ శాఖల్లో 21 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి చెప్పారు. వీరందరినీ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ పోస్టుకు ఎంపిక చేసినట్లు వివరించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఎంపికై న వారికి నియామక పత్రాలను కలెక్టర్ అందజేశారు. జేసీ నూరుల్ ఖమర్, ఇన్చార్జ్ డీఆర్వో చిరంజీవి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు సునీత, రామసుబ్బయ్య, సెక్షన్ సిబ్బంది సన పాల్గొన్నారు. గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలి శ్రీశైలం: దేశంలో జరుగుతున్న గవర్నర్ల నియామకాల వ్యవస్థను రద్దు చేయాలని రాష్ట్రపతికి లేఖ రాసినట్లు రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ కుంచం వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనర్థమై సోమవారం శ్రీశైలం వచ్చిన ఆయన స్థానిక దేవస్థానం అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 153 ఆధారంగా ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి గవర్నర్లను నియమిస్తున్నార్నారు. సంబంధిత రాష్ట్రాలకు గవర్నర్ కార్యనిర్వాహక అధిపతి మాత్రమేనని, రాజ్యాంగం ప్రకారం గవర్నర్ మంత్రి మండలికి విధుల నిర్వహణలో సలహాలు ఇస్తారే కానీ ఎటువంటి నిర్ణయం, చర్యలు తీసుకునే అధికారం లేదని అన్నారు. ప్రస్తుతం గవర్నర్లు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయన్నారు. రాష్ట్ర గవర్నర్ల వ్యవహారాల తీరును వివరిస్తూ తమిళనాడులో ఇటీవల చోటు చేసుకు న్న పరిణామాలు దారుణమన్నారు. ఎన్నికల్లో విజయ్కి మెజారి టీ వచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్ తీవ్ర జాప్యం చేయడం సబబు కాదన్నారు. లా సెమిస్టర్ పరీక్షలకు ఐదుగురు గైర్హాజరు కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాల యం పరిధిలో సోమవారం జరిగిన 5 సంవత్సరాల ఎల్ఎల్బీ 8వ సెమిస్టర్ పరీక్షల్లో ఐదుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. 74 మందికి 69 మంది హాజరు కాగా 93 శాతం హాజరు నమోదైందని ఆయన పేర్కొన్నారు. -
పీజీఆర్ఎస్ అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి
కర్నూలు(సెంట్రల్): పీజీఆర్ఎస్ అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె జేసీ నూరుల్ ఖమర్తో కలసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీలను సంతృప్త స్థాయిలో పరిష్కరించేందుకు నోడల్ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. అర్జీదారుడితో నేరుగా మాట్లాడి సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో చిరంజీవి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ సునీత, రామసుబ్బయ్య పాల్గొన్నారు. వైద్య సేవల్లో కర్నూలు జిల్లాకు ఏగ్రేడ్ జిల్లాలో ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకు నిర్వహించిన హాస్పిటల్ యాక్టివిటీ ఇండికేటర్ గణనలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకొని జిల్లా సమగ్రంగా ఏ గ్రేడు సాధించినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సోమ వారం ఓ ప్రకటనలో తెలిపారు. మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి(ఆదోని), ప్రాంతీయ వైద్యశాల(ఎమ్మిగనూరు), సామాజిక ఆరోగ్య కేంద్రాలు కోడుమూ రు, వెల్దుర్తి, పత్తికొండ, ఆలూరులకు ఏ గ్రేడు, ఓర్వకల్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి బీ గ్రేడు లభించిందన్నారు. -
బాదం పప్పుపై బాల హనుమాన్
నంద్యాల(వ్యవసాయం): హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రముఖ చిత్రకారుడు తుర్లపాటి సుబ్రహ్మణ్యం సోమవారం ‘బాదం పప్పుపై బాల హనుమాన్ ‘అనే సూక్ష్మ వర్ణ చిత్రాన్ని ఆవిష్కరించారు. అష్టసిద్ధి ప్రదాత, నవ వ్యా కరణ పండితుడు అయిన శ్రీ హనుమంతుని ఆరాధన వల్ల బుద్ధి, బలం, ఆరోగ్యం, యశస్సు, ధైర్యం మొదలైనవన్నీ లభిస్తాయని చిత్రకారుడు తెలిపారు. అర్జునుడు తన రథం పైన హనుమద్ ధ్వజాన్ని స్థాపించడం వల్ల మహాభారత యుద్ధంలో తిరుగులేని విజయాన్ని సాధించారన్నారు. -
అను‘గృహం’ లేదు.. ఖాళీ చేయాల్సిందే!
● సున్నిపెంటలో 2,163 మందికి నోటీసులు శ్రీశైలంప్రాజెక్ట్: సున్నిపెంటలో ప్రభుత్వ గృహాలను ఖాళీ చేయాలని అందులో నివాసం ఉంటున్న వారికి తహసీల్దార్ కేవీ శ్రీనివాసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. సున్నిపెంట ప్రభుత్వ గృహాల ఆక్రమణలపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై ఇచ్చిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టం 1905 కింద 2,163 మందికి ఈ నోటీసులు జారీ అయ్యాయి. జలవనరులశాఖ, గ్రామ సచివాలయ సిబ్బందితో కలసి తహసీల్దార్ ఇంటింటికి వెళ్లి నోటీసులు జారీ ఇస్తున్నారు. నివాసితులు అందుబాటులో లేనిపక్షంలో గృహాలకు నోటీసులు అంటిస్తున్నారు. ఈనెల 17వ తేదీలోగా తహసీల్దార్ కార్యాలయంలో సంజాయిషీ సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు. సంజాయిషీ సంతృప్తకరంగా లేకుంటే చట్టప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నోటీసులో సూచించారు. అధికారుల రికార్డులు జరిపిన సర్వేల ఆధారంగా 2,260 ప్రభుత్వ గృహాలు ఉన్నాయి. వీటిలో 82 మంది జలవనరులశాఖ ఉద్యోగులు నివాసం ఉంటుండగా 247 గృహాలను నేలమట్టం చేశారు. ప్రభుత్వ గృహాలు, నివాస యూనిట్టు 428కి పట్టాలు మంజూరు చేయగా వాటిలో నాలుగు పట్టాలు సక్రమమైనవి కావని అధికారులు తేల్చారు. 277 మంది ప్రభుత్వ గృహాలకు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని అధికారులు జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించారు. -
హైకోర్ట్ ఎస్పీఎఫ్ హెడ్కానిస్టేబుల్ మృతి
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని పెనుమాక శివారు వద్ద సీడ్ యాక్సెస్ రోడ్లో సోమవారం స్కూటీపై వెళుతున్న హైకోర్టు ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ను వెనుక నుంచి అతివేగంగా వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామానికి చెందిన కె.శ్రీనివాసరావు (49) హైకోర్టు ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉండవల్లిలో కుటుంబంతో నివాసముంటున్న శ్రీనివాసరావు ఉదయం 7 గంటల సమయంలో తన స్కూటీపై సీడ్ యాక్సెస్ రోడ్లో నుంచి పెనుమాక మీదుగా హైకోర్టుకు వెళుతున్నాడు. పెనుమాక మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం రోడ్డులో స్కూటీపై వెళుతున్న శ్రీనివాసరావును వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై నుంచి కిందపడిన శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తాడేపల్లి ఎస్ఐ సంఘటనా స్థలానికి వెళ్లి రోడ్డుపై తీవ్ర రక్తస్రావంతో పడిపోయి ఉన్న శ్రీనివాసరావును వైద్య నిమిత్తం దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతిచెందినట్లు నిర్ధారించారు. జరిగిన సంఘటనపై హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఖాజావలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్తూరు క్షేత్రానికి రూ.2.64 లక్షల విరాళం
పాణ్యం: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయానికి కర్నూలు పట్టణానికి చెందిన యశ్వంత్, తేజస్విని దంపతులు రూ. 2.64 లక్షలు విరాళంగా అందజేశారు. స్వామివారికి కేజీ వెండి విలువైన డబ్బులను ఏపీజీపీ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు ఈఓ రామకృష్డుడు తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేయించారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు నారాయణస్వామి, సురేష్శర్మ, పంచాయతీ కార్యదర్శి సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
స్వాభిమానం.. సహస్ర కలశాభిషేకం
● శ్రీశైలంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ● కలశయాత్రలో పాల్గొన్న వెయ్యి మంది భక్తులు శ్రీశైలంటెంపుల్: సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని సోమవారం శ్రీశైల దేవస్థానంలో నిర్వహించారు. ఉదయం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి ఆలంకార మండపంలో సహస్ర కలశారాధన చేశారు. భక్తులందరూ కలశాలను తలపై ధరించి ఆలయ ప్రాంగణం నుంచి గంగాధర మండపం, నందిగుడి, మల్లికార్జునసదన్ మీదుగా బయలు వీరభద్రస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ స్వామికి విశేషపూజాదికాలను జరిపి వెయ్యి మంది భక్తులు ఆలయానికి వెళ్లి వృద్ధమల్లికార్జున స్వామివారికి కలశాభిషేకం చేశారు. కలశయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ మల్లికార్జున స్వామివారికి అలంకార దర్శనం, అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం దేవస్థానం అందించిన పుస్తకాలు, పెన్నులతో శివపంచాక్షరీ నామ లేఖ యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమంలో భాగంగానే గంగాధర మండపం వద్ద సాయంత్రం పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. అనంతరం వనపర్తికి చెందిన సత్యంస్వామి, బృందం వారిచే శివభజనలు, రాజమహేంద్రవరానికి చెందిన తాతా సందీప్శర్మ వారిచే ఓంకారం ప్రాశస్త్యంపై ప్రవచనం నిర్వహించారు. విజయనగరానికి చెందిన సుప్రియ బృందం వారిచే పేరిణి శివతాండవం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఈఓ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సోమనాథ్ ఆలయంపై దాడి జరిగి వెయ్యి సంవత్సరాలు, ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 సంవత్సరాల సందర్భంగా భారత ప్రభుత సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరుతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. -
తగ్గిన ఉష్ణోగ్రతలు
కర్నూలు(అగ్రికల్చర్): ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్ నెలలోనే రికార్డు స్థాయి లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెలలో మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందనే ప్రచారం జరిగి ంది. అయితే అక్కడక్కడ వర్షాలు పడటం, గా లుల తీవ్రత కొనసాగుతోంది. ఈ కారణాలతో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. మంత్రాలయంలో 41.5,చిప్పగిరిలో 41.2, కౌతాళంలో 41.4, హలహర్విలో 41.1, దొర్నిపాడులో 40.7, సంజామలలో 40.7,కొత్తపల్లిలో 40.5, ఆళ్లగడ్డలో 40.1 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎల్నినో ప్రభావం మొదలైనందున ఈ ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులుంటాయని వా తావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు. కాగా ఆదివారం సాయంత్రం నుంచి నాలుగు మండలా ల్లో వర్షం కురిసింది. ఓర్వకల్లో 16.4 మి.మీ, కల్లూరులో 4.4, వెల్దుర్తిలో 3.2, కర్నూలు రూరల్లో 1, కర్నూలు అర్బన్లో 0.8 మిమీ ప్రకారం వర్షపాతం నమోదైంది. పెనుగాలులకు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు కర్నూలు సిటీ: ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్–2026 ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. నేటి(మంగళవారం) నుంచి మొదలైయ్యే పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ కంప్యూటర్ ఆధారితంగా నేటి నుంచి 18వ తేది వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్, 19, 20 తేదిల్లో అగ్రికల్చర్, ఫార్మా సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ పరీక్షలకు 29,144 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 12 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. నిర్దేశిత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైన కేంద్రాల్లోకి అనుమతించబోమని సెట్ కన్వీనర్ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ కేంద్రాల మూసివేత కర్నూలు(అర్బన్): ఏపీఈఏపీసెట్–2026 పరీక్షల నేపథ్యంలో ఈ నెల 12 నుంచి 20వ తేది వరకు పరీక్ష కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను ఆయా సమయాల్లో మూసివేయాలని ఉప కార్మిక కమిషనర్ కె.వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నారన్నారు. ఆయా సమయాల్లో జీరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను తెర చి ఉంచితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉర్దూ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ ఫలితాలు విడుదల కర్నూలు కల్చరల్: డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి నెలలో నిర్వహించిన మొదటి సెమిస్టర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను వర్సిటీ ఇన్ఛార్జి వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్.షావలి ఖాన్ విడుదల చేశారు. ఫలితాలు వర్సిటీ వెబ్సైట్ www.ahuuk.ac.inలో అందుబాటులో ఉన్నాయని ఇన్ఛార్జి వీసీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ మహబుబ్ బాషా, ఎగ్జామినేషన్స్ కో ఆర్డినేటర్స్ మహమ్మద్ ఇర్ఫాన్, డాక్టర్ నబియా సుల్తాన, డాక్టర్ బి. వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు. మార్కెట్లో పడిపోయిన ధరలు కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రధానంగా వేరుశనగ, వాము, మొక్కజొన్న, కందులు, శనగల ధరలు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సోమవారం కర్నూలు మార్కెట్లో సగటున లభించిన ధర రూ.6,100 మాత్రమే. మార్కెట్కు 759 క్వింటాళ్ల వాము రాగా.. సగటున క్వింటాకు లభించిన ధర రూ.16,299. గరిష్టంగా రూ.24,444 ధర లభించినప్పటికీ ఈ ధర ఒకటి, రెండు లాట్లకే పరిమితం కావడం గమనార్హం. మొక్కజొన్నలు మార్కెట్కు 231 క్వింటాళ్లు రాగా లభించిన సగటు ధర రూ.1,727. కందులకు సగటున రూ.7712, శనగలకు రూ.5,380 ప్రకారం ధరలు లభించాయి. మార్కెట్కు ఉల్లి రావడం బాగా తగ్గిపోయింది. కేవలం నలుగురు రైతులు 125 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు తీసుక రాగా రూ.767 ధర మాత్రమే లభించింది. -
పోలీసు పీజీఆర్ఎస్కు 94 ఫిర్యాదులు
కర్నూలు: కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 94 ఫిర్యాదులు వచ్చాయి. అందులో ప్రధానంగా ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకుని మోసం, ఇళ్ల స్థలాలు, పొలాల ఆక్రమణలతో పాటు పలు వ్యక్తిగత సమస్యలపై ఫిర్యాదులు ఉన్నాయి. సీఐలు శివశంకర్, రామయ్య నాయుడు తదితరులు కూడా పీజీఆర్ఎస్లో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. -
అకాల వర్షం .. రైతులకు నష్టం!
బనగానపల్లె రూరల్/కొలిమిగుండ్ల/వెల్దుర్తి: మండు వేసవిలో అకాల వర్షాలు రైతులను భయపెడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా.. సాయంత్రం 6 గంటల సమయంలో బనగానపల్లె, చుట్టు పక్కల ప్రాంతాల్లో దాదాపు 20 నిమిషాలు మోస్తరు వర్షం కురిసింది. గాలీవానకు వరి పైర్లు నేలవాలాయి. ఆరబోసిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పట్టలు కప్పారు. అవుకు ప్రాంతంలో వరి పంట కాలం పూర్తి కావడంతో చాలా మంది రైతులు కోత కోసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ తరుణంలో ఈదురు గాలులు, వర్షంతో రైతులు నష్టపోయారు. వెల్దుర్తి మండలంలో ఆదివారం రాత్రి గాలీవాన భీభత్సం సృష్టించింది. మండల కేంద్రంలో ఈదురుగాలులతో పట్టణానికి తాగునీరందించే పథకం రామళ్లకోట రోడ్డులోని పార్వతయ్య బావి వద్ద ఉన్న సంప్పై భారీ చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయి. ఫలితంగా సంప్ నుంచి పట్టణానికి సరఫరా చేసే పైప్లైన్లు, మోటార్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ లైన్లు తెగిపోయాయి. పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్, విద్యుత్ ఏఈఈ వెంకటేశ్వర్లు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి తాగునీటి సరఫరాను సోమవారం సాయంత్రానికి పునరుద్ధరించారు. రామళ్లకోట రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద, మరోచోట రెండు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టారు. ఈదురుగాలులకు గోవర్ధనగిరి, శ్రీరంగాపురం, ఎల్ నగరం, లక్షుంపల్లె, చెర్లకొత్తూరు, బోగోలు, తదితర ప్రాంతాల మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి రైతులు నష్టపోయారు. -
ప్రయాణికుల కోసం..
● రూ. 10 లక్షలతో బస్ షెల్టర్ నిర్మించిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు ● ప్రారంభోత్సవం సందర్భంగా నేడు తోలు బొమ్మలాట ప్రదర్శన గడివేముల: ప్రజలకు ఉపయోగపడేలా.. పది కాలా ల పాటు గ్రామంలో గుర్తుండేలా ఓ వ్యక్తి బస్షెల్ట ర్ నిర్మించి ఆదర్శంగా నిలిచారు. గని గ్రామంలో రిటైర్ ఉపాధ్యాయుడు వెంకటరమణ, భార్య కళ్యా ణి రూ.10 లక్షలతో వెచ్చించి గ్రామస్తుల సౌకర్యా ర్థం బస్ షెల్టర్ నిర్మించారు. తన తల్లిదండ్రులు సు బ్బమ్మ, చిన్న మల్లయ్య జ్ఞాపకార్థం నిర్మించిన బస్ షెల్టర్ను మంగళవారం ప్రారంభిచనున్నారు. కాగా అంతరించి పోతున్న ప్రాచీన కళను ప్రోత్సహించేందుకు తోలుబొమ్మలాట ప్రదర్శన ఏర్పాటు చేయించారు. తోలుబొమ్మలాట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యంత ప్రాచూర్యం పొందిన ప్రాచీన జానపద కళారూపం. రాత్రి వేళల్లో, తెర వెనుక నుంచి దీపాల వెలుగులో బొమ్మలను ఆడిస్తూ, రామా యణ, మహాభారత వంటి పురాణ కథలను కళాకారులు వినోదాత్మకంగా ప్రదర్శిస్తారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన వినోద సాధనంగా ఉన్న ఈ కళారూపం, నేడు సాంకేతికత పెరగడంతో కనుమరుగవుతోంది. ప్రస్తుతం కొంతమంది కళాకారులు మాత్రమే ఈ కళను బతికించుకుంటున్నారు. ఈ మేరకు గ్రామంలో మంగళవారం సత్య సాయి జిల్లా లేపాక్షి చెందిన సిండే రామ్మూర్తి గ్రూపు వారు రామాయణం తోలుబొమ్మలాట ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై వీక్షించాలని వెంకటరమణ కోరారు. -
మగ శిశువు లభ్యం
ఉయ్యాలవాడ: మాయలూరు గ్రామంలోని ఓ పాడుబడిన గృహంలో మగశిశువు లభ్యమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వెన్నపూస శంకర్రెడ్డికి చెందిన పాడుబడిన గృహం నుంచి నవజాతశిశువు ఏడుపు వినిపించింది. సమీపంలో నివసించే కశిరెడ్డి నాగేశ్వరమ్మ అనే మహిళ ఆ శబ్దం విని గృహాలు వెతుకుంటూ వెళ్లింది. పాడుబడిన గృహం లోపలికి వెళ్లి చూడగా మగ శిశువు కనిపించాడు. వెంటనే ఆ శిశువును ఎత్తుకొని ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నాడని నిర్ధారించడంతో శిశువును తిరిగి గ్రామానికి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం నందిరెడ్డి ఈశ్వరరెడ్డి ఆ చిన్నారిని సంరక్షిస్తున్నారు. ఏం కష్టమొచ్చిందో ఆ తల్లి పేగు బంధాన్ని తెంచుకుందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే ఐక్య పోరాటాలు
కర్నూలు(సెంట్రల్): కేంద్ర ప్రభుత్వం మొండిగా తీసుకొచ్చి అమలు చేస్తున్న లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోకపోతే కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధమవుతారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ హెచ్చరించారు. ఆదివారం ఆయూనియన్ ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు సుందరయ్య సర్కిల్లో న్యూసిటీ కమిటీ ఆధ్వర్యంలో లేబర్కోడ్ కాపీలను దహనం చేసి నిరసన తెలిపారు. నగర అధ్యక్షుడు వై.నగేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ, నగర ప్రధాన కార్యదర్శి ఆర్.నరసింహులు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తోందన్నారు. ఇటీవల గుట్టు చప్పుడు కాకుండా ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన వెంటనే లేబర్ కోడ్లను అమల్లో తేవడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం దారుణమన్నారు. ఫలితంగా ఇప్పటి వరక కార్మికులకు అండగా ఉన్న చట్టాలు రద్దై నాలుగు కోడ్లు మాత్రమే అమల్లోకి వచ్చినట్లు అవుతుందన్నారు. వీటి ప్రకారం 13 గంటల పని విధానం అమల్లోకి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ ఆనంద్బాబు, టి.రాముడు పాల్గొన్నారు. -
25 ఏళ్ల తర్వాత..!
నందవరం: దాదాపు పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికతో ఆ పాఠశాలలో ఆనందాలు విరబూశాయి. స్థానిక నాగలదిన్నె జెడ్పీ హైస్కూల్ ప్రాంగణం ఇందుకు వేదికైంది. స్థానిక పాఠశాలలో 2000–2001 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు పాతికేళ్ల తరువాత ఆదివారం అదే పాఠశాలలో కలుసుకున్నా రు. ఆనాటి తీపి జ్ఞాపకాలు, ఆటలు, అల్లర్లు గుర్తుకు తెచ్చుకుంటూ ఒకరునొకరు పిలుచుకుంటూ ఉత్సాహంగా గడిపారు. వివిధ వృత్తులు, ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడి పలు ప్రాంతాల్లో ఉన్న వారంతా తరలివచ్చారు. విద్యార్థులందరూ వినోద కార్యక్రమంలో పాల్గొని, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఆనాడు చదువు చెప్పిన గురువులు షాజహాన్, నరసింహులు, రంగస్వామి, ఉస్సేన్ తదితర ఉపాధ్యాయులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. -
వామ్మో.. వంతెన
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– ఆళ్లగడ్డ ఆర్అండ్బీ రహదారిలో మండలంలోని భీమునిపాడు సమీపంలో కుందరవాగుపై ఏర్పాటు చేసిన వంతెన ప్రమాదకరంగా మారింది. బ్రిటీష్కాలంలో 1932లో వాగుపై ఇరుకై న వంతెన ఏర్పాటు చేశారు. వంతెన నిర్మించి 94 సంవత్సరాలు కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. వంతెనకు ఏర్పాటు చేసిన కడ్డీలు ఒకవైపు వంగిపోవడంతోపాటు దిమ్మెలు పూర్తిగా దెబ్బతిని వంతెన కూలేందుకు సిద్ధంగా ఉంది. వంతెనకు సైడ్వాల్స్ లేకపోవడంతో గతంలో వాహనాలు వాగులో పడి ప్రయాణికులు ప్రాణా లు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ రహదారిలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రాత్రి వేళల్లో వంతెనపై ప్రయాణసమయంలో ఏమాత్రం ఏమరపాటు వహించినా వాహనాలు వాగులోపడి విలువైన ప్రాణాలు కోల్పోవాల్సిందే. సంబంధిత ఆర్అండ్బీ అధికారులు దెబ్బతిన్న వంతెన స్థానంతో కొత్తగా వంతెన ఏర్పాటు చేసి ప్రమాదాలు అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
పాణ్యంలో ఆరబెట్టిన మొక్కజొన్నలో నీటిని తోడుతున్న రైతులునెరవాడ మెట్ట వద్ద ధాన్యంపై పట్టలు కప్పడంతో నిలిచిన వర్షపునీరుపాణ్యం: మద్దతు ధర లేక కల్లాల్లో ఆరబెట్టుకున్న ధాన్యం అకాల వర్షంతో నీటిపాలైంది. రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. పాణ్యం, నెరవాడ, బలపనూరు, కొండజూటూరు, భూపనపాడు, కొణిదేడు గ్రామాల్లో వర్షం ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. చేతికొచ్చిన మొక్కజొన్న, వరి ధాన్యాన్ని రోడ్లపై, కల్లాల్లో ఆరబోసుకోగా అకాల వర్షం కురియడంతో మొత్తం నీట తడిసి పోయింది. వర్షం తగ్గిన తర్వాత రైతులు వర్షపునీటిని తొలగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాణ్యంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీసు రోడ్లలో వర్షపునీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే నెరవాడ మెట్ట వద్ద సర్వీసు రోడ్లపై వరి, మొక్కజొన్న ధాన్యాన్ని ఆరబెట్టుకోగా దిగుబడులు మొత్తం నీట తడిసి పోయాయి. -
అందరిపై ఆరోగ్యమాత కరుణ
నందికొట్కూరు: ఆరోగ్యమాత కరుణ అందరిపై ఉందని ఉమ్మడి కర్నూలు జిల్లా ఆర్సీఎం చర్చి మేత్రాసన బిషప్ గోరంట్ల జ్వానేష్ అన్నారు. ఆదివారం పట్టణంలో వేలంగణి మాత మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలో ప్రధాన రహదారి, పురవీధుల వెంట మేరీమాత విగ్రహాన్ని మేళతాళాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. రంగులు చల్లుకుంటూ అంగరంగ వైభవంగా మేరీమాత ఉత్సవాలను జరుపుకున్నారు. అనంతరం ఆర్సీఎం చర్చిలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మేరీమాత వద్ద జ్యోతులు వెలిగించి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బిషప్ మాట్లాడుతూ.. జిల్లా వాసులకు నాగపట్నం తరహాలో మేరీమాతను నందికొట్కూరులో ప్రతిష్టించడం విశేషమన్నారు. ఉత్సవాల్లో ఫాదర్ కేడీ జోసెఫ్, సహాయక ఫాదర్ బాల ఏసు తదితరులు ప్రార్థనలో పాల్గొన్నారు. -
బాలుడి అదృశ్యంపై ‘సిట్’ విచారణ
కౌతాళం: బాలుడి అదృశ్యంపై సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) విచారణ చేపట్టింది. ఇందుకోసం సిట్ సభ్యులు ఆదివారం బదినేహాల్ గ్రామానికి వెళ్లారు. పొలానికి పురుగు మందులు పిచికారీ చేయడానికి వెళ్లి బాలుడు మాల రవీంద్ర (17) ఇంటికి తిరిగి రాలేదు. దీంతో 2024 నవంబర్ 13న కౌతాళం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తన కుమారుడి మిస్సింగ్ కేసులో ఎలాంటి పురోగతి లేదని రవీంద్ర తల్లి మాల గంగమ్మ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు 13 మంది అధికారులతో సిట్ను ఏర్పాటు చేసింది. బృందంలోని సభ్యులు ఆదివారం బదినేహాల్కు వచ్చి గంగమ్మ ఇంటికి వెళ్లి విచారణ చేశారు. అలాగే తుంగభద్ర దిగువ కాలువ వద్దకు కూడా వెళ్లి విచారణ చేపట్టారు. -
ఆరోగ్యంపై రంగు పడుద్ది!
వాటిని చూడగానే నోరూరిస్తున్నాయని ఆబగా తింటున్నారా...అయితే కాస్త ఆగండి. మీరు తినే రంగులు కలిపిన ఆహార పదార్థాలలో పరిమితికి మించి, నిషేధిత సింథటిక్ కలిపి ఉంటున్నాయి. దీనివల్ల ఇప్పటికిప్పుడు జీర్ణకోశవ్యాధులు, భవిష్యత్లో క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాయని ఏది పడితే అది తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వారు చెబుతున్నారు. లాభాపేక్ష కోసం వ్యాపారులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నా అడ్డుకునే వారు కరువయ్యారు. ● ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా రంగుల వినియోగం ● నిషేధిత రంగులూ యథేచ్ఛగా వాడుతున్న వ్యాపారులు ● హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో అధికం ● జీర్ణకోశవ్యాధులు, క్యాన్సర్కు అవకాశం ● దాడులు చేస్తున్నా మారని వైనం కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డుసైడ్ తోపుడు బండ్లు, టీ దుకాణాలు, మొబైల్ క్యాంటీన్లు, డాబాలు, చాట్బాండార్, నూడుల్స్ షాపులు అన్నీ కలుపుకుని దాదాపు 15 వేలకు పైగా ఉంటాయి. కర్నూలు నగరంలో మాత్రమే 4 వేల దాకా హోటల్స్, దుకాణాలు, రోడ్డుసైడు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆయా వ్యాపారాల ద్వారా ప్రతి ఏడాది కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతున్నా వీటిలో జీఎస్టి చెల్లించేది కేవలం 5 శాతంలోపు వ్యాపారులే ఉంటారన్నది బహిరంగ రహస్యం. ఉమ్మడి జిల్లాలోని స్వీట్స్ తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల, జంక్ఫుడ్ కేంద్రాలు, కూల్డ్రింక్స్ దుకాణాలలో పరిమితికి మించి ప్రాణాంతక బుష్పౌడర్ అనే సింథటిక్ కలర్ వాడుతున్నారు. నిబంధనల ప్రకారం ఒక కిలో ఆహార పదార్థానికి 0.001మి.గ్రా వాడాలి. అయితే వ్యాపారులు వారు విక్రయించే ఆహార పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించాలన్న ఉద్దేశంతో కిలోకు 10 నుంచి 20 మి.గ్రా ఫుడ్కలర్ వాడుతున్నారు. ఇలా పరిమితికి మించి వాడితే ఆ పదార్థాలను తిన్న వారికి జీర్ణకోశవ్యాధులు, కాలేయ వ్యాధులు, కడుపులో అల్సర్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఈ రంగులను ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో గోబీ మంచూరియా, కచోరి, కట్లెట్, రెస్టారెంట్లలో బిర్యానీలు, గ్రేవీ ఐటమ్స్, పలు రకాల ఫ్రై ఐటమ్స్, స్వీట్లు, చాక్లెట్లు, ఐస్క్రీమ్లు, కేక్లు, కూల్డ్రింక్లలో ఎక్కువగా వాడుతున్నారు. లెక్కచేయని వ్యాపారులు ఆహార భద్రత అధికారులు ఇటీవల కాలంలో కల్తీ పదార్థాలు, నిషేధిత రంగులు కలిపిన పదార్థాలను విక్రయించే వారిపై విస్తృతంగా దాడులు నిర్వహించి జరిమానాలు విధిస్తున్నారు. అయినా వ్యాపారుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. యథేచ్ఛగా వారు ఆహార పదార్థాల్లో నిషేధిత సింథటిక్ రంగులు కలిపి విక్రయిస్తున్నారు. అధికారులు ఎవ్వరైనా దాడులు చేస్తే వెంటనే వ్యాపారులు వారికి పరిచయం ఉన్న వారితో ప్రజాప్రతినిధులతో అధికారులకు ఫోన్ చేయించి ‘మా వాడే వదిలేయండి’ అని చెప్పిస్తున్నారు. నూటికి 70 శాతం మంది ఇలాగే చేస్తుండగా అధికారులు తలపట్టుకుంటున్నారు. గత నాలుగేళ్లుగా జిల్లాలోని పలువురు వ్యాపారులస్తులపై దాడులు నిర్వహించి నిబంధనలు పాటించని వ్యాపారులకు భారీగా జరిమానాలు విధించారు. అయినా కూడా ఇతర వ్యాపారుల్లో ఎలాంటి మార్పు కనిపించకపోవడం ప్రజారోగ్యం పట్ల వారికున్న చిత్తశుద్ధి ఎలాంటిదో అర్థం అవుతుంది. రంగులు కలిపిన బెల్లంరంగులు కలిపిన బఠానీలురంగులు కలిపిన కివీ డ్రై ఫ్రూట్ ఆహార పదార్థాల్లో సింథటిక్ కలర్స్ వాడకూడదు. ముఖ్యంగా వీటిని గోబీమంచూరియా, చికెన్ దమ్ బిర్యానీ, రెస్టారెంట్లలో ఫ్రైలు, గ్రేవీ ఐటమ్స్లో ఎక్కువగా కలుపుతున్నారు. అలాగే స్వీట్లలో, కూల్డ్రింక్స్లోనూ పరిమితికి మించి రంగులు కలుపుతున్నారు. ఈ మేరకు వ్యాపారులను హెచ్చరించి నోటీసులు జారీ భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నాం. ఆహార పదార్థాల తయారీలో నిబంధనలు పాటించని వ్యాపారుల పట్ల కఠినంగా ఉంటున్నాం. – కూర్మా నాయకులు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, ఉమ్మడి కర్నూలు జిల్లా -
మాజీ సైనికుడి భార్య ఆత్మహత్య
ఆదోని అర్బన్: పట్టణంలోని ఆర్టీసీ కాలనీకి చెందిన మాజీ సైనికుడు వీరేష్ భార్య శైలజ(36) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని టూటౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆదివారం ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. అప్పుల బాధతో యువకుడు..కొత్తపల్లి: అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దుద్యాల గ్రామంలోని రాజమూరి నాగశేషులు, నాగలక్ష్మీల దంపతులకు కుమారుడు పుల్లయ్య అలియాస్ ప్రవీణ్(23)తో పాటు మరో ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇంటర్ చదివిన పుల్లయ్య చదువు మానేసి ఐదేళ్లుగా ఆత్మకూరు పట్టణంలోని బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ అవసరాలకు జీతం సరిపోగా స్నేహితుల వద్ద ఎక్కువ మొత్తంలో అప్పులు చేశాడు. అప్పుల భారంతో తీవ్ర మనస్తాపం చెంది శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం ఉదయం గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జయశేఖర్ తెలిపారు. అనారోగ్యంతో వృద్ధురాలు..మహానంది: గోపవరం గ్రామానికి చెందిన పిన్నాపురం నాగలక్ష్మమ్మ (68) గూడ్సు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాగలక్ష్మమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఆదివారం గ్రామ సమీపంలో రైల్వే గేటు వద్ద గూడ్సు రైలు కిందపడి మృతి చెందింది. సమాచారం అందుకున్న నంద్యాల రైల్వే హెడ్ కానిస్టేబుల్ హరికృష్ణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి కోడలు లక్ష్మిదేవమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
మిత్రుడి మరణం తట్టుకోలేక..
