Sakshi Special
-
డాల్ఫిన్.. నాట్ ఫైన్!
దేశంలో నదీ డాల్ఫిన్ల సంఖ్య ఒక పక్క పెరుగుతున్నా, మరోవైపు వాటి మనుగడ సైతం ప్రశ్నార్థకమవుతోంది. ఉత్తర భారతంలోని గంగా, బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలే ప్రధానంగా వీటికి ఆవాసంగా ఉన్నాయి. తాజా సర్వే ప్రకారం, దేశీయ నదుల్లో 6,327 డాల్ఫిన్లను గుర్తించారు. వీటిల్లో రెండు రకాలుృ గంగాటిక్ , సింధు డాల్ఫిన్లుగా పరిగణిస్తున్నారు. ఈ జాతులను ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) అంతరించిపోతున్న జాతులుగా వర్గీకరించడం ఆందోళన కలిగిస్తోంది. - సాక్షి, అమరావతి నదుల్లోకి ఎలా? మిలియన్ ఏళ్ల క్రితం ఇవి సముద్ర డాల్ఫిన్ల నుంచి ఉద్భవించినట్టు భావిస్తున్నారు. ఒకప్పుడు దక్షిణాసియాలో లోతట్టు ప్రాంతాలను సముద్రాలు ముంచెత్తినప్పుడు, ఈ డాల్ఫిన్లు నదుల్లోకి చేరుకున్నట్టు అంచనా. సముద్రంలో నివసించే డాల్ఫిన్ల నుంచి తమకు తాము వేరుచేసుకుని నివసించగలిగే లక్షణాలను అభివృద్ధి చేసుకున్నట్టు తెలుస్తోంది. సముద్రంలోని డాల్ఫిన్లకు గంగా నది డాల్ఫిన్లకు కొన్ని అంశాల్లో వ్యత్యాసాలు కనిపిస్తాయి. నది డాల్ఫిన్లు నీటిలో ఎగసి దూకలేవు. నిటారుగా కూడా ఈత కొట్టలేవు. పక్కకు ఈదుతాయి. ఎక్కువ సేపు నీటి అడుగు భాగానే ఉంటాయి. పొడవైన ముక్కు కలిగి, దాదాపు దృష్టి సామర్థ్యం తక్కువతో మనుగడ సాగిస్తాయి. జాతీయ జల జంతువుకు సమస్యలు.. » ఆనకట్టల నిర్మాణం. » డాల్ఫిన్లను వాటి మాంసం, బ్లబ్బర్ (మందపాటి కొవ్వు పొర) కోసం వేటాడుతున్నారు. వాటి నుంచి నూనెలు తీసి చేపలు పట్టడానికి ఎరగా ఉపయోగిస్తున్నారు. » చేపల వేట తీగల్లో చిక్కుకుని కొన్ని మృత్యువాత పడుతున్నాయి. » గత దశాబ్దంగా పుంజుకుంటున్న నది క్రూయిజ్ పర్యాటకం. క్రూయిజ్ల నుంచి వచ్చే శబ్దాలను తట్టుకుని డాల్ఫిన్లు మనుగడ సాగించడం కష్టంగా మారుతోంది. చైనాలోని యాంగ్జీ నదిలో బైజీ డాల్ఫిన్ల విషయంలో ఇదే జరిగింది. »దృష్టి సామర్థ్యం సరిగా లేకపోవడంతో ఈ డాల్ఫిన్లు నెమ్మదిగా ఈత కొడతాయి. ఫలితంగా పడవలను ఢీకొనే అవకాశం ఎక్కువగా ఉంటోంది. » దేశ వన్యప్రాణుల చట్ట ప్రకారం డాల్ఫిన్లకు హాని తలపెడితే కఠిన శిక్షలు విధిస్తారు. ఫలితంగా వీటి మరణాలపై జాలరులకు సమాచారం తెలిసినప్పటికీ, కేసులకు భయపడి రిపోర్టు చేయడం లేదు. » పునరుత్పత్తి చక్రం నెమ్మదిగానే ఉంటోంది. ఇవి 6ృ10 సంవత్సరాలకు మధ్య పరిపక్వం చెందుతున్నాయి. ప్రతి రెండు నుంచి మూడేళ్లకు ఒక జీవికి మాత్రమే జన్మనిస్తాయి. ఊరటనిచ్చే అంశమే అయినా... 2009లో గంగా నది డాల్ఫిన్ల పరిరక్షణ ధ్యేయంగా కేంద్రం దీనిని జాతీయ జల జంతువుగా ప్రకటించింది. 2020లో సర్వే కార్యాచరణ ప్రణాళిక, 2024లో ప్రత్యేక పరిశోధనా కేంద్రం ఏర్పాటు వంటి చర్యలతో వాటి సంఖ్యను పునరుద్ధరించడంలో అడుగులు పడ్డాయి. ఒకప్పుడు 10 వేలు ఉండే డాల్ఫిన్ల సంఖ్య గత శతాబ్దంలో 2 వేలకు పడిపోయింది. అయితే వాటి ప్రస్తుత సంఖ్య కొంత ఊరటనిస్తోంది. వాటి మనుగడ ప్రశ్నార్థకమే ఇప్పుడు సమస్య. 2021 నుంచి 10 రాష్ట్రాల్లో 8,507 కిలోమీటర్ల పొడవున 28 నదుల్లో పడవల ద్వారా, 30 నదుల్లో రోడ్డుమార్గం ద్వారా చేపట్టిన సర్వే వివరాలు రాష్ట్రాల వారీగా డాల్ఫిన్ల సంఖ్య ఉత్తరప్రదేశ్ 2,397పంజాబ్ 3పశ్చిమ బెంగాల్ 815బిహార్ 2,220అసోం 635జార్ఖండ్ 162రాజస్థాన్, మధ్యప్రదేశ్ 95 -
విద్యా రుణం.. నిబంధనలు శరాఘాతం
విద్యా రుణం (ఎడ్యుకేషన్ లోన్).. ఉన్నత విద్య చదవాలన్న ఆసక్తి ఉన్నా, స్తోమత లేని వారి పాలిట వరం. విదేశీ విద్యకు, ఆయా కోర్సులకు ఉండే రూ. లక్షల్లో ఫీజులు సొంతంగా చెల్లించలేని పరిస్థితుల్లో విద్యా రుణానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆ రుణం మంజూరు అయితే తమ కలల చదువు పూర్తి చేసుకుని.. లక్షల్లో జీతాలొచ్చే ఉద్యోగాల్లో స్థిరపడవచ్చని, లేదంటే సొంతంగా స్టార్టప్స్ వంటివి ప్రారంభించవచ్చనే ఆలోచనతో అడుగులు వేస్తున్నారు. కానీ.. ఈ ఆలోచనలకు, ఆశలకు భిన్నంగా బ్యాంకుల నిబంధనలు విద్యార్థులకు శరాఘాతంగా మారుతున్నాయి. విద్యారుణాల మంజూరులో బ్యాంకులు పాటిస్తున్న నిబంధనలు విద్యార్థులను డిఫాల్టర్స్ (ఎగవేతదారుల) జాబితాలో చేరే పరిస్థితికి కారణమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. రుణ దరఖాస్తుకు కో– అప్లికెంట్ (సహ దరఖాస్తుదారు)గా తమ తల్లిదండ్రులను లేదా సంరక్షకులను పేర్కొనడమే. – సాక్షి, స్పెషల్ డెస్క్‘డిఫాల్టర్స్’సమస్య సాధారణంగా విద్యార్థులకు సొంత ఆదాయ వనరులు ఉండవు. ఈ క్రమంలో విద్యా రుణ దరఖాస్తు సమయంలో తల్లిదండ్రులను కో అప్లికెంట్స్గా పేర్కొంటున్నారు. కానీ తల్లిదండ్రులు అప్పటికే ఏదైనా వ్యక్తిగత రుణం, ఇతర రుణాలు తీసుకుని చెల్లించకపోతే వారితోపాటు, విద్యార్థులను కూడా డిఫాల్టర్స్ జాబితాలో చూపించేలా బ్యాంకులు వ్యవహరిస్తున్నాయని తల్లిదండ్రులు అంటున్నారు. అంతేకాదు, భవిష్యత్తులో విడతల వారీగా మంజూరు చేసే రుణ మొత్తాన్ని కూడా నిలిపివేస్తున్నాయి బ్యాంకులు. ఈ సమస్యను పలు బ్యాంకులు కొద్ది రోజుల కిందట రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి. సహ రుణగ్రహీతగా పేరెంట్ లేదా గార్డియన్ ప్రస్తుతం అమల్లో ఉన్న మోడల్ ఎడ్యుకేషన్ లోన్ పథకం ప్రకారం.. రూ.7.5 లక్షల రుణం వరకు ఎలాంటి హామీ లేదా థర్డ్ పార్టీ గ్యారెంటీ అక్కర్లేదు. ఈ సందర్భంలో పేరెంట్ లేదా గార్డియన్ను సహ రుణ గ్రహీతగా పేర్కొంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో రుణాలు మంజూరు చేసే ముందు.. బ్యాంకులు సహ రుణ గ్రహీతలు ఇతర లోన్స్ చెల్లింపులో విఫలమైతే.. ఆ కారణంగా విద్యార్థుల రుణ దరఖాస్తులను పక్కన పెట్టేస్తున్నాయి. ఒకవేళ విద్యా రుణం మంజూరు అయ్యాక పేరెంట్స్ వాటిని తిరిగి చెల్లించలేకపోతే విద్యార్థులనూ రుణ ఎగవేతదారులుగా పేర్కొంటున్న పరిస్థితి. ఇది భవిష్యత్తు రుణ దరఖాస్తుల ఆమోదంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆర్బీఐ నిబంధనలు కూడా.. ఆర్బీఐ ప్రస్తుత నిబంధనల ప్రకారం రుణాలను లోన్ అకౌంట్ ప్రాతిపదికగా కాకుండా వ్యక్తుల ప్రాతిపదికగా మంజూరు చేస్తున్నారు. దీంతో ఒక వ్యక్తి ఏదైనా ఒక లోన్ చెల్లింపులో విఫలమైతే ఇతర లోన్ అకౌంట్లను కూడా నిరర్థక ఆస్తుల జాబితాలో చేర్చుతున్నారు. అయితే ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని, ఆర్బీఐ ఈ విషయంలో కొన్ని సడలింపులు ఇవ్వాలని బ్యాంకింగ్ వర్గాలు కోరుతున్నాయి. కానీ, ఆర్బీఐ నుంచి ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదు. ఎన్బీఎఫ్సీల్లో విద్యా రుణాలు ప్రభుత్వ రంగ బ్యాంకులు విద్యా రుణాల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయడంతో దరఖాస్తుల మంజూరు సంఖ్య తక్కువగా ఉంది. కానీ ఉన్న నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో (ఎన్బీఎఫ్సీ) మాత్రం విదేశీ విద్యా రుణాల్లో రుణాల మంజూరు గత అయిదేళ్లలో దాదాపు నూరు శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. అంతేకాదు, రూ.15 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో ఈ రుణాలు మంజూరయ్యాయి. ‘పీఎం విద్యాలక్ష్మి’ఆశలు నిరాశేనా? దేశంలో ప్రతిభావంతులైన యువత ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో కేంద్రం గత ఏడాది పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ పేరిట విద్యారుణ పథకం ప్రవేశ పెట్టింది. 2024–25 నుంచి 2030–31 వరకు అమలు చేసే ఈ పథకం ద్వారా ఏటా 22 లక్షల మందికి ప్రయోజనం కల్పించాలన్నది లక్ష్యం. ఇందుకోసం రూ. 3,600 కోట్లు కేటాయించారు. రూ. 7.5 లక్షల వరకు రుణ మొత్తంలో 75 శాతం మొత్తానికి కేంద్ర ప్రభుత్వమే గ్యారెంటీగా ఉంటుందని గత ఏడాది బడ్జెట్లో పేర్కొన్నారు.కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉండి, ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్స్, ఇతర ఆర్థిక ప్రోత్సాహకాలు పొందని విద్యార్థుల విషయంలో లోన్రీ పేమెంట్ మారటోరియం సమయంలో మూడు శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. గరిష్టంగా రూ. 10 లక్షల రుణం వరకు ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ 2024 నాటికి 11.26 లక్షల క్రెడిట్ గ్యారెంటీలను అందించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు 50,800 అకౌంట్లను నిర్థరక ఆస్తులుగా గుర్తించారు. బ్యాంకుల నిబంధనలతో ‘పీఎం విద్యా లక్ష్మి’ద్వారా రుణం కూడా కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగానేవిద్యా రుణాల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రా ష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలోనే దరఖాస్తులు వస్తున్నాయని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు రిటైల్ అసెట్ విభాగం జనరల్ మేనేజర్ సాక్షికి తెలిపారు. మొత్తం రుణ దరఖాస్తుల్లో దాదాపు 40 శాతం వరకు మనవాళ్లవే ఉంటున్నాయని.. దరఖాస్తుదారుల్లో 50 శాతం మేర రుణాలను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. పోర్టల్లోనూ సమస్యలు ⇒ విద్యాలక్ష్మి పోర్టల్ పనితీరుపైనా విద్యార్థులు, తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. ఈ వెబ్సైట్లో లాగిన్ సమస్యలు, బ్యాంకులతో అనుసంధానమయ్యే సాంకేతిక ప్రక్రియలో ఇబ్బందులు, ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేస్తున్న సమయంలో సర్వర్ డౌన్ అవడం వంటి కారణాలతో దరఖాస్తుల సంఖ్య, మంజూరు సంఖ్య మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటోంది. ⇒ 2025 ఏప్రిల్ నెల గణాంకాలను పరిశీలిస్తే.. ఎస్బీఐకి 1,125 దరఖాస్తులకు గాను 20 దరఖాస్తులకు; కెనరా బ్యాంకులో 483కు గాను 24కి; బ్యాంక్ ఆఫ్ బరోడాలో 342కు గాను 19 దరఖాస్తులకు; పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 304కుగాను 28కి; యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 212 దరఖాస్తులకుగాను 16 దరఖాస్తులకే రుణాలు మంజూరు అయ్యాయి. ⇒ మొత్తమ్మీద.. విద్యా రుణాల మంజూరు విషయంలో తల్లిదండ్రుల వ్యక్తిగత ఆర్థిక స్థోమత నుంచి ఇతర సాంకేతిక అంశాల వరకు పలు అంశాల్లో నిబంధనలను సరళీకృతం చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఎన్ఎఫ్హెచ్సీ.. సేవల్లో భేష్
కేసముద్రం: రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు చేయూతనిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది నేషన్స్ ఫస్ట్ హ్యూమన్ చైన్ ఫౌండేషన్ (ఎన్ఎఫ్హెచ్సీ). ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు ఆర్థికసాయం చేయడంతో పాటు వేసవికాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తూ, మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు, తాగునీటి ప్రాజెక్టుల ఏర్పాటు వంటి పలు సేవాకార్య క్రమాలతో ముందుకు వెళ్తూ అందరితో భేష్ అనిపించు కుంటోంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండ లం తావుర్యా తండాకు చెందిన గిరిజన విద్యాకుసుమం, సైంటిస్ట్ మూడావత్ మోహన్కు వచ్చిన మంచి ఆలోచనతో ఏర్పాటైన ఎన్ఎఫ్హెచ్సీ ఫౌండేషన్ ద్వారా తన తండా, చదువుకున్న గురుకుల పాఠశాల నుంచి మొదలుకుని, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని మారు మూల గ్రామాల వరకు సేవాకార్యక్రమాలను విస్తరించి, అందరి మన్నలను పొందుతు ఆదర్శంగా నిలుస్తున్నారు. తండా నుంచి సైంటిస్ట్గా..తావుర్యాతండాకు చెందిన మూడావత్ భద్రునాయక్, శాంతి దంపతులకు కుమారుడు మోహన్, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మొదటి నుంచి ఆ దంపతులు వ్యవసాయం చేస్తూ పిల్లల్ని చదివిస్తూ వచ్చారు. మోహన్ చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తూ వచ్చాడు. ఈ క్రమంలో జిల్లాలోని గూడూరు మండలం దామరవంచ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో పదో తరగతి వరకు చది వాడు. అక్కడి గణిత ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్రావు ప్రోత్సాహంతో చదువు పట్ల శ్రద్ధ వహించి, పదిలో 550 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచాడు. తన గురువు సహకారంతో విజయవాడలోని ఓ విద్యాసంస్థలో మోహన్ ఇంటర్తోపాటు (ఎంపీసీ), ఐఐటీ కోచింగ్ తీసుకున్నాడు. ఇంటర్లో 963 మార్కులు సాధించాడు. ఈ క్రమంలో ఏఐఈఈఈలో ఉత్తమ ర్యాంకు సాధించి నిట్ వరంగల్లో ఈసీఈ బ్రాంచ్లో అడ్మిషన్ పొందాడు. ఐఐటీ క్వాలీఫై అయినప్పటికీ, తాను కోరుకున్న బ్రాంచ్ రాకపోవడంతో నిట్లో చేరాడు. 2012లో బీటెక్ పూర్తి చేసి, క్యాంపస్ ప్లేస్మెంట్లో ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ సీడాట్లో రీసెర్చ్ ఇంజనీర్గా ఉద్యోగం పొందాడు. ప్రస్తుతం బెంగళూరులో సీడాట్ కంపెనీలో 4జీ, 5జీ టెక్నాలజీతోపాటు, మిగతా సాంకేతిక ప్రాజెక్టుల అభివృద్ధిపై సైంటిస్టుగా పనిచేస్తున్నాడు. సేవచేయాలనే తపనతో..తన తండ్రి, గురువు అందించిన ప్రోత్సాహంతో మోహన్ చదువులో రాణిస్తూ వచ్చాడు. తన మాదిరిగానే చదువు పట్ల శ్రద్ధ ఉన్న నిరుపేద పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దనే మంచి ఆలోచన విద్యార్థి దశలోనే తనకు వచ్చింది. తాను బీటెక్ చదువుతున్న సమయంలో 2010లో నేషన్స్ ఫస్ట్ హ్యూమన్ చైన్ ఫౌండేషన్ (ఎన్ఎఫ్హెచ్సీ) అనే సేవాసంస్థను ఏర్పాటు చేశాడు. ఆ టీంలో సివిల్ సర్వెంట్స్, ఎన్ఐటీ, ఐఐటీ తదితర ప్రముఖ విద్యాసంస్థల నుంచి ఎదిగిన వారితోపాటు, ప్రముఖ వైద్యులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన నిపుణులతో కలిసి నాలెడ్డ్ నెట్వర్క్ టీంను ఏర్పాటు చేశాడు. ఎప్పటికప్పుడు ఆ టీం సలహాలు, సూచనలు తీసుకుంటూ, అనేక మంది సహకారంతో పేద విద్యార్థులకు విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పిస్తూ, వారికి అవసరమైన సాయం అందిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఫౌండేషన్లో 100 మంది సభ్యులు ఉన్నారు. సేవా కార్యక్రమాలు ఇవే..రాష్ట్రంలోని మహబూబాబాద్, వరంగల్, మెదక్, నారాయణపేట, నల్లగొండ జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో 40 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రేరణ సదస్సులు నిర్వహించారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్స్ను అందించారు. 8వ తరగతి విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ మెటీరియల్, పదో తరగతి పిల్లలకు ఆల్ఇన్వన్, పాలిటెక్నిక్ మెటీరియల్ అందజేశారు. పాఠశాలల్లోని గ్రంథాలయానికి బుక్స్ అందజేశారు. అలాగే స్పోర్ట్స్ కిట్లు అందించారు. ఈ ఏడాది ఇనుగుర్తి మండలం చీన్యాతండాలో వేసవి శిక్షణ శిబిరాన్ని ఇటీవల ప్రారంభించారు. ఈ శిబిరంలో పిల్లలకు స్పోకెన్ ఇంగ్లిష్తోపాటు, ఆటపాటలు నేర్పించడం, పది పిల్లలకు పాలిటెక్నిక్ కోచింగ్ ఇస్తున్నారు. అలాగే ఆయా గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి, వైద్యపరీక్షల అనంతరం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. తావుర్యాతండాలో ప్రజల దాహార్తి తీర్చేందుకు వాటర్ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఉన్నత చదువులు చదివే పలువురు నిరుపేద విద్యార్థులకు ఆర్థికసాయం అందిస్తున్నారు.మా నాన్న, గురువు స్ఫూర్తితో ఎన్ఎఫ్హెచ్సీ ఏర్పాటు మానాన్న భద్రునాయక్, మ్యాథ్స్ టీచర్ జి.వెంకటేశ్వర్రావు ప్రోత్సాహంతో ఎన్ఎఫ్హెచ్సీ ఏర్పాటు చేశా. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అండగా నిలిచి ధైర్యం చెప్పేవారు. మా నాన్న, గురువు ప్రోత్సాహంతో చదువులో రాణించి, ప్రస్తుతం బెంగళూరులోని టెలికాం డిపార్ట్మెంట్ అయిన సీడాన్ కంపెనీలో 4జీ, 5జీ టెక్నాలజీతోపాటు, సాంకేతిక ప్రాజెక్టుల అభివృద్ధిపై సైంటిస్టుగా పనిచేస్తున్నాను. ఎంతో మంది నిపుణులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో కలిసి పేద విద్యార్థులకు తోడ్పాటునందిస్తూ, ఆర్థిక సాయం అందజేస్తున్నాం. – మూడావత్ మోహన్, ఎన్ఎఫ్హెచ్సీ వ్యవస్థాపకుడు, తావుర్యాతండాజీపీ, కేసముద్రం మండలం సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తిచిన్నతనం నుంచి కష్టపడి చదువుకున్నా. చదువుకునే రోజుల్లోనే పేద విద్యార్థులకు సాయం అందించాలనే ఆలోచన ఉండేది. ఆ విధంగా నా వంతుగా ఎంతోమందికి సాయం చేస్తూ వచ్చా. ఆ తర్వాత 2019లో ఎన్ఎఫ్హెచ్సీ ఫౌండేషన్లో సభ్యుడిగా చేరి, ఎన్నో సేవాకార్యక్రమాలు చేశాం. ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నా. మా తండాలో ఈ వేసవిలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశాం. విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, ఆటలు ఆడించడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – జాటోత్ జయకృష్ణ, ఎన్ఎఫ్హెచ్సీ జనరల్ సెక్రటరీ, చీన్యాతండా, ఇనుగుర్తి మండలం కోచింగ్ ఉపయోగపడుతుంది మా తండాలోని ప్రాథమిక పాఠశాలలో ఎన్ఎఫ్హెచ్సీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో పాలిటెక్నిక్ కోచింగ్ ఇస్తున్నారు. ఈ కోచింగ్ తమకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మాకు వచ్చే అనుమానాలను ఎప్పటికప్పడు నివృత్తి చేసుకుంటున్నాం. పైగా స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. – గుగులోత్ శైలజ, విద్యార్థిని, చీన్యాతండా జీపీ, ఇనుగుర్తి మండలం -
రన్ వేపై రెక్కల ముక్కలు
భారత విమానాశ్రయాలు చాలావరకు భద్రమైనవి. అయితే ఆ భద్రతకు ఊహించని విధంగా పక్షులు, ఇతర వన్యప్రాణుల మూలంగా తరచూ ముప్పు వాటిల్లుతోంది. పక్షులు ఢీకొనటం; జింకలు, నక్కలు, కుక్కలు వంటి జంతువులు తగలటం వల్ల రన్ వే పైన విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాదు, గత అక్టోబర్లో భువనేశ్వర్ విమానాశ్రయం సమీపంలో అడవి పిల్లి సంచరిస్తూ కనిపించటం, ఈ ఏడాది మార్చిలో డయ్యూ ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో సింహం ప్రత్యక్షమవటం భవిష్యత్తులో జరగనున్న విమాన ప్రమాదాలకు సంకేతంగా గుర్తించి, అధికారులు అప్రమత్తం అవుతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్అడ్డొచ్చి తగులుతుంటాయి :.. ఏప్రిల్ 14న హిసార్–అయోధ్యల మధ్య విమానాన్ని ప్రారంభించటానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ముందు హర్యానాలోని మహారాజా అగ్రసేన్ విమానాశ్రయం అధికారులు డెహ్రాడూన్లోని ‘వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’నుంచి నిపుణులను రప్పించి మరీ ఆ దరిదాపుల్లోకి ‘నీల్గై’భారీ జింకలు రాకుండా చూసుకున్నారు. అగ్రసేన్ ఎయిర్పోర్ట్ ఉన్న ప్రదేశం చాలాకాలంగా నీల్గైలకు నివాసంగా ఉంటోంది! ఇక కోల్కతాలోని రన్వేల మీద ఇటీవల నక్కలు పరుగులు తీశాయి. సంతతి కోసం విమానాశ్రయంలో అవి తవ్వుకున్న బొరియల్ని సైతం అధికారులు గుర్తించారు. వాటిని పట్టుకునేందుకు ప్రాంగణంలో రహస్యంగా ముపై్పకి పైగా బోన్లు ఏర్పాటు చేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రన్వేలపై విమానాలు టేకాఫ్ అవుతున్నప్పుడు లేదా ల్యాండ్ అవుతున్నప్పుడు పక్షులు, వన్యప్రాణులు వచ్చి తగిలే అవకాశం ఉండటంపై అధికారులూ, ప్రయాణికులూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే అతి పెద్ద ప్రమాదం!రన్వేపై పక్షులు ఢీకొనడం, జంతువులు వచ్చి వేగంగా వెళ్తున్న విమానానికి తగలటం చాలాసార్లు ప్రాణాంతకం కాకపోయినా కొన్నిసార్లు ఘోర ప్రమాదానికి కారణం అవుతుంటాయి. ఇందుకు ఉదాహరణ.. ఇటీవల పక్షి ఢీకొని దక్షిణ కొరియాలో సంభవించిన జెజు ఎయిర్ క్రాష్లో విమానంలోని 179 మందీ మరణించటం! (దీనిపై ఇంకా విచారణ సాగుతోంది). భారత్లో చివరిసారిగా 2015లో ఇలాంటి ప్రమాదం జరిగింది. కత్రా నుండి వైష్ణోదేవి ఆలయానికి వెళుతున్న హెలికాప్టర్.. రాబందు ఢీకొనటంతో పల్టీలు కొట్టి, మంటలు చెలరేగి పైలట్తో సహా ఏడుగురు చనిపోయారు. ఢిల్లీ రన్వేపై 700సార్లు!పక్షులు ఢీకొన్న సంఘటనల్లో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రస్థానంలో ఉంది. 2018–2023 మధ్య ఆ రన్వేలపై 700 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్యపై ఆందోళన వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు... జంతు సంక్షేమ కార్యకర్త గౌరీ మౌలేఖి దాఖలు చేసిన పిటిషన్కు ప్రతిస్పందనగా ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్’, ‘ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా’సంస్థలకు నోటీసులు జారీ చేసింది. విమానా శ్రయం పరిసరాల్లో కబేళాలు, మాంసం దుకాణాలు, పాడి పరిశ్రమలు ఉండటం విమానయాన భద్రతా నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని మౌలేఖీ తన పిటిషన్లో పేర్కొన్నారు. 39 ఫ్లెమింగోల మృత్యువాత.. 2023 డిసెంబర్ 18న రాజ్యసభలో పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాధానం ప్రకారం... భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలు వన్యప్రాణులు, ప్రధానంగా పక్షుల బెడదతో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని తెలుస్తోంది. గత ఏడాది ఎమిరేట్స్ విమానం ముంబైలో ఫ్లెమింగోల గుంపును ఢీకొట్టడంతో 39 పక్షులు చనిపోయాయి. ఈ ఘటన వన్యప్రాణుల ప్రేమికులను ఎంతగానో కలవరపరిచింది.పక్షులు తగిలితే ఎందుకు కూలిపోతాయి? నిజానికి పక్షుల తగిలినంత మాత్రానే విమానాలు కూలిపోవు. కొన్ని సందర్భాలలో ఇంజిన్ లేదా ఇతర భాగాలకు నష్టం వాటిల్లుతుంది. విమానాలు చాలా వేగంగా టేకాఫ్ అవుతాయి. పక్షులు, ముఖ్యంగా పెద్ద పక్షులు; ఇంజిన్ లేదా విండ్షీల్డ్లోకి ప్రవేశించే పక్షి సమూహాలు ఢీకొనడం వల్ల మాత్రం పెద్ద ముప్పే వాటిల్లవచ్చు. టేకాఫ్ దశలో ఇంజిన్ చాలా వేగంతో తిరుగుతున్నప్పుడు, విమానం తక్కువ ఎత్తులో ఉండగానే పక్షి ఢీకొన్నప్పుడు ఇంజిన్ ఫ్యాన్ బ్లేడ్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీంతో ఇంజిన్ విఫలమై ప్రమాదం సంభవించవచ్చు. పక్షి ఢీకొట్టగానే పైలట్ దృష్టి చెదిరి ప్రమాదాలు జరుగుతుంటాయి. పక్షులను చెదరగొట్టే మార్గాలు ప్రమాదాలు జరిగి అటు వన్యప్రాణులు, పక్షులు గానీ, ఇటు విమానాలు, ప్రయాణికులు గానీ నష్టపోకుండా / ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యక్షంగా చేపట్టాల్సినవి, అప్రమత్తం చేసే ధ్వని పరికరాలు, రాప్టర్ కైట్స్, బెలూన్లు, రిఫ్లెక్టింగ్ టేప్ వంటివి వాడాలి. ఇక పరోక్షంగా.. నీటి వనరుల మూసివేత, వ్యర్థాల తొలగింపు, పచ్చిక ఉన్న ప్రదేశాలలో చీడపురుగుల ఏరివేత, గూళ్లు పెట్టకుండా గడ్డిని కత్తిరించడం, ఎలుకల నియంత్రణ వంటివి చేపట్టాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ యావియేషన్ సూచించింది. అంతిమంగా మనమంతా.. పక్షులు మన స్థలంలోకి రావటం లేదు, వాటి స్థలంలోకే మనం వెళ్లి అభివృద్ధి పేరిట అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అని గుర్తించి వన్యప్రాణి హితమైన చర్యలు మాత్రమే తీసుకోవాలి. అన్ని పక్షులూ ముప్పుకాదు.. 1966–1989 మధ్య కాలంలో తీవ్రమైన విమాన నష్టానికి కారణమైన పక్షుల జాబితాలో రాబందులు ఒకప్పుడు అగ్రస్థానంలో ఉండేవి. వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోవటంతో వాటి వల్ల ముప్పు తగ్గుముఖం పట్టింది. నేడు ప్రధానంగా బ్లాక్ కైట్స్ (డేగ జాతి), గబ్బిలాలు, ల్యాప్విగ్ పక్షులు ప్రమాదం కలిగించే జాబితాలోకి చేరాయి. 2020 జూన్లో ‘డిఫెన్స్ లైఫ్’సైన్స్ జర్నల్ లో ‘భారతదేశంలో విమానాలకు వన్యప్రాణుల తాకిడి’అనే శీర్షికతో ప్రచురితమైన అధ్యయన పత్రం ప్రకారం.. ఈ మూడు జాతుల పక్షులే ఇప్పుడు ప్రధానంగా రన్వేపై విమాన ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. 2012–2018 మధ్య భారతదేశంలో 3,665 వన్యప్రాణు తాకిళ్లు సంభవించినట్లు ఈ పత్రం పేర్కొంది. వీటిల్లో 385 ఘటనలు విమాన నష్టానికి కారణం అయ్యాయి. 2005–2018 మధ్య మూడు సైనిక విమానాలు కూలిపోవటానికి బ్లాక్ కైట్స్ పక్షులు కారణమయ్యాయి. -
రికార్డు స్థాయికి ప్రపంచ సైనిక వ్యయం
ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం భారీగా పెరిగింది. మారుతున్న భౌగోళిక, రాజకీయ సంబంధాలు, యుద్ధాల నేపథ్యంలో ప్రభుత్వాలు సైనిక భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. 2024లో ప్రపంచ దేశాలు సైన్యానికి 2.7 ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేశాయి. గాజా, ఉక్రెయిన్లపై యుద్ధం నేపథ్యంలో ముఖ్యంగా యూరప్, మధ్యప్రాచ్యంలో ఈ సైనిక వ్యయం అధికంగా పెరిగింది. తాజా వివరాలను స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రి) నివేదిక తెలిపింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు తమ సైనిక వ్యయాన్ని పెంచాయి. 2023తో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఖర్చు 9.4 శాతం పెరిగింది. వరుసగా పదో సంవత్సరం కూడా సైనిక వ్యయంలో పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలకు అద్దం పడుతోంది. యూరప్లో ఊహించని పెరుగుదల యూరప్ దేశాల్లో (రష్యాతో సహా) సైనిక వ్యయంలో అధిక పెరుగుదల కనిపించింది. ఉక్రెయిన్లో యుద్ధం, నాటో కూటమి పట్ల అమెరికా నిబద్ధతపై సందేహాల మధ్య 17 శాతం పెరుగుదల నమోదైంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగింపు సమయంలో సైనిక వ్యయాన్ని మించిపోయింది. ఇక రష్యా సైనిక వ్యయం 2024లో 149 బిలియన్ డాలర్లకు చేరుకుంది, ఇది 2023తో పోలిస్తే 38 శాతం పెరిగింది. ఇది రష్యా జీడీపీలో 7.1 శాతం. మొత్తం ప్రభుత్వ వ్యయంలో 19%. ఉక్రెయిన్ మొత్తం సైనిక వ్యయం 2.9 శాతం పెరిగి 64.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది రష్యా వ్యయంలో 43 శాతం కాగా, ఆ దేశ జీడీపీలో 34 శాతం. 2024లో అత్యధిక సైనిక వ్యయం చేసిన దేశం ఉక్రెయిన్. రష్యా చేస్తున్న యుద్ధానికి ఉక్రెయిన్ ప్రస్తుతం తన పన్ను ఆదాయం మొత్తాన్ని సైన్యానికి కేటాయిస్తోంది. జర్మనీ కూడా సైనిక వ్యయాన్ని బాగానే పెంచింది. 28 శాతం పెరిగి, 88.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఇది భారతదేశాన్ని అధిగమించి ప్రపంచంలో నాల్గో అతి పెద్ద దేశంగా నిలిచింది. పునరేకీకరణ తరువాత జర్మనీ ఇంతపెద్ద మొత్తంలో ఖర్చు చేయడం ఇదే మొదటిసారి. వ్యయాన్ని పెంచిన చైనా సైన్యానికి భారీగా ఖర్చు చేసే ప్రపంచంలోనే రెండో దేశమైన చైనా సైతం తన సైనిక బడ్జెట్ను పెంచింది. 7.0 శాతం పెరుగుదలతో చైనా సైనిక వ్యయం 314 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తన సైన్యాన్ని ఆధునీకరించడానికి, సైబర్ వార్ఫేర్ సామర్థ్యాలు పెంచుకోవడానికి, అణ్వాయుధాల విస్తరణలో విస్తృతమైన పెట్టుబడులు పెడుతోంది. ఆసియా మొత్తం సైనిక వ్యయంలో సగం వాటాను చైనానే కలిగి ఉంది. తగ్గేదే లేదన్న అమెరికా ప్రపంచ పెద్దన్న అమెరికా కూ సైనిక వ్యయంలో వెనుకబడలేదు. మొత్తం ప్రపంచ సైనిక వ్యయంలో అమెరికా వాటా 37 శాతం గమనార్హం. ఇక 2024లో మొత్తం నాటో వ్యయంలో 66 శాతం ఆమెరికా పెట్టుబడులే. 2024లో 5.7 శాతం పెంచడంతో ఆ దేశ సైనిక వ్యయం 997 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అమెరికా నేతృత్వంలోని కూటమిలోని 32 సభ్యదేశాల మొత్తం సైనిక వ్యయం 1.5 ట్రిలియన్లకు పెరిగింది. 2025లో రక్షణకు అత్యధిక బడ్జెట్ను కేటాయించిన దేశాలు అస్థిర, సంక్లిష్ట భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు తమ శక్తిని, పలుకుబడిని చాటుకునేందుకు సైనిక బలగాలను బలోపేతం చేసుకుంటున్నాయి. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ డేటా ప్రకారం అమెరికా, చైనా, రష్యా, భారత్, సౌదీ అరేబియాలు తమ సైనిక శక్తికి అత్యధిక బడ్జెట్ కేయటాంచిన మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. యూఎస్ – 895 బిలియన్ డాలర్లు చైనా – 266.85 బిలియన్ డాలర్లు రష్యా – 126 బిలియన్ డాలర్లు భారత్ – 75 బిలియన్ డాలర్లు సౌదీ అరేబియా – 74.76 బిలియన్ డాలర్లు – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
పహల్గాం ఉగ్రవాదుల దాడి ప్రత్యక్ష సాక్షులను ఇంకా వెంటాడుతోంది. ఆ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న మైసూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన అనుభవాలను ఎక్స్లో పోస్ట్ చేశారు. తన కుటుంబంతో పాటు మరో 35–40 మంది ఎలా ప్రాణాలతో బయటపడ్డారో వివరిస్తూ ఆయన రాసిన పోస్టు అందరినీ కదిలిస్తోంది. ‘అదో రాక్షస చర్య. స్వర్గ సౌందర్యాన్ని రక్తపు మరకలతో ఎరుపెక్కించిన ఓ భయా నక అనుభవం. దాన్నుంచి మేం బయటపడ్డాం. ప్రతికూల వాతావరణం కారణంగా మా పర్యటనను రెండు రోజులు వాయిదా వేసుకుని ఏప్రిల్ 22 మధ్యాహ్నం భార్య, తమ్ముడు, మరదలితో కలిసి కశ్మీర్ వెళ్లాం. నా సోదరుడు ఇండియన్ ఆర్మీలో సీనియర్ అధికారి. మాతో పాటు ట్రిప్లో ఉన్నాడు. ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు పహల్గాం పట్టణానికి చేరుకుని.. పోనీ రైడ్లో బైసారన్ లోయకు 1:35 గంటలకు చేరుకున్నాము. ఆ గంభీరమైన ప్రకృతి దృశ్యాన్ని ఆస్వాదిస్తూ ఓ కప్పు టీ తాగాం. 2:00 గంటలకు ఫోటోలు తీసుకోవడానికి లేచాం. ప్రవేశ ద్వారం ఎదురుగా ఉన్న దిశలో కదలడం మా అదృష్టం. పిల్లలు, తల్లిదండ్రుల గురించే ఆందోళన అలా మేం నలుగురం సంఘటనా స్థలానికి కొన్ని వందల మీటర్ల దూరంలో చెట్ల కింద ఉన్న ఇరుకైన గుంతలోకి వెళ్లాం. మధ్యాహ్నం 3 గంటల వరకు తుపాకీ కాల్పుల శబ్దం లోయలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. అక్కడే ఉండాలా? మరోవైపు పరుగెత్తాలా? తెలియడం లేదు. అక్కడ ఉన్నంత సేపు ఇంట్లో ఉన్న మా తల్లిదండ్రులు, పిల్లల గురించి ఆందోళన చెందుతున్నాం. మధ్యాహ్నం 3.40 గంటలకు హెలికాప్టర్ శబ్దం వినిపించింది. భద్రతా దళాలు వచ్చాయని నిర్ధారించుకున్నాక బయటకు వచ్చాం. ఆ తుపాకీ కాల్పులు ఇప్పటికీ మా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఇలాంటి భయానక అనుభవాలు ఎవ్వరికీ రాకూడదని ప్రారి్థస్తున్నా. వారి ఆత్మల కోసం ప్రార్థిస్తున్నా’అని భట్ పేర్కొన్నారు. క్షణాల్లో రెండు మృతదేహాలు.. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫొటోలు తీసుకుంటుండగా మధ్యాహ్నం 2.25 గంటల సమయంలో మొదటి రెండు తుపాకీ శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత ఒక నిమిషం పాటు నిశ్శబ్దం. ఏం జరిగిందో అందరికీ అర్థమైంది. క్షణాల్లోనే రెండు మృతదేహాలు పడి ఉండటాన్ని చూశాం. ఇది ఉగ్రదాడి అని నా సోదరుడికి తెలిసిపోయింది. తుపాకీ శబ్దాలు పేలాయి. గందరగోళం ఏర్పడింది. జనం బిగ్గరగా అరుస్తూ ప్రాణాల కోసం పరిగెత్తుతున్నారు. మా దిశలో ఒక ఉగ్రవాది రావడాన్ని మేము గమనించాం. పరిస్థితిని అంచనా వేసిన మా తమ్ముడు 35–40 మంది పర్యాటకులతో మమ్మల్ని వ్యతిరేక దిశలో నడిపించాడు. అదృష్టవశాత్తూ ఫెన్సింగ్ కింద ఇరుకైన మార్గం కనబడింది. మాతోపాటు చాలా మంది ప్రజలు కంచె గుండా జారి వేరే మార్గంలో పరిగెత్తడం ప్రారంభించారు. అది కొంచెం లోయలా ఉండటంతో మేం ఎవరికీ కనిపించలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
100 రోజుల ట్రంపరితనం
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టి మంగళవారానికి 100 రోజులు. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుస్తున్నాననే మిషతో రోజుకోటి అన్నట్టుగా ఈ మూడు నెలల్లో ఆయన లెక్కలేనన్ని అనాలోచిత చర్యలకు దిగారు. ‘పూటకో మాట, రోజుకో వైఖరి’ అన్నట్టుగా పదేపదే నిర్ణయాలను, విధానాలను మార్చుకుంటూ నవ్వులపాలవుతున్నారు. అంతర్జాతీయ సమాజం దృష్టిలో అమెరికాను పలుచన చేయడమే గాక వ్యక్తిగతంగా జీవితకాలానికి సరిపడా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. అక్రమ వలసదారులకు అడ్డుకట్ట సాకుతో తలా తోకా లేని నిబంధనలతో అంతర్జాతీయ విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. పొదుపు పేరిట ఉద్యోగులను భారీగా తొలగించడం వంటి చర్యలతో అమెరికన్లను కూడా ఎన్నడూ లేనంత అభద్రతా భావంలోకి నెట్టేశారు. దాదాపుగా ఈ మూడు నెలల్లో ట్రంప్ తీసుకున్న అన్ని నిర్ణయాలూ న్యాయ వివాదాలకు దారితీయడం విశేషం. అమెరికా ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేస్తానన్న వాగ్దానం నిలుపుకోవడంలోనూ ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారు. నిత్యావసరాల ధరలు చుక్కలు తాకుతున్నాయి. చివరికి గుడ్ల ధరలు చూసి సగటు అమెరికన్ గుడ్లు తేలేసే పరిస్థితి నెలకొంది! ఇష్టారాజ్యపు నిర్ణయాలతో అటు ప్రపంచాన్ని, ఇటు అమెరికాను కూడా ఆర్థికంగా ప్రమాదపుటంచుల్లోకి నెట్టిన ట్రంప్, ఆ మంటల్లో తీరిగ్గా చలి కాచుకుంటున్నారు...మతిలేని టారిఫ్ల యుద్ధం ఈ 100 రోజుల్లో ట్రంప్ చేపట్టిన చర్యలన్నింట్లోనూ అత్యంత వివాదాస్పదమైనది, ఆనాలోచితమైనది టారిఫ్ల యుద్ధమే. అమెరికాపై భారీ టారిఫ్లు విధిస్తున్నాయంటూ చాలా దేశాలపై అంతర్జాతీయ వాణిజ్య సూత్రాలకు విరుద్ధంగా ప్రతీకార చర్యలకు దిగారు. అగ్ర రాజ్యాలు మొదలుకుని చివరికి అసలు జనమే ఉండని అంటార్కిటికా వంటి ప్రాంతాలపై కూడా ఎడాపెడా టారిఫ్లు పెంచి నవ్వులపాలయ్యారు. పైగా వాటిని రోజుకోలా మారుస్తూ అత్యంత చంచల ధోరణి కనబరిచారు. ఇక చైనా విషయంలోనైతే టారిఫ్లను రోజురోజుకూ అంతకంతకూ పెంచుతూ వేలంపాటను తలపించారు. చివరికి 145 శాతం దాకా తీసుకెళ్లి దాన్నో కామెడీ వ్యవహారంగా మార్చేశారు. టారిఫ్ల భయంతో ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలి కోలుకోలేని రీతిలో లక్షలాది కోట్ల రూపాయల మేర నష్టాలను చవిచూశాక తీరిగ్గా వాటి అమలును మూడు నెలల పాటు వాయిదా వేశారు. టారిఫ్లకు ప్రతీకారంగా అరుదైన ఖనిజాల ఎగుమతిని చైనా పూర్తిగా నిలిపేయడంతో అమెరికా దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది.వలసలపై మొట్టి కాయలు అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపే పేరిట వలసదారుల గుండెల్లో ట్రంప్ రైళ్లు పరుగెత్తిస్తున్నారు. పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే అక్రమ వలసదారులను భారీ ఖర్చుతో ఏకంగా సైనిక విమానాల్లో స్వదేశాలకు పంపారు. సుదీర్ఘ ప్రయాణం పొడవునా ఒళ్లంతా సంకెళ్లు వేసి విమర్శలు మూటగట్టుకున్నారు. తర్వాత వారిని గ్యాటెమాలా తదితర సమీప దేశాలకు తరలించి నిర్బంధంలో ఉంచడం మొదలుపెట్టారు. దీనిపై కోర్టుల మందలింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక విదేశీ విద్యార్థుల విషయంలోనైతే ట్రంప్ అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. ఐదారేళ్ల చరిత్రను తవ్వుతూ ఎక్కడ ఏ చిన్న తప్పిదం కనిపించినా దేశం వీడాలని ఆదేశిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చిన్నాచితకా కారణాలకు కూడా వీసాలు రద్దు చేసి వెనక్కు పంపిస్తున్నారు. ఈ విషయంలో కోర్టులతో పదేపదే మొట్టికాయలు తింటూ వస్తున్నారు.డోజ్.. ఓవర్ డోస్ దుబారా వ్యయానికి కళ్లెం వేసేందుకంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో తీసుకొచ్చిన డోజ్ పనితీరు అమెరికన్లలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. లెక్కలేనన్ని ఉద్యోగాలను డోజ్ ఒక్క దెబ్బతో పీకిపారేసింది. కనీసం రెండు లక్షల కోట్ల డాలర్లు ఆదా చేస్తానని గొప్పగా చెప్పుకున్న మస్్క, ఓ రెండొందల కోట్ల డాలర్ల కంటే ఆదా కష్టమంటూ చివరికి చేతులెత్తేశారు. పైగా డోజ్ ముసుగులో అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన కీలక, రహస్య డేటానంతా మస్క్ చేజిక్కించుకున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.జెలెన్స్కీకి అవమానం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని చర్చలకంటూ పిలిచి వైట్హౌస్లో మీడియా సాక్షిగా ట్రంప్, ఆయన డిప్యూటీ జేడీ వాన్స్ ఘోరంగా అవమానించిన తీరు చరిత్రలో నిలిచిపోయింది. దేశాధ్యక్షుడనే కనీస గౌరవం కూడా లేకుండా సూటిపోటి మాటలతో ఇద్దరూ రెచ్చిపోయారు. జెలెన్స్కీ ఎక్కడా తగ్గకుండా వాళ్లకు మాటకు మాట బదులిచ్చి శెభాష్ అనిపించుకున్నారు. చిర్రెత్తుకొచి్చన ట్రంప్ చివరికి ఆయన్ను వైట్హౌస్ నుంచి అవమానకర రీతిలో వెళ్లగొట్టిన తీరు చూసి ప్రపంచ దేశాలన్నీ షాక్కు గురయ్యాయి. ట్రంప్, వాన్స్ ప్రవర్తన వైట్హౌస్కే తీవ్ర కళంకమంటూ ఈసడించుకున్నాయి. ఆదరణ అట్టడుగుకు ట్రంప్ పట్ల అమెరికన్లలో వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోందని పోల్స్ అన్నీ ముక్త కంఠంతో చెబుతున్నాయి. అధ్యక్షుల తొలి 100 రోజుల పాలనకు జనామోదం విషయంలో ట్రంప్ గత 70 ఏళ్లలోనే అట్టడుగున నిలిచారు! ఆయన పాలనను గట్టిగా సమరి్థస్తున్న వారి సంఖ్య ఏకంగా 22 శాతానికి పడిపోయినట్టు సీఎన్ఎన్ పోల్ తేలి్చంది. గట్టిగా వ్యతిరేకించేవారి సంఖ్య 45 శాతానికి పెరిగింది. ముఖ్యంగా మార్చి నుంచి ట్రంప్ ఆదరణ శరవేగంగా అడుగంటుతూ వస్తోంది. టారిఫ్లపై ట్రంప్ తీరును 35 శాతం అమెరికన్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఆర్థికంగా దేశాన్ని ఆయన గట్టెక్కిస్తారని నమ్ముతున్న వారి సంఖ్య కూడా డిసెంబర్తో పోలిస్తే ఏకంగా 12 శాతం తగ్గింది. మతిలేని చర్యలతో దేశాన్ని ట్రంప్ ప్రమాదంలోకి నెడుతున్నారని 57 శాతం మంది భావిస్తున్నారు. ఆయన విదేశీ విధానాన్ని 60 శాతం మందికి పైగా తీవ్రంగా తప్పుబడుతున్నారు. వలసల విధానాన్ని కూడా 47 శాతం మంది ఆక్షేపిస్తున్నారు. ఉద్యోగ కల్పనలో ట్రంప్ తీరుతో 58 శాతం మంది పెదవి విరుస్తున్నారు. అధ్యక్షునిగా అధికారాన్ని బాధ్యతాయుతంగా వాడతారన్న నమ్మకం లేదని 54 శాతం మంది అమెరికన్లు అంటుండటం విశేషం. సరైన నాయకత్వం అందిస్తారని నమ్ముతున్నది 50 శాతమే. ఆయనకు ఓటేసి తప్పు చేశామని 20 శాతం మంది వాపోతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది!దేశాలపై నోటి దురుసు కెనడా మొదలుకుని పలు దేశాలపై నోటి దురుసు వ్యాఖ్యలతో ట్రంప్ పరువు పోగొట్టుకున్నారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా విలీనమైతే మేలంటూ అనవసర వ్యాఖ్యలు చేసి కెనడాతో శత్రుత్వాన్ని కొనితెచ్చుకున్నారు. పైగా ఆ దేశంపై విధించిన అడ్డగోలు టారిఫ్లతో అంతిమంగా అమెరికాకే నష్టం జరిగింది. అంతేగాక అమెరికాను ఇక జీవితంలో నమ్మేది లేదని కెనడా నాయకత్వంతో అనిపించుకున్నారు. గ్రీన్లాండ్ను ఆక్రమించేసుకుంటామని ప్రకటించి మరో వివాదాల తేనెతుట్టెను కదిపారు. గాజా నుంచి పాలస్తీనియన్లను పూర్తిగా తొలగించేసి దాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామంటూ తలాతోకా లేని ప్రకటన చేసి మొత్తం ముస్లిం ప్రపంచం ఆగ్రహానికి గురయ్యారు. ఉక్రెయిన్కు చేసిన యుద్ధ సాయానికి బదులుగా ఆ దేశ ఖనిజ నిల్వలను అమెరికాకు కట్టబెట్టాల్సిందేనంటూ భీష్మించుకున్నారు. రష్యాను ఒప్పించి ఒక్క రోజులో యుద్ధాన్ని ఆపిస్తానన్న ట్రంప్ ప్రకటన కూడా ఉత్తదేనని తేలిపోయింది. ‘పుతిన్కు యుద్ధం ఆపే ఉద్దేశమే లేనట్టుంది’ అంటూ ఇప్పుడాయన తీరిగ్గా నిట్టూరుస్తున్నారు.విద్యాసంస్థలపై ఉక్కుపాదం తన మాట వినడం లేదంటూ యూనివర్సిటీలపై ట్రంప్ కన్నెర్రజేశారు. ప్రపంచానికే తలమానికం వంటి అమెరికా విద్యా సంస్థల పునాదులనే పెకిలించే పనిలో పడ్డారు. వాటికి బిలియన్ల కొద్దీ ప్రభుత్వ నిధులను నిలిపేశారు. దారికొస్తే తప్ప వాటిని విడుదల చేసేది లేదంటున్నారు. అలా కొలంబియా వంటి వర్సిటీలను లొంగదీసుకున్నారు. కానీ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ మాత్రం ట్రంప్ తీరును తూర్పారబట్టింది. అణచివేత చర్యలకు తలొంచేది లేదని ప్రకటించింది. 300 కోట్ల డాలర్లకు పైగా నిధులను నిలిపేసినా ‘డోంట్ కేర్’ అనేసింది. -
ఏఐనా.. అంటే..
సాక్షి, స్పెషల్ డెస్క్: ఓవైపు అగ్ర దేశాల్లో కృత్రిమ మేధ (ఏఐ) వాడకం విస్తృతంగా కొనసాగుతుంటే ఆ దేశాలతో అన్ని రంగాల్లో పోటీపడుతున్న భారత్ మాత్రం ఏఐని అందిపుచ్చుకోవడంలో ఇంకా ప్రారంభ స్థాయిలోనే ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఏకంగా 60% మంది భారతీయులకు ఏఐ గురించి తెలియదని టెక్నాలజీ దిగ్గజం గూగుల్, మార్కెట్ పరిశోధన సంస్థ కాంటార్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనం ప్రకారం దేశంలో కేవలం 31% మందే జనరేటివ్ ఏఐ సాధనాలను వినియోగిస్తున్నారు.జీవితాల మెరుగుదల కోసం.. అత్యధికులకు ఇప్పటికీ ఏఐ గురించి తెలియకపోయినా తమ జీవితాలను మెరుగుపరచుకోవడానికి ఏఐ వంటి సాధనాలను ఉపయోగించాలనే కోరిక ఎక్కువ మందిలో ఉంది. మరింత ఉత్పాదకత పొందాలని 72% మంది, సృజనాత్మకతను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని 77% మంది, మరింత సమర్థంగా సమాచారాన్ని తెలియజేయాలని 73% మంది చూస్తున్నారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా రాణించడానికి సహాయపడే సాధనాన్ని 75 శాతం మంది కోరుకుంటున్నారు. ప్రారంభించడమూ తెలియదు.. పనిప్రదేశం లేదా తరగతి గదికి మించి భారతీయులు రోజువారీ పనుల్లో కూడా సహాయం కోసం ఆసక్తిగా ఉన్నారు. ప్రయాణ ప్రణాళిక నుంచి బడ్జెట్లను నిర్వహించడం వరకు 76% మంది తమ సమయం ఆదా చేయడంలో సహాయం కోరుకుంటున్నారు. పిల్లలకు హోంవర్క్లో చేదోడు లేదా వంట వంటి కొత్త అభిరుచులను అన్వేషించడం.. ఇలా రోజువారీ జీవితంలో మరింత సృజనాత్మకంగా ఉండాలని 84% మంది ఆశిస్తున్నారు. ఏఐ వినియోగంలో చాలా మంది నిరంతర అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. ఏఐని ఎలా ప్రారంభించాలో 68% మందికి తెలియడంలేదు. అందుకు నైపుణ్యం లేదా మార్గదర్శకత్వం లేకపోవడాన్ని 52% మంది ఉదహరిస్తున్నారు. అటువంటి అడ్డంకుల కారణంగా వృత్తిపరమైన లేదా సృజనాత్మక ఆకాంక్షను వదులుకున్నామని 61% మంది చెప్పారు. మార్పు తెచ్చిన జెమినై..తమ ఏఐ ప్లాట్ఫామ్ జెమినైని మొదటగా స్వీకరించినవారు ఇప్పటికే గణనీయంగా ప్రయోజనాలను ఆస్వాదిస్తున్నారని గూగుల్ తెలిపింది. దేశంలోని 92% జెమినై వినియోగదారుల విశ్వాసాన్ని ఈ సాధనం మెరుగుపరిచిందని వెల్లడించింది. ముఖ్యంగా జనరేషన్ జెడ్ (94%), విద్యార్థులు (95%), మహిళల్లో (94%) జెమినై అధిక ప్రభావం ఉందని వివరించింది. ఏఐ వినియోగం 93% మంది వినియోగదార్ల ఉత్పాదకతను పెంచిందని తెలిపింది. సృజనాత్మకంగా ఆలోచించడంలో 85% మందికి సహాయపడిందని గూగుల్ వివరించింది. గూగుల్–కాంటార్ తాజా అధ్యయనం.. -
సజీవ కళ.. ఆదరణ లేక!