ఉరేసుకుని ఆత్మహత్యబేతంచెర్ల: ప్రాణ స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన బేతంచెర్లలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన యువకులు షేక్షావలి, ట్రాక్టర్ డ్రైవర్ కొడిగంటి చిన్న స్నేహితులు. ఎప్పుడూ ఇద్దరు కలసిమెలసి ఉండేవారు. షేక్షావలి శనివారం రోడ్డు ప్రమాదానికి గురై కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. మిత్రుడి మరణంతో తీవ్ర మనస్తాపానికి చెందిన డ్రైవర్ చిన్న (25) అనురాధ థియేటర్ సమీపంలోని తన ఇంట్లో అర్ధరాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య చిలకమ్మతో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
ప్రజల దాహార్తి తీర్చుతూ.. బీడు భూములను సస్యశ్యామలం చేస్తూ గలగల పాడే తుంగభద్ర, హంద్రీ నదులు తమ రూపును కోల్పోతున్నాయి. టీడీపీ నాయకులు భారీగా ఇసుకను తవ్వుతుండటంతో నదుల భద్రతకు దిక్కే లేకుండా పోయింది. అడుగడుగునా మీటర్ల మేర భారీగా గుంతలు ఏర్పడటంతో నదుల్లో నీటి
హంద్రీ నది నుంచి జేసీబీతో ట్రాక్టర్లలో ఇసుకను నింపుతున్న దృశ్యంకోడుమూరు రూరల్/నందవరం: అడిగే వారు లేరనే ధీమానో, అధికారం ఉందన్న అహంకారమో టీడీపీ నాయకులు యథేచ్ఛగా హంద్రీనది నుంచి ఇసుకను తోడేస్తున్నారు. కోడుమూరులోని ముడుమలగుర్తి రోడ్డు వైపు గల హంద్రీనది నుంచి భారీ యంత్రాల సాయంతో రోజుకు 300 నుంచి 400 ట్రాక్టర్ల వరకు ఇసుకను పగలు, రాత్రి తేడా లేకుండా తరలించుకుపోతున్నారు. హంద్రీ నుంచి కోడుమూరు, కర్నూలు, గూడూరు, పత్తికొండ వంటి ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు. యంత్రాల సాయంతో కొన్ని మీటర్ల లోతు వరకు ఇసుకను తీస్తుండడంతో హంద్రీ నదిలో భారీగా గోతులేర్పడ్డాయి. హంద్రీ నుంచి భారీగా ఇసుకను తరలించుకుపోతుండడంతో భవిష్యత్తులో దొరకని పరిస్థితి నెలకొనే ప్రమాదముందని కోడుమూరు వాసులు తీవ్ర ఆందోళన చేందుతున్నారు. అబద్ధాల ప్రచారం ఇసుక అక్రమ రవాణాపై కోడుమూరు ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో టీడీపీ నాయకులు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఇందుకు విలేకరుల సమావేశం నిర్వహించి ఇసుక అక్రమ రవా ణాలో తమకేమి సంబంధం లేదని చెబుతున్నారు. భవన నిర్మాణ కార్మికులకు, ట్రాక్టర్ యాజమానులకు పనులు కల్పించడం కోసమే తాము అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహిస్తున్నట్లు అబద్ధాలు చెప్పారు. అక్రమ ఆర్జనకే టీడీపీ నాయకులు ఇసుక దోపిడీ చేస్తున్నారని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఇసుక అక్రమ రవాణా పట్టించుకోవడం లేదు. పొంచి ఉన్న నీటి సమస్య కోడుమూరు, వర్కూరు, ముడుమలగుర్తి, క్రిష్ణాపురం, వెంకటగిరి, గోరంట్ల, లద్దగిరి, ప్యాలకుర్తి, అనగొండ, అమడగుంట్ల, ఎర్రదొడ్డి వంటి గ్రామాల్లోని మంచినీటి పథకాలకు హంద్రీలోని బోర్ల ద్వారానే నీటిని సరఫరా చేస్తారు. ఇప్పటికే హంద్రీలో ఇసుకమేటలు లేకపోవడంతో నీళ్లు నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. ఉన్న కాస్త ఇసుకను కూడా తరలిస్తే భవిష్యత్తులో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చే ప్రమాదముంది. కోడుమూరుకు భారీ నీటి సమస్య పొంచి ఉంది. ఇప్పటికే హంద్రీలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో 4 నుంచి 5రోజులకోసారి పంచాయతీ అధికారులు కుళాయిలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉన్న కాస్తా ఇసుకను కూడా తరలిస్తే నీటి సమస్య తీవ్రమవుతుందని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే అండదండలతో..ఇసుక దందా అంతా స్థానిక ఎమ్మెల్యే అండదండలతో సాగుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. నదికై రవాడి గ్రామానికి చెందిన ఓ చోట నాయకుడు, మరో ఇసుక రీచ్ సూపర్వైజర్ కలిసి ఈ దందాకు తెర తీశారు. ఇప్పటికే 200 క్యూబిక్ మీటర్లుకు పైగా ఇసుక తరలించినట్లు అంచనా. నదికై రవాడి గ్రామ సమీపంలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న చిలకలడోణ ఎత్తిపోతల పథకం సమీపంలో పొలంలో ఐదు ట్రాక్టర్లు, జేసీబీతో ఇసుకను డంప్ చేసి, రాత్రి పూట లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తునట్లు సమాచారం. హంద్రీ నదిని యథేచ్ఛగా తవ్వుతున్న టీడీపీ నాయకులు తుంగభద్ర నది నుంచి ఇసుక తరలింపు జేసీబీ, హిటాచీ యంత్రాల ఉపయోగం నదుల్లో కనిపిస్తున్న భారీ గోతులు చోద్యం చూస్తున్న అధికారులు -
‘బండ’డు కష్టాలు
ఇండియన్ గ్యాస్ను సక్రమంగా సరఫరా చేయకపోవడంతో ఆదివారం ఆస్పరిలో బస్టాండ్ దగ్గర సిలిండర్లును క్యూలో పెట్టి ఉంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంటి దగ్గరకు గ్యాస్ సరఫరా చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నా ఆస్పరిలో మాత్రం జరగడం లేదని వినియోగదారులు అవేదన చెందుతున్నారు. ఆదివారం 250 మంది గ్యాస్ కోసం సిలిండర్లు క్యూలో పెట్టి వేచి ఉండగా గ్యాస్ ఏజెన్సీవారు 80 మందికి మాత్రమే ఇచ్చినట్లు వినియోగదారులు తెలిపారు. –ఆస్పరి -
వేరుశనగ క్వింటా రూ.7,200
ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఆదివారం క్వింటా వేరుశనగ గరిష్టంగా రూ.7,200 ధర పలికింది. మార్కెట్కు 115 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులు మాత్రమే మార్కెట్కు విక్రయానికి వచ్చాయి. దీంతో క్వింటా వేరుశనగ కనిష్ట ధర రూ.5,540కు, మధ్యస్థ ధర క్వింటం రూ,6,713 ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. అదేవిధంగా ఆముదాలు 42 క్వింటాళ్లు విక్రయానికి రావడంతో కనిష్ట ధర క్వింటా రూ.5,880లు. మధ్యస్థ రూ.5,890, గరిష్టంగా ధర రూ.5,901కు, కందులు 2 క్వింటాళ్లు అమ్మకానికి రావడంతో క్వింటా గరిష్ట ధర రూ.6,430కు వ్యాపారులు కొనుగోలు చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో వెట్టిచాకిరి కర్నూలు(సెంట్రల్): అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటోందని స్టేట్ గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గంటా సంపత్కుమార్, ఈడుపుగంటి మోహన్రావు ఆరోపించారు. ఆదివారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా వారు మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. అవుట్సోర్సింగ్ పేరుతో నెలకు రూ.10 వేల జీతం ఇస్తూ శ్రమదోపిడీ చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయసును 62 సంత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. అసోసియేషన్ కర్నూలు జిల్లా కమిటీకి జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నాగరాజు, జనరల్ సెక్రటరీగా రాములు, ట్రేజరర్గా శివప్రసాద్ ఎన్నికయ్యారు. నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా కర్నూలు(సెంట్రల్): తుంగభద్ర, హంద్రీ నదులను, వక్కెరవాగును పరిరక్షించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు రాల్యీగా వస్తామని పేర్కొన్నారు. కర్నూలు నగరానికి శాశ్వతంగా నీటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే తుంగభద్ర, హంద్రీ నదులను పరిరక్షించాలని, ధర్నాలో ప్రజలు పాల్గొనాలని కోరారు. అధికారిక వైబ్సైట్ను మాత్రమే వినియోగించాలి శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో ఆర్జిత సేవా టికెట్లు, స్పర్శదర్శనం టికెట్లు, వసతి గదులు ముందస్తు బుకింగ్ కోసం దేవస్థాన అధికారిక వెబ్సైట్ను మాత్రమే వినియోగించుకోవాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఈఓ మాట్లాడుతూ శ్రీశైల దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో అన్నీ ఆర్జిత సేవలు, మల్లికార్జున స్వామివారి స్పర్శదర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందే అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. 17 ఆర్జిత సేవలకు సంబంధించిన సేవాటికెట్లను ఆన్లైన్ ద్వారా భక్తులు పొందవచ్చన్నారు. అలాగే వసతిని కూడా ముందస్తుగా ఆన్లైన్లో రిజర్వ్ చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు. భక్తులు రాష్ట్ర దేవదాయశాఖ అధికారిక వైబ్సైట్ www.aptemples.ap.gov.in, అలాగే దేవస్థానం అధికారిక వెబ్సైట్ www. srisailadevasthanam.org ద్వారా మాత్రమే వినియోగించుకోవాలని అన్నారు. అలాగే మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా అన్నీ ఆర్జిత సేవా టికెట్లను, మల్లన్న స్పర్శదర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం టికెట్లను పొందవచ్చునని అన్నారు. -
చంద్రబాబు పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యం
● ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షిచిప్పగిరి: చంద్రబాబు పాలనలో విద్య, వైద్య, వ్యవసాయం, ఉపాధి తదితర రంగాలన్నీ నిర్వీర్యం అయ్యాయని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి అన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రైతాంగానికి చేసింది ఏమీ లేదన్నారు. జగనన్న హయాంలో ఖరీఫ్, రబీ సీజన్ ముగిసేలోపు పంటల బీమా సాయం అందించారని గుర్తు చేశారు. చంద్ర బాబు పాలనలో మోంథా తుపాన్తో దెబ్బతిన్న పంటలకు నేటి వరకు నష్ట పరిహారం అందలేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి రైతుకు రైతుభరోసా సాయం అందిస్తే చంద్రబాబు రెండేళ్ల పాలనలో కేవలం ఒక్కసారి తూతూ మంత్రంగా అన్నదాత సుఖీభవ అందించారన్నారు. ఫీజురీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో అనేక మంది విద్యార్థులు బాధపడుతున్నారన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా లక్షల కోట్లు అప్పులు తెస్తూ అప్పుల ఆంధ్రగా మారుస్తున్నారని ఆరోపించారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులా పాలన చేస్తే ప్రస్తుత చంద్రబాబు పాలన దోచుకో, దాచుకో అన్న చందంగా పాలన చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్సీపీ నాయకులు బుసినె చంద్రశేఖర్, శ్రీరాములు, వెంకటేష్, మహానంది, హనుమంతు ఉన్నారు. -
అల్లా మార్గంలో నడవాలి
రుద్రవరం: ముస్లింలు అల్లా మార్గంలో నడవాలని మత పెద్దలు అన్నారు. రుద్రవరంలో ఆదివారం ఇస్తెమా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు ఐదు మార్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ.. ప్రతి రోజు నమాజ్ చేయాలని, అలాగే సంపాదనలో జకాత్ తీసి పేదలకు పంచాలని చెప్పారు. శాంతి మార్గంలో నడుస్తూ అందరితో మంచిగా మెలగాలని వివరించారు. ఇస్తెమాకు వచ్చిన వారికి స్థానిక ముస్లింలు తగిన వసతులు కల్పించారు. ఎండలు అధికంగా ఉండటంతో దాతల సహాయంతో మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. గడ్డి వాము, ట్రాక్టర్ దగ్ధం బేతంచెర్ల: అంబాపురం గ్రామంలో గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధమైన సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల మేరకు గ్రామానికి దగడ సురేంద్రనాథ్ రెడ్డి గడ్డివాముకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. గమనించిన గ్రామస్తులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాకపోగా , పక్కన్న ఉన్న ట్రాక్టర్ ఇంజన్కు సైతం మంటలు వ్యాపించి దగ్ధమైంది. సుమారు గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధమై రూ.6.50 లక్షల ఆస్తి నష్టం వాటిలినట్లు బాధితుడు తెలిపారు. గ్రామంలో గడ్డివాము దగ్ధం సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధిత రైతుకు న్యాయం చేయాలని గ్రామ సీపీఐ నాయకులు శ్రీరాములు, సోమన్న, నాగేశ్వరరావు, చంద్రమోహన్ డిమాండు చేశారు. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి కర్నూలు (టౌన్): కర్నూలు – గుంటూరు రహదారిలో నందనపల్లి గ్రామ శివారులో ఉన్న శ్రీనివాస గార్డెన్ సమీపంలో ఆదివారం వాహనం ఢీకొని గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికంగా కుంభకోణం కాఫీ హోటల్ దగ్గరలో గార్గేయపురం వైపు నుంచి కర్నూలుకు వస్తున్న కంకర మిక్చర్ వాహనం రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలుకావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక వీఆర్ఓ ఖాజామియ్య కర్నూలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి ఆనవాళ్లు సేకరించారు. సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉండి 5.6 అడుగుల ఎత్తు, చామనఛాయ రంగు కలిగి ఉన్నాడు. వివరాలు తెలిస్తే 91211 01063 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఘాట్ రోడ్డులో లారీ బోల్తా ● ప్రాణభయంతో కిందకు దూకి మృతి చెందిన క్లీనర్ మహానంది: నంద్యాల – గిద్దలూరు నల్లమల ఘాట్రోడ్డులో అదుపు తప్పిన లారీ కొండచరియను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో క్లీనర్ మృతి చెందాడు. ఒంగోలు నుంచి బళ్లారికి ఐరన్ షీట్లతో వెళ్తున్న లారీ పాత బొగద దొరబావి వంతెన మలుపు సమీపంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో కొండ చరియను ఢీకొని బోల్తా పడింది. దీంతో లారీలో డ్రైవర్తో పాటు ఉన్న క్లీనర్ ప్రసాద్ ప్రాణభయంతో కిందికి దూకడంతో తలకు దెబ్బలు తగిలి మృతి చెందాడు. లారీ వెనుకే వస్తున్న ఓ స్కార్పియో వాహన దారులు అప్రమత్తమై వెనుకకు వెళ్తుండగా లారీ వెనుక భాగం నుంచి ఐరన్ షీట్లు పడటంతో వాహనం ముందు భాగం దెబ్బతినింది. సుమారు మూడు గంటలకు పైగా వాహ నాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రోడ్సేఫ్టీ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి రోడ్డుపై బోల్తాపడిన లారీని జేసీబీ సహాయంతో పక్కకు తప్పించడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. క్లీనర్ ప్రసాద్ విజయవాడ నగరానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. నంద్యాల ఏఎస్పీ మందా జావళి, మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. -
వసతుల కల్పనకు చర్యలు
● ఆర్యూ వీసీ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో వసతులను మెరుగు పరుస్తామని మర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవ రావు అన్నారు. శనివారం వర్సిటీ ప్రాంగణంలో ఇంజినీరింగ్ కళాశాలకు అనుబంధంగా అదనపు భవనాల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ఏకై క ఇంజినీరింగ్ కళాశాల అయిన వర్సిటీ కళాశాల విద్యార్థులకు సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా ఈ నిర్మాణాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్కుమార్ నాయుడు, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.విశ్వనాథ రెడ్డి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార పుచ్చ వెంకట సుందరానంద్, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య ఎన్. నరసింహులు, బోటనీ ప్రొఫెసర్ భరత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
గుంతలు.. వాన పడితే మడుగులు
గుంతలమయమైన రహదారిలో చిన్నపాటి వర్షానికి నీరు చేరడంతో వాహనదారుల కష్టాలు అన్నీఇన్నీ కావు. మండల కేంద్రమైన కౌతాళంలో బాపురం రోడ్డు అధ్వానంగా మారింది. రెండు రోజు ల క్రితం కురిసిన చిన్న పాటి వర్షానికి రో డ్డులో గుంతలు పూర్తిగా నీటితో నిండి మడుగులను తలపిస్తున్నాయి. ఇండియన్ పెట్రోల్ బంక్ నుంచి వెలుగు కార్యాలయం వరకు బురదదారిలో ప్రయాణించ డం కష్టంగా మారింది. వాహనదారులు ఊరు దాటాలంటే భయపడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా నివాసముంటున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది. అడుగు బయటపెట్టాలంటే ఆలోచించాల్సి వస్తోంది. కొందరు టెంకాయ పీచు సహాయంతో బురద దారిని దాటుతున్నారు. వెంటనే రహదారి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. – కౌతాళం -
మద్దిలేటయ్య క్షేత్రం కిటకిట
బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయం వైశాఖ మాసం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేసవి సెలవులు, శుభ దినాలు కావడంతో పెళ్లిలు, కేశఖండన కార్యక్రమాలు ఉండటంతో ఆలయం భక్త జన సంద్రంగా మారింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం, కుంమార్చన, ఆకుపూజ, స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజతో పాటు మహా మంగళహారతి నిర్వహించారు. మద్దిలేటయ్య నామస్మరణలతో క్షేత్రం మారుమోగింది. -
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా
● ఆరుగురికి గాయాలు గోస్పాడు: కర్నూలు – కడప జాతీయ రహదారిపై సాంబవరం మెట్ట సమీపంలో శనివారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్ నుంచి అరుణాచలానికి వెళ్తున్న జగన్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అమరేంద్రగౌడ్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపటంతో వేగాన్ని నియంత్రించుకోలేక సాంబవరం మెట్ట సమీపంలో అదుపు తప్పి బోల్తా పడి పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో 39 మంది ఉండగా ప్రయాణికులు వినయ్కుమార్, ఎల్లారెడ్డి, నాగేంద్రమ్మ, జ్యోతి, బాలనర్సమ్మ, ఇందిరారాణి తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాగేంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్రెడ్డి తెలిపారు. భార్య హత్య కేసులో భర్త అరెస్టు కృష్ణగిరి: మద్యం మత్తులో ఈ నెల 5న బోయ బొంతిరాళ్ల గ్రామంలో భార్య పద్మావతి అలియాస్ సుజాతను గొడ్డలితో హత్య చేసిన భర్త పాపారాయుడును శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు సంబంధించిన వివరాలను సీఐ యుగంధర్, ఎస్ఐ కృష్ణమూర్తి వెల్లడించారు. ఇతనికి ఆరోగ్యం బాగా లేదని కొంత కాలంగా భార్య సుజాత దాంపత్య జీవితానికి దూరంగా ఉంచింది. దీంతో ఆమైపె అనుమానం పెంచుకుని గొడవ పడి గొడ్డలితో దాడి చేసినట్లు విచారణ వెల్లడైందన్నారు. నిందితుడు ముందుగా ఆలంకొండ వీఆర్వో అనిల్ వద్ద లొంగిపోగా అతన్ని పోలీసులకు అప్పగించారన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించినట్లు తెలిపారు. -
డ్రైవరూ.. టైరు జాగ్రత్త
● టైర్ల నిర్వహణపై అవగాహన లోపం ● వాహనాల టైర్లు పేలి వరుస ప్రమాదాలు ● వేసవిలో మరింత జాగ్రత్తంటున్న నిపుణులు సాక్షి, నంద్యాల: ‘వాహనాలు కండిషన్లోనే ఉన్నాయి. క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తున్నాం’ .. అని ధీమాగా ఉంటే సరిపోదు. వాహనాల కండిషన్, ఇంధనం మాత్రమే కాదు.. టైర్లు, అందులో గాలి తరచూ సరి చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాహనం బయలుదేరడానికి ముందే ఒకటికి రెండు సార్లు టైర్లు ఎలా ఉన్నాయి.. వాటిలో సరిపడినంత గాలి ఉందా.. తక్కువ/ఎక్కువగా ఉందో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో టైర్లు పేలిపోయి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జిల్లాలో ఈ తరహాలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రతి టైరుకు కాలపరిమితి ఉంటుంది. తర్వాత కాల పరిమితి తగ్గిపోతుంది. రబ్బరు గట్టిపడడంతో అందులో పరిమితికి మించి గాలి పట్టినప్పుడు, గుంతల్లో పడినప్పుడు టైర్లు పేలిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వేసవి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో అరిగిపోయిన టైర్లతో వాహనాలు ప్రయాణం చేయడం అత్యంత ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ఆ అక్షరమే... భద్రతకు కీలకం.. టైరు కొనుగోలు చేసే సమయంలో దాని తయారీ సంవత్సరం చూసుకోవాలి. రీ బటన్ వేసిన వాటిని కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. మరోవైపు బైక్లు, కార్లు, బస్సులు, లారీల టైర్లు నాణ్యత, స్పీడ్ రేటింగ్ సరిగ్గా లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. టైర్ స్పీడ్ రేటింగ్ అక్షరాలలో ఉంటుంది. ప్రతి టైర్పై దాని సామర్థ్యం తెలియజేసే ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. అందులో చివరి ఆల్ఫా బెటికల్ అక్షరం చాలా కీలకమైంది. దాన్ని టైర్ స్పీడ్ రేటింగ్ అంటారు. వాహన కంపెనీలు ఆ మోడ ల్కు తగిన స్పీడ్ రేటింగ్ నిర్ణయిస్తాయి. డ్రైవర్ డోర్ వద్ద ఉండే స్టిక్కర్ లేదా వాహన మాన్యువల్లో ఇది స్పష్టంగా ఉంటుంది. హైవేలపై డ్రైవ్ చేసేవారు హెచ్, వి రేటింగ్ టైర్లు వినియోగించడం మంచిదని నిపుణు లు చెబుతున్నారు. సాధారణంగా టైర్ల మన్నిక కాలం ఐదారేళ్లు ఉంటుంది. కొత్త టైర్ తీసుకునే సమయంలో అది ఎప్పుడు తయారైందనేది తప్పనిసరిగా పరిశీలించాలి. ఉదాహరణకు 1226 అని ఉంటే 2026వ సంవత్సరం 12వ వారంలో తయారైనట్లు అర్థం. ద్విచక్ర వాహనాలు 2,74,768 ఆటోలు 16,631 కార్లు 16,832 గూడ్స్ వాహనాలు 12,839 ట్రాక్టర్లు 21,583 జీపులు, క్యాబ్లు, స్కూల్ బస్సులు 4,607 జిల్లాలో వాహనాల వివరాలు ఇలా... -
‘తాలిమ్ ఏ హునర్’ను సద్వినియోగం చేసుకోండి
కర్నూలు(హాస్పిటల్): వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘తాలిమ్ ఏ హునర్’ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రోజా దర్గా ముతవల్లి సయ్యద్ దాదా బాషా ఖాద్రి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ స్థాయి విద్యను భరించలేని మైనార్టీ పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఉన్నత విద్యావకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఇంటర్ మీడియట్ విద్యతో పాటు జేఈఈ, ఎంసెట్, నీట్, ఇతర పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ అందించనున్నట్లు తెలిపారు. మొత్తం రూ.5 కోట్ల వ్యయంతో 250 మంది విద్యార్థులకు రెండు సంవత్సరాల పాటు నాణ్యమైన విద్య, శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు ఉందని, ఈనెల 17వ తేదీన పరీక్ష ఉంటుందని తెలిపారు. కర్నూలు కల్చరల్: కళావాహిని సాంస్కృతిక సాహితీ సంస్థ ఆధ్వర్యంలో శనివారం రాత్రి సీక్యాంప్ కళాక్షేత్రంలో నిర్వహించిన అన్నమాచార్య సంకీర్తనల గాన కచేరి అలరించింది. అనమయ్య జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో సంగీత విద్వాంసులు రాఘవేంద్ర కుమార్, భార్గవిల బృందం అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ శంకర్ శర్మ, మధుర కవి ఎలమర్తి రమణయ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. అన్నమయ్య సంకీర్తనలు అజరామరమన్నారు. ఆయన తొలి తెలుగు వాగ్గేయ కారులు అన్నారు. కళావాహిని సాహితీ సంస్థ అధ్యక్షులు మనోహర్బాబు, హనుమంతరావు చౌదరి, సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
ఆనాటి స్నేహం.. అద్భుత జ్ఞాపకం
నంద్యాల (అర్బన్): చదువులమ్మ చెట్టు నీడలో విద్యాబుద్ధులు నేర్చుకున్న స్నేహితులందరూ మూడు దశబ్దాల తర్వాత తిరిగి అక్కడే జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇందుకు నంద్యాల మండలం చాపిరేవుల జెడ్పీ హైస్కూల్ ప్రాంగణం వేదికై ంది. స్థానిక ఉన్నత పాఠశాలలో 1995–96 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు 30 ఏళ్ల అనంతరం శనివారం అదే పాఠశాలలో కలుసుకున్నారు. తొలుత సభా వేదిక పైకి వెళ్లి ఒక్కొక్కరిగా పరిచయం చేసుకున్నారు. ఆనాటి తీపి జ్ఞాపకాలు, ఆటలు, అల్లర్లు, నిక్నెమ్లు గుర్తుకు తెచ్చుకుంటూ ఒకరినొకరు పిలుచుకుంటూ చిన్న పిల్లల్లా మారిపోయి ఉత్సాహంగా గడిపారు. ఆత్మీయ పలకరింపులతో యోగ క్షేమాలు తెలుసుకుంటూ ఆనందంగా సందడి చేశారు. వివిధ వృత్తులు, ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడి పలు ప్రాంతాల్లో ఉన్న వారంతా తరలి వచ్చారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేద్దామని, తోటి విద్యార్థులకు సాయపడదామని తీర్మానాలు చేసుకున్నారు. విద్యార్థులందరూ వినోద కార్యక్రమాల్లో పాల్గొని, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. పాఠశాల అభివృద్ధికి రూ.60వేలు బహూకరించారు. తోటి విద్యార్థి నరసింహారెడ్డి ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడటంతో అతనికి రూ.30 వేలు ఆర్థిక సాయం చేశారు. తమకు విద్యాబుద్ధులు నేర్చిన గురువులు, పీఈటీలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ జిల్లెల్ల సరస్వతి, వాసుదేవరెడ్డి, మల్లికార్జునరెడ్డి, వెంకటసుబ్బయ్య, అరుణ, శివపార్వతి, ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు. -
నల్లమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
మహానంది: నంద్యాల – గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్డులో శనివారం పెద్ద ప్రమాదం తప్పింది. పాత బొగద రైల్వే వంతెన వద్ద ఎదురెదురుగా వస్తున్న లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ బోల్తా పడింది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. రోడ్డుపై లారీ బోల్తా పడటంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డుగా ఉన్న వాహనాలను పక్కకు తొలగించడంతో వాహ నాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి ప్యాపిలి: ఊటకొండ గ్రామానికి చెందిన రామాంజనేయులు (47) శనివారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. రామాంజనేయులు తన పొలంలో మోటార్ ఆన్ కాకపోవడంతో డీపీ వద్దకు వెళ్లి పరిశీలిస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య రాజమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జలదుర్గం ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. వివాహిత అదృశ్యం ఉయ్యాలవాడ: ఆర్.పాంపల్లెకు చెందిన లీలావతి (27) రెండు రోజుల నుంచి కనిపించడం లేదు. ఉయ్యాలవాడ పీఎస్ ఏఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపి న వివరాల మేరకు.. ఆర్. పాపంల్లె గ్రామానికి చెందిన కళ్యాణ్బాబు, లీలా వతి దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. ఈ నెల 8వ తేదీ ఉదయం ఇంటి నుంచి లీలావతి తన కుమార్తెను వెంట తీసుకుని వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం బంధువులు, భర్త గాలించారు. ఆచూకీ లేకపోవడంతో లీలా వతి తండ్రి రొక్కం ఏసయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. -
సుపరిపాలన అంటే అరాచకం.. దౌర్జన్యమా?