‘వాద్య వైఖరి కడు నెరవాది యనగా ఏకవీర మహాదేవి ఎదుట నిల్చి పరుశరాముని కథలెల్ల ఫ్రౌడి పాడె చారుతర కీర్తి భవనీల చక్రవర్తి’.. అని 13వ శతాబ్దం నాటి గ్రంథం ‘క్రీడాభిరామం’లో బైండ్ల కళ గొప్పతనం గురించి ఉంది. ‘‘శివుని చిన్న బిడ్డవమ్మ ఎల్లమ్మా.. నీవు శివులెల్లి మాతవమ్మ ఎల్లమ్మా.. పుట్టలోన పుట్టినావు ఎల్లమ్మ.. నీవు పుడమిపై బడ్డవమ్మా ఎల్లమ్మా.. నాగవన్నె చీరలమ్మ ఎల్లమ్మ.. నీకు నెమలికండ్ల రవికలమ్మ ఎల్లమ్మా.. రావె రావె ఎల్లమ్మా... నిన్ను రాజులు కొలిచేరెల్లమ్మా..’’ తొర్రూరు: ఒంటి నిండా రంగు.. గంభీరమైన ఆకారంతో.. ఇలాంటి పాటలు పాడుతూ గ్రామ దేవతలకు పూజలు చేసే కళాకారులే బైండ్ల కళాకారులు. జమిడిక తంత్రిని మునివేళ్లతో మీటుతూ రకరకాల శబ్దాలను పలికిస్తారు. ఒకప్పుడు రాజులకు వినోదాన్ని పంచిన ఈ కళ ప్రజలందరికీ చేరువలో ఉండేది. వంశపారంపర్యంగా వచ్చిన కళను కాపాడుతూ జీవం పోస్తున్నారు. నేడు జమిడిక నాదం మూగబోయే స్థితికి.. అలాంటి జమిడిక నాదం ప్రస్తుతం మూగబోయే పరిస్థితి కనిపిస్తోంది. పల్లెలు, పట్టణాల్లో డీజేల హోరు పెరగడంతో భవిష్యత్తులో బైండ్ల కళా ప్రదర్శన కనుమరుగయ్యే దుస్థితి నెలకొందని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైండ్ల కళాకారులను భవానీలు అని కూడా పిలుస్తారు. వీళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లోనూ ఉన్నారు. వీరి పూజా విధానం కాస్త కష్టంగానే ఉన్నా.. ప్రజలను ఉర్రూతలూగిస్తుంది. గ్రామ దేవతలకు పూజలు చేస్తూ.. తెలుగు చరిత్రలో బైండ్ల కులస్తులకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కళాకారులు మాదిగ కులస్తులకు పూజారులుగా, శక్తి ఆరాధకులుగా పేరొందారు. పూర్వం మాదిగ కులస్తులు (Madiga Community) జరుపుకొనే శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టడమే కాకుండా పెళ్లితంతు జరిపేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. పెళ్లిళ్లు, పండుగలు ఇతర కులాల వారితో చేయించడం వల్ల వారి ఉపాధి దెబ్బ తింది. ప్రస్తుతం వారు వంశానుక్రమంగా సంక్రమించిన గ్రామాలకు వెళ్లి ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ కథలు చెప్పి దేవతలను కొలిచే పూజారులుగా, కళాకారులుగానే మిగిలారు. ‘జమిడిక’ విన్యాసాలు బైండ్ల కళాకారులు ఉపయోగించే వాయిద్యాన్ని ‘జమిడిక’ అంటారు. దీన్ని ఇత్తడితో తయారు చేస్తారు. జమిడికతో అనేక రకాల సంగీత ధ్వనులు పలికిస్తారు. పాట వరుసను అనుసరించి లయ మారుస్తుంటారు. కథకుడు కథాగానం చేస్తుంటే.. పక్కనున్న కళాకారులు వంత పాడుతూ జమిడిక వాయిస్తుంటారు. పల్లెల్లో ఎక్కువగా చేసుకునే రేణుకా ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, పోలేరమ్మ పండుగలప్పుడు పసుపు, కుంకుమలతో పట్నాలు వేసి దేవతలను కొలుస్తారు. దేవుళ్లకు బోనాలు సమర్పించిన రాత్రంతా గుడి దగ్గరే ఉంటారు. తెల్లవారుజాము వరకు ఆటపాటలతో దేవతల చరిత్ర చెబుతారు. పరశురాముడు, మాందాత, పోతరాజు, ఎల్లమ్మతో పాటు పలు రకాల వేషధారణలతో ఆకట్టుకుంటారు.నేడు ఉపాధి కరువై.. ప్రస్తుతం తెలంగాణలో కథాగానం చేసే బైండ్ల కళాకారులు (Baindla Artists) స్వల్ప సంఖ్యలో ఉన్నారు. ఆయా గ్రామాల్లో పండుగలు జరిగినప్పుడే వీరికి ఉపాధి దొరుకుతోంది. ఏటా కేవలం ఆషాఢం, శ్రావణ మాసాల్లోనే వీరికి ఉపాధి దొరుకుతోంది. మిగతా రోజులు కూలీ పనులు, వేరే వృత్తులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు. కొత్త తరం ఈ కళారూపాన్ని నేర్చుకోవడానికి ముందుకు రావడం లేదు. అక్కడక్కడా కళాకారులు తమ వారసత్వ కళా సంస్కృతిని కొనసాగించాలనే పట్టుదలతో తమ పిల్లలను చదివిస్తూనే సందర్భాన్ని బట్టి వారికి కథలను నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు.ప్రభుత్వ చేయూత కోసం.. శక్తి దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ వంటి దేవతల కథలు చెప్పే సంస్కృతి బైండ్ల కళాకారుల నుంచి అనాదిగా వస్తోంది. ఈ ఆలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ధూపదీప నైవేద్య పథకం కింద బైండ్ల కళాకారులను చేర్చి అర్చకులుగా అవకాశమివ్వాలని వారు కోరుతున్నారు. దాంతో పాటు కళనే నమ్ముకుని వయోభారంతో ఇబ్బంది పడుతున్న వారికి.. ప్రభుత్వం ప్రత్యేక పథకాలు వర్తింపజేయాలని, కళాకారుల పింఛన్లు (Pensions) అందించాలని కోరుతున్నారు. భావితరాలకు ఈ కళను పరిచయం చేసేందుకు డాక్యుమెంటేషన్ చేయాలని కళాకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: పిలిచిన పలికేవు స్వామి! -
పాపం పసివాళ్లు!
ఒక్క ఉగ్రవాద దాడి రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీయడమే గాక తల్లీబిడ్డలను విడదీస్తోంది. భార్యాభర్తలను వేరు చేస్తోంది. విభజన కాలం నాటి ఉది్వగ్న పరిస్థితులను తలపిస్తోంది. పహల్గాంలో ఉగ్రదాడి తరువాత పాక్ వీసాలను రద్దు చేయడం తెలిసిందే. దాంతో ఇక్కడి పాకిస్తానీలంతా వెనుదిరుగుతున్నారు. భారత వీసాలున్న పలువురు మహిళలు మాత్రం తమ కుటుంబంతో పాటు పాక్ వెళ్లలేకపోతున్నారు. పాక్ వీసాలున్న వారి పిల్లలేమో వెళ్లక తప్పని పరిస్థితి! తల్లులను విడిచి వెళ్లలేక వారు పడుతున్న బాధ వర్ణనాతీతం! ‘‘‘తల్లి లేకుండా పిల్లలెలా ఉంటారు ప్రధాని మోదీ జోక్యం చేసుకుని తల్లులను పిల్లల దగ్గరకు చేర్చాలి’’ అని ఆ కుటుంబాలు వేడుకుంటున్నాయి.పిల్లలు విలవిల్లాడుతున్నారుగత నెలలో కరాచీ నుంచి భారత్కు వచ్చిన మరో కుటుంబానిదీ ఇదే పరిస్థితి. తల్లికి భారత పౌరసత్వం ఉండగా పిల్లలు పాకిస్తాన్ జాతీయులు. ‘‘అమ్మను వదిలి వెళ్లడం బాధగా ఉంది. అమ్మ మాతోపాటు పాక్ రావడానికి అనుమతించాలని మోదీని వేడుకుంటున్నా’’ అంటూ అల్యాన్ అనే బాలుడు అభ్యర్థించాడు. ‘‘మేం గత నెల కరాచీ నుంచి భారత్ వచ్చాం. నా భార్య నబీలాను ఇక్కడే వదిలి తిరిగి వెళ్లాలివస్తోంది. పిల్లలు విలవిల్లాడుతున్నారు. ఈ టెర్రరిస్టులు మా కుటుంబాన్ని వేరు చేశారు. అందుకు మూల్యం చెల్లించుకుంటారు’’ అని అల్యాన్ తండ్రి మహ్మద్ ఇర్ఫాన్ వాపోయారు. భార్య షర్మిన్, కూతుళ్లతో కలిసి వచ్చిన మహ్మద్ ఇమ్రాన్దీ ఇదే పరిస్థితి. ‘‘షర్మిన్కు భారత పాస్పోర్టుంది. దాంతో మాతో పాక్ వచ్చేందుకు అనుమతించడం లేదు. మోదీ మాకు సాయం చేయాలి’’ అని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అమ్మమ్మను చూడ్డానికి వచ్చి.. అమ్మను వదిలేసి.. ఆదివారం పంజాబ్లోని అటారీ సరిహద్దులో విషాద పరిస్థితులు నెలకొన్నాయి. తల్లిని వీడి వెళ్తున్న 11 ఏళ్ల జైనబ్, 8 ఏళ్ల జెనీష్ కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘నానీని కలవడానికి వచ్చాం. కానీ ఇప్పుడు అమ్మ మాతో రాలేకపోతోంది. నేను, చెల్లి మాత్రమే వెళ్లిపోతున్నాం. అమ్మను వదిలి వెళ్లాలన్న ఆలోచనకే నా గుండె బద్దలవుతోంది’’ అంటూ జైనాబ్ విలపిస్తోంది. వారి తండ్రి పాకిస్తానీ. తల్లిది ఢిల్లీ. పిల్లలిద్దరికీ పాకిస్తాన్ పాస్పోర్టుండగా తల్లికి భారత్ పాస్పోర్టుంది. ఢిల్లీలో అమ్మమ్మను చూడ్డానికి గత నెలలో వచ్చారు. తమలాంటి అమాయకులను ఇబ్బంది పెట్టిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని జైనాబ్ కోరుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈపీఎఫ్ క్లెయిమ్కు వెళ్తున్నారా..?
వేతన జీవుల్లో అధిక శాతం మందికి నెలవారీ ఖర్చులు ఆదాయాన్ని మించుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రుణాలను ఆశ్రయిస్తున్నారు. దీని ఫలితమే పర్సనల్, క్రెడిట్ కార్డ్, బంగారం రుణాలు గడిచిన కొన్నేళ్లలో గణనీయంగా పెరిగిపోవడం చూస్తున్నాం. కానీ, ఒక్కసారి ఈ రుణ చక్రంలోకి దిగితే.. అది అంత తొందరగా విడిచిపెట్టదు. అందుకే దీనికి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి. ఇటీవలి కాలంలో వేతన జీవుల నుంచి భవిష్యనిధి క్లెయిమ్లు పెరగడం చూస్తున్నాం. అత్యవసరాల్లో ఈపీఎఫ్ నుంచి పాక్షిక ఉపసంహరణ అవకాశాన్ని ఉద్యోగులు వినియోగించుకుంటున్నారు. నిర్దేశిత అర్హతలు, నిబంధనల మేరకే ఈపీఎఫ్ క్లెయిమ్ చేసుకోగలరు. ఈ విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై నిపుణులు అందిస్తున్న సమాచారం ఇది... ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్’ (ఈపీఎఫ్) వేతన జీవుల భవిష్యత్ లక్ష్యాల కోసం ఉద్దేశించిన సాధనం అని అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ముఖ్యంగా రిటైర్మెంట్ అవసరాల కోసం దీన్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో సొంతిల్లు, వైద్య అవసరాల్లోనూ దీన్ని వినియోగించుకోవచ్చు. భవిష్యత్ లక్ష్యాల కోసం ఉద్దేశించిన ఈ నిధిని తాత్కాలిక అవసరాల కోసం ఖాళీ చేయడం మంచి నిర్ణయం అనిపించుకోదు. కానీ, ఆర్థిక, అత్యవసర పరిస్థితుల్లో కొందరు ఉద్యోగులకు మరో ప్రత్యామ్నాయం లేకపోవచ్చు. ఖర్చులు ఆదాయాన్ని మించినప్పుడు.. రుణాలు తీసుకోవడం వల్ల చెల్లింపులు భారంగా మారతాయి. కనుక విశ్రాంత జీవనం కోసం ప్రత్యామ్నాయ ప్రణాళిక కలిగిన వారు.. విద్య, వైద్యం, వివాహం వంటి అత్యంత ముఖ్యమైన, క్లిష్టమైన అవసరాల్లో ఈపీఎఫ్ క్లెయిమ్ను పరిశీలించొచ్చు. అలాంటి సందర్భాల్లో ఎంత మేర వెనక్కి తీసుకోవచ్చు? అర్హతల గురించి ఉద్యోగులకు తప్పక అవగాహన ఉండాలి. ఏ అవసరానికి ఎంత? వివాహం లేదా ఉన్నత విద్య కోసం ఈపీఎఫ్ నిధిని వినియోగించుకోవాలంటే కఠిన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగి కనీసం ఏడేళ్ల పాటు ఈపీఎఫ్ సభ్యుడు/సభ్యురాలిగా ఉంటేనే ఈ అవసరాల కోసం క్లెయిమ్ చేసుకునేందుకు అర్హత లభిస్తుందని ప్రావిడెంట్ ఫండ్ మాజీ ప్రాంతీయ కమిషనర్ సంజయ్ కేసరి తెలిపారు. ఉద్యోగంలో చేరిన తేదీ క్లెయిమ్ తేదీకి ఏడేళ్ల ముందు అయి ఉండాలన్నారు. ఈ నిబంధనలో ఎలాంటి వెసులుబాటు ఉండదు. తన సర్విస్ మొత్తంలో ఉన్నత విద్య (పదో తరగతి తర్వాత చదువులు), వివాహ అవసరాల కోసం కలిపి మూడు పర్యాయాలు ఉపసంహరణకు వెళ్లొచ్చు. ఒకవేళ వైద్యం కోసం అయితే సర్విస్తో సంబంధం లేకుండా క్లెయిమ్కు వెళ్లొచ్చు. గరిష్టంగా క్లెయిమ్ ఇన్ని సార్లు అన్న పరిమితి అయితే లేదు. వివాహం ఉద్యోగి తన సొంత వివాహం కోసం, తన తోడ బుట్టిన వారి వివాహం కోసం, తన పిల్లల వివాహాల కోసం పీఎఫ్ నిధిని పొందొచ్చు. కనీసం ఏడేళ్ల సర్వీస్ ఉండాలి. ఉద్యోగి వాటాల రూపంలో జమలు, వడ్డీ నుంచి 50 శాతం ఉపసంహరించుకోవచ్చు. వైద్యం సభ్యుడు, అతను/ఆమె జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, తన పిల్లల వైద్యం కోసం తీసుకోవచ్చు. వైద్య అవసరాలకు కనీస సర్వీస్ నిబంధన వర్తించదు. ఎన్ని పర్యాయాలు ఉపసంహరించుకోవచ్చన్న పరిమితి లేదు. ఉద్యోగి స్వీయ జమల రూపంలో పోగైన మొత్తం, వడ్డీ లేదా.. నెలవారీ మూలవేతనం, డీఏకి ఆరు రెట్లు.. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అంత మేరకు వెనక్కి తీసుకోవచ్చు. ఇల్లుప్లాట్ కొనుగోలు లేదా ఇల్లు/ఫ్లాట్ నిర్మాణం, కొనుగోలు కోసం ఉద్యోగి తన జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే పీఎఫ్ క్లెయిమ్కు వెళ్లొచ్చు. కనీసం ఐదేళ్ల సర్వీస్ను పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగి సొంతంగా లేదా జీవిత భాగస్వామితో కలసి జాయింట్గా ప్రాపర్టీ కొనుగోలు చేయడం లేదా కలిగి ఉండడం తప్పనిసరి. ప్లాట్ కొనుగోలుకు అయితే నెల జీతానికి 24 రెట్లు.. ఇల్లు కొనుగోలు లేదా ఇంటి నిర్మాణం కోసం అయితే నెలవారీ జీతానికి 36 రెట్లు.. లేదా ఉద్యోగి, యాజమాన్యం జమలు, వీటిపై వడ్డీ మొత్తం.. లేదా కొనుగోలు/నిర్మాణ వ్యయం.. ఇందులో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. గృహ నవీకరణ ఇల్లు నిర్మించుకున్న ఐదేళ్ల తర్వాత అనుమతిస్తారు. ఉద్యోగి నెలవారీ మూలవేతనం, డీఏకి 12 రెట్ల వరకు తీసుకోవచ్చు. లేదా ఉద్యోగి స్వీయ జమలు, వాటిపై వడ్డీ.. లేదా నవీకరణకు అయ్యే వ్యయం.. ఈ మూడింటిలో తక్కువ మొత్తాన్నే అనుమతిస్తారు. గృహ రుణం తీర్చివేసేందుకు కనీసం మూడేళ్ల సర్విస్ పూర్తి చేసి ఉండాలి. బ్యాలన్స్ నుంచి 90% వెనక్కి తీసుకోవచ్చు. విద్య తన కుమారుడు లేదా కుమార్తెల ఉన్నత విద్య కోసమే భవిష్య నిధి నుంచి పాక్షిక ఉపసంహర ణకు అనుమతిస్తారు. కనీసం ఏడేళ్ల సర్విస్ ఉండాలి. ఉద్యోగి జమలు, వడ్డీ మొత్తం నుంచి 50 శాతాన్ని తీసుకోవచ్చు. ఇలా 3 పర్యాయాలు ఉపసంహరించుకోవచ్చు. ఈ 3 సార్లు అన్న పరిమితి వివాహం, విద్యకు కలిపి వర్తిస్తుంది. ఉద్యోగం కోల్పోయిన పరిస్థితుల్లో.. ఒకచోట ఉద్యోగం కోల్పోవడం లేదంటే మానివేసి.. నెల రోజులకు పైగా మరో ఉపాధి లేని పరిస్థితుల్లో పీఎఫ్ బ్యాలన్స్ నుంచి 75 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఉపాధి లేకుండా రెండు నెలలు దాటిపోతే అప్పుడు మిగిలిన 25 శాతాన్ని కూడా వెనక్కి తీసేసుకోవడానికి నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఒక సంస్థలో ఉద్యోగం మానేశామన్న కారణంతో పీఎఫ్ ఖాతాను ఖాళీ చేయాలనేమీ లేదు. మరో సంస్థలో చేరిన తర్వాత పీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు. తద్వారా అందులో ప్రయోజనాలను అలాగే కొనసాగించుకోవచ్చు.ఉపసంహరణ ఎలా..? ఆన్లైన్ క్లెయిమ్ ప్రక్రియను ఈపీఎఫ్వో ఎంతో సులభతరం చేసింది. ఈపీఎఫ్ ఇండియా పోర్టల్కు వెళ్లి కుడి భాగంలో పైన కనిపించే ‘ఆన్లైన్ క్లెయిమ్స్’ దగ్గర క్లిక్ చేయాలి. ఆ తర్వాత ప్రత్యేక విండో తెరుచుకుంటుంది. అక్కడ ‘యూఏఎన్’ నంబర్, పాస్వర్డ్ నమోదు చేసి, మొబైల్కు వచ్చే ఓటీపీతో లాగిన్ అవ్వాలి. లాగిన్ పూర్తయిన తర్వాత పైన కనిపించే ఆప్షన్లలో ‘ఆన్లైన్ సర్విసెస్’ సెక్షన్లో ‘క్లెయిమ్ ఫారమ్’ను ఎంపిక చేసుకోవాలి. అక్కడ యూఏఎన్కు లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నంబర్ను నమోదు చేసి ధ్రువీకరించాలి. అక్కడ పీఎఫ్ అడ్వాన్స్ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెలక్ట్ సర్వీస్ దగ్గర పనిచేస్తున్న సంస్థను ఎంపిక చేసుకోవాలి. దాని కింద క్లెయిమ్ దేనికోసమన్న కారణాన్ని ఎంపిక చేసుకోవాలి. అనంతరం అక్కడ కోరిన వివరాలు ఇచ్చి దరఖాస్తును సమర్పించాలి. చివరిగా మొబైల్కు వచ్చే ఓటీపీని నమోదు చేసిన అనంతరం అది విజయవంతంగా దాఖలవుతుంది. క్లెయిమ్ దరఖాస్తు పురోగతిని సైతం ఇదే మాదిరి లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. పరిశీలన కోసం చెక్ కాపీని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి రావచ్చు. కనుక ముందే సిద్ధం చేసుకోవాలి. సంబంధిత చెక్ లీఫ్పై సభ్యుడి పేరు, బ్యాంక్ ఖాతా తదితర వివరాలు ఉండాలి. ఉమంగ్ యాప్ నుంచి కూడా క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. అదే ఆఫ్లైన్లో క్లెయిమ్ దరఖాస్తు సమర్పించేందుకు, కావాల్సిన అన్ని డాక్యుమెంట్లతో సమీపంలోని ఈపీఎఫ్వో కార్యాలయానికి వెళితే సరిపోతుంది. అక్కడ విత్డ్రాయల్ ఫారమ్ పూరించి, వారు కోరినట్టు డాక్యుమెంట్లను జత చేసి సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో క్లెయిమ్ దరఖాస్తు 3–4 రోజుల్లో పరిష్కారం అవుతుంది. క్లెయిమ్ రూ. లక్ష లోపు ఉంటే ఆటోమేటిక్గా అనుమతి లభిస్తుంది. ఆఫ్లైన్లో ఇందుకు 10–20 రోజులు పట్టొచ్చు. ఈపీఎఫ్ ఖాతా నుంచి ఉపసంహరించుకున్న నిధులను, రుణం కాదు కనుక తిరిగి జమ చేయాల్సిన అవసరం లేదు. అలాగే, ఈపీఎఫ్ బ్యాలన్స్పై ఎలాంటి రుణ సదుపాయం లేదు. → క్లెయిమ్ భారీగా ఉంటే అప్పుడు విద్యార్హత సర్టిఫికెట్లు లేదా వైద్య డాక్యుమెంట్ల కాపీలు అప్లోడ్ చేయాల్సి రావచ్చు. → అర్హతలు, పరిమితులను ఒక్కసారి సమగ్రంగా తెలుసుకోవాలి. ముఖ్యమైన అవసరాల్లోనే ఈపీఎఫ్ను వివేకంగా ఉపయోగించుకోవాలన్నది నిపుణుల సూచన. → ఈపీఎఫ్ క్లెయిమ్కు వెళ్లే ముందు తమ కేవైసీ వివరాలు సరిగ్గా ఉన్నాయేమో ఒక్కసారి సరిచూసుకోవాలి. అంటే బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్, పాన్ వివరాలు నమోదు చేసి, ధ్రువీకరించి ఉండాలి. దీనివల్ల క్లెయిమ్ దరఖాస్తు తిరస్కరణకు గురికాకుండా ఉంటుంది. 54 ఏళ్లు నిండితే..54 ఏళ్లు నిండిన తర్వాత, ముందస్తు పదవీ విరమణ/వయోభారం రీత్యా విరమణ చేసిన వారు 58 ఏళ్లు రాకముందే మొత్తం పీఎఫ్ బ్యాలన్స్లో 90 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు.పన్ను భారం? ఈపీఎఫ్ ఖాతా ప్రారంభించిన ఐదేళ్ల తర్వాత ఉపసంహరణకు వెళితే ఆ మొత్తంపై ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఒకవేళ సర్విస్ ఐదేళ్లలోపు ఉండి, ఉపసంహరించుకునే మొత్తం రూ.50,000 మించితే అప్పుడు దీనిపై 10 శాతం టీడీఎస్ మినహాయిస్తారు. పాన్ నంబర్ ఇవ్వకపోతే 20 శాతం టీడీఎస్ పడుతుంది. ఐదేళ్లలోపు రూ.50 వేలకు మించి ఉపసంహరించుకుంటే ఆ మొత్తాన్ని వార్షిక ఆదాయానికి కలిపి చూపించి నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. పన్ను పరిధిలోకి రాకపోతే, పీఎఫ్పై మినహాయించిన టీడీఎస్ను రిఫండ్ కోరొచ్చు. ఒకవేళ ఉద్యోగం నుంచి తొలగింపునకు గురై లేదా కంపెనీ మూసివేసిన కేసుల్లో ఉద్యోగులు పీఎఫ్ నిధిని ఉపసంహరించుకుంటే, అప్పుడు సర్విస్ ఐదేళ్లలోపు ఉన్నా సరే ఆ మొత్తం పన్ను పరిధిలోకి రాదు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
కశ్మీర్కు పర్యాటక కళ
కశ్మీర్ నెత్తుటి మరకలను తుడుచుకుంది. పాశవిక దాడి తాలూకు చేదు అనుభవం నుంచి చూస్తుండగానే తేరుకుంది. పర్యాటకులను ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటోంది. దాడి నేపథ్యంలో భయాందోళనలతో లోయను వీడిన టూరిస్టులు ఇప్పుడు అక్కడికి తిరిగి వెళ్తున్నారు. ఉగ్ర దాడుల ఆందోళనలు పూర్తిగా తొలగకపోయినా దేశమంతా ఏకమై ఉందని చెప్పడానికి కశ్మీర్ను సందర్శిస్తున్నారు. శని, ఆదివారాల్లో కోల్కతా, బెంగళూరు సహా దేశంలోని పలు ప్రాంతాల నుంచి ప్రయాణికులు కశ్మీర్ చేరుకున్నారు. ‘‘కశ్మీర్ ఇప్పుడు సురక్షితంగా ఉంది, షాపులు, సందర్శన స్థలాలు అన్నీ తెరిచే ఉన్నాయి’’ అని వారు స్వయంగా చెబుతున్నారు. ‘‘లోయ మళ్లీ పర్యటాకులతో కళకళలాడుతోంది. కశ్మీర్ పర్యటనకు రండి’ అని స్థానిక టూర్ ఆపరేటర్లతో పాటు ప్రభుత్వం కూడా పిలుపునిస్తోంది. ప్రఖ్యాత దాల్ సరస్సు ఆదివారం ఉదయం మళ్లీ సందడిగా మారింది. పర్యాటకులు షికారాల్లో విహరాన్ని, స్థానిక ఆతిథ్యాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నారు. కశ్మీరీల ఆతిథ్యం గొప్పగా ఉందంటూ కొనియాడుతున్నారు. ఉగ్ర దాడితో పర్యాటకం దెబ్బతినకుండా చూసుకుందామంటూ పిలుపునిస్తున్నారు.‘ఛలో కశ్మీర్’ నటుడు అతుల్ కులకర్ణి కశ్మీర్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు బాలీవుడ్ నటుడు అతుల్ కులకర్ణి ముందుకొచ్చారు. ‘చలో కశ్మీర్’ అంటూ ఆయన ఆదివారం ఉదయం పహల్గాం చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో పర్యాటకులు కశ్మీర్ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘కశ్మీర్ పర్యటన ప్రణాళికలను రద్దు చేసుకుంటే ఉగ్రవాదులు అనుకున్నది నెరవేరుతుంది. అది జరగకూడదు. పర్యాటకులు కశ్మీర్కు రావాలి’’ అని ఎక్స్లో పిలుపునిచ్చారు. ‘చలో కశ్మీర్’, ‘టెర్రరిజాన్ని ఓడించండి’, ‘ఫీట్స్ ఇన్ కశ్మీర్’ అంటూ హ్యాష్టాగ్లు జోడించారు. ఉగ్రవాదాన్ని ఓడించాలనే సందేశంతో కశ్మీర్లో రెండు రోజుల పాటు పర్యటిస్తానని కులకర్ణి చెప్పారు. ఇలాంటి కార్యకలాపాలు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలు పరస్పరం అర్థం చేసుకోవడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. కశ్మీరీ జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్న తమిళనాడుకు చెందిన పర్యాటకుల బృందాన్ని పహల్గాంలో చూశానని, ఇలాంటి సంభాషణలు ప్రజల సన్నిహిత బంధాలను పెంపొందించడానికి, ఐక్యత, కరుణ సందేశాన్ని పంపడానికి కూడా సహాయపడతాయని ఆయన అన్నారు. పహల్గాంలోని బైసారన్ లోయలో మంగళవారం ఉగ్ర దాడి జరిగిన వెంటనే కశ్మీర్లోని హోటళ్లు, హౌస్ బోట్ల టూరిస్ట్ బుకింగ్స్లో 80 శాతం వరకు రద్దవడం తెలిసిందే. వేలాది మంది పర్యాటకులు కశ్మీర్లో పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని ప్రత్యేక విమానాలు, రైళ్లలో స్వస్థలాలకు చేరుకున్నారు.ఉగ్ర లక్ష్యం నెరవేర నీయొద్దు‘‘దుర్గా పూజ తర్వాత కశ్మీర్ పర్యటనకు బుకింగ్స్ చేసుకున్నాం. దాడితో షాకయ్యాం. కానీ స్థానికులతో మాట్లాడాక వెళ్లొచ్చని నిర్ధారించుకున్నాం. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో కశ్మీర్ను కచ్చితంగా పర్యటించాలనే వచ్చాం. భయపడి ఆగిపోతే ఉగ్రవాదుల లక్ష్యాన్ని నెరవేర్చిన వాళ్లమవుతాం అనిపించింది. అందుకే వచ్చాం’ అని కోల్కతా నుంచి వచ్చిన ఓ యువతి తెలిపారు. ‘‘ఇప్పుడు కశ్మీర్ సురక్షితంగా ఉంది. గుల్మార్గ్, సోన్మార్గ్, తరువాత పహల్గాం కూడా వెళ్లాలనుకుంటున్నాం. కశ్మీర్ భారత్లో భాగం. మనం కశ్మీర్ సందర్శించడం స్థానికులకు సాయం చేసినట్టవుతుంది. ఈ విషాద సమయాల్లో మనమంతా ఒక్కటని చాటాల్సిన అవసరముంది’’ అని మరో యువకుడు నొక్కి చెప్పారు. ‘‘మేం దాడి తర్వాతే వచ్చాం. ఇప్పుడిక్కడ అంతా సాధారణంగానే ఉంది. చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేశాం’ అని బెంగళూరుకు చెందిన దంపతులు చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎండగండం నుంచి..కొండంత ఉపశమనం
రోహిణీ కార్తె ఇంకా రానేలేదు.. అప్పుడే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తున్నాయి. నడినెత్తిన చండమార్తాండుడు నిప్పులు కురిపిస్తూండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇలా మండుతున్న ఎండల నుంచి తక్షణ ఉపశమనాన్నిచ్చే దివ్యౌషధం కొబ్బరి బొండం. వేసవిలోనే కాదు ఏడాది పొడవునా తాగేందుకు అనువైన ఆరోగ్యకరమైన పానీయం. రైతులకు సైతం కొబ్బరి కాయ కన్నా బొండం అమ్మకాల వల్లే అధిక ఆదాయం లభిస్తోంది. బొండాలు, నీళ్లు, కొబ్బరి నీళ్లతో చేసే జ్యూస్ల విక్రయాలతో చిరు వ్యాపారుల నుంచి కార్పొరేట్ కంపెనీల వరకూ పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నాయి. –సాక్షి, అమలాపురంపోషకాల గని » కొబ్బరి నీళ్లలో పోషకాలు, ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి. కొబ్బరి బొండం సెలైన్తో సమానం. ఒక బొండంలో దాదాపు 300 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. » మూత్ర సంబంధిత జబ్బులు, కిడ్నీలో రాళ్ల సమస్యకు ఇది చక్కగా పని చేస్తుంది. » కొబ్బరి నీళ్లు ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. దీనిని బెస్ట్ ఎనర్జీ డ్రింక్గా ఆరోగ్య నిపుణులు పేర్కొంటారు. » బొండంలో ఉండే కొబ్బరి గుజ్జు గుండెజబ్బులు రానివ్వకుండా చేస్తుంది. వేసవిలో చెమట కాయలు, వేడి కురుపులు, చికెన్పాక్స్ వంటివి తగ్గడానికి దోహదపడుతుంది. » లేత కొబ్బరిలో విటమిన్–ఎ, బి, సి సమృద్ధిగా లభిస్తాయి. ఐరన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, రెబోఫ్లెవిన్, నియాసిన్, థయామిన్ అధికంగా ఉంటాయి. అక్కడి బొండాలకు డిమాండ్ »డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో సుమారు 1.50 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. ఏడాదికి 105 కోట్ల కొబ్బరి కాయలు వస్తాయని అంచనా. కొబ్బరి కాయల్లో 15 శాతం మాత్రమే బొండాలుగా రైతులు విక్రయిస్తున్నారు. »ఎండలు పెరగడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి బొండాల ఎగుమతులు జోరందుకున్నాయి. మన రాష్ట్రంతో పాటు తెలంగాణలోని ముఖ్య నగరాలు, పట్టణాలకు బొండాలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుత సీజన్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి రోజుకు 60 లారీలకు పైగా ఎగుమతి అవుతున్నాయి. ఎండల తీవ్రత మరింత పెరిగితే రోజుకు 100 లారీల వరకూ బొండాల ఎగుమతి జరుగుతుందని రైతులు చెబుతున్నారు. » తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు, చాగల్లు, పెరవలి, గోపాలపురం, కాకినాడ జిల్లాలో తుని, ఏలేశ్వరం, కోనసీమ జిల్లాలోని కొత్తపేట, పి.గన్నవరం వంటి మండలాల్లో మాత్రమే కొబ్బరి బొండం సేకరణ అధికంగా ఉంటుంది. »మార్చి మొదటి వారంలో బొండం రైతువారీ ధర రూ.12 ఉండగా ఇప్పుడది రూ.18కి పెరిగింది. ఎండలు పెరిగితే ఈ ధర రూ.20 వరకూ చేరుతుందని రైతులు ఆశపడుతున్నారు. కొబ్బరి కాయలైతే రైతులే సేకరించాలి. దింపు, పోగువేత, రాశులు పోయడం ఇలా కాయకు రూ.2 వరకూ అవుతోంది. అదే బొండాలను వ్యాపారులు సొంత ఖర్చులు పెట్టుకుని తీసుకుంటారు. దీనివలన రైతులకు ఆ పెట్టుబడి బాధ తప్పుతోంది. మార్కెట్తో సంబంధం లేకుండా ధర నిలకడగా ఉండటం, కాయ సేకరణ భారం లేకపోవడంతో బొండాల అమ్మకమే ప్రయోజనకరమని కొబ్బరి రైతులు భావిస్తున్నారు. కొబ్బరి కాయతో పోల్చుకుంటే బొండం అమ్మకాలే లాభసాటిగా ఉంటున్నాయని రైతులు చెబుతున్నారు. బొండం ఆరు నుంచి ఎనిమిది నెలలకు తయారవుతుంది. అదే పక్వానికి వచ్చే కొబ్బరి కాయకు పట్టే సమయం 12 నెలలు. అందువలన బొండాల ఉత్పత్తిని రైతులు త్వరగా అందుకుంటూ, నాలుగు డబ్బులు కళ్లజూస్తున్నారు. షర్బత్ల నుంచి జ్యూస్ల వరకూ.. కొబ్బరి బొండాలపై ఆధారపడి జీవిస్తున్నవారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. బొండాలతో పాటు కొబ్బరి నీళ్లతో షర్బత్, నాటాడీకో వంటి కోకోనట్ జల్లీలతో పాటు కొబ్బరి నీళ్లు, గుజ్జుతో జ్యూస్లు కూడా తయారు చేస్తున్నారు. వాస్తవానికి కొబ్బరి జ్యూస్ తయారీ మొదలైంది రాజమహేంద్రవరంలోనే కావడం విశేషం. ఇప్పుడు ఈ వ్యాపారం అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. కోకోనట్ జ్యూస్లలో సైతం స్ట్రాబెర్రీ, మ్యాంగో, డ్రాగన్, బనానా, కివీ, వాటర్ మిలన్, ఆపిల్ వంటి ఫ్లేవర్లతో ఆకట్టుకుంటున్నారు. వీటితో నిరుద్యోగ యువత ఉపాధి పొందడంతో పాటు జనానికి ఆరోగ్యాన్ని చేరువ చేస్తున్నారు. ఆరోగ్యానికి ఔషధం కేవలం దప్పిక తీరడమే కాదు.. కొబ్బరి బొండం ఆరోగ్యానికి ఔషధం. వేసవిలో ఉపశమనం కోసమే కాదు.. ఏడాది పొడవునా ఆరోగ్యం కోసం కొబ్బరి బొండం తాగడం మంచిదే. దీనిలోని ఎలక్ట్రోలైట్లు, సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు తక్షణ శక్తినిస్తాయి. ఆరోగ్యానికి పలు రకాలుగా మేలు చేస్తాయి. – డాక్టర్ ఎన్బీవీ చలపతిరావు, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త, అంబాజీపేట -
3 నిమిషాలకో మరణం
రోజూ ఉదయం పేపర్ తీయగానే రోడ్డు ప్రమాద వార్తలు. బస్సులు లోయల్లోకి పడిపోవడం, ఆగి ఉన్న ట్రక్కులను ఢీకొన్న కార్లు. ద్విచక్ర వాహనాలను ఢీకొన్న పెద్ద వాహనాలు. ఈ రోజువారీ విషాదాలు నిశ్శబ్ద సంక్షోభానికి అద్దం పడుతున్నాయి. భారత్లో ప్రతి మూడు నిమిషాలకొకరు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు. సగటున రోజూ 474 మరణాలు సంభవిస్తున్నాయి. 2023లోనే 1,72,000 మందికి పైగా భారతీయులు రోడ్లపై ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్రం విడుదల చేసిన అధికారిక నివేదికే పేర్కొది. వారిలో 10,000 మంది పిల్లలే. పాఠశాలలు, కళాశాలల సమీపంలో జరిగిన ప్రమాదాల్లో మరో 10వేల మంది మరణించారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వాహనాలు ఢీకొట్టి 35 వేల మంది పాదచారులు ప్రాణాలు కోల్పోయారు. మృత్యువాత పడ్డ ద్విచక్ర వాహనదారుల సంఖ్య కూడా అధికమే. ఈ ప్రమాదాలకు అతివేగమే అతి పెద్ద కారణం. కనీస భద్రతా జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ప్రాణాంతకంగా మారింది. హెల్మెట్ ధరించకపోవడం వల్ల 54 వేల మంది ద్విచక్రవాహనదారులు ప్రాణాలు కోల్పోయారు. కారులో సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల 16 వేల మంది మరణించారు. ఓవర్ లోడ్ 12,000 మరణాలకు దారితీసింది. సరైన లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వల్ల జరిగిన ప్రమాదాలకు బలైనవారు 34 వేలమంది. రోడ్ల వ్యవస్థ అస్థవ్యస్తం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రహదారి నెట్వర్క్ భారత్లో ఉంది. మొత్తం 66 లక్షల కిలోమీటర్ల పొడవైన రహదారులున్నాయి. ఇందులో జాతీయ, రాష్ట్ర రహదారుల వాటా 5 శాతం. 35 కోట్ల రిజిస్టర్డ్ వాహనాలున్నాయి. కానీ భారత రహదారులు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. అస్థవ్యస్తమైన రహదారుల వ్యవస్థే దీనికి కారణం. రోడ్లపై ట్రాఫిక్ నియమాలు సరిగ్గా లేకపోవడం, ఉన్నా పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్లు, బస్సులు, ద్విచక్రవాహనాలు, భారీ వాహనాలు, ఆటోలు, సైకిళ్లు, పాదచారులు, అక్కడక్కడా జంతువులు.. మొత్తంగా రోడ్డును అడ్డదిడ్డంగా ఉపయోగించడం వల్ల పరమాదాలు జరుగుతున్నాయి. ఫుట్పాత్ ఆక్రమణ కూడా ప్రమాదాలకు కారణంగా ఉంది. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా నియంత్రణకోసం ఎన్ని నిధులు వెచ్చించినా మారని మనుషుల తీరు, అమలులో లోపాలు, వ్యవస్థాగత నిర్లక్ష్యం సంక్షోభానికి కారణమవుతోంది. రోడ్డు ప్రమాదాలతో దేశ వార్షిక జీడీపికి 3 శాతం నష్టం కలుగుతోందంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు చట్టం పట్ల గౌరవం, భయం లేకపోవడం వల్లే అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రభుత్వాలు చెబుతున్నా అది ఒక పార్శ్వం మాత్రమే. నిర్మాణ, నిర్వహణ లోపాలు లోపభూయిష్టమైన రోడ్ల డిజైన్, నాసిరకం నిర్మాణం, అసమర్థ నిర్వహణ ప్రమాదాలకు ప్రధాన కారణంగా ఉన్నాయి. రోడ్డు సూచికలు, మార్కింగ్ విధానం వంటి చిన్న విషయాలు కూడా అధ్వానంగా ఉన్నాయి. 59 ప్రధాన లోపాలను కేంద్ర ఉపరితల రవాణా శాఖే గుర్తించింది. రహదారుల్లో ప్రమాదానికి కారణమయ్యే 13,795 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. వీటిలో 5,036లకు మాత్రమే దీర్ఘకాలిక మరమ్మతులు చేశారు. ఢిల్లీ ఐఐటీ ట్రాన్స్పోర్టేషన్ రీసర్చ్ అండ్ ఇంజ్యూరీ ప్రివెన్షన్ సెంటర్ నిర్వహించిన రోడ్ సేఫ్టీ ఆడిట్లు దేశ రహదారుల్లో మౌలిక సదుపాయాల లోపాలేంటో గుర్తించాయి. క్రాష్ బారికేడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం కూడా ప్రధాన కారణంగా ఉంది. బారికేడ్లున్నా లెక్క చేయకపోవడం కొంత కారణమైతే అస్థవ్యస్తమైన నిర్వహణే ఎక్కువ హాని చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. డివైడర్ల నిర్మాణంలోనూ లోపాలున్నాయి. ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఎత్తులో ఉండటం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. గుంతలు తవ్వి వదిలేయడం, సైన్ బోర్డులు పెట్టకపోవడం వల్లా ప్రమాదాలు జరుగుతున్నాయి. పటిష్టమైన రహదారుల వ్యవస్థ కాగితాలపైనే ఉందని, క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని నిపుణులు చెబుతున్నారు. అనుకరణ వద్దుభారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. ఇక్కడ ప్రత్యేక ట్రాఫిక్ వ్యవస్థ ఉంటుంది. తదనుగుణంగా ఏర్పాట్లుండాలి. అందుకు భిన్నంగా పాశ్చాత్య రహదారుల నమూనాలను అనుకరించడం ప్రమాదాలకు కారణమవుతోందన్నది అంతర్జాతీయ నిపుణుల వాదన. రోడ్డు వెడల్పు చేయడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయన్నది నిజం కాదని చెబుతున్నారు. రోడ్డు వెడల్పు అతి వేగానికి దారి తీస్తుందని, చిన్న వాహనదారులకు ప్రాణాంతకంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు. దేశాభివృద్ధికి మరిన్ని రహదారులను నిర్మించడం కీలకమేనని, అయితే అది పాదచారులు, సైక్లిస్టుల, ద్విచక్ర వాహనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆ అభివృద్ధికి నిరుపేద వర్గాలు మూల్యం చెల్లించుకోవాల్సి రాకూడదని హెచ్చరిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ ఎప్పుడో?
బాసర ట్రిపుల్ ఐటీలో ఈ విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందోనని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసరలో ఉన్న ట్రిపుల్ ఐటీకి ఏటా వేల సంఖ్యలోనే దరఖాస్తులొస్తాయి. ఈ ఏడాది ప్రభుత్వం 1,500 సీట్ల ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానించనున్నట్టు సమాచారం. ప్రవేశాల ప్రక్రియకు ఇన్చార్జ్ వీసీ గోవర్దన్ ఆధ్వర్యంలో అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల చివరిలోగా పదో తరగతి ఫలితాలు వెలువడనున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్లో అత్యధిక మార్కులు ఉన్న వారికే ఈ క్యాంపస్లో సీట్లు దక్కుతాయి. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సు బోధిస్తున్నారు. ఇక్కడి విద్యార్థుల్లో అధిక శాతం ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్లోనూ కార్పొరేట్ కంపెనీల్లో కొలువులు వస్తున్నాయి. – భైంసాఎల్కతుర్తి క్యాంపస్...కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాలకు కూడలిగా ఉన్న ఎల్కతుర్తిలో ట్రిపుల్ ఐటీ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలో నాలుగు కొత్త ట్రిపుల్ ఐటీలను నెలకొల్పుతామని పేర్కొంది. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో విద్యా సంస్కరణలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో రెండు కొత్త ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మహబూబ్నగర్, ఖమ్మం, నల్ల గొండ, ఎల్కతుర్తిలో క్యాంపస్లు ఏర్పాటు చేయాలనే చర్చ జరిగినట్టు తెలిసింది. కాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త క్యాంపస్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించారు. బాసర ట్రిపుల్ ఐటీకి అనుబంధంగా ఎల్కతుర్తి లో మరో క్యాంపస్ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 24న బాసర ఇన్చార్జ్ వీసీ గోవర్దన్ ఎల్కతుర్తి రెవెన్యూ అధికారులతో కలిసి అక్కడ భూమిని పరిశీలించారు. ట్రిపుల్ ఐటీ ఏర్పాటు కోసం 100 ఎకరాలు అవసరమని చర్చించారు.ఎల్కతుర్తి మండల కేంద్రంలో బస్టాండ్ నుంచి కిలోమీటరు దూరంలో సర్వే నంబర్లు 381, 385, 389, 392లలో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించారు. 381 సర్వేనంబరులో 88 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని సమాచారం. రెవె న్యూ అధికారుల బృందం గత మార్చి నెలలో మూడు రోజులు సర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. కలిపి ఇస్తారేమో...?బాసర ట్రిపుల్ ఐటీకి ఈ బడ్జెట్లో రూ.35 కోట్లు కేటాయించారు. కొత్త క్యాంపస్ కోసం రూ.500 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని సమాచారం. ఎల్కతుర్తిలో ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు తీసుకొని తరగతులు ప్రారంభించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. శాశ్వతంగా భవనాలు నిర్మించే వరకు కొత్త క్యాంపస్లో ఏటా 1,000 సీట్లు భర్తీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఏడాదికో క్యాంపస్ తెరిచి రానున్న నాలుగేళ్లలో నాలుగు కొత్త ట్రిపుల్ ఐటీలను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే ఈ ఏడాది ప్రవేశాలు ఎల్కతుర్తితో కలిసి 1,000 సీట్లు పెంచుతారో ఒక్క బాసరకే 1,500 సీట్లు కేటాయిస్తారో అనే విషయం తెలియడం లేదు. సీట్లు పెరిగితే మరో 1,000 మంది విద్యార్థులకు చదువుకునే అవకాశం వస్తుంది. అప్పటి వరకు బాసరలోనే...ఎల్కతుర్తి క్యాంపస్లో కొత్త విద్యా సంవత్సరానికి 1,000 సీట్లు భర్తీ చేసి వచ్చే విద్యా సంవత్సరం వరకు బాసర క్యాంపస్లోనే పీయూసీ–1, పీయూసీ–2 చదివేలా ఏర్పాట్లు చేయించాలని వాదనలు వినిపిస్తున్నాయి. బాసర క్యాంపస్లో విశాలమైన భవనాలు ఉన్నాయి. రెండేళ్ల వరకు ఇక్కడే విద్యార్థులు చదివి.. ఎల్కతుర్తి క్యాంపస్ నిర్మాణం ప్రారంభమైతే విద్యార్థులను అక్కడకు పంపించొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ప్రభుత్వానికి నివేదించాంగత మార్చి నెలలో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాల ప్రకటన విషయ మై ప్రభుత్వానికి నివేదికను పంపించాం. రాష్ట్ర ప్రభుత్వం అను మతి ఇవ్వగానే నోటిఫికేషన్ విడుదల చేస్తాం. పదో తరగతి ఉత్తీర్ణులైన ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ చదివేందుకు ఆసక్తి కనబరుస్తారు. ప్రభుత్వ అనుమతి రాగానే నోటిఫికేషన్ వెలువరించి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తాం.– గోవర్దన్, ట్రిపుల్ ఐటీ, వీసీ -
60+ సాహస యాత్ర!
అరవైల్లో పడ్డాక ఇక జీవితం అయిపోయిందనే రోజులు పోయాయ్! అమ్మమ్మలు.. తాతయ్యలు కూడా ఇప్పుడు అంటార్కిటికా నుంచి అగ్నిపర్వతాల దాకా... యూరప్ నుంచి జపాన్ దాకా.. ప్రపంచాన్ని చుట్టేసేందుకు సై అంటున్నారు. అంతేకాదు స్కైడైవింగ్ మొదలు స్కీయింగ్.. శాండ్ సర్ఫింగ్.. ఎలాంటి సాహసాలకైనా తగ్గేదేలే అంటున్నారు. అడ్వెంచర్ టూర్ల విషయంలో యువతతో పోటీ పడుతుండటంతో బేబీ బూమర్స్ (1946 నుంచి 1964 మధ్య పుట్టిన వారు) పర్యాటకం ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉంది. – సాక్షి, స్పెషల్ డెస్క్జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి వయసుతో పనేముందని నిరూపిస్తున్నారు బేబీ బూమర్స్. కుటుంబ బాధ్యతలతో తాము కోరుకున్న ఆనందాలను దూరం చేసుకున్న వారెందరో ఉంటారు. అయితే, అరవైల్లో మళ్లీ నలభై వచ్చింది.. అంటూ ప్రపంచ పర్యటనలకు సైతం సిద్ధమైపోతున్న వారు ఇటీవల బాగా పెరుగుతున్నారు. దీంతో ట్రావెల్ పరిశ్రమ కూడా ప్రత్యేక ప్యాకేజీలతో మరింత ప్రోత్సహిస్తోంది. సెగ్జాజెనేరియన్స్ (60–69 ఏళ్ల వయసు), సెప్టువాజెనేరియన్స్ (70–79 ఏళ్ల వయసు) ఆక్టాజెనేరియన్స్ (80–89 ఏళ్ల వయసు) ఇలా అన్ని వయసుల వారికీ ట్రావెల్ కంపెనీలు అనువైన ప్యాకేజీలను అందిస్తున్నాయి. ఏ సాహసానికైనా రెడీకేవలం ప్రపంచ యాత్రలే కాదు అడ్వెంచర్ ట్రావెల్కు కూడా బేబీ బూమర్స్ ఎగిరి గంతేస్తున్నారు. బుకింగ్స్ డాట్ కామ్ ‘ట్రావెల్ ప్రిడిక్షన్స్–2025’ సర్వే ప్రకారం అత్యంత సాహసంతో కూడిన యాక్టివిటీలకు మొగ్గు చూపుతున్న బేబీ బూమర్స్ 30 శాతానికి ఎగబాకారు. 2024లో ఈ సంఖ్య 11 శాతం మాత్రమే. వయసు గురించి ఆలోచించకుండా ప్రతి నలుగురు బేబీ బూమర్స్లో ఒకరు ఇలాంటి అడ్వెంచర్లంటే మక్కువ చూపుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.ప్రత్యేక డిస్కౌంట్లుసీనియర్ సిటిజన్స్ విదేశీ పర్యటన బుకింగ్స్లో ఏటా 20 శాతం వృద్ధి నమోదవుతున్నట్లు ట్రావెల్ పోర్టల్ ఈజ్మైట్రిప్ సీఈఓ రికాంత్ పిట్టీ పేర్కొన్నారు. 2021తో పోలిస్తే బుకింగ్స్ ఏకంగా మూడు రెట్లు పెరిగాయన్నారు. కాగా, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేక డిస్కౌంట్లనూ ఈ సంస్థ అందిస్తోంది. రిలాక్స్ అయ్యేందుకు కేరళ బ్యాక్ వాటర్స్, గోవా బీచ్లను ఎంచుకుంటున్నారు. ఇక ప్రకృతిలో సేద తీరేందుకు ఈశాన్య భారతాన్ని ఎక్కువగా చుట్టేస్తున్నారు. చలో అంటార్కిటికా...ఉత్తర ధ్రువం వద్ద నార్తర్న్ లైట్స్, అంటార్కిటికా క్రూజ్ యాత్రలకూ ఇటీవల ఆసక్తి పెరిగిందని సీనియర్ సిటిజన్స్ ట్రావెల్ స్పెషలిస్ట్ సంస్థ ‘కరేవాయేజ్’ పేర్కొంది. సంప్రదాయేతర, సాహసోపేతమైన గమ్యస్థానాలకు మొగ్గు చూపేవారు 2021తో పోలిస్తే 2024లో మూడింతలు పెరిగారని చెప్పింది. ఏటా 10వేల మందికి పైగా డిమాండ్ ఉన్నప్పటికీ, మంచి పర్యాటక అనుభూతిని అందించే లక్ష్యంతో తాము అంతకు మించి బుకింగ్స్ అనుమతించడం లేదని కంపెనీ ఫౌండర్ షెఫాలీ జైన్ మిశ్రా తెలిపారు. గతేడాది ఈ సంస్థ 10 మంది సీనియర్ సిటిజన్స్ బృందంతో 10 రోజుల అంటార్కిటికా ట్రిప్ నిర్వహించింది. జపాన్ చెర్రీ బ్లోసమ్స్, ఫిన్లాండ్ వింటర్ ల్యాండ్స్కేప్స్, నార్వే నార్తర్న్ లైట్స్, ఐస్లాండ్స్ క్రూజ్ యాత్రలు, యూరప్ రివర్ సెయిలింగ్స్ వంటి ప్రత్యేక టూర్లనూ ఈ సంస్థ అందిస్తోంది. ఆర్థికంగా స్థిరపడటం ప్లస్ఖర్చులన్నీ పోను అదనంగా వెచ్చించగలిగే ఆదాయం దండిగా ఉండటం, కుటుంబ బాధ్యతలన్నీ తీరిపోవడంతో ప్రపంచాన్ని చుట్టిరావాలన్న తమ కోరికలను తీర్చుకోవడానికి సీనియర్ సిటిజన్స్ ప్రాధాన్యమిస్తున్నారని పిట్టీ చెప్పారు. ‘రిటైర్మెంట్ తర్వాత తగినంత సమయం దొరకడంతో కొత్త ప్రదేశాలను చుట్టొచ్చేందుకు వీలవుతోంది. 51 శాతం మంది బేబీ బూమర్స్, 39 శాతం మంది సైలెంట్ జెనరేషన్ (80 ఏళ్ల పైబడిన వారు) జీవితకాలంలో ఒక్కసారైనా చూడాల్సిన టూర్లకు మొగ్గు చూపుతున్నారు’ అని వివరించారు. కాగా, విమానాలు, రైలు చార్జీల్లో డిస్కౌంట్లు.. ఎయిర్పోర్టుల్లో ర్యాంపులు, ఎలివేటర్ సదుపాయాలు ఉండటం వల్ల వారు పర్యటనలకు ముందుకొస్తున్నారని భారతీయ టూరిజం, హాస్పిటాలిటీ అసోసియేషన్ల ఫెడరేషన్ (ఎఫ్ఏఐటీహెచ్) బోర్డు సభ్యుడు, టూర్వాలా ఎండీ వేద్ ఖన్నా అభిప్రాయపడ్డారు. నిపుణులైన టూర్ గైడ్లు, జర్నీలో వైద్యుల తోడ్పాటు వంటి సదుపాయాలతో ప్రత్యేకంగా ప్యాకేజీలను తీర్చిదిద్దుతుండటం వల్ల కూడా డిమాండ్ పెరిగిందన్నారు.అవీ ఇవీసీనియర్స్ మక్కువ చూపుతున్న ప్రఖ్యాత ప్రపంచ నగరాలు: టోక్యో, సియోల్, సింగపూర్, లండన్ ప్రఖ్యాత పుణ్య క్షేత్రాలు: వారణాసి, అయోధ్య, హరిద్వార్, రిషికేష్, రామేశ్వరం, పూరి, తిరుపతిసీనియర్ సిటిజన్స్ ట్రావెల్ బుకింగ్స్లో వృద్ధి: 20%2023లో ప్రపంచవ్యాప్తంగా సీనియర్ సిటిజన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ మార్కెట్ విలువ: 3.2 బిలియన్ డాలర్లు (రూ.27వేల కోట్లు) (2032 నాటికి ఇది 16.7 బిలియన్ డాలర్లకు చేరుతుందనేది అలైట్ మార్కెట్ రీసెర్చ్ అంచనా) -
తల్లికి రక్తహీనత.. పుట్టే బిడ్డకు రిస్క్
మహిళలను పట్టి పీడించే సమస్యల్లో ప్రధానమైనది రక్తహీనత. ఇది గర్భధారణ సమయంలో తలెత్తితే తల్లి, బిడ్డ ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. రాష్ట్రం, దేశంలో నమోదవుతున్న మాతా, శిశు మరణాలకు ప్రధాన కారణం ఇదేనని వైద్యులు చెబుతున్నారు. దీని కారణంగా పుట్టబోయే బిడ్డకు కూడా ప్రమాదం ఉంటుందని యూకేలోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. గర్భం దాల్చిన మొదటి 100 రోజుల్లో మహిళ రక్తహీనతతో బాధపడితే.. పుట్టబోయే బిడ్డ గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. - సాక్షి, అమరావతి 16,500 మందిపై అధ్యయనం అధ్యయనంలో భాగంగా 1998 నుంచి 2020 మధ్య గర్భం దాల్చిన 16,500 మంది మహిళల ఆరోగ్య రికార్డులను పరిశోధకులు విశ్లేషించారు. రక్తహీనత సమస్య ఉన్న 2,700 మందికిపైగా మహిళల సంతానంలో పుట్టుకతో గుండె జబ్బులు ఉన్నట్లు కనుగొన్నారు. రక్తహీనత సమస్య లేని మహిళలు జన్మనిచ్చిన బిడ్డల్లో జబ్బులు లేవు. గర్భం దాల్చిన మొదటి వంద రోజుల్లో మహిళలకు రక్తహీనత ఉందో లేదో కూడా నిర్ధారించారు. గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో ఐరన్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల సంతానంలో హృదయ సంబంధ సమస్యలను నివారించవచ్చని పరిశోధకులు గుర్తించారు.జాగ్రత్తలు అవసరం రక్తహీనత సమస్య గర్భిణితో పాటు పుట్టబోయే బిడ్డ ఎదుగుదల, ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, ముందస్తు ప్రసవం, పిండానికి సరైన పోషకాలు అందకపోవడం వంటి ఇబ్బందులు ఉంటాయి. గర్భధారణ ప్రారంభ సమయంలో పిండం గుండె, ఇతర అవయవాల అభివృద్ధి జరుగుతుంది. ఇలాంటి సమయంలో రక్తహీనత తలెత్తితే బిడ్డ అవయవాల అభివృద్ధిపై ప్రభావం పడుతుంది.అలాగే చివరి దశలో తీవ్రమైన రక్తహీనత ఉన్నట్లయితే అకాల ప్రసవం, తక్కువ బరువుతో శిశువు పుట్టడం చోటు చేసుకుంటుంది. ఈ క్రమంలో గర్భధారణకు ప్రణాళికలున్న మహిళలు తొలుత వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. రక్తహీనత సమస్య నివారణకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. – డాక్టర్ శ్రీనాథ రెడ్డి, డైరెక్టర్, శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాలయం, తిరుపతి -
అనుభవాలే పాఠాలుగా...
జీవితంలో పైకి రావాలనుకున్న వారెవరికైనా ముందుగా తాము చేస్తున్న పని పట్ల, తమ లక్ష్యం పట్ల చిత్తశుద్ధి ఉండాలి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తమపట్ల తమకు నమ్మకం ఉండాలి. నేను చేయగలను అన్న నమ్మకం మీలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. కొత్త ఆశలను చిగురింప చేస్తుంది. కావల్సినంత బలాన్నిస్తుంది. అందువల్ల జీవితంలో ఎవ్వరిని నమ్మినా నమ్మకపోయినా మనలో ఉన్న మన ఆత్మవిశ్వాసమే మనల్ని విజయ తీరాల వైపు తీసుకువెళుతుందన్న విషయాన్ని గుర్తించాలి.తమ లక్ష్యాలను సాధించి జీవితంలో విజయ బావుటా ఎగురవేసిన వారిని మనం నిత్యజీవితంలో అనేక మందిని చూస్తుంటాం. వింటూ ఉంటాం. అయితే వారివారి విజయ గాధలలో ఆయా వ్యక్తుల సాఫల్యాన్ని మాత్రమే మనం పరిగణనలోకి తీసుకుంటాం కానీ ఆ విజయం వెనుక సదరు వ్యక్తులు పడిన తపన, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, అవరోధాల గురించి మనం పట్టించుకోం. నిజానికి ప్రతి విజయ గాధ వెనుక ఎన్నో అపజయాలు, మరెన్నో అవరోధాలు ఉంటాయని తెలుసుకోలేం. నేడు సమాజంలో ఉన్నత స్థితికి వచ్చిన ఏ వ్యక్తినైనా తీసుకోండి. వారి విజయం వెనుక వారెన్ని కష్టాలు, ఇబ్బందులు పడ్డారో తేటతెల్లమవుతుంది. ఎన్నో అపజయాలు, ఓటములు అనుభవించిన తరువాత గానీ, ఆయా వ్యక్తులకు విజయం సిద్ధించలేదన్న విషయం బోధపడుతుంది. జీవితంలో ఎవ్వరైనా తాము అనుభవిస్తున్న, అనుభవించిన అవమానాలు, అపజయాలు, ఓటముల ద్వారానే పాఠాలు నేర్చుకోవాలి. ఆయా పాఠాలు నేర్పిన గుణపాఠాలను ఆత్మవిశ్వాసం ద్వారా అధిగమించాలి. తమమీద తాము విశ్వాసాన్ని పెంచుకుని అపజయాన్ని విజయానికి సోపానంగా మార్చుకున్న వారే జీవితంలో ఎలాంటి విజయాన్నైనా సాధించగలరు. అందువల్ల ఆత్మవిశ్వాసమే ఆశావహుల ఆభరణమని తెలుసుకోవాలి. మనం చిన్నపుడు తాబేలు, కుందేలు కథ విని ఉంటాం. నిదానంగా, నెమ్మదిగా పరుగెత్తే తాబేలు, అత్యంత వేగంగా పరుగెత్తే కుందేలుతో పరుగెత్తి విజయం సాధించిందని ఆ కథ సారాంశం. మరి ఈ కథలో తాబేలుకు విజయం వరించడానికి ప్రధానమైన కారణమే ఆత్మవిశ్వాసం. ఎంత ఆత్మవిశ్వాసం ఉంటే వేగంగా కదలలేని తాబేలు, వేగంగా పరుగెత్తే కుందేలు తో పందెం కడుతుంది. ఎంత ఆత్మవిశ్వాసముంటే తాబేలు కుందేలుతో పోటీపడి గెలుస్తుంది. ఎంత అతి విశ్వాసముంటే, పోటీలో గెలిచే సామర్ధ్యమున్నా, కుందేలు విజయానికి దూరంగా ఉందన్న విషయం అవగతమవుతోంది. ఈ కథ ద్వారా జీవితంలో పైకి రావాలనుకున్న ప్రతి ఒక్కరికీ ఆత్మవిశ్వాసం ఎంత అవసరమో తెలుస్తుంది. అలాగే, మన లక్ష్యాలను గమ్యాలను దూరం చేసే అతి విశ్వాసం పనికిరాదని తేటతెల్లమవుతుంది.ఆత్మవిశ్వాసంతో ఎలాంటి విజయాలనైనా సాధించవచ్చని అమెరికా మాజీ అధ్యక్షుదు అబ్రహాం లింకన్ జీవిత గాథ మనకు అవగతం చేస్తుంది. విజయం సాధించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించి విజేతగా నిలిచిన గొప్ప వ్యాపారవేత్త కల్నల్ సాండర్స్. కనుక జీవితంలో విజేతగా నిలవాలనుకున్న ప్రతిఒక్కరూ కష్టాలకు నెరవకుండా, అనుభవాలను పాఠాలుగా నేర్చుకుంటూ ముందుకి వెళితే విజయం తప్పక వరిస్తుందన్న వాస్తవాన్ని తెలుసుకుని మసలుకోవాలి. – దాసరి దుర్గా ప్రసాద్ -
కాలుష్యకాసారంగా కృష్ణా నది
మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వర్కు సమీపంలో జన్మించి, ఒంపు సొంపులతో బిరబిరా సాగుతూ కృష్ణా జిల్లా హంసలదీవి వరకు పరుగులిడే కృష్ణా నది తెలుగు రాష్ట్రాలకు జీవనాధారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సాగు, తాగునీటి కోసం అధికంగా ఆధారపడేది కృష్ణా జలాలపైనే. నిత్యం నీరు పారే ఈ జీవ నది మానవ తప్పిదాల కారణంగా ఇప్పడు కాలుష్యకాసారంగా మారింది. ఒకప్పుడు నేరుగా తాగేంత స్వచ్ఛంగా ఉన్న కృష్ణా నది నీరు ఇప్పుడు శుద్ధి చేయనిదే తాగకూడని దశకు చేరాయి. ఈ నది జలాల్లో క్షార స్వభావం, బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ), ప్రమాదకర బ్యాక్టీరియా (ఫీకల్ కోలిఫారమ్), ఘన వ్యర్థాలు అధికంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (ఏపీపీసీబీ) గత నెల (మార్చి)లో నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. కృష్ణా నీటిని శుద్ధి చేయకుండా తాగడం శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. శుద్ధి చేయకుండా తాగితే డయేరియా, చర్మ వ్యాధుల, ఇతర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ నది పరీవాహక ప్రాంతంలో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మురుగునీటిని యథేచ్ఛగా వదిలేయడం, పారిశ్రామిక వ్యర్థాలను విడిచిపెట్టడం, అనేక ప్రాంతాల్లో నదినే డంపింగ్ యార్డ్గా మార్చేయడం వల్ల జలాలు కలుషితమవుతున్నాయి. అడవులను నరికివేయడం, గనులను ఇష్టారాజ్యంగా తవ్వడం వల్ల కూడా నది కలుషితమవుతోంది. పర్యవసానంగా కృష్ణా జలాలు నేరుగా తాగడానికి పనికి రాకుండా పోతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, అమరావతి ప్రమాదకర బ్యాక్టీరియా కృష్ణా జలాల నాణ్యతపై ఏపీపీసీబీ ప్రతి నెలా పరీక్షలు చేస్తోంది. ఫిబ్రవరిలో నిర్వహించిన పరీక్షల్లో కృష్ణా జలాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. పీహెచ్ 7 శాతం లోపు ఉంటే ఆమ్ల స్వభావం.. 7 శాతం కంటే ఎక్కువ ఉంటే క్షార స్వభావం ఉన్నట్లు లెక్క. పీహెచ్ 7 ఉంటే స్వచ్ఛమైన నీరుగా లెక్క. కానీ.. కృష్ణా జలాల్లో పీహెచ్ 7 శాతం కంటే ఎక్కువగా ఉంది. అంటే జలాల్లో క్షార స్వభావం ఎక్కువ ఉన్నట్లు స్పష్టమవుతోంది. నీటిలో కరిగిన ఆక్సిజన్ (డీవో), బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) కూడా మోతాదుకు మించి ఉన్నట్లు వెల్లడైంది. తాగే నీటిలో అత్యంత ప్రమాదకరమైన ఫీకల్ కోలీఫామ్ బ్యాక్టీరియా వంద మిల్లీ లీటర్లకు ఒక్కటి కూడా ఉండకూడదు. కానీ.. కృష్ణా జలాల్లో వంద మిల్లీ లీటర్లకు 11 నుంచి 58 వరకూ ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది.నీటిలో ఘనవ్యర్థాలు వంద మీల్లీ లీటర్లకు 500 మిల్లీ గ్రాముల వరకూ ఉండవచ్చు. కానీ.. కృష్ణా నీటిలో ఘన వ్యర్థాలు అంతకంటే ఎక్కువ ఉన్నట్లు వెల్లడైంది. మురుగు నీటిని, పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధి చేయడం, వ్యర్థాలకు అడ్డుకట్ట వేయడం ద్వారా కృష్ణా నదిని స్వచ్ఛంగా మార్చవచ్చునని నిపుణులు చెబుతున్నారు. బీఐఎస్ ప్రమాణాల మేరకు తాగు నీటికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాలు1. పీహెచ్ 6.5 నుంచి 8.5 శాతం లోపు ఉండొచ్చు 2. డీవో (డిజాల్్వడ్ ఆక్సిజన్) లీటర్ నీటికి 6 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉండాలి 3. బీవోడీ (బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్) లీటర్ నీటికి 2 మిల్లీగ్రాముల లోపు ఉండొచ్చు 4. టోటల్ కోలీఫామ్ (టీసీ– బ్యాక్టీరియా) 100 మిల్లీలీటర్ల నీటికి 50 లోపు ఉండొచ్చు 5. ఫీకల్ కోలీఫామ్ (ఎఫ్సీ– ప్రమాదకర బ్యాక్టీరియా) 100 మిల్లీలీటర్లకు నీటికి ఒక్కటి కూడా ఉండకూదు 6. టీడీఎస్ (టోటల్ డిజాల్్వడ్ సాలిడ్స్) లీటర్ నీటికి 500 మిల్లీగ్రాముల లోపు ఉండొచ్చు -
కిన్నెరసాని.. చూసొద్దాం రండి..
పాల్వంచ రూరల్: వేసవి సెలవులు వచ్చాయి. చిన్నారులు, పెద్దలు, మహిళలు వెళ్లేందుకు కిన్నెరసాని ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చదనాన్ని పంచే అడవులు, స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించే చెట్లు.. చెంగుచెంగున ఎగిరే వన్యప్రాణులు, గలగలా పారే సెలయేర్లు.. పక్షుల కిలకిలారావాలకు కిన్నెరసాని డీర్పార్కు చిరునామాగా నిలుస్తోంది. అడుగడుగునా ఆహ్లాదాన్ని పంచే జీవ వైవిధ్యం గల అటవీ అందాలతో మినీ ఊటీగా మారుతోంది కిన్నెరసాని పర్యాటక ప్రాంతం. కొండకోనలు, పచ్చని చెట్లు, జలాశయం, వన్యప్రాణులతో చూడచక్కని ప్రకృతి అందాలకు నిలయమైన కిన్నెరసానిలో పర్యాటకులను ఆకట్టుకునేలా పచ్చని పొదరిళ్లు, ఎత్తయిన కొండలు, గుట్టలు, జలాశయం, చూడచక్కని ద్వీపాలు కనిపిస్తాయి. పర్యాటకుల ఊహకు ఏమాత్రం తగ్గని రీతిలో ఇక్కడి ప్రకృతి సోయగాలు ప్రతీ ఒక్కరిని అలరిస్తాయి. ఈ సుందర దృశ్యాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా వేసవి సెలవుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు.పర్యాటకులను ఆకర్షించేలా కాటేజీలు..భద్రాద్రి కొత్తగూడెం జిలê్ల పాల్వంచ మండలంలోని కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో నీతి ఆయోగ్ పథకం కింద రూ.3.24 కోట్లు, ఎకో టూరిజం అభివృద్ధి కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.7.53 కోట్లు మంజూరు చేశాయి. ఆయా నిధులతో కిన్నెరసానిలో తొమ్మిది కాటేజీలు, అద్దాలమేడ నిర్మాణం చేపడుతున్నారు. కిన్నెరసాని రిజర్వాయర్లో పర్యాటకుల కోసం బోటు షికారు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు డీర్పార్క్లోని చుక్కల జింకలు, జలాశయం అందాలను చూసి.. మరోసారి రావడానికి ఉత్సాహం చూపుతుంటారు.అద్దాలమేడకు ఎంతో ప్రాముఖ్యంకిన్నెరసాని పర్యాటక ప్రాంతంలో ఒకప్పుడు అద్దాలమేడకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. 1978లో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో అద్దాలమేడతో పాటు పలు కాటేజీలు నిర్మించారు. అయితే ఆ తర్వాత అద్దాలమేడను మావోయిస్టులు ధ్వంసం చేయడంతో కళావిహీనంగా తయారైంది. కాగా, కిన్నెరసానిని పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో భాగంగా అద్దాలమేడ పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన రూ,10.77 కోట్లు ఖర్చు చేశారు. శిథిలావస్థకు చేరిన అద్దాలమేడతో పాటు కాటేజీలను కూల్చి వాటి స్థానంలో కొత్తవి నిర్మించారు. రిజర్వాయర్ చుట్టూ ఎత్తయిన గుట్టపై రెండంతస్తుల్లో 9 కాటేజీలు, అద్దాల మేడ, ఫుడ్ కోర్టు నిర్మించారు. కిన్నెరసానికి ఎలా చేరుకోవాలంటే..ఖమ్మం నుంచి భద్రాద్రి జిల్లా పాల్వంచకు 90 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పట్టణానికి చేరుకున్నాక అంబేడ్కర్ సెంటర్ నుంచి 12 కిలోమీటర్లు ప్రయాణిస్తే కిన్నెరసాని ప్రాజెక్టు వస్తుంది. అక్కడ ప్రకృతి అందాలతో నిండిన జలాశయం, జింకల పార్కు ఉంటాయి. కిన్నెరసానికి సమీపంలోని మందెరకలపాడు సమీప అటవీ ప్రాంతంలో జలపాతం ఉంది. ఇక్కడ నుంచి తిరిగి భద్రాచలం వెళ్లే మార్గంలో పెద్దమ్మతల్లి ఆలయం ఉంది. కాగా, కిన్నెరసాని చేరడానికి బస్ సౌకర్యం లేక ఆటోలను ఆశ్రయించాల్సిందే. వేసవి సెలవుల్లోనైనా బస్సు సౌకర్యం కల్పిస్తే కిన్నెరసానికి పర్యాటకుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఇక వరంగల్ జిల్లా లక్నవరంలో ఏర్పాటు చేసినట్లుగా కిన్నెరసానిలో కూడా నీళ్ల మధ్య వంతెన నిర్మించి, ప్రత్యేక హోటళ్లు, వసతి గృహాలను నిర్మిస్తే పర్యాటకులను మరింతగా ఆకట్టుకోవచ్చు. -
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
‘నేను పాకిస్తాన్ కుమార్తెను, కానీ ఇప్పుడు నేను భారతదేశ కోడలిని. నాకు పాకిస్తాన్కు వెళ్లడం ఇష్టం లేదు. నన్ను ఇక్కడే ఉండనివ్వండి. నన్ను భారతదేశంలో ఉండడానికి అనుమతివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగిలకు విజ్ఞప్తి చేస్తున్నాను’ఇది పాకిస్తాన్ పౌరురాలైన... ప్రస్తుతం యూపీలో ఉంటున్న సీమా హైదర్ చేసిన విజ్ఞప్తి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరుల వీసాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. తనను కూడా పంపించేస్తారేమోనన్న ఆందోళనతో సీమ చేసిన వీడియో విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎవరీ సీమా హైదర్. పాకిస్తాన్ పౌరురాలు యూపీ కోడలు ఎలా అయ్యింది? సీమా హైదర్... పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్కు చెందిన మహిళ. 2019లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండగా ఆమెకు యూపీకి చెందిన సచిన్ మీనాతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే.. అప్పటికే సీమాకు పెళ్లయ్యింది. భర్త గులాం హైదర్తో ఆమెకు నలుగురు పిల్లలు కూడా. అయితే సచిన్ మీద ప్రేమతో.. నలుగురు పిల్లలను తీసుకుని ఆమె భారత్కు వచ్చేసింది. నేపాల్ మీదుగా సరిహద్దు నుంచి అక్రమంగా భారత్లోకి ప్రవేశించింది. యూపీలోని సచిన్ను పెళ్లి చేసుకుంది. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని రబుపుర ప్రాంతంలో నివసిస్తోంది. వీరి విషయం 2023 జూలైలో బయటకు వచ్చింది. అక్రమంగా ప్రవేశించినందుకు సీమాను, ఆశ్రయం కల్పించినందుకు సచిన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత ఇద్దరూ బెయిల్పై విడుదలయ్యారు. ఆమె కేసును ఏటీఎస్ విచారిస్తోంది. పహల్గాం ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విష యం తెలిసిందే. నిబంధనల ప్రకారం సీమా సైతం భారత్ను వీడి వెళ్లాలి. కాని తాను పాక్కు వెళ్లనని, ఇక్కడే ఉంటానని, అందుకు తనకు అనుమతి ఇవ్వాలని సీమా విజ్ఞప్తి చేస్తోంది. తానిప్పుడు సీమా హైదర్ను కాదని, సీమా మీనానని, సచిన్ను పెళ్లి చేసుకున్నా తరువాత హిందూ మతాన్ని స్వీకరించానని చెబుతోంది. అయితే ఆమె భారత్లో నివసించడానికి అర్హురాలని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ సైతం వాదిస్తున్నారు. సచిన్ మీనాతో పెళ్లి తరువాత ఆ దంపతులకు కూతురు పుట్టింది. ఆ చిన్నారి ఇప్పుడు భారతీయురాలు. అంతర్జాతీయ న్యాయస్థానం, సంరక్షణ చట్టాల ప్రకారం చిన్నారి సంరక్షణ బాధ్యత తల్లిది. తల్లి సీమా మీనా భారత్ను వీడితే.. చిన్నారిని కూడా వెంట తీసుకెళ్లాల్సి వస్తుంది. భారతీయ పౌరురాలిని పాక్కు ఎలా పంపిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ పౌరులందరూ దేశం విడిచి వెళ్లాలనే ఆదేశం నుంచి ఆమెకు మినహాయింపు ఉంటుందని ఆయన భావిస్తున్నారు. సీమ కేసు భిన్నమైనదని, ఈ విషయమై రాష్ట్రపతి దగ్గర పిటిషన్ కూడా ఉందని ఆయన వాదిస్తున్నారు. అంతేకాదు.. బెయిల్పై ఉన్న సీమను అత్తమామల ఇల్లు తప్ప రబుపురా దాటరాదని జెవార్ కోర్టు ఆదేశాలు కూడా ఉన్నందున.. వీసా రద్దు ఉత్తర్వులు ఆమెకు వర్తించవని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Indus Waters Treaty: సస్పెన్షన్ సాధ్యమే
పూర్తిస్థాయి యుద్ధాలు. కార్గిల్ వంటి దురాక్రమణలు. మరెన్నో లెక్కలేనన్ని దుశ్చర్యలు. గత 75 ఏళ్లలో భారత్పై పాకిస్తాన్ మతిలేని ఉన్మాద చర్యలు అన్నీ ఇన్నీ కావు. అయినా సామాన్య పాకిస్తానీలను దృష్టిలో పెట్టుకుని సింధూ జల ఒప్పందాన్ని భారత్ ఎప్పుడూ గౌరవిస్తూనే వచ్చింది. ఆర్థికంగానే గాక అన్నివిధాలా పతనావస్థకు చేరినా దాయాదికి ఇక బుద్ధి రాబోదని పహల్గాం దాడితో తేలిపోయింది. దాంతో ఓపిక నశించి పాక్కు శాశ్వతంగా బుద్ధి చెప్పే చర్యల్లో భాగంగా సింధూ ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేసింది. ఏకపక్షంగా అలా చేసే అధికారం భారత్కు లేదంటూ పాక్ గగ్గోలు పెడుతోంది. ఇది తమపై యుద్ధ ప్రకటనేనంటూ ఆక్రోశిస్తోంది. అయితే అంతర్జాతీయ చట్టాల మేరకు భారత్ చర్య సబబేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానుకోని పక్షంలో సింధూ ఒప్పందానికి నూకలు చెల్లుతాయంటూ పాక్ను భారత్ ఎన్నోసార్లు హెచ్చరించింది. సస్పెన్షన్కు సంబంధించి ఒప్పందంలో స్పష్టమైన నిబంధనలేవీ లేవు. పైగా అందులోని ఆర్టికల్ 12 ప్రకారం ఒప్పందానికి సవరణలు, ఇరుదేశాల ఆమోదంతో పూర్తిగా రద్దు మాత్రమే సాధ్యం. అలాంటప్పుడు సస్పెన్షన్ నిర్ణయాన్ని ఏ ప్రాతిపదికన తీసుకున్నారన్నది ప్రాధాన్యం సంతరించుకుంది. 1969 వియన్నా కన్వెన్షన్, ఇతర అంతర్జాతీయ న్యాయ ఒప్పందాల ప్రకారం అలా చేసేందుకు వీలుందని సీనియర్ అడ్వకేట్ నీరజ్ కిషన్ కౌల్ స్పష్టం చేశారు. ‘పరిస్థితుల్లో మౌలిక మార్పులు’చోటుచేసుకున్న సందర్భాల్లో వియన్నా కన్వెన్షన్లోని ఆర్టికల్ 62 ప్రకారం ఒప్పందాన్ని పూర్తిగా తిరస్కరించడం కూడా సాధ్యమేనని మాజీ సింధూ జల కమిషనర్ పి.కె.సక్సేనా వివరించారు. ఈ విషయంలో ఇంకా మరెన్నో చర్యలు తీసుకునే అవకాశం కూడా భారత్కు ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆర్టికల్ 62 ఏమంటోంది...? ఒప్పందం కుదుర్చుకున్న నాటితో పోలిస్తే అనంతర కాలంలో పరిస్థితుల్లో తలెత్తే మౌలిక మార్పులకు సంబంధించిన నియమ నిబంధనలను వియన్నా కన్వెన్షన్లోని ఆర్టికల్ 62లో పేర్కొంటుంది. అవి ఒప్పంద సమయంలో ఊహించనివై, ఆ మార్పుల ప్రభావం వల్ల ఒప్పంద బాధ్యతలను నెరవేర్చలేని పరిస్థితులు తలెత్తితే ఒప్పందాన్ని సస్పెండ్ చేయవచ్చని అది చెబుతోంది. కనుక ఈ విషయంలో పాక్ చేసేదేమీ ఉండబోదని కౌల్ అన్నారు. ‘‘చివరికి అంతర్జాతీయ న్యాయస్థానం తలుపు తట్టినా లాభముండదు. నిరంతర ఉగ్ర దాడులు, ఫలితంగా భౌతిక, ఆర్థిక భద్రతకు, దేశ సార్వభౌమత్వానికి తలెత్తుతున్న ముప్పు ఒప్పంద పరిస్థితుల్లో మౌలిక మార్పులకు దారి తీసిందని భారత్ వాదించవచ్చు. సింధూ ఒప్పందం కుదిరిందే ఇరు దేశాల నడుమ స్నేహం, సద్భావనల స్ఫూర్తికి కార్యరూపమిచ్చేందుకు! పాక్ చర్యల నేపథ్యంలో ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’’అని వివరించారు. పర్యావరణ సవాళ్లు, ఉగ్ర దాడుల నేపథ్యంలో ఒప్పందాన్ని సమీక్షించి మార్చుకోవాల్సిన అవసరముందని కొన్నేళ్లుగా భారత్ చెబుతోందని గుర్తు చేశారు. ఇవన్నీ చేయొచ్చు... → ఒప్పందం సస్పెన్షన్ వల్ల సింధూ బేసిన్ నదుల నీటి ప్రవాహ నెలవారీ డేటాను భారత్ ఇకపై పాక్తో పంచుకోవాల్సిన అవసరం లేదు. → నీటి ప్రవాహాల ఉమ్మడి తనిఖీకి పాక్ అధికారులకు భారత్లోకి ప్రవేశం నిరాకరించవచ్చు. → నీటి ప్రవాహాలను నియంత్రించడం వంటి కఠిన చర్యలకు కూడా తీసుకోవచ్చు. → సింధూతో పాటు జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లె జ్ నదుల ప్రవాహాలను కాల్వల వంటివాటిలోకి మళ్లించవచ్చు. వాటిపై డ్యాముల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా మరింత నీటిని నిల్వ చేయవచ్చు. ఇలాంటి చర్యలతో పాక్లోకి వాటి ప్రవాహాన్ని నిరోధించవచ్చు. → సింధూ బేసిన్కు సంబంధించి భారత్, పాక్ నడుమ పలు అంతర్జాతీయ వేదికలపై న్యాయపోరాటం సాగుతోంది. జీలం ఉపనది కిషన్గంగపై నిర్మిస్తున్న జల విద్యుత్కేంద్రం వంటివి వీటిలో ఉన్నాయి. ఆ వివాదాలన్నింటి నుంచీ ఇప్పుడు భారత్ ఏకపక్షంగా వైదొలగవచ్చు కూడా. → వేసవి దృష్ట్యా సింధూ బేసిన్లోని నదీ ప్రవాహాలను భారత్ ఇప్పుడు ఏమాత్రం నియంత్రించినా తాగు, సాగునీరుతో పాటు జల విద్యుత్ తదితరాల కోసం పాక్ అల్లాడటం ఖాయమే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రమణీయం..చారిత్రక దృశ్యకావ్యం
విజయపురిసౌత్: విద్యార్థులకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు అతి సమీపంలో ఉన్న నాగార్జున సాగర్ను కుటుంబ సమేతంగా వేసవి సెలవుల్లో చూడాల్సిందే. సాగర్ పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తుంది. చారిత్రాత్మకమైన ప్రాంతమే కాకుండా సాంకేతిక పరంగా సాగర్ ప్రాజెక్టు సందర్శన ఎంతో విజ్ఞానదాయకంగా నిలుస్తోంది. కృష్ణా జలాశయంలో లాంచీ ప్రయాణం ఆహ్లాదకరం. లాంచీలో ప్రయాణించి జలాశయం మధ్యన ఎనలేని ప్రశస్తి ఉన్న నాగార్జునకొండ మ్యూజియం సందర్శించాల్సిందే. ప్రపంచంలోనే మానవ నిర్మిత ఐలాండ్ మ్యూజియంలలో నాగార్జునకొండ రెండవది. ఆచార్య నాగార్జునుని విశ్వవిద్యాలయం ఇక్కడ ఉంది. బుద్ధదంత ధామమయమైన మహాస్థూపం, విశాలమైన వివిధ భిక్షువిహారాలు ఉన్నాయి. వీటన్నింటితో ఇక్షా్వకుల రాజధానిగా విలసిల్లిన విజయపురి ప్రాంతం సాగర్లో ముంపునకు గురి కాకుండా కేంద్ర పురావస్తు శాఖ వారు అక్కడ విశేష సామగ్రిని పరిరక్షించి, నేడు నాగార్జున కొండలో ప్రదర్శిస్తున్నారు. హారతీ దేవాలయం విశ్వవిద్యాలయానికి కొద్దిదూరంలో హారతీ దేవాలయం దాని దిగువన చతురస్త్రాకారంలో ఒకపెద్ద సరస్సు ఉంది. దీనికి నలువైపుల మెట్లతో ఒడ్డు ప్రాంతాలున్నాయి. హారతీ దేవాలయంలో ప్రవేశానికి ముందు ఈ సరస్సులో స్నానమాచరించేవారు. నాగార్జున కొండకు ఇలా చేరుకోవాలి.. నాగార్జునకొండకు వెళ్లాలంటే విజయపురిసౌత్లోని లాంచీస్టేషన్ నుంచి 14కి.మీ. దూరం కృష్ణానదిలో ప్రయాణం చేయాలి. కొండకు చేరుకునేందుకు లాంచీలో 45 నిమిషాల సమయం పడుతుంది. నాగార్జునకొండ ప్రపంచంలోనే రెండవ ఐలాండ్ మ్యూజియం. నాగార్జున సాగర్ పరిధిలోని విజయపురిసౌత్లో లాంచీస్టేషన్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు లాంచీలు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. పెద్దలకు లాంచీ టిక్కెట్టు ధర రూ.200, మ్యూజియం, మాన్యుమెంట్ సందర్శనకు రూ.30, 6 నుంచి 12 సంవత్సరాల చిన్నారులకు లాంచీకు రూ.150, మ్యూజియం సందర్శనకు 14 సంవత్సరాలలోపు చిన్నారులకు ఉచితం. గ్రూపుగా వచ్చే విద్యార్థులకు లాంచీటిక్కెట్పై 20 శాతం రాయితీని పర్యాటకశాఖ ఇస్తుంది. ఇతర వివరాలకు లాంచీస్టేషన్ ఫోన్ 9705188311 నెంబర్ను సంప్రదించవచ్చు. మహా చైత్యం ఇది బుద్ధ దాతువుపై కట్టిన అందాల చైత్యం. ఈసూ్థపం నుంచి తవ్వి తీసిన ధాతువును ప్రస్తుతం బుద్ధుడు మొదటి ప్రసంగం చేసిన సారనాథ్లో ఉంచి, పూజిస్తున్నారు. ఇది శారీరక స్థూపాల జాతికి చెందినది. దీని అంతర్భాగంలో బుద్ధభగవానుని అస్థికలు అమర్చబడ్డాయి. ఇది ప్రాచీన శిల్ప నిర్మాణ ప్రావీణ్యానికి నిదర్శనం. చక్రము దాని ఆకులను ఇటుక గోడల్లా నిర్మంచి ఆకుల మధ్య ఖాళీ స్థలాన్ని మట్టితో కప్పి స్థూపాకారాన్ని తయారు చేసి ఉపరితలాన్ని చుట్టుపక్కల పాలరాతి పలుకలతో కప్పి అర్థగోళాకారంగా అందంగా నిర్మించారు.ప్రాచీన విశ్వవిద్యాలయంఈ విశ్వవిద్యాలయం శిథిల అవశేషాలు నాగార్జునకొండ లోయలో ఏవిధంగా ఉండేవో అదే విధంగా ఆ ఇటుకలతోనే అనుపు వద్ద అమర్చారు. కృష్ణానది తీరాన విశాలమైన విస్తీర్ణంలో ఈ విశ్వవిద్యాలయం నెలకొని ఉండేది. ఇది ప్రాచీన కాలపు గురుకులమై గురుశిష్య నివాసాలు ఒకేదగ్గరుండి సకల శాస్త్ర విజ్ఞాన కేంద్రమై, ప్రపంచఖ్యాతి గాంచింది. ఎత్తిపోతల సోయగంసాగర్కు 15 కి.మీ. దూరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో చంద్రవంక నదిపై సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతం. ఇది 70 అడుగుల పైనుంచి జాలువారే జలపాతం. పర్యాటకుల మనస్సును ఇట్టే ఆకర్షిస్తుంది. పూర్వకాలంలో యతులు తపస్సు చేసుకునే ప్రాంతం కావటంతో ఎత్తిపోతల అనే పేరు వచ్చింది. పెద్దలకు రూ.30 పిల్లలకు రూ.20 ప్రవేశ రుసుము వసూలు చేస్తారు. సాగర్నుంచి ముగ్గురు నలుగురు కలిసి ఆటో మాట్లాడుకోని వెళ్లాలి. -
జలదిగ్బంధం!
దశాబ్దాల నాటి సింధూ నదీజల ఒప్పందాన్ని పక్కన పెడుతూ భారత్ కొట్టిన దెబ్బతో ఆర్థికంగా పాకిస్తాన్ నడ్డి విరిగినట్టేనని చెబుతున్నారు. కొందరు చెబుతున్నట్టుగా దీని ప్రభావం పూర్తిస్థాయిలో కనిపించేందుకు దశాబ్దాలేమీ పట్టదని జల వనరుల నిపుణులు అంటున్నారు. పాక్పై తక్షణ ప్రభావం చూపేందుకు పలు మార్గాలున్నాయని వారు చెబుతున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. సింధూ నదిపై డ్యాముల సామర్థ్యాన్ని పెంచనున్నట్టు వెల్లడించాయి. అందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొన్నాయి. జీలం తదితర సింధూ ఉపనదుల విషయంలో కూడా ఇదే వ్యూహం అమలవుతుందని తెలిపాయి. వీటితో పాటు కొత్తగా డ్యాములు తదితరాల నిర్మాణం వంటివి కూడా శరవేగంగా జరిపే యోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చినాబ్ బేసిన్లో పలు డ్యాములు, ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. అవి పూర్తయ్యేందుకు ఐదేళ్ల దాకా పట్టవచ్చని అంచనా. తాజా పరిణామాల నేపథ్యంలో వాటన్నింటినీ శరవేగంగా పూర్తి చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పాక్కు సమాచారం తొమ్మిదేళ్ల సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం భారత్, పాక్ నడుమ 1960లో సింధూ జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పుకు పారే సట్లెజ్, బియాస్, రావి నదీ జలాలు భారత్కు; పశ్చిమానికి ప్రవహించే సింధు, జీలం, చీనాబ్ నదుల జలాలు పాక్కు చెందాయి. సింధూ జలాల్లో 20 శాతం భారత్కు, 80 శాతం పాక్కు దక్కేలా అంగీకారం కుదిరింది. ఆ ఒప్పందాన్ని పక్కన పెడుతున్నట్టు పాక్కు కేంద్రం లాంఛనంగా వర్తమానమిచ్చింది. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఈ మేరకు పాక్ జల వనరుల శాఖ కార్యదర్శికి ఇప్పటికే లేఖ రాశారు. జమ్మూ కశ్మీర్ను లక్ష్యం చేసుకుని పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతోందని అందులో ఘాటుగా దుయ్యబట్టారు. ‘‘ఏ ఒప్పందానికైనా పరస్పర విశ్వాసమే పునాది. దానికే మీరు తూట్లు పొడుస్తున్నారు. మీ దుశ్చర్యలు సింధూ ఒప్పందం కింద భారత్కు దఖలుపడ్డ హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. కనుక సింధూ ఒప్పందాన్ని గౌరవించాల్సిన అవసరం భారత్కు ఎంతమాత్రమూ లేదు’’ అని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో పాక్ అంగీకారంతో నిమిత్తం లేకుండా సింధూ, దాని ఉపనదులపై ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు వాటి జలాలను భారత్ తోచిన రీతిలో వాడుకునే వీలుంది. వాటికి సంబంధించి దాయాదికి ఎలాంటి ముందస్తు సమాచారమూ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. దీనిపై పాక్ తీవ్రంగా ఆక్రోశించడం, నీటిని ఆపే చర్యలను తమపై యుద్ధ ప్రకటనగా భావిస్తామంటూ బీరాలు పలకడం తెలిసిందే. చుక్క కూడా వదిలేది లేదు కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ అతి త్వరలో సమగ్ర వ్యూహం ప్రధాని ఆదేశాలిచ్చినట్టు వెల్లడి సింధూ ఒప్పందంపై సమీక్ష అమిత్ షా తదితరుల హాజరు న్యూఢిల్లీ: పాకిస్తాన్కు చుక్క నీటిని కూడా వదలబోమని కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ స్పష్టం చేశారు. ‘‘ఆ దిశగా సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నాం. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పలు సూచనలు చేశారు. స్పష్టమైన ఆదేశాలిచ్చారు’’ అని వెల్లడించారు. సింధూ జలాల ఒప్పందం సస్పెన్షన్ నేపథ్యంలో ఈ విషయమై చేపట్టాల్సిన తదుపరి చర్యల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. పాటిల్తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు అందులో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఆదేశాల అమలుకు చేపట్టాల్సిన చర్యలపైనే భేటీలో ప్రధానంగా చర్చించినట్టు వివరించారు. అమిత్ షా కూడా పలు సూచనలు చేసినట్టు తెలిపారు. ఈ దిశగా స్వల్ప, దీర్ఘకాలిక చర్యలు చేపడుతూ మూడంచెల వ్యూహంతో కేంద్రం ముందుకు సాగనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భూతల స్వర్గం మళ్ళీ వెలవెల!
భూతల స్వర్గంగా పేరుగాంచిన అందాల కశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడి ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న అక్కడి పర్యాటక రంగాన్ని మళ్లీ సంక్షోభంలోకి నెట్టేసింది. పహల్గాంలో ముష్కరులు 26 మంది టూరిస్టులను అత్యంత పాశవికంగా హతమార్చడం పర్యాటకుల విశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీయడమే కాకుండా దాదాపు 2.5 లక్షల మంది కశ్మీరీల జీవనోపాధి, కశ్మీర్ లోయ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రశ్నార్థకం చేసింది. మళ్లీ పర్యాటకుల్లో మునుపటి విశ్వాసం, ఉత్సాహం నెలకొనాలంటే ఎన్నేళ్లు పడుతుందోనని టూరిజం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. - సాక్షి, స్పెషల్ డెస్క్హోటళ్లన్నీ ఖాళీ..ఈ నెల 22న పహల్గాం సమీపంలో మినీ స్విట్జర్లాండ్గా పేరుగాంచిన బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాద దాడి ప్రభావంతో కశ్మీర్లో పర్యటించేందుకు సిద్ధమైన వేలాది మంది పర్యాటకుల్లో దాదాపు 90 శాతం మంది 24 గంటల వ్యవధిలోనే విమాన టికెట్లు రద్దు చేసుకున్నారు. మరోవైపు ఇప్పటికే కశ్మీర్ సందర్శనకు వచ్చిన పర్యాటకులు రాత్రికి రాత్రే హోటళ్లు, క్యాబ్ల బుకింగ్లు కూడా పెద్ద ఎత్తున రద్దు కావడం మొదలయ్యాయి.ఇప్పట్లో పర్యాటక పరిశ్రమ కోలుకొనే అవకాశమే లేదని ఓ ట్రావెల్ ఏజెంట్ వ్యాఖ్యానించారు. ‘మొన్నటివరకు పర్యాటకులతో కళకళలాడిన మా హోటల్ ఇప్పుడు వెలవెలబోతోంది. అసలైతే గదులన్నీ వచ్చే నెలకు కూడా బుక్ అయ్యాయి. కానీ రాత్రికి రాత్రే పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. టూరిస్టులంతా భయంతో గదులు ఖాళీ చేసి వెళ్లిపోయారు’ అని ఓ హోటల్ యజమాని వాపోయారు.కేంద్రం చర్యలన్నీ బూడిదపాలు..కశ్మీరీలకు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. జమ్మూకశ్మీర్ వార్షిక పర్యాటక పరిశ్రమ విలువ దాదాపు రూ. 12 వేల కోట్లు. దీని విలువ 2030 నాటికి రూ. 30 వేల కోట్లకు పెరుగుతుందని అంచనా. జమ్మూకశ్మీర్కు స్పెషల్ స్టేటస్ కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని కేంద్రం 2019లో రద్దు చేయడంతోపాటు రాష్ట్ర హోదా తొలగించి జమ్మూకశ్మీర్ను లద్దాఖ్ను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది. అలాగే ఏటా స్థానికంగా దాదాపు 50 వేల మందికి ఉపాధి కల్పించేలా, ఐదేళ్లలో రూ. 2 వేల కోట్ల వార్షిక పెట్టుబడులను ఆకర్షించేలా 2020లో ప్రత్యేక పర్యాటక పాలసీని తీసుకొచ్చింది. దీనికితోడు మౌలిక సదుపాయాల మెరుగుదల, విమాన కనెక్టివిటీ, విదేశీ పర్యాటకులకు ఆన్–అరైవల్ వీసా, 75 కొత్త పర్యాటక ప్రదేశాలు, 75 కొత్త వారసత్వ/సాంస్కృతిక ప్రదేశాలు, 75 కొత్త సూఫీ/మత ప్రదేశాల స్థాపన కోసం రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించింది. కశ్మీర్ను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో నేరుగా అనుసంధానించడానికి రైల్వే కూడా కసరత్తు ప్రారంభించింది.ప్రీమియం రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఇందులో ఉంది. కేంద్రం చర్యలతో 2020 నుంచి కశ్మీర్ లోయను సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2024 నాటికి పర్యాటకుల సంఖ్య సుమారు 2.36 కోట్లకు చేరుకుంది. కానీ ఇప్పుడు ఉగ్రవాద దాడితో అక్కడి పర్యాటక రంగం చుట్టూ సంక్షోభం ముసురుకుంది. -
బడికి టాటా.. 50 రోజుల ఆట
సాక్షి, హైదరాబాద్: పరీక్షా కాలం ముగిసింది.. చదువుల ఒత్తిడి నుంచి పిల్లలకు విరామం లభించింది.. బడులకు టాటా చెప్పి ఆటపాటలతో సేదతీరే వేళయింది. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో దాదాపు 50 రోజులపాటు సందడే సందడి నెలకొననుంది. అయితే వినోదాల పేరిట పిల్లలు ఇష్టారీతిన వ్యవహరిస్తూ దారితప్పకుండా తల్లిదండ్రులు ఇప్పుడే దృష్టి పెట్టాలని.. వారు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలని.. అవసరమైన మార్గదర్శనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకు తగ్గ ప్రణాళిక రచించాలంటున్నారు. కాసేపు టీవీలు చూడనిచ్చినా కుటుంబ సభ్యులంతా కలిసి ఆడుకొనే ఆటలపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు.ఆన్లైన్కు బానిసలు కానివ్వొద్దుపట్టణాలు, నగరాల్లో పిల్లలకు ఆటస్థలాల కొరత వల్ల చాలా మంది సెల్ఫోన్లు, ఆన్లైన్ ఆటలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల 50 రోజుల్లో వారి మానసిక ధోరణిలో మార్పులొస్తాయని ప్రముఖ మానసిక శాస్త్రవేత్త అంజలా గౌరీ తెలిపారు. ఈ విధానం వల్ల రెండేళ్లలో మెదడు మొద్దుబారి విచిత్ర ధోరణి ప్రదర్శించిన 28 మందికి కౌన్సెలింగ్ ఇచి్చనట్లు చెప్పారు. రేయింబవళ్లు సెల్ఫోన్లకు పరిమితమవడం నిద్రలేమికి దారితీస్తుందని.. ఫలితంగా వారి మానసిక ధోరణిలో మార్పులొస్తాయని హైదరాబాద్కు చెందిన మానసిక నిపుణులు అరోరీ వాగ్దేవి తెలిపారు. గతేడాది వేసవి సెలవుల్లో తన కుమారుడు అదేపనిగా ఆన్లైన్ గేమ్స్ ఆడటం వల్ల తిరిగి స్కూల్ తెరిచాక ఏడాదంతా పాఠ్యపుస్తకాలు చదవాలంటే ఒక రకమైన భయం పట్టుకుందని కూకట్పల్లికి చెందిన ఓ విద్యార్థి తల్లి పేర్కొన్నారు.బంధాల వైపు మళ్లించాలి పిల్లలకు అమ్మమ్మ, తాతయ్యల ఊళ్లలో గడిపే అవకాశం ఇవ్వడం వల్ల సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటంతోపాటు పొడుపు కథల వంటివి వారి నుంచి నేర్చుకునే అవకాశం ఉంటుందని తెలుగు భాషపై వరంగల్ స్కాలర్ వినీత్ భార్గవ్ జరిపిన పరిశోధనలో వెలుగులోకి వచి్చంది. నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మల అనుభవాల్లోంచి కథలు నేర్చుకొనే పిల్లల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తోందని.. 100 మందిలో 82 మంది తరగతి గదుల్లోనూ చురుకుగా వ్యవహరించిన తీరును గుర్తించామని ఆయన పేర్కొన్నారు.దీంతోపాటు గ్రామీణ అనుబంధాలు, బంధువులతో మమేకమైనప్పుడు కలిగే అనుభూతులు విద్యార్థుల మానసిక ధోరణిలో మార్పు తెస్తున్నాయన్నారు. అనుబంధాలు పెంచుకొనే పిల్లల మానసిక ధోరణి ఇతరులతో పోలిస్తే భిన్నంగా ఉంటోందని భారత సైకాలజీ అసోసియేషన్ జరిపిన ఓ పరిశోధన తేల్చింది. 468 మందిపై అసోసియన్ ఆన్లైన్ సర్వే చేపట్టింది. ఎవరికి ఎవరు అనే ధోరణి నుంచి బయటపడిన పిల్లల్లో 332 మంది వేసవి సెలవుల్లో పెద్దవాళ్ల దగ్గర నేర్చుకున్న జ్ఞానమేనని తేలింది.జాగ్రత్తగా వ్యాయామంఆట విడుపులో భాగంగా పిల్లలు నిత్యం క్రికెట్, కబడ్డీ లాంటి రకరకాల క్రీడలు ఆడుతుంటారు. దీనివల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా బలపడతారని వ్యాయామ కళాశాలలో విశేష అనుభవం ఉన్న జీవీవీ సత్యనారాయణ తెలిపారు. ఆటలతో స్నేహాలు మరింత మెరుగవుతాయని.. కొత్త స్నేహాలను చిగురింపజేస్తాయని పేర్కొన్నారు.అయితే ఈ క్రమంలో పిల్లలు ఘర్షణలు, విభేదాల వైపు మళ్లకుండా మార్గదర్శకుల పర్యవేక్షణలో వారు ఆటలు ఆడేందుకు వీలున్న గ్రౌండ్లకు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది విద్యార్థులు స్నేహితులతో కలిసి ఈతకు వెళ్తూ సేదతీరుతుంటారు. అయితే ఇందులో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఇలాంటి ఘటనల్లో తీవ్రంగా గాయపడగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.⇒ వేసవి సెలవుల్లో పిల్లల్ని ఖాళీగా వదిలేస్తే ఫోన్లు, టీవీలకు అతుక్కుపోవడమో లేదా ఎండలో స్నేహితులతో తిరగడమో చేస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లలకు నీతికథలు చెప్పాలి. గ్రామాల్లో ఇరుగుపొరుగు పిల్లలందరినీ ఒకచోట కూర్చోబెట్టి వారికి లోకజ్ఞానం నేరి్పంచే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పిల్లలు కూడా ఇవే కోరుకుంటున్నారు. బోర్గా ఫీలవ్వడం లేదు. – కాకి వీరభద్రం, వనం వారి కృష్ణాపురం, ఖమ్మం జిల్లా⇒ కృత్రిమ మేధ (ఏఐ) గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పిల్లల్లో పెరిగింది. దాని గురించి నేర్పడానికి ఇదే మంచి తరుణం. వేసవిలో వారితో కూర్చొని ఏఐపై కసరత్తు చేస్తే పిల్లలు బోర్గా ఫీలవ్వరు. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఈ తరహా మోటివేషన్ బాగా పనిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్దలు చొరవ తీసుకొని ఆన్లైన్లో ఏఐపై శిక్షణ ఇప్పించాలి. – కంకిపాటి శేషుకుమార్, హైదరాబాద్ -
అంతర్జాతీయ ప్రయాణం .. మరింత భారం
పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం దాయాదీ దేశం పాకిస్తాన్పై భారత్ కఠిన ఆంక్షలు విధించింది. పాకిస్తాన్ సైతం అదే రీతిలో స్పందిస్తూ తమ గగనతలాన్ని భారతదేశ విమానాలు ఉపయోగించుకోకుండా నిషేధించింది. ఇండియా విమానాలు తమ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలపై అదనంగా ఆర్థిక భారం పడుతోందని, అతిమంగా ప్రయాణికులే భరించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఉత్తర భారతదేశం నుంచి పాక్ గగనతలం గుండా ప శ్చిమ దేశాలకు ప్రయాణించాల్సిన విమానాలు ఇక చుట్టూ తిరిగి వెళ్లక తప్పదు. దీనివల్ల విమాన చార్జీలు 8 నుంచి 12 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరప్, ఉత్తర అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్లేవారు అదనపు భారం భరించాల్సి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ రూట్లలో విమాన ప్రయాణాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఇండియాలో రిజిస్టర్ అయిన అన్ని విమానాలతోపాటు భారతీయుల యాజమాన్యంలో ఉన్న విమానాలు పాక్ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి లేదు. ఇక సుదూర ప్రయాణాలే పాక్ ఆంక్షల ప్రభావం ఇప్పటికే మొదలైందని ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి సంస్థలు నిర్ధారించాయి. తమ అంతర్జాతీయ విమానాలను మరో మార్గం గుండా మళ్లించామని తెలిపాయి. తమ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాక్ ఆంక్షల విషయంలో తాము చేయగలిగేది ఏమీ లేదని నిస్సహాయత వ్యక్తంచేశాయి. ఇండియా నుంచి యూరప్, అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లాల్సిన విమానాలు అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల రెండు నుంచి రెండున్నర గంటల అదనపు సమయం పడుతోందని ఓ పైలట్ చెప్పారు. ఢిల్లీ, అమృత్సర్, జైపూర్, లక్నో, వారణాసి తదితర నగరాల నుంచి ప్రయాణించేవారు అదనపు సమయం వెచి్చంచడంతోపాటు అదనపు వ్యయం భరించాల్సి వస్తోంది. ఇండియా విమానాలకు పాకిస్తాన్ ఎయిర్స్పేస్ అత్యంత కీలకం. చాలావరకు విమానాలు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుంటాయి. ఇన్నాళ్లూ ఎటువంటి ఇబ్బందుల లేకుండా ప్రయాణాలు సాగిపోయాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఏ విమానానికి ఎంత సమయం అదనంగా అవసరమన్న దానిపై త్వరలో పూర్తి స్పష్టత వస్తుందని సీనియర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఒకరు తెలిపారు. కనెక్టింగ్ విమానాలు అందుకోవడం కష్టం రాబోయే రోజుల్లో అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరింత ఖరీదు కాబోతున్నాయి. విమానాలు ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఇంధనంతోపాటు నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతాయి. అదే స్థాయిలో టికెట్ చార్జీలు పెరగడం తథ్యం. విమానయాన సంస్థలు తమపై పడే అదనపు వ్యయాన్ని ప్రయాణికులకే బదిలీ చేస్తాయి. మరో ఇబ్బంది ఏమిటంటే.. ప్రయాణానికి అదనపు సమయం పట్టడం వల్ల ఇతర దేశాల్లో కనెక్టింగ్ విమానాలు అందుకోవడం కష్టం కావొచ్చు. అందుకే ప్రయాణ ప్రణాళికను రీషెడ్యూల్ చేసుకోవాలి. విదేశాల నుంచి వచ్చేవారు కూడా ఆలస్యంగా స్వదేశానికి చేరుకుంటారు. లాంగ్ జర్నీ వల్ల విమానాల్లో ఇంధనం లోడ్ పెరుగుతుంది. ఎక్కువ ఇంధనాన్ని నింపుకోవాలి. ప్రయాణ సమయానికి అనుగుణంగా భద్రతాపరమైన ప్రమాణాలు కూడా పాటించాలి. పేలోడ్ను తగ్గించుకోవాలి. అంటే తక్కువ మంది ప్రయాణికులు, తక్కువ లగేజీతో ప్రయాణించాలి. దీనివల్ల విమానాల్లో సీట్లు లభించడం కష్టమవుతుంది. ఓవర్బుకింగ్ వంటి పరిణామాలు ఎదురవుతాయి. ముందస్తు ప్రణాళిక ఉంటే తప్ప అంతర్జాతీయ విమానాల్లో అప్పటికప్పుడు సీట్లు దొరకవు. భారత విమానాలకు తమ గగనతలాన్ని పాక్ మూసివేయడం ఇదే మొదటిసారి కాదు. 2019 ఫిబ్రవరిలోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తింది. భారత సైన్యం చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడుల నేపథ్యంలో తమ గగనతలం గుండా భారత విమానాలు ప్రయాణించకుండా నిషేధించింది. ఈ నిషేధం కొన్ని నెలలపాటు కొనసాగింది. ఇప్పట్లో భారత ప్రయాణికులకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు చేయాల్సిందేమిటి? → పాక్ ఆంక్షల కారణంగా విమానయాన చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా టికెట్లు బుక్ చేసుకోవాలి. → విమానాల విషయంలో అప్డేట్స్ కోసం సంబంధిత ఎయిర్లైన్స్ వెబ్సైట్ లేదా యాప్ను తరచూ చెక్ చేసుకోవాలి. → అంతర్జాతీయ ప్రయాణాలకు అదనపు సమయం కేటాయించేందుకు సిద్ధపడాలి. తదనుగుణంగా పక్కా ప్లానింగ్ ఉండాలి. → ఎయిర్లైన్స్ సంస్థలు ప్రయాణికుల లగేజీపై పరిమితి విధించే అవకాశం కనిపిస్తోంది. కనుక తక్కువ లగేజీతోనే ప్రయాణించాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శాంతిస్థాపనే లక్ష్యంగా సిమ్లా ఒప్పందం
పహల్గాంలో హేయమైన ఉగ్రదాడి తర్వాత సింధూ నదీజలాల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించాక అందుకు ప్రతీకార నిర్ణయంగా పాకిస్తాన్ రెచ్చగొట్టే నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారంలో మూడో దేశం జోక్యం చేసుకోవద్దనే ప్రధాన అజెండాగా రూపుదిద్దుకున్న సిమ్లా ఒప్పందం నుంచి పక్కకు జరుగుతున్నట్లు పాక్ ప్రకటించింది. దీంతో దశాబ్దాలుగా రావణకాష్టంగా రగలిపోతున్న కశీ్మర్ అంశంలో ఇకపై అమెరికా వంటి సంపన్న దేశాలు పెద్దమనిషిలా దూరిపోయి అంశాన్ని మరింత జఠిలం చేసే ప్రమాదముందనే సంకేతాలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు సిమ్లా ఒప్పందంలో ఏమేం అంశాలు ఉన్నాయి?. వాటి ప్రాధాన్యత ఏమిటి? అనే చర్చ ఇప్పుడు మొదలైంది. 1972లో సాకారం.. తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా విమోచన పొందడంలో భారత ప్రమేయాన్ని తీవ్రంగా తప్పుబడుతూ భారత్పైకి పాకిస్తాన్ దాడికి తెగించడం తదనంతర పరిణామాలతో 1971 యుద్ధం జరిగింది. 1971లో భారత్, పాక్ల మధ్య యుద్ధం ముగిశాక శాంతిస్థాపనే లక్ష్యంగా ఒక ఒప్పందానికి ఇరుదేశాలు మొగ్గుచూపాయి. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకుని, సాధారణ పరిస్థితులు నెలకొనడమే లక్ష్యంగా ఒక ఒప్పందానికి ఇరుదేశాలు పచ్చజెండా ఊపాయి. పొరుగుదేశ సరిహద్దు ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నియంత్రణ రేఖను ఇష్టమొచి్చనట్లు ఏకపక్షంగా మార్చకూడదనే కట్టుబాటుతో ఈ ఒప్పందం చేసుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా పట్టణంలో 1972 జూలై రెండో తేదీన నాటి భారత ప్రధాని ఇందిరా గాం«దీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జులి్ఫ కర్ అలీ భుట్టో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. యుద్ధం ముగిసిన వెంటనే శాంతిస్థాపనకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ఇరుదేశాలు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంగా ఈ ఒప్పందం పేరొందింది. ఇకపై పొరుగుదేశాలుగా పరస్పర సహకారం, సామరస్యంతో మెలుగుతామని ఆనాడు ఇరుదేశాలు ప్రతినబూనాయి. ఒప్పందంలో ఏమేం ఉన్నాయి? భవిష్యత్తులో సరిహద్దుసహా మరే అంశంలోనైనా మనస్పర్థలు తలెత్తినా, వివాదాలు చెలరేగినా మూడో దేశానికి లేదా అంతర్జాతీయ సంఘంలో ఫిర్యాదుచేయకుండా రెండు దేశాలు మాత్రమే కూర్చుని మాట్లాడుకోవాలని సిమ్లా ఒప్పందంలో పేర్కొన్నారు. మూడో దేశం జోక్యాన్ని ఈ ఒప్పందం నివారిస్తోంది. 1971లో యుద్ధం సమయంలో సరిహద్దు దాటి ముందుకు చొచ్చుకురావడం, మరి కొన్ని చోట్ల భూభాగాన్ని కోల్పోవడం వంటి ఘటనలు జరిగాయి. ప్రస్తుతం తమ అ«దీనంలోని భూభాగాలను తమవిగా పేర్కొంటూ, యథాతథ స్థితిని కొనసాగించాలంటూ దానినే నియంత్రణ రేఖగా ఇరుదేశాలు అంగీకరించాయి. ఈ ని యంత్రణ రేఖను ఏకపక్షంగా మార్చడానికి వీలులేదు. యుద్ధం వేళ చాలా మంది పాకిస్తానీ సైనికులను భారత బలగాలు బంధించాయి. ఈ ఒప్పందంలో భాగంగా వారందరినీ విడిచిపెట్టారు. పాకిస్తాన్ సైతం బంగ్లాదేశ్ సాధించిన సార్వభౌమత్వాన్ని అధికారికంగా గుర్తించింది. బంగ్లాదేశ్తోనూ పర స్పర గౌరవం పాదుకొల్పడమే లక్ష్యంగా ఈ అంశాన్నీ సిమ్లా ఒప్పందంలో చేర్చారు. ఒప్పందం ప్రభావం ఎంత ? ఈ ఒప్పందం కారణంగా తదనంతరకాలంలో ఇరు దేశాల మధ్య పొరపొచ్చాలు వచి్చన ప్రతిసారీ ఈ రెండు దేశాలే సమస్యలను పరిష్కరించుకున్నాయిగానీ మరే ఇతర దేశాన్ని మధ్యవర్తిగా ఆహ్వానించలేదు. చర్చలు రెండు దేశాల మధ్యే పరిమితం కావడంతో వేగంగా సంప్రతింపులు సాధ్యమయ్యాయి. మెరుగైన పరిష్కారం సాధ్యమైంది. కశ్మీర్లో నియంత్రణ రేఖనే వాస్తవా«దీన రేఖగా అప్పటి నుంచి కొనసాగింది. దీంతో ఆనాటి నుంచి ఎలాంటి సరిహద్దు ఆక్రమణ ఘటనలు జరగలేదు. ఇలా ఈ ఒప్పందం భూభాగాల వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించింది. దౌత్యపరంగా సంబంధాల కొనసాగింపునకు ఈ ఒప్పందం సుసాధ్యం చేసింది. ఇరుదేశాల మధ్య విశ్వాసం పెంచే ప్రయత్నాలు ఈ ఒప్పందం కారణంగానే జరిగాయి. అయితే ఇరువైపులా కాల్పుల విరమణ ఒప్పందం వంటివి తరచూ ఉల్లంఘనకు గురవడం ఒక్కటే ఈ ఒప్పందం మనుగడకు సవాల్గా నిలిచింది. తాజాగా పాకిస్తాన్ ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటే కశీ్మర్ అంశంపై పాక్ అనుకూల దేశాలు మధ్యవర్తులుగా బయల్దేరే ప్రమాదముంది. అప్పుడు కశీ్మర్ మా ఇద్దరికి మాత్రమే సంబంధించిన అంశం అనే భారత వాదన అంతర్జాతీయ వేదికలపై కాస్తంత బలహీనపడే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
త్రుటిలో తప్పించుకున్నారు..