దేవనకొండ: టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డూ అదుపులేకుండా దౌర్జన్యాలు చేయడం.. అరాచకాలకు పాల్పడటం.. ప్రభుత్వ ఉద్యోగులను, ప్రజలను వేధించడం... ఇదేనా సుపరిపాలన అంటే అని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ప్రశ్నించారు. దేవనకొండలో తాళా లు వేసిన ఉపాధి హామీ కార్యాలయాన్ని గురువారం ఆయన పరిశీలించారు. కార్యాలయానికి ఎందుకు తాళం వేశారని డ్వామా పీడీతో ఫోన్లో ఎమ్మెల్యే మా ట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దేవనకొండ మండలంలోని మాచాపురం, నెల్లిబండ, దేవనకొండ గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లను బలవంతంగా రాజీనామా చేయాలని, ఉపాధి హామీ సిబ్బంది వారిని రాజీనామా చేసేలా టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చారన్నారు. ఉపాధి హామీ సిబ్బందిని నానా దుర్భాషలాడుతూ ఇబ్బందులుకు గురి చేస్తున్నారన్నారు. గత మూడు రోజుల నుంచి సిబ్బంది పనిచేసే కార్యాలయానికి టీడీపీ నాయకులు తాళం వేసుకుని వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్బుక్ పాలన నడుస్తోందన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులనే టార్గెట్ చేస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులను కూడా వేధించడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామా అని ప్రజలు భయాందోళన చెందుతున్నారన్నారు. ఇలాంటి అరాచకాలు ఇంకోసారి తన నియోజకవర్గంలో జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తేలేదని హెచ్చరించారు. తనను నమ్మి ఓటు వేసిన ఆలూరు నియోజకవర్గ ప్రజల వెనక తాను నిలబడి పోరాడతానని తెలిపారు. ‘ఉపాధి’ సిబ్బందికి అండగా ఉంటానని, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తనని సంప్రదించాలని సూచించారు. కార్యాలయానికి వచ్చి ప్రశాంతంగా పని చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వచ్చిన విషయాన్ని తెలుసుకున్న టీడీపీ నాయకులు ఎమ్మెల్యే వెళ్లిన ఒక గంటలోపే తాళాలను ఇచ్చి కార్యాలయాన్ని తెరిపించారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ రామకృష్ణ, దివాకర్నాయుడు, ఎర్రగోటి అంజి, మండలంలోని కార్యకర్తలు ఉన్నారు. -
మహాయోగి లక్ష్మమ్మవ్వ
మహిమాన్వితురాలు ● భక్తుల ఇలవేల్పుగా ప్రసిద్ధి ● రేపు అవ్వ జాతర ● తరలిరానున్న భక్తజనం ఆదోని అర్బన్: మహాయోగి లక్ష్మమ్మవ్వ కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. ఆదోని పట్టణంలో వెలిసిన అవ్వను భక్తులు తమ ఇలవేల్పుగా కొలుస్తున్నారు. ఈనెల 9వ తేదీన శనివారం అవ్వ జాతర సందర్భంగా వెండి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక నుంచి కూడా భక్తులు తరలిరానుండటంతో ఆలయ నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం తెల్లవారుజామున అవ్వ వారి సమాధి, మూలవిరాట్కు క్షీరాభిషేకం, పట్టువస్త్రాలు, ఒడిబియ్యం, పూల అలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి అవ్వ విగ్రహాన్ని వెండి రథంలో ఉంచి పురవీధుల్లో ఊరేగించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆలయం ముందు చలువ పందిళ్లు వేశారు. ఇన్చార్జి డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తును నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లోనూ చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు 25 శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ ఆలయాలు వెలిశాయి. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం బళ్లారి, సిరుగుప్ప తాలూకా రారావిలో కూడా అవ్వ వారి ఆలయాలు ఉన్నాయి. ప్రతిరోజూ శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ పూజలందుకుంటున్నారు. ఆలూరు మండలం మూసానహళ్లి గ్రామంలో దళిత మంగమ్మ, బండెప్ప దంపతుల కుమార్తె లక్ష్మమ్మ చిన్నప్పటి నుంచే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండడంతో గ్రామస్తులు తిక్కమ్మగా పిలిచేవారు. పెళ్లీడు రావడంతో కర్ణాటక రాష్ట్రం సిరుగుప్ప గ్రామానికి చెందిన మారెప్పకు ఇచ్చి వివాహం చేశారు. ఓరోజు ఆమె తన భర్తకు శక్తిస్వరూపిణిగా కనిపించడంతో అతడు భయపడి ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాడు. కొన్ని రోజుల తర్వాత సిరుగుప్ప నుంచి ఆదోనికి చేరుకుని పుర వీధుల్లో సంచరించే వారు. పట్టణ ప్రజలకు తరచూ ఆమె రకరకాల మహిమలు చూపుతుండడంతో మహాయోగిగా భావించి సమస్యలు చెప్పుకుని సాంత్వన పొందటం ప్రారంభించారు. ఆమె దుకాణాల వద్దకు వచ్చిపోతే వ్యాపారం బాగా జరుగుతుందనే నమ్మేవారు. సంతానం లేని వారికి అమ్మవారిని కలిసి వేడుకుంటే సంతానం కలిగేదని భక్తుల నమ్మకం. రోజురోజుకూ మహిమలు చూపడం ఎక్కువ కావడంతో తిక్క లక్ష్మమ్మను మహాయోగిగా పిలిచేవారు. అమ్మవారు జీవించిన కాలంలోనే ఓ పెద్ద కుర్చీలో ఉంచి పల్లకీ సేవగా ఊరేగించే వారు. 1933లో పట్టణంలో జీవసమాధి అయ్యారని ఆలయ నిర్వాహకులు రాచోటి రామయ్య, రాచోటి సుబ్బయ్య తెలిపారు.రథోత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. భక్తులు అందరికీ అన్నదానం నిర్వహిస్తున్నాం. శ్రీభగవాన్ శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో అవ్వవారి పేరుమీద ఉచితంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు యోగా సాధన, ధ్యానం, ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహిస్తున్నాం. – రాచోటి రామయ్య, ఆలయ ధర్మకర్త -
‘ఉపాధి’ కార్యాలయానికి తాళం
టీడీపీ నాయకులు తాళాలు వేసిన దేవనకొండ ఉపాధి హామీ కార్యాలయం ఇది. నెల్లిబండ, దేవనకొండ, మాచాపురం ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారిని తొలగించాలని టీడీపీ నాయకులు ఎంపీడీఓను కోరారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలని ఆయన చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను బలవంతంగా రాజీనామా చేయించాలని ‘ఉపాధి’ సిబ్బందిని టీడీపీ నాయకులు బెదిరించారు. అంతటితో ఆగకుండా మూడు రోజుల క్రితం కార్యాలయానికి తాళాలు వేశారు. దీంతో ఉద్యోగులు భయపడుతూ గురువారం ఒక్కరు కూడా విధులకు రాలేదు. విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి కార్యాలయాన్ని సందర్శించారు. అధికారులతో మాట్లాడి కార్యాలయాన్ని తెరిపించారు. -
భక్తులకు మెరుగైన సౌకర్యాలు
● శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు మంత్రాలయం: భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని శ్రీమఠం అధికారులను పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మఠం అధికారులతో కలసి అన్నపూర్ణ భోజనశాల, వీఐపీ భోజనశాల, కల్పతర్వు క్యూ కాంపెక్స్ను తనిఖీ చేశారు. అన్నప్రసాదం ఎలా ఉందని భక్తులను అడిగి తెలుసుకున్నారు. క్యూ కాంపెక్స్లో భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. వంటశాలల్లో సిబ్బందితో మట్లాడి పలు సూచనలు ఇచ్చారు. ఎండతీవ్రత దృష్ట్యా అన్నపూర్ణ భోజన రహదారికి తడకలతో నీడ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యూ కాంప్లెక్స్లో నీటి వసతి కల్పించాలన్నారు. కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాసరావు, ప్రధాన అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. -
కమనీయం.. మల్లన్న కల్యాణోత్సవం
శ్రీశైలంటెంపుల్: హిందూధర్మ ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా చింతల చెంచుగూడేంలో ‘మా స్వామి మల్లన్న– మా చెంతకే’ కార్యక్రమంలో భాగంగా భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు వైభవంగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. గురువారం సాయంత్రం ప్రకాశం జిల్లా చింతల చెంచుగూడెంలో శోభయాత్ర అనంతరం కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణోత్సవంలో భాగంగా ముందుగా స్వామిఅమ్మవార్లకు ప్రవర పఠించి, వరపూజ నిర్వహించి బాషికాలను అలంకరించారు. తరువాత భూమండలం, శ్రీశైల క్షేత్ర వర్ణనతో కూడిన మహాసంకల్పం పఠించారు. అర్చకులు మంగళాష్టకాలను పఠిస్తూ సుముహూర్త సమయంలో స్వామిఅమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సమర్పించారు. లోకకల్యాణం కోసం అమ్మవారికి మాంగళ్యధారణ జరిపి, స్వామిఅమ్మవార్లకు తలంబ్రాలను సమర్పించారు. స్వామిఅమ్మవార్ల వస్త్రాల కొంగులను కలుపుతూ బ్రహ్మముడి వేశారు. స్వామిఅమ్మవార్లకు పునఃపూజలు జరిపి, ఆశీర్వచనం, భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. -
దేవుడి భూమి స్వాహా!
అన్యాక్రాంతం నందవరం: రెవెన్యూ రికార్డులు కాదని కొందరు దేవుడి భూమిని సొంతంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఆ భూమిని పాతికేళ్లుగా అనుభవిస్తూ దర్జాను ప్రదర్శిస్తున్నారు. ఇటీవల జరిగిన రీ సర్వేతో వారి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నందవరం మండలం నదికై రవాడి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయానికి 23.97 ఎకరాల భూమి ఉంది. గ్రామం తూర్పు భాగంలో తుంగభద్రనదీ తీరంలో ఈ భూములు ఉన్నాయి. ఇక్కడ ఎకరా ధర రూ.20 లక్షలకు పైగా పలుకుతోంది. ఇలాంటి విలువైన భూమిని కొందరు సెట్లర్స్(వేరే ప్రాంతం నుంచి వచ్చి గ్రామంలో ఉండేవారు) ఆక్రమణదారులతో కలిసి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారు. ఇబ్రహీంపురం కొట్టాలకు చెందిన సత్యనారాయణ, కృష్ణమూర్తిలతో దేవుడికి అర్చకులని చెప్పి షణ్ముఖ, వీరభద్రప్పలు మాన్యం భూమిని అనుభవిస్తున్నారు. వీరందరూ కలిసి మాన్యాన్ని అనుభవిస్తూనే రికార్డులు మార్చేశారు. కృష్ణమూర్తి 6 ఎకరాలు, సత్యనారాయణ 6 ఎకరాలు, వీరభద్రప్ప 5.93 ఎకరాలు, షణ్ముక 5.94 ఎకరాల చొప్పున అనుభవంలో ఉన్నట్లు చూపించుకున్నారు. సర్వేకు అడ్డంకులు దేవుడి మాన్యం ఆక్రమణ అయ్యిందని రీ సర్వేలో బయట పడింది. దీంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్కు, తహసీల్దార్కు వినతి పత్రాలు అందజేశారు. ఈ భూమిని రికార్డుల ఆధారంగా సర్వే చేసి తమకు స్వాధీన పరచాలని రెవెన్యూ అధికారులకు ఎండోమెంట్ అధికారులు విన్నవించుకున్నారు. విన్నపం మేరకు ఈ నెల 2న (శనివారం) మండల సర్వే అధికారి అక్బర్బాషా, గ్రామ సర్వేయర్లతో కలిసి సర్వే చేయడానికి వెళ్లగా అనుభవదారులు అడ్డుచెప్పారు. సర్వేకు దేవదాయ శాఖ అధికారులు రాకపోవడంతోపాటు రాజకీయ నాయకుల ఒత్తిళ్లు అడ్డంకిగా మారాయి. దేవదాయ శాఖ, రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేపట్టి భూమి దేవుడికి చెందేలా చూడాలి. గ్రామంలో ఆంజనేయ స్వామికి నిత్య పూజలు కరువయ్యాయి. ఆలయానికి సంబంధించి 23.97 ఎకరాలు దేవుడికి అప్పగిస్తే బాగుంటుంది. – ఈడిగ వేణు ఆక్రమణదారుల నుంచి దేవుడి మాన్యం విడిపించేంత వరకు పోరాడతాం. దేవదాయశాఖ, రెవెన్యూ, సర్వే అధికారులు గ్రామానికి వచ్చి సర్వే చేసి హద్దులు చూపించాలి. లేకపోతే విశ్వహిందూ పరిషత్తో కలిసి ఆందోళన తీవ్రతరం చేస్తాం. ఇప్పటికై నా అధికారులు స్పందించి సర్వే చేపట్టాలి. – బోయ వెంకటేష్ -
విద్యాసంస్థల బస్సులు తనిఖీ
● భద్రతా లోపాలున్న 61 బస్సులకు నోటీసులు జారీ కర్నూలు: పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభ తేదీ దగ్గర పడుతుండటంతో రవాణా శాఖ అధికారులు బడి బస్సుల తనిఖీలు విస్తృతం చేశారు. డిప్యూటీ కమిషనర్ శాంతకుమారి ఆదేశాల మేరకు ఎంవీఐలు, ఏఎంవీఐలు నాలుగు బృందాలుగా ఏర్పడి జిల్లాలో విద్యాసంస్థలకు చెందిన బస్సులపై సమగ్ర తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 582 పైగా విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. ఇప్పటివరకు 38 విద్యాసంస్థలను సందర్శించి 168 పాఠశాలలు, కళాశాలల బస్సులను అధికారులు తనిఖీ చేశారు. ఈనెల 15లోపు ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాలని తనిఖీ సందర్భంగా అధికారులు ఆదేశిస్తున్నారు. భద్రతా లోపాలున్న 61 బస్సులకు లోపాల ను సరిచేసుకోవాలని నోటీసులు జారీ చేశారు. అగ్నిప్రమాద భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. -
పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు
కర్నూలు: పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి సూచనల మేరకు స్థానిక పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనున్న హోప్ ఆఫ్ హోమ్లో పొక్సో యాక్ట్పై గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు పొక్సో చట్టం గురించి వివరించారు. 18 సంవత్సరాల్లోపు వయస్సు పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడకుండా పొక్సో యాక్ట్ ఉపయోగపడుతుందన్నారు. కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టు ఉందన్నారు. పిల్లలకు ఏదైనా సమస్య వస్తే లీగల్ సర్వీసెస్ టోల్ఫ్రీ నంబర్ 15100కు కాల్ చేస్తే పరిష్కరిస్తామన్నారు. ఐసీడీఎస్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, జాగృతి యూనిట్ సభ్యుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘ఆరు’ విధాలుగా మేలు
● 30 సెంట్లలో ఆరు రకాల ఆకుకూరల సాగు ● రోజు రూ.800 నుంచి రూ.1,200 వరకు ఆదాయం సి.బెళగల్: అహోరాత్రులు శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న సమయంలో పోలకల్ గ్రామానికి చెందిన రైతు బూడిదపాడు మద్దిలేటి వినూత్నంగా ఆలోచించారు. తన ఎకరా పామాయిల్ తోటలో అంతర పంటలుగా ఆరు రకాల ఆకుకూరలను సాగు చేస్తున్నారు. మంచి దిగుబడి, రాబడి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తోటలో గతంలో అంతర పంటగా ఉల్లి పంటను సాగుచేయడంతో నష్టాలు వచ్చాయి. నష్టాల నుంచి బయటపడేందుకు తోటలో 30 సెంట్ల భూమిలో ఆరు రకాల ఆకుకూరలను పండించాలని సంకల్పించారు. తన సతీమణి అనంతమ్మతో కలసి పొలంలో పాలకూర, తోటకూర, గోంగూరు, కొత్తిమీర, మెంతికూర, చిరుకూర విత్తనాలను చల్లారు. ఆకుకూరల పంటలు త్వరగా కోతలకు రావడంతో ప్రతిరోజు పనులను చేసుకుంటూ బిజీగా గడుపుతున్నారు. ప్రతిరోజూ కోతలు కోసుకుని సొంతంగా గ్రామాల్లో తిరుగుతూ అమ్ముకుని అధిక లాభాలు పొందుతున్నారు. రోజుకు రూ.800 నుంచి రూ.1,200ల వరకు ఆదాయం వస్తున్నట్లు రైతు మద్దిలేటి తెలిపారు. -
భార్య హత్య కేసులో భర్త అరెస్ట్
బనగానపల్లె: భార్య హత్యకేసులో భర్త కొండగాళ్ల వెంకటస్వామిని గురువారం అరెస్టు చేసినట్లు బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్రెడ్డి తెలిపారు. అతని సోదరులను కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. స్థానిక సీఐ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. బీరవోలు గ్రామానికి చెందిన వెంకటస్వామికి కొంత కాలంగా భార్య లక్ష్మీపై అనుమానం ఎక్కువైంది. గత నెల 29న కూలి పనికి వెళ్దామని భార్యను నమ్మించి తన మోటార్సైకిల్పై గ్రామ చివర ఉన్న గాలేరు నగరి కాల్వ వద్దకు వెళ్లారు. అక్కడే భార్యతో గొడవపడి హత్య చేసి మృతదేహానికి రాయి కట్టి పక్కనే ఉన్న బావిలో వేశాడు. రెండు రోజుల తరువాత అనుమానం వచ్చిన వెంకటస్వామి మళ్లీ బావి వద్దకు వెళ్లి చూడగా మృతదేహం తేలియాడుతూ కనిపించింది. తన సోదరులైన వెంకటరమణ, శ్రీనివాసులను బావి వద్దకు తీసుకెళ్లి మృతదేహాన్ని బయటికి తీసి పక్కనే పూడ్చివేశారు. ఈనెల 2న మృతురాలి తల్లి నంద్యాల దేవనగర్కు చెందిన రాజోలి సుబ్బలక్ష్మీ తన కుమార్తె కనిపించడం లేదని, తన అల్లుడిపై అనుమానం ఉందని నందివర్గం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడు వెంకటస్వామి పరారీలో ఉండగా సోదరులు వెంకటరమణ, శ్రీనివాసులను అదుపులోకి తీసుకొని విచారించగా నిజాన్ని ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు వెంకటస్వామితో పాటు సోదరులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచినట్లు సీఐ చెప్పారు. -
పేదల బియ్యం.. పెద్దల భోజ్యం
రాజకీయనేతల ఒత్తిళ్లకు భయపడి! కర్నూలు(సెంట్రల్): పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం బడాబాబుల దరికి చేరుతోంది. అక్రమంగా సేకరించిన బియ్యాన్ని కర్నూలుకు 18 కిలోమీటర్ల దూరంలో నిల్వ ఉంచుతున్నారు. ఇందుకోసం నిర్జన ప్రాంతంలో గోదాము ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి నుంచే అక్రమ బియ్యం వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. కర్నూలుకు 18 కిలోమీటర్ల దూరంలోని గార్గేయపురం–నూతనపల్లెల మధ్య జాతీయ రహ దారి 340సీ నుంచి దాదాపు కిలోమీటర్ దూరంలో ఈ గోదాము కనిపిస్తుంది. ఇందులో ఐదారు లారీల బియ్యాన్ని ఏక కాలంలో నిల్వ చేయవచ్చు. మనుషు లు కూడా సరిగా సంచరించని ఈ ప్రాంతంలో అక్రమ వ్యాపారానికి అనువుగా ఉంటుందని నిర్మించారు. ఇక్కడి నుంచి చౌక ధరల దుకాణాల డీలర్లు, ప్రజల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని నిల్వ చేసి జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ గోదాములో కర్నూలు నగరం, కర్నూలు రూరల్ మండలం, కల్లూరు మండలం, మిడుతూరు, నందికొట్కూరు ప్రాంతాల్లో అక్రమ మార్గాల ద్వారా సేకరించిన బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. ముఖ్యంగా రేషన్ షాపుల డీలర్లు, ఇంటింటికీ వచ్చి బియ్యాన్ని కొనుగోలు చేసే వ్యాపారులు ఇక్కడకి వచ్చి విక్రయాలు చేస్తారని తెలుస్తోంది. బియ్యం అక్రమ వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు పదే పదే చెబుతుంటారు. రేషన్ బియ్యాన్ని అమ్మినా..కొనుగోలు చేసినా చట్టరీత్యా నేరమని చెబుతుంటారు. అయితే అక్రమ బియ్యం వ్యాపారం కళ్లముందే జరుగుతున్నా రాజకీయనేతల ఒత్తిళ్లు, డబ్బుకు ఆశపడి అక్రమార్కులకే సహకరిస్తున్నారన్నది బహిరంగ సత్యం. ప్రస్తుతం అక్రమ బియ్యం డంపుపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో తెలియడంలేదు. -
రాయరు సన్నిధిలో భక్తుల సందడి
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో గురువారం భక్తుల సందడి నెలకొంది. రాఘవేంద్రస్వామి ప్రత్యేక దినం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వా మి సేవలో తరించారు. భక్తుల రాకతో శ్రీ మఠంలో రద్దీ కనపించింది. మూల బృందావ న దర్శనానికి రెండు గంటలకు పైగా సమ యం పట్టింది.రాయరు దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. తుంగభద్ర నదీ తీరంలో భక్తుల కోలాహలం నెలకొంది. వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల రాక అధికమైంది. 8న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు కర్నూలు(అర్బన్): జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 8న నిర్వహిస్తున్నట్లు సీఈఓ జీవీ రమణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు సమావేశాలను ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశాల్లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య, వైద్యం, మహిళాభివృద్ధి–శిశు సంక్షేమం, పనులు, ఆర్థిక ప్రణాళిక అంశాలపై చర్చిస్తామన్నారు. సమావేశాలకు స్థాయి సంఘాల సభ్యులు, కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు వారికి కేటాయించిన సమాయానికి హాజరు కావాలని సీఈఓ కోరారు. ఆర్ఆర్బీ, ఏపీ హైకోర్టు పరీక్షలకు ఉచిత శిక్షణ కర్నూలు(అర్బన్): రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు–లోకో పైలెట్, గ్రూప్–డీ, ఏపీ హైకోర్టు –2026 రిక్రూట్మెంట్ పరీక్షలకు ఉమ్మడి జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల అభ్యర్థులకు స్థానిక ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణను అందిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.ప్రసూన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 20లోగా ఏపీ బీసీ స్టడీ సర్కిల్, కల్లూరు తహసీల్దార్ కార్యాలయం, అబ్బాస్నగర్, కర్నూలు చిరునామాలో అందించాలన్నారు. వంద మంది అభ్యర్థులకు 2 నెలలు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు. ఎస్ఎస్సీ, డిగ్రీలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తాన్నారు. ఈ నెల 25వ తేది నుంచి శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఇతర వివరాలకు 08518–236076, 9652093661 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. 21 నుంచి ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లమెంటరీ పరీక్షలు ఈ నెల 21 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకెండియర్ పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 25,819 మంది విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లించారు. పరీక్షలకు మొత్తం 57 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్స్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు, గైర్హాజరైన వారికి వచ్చే నెల 7 నుంచి 11వ తేదీ వరకు కేవలం జిల్లా కేంద్రంలోని జనరల్ ప్రభుత్వ జూనియర్(టౌన్ మోడల్)కాలేజీ, వొకేషనల్ విద్యార్థులకు మూడు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అధ్యాపక నియామక నోటిఫికేషన్లు రద్దు కర్నూలు కల్చరల్: డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వ విద్యాలయంలో ఖాళీగా ఉన్న 63 అధ్యాపక పోస్టుల భర్తీకి 2023లో జారీ చేసిన నియామక నోటిఫికేషన్లు రద్దు చేసినట్లు వర్సిటీ ఇన్చార్జి వైస్ ఛాన్స్లర్, వర్సిటీ ఎఫ్ఏసీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ షావలి ఖాన్ తెలిపారు. డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వ విద్యాలయం కార్యనిర్వాహక మండలి తీర్మానం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 69, తేదీ 06.05.26 మేరకు అధ్యాపక పోస్టుల భర్తీకి ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం ఉపసంహరించుకుందన్నారు. ఆయా నోటిఫికేషన్ల కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్ ఫీజు రీఫండ్ వివరాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ https://ahuuk.ac.in లో తెలుసుకోవచ్చన్నారు. టీబీ డ్యాంలో 10 టీఎంిసీల నీరు హొళగుంద: తుంగభద్ర డ్యాంలో గురువారం ఉదయం నాటికి 105.788 టీఎంసీలకు గాను 10.190 టీఎంిసీల నీరు నిల్వ ఉంది. తుంగభద్ర దిగువ(ఎల్లెల్సీ) కాలువలో గురువారం నీటి ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది. టీబీ డ్యాంకు ఇన్ఫ్లో జీరో ఉండగా అవుట్ఫ్లో 454 క్యూసెక్కులుంది. -
మల్లన్న సేవలో శ్రీశైల జగద్గురు పీఠాధిపతి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్దరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. గురువారం మల్లన్న దర్శనార్థం విచ్చేసిన పీఠాధిపతికి ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ప్రధానార్చకులు శ్రీశైల జగద్గురు పీఠాధిపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద ఉన్న ఆశీర్వచన మండపంలో పీఠాధిపతి గౌరవార్థం అర్చకులు, వేదపండితులు వేదగోష్టి నిర్వహించారు. -
ఏఐఎస్–63 ప్రమాణాలు విధిగా పాటించాలి
జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల యాజమాన్యాలు తమ బస్సుల్లో ఏఐఎస్–63 ప్రమాణాలు విధిగా పాటించాలి. భద్రత లోపాలు ఉన్న బస్సులకు నోటీసులు జారీ చేసి వారం గడువు ఇస్తున్నాం. ఆ తర్వాత కూడా లోపాలు సరిచేయకపోతే మోటార్ వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. బడి బస్సుల భద్రతలో వాటి యాజమాన్యాలు కూడా సమాన బాధ్యత వహించాలి. రాబోయే రోజుల్లో ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయి. – శాంతకుమారి, డీటీసీ -
గోనెగండ్ల పంచాయతీకి ఐఎస్ఓ గుర్తింపు
గోనెగండ్ల: మెరుగైన సేవలతో గోనెగండ్ల మేజర్ గ్రామ పంచాయతీకి ఐఎస్ఓ గుర్తింపు లభించింది. టీక్యూఎస్ సంస్థ సభ్యులు పీఎం ప్రేమానంద్, ఆడిటర్ ఇమామ్, సాయికృష్ణ గురువారం గోనెగండ్ల మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 52 గ్రామపంచాయతీలు ఐఎస్ఓ సర్టిఫికెట్కు ఎంపికయ్యాయన్నారు. వాటిలో మొదటి విడతలో 24 పంచాయతీలు ఐఎస్ఓ సర్టిఫికెట్లు పొందేందుకు అర్హత పొందాయని తెలిపారు. ఇందులో భాగంగా 19వ పంచాయతీగా గోనెగండ్ల గుర్తింపు పొందిందన్నారు. అనంతరం కార్యాలయంలో మండల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కార్యదర్శి సతీష్కు ఐఎస్ఓ సర్టిఫికెట్ను అందజేశారు. డిప్యూటీ ఎంపీడీఓ అనంతసేన, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అటవీ సంరక్షణ అందరి బాధ్యత కర్నూలు కల్చరల్: అటవీ సంరక్షణ అందరి బాధ్యత అని కర్నూలు సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బీవీఏ కృష్ణమూర్తి అన్నారు. సర్కిల్ కార్యాలయంలో రెనోవేషన్ చేసిన అటవీ శాఖ గెస్ట్ హాస్ను డీఎఫ్ఓ పి. శ్యామలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎఫ్ మాట్లాడుతూ.. రూ. 34 లక్షలతో సర్కిల్ కార్యాలయం, మీటింగ్ హాల్, గెస్ట్ హౌస్లను రెనోవేషన్ పనులు చేపట్టి ఆధునీకరించామన్నారు. కార్పొరేట్ స్థాయిలో కార్యాలయాన్ని తీర్చిదిద్దామన్నారు. కర్నూలు డివిజన్లోని నగర వనాల్లో ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టామన్నారు. కర్నూలు, ఆదోని రేంజ్ ఆఫీసర్లు ప్రియాంక, తేజశ్వి, అకౌంట్స్ ఆఫీసర్ అబ్దుల్ సుభాన్, డీఆర్వోలు ఓబులేస్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లెలో ఓ వివాహిత గురువారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన కొప్పుల సుధాకరరెడ్డి రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీలో జేసీబీ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. కొలిమిగుండ్లలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మో త్సవాలకు భార్య సౌజన్య (35)తో కలిసి బంధువుల ఇంటికి వచ్చారు. బుధవారం రాత్రి దంపతులిద్దరూ స్వగ్రామానికి వెళ్లి పోయారు. నిద్ర మధ్యలో లేచి సౌజన్య ఉరి వేసుకుంది. కొద్ది సేపటి తర్వాత భర్త గమనించి చూడగా అప్పటికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలు సేకరించారు. సౌజన్య చాలా రోజుల నుంచి తల నొప్పితో బాధపడుతుందని, భరించలేకనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి చెన్నపురెడ్డి సంజీవరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మల్లెవేములలో భారీ చోరీ చాగలమర్రి: మండలంలోని మల్లెవేముల గ్రా మంలో భారీ చోరీ జరిగింది. రూ.15.50 లక్షల విలువైన 10 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని బాధితుడు గోపిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. తామంతా నిద్రిస్తుండగా బుధవారం అర్ధరాత్రి ఇంటి వెనుక వైపున ఉన్న తలుపులను తెరుచుకొని దుండగులు ఇంట్లోకి వచ్చారన్నారు. బీరువాను పగుల గొట్టి అందులో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ట్లు చెప్పారు. ఆళ్లగడ్డ రూరల్ సీఐ వెంకట రమణ సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంను ర ప్పించారు. వేలి ముద్రలను సేకరించి, కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వృద్ధుడి ఆత్మహత్య కోవెలకుంట్ల: పట్టణంలోని సుంకులమ్మ దేవాలయ సమీపంలో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గురువారం ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. కాలనీకి చెందిన నరసింహుడు(85) కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఈ నెల 2వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుని కుమారుడు లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ట్రాక్టర్ నుంచి కిందపడి వ్యక్తి మృతి ఓర్వకల్లు: పొలానికి మట్టిని తరలిస్తున్న ఓ వ్యక్తి ట్రాక్టర్పై నుంచి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఉయ్యాలవాడ గ్రామ సమీపంలో చేసుకుంది. మీదివేముల గ్రామానికి చెందిన ఎల్లయ్య(58) తన పొలానికి నల్లమట్టిని తరలించేందుకు అదే గ్రామానికి చెందిన బోయ కృష్ణకు చెందిన ట్రాక్టర్ను గురు వారం అద్దెకు తీసుకున్నాడు. వెల్దుర్తి మండలం బ్రహ్మగుండం చెరువు నుంచి మట్టిని తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మార్గమధ్యలో ఉయ్యాలవాడ గ్రామ సమీపంలోని లింగమయ్య కుంట వద్ద డ్రైవర్ పక్కన కూర్చు న్న ఎల్లయ్య ప్రమాదవశాత్తు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. మృతదేహాన్ని కర్నూలు ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్లు ఎస్ఐ సునీల్కుమార్ తెలిపారు. -
25, 26 తేదీల్లో ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె
కర్నూలు(అర్బన్): స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ దేశ వ్యాప్తంగా ఈ నెల 25, 26వ తేదీల్లో రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చినట్లు కర్నూలు మాడ్యూల్ డీజీఎస్ పి.విద్యాసాగర్ తెలిపారు. గురువారం స్థానిక మాడ్యూల్ కార్యాలయంలో సమ్మెకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ బ్యాంకు యాజమాన్యానికి సమ్మె నోటీసు అందించారన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల యాజమాన్యం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యవైఖరికి వ్యతిరేకంగా ఈ సమ్మె నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పేద, వెనుకబడిన వర్గాలకు ఉద్యోగ అవకాశాలను కల్పించాల్సిన సామాజిక బాధ్యతను బ్యాంకు విస్మరిస్తోందన్నారు. బ్యాంకులో శాశ్వత స్వభావం కలిగిన పనులను అవుట్ సోర్సింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమన్నారు. కార్యక్రమంలో ఏజీఎస్లు పి.శ్రీకాంత్, కె.ప్రవీణ్, అసిస్టెంట్ ట్రెజరర్ ఎన్.శ్రీకాంత్ పాల్గొన్నారు. -
కంటి ఆసుపత్రిలో ఉద్యోగులే దళారులు!
● కంటి అద్దాలకు బయటి దుకాణాలకు రెఫర్ కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో ఉద్యోగులే దళారుల అవతారం ఎత్తారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి కంటి అద్దాలను వైద్యులు సూచించగా, వాటిని ఫలానా దుకాణంలో తీసుకోవాలంటూ కొందరు ఉద్యోగులు చెప్పి మరీ పంపుతున్నారు. కొందరు ఉద్యోగులైతే ఒక తెల్లకాగితంపై దుకాణం పేరు కూడా రాసి ఇస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రిలో కంటి పరీక్షలు చేయించుకుని, దృష్టిలోపం ఉన్న వారికి కంటి అద్దాలు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలా వైద్యులు సూచించిన మేరకు అద్దాలను జగనన్న కంటి వెలుగు కార్యక్రమం కింద ఉచితంగా తయారు చేసి పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పథకంను తీసివేశారు. అప్పటి నుంచి కంటి అద్దాలను రోగులు బయట కొనుగోలు చేస్తున్నారు. ఇలా వైద్యులు సూచించిన అద్దాలను రోగులే వారికి నచ్చిన దుకాణంలో కొనుగోలు చేసుకోవాలి. కానీ ఆసుపత్రిలో పనిచేసే కొందరు ఉద్యోగులు దళారుల అవతారం ఎత్తారు. ప్రైవేటు ఆప్టికల్స్ షాపులకు వీరే రోగులను పంపిస్తున్నారు. కొందరు దుకాణదారులు ఆసుపత్రిలోకి వచ్చి రోగులను వెంటబెట్టుకుని మరీ తీసుకెళ్తున్నారు. ఇలా రోగులను దుకాణాలకు పంపినందుకు గాను సదరు ఉద్యోగులకు తగిన మొత్తాన్ని అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణరెడ్డి వివరణ ఇస్తూ.. త్వరలో రోగులకు ఉచితంగా కంటి అద్దాలను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తోందని తెలిపారు. ఆసుపత్రిలో రోగులను బయట దుకాణాలకు పంపే ఉద్యోగులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. -
ఈతకు వెళ్లి..
నందికొట్కూరు: మండలంలోని బిజినవేముల గ్రామంలో ఈతకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. నందికొట్కూరు పట్టణంలోని ట్యాంక్ ఏరియాకు చెందిన షేక్ మహమ్మద్ అర్షద్ (33) మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బిజినవేముల గ్రామ సమీపంలోని తిరుపతయ్యకు చెందిన వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లాడు. అయితే, ప్రమాదవశాత్తు అర్షద్ నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు గమనించి వెంటనే విషయం కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు బావి వద్దకు చేరుకొని గాలించగా విగతజీవిగా కనిపించాడు. నీటిలో నుంచి బయటకు తీసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య రేష్మా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి మహానంది: నంద్యాల నుంచి మహానంది వెళ్లే మార్గంలో ఆటో బోల్తా పడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. అబ్బీపురం గ్రామానికి చెందిన డమాల రవితేజ (20) ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. బుధవారం రాత్రి బుక్కాపురం గ్రామానికి వెళ్లి ఒక్కడు తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈఘటనలో తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతిచెందాడు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య రుద్రవరం: మండలంలోని మందలూరు గ్రామంలో సంజీవరాయుడు (43) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులతో గొడవ జరగడంతో తీవ్ర మనస్థాపం చెందాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య పద్మావతి, కుమార్తె, కొడుకు ఉన్నారు. మృతుడి తండ్రి సుంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జయప్ప తెలిపారు. ఎరువు దుకాణాల లైసెన్స్ రద్దు రుద్రవరం: మండలంలోని ఆలమూరు, మచినేనిపల్లె గ్రామాల్లోని మూడు రసాయన ఎరువుల దుకాణాల లైసెన్స్లు రద్దు చేసినట్లు వ్యవసాయాధికారి సుమతి తెలిపారు. వ్యవసాయ పనులు ముగిశాక ఎరువులు విక్రయిస్తున్నారన్న సమాచారంతో బుధవారం ఆలమూరులోని ప్రణవి ట్రేడర్స్, మాచినేనిపల్లెలోని శ్రీ విజయలక్ష్మి, శ్రీ బిందు ఏజెన్సీల్లో తనిఖీలు నిర్వహించారు. ఎరువులు విక్రయించినట్లు తేలడంతో వాటి లైసెన్స్లను పది రోజుల పాటు రద్దు చేసినట్లు ఏఓ తెలిపారు. -
హోరాహోరీగా బేస్బాల్ పోటీలు
● 23 జిల్లాల నుంచి 850 మంది క్రీడాకారుల హాజరుగోనెగండ్ల: మండల కేంద్రం గోనెగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్రస్థాయి ఏడో సబ్ జూనియర్ బేస్బాల్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. బుధవారం ప్రారంభమైన ఈ పోటీలకు ఏపీలోని 23 జిల్లాల నుంచి 850 మంది క్రీడాకారులు (బాలికలు, బాలురు) హాజరయ్యారు. బాలుర విభాగంలో నెల్లురు జిల్లా జట్టు, ప్రకాశం టీమ్పై 6–0 తో, నంద్యాల జట్టు తిరుపతిపై 4–2 పాయింట్ల తేడాతో, కర్నూలుజట్టు గుంటూరుపై 4–0 పాయింట్లతో, బాపట్ల జట్టు కృష్ణాపై 2–0 పాయింట్లతో విజయం సాధించింది. అలాగే బాలికల విభాగంలో కృష్ణాజిల్లా జట్టు అనకాపల్లిపై 5–4 పాయింట్లతో, నెల్లూరు జట్టు బాపట్లపై 7–1 పాయింట్లతో, విశాఖపట్నం జట్టు ప్రకాశంపై 5–2 పాయింట్లతో, కర్నూలు జట్టు చిత్తూరుపై 10–1 పాయింట్లతో, నంద్యాల జట్టు సత్యసాయిపై 7–0 పాయింట్లతో, పల్నాడు జట్టు అనంతపురంపై 7–1 పాయింట్లతో, గుంటూరుజట్టు బాపట్లపై 7–6 పాయింట్లతో విజయం సాధించి క్వాటర్ ఫైనల్కు చేరుకున్నాయి. కార్యక్రమంలో రాష్ట్ర బేస్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మల్లికార్జున రెడ్డి, బేస్బాల్ లీగల్ అడ్వయిజర్ మాధవరావు, టోర్నమెంట్ అడ్వయిజర్ సుబ్బయ్య, కర్నూలు జిల్లా బేస్బాల్ యూనియన్ అధ్యక్షుడు శ్రీరాములు, కార్యదర్శి రమణ తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసుల సెటిల్మెంట్కు ప్రత్యేక లోక్ అదాలత్
కర్నూలు: సుప్రీం కోర్టులోని పెండింగ్ కేసుల సెటిల్మెంట్కు ఆగస్టు 21, 22, 23 తేదీల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ వ్యాప్తంగా మధ్యవర్తిత్వ తీర్పు, వివాదాల సామరస్యం కోసం సుప్రీం కోర్టు ఈ చర్య చేపట్టిందన్నారు. సుప్రీం కోర్టులో పెండింగ్లోని చెక్బౌన్స్ కేసులు, ప్రమాదాలకు సంబంధించిన క్లెయిమ్లు, భూసేకరణ సమస్యలను కక్షిదారులు ప్రత్యేక లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవచ్చన్నారు. ఇందుకోసం ఆన్లైన్లో గూగుల్ ఫామ్ htt pr://www.sci.gov.in వెబ్సైట్ అందుబాటులో ఉందన్నారు. ఫిర్యాదుదారులు, కక్షిదారులు వారి అంగీకారంతో, వారి న్యాయవాదులతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించే సెటిల్మెంట్ సమావేశాలకు ప్రత్యేకంగా కానీ, వర్చువల్గా కాని హాజరుకావచ్చన్నారు. వివరాలకు టోల్ఫ్రీ నెంబర్ 15100, 08518–248828 నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. -
రూ.100 కోట్ల ఆర్ అండ్ బి స్థలంలో టీడీపీ కార్యాలయమా?
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డికర్నూలు(టౌన్): నగరంలోని సి.క్యాంపు ప్రాంతంలో రూ.100 కోట్ల విలువ చేసే 2 ఎకరాల ఆర్ అండ్ బి స్థలంలో టీడీపీ కార్యాలయం నిర్మించడమేంటని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి ఽప్రశ్నించారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే గాయత్రి ఎస్టేట్లో కార్యాలయం ఉందని, మళ్లీ రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలంలో మరో కార్యాలయం అవసరమేంటన్నారు. ఆర్ అండ్ బి స్థలంలో ప్రస్తుతం అక్కడ ఉన్న వారిని తరలించి హడావుడిగా భూమి పూజ చేయడం అమానుషమన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను కూల్చి పార్టీ కార్యాలయాలను నిర్మించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. పార్టీ పేరుతో ఆర్ అండ్ బి స్థలంలో షాపులు నిర్మించి అద్దెకు ఇవ్వాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. 100 సంవత్సరాల పురాతన వృక్షాలను తొలగించడం పర్యావరణాన్ని హరించడమేనన్నారు. ఎంతో విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటినే రాజకీయ ప్రయోజనాలకు వినియోగించడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని అడ్డుకోలేదా? ఆర్ఎస్ రోడ్డు సమీపంలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న నిరుపయోగ స్థలంలో ఆనాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించతలపెట్టిందన్నారు. అయితే అప్పట్లో టీడీపీ నేతలు నానా యాగీ చేశారన్నారు. ఎన్నో అడ్డంకులు సృష్టించారన్నారు. 90 శాతం పనులు పూర్తయి, హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ భవన నిర్మాణాన్ని టీడీపీ నేతలు అడ్డుకోలేదా అని ప్రశ్నించారు. అనాడు వైఎస్సార్సీపీ కార్యాలయ భవనం విషయంలో ఇబ్బందులు సృష్టించినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ పేరు చెప్పి షాపులు నిర్మించుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేదని గుర్తు చేశారు. ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. -
ఉల్లికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలి
కోడుమూరు రూరల్: రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులంతా భారీగా ఉల్లి పంట సాగు చేయకుండా ప్రత్యామ్నాయంగా ఇతర కూరగాయల పంటలు సాగు చేసుకోవాలని జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని వెంకటగిరి, గోరంట్ల గ్రామాల్లో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మిశ్రమ పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తిగా ఉల్లిపంటపై ఆధారపడకుండా మిశ్రమ పంటలను సాగు చేసుకోవాలని చెప్పారు. పత్తి, వాముతో పాటు స్వల్పకాల పంటలైన కూరగాయలు వేసుకోవాలని చెప్పారు. కోడుమూరు ఉద్యాన అధికారి మధన్మోహన్ మాట్లాడుతూ పొలాల్లో నీటినిల్వ కుంటలను ఏర్పాటు చేసుకుంటే పంటల ఉత్పాదకత మెరుగుపడుతుందన్నారు. కార్యక్రమంలో ఏఈఓ బాలక్రిష్ణ, గ్రామ ఉద్యాన సహాయకులు ఇందు, ప్రియాంక, హరిప్రసాద్, సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
భక్తి చిత్రం...భుక్తి మార్గం!
● భక్తుల వాహనాలపై అధ్యాత్మిక బొమ్మలు గీస్తూ జీవనోపాధి ● ఇదంతా శ్రీశైలేశుడి చలువే అంటున్న చిత్రకారులు 12 సంవత్సరాల నుంచి వాహనాలపై బొమ్మలు వేయడాన్ని వృత్తిగా చేసుకున్నాను. మా బొమ్మలను మెచ్చి భక్తులు ఇచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. పెద్దగా చదువుకోని మేము శ్రీశైలం మల్లికార్జున స్వామినే నమ్ముకుని జీవిస్తున్నాము. ఆయనే మాకు చిత్రకారుడిగా మార్చి ఉపాధి చూపుతున్నాడు. – చందు నాయక్, చిత్రకారుడు అధ్యాత్మిక బొమ్మలు గీయడానికి మేము పెద్ద ఆర్టిస్టులము కాదు. మాకు ఎవరు గురువులు లేరు. ఒకరిని చూసి మరొకరం నేర్చుకున్నాం. స్వామి దయ వలన ఆయన సన్నిధికి వచ్చే భక్తుల వాహనాలపై చిత్రాలు గీసి జీవనోపాధి పొందుతున్నాం. కొంత మంది భక్తులు మా కళను మెచ్చుకున్నప్పుడు ఎనలేని సంతోషం కలుగుతోంది. – సతీష్, చిత్రకారుడుశ్రీశైలంటెంపుల్: త్రిశూలం, శివలింగం, శివపార్వతులు ఇలాంటి మరెన్నే భక్తి బొమ్మలు.. వేప పుల్లనే కుంచెగా మలుచుకుని క్షణాల్లో కళాత్మకంగా గీస్తూ అబ్బురపరుస్తున్నారు. ఇదేలా సాధ్యమంటే.. శ్రీశైలేశుడు ప్రసాదించిన కళ అంటారు ఆ చిత్రకారులు. ఇల కై లాసమైన శ్రీగిరిలో భక్తుల వాహనాలపై ఆధ్యాత్మిక చిత్రాలు గీస్తూ వందమందికిపైగా జీవనోపాధి పొందుతున్నారు. శ్రీశైల క్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకుని తిరిగి వెళ్లేటప్పుడు తమ వాహనాలపై అధ్యాత్మిక చిత్రాలు వేయించుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు.దీంతో శ్రీశైలంలోని వివిధ ప్రదేశాల్లో వాహనాల పై భక్తి బొమ్మలు వేయడం వృత్తిగా చేసుకున్నారు. చకచకా పార్కింగ్ ప్రదేశాల్లో భక్తుల వాహనాలను శుభ్రం చేసి వాటి అద్దాలపై అధ్యాత్మిక బొమ్మలు గీస్తారు. వేపపుల్లను కుంచెగా చేసుకొని విభూది, కుంకుమ, నీలం, అకుపచ్చ నంగులను ఉపయోగిస్తూ త్రిశూలం, శివలింగం, శివపార్వతులు, పుష్పాలు, మయూరం తదితర చిత్రాలు వేస్తారు. వారి కళను మెచ్చి వాహనదారులు ఎంతోకొంత డబ్బులు ఇస్తారు. సాధారణ రోజుల్లో కంటే రద్దీ రోజులైన శని, ఆది, సోమవారాల్లో వాహనాల్లో భక్తులు అధికంగా వస్తారు. ఆ సమయంలో చిత్రకారులకు చేతినిండా పని ఉంటుంది. -
ఆవును ఢీకొని..
ఆళ్లగడ్డ: మండల పరిధిలోని బత్తలూరు గ్రామం వద్ద జాతీయ రహదారిపై అవును ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. వివరాలు.. మండల కేంద్రం శిరివెళ్లకు చెందిన లింగప్రసాద్ (45) అనే వ్యక్తి ఆళ్లగడ్డలో జరుగుతున్న ఓ ఫంక్షన్కు హాజరయ్యేందుకు మోటర్సైకిల్ పై బయలు దేరగా నల్లగట్ల సమీపంలోకి వచ్చేసరికి కుటుంబ సభ్యులు ఫోన్ చేసి వెంటనే శిరివెళ్లకు రావాలని చెప్పారు. దీంతో నల్లగట్ల నుంచి శిరివెళ్లకు బయలు దేరగా బత్తలూరు సమీపంలోని జాతీయ రహదారిపై నల్లని ఆవును గమనించకుండా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో లింగప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా వెనుక కూర్చుని ఉన్న శ్రీనివాసులు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ పోలీసులు తెలిపారు. -
క్యాన్సర్ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్
● వృద్ధురాలి కడుపులో నుంచి 10 కిలోల కణితి తొలగింపుకర్నూలు (టౌన్): కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ను విజయవంతంగా చేశారు. వృద్ధురాలి కడుపులో నుంచి ఏకంగా 10 కిలోల కణితి తొలగించారు. వివరాల్లోకి వెళితే.. వెలుగోడు పట్టణానికి చెందిన 75 ఏళ్ల సుబ్బలక్ష్మమ్మ ఆరు నెలలుగా కడుపు నొప్పి, ఉబ్బరంతో బాధపడుతుంది. పలు ఆసుపత్రుల్లో చూపించుకున్నా నొప్పి తగ్గ లేదు. దీంతో గత నెల 22 వ తేది స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు పరీక్షలు చేసి కడుపులో 30x25 సెంటీమీటర్ల పరిమాణం కలిగిన భారీ అండాశయ కణితిని గుర్తించారు. ఈనెల 1 వ తేదీన విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి ఆ కణితిని తొలగించారు. ప్రస్తుతం ఆమెకు నొప్పి తగ్గి ఆరోగ్యం కుదుట పడినట్లు వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స చేసిన వారిలో వైద్యులు నరేష్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ సర్జికల్ అంకాలజిస్టు సందీప్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ సర్టికల్ అంకాలజిస్టు భారతి, డాక్టర్లు సంధ్య, మాలిక్, కాంచనగౌరి, లక్ష్మి పాల్గొన్నారు. క్యాన్సర్ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. -
సంగపట్నంలో పది గడ్డివాములు దగ్ధం
అవుకు(కొలిమిగుండ్ల): మండల పరిధిలోని సంగపట్నంలో ప్రమాదవశాత్తు బుధవారం పది గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన శేఖర్రెడ్డి, శివశంకర్రెడ్డి,బత్తుల ఈశ్వరరెడ్డి,చిన్న బయపురెడ్డి,చిన్న వెంకటసుబ్బారెడ్డి, నూర్బాషా, మల్లు శివశంకర్రెడ్డి పశువుల మేత కోసం పది గడ్డివాములను నిల్వ చేసుకున్నారు. గడ్డివాములకు సమీపంలో మొక్క జొన్న కోతలు కోసి వేస్టేజ్ను పక్కకు పడేయంతో వాటికి నిప్పు పెట్టారు. క్రమేణా మంటలు గడ్డివాములకు అంటుకున్నాయి. అదుపు చేసేందుకు యత్నించినా లాభం లేకుండా పోయింది. పూర్తిగా గడ్డివాములు కాలిపోవడంతో సుమారు రూ.8లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు. నిలిచిపోయిన నీటి విడుదల గోనెగండ్ల: ఏపీవాట ఇండెంట్ పూర్తి కావడంతో తుంగభద్ర దిగువ కాలువకు నీటి విడుదలను డ్యామ్ అధికారులు నిలిపివేశారు. దిగువ ప్రాంతమైన గోనెగండ్ల సెక్షన్కు బుధవారం ఉదయం 10 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరింది. సాయంత్రానికి నీటి విడుదల పూర్తిగా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. తాగునీటి అవసరాల కోసం ఏప్రిల్ 1 నుంచి తుంగభద్ర దిగువ కాలువకు నీటి విడుదల కొనసాగింది. హత్య కేసుగా మారిన అదృశ్యం కేసు బనగానపల్లె: మండలంలోని బీరవోలు గ్రామానికి చెందిన లక్ష్మి(35) అదృశ్యం కేసు హత్య కేసుగా మారినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. గొల్ల వెంకటస్వామి భార్య లక్ష్మిపై భర్త అనుమానంతో వారం రోజుల క్రితం సోదరులు వెంకటరమణ, శ్రీనివాసులు సహకారంతో గ్రామ సమీపంలోని గాలేరు నగరి కాల్వ వద్దకు ఆమెను తీసుకెళ్లి అక్కడే చంపి పూడ్చివేశారు. అయితే ఏమీ తెలియనట్లు ఈ నెల 2న తన భార్య కనిపించడంలేదని వెంకటస్వామి నందివర్గం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. లక్ష్మి కొద్ది రోజులుగా అగుపించకపోవడంతో బంధువులు భర్తపై అనుమానం ఉందని, కేసు దర్యాప్తు చేయవలసిందిగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బనగానపల్లె సీఐ మంజునాథ్రెడ్డి, ఎస్ఐ భూపాలుడులు కేసు నమోదు చేసి విచారణ చేయగా.. వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మృతదేహం కుళ్లిపోవడంతో ఘటనా స్థలంలోనే పంచనామ, పోస్టుమార్టం చేశారు. భర్త వెంకటస్వామితో పాటు సోదరులు వెంకటరమణ, శ్రీనివాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అడుగుకో గుంత గోనెగండ్ల: మండల కేంద్రం గోనెగండ్ల నుంచి గంజిహళ్లి గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. అడుగడుగున గుంతలతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. గోనెగండ్ల నుంచి గంజిహళ్లి మీదుగా బైలుప్పల, బి. అగ్రహారం తదితర గ్రామాలకు ఈ దారిలోనే వెళ్లాలి. గంజిహళ్లి చెరువు నుంచి ఇటీవల టిప్పర్లలో ఎమ్మిగనూరుకు మట్టి తరలించారు. ఈ వాహనాలు అధికలోడ్తో ఇష్టనుసారంగా వెళ్లాడంతోనే రోడ్డు దెబ్బతినిందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి రహదారి బాగుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఉయ్యాలవాడలో పిడుగు ఉయ్యాలవాడ: మండలంలో బుధవారం సాయంత్రం భారీగా ఈదురు గాలులు వీచాయి. రాత్రి 7.15 గంటల సమయంలో మండల కేంద్రం ఉయ్యాలవాడలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. మండలకేంద్రంలో ఉన్న మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి స్వగృహం ఆవరణలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. ఈ ఘటనలో చెట్టు పోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పిడుగు పడిన శబ్ధానికి చుట్టు పక్కల ఇళ్లలోని ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. తర్వాత వారు సంఘటనా స్థలానికి చేరుకుని నీటితో మంటలను అదుపు చేశారు. ఏఎస్ఐ ప్రతాప్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అలాగే భారీగా గాలులు వీచడంతో మండలంలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. -
చెంచుగూడెంలో మల్లన్న కల్యాణోత్సవం
శ్రీశైలంటెంపుల్: హిందూ ధర్మప్రచారంలో భాగంగా బుధవారం శ్రీశైలంలోని మేకలబండ చెంచుగూడెంలో శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం నిర్వహించారు. ధర్మప్రచారంలో ముందుగా క్షేత్రపాలకుడైన బయలువీరభద్రస్వామికి విశేషపూజలు చేశారు. అనంతరం మేకలబండ చెంచుగూడెంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణవేదిక వద్ద వరకు దేవస్థానం ధర్మప్రచార రథంతో శోభాయాత్ర నిర్వహించారు. కల్యాణోత్సవ సంకల్పాన్ని పఠించి మహాగణపతిపూజ జరిపించారు. అమ్మవారికి కంకణధారణ అనంతరం స్వామిఅమ్మవార్ల ప్రవర పఠించారు. స్వామిఅమ్మవార్లకు వరపూజ నిర్వహించి భాషికలను అలంకరించారు. భూమండలం, శ్రీశైల క్షేత్రవర్ణనతో కూడిన మహాసంకల్పం పఠించారు. అర్చకులు మంగళాష్టకాలను పఠిస్తూ సుముహూర్త సమయంలో స్వామిఅమ్మవార్ల శిరస్సుపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సమర్పించారు. లోకకల్యాణం కోసం అమ్మవారికి మాంగల్యధారణ జరిపి, తలంబ్రాలను సమర్పించారు. చివరిగా స్వామిఅమ్మవార్ల కొంగులను కలుపుతూ బ్రహ్మముడి వేశారు. భక్తులకు ఆశీర్వచనం, ప్రసాద వితరణ చేశారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులందరికి శేషవస్త్రాలను అందించారు. శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పి.వి.ఎస్.నాయుడు, ఏపీడీ కె.పి.నాయక్, ట్రస్ట్బోర్డు సభ్యులు గుల్ల గంగమ్మ, కాంతివర్దిని, అధికారులు పాల్గొన్నారు. -
అవసరమేరకే ఎరువులు వాడాలి
నంద్యాల(అర్బన్): పంటలకు యూరియా, డీఏపీలను అవసరమైన మేరకే వాడాలని, మోతాదుకు మించి వాడితే భూసారం దెబ్బతింటుందని కేంద్ర బృందం సభ్యులు ఢిల్లీ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫర్టిలైజర్స్ రవీంద్రయాదవ్, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ మధుశేఖర్ పేర్కొన్నారు. యూరియా, డీఏపీ నిల్వల పరిశీలన నిమిత్తం నంద్యాల జిల్లా కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాల్లో డీఏఓ వెంకటేశ్వర్లుతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, రిజిస్టర్ బిల్లులు, క్రయవిక్రయాల రికార్డులు, ఈ పాస్ మిషన్ల ద్వారా రైతులకు ఎరువుల సరఫరా విధానం, గత మూడేళ్లుగా యూరియా అమ్మకాల వివరాలు సేకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎరువులు రైతులకు అవసరమైన మేరకు సమృద్ధిగా ఉన్నాయని, ఆందోళనలతో ముందస్తుగా కొనుగోలు చేయవద్దని చెప్పారు. డీలర్లు ఎరువుల విక్రయాలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, యూరియా, డీఏపీలకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా, నానో డీఏపీ, జీవన ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. తొలకరి వర్షాలు కురిసిన వెంటనే రైతులు పచ్చిరొట్ట ఎరువులు అయిన జీలుగ, పిల్లిపెసర, 25 నుంచి 30 రకాల విత్తనాలు కలిగిన పీఎండీఎస్ కిట్లను సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ జయప్రకాష్రెడ్డి, గిరీష్, ప్రసాదరావు, పవన్, షేక్షావలి, మహేశ్వరరెడ్డి, నేతాజీ, నాగేశ్వరరెడ్డి, పీరునాయక్, కల్యాణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచాలి
● మంత్రాలయం రైల్వేస్టేషన్ తనిఖీలో డీఆర్ఎంమంత్రాలయం రూరల్: రైల్వే స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచాలని గుంతకల్లు డివిజిన్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) చంద్ర ఎస్.గుప్తా అధికారులను ఆదేశించారు. డీఓఎం శ్రవణ్తో కలసి బుధవారం ఆయన మంత్రాలయం రైల్వే స్టేషన్ను తనిఖీ చేశారు. అక్కడ స్టేషన్ పరిసరాల పరిశుభ్రతపై ఆరా తీసి మాట్లాడారు. శ్రీరాఘవేంద్రస్వామి భక్తులకు, ప్రయాణికులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్థానిక రైల్వే అధికారులకు సూచించారు. రెండు ప్లాట్ఫాంలకు ఎక్స్వేటర్లు మంజూరయ్యాయన్నారు. త్వరలో వాటి ఏర్పాటుకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ డీసీఎం ఎన్ మనోజ్, రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ సిద్ధారెడ్డి పాల్గొన్నారు. -