ఒకరు ప్లాన్ చేంజ్ చేసుకున్నారు.. మరొకరికి గుర్రపు స్వారీ దొరకలేదు.. ఇంకొందరైతే ఘటనకు కొద్దిసేపటి నుంచే అక్కడి నుంచి వెళ్లిపోయారు. పహల్గాం ఉగ్రదాడినుంచి త్రుటిలో తప్పించుకున్న పర్యాటకులు ఒక్కొక్కరిదీ ఒక్కో అనుభవం. దాడి భయానక పరిస్థితులను, క్షతగాత్రులకు సాయం చేయడానికి, సురక్షితంగా బయటపడేయడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన స్థానికుల ప్రయత్నాలను వారు గుర్తు చేసుకున్నారు. భయంతో నిద్రపట్టలేదు.. ‘అక్కడికి వెళ్లడానికి.. బైసారన్ లోయకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సిటీ ట్యాక్స్ స్టాండ్ దగ్గర మేం ఉండగా గందరగోళం ప్రారంభమైంది. ప్రజలు కేకలు వేస్తూ పరుగులు తీస్తున్నారు. ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు. ఆ తరువాత దాడి గురించి తెలిసింది. స్థానికుల సలహా మేరకు ఓ హోటల్ను సంప్రదించడంతో వారు వాహనాన్ని పంపి మమ్మల్ని అక్కడినుంచి తీసుకెళ్లారు. మేం తిరిగి వెళ్తుండగా అంబులెన్సులు, మిలిటరీ వాహనాలు పరుగులు పెట్టడం కనిపించింది. నా ఎనిమిదేళ్ల కొడుకు చాలా భయపడ్డాడు. మాట్లాడలేకపోయాడు. ఆ భయం రాత్రంతా కొనసాగింది. నిద్రకూడా పట్టలేదు. వెంటనే ప్రయాణాన్ని కుదించుకుని తిరిగి వచ్చేశాం.’అని ఆ భయానకమైన రోజును గుర్తు చేసుకున్నారు పశి్చమబెంగాల్లోని హుగ్లీకి చెందిన చంచల్ డే. దాడి జరిగిన సమయంలో ఆయన కుటుంబంతో కలిసి కశ్మీర్ పర్యటనలో ఉన్నారు. ‘‘నేను మళ్లీ కశ్మీర్కు వెళ్లను. అక్కడికి వెళ్లాలన్న ఆలోచన వచి్చనా పునరాలోచిస్తాను. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వం. నా ఆలోచన మాత్రం మా భద్రత గురించే’అని వారితో పాటు పర్యటనకు వెళ్లొచి్చన డే మరదలు బసంతి తెలిపారు. ప్లాన్ మారి ప్రాణాలతో బయటపడ్డాం.. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన విశాల్ సంగోకర్, అతని భార్య దాడి జరిగిన రోజే బైసారన్ను సందర్శించాలనుకున్నారు. అదృష్టవశాత్తు వారి ప్లాన్ ఒక రోజు ముందుకు మారింది. 22న దాడి జరగగా, 21న అంటే ఒక రోజు ముందుగానే బైసారన్లో పర్యటించారు. ‘‘ఒక రోజు ముందుగా వెళ్లడం మా అదృష్టం. లేకపోతే మేం కూడా బాధితుల్లో ఉండేవాళ్లం. మేం వెళ్లిన రోజు కూడా కొంత అసౌకర్యానికి గురయ్యాం. చుట్టుపక్కల ఎలాంటి సెక్యూరిటీ లేదు’’అని పహల్గాం అనుభవాలు పంచుకున్నారు సంగోకర్. ప్రస్తుతం శ్రీనగర్లో ఉన్న వీరు త్వరలోనే అకోలాకు రానున్నారు. డ్రైవర్ తన ఇంట్లో ఆశ్రయం కల్పించారు.. ధారశివ్ జిల్లాకు చెందిన రెండు కుటుంబాలు కూడా ఏప్రిల్ 22న సంఘటనా స్థలానికి మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ‘‘అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకస్మిక దాడితో దిగ్భ్రాంతికి గురయ్యాం. ‘ఏదో సమస్య ఉంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోదాం’అని స్థానికుడైన మా డ్రైవర్ మజీద్ఖాన్ చెప్పారు. మమ్మల్ని తీసుకెళ్లి వాళ్లింట్లో ఆశ్రయం కలి్పంచారు. మజీద్ మమ్మల్ని అప్రమత్తం చేయకుంటే పరిస్థితి మరోలా ఉండేది’’అంటూ ఆనాటి వాతావరణాన్ని వారు గుర్తు చేసుకున్నారు. గుర్రం దొరక్క ప్రాణాలు దక్కాయి.. సాంగ్లీకి చెందిన సంతోష్ జగ్దాలే కుటుంబం ఊహించని ట్విస్ట్తో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. దాడి జరిగిన రోజు ఉదయం వారు పహల్గాం వెళ్లాల్సి ఉంది. స్వారీ చేయడానికి గుర్రాలు దొరకలేదు. దీంతో బదులుగా సందర్శనకు మరొక ప్రదేశానికి వెళ్లారు. ‘‘మేం తిరిగి వచ్చేసరికి దాడి జరిగింది. ఎక్కడ చూసినా సైన్యమే. సంతోష్ జగ్దాలే అనే పేరున్న పుణేకి చెందిన మరో వ్యక్తి చనిపోయాడు. దీంతో మా బంధువుల్లో భయాందోళనలు పెరిగి ఫోన్స్ చేశారు. నేను బతికే ఉన్నానని నిర్ధారించుకుని నెమ్మదించారు’అని సంతోష్ వివరించారు. ప్రాణాలు కాపాడిన మటన్ రోగన్ జోష్...కేరళలోని కొచి్చకి చెందిన 11 మంది సభ్యుల కుటుంబాన్ని మటన్ రోగన్ జోష్ ప్రాణాలతో బయటపడేసింది. వారి కుటుంబం ఏప్రిల్ 19న కశీ్మర్ చేరుకుంది. గుల్మార్గ్, సోన్మార్గ్ అందాలను ఆస్వాదిస్తూ రెండు రోజులు గడిపారు. బిజీ షెడ్యూల్ కారణంగా రెండు రోజుల పాటు మధ్యాహ్న భోజనం చేయలేదు. దీంతో.. బైసారన్ మైదానానికి వెళ్లడానికి ముందు ఏదైనా తినాలనుకున్నారు. ఆ రోజు ఉదయం కొంచెం ఆలస్యంగా బయలుదేరారు. రెండు రోజులుగా ఏం తినకపోవడంతో, కేవలం 15 నిమిషాల దూరంలో ఉన్న బైసారన్ చేరుకునే ముందు ఏదైనా తిందామని రోడ్డు పక్కన ఫుడ్స్టాల్ దగ్గర ఆగారు. మటన్ రోగన్ జోష్ ఉప్పగా ఉండటంతో తాజాగా చేయమని రెస్టారెంట్ సిబ్బందిని అడిగారు. తిని, బైసారన్కు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించేపట్టికి గంట ఆలస్యమైంది. బైసారన్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉండగా గందరగోళం నెలకొంది. గుర్రాలు, ట్యాక్సీలు కిందకు వస్తున్నాయి. ప్రజలు కేకలు వేస్తున్నారు. స్థానిక భాష తెలియకపోవడంతో ముందుకు వెళ్దాం అనుకున్నారు. డ్రైవర్ స్థానికుడు కావడంతో ఎందుకైనా మంచిదని ఆరా తీశాడు. దాడి జరిగిందని, అప్పటికే భద్రతా బలగాలు రంగంలోకి దిగాయని సమాచారం తెలిసింది. వారికి ధైర్యం చెప్పిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని వెనక్కి తిప్పాడు. క్షేమంగా హోటల్కు చేర్చాడు. లేటైతే ప్రాణాలు పోయేవి.. నాందేడ్కు చెందిన కృష్ణ, సాక్షిల ప్రాణాలను ఓ పదిహేను నిమిషాలు కాపాడాయి. ఉగ్రవాదులు కాల్పులు జరపడానికి 15 నిమిషాల ముందే ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. తాము క్షేమంగా ఉన్నామని వివరిస్తూ వారు షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం తిరుగు ప్రయాణానికి విమాన టిక్కెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. అస్సాంలోని బొంగైగావ్కు చెందిన బిశ్వజిత్ ఛటర్జీ కుటుంబం కూడా ఇలాగే ప్రాణాలు కాపాడుకుంది. గౌహతి మీదుగా ఏప్రిల్ 17న శ్రీనగర్కు చేరుకున్నవారు 19 వరకు గుల్మార్గ్లో ఉన్నారు. 20న పహల్గాంకు వచ్చారు. 20, 21 తేదీల్లో చాలా సరదాగా గడిపారు. 22వ తేదీన దాడి జరగడానికి రెండు గంటల ముందే బైసారన్ నుంచి వారు వెళ్లిపోయారు. వారు మరో ప్రదేశాన్ని సందర్శిస్తుండగా దాడి వార్త తెలిసింది. కాస్త ఆలస్యమైతే ఏమయ్యేదన్న ఆలోచన వస్తేనే భయమేస్తుందని వారు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చిన్నారి హల్ సెల్
కూర్చున్నా.. పరిగెడుతున్నా..తింటున్నా..పడుకున్నా..సెల్ చెంతనే ఉండాల్సిందే. ఇది లేని జీవితాన్ని ఊహించడం కష్టసాధ్యంగా మారుతోంది. పిల్లలు పెద్దల ప్రమేయం లేకుండానే గేమ్లు ఆడుతున్నారు. తమకు కావాల్సిన ఆటలు డౌన్లోడ్ పెట్టుకుంటున్నారు. ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో మంచితోపాటు చెడు మిళితమై ఉండడంతోపాటు అతి వినియోగంతో అనర్థాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పలమనేరు: స్మార్ట్ఫోన్ల వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎలాంటే.. ఒక నిమిషం చేతిలో సెల్ లేకుంటే బతకలేమన్నట్టుగా తయారయ్యారు నేటి విద్యార్థులతు, పిల్లలు, యువకులు. డ్రగ్స్కు బానిసైనట్టు స్మార్ట్ఫోన్ (Smartphone) కారాగారంలో నేటి తరం బందీలుగా మారారు. ఇప్పుడు పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా స్మార్ట్ఫోన్ల వాడకం విద్యార్థుల్లో ఎక్కువైంది. పిల్లాడు అన్నం తినాలంటే మొబైల్, బడికి రెడీ కావాలంటే మొబైల్, బడి నుంచి రాగానే సెల్ఫోన్ చేతిలో పెట్టాల్సిందే. పసిబిడ్డలు సైతం ఏడుపు ఆపాలంటే తల్లిపాలు పట్టడం కంటే చేతిలో సెల్ పెట్టగానే సైలెంట్ అవుతున్నారు. మొబైల్ లేకుంటే మనషులకు బుర్ర కూడా పనిచేయడం లేదు. మితిమీరిన సెల్ వాడకం మనిషి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నా మార్పు రావడం లేదు. ఇప్పటికే చాలామంది వారికి తెలియకనే మానసిక రోగుల్లా మారారు. ఇంకొందరు అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు స్టార్ట్ఫోన్లకు బానిసలుగా మారిపోవడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. ఏటా15 శాతం పెరుగుతున్న సెల్ ఫోన్ వినియోగం గత నాలుగేళ్లుగా సెల్ఫోన్ల వాడకం ఏటా 15 శాతం పెరుగుతున్నట్టు ట్రాయ్ (టెలీఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లెక్కలు చెబుతున్నాయి. స్మార్ట్ఫోన్లను వాడేవారిలో రోజుకు సగటున యువత 4 గంటలు, విద్యార్థులు 2 గంటలు, గృహిణిలు 2 గంటలు, అధికారులు 1.30 నిమిషాలు, పిల్లలు గంటపాటు సమయాన్ని కేటాయిస్తున్నట్టు తెలిసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉదాహరణే తీసుకుంటే... 1990లో కీప్యాడ్ఫోన్ల వాడకం మొదలైంది. తొలుత తిరుపతి, చిత్తూరు, కుప్పం, మదనపల్లెలో రిలయన్స్ మొబైల్ టవర్ల ద్వారా నెట్వర్క్ను అందిస్తూ సేవలను మొదలు పెట్టారు. ఆపై పలు సెల్ కంపెనీలు మార్కెట్లోని వచ్చాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 8 వేల దాకా సెల్ఫోన్ టవర్లున్నాయి. ఉమ్మడి జిల్లా జనాభా 44 లక్షలు కాగా వీరిలో సెల్ఫోన్లు (కీఫ్యాడ్, టచ్ మొబైల్)వాడే వారి సంఖ్య ప్రస్తుతం 10 లక్షలకు చేరింది.ఇదిగో సాక్ష్యం.. పలమనేరు పట్టణంలో ఇంజినీరింగ్ చదవుతున్న ఓ విద్యార్థిని సెల్ఫోన్ అతిగా వాడొద్దని తల్లిదండ్రులు మందలించారు. దీంతో అప్పటికే సెల్కు బానిసైన ఆ విద్యార్థి తన గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని పదో తరగతి చదివే బాలికకు సెల్ఫోన్ కొన్విలేదని తన చేతిని బ్లేడ్తో కోసుకుని ఆస్పత్రి పాలైంది. సెల్ ఇవ్వలేదని ఐదో క్లాస్ చిన్నారి ఇంటి నుంచి పరారయ్యాడు. ఇలాంటి సంఘటనలు జిల్లాల్లో నిత్యకృత్యంగా మారాయి.ఎక్కువ మంది యూట్యూబ్ వీక్షకులే స్మార్ట్ఫోన్ వాడుతున్న వారిలో 80 శాతం మంది యూట్యూబ్ చూస్తుండగా, 60 శాతం మంది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్ర్రాగామ్ను వాడుతున్నట్టు గూగూల్ చేసిన సర్వేలో తేలింది. విద్యార్థులు, యువతలో 50 శాతం మంచి ఆన్లైన్లో గేమ్స్ కోసం సమయాన్ని వెచ్చిస్తున్నారు. మహిళలు పనిపాట చేసుకుంటూ కూడా సీరియళ్లను సెల్లోనే చూసేవారి సంఖ్య పెరుగుతోంది. ఇక చిన్నపిల్లలు సైతం స్మార్ట్ఫోన్లో కార్టూన్ స్టోరీస్ చూడకుండే ఏడుపు మొదలు పెట్టడం చూస్తూనే ఉన్నాం.అనారోగ్య సమస్యలు తప్పవుసెల్ చూస్తున్న కారణంగా నిద్రలేమి ప్రధాన సమస్యగా మారుతోంది. దీంతో మనిషి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత దెబ్బతింటోందని(డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో తెలిపింది. శరీరంలో మెలటోనియన్ నిల్వలు నశించి డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నిద్రలేమి కారణంగా అధిక బరువు, లావెక్కడం జరుగుతుంది. పిల్లలకు తలనొప్పి, చూపు మందగించి కంటి అద్దాలను వాడాల్సిందే. అలాగే పలు అనారోగ్య సమస్యలు తప్పవు. – మమతారాణి, ఏరియాఆస్పత్రి సూపరిండెంటెంట్, పలమనేరుసోషల్ మీడియా వాడకం పరిస్థితి ఇదీ! ఇటీవల యాన్యువల్ స్టేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ నివేదికలో వెల్లడించిన అంశాలు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా (Social Media) బానిసలైన వారిలో 14 ఏళ్లలోపు పిల్లలు 79 శాతం, 15 నుంచి 20 ఏళ్ల వయసున్న వారిలో 82 శాతం, మహిళలు 75 శాతం ఉండడం కొసమెరుపు. -
బీటీ పత్తి.. పురుగుమందు ఎడాపెడా
సాక్షి, స్పెషల్ డెస్క్ : జన్యుమార్పిడి (జీఎం) పంటలు మన దేశ సాగులోకి వచ్చిన గత ముప్పయ్యేళ్లలో ముందు ఆశించినట్టు, రసాయనిక పురుగు మందుల వాడకం తగ్గకపోగా పెరిగిందా? అంటే అవుననే చెబుతోంది ఓ తాజా అధ్యయనం. అమెరికాలోని అంతర్జాతీయ పత్తి సలహా సంఘం (ఐసీఏసీ), వాషింగ్టన్లోని వర్డ్యూ యూనివర్సిటీ, లీ యూనివర్సిటీ పరిశోధకులు ఉమ్మడిగా ఈ అధ్యయనం చేశారు. మన దేశంలో సాగవుతున్న పత్తి విస్తీర్ణంలో 95% బీటీ పత్తి విత్తనాలనే ఇప్పుడు రైతులు వాడుతున్న సంగతి తెలిసిందే. బీటీ పత్తి మొక్క విషపూరితంగా ఉంటుంది కాబట్టి.. పురుగు ఆశించిన వెంటనే చనిపోతుందని, తద్వారా పురుగు మందులు వాడాల్సిన అవసరమే తగ్గిపోతుందని చెబుతూ వచ్చారు. అయితే, వాస్తవానికి ఆచరణలో అందుకు భిన్నంగా జరిగిందని ‘జర్నల్ ఆఫ్ అగ్రేరియన్ చేంజ్’లో ఇటీవల ప్రచురితమైన అధ్యయనం తేల్చింది. భారతీయ రైతులు 1990 దశకంలో నాన్బీటీ పత్తి రకాలను సాగు చేసినప్పుడు వాడినప్పటికన్నా బీటీ పత్తి వచ్చిన తర్వాత ఎక్కువగా విష రసాయనాలను వాడాల్సి వస్తోందని గత ముప్పయేళ్ల గణాంకాలను విశ్లేíÙంచిన తర్వాత పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. పెరిగిన ఖర్చులు బీటీ పత్తిని 2002లో దేశంలోకి ప్రవేశపెట్టిన తొలిదశలో పురుగుమందుల వాడకం, తద్వారా సాగు ఖర్చు తగ్గింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో సంప్రదాయ పత్తి వంగడాలను వదిలి రైతుల్లో 95% మంది బీటీ పత్తి వైపు మళ్లారు. అయితే, బీటీపత్తిపై పెట్టుకున్న ఆశలు కొద్ది ఏళ్లలోనే తారుమారయ్యాయి. పురుగులు బీటీ పత్తికి అలవాటుపడిపోవటంతో 2010 నాటికే పురుగుమందుల వాడకం మళ్లీ పెరిగింది. ‘2018 నాటికి భారతీయ పత్తి రైతులు బీటీకి ముందుకన్నా 37% ఎక్కువగా పురుగు మందులపై ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది’అని అధ్యయనం తెలిపింది. ఎక్కువ మంది బీటీ పత్తిని ఏకపంటగా విస్తారంగా సాగు చేస్తుండటంతో త్వరలోనే పురుగులు బీటీ విషానికి తట్టుకునే శక్తిని పెంచుకున్నాయి. పురుగు మందుల వాడకం ఉధృతమైంది. ఈ అధ్యయనంలో భాగస్వాములైన సంస్థల్లో వాషింగ్టన్లోని అంతర్జాతీయ పత్తి సలహా సంఘం (ఐసీఏసీ) ఒకటి. దీని ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ కేశవ్ క్రాంతి తెలుగు వ్యక్తి కావటం విశేషం. ఆయన గతంలో నాగపూర్లోని ఐసీఏఆర్–కేంద్రీయ పత్తి పరిశోధన కేంద్రం (సీఐసీఆర్) సంచాలకుడిగా పనిచేశారు. రసం పీల్చే పురుగుల విజృంభణ కాయ తొలిచే పురుగును నియంత్రించే ప్రధాన లక్ష్యంతో బీటీ పత్తి వంగడాలను ప్రవేశపెట్టారు. అయితే, ఆ తర్వాత ఈ పురుగుల ఉధృతి తగ్గినా, అప్పటి వరకు స్వల్పంగా ఉన్న రసం పీల్చే పురుగుల బెడద గతమెన్నడూ ఎరుగనంత తీవ్రమైంది. 2006 నాటికి బీటీ పత్తి సాగు చేయటం దేశవ్యాప్తమైంది. తదనంతర కాలంలో పత్తి పంటలో రసం పీల్చే పురుగుల ఉధృతి ఏటేటా పెరుగుతూ వచ్చింది. 2018 నాటికే భారతీయ పత్తి రైతులపై పురుగుమందుల పిచికారీ ఖర్చు భారీగా పెరిగిందని ఈ అధ్యయనం పేర్కొంది. అమెరికాలో ఏకు మేకైన కలుపు అమెరికాలో రైతులు గ్లైఫొసేట్ వంటి కలుపు మందులను చల్లినా తట్టుకొని నిలిచేలా జన్యుమార్పిడి చేసిన పంటల (హెచ్టీ క్రాప్స్)ను విస్తారంగా సాగు చేస్తున్నారు. సోయా, మొక్కజొన్న తదితర పంటలు ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికాలో హెచ్టీ. సోయా విస్తీర్ణం 1994 లో 92 లక్షల ఎకరాలుండగా, 2018 నాటికి 11.3 కోట్ల ఎకరాలకు పెరిగింది. ఆ మేరకు గ్లైఫొసేట్ వినియోగం పెరిగింది. గ్లైఫొసేట్ పనితీరు సంక్లిష్ట పద్ధతిలో ఉంటుంది కాబట్టి దీనికి కలుపు మొక్కలు అలవాటు పడి, చనిపోకుండా ఎదురు తిరగవని గ్లైఫొసేట్ తయారు చేసిన కంపెనీ చెబుతూ వచ్చింది. అయితే, 1998 నాటికే డజన్ల కొద్దీ కలుపు మొక్కలు గ్లైఫొసేట్ చల్లినా చనిపోని పరిస్థితి ఏర్పడింది. దక్షిణ అమెరికాలో జన్యుమారి్పడి పంటలకు ఆదరణ పెరుగుతున్న కొద్దీ రైతులు హెచ్టీ సోయా సాగు విస్తీర్ణాన్ని పెంచారు. కెనడాలోనూ హెచ్టీ మొక్కజొన్న, షుగర్ బీట్, ఆవ పంటల సాగు విస్తీర్ణం తామరతంపరగా విస్తరించింది. ‘ఈ (జన్యుమార్పిడి పంటల) సాంకేతికత చెప్పినట్టు రసాయనిక పురుగుమందుల వినియోగం తొలుత తగ్గినా, తదనంతరం అంతకుముందుకన్నా పెరిగిపోయింది. ఏదో ఒకే రకం పంటనే పొలం అంతటా సాగు చేసే పారిశ్రామిక సాంద్ర వ్యవసాయ పద్ధతి వల్ల రసాయనిక పురుగుమందులతో పాటు ఎరువుల వాడకం కూడా పెరిగిపోయింది. శక్తివంతమైన రసాయనిక ఎరువులు, పురుగుమందుల కంపెనీల ఒత్తిళ్ల ప్రభావం వల్ల ఆయా దేశాల ప్రభుత్వాలు శిలాజ ఇంధనాల వాడకాన్ని పెంపొందించే జన్యుమార్పిడి పంటలను గట్టిగా ప్రోత్సహిస్తున్నాయి..’అని ఈ అధ్యయనం విశ్లేషించింది. భారత్లోనూ గ్లైఫొసేట్ను తట్టుకునే హెచ్టీ బీటీ పత్తి వంగడాన్ని అనేక లక్షల ఎకరాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, గత కొన్ని సంవత్సరాలుగా అనధికారికంగా సాగు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పెరిగిన గ్లైఫొసేట్ వాడకంతెలంగాణ, ఏపీలోకూడా హెర్బిసైడ్ టాలరెంట్ పత్తి విత్తనాల ఉపయోగం వల్ల గ్లైఫొసేట్ వాడకం పెరిగింది. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కలు పు మందును రెండు, మూడు సంవత్సరాలు 60 రోజుల పాటు నిషేధించాయి. తెలంగాణలో పత్తి విస్తీర్ణం పెరిగింది. గులాబీ పురుగులు మరింత ఉధృతం కావటంతో ప్రమాదకర రసాయనాల వాడకం ఎక్కువైంది. సాగు ఖర్చు పెరిగింది. – డా. దొంతి నరసింహారెడ్డి, విధాన విశ్లేషకుడు, పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా, హైదరాబాద్ -
ఆ ఊళ్లో అల్లుడే పెద్దకొడుకు
‘ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే...భలే ఛాన్సులే’ అంటుంది సుపరిచిత సినిమా పాట. ‘మజా’ సంగతి ఎలా ఉన్నా ‘ఇల్లరికం అల్లుడు’ అంటే మజాకా కాదు. అత్తామామలను కన్నతల్లిదండ్రుల్లా చూసుకునే మంచి మనసు ఉండాలి. ఈ విషయంలో నూటికి నూరు మార్కులు తెచ్చుకున్నారు మద్నూర్ మండల ఇల్లరికం అల్లుళ్లు...మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉన్న కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో గల్లీకో నలుగురు ఇల్లరికం అల్లుళ్లు ఉంటారు. అందులో రెండు మూడు తరాల వాళ్లున్నారు. ఒకటి రెండు కుటుంబాల్లో మామ, అల్లుడు ఇద్దరూ ఇల్లరికం వాళ్లే ఉన్నారు. ఇంట్లో అందరూ ఆడపిల్లలు ఉన్న కుటుంబాల వాళ్లు తమ బంధువుల అబ్బాయిలను, తెలిసిన వాళ్ల అబ్బాయిలను, బంధుత్వం లేని వాళ్లను కూడా ఇల్లరికం తెచ్చుకుని వారికి తమ కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తారు.అత్తగారి ఇల్లే....అమ్మగారి ఇల్లుఇల్లరికం వచ్చిన అల్లుల్లు అత్తారింటిలో భాగం అయిపోతారు. ఇక్కడి ఇంటి పేరే వారి ఇంటి పేరుగా మారిపోతుంది. సంతానం లేని కుటుంబాల్లో దగ్గరి బంధువుల అమ్మాయిని దత్తత తీసుకుని, వేరే అబ్బాయిని ఇల్లరికం తెచ్చుకుని పెళ్లిచేసి ఇంట్లో పెట్టుకుంటారు. ఇల్లరికం వచ్చిన అల్లుళ్లు అన్నీ తామై కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నారు.అల్లుడే కుమారుడై...మగ సంతానం లేకపోవడంతో ఇల్లరికం అల్లుడిని తెచ్చుకునే పద్ధతిని చాలామంది పాటిస్తున్నారు. కుటుంబ బరువు, బాధ్యతలు మోయడంతో పాటు, వృద్ధాప్యంలో అత్తామామలకు ఆసరాగా ఉంటున్నారు అల్లుళ్లు. దశాబ్దాలుగా ఇది కొనసాగుతోంది.మంచిగ చూసుకుంటరు...తాడిచెట్లవార్ సచిన్ సొంతూరు మహారాష్ట్రలోని సావర్మల్. అత్తమామలు తాడిచెట్ల అంజయ్య, రుక్మిణిలకు మగసంతానం లేరు. 2021లో సచిన్ను ఇల్లరికం తెచ్చుకున్నారు. ‘మా అత్తామామలకు కొడుకు, అల్లుడు అన్నీ నేనే. వ్యాపారం చూసుకుంటాను. ఇంటి వ్యవహారాలన్నీ నేను చూస్తాను. అందరం చాలా బాగా ఉంటాం’ అంటున్నాడు సచిన్.‘మాది మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా. మా అత్తమామలకు ఒకతే ఆడపిల్ల కావడంతో 2022లో నన్ను ఇల్లరికం అల్లుడిగా తీసుకుని పెళ్లి జరిపించారు. ఇంట్లో అందరూ మంచిగ చూసుకుంటరు. నేను బిజినెస్ చేస్తున్నాను. ఇంట్లో అందరి సహకారం బాగుంది. ఎవరూ తేడా చూపరు’ అంటున్నాడు కన్నవార్ మణికంఠ.‘2003 లో నేను ఇల్లరికం వచ్చాను. అల్లుడినైనా కొడుకులాగా మా అత్తామామలను చూసుకోవాలి. ఏ ఇబ్బందీ లేకుండా సంతోషంగా ఉన్నాం’ అంటున్నాడు గంపల్వార్ నాగనాథ్.‘నాకు ముగ్గురు పిల్లలు. వాళ్లను బాగా చదివిస్తున్నాను. మా అత్తమామ నన్ను కొడుకులా చూసుకుంటారు. నాకు వాళ్లే తల్లిదండ్రులు’ అంటున్నాడు గడ్డంవార్ మల్లికార్జున్. ఇవన్నీ చూస్తుంటే మనం మొదట్లో పాడుకున్న పాటకు తగ్గట్టే ఉన్నారు అనిపిస్తోంది కదా!మామ... అల్లుడు ఇద్దరూ ఇల్లరికమే...మద్నూర్లో గడ్డంవార్ నడిపి గంగారాం 1966లో ఆ ఇంటికి ఇల్లరికం వచ్చాడు. ఆయనే ఆ ఇంటికి కొడుకైనా, అల్లుడైనా. ఆయనకు నలుగురు ఆడపిల్లలు. ముగ్గురు పెళ్లిళ్లు చేసిన తరువాత నాలుగో కూతురికి ఇల్లరికం అల్లుడిని తెచ్చుకోవాలనుకున్నారు. 2000 సంవత్సరంలో మల్లికార్జున్ను ఇల్లరికం తెచ్చుకుని నాలుగో కూతురితో పెళ్లి జరిపించాడు. అప్పటి నుంచి ఇంటి బాధ్యతలు మళ్లికార్జున్ చూసుకుంటున్నాడు.అల్లుళ్ల సంఘం!మద్నూర్ మండల కేంద్రంలో ఇల్లరికం అల్లుళ్లు కలిసి ఒక సంఘం పెట్టుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఊళ్లో ఇల్లరికం అల్లుళ్ల పేర్లతో జాబితాను రూపొందించుకున్నారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి వంటి పదవులకు కూడా పేర్లు నిర్ణయించుకున్నారు. ఎందుకోగానీ సంఘం పెట్టుకోవాలనే వారి కల కలగానే మిగిలిపోయింది. చిన్న చూపు చూడలేదు... చిన్న సమస్యా రాలేదుమా ఆయన ఇల్లరికం వచ్చిండు. మాకు అందరు బిడ్డలే. మేమూ అల్లున్ని ఇల్లరికం తెచ్చుకున్నం. ఎప్పుడు గూడా చిన్న సమస్య రాలేదు. అందరం మంచిగనే ఉంటం. ఇల్లరికం అని ఎవరినీ ఎవరూ చిన్న చూపు చూడలేదు. కలిసి మెలిసి ఉండి ఎవరి పని వాళ్లు చేసుకుంటుంటరు. – గడ్డంవార్ చంద్రకళ – ఎస్. వేణుగోపాలాచారి సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం?
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారత సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఈ నదీజలాల అంశం చర్చనీయాంశమైంది. ఘర్షణతో మొదలై ఒప్పందం దాకా..ఇరు దేశాల మధ్య విస్తరించి ఉన్న సింధూ నది, దాని ఉపనదుల జలాలను సాగు కోసం, జలవిద్యుత్ఉత్పత్తి, జల రవాణా, చేపల వేట తదితరాల కోసం వినియోగించుకునేందుకుగాను భారత్, పాకిస్తాన్ దశాబ్దాల క్రితం ఒక ఒప్పందం చేసుకున్నాయి. దాదాపు తొమ్మిదేళ్లపాటు విస్తతస్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్ 19వ తేదీన నాటి భారత ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ఖాన్లు ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందంలో పేర్కొన్న మేరకు సింధూ ఉపనదుల్లో తూర్పువైపుగా ప్రవహించే రావి, బియాస్, సట్లైజ్ నదులపై భారత్కు హక్కులు దఖలుపడ్డాయి. సింధూ ఉపనదుల్లో పశ్చిమ దిశగా ప్రవహించే జీలం, చినాబ్లపై పాకిస్తాన్కు హక్కులు లభించాయి. ఈ నదీ జలాల వినియోగం, ఇరు దేశాల మధ్య ఉత్తరప్రత్యత్తరాల కోసం ఒక సహకార యంత్రాంగాన్ని నెలకొల్పారు. ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా పరస్పర సహకారం భావనతో నదీజలాలను సద్వినియోగం చేసుకోవడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. భారత్ తన పాక్షిక హక్కు మేరకు పాకిస్తాన్ పరిధిలోని పశ్చిమ ఉపనదుల జలాలనూ పరిమితంగా వాడుకోవచ్చు. వ్యవసాయం, జలవిద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించుకోవచ్చు. అయితే పశ్చిమ దిశగా ప్రయాణించే జలాలు పాకిస్తాన్లోకి వెళ్లకుండా అడ్డుకోకూడదు. ఈ ఒప్పందంలో భాగంగానే గతంలోనే శాశ్వత సింధూ కమిషన్ను ఏర్పాటుచేశారు. ఈ కమిషన్లో ఇరు దేశాలకు ప్రాతినిధ్యం ఉంది. ఇరు దేశాలు తమ అభ్యంతరాలను ఈ శాశ్వత కమిషన్ ద్వారా చెప్పుకోవచ్చు. ఈ నదీజలాలపై ఉద్దేశపూర్వకంగా డ్యామ్లను నిర్మించి, హఠాత్తుగా నీటిని వదిలి నీటిబాంబులుగా మార్చకూడదని షరతు పెట్టుకున్నారు. గడచిన ఆరు దశబ్దాల్లో ఈ నదీప్రవాహాల వెంట భౌగోళికంగా, రాజకీయంగా, పర్యావరణపరంగా చాలా మార్పులొచ్చాయి. జీలంకు ఉపనది అయిన కిషన్గంగ నదిపై భారత్ జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించింది. దీనిపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. ప్రాజెక్టు కారణంగా తమ భూభాగంలోకి నదీజలాల ఉధృతి బాగా తగ్గిపోయిందని సింధూ నదీజలాల ఒప్పందానికి భారత్ తూట్లు పొడుస్తోందని పాకిస్తాన్ వాదిస్తోంది. భారత్, పాక్ల మధ్య గతంలో 1965, 1971, 1999లో యుద్ధాలు జరిగినా, పలుమార్లు ఉద్రిక్తతలు నెలకొన్నా సింధు జలాల ఒప్పందం అమలుకు నిరాటంకంగా కొనసాగడం విశేషం. అయితే ఇటీవలి కాలంలో డ్యామ్ల నిర్మాణం, నీటి వినియోగం తదితర అంశాలపై వివాదాలు ఎక్కువయ్యాయి. కిషన్గంగ, రాట్లే ప్రాజెక్టులపై పంచాయతీని పాకిస్తాన్ ప్రపంచబ్యాంక్ దాకా తీసుకెళ్లింది. అయితే తాజాగా ఒప్పందం నుంచి తాత్కాలికంగా భారత్ వైదొలిగితే ఇకపై కేంద్రప్రభుత్వం తనకు నచ్చినట్లు ప్రవర్తించే వీలుంది. అంటే జీలం, చినాబ్, రావి, బియాస్, సట్జైజ్ నదీజలాలు పాకిస్తాన్కు స్వేచ్ఛగా ప్రవహించకుండా డ్యామ్లు కట్టే వీలుంది. అప్పుడు పాకిస్తాన్కు నీటి కష్టాలు పెరుగుతాయి. దీంతో దాయాదిదేశాన్ని జలసంక్షోభం చుట్టుముడుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ . -
ప్రపంచ సాగుభూమిలో 15% కలుషితం
భూమి..మన మనుగడకు మూలాధారం. మనం తినే 95% ఆహారానికే కాదు..అనుదినం తాగే నీటికి కూడా ప్రధాన వనరు భూమి. అయితే ఈ భూమిలో దాదాపు 15% విస్తీర్ణం మేర విషతుల్యమైన భార లోహాలతో కలుషితమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఐరోపా, ఆసియా ఖండాల్లోని కొన్ని దేశాల్లో ఈ కాలుష్యం అపరిమితంగా ఉంది. ఆర్సెనిక్, లెడ్ తదితర భార లోహాలు పరిమితికి మించి సాగు భూమిని కలుషితం చేసి ఆహార వ్యవస్థల్లోకి చేరిపోయాయి. సుమారు 140 కోట్ల మంది ప్రజల ఆరోగ్యానికి భార లోహాల కాలుష్యం» అమెరికన్ అసోసియేషన ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ (ఏఏఏఎస్) ఆధ్వర్యంలో జరిగిన ఈ అధ్య యనానికి చైనాలోని సింగువా విశ్వవిద్యాలయ పరిశోధకుడు డా. దేయీ హౌ నేతృత్వం వహించారు. ఈ పరిశోధన ఫలితాలపై వ్యాసం ప్రసిద్ధ ‘సైన్స్’జర్నల్లో ఇటీవల ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి ప్రాంతీయ అధ్యయనాల గణాంకాలను సేకరించి, మెషీన్ లెర్నింగ్ సాంకేతికత ద్వారా విశ్లేషించారు. » ప్రపంచవ్యాప్త సాగు భూమిలో కనిష్టంగా14% గరిష్టంగా 17% విస్తీర్ణంలో ఈ కాలుష్యం ఉంది. సుమారు 24.2 కోట్ల హెక్టార్ల నేలల్లో భార లోహ కాలుష్యం తిష్ట వేసిందని అధ్యయనం తేల్చింది.ఆర్సెనిక్, కాడ్మియం, కోబాల్ట్, క్రోమియం,రాగి, నికెల్, సీసం వంటి భార లోహాలు అపరిమిత స్థాయిలో సాగు భూమిలో ప్రజారోగ్యానికి తీరనిహాని కలిగించే స్థాయిలో ఉన్నాయని అధ్యయనంతెలిపింది. – సాక్షి, స్పెషల్ డెస్క్భార లోహాలతో ముప్పేమిటి?శిలలు, మానవ కార్యకలాపాల వల్ల ఏర్పడే లోహాలు, మెటలాయిడ్లు ప్రపంచవ్యాప్తంగా అన్ని నేలల్లో ఉంటాయి. ఇతర లోహాలతో పోల్చితే ఈ లోహాల బరువు అణుస్థాయిలో అధికంగా ఉంటుంది. అందుకే వీటిని భార లోహాలు అంటారు. అవి మన కంటికి కనిపించవు. సేంద్రియ పదార్థం మాదిరిగా కాలగమనంలో భార లోహాలు విచ్ఛిన్నం కావు. ఒక్కసారి మట్టిలో ఇవి కలిశాయంటే దశాబ్దాల కాలం వరకూ పోవు. వీటిని మట్టిలో నుంచి పంట మొక్కల వేర్లు గ్రహిస్తాయి. అవి ఆ పంటల ధాన్యాలు, పూలు, కాయల్లోకి చేరుతాయి. ఆ విధంగా ఆహార చక్రం ద్వారా మనుషుల దేహాల్లోకి చేరుతున్నాయి. » ఈ సమ్మేళనాలు పరిమితికి మించి దేహంలోకి చేరితే మనుషులు, జంతువులు, ఇతర జీవులకు ఆరోగ్యపరంగా తీరని హాని జరుగుతుంది. అయితే, వీటి ప్రతికూల ప్రభావం వెంటనే తెలియదు. కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఏయే దేశాల సాగు భూముల్లో ఏయే మోతాదుల్లో భార లోహాలు ఇప్పటికే మితిమీరి ఉన్నాయనే వివరాలు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పుడు మనం తినే ఆహారంలో ఉన్నాయి. ఇక ముందూ దశాబ్దాల పాటు ఉంటాయి. » జింక్, రాగి వంటివి భార లోహాలైనప్పటికీ అత్యల్ప మోతాదులో మనకు సూక్ష్మపోషకాలుగా మనకు అవసరమే. అయితే, ఆర్సెనిక్, కాడ్మియం, పాదరసం, సీసం వంటి విషతుల్యమైన భార లోహాలు అత్యంత సూక్ష్మ స్థాయిలో ఉన్నా కేన్సర్, కిడ్నీ, ఎముకల పటుత్వం క్షీణించటంతో పాటు పిల్లల్లో డిజార్డర్లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. యురేసియా దేశాలకు అధిక ముప్పు యురేసియా తక్కువ అక్షాంశ ప్రాంతంలోని సాగుభూముల్లో భార లోహాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని ఈ అధ్యయనం గుర్తించింది. దక్షిణ ఐరోపా, మధ్య ప్రాచ్య, దక్షిణాసియా, దక్షిణ చైనా ప్రాంత దేశాలకు ఈ బెడద అధికం. గ్రీకు, రోమన్, పర్షియన్, చైనా తదితర పురాతన నాగరికతలు విలసిల్లిన ప్రాంతం ఈ హైరిస్క్ జోన్లోనే ఉంది. గనుల తవ్వకం, లోహాలను కరిగించటం, వ్యవసాయం వంటి మానవ కార్యకలాపాలతోపాటు లోహ సంపన్న సహజ రాతి శిలలు ఉండటం, ఇవి తక్కువ వర్షపాత ప్రాంతం కావటమే ఈ కాలుష్యానికి కారణమని పరిశోధకులు విశ్లేషించారు. » అన్నిచోట్లా సాగు భూముల్లో ఈ ఏడు భార లోహాలు ఉన్నాయని కాదు.. కనీసం ఏదో ఒక రకమైనా అపరిమిత మోతాదులో పోగుపడినట్టు శాస్త్రబద్ధమైన అధ్యయనంలో గుర్తించామని డా. దేయీ హౌ స్పష్టం చేశారు. వీటిల్లో కాడ్మియం కాలుష్యం అత్యధికంగా ఉంది. ప్రపంచ నేలల్లో కనీసం 9% భూమిని కలుషితం చేసింది. ఉత్తర, మధ్య భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణ చైనాతో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో కొన్ని ప్రాంతపు నేలల్లో కాడ్మియం ఎక్కువగా ఉంది. » ఆర్సెనిక్ బెడద దక్షిణ చైనా, ఆగ్నేయాసియా, పశ్చిమ ఆఫ్రికాలో ఎక్కువగా ఉంది. నికెల్, క్రోమియం కాలుష్యం మధ్య ప్రాచ్యం, సబార్కిటిక్ రష్యా, తూర్పు ఆఫ్రికాలో ఎక్కువ. కోబాల్ట్ కాలుష్యానికి ప్రధాన కారణం గనుల తవ్వకం. జాంబియా, కాంగో, ఇథియోపియాల్లో ఇది అధికం. » ప్రపంచవ్యాప్తంగా ఆహారోత్పత్తుల వాణిజ్యం విస్తృతంగా జరుగుతున్నందున, ఆయా ప్రాంతాల్లో ప్రజలకు మాత్రమే ముప్పు పరిమితమైందని భావించడానికి లేదు. కాబట్టి, భార లోహాల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సాగు భూముల స్థితిగతులపై పర్యవేక్షణకు అంతర్జాతీయంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరముందని డా. దేయీ హౌ సూచించారు. -
పహల్గాం ఉగ్రదాడిలో విస్తుపోయే విషయాలు
ప్రభుత్వాధికారులను, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకునే పహల్గాం దాడి జరిగిందా? కాల్చి చంపే ముందు ఉగ్రవాదులు టూరిస్టుల ఐడీ కార్డులను ఎందుకు చెక్ చేశారు?. పైగా మృతుల్లో ఐబీ, నేవీ, ఎయిర్ఫోర్స్ విభాగాల ఉద్యోగులే అధికంగా ఉండడం.. ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. పహల్గాం ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.కశ్మీర్ గడ్డపై నరమేధానికి ఉగ్రవాదులు ఈ పర్యాటక ప్రాంతాన్నే ఎంచుకోవడం వెనుక భద్రతాధికారులు పలు కారణాలు చెబుతున్నారు. పహల్గాం పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ వ్యాలీ(baisaran valley)కి కశ్మీర్ ‘మినీ స్విట్జర్లాండ్’గా పేరుంది. శీతాకాలంలో మంచు దుప్పటి పర్చుకునే ఈ ప్రాంతం.. మిగతా కాలంలో పచ్చిక బయళ్లతో, ఫైన్ చెట్లతో.. యూరప్ అల్పైన్ లోయలను తలపిస్తుంటుంది. అందుకే దేశం నలుమూలల నుంచి పర్యాటకలకు వేసవిలో ఈ ప్రాంతానికి క్యూ కడుతుంటారు. పైగా ల్యూలియన్ సరస్సుకు బైసరన్ వ్యాలీ బేస్గా ఉండడంతో పాటు ట్రెక్కింగ్ కోసం సాహస యాత్రికులు ఈ ప్రాంతానికి క్యూ కడుతుంటారు.అయితే పహల్గాం(pahalgam) బైసరన్ లోయకు ఉన్న ప్రత్యేకతలే.. ఉగ్రవాదులు సులువుగా చొరబడి అమాయకులపై దాడి చేయడానికి వీలు కలిపించింది. ఇక్కడి పచ్చదనం పాడు కాకూడదన్న ఉద్దేశంతో మోటార్ వెహికిల్స్ను అనుమతించరు. పహల్గాం టౌన్ నుంచి ఐదు కిలోమీటర్ల పాటు కాలినడకన లేదంటే పొట్టి గుర్రాలను(Pony) పర్యాటకులు ఆశ్రయించాల్సి ఉంటుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం కోసం తీసుకున్న ఈ చర్యలు ఈ ప్రాంతాన్ని ఒంటరిని చేసేశాయి. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో లేదంటే ఊహించని సంఘటనల సమయంలో చర్యలకు జాప్యం కలిగేలా చేశాయి. ప్రభుత్వాధికారులే లక్ష్యంగా.. పక్కా ప్లాన్తోనే బైసరన్ వ్యాలీలో ఉగ్రదాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. మంగళవారం మధ్యాహ్నా సమయంలో (2.45గం.-3గం. ప్రాంతంలో) సైన్యం దుస్తుల్లో సమీప అడవుల నుంచి వచ్చిన బృందం.. టూరిస్టులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. బాడీక్యామ్లు ధరించిన ముగ్గురు టెర్రరిస్టులు పర్యాటకులను ఒక చోటా చేర్చి.. వివరాలను ఆరా తీసి మరి కాల్చి చంపి ఆ దృశ్యాలను రికార్డు చేశారు. టూరిస్టులు పారిపోతున్న టైంలో స్నైఫర్ ఫైర్ చేశారు. అయితే ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆరుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 26 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. బైరసర్ వ్యాలీ దగ్గర వాహనాలు లేకపోవడంతో క్షతగాత్రుల తరలింపు మరింత ఆలస్యమైంది. భద్రతా బలగాలు కూడా కాస్త ఆలస్యంగానే అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈలోపు దట్టమైన అడవుల్లోకి ఉగ్రవాదులు పారిపోగలిగారు. జమ్ము కశ్మీర్లోనే అంత్యంత ప్రశాంతమైన పర్యాటక ప్రాంతంగా పేరు ఉన్న బైసరన్ వ్యాలీ.. నిన్నటి దాడితో ఆ పేరుపై నీలినీడలు కమ్ముకునేలా చేసుకుంది.ఎమోషనల్ పోస్టులుపహల్గాం ఉగ్రదాడి గురించి తెలిశాక.. చాలా మంది(సెలబ్రిటీలతో సహా) సోషల్ మీడియాలో బైసరన్ వ్యాలీ అనుభూతుల్ని పంచుకుంటున్నారు. గతంలో తాము అక్కడికి వెళ్లిన సందర్భంలో దిగిన చిత్రాలను షేర్ చేస్తూ.. ఉగ్రదాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతమైన ఆ నేల నెత్తురోడడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రాన్ని కోరుతున్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)#baisaranvalley. Kashmir. Had been there 2 years before with family. Can’t imagine today this tragic incidence has happened at the same place. My heart goes out to the victims, their families and all those tourist civilians who lost their life🙏 pic.twitter.com/MabmrYmG5F— Rakesh Banerjee (@RakeshB41201077) April 22, 2025 Most people refer to Baisaran Valley in Pahalgam as "Mini Switzerland" but I prefer to call it by its own name Baisaran. After all, it’s Kashmir, not Switzerland. Why would I compare such a breathtaking place in Kashmir to another country? Baisaran has its own unique charm.. pic.twitter.com/MDLDXl41L7— batukh (@Samaandar_) March 13, 2025 -
పురాతన ఆలయాలకు నిలయం.. పిల్లలమర్రి
తాళ్లగడ్డ (సూర్యాపేట): పిల్లలమర్రి ఆ పేరు వింటే నే చారిత్రక కట్టడాలు గుర్తుకువస్తాయి. ఆధ్యాత్మిక భావం ఉప్పొంగుతుంది. ఇక్కడ కాకతీయుల కాలంలో నిర్మించిన నామేశ్వర, ఎరకేశ్వర దేవాలయాలు దశాబ్దాలు దాటినా నేటికీ శిల్పకళా సంపద చరిత్రకు సజీవసాక్ష్యంగా నిలిచాయి. గొప్ప కళాకృతుల సౌందర్యం ఉట్టిపడే ఈ ఆలయాలకు నేడు ఆదరణ కరువైంది. పాలకులు పట్టించుకోకపోవడంతో భావితరాలకు అందించాల్సిన ఆధ్యాతి్మక సంపదకు రక్షణ లేకుండాపోయింది. ప్రభుత్వం చొరవ చూపి ఆలయ అభివృద్ధికి పాటుపడాలని భక్తులు కోరుతున్నారు. నామేశ్వర ఆలయ నిర్మాణ వృత్తాంతం కాకతీయ రాజు గణపతిదేవుడి పరిపాలనా కాలంలో రేచర్ల నామిరెడ్డి ప్రస్తుతం పిల్లలమర్రి గ్రామం ఉన్న ప్రాంతానికి సామంతరాజుగా ఉండేవారు. వీరు శైవారాధికులు కావడంతో 11వ శతాబ్దంలో మూసీ నది పరీవాహక ప్రాంతంలో ఆయన పేరు మీద పార్వతీ మహాదేవ నామేశ్వర దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడి శివలింగాలు బ్రహ్మసూత్రం కలిగి ఉండటం విశేషం. కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయాలకు మాత్రమే ఈ బ్రహ్మసూత్రం ఉంటుంది.ఎరకేశ్వర ఆలయ వృత్తాంతం12వ శతాబ్దంలో రేచర్ల బేతిరెడ్డి నామేశ్వర ఆలయంలో పూజలు చేసి పరిసర ప్రాంతంలో సంచరిస్తుండగా.. వేటకు వచ్చిన ఎరుకల వ్యక్తి అక్కడ ఉన్న ఒకపెద్ద ఊడల మర్రిచెట్టు కింద సేద తీరుతున్నాడు. ఆ సమయంలో ఆ చెట్టు పైన ఉన్న పిట్టలు.. మరి కొన్నాళ్లకు ఈ చెట్టు కూలుతుందని దీని కింద అనంత నిధి నిక్షిప్తమై ఉందని మాట్లాడుకోవడాన్ని విన్నాడు. వీరు అడవిలో ఉండటం పక్షులతో సావాసం కారణంగా ఆ మాటలు ఎరుకల వ్యక్తికి అర్థంకావడంతో వేటగాడు స్పందించాడు. దీంతో ఆ పక్షులు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే తల పగిలి చస్తావ్ అని శపిస్తాయి. ఇది గమనించిన బేతిరెడ్డి రాజు ఎరుకల వారిని విషయం చెప్పాల్సిందిగా కోరగా శాప భయంతో వేటగాడు సంకోచిస్తుండగా చెప్పకుంటే మరణ శిక్ష విధిస్తానన్నాడు. చెప్పినా చెప్పకపోయినా ప్రాణం పోతుందని భావించిన వేటగాడు రాజును ఓ కోరిక కోరతాడు. తన పేరున ఆలయం నిర్మిస్తే పక్షులు మాట్లాడుకున్న విషయం చెబుతానని రాజుతో అంటాడు. అప్పుడు రాజు అందుకు అంగీకరిస్తాడు. దీంతో పక్షులు ఏం మాట్లాడుకున్నాయో రాజుకు వివరించి ఆ ఎరుకలివాడు మరణిస్తాడు. కొంతకాలానికి ఆ మర్రి చెట్టు కూలి అక్కడ పెద్ద గొయ్యి ఏర్పడింది. అందులో 7 కొప్పెర్ల నిధి (ఆనాటి కొలతల ప్రకారం) బయటపడుతుంది. ఆ ధనంతో ఎరకేశ్వర ఆలయం నిర్మించారు. దానికి ఎరుకల వాని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే దీనికి మరో వృత్తాంతం కూడా ప్రచారంలో ఉంది. రేచర్ల బేతిరెడ్డి భార్య ఎరకసానమ్మ ఆలయం నిర్మించిందని ఆమె పేరు మీద ఎరకేశ్వరాలయం పేరు వచి్చందని కొందరి విశ్వాసం. ఆలయ నిర్మాణానికి ముందు ఇక్కడ ఉన్న పెద్ద మర్రిచెట్టు ఊడలు పోసుకొని పెద్దగా విస్తరించడంతో ఈ గ్రామానికి పిల్లలమర్రి అని పేరు వచ్చింది. ఆలయ నిర్మాణ శైలి.. శిల్పకళా సౌందర్యం నామేశ్వర ఆలయాన్ని చతురస్రాకారంలో, ఎరకేశ్వరాలయాన్ని శ్రీచక్రం ఆకారంలో రాతితో నిర్మించారు. ఇవి కాకతీయుల కాలం నాటి సంస్కృతిని, శిల్పసంపదను ప్రతిబింబిస్తున్నాయి. గర్భాలయం, అంతరాలయం తోరణాలు నల్లని (క్రిష్ణశిల) ఏకశిలతో నిర్మించడం విశేషం. ఈ ఆలయాల్లో శివలింగం ఎదురుగా నందీశ్వరుడు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎక్కడా లేని విధంగా నందిని ఆలయంపైన గోపురం ముందు ప్రతిష్టించారు.రేచర్ల రాజులు నాట్య కళాప్రియులు కావడంతో ఆలయాల్లో గర్భగుడి ఎదురుగా నందీశ్వరునికి బదులుగా నాట్యమండపం నిర్మించారు. నాట్యమండపం నిర్మాణానికి ఏర్పాటు చేసిన స్తంభాలపై చెక్కిన నాట్య శిల్పకళా రూపాలు సౌందర్యవంతంగా దర్శనమిస్తున్నాయి. ఈ స్తంభాల నుంచి సప్తస్వరాలు వినిపించేలా నిర్మించడం విశేషం. బ్రహ్మసూత్రంతో శివలింగంసాధారణంగా అన్ని శివలింగాల మీద గీత ఉండదు కేవలం కాకతీయుల కాలంలో నిర్మించిన కొన్ని శివలింగాలకు మాత్రమే బ్రహ్మసూత్రం అనే గీత ఉంటుంది. బ్రహ్మసూత్రం ఉన్న ఆలయంలో ఒక్కసారి రుద్రాభిõÙకం, జపం, ఇత్యాది పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే కోటి సార్లు చేసిన పుణ్యఫలం లభిస్తుందని, ఇలాంటి శివలింగాన్ని దర్శిస్తే జన్మ ధన్యమవుతుందని భక్తుల నమ్మకం.ధ్వంసమైన కళారూపాలు వందల ఏళ్ల కిందట వచ్చిన అతిపెద్ద భూకంపం వల్ల శివలింగాలు ఉత్తరం వైపుగా ఒరిగాయి. ఆలయాలు కదలడంలో ఆలయ ప్రాకారాలు పైకప్పు జరిగిన ఆనవాళ్లు నేటికీ కనిపిస్తున్నాయి. నామేశ్వరాలయం నుంచి సూర్యాపేట బర్లపెంట బజార్లోని శ్రీఅన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి దేవాలయం వరకు సొరంగ మార్గం ఉంది. భూకంపం ప్రభావంతో కాలక్రమేణా పూర్తిగా పూడిపోయింది. పిల్లలమర్రి గ్రామంలో ఉన్న విఘ్నేశ్వరాలయం కాలగర్భంలో కలిసిపోయింది. ఏటా శివరాత్రికి జాతరశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పిల్లలమర్రిలో 5 రోజుల జాతర.. శివరాత్రికి ఒకరోజు ముందు ప్రారంభం అవుతుంది. మొదటి రోజు గణపతి పూజతో మొదలుకొని రెండోరోజు శివరాత్రి లింగోద్భవకాలంలో కల్యాణం, మూడోరోజు ర«థోత్సవం, నాలుగవరోజు అగి్నగుండాలు, చివరి రోజున సాయంత్రం త్రిశూల స్నానం, ఏకాంత సేవ నిర్వహణతో జాతర ముగుస్తుంది. భారీగా భక్తుల రాకసూర్యాపేటకు ఆనుకుని ఉండటం, విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారికి చేరువలో ఉండటంతో జాతర సమయంలో భక్తులు అ«ధిక సంఖ్యలో వస్తుంటారు. చుట్టుపక్కల జిల్లాలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా భక్తులు రావటం విశేషం.పట్టించుకోని ప్రభుత్వంఈ ఆలయాలకు ఆదరణ కరువైంది. వర్షాకాలంలో నీళ్లు కారుతూ పాకురుపట్టింది. శిథిలావస్థకు చేరువలో ఉంది. ఆదాయం తక్కువగా ఉందని ఆర్థిక మిగులు బాటు లేదని ప్రభుత్వం దేవాదాయశాఖ పట్టించుకోకపోవడం శోచనీయం. ఆలయ ప్రాంగణంలో మంచినీటి బావులు.. ఇక్కడ మంచినీటి బావులకు ప్రత్యేక స్థానం ఉంది. 11వ శతాబ్దంలో రేచర్ల రాజులు బావులు తవ్వించారు. నాటి నుంచి నేటి వరకు అదే నీటితో అభిషేకాలు చేస్తున్నారు. కరువులోనూ ఈ బావులు ఎండకపోగా.. గ్రామస్తులు, రైతులు ఈ నీటిని తోడినా మళ్లీ అదే స్థాయిలోకి నీరు ఉండటం విశేషం. కరువు కాలంలో పక్కన ఉన్న మూసీ నది, చెరువులు అడుగంటినా ఈ బావి నీటిమట్టం తగ్గకపోవటం విశేషం.త్రికూటేశ్వరాలయం.. త్రికూటేశ్వరాలయం, సరస్వతీదేవి సమేత బ్రహ్మ దేవాలయాలను రేచర్ల బేతిరెడ్డి భార్య ఎరకసానమ్మ నామేశ్వర దేవాలయం ప్రాంగణంలోనే నిర్మించారు. త్రికుటేశ్వరాలయంలో మూడు శివలింగాలు ఒకే నందీశ్వరునితో ప్రతిష్టించారు. ఇక్కడి నంది ఉత్తరం వైపుగా తలతిప్పి ఉంటుంది. ఎడమ కన్నుతో దక్షిణ, పడమర ఆలయంవైపు కుడి కన్నుతో ఉత్తరం వైపు ఉన్న ఆలయాన్ని చూస్తున్నట్లుగా ఉంటుంది. అన్ని శివాలయాలలో ప్రాణమట్టాలు ఉత్తరంవైపుగా ఉంటాయి. కానీ ఈ త్రికుటేశ్వరాలయంలో మాత్రం ఎదురుగా ఉన్న ఆలయంలో ఉత్తరం వైపు, ఉత్తరం, దక్షిణం వైపు ఉన్న ఆలయాల్లో మాత్రం తూర్పువైపుగా ప్రాణమట్టాలు ఉన్నాయి.ప్రపంచంలోఈ విగ్రహం ఒక్కటే.. సరస్వతీదేవి సమేత బ్రహ్మ ఆలయంలో నెమలి వాహనంపై బ్రహ్మ సరస్వతీదేవి ఏకశిలపై ఒకే విగ్రహంగా దర్శనమిస్తారు. ప్రపంచంలో ఇలాంటి విగ్రహం ఇది ఒక్కటి మాత్రమే ఉండటం విశేషం. కవి పిల్లలమర్రి పినవీరభద్రుడు అమ్మవారిని దర్శించి కటాక్షం పొంది కవిగా ప్రసిద్ధి చెందాడని నానుడి. పిల్లలమర్రి గ్రామంలో పురాతన శ్రీచెన్నకేశవస్వామి ఆలయం, హనుమ ఆలయాలు కూడా ఉన్నాయి.ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి పిల్లల మర్రి ఆలయాలకు 12 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిపై వచ్చే ధనాన్ని వెచ్చించి ధూపదీప నైవేద్యం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విజయవాడ–హైదరాబాద్ రహదారికి ఖమ్మం బైపాస్కి పిల్లలమర్రి గ్రామం మీదుగా లింక్ రోడ్డు వేస్తే భక్తుల రాకపోకలకు, ఆలయాభివృద్ధికి దోహదపడుతుంది. భక్తుల కోసం వసతి గృహాలు కట్టిస్తే బాగుంటుంది. వర్షాకాలంలో నీరు కారి ఆలయ పైకప్పు ప్రాకారాలు పాకురు పడుతున్నాయి. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి. – మునగలేటి సంతోష్ శర్మ, ప్రధాన అర్చకుడు -
అమెరికా సంబంధమా.. అసలే వద్దు!