అన్నప్రసాద నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ
● శ్రీశైల దేవస్థానం అధికారులకు ఈఓ ఆదేశంశ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం తయారు చేస్తున్న వంటకాల నాణ్యతపై పట్ట ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో భక్తులకు దేవస్థానం అందిస్తున్న సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ దర్శనం ఏర్పాట్లు, మంచినీటి సదుపాయం, అన్నప్రసాదం, ఉచిత ప్రసాద వితరణ, శౌచాలయాలు, పారిశుద్ద్య నిర్వహణ తదితర మౌలిక వసతులపై భక్తుల నుంచి 90 శాతం సానుకూల స్పందన ఉండాలన్నారు.ఇందుకు అనుగుణంగా ఉద్యోగులు పనిచేయాలని ఆదేశించారు. అన్నప్రసాద వితరణలో ప్రతిరోజు తాజా కూరగాయలను వినియోగించాలన్నారు. వంటశాలలో శుచి, శుభ్రత పాటించాలన్నారు. -
హెచ్ఎం పోరాటానికి 11 నెలలు
కర్నూలు(సెంట్రల్): సమస్యలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు వాట్సాప్లో ఫిర్యాదు చేస్తే చాలు.. పాఠశాలల సమస్యలు వెంటనే పరిష్కార అవుతాయనేది అవాస్తమని ఈ కథనం చదివితే తెలిసిపోతుంది. కృష్ణగిరి మండలం అమకతాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రహరీని స్థానిక టీడీపీ నాయకులు కూల్చి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, ఆక్రమణలు తొలగించాలని కోరుతూ గతేడాది జూన్ 20వ తేదీన పాఠశాల హెచ్ఎం మంత్రి లోకేష్తో పాటు ఆశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్, డీఈఓలతో పాటు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. 11 నెలలు గడిచినా వారిలో ఒక్కరూ కూడా కనీసం విచారణ కూడా చేయలేదు. గ్రామంలోని ఎంపీపీ పాఠశాలకు సర్వే నంబరు 141లో 1.40 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అందులో పాఠశాల భవనం నిర్మాణంతో పాటు మిగిలిన స్థలాన్ని కలుపుకొని ప్రహరీని నిర్మించారు. అయితే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వీరభద్రుడు ప్రోద్బలంతో అదే గ్రామానికి చెందిన బోయ సుధాకర్, తలారి మల్లికార్జున, వడ్ల ఈశ్వరయ్య, వడ్ల ఎల్లయ్య పాఠశాల ప్రవాహరీని కూల్చి స్థలంలో ఇళ్లు కట్టుకున్నారు. దీంతో 1.40 ఎకరాల్లో ప్రస్తుతం పాఠశాలకు 15 సెంట్లు మాత్రమే మిగిలింది. ఈ క్రమంలో ఆక్రమణలు తొలగించి పాఠశాల స్థలాన్ని స్వాధీనం చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ స్కూలు ఎడ్యుకేషన్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, పత్తికొండ డీఎస్పీ, వెల్దుర్తి సీఐ, డీఈఓ, ఎంఈఓ, తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కొందరికీ స్వయంగా ఇవ్వగా మరికొందరికీ ఈ–మెయిల్ ద్వారా హెచ్ఎం ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసి ఏడాది కావస్తున్నా ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం విచారణ కూడా చేపట్టలేదు. ఈ క్రమంలో ఆక్రమణదారులు దర్జాగా పాఠశాల స్థలాన్ని అనుభవిస్తున్నారు. చంపేస్తామంటూ బెదిరింపులు... ప్రస్తుత పాఠశాల హెచ్ఎంగా ఉన్న వ్యక్తి టీడీపీ నాయకుల అక్రమాలను బయట పెట్టడంతో అతని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ‘నీవు ఎరుకులోడివి, నీకు ఇక్కడేమ పని.. నీ జీతం మా చేతల మీదుగా ఇప్పిస్తాం.. మా కింత జీతగాడిలా ఉండాలి’ అంటూ అవమాన పరుస్తున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నాడని హెచ్ఎం వాపోతున్నాడు. బడిలో జోక్యం చేసుకోవద్దని, ఎవరికీ ఫిర్యాదు చేసినా ఏమి కాదని, లోకేష్ తమ పార్టీ నాయకుడేనని, తమకేమి కాదని అక్రమార్కులు హెచ్ఎంను బెదిరిస్తున్నారు. అంతేకాక పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది కూడా స్థానిక టీడీపీ నాయకులు చెబితే పనిచేస్తారని, హెచ్ఎం మాటను వారు అస్సలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. పాఠశాల గదుల తాళాలు అతని వద్దే.. స్థానిక టీడీపీ నాయకుడు వీరభద్రుడు అండదండలతో బోయ హనుహంతు అనే వ్యక్తి 20 ఏళ్ల నుంచి పాఠశాలపై అజమాయిషీ చెలాయిస్తున్నాడు. పాఠశాల గదుల తాళాలు ఆయన దగ్గరే ఉంచుకొని అందులో పిల్లలకు ప్రైవేట్ ట్యూషన్లు చెబుతున్నానని నమ్మిస్తూ మందుబాబులకు అడ్డాగా మార్చేశాడు. ప్రస్తుతం హెచ్ఎం ఆఫీసు తాళాలు, స్కూలు రికార్డులకు సంబంధించిన తాళాలు కూడా అతని దగ్గరే ఉంచుకొని పాఠశాల నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నాడని హెచ్ఎం ఫిర్యాదులో పేర్కొన్నారు. అమకతాడు పాఠశాల స్థలం ఆక్రమణ టీడీపీ నేత అండతో నలుగురు ఇళ్ల నిర్మాణం మంత్రి లోకేష్తో పాటు అధికారులకు హెచ్ఎం ఫిర్యాదు నెలలు గడుస్తున్నా చర్యలు శూన్యం అక్రమార్కుల నుంచి హెచ్ఎంకు ప్రాణహాని -
పైసా ఖర్చు లేకుండా ఉచిత విద్య
కర్నూలు సిటీ: సర్కార్ బడిలో విద్యార్థులకు పైసా ఖర్చు లేకుండా ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, బూట్లు, బ్యాగ్ తదితరాలతో విద్యను అందిస్తున్నట్లు డీఈఓ ఎల్.సుధాకర్ తెలిపారు. బుధవారం నగరంలోని సీ క్యాంపు సమీపం శ్రీరాంనగర్, రైతు బజార్ ప్రాంతాల్లో బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా అవగహన ర్యాలీ నిర్వహించారు. డీఈఓతో పాటు డిప్యూటీ డీఈఓ శ్రీధర్ పాల్గొన్నారు. ర్యాలీలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి అర్హత కలిగిన చిన్నారులను ఒకటవ తరగతి తరగతిలో చేర్పించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల వయస్సు నిండిన చిన్నారులను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలన్నారు. బోధనలో అత్యంత అనుభవం, అర్హత కలిగిన టీచర్లు ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారులు చౌడయ్య, రెహ్మాన్, అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ రఫీ, సీ్త్ర శిశు సంక్షేమ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. పసుపుల గ్రామ పంచాయతీకి ఐఎస్ఓ సర్టిఫికెట్ కర్నూలు సిటీ: కర్నూలు రూరల్ మండల పరిధిలోని పసుపుల గ్రామ పంచాయతీ ఐఎస్ఓ సర్టి ఫికెట్కు ఎంపికై ంది. బుధవారం ఆ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ముఖ్య అతిథిగా పాల్గొని ఐఎస్ఓ సర్టిఫికెట్ను జిల్లా గ్రామ పంచాయతీ అధికారి జి.భాస్కర్, ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి హేమంత్ కుమార్ రెడ్డిలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఐఎస్ఓ సర్టిఫికెట్ పొందిన 18వ గ్రామ పంచాయతీగా పసుపుల గ్రామ పంచాయతీ ఎంపికై ందన్నారు. నిర్దిష్ట కాలమాన సేవలు, మెరుగైన నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న నాణ్యమైన సేవలతోనే అరుదైన గుర్తింపు లభించిందన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి రఘునాథ్, టిక్యూఎస్ సంస్థ ప్రతినిధి సీఎం ప్రేమానంద్ తదితరులు పాల్గొన్నారు. రూ.60 కోట్లతో 26 రోడ్ల పనులు కర్నూలు(అర్బన్): జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాస్కీలో భాగంగా రూ.60 కోట్లతో 26 రోడ్ల పునరుద్ధరణ పనులు(110 కిలోమీటర్ల మేర) చేపట్టనున్నట్లు పీఆర్ పర్యవేక్షక ఇంజనీరు జి.ప్రభాకర్రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీఆర్ఆర్ఎస్పీ కింద ఈ పనులకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాన్ని అందిస్తోందన్నారు. ఈ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఒకే ప్యాకేజీ కింద ఈ పనులను చేపడతామన్నారు. క్యాజువాలిటీ ఆకస్మిక తనిఖీ కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీ విభాగంలో బుధవారం రాత్రి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో విధుల్లో లేని డీఏపీ, డీఏఎస్లకు మెమోలు జారీ చేశారు. చికిత్సకు వచ్చిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం, చికిత్స వివరాలను తెలుసుకున్నారు. డ్యూటీ సమయంలో వైద్యులు, సిబ్బంది విధిగా విధుల్లో ఉండాలని, లేనివారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డిప్యూటీ సీఎస్ఆర్ఎంఓ పద్మజ తదితరులు ఉన్నారు. బాలికపై లైంగిక దాడి ● యువకుడిపై పొక్సో కేసు నమోదు నందికొట్కూరు: పట్టణంలోని ఓ ప్రాంతానికి చెందిన 13 బాకలికపై అదే ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువకుడు ఈ నెల 2న లైంగికదాడి చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు నందికొట్కూరు టౌన్ సీఐ అశోక్ కుమార్ బుధవారం విలేకరులకు తెలిపారు. లైంగికదాడి చేసిన యువకుడు బాలికకు సొంత మేనమామ అని తెలిసింది. -
శ్రీశైల క్షేత్రంలో స్వచ్ఛత భేష్
శ్రీశైలం: పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతలో భాగంగా శ్రీశైల మహా క్షేత్రంలో చేపడుతున్న చర్యలు భేష్ అని ఆదానీ అనుబంధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. నో ప్లాస్టిక్ – సేవ్ నేచర్ నినాదంతో ఆ సంస్థ ప్రతినిధులు నలుగురు 12 జ్యోతిర్లింగాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీశైల క్షేత్రానికి వచ్చిన వారు పారిశుధ్య పనులు, ప్లాస్టిక్ నివారణ చర్యలపై భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. తర్వాత నివేదిక తయారు చేసి ఈవో శ్రీ నివాసరావును కలిసి అందజేశారు. బృందంలో గుజరాత్కు చెందిన హరినాథ్ నబ్బవ, కపిల్ గోర్, మకుందనాథ్, సావన్గర్ గో స్వామి ఉన్నారు. -
మున్సిపల్ చెత్త లారీ ఢీకొని బైకిస్ట్ దుర్మరణం
కర్నూలు : నగరంలోని బుధవారపేటలోని చెన్నకేశవస్వామి గుడి ఆర్చి దగ్గర మున్సిపాల్టీకి చెందిన చెత్త సేకరణ లారీ ఢీకొని బైకిస్ట్ బంగి బద్రీనాథ్ (28) మృతిచెందాడు. ఈయన డిగ్రీ వరకు చదువుకుని ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. బుధవారం ఉదయం తన ఇంటి వద్ద నుంచి ద్విచక్ర వాహనంపై తండ్రి బంగి రంగస్వామిని ఎక్కించుకుని ప్రభుత్వాసుపత్రి దగ్గర దింపి తిరిగి ఇంటికి వెళ్తుండగా బుధవారపేటలోని చెన్నకేశవస్వామి గుడి ఆర్చి వద్ద మున్సిపాల్టీ చెత్త లారీ ఢీకొనడంతో కింద పడి తీవ్ర గాయాలకు గురయ్యాడు. లారీ టైర్ అతనిపై వెళ్లడంతో తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికంగా ఉన్న మహిళలు మల్లీశ్వరి, సుంకులమ్మ చూసి మృతుని ఇంటి వద్దకు వెళ్లి తల్లి జయమ్మకు సమాచారం తెలియజేయగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఆటోలో ఆసుపత్రికి తరలించారు. క్యాజువాలిటీ వార్డులో డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని మార్చురీ కేంద్రానికి తరలించి భద్రపరిచారు.తన కుమారుడి మృతికి చెత్త లారీ డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపటమే కారణమని జయమ్మ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రమాదానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్సూరుద్దీన్ తెలిపారు. -
కల్లాల నిండా కన్నీళ్లే!
పాణ్యం: ‘ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనేవారు లేరు. రోజుల తరబడి కల్లాల్లో ధాన్యం వద్ద పడిగాపులు కాస్తున్నా వ్యాపారులు రావడం లేదు. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది’ అని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఆలమూరు, గోనవరం గ్రామాల్లో పర్యటించి రబీలో వరి సాగు చేసిన రైతుల కష్టాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఖరీఫ్ సీజన్లో ధాన్యం బస్తా రూ.1,900 వరకు, రబీలో రూ.1,800 వరకు తగ్గకుండా విక్రయించారు. ఎగుమతులు లేకపోయినా ధరల స్థిరీకరణతో అప్పటి ప్రభుత్వం రైతులను ఆదుకుంది. కొనుగోలు జరిగిన నెల రోజుల వ్యవధిలోనే నగదు రైతుల ఖాతాల్లో జమ అయ్యేది. కూటమి ప్రభుత్వంలో రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మా ధాన్యం కొనండి అని రైతులు పిలుస్తున్నా.. కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కల్లాల్లో ధాన్యం ఆరబోసుకుని వ్యాపారుల కోసం ఎదురు చూస్తున్నారు. రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వలేదు కానీ.. యూరియాకు ధరలు మాత్రం పెంచేశారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ఏమి చేశారో టీడీపీ నేతలు టీవీల ముందు కాకుండా రైతుల వద్దకు వచ్చి చెప్పండి. ఆనాడు ఆర్బీకేలను విమర్శించిన టీడీపీ నేతలు నేడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన విధానాలను అమలు చేస్తున్నారు. టీడీపీ నేతలు అనుకూల మీడియాలో మాట్లాడి రైతులకు ఎంతో చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్పా.. రైతులకు చేసిందేమి లేదు’ అని కాటసాని విమర్శించారు. మొక్కజొన్న సంగతేంటి.. పక్క రాష్ట్రంలో మొక్క జొన్న క్వింటాకు రూ. 2,400 మద్దతు ధర ఇస్తుంటే ఇక్కడ మాత్రం రూ.1500 పలుకుతుందని కాటసాని అన్నారు. ‘ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎంత మోతాదులో కొన్నారో ప్రజలకు చెప్పాలి. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి గ్రామాల్లో సంచులు ఇవ్వడం తప్ప.. ఎక్కడా పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదు. జొన్న, మిరప ధరలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ఉల్లి, టమాట పంటలకు ధర లేక రైతులు రోడ్లపై పారబోశారు. మామిడికి నేటికి ధర కనిపించడం లేదు’. అని చెప్పారు. ఉచిత ఇసుక ఎక్కడ ఇస్తున్నారు.. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. రైతులకు డీజిల్ అందక పంట కోతలు కూడా ఆలస్యమయ్యాయి. ప్రజలకు గ్యాస్ సిలిండర్లు అందక ఎన్నో కష్టాలు పడ్డారు. రైతులకు యూరియా సరఫరా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కొత్త పింఛన్ల రెండేళ్లు అయినా ఇవ్వలేదు. ప్రజలకు ఉచిత ఇసుక ఎక్కడ ఇస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. నేడు టన్ను ఇసుక ధర రూ. 900 టీడీపీ నాయకులే బహిరంగంగా అమ్ముతున్నారు. సామాన్యుడు వాగులో మట్టిని తరలిస్తున్నా తీసుకెళ్లి పోలీస్స్టేషనలో వేస్తున్నారు. మద్యం డోర్ డెలివరీ కూటమి ప్రభుత్వంలో మద్యం విక్రయాలు మాత్రం వందశాతం పక్కాగా అమలు చేస్తున్నారని కాటసాని ఎద్దేవా చేశారు. ఒక్కో గ్రామానికి 4 నుంచి 8 వరకు బెల్ట్షాప్లు నిర్వహిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. ఒక్క ఫోన్ కాల్తో ఏకంగా డోర్ డెలివరీ చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎక్కడా బెల్ట్షాప్లు నిర్వహించలేదు’. అని కాటసాని అన్నారు. రైతుల సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు. కాటసాని వెంట మాజీ జెట్పీటీసీ సభ్యులు సద్దల సూర్యనారాయణరెడ్డి, మల్లు జయచంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ రామలక్ష్మయ్య, సుమంత్రెడ్డి, మధురెడ్డి చాంద్బాషా, ఉప్పు విజయభాస్కర్, గోపాల్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తల జోలికొస్తే తీవ్ర పరిణామాలు
కర్నూలు(టౌన్): వైఎస్సార్సీపీ కార్యకర్తల జోలికొస్తే తీవ్ర పరిణామాలు తప్పవని, సోషల్ మీడియా యాక్టివిస్ట్ సనా నరసింహులును ఒకటవ పట్టణ పోలీసులు మర్డర్ చేసిన ముద్దాయిని తీసుకెళ్లినట్లుగా స్టేషన్కు తరలించడం ఏంటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్నూలు నగరంలో సతీష్ అనే దళిత యువకుడి ఆత్మహత్య ఘటన ప్రతి ఒక్కరినీ కదిలించిందన్నారు. మంత్రి టీజీ భరత్ అనుచరుడు, ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ బెదిరింపులతోనే సతీష్ బలవన్మరణానికి పాల్పడ్డాడన్నారు. ఇదే విషయాన్ని నరసింహులు సోషల్ మీడియాలో ప్రశ్నించడంతో వైఎస్సార్సీపీ లక్ష్యంగా అక్రమ కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. మంత్రితో గట్టు తిలక్ సన్నిహితంగా ఉన్న ఫొటోను సోషల్ మీడియా యాక్టివిస్ట్ షేర్ చేయడం తప్పు ఎలాగవుతుందన్నారు. నరసింహులుపై 41 కేసులు నమోదు చేసి స్టేషన్కు తరలించడం, నాలుగు గంటల పాటు అక్కడే కూర్చోబెట్టడం చూస్తే పోలీసులు అధికార పార్టీ కనుసన్నల్లో పని చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, శ్రేణులను నేరుగా ఎదుర్కోలేక టీడీపీ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకొని నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. అక్రమ కేసుల ను మానుకోకపోతే న్యాయపోరాటంతో సమాధానం చెబుతామన్నారు. సతీష్ బలవన్మరణానికి కారకులపై వెంటనే కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, ఇప్పటికై నా పోలీసు యంత్రాంగం మేల్కొనాలన్నారు. -
జగనన్న మార్టులకు ‘చంద్ర’గ్రహణం
కర్నూలు నగరంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న జగనన్న మార్టులు మూతపడ్డాయి. వీటి పేరును మహిళామార్టు అని మార్చి రెండేళ్లు అవుతున్నా తెరవలేదు. ఈ మార్టుల్లో నాణ్యమైన నిత్యావసరవస్తువులు ఎంఆర్పీ ధర కంటే తక్కువగా లభించేవి. మహిళలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేవి. రిలయన్స్, క్రాప్టర్ అండ్ గ్యాంబల్ వంటి ప్రముఖ సంస్థలతో మెప్మా సంస్థ ఒప్పందం కుదుర్చుకొని పొదుపు గ్రూపులు చేసిన వస్తువులు సైతం మార్కెటింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఉపయోగ పడుతున్న మహిళా మార్టుల పరిస్థితి అధ్వాన్నంగా మారాయి. మూతపడిన పట్టించుకున్న పాపాన పోలేదు. మూత పడిన క్రికెట్, టెన్నిస్ కోర్టులు కర్నూలు (టౌన్): కర్నూలు.. ఒకప్పటి రాష్ట్ర రాజధాని. రాయలసీమ ముఖద్వారంగా పేరు ప్రఖ్యాతలు ఉన్న ఈ నగరంలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ఒకరు మంత్రిగా పనిచేస్తున్నారు. జనాభా ఎక్కువగా ఉన్న కర్నూలులో రెండేళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన కౌన్ని సౌకర్యాలను తొలగించారు. నగర పాలకవర్గం గడువు గత మార్చి 18వ తేదీ ముగిసినా ఇప్పటి వరకు ‘స్పెషల్’ పాలన కనిపించడం లేదు. మంత్రి ఉన్నా నత్తనడకన పనులు కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచిన టీజీ భరత్ రాష్ట్ర పారిశ్రామిక మంత్రిగా పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో రెండేళ్లలో ప్రత్యేకించి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. కమిషనర్లు, ఇతర విభాగాల అధికారుల బదిలీలతో పాలనలో స్తబ్ధత నెలకొంది. చేసిన పనులకు రూ. కోట్లలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. సీఎఫ్ఎంఎస్లో బిల్లులు చేయడంలోనే అంతులేని జాప్యం జరుగుతుండటంతో కొంత మంది హైకోర్టు మెట్లు ఎక్కారు. అధికారులకు నోటీసులు జారీ చేయించడంతో సదరు కాంట్రాక్టర్లపై ప్రభుత్వం విజిలెన్స్ అస్త్రం ప్రయోగించింది. దీంతో మున్సిపల్ డైరెక్టరేట్కు ఫిర్యాదు చేశారు. కర్నూలు నగరంలో నంద్యాల చెక్పోస్టు నుంచి ఎస్ఎస్ గార్డెన్ వరకు 100 అడుగుల రోడ్డుకు స్థానిక ప్రజాప్రతినిధి అనుమతులు తీసుకువచ్చినా.. పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు జొహరాపురంలో రూ. 2 కోట్లతో క్రీడా ప్రాంగణాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించింది. కర్నూలు ప్రజలకు, విద్యార్థినీ, విద్యార్థులకు, క్రీడాకారులకు, ఔత్సాహిక క్రీడాకారులకు నామమాత్రపు ఫీజులతో అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుతం ఈ క్రీడా ప్రాంగణం మూత పడింది. క్రీడాకారులు మళ్లీ ప్రైవేటు నిర్వాహకులను ఆశ్రయించాల్సి వచ్చింది. అన్ని వసతులతో నిర్మించిన ఇండోర్ స్టేడియానికి మూతవేశారు. చిరు వ్యాపారులకు ఇబ్బందులు చిరువ్యాపారుల కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కర్నూలు నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో స్ట్రీట్ మార్కెట్లు నిర్మించింది. వినాయక్ ఘాట్, కృష్ణానగర్ ఐటీసీ సర్కిల్, గుత్తి పెట్రోల్ బంకు సర్కిల్, వాల్ మార్టు ఎదురుగా వ్యాపారాలు చేసుకునేందుకు ఇవి ఉన్నాయి. వీటిని మూసివేయడంతో చిరువ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బదిలీల ప్రహసనం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే కర్నూలు కమిషనర్ ఐఏఎస్ భార్గవ్ తేజను బదిలీ చేశారు. అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర్కు ఇన్చార్జ్గా బాధ్యతలు ఇచ్చి ఆయననూ తప్పించారు. కమిషనర్ రవీంద్రబాబు బాగా పనిచేస్తుండగా ఒక ప్రజాప్రతినిధికి కోపం వచ్చి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కూడా బదిలీ వేటు పడింది. అనంతరం బాధ్యతలు చేపట్టిన కమిషనర్ పి. విశ్వనాథ్ను పట్టుమని పది నెలల గడవక ముందే బదిలీ చేశారు. పైగా పోస్టింగ్ ఇవ్వలేదు. వరుస బదిలీల వెనుక టీడీపీ ప్రజా ప్రతినిధులు ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. అలాగే నగరపాలక ఇంజినీరింగ్ విభాగంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ రాజశేఖర్, టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ రెడ్డి, డాక్టర్ విశ్వేశ్వర రెడ్డి, డాక్టర్ నాగ ప్రసాద్ బాబు.. ఇలా వివిధ విభాగాల అధికారులను సైతం ఇష్టానుసారంగా బదిలీలు చేయడంపై పలు విమర్శలు వచ్చాయి. దుకాణాల్లో కార్యాలయం నగరపాలక నూతన భవనాన్ని రూ. 28 కోట్లతో నిర్మించతలపెట్టారు. ఇప్పటికే 60 శాతం పైగా పను లు పూర్తయ్యాయి. రూ. 5 కోట్ల బిల్లులు మంజూరు చేస్తే సరిపోతుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా పనులను నిలిపి వేసింది. చేసిన పనికి బిల్లులు మంజూరు చేయకుండా కాంట్రాక్టర్ను ముప్పు తిప్పలు పెట్టింది. బిల్డింగ్ పనులు పూర్తి కాక నగరపాలక కార్యాలయాన్ని వెంకటరమణ కాలనీ లోని దుకాణాల్లోకి మార్చారు. దీనికి రూ. 1.50 కోట్లు ఖర్చు చేశారు. స్వచ్ఛత.. తూచ్! గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో స్వచ్ఛతలో కర్నూలు నగరం రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. అప్పట్లో క్లాప్ ఆటోల ద్వారా ఇంటింటికి చెత్త సేకరించేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముగ్గురు ప్రజారోగ్య ఆధికారులను మార్చడంతోపాటు క్లాప్ ఆటోలను రద్దు చేశారు. స్వచ్ఛత ర్యాంకు సాధించాలంటూ 200 మంది అదనపు వర్కర్లను నియమించారు. దీంతో కార్పొరేషన్కు ప్రతి ఏటా రూ.3.50 కోట్ల భారం పడుతోంది. క్లాప్ ఆటోలు లేవంటూ పది ప్రైవేటు ట్రాక్టర్లు ఏర్పాటు చేసి ప్రతి నెల రూ.40 లక్షలు అదనంగా ఖర్చు చేస్తున్నారు. అయి నా రాష్ట్ర స్థాయిలో కర్నూలు నగరం స్వచ్ఛతలో ఆరో స్థానానికి దిగజారింది. మట్టి రోడ్డుకు రూ.50 లక్షలు అభివృద్ధి ఎక్కడ అని ఎవరైనా ప్రశ్నిస్తే టీడీపీ నాయకులు రూ.50 లక్షలతో 60 శాతం నిర్మించిన మట్టి రోడ్డును చూపుతున్నారు. రాజ్విహార్ సమీపంలోని ఎల్లమ్మ దేవాలయం నుంచి కల్లూరు దర్వాజ వరకు మట్టి రోడ్డు వేస్తున్నారు. హంద్రీ నదిలో వేస్తున్న మట్టి రోడ్డుకు ఇరిగేషన్ అధికారుల అనుమతి తీసుకోకపోవడంపై ఆరోపణలు వచ్చాయి. -
చెరువును కొల్లగొడుతున్నా పట్టించుకోరా?
● అధికారుల అండతోనే మట్టి దందా ● గంజిహళ్లి చెరువులో అక్రమ తవ్వకాలు అడ్డుకోవాలి ● వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రాజీవ్ రెడ్డి గోనెగండ్ల: గంజిహళ్లి గ్రామ చెరువును అక్రమార్కు లు కొల్లగొడుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రాజీవ్ రెడ్డి విమర్శించారు. అనుమతులకు మించి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నా అడ్డుకునేవారు కరువయ్యారన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, పార్టీ నాయకులతో కలిసి మంగళవారం ఆయన గంజిహళ్లి గ్రామ చెరువును పరిశీలించారు. తవ్వకాలను అడ్డుకుని అక్కడ ఉన్న టిప్పర్లు, యంత్రాలను బయటకు పంపించేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. లాభాపేక్ష ధోరణితో వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే తన వైఖరిని మార్చుకోవాలన్నారు. ఇటుక బట్టీలకు చెరువు మట్టిని తరలించడం దారుణమన్నారు. అక్రమ మట్టి రవాణాను ప్రశ్నించిన తమ పార్టీ నాయకులను పోలీసులు బెదిరిస్తున్నారని, ఇది ప్రజాసామ్వానికి విరుద్ధమన్నారు. రెండు వారాల క్రితం రాష్ట్ర కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి చెరువును సందర్శించి అక్రమ మట్టి రవాణాను అడ్డుకోవాలని అధికారులకు విన్నవించినా చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటోనని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నా కాసులకు కక్కుర్తి పడి అధికార పార్టీ నేతలకు అధికారులు వత్తాసు పలకడం సమంజసం కాదన్నారు. చెరువులో అక్రమ తవ్వకాలపై ఏఏ అధికారుల ప్రమేయం ఉందో వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మట్టి దందాను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. ఆయన వెంట ఎమ్మిగనూరు, గోనెగండ్ల మండలాల వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు బీఆర్ బసిరెడ్డి, కేవీ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ అలువాల వెంకట్రామిరెడ్డి, గంజిహళ్లి తిరుమాలరెడ్డి, ఎస్బీ మన్సూర్, భాస్కర్ రెడ్డి, ఇమ్రాన్, చికెన్ రాజా, మహేష్ రెడ్డి, తోలు రాముడు, మాణిక్యరెడ్డి, డాక్టర్ శివరాం, కబేర్ నాయుడు, పులికొండ, గిడ్డయ్య, భరత్ రెడ్డి, అశోక్, లక్ష్మన్న తదితరులు ఉన్నారు. -
పీఆర్ ఈఈ పోస్టుకు త్రిముఖ పోటీ
కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్ కర్నూలు ఈఈ పోస్టుకు ముగ్గురు డీఈఈలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఈఈగా విధులు నిర్వహిస్తున్న ఎస్.మహేశ్వరరెడ్డి గత ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో పాణ్యం పీఆర్ డీఈఈగా విధులు నిర్వహిస్తున్న నాగిరెడ్డికి ఇన్చార్జి ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, పీఆర్ ఇంజనీరింగ్ విభాగంలో పదోన్నతులకు సంబంధించిన డీపీసీ పూర్తయిన నేపథ్యంలో వివిధ జిల్లాల్లో డీఈఈలుగా విధులు నిర్వహిస్తూ ఈఈలుగా పదోన్నతి పొందనున్న ముగ్గురు ఇక్కడకు ఈఈగా వచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కడపలో పీఆర్ క్వాలిటీ కంట్రోల్ విభాగం డీఈఈ శివసాగర్రెడ్డి, జమ్మలమడుగు డీఈఈ రాఘవరెడ్డి, అనంతపురం జిల్లాలో డీఈఈగా పనిచేస్తున్న శ్రీరాములు తమకున్న రాజకీ య, అధికార పరిచయాల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇందులో ఒక డీఈఈ మాత్రం జిల్లాకు చెందిన మంత్రులు, పలువురు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టును ఎవరు దక్కించుకుంటారో ఒకటి, రెండు రోజుల్లో తేలిపోనుంది. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో విభిన్నప్రతిభావంతుల(దివ్యాంగులు) బ్యాక్లా గ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 27 గ్రూపు –4 పోస్టులు, 11 క్లాస్ –4 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరించారు. పూర్తి వివరాలను వెబ్సైట్ www.kurnool.a p.gov.in, www.nandyal.ap.gov.in వెబ్సైట్తో పాటు కార్యాలయ నోటీసు బోర్డులో కూడా ఉంచామన్నారు. వివరాలకు 08518 – 277864 నెంబర్ను సంప్రదించవచ్చన్నారు. అర్హులు ఈ నెల 14వ తేది సాయంత్రం 5 గంటల్లోపు తమ దరఖాస్తులను అందించాలన్నారు. అలాగే ఈ ఏడాది మార్చి 18న ఇచ్చిన ప్రకటనలో సవరణ చేశామన్నాన్నారు. టైపిస్టు పోస్టుకు టైపు రైటింగ్ ఇంగ్లిష్ మరియు తెలుగు హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ లేకున్నా, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచ్లర్ డిగ్రీ సర్టిఫికెట్ ఉన్నా అర్హులేనన్నారు. టైపిస్టు పోస్టుకు ఉద్యోగం పొందిన వారికి కంప్యూటర్ ప్రొఫెషనరీ టెస్ట్(సీపీటీ) నిర్వహిస్తామన్నారు. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల కర్నూలు సిటీ: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. గత నెల 25న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన పరీక్షలకు జిల్లాలో మొత్తం 21 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 7,735 మంది విద్యార్థుల్లో 7,202 మంది హాజరు కాగా 6,381 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లా స్థాయిలో కమ్మర పవన్ కళ్యాణ్ 117 మార్కులతో ఫస్ట్ ర్యాంకు(రాష్ట్ర స్థాయిలో 195వ ర్యాంకు), మేడం చేతన్రెడ్డి 116 మార్కులతో రెండో ర్యాంకు (రాష్ట్ర స్థాయిలో 249వ ర్యాంకు), భాష్యం శశావత్ 116 మార్కులతో తృతీయ ర్యాంకు (రాష్ట్ర స్థాయిలో 252వ ర్యాంకు) సాధించారన్నారు. అంగన్వాడీల నిర్వహణలో అలసత్వం వద్దు కర్నూలు(అర్బన్): అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మహి ళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పి.విజయ హెచ్చరించారు. పబ్లిక్ పాజిటివ్ పెర్ఫార్మెన్స్లో 62 శాతం నెగిటివిటీ వచ్చిన కోడుమూరు ప్రాజెక్టు పసుపుల –2 అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు రిజిస్టర్ల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. అనంతరం పసుపుల 1, 3 కేంద్రాలను కూడా తనిఖీ చేశారు. ఆ యా కేంద్రాల్లోని రిమార్కులపై సిబ్బందిపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. తప్పులను సరి చేసుకోవడంతో పాటు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవన్నారు. ముక్తార్బాషాకు డీఆర్ఓగా పదోన్నతి రుద్రవరం: రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని ఆలమూరు సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న ముక్తార్బాషాకు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా పదోన్నతి లభించింది. రుద్రవరం రేంజిలో గత నాలుగేళ్లుగా ఆయన సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పదోన్నతిపై కడప డివిజన్ సిద్దవటం అటవీ క్షేత్రానికి బదిలీ చేశారు. -
రైతు ఉసురు తీసిన అప్పులు
సి.బెళగల్: అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని క్రిష్ణదొడ్డిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మణస్వామి(46) తనకున్న రెండు ఎకరాల పొలంతో పాటు, గత కొంతకాలంగా మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, ఉల్లి, మిరప, శనగ పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొంతకాలంగా పంటల సాగుకు పెద్ద ఎత్తున పెట్టుబడి ఖర్చులు రావడంతో పాటు సరైన దిగుబడులు రాలేదు. పైగా పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో తెలిసిన వారు, బంధువుల దగ్గర దాదాపు రూ.10 లక్షలకు పైగా అప్పు చేశాడు. ఈ క్రమంలో పంటలకు చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని గత రెండు రోజులుగా మదనపడుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యాహ్నం అనంతరం కుటుంబ సభ్యులు గమనించినా అప్పటికే మరణించాడు. ఎస్ఐ వేణుగోపాల్రాజు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య జయలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. -
నేటి నుంచి లా సెమిస్టర్ పరీక్షలు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో 3 సంవత్సరాల లా 6వ సెమిస్టర్, 5 సంవత్సరాల లా 6, 8, 10 సెమిస్టర్ల పరీక్షలను ఈ నెల 5వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రెగ్యులర్ 316 మంది, సప్లిమెంటరీ 40 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. స్థానిక ఉస్మానియా డిగ్రీ కళాశాలలో ఈనెల 14వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి కర్నూలు(సెంట్రల్): పీజీఆర్ఎస్ అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠి న చర్యలు తప్పవని జేసీ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీలను సంతృప్త స్థాయి లో పరిష్కరించేందుకు నోడల్ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రీ ఆడిటింగ్ బృందాల ద్వారా అర్జీల పరిష్కారంలో నాణ్యతను పెంచాలని సూచించారు. అర్జీదారుడితో నేరుగా మాట్లాడి సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో చిరంజీవి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ అనురాధ, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మూడు చక్రాల వాహనాలు పంపిణీ కర్నూలు(సెంట్రల్): జిల్లాలోని 70 మంది విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేసినట్లు ఇన్చార్జి కలెక్టర్, జేసీ నూరుల్ ఖమర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికలో వికలాంగులకు మంజూరైన మూడు చక్రాల వాహనాలను జేసీతో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల చైర్మన్ నారాయణస్వామి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. ఎప్పటిలానే అధికారిక కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ హాజరుకావడం విమర్శలకు తావిస్తోంది. క్వింటా పత్తి రూ.9615 ఆదోని అర్బన్: ఆదోని వ్యవసాయ మార్కెట్యార్డులో సోమవారం పత్తి ధర రూ.9,615గా నమోదైంది. సోమవారం రైతులు 758 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి తీసుకురాగా గరిష్ట ధర రూ.9,615, మధ్య ధర రూ.9,300, కనిష్ట ధర రూ.5,525 పలికింది. అదేవిధంగా వేరుశనగ 173 క్వింటాళ్లు రాగా గరిష్ట ధర రూ.7,600, మధ్య ధర రూ.6,869, కనిష్ట ధర రూ.4,609 నమోదైంది. ఆముదాలు 32 క్వింటాళ్లు రాగా గరిష్ట ధర రూ.6,056, మధ్య ధర రూ.6038, కనిష్ట ధర రూ.5,342 పలికింది. అరటి తోట దగ్ధం ● రూ.2 లక్షల ఆస్తి నష్టం ఓర్వకల్లు: చేతికొచ్చిన అరటి తోట దగ్ధమైన బ్రాహ్మణపల్లె గ్రామంలో ఆదివారం చోటుచేసుకొంది. గ్రామానికి చెందిన కానుగల దేవరాజు అనే రైతు తమకున్న రెండెకరాలలో గత కొంతకాలంగా అరటి పంటను సాగు చేశాడు. పచ్చగా కళకళలాడుతున్న అరటి తోటకు ఆదివారం రాత్రి నిప్పంటుకొని సుమారు 200 చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మంటలను అదుపు చేశారు. నెల రోజుల్లో కోత కోయాల్సి ఉండగా ప్రమాదం చోటు చేసుకోవడంతో రూ.2 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపాడు. ప్రమాదవశాత్తూ జరిగిందా? ఇతరులు నిప్పు పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఏసీబీ వలలో తహసీల్దార్, సర్వేయర్
● లంచం తీసుకుంటుండగా సర్వేయర్ను పట్టుకున్న అధికారులు ● ఫోన్లో డబ్బులు తీసుకురావాలని చెప్పి దొరికిపోయిన తహసీల్దార్ బనగానపల్లె: లంచం తీసుకుంటున్న బనగానపల్లె తహసీల్దార్ ఆర్. రాజీవ్రెడ్డి, మండల ఇన్చార్జ్ సర్వేయర్ షేక్ హుస్సేన్బాషాను సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల మేరకు.. అవుకు మండలం కోనాపురం గ్రామానికి చెందిన రైతు నారాయణరెడ్డి బనగానపల్లె పట్టణంలోని నివాసం ఉంటున్నారు. ఇతనికి బనగానపల్లె సమీపంలో మూడు ఎకరాల వ్యవసాయభూమి ఉంది. ఇది చుక్కల భూమి కావడంతో సమస్యను తొలగించుకునేందుకు 2023లో సర్వేయర్ ద్వారా ప్రయత్నించారు. అయితే లంచం విషయంలో బేరం కుదరలేదు. దీంతో ఇన్చార్జ్ సర్వేయర్ షేక్హుస్సేన్బాషా ఇటీవల రైతు నారాయణరెడ్డిని మళ్లీ సంప్రదించారు. సంప్రదింపుల తరువాత తహసీల్దార్తో చర్చించి రూ.1.50 లక్షలకు సర్వేయర్ డిమాండ్ చేశారు. చివరకు రూ.80 వేలకు అంగీకారం కుదిరింది. ముందుగా రూ.50 వేల ఇచ్చి మిగిలినది పనిపూర్తి అయిన తర్వాత ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. లంచం ఇచ్చి పనిచేయించుకోవడం ఇష్టంలేని రైతు నారాయణరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు రూ.50 వేల మొత్తాన్ని తీసుకునేందుకు సబ్స్టేషన్ వద్దకు రావాలని సర్వేయర్ కోరాడు. నారాయణరెడ్డి అక్కడికి వచ్చి సర్వేయర్కు డబ్బులు ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. అక్కడి నుంచే సర్వేయర్తో తహసీల్దార్కు ఫోన్లో మాట్లాడించడంతో ఆయన డబ్బులు తీసుకురావాలని ఆదేశించారు. దీంతో సర్వేయర్, తహసీల్దార్ ఇద్దరూ కలిసి రైతు నారాయణ రెడ్డి నుంచి మొత్తాన్ని తీసుకున్నట్లు తమ విచారణలో తెలినట్లు డీఎస్పీ సోమన్న తెలిపారు. డీఎస్పీ వెంట సీఐలు రాజాప్రభాకర్, కృష్ణయ్య సిబ్బంది పాల్గొన్నారు. తహసీల్దార్ రాజీవ్రెడ్డి గత 20 రోజుల క్రితమే డిప్యూటీ తహసీల్దార్ నుంచి పదోన్నతిపై బనగానపల్లెకు వచ్చి బాధ్యతలు స్వీకరించారు. -
పదేళ్ల ప్రేమను చిదిమేశారు. కులం పేరుతూ దోషించారు.. ఊరు వదిలేంత వరకు వదిలేది లేదని హెచ్చరించారు. సెల్ఫోన్ లాక్కుని రోజంతా ముప్పుతిప్పలు పెట్టారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఓ జీవితాన్ని కాలరాశారు. న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు రోడ్డెక్కితే ఖాకీలు జులం ప
కర్నూలు(సెంట్రల్): రెండురోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన దళిత యువకుడు సతీష్ మృతికి కారణమైన ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్పై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు ప్రయత్నించారు. అయితే వారిని మూడో పట్టణ పోలీసులు అడ్డుకొని జులుం ప్రదర్శించారు. సీఐ శేషయ్య వారిపై చేయి చేసుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నెల 3న కర్నూలు నగరంలోని శ్రీరామ్నగర్కు చెందిన సతీష్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మూడు రోజుల ముందు అతను 15 ఏళ్లుగా ప్రేమించిన ప్రియురాలిని వదిలివేయాలని ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్, త్రీటౌన్ పోలీసులతో కలసి తీవ్రంగా వేధించాడు. ఆ అమ్మాయికి ఫోన్ చేసినా, మాట్లాడినా తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలో యువకుడు తన ప్రేమ విఫలమవుతుందనే ఆందోళనతో ఆదివారం ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం పోస్టుమార్టం అనంతరం పోలీసులు అంబులెన్స్లో శవాన్ని తీసుకెళ్లాలని బంధువులకు అప్పగించారు. అయితే బంధువులు ఆత్మహత్యకు కారణమైన గట్టు తిలక్ను అరెస్టు చేయాలని, మూడో పట్టణ పోలీసులపై విచారణ చేయాలని కోరుతూ నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మెడికల్ కాలేజీ అవు ట్ గేటు దగ్గర అంబులెన్స్లో ఉన్న శవాన్ని బయటకు తీసి స్ట్రెక్చర్పై కలెక్టరేట్ వైపు ర్యాలీగా వెళ్లారు. వీరిని మూడో పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. సీఐ శేషయ్య, పోలీసులు ర్యాలీగా వెళ్లకూడదని, నిరసన వ్యక్తం చేయకూడదని హాస్పిటల్ అవుట్ గేటు దగ్గర అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు బలవంతంగా స్ట్రెక్చర్పై ఉన్న శవాన్ని అంబులెన్స్లో ఎక్కించేందుకు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో వారిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. అడ్డువచ్చిన వారిపై దాడి చేసి బలవంతంగా అంబులెన్స్లో ఎక్కించారు. బంధువులు అంబులెన్స్ ముందుకు వెళ్లకుండా కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, సతీష్ కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమపైనే పోలీసులు దాడి చేయడం హేయమని, తమకు న్యాయం చేయమని కోరితే దాడి చేయడం అన్యాయమన్నారు. గట్టు తిలక్ను అరెస్టు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడిపై కేసు నమోదుకు వెనుకంజ కులం పేరుతో దూషించి, పోలీసుస్టేషన్లో వేధింపులు సూసైడ్ నోట్ లభ్యమైనా చర్యలకు ససేమిరా కలెక్టరేట్ ఎదుట నిరసనకు సిద్ధమైన కుటుంబ సభ్యులు అడ్డుకుని జులం ప్రదర్శించిన త్రీటౌన్ పోలీసులు -
శనగ రైతుకు అందని ‘మద్దతు’
● అదనపు కొనుగోళ్ల ప్రతిపాదనను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వంకర్నూలు(అగ్రికల్చర్): మద్దతు ధర లభించక శనగ రైతులు భారీ ఎత్తున నష్టాలు మూట కట్టుకున్నారు. క్వింటా శనగలకు మద్దతు ధర రూ.5875 ఉండగా మార్కెట్లో రూ.5000 లోపే ధర లభిస్తోంది. మద్దతు ధరతో శనగలు అరకొరగా కొనుగోలు చేసి.. చేతులు దులపుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. అరకొరగా కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అయిన నాఫెడ్ కొనుగోలు చేసింది. శనగల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేదు. నాఫెడ్ జిల్లాకు 12,880 టన్నుల శనగల కొనుగోలుకు అనుమతి ఇవ్వగా.. నెలన్నర క్రితమే ఈ మేరకు కొనుగోలు చేయడం పూర్తి అయింది. అదనంగా కొనుగోలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసింది. ఈ లేఖను ప్రభుత్వం కేంద్రానికి పంపింది తప్ప ప్రత్యేక చర్యలు లేవు. నెలన్నర క్రితం అదనంగా శనగల కొనుగోలు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. మద్దతు ధరతో శనగలు అమ్ముకున్న రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు విడుదల చేయడంలో అంతులేని జాప్యం జరుగుతోంది. శనగల కొనుగోళ్లు ముగిసి నెలన్నర రోజులవుతున్నా ఇప్పటికి దాదాపు 1100 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ కాలేదు. మామూలుగా అయితే విక్రయించిన 10 రోజుల్లో నగదు చెల్లించాల్సి ఉంది. కాని రెండు నెలలవుతున్నా... నగదు జమ కాకపోవడం పట్ల రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రేషన్ డీలర్లపై ముప్పేట దాడి
డోన్: అధికార అండతో టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. తెలుగు తమ్ముళ్లకు ఉపాధి కల్పించేందుకు దౌర్జన్యాలు, బెదిరింపులే కాకుండా అధికారులతో వేధింపులకు పాల్పడుతున్నారు. రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్ శాఖల అధికారుల్లో కొందరు టీడీపీ నేతలకు జీహుజూర్ అంటూ గులాం గిరి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల రేషన్ దుకాణాలపై దాడులు చేసినా ఎలాంటి తప్పు లు దొరకపోవడంతో చివరకు కొత్త ఎత్తుగడ వేశారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లల్లో నుంచి రేషన్ బియ్యం తెచ్చి కాటా తక్కువ ఉన్నట్లు చూపించడమే కాక వారి స్టేట్మెంట్ను రికార్డు చేసి సస్పెండ్ చేసేందుకు కూడా వెనకాడటం లేదు. రెండు రోజుల క్రితం ఇదే తరహాలో డోన్ మండలం వలసల గ్రామంలో తూకంలో తేడా లంటూ డీలర్పై వేటు వేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల రేషన్ దుకాణాల్లో ఆకస్మి క తనిఖీల్లోనూ రెవెన్యూ, పోలీసు అధికారులతో పాటు టీడీపీ కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషిస్తున్నా రు. తాజాగా సోమవారం డోన్ పట్టణంలో వైఎస్సా ర్సీపీ మద్దతుదారు డీలర్ను ఇలాగే వేధించారు. పట్టణంలోని సీ3–231–2019 షాప్ దుకాణం తనిఖీలో మల్యాల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ధర్మ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అధికారుల సమక్షంలోనే స్టాక్ రికార్డులు పరిశీలించడం చూసి పలువురు ఆశ్చర్యపోయారు. రేషన్ దుకాణాన్ని వైఎస్సార్సీపీ వర్గీయుడు వదులుకునేలా ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి యంత్రాంగం దాడుల పేరు తో బెదిరింపులకు పాల్ప డటం, మాట వినని డీలర్లపై అక్రమ కేసులు బనాయించేందుకు టీడీపీ నేతలు యత్నిస్తుండటంతో డీలర్లు బెంబేలెత్తుతున్నారు. సగానికి పైగా డీలర్షిప్ వదిలేశారు.. డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి మండలంలో 52, బేతంచెర్ల మండలంలో 45, డోన్ మండలంలో 72 మంది చౌకదుకాణ డీలర్లు ఉండగా.. టీడీపీ నేతలు, అధికారుల వేధింపులు తాళలేక 50 శాతం మంది డీలర్షిప్ను వదులుకున్నారు. టీడీపీ నాయకుల ప్రోద్బలంతో పోలీసుల వేధింపులు తాళలేక డీలర్షిప్ వద్దనుకున్న వారు అధికంగా ఉన్నారు. మరో 30 మంది తమ సప్పెండ్ను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చు కున్నారు. ఇక లాభం లేదు అనుకుని సివిల్ సప్లై గోడౌన్ ఇన్చార్జి రబ్బానీపై ఒత్తిడి తెచ్చి ఎలాంటి కాటా (తూకం) వేయకుండానే రేషన్ దుకాణాలకు బియ్యం బస్తాలను తరలిస్తున్నారు. చౌక దుకాణాలకు చేరిన వెంటనే పోలీసులు, టీడీపీ కార్యకర్తల సహాయంతో రెవెన్యూ అధికారులు ఆ దుకాణాలను తనిఖీ చేసి బస్తాలను తూకం వేయడం ద్వారా కేజీ నుంచి 2 కేజీల వరకు ప్రతి బస్తాకు తక్కువ ఉన్నాయని కేసులు రాస్తూ వేధిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గోడౌన్ నుంచి దుకాణానికి చేరేలోగా బస్తాకు అర కేజీ తూకం తగ్గుతుండటంతో రెవెన్యూ అధికారులు డీలర్ తొలగింపునకు సులువైంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై తీవ్ర వేధింపులు డీలర్షిప్ వదులుకునే వరకు ఒత్తిళ్లు వత్తాసు పలుకుతున్న రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలంటూ భయపెడుతున్న వైనం సగానికిపైగా దుకాణాలను వదులుకున్న డీలర్లు -
ఉచిత ఇసుకను అమ్ముకుంటున్న టీడీపీ నేతలు
● పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డికర్నూలు(సెంట్రల్): పాణ్యం నియోజకవర్గంలో కొందరు టీడీపీ నాయకులు ఉచిత ఇసుకను అమ్ముకుంటున్నారని, అడ్డుకోవాల్సిన అధికారులు వారికే కొమ్ము కాస్తుండడంతో ప్రజలకు ఇసుక దొరకడంలేదని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టరేట్లో జేసీ నూరుల్ ఖమర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొందరు టీడీపీ నాయకులు ఉచిత ఇసుక రవాణాను అడ్డుకొని డంపుల్లో దాచుకొని అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు వెళ్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మరోవైపు కల్లూరు మండలం దొడ్డిపాడు గ్రామ రైతులకు భూ సంబంధిత, సాగునీటి, పంట నష్టపరిహారం సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్న విషయాన్ని జేసీ దృష్టికి తీసుకొచ్చారు. అందుకు జేసీ స్పందిస్తూ విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. కాటసాని వెంట పెద్దటేకూరు నాయకులు హనుమంతరెడ్డి, దొడ్డిపాడు గ్రామ నాయకులు ఉన్నారు. -
థ్యాంక్యూ సాక్షి
నాకు పదో తరగతిలో 590 మార్కులు రావడం ఆనందంగా ఉంది. మా నాన్న ఖాజామొహిద్దీన్ పాత టైర్ల షాపును నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాం. మా అమ్మ గృహిణి. మాది నిరుపేద కుటుంబం. సాక్షి యాజమాన్యం మా పాఠశాలలో పదో తరగతి మెటీరియల్ను పంపిణీ చేసింది. ఉపాధ్యాయులు బోధించే పాఠాలతో పాటు సాక్షి మెటీరియల్తోనే 590 మార్కుల స్కోరింగ్ సాధ్యమైంది. డాక్టర్ కావడం నా కల. – షేక్ అనీషాతబసుమ్, ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం అయ్యే సమయంలో సాక్షి మీడియా ఉచితంగా ఇచ్చిన స్టడీ మెటీరియల్ ఉపయోగపడింది. నేను 519 మార్కులు సాధించాను. చాలా సంతోషంగా ఉంది. ఈ మెటీరియల్లో ఉన్న అత్యధిక ప్రశ్నలు రావడంతోనే అధిక మార్కులు వచ్చాయి. ఇందుకు కారణమైన సాక్షికి ధన్యవాదాలు. – మహేష్బాబు, ఆలూరు టెన్త్ పరీక్షలకు ముందు సాక్షి మీడియా గ్రూప్ వారు ఉచితంగా అందించిన స్టడీ మెటీరియల్ నాకు ఎంతో ఉపయోగపడింది. ఉపాధ్యాయులు మంచి నోట్సు అందించారు. దీంతో పరీక్షల్లో 577 మార్కులు సాధించా. స్కూల్ టాపర్గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. – కె.గౌతమి, ఆదోని మున్సిపల్ హైస్కూల్ ● ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ ● ఆ మెటీరియల్ చదివి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు సాక్షి మెటీరియల్ అందుకున్న విద్యార్థినులతో ఉపాధ్యాయులు(ఫైల్)కర్నూలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ ఇవ్వడంతో దానిని చదివిన వారు ఉత్తమ ఫలితాలను సాధించారు. చాలా మందికి 500పైగా మార్కులు వచ్చాయి. ‘సాక్షి’ స్టడీ మెటీరియల్తోనే ఇదంతా సాధ్యమైందని వారు తెలిపారు. ప్రతి ఏటా ప్రభుత్వ సాధారణ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో ఆయా సబ్జెక్టుల భోధనలో అత్యంత అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో నిపుణుల బృందం ఏర్పాటు చేసి స్టడీ మెటీరియల్ను తయారు చేసి విద్యార్థులకు ఇచ్చేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పదో తరగతి విద్యార్థులకు ఎలాంటి స్టడీ మెటరియల్ ఇవ్వలేదు. కేవలం పీడీఎఫ్ రూపంలో ఉన్న మెటీరియల్ను టీచర్లకు ఇస్తున్నారు. విద్యార్థులు ఇబ్బంది ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకుని సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో ఆయా సబ్జెక్టుల నిపుణులతో స్టడీ మెటీరియల్ను రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందించారు. ఉపాధ్యాయుల బోధనతో పాటు స్టడీ మెటిరియల్ తోడు కావడంతో విద్యార్థులు గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా ఉత్తమ మార్కులు సాధించారు. కార్పొరేట్ కాలేజీలకు దీటుగా సర్కార్ బడుల్లోని విద్యార్థులకు మార్కులు వచ్చాయి. సాక్షి మీడియా గ్రూప్ ఇచ్చిన మెటీరియల్ అత్యుత్తమ మార్కుల సాధనకు ఉపయోపడినట్లు విద్యార్థులు తెలిపారు. -
పొగాకు కంపెనీ నిర్లక్ష్యానికి రైతు బలి
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డిఓర్వకల్లు: పొగాకు కంపెనీ నిర్లక్ష్యంతో రైతు ఖాజామొహిద్దీన్ మృతి చెందాడని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. రైతు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక జీపీ ఐ పొగాకు కంపెనీ యాజమాన్యం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. నాణ్యత ప్రమాణాల పేరుతో ఆత్మకూరు, ఆళ్లగడ్డ, అలంపూరు వంటి దూర ప్రాంతాలకు దిగుబడులు తీసుకురమ్మనడం దారుణమన్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు వందల కి.మీ ప్రయాణించి అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఒప్పందం మేరకు స్థానికంగా కొనుగోలు కేంద్రం ప్రారంభించాలన్నారు. మృతుడు ఖాజామొహిద్దీన్ కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, పాణ్యం జెడ్పీటీసీ మాజీ సభ్యులు సద్దల సూర్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ రంగనాఽథ్గౌడు, వైఎస్సార్సీపీ నాయకులు కాశిరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి, ఐటీ విభాగం అధ్యక్షులు శివకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, అయ్యపురెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఈనెల 2వ తేదీన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన గుట్టపాడు గ్రామానికి చెందిన రైతు మహబూబ్బాషాను పరామర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బాధితుడికి పరిహారం అందించాలని కోరారు. చికిత్స పొందుతూ రైతు మృతి రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓర్వకల్లుకు చెందిన రైతు షేక్ ఖాజామొహిద్దీన్(56) చికిత్స పొందుతూ కోలేక మృతి చెందాడు. మృతుడు ఓర్వకల్లు ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్సార్సీపీ నాయకుడు షేక్ ఉస్మాన్బాషా సోదరుడు. గత నెల 30వ తేదీన జోగులాంబ అలంపూరులోని పొగాకు కొనుగోలు కేంద్రానికి ట్రాక్టర్లో దిగుబడి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో కర్నూలు నగరంలోని చెన్నమ్మ సర్కిల్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ వంతెనపై వెనుక నుంచి ఓ ప్రైవేట్ బస్సు కొట్టింది. ఈ ప్రమాదంలో షేక్ ఖాజామొహిద్దీన్కు తీవ్ర గాయాలు కావడంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. పరిస్థితి కుదుట పడకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం తెల్లవారు జామున మృతి చెందాడు. అక్కడి వైద్యుల సల హా మేరకు మృతుని అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. -
‘పెట్రో’ కష్టాలు
కోసిగి: పెట్రోల్ దొరకక వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. స్టాక్ లేకపోవడంతో కోసిగిలో మూడు రోజులుగా హెచ్పీ, నయారా పెట్రోలియం బంకులు మూతపడ్డాయి. కేవలం ఇండియన్ పెట్రోలియం బంక్లో మాత్రమే పెట్రోల్ను పోస్తున్నారు. దీంతో ద్విచక్రవాహనాలతో ప్రజలు బారులుదీరాల్సి వస్తోంది. వేసవికాలం కావడంతో ఎండ వేడిమికి తాళలేకపోతున్నారు. పెట్రోల్ బంక్ పరిసరాల్లో కనీస తాగునీటి వసతి లేకపోవడంతో దాహంతో అల్లాడుతున్నారు. అధికారులు స్పందించి కోసిగిలో ఉన్న మూడు పెట్రోలియం బంక్లలో పెట్రోల్, డీజిల్ సమస్యలు లేకుండా చూడాలని వాహనదారులు కోరారు. పీఐయూ డీఈఈగా సతీష్కుమార్ కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం పీఐయూ ( ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ ) కర్నూలు సబ్డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుగా ఆర్ సతీష్కుమార్కు పూర్తి అధనపు బాధ్యతలు అప్పగిస్తు పీఆర్ ఈఎన్సీ బాలునాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. పీఐయూ రెగ్యులర్ డీఈఈగా విధులు నిర్వహించిన ఎస్ మహేశ్వరరెడ్డి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలోనే సతీ ష్కుమార్కు డీఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. డీఈఈగా సతీష్కుమార్ నియమితులు కావడంపై సహచర డీఈఈలు, ఏఈ, ఏఈఈలు, కార్యాలయ ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. నేడు పీజీఆర్ఎస్ కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)ను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ నూరుల్ ఖమర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లో నూ ప్రజలను ఫిర్యాదులను స్వీరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్జీల పరిష్కార సమాచారం కోసం 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. ఎల్లెల్సీకి నీటి సరఫరా బంద్ హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు ఆదివారం రాత్రి 8 గంటలకు టీబీ బోర్డు అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. ఈ ఏడాది డ్యాంలో కొత్త క్రస్టుగేట్ల ఏర్పాటుకు సంబంధించి ఎల్లెల్సీకి జనవరిలో నీటి సరఫరాను నిలిపివేసిన అధికారులు తాగునీటి అవసరాల నిమిత్తం ఏప్రిల్ 3న విడుదల చేశారు. దాదాపు నెల రోజుల పాటు నీటిని వదిలిన అధికారులు ఆదివారం తిరిగి బంద్ చేశారు. శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తజనం తరలివచ్చింది. వేకువజామునుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. -
గల్లంతైన బాలిక మృతి
ఎమ్మిగనూరురూరల్: గుడేకల్ చెరువులో గల్లంతైన బాలిక ఆఫ్రిన్ మృతిచెందారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక గజ ఈతగాళ్లు.. చిన్నారి మృతదేహాన్ని ఆదివారం బయటకు తీసుకువచ్చారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా ఆంధ్రాల గ్రామం నుంచి శ్రీ అల్లిపీరా స్వామి ఉరుసులో పాల్గొనేందుకు తల్లి రజియా బేగం, ఏడేళ్ల కుమార్తె ఆఫ్రిన్లు కలసి వచ్చారు. దర్గాకు వెళ్లే ముందు పవిత్రంగా కాళ్లు, చేతులు కడుకందామని శనివారం గుడేకల్ చెరువు కు వెళ్లారు. కాలుజారి తల్లీబిడ్డ లోతైన చెరువులో పడిపోయారు. గమనించిన స్థానికులు ప్రాణాలు తెగించి తల్లి రంజియాబేగంను కాపాడగలిగారు. చిన్నారి మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆదివారం ఉదయం విగతజీవిగా ఆఫ్రిన్ కనిపించడంతో తల్లి గుండెపగిలెలా రోదించారు. భర్తను కోల్పోయిన రజియా ఇప్పుడు కుమార్తెను కోల్పోయి దుఃఖసాగరంలో మునిగారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించి బళ్లారి జిల్లా ఆంధ్రాల గ్రామానికి తరలించారు. ఎమ్మిగనూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రబాబు ప్రభుత్వానికి తాగునీటి ఎద్దడి కనిపించదా?
● ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి హాలహర్వి: గ్రామాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి చంద్రబాబు ప్రభుత్వానికి కనిపించదా అని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ప్రశ్నించారు. హాలహర్విలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మండలంలోని మల్లికార్జునపల్లి, నిట్రవట్టి, కొక్కరచేడు, శ్రీధర్హాల్, సిద్ధాపురం, సిరుగాపురం గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. ప్రజలు గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించలేదన్నారు. కొత్త పింఛన్ల ఊసే కరువైందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు తెలిపారు. వైఎస్సార్సీపీ మహిళా రాష్ట్ర కార్యదర్శి శశికళ, మండల కన్వీనర్ రామిరెడ్డి, జిల్లా కార్యదర్శి అర్ధగేరి శ్రీనివాసులు, కో కన్వీనర్లు మల్లికార్జున, ఉసేని, మండల కార్యదర్శి గోపాల్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. -
కనుమరుగువుతున్న లక్ష్యం!