‘అగ్రరాజ్యంలో ఉద్యోగం. డాలర్లలో జీతం, పెళ్లయితే ఇద్దరూ కలిసి బాగా సంపాదిస్తారు. కార్లు, బంగళాలు అన్నీ వచ్చేస్తాయి. పిల్లలు అమెరికా పౌరులవుతారు. సొంత ఊళ్లో ఏమున్నా లేకపోయినా అమెరికాలో ఉద్యోగం ఉంటే చాలదా? బంగారంలాంటి అమెరికా సంబంధాన్ని వదులుకోవడం కంటే మూర్ఖత్వం మరొకటి ఉంటుందా?’.. నిన్నమొన్నటి వరకు తెలుగువాళ్లలో అమెరికా సంబంధాలపై ఉన్న అభిప్రాయమిది.ఇప్పుడు అమెరికా పేరెత్తితేనే బాబోయ్ మాకొద్దు ఆ సంబంధం అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడానికి ముందు, తరువాత అన్నట్లుగా అమెరికా పెళ్లి సంబంధాల పరిస్థితి తయారైంది. ట్రంప్ ఆంక్షలకు ముందు కుదుర్చుకున్న పెళ్లి సంబంధాలు సైతం రద్దవుతున్నాయి. మధ్యతరగతి వర్గాల నుంచి సంపన్న కుటుంబాల వరకు ఇదే పరిస్థితి ఉంది. – సాక్షి, హైదరాబాద్ఈ అనిశ్చితి మరో రెండేళ్లు ఉండొచ్చు ఇది ఒకవిధంగా కష్టకాలమే. ఈ అనిశ్చితి మరో రెండేళ్లు ఉంటుందేమో అనిపిస్తోంది. ఏదో ఒక పరిణామం జరిగి ట్రంప్ మారితే తప్ప ఇప్పట్లో పరిస్థితులు మారుతాయని భావించలేము. – హిమబిందు, కాన్వోకేషన్స్స్కే్వర్, ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ.అంతులేని వీసా కష్టాలుఆ అబ్బాయి షికాగోలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాది క్రితం హైదరాబాద్లోని చిక్కడపల్లికి చెందిన ఒక అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. గత నెలలో పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు భావించాయి. కానీ డిపెండెంట్ వీసాలపై అమెరికా ఆంక్షలు విధించటంతో ఇప్పుడు ఆ కుటుంబాలు పునరాలోచనలో పడ్డాయి. ‘చేసుకుంటే అమెరికా అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి’అని కలలుగన్న ఆ అమ్మాయి ఇప్పుడు ‘ఏ హైదరాబాదీ అయినా సరే పెళ్లికి రెడీ’అంటోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన భార్యాభర్తలు కొంతకాలంగా అమెరికాలోని ఒహాయోలో ఉంటున్నారు. భర్తకు హెచ్–1 వీసా ఉంది.హెచ్–4 వీసాపై రెండేళ్ల క్రితం భార్యను తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తరువాత ఆమె రెండుమూడు కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నట్లు ప్రభుత్వం వద్ద నమోదు చేసుకుంది. ఇటీవల సొంత ఊరుకు వచ్చిన ఆ జంట తిరిగి అమెరికాకు వెళ్లారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎయిర్పోర్టులోనే ఆమెను నిలిపివేసి, ఉద్యోగాల గురించి ఆరా తీశారు. ఆమె పనిచేస్తున్నట్లు చెప్పిన కంపెనీల హెచ్ఆర్ విభాగాలు ఆ విషయాన్ని ధ్రువీకరించకపోవడంతో ఆమె వీసాను ఫ్రీజ్ చేశారు. గత్యంతరం లేక ఆమె భారత్కు తిరిగి రావాల్సి వచ్చింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు కూడా వీసాలు రద్దయిపోతున్న పరిస్థితి ఉంది. ట్రంప్ ఆంక్షలు ప్రారంభమైన తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు రెండున్నర నెలల్లోనే సుమారు వేయి మంది తెలుగువాళ్లు వివిధ కారణాలతో వెనుదిరిగి విచ్చినట్లు హైదరాబాద్కు చెందిన కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్నాయి. మరోవైపు కొత్తగా వీసాల దరఖాస్తు చేసుకున్న వేలాది మంది ఆశలు వదిలేసుకున్నారు. ఈ అనిశ్చితి కారణంగా పెళ్లి సంబంధాలు రద్దుకావడం, వాయిదా వేసుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అమీర్పేట్లో ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న హిమబిందు తెలిపారు. అమెరికా సంబంధాల కోసం మ్యారేజ్ బ్యూరోల్లో దరఖాస్తు చేసుకున్నవాళ్లు సైతం విరమించుకుంటున్నట్లు చెప్పారు.అమెరికా పౌరులైతేనే భద్రత చాలాకాలంగా అమెరికాలో ఉండి గ్రీన్కార్డుదారులుగా స్థిరపడ్డవాళ్లకు కూడా ఇప్పుడు భద్రత లేకుండా పోయింది. సాధారణంగా ఏడేళ్లకు పైగా అక్కడ ఉంటే గ్రీన్కార్డు లభించే అవకాశం ఉంది. కానీ ఏడెనిమిదేళ్ల తరువాత వివిధ కారణాల వల్ల తిరిగి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడుతున్నవాళ్లు ఇప్పుడు తమ గ్రీన్కార్డులను వదులుకోవాల్సి వస్తోంది.సాధారణంగా గ్రీన్కార్డుదారులు తమ గుర్తింపును కొనసాగించాలంటే అమెరికాలోనే ఉంటున్నట్లు నమోదు కావాలి. అందుకో సం ప్రతి 6 నెలలకు ఒకసారి అమెరికా వెళ్లి వస్తారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇలాంటివారి గ్రీన్కార్డులను కూడా రద్దు చేస్తుండటంతో భద్రత లేకుండా పోయింది. అమెరికా పౌరసత్వం కలిగిన వాళ్లకు మాత్రమే ఇప్పుడు పూర్తి భద్రత ఉందని హిమబిందు తెలిపారు. అలాంటి కుటుంబాల్లో సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవడానికి కొంత అవకాశాలు ఉన్నాయి. పాతకాలపు ‘నయా’ట్రెండ్డాలర్ డ్రీమ్స్ కరిగిపోవటంతో పెళ్లి సంబంధాల్లో పాతకాలపు పద్ధతులకు మళ్లీ పెద్దపీట వేస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం, పెద్ద చదువుల జోలికి వెళ్లకుండా సొంత ఊళ్లో ఏ మేరకు ఆస్తి ఉంది? ఎన్ని ఎకరాల భూమి ఉంది? హైదరాబాద్లో సొంత ఫ్లాట్, ఇల్లు వంటివి ఉన్నాయా? ఉన్న ఊళ్లో సదరు కుటుంబానికి ఎలాంటి గౌరవ మర్యాదలు ఉన్నాయి? వంటి అంశాలను ఆరా తీసి సంబంధాలను ఎంపిక చేసుకుంటున్నారు. ‘అమెరికా అబ్బాయిల కోసం ఎదురుచూసేందుకు అమ్మాయిలు నిరాకరిస్తున్నారు. చాలామంది ఇప్పుడు డిగ్రీ చేసిన వాడైనా సరే కుటుంబ భద్రత బాగుంటే చాలని భావిస్తున్నారు’అని హైదరాబాద్లోని ఒక ప్రముఖ వివాహ పరిచయవేదిక ప్రతినిధి ఒకరు చెప్పారు. -
మహిళామణులు
తరాలు మారాయి. అంతరాలు పోతున్నాయి. ఒకప్పుడు మహిళలంటే.. వంటింటికే పరిమితమని.. నాయకత్వ బాధ్యతలకు పనికిరారని ఉండేవన్నీ అపోహలే అని తేలిపోతోంది. ‘ముదితల్ నేర్వగరాని విద్య గలదే.. ముద్దార నేర్పించినన్..’ అన్నది రుజువవుతోంది. పదుగురికీ ఉపాధి కల్పించే సంస్థల్లో నాయకత్వ బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. ఒకరు ఇద్దరుగా.. ఇద్దరు నలుగురిగా.. మొదలైన మహిళల ప్రస్థానం నేడు అక్షరాలా లక్షల్లోకి చేరింది. సాక్షి,అమరావతి: దేశంలో అన్ని రంగాల్లోని కంపెనీల్లో మహిళల విశిష్ట పాత్ర పెరుగుతోంది. కంపెనీల్లో మేనేజర్ నుంచి కంపెనీ డైరెక్టర్లు, అత్యున్నత స్థాయిలోనూ రాణిస్తున్నారు. 2017 నుంచి 2025 వరకు దేశంలోని కంపెనీల కీలక స్థానాల్లో మహిళల పాత్ర పెరుగుదలను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విశ్లేíÙంచింది. ‘మహిళలు–పురుషులు–2024’ నివేదికలో ఆ వివరాలు వెల్లడించింది. కంపెనీ బోర్డు డైరెక్టర్ల పదవుల్లో 2017లో 4.47 లక్షల మంది మహిళలుండగా, 2025 నాటికి ఈ సంఖ్య 9.08 లక్షలకు పెరిగినట్లు ఈ నివేదిక తెలిపింది.సీనియర్ మేనేజ్మెంట్ పదవుల్లో 2017లో 23 వేల మంది మహిళలుండగా 2025 నాటికి 38 వేలకు పెరిగారు. ఇతర నిర్వహణ పదవుల్లో 2017లో 4.32 లక్షల మంది మహిళలుండగా 2025 నాటికి 8.83 లక్షలకు పెరిగారు. ఇతర సీనియర్ నిర్వహణ పదవుల్లో పురుషులు, మహిళల నిష్పత్తి 2017లో 1:0.36 ఉండగా 2025 నాటికి 0.41కి పెరిగింది. బోర్డు డైరెక్టర్ల పదవుల్లో మహిళల నిష్పత్తి 0.35 నుంచి 0.40కి పెరిగింది. ఈ పదవుల్లో మహిళల నిష్పత్తి 0.16 నుంచి 0.20 మాత్రమే పెరిగింది. ఇక్కడ లింగ అంతరాలను మరింత తగ్గించాల్సి ఉందని నివేదిక పేర్కొంది.ఈ ఎంఎస్ఎంఈలకు మహిళలే మహారాణులుదేశంలోని ఎంఎస్ఎంఈల్లో ‘ఉద్యమ్’ పోర్టల్లో నమోదైన వాటిలో 2020 జులై 1 నుంచి 2024 సెప్టెంబరు 31 నాటికి.. మహిళలు యజమానులుగా ఉన్నవి 66,61,675. వీటిలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగులు 4.05 కోట్లకుపైనే. మహిళా శక్తికి ఇదొక నిదర్శనం. ఈ ఎంఎస్ఎంఈల్లో 25 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్న రాష్ట్రాలు 7 మాత్రమే. అందులో దక్షిణాది రాష్ట్రాలే 4 ఉండటం విశేషం. -
పుట్టి.. మళ్లీ కడుపులోకి వెళ్లి.. మళ్లీ పుట్టి
బ్రిటన్లో రాఫర్టీ ఇసాక్ అనే పిల్లాడు రెండు సార్లు పుట్టాడు. ఒకసారి జన్మించిన పిల్లాడు పెరిగి పెద్దవాడయ్యాక ముదిమి వయసులో చనిపోతే తర్వాత జన్మలో కదా పుట్టేది అని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఈ పిల్లాడు ‘సాంకేతికంగా’రెండుసార్లు జన్మించాడు. తల్లికి క్యాన్సర్ కణుతులు పెరిగి క్యాన్సర్ రెండో స్టేజీకి చేరుకున్నాక తప్పనిసరి పరిస్థితుల్లో అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. అప్పటికి పిల్లాడు ఇంకా 20 వారాల వయసులో గర్భస్త పిండంగా గర్భాశయంలోనే ఉన్నాడు. ఆలస్యం చేస్తే పిల్లాడు బతుకుతాడేమోగాని క్యాన్సర్ ముదిరి తల్లి ప్రాణాలు వదలడం ఖాయం. ఈ పరిస్థితుల్లో అత్యంత నిష్ణాతుడైన డాక్టర్ సాల్మనీ మజిద్ తన 15 మంది వైద్య బృందంతో కలసి చాలా సంక్లిష్టమైన ఆపరేషన్ చేసి అటు తల్లిని, ఇటు గర్భస్థ శిశువును సంరక్షించాడు. అరుదైన ఆపరేషన్ బ్రిటన్లోని ఆక్స్ఫర్ట్ ప్రాంతానికి చెందిన లూసీ ఇసాక్ వృత్తిరీత్యా టీచర్. 32 ఏళ్ల లూసీ గత ఏడాది గర్భందాల్చింది. గర్భిణి కావడంతో సాధారణ అ్రల్టాసౌండ్ పరీక్ష చేయించడంతో అనూహ్యంగా ఓవరీ క్యాన్సర్ బారిన పడ్డట్లు తేలింది. గర్భంతో ఉన్న కారణంగా కీహోల్ తరహాలో శస్త్రచికత్స చేయడం కుదరలేదు. అలాగని గర్భాన్ని తొలగించలేని పరిస్థితి. దాంతో పిండాన్ని ప్రసవం తరహాలో అలాగే బయటకు తీసుకొచ్చి బయట క్షేమంగా పక్కనే పెట్టి తల్లిని శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా జాన్ రాడ్క్లిఫ్ ఆస్పత్రిలో వైద్యుల బృందం రంగంలోకి దిగి గర్భస్త పిండాన్ని బయటకు తీశారు. తల్లి శరీరంతో అనుసంధానమైన రక్తనాళాలు, కణజాలం జోలికి వెళ్లలేదు. వెచ్చగా పొత్తికడుపులో ఉండాల్సిన పిండం బయటి వాతావరణంలో మనగలగడం అసాధ్యం. అందుకే వెచ్చని ‘సలీన్’బ్యాగ్లో పెట్టారు. దాదాపు ఐదు గంటలపాటు కష్టపడి తల్లి ఓవరీ క్యాన్సర్ కణాలను వైద్యులు తొలగించారు. బ్యాగులో పిండం ఆరోగ్యపరిస్థితిని ఇద్దరు వైద్యుల బృందం అనుక్షణం గమనించింది. ప్రతి 20 నిమిషాలకొకసారి బ్యాగును మార్చారు. ఈలోపు ఆపరేషన్ను పూర్తిచేసి గర్భాశయాన్ని మళ్లీ తల్లి పొత్తికడుపులో పెట్టి కుట్లేశారు. ఇలా ఆపరేషన్ను విజయవంతం చేశారు. ఈ ఏడాది జనవరిలో నిండు గర్భిణిగా మళ్లీ ఆస్పత్రికి వచ్చిన లూసీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పిల్లాడు పుట్టినప్పుడు 2.86 కేజీల బరువున్నాడు. ఇలా రెండు సార్లు పుట్టిన పిల్లాడిగా రాఫర్టీ అరుదైన ఘనత సాధించాడు. ఆపరేషన్ చేసిన వైద్యుడు సాల్మనీ మజిద్ను పిల్లాడి తల్లిదండ్రులు ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ‘‘మూడేళ్ల క్రితం నాకు మూత్రపిండ మారి్పడి శస్త్రచికిత్స జరిగింది. అలా నాకు అది పునర్జన్మ. క్యాన్సర్ బారిన పడి కూడా కోలుకుని నా భార్య లూసీ పునర్జన్మ ఎత్తింది. ప్రసవానికి ముందే పుట్టి మళ్లీ తల్లికడుపులోకి వెళ్లి మరోసారి పుట్టి నా కుమారుడు కూడా పునర్జన్మ ఎత్తాడు’’అని పిల్లాడి తండ్రి ఆడమ్ ఆనందంగా చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Rakhaldas Banerjee: ఆయనకింకా ఆ క్రెడిట్ దక్కలేదు!
భారతదేశంలో 5,300 సంవత్సరాలకు పూర్వమే గొప్ప నాగరికత వషిల్లింది. అదే సింధూలోయ నాగరికత లేదా హరప్పా నాగరికత. ప్రణాళికాబద్ధమైన వీధులు, ఇళ్లు, మురుగు నీటి వ్యవస్థతో ఈ నాగరికత ఇప్పటి ఆధునిక నగరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండేది. 1990వ దశకం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో సింధూలోయ నాగరికత ఆనవాళ్లు బయటపడ్డాయి. భూమి పొరల కింద శతాబ్దాలుగా కప్పబడి ఉన్న శిథిలాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అవిశ్రాంతమైన తవ్వకాలతో ఈ గొప్ప నాగరికతను నేటి తరానికి పరిచయం చేశారు. ఈ మహాయజ్ఞం వెనుక ఉన్నది ఎవరో తెలుసా? భారతీయుడైన రఖల్దాస్ బెనర్జీ. కానీ, మొత్తం క్రెడిట్ కొట్టేసింది మాత్రం అప్పటి భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్ఐ) చీఫ్, బ్రిటిష్ జాతీయుడైన జాన్ మార్షల్. సింధూలోయ నాగరికతను బయటపెట్టింది జాన్ మార్షల్ అని బ్రిటిష్ ప్రభుత్వం లోకాన్ని నమ్మించింది. పాఠ్య పుస్తకాల్లోనూ అదే చేర్చారు. ఇప్పటికీ పిల్లలు అదే చదువుకుంటున్నారు. కానీ, వాస్తవం అది కాదని చరిత్రకారులు, పరిశోధకులు తేల్చిచెబుతున్నారు. అసలైన కథానాయకుడు రఖల్దాస్ బెనర్జీ అనామకంగా ఉండిపోవడానికి కారణం ఏమిటి? అసలు ఆయనెవరు? ఆ మహా మనిషిని మనం ఎందుకు మర్చిపోయాం? చిన్నప్పుడే చరిత్రపై ఆసక్తి పురావస్తు పరిశోధకుడైన రఖల్దాస్ బెనర్జీ 1885లో పశ్చిమ బెంగాల్లో ఓ సంపన్న కుటుంబంలో జని్మంచారు. బహరాంపూర్ పట్టణంలో పెరిగారు. ఆ మధ్య యుగాల నాటి కట్టడాలు అధికంగా ఉండేవి. ఆయన వాటిని చూస్తూ ప్రాచీన నాగరికతలు, చరిత్రపై ఆసక్తి పెంచుకున్నారు. కాలేజీలో చేరి చరిత్రను అధ్యయనం చేశారు. మధ్యయుగ భారతదేశ చరిత్రపై వ్యాసం రాసే బాధ్యత అప్పగించగా, అందుకోసం స్వయంగా పరిశోధన ప్రారంభించారు. పొరుగు రాష్ట్రం వెళ్లి అక్కడి శిల్పాలు, రాతపత్రులను పరిశీలించారు. దాంతో చరిత్ర, నాగరికతలపై ఆసక్తి మరింత పెరిగింది. 1910లో ఏఎస్ఐలో ఎక్సవేషన్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరారు. చురుకైన వ్యక్తి కావడంతో తక్కువకాలంలోనే సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు స్థాయికి ఎదిగారు. 1917లో విధుల్లో భాగంగా పశ్చి మ భారతదేశానికి చేరుకున్నారు. 1919లో సింధూ ప్రాంతంలోని మొహెంజోదారోలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్తో లర్కానాలో జిల్లాలో ఉంది. ఇప్పటికైనా గుర్తింపు దక్కేనా? సింధూలోయలో ప్రాచీన నగరాన్ని తవ్వకాల్లో బయటకు తెచ్చిన ఘనత నిశ్చయంగా రఖల్దాస్ బెనర్జీదే. అందుకోసం ఆయన ఎంతగానో కష్టపడ్డారు. వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకున్నారు. కానీ, ఒక భారతీయుడికి ఆ పేరు ప్రఖ్యాతలు దక్కడం బ్రిటిష్ ప్రభుత్వానికి ఇష్టం లేకపోయింది. ఆయనపై ఎన్నో అభియోగాలు మోపింది. అంతేకాకుండా రఖల్దాస్ది ధిక్కరించే తత్వం. తనపై ఎవరైనా పెత్తనం చెలాయించాలని చూస్తే సహించేవారు కాదు. ఈ లక్షణమే ఆయనను బ్రిటిష్ అధికారులకు విరోధిగా మార్చింది. నిధులు దురి్వనియోగం చేశారని, అవినీతికి పాల్పడ్డారని రఖల్దాస్పై నిందలు మోపారు. అరుదైన శిల్పాలు, పెయింటింగ్లు దొంగిలించారని ఆరోపించారు. మధ్యప్రదేశ్లో చోరీకి గురైన ఒక బుద్ధిస్టు దేవత విగ్రహం కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు. అవమానాలు భరించలేక ఆయన 1927లో ఏఎస్ఐలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. కానీ, ఆయనపై వచ్చిన అభియోగాలను తర్వాత కోర్టులు కొట్టివేశాయి. ఉపాధి కోసం రఖల్దాస్ 1928లో బనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. 1930లో మరణించారు. అప్పుడు ఆయన వయసు కేవలం 45 ఏళ్లు. గొప్ప చరిత్రను వెలికితీసిన రఖల్దాస్కు చివరకు చరిత్రలో స్థానం లేకుండాపోవడం ఒక వైచిత్రి. ఇప్పటి తరానికి ఆయనెవరో తెలియదు. సింధూలోయలో ప్రాచీన నగరా>న్ని సందర్శించేవారికి కూడా ఆయన గొప్పతనం ఏమిటో తెలిసే అవకాశం లేదు. ఇప్పటికైనా భారత ప్రభుత్వం స్పందించాలని, రఖల్దాస్ బెనర్జీకి తగిన గుర్తింపు ఇవ్వాలని చరిత్రకారులు కోరుతున్నారు. 5,300 ఏళ్ల నాటి నగరం మొహెంజోదారో అంటే సింధీ భాషలో మృతిచెందిన మనిషి దిబ్బ అని అర్థం. ఇదే చోట రఖల్దాస్ బెనర్జీ తవ్వకాలు ప్రారంభించారు. తొలుత బౌద్ధ స్తూపాలు, నాణేలు, ముద్రలు, కుండలు, ఇతర కళాకృతులు లభించాయి. మరిన్ని ఆధారాల కోసం 1922, 1923లో తవ్వకాలు ఊపందుకున్నాయి. ప్రాచీన సింధూలోయ నాగరికత బయటపడింది. కాల్చిన ఇటుకలతో నిర్మించిన అప్పటి భవనాలు, నీటి తొట్టెలు, స్నానపు గదులు, రహదారులు వెలుగులోకి వచ్చాయి. ఇది 5,300 ఏళ్ల క్రితం నాటిదని తేల్చారు. సింధూనది లోయ 3.86 లక్షల చదరపు మైళ్ల మేర విస్తరించి ఉండేది. ఈశాన్య అఫ్గానిస్తాన్ నుంచి వాయువ్య భారత్ దాకా గొప్ప రాజ్యం వర్థిల్లింది. తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వరదల కారణంగా చాలావరకు తుడిచిపెట్టుకుపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మీ రైస్లో ఆర్సెనిక్ ఉందా!?
వరి. విశ్వవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలకు నిత్యం కడుపునింపే అమృతం. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఎన్ని చిరుతిళ్లు, ఇతర చల్లనిపానీయాలు తాగినా కాస్తంత వరి అన్నంతో భోజనం చేస్తేనే కడుపు నిండిన సంతృప్తికర భావన కల్గుతుంది. జీవకోటి ప్రాణాలు నిలుపుతున్న వరిలో ఇప్పుడు అత్యంత విషపూరిత ఆర్సెనిక్ మూలకం స్థాయిలు ఎక్కువ అవుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి చేదు నిజాన్ని బయటపెట్టింది. యథేచ్ఛగా జరుగుతున్న మానవ కార్యకలాపాలు, అడవుల దహనం, శిలాజ ఇంధనాల వాడకంతో వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. ఇప్పుడీ వాతావరణ మార్పుల విపరిణామాలు వరి పంటలపై పడుతున్నాయని స్పష్టమైంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగి, కార్భన్డయాక్సైడ్, కర్భన ఉద్గారాల స్థాయిలు పెరగడంతో వాటి కారణంగా పొల్లాల్లో మట్టి, నీటి నుంచి ఆర్సెనిక్ మూలకం అత్యధికంగా వరిధాన్యంలోకి చేరుతోంది. విషాల రారాజుగా పేరొందిన ఆర్సెనిక్ పాళ్లు వరిలో పెరిగితే ఆరోగ్యంపై దాని దు్రష్పభావాలు దారుణంగా ఉంటాయి. ఆర్సెనిక్ స్థాయి పెరిగిన వరి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటే చర్మ, ఊపిరితిత్తుల సంబంధ క్యాన్సర్లతో పాటు ఎన్నోరకాల తీవ్ర ఆరోగ్య సమస్యలు మనిషిని చుట్టుముట్టడం ఖాయం. రక్తసరఫరా, రోగ నిరోధక వ్యవస్థలు, కాలేయం, మూత్రపిండాలు, మూత్రాశయం, చర్మం, ప్రోస్టేట్ గ్రంథి వంటి శరీర భాగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హృద్రోగ సమస్యతోపాటు మధుమేహ వ్యాధి ప్రబలే ప్రమాదముంది. గర్భిణుల్లో పిండం సరిగా ఎదగపోవడం, అకాల మరణాలు సంభవించే ముప్పు ఉంది. వాతావరణ మార్పుల కారణంగా వాతావరణంలోని వెలువడుతున్న అధిక కర్భన ఉద్గారాలు, ఉష్ణోగ్రతల పెరుగుదలతో అమృతాహారం కాస్తా విషాహారంగా మారుతున్న వైనాన్ని శాస్త్రవేత్తలు వివరించారు. కొలంబియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల బృందం చేసిన ఈ అధ్యయన ఫలితాలు ‘లాన్సెట్ ప్లానిటరీ హెల్త్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అకర్బన ఆర్సెనిక్తో మరింత ప్రమాదం ఆర్సెనిక్ కర్భన, అకర్బన రూపాల్లో సహజంగానే నేల పొరల్లో ఉంటుంది. మానవునికి అకర్బన ఆర్సెనిక్తో పోలిస్తే అకర్బన ఆర్సెనిక్తో ముప్పు చాలా ఎక్కువ. వరిపంట మడుల్లో నీటితో నింపినప్పుడు మట్టిలోని ఆర్సెనిక్ వరినాట్ల ద్వారా వరిధాన్యంలోకి చేరుతుంది. అధ్యయనంలో భాగంగా పదేళ్లపాటు చైనాలో వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో సాగుచేస్తున్న 28 రకాల వరి వంగడాలపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, వాతావరణంలో కార్భన్డయాక్సైడ్ స్థాయిలు పెరిగినప్పుడు ఆర్సెనిక్ శోషణ స్థాయిలూ పెరుగుతున్నాయి. దీంతో వరి ధాన్యంలో ఆర్సెనిక్ స్థాయిలు ఎక్కువవుతున్నాయి. ఇలాగే కొనసాగితే ఒక్క చైనాలోనే వరి అన్నం తినడం వల్ల 1.93 కోట్ల క్యాన్సర్ కేసులు పెరుగుతాయని న్యూయార్క్లోని కొలంబియా వర్సిటీలోని వాతావరణ ఆరోగ్య శాస్త్ర సహాయ అధ్యాపకులు, ఈ పరిశోధనలో సహ రచయిత లెవీస్ జిస్కా చెప్పారు. ఉష్ణోగ్రత మరో 2 డిగ్రీల సెల్సియస్ పెరిగితే మరో పాతికేళ్లలో వాతావరణంలో కార్బన్డయాక్సైడ్ ప్రతి 10 లక్షలకు 200 పాళ్లు ఎక్కువవుతుందని ఆయన పేర్కొన్నారు. మతలబు అంతా వరిమళ్లలోనే వేల సంవత్సరాల క్రితం వరిసాగు లేదు. అక్కడక్కడా పెరిగిన వరికంకుల నుంచే వరిధాన్యాన్ని సేకరించి వండుకుని తిన్నారు. ఆ వరిమొక్కల మొదళ్ల వద్ద ఎలాంటి నీరు నిల్వ ఉండేదికాదు. ఇప్పుడు నాగరిక సమాజంలో మడులు కట్టి నీటిని నిల్వచేసి వరిసాగు చేస్తున్నారు. వరి మొక్కల మొదళ్ల వద్ద పూర్తిగా నీరు ఉంటుంది. దీంతో మట్టిలో సహజ ఆక్సిజన్ ఉండదు. దీంతో మొక్క వేర్ల వద్ద అన్ఎరోబిక్ బ్యాక్టీరియా శక్తి సంగ్రహణ కోసం ప్రత్యామ్నాయంగా ఆర్సెనిక్ అణువులను లాగేస్తుంది. అలా గతంలో పోలిస్తే ఆర్సెనిక్ వరిధాన్యంలోని వచ్చి చేరుతోంది. కాలుష్యం, తదితర మానవ ప్రేరేపిత వాతావరణ మార్పుల కారణంగా నేలలో కర్భన ఉద్గారాలు పెరిగి, ఉష్ణోగ్రత ఎక్కువై ఈ ఆర్సెనిక్ సంగ్రహణ రేటు పెరుగుతోంది. అరికట్టే మార్గాలున్నాయి వరిధాన్యంలోని ఆర్సెనిక్ వంట ద్వారా ఒంటిలోకి చేరకుండా అడ్డుకునే చిట్కాలున్నాయి. బ్రౌన్ రైస్తో పోలిస్తే తెల్ల బియ్యంలో పోషకాలు తక్కువ. అలాగే ఆర్సెన్ పాళ్లు కూడా తక్కువే. అందుకే బ్రౌన్రైస్ బదులు తెల్ల అన్నం తింటే కాస్త దీని ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ఇతర రకాలతో పోలిస్తే బాస్మతి రకం బియ్యంలోనూ ఆర్సెనిక్ తక్కువగా ఉంటుంది. ఆగ్నేయాసియా, అమెరికా, యూరప్ దేశాల్లోని రకాలతో పోలిస్తే తూర్పు ఆఫ్రికాలో దొరికే వరిలో ఆర్సెనిక్ తక్కువగా ఉంటోంది. ‘‘ అప్పటికే మరుగుతున్న నీటిలో బియ్యాన్ని పోసి ఉడకబెట్టండి. ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ నీటినంతా పారబోయండి. తర్వాత మళ్లీ కొత్తగా నీళ్లు జతచేసి అన్నం వండండి. గంజి వార్చకండి’’ అని బ్రిటన్లోని షెఫీల్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు. ‘‘ వండటానికి ముందు బియ్యాన్ని బాగా కడగండి. తర్వాత ఒక పాలు బియ్యానికి, ఆరు పాళ్ల నీటిని జతచేసి వండండి’’ అని బ్రిటన్ ఆహార ప్రమాణాల ప్రాధికార సంస్థ సూచించింది.బ్రౌన్ రైస్ కంటే తెల్ల అన్నమే మంచిది ! ‘‘బ్రౌన్ రైస్లో అకర్బన ఆర్సెనిక్ ఎక్కువగా ఉంటుంది. తెల్ల అన్నంలో ఇది తక్కువగా ఉంటుంది. విషపూరిత ఆర్సెనిక్ కోణంలో చూస్తే ఆహారంగా బ్రౌన్ రైస్ కంటే పాలిష్ చేసిన తెల్ల అన్నమే మంచిది’’ అని శాస్త్రవేత్తలు చెప్పారు. తెల్ల అన్నంతో పోలిస్తే ముడి అన్నం, బ్రౌన్ రైస్ మంచివి అంటూ జనం కొత్తపోకడలో వెళుతున్న ఈ తరుణంలో శాస్త్రవేత్తలు తెల్ల అన్నమే ఉత్తమమని చెప్పడం గమనార్హం. ‘‘ వరిధాన్యంలో ఆర్సెనిక్ స్థాయిని తేల్చేందుకు ప్రపంచంలో విస్తృతస్థాయిలో జరిగిన తొలి అధ్యయనం ఇది’’ అని బెల్ఫాస్ట్లోని క్వీన్స్ యూనివర్సిటీ బయోలాజికల్ సైన్సెస్ విభాగ ప్రొఫెసర్ ఆండ్రూ మెహార్గ్ చెప్పారు. రంగు, రుచి, వాసన ఉండదు ఆర్సెనిక్ విషపూరితమైనదని ప్రాచీన మానవులకు కూడా తెలుసు. ఇది ఎలాంటి రంగు, రుచి, వాసన ఉండదు. ప్రాచీనకాలంలో రోమ్, యూరప్ దేశాల్లో శత్రువులను చంపేసేందుకు ఆర్సెనిక్ను ఇచ్చేవారని కథలు కథలుగా చెప్పేవారు. అయితే అత్యల్ప స్థాయిలో దీనిని తీసుకుంటే వెంటనే ఎలాంటి ప్రభావం చూపించదుగానీ స్లో పాయిజన్లా పనిచేసి దీర్ఘకాలంలో శరీరంపై తీవ్ర దు్రష్పభావాలను చూపిస్తుంది. అకర్బన ఆర్సెనిక్ అణువులు మానవశరీరంలోని జీవఅణువులతో అత్యంత సులభంగా బంధం ఏర్పర్చుకుంటాయి. కర్బన ఆర్సెనిక్ సహజంగా శిలలు, నేలల్లో ఉంటుంది. అకర్బన ఆర్సెనిక్ ఎక్కువగా గనుల తవ్వకం, బొగ్గును కాల్చడం ఇతర పారిశ్రామిక కార్యకలాపాల వల్ల వాతావరణంలోకి చేరుతుంది. ఇది నీటిలో కరుగుతుంది. పారిశ్రామిక వ్యర్థాలు నదీజలాల్లోకి పారి ఆ నీటితో పండించే పంటల ద్వారా మానవ శరీరాల్లోకి చేరుతోంది. దక్షిణ అమెరికా, దక్షిణ, మధ్యాసియా దేశాల్లోని భూగర్భ జలాల్లోనూ అకర్బన ఆర్సెనిక్ ఉంటోంది. అమెరికాలో దాదాపు 21 లక్షల మంది ప్రజలు ఇలా అకర్బన∙ఆర్సెనిక్ ఉన్న నీటినే తాగుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితులను దాటిన ఆర్సెనిక్ ఉన్న జలాలనే ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల మంది జనం తాగుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
జూలైలో మెగా సునామీ?