వ్యాక్సిన్ సరఫరా చేసే రెండు వాహనాలు ఇవి. మరమ్మతులకు గురైన వీటిని కొన్ని నెలలుగా జిల్లా ఇమ్యునైజేషన్ కార్యాలయం పక్కన నిలిపి ఉంచారు. సంరక్షణ లేకపోవడంతో ఎంతో విలువైన ఇవి ఎండకు ఎండి, వానకు తడిచి మరింత పాడైపోయాయి. ఆ వాహనాలకు చుట్టూ మొక్కలు ఏపుగా పెరిగాయి. ఒక మొక్క పెరిగి వృక్షమయ్యింది. కొంత కాలానికి మొక్కలు ఏపుగా పెరిగి వాహనాలు కనిపించకుండా పోయే అవకాశం ఉంది. వీటి లక్ష్యం కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంది. అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. – కర్నూలు(హాస్పిటల్) -
అత్యవసర వైద్యం..పెద్ద కష్టం
● ఐవీఆర్ఎస్లో రోగుల పెదవి విరుపు ● కర్నూలు పెద్దాసుపత్రికి కింద నుంచి నాలుగవ స్థానంకర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అందుతున్న వైద్యసేవలపై ఇక్కడ చికిత్స పొందుతున్న రోగులు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రుల్లో ఈ ఆసుపత్రికి కింది నుంచి నాలుగో స్థానాన్ని కేటాయించారు. ఏకంగా 32.49శాతం మంది రోగులు వైద్యసేవలపై వ్యతిరేక అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆయా ప్రభుత్వ శాఖలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సేవలపై కొంత కాలంగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఫీడ్బ్యాక్(అభిప్రాయ సేకరణ) తీసుకుంటోంది. ఇందులో భాగంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల 67.51శాతం మంది అనుకూలంగా 32.49శాతం వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఆసుపత్రుల అధికారులకు తాకీదులు కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్లో 71.20 శాతం అనుకూలంగా, 28.86శాతం మంది వ్యతిరేకంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఆదోనిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 71.49శాతం అనుకూలంగా, 28.51శాతం వ్యతిరేకంగా, ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రి 72.73శాతం అనుకూలంగా 27.27శాతం మంది వ్యతిరేకంగా చెప్పా రు. ఈ విషయమై ఆయా ఆసుపత్రుల అధికారులకు ఉన్నతాధికారుల నుంచి తాకీదులు వచ్చినట్లు సమాచారం. దీంతో అధికారులు వైద్యసేవలను మెరుగుపరిచే దిశగా చర్యలు ప్రారంభించారు. రోగుల తీవ్ర అసంతృప్తి ముఖ్యంగా వైద్యులు, స్టాఫ్నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర ఉద్యోగుల సమయపాలన సరిగ్గా లేదు. కొందరు వైద్యులు ఓపీల్లో సైతం ఉండటం లేదు. ముఖ్యంగా సూపర్స్పెషాలిటీ విభాగాల్లో ఎక్కువ శాతం పీజీ వైద్యులే ఉంటున్నారు. మధ్యాహ్నం తర్వాత ఓపీలో కేవలం ఒకరిద్దరు పీజీ వైద్యులతో నడిపిస్తున్నారు. రక్తపరీక్షలు, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, సీటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ వంటి వ్యాధినిర్ధారణ పరీక్షల నివేదికలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆపరేషన్లు సకాలంలో జరగకపోవడం, మందులు, వైద్యపరీక్షలు సగం బయటే తీసుకోవాలని చెప్పడం వంటి అంశాలూ రోగులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి. రోగుల ఫీడ్బ్యాక్ సరిగ్గా లేకపోవడంతో ఉన్నతాధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
చేనేతపురి.. ప్రగతి అధోగతి
● ఎమ్మిగనూరులో నిలిచిపోయిన అభివృద్ధి పనులు ● పనులు చేపట్టేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు ఎమ్మిగనూరుటౌన్: అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులను పట్టాలెక్కిస్తాం అని ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చారు. ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కి 23 నెలలవుతున్నా అభివృద్ధి పనులు చేయలేకపోయారు. కోట్ల రూపాయల్లో ఉన్న పెండింగ్ బిల్లులను మంజూరు చేయలేదు. ఫలితంగా కొత్త పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేకపోతున్నారు. ఫలితంగా ఎమ్మిగనూరు పట్టణంలో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. రూ.3 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి ఎమ్మిగనూరులోని పలు ప్రాంతాల్లో అట్టహాసంగా అభివృద్ధి పనులకు భూమి పూజలు చేశారు. గత మున్సిపాలిటీ పాలక వర్గం ఆమోదించిన పలు అభివృద్ధి పనులను సైతం పోటీ పడి మరీ ప్రారంభించారు. అందులో సీసీ రోడ్లు, డ్రైన్లు ఉన్నాయి. అయితే గతంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.3 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నా వాటిని విడుదల చేయలేదు. దీంతో కొన్ని సీసీ, బీటీ, డ్రైన్ల నిర్మాణాలు ప్రారంభించినా వాటిని మధ్యలోనే నిలిపేశారు. దీంతో పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసిన పనులకు సంబంధించిన బిల్లులు సత్వరం మంజూరయ్యేలా ప్రతిపాదనలు పంపాం. అందుకు సంబంధించి బిల్లులు ప్రాసెస్ చేస్తున్నాం. కొన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నది వాస్తవమే. ప్రస్తుతం మంచినీటిపైప్ లైన్లు, డ్రైనేజీ పనులకు ప్రాధాన్యతనిస్తున్నాం. రోడ్ల పనులు కూడా చేపడతాం. – గంగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఎమ్మిగనూరు పట్టణంలోని గంజిళ్ల రోడ్డు ఇది. దీని నిర్మాణానికి రూ.99 లక్షలతో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి టెంకాయ కొట్టి భూమి పూజ చేశారు. వెనువెంటనే రోడ్డు పనులను టెండర్ ద్వారా దక్కించుకొన్న కాంట్రాక్టర్ గుంతలు పడ్డ రోడ్డుపై కంకర పరిచి వదిలేశాడు. నెలలు గడుస్తున్నా ఆయా పనులు మాత్రం ముందుకు కొనసాగలేదు. గతంలో చేసిన పనులకు సంబంధించి బిల్లులు మంజూరు కాకపోవడంతో రోడ్డు నిర్మాణ పనులు చేయలేనంటూ చేతులెత్తేసినట్లు తెలిసింది. ఫలితంగా గోతులమయమైన ఈ రోడ్డుపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. -
అనాథకు ఆత్మీయ బంధువుల్లా..
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన రమేష్ శెట్టి (80) శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. అతనికి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో స్థానికులు బేతంచెర్లలోని ‘ఆ నలుగురు’ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వన్నూర్ బాషాకు సమాచారం ఇచ్చారు. వారు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి అనంతరం బృందం సభ్యులు గ్రామానికి చేరుకుని రమేష్ శెట్టికి సొంత కుటుంబ సభ్యుల్లా అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్ మృతి వెల్దుర్తి: విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్ సురేంద్ర(38) మృతి చెందాడు. ఈ దుర్ఘటన మదార్పురం గ్రామంలోని ఇటుకల బట్టీలో చోటుచేసుకుంది. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాల మేరకు.. ఉలిందకొండకు వెళ్లేందుకు కల్లూరు మండలం చెట్లమల్లాపురం గ్రామానికి చెందిన డ్రైవర్ చాకలి సురేంద్ర లోడింగ్లో ఉన్న లారీని రివర్స్ చేశాడు. ఈ సమయంలో 11కెవీ విద్యుత్ లైన్ కలిగిన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఓ వైరు లారీ టైర్లను ఆనుకుంటూ వేలాడింది. ఏం జరిగిందోనని చూసుకునేందుకు లారీ డ్రైవర్ కిందకు దిగే ప్రయత్నంలో విద్యుత్ సరఫరా ఉన్న వేలాడిన వైరుపై ఓ కాలు ఉంచాడు. భూమిపై మరో కాలు మోపడంతోనే విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న డోన్ ఏడీఏ సుబ్బన్న, వెల్దుర్తి ఏఈ వెంకటేశ్వర్లు, సిబ్బంది, ఎస్ఐ నరేశ్ బృందం సంఘటనాస్థలికి చేరుకుని విచారించారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. సురేంద్రకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. లారీ టైర్లపై వేలాడిన 11కేవీ విద్యుత్ వైరుమృతిచెందిన లారీ డ్రైవర్ సురేంద్ర -
‘నీట్’కు 97.54 శాతం హాజరు
● జిల్లాలో 16 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ కర్నూలు సిటీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం జాతీయస్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను ప్రశాంతంగా నిర్వహించారు. ఎన్టీఏ నిబంధనలను అనుసరిస్తూ విద్యార్థులను గంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 16 కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష జరిగింది. మొత్తం 4,928 మంది విద్యార్థులకు గాను 4,807 మంది (97.54శాతం ) హాజరు కాగా 121 మంది గైర్హాజరయ్యారు. ఎన్టీఏ నిబంధనల మేరకు ప్రతి ఒక్క విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల వెలుపల విద్యార్థులను మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేశారు. రాయలసీమ యూనివర్సిటీలోని కేంద్రం వద్ద పోలీసుబంద్బస్తు ఏర్పాటు చేశారు. కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన నీట్ కేంద్రాలను జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పరీక్షలు సజావుగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగాయన్నారు. -
అలగనూరు.. గట్టెక్కని మరమ్మతులు
● ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చని టీడీపీ నేతలు ● సాగునీరు లేక పొలాలను బీడుగా పెట్టుకుంటున్న రైతులుగడివేముల: అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్ట కుంగిపోయినా మరమ్మతులు చేయడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందలాది ఎకరాలు బీడుగా మారాయి. మిడుతూరు మండలం అలగనూరు గ్రామం సమీపంలోని కేసీ కెనాల్ 119 కి.మీ దగ్గర రిజార్వాయర్ నిర్మాణానికి 1987లో రూ.3.06 కోట్లతో పరిపాలన అనుమతులు వచ్చాయి. దీనిని 1993 వరకు ఎవరూ పట్టించుకోలేదు. జైకా నిధులతో కేసీ కెనాల్ ఆధునికీకరించే పనుల్లో భాగంగా రూ.59.90 కోట్లతో అలగనూరును చేపట్టారు. పనులు ఆలస్యమైనా 2004లో పూర్తయ్యాయి. రిజర్వాయర్ కెపాసిటీ మూడు టీఎంసీలు కాగా.. 2017 –18 ఒక్కచోట కట్ట బలహీన పడి కుంగింది. అప్పటి ప్రభుత్వం కుంగిన ప్రాంతంలో తాత్కాలికంగా ఇసుకసంచులు వేసి నీటిని నిల్వచేశారు. కాలక్రమేణా మరింత బలహీన పడిపోవడంతో రిజర్వాయర్లో నీటిని నింపడం ప్రమాదకరంగా మారింది. రూ.36 కోట్లతో ప్రతిపాదనలు రిజర్వాయర్ కట్టకు 2017లో కుంగినప్పుడే శాశ్వత మరమ్మతులు చేసుంటే బాగుండేది. అయితే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.3.12 కోట్లు మంజూరు చేసింది. అయితే కట్ట కుంగిన ప్రాంతం మరింత పెరగడంతో రూ.18 కోట్ల దాకా ఎస్టిమేషన్ పంపారు. అంతలోనే ఎన్నికలు రావడంతో నిధులు మంజూరు కాలేదు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కట్ట కుంగిన ప్రాంతాన్ని గత ఏడాది నంద్యాల జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రివైజ్డ్ ఎస్టిమేషన్ వేసి రూ.36 కోట్లకు ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. ఇంతవరకు రిజర్వాయర్కు నిధు లు కేటాయిస్తామని చెప్పడమే తప్ప స్పష్టమైన ప్రకటన రాలేదు. నాటి తప్పిదమే.. 2017లోని ప్రభుత్వం చేసిన తప్పిదాలతో కుంగిన వెంటనే మరమ్మతులు చేయలేదు. రిజర్వాయర్లో నీరు ఉంటే గడివేముల, బూజునూరు, చిందుకూరు, గడిగరేవుల, కొరటమద్ది, పులిమద్ది గ్రామాలకు చెందిన పొలాల్లో భూగర్భజలాలు వృద్ధి చెందుతాయి. బోర్లతో పంటలు పండించుకునే అవకాశం ఉంది. సాగునీరు రాకపోవడంతో రిజర్వాయర్ కింద ఉంటే గ్రామాల్లోని వందలాది ఎకరాలు బీడుగా మారాయి. రిజర్వాయర్లో నీరు నిల్వ లేకుండా పోవడంతో పశువులు, ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకోవాలి. త్వరగా నిధులు మంజూరు చేయించి మరమ్మతులు చేయిస్తే ప్రజలకు తాగునీరు, పొలాలకు సాగునీరు అందుతుంది. –సర్వేశ్రెడ్డి, ఆళ్లగడ్డ గ్రామం ఇదీ సమస్యకోర్టు కేసుల కారణంగా రిజర్వాయర్ ఎర్త్ బండ్ చాలా కాలం పాటు ఆగిపోయింది. లోతైన కొండ గట్టు పోర్షన్లో నేల స్థాయి కంటే తక్కువ పొరల కుదింపు జరుగలేదు. ఈ రిజర్వాయర్ పనులు జరుగుతున్న సమయంలో గడివేముల నుంచి రోళ్లపాడు గ్రామానికి వెళ్లేందుకు ఉన్న రోడ్డును తొలగించకుండా, ఎలాంటి ట్రెంచెస్ వేయకుండానే నిర్మాణం చేపట్టారనే విమర్శలు ఉన్నాయి. నిపుణుల కమిటీ సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తం చేసింది. రోడ్డు ఉన్న ప్రాంతం, గతంలో ఇక్కడ ఉండే చెరువులోకి నీరు వచ్చేందుకు ఉండే వాగు మట్టిని తొలగించక పోవడంతోనే బండ్ కుంగిందని తెలుస్తోంది. రిజర్వాయర్ లోపల వైపునకు 2.5 కి.మీ నుంచి 2.65 కి.మీ, 2.75 నుంచి 2.85 కి.మీ, 2.9 కి.మీ నుంచి 3.00 కి.మీ, 3.15 నుంచి 3.25 కి.మీ వరకు, పైభాగంలో 2.65 కి.మీ నుంచి 2.75 కి.మీ వరకు బండ్ కుంగింది. దిగువ భాగంలో కూడా కొన్ని చోట్ల నీరు సీపేజ్ అవుతున్నట్లు అప్పటి ఇంజినీర్లు గుర్తించారు. -
నాటుసారా తయారీదారులపై ‘పిడి’కిలి
● కడప సెంట్రల్ జైలుకు తరలించిన ఎకై ్సజ్ అధికారులుకర్నూలు: నాటుసారా దొంగచాటుగా తయారుచేసి వ్యాపారం చేస్తున్న ఇద్దరిపై ఎకై ్సజ్ అధికారులు పీడీ చట్టాన్ని ప్రయోగించారు. పత్తికొండ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని మద్దికెర గ్రామానికి చెందిన సాతుపాటి కృష్ణ, కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని కల్లూరు మండలం కొల్లంపల్లి తండా వాసి తెలుగు రామదాసులపై పీడీ చట్టం ప్రయోగించేందుకు ఎకై ్సజ్ అధికారులు జిల్లా కలెక్టర్కు ప్రతిపాదించారు. ఈ మేరకు నిర్బంధ ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి జారీ చేశారు. నాలుగు నెలల వ్యవధిలో సాతుపాటి కృష్ణ, తెలుగు రామదాసుపై నాలుగు చొప్పున సారా రవాణా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇద్దరినీ కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి సుధీర్ బాబు తెలిపారు. నాటుసారా రవాణా, విక్రయాలు మానేస్తే మెప్మా, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ సంక్షేమ విభాగాలతో సమన్వయం చేసి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ పోతుల శ్రీదేవి తెలిపారు. పాత నేరస్తులు సారా వృత్తిని మాని ప్రత్యామ్నాయ ఉపాధి ద్వారా గౌరవప్రదమైన జీవితాన్ని గడపాల్సిందిగా ఆమె సూచించారు. దొంగచాటుగా వ్యాపారం సాగిస్తున్న మరికొంతమందిపై పీడీ చట్టం ప్రయోగించేందుకు జాబితా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తెలుగు రామదాసు సాతుపాటి కృష్ణ -
గరుడ వాహనంపై పాండురంగడు
● ఎనమిదవ రోజుకు చేరిన బ్రహ్మోత్సవాలుకోవెలకుంట్ల: పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం స్వామివారు గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఎనమిదవ రోజు ఆలయ అర్చకులు సుదర్శనాచార్యులు, సంజీవాచార్యులు, పవనాచార్యులు పంచామృతాభిషేకం, మహాగణపతి పూజ, సీ్త్రసూక్త, భూసూక్త విధానేన అభిషేకాలు, సంప్రోక్షణ, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రికి పాండురంగడు ప్రత్యేక అలంకరణంలో గరుడవాహనంపై భక్తులకు కనువిందు చేశారు. ఆలయం నుంచి గాంధీసెంటర్ వరకు స్వామివారి గ్రామోత్సవం వైభవంగా కొనసాగింది. పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన భక్తులు పాండురంగ విఠలేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గరుడసేవను పురష్కరించుని ఆలయ ఆవరణలో నెల్లూరు కళాకారులు నిర్వహించిన ఆర్కెస్ట్రా అలరించింది. సోమవారం గజ వాహన సేవ నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. -
స్కూల్లో సెకెండ్ ప్లేస్లో నిలిచాను
పదో తరగతి పరీక్షలకు ముందు సాక్షి మీడియా గ్రూప్ యాజమాన్యం స్టడీ మెటీరియల్ ఇచ్చారు. గణితం, సైన్స్ మెటీరియల్ చాలా చక్కగా ఉపయోగపడింది. ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టుల్లో ఇచ్చిన సూచనలతో పాటు, స్టడీ మెటీరియల్ను చదడంతో సైన్స్ 100 మార్కులకుగాను 93, గణితంలో 99 మార్కులు వచ్చాయి. మొత్తంగా 561 మార్కులు సాధించి స్కూల్లో సెకెండ్ ప్లేస్లో నిలిచాను. – ధరణి, మద్దికెర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేను హలహర్వి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతూ పదో తరగతి పరీక్షలు రాశాను. 600 మార్కులకుగాను 553 మార్కులు సాధించాను. సాక్షి మీడియా గ్రూప్ యాజమాన్యం ఇచ్చిన స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయోగపడింది. నేను అత్యధిక మార్కులు సాధించాను. – ప్రవీణ్కుమార్, మేదేహల్ గ్రామం, హాలహర్వి మండలం పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించేందుకు ఉపాధ్యాయుల బోధన, సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడ్డాయి. నాకు 550 మార్కులు వస్తాయనే అనుకోలేదు. ఆ మార్కుల సాధనకు సాక్షి స్టడీ మెటీరియల్ చాలా చక్కగా ఉపయోగపడింది. ఈ మెటీరియల్లో చాలా సులభమైన అంశాలు ఉన్నాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ నేర్చుకునేందుకు అవకాశం కలిగింది. – గౌస్ బాషా, ఆలూరు ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాల -
చౌడేశ్వరిదేవి ఆలయ అభివృద్ధికి విరాళం
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయ అభివృద్ధికి అదే గ్రామానికి చెందిన డేరంగుల బాలాంజనేయు లు, నాగార్జున కుటుంబ సభ్యులు రూ.1,50,116 విరాళాన్ని ఆలయ పాలక మండలి చైర్మన్ పీవీ నాగార్జునరెడ్డికి ఆదివారం అందజేశారు. ఈ మేరకు విరాళం అందజేసిన దాత కుటుంబ సభ్యులను సత్కరించారు. నిర్వాసితులకు బాబు ద్రోహం నందికొట్కూరు: శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులకు సీఎం చంద్రబాబు తీరని ద్రోహం చేశారని నీటిముంపు నిరుద్యోగ సంఘం నాయకులు జయన్న ఆరోపించారు. శుక్రవారం పట్టణంలోని కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిపై శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 39 రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోరికలు కోరలేదని, 98 జీవో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. నీటిముంపు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి జీవనభృతి కల్పించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులకు ఇచ్చిన మాటకు కట్టుబడి లష్కర్ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. రహంతుల్లా, నాగేంద్రుడు, నారాయణ, మురళి, మౌలలి, రాజు, తదితరులు పాల్గొన్నారు. మహిళ ఆత్మహత్య బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి అరిగెల శిరీష(37) ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్త రామకృష్ణకు వెన్నెముక ఆపరేషన్ కావడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యాడు. శిరీష కూడా అనారోగ్యం బారిన పడి ఆర్థిక సమస్యలు తలెత్తాయి. మనస్తాపానికి గురై శనివారం రసాయన పౌడర్ను నీటిలో కలిపి తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు వెంటనే బేతంచెర్ల ఆసుపత్రికి తరలించడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి కొడుకు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య బనగానపల్లె: పట్టణంలోని మంగళవారం పేటకు చెందిన చైతన్యరెడ్డి (23) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక రైల్వేస్టేషన్కు రెండు కిలో మీటర్ల దూరంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు నంద్యాల రైల్వే స్టేషన్ ఎస్ఐ కుమారి తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియలేదన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. దోపిడీ దొంగ అరెస్ట్ బొమ్మలసత్రం: పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ వ్యక్తిని బెదిరించి రూ. 20 వేలు దోచుకున్న దొంగను ఆదివారం వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సుధాకర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గడివేముల మండలం కరిమద్దెల గ్రామానికి చెందిన వెంకటస్వామి గత నెల 22వ తేదీ టీవీ కొనేందుకు రూ. 20 వేల నగదుతో బస్టాండ్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. పోరుమామిళ్లకు చెందిన షేక్షఫి స్కూటీపై వచ్చి సుధాకర్ను ఢీకొట్టి చంపుతానని బెదిరించి రూ. 20 వేల నగదు లాక్కుని పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం షేక్షఫిని బస్టాండ్ సమీపంలో గుర్తించి అరెస్ట్ చేశారు. రూ. 20 వేల నగదు, స్కూటీని స్వాధీ నం చేసుకున్నారు. అమ్మవారికి పల్లకీ సేవ శ్రీశైలంటెంపుల్: శ్రీ భ్రమరాంబా, మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులను ఆశీనులు గావించి వేదమంత్రోచ్ఛారణల నడుమ విశేష పూజలు చేసి, మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేపట్టారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. -
పిచ్చి రాతలు రాస్తే ఊరుకునే ప్రసక్తే లేదు!