సునామీ. మూడక్షరాలే అయినా, అది సృష్టించే విధ్వంసం ఎంతటిదో తెలియని వారంటూ ఎవరూ ఉండరు. 2004లో విరుచుకుపడ్డ సునామీ బీభత్సాన్ని ప్రపంచం ఎన్నిటికీ మర్చిపోలేదు. అనంతరం 2011లో భారీ సునామీ జపాన్ మొదలుకుని పలు దేశాలను అతలాకుతలం చేసేసింది. అలాంటి ఉత్పాతం మరోసారి వచ్చి పడితే? అది కూడా 2011, 2004ల్లో కంటే ప్రళయభీకర స్థాయిలో వస్తే? అదే జరగవచ్చట. అది కూడా ఎప్పుడో కాదు, వచ్చే జూలైలోనే! దాని తీవ్రత జపాన్ చరిత్రలోనే కనీ వినీ ఎరగని విధంగా ఉంటుందట. ఈ మేరకు జపాన్కు చెందిన ప్రఖ్యాత మాంగా ఆర్టిస్టు ర్యో తత్సుకీ చెప్పిన జోస్యం ఇప్పుడు చాలామందిని తీవ్రంగా కలవరపెడుతోంది. 2011 సునామీతో పాటు ఆమె గతంలో చెప్పినవెన్నో అక్షరాలా జరగడమే ఇందుకు కారణం. ఆ జాబితాలో 2020 నుంచి రెండేళ్లకు పైగా ప్రపంచానికి నిద్ర కూడా లేకుండా చేసిన కరోనా కూడా ఉంది! ఏమిటీ మాంగా? మాంగా అంటే జపాన్కే ప్రత్యేకమైన నవలలు, కార్టూన్లు. 70 ఏళ్ల తత్సుకీ ఈ కళలో ఆరితేరారు. పైగా ఇలస్ట్రేటర్గా కూడా ఆమెకు చాలా పేరుంది. అంతకుమించి భవిష్యద్రష్టగా కూడా తత్సుకీకి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. 1980ల నుంచీ ఆమె భవిష్యత్తు చెబుతున్నారు. ప్రిన్సెస్ డయానా మరణాన్ని కూడా ముందే చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, ‘నేను చూసిన భవిష్యత్తు (ద ఫ్యూచర్ దట్ ఐ సా)’పేరిట 1999లో ఆమె రాసిన మాంగా రేపిన దుమారం అంతా ఇంతా కాదు.సమీప భవిష్యత్తులో వచి్చపడనున్న ఎన్నెన్నో ప్రాకృతిక విపత్తులను గురించి అందులో తత్సుకీ ముందే పేర్కొన్నారు. ముఖ్యంగా 2011 మార్చి 11న ఏకంగా 9.1 తీవ్రతతో జపాన్ను కుదిపేసిన భయానక భూకంపం, దాని ఫలితంగా వచి్చపడ్డ భీకర సునామీ ధాటికి ఏకంగా 20 వేల మందికి పైగా మరణించారు. ఈ ఉత్పాతం గురించైతే తత్సుకీ అత్యంత స్పష్టంగా పేర్కొన్నారు. ‘2011లో భారీ ఉత్పాతం వచ్చి పడనుంది’అంటూ ఓ అధ్యాయమే రాశారు. అంతేకాదు, ‘2020లో అంతుపట్టని కొత్త రకం వైరస్ వ్యాప్తి పరాకాష్టకు చేరుతుంది’అంటూ మరోచోట కరోనా గురించి కూడా స్పష్టంగా పేర్కొన్నారు. రాకాసి బుడగలువచ్చే జూలైలో మెగా సునామీ రాబోతోందన్న తత్సుకీ, అది జపాన్ చరిత్రలోనే కనీవినీ ఎరగనంత తీవ్రమైనదని కూడా రాశారు. దాని ధాటికి జపాన్, తైవాన్, ఇండొనేసియా, ఉత్తర మరియానా దీవులు అతలాకుతలమైపోతాయని హెచ్చరించారు. ఆ దేశాలను అనుసంధానించే వజ్రాకృతితో కూడిన జోన్ నిండా ‘రాక్షస బుడగలు (రాకాసి అలలు) పడగలెత్తుతాయి’, ‘దక్షిణ జపాన్ సముద్రం మరిగిపోతుంది’అంటూ రాబోయే సునామీ తీవ్రతను వర్ణి0చారు. అంతేకాదు, దాని తీవ్రత 2011 నాటి సునామీ కంటే కనీసం మూడు రెట్లకు పై చిలుకేనని స్పష్టంగా పేర్కొన్నారు. దీనిపై కొద్ది రోజులుగా ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది. ఈ జోస్యం ఏ మేరకు నిజమవుతుందన్న దానిపై ఎవరి అంచనాల్లో వారున్నారు. గత 20 ఏళ్లలో తత్సుకీ చెప్పినవన్నీ జరిగినప్పుడు ఇది మాత్రం ఎందుకు జరగదని వాదించే వారు కొందరు. సునామీ వంటి ప్రాకృతిక విపత్తుల విషయంలో శాస్త్రీయ అంచనాలను నమ్ముకోవాలే తప్ప ఇలాంటి జోస్యాలను కాదని మరికొందరు కొట్టిపారేస్తున్నారు. చూడబోతే మాంగా పేరిట తత్సుకీ ఏకంగా ప్రపంచం పాలిట మరణశాసనమే రాసినట్టు కని్పస్తోందంటూ ఇంకొందరు వాపోతున్నారు. తన రాతలపై ఇంత దుమారం రేగుతున్నా 70 ఏళ్ల తత్సుకీ మాత్రం వాటిపై మౌనం వీడటం లేదు. గత శతాబ్దికి చెందిన బల్గేరియా మిస్టిక్, హీలర్ బాబా వంగా పేరిట ఆమెను ఇప్పుడంతా ‘జపనీస్ బాబా వంగా’అంటూ కీర్తిస్తున్నారు. అంధురాలైన బాబా వంగా కూడా ఇలాగే జరగబోయే విషయాలను ముందుగానే చెప్పి ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. కొసమెరుపు కరోనాకు సంబంధించి మనందరినీ మరింత వణికించేలా మరో జోస్యం కూడా చెప్పారు తత్సుకీ! అదేమిటో తెలుసా? మరో అయిదేళ్లలో అంటే 2030లో అది మరింత తీవ్రతతో వచ్చి పడుతుందట.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉల్కాపాతపు వెలుగులు
అంతరిక్ష వీక్షకులకు మరో రెండు రోజుల్లో పండుగే. లైరైడ్ ఉల్కాపాతం వారికి కావాల్సినంతగా కనువిందు చేయనుంది. ఉత్తరార్ధ గోళంలోని వారు ఏప్రిల్ 22న తెల్లవారుజాము నుంచి కనీసం రెండు రోజుల పాటు ఈ ఖగోళ అద్భుతాన్ని తనివితీరా ఆస్వాదించవచ్చు. మబ్బుల వంటివేమీ లేకుండా వాతావరణం పొడిగా, వీలైనంత చీకటిగా ఉంటే చాలు. గంటకు కనీసం 10 నుంచి 20 దాకా ఉల్కలు భూ వాతావరణంలోకి ప్రవేశించి ప్రకాశవంతంగా మండిపోతూ కని్పస్తాయి. ఒక్కోసారి వాటి సంఖ్య గంటకు 100 దాకా కూడా ఉంటుంది. ఈ వార్షిక ఖగోళ వింత సాధారణంగా ఏప్రిల్ 20 తర్వాత ఏర్పడుతూ ఉంటుంది. ఏమిటి ఇవి: ఏటా భూమిని పలకరించే ఈ ఉల్కలను లైరైడ్స్గా పిలుస్తారు. వీటి మూలాలు లైరా నక్షత్రరాశిలో ఉండటమే అందుకు కారణం. అక్కడినుంచి పుట్టుకొచ్చిన థాచర్ అనే తోకచుక్క ఈ ఉల్కలకు మాతృస్థానం. థాచర్ను 1861లో తొలిసారిగా గుర్తించారు. ఇది సూర్యుని చుట్టూ 415 ఏళ్లకు ఓసారి చొప్పున తిరుగుతుంటుంది. ఆ క్రమంలో ఏటా ఏప్రిల్ చివర్లో భూమికి అతి సమీపంగా వస్తుంది. అప్పుడు దాని తోక తాలూకు శిథిలాలు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంటాయి. కొన్ని అనామకంగా అదృశ్యమైపోతాయి. మరికొన్ని మాత్రం ప్రకాశవంతంగా మండిపోతూ అందమైన వెలుతురు వలయాలను సృష్టిస్తాయి. అందుకే వీటిని తారా సమూహంగా కూడా పిలుస్తుంటారు. ఎప్పుడు చూడొచ్చు: ఏప్రిల్ 22 తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య సమయంలో లైరైడ్స్ను వీక్షించేందుకు అత్యంత అనువైనది. ఆ సమయంలో వాటి సంఖ్య, వెలుతురు రెండూ గరిష్టంగా ఉంటాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మనిషి.. మరమనిషి సై
మనిషికి దీటుగా కృత్రిమ మేధ ఆన్లైన్లో అసాధారణ ప్రతిభ చూపిస్తుంటే ఆఫ్లైన్లో అంటే ప్రత్యక్షంగా హ్యూమనాయిడ్ రోబోలు మనిషికి సవాల్ విసురుతున్నాయి. అనుకున్నదే తడవుగా పరుగుపందెంలో పోటీకి దిగి తమ సామర్థ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశాయి. కృత్రిమ మేధ సాంకేతికతలో అధునాతన ఆవిష్కరణలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే 21 హ్యూమనాయిడ్ రోబోలు 21 కిలోమీటర్ల పరుగుపందెంలో మనుషులతో పోటీగా పరిగెత్తి శెభాష్ అనిపించుకున్నాయి. మానవులతో సమానంగా పరుగుకు ప్రయత్నించడంతో ప్రపంచంలోనే తొలి హ్యూమనాయిడ్ రోబో హాఫ్ మారథాన్గా ఈ కార్యక్రమం చరిత్రకెక్కింది. చైనాలోని బీజింగ్ నగరంలో శనివారం ఈ రోబోలు చేసిన హడావుడి అంతాఇంతా కాదు. మనిషి సృష్టించిన మరమనిషి.. మనిషితోనే పోటీకి సై అనడం చూసేందుకు జనం తండోపతండాలుగా విచ్చేశారు. వాటితో కలిపి సెలీ్ఫలు, వీడియోలు తీసుకున్నారు. ట్రాక్పై పరుగెడుతున్న రోబోలను ఉత్సాహపరుస్తూ జనం విజిల్స్ వేస్తూ చప్పట్లు కొట్టారు. అమెరికా రోబోటిక్స్ కంపెనీలతో పోటీపడుతూ హ్యూమనాయిడ్ రోబోల రంగంలో ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్న తరుణంలో దేశ రాజధాని బీజింగ్లో ఇజువాంగ్ హాఫ్ మారథాన్ను నిర్వహించడం గమనార్హం. ఫార్ములా 1 తరహాలో.. ఫార్ములా 1 కార్ల రేసులో మార్గమధ్యంలో కార్ల టైర్లు పాడైతే వెంటనే ట్రాక్ పక్కనే హఠాత్తుగా ఆపేస్తారు. అక్కడున్న సిబ్బంది సెకన్ల వ్యవధిలో టైర్లు మార్చేసి వెంటనే రేస్ను కొనసాగించడానికి సాయపడతారు. శనివారం రోబోట్ల హాఫ్ మారథాన్లోనూ ఇదే నియమం పాటించారు. వేగంగా పరుగెత్తే రోబోల బ్యాటరీలు పాడైనా, చార్జింగ్ అయిపోయినా నిట్టనిలువుగా అక్కడే ఆగిపోకుండా పక్కనే స్టాప్పాయింట్లను సిద్ధంచేశారు. అక్కడ వెంటనే బ్యాటరీలను మార్చుకుని రోబోలు పరుగు కొనసాగించాయి. ఒకదానితో మరోటి ఢీకొనకుండా ఉండేందుకు మొదట్లోనే వీటిని సమాంతరంగా 1–2 మీటర్ల దూరంలో నిలబెట్టి పోటీని ప్రారంభించారు. ఎన్నెన్నో సైజులు, ఆకారాలు బీజింగ్ ఎకనామిక్–టెక్నలాజికల్ డెవలప్మెంట్ ఏరియాలో జరిగిన ఈ రేసులో ఒకే డిజైన్తో కాకుండా భిన్న పరిమాణాల్లో వేర్వేరు ఆకారాల్లో ఉన్న హ్యూమనాయిడ్ రోబోలు పాల్గొన్నాయి. మారథాన్ పూర్తయ్యాక ఆయా రోబోట్ల తయారీ కంపెనీలు, విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేందుకు నిర్వాహకులు పలు విభాగాల కింద అవార్డులు అందజేశారు. ‘అత్యంత పోటీతత్వం’, ‘గొప్ప డిజైన్’, ‘అత్యంత వినూత్న తరహా రోబో’ఇలా పలు అవార్డ్లు ప్రదానం చేశారు. 2 గంటల 40 నిమిషాల్లో ఫినిషింగ్ లైన్కు.. ఈ పోటీలో చైనాలోని పలు ప్రముఖ హ్యూమనాయిడ్ రోబో కంపెనీలు, విశ్వవిద్యాలయాలు పోటీపడ్డాయి. తమ అధునాతన రోబోలను రంగంలోకి దింపాయి. ప్రతి రోబోకి ఒక రిమోట్ ఆపరేటర్, ఒక సహాయకుడు వెంటే పరుగెత్తారు. బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న రోబోట్ ఇన్నోవేషన్ సెంటర్ వారి ‘తియాన్గాంగ్ అల్ట్రా’రోబో వేగంగా దూసుకొచ్చి విజేతగా నిలిచింది. 21 కిలోమీటర్ల పరుగుపందాన్ని కేవలం 2 గంటల 40 నిమిషాల్లో పూర్తిచేసి ఔరా అనిపించింది. ‘‘మనిషిలాగా ఈ రోబోకు పొడవైన కాళ్లను అమర్చాం. మనిషిలా ఒక పద్ధతిగా పరుగెత్తేలా ప్రత్యేక అల్గారిథమ్ను ఇందులో సెట్చేశాం. అందుకే గెలుపు సాధ్యమైంది’’అని దీని తయారీసంస్థ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ చీఫ్ టెక్నాలజీ అధికారి టాంగ్ జియాన్ చెప్పారు. హాఫ్ మారథాన్లో పురుషుల విభాగంలో 12,000 మంది పాల్గొనగా ఇథియోపియాకు చెందిన ఎలియాస్ దెస్తా అందరికంటే వేగంగా ఒక గంట రెండు నిమిషాల్లో మారథాన్ను పూర్తిచేసి విజేతగా నిలిచాడు. ఫిబ్రవరినెలలో హాఫ్ మారథాన్లో ప్రపంచ పరుగువీరుడు, ఉగాండా అథ్లెట్ జాకబ్ కిప్లిమో ఇదే 21 కి.మీ.ల హాఫ్ మారథాన్ను కేవలం 56 నిమిషాల్లో పూర్తిచేయడం తెల్సిందే. ఇక్కడ పరుగు ముఖ్యం కాదు..! ‘‘ఇక్కడ కేవలం సరళరేఖ మార్గంలో పరుగు పందెం ముఖ్యం కాదు. అంతకుమించినవి ఎన్నో ఉన్నాయి. రోబోలు వేగంగా పరుగెత్తేటప్పుడు కూడా స్థిరంగా ఉండగల్గడం, ట్రాక్పై మలుపుల వద్ద తూలిపడిపోకుండా చూసుకోవడం, ట్రాక్పై జారిపోయే స్వభావం ఉన్న చోట జాగ్రత్తగా పరుగెత్తడం, ఎత్తుపల్లాలున్న చోట్ల వేగాన్ని అందుకు తగ్గట్లు మార్చుకోవడం వంటివన్నీ కీలకం. ఎంత వేగంతో వెళ్తే ఎంత బ్యాటరీ అయిపోతుంది?. గజిబిజి పరుగులో రోబో భాగాలు వదులుకాకుండా చూసుకోవడం వంటివన్నీ ముఖ్యమే’’అని బీజింగ్ హ్యూమనాయిడ్ రోబోట్ ఇన్నోవేషన్ సెంటర్ సీఈఓ జియాంగ్ యూజువాన్ చెప్పారు. చైనాలో హ్యూమనాయిడ్ రోబోల మార్కెట్ మరో ఐదేళ్లలో ఏకంగా 119 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని ఓ అంచనా. ‘‘రోబోల మారథాన్ ఇక్కడితో ముగిసినా హ్యూమన్ టెక్నలాజికల్ అభివృద్ధి శకం ఇక్కడితోనే మొదలుకానుందనే చెప్పాలి. నేటి స్ఫూర్తితో మరిన్ని సంస్థలు ఈ రంగంలో ముందుకొస్తాయి. భవిష్యత్ హ్యూమనాయిడ్ శకానికి ఇది నాంది’’అని ఇజువాంగ్ స్థానిక యంత్రాంగం కమిటీ డిప్యూటీ డైరెక్టర్ లియాంగ్ లెయాంగ్ వ్యాఖ్యానించారు. – బీజింగ్ -
పొరపాట్లు దిద్దుకున్నా 100 పర్సంటైల్ సాధించా
పదో తగరతి: 9.7 జీపీఏఇంటర్ ఫస్టియర్: 465 మార్కులుజేఈఈ మెయిన్ తొలి సెషన్ మార్కులు: 276జేఈఈ మెయిన్ రెండో సెషన్ మార్కులు: 300సాక్షి, ఎడ్యుకేషన్: ‘జనవరి సెషన్లో చిన్న పొరపాట్ల వల్ల 100 పర్సంటైల్ కొద్దిలో కోల్పోయా. పొరపాట్లను సరిదిద్దుకొని.. మ రింత ప్రాక్టీస్ చేసి 100 శాతం మార్కులే లక్ష్యంగా ఏప్రిల్ సెషన్ రాశా. ఇష్టంతో చదివితే ఎలాంటి మానసిక ఒత్తిడి ఉండదు’ అని జేఈఈ–మెయిన్ ఫలితాల్లో 300 మార్కులతో టాపర్గా నిలిచి న వంగల అజయ్రెడ్డి అన్నాడు. జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకు సాధించి ఐఐటీ–ముంబైలో సీఎస్ఈలో చేరడమే తన లక్ష్యమన్న అజయ్ ‘సాక్షి’తో తన విజయ ప్రస్థానాన్ని పంచుకున్నాడు.అన్నయ్య స్ఫూర్తి.. వ్యక్తిగత ఆసక్తితో..: ఐఐటీల్లో బీటెక్ చేయాలనే సంకల్పానికి మా అన్నయ్య అక్షయ్రెడ్డి స్ఫూర్తి ఎంతో ఉంది. ప్రస్తుతం ఐఐటీ ఖరగ్పూర్లో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఐఐటీల్లో ఇంజనీరింగ్ పూర్తి చేస్తే కెరీర్ బాగుంటుందని చెప్పేవాడు. దీంతో నాకు కూడా ఐఐటీపై ఆసక్తి పెరిగింది. అదే లక్ష్యంగా తొమ్మిదో తరగతి నుంచే జేఈఈ దిశగా అడుగులు వేశా.కర్నూలు నుంచి హైదరాబాద్కు..: ఐఐటీలో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాక కర్నూలు నుంచి హైదరాబాద్కు వచ్చా. నాన్న వెంకటరమణారెడ్డి ఎంతో ప్రోత్సహించారు. తొమ్మిదో తరగతి నుంచి ఐఐటీ ఫౌండేషన్ కోర్సులో చేరా. బేసిక్స్తో మొదలు పెట్టి జేఈఈకి అవసరమైన అన్ని అంశాలపై అవగాహన ఏర్పరచుకున్నా.ఒత్తిడి లేదు..: టెన్త్ అయ్యాక ఇంటర్, జేఈఈకి ఏకకాలంలో ప్రిపరేషన్ సాగించా. రోజుకు 14 గంటలు ప్రిపరేషన్కు కేటాయించా. కానీ ఎప్పుడూ ఒత్తిడికి గురి కాలేదు. కాలేజీలో స్టడీ మెటీరియల్, వీక్లీ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు రాస్తూ ఎప్పటికప్పుడు పొరపాట్లను సరిదిద్దుకొని ప్రిపేర్ అవడంతో విజయం చేకూరింది.జనవరిలో సెషన్లో లోపాలతో..: జేఈఈ మెయిన్ జనవరి సెషన్లో 276 మార్కులు (99.996 పర్సంటైల్) వచ్చాయి. కాలిక్యులేషన్స్కు ఎక్కువ సమయం తీసుకోవడం, సమాధానాలు గుర్తించడంలో పొరపాట్లే అందుకు కారణమని గుర్తించా. ఫిజిక్స్లో 90 మార్కులే రావడంతో ఆ సబ్జెక్ట్పై మరింత దృష్టి పెట్టా. ఇంటర్ పరీక్షల తర్వాత పూర్తి సమయం కేటాయించి ప్రతి సబ్జెక్ట్లో ప్రతి కాన్సెప్ట్పై కూలంకషంగా అధ్యయనం చేయడంతో.. ఏప్రిల్ సెషన్లో ఆశించిన ఫలితం పొందగలిగా. మూడు సబ్జెక్ట్లలోనూ నూటికి నూరు శాతం మార్కులు వచ్చాయి.హార్డ్వర్క్, వ్యూహం ఉండాలి..: జేఈఈ మెయిన్ వంటి పోటీపరీక్షలకు సిద్ధమయ్యేందుకు కష్టపడేతత్వంతోపాటు వ్యూహం ఉండాలి. ప్రతి టాపిక్ అధ్యయనానికి తగిన సమయం కేటాయించుకోవాలి. రివిజన్ స్ట్రాటజీ, బలహీనతలను గుర్తించడం ఎంతో ముఖ్యం. దీనివల్ల ఏ టాపిక్లో వెనుకబడ్డామో తెలుసుకొని వాటిని పరిష్కరించుకునే సంసిద్ధత పొందొచ్చు.ఐఐటీ బాంబేలో సీఎస్ఈలో చేరడం: జేఈఈ అడ్వాన్స్డ్కు కూడా ప్రిపేర్ అవుతున్నాను. అందులో మంచి ర్యాంకు సాధించి ఐఐటీ ముంబైలో సీఎస్ఈ బ్రాంచ్లో బీటెక్లో అడుగు పెట్టడమే లక్ష్యం. ఐఐటీలో ఈసీఈలో చేరడమే లక్ష్యం: సాయి మనోజ్ఞ(Sai Manojna)⇒ ‘సాక్షి’తో జేఈఈ మెయిన్ మహిళల విభాగం టాపర్ సాయి మనోజ్ఞ⇒ రోజుకు 12 గంటలు ప్రిపరేషన్కు సమయం కేటాయించా⇒ గ్రాండ్ టెస్ట్లు, మోడల్ టెస్ట్లు రాస్తూ తప్పులు సరిదిద్దుకున్నాపదో తరగతి (ఐసీఎస్ఈ): 588 మార్కులుఇంటర్: 987 మార్కులుజేఈఈ మెయిన్ జనవరి సెషన్: 295 మార్కులుజేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్: 300 మార్కులు‘జేఈఈ మెయిన్ జనవరి సెషన్లోనూ 100 పర్సంటైల్ సాధించా. కానీ మార్కులు తగ్గడంతో 300 మార్కులు లక్ష్యంగా ఏప్రిల్ సెషన్కు హాజరయ్యా. నిర్దిష్ట ప్రణాళికతో ఆ మార్కులు సాధించగలిగా’ అని జేఈఈ మెయిన్ మహిళల విభాగం ఏపీ టాపర్, గుంటూరుకు చెందిన గుత్తికొండ సాయిమనోజ్ఞ చెప్పింది. ఐఐటీలో ఈసీఈలో బీటెక్ చేయడమే తన లక్ష్యమన్న మనోజ్ఞ ‘సాక్షి’తో తన ప్రిపరేషన్ తీరుతెన్నులను పంచుకుంది.కాన్సెప్ట్స్పై అవగాహనతో..: జేఈఈ మెయిన్ పరీక్షలో విజయానికి.. ఆయా సబ్జెక్ట్లలో కాన్సెప్ట్ల పై, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే సమయంలో ఫార్ములా లను అన్వయించే విధానంపై పట్టు సాధించా. ఇది ఎంతో ఉపయోగపడింది. పరీక్షలో ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చేందుకు తోడ్పడింది. టెన్త్ నుంచే జేఈఈ దిశగా..: ఐఐటీలో చేరాలనే లక్ష్యంతో పదో తరగతి నుంచే ప్రిపరేషన్ సాగించా. ఇంటర్కు ఐసీఎస్ఈ నుంచి బోర్డ్ సిలబస్ వైపు మారా. ఇందులో ఉండే అంశాలు జేఈఈ సిల బస్కు అనుగుణంగా ఉండటం, బోధన, పుస్తకాలు ఎక్కువగా లభించడమే అందుకు కారణం.ప్రిపరేషన్ ఇలా..: జేఈఈలో విజయం సాధించేందుకు ఇంటర్ తొలిరోజు నుంచే రోజుకు కనీసం 12 గంటలు ప్రిపరేషన్కు సమయం కేటాయించేదాన్ని. గ్రాండ్ టెస్ట్లు, మోడల్ టెస్ట్లకు హాజరవడం కూడా ఎంతో ప్రయోజనం చేకూర్చాయి. ఆ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినప్పుడల్లా ఏయే అంశాల్లో ఎందుకు మార్కులు తగ్గాయో తెలుసుకొని వెంటనే వాటిని సరిదిద్దుకుంటూ ప్రిపరేషన్ సాగించా. ఒక టాపిక్ను చదివేటప్పుడు అందులో ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడుగుతారో ఊహించి అభ్యాసం చేశా. ప్రతి సబ్జెక్ట్కు నిర్దిష్ట సమయం కేటాయించుకొని ఆ సమయంలో ఆ సబ్జెక్ట్లోని టాపిక్ను పూర్తిచేయడం నాకు ఎంతో ఉపయోగపడింది.జనవరి సెషన్లో 295 మార్కులు: జేఈఈ మెయిన్ జనవరి సెషన్లో కూడా నాకు 100 పర్సంటైల్ వచ్చింది. కానీ మార్కులు 295 మాత్రమే వచ్చాయి. దీంతో 300కు 300 మార్కులు సాధించాలనే లక్ష్యంతో ఏప్రిల్ సెషన్కు హాజర య్యా. బోర్డ్ పరీక్షలు ముగిశాక పూర్తి సమయం రివిజన్కు, మోడల్ టెస్ట్లకు కేటాయించా. వాటి ఫలితంగానే ఇప్పుడు 300 మార్కులు వచ్చాయి. ఐఐటీలో ఈసీఈ చేస్తా..: జేఈఈ అడ్వాన్స్డ్కు కూడా ప్రిపరేషన్ సాగిస్తున్నా. అందులో మంచి ర్యాంకుతో ఐఐటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) బ్రాంచ్లో బీటెక్లో చేరడమే నా లక్ష్యం. ఆ తర్వాత అదే రంగంలో ఉన్నతవిద్య, ఉద్యోగం దిశగా అడుగులు వేయాలనుకుంటున్నా. నా విషయంలో నాన్న కిశో ర్ చౌదరి, అమ్మ పద్మజల ప్రోత్సాహం ఎంతో ఉంది. నాన్న ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకులుగా ఉండటంతో ఇంజనీరింగ్పై ఆసక్తి పెరిగింది. -
ఇక ఆపుకోనక్కర లేదు
సాక్షి, హైదరాబాద్: నీళ్లు తాగటానికి ఒకటికి నాలుగుసార్లు ఆలోచించే పరిస్థితి.. మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందనే భయం. మూత్ర విసర్జనకు వెళ్లాలంటే రైలు ఆగే స్టేషన్ రాకకోసం ఎదురుచూడాల్సిందే. అందుకు ఒక్కోసారి ఐదారు గంటలైనా పట్టొచ్చు. ఇది రైళ్లను క్షేమంగా గమ్యం చేర్చే లోకో పైలట్లు, సహాయ లోకోపైలట్ల దుస్థితి.ముఖ్యంగా మహిళా లోకోపైలట్ల ఆవేదనపై సాక్షి పత్రిక ‘ఆపుకోలేని ఆవేదన’పేరిట కథనాన్ని కూడా ప్రచురించింది. ఈ సమస్యను పరిష్కరించాలని ఇంతకాలానికి రైల్వే శాఖ నిర్ణయించింది. రైళ్ల ఇంజిన్ క్యాబిన్ (లోకో)లలో యూరినల్స్, ఏసీ వసతి, ఆధునిక ఎర్గోనామిక్ సీట్ల ఏర్పాటును తప్పనిసరి చేసింది. దీంతో లక్షన్నర మంది లోకో, అసిస్టెంట్ లోకోపైలట్లకు పెద్ద ఉపశమనం లభించనుంది. యూరినల్స్ ఏర్పాటు ప్రారంభం కొత్తగా తయారు చేసే అన్ని లోకో క్యాబిన్లలో యూరినల్స్, ఏసీ, ఎర్గోనామిక్ సీట్ల ఏర్పాటు కోసం వాటి డిజైన్లను రైల్వేశాఖ మార్చింది. ఇప్పటికే వినియోగిస్తున్న లోకోమోటివ్లలో వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. హైదరాబాద్లోని లాలాగూడ, మౌలాలి లోకోòÙడ్లతోపాటు కాజీపేట, విజయవాడ, గుత్తిలలోని లోకోòÙడ్లలో ఈ పనులు ప్రారంభించారు. తొలుత గూడ్సు రైళ్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఇప్పటికే 42 లోకోమోటివ్లలో ఏర్పాటు చేశారు. ఇంజిన్ను పరిశీలించేందుకు వీలుగా ఉన్న కారిడార్లో చిన్న క్యాబిన్ ఏర్పాటుచేసి, అందులో యూరినల్స్ కమోడ్ ఏర్పాటు చేస్తున్నారు. లోకోమోటివ్లలో నీటి వసతి ఉండదు కాబట్టి టాయిలెట్ కాకుండా యూరినల్స్ వసతి మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ కోచ్ నాలుగు రోజులకోసారి స్పెషల్ క్లీనింగ్కు షెడ్డుకు వెళ్తుంది. అప్పుడు అందులోని మానవ వ్యర్ధాలను తొలగిస్తారు. కానీ, లోకోమోటివ్ 90 రోజులకోసారి మాత్రమే షెడ్డుకు వెళ్తుంది. అప్పటి వరకు వ్యర్ధాలు నిల్వ ఉంచలేరు. ఎర్గోనామిక్ సీట్లు.. గతంలో 90 డిగ్రీల కోణంలో సీట్లు ఉండేవి. ఇవి ఏమాత్రం అనుకూలంగా ఉండేవి కాదు. వీటిల్లో ఎక్కువ గంటలు కూర్చుని పనిచేస్తే నడుము, వెన్నెముఖ నొప్పులొస్తున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మహిళా సిబ్బంది మరింత ఇబ్బందికి గురవుతున్నారు. ఇప్పుడు వీటి స్థానంలో ఎర్గోనామిక్ సీట్లను ఏర్పాటు చేస్తున్నారు. మంచినీళ్లు కూడా తాగేవాళ్లం కాదుపురుషులతో సమానంగా ఈ కష్టతరమైన పనిచేయటాన్ని సవాల్గా తీసుకుని ఈ ఉద్యోగంలో చేరా. కానీ లోకోమోటివ్లలోని ప్రతికూల పరిస్థితులు ఈ సవాల్ను మరింత కఠినతరం చేశాయి. మంచినీళ్లు తాగితే మూత్రవిసర్జన చేయాల్సి వస్తుందన్న భయంతో నీరు కూడా తాగకుండా పనిచేస్తూ వస్తున్నాం. రైల్వే శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం మాకు పెద్ద వరం లాంటిదే. - డి.దుర్గాభవాని, సీనియర్ అసిస్టెంట్ లోకోపైలట్టాయిలెట్ వసతి కూడా ఏర్పాటు చేయాలి దశాబ్దాల మా సమస్యలకు పరిష్కారంగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం ఎంతో సంతోషాన్నిచ్చింది. యూరినల్స్కే పరిమితం కాకుండా, టాయిలెట్ వసతి కూడా ఏర్పాటు చేస్తే సమస్యకు పూర్తి పరిష్కారం లభించినట్టవుతుంది. - పి.రవీందర్, చీఫ్ లోకో ఇన్స్పెక్టర్ -
విశ్వమూ భ్రమిస్తోంది
భ్రమణం జీవలక్షణం. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది గనుకే రాత్రింబవళ్లు ఏర్పడతాయి. జీవకోటి యాత్ర సజావుగా సాగుతుంది. ఆ మాటకొస్తే చంద్రుని వంటి ఉపగ్రహాలు మొదలుకుని గ్రహాలన్నీ తమ చుట్టూ తాము నిత్యం తిరుగుతూనే ఉంటాయన్నది తెలిసిందే. చివరికి సూర్యుడు కూడా ఇందుకు అతీతుడు కాదు. ఆ మాటకొస్తే పాలపుంత కూడా తనచుట్టూ తాను తిరుగుతూ ంటుంది. మరి విశ్వం? విశ్వానికి భ్రమణమనేది లేదన్నది ఇప్పటిదాకా నమ్ముతూ వచ్చిన సిద్ధాంతం. అది నిత్యమూ అన్ని దిశలకూ సమానంగా విస్తరిస్తూ ఉంటుందన్నది సైంటిస్టుల భావన. కనుక విశ్వం తనచుట్టూ తాను తిరగదని సూత్రీకరించారు. కానీ అది నిజం కాదంటోంది తాజా పరిశోధన ఒకటి. విశ్వం కూడా తనచుట్టూ తాను తిరుగుతుందని పేర్కొంది. అయితే అది అత్యంత నెమ్మదిగా జరుగుతోందట. ఎంత మెల్లిగా అంటే, విశ్వం ఒక భ్రమణం పూర్తి చేయడానికి ఏకంగా 50 వేల కోట్ల ఏళ్లుపడుతుందని ఆ పరిశోధన తేల్చింది! దాని అధ్యయన వివరాలను రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ జర్నల్లో ప్రచురించారు.‘హబుల్’ముడి వీడినట్టే! తాజా పరిశోధనకు హవాయి యూనివర్సిటీలోని ఆస్ట్రానమీ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రొఫెసర్ ఇస్ట్వాన్ జపుదీ సారథ్యం వహించారు. అంతరిక్ష శా్రస్తానికి సంబంధించి ఇప్పటిదాకా అతి పెద్ద ప్రహేళికల్లో ఒకటిగా మిగిలిపోయిన ‘హబుల్ టెన్షన్’ను పరిష్కరించేందుకు కూడా ఇది దోహదపడుతుందని సైంటిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విశ్వం తనచుట్టూ తాను తిరగడం లేదంటూ ఇప్పటిదాకా విశ్వసిస్తూ రావడం తెలిసిందే. విశ్వ విస్తరణ వేగానికి సంబంధించిన రెండు పరస్పర విరుద్ధ సమీకరణాలను వివరించడంలో ఈ సిద్ధాంతం విఫలమవుతోంది. వాటిలో ఒకటి సుదూరాల్లోని సూపర్నోవాలు, నక్షత్ర మండలాల దూరాల ఆధారంగా రూపొందించినది. మరొకటి దాదాపు 1,300 ఏళ్ల కింద విశ్వం ఆవిర్భవించిన నాటి కాస్మిక్ రేడియేషన్ నేపథ్యం ఆధారంగా సూత్రీకరించినది. రెండింట్లో ప్రతిపాదించిన విశ్వ విస్తరణ రేటులో తేడా ఉంది. దీన్ని అంతరిక్ష శాస్త్ర పరిభాషలో ‘హబుల్ టెన్షన్’గా పిలుస్తారు. జపుదీ బృందం అభివృద్ధి చేసిన గణిత సిద్ధాంతం ఈ సమస్యకు పరిష్కారం చూపడం విశేషం! అందులో భాగంగా విశ్వ విస్తరణ సిద్ధాంతానికి కొద్దిపాటి భ్రమణ సూత్రాన్ని జోడించారు. తద్వారా రెండు సమీకరణాలూ సరైనవేనని తేలినట్టు సైంటిస్టులు వివరించారు. ‘‘ప్రతిదీ విధిగా తనచుట్టూ తాను తిరుగుతుందన్న గ్రీకు తత్వవేత్త హెరాక్లిటస్ సూత్రాన్ని నమ్మి రంగంలోకి దిగాం. ఇంతవరకూ వచ్చాం. విశ్వం ఒక భ్రమణానికి 500 బిలియన్ ఏళ్లు తీసుకుంటుందన్న మా సూత్రీకరణ చాలా హేతుబద్ధంగా ఉంది. పైగా ప్రస్తుత భౌతికశాస్త్ర సూత్రాలు వేటినీ ఉల్లంఘించడం లేదు. కనుక రెట్టించిన ఉత్సాహంతో తర్వాతి దశకు పరిశోధనకు సిద్ధమవుతున్నాం. విశ్వభ్రమణ సిద్ధాంతాన్ని మరింతగా పరిశోధించేందుకు సమగ్ర కంప్యూటర్ సిమ్యులేషన్ ప్రయోగాలు చేపట్టనున్నాం’’అని జపుదీ వివరించారు. ఈ సిద్ధాంతం పూర్తిస్థాయిలో నిరూపణ అయితే విశ్వం తాలూకు మన అవగాహన మరింత విస్తరిస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విద్యార్థుల వీసాలపై పిడుగు
విదేశీ విద్యార్థులపై అమెరికా కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తోంది. గత నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా 1,024 మంది విదేశీ విద్యార్థుల వీసాలనో, వారి లీగల్ రెసిడెన్సీ స్టేటస్నో రద్దు చేసింది. వారంతా అమెరికాలోని 160 కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకుంటున్నవారే. వారంతా ఆందోళనకు లోనవుతున్నారు. ఇలా ఉన్నపళంగా వెళ్లగొట్టడం ఏమిటంటూ మండిపడుతున్నారు. ‘‘చట్టప్రకారం అన్ని అనుమతులూ ఇచ్చిన ప్రభుత్వమే ఆ చట్టాలను ఉల్లంఘిస్తోంది. ఈ చర్యలను ఎలా సమర్థించుకుంటుంది?’’ అని ప్రశి్నస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వ చర్యపై పలువురు కోర్టుకెక్కారు. కొందరు అరెస్టు భయంతో చదువులు మధ్యలోనే వదిలేసి స్వదేశాలకు వెళ్లిపోయారు. పునరాలోచించాలి లీగల్ స్టేటస్ రద్దుతో వందలాది మంది విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు అమెరికా వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే ప్రభుత్వమే నిర్బంధించి బలవంతంగా వెళ్లగొట్టే పరిస్థితి నెలకొంది. హార్వర్డ్, స్టాన్ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్, ఒహాయో స్టేట్ వర్సిటీల్లోని పలువురు విద్యార్థుల లీగల్ స్టేటస్లు రద్దయ్యాయి. పలు కాలేజీల్లోని విద్యార్థులు వీసాలు కూడా రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీపై కోర్టుల్లో కేసులు దాఖలవుతున్నాయి. విదేశీ విద్యార్థులు ఇలా వెళ్లిపోతే అమెరికా వర్సిటీలు, కాలేజీల మనుగడ కష్టమవుతుందని అక్కడి నిపుణులు చెబుతున్నారు. దీనిపై పునరాలోచించాలని ట్రంప్ సర్కారుకు సూచిస్తున్నారు. కాలేజీలు, వర్సిటీల నుంచి కూడా ఈ మేరకు విజ్ఞాపనలు వెళ్తున్నాయి. రద్దయితే ఇంటికేనా? ఎఫ్–1 విద్యార్థి వీసాలను అమెరికా విదేశాంగ శాఖ పర్యవేక్షిస్తుంది. అమెరికాలోకి అడుగుపెట్టాక వారి లీగల్ రెసిడెన్సీ స్టేటస్ను పర్యవేక్షించే బాధ్యత డీఓహెచ్దే. విద్యార్థుల డేటాబేస్ దానివద్ద ఉంటుంది. విద్యాభ్యాసం పూర్తయ్యి వారు స్వదేశాలకు వెళ్లాక వర్సిటీ సూచనతో లీగల్ స్టేటస్ను తొలగించేవారు. ఇప్పుడు వర్సిటీలతో సంబంధమే లేకుండా విదేశీ విద్యార్థుల లీగల్ రెసిడెన్సీ స్టేటస్ ఉన్నపళంగా రద్దయిపోతోంది. పైగా ఆ మేరకు సమాచారం కూడా ఇవ్వడం లేదు. డేటాబేస్ను వర్సిటీ వర్గాలు తనిఖీ చేసినప్పుడు మాత్రమే ఆ విషయం తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో వీసా రద్దయినా లీగల్ రెసిడెన్సీ స్టేటస్ అలాగే ఉంటుంది. అలాంటప్పుడు విద్యాభ్యాసం కొనసాగించవచ్చు. స్వదేశాలకు వెళ్లి మళ్లీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేటస్ రద్దయితే మాత్రం అమెరికాలో ఉండడానికి అనుమతించరు. స్వదేశాలకు వెళ్లిపోవాలని సూచిస్తారు. లేదంటే బలవంతంగా పంపిస్తారు.ఎందుకీ వీసాల రద్దు? → విద్యార్థుల వీసాల రద్దుకు నిబంధనల ఉల్లంఘన ముఖ్య కారణమని వర్సిటీలు చెబుతున్నాయి. → ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా వీసా రద్దవుతోంది. గత ఉల్లంఘనలకు కూడా ఇప్పుడు వీసా రద్దు చేస్తున్నారు. → చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడినా వీసా రద్దు తప్పదు. → పాలస్తీనా సానుభూతిపరుడంటూ కొలంబియా వర్సిటీ విద్యార్థి మహమ్మద్ ఖలీల్ వీసా రద్దు చేశారు. కానీ వీసాలు, లీగల్ స్టేటస్లు రద్దవుతున్న పలువురు విద్యార్థులకు ఉద్యమాలతో, తీవ్రవాద/ఉగ్రవాద సంస్థలతో ఏ సంబంధమూ లేదని ఆయా వర్సిటీలే చెబుతున్నాయి. కారణాలేమిటో ప్రభుత్వాన్నే అడగాలంటున్నాయి. → ‘‘విదేశీ విద్యార్థులను బయటకు వెళ్లగొట్టడమే డీఓహెచ్కు పనిగా మారింది. ఈ మేరకు అనధికారింగా జాతీయ పాలసీ తెచ్చినట్టు కనిపిస్తోంది’’ అని వేన్ స్టేట్ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ ప్రతినిధులు విద్యార్థుల తరఫున కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బలవంతపు డిపోర్టేషన్లు ఆపాలని కోరారు. → డార్ట్మౌత్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న చైనాకు చెందిన షియాంటియాన్ లియూ తన లీగల్ స్టేటస్ రద్దుపై కోర్టును ఆశ్రయించాడు. ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తూ విద్యారి్థకి అనుకూలంగా న్యూ హ్యాంప్షైర్ ఫెడరల్ జడ్జి తీర్పు ఇచ్చారు. → ‘‘అమెరికాలోకి వచ్చిపడుతున్న విదేశీయుల పట్ల ట్రంప్ గుర్రుగా ఉన్నారు. వారందరినీ వెనక్కు పంపేయాలని పట్టుదలగా ఉన్నారు. అందుకే విదేశీ విద్యార్థులను లక్ష్యం చేసుకుంటున్నారు’’ అని మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్లో పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ మిషెల్ మిటెల్స్టాడ్ అన్నారు.తీవ్ర పరిణామాలేఅమెరికాలో చట్టాల అమలు కఠినంగా ఉంటుంది. వాటిని పాటించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ‘‘విద్యార్థులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. చట్టాలను ధిక్కరిస్తామంటే ప్రభుత్వం సహించదు. ఇష్టానుసారం వ్యవహరిస్తే వీసాలు రద్దు చేసి వెనక్కు పంపుతారు. నిజాయితీగా ఉండేవారికి అమెరికాలో అద్భుత అవకాశాలున్నాయి’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మార్గరెట్ మెక్లియోడ్ అన్నారు. ఈ విషయంలో కేంద్రం ఇకనైనా మొద్దునిద్ర వీడి అమెరికాలోని మన విద్యార్థుల భవితవ్యాన్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మామిడిని ఆరోగ్యంగా మాగిద్దాం
కర్నూలు (అగ్రికల్చర్): ఏటా వేసవిలో అందరినీ ఊరించే పండు మామిడి. జూన్ వరకు మార్కెట్లో మామిడిదే పైచేయి సంపన్నులైనా.. సామాన్యులైనా.. మామిడి రుచిని ఆస్వాదించాల్సిందే. బంగినపల్లి (బేనీసా) రకం మామిడి అంటే దానికి ఉన్న డిమాండే వేరు. మామిడి ఇప్పుడిప్పుడే మార్కెట్లో పసుపుపచ్చగా కనువిందు చేస్తోంది. రంగు బాగా ఉంది కదాని తింటే అనారోగ్యాలను కొని తెచ్చుకోవాల్సిందే. ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్ను ఉపయోగించి మాగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మామిడి ఆరోగ్యకరమైన పద్ధతుల ద్వారా మాగించాల్సిన అవసరం ఉందని కర్నూలు జిల్లా ఉద్యానశాఖ అధికారి పి.రామాంజనేయులు తెలిపారు. ఈ ఏడాది మామిడి దిగుబడులు ఒక మోస్తరుగా ఉన్నాయని వీటిని ఆరోగ్యవంతమైన పద్ధతిలో మాగించుకుంటే మంచి డిమాండ్, ధర లభిస్తుందని తెలిపారు. మార్కెట్లో మామిడి పండ్లు కొనుగోలు చేసే ముందు సూక్ష్మంగా పరిశీలించాలన్నారు. పండ్లు కొనేటప్పుడు, తినేటప్పు డు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్బైడ్కు ప్రత్యామ్నాయంగా పండ్లు మాగించే పద్ధతులను వివరించారు. పండ్లు ఎలా మాగుతాయి... సాధారణంగా పండ్లు పక్వానికి వచ్చినప్పుడు ప్రకృతి సిద్ధంగా పండ్ల నందు ఉత్పత్తి అయ్యే ఇథలీన్ వల్ల మాగడం జరుగుతుంది. ఇథలీన్ పండు పక్వానికి వచ్చినప్పుడు దాని నిర్మాణ, రంగు, రుచి వంటి మార్పులకు ఉపయోగపడుతుంది. » తప్పని పరిస్థితుల్లో కాయలు మాగబెట్టుటకు ఎథిలిన్ వాయువు 100 పీపీఎం మాత్రమే ఉపయోగించాలి. 100 పీపీఎం ఎథిలిన్ వాయువు 24 గంటలు తగిలేటట్లుగా ఉంచితే 5 రోజులలో సహజత్వానికి దగ్గరగా ఎలాంటి హాని లేకుండా మాగుతాయి. » ఇంటిలో అయితే మాగని కాయల్లో కొన్ని మాగిన పండ్లను గాలి చొరవ డబ్బాలో ఉంచాలి. పక్వానికి వచ్చిన కాయలను ఒక రూములో వరిగడ్డి లేదా బోదగడ్డిలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల సహజ సిద్ధంగా మాగుతాయి. కొనేటప్పుడు ఇలా చూడాలి.. సీజన్ రాకముందే అపరిపక్వముగా ఉండి కృత్రిమంగా మాగబెట్టిన రంగు వచ్చేటట్లు చేసిన పండ్లు కొనరాదు. రంగు చూసి మోసపోరాదు. సీజన్లో పండ్లు పరిపక్వత చెంది సహజముగా మాగిన పండ్లు కొనడం ఆరోగ్యదాయకం. తినేటప్పుడు ఇలా చేయాలి.. పండ్లను ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15–20 నిముషాలు ఉంచి, తిరిగి వాటిని మంచినీటిలో కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత వాటిని తినాలి. లేదా ఫ్రిజ్లో ఉంచుకోవాలి. సాధ్యమైనంత వరకు పండ్ల తొక్కను తీసి తినడం మంచిది. కార్బైడ్తో మాగిస్తే శిక్ష... ఆహార సురక్షణ ప్రమాణాల చట్టం–2006 ప్రకారం కార్బైడ్ వాడి పండ్లు మాగబెట్టిన వారికి, అమ్మే వారికి ఒక ఏడాది జైలు శిక్ష, మూడు లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. కార్బైడ్ వాడిన పండ్లను తినడం వల్ల అనేక వ్యాధులు, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఈ విషయం శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. సహజ, కృత్రిమంగా మాగిన పండ్లకు తేడాలు..రంగు.. : సహజంగా మాగిన పండు కొంత పసుపు, మరికొంత ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి పండు లోపలి భాగం అంతా పరిపక్వంగా ఉంటుంది. » కృత్రిమంగా మాగిన వాటిలో పండు మొత్తం ఒకే విధమైన కాంతివంతమైన లేత పసుపు కలిగి ఉంటాయి. పైకి మాగినట్లుగా కనిపించినా లోపల అపరిపక్వంగా ఉండి పుల్లగా ఉంటాయి. వాసన.. : సహజంగా మాగిన పండు కొంత దూరంలో ఉన్నప్పటికీ కమ్మని మామిడి పండు వాసన వస్తుంది. కృత్రిమంగా మాగిన పండును ముక్కుకు దగ్గరగా ఉంచినప్పుడు మాత్రమే మామిడి పండు వాసన వస్తుంది. రుచి.. : సహజంగా మాగిన పండులో తగినంత చక్కెర శాతం ఏర్పడుతుంది. కావున తియ్యగా రుచిగా ఉంటుంది. కృత్రిమంగా మాగిన పండులో తగినంత చక్కెర శాతం ఏర్పడక తక్కువ తీపిదనం, రుచి లేకకుండా ఉంటాయి. నిల్వ.. : సహజంగా మాగిన మామిడి పండ్లు మెత్తగా ఉంటాయి. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. » కృత్రిమంగా మాగిన వాటిలో పండ్ల తొక్క ముడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటాయి. పండు త్వరగా పాడైపోతుంది. తొక్కపై నల్లని చుక్కలు ఏర్పడతాయి. -
తెలంగాణలో ప్రతీ లక్ష మందికి 233 మంది పోలీసులు
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులది అత్యంత కీలకపాత్ర. నేరాలు జరగకుండా చూడడంతోపాటు నేరస్తులను చట్టం ముందు నిలబెట్టేలా దర్యాప్తు చేయడం వీరి ప్రధాన విధి. అయితే దేశవ్యాప్తంగా పోలీసుల సంఖ్యకు నానాటికీ పెరుగుతున్న జనాభాకు పొంతన లేకుండా పోతోంది. దేశవ్యాప్తంగా ప్రతి లక్ష మంది జనాభాకు కేవలం 155 మంది పోలీసులు మాత్రమే ఉన్నట్టు ఇటీవల విడుదలైన ఇండియా జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్)–2025 నివేదిక వెల్లడించింది. – సాక్షి, హైదరాబాద్⇒ జాతీయ స్థాయిలో సరాసరిన చూస్తే ప్రతి లక్ష మంది జనాభాకు మంజూరైన పోలీసుల సంఖ్య 197 కాగా, కేవలం 155 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ⇒ తెలంగాణ విషయానికి వస్తే ప్రతి లక్ష మంది జనాభాకు ఇక్కడ 233 మంది పోలీసులు అందుబాటులో ఉన్నారు. ⇒ ఇక రాష్ట్రాల వారీగా చూస్తే ప్రతి లక్ష మందికి బిహార్లో అత్యల్పంగా కేవలం 75 మంది పోలీసులు మాత్రమే అందుబాటులో ఉన్నారు.మహిళా పోలీసుల సంఖ్య అంతంతే..⇒ పోలీస్ బలగాల్లో మహిళా అధికారులు, సిబ్బంది సంఖ్య సైతం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. ⇒ జాతీయ స్థాయిలో పోలీస్ విభాగాల్లో మహిళా సిబ్బంది సంఖ్య 8 శాతంగా ఉండగా..మహిళా అధికారుల సంఖ్య 10 శాతానికి పరిమితమైంది. ⇒ తెలంగాణ పోలీస్శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను అమలు చేస్తూ మహిళల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటోంది. అయితే ఐజేఆర్ 2025 నివేదిక ప్రకారం తెలంగాణ పోలీస్శాఖలో మహిళా సిబ్బంది 8.7 శాతంగా, మహిళా అధికారుల సంఖ్య 7.6 శాతంగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. ⇒ దేశవ్యాప్తంగా అత్యధికంగా తమిళనాడు పోలీస్శాఖలో మహిళా సిబ్బంది సంఖ్య 20.7 శాతంగా, మహిళా అధికారుల సంఖ్య 20.1 శాతంగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. -
బంధాలపై కత్తి వేటు
సాక్షి, హైదరాబాద్: ఒకరిది ప్రతీకారేచ్ఛ..మరొకరిది ఆస్తుల కోసం ఆరాటం. కారణమేదైనా కొందరి విపరీత ప్రవర్తన కుటుంబ బంధాలు, అనుబంధాలను చిన్నాభిన్నం చేస్తోంది. మూఢ నమ్మకాలతో కన్నతల్లే నెలల పసికందును చంపిన ఘటన ఒకటైతే.. తోబుట్టువులే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న సంఘటన మరోటి.. ప్రేమపేరుతో మరికొందరు ఉన్మాదులై స్వైరవిహారం చేస్తున్నారు. వివాహేతర సంబంధాలతో ఇంకొందరు కుటుంబాలను చిదిమేసుకుంటున్నారు. ⇒ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో 2025 మార్చి 27న జరిగిన ఒక దారుణ ఘటనలో రజిత తన ముగ్గురు పిల్లలను విషంఇచ్చి చంపినట్టు పోలీసులు తేల్చా రు. ఈ హత్యల వెనుక వివాహేతర సంబంధం కారణమని విచారణలో తేలింది. జీవితం మొత్తం జైలుపాలవుతామని తెలిసినా వీసమెత్తు భయం లేకుండా నడిరోడ్లపైనే విపరీత చర్యలకు పూనుకుంటున్నారు. ఇందుకు కారణాలేంటి? ఎందుకు ఈ విపరీత ప్రవర్తన పెరుగుతోంది? సున్నితమైన ఈ అంశాలపై లోతైన చర్చ జరగాల్సిన అవసరముంది. ⇒ మూఢ నమ్మకాల పేరుతో 2021 ఏప్రిల్లో మోతె మండలం మేకలపాటి తండాలో తన ఏడు నెలల కూతురిని చంపిన కేసులో తల్లి బాణోతు భారతికి సూర్యాపేట జిల్లా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ ఈ నెల 11న సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో కుటుంబ బంధాలపై కత్తివేటు వేస్తున్న ఘటనలపై మరోమారు చర్చ మొదలైంది. ఆస్తుల కోసం హత్యలు ⇒ మద్యపానం..జూదం..ఆన్లైన్ బెట్టింగ్ వంటి వ్యసనాలకు బానిసలవుతున్న కొందరు యువకులు.. డబ్బు, వారసత్వ ఆస్తుల కోసం కుటుంబ సభ్యులనే హతమారుస్తున్నారు. ఆ తర్వాత జరిగే పరిణామాలను పట్టించుకోవటం లేదు. ⇒ ఆస్తిలో వాటా ఇవ్వడం లేదని హైదరాబాద్లో వెలిజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ చంద్రశేఖర జనార్దన్రావును ఆయన మనుమడు కిలారు కార్తి తేజ గత నెలలో 72 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ⇒ ఆస్తి కోసం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో కన్నతల్లి రాధికను కొడుకు కార్తీక్ కత్తితో ఎనిమిదిసార్లు పొడిచి హత్య చేశాడు. విపరీత ప్రవర్తనను ముందే పసిగట్టాలి ఏ వ్యక్తి గురించైనా వారి కుటుంబ సభ్యులకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. పుట్టినప్పటి నుంచి వారి ప్రవర్తనను గమనించే అవకాశం తల్లిదండ్రులు, తోబుట్టువులకే ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా చిన్ననాటి నుంచే విపరీత ప్రవర్తనను కలిగి ఉండడం..చెడు వ్యసనాలకు బానిసలవుతున్నట్టు గమనిస్తే..వారి వయస్సును బట్టి మందలించడం..దండించడం..ప్రతిసారి దూషిస్తూ..ఎదుటివారి ముందు తక్కువ చేసి మాట్లాడం పక్కన పెట్టి..ఎందుకు ఆ ప్రవర్తన కలిగి ఉంటున్నారు అన్నది మూలాల నుంచి గమనించే ప్రయత్నం చేయాలి. అవసరం మేరకు వారికి మానసిక వైద్యులతో చికిత్స అందించడం...లేదంటే కౌన్సెలింగ్ ఇప్పించడం వంటి మార్గాలను ఎంచుకోవాలి. కుటుంబ సభ్యుల పట్ల పగ, ద్వేషం పెరుగుతున్నట్టు గమనిస్తే వెంటనే తగినంత సమయాన్ని వారికి కేటాయించి..వారి ఇబ్బందులు ఏంటి..అందుకు కుటుంబ పరంగా ఎలాంటి సహకారం అవసరమన్నది గమనించి అందుకు తగ్గట్టుగానే చర్యలు తీసుకోవాలి. ఈ తరహా ఘటనలు మరికొన్ని.. ళీ హైదరాబాద్లోని జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో లక్ష్మి తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారన్న అక్కసుతో తల్లి సుశీల, అక్క జ్ఞానేశ్వరిలను ప్రియుడితో హత్య చేయించింది. ళీ జనవరిలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురుమూర్తి భార్యను హత్యచేసి ముక్కలుగా నరికి ఉడకబెట్టిన ఘటన సంచలనంగా మారింది. ళీ ఫిబ్రవరిలో కాప్రా పరిధిలో మొగిలిని అతడి కుమారుడు సాయికుమార్ నడిరోడ్డుపై కత్తితో నరికి చంపాడు. చట్టాలపై అవగాహన పెంచాలి చట్టాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చన్న విషయాన్ని కొందరు పట్టించుకోవటం లేదు. కారణం ఏదైనా తప్పు చేస్తే చట్టం నుంచి తప్పించుకోలేరు అన్నది మరవొద్దు. హత్యలు చేసిన నిందితులు విలువైన జీవితం కోల్పోవడంతోపాటు కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసినట్టు అవుతుంది. నేరం చేస్తే ఎదురయ్యే పరిణామాలను ప్రజలకు తెలియజెప్పాలి. –పెందోట శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదిపక్కా ప్రణాళికతో చేసే హత్యలివి ఇలాంటి హత్యలన్నీ పక్కా ప్రణాళికతో చేసేవే. క్షణికావేశంలో చేస్తున్నవి కాదు. ఇటీవల జరిగిన ఏ ఘటనను క్షుణ్ణంగా పరిశీలించినా ఇది అర్థం అవుతుంది. ఇది ఒక రకమైన పర్సనాలిటీ డిజార్డర్. ఇలాంటి వ్యక్తుల ప్రవర్తన చిన్ననాటి నుంచే విపరీతంగా ఉంటుంది. సకాలంలో గుర్తించి సరైన వైద్యం, కౌన్సెలింగ్ చేయిస్తే ఫలితం ఉంటుంది. అలా కాకుండా వారిని మార్చేందుకు ఆంక్షలు పెట్టడం, నిందిస్తూ మాట్లాడితే చివరకు కుటుంబ సభ్యులపై కక్ష పెంచుకుంటారు. అదును కోసం ఎదురు చూసి హతమార్చేందుకు సిద్ధమవుతారు. – డా.సి.వీరేందర్, సైకాలజిస్ట్ -
గోమయం.. దివ్యమైన హోమం
ఆవుపేడ కదా అందులో ఏముంది అనుకునే వారికి దాని విలువ తెలియకపోవచ్చు.. ముందు తరాలవారు దాని విశిష్టతను గుర్తించారు. వారికి దాని ఉపయోగాలు తెలుసు..అందుకే ఆవు పేడ నీటితో కళ్లాపి చల్లేవారు.. పేడ అలికిన ఇల్లు శుభదాయకమని చెప్పేవారు. మట్టి గోడలకు పేడను అలికేవారు.. ఇలా క్రిమి కీటకాలను ఆవుపేడ నశింపజేస్తుందని వారు ముందే పసిగట్టారు. పేడ విలువను గుర్తించిన నేటితరం ఆవుపేడతో చెయ్యలేనిది ఏమీ లేదని నిరూపిస్తున్నారు. ఇప్పటికే ఆవు పేడతో సేంద్రియ ఎరువులు, బయోగ్యాస్ , పిడకలు, విభూతి, పళ్లపొడి, రాఖీలు, ప్రమిదలు, బొమ్మలు, దేవుళ్ల ప్రతిమలు, కుండీలు, జపమాలలు, అగరొత్తులు అంటూ ఎన్నో రకాలుగా ఆవు పేడను వినియోగిస్తున్నారు. ఇలా ఆవు పేడలో మూలికలు కలిపి అగ్నిహోత్ర పిడకలు తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు రాజుల కండ్రిగ రైతు సుబ్బరాజు. నగరి : పీల్చే గాలి కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలనే సదుద్దేశంతో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా చిత్తూరు జిల్లా నగరి మండలం రాజులకండ్రిగకు చెందిన రైతు సుబ్బరాజు అగ్నిహోత్ర పిడకలు తయారు చేస్తున్నారు. రైతుగా సేంద్రియ పద్ధతిలో నూతన పంటలు సాగు చేసి అందరి మెప్పు పొందిన ఆయన పాడి రైతుగాను ఆరోగ్యమిచ్చే అంశాలపైనే దృష్టిసారించారు. హోమ పూజలు, ఇళ్లలో దూపం వేసే సమయంలోనూ వచ్చే పొగ ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకునే ఆయన పర్యావరణ రక్షణకు సంబంధిత ఆయుర్వేద గ్రంథాలు చదవడం, సంబంధిత శాఖలోని వారిని కలిసి వారి వద్ద సలహాలు, సూచనలు పొంది అగ్నిహోత్ర పిడకల తయారీకి పూనుకున్నారు. కష్టంతో కూడుకున్న పనే అయినా పర్యావరణ రక్షణపై ఉన్న వ్యామోహంతో ఇంటి వద్దే ఒక పాక వేసుకొని అగ్నిహోత్ర పిడకల తయారీ చేస్తున్నారు. ఒక్కో పిడక రూ.30 10 కిలోల ఆవు పేడతో పిడకలు తయారు చేయాలంటే 3 కిలోల నెయ్యి , పాలు, పెరుగు, పంచితం అవసరం. వీటితో పాటు వేసే మూలికలు స్థానికంగా లభించవు. కొన్ని వస్తువులు చెన్నైలోని ఆయుర్వేద షాపునకు వెళ్లి తీసుకొస్తున్నారు. ఇలా తయారు చేయాలంటే ఒక్కో పిడకకు రూ.25 ఖర్చు అవుతోందని చెబుతున్నారు. వీటిని రూ.30కి విక్రయిస్తున్నారు. లాభాల కన్నా ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు రైతు సుబ్బరాజు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చుట్టు పక్కల ఉన్న ఆలయాలలో జరిగే హోమ పూజలు, ఇళ్లలో జరిగే పూజలకు వాడటంతో పాటుతో తమిళనాడు, కర్ణాటకలలో జరిగే హోమ పూజలకు అగ్నిహోత్ర పిడకలు నగరి నుంచి తీసుకొని వెళతారు. ఒక్కసారి ఈ పిడకలు వాడి వాటి ప్రయోజనాలు తెలుసుకున్నవారు వాటిని వదలరు. తయారీ ఇలా.... దేశీవాళీ గిర్ ఆవుల పేడలో నెయ్యి, పాలు, పెరుగు, పంచితం, హోమ ద్రవ్యాలైన రావి, మోదుగ, జమ్మి, అర్క, గరిక, దర్భ, మేడి, చండ్ర, సరస్వతీ, తామర మొదలగు సమిధలతో పాటు సాంబ్రాణి, సర్జారసం, తెల్ల గుగ్గులు, వస, జటామాన్సి, ఆవాలు, కస్తూరి పసుపు, అపరాజిత, వేప, సుగంధి పాల, గ్రంథి తగర, చెంగాల్వ కోస్తు, పచ్చ కర్పూరం మొదలగు సుగంధ భరిత ద్రవ్యాలను కలిపి ముద్దలు చేసి కావాల్సిన ఆకారంలో చేసి ఎండబెడతారు. ఇలా శా్రస్తోక్తంగా పవిత్రంగా ఈ పిడకలు తయారవుతాయి. కావాల్సిన సామగ్రి సమకూర్చడానికి మాత్రమే ఎక్కువ సమయం పడుతుంది. అన్ని వస్తువులు ఉంటే రోజుకు ఒక మనిషి 300 పిడకలు చేసి ఎండబెట్టవచ్చు.వినియోగించడం ఎలా.. ఇంట్లో హోమ ద్రవ్యంగాను , అగ్నిహోత్రంగా, ధూపంగా వేసినట్లైతే మూలికలతో తయారైన ఈ పిడకల నుంచి వచ్చే పొగ రోగ కారక క్రిములను అంతరిపంజేసి, వాతావరణ కాలుష్యం నివారించి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ విరివిగా లభిస్తుంది. ఆరోగ్యంతో పాటు సుగంధ భరితమైన సువాసనలతో ఇంటి వాతావరణం ఆధ్యాతి్మకతను సంతరించుకుంటుంది. ఆరోగ్యం కోసమే చేస్తున్నా ఆరోగ్యకరమైన పంటల కోసం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. అలాగే గాలి కూడా వీలైనంత మేర ఆరోగ్యకరంగా ఇవ్వాలనే ఆలోచనే ఈ పిడకల తయారీకి దారి తీసింది. పూర్వీకులు ఉదయాన్నే సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాల నుంచి వెలువడే రేడియేషన్ను నిర్మూలించేందుకు ఆవుపేడను నీళ్లలో కలిపి కళ్లాపి చల్లేవారని ఈ మధ్య కాలంలో జరిపిన ప్రయోగాల్లో కనుగొన్నారు.ఒక పిడక మీద సెల్ ఫోన్ ఉంచినప్పుడు అది వెలువరించే రేడియేషన్ పరిమాణం తగ్గినట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపినట్లు పత్రికల్లో చదివాను. ఆయుర్వేద గ్రంథాలలో వాయు కాలుష్య నివారణకు సూచించిన మార్గాలను తెలుసుకొని ఆయుర్వేదానికి సంబంధించి కొందరి సలహాలతో అగ్నిహోత్ర పిడకలను తయారు చేస్తున్నా. లాభాల కన్నా ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే వీటిని తయారు చేస్తున్నా. – సుబ్బరాజు, పాడి రైతు, రాజులకండ్రిగ -
గుండె ఆరోగ్యాన్ని తెలిపే ‘లెక్క’!
ఫిట్నెస్ బ్యాండ్లు లేదా స్మార్ట్ వాచీలు మన హృదయ స్పందనల్లో తేడాలను గుర్తించి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుండటం తెలిసిందే. అయితే ఓ చిన్న ‘లెక్క’సాయంతో అంతకన్నా మరింత కచ్చితత్వంతో గుండె ఆరోగ్యాన్ని గుర్తించే విధానాన్ని పరిశోధకులు తాజాగా గుర్తించారు. ఇటీవల జరిగిన అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ (ఏసీసీ–2025) సమావేశంలో ఆ సరికొత్త ‘పారామీటర్’ను ప్రకటించారు. – సాక్షి, స్పెషల్ డెస్క్ఏమిటా పారామీటర్?ఒక రోజులో ఒక వ్యక్తి వేసిన అడుగుల సంఖ్యను ఆ రోజు అతడి హృదయ స్పందనల సగటు రేటుతో భాగించడమే ఆ పారామీటర్ (చిన్న లెక్క). అలా వచ్చిన ఆ విలువను ‘డైలీ హార్ట్ రేట్ పర్ స్టెప్ (డీహెచ్ఆర్పీఎస్)గా పేర్కొంటున్నారు. ఒక వ్యక్తి గుండె ఆరోగ్య స్థితిని కచ్చితంగా అంచనా వేసేందుకు ఈ పారామీటర్ దోహదపడుతుందంటున్నారు పరిశోధకులు. ఒకవేళ ఈ విలువ ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తిలో గుండె జబ్బులు వచ్చే ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుందంటున్నారు. డీహెచ్ఆర్పీఎస్ ఉండాల్సిన దానికంటే గుండె స్పందనలు ఎక్కువగా ఉన్నా లేదా మరీ తక్కువగా ఉన్నా కూడా గుండె ఆరోగ్యం బాగోలేదనడానికి సూచిక అని చెబుతున్నారు. సుమారు 7 వేల మందికి సంబంధించిన 58 లక్షల పర్సన్–డేస్, వారు నడిచిన 5,100 కోట్ల అడుగులను విశ్లేషించి ఈ విషయాన్ని వారు చెప్పారు. అయితే ఇవి కేవలం మొదట చేసిన ఓ అధ్యయన ఫలితాలతో వెల్లడైన అంశాలేనని.. వాటిని పూర్తి రోగ నిర్ధారణగా చెప్పడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని పరిశోధకులు పేర్కొంటున్నారు. అయితే వాటన్నింటిలోనూ ఇదే విషయం నిర్ధారణ అయితే భవిష్యత్తులో గుండె పరీక్షలకు దీన్నే ఓ ప్రామాణిక పారామీటర్గా తీసుకొనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. డీహెచ్ఆర్పీఎస్ ఎక్కువగా ఉంటే రాబోయే అనారోగ్య సమస్యలు ఇలా..⇒ టైప్–2 డయాబెటిస్ ముప్పు 2 రెట్లు ఎక్కువ ⇒ గుండె వైఫల్యం ముప్పు 1.7 రెట్లు ఎక్కువ ⇒ అధిక రక్తపోటు ముప్పు 1.6 రెట్లు ఎక్కువ ళీ కరొనరీ ఆర్టరీ డీసీజ్ ముప్పు 1.4 రెట్లు ఎక్కువ -
సౌర వ్యవస్థకు ఆవల జీవం!
అనంతమైన విశ్వంలో మన భూగోళంపైనే కాకుండా ఇంకెక్కడైనా జీవజాలం ఉందా? జీవులు మనుగడ సాగించే వాతావరణ పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం కనిపెట్టడానికి శతాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇతర గ్రహాలపై జీవుల ఉనికి ఉండొచ్చని అంచనా వేస్తున్నప్పటికీ అందుకు కచ్చితమైన ఆధారాలైతే లభించలేదు. గ్రహాంతర జీవులు కాల్పనిక సాహిత్యానికే పరిమితమయ్యాయి. కానీ, మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న ‘కే2–18బీ’ అనే గ్రహంపై జీవం ఉందని చెప్పడానికి బలమైన సాక్ష్యాధారాలు లభించాయని యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు వెల్లడించారు. ఈ గ్రహం మన భూమి నుంచి 124 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. భూమితో పోలిస్తే 8.5 రెట్లు పెద్దది. కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ‘నాసా’కు చెందిన జేమ్స్వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఈ గ్రహంపై డైమిౖథెల్ సల్ఫైడ్(డీఎంఎస్), డైమిౖథెల్ డైసల్ఫైడ్(డీఎండీఎస్) అనే రకాల వాయువుల కెమిల్ ఫింగర్ఫ్రింట్స్ను గుర్తించారు. ఈ రెండు రకాల వాయువులు భూమిపైనా ఉన్నాయి. ఇవి కేవలం జీవ సంబంధమైన ప్రక్రియల ద్వారానే ఉత్పత్తి అవుతాయి. సముద్రంలోని ఆల్గే(మెరైన్ ఫైటోప్లాంక్టన్)తోపాటు ఇతర జీవుల నుంచి ఈ వాయువుల ఉత్పత్తి అధికంగా జరుగుతుంది. దీన్నిబట్టి కే2–18బీ గ్రహంపై జీవం ఉందని తేల్చారు. అచ్చంగా భూమిపై ఉన్నట్లుగా అక్కడ జీవించి ఉన్న ప్రాణులు లేనప్పటికీ జీవసంబంధిత ప్రక్రియలు జరుగుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే, దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని పేర్కొంటున్నారు. మనం ఒంటరివాళ్లం కాదు: మధుసూదన్ జీవుల మనుగడ సాధ్యమయ్యే మరో గ్రహం దొరికిందని చెప్పడానికి ఇది తొలి సంకేతమని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో అస్ట్రోఫిజిక్స్, ఎక్సోప్లానెటరీ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న నిక్కు మధుసూదన్ వెల్లడించారు. సౌర వ్యవస్థకు బయట జీవం ఉనికిని పరిశోధించే విషయంలో ఇదొక కీలకమైన మలుపు అని తెలిపారు. ఇతర గ్రహాలపై మన సహచర జీవులు ఉన్నాయని కచ్చితంగా చెప్పే రోజు మరికొన్ని సంవత్సరాల్లో వస్తుందని మధుసూదన్ స్పష్టంచేశారు. మనం ఒంటరివాళ్లం కాదన్నారు. హైసియన్ ప్రపంచాలు కే2–18బీ గ్రహం సబ్–నెప్ట్యూన్ తరగతికి చెందినది. అంటే ఇలాంటి గ్రహాల వ్యాసం భూమి వ్యాసం కంటే ఎక్కువ, నెప్ట్యూన్ వ్యాసం కంటే తక్కువ. కే2–18బీ గ్రహం ఎలా ఏర్పడిందన్నది ప్రస్తుతానికి మిస్టరీగానే ఉంది. దీనిపై మిథేన్, కార్బన్డయాక్సైడ్, డైమిౖథెల్ సల్ఫైడ్, డైమిౖథెల్ డైసల్ఫైడ్ వాయువులు సమృద్ధిగా ఉన్నట్లు 2023లో కనిపెట్టారు. 1990 నుంచి ఇప్పటివరకు సౌర వ్యవస్థ బయట 5,800 గ్రహాలను గుర్తించారు. వీటిని ఎక్సోప్లానెట్స్ అని పిలుస్తున్నారు. హైసియన్ ప్రపంచాలు అని కూడా అంటున్నారు. వీటిలో చాలావరకు ద్రవరూపంలోని నీటి సముద్రాలతో కప్పి ఉన్నాయని, ఎక్సోప్లానెట్స్పై హైడ్రోజన్తో కూడిన వాతావరణం ఉందని చెబుతున్నారు. ఆయా గ్రహాలపై జీవులు ఉండేందుకు వంద శాతం ఆస్కారం ఉందని, వాటిని గుర్తించడమే మిగిలి ఉందని పేర్కొంటున్నారు. పరిశోధనల దిగ్గజం నిక్కు మధుసూదన్ ఇండియన్–బ్రిటిష్ ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ ఎక్సోప్లానెట్స్ను గుర్తించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన సమర్పించిన ఎన్నో పరిశోధన పత్రాలు అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పలు అధ్యయనాలకు ఆయన నేతృత్వం వహిస్తున్నారు. మధుసూదన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–వారణాసిలో బీటెక్ పూర్తిచేశారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో ఎంఎస్, పీహెచ్డీ అభ్యసించారు. 2020లో వాస్ప్–19బీ అనే గ్రహంపై టైటానియం ఆౖక్సైడ్ను గుర్తించిన బృందంలో ఆయన కూడా ఉన్నారు. కే2–18బీ గ్రహంపై పరిశోధనలు సాగిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
భూకంపం నుంచి బిడ్డను రక్షించుకునేందుకు.. వలయాన్ని సృష్టించిన ఏనుగులు
ప్రాణి ఏదైనా పిల్లల పట్ల చూపించే ప్రేమ, తీసుకునే జాగ్రత్తలు ఒకేతీరుగా ఉంటాయి. అందుకు తాజా ఉదాహరణ ఈ ఘటన. సోమవారం దక్షిణ కాలిఫోర్నియాలో 5.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఒక్కసారిగా కదలికలను గమనించిన శాన్డియాగో జంతు ప్రదర్శనశాలలోని ఏనుగులు అప్రమత్తమయ్యాయి. జూ సఫారీ పార్కులో ఉన్న ఆఫ్రికన్ ఏనుగుల గుంపు ఒకేచోట చేరింది. తమ పిల్లలను రక్షించుకోవడానికి వలయం ఏర్పాటు చేసింది. మధ్యలో పిల్లలను ఉంచిన ఏనుగులు ఏ పక్క నుంచి ఏ ముప్పు ఉందోనని చుట్టుపక్కల పరిశీలించడం మొదలుపెట్టాయి. చెవులు చాచి, కళ్లు పరిసరాలను పరిశీలిస్తూ, ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నట్టుగా నిలబడి ఉన్నాయి. గుంపులో ఉన్న మగ ఏనుగు పిల్ల కూడా రక్షణ వలయంలోకి వచ్చి నిలబడింది. దానికి తల్లి ఏనుగు తొండంసాయంతో నేనున్నా అనే భరోసాను సైతం ఇచ్చింది. భూమి కంపించడం ప్రారంభించిన క్షణాల్లోనే ఏనుగులు చర్యకు దిగాయి. ఎన్క్లోజర్లోని నిఘా కెమెరాలు ఈ దృశ్యాలను బంధించాయి. ‘అలర్ట్ సర్కిల్’అనిపిలిచే ఈ సహజ రక్షణ వలయం. బలహీనమైన సభ్యులు భయపడకుండా ఉండేందుకు ఏనుగులు ఈ విలక్షణమైన పవర్తనను కలిగి ఉంటాయి. ఇది వాటి తెలివితేటలకు, సామాజిక బంధానికి నిదర్శనమని జంతుప్రదర్శనశాల క్షీరదాల క్యూరేటర్ మిండీ ఆల్బ్రైట్ తెలిపారు. ఏనుగులు తమ పాదాల ద్వారా భూకంప కార్యకలాపాలను గ్రహించగలవని, ఆయా జంతువులకు ముందుగానే తెలిసిపోతుందని వెల్లడించారు. సుమారు గంట తర్వాత భూప్రకంపనలు రావడంతో ఆ గుంపు మరోసారి రక్షణ వలయాన్ని ఏర్పరిచింది. ముప్పేమీ లేదని నిర్ణయించుకున్నాకే విశ్రాంతి తీసుకుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కెనడా వర్సిటీల వైపు అమెరికా విద్యార్థుల చూపు
అమెరికాలో విద్యార్థులు ఇప్పుడు కెనడా వైపు దృష్టి సారించారు. ట్రంప్ విధానాల నేపథ్యంలో కెనడియన్ విశ్వవిద్యాలయా లు అమెరికా విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేయ డం, యూనివర్సిటీ నిధులను తగ్గించడంవంటి చర్యల ఫలితంగా.. యూనివ ర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొ లంబియా (యూబీసీ), యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, యూనివర్శిటీ ఆఫ్ వాటర్లూ వంటి కెనడియన్ విశ్వవిద్యాలయాలకు అమెరికా విద్యార్థుల దరఖాస్తులు పెరిగాయి. వాంకోవర్లో ఉన్న యూబీసీ క్యాంపస్లో 2024తో పోలిస్తే మార్చి1 నాటికి యూఎస్ పౌరుల నుంచి గ్రాడ్యుయేషన్ దరఖాస్తుల్లో 27% పెరుగుదల నమోదైంది. ఈ సంస్థ కొన్ని ప్రోగ్రామ్స్ కోసం అడ్మిషన్లను ఈవారం కూ డా తిరిగి తెరిచింది. ఈ నేపథ్యంలో సెపె్టంబర్ 2025 నాటికి యూఎస్ విద్యార్థుల నుంచి దరఖాస్తుల సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నారు. టొరంటో విశ్వవిద్యాలయానికి కూడా సాధారణం కంటే ఎక్కువ సంఖ్యలో యూఎస్ నుంచి దరఖాస్తులు వచ్చాయి. వాటర్లూ విశ్వవిద్యాలయంలో, సెపె్టంబర్ 2024 నుంచి యూఎస్ వెబ్ ట్రాఫిక్ 15% పెరిగింది. ఎక్కువ మంది అమెరికన్ విద్యార్థులు క్యాంపస్ను వ్యక్తిగతంగా సందర్శిస్తున్నారని కూడా నివేదికలు చెబుతున్నాయి. ఈ ఆకర్షణకు కారణాలు.. ట్రంప్ ప్రభుత్వం హఠాత్తుగా వీసాలను రద్దు చేయడం, విదేశీ విద్యార్థుల సోష ల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షించడం, కాలేజీలకు ఫెడరల్ ఫండింగ్ తగ్గించడం ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ పలువురు విద్యార్థులు, కుటుంబాల్లో భవిష్యత్తుపై భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. స్టూడెంట్ వీసాలు, యూనివర్సిటీ ఫండింగ్పై అమెరికాలో నిరసనలు, దావాలు ఎదుర్కొంటున్న సమయంలో కెనడా విద్యకు మరింత స్థిరమైన, స్నేహపూర్వక గమ్యస్థానంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడా కొన్ని పరిమితులున్నాయి. తమ దేశంలోకి ప్రవేశించే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై కెనడా ప్రభుత్వం కూడా పరిమితి విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ పెరిగిన క్యాంపస్ టూర్లు.. యూబీసీలో యూఎస నుంచి అండర్ గ్రాడ్యుయేయేషన్ అప్లికేషన్లు కేవలం 2% మాత్రమే పెరిగినా, అమెరి కన్–నిర్దేశిత క్యాంపస్ టూర్లు మాత్రం 20% పెరిగాయి. ఆసక్తి పెరుగుతోందని, ఎక్కువ మంది విద్యార్థులు కెనడియన్ విశ్వవిద్యాలయాలను వాస్తవ అవకాశంగా చూస్తున్నారని ఇది సూచిస్తుంది. తమ క్యాంపస్లకు అంతర్జాతీయ విద్యార్థులను పంపే మొదటి మూడు దేశాల్లో అమెరికా ఇప్పటికే ఒకటి అని యూబీసీ వార్షిక నివేదిక పేర్కొంది. ఇప్పటికే సుమారు 1,500 మంది యూఎస్ విద్యార్థులు యూబీసీలో గ్రాడ్యుయేషన్, అండర్గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. -
ట్రంప్కు కీలెరిగి వాత
అరుదైన ఖనిజాల ఎగుమతుల నిలిపివేత ద్వారా అమెరికాను చైనా నేరుగా కుంభస్థలంపైనే కొట్టిందని పరిశీలకులు అంటున్నారు. దీని ప్రభావం అమెరికా రక్షణ శాఖపై భారీగా ఉండనుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫైటర్ జెట్లు తదితరాల తయారీని ఇది తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న మొత్తం అరుదైన ఖనిజాల్లో ఏకంగా 70 శాతం వాటా చైనాదే! అమెరికా వాటా 11.4 శాతం.కానీ దేశీయ, ముఖ్యంగా రక్షణ అవసరాలను తీర్చేందుకు ఆ నిల్వలు ఏ మూలకూ చాలవు. మలేసియా, జపాన్ సహా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నా అవి 30 శాతం అవసరాలనే తీర్చగలుగుతున్నాయి. దాంతో మరో దారిలేక అగ్ర రాజ్యం ఇంతకాలంగా చైనా దిగుమతులపైనే ప్రధానంగా ఆధారపడుతూ వస్తోంది. తన అరుదైన ఖనిజ అవసరాల్లో 70 శాతం అక్కడినుంచే దిగుమతి చేసుకుంటోంది. చైనా ఇప్పుడు సరిగ్గా గురి చూసి ఆ కీలకమైన సరఫరా లింకును మొత్తానికే తెగ్గొట్టింది.17 రకాల అరుదైన ఖనిజాల్లో సమారియం, గాడోలినియం, టెర్బియం, డైస్పోరియం, లుటేటియం, స్కాండియం, ఇత్రియం రూపంలో ప్రస్తుతానికి ఏడింటికి ఎగుమతుల నిషేధాన్ని వర్తింపజేసింది. వీటితో పాటు పలు కీలక లోహాలు, అయస్కాంత వస్తువులను కూడా ఈ జాబితాలో చేర్చింది. ఇకపై చైనా కంపెనీలు వీటిని ఎగుమతి చేయాలంటే ప్రత్యేక లైసెన్సులు తీసుకోవాల్సిందే. చైనా నిర్ణయం పలు అమెరికానే గాక చాలా దేశాలనూ ప్రభావితం చేయనుంది. ముఖ్యంగా యూరప్ దేశాలకైతే పిడుగుపాటే. వాటి అరుదైన ఖనిజాల అవసరాల్లో సగటున 46 శాతం దాకా చైనా దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి.అనుమానమే నిజమైందిఅత్యంత కీలకమైన ఖనిజ అవసరాల కోసం చైనాపై ఆధారపడటం ఎప్పటికైనా ప్రమాదమేనని అమెరికా రక్షణ శాఖ ముందునుంచీ మొత్తుకుంటూనే ఉంది. ఇది జాతీయ భద్రతకే ముప్పని 2024 మార్చి 11న అధ్యక్షునికి పంపిన ఓ నోట్లో స్పష్టంగా పేర్కొంది కూడా. ఈ విషయంలో అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో చాలావరకు చైనామీదే ఆధారపడాల్సి రావడంపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఆ భయాలే ఇప్పుడు నిజమయ్యాయి. రక్షణ పాటవం పెంచుకోవడంలో అమెరికా, చైనా కొన్నేళ్లుగా నువ్వా, నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి.కీలక ఖనిజాలపై ఆంక్షలతో ఈ పోటీలో అగ్ర రాజ్యాన్ని దాటి చైనా దూసుకెళ్లేలా కన్పిస్తోంది. ఈ సమస్యను అధిగమించే మార్గాలపై అమెరికా రక్షణ శాఖ కొంతకాలంగా గట్టిగా దృష్టి సారించింది. దేశీయంగా అరుదైన ఖనిజాల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇతోధికంగా పెంచుకునేలా ‘మైన్ టు మాగ్నెట్’ పేరిట ఐదేళ్ల ప్రణాళికను సిద్ధం చేసింది. కానీ ఆలోగా జరిగే అపార నష్టాన్ని భర్తీ చేసుకునే మార్గాంతరాలు కన్పించక ట్రంప్ సర్కారు తలపట్టుకుంటోంది.అన్నింట్లోనూ అవే కీలకంఫైటర్ జెట్లు మొదలుకుని కీలకమైన రక్షణ వ్యవస్థలన్నింట్లోనూ అరుదైన ఖనిజాలది కీలక పాత్ర. ఎఫ్–35 యుద్ధ విమానాలు, వర్జీనియా–కొలంబియా శ్రేణి జలాంతర్గాములు, తోమహాక్ క్షిపణులు, రాడార్ వ్యవస్థలు, ప్రిడేటర్ శ్రేణి మానవరహిత వైమానిక వాహనాలు, మ్యునిషన్ సిరీస్ స్మార్ట్ బాంబులు... ఇలా దేని తయారీకైనా అవి కావాల్సిందేనని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ వివరించింది.⇒ ఒక ఎఫ్–35 యుద్ధ విమానం తయారీకి 900 పౌండ్ల (400 కిలోల) మేరకు అరుదైన ఖనిజాలు కావాలి.⇒ అర్లే బ్రూక్ శ్రేణి డీడీజీ–51 డిస్ట్రాయర్ యుద్ధనౌక తయారీకి ఏకంగా 5,200 పౌండ్లు (2,300 కిలోలు) అవసరం.⇒ అదే వర్జీనియా శ్రేణి జలాంతర్గామి నిర్మాణానికి 9,200 పౌండ్ల (4,173 కిలోల) అరుదైన ఖనిజాలు అవసరం.ఆందోళనకరమే⇒ ఖనిజాలపై చైనాతో చర్చిస్తాం ⇒ ట్రంప్ ఆర్థిక సలహాదారువాషింగ్టన్: అరుదైన ఖనిజాలు, కీలక లోహాలు, అయస్కాంత పదార్థాల ఎగుమతులను నిలిపేస్తూ చైనా తీసుకున్న నిర్ణయం అమెరికాను తీవ్ర ఆందోళనకు గురిచేసే అంశమేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక సలహాదారు కెవిన్ హసెట్ అంగీకరించారు. సోమవారం ఆయన వైట్హౌస్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఆ అరుదైన ఖనిజాల అవసరం రక్షణ, టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలకు చాలా ఉంటుంది.చైనా నిర్ణయాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నాం. ఈ విషయమై మాకు అందుబాటులో ఉన్న అన్ని ఇతర అవకాశాలనూ పరిశీలిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. బహుశా డ్రాగన్ దేశంతో తాము చర్చలు జరిపే అవకాశాలు లేకపోలేదన్నారు. చైనా నిర్ణయంతో పలు యూరప్ దేశాల్లో కూడా ఆటోమొబైల్స్, సెమీ కండక్టర్లు తదితర కంపెనీలు తీవ్రంగా ప్రభావితమవుతాయని అభిప్రాయపడ్డారు. ట్రంప్ ప్రతీకార సుంకాల వల్ల అమెరికా ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుతుందన్న వాదనను హసెట్ తోసిపుచ్చారు. అమెరికా, చైనా మధ్య తీవ్రస్థాయి టారిఫ్ల పోరు సాగుతున్న విషయం తెలిసిందే. -
ఇక్కడే పుట్టి.. ఇపెరిగాం.. ఇప్పుడు వీడి పోవాలా ?
ఊరంటే కేవలం మట్టి కాదు..ఆ వాసనతో పెనవేసుకున్న ఇగిరిపోని బంధం. ఊరంటే ఇళ్లే కావు.. వాటితో ఉండే అనుబంధాల కాపురాలు. ఊరంటే ఇవే కాదు.. గడప గడపలో కనిపించే ఎడతెగని ఆప్యాయతలు.. వీధి వీధితో విడదీయలేని నేస్తుల అభిమానాలు.. దారి దారిలో విరబూసిన సుగంధాల పరిమళాలు.. ప్రతి కుడ్యం అందమైన చిత్రం... చెట్టూచేమ, రాయీరప్పా.. బండిపెండి, పాదు, పసిరక, ఏరుగట్టు, పైరు గాలి.. ఇలా అన్నీ అపురూపాలే.. ఊళ్లే లేకుండా పోతున్నాయక్కో.. ఈ మట్టితో బంధం తెగిపోతున్నదక్కో.. ముల్లె సదురుకుని ఎల్లిపోవాలక్కో.. అంటూ పోలవరం నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో చింతూరు, కూనవరం, వీఆర్పురం, ఎటపాక మండలాల్లో పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఈ ప్రాంతాలను వీడి పునరావాస ప్రాంతాలకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా గ్రామాలతో పెనవేసుకున్న బంధం వీడనుండడంతో నిర్వాసితుల్లో ఆందోళన ప్రారంభమైంది. పుట్టిన ఊళ్లను, పెరిగిన ఇళ్లను, సాగు భూములను వదిలి వెళ్లలేక వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రాంతాలను వదిలివెళ్లడం ద్వారా తమ సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగు కానున్నాయని ప్రధానంగా గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. – చింతూరుపోలవరం ముంపు గ్రామాల్లో పరిహారం, పునరావాస ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ముందుగా ప్రాధాన్యతా క్రమంలో చేర్చిన ప్రతి ముంపు గ్రామంలో గ్రామసభలను నిర్వహిస్తున్నారు. ముంపునకు గురవుతున్న గ్రామానికి సంబంధించిన నిర్వాసితుల జాబితాలను గ్రామసభల్లో వెల్లడిస్తున్నారు. దీంతో పరిహారం సొమ్ములు అందినవెంటనే గ్రామాలను ఖాళీచేయాల్సి వస్తుందని నిర్వాసితుల్లో జోరుగా చర్చ సాగుతోంది. కాగా ప్రస్తుతం గ్రామసభలు నిర్వహిస్తున్న అధికారులు నిర్వాసితుల అభిప్రాయాల మేరకు పునరావాస ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించడంతో అన్నిరకాల మౌలికసౌకర్యాలు కల్పిం చిన అనంతరం మాత్రమే వారిని ఇక్కడినుంచి తరలించాల్సి ఉంటుంది. రాళ్లు రప్పలతో నిండిన భూములను దశాబ్దాలుగా ఎంతో కష్టపడి ఇప్పుడిప్పుడే సాగుకు అనుకూలంగా మార్చుకున్నారు. ఆ భూములు ఇప్పుడు ముంపునకు గురవుతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునరావాస ప్రాంతంలో భూములన్నీ రాళ్లు, రప్పలతో సాగుకు అనుకూలంగా లేవని వాటిని మళ్లీ అభివృధ్థి చేసి సాగులోకి తెచ్చేందుకు ఏళ్ల సమయం పడుతుందని వారు అంటున్నారు.సంతలు కనుమరుగేనా? గిరిజనులు నిత్యావసరాల కొనుగోలుకు సంతల పై ఆధారపడతారు. చింతూరులో ప్రతి బుధవా రం పెద్ద సంత జరుగుతుంది. సంతలకు మారుమూల గ్రామాలకు చెందిన గిరిజనులు అధికసంఖ్యలో వచ్చి వారానికి సరిపడా నిత్యావసరాలు కొనుగోలు చేసుకుని వెళ్తుంటారు. తాము సేకరించిన అటవీ ఉత్పత్తులను సంతల్లో విక్రయించి ఆదాయాన్ని పొందుతుంటారు. సంతలు కేవలం వ్యాపార స్థలాలుగానే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలకు, ఆచారవ్యవహారాలకు కేంద్రాలుగా, స్నేహబంధం కొనసాగించే ప్రాంతాలుగా గిరిజనుల జీవితాలతో ముడిపడి ఉన్నాయి. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుతో ఆయా సంత ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. పండగలకు అధిక ప్రాధాన్యత గిరిజనులు తమ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా పండగలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. ప్రతి గ్రామంలో గ్రామదేవతలను ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహిస్తారు. తొలకరి ప్రారంభంతో పంటలు బాగా పండాలని భూమిపండగ, బీరకాయ, ఆనపకాయ తినేందుకు పచ్చపండగ, వరివిత్తనాలు నాటే సమయంలో కొత్తల్ పండగ, చిక్కుడు కాయలు తినేందుకు చిక్కుడు పండగల ను వారు నిర్వహిస్తారు. దీంతో పాటు పెళ్లిళ్ల సమయంలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ప్రతి మూడేళ్లకు కొలుపులు నిర్వహిస్తారు. భూమిపండగ ఈ ప్రాంత గిరిజను లకు ఎంతో ప్రత్యేకమైనది. పండగలో భాగంగా పురుషులు సమీపంలోని అడవికి వెళ్లి సంప్రదాయ జంతువుల వేట కొనసాగిస్తుంటారు. మహిళలు తమ గ్రామాలకు సమీపంలోని ప్రధాన రహదారులపై సంప్రదాయ గిరిజన నృత్యాలు చేస్తూ వాహనదారుల నుంచి పండగ ఖర్చుల కోసం విరాళాలు సేకరిస్తారు.ప్రస్తుతం పోలవరం ముంపులో భాగంగా తమను మైదాన ప్రాంతాలకు తరలిస్తుండడంతో భూమి పండగ నిర్వహించే అవకాశాలు ఉండవేమోనని వారు ఆందోళన చెందుతున్నారు.ముంపుబారిన ఆదాయాన్నిచ్చే చెట్లు గిరిజనులకు పలురకాల చెట్లు ఆదాయాన్ని అందిస్తుంటాయి. విప్ప, తాటి, చింత, మామిడిచెట్లు వీటిలో ప్రధానమైనవి. విప్పచెట్టు నుంచి విప్పపువ్వు, విప్పబద్ద, విప్పనూనె, చింతచెట్టు నుంచి చింతపండు, చింతపిక్కలు సేకరించి విక్రయించడం ద్వారా ఒక్కో కుటుంబం ఏడాదికి రూ.10 వేల వరకు ఆదాయం పొందుతుంది. మామిడిచెట్టు ద్వారా ఏడాదికి రూ.20 వేలు, తాటిచెట్టు ద్వారా ఏడాదికి రూ.లక్ష వరకు, కూరగాయల సాగుద్వారా ఏడాదికి రూ.లక్ష వరకు ఆదాయం పొందుతుండగా ప్రాజెక్టు పూర్తయితే ఇవన్నీ ముంపుబారిన పడి గిరిజనులు ఆదాయం కోల్పోనున్నారు. గ్రామ దేవతలను కోల్పోతున్నాం పోలవరం ముంపుతో మా గ్రామదేవతలను కోల్పోతున్నాం. దేవతలను పూజిస్తే గ్రామానికి మంచి జరుగుతుందనే విశ్వాసంతో ప్రతిఏటా ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. పునరావాస కేంద్రాల్లో గ్రామదేవతలను ప్రతిష్టించేందుకు చాలా సమయం పడుతుంది. – సవలం సుబ్బయ్య, గ్రామపటేల్, చూటూరు, చింతూరు మండలంఊరు వీడాలంటే భయంగా ఉంది దశాబ్దాలుగా భూమిని సాగు చేసుకుని, కూలీనాలీ చేసుకుని వచ్చిన సొమ్ములతో జీవనం సాగిస్తున్నాం. ముంపులో భాగంగా గ్రామాలను వీడాలంటే ఎంతో భయంగా ఉంది. పునరావాస ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నాం. – సవలం లచ్చమ్మ, చూటూరు, చింతూరు మండలం భవిష్యత్తు తలుచుకుంటే ఆందోళనగా ఉంది ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ, పిల్లల్ని చదివిస్తూ జీవనం సాగిస్తున్నాం. కొత్త ప్రాంతంలో మా భవిష్యత్తును తలుచుకుంటే ఆందోళనగా ఉంది. మరోసారి కొత్త జీవితం ప్రారంభించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. – సవలం దారయ్య, మాజీ సర్పంచ్, చూటూరు, చింతూరు మండలం ఈ వ్యక్తి చింతూరు మండలం ఏజీకొడేరుకు చెందిన 80 ఏళ్ల అగరం నారాయణ. ఇతను ఇప్పటివరకు బ్యాంకు పనిమీద మండలకేంద్రం వెళ్లి రావడమే తప్ప ఇతర ప్రాంతాలకు వెళ్లిందిలేదు. అలాంటిది పోలవరం ముంపులో భాగంగా గ్రామం విడిచి కొత్త ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోందని, త్వరలోనే గ్రామంతో బంధం తెగిపోతోందని దిగులు చెందుతున్నాడు. శబరినది పక్కనే నివాసముంటున్న తాను వరదలు వస్తే గ్రామంలోనే ఏదోచోట సురక్షిత ప్రాంతానికి వెళ్లేవాడినని అలాంటిది పోలవరం ఊరును ముంచేస్తుంటే ఇక శాశ్వతంగాగ్రామాన్ని వదలాల్సివస్తోందని మదనపడుతున్నాడు. ఈ 90 ఏళ్ల వృద్ధురాలు ఏజీకొడేరుకు చెందిన బల్లెం ముత్తమ్మ. దశాబ్దాలుగా కుటుంబంతో కలసి గ్రామంలోనే నివాస ముంటోంది. ఆ రోజుకు తినేందుకు కూరలు ఏమీలేకున్నా పక్కనున్న చేలల్లోకి వెళ్లి పచ్చకూర కోసితెచ్చి వండు కుని ఆ పూటకు కడుపు నింపుకొంటామని చెబుతోంది. పోలవరం ముంపులో తమ గ్రామంతో బంధాన్ని వీడి కొత్త ప్రాంతానికి వెళ్లవలసి రావడం ఆవేదన కలగచేస్తోందని ఆమె అంటోంది. అక్కడ సౌకర్యాలు ఎలా ఉంటాయో అర్థంకాని పరిస్థితి నెలకొందని, మాగ్రామం తప్ప ఎప్పుడూ కొత్త ప్రాంతాలకు వెళ్లలేదని, పునరావాసం పేరుతో ఇక్కడి నుంచి తరలిస్తుండడంతో ఈ అవసాన దశలో ఈ కష్టమేంటని ఆమె ఆవేదన వ్యక్తంచేస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న గ్రామాలు, జనాభా వివరాలుగ్రామాలు 190 ప్రాధాన్యతా క్రమంలో చేర్చినవి 32 కుటుంబాలు 13,323 జనాభా 56,108 గిరిజన జనాభా 30,669 -
తాటి ముంజలతో లాభాలు మేటి
జ్యోతినగర్(రామగుండం): మండే వేసవిలో చల్లదనంతోపాటు సంపూర్ణారోగ్యాన్ని చేకూర్చే తాటిముంజల వ్యాపారంతో వేలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. తెలంగాణ లో తాటిముంజలు అంటే తెలియని వారుండరు.. అందుకే వీటికి ఏటా డిమాండ్ పెరుగుతూ వ స్తోంది.. దీన్ని దృష్టిలో పెట్టుకున్న చిరు వ్యా పారులు, రోజువారీ కూలీలు.. గీత కార్మికు ల నుంచి హోల్సేల్గా కొనుగోలు చేస్తూ పట్టణా లు, నగరాలకు తరలిస్తూ విక్రయిస్తున్నారు. మరికొందరు గీత కార్మికులే నేరుగా విక్రయిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏటా 46–48 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. వేడి నుంచి ఉపశమనం కోసం శ్రామికులు, కార్మికులే కాదు.. అధికారులూ తాటిముంజల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిని ఆధారం చేసుకుని పెద్దపల్లి జిల్లాలో సుమారు 100 మంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా పరిశీలిస్తే దాదాపు 500 మంది వరకు తాటిముంజలు విక్రయి స్తూ సీజనల్ ఉపాధి పొందుతు న్నారు.వైద్యులు ఏమంటున్నారంటే..» అరటిపండ్లలో మాదిరిగానే పొటాషియం ఉంటుంది» గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది» రక్తపోటును అదుపులో ఉంచుతుంది» విటమిన్ కే, సీ, బీ, జింక్, ఐరన్, కాల్షియం, పోషకాలు లభిస్తాయి » శరీరంలో ద్రవాలు పెరుగుతాయి» అధిక బరువును నియంత్రిస్తుంది» చెడు కొలెస్ట్రాల్ను తొలగించి, జీర్ణశక్తిని పెంచుతుందిసీజన్ వ్యాపారం బాగుందిప్రతీ సీజన్లో దొరికే మామిడి, దోసకాయలు అమ్ముత. ఈసారి కూడా పల్లెటూరులో గౌడ కులస్తుల వద్ద ముంజకాయలు కొనుగోలు చేసి ఎన్టీపీసీ తీసుకొచ్చిన. గిరాకీ బాగుంది. ఖర్చుపోనూ రోజూవారీ కూలి మంచిగనే గిట్టుబాటవుతోంది. వారం నుంచి ఈ వ్యాపారం చేస్తున్న. – బాకం మల్లేశ్, చిరు వ్యాపారి, ఎన్టీపీసీ రింగ్రోడ్డుచిన్నప్పుడు తినేవాళ్లం చిన్నప్పుడు మా ఊరిలో గౌడ్ నుంచి మా నాన్న ముంజకాయలు తీసుకొచ్చేవారు. ఇప్పుడు తిందామంటే ఊరికి వెళ్లడానికి కుదరడం లేదు. గోదావరిఖనికి వెళ్లి తాటిముంజలు కొనుగోలు చేసి తీసుకొస్తున్న. మా పిల్లలకు కూడా వీటి గురించి చెప్పి తినిపిస్తున్న. ఎండాకాలంలో మంచిది. – స్వరూప, నర్రాశాలపల్లె, ఎన్టీపీసీఅమ్మ తీసుకొచ్చింది నేను పాఠశాల నుంచి వస్తున్నప్పుడు రోడ్డు పక్కన తాటిముంజలు చూసిన. అవి కావాలని మా అమ్మకు చెప్పిన. వెంటనే వెళ్లికొని తీసుకొచ్చింది. చాలా రుచిగా ఉన్నయి. మా పాఠశాలలో కూడా వీటిగురించి చెప్పిన. ఫాస్ట్ఫుడ్ కన్నా ఇవి ఆరోగ్యానికి ఎంతోమంచివని మా ఉపాధ్యాయులు కూడా చెప్పారు. – నిత్యశ్రీ, విద్యార్థిని, ఎన్టీపీసీ, రామగుండంతెలంగాణలో కల్లు ఫేమస్ తెలంగాణలో తాటి, ఈతకల్లు ఫేమస్. వేరే ప్రాంతాల్లో కల్లు గీయడం, తాటి ముంజలు అమ్ముకోవడం చాలా తక్కువ. తెలంగాణలో చాలామంది గీత కార్మికులు ఉన్నారు. తెల్లకల్లు మూడు సీజన్లలో దొరుకుతుంది. వీటిని పొద్దాటి, పరుపుదాటి, పండుతాటి అని అంటారు. నీరా, అడగల్లు కూడా ఉంటుంది. – సింగం మల్లికార్జున్గౌడ్, మేడిపల్లిఆరోగ్యానికి మంచిది తాటిముంజలు తింటే గుండె, లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి వేసవిలో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. వాటిలోని పోషకాలు ఆరోగ్యానికి ఉపయోగకరం. శరీరంలో నీటి శాతం తగ్గకుండా దోహదపడుతాయి. ఎండలో బయటకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ రాజశేఖరరెడ్డి, ఫిజీషియన్, ప్రభుత్వ ఆస్పత్రి, గోదావరిఖని -
ఆ ఊరిలో ఏకంగా 45 హనుమాన్ దేవాలయాలు!
ఊరిలో ఒకటి.. రెండు హనుమాన్ దేవాలయాలు ఉండటం మామూలే. ఒకటి రెండు కాదు.. ఏకంగా 45 హనుమాన్ దేవాలయాలు.. అక్కడితో ఆగకుండా వీధుల్లో అక్కడక్కడ గుడి నిర్మాణాలు జరగని అంజన్న విగ్రహాలు పది వరకు కొలువుదీరి ఉన్నాయి. ఈ వింత జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో మనకు కనిపిస్తుంది. గ్రామంలో ఏ మూలకు వెళ్లిన ఓ అంజన్న దేవాలయం దర్శనమిస్తుంది. అక్కడ నిత్యపూజలు, భక్తజన కోలాహలం ఉంటుంది. ఎందుకిలా ఇంత పెద్ద మొత్తంలో అంజన్న దేవాలయాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఓ సారి ఆ ఊరి చరిత్రలోకి తొంగిచూడాల్సిందే. ఎటూ చూసినా అంజన్న గుళ్లు..వెల్లుల్ల గ్రామ చావడి వద్ద పెద్ద మర్రిచెట్టును ఆనుకుని మూడు దిక్కులా ఎటు చూసినా అంజన్న దేవాలయాలు కనిపిస్తాయి. అక్కడి నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల్లోకి వెళ్తే.. సందుకు ఓ అంజన్న గుడి కనిపిస్తుంది. ఈ గుళ్లు చిన్నవి.. పెద్దవి కావచ్చు. కానీ ఆయా గుళ్లలో హనుమంతునికి నిత్యపూజలు జరుగుతూనే ఉంటాయి. ఇలా వీధుల్లో ఉన్న అంజన్న దేవాలయాలు లెక్కిస్తే ఏతావాతా 45 వరకు ఉన్నాయి. దేవాలయాలే కాకుండా చెరువు కట్ట వద్ద రెండు హనుమాన్ విగ్రహాలు, గ్రామంలోని నాలుగైదు వీధుల్లో హనుమాన్ విగ్రహాలున్నాయి. వీటికి గుళ్ల నిర్మాణం జరగకున్నా భక్తులు ప్రతీ శనివారం పూజలు చేయడం ఆనవాయితీ.ఈ సారి కొండగట్టు హనుమాన్ (Kondagattu Hanuman) జయంతి సందర్భంగా దాదాపు అన్ని హనుమాన్ దేవాలయాలను కాషాయరంగుల్లో అందంగా తీర్చిదిద్దారు. ప్రతీ దేవాలయంలో అంజన్న దీక్షాపరులు దీక్షల కోసం ప్రత్యేక నిలయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఊరి జనాభా సుమారు 2,200 వరకు ఉండగా ఈ సారి హనుమాన్ దీక్షలు తీసుకున్న యువ భక్తుల సంఖ్య ఎంత తక్కువ అనుకున్నా 300 దాకా ఉంటుందని గ్రామానికి చెందిన శ్రీనివాస్ చెప్పడం గమనార్హం. ఇక్కడ ఉన్న అంజన్న గుళ్లకు అభయాంజనేయ, భక్తాంజనేయ, వీరాంజనేయ.. ఇలా వెల్లుల్లలో అంజన్న గుడులు ఉన్న కారణంగా అంజన్న దీక్షా సమయంలో 41 రోజుల పాటు వెల్లుల్ల గ్రామం కాషాయ రంగు పులుముకుని హనుమాన్ భక్తుల సందడి, అంజన్న భజనలతో సందడిగా ఉంటుంది. ఎందుకీ ప్రత్యేకత?జైన చాళుక్యుల పాలనా కాలంలో వెల్లుల్ల గ్రామం (Vellulla Village)లో సుమారు 200 వరకు బ్రాహ్మణ కుటుంబాలు నివాసముండేవి. ఈ బ్రాహ్మణ కుటుంబాల్లో చాలా మంది అంజన్నను ఆరాధ్య దైవంగా భావించేవారు. వీరు తమ ఆరాధ్య దైవానికి నిత్యపూజలు అందించేందుకు వంశాల వారీగా ఎవరికి వారు తమ ఇళ్ల పక్కనే ఉన్న ఖాళీ స్థలాల్లో వీలైన రీతిలో పెద్ద, చిన్న ఆంజనేయ గుళ్లు నిర్మించుకున్నారు. గ్రామంలోని గుట్ట గండి సమీపంలో మర్రిచెట్టు వద్ద ఉన్న ఆంజనేయ ఆలయం ఆ కాలంలో ఈ ప్రాంతంలో ఉన్న దొంగల బారి నుంచి తమను అంజన్న కాపాడతాడనే నమ్మకంతోనే నిర్మించినట్లు గ్రామస్తులు చెబుతారు.ఇలా వంశానికి ఒక్కటి చొప్పున అంజనేయ ఆలయాలు (Anjaneya Temples) నిర్మించడం గ్రామంలో ప్రతీ వీధిలో అంజన్న గుళ్లు కనిపించడానికి ప్రధాన కారణం. కాలక్రమేణా బ్రాహ్మణ కుటుంబాలు ఇక్కడి నుంచి వలస వెళ్లినప్పటికీ గ్రామస్తులు మాత్రం ఆ గుళ్లను తమ ఇంటి అంజన్నగా మార్చుకుని నిత్య పూజలు నిర్వహించడం ఆచారంగా మార్చుకున్నారు. దీనికి తోడు పురాతన కాలంలో నిర్మించిన అంజన్న దేవాలయాలతో పాటు కొత్తగా ఇంటి దగ్గర అంజన్న గుడి ఉంటే శుభప్రదమన్న నమ్మకంతో కొంత మంది తమ తమ ఇళ్ల వద్ద అంజన్న గుళ్లు నిర్మించడంతో పాత, కొత్త అంజన్న దేవాలయాలన్నీ కలిసి వెల్లుల్ల గ్రామాన్ని ‘అంజన్న ఆలయాల ఖిల్లా’గా మార్చాయి. బ్రాహ్మణులు ఏర్పాటు చేసినవే జైనుల కాలంలో వెల్లుల్ల గ్రామంలో సుమారు 200 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవని చెబుతారు. ఆ కుటుంబాలు ఎవరికి వారు అంజన్న గుడులు నిర్మించి నిత్యపూజలు చేసేవారని పెద్దలు చెప్తారు. బ్రాహ్మణులు ఇక్కడి నుంచి వెళ్లిపోయినా అవే గుళ్లు ఇప్పటికీ ప్రజలకు ఆరాధ్యదైవాలుగా మారి పూజలు అందుకుంటున్నాయి. – మార మురళి, వెల్లుల్లఅంజన్న అంటే నమ్మకం మా ఊరిలో అన్ని కుటుంబాలకు ఆరాధ్యదైవం అంజన్న. అంజన్న గుళ్లు నిర్మించుకున్న అన్ని కుటుంబాల నుంచి ఏటా యువకులు అంజన్న దీక్షలు చేపడతారు. అంజన్న దీక్షా కాలంలో మా ఊరు కాషాయమయంగా మారుతుంది. అంజన్న భక్తులను భజనలతో ఊరు మార్మోగుతుంది. – మహేశ్, వెల్లుల్ల, అంజన్న భక్తుడుఆ కాలంలో నిర్మించినవే 1920–30 దశాబ్దిలో వెల్లుల్ల గ్రామంలో ఉన్న 200 బ్రాహ్మణ కుటుంబాలు ఎవరి వంశానికి వారు నిర్మించుకున్న ఆంజన్న గుడులే ఇప్పుడు వెల్లుల్లలో మనకు కనిపిస్తున్నాయి. కాల క్రమేణా బ్రాహ్మణులు ఇక్కడి నుంచి వెళ్లిపోయినా అంజన్నపై నమ్మకంతో గ్రామస్తులు ఆ గుడులను మళ్లీ అభివృద్ధి చేసి పూజలు చేస్తున్నారు. అంతే కాక గ్రామంలో కొత్త ఆలయాలు నిర్మించి తమ భక్తిని చాటుకుంటున్నారు. ఇదే వెల్లుల్లకు ప్రత్యేకతను ఇచ్చింది. – నంబి కిషన్ శర్మ, పూజారి వెల్లుల్ల -
థెరపిస్టు చాట్జీపీటీ
లవ్ బ్రేకప్.. ఒంటరితనం.. ఆఫీసులో కోపిష్టి బాస్ వేధింపులు.. సహోద్యోగులతో ఇబ్బందులు.. జీవితంలో ఏ సమస్య వచ్చినా చెప్పుకోవడానికి, ఓపిగ్గా వినేవారొకరు ఉండాలి. తీరా చెప్పాక జడ్జ్ చేయకుండా ఉంటారా? నిష్పాక్షికంగా పరిష్కార మార్గం సూచిస్తారా? అనుమానమే. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా మానసిక వైద్యులను సంప్రదిస్తారు. కానీ ఇప్పుడు ట్రెండు మారుతోంది. ఈ విషయంలో చాట్జీపీటీకే జనం ఓటేస్తున్నారు. సమస్యలను వినే మంచి ఫ్రెండ్గానే గాక వాటికి పరిష్కారం చూపే కౌన్సిలర్గా కూడా భావిస్తున్నారు. లైఫ్ కౌన్సిలర్ 27 ఏళ్ల మనీశ్ ఇంజనీర్. ప్రియురాలితో గొడవైంది. అపార్థాలతో బంధానికి బ్రేక్ పడింది. మానసికంగా అలసిపోయి ఓ సాయం వేళ చాట్జీపీటీని ఆశ్రయించాడు. సమస్యంతా చెప్పాడు. ఏం చేయాలో పాలుపోవడం లేదన్నాడు. చాట్జీపీటీ సమాధానం మనోన్ని ఆశ్చర్యపరిచింది. ‘‘మీరు చెప్పింది ఆమె వినకపోవడం మిమ్మల్ని బాధిస్తోంది. అదే విషయం ఆమెకు నేరుగా చెప్పారా?’’అని అడిగింది. అంతటితో ఆగకుండా ప్రేయసికి సందేశం పంపడంలో మనీశ్కు సాయపడింది. ఆమెను నిందించకుండా కేవలం అతని ఫీలింగ్స్ మాత్రమే వ్యక్తపరిచే ప్రశాంతమైన, నిజాయితీతో కూడిన నోట్ అది. అందుకున్న ఆ అమ్మాయి మనీశ్ తో మాట్లాడింది. ఇంకేముంది వారి మధ్య దూరం తగ్గిపోయింది. వృత్తి సమస్యల్లో సాయం 26 ఏళ్ల అక్షయ్ శ్రీవాస్తవ కంటెంట్ రైటర్, మీడియా ప్రొఫెషనల్. ఆఫీసుకు వెళ్లిరావడానికే నాలుగ్గంటలు పోతోంది. నిద్ర లేదు. కుటుంబంతో గడపడానికి లేదు. ఫిర్యాదులా కాకుండా ఈ విషయాన్ని బాస్తో ఎలా చెప్పాలో తేలక చాట్జీపీటీని ఆశ్రయించాడు. వాడాల్సిన పదాలతో సహా చక్కని నిర్మాణాత్మక సలహాలిచ్చింది. అప్పటినుంచి అక్షయ్ క్రమం తప్పకుండా చాట్బాట్ను ఆశ్రయిస్తున్నాడు. ఆయేషాది మరో సమస్య. ఇన్నాళ్లు సహోద్యోగిగా ఉన్న స్నేహితులకే బాస్ అయింది. సాన్నిహిత్యం కోల్పోకుండా వాళ్లతో ఎలా డీల్ చేయాలని చాట్జీపీటీనే అడిగింది. అదిచ్చిన సమాధానం ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో క్రాష్ కోర్సులా సాయపడింది. బెటర్ కౌన్సిలర్? ఒక్కోసారి కౌన్సిలర్ కంటే మెరుగ్గా చాట్జీపీటీ ఇచ్చే సమాధానాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. జీవితంలో చాలా కోల్పోయానని అపిస్తుందనే ప్రశ్నకు.. ‘మార్పు జరిగినప్పుడు అది మామూలే. అభిరుచులను పెంచుకోండి’అని కౌన్సిలర్ చెప్పారు. చాట్జీపీటీ మాత్రం, ‘సంతోషపరిచే పనులు చేయండి. చిన్న లక్ష్యాలు పెట్టుకుని చేరుకునే ప్రయత్నం చేయండి’అని సూచించింది. స్నేహితులు అర్థం చేసుకోవడం లేదంటే వారితో ఓపెన్గా మాట్లాడమని థెరపిస్టు చెబితే, ‘స్నేహితుల్లో అపార్థాలు మామూలే. వారితో నిజాయితీగా మాట్లాడండి’అని చాట్జీపీటీ సూచించింది. పని నచ్చడం లేదంటే ఒత్తిళ్లను గుర్తించి పరిష్కారానికి కొత్తగా ప్రయతి్నంచమని కౌన్సిలర్ చెప్పాడు. చాట్జీపీటీ మాత్రం, ‘పనిలో పరిమితులను పెట్టుకోండి. హెచ్ఆర్ లేదా మెంటార్తో మాట్లాడండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి’అని సలహా ఇచ్చింది. భాగస్వామితో విభేదాలపై ఓపెన్గా మాట్లాడుకుని, సమస్యకు కారణాలేంటో కనిపెట్టి పరిష్కారానికి కలిసి ప్రయతి్నంచండన్న చాట్జీపీటీ సూచనే మెరుగ్గా ఉందని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.ప్రత్యామ్నాయం కాబోదు: మానసిక వైద్యులు మానసిక వైద్యం మనదేశంలో కాస్త ఖరీదైన విషయం. జనంలో అవగాహన లేమి కూడా ఉంది. ఆ సమస్యలకు చాలామంది క్రమంగా ఏఐపై ఆధారపడుతున్నారు. అది జడ్జ్ చేయదు. చెబుతుంటే మధ్యలో అడ్డుకోదు. ఏం చెప్పినా, ఎంతసేపు చెప్పినా, ఎప్పుడు చెప్పినా శ్రద్ధగా వింటుంది. అంతే ఓపిగ్గా సమాధానమూ ఇస్తుంది. దాంతో వ్యక్తిగతం నుంచి వృత్తిపరమైన సలహాల దాకా యూత్ చాట్జీపీటీపై ఆధారపడుతోంది. కానీ ఈ చాట్బాట్ మానసిక ఇబ్బందులకు మొత్తంగా పరిష్కారం చూపలేదంటున్నారు వైద్యులు. ‘‘అది తాత్కాలిక ఉపశమనమిచ్చే ఔట్లెట్లా పనిచేస్తుందంతే. పూర్తిస్థాయి మానసిక చికిత్స ప్రక్రియకు ప్రత్యామ్నాయం కాబోదు. సహానుభూతి, అంతర్దష్టి, అవగాహన వాటికుండవు’’అంటున్నారు. అంతేగాక ఏఐ థెరపీ బాట్లతో ముప్పు కూడా ఉంటుందని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ హెచ్చరించింది. ప్రత్యేకించి వాటిని పిల్లలు వాడటంపై ఆందోళన వ్యక్తం చేసింది. మనుషులను అవి మరింత ఒంటరులను చేస్తాయనీ హెచ్చరించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మనోళ్లపై మరో పిడుగు
ట్రంప్ సర్కారు భారతీయులను నానాటికీ మరింతగా లక్ష్యం చేసుకుంటోంది. వారిని వేధించేలా రోజుకో తరహా నిబంధనలు తీసుకొస్తోంది. హెచ్–1బీ వీసాలు, గ్రీన్కార్డులు ఆశావహుల కలలపై నీళ్లు చల్లేలా తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయ్మెంట్ బేస్డ్ పిఫ్త్ ప్రిఫరెన్స్ (ఈబీ–5) అన్ రిజర్వ్డ్ కేటగిరీ కింద వాటికోసం దరఖాస్తు చేసుకునేందుకు కటాఫ్ను ఆర్నెల్ల పాటు తగ్గించింది. దాన్ని 2019 నవంబర్ 1 నుంచి 2019 మే 1కి మార్చింది. ఈబీ–5 కేటగిరీలో భారతీయుల నుంచి డిమాండ్ అధికంగా ఉందన్న సాకుతో ఈ నిర్ణయం తీసుకుంది. మే నెలకు సంబంధించి విడుదల చేసిన వీసా బులెటిన్లో అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఈ మేరకు పేర్కొంది. దాంతో చాలామంది భారతీయులు ఈబీ–5 కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా మారారు! నెలవారీ బులెటిన్లో విదేశాంగ శాఖ పేర్కొనే ‘తుది కార్యాచరణ తేదీ’లు చాలా కీలకం. వీసా/గ్రీన్కార్డు దరఖాస్తును ప్రాసెసింగ్ నిమిత్తం యూఎస్ సిటిజన్షిప్, ఇమిగ్రేషన్ సరీ్వసెస్ (యూఎస్సీఐఎస్) పరిగణనలోకి తీసుకోవాలంటే అవి బులెటిన్లో పేర్కొన్న తేదీ కంటే ముందువి అయ్యుండాలి. చైనాకు మాత్రం ఈబీ–5 కటాఫ్ను మార్చకపోవడం విశేషం. ఏమిటీ ఈబీ–5 కేటగిరీ? అర్హులైన వలస ఇన్వెస్టర్లకు అమెరికాలోని గ్రామీణ, హెచ్చు నిరుద్యోగ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించేందుకు ఈబీ–5 కేటగిరీని అమెరికా తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా అన్ రిజర్వుడ్ విభాగం కింద దరఖాస్తు చేస్తున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దాంతో అందుబాటులో ఉండే వీసాల తగ్గిపోతోంది. భారతీయులకు ఈబీ–5 కటాఫ్ తగ్గింపు వల్ల అర్హుల జాబితా నుంచి చాలామంది గల్లంతవుతారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డీఐఈ చీఫ్ నీలా రాజేంద్రకు నాసా ఉద్వాసన
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా డీఈఐ విభాగం చీఫ్ నీలా రాజేంద్ర ఉద్వాసనకు గురయ్యారు. డీఈఐ వంటి ఫెడరల్ ఏజెన్సీలను రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణమైంది. భారత మూలాలున్న నీలా రాజేంద్రకు అత్యంత ప్రతిభావంతురాలిగా పేరుంది. ఆమెను ఎలాగైనా అట్టిపెట్టుకునేందుకు నాసా చివరిదాకా విఫలయత్నం చేసింది. అందులో భాగంగా నీలను జెట్ ప్రొపల్షన్ లేబోరేటరీ విభాగం డీఈఐ పదవి నుంచి తప్పించడమే గాక ఆమె హోదాను ‘టీమ్ ఎక్సలెన్స్ అండ్ ఎంప్లాయీ సక్సెస్ (టీఈఈఎస్)’విభాగం చీఫ్గా మార్చేసింది. నీల కెరీర్ ప్రొఫైల్ నుంచి డీఈఐ బాధ్యతల నిర్వహణ తాలూకు రికార్డులను పూర్తిగా తొలగించింది. అయినా లాభం లేకపోయింది. ‘‘నీల ఇకపై మనతో పాటు పనిచేయబోరు. ఎంతో ఆవేదన నడుమ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’అని జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ విభాగం డైరెక్టర్ లారీ లేసిన్ వెల్లడించారు. ‘‘నాసాకు నీల ఎనలేని సేవలందించారు. తన పనితీరుతో చెరగని ముద్ర వేశారు. అందుకు సంస్థ ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. తనకు అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాం’’అని సంస్థ సిబ్బందికి రాసిన ఈ మెయిల్లో పేర్కొన్నారు. టీఈఈఎస్ను మానవ వనరుల విభాగంలో విలీనం చేస్తున్నట్టు తెలిపారు. త్వరలో మరికొందరు ఉద్యోగులకు ఉద్వాసన తప్పదనేందుకు ఇది సంకేతమని భావిస్తున్నారు. ఏమిటీ డీఈఐ డీఈఐ అంటే డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్. అమెరికాలోని జాతి, భాషాపరమైన మైనారిటీలు తదితరులకు ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించడం దీని ఉద్దేశం. ఈ పథకం అమెరికన్లలో జాతి ఆధారంగా విభజనకు, వివక్షకు కారణమవుతోందని ట్రంప్ చాలాకాలంగా ఆరోపిస్తూ వచ్చారు. రెండోసారి అధ్యక్షుడు కాగానే ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలన్నింట్లోనూ డీఈఐ విభాగాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు 2024లోనే బడ్జెట్ పరిమితులు, డీఈఐ నిబంధనల కారణంగా పలు విభాగాలకు చెందిన 900 మంది ఉద్యోగులను నాసా తొలగించాల్సి వచ్చింది. ఆ నిర్ణయంపై తీవ్ర దుమారం రేగింది కూడా. అయినా నీలను మాత్రం అప్పట్లో సంస్థ అట్టిపెట్టుకుంది. ట్రంప్ సర్కారు తాజా ఉత్తర్వులతో ఇప్పుడామెను తొలగించక తప్పలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సహజమైన మార్పు ఇది.. మనమూ మారుదాం!