● కొత్త పింఛన్లు రాలేదని రాయండి ● ‘సూపర్సిక్స్’అమలు కాలేదని ప్రచురించండి ● ఒక పత్రికపై జయమనోజ్రెడ్డి ధ్వజం ఆదోని అర్బన్: పిచ్చి రాతలు రాస్తే ఊరుకునే ప్రసక్తేలేదని ఒక పత్రికపై ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి తనయుడు జయమనోజ్రెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జగనన్న కాలనీలో విజిలెన్స్ విచారణ జరుగుతోందని ఆరోపణలు రావడంపై రెండు రోజుల క్రితమే తన తండ్రి చట్టపరంగా ఎదుర్కోవడానికి ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పారన్నారు. అలాంటిది ఏకపక్షంగా ఒక పత్రిక రాయడంపై మండిపడ్డారు. రాసే ముందు తన వివరణ తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నో హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పటివరకు రెండేళ్లయినా అభివృద్ధి చేయలేదని, అయినా ఆ పత్రిక రాయలేదన్నారు. ఎమ్మెల్యే పార్థసారథిపై ఆరోపణలు వస్తే వాటిని పక్కదోవ పట్టించేందుకు అవాస్తవాలు రాస్తున్నారన్నారు. సూపర్సిక్స్ పథకాలు అమలుకాక, ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఆ పత్రికకు కనపడటం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఇంత వరకు కొత్త పింఛన్లు ఇవ్వలేదని, దానిపై రాయాలని సూచించారు. అభివృద్ధి కనిపించదా? తన తండ్రి హయాంలో ఆదోనిలో జరిగిన రోడ్ల వెడల్పు, అభివృద్ధి గురించి ఆ పత్రికకు కనిపించదా అని జయమనోజ్రెడ్డి ప్రశ్నించారు. మెడికల్ కళాశాల నిర్మాణం దాదాపు రూ.450 కోట్లతో చేపట్టినా, టీడీపీ ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసినా ఎప్పుడూ ఆ పత్రిక రాసింది లేదన్నారు. ఆదోనికి డిగ్రీ కళాశాల తెచ్చింది తన తండ్రే అని, శాశ్వత భవనం లేదని, ప్రభుత్వం నిర్మించాలని రాయొచ్చు కదా అని ప్రశ్నించారు. వాటి గురించి రాస్తే ప్రజలు ఎంతో సంతోషిస్తారు కదా అన్నారు. తాము ఎప్పుడూ ఇక్కడే ఉంటామని, ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమ స్వభావం ఎలాంటిదో ఇక్కడున్న 2.50 లక్షల మంది ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో లీగల్ అడ్వైజర్ జీవన్సింగ్ పాల్గొన్నారు. -
చాలా ఉపయోగపడింది
10వ తరగతి ఫలితాల్లో 566 మార్కుల సాధనకు సాక్షి పత్రిక అందించిన మెటీరియల్ ఎంతో ఉపయోగపడింది. ప్రతి సబ్జెక్టు సరళమైన రీతిలో, త్వరగా అర్థం చేసుకునేలా ఉంది. నేను అన్ని సబ్జెక్టులు పూర్తిగా చదివాను. పలు ప్రశ్నలకు సంబంధించిన డౌట్స్ మా సారొళ్లు చెప్పారు. వారి ప్రోత్సాహం మరువలేనిది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మాలాంటి పేద విద్యార్థులు మెటీరియల్ అందించి మంచి మార్కులు సాధించడానికి దోహదపడిన సాక్షి యాజమాన్యానికి కృతజ్ఞతలు. – మనోహర్, పాములపాడు జెడ్పీ పాఠశాల విద్యార్థి -
హోరాహోరీగా గుర్రపు బండి పోటీలు
కోవెలకుంట్ల: పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోవెలకుంట్ల– ముదిగేడు ఆర్అండ్బీ రహదారిలో ఆదివారం నిర్వహించిన గుర్రపుబండి పరుగు పందెం పోటీలు ఆకట్టుకున్నాయి. జిల్లాలోని బనగానపల్లె, ఆత్మకూరు, బండిఆత్మకూరు, కోవెలకుంట్ల మండలాలకు చెందిన ఎనిమిది గుర్రాలు పోటీల్లో పాల్గొన్నాయి. నిర్ణీత పది కిమీ దూరాన్ని బనగానపల్లెకు చెందిన రాజా గుర్రపు బండి 19.28 నిమిషాల్లో పరిగెత్తి మొదటిస్థానంలో నిలిచి రూ. 10వేల బహుమతి కై వసం చేసుకుంది. ఆత్మకూరుకు చెందిన రసూల్ గుర్రం 20.18 నిమిషాల్లో చేరి ద్వితీయస్థానంలో రూ. 5వేలు, కోవెలకుంట్లకు చెందిన పెద్దయ్య గుర్రం 20.50 నిమిషాల్లో చేరి మూడవ స్థానంలో నిలిచి రూ. 3వేలు బహుమతిని దక్కించుకున్నాయి. పాండురంగస్వామి ఆలయ కమిటీ, కోవెలకుంట్లకు చెందిన పృద్వీరాజ్, పెద్దయ్య ఆర్థిక సహకారంతో గుర్రపుబండి యజమానులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ చిన్న వెంకటసుబ్బారెడ్డి, కరిమద్దెల మురళీకృష్ణ, పెనుగొండ రాజశేఖర్, చెన్నకృష్ణుడు, లక్ష్మినాగేంద్రబాబు, రాంమోహన్రెడ్డి, రాజు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. -
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
కర్నూలు(అర్బన్): వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కర్నూలు యార్డు సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శి ఆర్ జయలక్ష్మి చెప్పారు. ఆదివారం స్థానిక మార్కెట్యార్డులో ఉమ్మడి జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు తెలుగు నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశానికి మార్కెట్యార్డు వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి, ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులు బంగి శ్రీధర్, నంద్యాల జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప, సురేష్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా శేషగిరి శెట్టి మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీలలో 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తించేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు. ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు బంగి శ్రీధర్ మాట్లాడుతూ.. ఉద్యోగులందరు కలిసికట్టుగా ఉంటు హక్కుల సాధనకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎల్లప్పుడు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటరత్నం, కోశాధికారి డీసీ వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారు బీ శ్రీరాములు, ఉపాధ్యక్షులు పీవీ కిరణ్, అనంతపురం, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఈశ్వర్, నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
సమాధులపల్లె భూములు ఆక్రమిస్తే చర్యలు
కల్లూరు: కల్లూరు మండలం బస్తిపాడు గ్రామ పొలిమేరలోని సమాధుల పల్లెలో సర్వే నెంబర్ 382లోని 1.93 ఎకరాల గ్రామ కంఠం భూమిని ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆ భూముల్లో అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. గ్రామ కంఠం భూమిని ఆక్రమించేందుకు టీడీపీ నాయకులు చదును చేయడంతో విషయం తెలుసుకున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి శనివారం స్థానిక నాయకులు, గ్రామస్తులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రజల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. భూములు ఆక్రమిస్తున్నా చర్యలు తీసుకోకపోవడంతో అధికారుల తీరును తూర్పారబడ్డారు. ఈ మేరకు స్పందించిన రెవెన్యూ అధికారులు ఆదివారం హెచ్చరిక బోర్డును పాతారు. ఇది ప్రభుత్వ భూమి అని, సర్వే నెంబర్ 382లోకి అక్రమంగా ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డులో పేర్కొన్నారు. కాటసాని రాంభూపాల్రెడ్డి చొరవతోనే ప్రభుత్వ కబ్జా కాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
దేవుడి మాన్యం సర్వేకు ఎమ్మెల్యే అడ్డంకులు
● నదికై రవాడి గ్రామస్తుల ఆందోళననందవరం: దేవుడి మాన్యం సర్వేకు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని నదికై రవాడి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంజనేస్వామి ఆలయానికి 23.97 ఎకరాల మాన్యం భూమి ఉందని, వాటిని అక్రమంగా అనుభవిస్తున్నారన్నారు. ఆక్రమదారులతో రెవెన్యూ , దేవాదాయ శాఖ అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దేవుడి మాన్యం రీ సర్వేకు హాజరు కావాలని గ్రామపెద్దలకు నోటీసులు ఇచ్చి శనివారం అధికారులు రాకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు వెంకటేష్, కృష్ణమూర్తి మాట్లాడుతూ.. గ్రామస్తులమంతా ఉదయం 9 గంటలకు దేవుడి మాన్యం సర్వేకు వచ్చామని మధ్యాహ్నం 1 గంట వరకు అధికారులు రాకపోవడం ఆశ్చర్యాన్ని గురిచేస్తోందన్నారు. అధికారులు స్పందించకపోతే విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మధ్యాహ్నం 2 గంటలకు మండల సర్వేయర్ అక్బర్బాషా, సర్వే సిబ్బంది హాజరు కావడంతో వారితో గ్రామస్తులు వాగ్వాదం చేశారు. సర్వే అధికారి అక్బర్బాషా మాట్లాడుతూ.. గ్రామస్తులకు నోటీసులు జారీ చేసిన విషయం వాస్తమవేనని, సర్వేకు దేవాదాయ శాఖ అధికారులు రాలేదని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం నదికై రవాడి దేవుడి మాన్యం సర్వేలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. సర్వే కోసం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ అబ్దుల్వాహబ్, ఆదోని డివిజన్ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లులు, ఆర్ఎస్డీటీ మహేస్కుమార్, మండల సర్వేయర్ అక్బర్ బాషా సమావేశం నిర్వహించారు. అనంతరం అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో సర్వేకు హాజరు కాలేదు. అధికారుల నిర్లక్ష్యంతో దేవుడి మాన్యం సర్వే వాయిదా పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అసిస్టెంట్ దేవాదాయ శాఖ కమిషనర్ సుధాకర్రెడ్డిని ఫోన్ ద్వారా వివరణ కోరగా.. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మూడు రోజుల పాటు సర్వేను వాయిదా వేయమని కోరినట్లు తెలిపారు. -
చెరువులో బాలిక గల్లంతు
● స్నానానికి వెళ్తూ జారిపడిన తల్లీబిడ్డ ● తల్లిని రక్షించిన స్థానికులు ● బాలిక కోసం గాలింపు చర్యలు ఎమ్మిగనూరురూరల్: గుడేకల్ గ్రామంలో అల్లీపీరస్వామి ఉరుసుకు కుటుంబంతో వచ్చిన ఓ బాలిక ప్రమాదవశాత్తూ చెరువులో గల్లంతైంది. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన రజియా తన కుమార్తె ఆఫ్రిన్(7)తో శుక్రవారం సాయంత్రం బంధువులతో గుడేకల్లుకు చేరుకుంది. రాత్రి దర్గా సమీపంలో నిద్రపోయి శనివారం ఉదయం చెరువు దగ్గర స్నానం చేసేందుకు బంధువులతో కలసి వెళ్లారు. చెరువు దగ్గర సిమెంట్ దిమ్మైపె రజియా, ఆఫ్రిన్ నడుస్తుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి ఇద్దరూ చెరువులో పడిపోయారు. అయితే అక్కడే స్నానాలు చేస్తున్న కొందరు వెంటనే రజియాను రక్షించి బయటకు తీసుకురాగా, బాలిక జాడ కనిపించ లేదు. వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం అందించటంతో రూరల్ సీఐ చిరంజీవి, నందవరం ఎస్ఐ తిమ్మారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఫైర్ అధికారి ఆంజనేయులు సంఘటన స్థలానికి చేరుకొని గత ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ ముర్రవాడ భార్గవి చెరువు దగ్గరకు చేరుకొని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. రజియా భర్త సిద్దూసాబ్ చనిపోగా తన ముగ్గురు కమార్తెలను పోషిస్తూ జీవనం సాగిస్తుంది. చివరి అమ్మాయి ఆఫ్రిన్ చెరువులో పడి మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా విలిపిస్తోంది. సాయంత్రం వరకు బాలిక జాడ కనిపించకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రప్పిస్తున్నట్లు సీఐ చిరంజీవి తెలిపారు. దైవ దర్శనం కోసం విషాదం చోటు చేసుకుందని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. -
జిల్లావ్యాప్తంగా మెగా కార్డెన్ సెర్చ్
కర్నూలు: ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా శనివారం మెగా కార్డ్డెన్ సెర్చ్ (నిర్బంధ తనిఖీలు) నిర్వహించారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దేవనకొండ మండలం కప్పట్రాళ్ల, ఎమ్మిగనూరు సబ్డివిజన్లోని లచ్చుమర్రి, ఆదోని సబ్ డివిజన్లోని కపటి, కర్నూలులోని జొహరాపురం, ఇందిరమ్మ హౌసింగ్ కాలనీలోని అనుమానితుల ఇళ్లలో సోదాలు చేశారు. మొత్తం 165 వాహనాలను తనిఖీ చేసి 53 వాహనాలకు పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకొని స్టేషన్లకు తరలించారు.పరిసర ప్రాంతాల్లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల సమాచారం ఉంటే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్: 1972కు సమాచారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలతో కలిసి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. -
టీడీపీ నేతలు భూ కబ్జాదారులు
కల్లూరు: ఖాళీ భూమి కనిపిస్తే చాలు టీడీపీ నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. కల్లూరు మండలం బస్తిపాడు గ్రామ పొలిమేరలో ఉన్న సమాధుల పల్లెలో రూ. కోట్ల విలువైన గ్రామకంఠం భూమిని టీడీపీ నాయకులు ఆక్రమించేందుకు చదును చేశారు. విషయం తెలుసుకున్న కాటసాని శనివారం స్థానిక నాయకులు, గ్రామస్తులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో టీడీపీ నేతల భూ ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని విమర్శించారు. అధికార పార్టీ నేతలమంటూ ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ గద్దల్లా వాలిపోయి కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. బస్తిపాడు గ్రామ పరిధిలోని సమాధుల పల్లెలో ఉన్న గ్రామకంఠం భూమిని టీడీపీ నాయకులు ఎలా ఆక్రమిస్తారని మండిపడ్డారు. సర్వే నెంబర్ 382లోని 1.93 ఎకరాలను టీడీపీ నాయకులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలను, కబ్జాలను కచ్చితంగా అడ్డుకొని తీరుతామన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కబ్జా చేసిన భూములను ప్రజలకే స్వాధీనం చేస్తామన్నారు. కబ్జాదారులకు వత్తాసు పలికే అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత ఎన్నికల్లో గెలవడం కోసం తనపై అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేశారని, ఎవరు ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తున్నారో ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల తరఫున పోరాటం చేస్తుందన్నారు. ఖాళీ భూమి కనిపిస్తే చాలు అక్రమించేస్తున్నారు రూ. కోట్ల విలువైన గ్రామకంఠం భూమి ఆక్రమణను అడ్డుకుంటాం ప్రజల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి -
భద్రత, సంక్షేమం ప్రభుత్వ బాధ్యత
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డికర్నూలు (టౌన్): కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మేడే వేడుకలు నిర్వహించారు. స్థానిక సి.క్యాంపు సెంటర్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు. పార్టీ నాయకులు కార్మికుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక లోకం సాగించిన దీర్ఘకాల పోరాట ఫలితంగా 8 గంటల పని హక్కును సాధించుకున్న చారిత్రాత్మక రోజు మేడే అన్నారు. సమాన హక్కులు, గౌరవ ప్రదమైన జీవితం కోసం కార్మికులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమన్నారు. దేశ అభివృద్ధిలో కార్మికులు, కర్షకులు ప్రధాన స్తంభాలని వారి సంక్షేమం, హక్కుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అన్నారు. కార్మికులకు తగిన గౌరవం, భద్రత, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలన్నారు. కార్మికుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు. ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, ట్రేడ్ యూనియన్ అధికార ప్రతినిధి కటారి సురేష్, నగర అధ్యక్షుడు ప్రకాష్, రామాంజనేయులు, బబ్లూ గోల్డ్ శీను, నగర మహిళా అధ్యక్షురాలు మంగమ్మ, ట్రేడ్ యూనియన్ నాయకులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ అక్రమాలపై విచారణ
కౌతాళం: అక్రమార్కులకు ‘ఉపాధి’ అన్న శీర్షిక ఏప్రిల్ 30న గురువారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కౌతాళం మండలంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ నిధులు కొల్లగొట్టిన తీరుపై శుక్రవారం ఆదోని డివిజన్ ఏపీడీ లోకేశ్వర విచారణ చేపట్టారు. కౌతాళం ఎంపీడీఓ కార్యాలయంలో వివరాలు సేకరించారు. ఎంబుక్ లేకుండా పనిచేయని 98 పనులకు చెక్ మెజర్మెంట్ చేయడంపై ఏపీడీని వివరణ కోరారు. ఎంబుక్ లేనివి ఎంపీడీఓతో డీలిట్ చేసినట్లు ఎంబుక్ ఉన్న వాటికి మాత్రమే బిల్లులు చేసినట్లు ఈసీ వ్యక్తిగతంగా హజరై రాతపూర్వకంగా వివరణ ఇచ్చినట్లు ఏపీడీ తెలిపారు. నీట్ సందేహాల నివృత్తికి హెల్ప్డెస్క్ కర్నూలు(సెంట్రల్): ఈనెల 3న నిర్వహించనున్న నీట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి సందేహాలు, సలహాల కోసం కలెక్టరేట్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి సందేహాలున్నా 08518–277305 నంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చన్నారు. డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్ కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం జరిగిన డిగ్రీ నాల్గవ సెమిస్టర్ పరీక్షల్లో 95 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో ముగ్గురు విద్యార్థులు చూచి రాతలకు పాల్పడగా డిబార్ చేశారు. -
దూరమెరగని దాహం
వేసవికాలం ప్రారంభం నుంచి పశ్చిమ ప్రాంతంలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి. అధికారులు, పాలకులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు తాగునీటిని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు వదులుకొని కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బోరుబావుల నుంచి నీళ్లు తెచ్చుకొని గొంతుతడుపుకుంటున్నారు. నందవరం మండలం ఇబ్రహీంపురం గ్రామంలో మంచినీటి పథకాలు సక్రమంగా పనిచేయకపోవడంతో మండుటెండలో మహిళలు, చిన్నారులు తోపుడుబండ్లు తీసుకెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. తాగునీటి సమస్య తీవ్రతకు అద్దంపట్టే ఈ దృశ్యాలు చూసైనా అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. –నందవరం -
సూపరింటెండెంట్ ఆకస్మిక తనిఖీ
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు శుక్రవారం పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్యూటీలో ఉన్న వైద్యులు నిర్ణీత సమయానికి వస్తున్నారా?, షిఫ్ట్ సమయం ముగిసే వరకు అందుబాటులో ఉంటున్నారా? అని పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆసుపత్రి సేవలను డిజిటలైజ్ చేసే క్రమంలో నెక్ట్స్ జనరేషన్ ఈ–హాస్పిటల్ వెబ్సైట్లో రోగులకు సంబంధించిన వివరాలు, రిపోర్టులు, ఇతర సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు. ఆయన వెంట ఆర్ఎంఓలు, అడ్మినిస్ట్రేషన్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. కేస్ షీట్ల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి కర్నూలు(హాస్పిటల్): కేస్ షీట్ల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు నర్సులను ఆదేశించారు. ఆయన శుక్రవారం ఆసుపత్రిలోని ధన్వంతరి హాలులో మాట్లాడుతూ.. రోగి ఆసుపత్రికి వచ్చిన సమయం నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ప్రతి అంశాన్ని కేసు షీట్లో క్షుణ్ణంగా నమోదు చేయాలన్నారు. రోగి ఏ పరిస్థితిలో ఆసుపత్రిలో చేరారు. వారికి అందించిన వైద్యసేవలు, నిర్వహించిన పరీక్షల వివరాలు స్పష్టంగా ఉండాలన్నారు. వైద్యసేవల్లో పారదర్శకతను పెంచేందుకు, రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రతి స్టాఫ్నర్సు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అధికారులు, హెడ్నర్సులు, స్టాఫ్నర్సులు పాల్గొన్నారు. -
తెలుగుగంగ కాలువలో పడిన టిప్పర్
● మట్టిని ఓవర్లోడ్ చేసుకొని వెళ్తుండగా ఘటన ● తెలుగు గంగ కట్టకు పొంచి ఉన్న ముప్పు మహానంది: మట్టిని ఓవర్లోడ్ చేసుకుని వస్తున్న టిప్పర్ అదుపు తప్పి తెలుగుగంగ కాల్వలో పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలం కృష్ణనంది సమీప ంలోని పొలాల నుంచి ఇటీవల నిత్యం వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. శు క్రవారం కృష్ణనంది నుంచి తెలుగుగంగ కట్టమీదు గా మహానంది, నంద్యాల వైపు వస్తున్న టిప్పర్ అ దుపు తప్పి గంగ కాలువలో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడినట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా కట్ట వెంట భారీగా టిప్పర్లు మహానంది, బండిఆత్మకూరు మండలాలకు చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు ఎర్రమట్టి, గ్రావెల్ను వెంచర్లు, ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. గాజులపల్లె, కృష్ణనంది సమీపంలోని కొన్ని పంట పొలాల్లో మట్టిని తరలించేందుకు అధికారపార్టీ నేతలు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. రెండు మండలాలకు చెందిన కీలక నేతలు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు తెలిసింది. అన్ని అనుమతులు ఉన్నాయంటూనే తెలుగుగంగ కట్ట వెంట భారీగా టిప్పర్లను తరలిస్తుండటం వల్ల కట్టకు ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే పలు చోట్ల కట్ట బలహీనంగా ఉండి, గండ్లు పడిన విషయం తెలిసిందే. కృష్ణనంది నుంచి వచ్చేవి, గాజులపల్లె నుంచి తరలించేవి తెలుగుగంగ కట్టమీదుగా అయ్యన్ననగర్ వరకు వచ్చి అక్కడి నుంచి నంద్యాల, ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. తెలుగుగంగ కాల్వ కట్టమీదుగా ఎలాంటి భారీ వాహనాలు వెళ్లకూడదన్న నిబంధనలు ఉన్నాయి. అయితే అధికారపార్టీకి చెందిన వారు కావడంతో సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాయల్టీ చెల్లింపుతో సహా అన్ని రకాల అనుమతులు ఉంటే ప్రధాన రహదారుల వెంట తీసుకెళ్లవచ్చు కదా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని శాఖల అధికారులకు మామూళ్లు ముట్టాయని, విజిలెన్స్, మైనింగ్శాఖల అధికారులు తనిఖీలు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అధికారపార్టీకి చెందిన ఓ వర్గం నేతలు పేర్కొంటున్నారు. -
హోటల్లో షార్ట్సర్క్యూట్
బేతంచెర్ల: పట్టణంలోని నగర పంచాయతీ సమీపాన ఉన్న మహబూబ్ హోటల్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్టు సర్క్యూట్ జరిగి రూ. 2.50 లక్షల ఆస్తి నష్టం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన హోటల్ నిర్వాహకు డు రసూల్గురువారం రాత్రి 11 గంటల సమ యంలో హోటల్ బంద్ చేసి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం తెల్లవారుజామున హోటల్లో నుంచి మంటలు రావడాన్ని గమనించిన స్థానికు లు వెంటనే ఆయనకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన వెళ్లి చూడగా హోటల్లోని ఫ్రిజ్ లో షార్టు సర్క్యూట్ జరిగి పక్కనే ఉన్న వంట సామగ్రి, కుర్చీలు, టేబుల్స్, 15 వేల నగదు, బియ్యం బస్తాలు, మిక్సి, గ్రైండర్ కాలిపోయా యి. సుమారు రూ. 2.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. గ్యాస్ సిలిండర్ల దగ్గరకు మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పట్టీ రాయించాడు.. సరుకులు పట్టుకెళ్లాడు మద్దికెర: మోసానికి కాదేది అనర్హం అంటున్నా రు కొందరు కేటుగాళ్లు. ఎదుటివాడికి ఎలాంటి అనుమానం కలగకుండా మాయమాటల తో నమ్మించి చీటింగ్ చేస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కొందరు వారి వలలో పడి లబోదిబోమంటున్నారు. తాజాగా మద్దికెరలో ని ఓ దుకాణాదారుడికి కేటుగాడు రూ. 40వేలు టోకరా వేశాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు.. గురువారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మద్దికెరలోని ఓ కిరాణ దుకాణానికి వచ్చాడు. దాదాపు రూ. 1.50 లక్షలు విలువ చేసే సరుకుల పట్టీ రా యించాడు. వ్యాపారి ఆ పట్టీ ప్రకారం సరుకు లు ప్యాక్ చేసి పెట్టారు. అందులో దాదాపు రూ.40 వేలు విలువ చేసే సిగరెట్లు ప్రత్యేకంగా ప్యాక్ చేయించుకున్నాడు. ఆటో తీసుకొచ్చి డ బ్బులు చెల్లించి సరుకులు తీసుకెళ్తానని నమ్మించి సిగరెట్లు వెంట పట్టుకెళ్లాడు. రాత్రయినా రాకపోవడంతో మోసపోయానని గమనించి లబోదిబోమనడం దుకాణాదారుడి వంతైంది. పతకాలు సాధించాలి కర్నూలు (టౌన్) : అథ్లెటిక్స్లో జిల్లాకు పతకాలు తీసుకురావాలని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. శుక్ర వారం స్థానిక బి. క్యాంపు క్రీడా మైదానంలో ఉ మ్మడి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించారు.పోటీలను ప్రారంభించిన ఆయన ఎంపిక పోటీల్లో రాణించిన క్రీడాకారులు ఈనెల 5 వ తేదీ గుంటూరు నాగర్జున యూనివర్సీటీ క్రీడా మైదానంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో విక్టర్, పీడీలు లక్ష్మయ్య, అథ్లెటిక్స్ కోచ్ కాశీరావు, జనార్దన్, మల్లేష్ పాల్గొన్నారు. గడ్డివాములు దగ్ధం నందవరం: మండల పరిధిలోని హెచ్.బాపురం గ్రామంలో గురువారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. బోయ మునెప్ప గారి రామన్న అనే రైతు తన వాముదొడ్డిలో రెండు గడ్డి వాములు వేసుకున్నాడు. గురువారం అర్ధరాత్రి గడ్డివాముల నుంచి మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి రైతుకు స మాచారం అందించారు. ఆర్పేందుకు ప్రయత్నించేలోపు అవి పూర్తిగా కాలిపోవడంతో దాదాపు రూ.70 వేలు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయారు. ప్రభుత్వం స్పందించి పరిహారం అందించాలని ఆయన కోరారు. చిన్న నేలటూర్లో .. గోనెగండ్ల: మండల పరిధిలోని చిన్ననేలటూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గడ్డి వాములు దగ్ధమయ్యాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతోనే ఇలా జరిగిందని బాధిత రైతు ఈడిగ లక్ష్మన్న వాపోయాడు. గడ్డి వాముల దగ్ధంతో బాధితుడికి రూ. 1.50 లక్షలు నష్టం వాటిల్లింది. ఆదోని సెంట్రల్: ఆదోని రైల్వేస్టేషన్ పరిధిలోని కుప్పగల్–కోసిగి రైల్వేస్టేషన్ మధ్యలో కి.మీ.నంబర్ 516/17–19 అప్ ట్రాక్ మధ్యలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని ఆదోని రైల్వే పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సి.శివరామయ్య తెలిపారు. ఆదోని రైల్వే స్టేషన్ మాస్టర్ వెంకటేశ్వర్లు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించామన్నారు. మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని, ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఎడమచేతికి చక్రం ఆకారంలో పచ్చబొట్టు ఉందని, నలుపు రంగు లోయర్, బ్లూ రంగు ఫుల్ డ్రాయర్, కాఫీ కలర్ టీ షర్ట్ ధరించాడని చెప్పారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
మతసామరస్యానికి ప్రతీకలు దర్గాలు
● ఖాదర్లింగస్వామి సన్నిధిలో కాటిగి పీఠాధిపతి కౌతాళం: మతసామరస్యాలకు దర్గాలు ప్రతీకలుగా నిలుస్తాయని కర్ణాటక రాష్ట్రంలోని కాటిగి తలెకాన మఠం పీఠాధిపతి వీరభద్రస్వామి అన్నారు. కౌతాళంలో జగద్గురు ఖాదర్లింగస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు ధర్మకర్త మున్నపాషా చిష్తీ, పీఠాదిపతి ఖాదర్బాష చిస్తీలు స్వాగతం పలికారు. స్వామి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. అనంతరం శాలువ పూలమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి వీరభద్రస్వామి మాట్లాడుతూ ప్రజలు కులమతాలకు అతీతంగా ఖాదర్లింగస్వామిని దర్శించుకుంటున్నారన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని దర్గాలో పంచాంగ పఠనం చేస్తున్నారన్నారు. ఇలాంటి సంప్రదాయాలు అన్ని చోట్ల ఉండటం ఎంతో అవసరం అన్నారు. -
వైభవం.. పీఠాధిపతి పట్టాభిషేకం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల 14వ పట్టాభిషేక మహోత్సాలు వైభవంగా నిర్వహించారు. తొలుత ఊంజల మండపంలో యజ్ఞ యాగాలు చేపట్టారు. శ్రీమఠం ప్రాంగణంలో బ్రహ్మర్చిత శ్రీమూలరామదేవర పూజ, అదే విధంగా షోడశా బాహు శ్రీనరసింహా పూజను పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నిర్వహించారు. గ్రామదేవత మంచాలమ్మ, రాఘవేంద్రస్వాములకు విశేష పూజలు చేపట్టి మహా మంగళహారతులు ఇచ్చారు. పరమ పావన శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల అభినందన కార్యక్రమం శ్రీమఠం మేనేజర్, సిబ్బంది, శిష్యబృందం, భక్తులతో, మంత్రాలయం నివాసులు ఘనంగా చేపట్టారు. అనంతరం శ్రీమఠం పీఠాధిపతిని గజమాలతో, పూలతో శ్రీమఠం అధికారులు సన్మానించారు. మేనేజర్ ఎస్కె.శ్రీనివాసరావు రచించిన పుస్తకావిష్కరణ జరిగింది. అనంతరం భక్తులు పీఠాధిపతికి తులభారం నిర్వహించారు.కార్యక్రమంలో మేనేజర్–2 వెంకటేష్జోషి, శ్రీమఠం ఇంజినీర్ సురేష్ కోనాపూర్, శ్రీమఠం సిబ్బంది పాల్గొన్నారు. -
ఘనంగా ప్రసాదం పంపిణీ
కౌతాళం: కౌతాళంలో మతసామరస్యానికి ప్రతీకగా వెలసిన జగద్గురు ఖాదర్లింగ స్వామి ఉరుసు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సఫ్రాలుట్న (ప్రసాదం పంపిణీ) కార్యక్రమం ఘనంగా జరిగింది. దర్గా ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చీష్తీ ఇంట్లో మట్టి కుండల్లో ప్రత్యేంగా తయారు చేసిన తీపి పదార్థాన్ని డప్పువాయిద్యాలు, బ్యాండుమేళాల మధ్య దర్గాకు తీసుకొచ్చి ప్రత్యేక ఫాతెహాలు సమర్పించారు. అనంతరం ధర్మకర్త ప్రసాదం పంపిణీ ప్రారంభించడంతో భక్తులు ఎగబడ్డారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండ సీఐ యుగంధర్ గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. దర్గాను దర్శించుకున్న అడిషనల్ ఎస్పీ జిల్లా అడిషనల్ ఎస్పీ జి.హుసేన్పీరా ఫ్యాక్షన్ జోన్ సీఐ పార్థసారథి, కౌతాళం సీఐ యుగంధర్తో కలిసి ఖాదర్లింగస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ధర్మకర్త మున్నపాషా చిష్తీ, పీఠాధిపతి ఖాదర్బాషా చిస్తీలు ఘన స్వాగతం పలికి స్వామి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. అనంతరం శాలువ పూలమాలతో సత్కారించి దర్గా ఫొటో అందజేశారు. కొనసాగుతున్న కౌతాళం దర్గా ఉత్సవాలు -
‘పచ్చని’ పెళ్లి పిలుపు
అవుకు(కొలిమిగుండ్ల): సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా పెళ్లి అంటే వారి స్థాయికి తగ్గట్లుగా శుభలేఖలు అచ్చు వేయించి పంచుతుంటారు. ధనవంతులు పెండ్లి పత్రిక అందంగా, ఖరీదుగా ఉండేలా చూసుకుంటారు. కానీ వీటన్నిటింటికీ భిన్నంగా అవుకు మండలం మెట్టుపల్లెలో శుక్రవారం బ్యాగులో మొక్కలు ఉంచి బంధువులు, గ్రామస్తులను ఆహ్వానించారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మేకల వెంకటేశ్వరరెడ్డి పెద్ద కుమారుడు ఉపేంద్రరెడ్డి వివాహం సందర్భంగా ఆయన సోదరుడు, సుప్రీంకోర్టు న్యాయవాది గణేష్రెడ్డి ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాగులపై పెళ్లి వివరాలు ముద్రించారు. వాటిలోనే మొక్కలను పెట్టి ఊర్లో బంధువులు, మిత్రుల ఇంటింటికీ వెళ్లి అందిస్తూ తమ సోదరుడి వివాహానికి రావాలని కోరుతున్నారు. తప్పకుండా మొక్కలను మీ ఇళ్ల వద్ద నాటుకోవాలని సూచిస్తుండటం విశేషం. -
5న ఉపాధి కార్యాలయంలో జాబ్మేళా
కర్నూలు(సెంట్రల్): ఉపాధి కార్యాలయంలో ఈనెల 5న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.దీప్తి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబ్మేళాలో అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టు, ఫార్మ ట్రైనీ అసోసియేట్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు, స్కిల్ టెస్టులు నిర్వహిస్తారన్నారు. మొత్తం 100 ఖాళీలు ఉన్నాయని.. టెన్త్, ఇంటర్, డిగ్రీ ఫార్మసీ–డీ/బీ/ఎం/ఎం ఫార్మసీ పాసై 18–30 సంవత్సరాల మధ్య వయస్సు యువతీ యువకులు అర్హులన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు 5వ తేదీన ఉపాధి కార్యాలయంలో 10 నుంచి 5 గంటల మధ్య ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు www.ncs.gov.in, www.empoyment.ap.gov.in అనే వెబ్సైట్లలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఐదేళ్ల బాలుడికి డెంగీ ఆలూరు రూరల్: స్థానిక సిద్దేశ్వర కాలనీకి చెందిన ఓ బాలుడికి డెంగీ పాజిటివ్ నమోదైనట్లు మలేరియా నివారణ ఆదోని ప్రాంతీయ అధికారి మంజునాథ్ తెలిపారు. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఐదేళ్ల బాలుడికి గత నెల 27న తీవ్ర జ్వరం రావడంతో కర్నూలు సర్వజన ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. 28న వైద్య పరీక్షల్లో బాలుడికి డెంగీ పాజిటివ్గా నిర్ధారించారు. అయితే మెరుగైన చికిత్స అందించడంతో ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం వైద్యారోగ్య శాఖ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది బాలుడి ఇంటి పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మలేరియా అధికారిగా వెంకటేశులు కర్నూలు(హాస్పిటల్): జిల్లా మలేరియా నియంత్రణ అధికారిగా టి.వెంకటేశులు నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సీనియర్ ఎంటమాలజిస్టుగా పనిచేస్తున్న ఆయనకు ఇన్ఛార్జి మలేరియా అధికారిగా బాధ్యతలు అప్పజెప్పారు. త్వరలో ఎంటమాలజిస్టులను మలేరియా అధికారులుగా నియమించనున్నారు. అప్పటి వరకు ఈయనే ఆ పోస్టులో కొనసాగనున్నారు. జిల్లా మలేరియా అధికారి నూకరాజు గురువారం ఉద్యోగ విరమణ చేయడంతో ఆ పోస్టు ఖాళీగా మారిన విషయం విదితమే. అనంతపురం జిల్లాకు చెందిన వెంకటేశులు హెల్త్ అసిస్టెంట్గా, హెల్త్ సూపర్వైజర్గా, సబ్ యూనిట్ మలేరియా అధికారిగా, అసిస్టెంట్ మలేరియా అధికారిగా, సీనియర్ ఎంటమాలజిస్టుగా వివిధ స్థాయిల్లో విధులు నిర్వహించారు. హెల్త్ యూనివర్సిటీ సెనేట్ మెంబర్లుగా కేఎంసీ వైద్యులు కర్నూలు(హాస్పిటల్): డాక్టర్ ఎన్టిఆర్ హెల్త్ యూనివర్సిటీ సెనేట్ మెంబర్లుగా కర్నూలు మెడికల్ కాలేజి వైద్యులు నియమితులయ్యారు. ఇందులో కళాశాల వైస్ ప్రిన్సిపల్, కమ్యూనిటీ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ సింధియా శుభప్రద, పెథాలజి హెచ్ఓడీ డాక్టర్ బాలేశ్వరి, జనరల్ సర్జరి ప్రొఫెసర్ డాక్టర్ జయరామ్ ఉన్నారు. వీరు ముగ్గురూ మూడు సంవత్సరాల పాటు యూనివర్సిటీకి సెనెట్ మెంబర్లుగా వ్యవహరిస్తారు. వీరి ఎంపిక పట్ల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ అభినందించారు. అటవీ శాఖ కర్నూలు సర్కిల్ కన్జర్వేటర్గా సెల్వం కర్నూలు కల్చరల్: అటవీ శాఖ కర్నూలు సర్కిల్ కన్జర్వేటర్గా 2012 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి సి.సెల్వం నియమితులయ్యారు. పలువురు కన్జర్వేటర్లకు స్థానచలనం కలిగింది. కర్నూలు కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా విధులు నిర్వహిస్తున్న 2010 బ్యాచ్ ఐఎఫ్ఎస్ బీవీఏ కృష్ణమూర్తిని విశాఖపట్నం ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఏపీఎఫ్డీసీ లిమిటెడ్ ఆర్ఎంగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో తిరుపతి ఎస్వీ జూలాజికల్ పార్క్ క్యురేటర్గా విధులు నిర్వహిస్తున్న సి.సెల్వంను నియమించారు. నంద్యాల ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్ డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న 2020 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అనురాగ్మీనాను తిరుపతి ఎస్వీ జూలాజికల్ పార్క్ క్యురేటర్గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో మంగళగిరి పీసీసీఎఫ్ కార్యాలయంలో ఐటీ వింగ్ డిప్యూటీ సీఎఫ్గా విధులు నిర్వహిస్తున్న 2019 బ్యాచ్ ఐఎఫ్ఎస్ సి.చైతన్య కుమార్ రెడ్డిని నియమించారు. -
అనుమతులు లేని విత్తనాలు సీజ్
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని శ్రీసాయిరాం సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణంలో శుక్రవారం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కమిషనరేట్ సహాయ సంచాలకుడు ప్రవీణ్, ఏఓ మోహన్, ఏడీఏ మహమ్మద్ఖాద్రి, ఏఓ శివశంకర్ బృందం ఈ తనిఖీల్లో పాల్గొంది. ఎటువంటి అనుమతి లేకుండా విక్రయించేందుకు సిద్ధం చేసిన రూ. 25,35,142 విలువైన 2,482 విత్తన ప్యాకెట్లు, రూ. 1,91,000 విలువ చేసే బయో మందులను సీజ్ చేశారు. మొత్తం రూ. 27,26,142 విలువైన విత్తనాలు, బయో మందుల అమ్మకాలను నిలిపివేశారు. అనంతరం శ్రీ మైత్రీ ఆగ్రోస్ ఏజెన్సీ, చంద్ర ట్రేడర్స్లోనూ వారు విత్తనాలను తనిఖీ చేశారు.