గైనకాలజిస్ట్లు, సైకియాట్రిస్ట్లు, సైకాలజిస్ట్లు, లైఫ్ కోచ్లు.. అందరూ చెబుతున్నదీ, అవగాహన పెంచుతున్నదీ.. మెనోపాజ్తో మహిళ జీవితం అయిపోదని, అదొక ఫేజ్ అని, సహజమైన మార్పు అనే! దాన్ని ఆమె సాఫీగా దాటి.. లైఫ్ని ఉత్సాహంగా రీస్టార్ట్ చేయాలంటే ఆ దశ మీద అందరికీ అవగాహన ఉండాలని! ఆ ఉద్దేశాన్ని ఈ క్యాంపెయిన్ కాస్తయినా నెరవేర్చిందని.. సైలెంట్గా ఉన్న ఆ అంశాన్ని చర్చలోకి తెచ్చిందని భావిస్తున్నాం! మెనోపాజ్ గురించి మరికొందరు నిపుణులు చెబుతున్న మరికొన్ని విషయాలను తెలుసుకుందాం..మెనోపాజ్ను మనతో సహా తూర్పుదేశాలన్నీ పాజిటివ్గానే చూస్తున్నాయి. ఇది మహిళ జీవితంలో అత్యంత సహజమైన దశ. సింప్టమ్స్ తీవ్రంగా ఉండి దైనందిన జీవితం కూడా కష్టమైప్పుడు తప్ప దీన్ని దాటడానికి మెడికల్ సపోర్ట్ అంతగా అవసరం ఉండదు. ఒకరకంగా చెప్పాలంటే ఇదొక ఆసక్తికరమైన మార్పు. కాబట్టి దీని గురించి మాట్లాడ్డానికి సిగ్గుపడనక్కర్లేదు. బిడియం అంతకన్నా వద్దు. 45– 55 ఏళ్ల మధ్య వచ్చే పెరిమెనోపాజ్లో శారీరక, మానసిక, హార్మోన్ల, భావోద్వేగపరమైన మార్పులెన్నో కనిపిస్తుంటాయి. ఆ ఒత్తిడిని చాలామంది మహిళలు ఎవరి సహాయమూ లేకుండానే దాటేస్తుంటారు. సహాయం తీసుకోవాలనే ఎరుక వాళ్లకు లేక, అండగా ఉండాలనే గ్రహింపు కుటుంబాలకు రాక! కానీ ఇప్పుడా ఆలోచనను మార్చుకోవాలి. అర్థం చేసుకోవాలి. సపోర్ట్ ఇవ్వాలి! కుటుంబాలకు ఆ అవగాహన రావాలంటే పెరిమెనోపాజ్లోని మహిళలు తాము అనుభవిస్తున్న శారీరక, మానసిక సమస్యల గురించి కుటుంబానికి చెప్పాలి. చర్చించాలి. అప్పుడే ఆమె పరిస్థితిని కుటుంబం అర్థం చేసుకోగలదు. అండగా నిలబడగలదు. అంతేకాదు ఆ దశలోని మహిళలు తమ మానసిక భారాన్ని తేలిక చేసుకోవడానికి పదిమందితో కలుస్తూ .. మాట్లాడుతూ ఉండాలి. నడివయసు స్త్రీలలో చాలా మార్పులు కనిపిస్తుంటాయి. అయితే వయసుతో వచ్చిన మార్పులేమిటీ, ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల వచ్చిన మార్పులేమిటో కనుక్కోవడం కష్టమే! సమస్యలు తీవ్రంగా ఉంటే కుటుంబ సభ్యులతో కలిసి ఆ మహిళ వైద్యులను సంప్రదించాలి. ఆమె చెప్పింది వైద్యులు శ్రద్ధగా విని, అవసరమైన సలహాలు, సూచనలతో ఆమె ఆ దశను సాఫీగా దాటేలా సాయం చేస్తారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల పెరిమెనోపాజ్ పట్ల సమాజంలో అవగాహన కలిగే అవకాశం ఉంది.కష్టం లేకుండా పెరిమెనోపాజ్ దశను దాటేందుకు కొన్ని చిట్కాలు...డైట్ : పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం భోజన మోతాదును, అందులోని అధిక కొవ్వు పదార్థాలను తగ్గించుకోవాలి కానీ పూర్తిగా భోజనాన్నే మానేయకూడదు! రోజు మొత్తంలో తీసుకునే భోజనంలో 30 శాతం లేదా అంతకంటే తక్కువ కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. శాచురేటెడ్ ఫ్యాట్ ఉన్న ఫ్యాటీ మీట్స్, హోల్ మిల్క్, ఐస్క్రీమ్స్, చీజ్ లాంటివాటికీ దూరంగా ఉండాలి. మసాలానూ దరిచేరనివ్వద్దు. చక్కెర, ఉప్పునూ తగ్గించాలి. గ్రిల్డ్, స్మోక్ ఫుడ్కీ నో చెబితే మంచిది. ఫైబర్, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను, తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను డైట్లో చేర్చాలి. రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల వరకు నీటిని తాగాలి. మద్యం పూర్తిగా మానేయాలి. కాఫీ తగ్గించాలి. వ్యాయామం: క్రమం తప్పని వ్యాయామంతో శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యమూ సొంతమవుతుంది. అందుకే రోజూ 45 నిమిషాల పాటు కచ్చితంగా వాకింగ్ చేయాలి. యోగా, మెడిటేషన్,ప్రాణాయామాన్నీ ప్రాక్టీస్ చేయాలి. క్రియేటివ్ వర్క్ని వెదుక్కోవాలి. ఇది ఉత్సాహాన్నిస్తుంది. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్లు, చుట్టాలు, స్నేహితులతో కలుస్తుండాలి. హాట్ ఫ్లషస్ ఇబ్బందిగా మారితే.. వాటిని ట్రిగర్ చేస్తున్నవేవో గమనించి వాటికి దూరంగా ఉండాలి. పడక గదిని చల్లగా ఉంచుకోవాలి. డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయాలి. వాకింగే కాక స్విమ్మింగ్, డాన్సింగ్, సైక్లింగ్ ఇలా ఇష్టమైనదాన్ని ఎంచుకోవచ్చు. విటమిన్ ఇ సప్లిమెంట్స్ తీసుకోవాలి. 40 నుంచి 60 గ్రాముల సోయా ప్రొటీన్ను డైట్లో చేర్చుకోవాలి. వీటన్నిటి సహాయంతో పెరిమెనోపాజ్ దశను హాయిగా దాటేయొచ్చు. – డాక్టర్ ప్రణతి రెడ్డిక్లినికల్ డైరెక్టర్, రెయిన్బో హాస్పిటల్స్45– 55 ఏళ్ల మధ్య వచ్చే పెరిమెనోపాజ్లో శారీరక, మానసిక, హార్మోన్ల, భావోద్వేగపరమైన మార్పులెన్నో కనిపిస్తుంటాయి. ఆ ఒత్తిడిని చాలామంది మహిళలు ఎవరి సహాయం లేకుండానే దాటేస్తుంటారు. సహాయం తీసుకోవాలనే ఎరుక వాళ్లకు లేక, అండగా ఉండాలనే గ్రహింపు కుటుంబాలకు రాక! కానీ ఇప్పుడా ఆలోచనను మార్చుకోవాలి. అర్థం చేసుకోవాలి. సపోర్ట్ ఇవ్వాలి!పాజ్ నుంచి పుంజుకుందాం.. మెనోపాజ్ అనేది ప్రతి మహిళ జీవితంలో సహజమైన ప్రక్రియ. దీని తర్వాత కూడా ఆమెకు 30 ఏళ్లు పైబడిన ఆరోగ్యకర మైన, చురుకైన జీవితం ఉంటుంది. అందుకే మెనోపాజ్లో వచ్చే మార్పులు, సమస్యల గురించి తెలుసుకోవడం, అవగాహన పెంపొందించుకోవడం అత్యంతవసరం! ఈ దశలోని శారీరక మార్పులు మహిళల మానసిక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తాయి. హాట్ ఫ్లషస్.. ఆ వెంటనే చెమటలు పట్టడం వంటివి మహిళ దైనందిన జీవితాన్ని ఇబ్బందిగా మారుస్తాయి. వెజైనల్ డ్రైనెస్ వైవాహిక జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. అది ఆమెలో ఆందోళనకు తద్వారా ఇతర మానసిక సమస్యలకూ దారీతీయవచ్చు. ఈ సమయంలో కొందరు మహిళలు బరువు పెరుగుతారు. కీళ్లనొప్పులు, అలసట, ఏకాగ్రత లోపించడం వంటివీ అనుభవంలోకి వస్తుంటాయి. ఇవన్నీ మానసిక ఇబ్బందులకు దారితీస్తుంటాయి. ఈ మొత్తంలో ప్రధానంగా చర్చించుకోవాల్సింది మెనోపాజ్లో వచ్చే డిప్రెషన్ లేదా కుంగుబాటు గురించి. మహిళలకు మెనోపాజ్ కంటే ముందు డిప్రెషన్ ఉన్నా లేకపోయినా.. ఈ దశలో దీనిబారినపడే ప్రమాదం రెండు నుంచి నాలుగింతలు ఎక్కువని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే ఈ టైమ్లో కుటుంబం ఆమెకు అండగా నిలవాలి. కానీ మన దేశంలో దీని పట్ల సరైన అవగాహన లేక కుటుంబాల నుంచి కోరుకున్న మద్దతు లభించట్లేదు. అందుకే మెనోపాజ్ ప్రభావాన్ని కుటుంబమూ అర్థం చేసుకొని, అవగాహన పెంచుకోవాలి. మెనోపాజ్ తర్వాతా ఆమె జీవితం సాఫీగా సాగిపోయేలా సహకరించాలి. లేకపోతే ఒత్తిడి పెరిగి అది ఆమెను వేగంగా వృద్ధాప్యానికి చేరువచేస్తుంది. డిప్రెషన్ లక్షణాలు ఏమాత్రం కనపడినా జంకు, సందేహం లేకుండా వెంటనే మానసిక వైద్యనిపుణులను కలవాలి. ఏ మానసిక సమస్యకైనా కౌన్సెలింగ్ రూపంలోనో.. మందులో రూపంలోనో.. ఇంకే ఇతర సపోర్ట్ రూపంలో అయినా చికిత్స ఉంటుంది. దానికంటే ముందు మంచి ఆహార అలవాట్లు, ఎక్సర్సైజ్, మెడిటేషన్ను జీవనశైలిలో భాగం చేసుకోవాలి. సమస్యలను సాటి మహిళలతో పంచుకోవడానికి, చర్చించడానికి సందేహించవద్దు. షేరింగ్ వల్ల ఆందోళన, భయం తగ్గుతాయి. భరోసా వస్తుంది. అంతేకాదు ఆ చర్చల వల్ల సమాజంలోనూ దీనిపట్ల అవగాహన పెరుగుతుంది. ఇది జీవితంలో మళ్లీ పుంజుకోవడానికి సాయపడుతుంది.– డాక్టర్ అల్లం భావన, సైకియాట్రిస్ట్ఫిట్నెస్ పెంచుకుందాం... మెనోపాజ్ అనగానే జీవితం అయిపోయిందని భావించడమో, ఇక ఉపయోగం లేదని అనిపించుకోవడమో, తమ అవసరాన్ని ఎవరూ గుర్తించరనే భయమో కలుగుతుంది. నిజానికి ఇప్పుడే జీవితానికి కొత్త అర్థం మొదలవుతుంది. ఈ దశలో ఫిట్నెస్ చాలా కీలకం. ఫిట్నెస్ పెంచుకోవాలి. బ్రిస్క్ వాకింగ్, యోగా (భుజంగాసనం, చైల్డ్ పోజ్, శవాసనం లాంటివి),ప్రాణాయామం శరీరకంగా, మానసికంగా ఉపశమనాన్నిస్తాయి. సమతుల (కాల్షియం, విటమిన్ డి, ఒమేగా 3, ఫైబర్,ప్రొటీన్, నట్స్, ఫ్లాక్స్ సీడ్స్తో కూడిన) ఆహారం, తగినంత వ్యాయామంగల ఆరోగ్యకర జీవనశైలి మెనోపాజ్ సమస్యలకు చెక్ పెడుతుంది. ఒంటరితనం, దిగులుకు లోనవకుండా కొత్త యాక్టివిటీ మొదలుపెట్టాలి. ఫ్రెండ్స్తో గ్రూప్ ఏర్పాటు చేసుకుని మాట్లాడుతూండాలి. మహిళ ఆరోగ్యం అంటే కేవలం శారీరక ఆరోగ్యమే కాదు ఆమె మనసు, భావోద్వేగాలు కూడా! ఈ కోణంలో కుటుంబం మెనోపాజ్ దశలోని మహిళను అర్థం చేసుకోవాలి. సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడే ఆమె ఆ దశను ఆనందంగా మలచుకుంటుంది.. ఆత్మవిశ్వాసంతో సాగుతుంది. – రజిత మైనంపల్లి, లైఫ్ కోచ్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, యోగా అండ్ డైట్ ఎక్స్పర్ట్సిద్ధమైపోవాలంతే!అప్పటిదాకా బాధ్యతల్లో మునిగిపోయిన మహిళకు తన జీవితాన్ని తనకు నచ్చినట్టు మలచుకునే ఒక వెసులుబాటు మెనోపాజ్! పీరియడ్స్ ఆగిపోవడం వలన శారీరకంగా కొంత అసౌకర్యం ఉండొచ్చు. కానీ పీరియడ్స్ వల్ల అప్పటిదాకా ఉన్న కొన్ని అసౌకర్యాల నుంచి రిలీఫ్ దొరుకుతుంది. ప్రయాణాలకు, కొత్త ప్రయత్నాలకు పీరియడ్స్ ఆటంకం ఉండదు. ఫ్యామిలీ ప్లానింగ్ బాధ్యతను మోసే బెడదా తప్పుతుంది. ఒక స్వేచ్ఛ దొరుకుతుంది. ఈ సానుకూలతల పట్ల దృష్టి నిలిపి.. మనసుకు ఉత్సాహాన్ని పట్టించి.. వయసుకు రెక్కలు తొడిగి రీస్టార్ట్కు సిద్ధమైపోవాలంతే!– శిరీష చల్లపల్లినిర్వహణ: సరస్వతి రమ -
ప్రొఫెసర్ చింపాంజీలు!
చింపాంజీలను మన పూర్వీకులుగా చెబుతారు. అదెంత నిజమో గానీ మనిషిలాగే వాటికి కూడా భౌతిక శాస్త్ర సూత్రాలు బాగానే వంటబట్టాయని తాజా అధ్యయనంలో తేలింది. కడుపు నింపుకునేందుకు చెద పురుగులను తినడం చింపాంజీలకు అలవాటు. ఎర్రమట్టిలో, మెత్తటి నేలలు, మట్టి దిబ్బల్లో చెదపురుగులను చేత్తో ఏరకుండా, బొరియల్లో చెదలను ఒంపులు తిరిగిన కర్ర పుల్లలతో ఒడుపుగా పట్టుకోవడం వాటికి వెన్నతో పెట్టిన విద్య. అందుకోసం కనిపించిన కర్రపుల్లనల్లా వాడేయకుండా తమకు చక్కగా పనికొచ్చే పుల్లను మాత్రమే వేటకు వినియోగిస్తాయట. దాంతో, ఏ పుల్ల బాగా అక్కరకొస్తుందన్నది చింపాంజీలు ఎలా కనిపెడతాయో తెల్సుకోవాలనే జిజ్ఞాస పరిశోధకుల్లో ఎక్కువైంది. భౌతికశాస్త్రంపై వాటికి పట్టు ఎలా చిక్కిందనే అంశంపై పరిశోధన మొదలెట్టారు. వాటిలోనూ అభిజ్ఞాన వికాసం ఎక్కువేనని అందులో తేలింది. ఈ వివరాలు ఐసైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. గట్టిగా ఉండే పుల్లలకు బదులు స్ప్రింగ్లాగా ఒంగిపోయే లక్షణమున్న కాస్తంత గట్టి పుల్లలతో వేట సులభమవుతుందని చింపాంజీలు గ్రహించాయని, ఇవి వాటిలోని సహజ సంగ్రహణ సామర్థ్యం వల్లే సాధ్యమైందని పరిశోధకులు చెబుతున్నారు. మట్టిదిబ్బల్లో మహా ఒడుపుగా మట్టిదిబ్బల్లో ఇబ్బడిముబ్బడిగా చెదపురుగులు ఉంటాయి. చైనా వాళ్లు నూడుల్స్ను ఎలాగైతే తెల్లని సన్నని చిన్న కర్రపుల్లతో తింటారో అచ్చం అలాగే చింపాంజీలు చెదపురుగులను పుల్లలకు అంటుకునేలా చేసి ఆబగా ఆరగిస్తాయి. అలాగే అలా తినాలంటే వాటికి సహజసిద్ధ పుల్లలు కావాలి. మట్టిదిబ్బ బురద బొరియలో ఒకసారి లోపలికి దూర్చాక బయటకు తీస్తే మట్టి బరువుకు పుల్ల విరిగిపోవచ్చు. మెత్తడి పుల్ల తీసుకుంటే మట్టి తడికి మెత్తబడిపోతుంది. అలాగని గట్టి పుల్ల తీసుకుంటే గట్టిగా లాగితే విరిగిపోతుంది. దీంతో మెత్తబడని, సులువుగా ఒంగిపోయే బలమైన పుల్ల అవసరం చింపాంజీలకు ఏర్పడింది. బిరుసుగా ఉండే కర్రపుల్లకు బదులు బురద బొరియల్లో అలవోకగా ఒంగుతూ దూరిపోయే ఫ్లెక్సిబుల్ పుల్లతోనే పని సులువు అవుతుందని చింపాంజీలు కనిపెట్టాయని పరిశోధనల్లో ముఖ్య రచయిత అలెజాండ్రా పాస్కల్ గరిడో చెప్పారు. ‘‘ దగ్గర్లోని ప్రతి పుల్లను అవి మొదట సరిచూస్తాయి. మెత్తగా ఉందా, గట్టిగా ఉందా, వంచేస్తే విరుగుతుందా, ఎంత కోణం వరకు విరగకుండా వంగగలదు? ఇలాంటి టెస్ట్లన్నింటినీ పుల్లలపై చేస్తాయి. అన్ని టెస్టుల్లో పాసైన పుల్లనే చెదపురుగుల వేటకు వినియోగిస్తాయి. టాంజానియా దేశంలోని గాంబే నేషనల్ పార్క్లోని చింపాంజీల వేట విధానాలపై ఈ పరిశోధన చేశారు. అడవిలో భిన్న రకాల చెట్ల నుంచి ఒకతరహా పుల్లలు వస్తున్నప్పటికీ కొత్త జాతుల చెట్ల పుల్లలనే చింపాంజీలు వినియోగిస్తుండటం విశేషం. చింపాంజీలు నివసించే ప్రదేశాల్లో వేర్వేరు రకాల పుల్లలు ఉన్నప్పటికీ ఏకంగా 175 శాతం ఎక్కువగా ఒంగిపోయే సామర్థ్యమున్న పుల్లలనే చింపాంజీలు ఎంపికచేసి వాడుతున్నాయి. ఒకే జాతి చెట్ల పుల్లల్లో ఒంగిపోయే గుణమున్నా, ఎక్కువ ఒంగే లక్షణమున్న ఉపజాతి చెట్ల పుల్లలనే అవి కనిపెట్టి వాడుతుండటం చూస్తుంటే వీటిని నిజంగా ఫిజిక్స్ మీద మంచి పట్టు ఉన్నట్లు చెప్పొచ్చు’’ అని పాస్కల్ వ్యాఖ్యానించారు. ‘‘ ఒంగే పుల్లల్లోనూ ఏది ప్రస్తుతం వాడేందుకు అనువుగా ఉంది అనే అంశాన్ని తీరా వేట మొదలెట్టేటప్పుడూ పరీక్షించి చూస్తున్నాయి. తోటి చింపాంజీ ఏ రకం పుల్లను వాడుతోంది? అది పుల్లను ఎలా వినియోగిస్తోంది? వేట ఫలితం బాగుందా? అనే వాటినీ పక్కక ఉన్న మరో చింపాంజీ గమనిస్తుంది. మానవుల పూర్వీకులు సైతం ఇలాగే సమష్టిగా వేటాడుతూ వనోత్పత్తులను తమ వేటకు ఉపకరణాలుగా వాడుకునేవారు. ఇలాగే చెక్క సంబంధ వస్తువుల వినియోగంలో విప్లవాత్మక మార్పులు సాధ్యమయ్యాయి’’ అని పాస్కల్ వ్యాఖ్యానించారు. ‘‘ చింపాంజీలపై చేసిన ఈ పరిశోధన వాటికి ఏ పుల్ల అనువుగా ఉంది, అందుబాటులో ఉంది అనేది మాత్రమే కాదు వాటి అభిజ్ఞానవికాస స్థాయినీ తెలియజేస్తోంది. మన ఇంజనీరింగ్ సామర్థ్యాలు వేల సంవత్సరాల క్రితమే పరిణామ క్రమంలో మనలో ఇమిడిపోయాయనడానికి ఇదొక తార్కాణం. ఆదిమ మానవుల కాలం నుంచే అనాదిగా మనిషిలో ఇలా మేధాశక్తి పరంపరగా వస్తోంది’’ అని ఆయన అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘జ్వలియన్’ వాలాబాగ్
జలియన్వాలా బాగ్ పేరు చెబితే.. రౌలట్ చట్టం.. నిరసన తెలుపుతూ ప్రజా సమూహం సమావేశం.. బ్రిటిష్ సైన్యాధికారి హ్యారీ డయ్యర్ కాల్పులు.. వందల మంది దుర్మణం.. చరిత్రలో కనిపించేది ఇదే. ఏళ్ల తరబడి చదువుకున్నదీ ఇదే! కానీ, చరిత్ర వెనుక చెరగని గుర్తులు అమృత్సర్లోని ఆ తోటను ఆనుకుని ఉన్న గోడలపై నాటి ఘటనను గుర్తు చేస్తూనే ఉన్నాయి. స్వేచ్ఛా, స్వాతం్రత్యాల కోసం పంజాబ్ ప్రజలు 106 ఏళ్ల క్రితం చేసిన ప్రాణ త్యాగాలను నేటి తరానికి వివరిస్తున్నాయి. ఇటుక గోడల్లో దిగిన తూటాల గుర్తులు, 120 మంది ప్రాణాలు బలితీసుకున్న బావి.. సందర్శకుల హృదయాలను బరువెక్కిస్తుంటాయి. – సాక్షి అమరావతిఘటనకు ముందు చరిత్ర ఇదీ.. మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికులుగా పనిచేసేవారికి అనేక అవకాశాలు కల్పిస్తామని, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని బ్రిటిష్ ప్రభుత్వం ఆశ చూపడంతో పంజాబ్ నుంచి 3.55 లక్షల మంది బ్రిటిష్ ఇండియా సైన్యంలో చేరారు. యుద్ధం ముగిశాక ప్రభుత్వం సైనికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా వారిని సైన్యం నుంచి వెనక్కి పంపేసింది. దీంతో వారంతా పంజాబ్ చేరుకున్నాక నిరుద్యోగం వెంటాడింది. మరోవైపు కొన్నేళ్లుగా పంజాబ్ ప్రాంతం కరువుతో కొట్టుమిట్టాడుతోంది. మొదటి ప్రపంచయుద్ధంలో భాగంగా 1915లో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం రక్షణ చట్టం తీసుకొచ్చింది.దీని ప్రకారం ప్రజలపై నిరవధిక నిర్బంధం, విచారణ లేకుండా జైలుకు పంపడం వంటి కఠిన చర్యలను అనుసరించింది. యుద్ధం ముగిసినా ఈ చట్టాన్ని రద్దు చేయకుండా ఉద్యమకారులపై ప్రయోగించేందుకు అనువుగా మార్చుకుంది. ఇందుకోసం సర్ సిడ్నీ రౌలట్ అధ్యక్షతన 1917లో కమిటీ నియమించింది. దాని సిఫార్స్ల ఆధారంగా 1919 మార్చి 18న రౌలట్ చట్టాన్ని ఆమోదించింది.రౌలట్ చట్టం ప్రకారం ఏప్రిల్ 10న పంజాబ్కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు డాక్టర్ సైపుద్దీన్ కిచ్లూ, డాక్టర్ సత్యపాల్ను అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తర భారతదేశాన్ని కుదిపేసింది. ఇదే తేదీన ఇంగ్లండ్ చర్చి మిషనరీకి చెందిన మిస్ మార్షెల్లా షేర్వుడ్పై అమృత్సర్లో దాడి జరిగింది. అనంతరం బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ నివాసంపై దాడి చేసేందుకు నిరసనకారులు యత్నిస్తూన్నారని చెప్పి అమృత్సర్లోని రైల్వే ఓవర్ బ్రిడ్జిపై 25 మంది నిరాయుధులైన భారతీయులను సైన్యం కాల్చి చంపేసింది. దీంతో అవిభక్త పంజాబ్ మొత్తం ప్రజలు రగిలిపోయారు. 1919 ఏప్రిల్13న ఏం జరిగింది? బైశాఖి వేడుకలను పంజాబ్లో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అమృత్సర్లో ఏప్రిల్ 13న జరిగే వేడుక చూసేందుకు చుట్టపక్కల పట్టణాలు, గ్రామాల నుంచి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. మరోవైపు డాక్టర్ సైపుద్దీన్ కిచ్లూ, డాక్టర్ సత్యపాల్ అరెస్టులకు నిరసనగా అమృత్సర్లోని జలియన్వాలాబాగ్లో జాతీయవాదులు సాయంత్రం 5 గంటలకు శాంతియుత సమావేశం ఏర్పాటు చేశారు. పంజాబ్కు చెందిన ప్రముఖ న్యాయవాది లాలా కన్హియాలాల్ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు కీలక ప్రసంగం ఉందని చెప్పడంతో చిన్నా, పెద్దా అంతా వేలాదిగా తరలివచ్చారు. అదే క్రమంలో రాత్రి 8 గంటల నుంచి మార్షల్ లా అమలులో ఉంటుందని చెప్పుకున్నారు కానీ దీనిపై బ్రిటిష్ ప్రభుత్వం ప్రచారం చేయలేదు. కాల్పుల్లో 2 వేల మంది దుర్మరణం! అమృత్సర్లోని స్వర్ణదేవాలయానికి అత్యంత సమీపంలో 6.50 ఎకరాల్లో జలియన్వాలా బాగ్ ఉంది. మహరాజా రంజిత్సింగ్ కోటలో న్యాయవాదిగా పనిచేసి మరణించిన ‘హిమ్మత్సింగ్ జలియన్వాలా’ పార్థివదేహాన్ని ఇక్కడ సమాధి చేశారు. ఆయన పేరుతోనే ఈ ప్రాంతానికి జలియన్వాలా బాగ్గా పేరొచ్చింది. చుట్టూ ఎత్తయిన భవనాల మధ్య ఉత్తరం వైపున 3 నుంచి 4 అడుగుల వెడల్పు మార్గం మాత్రమే ఉంది. బాగ్లో తూర్పు వైపున నుయ్యి, ఆపై కొద్దిగా చెట్లు ఉన్నాయి.సమావేశంపై ప్రచారంతో బైశాఖి వేడుకకు వచ్చిన వారు సైతం ఇందులో పాల్గొనడంతో జనం దాదాపు 20 వేల వరకు హాజరైనట్టు అంచనా. సరిగ్గా సాయంత్రం 5 నుంచి 5.30 గంటల మధ్య రెజినాల్డ్ ఎడ్వర్డ్ హారీ డయ్యర్ మెషిన్ గన్ అమర్చిన వాహనాలతో 50 మంది సైనిక బగంతో అక్కడకు చేరుకున్నాడు. వస్తూనే బాగ్లోకి వెళ్లే మార్గాన్ని మూసివేసి కాల్పులకు ఆదేశాలిచ్చాడు. కేవలం 10 నుంచి 12 నిమిషాల వ్యవధిలో ఆ ప్రాంతం తుపాకుల మోతతో నిండిపోయింది.ప్రజలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు పిట్టల్లా రాలిపోయారు. తప్పించుకునే మార్గం లేదు.. పదుల సంఖ్యలో తూటాలు శరీరాలను చీల్చుకుంటూ భవనాల గోడల్లో దిగబడ్డాయి. ఆందోళనతో ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు ప్రాంగణంలోని బావిలోకి దూకేశారు. ఆ రాత్రంతా జలియన్వాలాబాగ్ పరిసరాలు ఆర్తనాదాలతో నిండిపోయాయి. ఈ కాల్పుల్లో దాదాపు 2 వేల మంది మరణించినట్లు స్థానికులు చెబుతారు. డయ్యర్ ముందుగానే కర్ఫ్యూ విధించడంతో గాయపడ్డవారిని తరలించే ఆస్కారం లేకపోయింది. లెక్కలోకి రాని మరణాలెన్నో..తమవారిఆచూకీ కోసం వెదికిన కుటుంబ సభ్యులకు మృతదేహాలను వెదికేందుకు రెండు మూడురోజులు పట్టిందని ఇక్కడి వారు చెబుతుంటారు. బ్రిటిష్ ప్రభుత్వం దుర్ఘటనపై హంటర్ కమిషన్ వేయగా 200 మంది చనిపోయినట్టు నివేదికిచ్చింది. సేవా సమితి సొసైటీ 379 మంది మరణించారని, 192 మంది తీవ్రంగా గాయపడ్డారని నివేదించింది. కానీ స్థానికులు మాత్రం 2 వేల మంది చనిపోయారని చెబుతుంటారు.చనిపోయిన 41 మంది బాలల్లో 7 నెలల వయసు వారు, ఆరువారాల శిశువు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఈ మారణకాండ జరిగిన మూడు నెలలకు అంటే జూలైలో ఎవరు చనిపోయారో గుర్తించేందుకు అధికారులు నగర ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, నాటి ఘనటలో పాల్గొన్న వారిని గుర్తిస్తే చనిపోయినవారి కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేస్తారన్న భయంతో ఎవరూ వాస్తవాలు చెప్పలేదు. దాంతో ఎంత మంది చనిపోయారో అధికారికంగా లెక్కలు లేవు. దుర్మాగానికి నిలువుటద్దం డయ్యర్ సైనికాధికారి రెజినాల్డ్ ఎడ్వర్డ్ హారీ డయ్యర్.. దుర్ఘటన అనంతరం ప్రభుత్వం చేసిన విచారణలో అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా, ఎలాంటి అపరాదభావం లేకుండా ఇచ్చిన సమాధానాలు అతడిలోని రాక్షసత్వానికి అద్దం పడతాయి. ప్రశ్న: ‘‘నువ్వు బాగ్ లోకి వెళ్ళగానే, ఏం చేశావు?’’ డయ్యర్:– నేను కాల్పులు జరిపాను. ప్రశ్న:– ‘‘వెంటనే?’’ డయ్యర్:– వెంటనే. నేను ఆ విషయం గురించి ఆలోచించాను, నా విధి ఏంటో నిర్ణయించుకోవడానికి నాకు 30 సెకన్ల కంటే ఎక్కువ సమయం పట్టలేదు. జనసమూహాన్ని చెదరగొట్టడానికి కాల్పులు జరపలేదు. బదులుగా, పార్కులో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారిపైకి విచక్షణా రహితంగా కాల్చి చంపారు. వీలైనంత ఎక్కువ మందిని చంపాలని సైనికులను డయ్యర్ ఆదేశించాడు. తెచ్చిన మందుగుండు సామగ్రి అయిపోయే వరకు సైనికులు కాల్పులు ఆపలేదు. రెజినాల్డ్ డయ్యర్ కూడా తాను మిషన్ గన్లు అమర్చిన కార్లను బాగ్ లోకి తీసుకురాగలిగితే, వాటితో కూడా కాల్పులు జరిపేవాడినని ఒప్పుకున్నాడు. కాగా ఈ మారణకాండలో మరణించినవారి ప్రాణాలకు 5 వేల పౌండ్ల చొప్పున వెలకట్టింది. అయితే చాలామంది ఈ మొత్తాన్ని తీసుకోలేదు. ‘‘మా తాతగారు గోబింద్ రామ్ సేథ్ సమావేశానికి హాజరై ప్రాణాలు కోల్పోయారు.చనిపోయిన వారిలో స్థానికులతో పాటు బైశాఖి వేడుకకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నట్టు మా నాన్న, పూర్వీకులు చెప్పారు. చనిపోయిన వారికి ప్రభుత్వం ఇచ్చిన 5 వేల పౌండ్లకు పంజాబీలు ఆశపడలేదు’’ అని చెప్పారు జలియన్వాలా బాగ్ ప్రభుత్వ గైడ్గా ఉన్న దీపక్ సేథ్. ఇక్కడికి నిత్యం వచ్చే వారికి నాటి ఘటనను వివరిస్తూ చైతన్యులను చేస్తారీయన. తర్వాత పార్కులో ప్రభుత్వం ప్రజల ఆత్మార్పణకు చిహ్నంగా స్మారకాన్ని నిర్మించింది. 120 మంది మరణించిన బావిని అద్దాలతో మూసివేసింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ చరిత్రలో అతిపెద్ద దుర్ఘటనగా నమోదైన జలియన్వాలా బాగ్లో తూటాలు దిగిన గోడలను 106 ఏళ్లుగా అలాగే కాపాడుతున్నారు. -
మహిలామణులు!
జిల్లా కోర్టుల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లా జడ్జీల్లో 60 శాతం వరకు మహిళలున్నారు. భవిష్యత్లో రాష్ట్రంలోని న్యాయవ్యవస్థలో పురుషుల కోసం 30% రిజర్వు చేయాల్సిన పరిస్థితి రావొచ్చు (నవ్వుతూ).జస్టిస్ సుజోయ్పాల్, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిలింగ భేదానికి తావులేకుండా తమను తాము నిరూపించుకున్నప్పుడే మహిళలు నిజంగా సంతోషంగా ఉంటారు. కోర్టులకొచ్చే ప్రజలు న్యాయమూర్తి పురుషుడా.. మహిళా.. అని చూడటం లేదు. న్యాయం అందుతోందా? లేదా? అనేదే చూస్తున్నారు. జస్టిస్ మౌషుమిభట్టాచార్య, హైకోర్టు న్యాయమూర్తిసాక్షి, హైదరాబాద్: కోర్టు అనగానే న్యాయదేవతే అందరికీ గుర్తొస్తుంది. కానీ, చాలా ఏళ్లు పురుషాధిక్యతే కొనసాగింది. ఇప్పుడు న్యాయవ్యవస్థ తమదే అంటూ సాగిపోతున్నారు మహిళలు. కేవలం చిహ్నానికే పరిమితం కాకుండా మహిళలు న్యాయదేవతలుగా అవతరిస్తున్నారు. న్యాయం అరి్థంచే స్థాయి నుంచి న్యాయం అందించే స్థాయికి ఎదుగుతున్నారు. ఈ విషయంలో దేశానికి తెలంగాణ (Telangana) స్ఫూర్తిగా నిలుస్తోంది. జిల్లా, కింది కోర్టుల జడ్జీల్లో 56 శాతం మహిళలే న్యాయం అందిస్తున్నారు. ఉన్నత న్యాయస్థానంలోనూ 33 శాతంతో ముఖ్యమైన కేసుల్లోనూ తీర్పులిస్తున్నారు. భవిష్యత్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. మహిళలకు న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకునే హక్కులేదని చెప్పిన ఈ దేశంలోనే పురుషులను మించి సత్తా చాటుకుంటున్నారు. రోజూ వందల తీర్పులిస్తున్న న్యాయదేవతలపై ప్రత్యేక కథనం. మహిళా న్యాయవాదా? కుదరదు.. కోల్కతాకు చెందిన రెజీనా గుహ న్యాయవిద్య పూర్తి చేసుకుని, అలీపూర్ జిల్లా జడ్జి కోర్టులో ప్లీడర్ (లాయర్)గా చేరడానికి 1916లో దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో అదో పెద్ద వింత. మహిళలు నమోదు చేసుకోవడానికి అనుమతి లేదంటూ ఆమె దరఖాస్తును తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెజీనా కలకత్తా హైకోర్టులో పిటిషన్ వేశారు. లీగల్ ప్రాక్టీషనర్స్ యాక్ట్.. అర్హత కలిగిన ‘వ్యక్తులు’ న్యాయవాదులుగా నమోదు చేసుకోవడానికి అనుమతిస్తుందని పేర్కొన్నారు. వ్యక్తి అంటే మహిళ అని కూడా అర్థం అని నివేదించారు. అయితే విచిత్రంగా ఆమె పిటిషన్ను నాటి కోర్టు కొట్టివేసింది. హైకోర్టు జడ్జీగా పదవిని స్వీకరించమని చాలామంది మహిళాలను ఆహ్వానించాం. కానీ, వాళ్లంతా నిరాకరించారు. ఇంటి బాధ్యతలున్నాయి, పిల్లవాడు పన్నెండో తరగతి చదువుతున్నాడు.. లాంటి కారణాలు చెప్పి హైకోర్టు జడ్జిగా ఉండటానికి నిరాకరించారని ఒక హైకోర్టు న్యాయమూర్తి నాకు రిపోర్ట్ చేశారు. ఈ విషయాలన్నిటినీ బహిరంగంగా చర్చించలేం. –2021లో జస్టిస్ బోబ్డే దేశవ్యాప్తంగా 33 శాతం మహిళా న్యాయమూర్తులున్న అతి కొద్ది హైకోర్టుల్లో తెలంగాణ ఒకటి. జిల్లా కోర్టులతో పోలిస్తే హైకోర్టులు, సుప్రీంకోర్టు మహిళల శాతంలో వెనుకబడి ఉన్నాయి. మహిళలను న్యాయమూర్తులుగా మార్చేందుకు బార్ ప్రోత్సాహం మరింత అవసరం. –జస్టిస్ రాధారాణి సమాజంలో మహిళలు శక్తిమంతంగా మారితే అది శాంతికి, శ్రేయస్సుకు దారితీస్తుంది. తల్లిగా, భార్యగా, చెల్లిగా, కూతురిగానే కాదు.. న్యాయమూర్తిగా సేవలు అందించడంలోనూ మహిళలు ముందుంటున్నారు. –జస్టిస్ సూరేపల్లి నందా న్యాయ విద్యలో రాణిస్తున్నారు మహిళలు ఎన్నో రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారు. న్యాయ వ్యవస్థలోనూ న్యాయమూర్తులుగా ఎంతో మంది మహిళలు న్యాయం అందిస్తున్నారు. రాష్ట్రంలో 56 శాతం మహిళలు ఉండటం శుభపరిణామం. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోనూ ఈ స్థాయికి చేరాలని అభిలíÙస్తున్నా. న్యాయ విద్యతో మహిళలు తమ హక్కులు తెలుసుకోగలుగుతారు. న్యాయ విద్యతో ఎన్నో ఉపాధి అవకాశాలున్నాయి. మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖలోనూ ప్రత్యేక పోస్టులుంటాయ్. మహిళలు న్యాయవ్యవస్థలో మరింత రాణించాలి. –సాయి రమాదేవి, సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇప్పటికే ఆలస్యమైంది. మనకు దేశంలో స్త్రీ, పురుష నిష్పత్తి 50ః50 ఉంటే న్యాయవ్యవస్థలో కూడా ఈ నిష్పత్తి ప్రతిబింబించాలి. లింగ సమానత్వం ఉండాలి. ఈ సమస్యపై ఎప్పుడో పోరాటం జరగాల్సింది. అలా జరిగి ఉంటే ఈపాటికి మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెరిగి ఉండేది. –శోభా గుప్త, లాయర్ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య: 42 ప్రస్తుతం పనిచేస్తున్న వారు: 30 పురుషులు: 20 మహిళలు: 10 పనిచేస్తున్న న్యాయమూర్తుల్లో మహిళల శాతం: 33.3 హైకోర్టులో మహిళా న్యాయమూర్తులు.. జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ పీ శ్రీసుధ, జస్టిస్ జీ రాధారాణి, జస్టిస్ టి.మాధవీ దేవి, జస్టిస్ సూరేపల్లి నందా, జస్టిస్ జువ్వాడీ శ్రీదేవి, జస్టిస్ ఎంజీ ప్రియదర్శిని, జస్టిస్ సుజన కళాసికం, జస్టిస్ రేణుక యారా, జస్టిస్ తిరుమలాదేవి -
నిద్ర లేమి ఫోన్ చలవే
సాక్షి, అమరావతి: వ్యసనంగా మారిన సెల్ఫోన్ స్క్రీనింగ్ నిద్రలేమికి కారణమవుతోంది. రాత్రివేళ సెల్ఫోన్లో ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్లు, సినిమాలు చూడటం నిద్రా సమయాన్ని మింగేస్తున్నాయి. ఓ ఐదు నిమిషాలు సెల్ఫోన్తో కాలక్షేపం చేద్దామని మొదలుపెట్టి అరగంట.. గంట.. రెండు గంటలవుతున్నా నిద్రపట్టదు. ఈ సమస్య ప్రస్తుతం ఎందరినో వేధిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం నిద్ర సమయంలో సెల్ఫోన్ వినియోగమేనని పలు అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇదే అంశాన్ని ఇటీవల నార్వే శాస్త్రవేత్తలు సైతం వెల్లడించారు. నిద్ర సమయంలో గంటసేపు స్క్రీన్ చూడటం వల్ల నిద్రలేమి ప్రమాదం 59 శాతం పెరుగుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గంటసేపు స్క్రీన్ చూస్తూ గడపటం వల్ల నిద్ర సమయం సైతం 24 నిమిషాలు తగ్గుతోందని గమనించారు.బ్లూ రేస్తో మెలటోనిన్ ఉత్పత్తిపై ప్రభావంమొబైల్, ల్యాప్ట్యాప్స్, ఇతర డిజిటల్ స్క్రీన్స్ నుంచి వెలువడే బ్లూ రేస్ నిద్రకు తోడ్పడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు తెలిపారు. అలా స్క్రీన్ చూస్తూ ఉండటంతో హార్మోన్ ఉత్పత్తి ఆలస్యమై మేల్కోనే సమయం పెరిగి నిద్రలేమి సమస్యలకు దారితీస్తున్నట్టు వివరించారు. నిద్రకు ఉపక్రమించడానికి ముందు 30 నిమిషాల పాటు సామాజిక మాధ్యమాలను చూసే వయోజనులు నిద్రలో కలత, అంతరాయం వంటి సమస్యలు ఎదుర్కొంటారని, గతంలో అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పరిశోధకులు గుర్తించారు. నిద్రలేమి సమస్యలు 1.62 రెట్లు ఎక్కువయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇది ఆరోగ్యంపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. భావోద్వేగాల నియంత్రణ, జ్ఞాపకశక్తి, మెదడు పనితీరుపై ప్రభావం పడుతుందన్నారు. బీపీ, షుగర్, ఊబకాయం వంటి సమస్యలు దీర్ఘకాలంలో తలెత్తుతాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.45 వేల మందిపై అధ్యయనంనిద్రలేమి సమస్యపై అధ్యయనంలో భాగంగా నార్వే శాస్త్రవేత్తలు 45వేల మంది విద్యార్థులపై పరిశోధన చేపట్టారు. వీరి వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉంది. వీరిని మూడు విభాగాలుగా విభజించి అధ్యయనం చేసినట్టు వెల్లడైంది. ఈ క్రమంలో రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే సమయంలో ఎక్కువగా స్క్రీన్ చూస్తుండటంతో నిద్రపోయే సమయం తగ్గడం, పేలవమైన నిద్ర వంటి సమస్యలు తలెత్తుతున్నట్టు గుర్తించారు. అంతేకాకుండా స్క్రీన్ వాడకం నిద్ర అంతరాయంలో కీలక కారకమని సూచించారు. -
మనువుతో మతిమరుపే!
ఒంటరితనంతో బాధపడేవారు కొన్ని విషయాలనే పదేపదే ఆలోచిస్తూ మిగతా వాటిని మర్చిపోతారనే వాదన ఉంది. కానీ అందులో అస్సలు నిజం లేదని తాజా అధ్యయనం ఒకటి బల్లగుద్ది చెబుతోంది. సోలో బతుకే సో బెటరు అంటోంది. పెళ్లికాని ప్రసాదుల్లో మతిమరుపు లక్షణాలు తక్కువని చెబుతోంది. వైవాహిక బంధానికి బీటలు పడి మళ్లీ ఒంటరయ్యే వాళ్లలో కూడా మతిమరుపు బారిన పడే అవకాశాలు బాగా తగ్గుతున్నట్టు కూడా ఈ పరిశోధనలో వెల్లడైంది.వేల మందిపై అధ్యయనం తర్వాత.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర విశ్వవిద్యాలయం ఈ పరిశోధన జరిపింది. ఇందుకోసం అమెరికాలో 24,000 మందిని ఎంపికచేశారు. వాళ్లందరినీ 18 ఏళ్లపాటు అధ్యయనం చేశారు. పెళ్లయిన వాళ్లు, విడాకులైన వాళ్లు, బ్రహ్మచారులు, జీవితభాగస్వామి అనారోగ్యంతో కన్నుమూసిన వారిని పరిశోధనకు ఎంచుకున్నారు. మతిమరుపు లక్షణాలు లేని వాళ్లను మాత్రమే అధ్యయనం కోసం ఎంపికచేశారు. పెళ్లికాని వాళ్లను మూడు గ్రూప్లుగా విభజించి ఆరోగ్య పరిస్థితిని అంచనావేశారు. పెళ్లయిన వాళ్లతో పోలిస్తే వారికి మతిమరుపు ముప్పు తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. పొగ తాగడం, కుంగుబాటు వంటివి ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని పరిశోధకులు చెప్పారు. పెళ్లయిన వాళ్లతో పోలి స్తే పెళ్లయి విడాకులు తీసుకున్న వాళ్లు, అస్సలు పెళ్లిచేసుకోని వాళ్లలో మతిభ్రంశం ముప్పు తక్కువగా ఉందని బయటపడింది. పెళ్లికాని వ్యక్తుల్లో అల్జీమర్స్ తరహా డిమెన్షియా ముప్పు తక్కువగా ఉంది. అయితే డిమెన్షియాలో అరుదైన రకమైన వాసు్కలర్ చిత్తవైకల్యం ముప్పు వివరాలు వెల్లడికాలేదు.విడాకులు తీసుకున్న వాళ్లలో విడాకులు తీసుకున్న వాళ్లు, అస్సలు పెళ్లిచేసుకోని వాళ్లలో అభిజ్ఞానవికాసం క్షీణించి డిమెన్షియా బారినపడే అవకాశాలు తక్కువగా ఉంటాయని వెల్లడైంది. అధ్యయనకాలంలో జీవితభాగస్వామి చనిపోవడంతో ఒంటరిగా మారిన వ్యక్తుల్లోనూ మనోభ్రంశం ముప్పు తక్కువగా ఉండటం విశేషం. మెదడు ఆరోగ్యం ముఖ్యం మెదడు పనితీరు ఎంత కీలకమైందో ఈ పరిశోధనలో మరోసారి స్పష్టమైంది. వైవాహిక జీవితంలో ఎదురయ్యే అనూహ్య పరిణా మాలు, కష్టాలు, రాజీపడటం, కీలకమైన నిర్ణయాలు అనేవి మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. పెళ్లిచేసుకుంటే హాయిగా ఉంటాం అనేది నిజం కాదని, పెళ్లాయ్యాక కూడా హాయిగా ఉండగల్గితేనే మెదడు ఆరోగ్యం బాగుంటుందని పరిశోధన పునరుద్ఘాటించింది. జీవితభాగస్వామిని కోల్పోయిన వాళ్లు, విడాకులు తీసుకున్న వాళ్లు ఎంతో వేదనకు గురవుతారన్న అభిప్రాయాన్ని సవాల్ చేసేలా ఈ పరిశోధనా ఫలితాలు రావడం గమనార్హం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అణు విద్యుచ్ఛక్తిలో... చైనా అద్భుతం!
ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ అవసరాలు నానాటికీ ఊహాతీతంగా పెరిగిపోతున్నాయి. కృత్రిమ మేధ, రోబోటిక్స్, సెమీ కండక్టర్లు, బయో టెక్నాలజీ వంటి రంగాల్లో ముందంజలో ఉండాలంటే అత్యధిక విద్యుత్, అది కూడా కారుచౌకగా అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యం. ఎందుకంటే ఒక అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ను నిర్వహించాలంటే కనీసం 40 లక్షల విద్యుత్ వాహనాలను చార్జ్ చేయడానికి సమానమైన విద్యుత్ కావాలని అంచనా. ఆన్లైన్ డేటాను రెప్పపాటులో ప్రాసెస్ చేసే కృత్రిమ మేధ డేటా సెంటర్లకు ప్రాణమైన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ)లకు కూడా నిరంతరం నిరాటంకమైన విద్యుత్ సరఫరా తప్పనిసరి. ప్రపంచమే డేటామయంగా మారిన నేపథ్యంలో డేటాను కాపాడుకోవాలన్నా, ఆన్లైన్లో నిరంతరం అందుబాటులో ఉంచాలన్నా అపారమైన విద్యుచ్ఛక్తి కావాల్సిందే. అణు విద్యుత్ రంగంలో ఇప్పటికే నంబర్వన్గా ఉన్న చైనా దీన్ని ముందే పసిగట్టింది. ప్రపంచంలోనే తొలిసారిగా ‘కేంద్రక సంలీన, విచ్చిత్తి’ సూత్రాల కలబోతగా ఓ వినూత్న అణు రియాక్టర్ తయారీకి నడుం బిగించింది. ఈ ప్రయత్నం గనుక ఫలిస్తే అపారమైన విద్యుత్ నిరంతరంగా అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. అన్నింట్లోనూ అగ్రస్థానం కేసి... ప్రపంచంలో ఎక్కడ ఏ కొత్త రకం వస్తువు తయారైనా వెంటనే దానికి నకలు తయారు చేస్తుందని చైనాకు పేరుంది. ఇమిటేషన్ టెక్నాలజీకి పేరెన్నికగన్న చైనా ఇప్పుడు వినూత్న ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆశపడుతోంది. పరిశోధన, అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా వాటికి అత్యధిక నిధులు కేటాయించిన దేశాల్లో చైనాది రెండో స్థానం విశేషం. హువాయీ, టెన్సెంట్, అలీబాబా, గ్జియోమీ, డీజేఐ కంపెనీలు, ఇన్నోవేషన్కు సంబంధించి బీవైడీ తదితరాలు చైనాను టెక్నాలజీలో అగ్రస్థానంలో నిలిపాయి. 5జీ టెక్నాలజీలో హువాయీ, డ్రోన్ టెక్నాలజీలో బీవైడీ టాప్ కంపెనీలుగా వెలుగొందుతున్నాయి. ఐదు నిమిషాలు ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల వెళ్లగల బ్యాటరీ, చార్జింగ్ వ్యవస్థలను బీవైడీ అభివృద్ధి చేసింది. విద్యుత్ వాహనాల అమ్మకాలు, ఆదాయంలో అది ‘టెస్లా’ను దాటేసిందని బీబీసీ ఇటీవలే పేర్కొంది. విద్యుత్ ఆధారిత రంగాల్లో అగ్రగామిగా కొనసాగాలంటే నిరంతర విద్యుత్ అవసరం. ఆ అవసరాలు తీరేలా చైనా ఇలా కేంద్రక సంలీన, విచ్ఛిత్తి రియాక్టర్ పనిలో పడింది.ఇలా పని చేస్తుంది జియాన్గ్జీ ప్రావిన్సులోని యహోహూ సైన్స్ ద్వీపంలో ఝింగ్హువో పేరిట ఈ వినూత్న అణు విద్యుత్కేంద్రాన్ని కేంద్రాన్ని చైనా నిర్మిస్తోంది. చైనా భాషలో ఝింగ్హువో అంటే మెరుపు. కేంద్రక విచ్చిత్తిలో యురేనియం వంటి బరువైన అణువులోని కేంద్రకం రెండు చిన్న కేంద్రకాలుగా విడిపోతుంది. ఆ క్రమంలో అత్యధిక స్థాయిలో ఉష్ణశక్తి వెలువడుతుంది. అణుబాంబు తయారీలో ఉండేది ఈ సూత్రమే. అణు రియాక్టర్లలో నూ దీన్నే వాడతారు. అదే కేంద్రక సంలీన ప్రక్రియలో రెండు కేంద్రకాలు కలిసిపోయి ఒక్కటిగా మారతాయి. విచ్చిత్తితో పోలిస్తే సంలీన చర్యతోనే అత్యధిక విద్యుదుత్పత్తి సాధ్యం. ఝింగ్హువో రియాక్టర్లో తొలుత సంలీన చర్యలు జరిపి వాటి ద్వారా వచ్చే భారయుత కేంద్రకాల సాయంతో విచ్ఛిత్తి జరుపుతారు. తద్వారా మరింత ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని చైనా శాస్తవేత్తలు చెబుతున్నారు. ఐదేళ్లలో లక్ష్యాన్ని సాధించాలని భావిస్తున్నారు.అత్యధిక ‘క్యూ వాల్యూ’ అత్యధిక అణు విద్యుదుత్పత్తి జరగాలంటే కేంద్రక సంలీన చర్యలో అత్యధిక శక్తి ఉద్గారం జరగాలి. సంలీన ప్రక్రియలో విడుదలయ్యే అత్యధిక ఉష్ణశక్తిని రియాక్టర్ విద్యుత్ రూపంలోకి మారుస్తుంది. సంలీన ప్రక్రియకు వెచ్చించాల్సిన శక్తి కంటే దాన్నుంచి ఉత్పన్నమయ్యే శక్తి ఎక్కువగా ఉండటాన్ని ‘నికర శక్తి లాభం’గా పిలుస్తారు. దాన్నే ‘క్యూ వాల్యూ’గా చెప్తారు. సంలీన ప్రక్రియలో అత్యధికంగా ఏకంగా 30 క్యూ వాల్యూను సాధించాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు సౌత్ చైనా మారి్నంగ్ పోస్ట్ కథనం పేర్కొంది. మూడేళ్ల క్రితం అమెరికాలో కాలిఫోరి్నయాలోని నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీ కేంద్రం 1.5 క్యూ వాల్యూను సాధించింది. ఫ్రాన్స్లోని ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పరమెంటల్ రియాక్టర్ (ఐటీఈఆర్) 10 క్యూ వాల్యూను సాధించే ప్రయత్నంలో ఉంది. అమెరికా, ఫ్రాన్స్ ఇప్పటికే కేంద్రక సంలీనం ద్వారా అణువిద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు శ్రమిస్తున్నాయి. చైనా తాజా యత్నాలు ఫలిస్తే అది ఏకంగా 20 ఏళ్లు ముందుకు దూసుకెళ్లగలదని ఆంట్రప్రెన్యూర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్నాడ్ బేర్ట్రెండ్ అభిప్రాయపడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎలక్ట్రానిక్వ్యర్థాల నిర్వహణకు ఓ లెక్కుంది
ఎల్రక్టానిక్ వ్యర్థాల నిర్వహణ అనేది సవాళ్లతో కూడుకున్నదిగా మారుతోంది. ఈ–వ్యర్థాల పట్ల అవగాహన, చైతన్యం తగినంతగా లేకపోవడం..దీనికి సంబంధించిన మౌలిక సదుపాయాలు తగినంతగా అందుబాటులోకి రాకపోవడం, వీటి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నియమ నిబంధనలు సరిగ్గా అమలు కాకపోవడం పెనుసమస్యగా అవతరించింది. ఇవన్నీ కలగలిసి ఈ–వ్యర్థాలను సరైన పద్ధతుల్లో తొలగించకపోవడం వంటి కారణాలతో పర్యావరణానికి నష్టం చేస్తున్నాయి. 2021–22లోనే తెలంగాణలో 50,335.6 టన్నుల ఈ–వ్యర్థాలు ఉత్పత్తి కాగా, వాటిలో 42,297 టన్నులు మాత్రమే సరైన పద్ధతుల్లో తొలగించారని పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ) గతంలోనే వెల్లడించింది. అయితే వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు, పరికరాల వినియోగదారులతోపాటు సాధారణ ప్రజల్లోనూ బాధ్యతాయుతంగా ‘ఎల్రక్టానిక్ వేస్ట్ డిస్పోజల్’విషయంలో సరైన అవగాహన, చైతన్యం లేదని పలు సందర్భాల్లో వెల్లడైంది. ఇళ్లలోనూ నిరుపయోగంగా మారుతున్న వివిధ ఎల్రక్టానిక్ వస్తువుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. చార్జర్లు, వైర్లతో కూడిన ఇయర్ఫోన్లు, స్పీకర్లు, ఎలక్ట్రిక్ కెటిళ్లు, కుక్కర్లు, ఇతర పరికరాలు, వస్తువులు పోగుపడుతున్నాయి. ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, ఎల్ఈడీ టీవీలు, ఇతర వస్తువులు పాడైతే స్థానికంగా అమ్మేయడమో లేక పాతపేపర్లు, పాతసామాన్లు అమ్మే షాపుల వారికి ఇచ్చేయడమో అధికంగా జరుగుతున్నాయి. అయితే ఈ వస్తువులను చివరకు సురక్షితంగా ఏ విధమైన పద్ధతుల్లో డిస్పోజ్ చేస్తున్నారనే విషయంలో మాత్రం స్పష్టత ఉండడం లేదు. – సాక్షి,హైదరాబాద్ సమగ్ర అధ్యయనంపై దృష్టి రాష్ట్రంలో ఈ–వేస్ట్ ఏయే రూపాల్లో ఎంతెంత పరిమాణంలో పోగుపడుతున్నదనే విషయంపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ–వేస్ట్ ఇన్వెంటొరైజేషన్ను చేపట్టి ఈ వ్యర్థాలు ఎక్కువగా ఎక్కడ, ఏ స్థాయిలో ఉత్పత్తి అవుతున్నాయి ? వాటి పరిమాణం ఎంత ? ప్రస్తుతం వాటిని ఏయే రూపాల్లో సేకరించి, సురక్షితంగా తొలగించేందుకు తీసుకుంటున్న చర్యలు తదితరాలను పరిశీలించనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ–వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు, 2022లో ఏఏ అంశాలను పొందుపరిచారు, ఆయా విషయాలను ఏ మేరకు వ్యర్థాల నియంత్రణ, నిర్వహణలో అనుసరిస్తున్నారనే దానిపై అధ్యయనం చేయనున్నారు. ఈ–వ్యర్థాలకు సంబంధించి సేకరించే సమాచారం, వివరాల ఆధారంగా...ఎల్రక్టానిక్ వస్తువుల సేకరణ, మెటీరియల్ రికవరీ, వీటి ద్వారా ఈ–వేస్ట్ మేనేజ్మెంట్లో ఉపాధి అవకాశాల కల్పనతో ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలిచేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై దృష్టి సారించారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలనేది ఎక్కడెక్కడ ఉత్పత్తి అవుతున్నాయో ట్రాక్ చేయడంతోపాటు ఆయా వస్తువులు, పరికరాలకు సంబంధించి కచ్చితమైన సమాచారం తెలుసుకొని అక్రమ డంపింగ్ను నిరోధించడంతోపాటు కచ్చితమైన విధానాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా సంస్థల సేవలు వినియోగించుకునే దిశగా టీపీసీబీ జాతీయస్థాయిలో పేరొందిన కన్సల్టెన్సీ సంస్థలు, విద్యాసంస్థలు, పరిశోధక సంస్థల సేవలను టీపీసీబీ ఉపయోగించుకోనున్నట్టు సమాచారం. మొత్తం 150 రోజుల్లో ఈ అధ్యయ నాన్ని పూర్తిచేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రటిక్ ఎక్విప్మెంట్ (ఈఈ ఈ) కేట గిరీలో ఎంత స్థాయిలో వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయో అంచనా వేస్తారు. ఇందుకోసం ఎంపిక చేసిన సంస్థ, ఉత్పత్తిదారులు, డిస్ట్రిబ్యూటర్లు, రీసైకిల్ చేసేవారు, వేర్వేరు పద్ధతులు, మార్గాల్లో వ్యర్థాలను సేకరించే వారి వివరాలను తీసుకుంటారు.వీరి నుంచి ఈ–వేస్ట్ ఉత్పత్తి అవుతున్న తీరు, పరిమాణం, వాటిని తొలగిస్తున్న తీరు, వీటి నిర్వహణలో ఎదురవుతున్న అంతరాలు, సమస్యలు వంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని ఈ సంస్థలు సేకరిస్తాయి. అనంతరం ఆయా సమస్యలు, అంతరాలను అధిగమించేందుకు పలు సూచనలు, సలహాలతో సిఫార్సులు చేస్తారు. ఈ అధ్యయనంలో భాగంగా సవివర ఇన్వెంటరీ ద్వారా ‘వేస్ట్ ఫ్రం ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ ఎక్విప్మెంట్ (డబ్ల్యూఈఈఈ) బిజినెస్ చెయిన్ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన సలహాలు ఇవ్వనుంది. స్టేక్ హోల్డర్స్ గ్రూపులు ఇలా...ప్రొడ్యూసర్స్, సెల్లర్స్: దిగుమతిదారులు, తయారీదారులు, సరఫరాదారులు, వ్యాపారులు, రిటైల్, డీలర్లు వినియోగదారులు: కుటుంబాలు, వ్యాపార సంస్థలు, ఐటీ కంపెనీలు, బీపీవోలు, విద్యాసంస్థలు, రైల్వే, ఎయిర్లైన్స్, డిఫెన్స్, రవాణా కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగసంస్థలు కలెక్ట్ చేసేవారు: ఈ–వేస్ట్ను సేకరించే స్క్రాప్ డీలర్లు, మాల్స్, ఇతర ప్రైవేట్ సంస్థలు రీసైక్లర్స్: డిసెంబ్లర్స్, డిస్మాంట్లర్స్, మెటీరియల్ రికవరీ యూనిట్లు ఇతర వర్గాలవారు: రోడ్డు పక్క విక్రేతలు, అధికారిక, అనధికారిక వేలం పాటలు పాడేవారు, సెకండ్ హ్యాండ్ ఎల్రక్టానిక్ వస్తువులు అమ్మేవారు -
మనసు మాట మెటాకు తెలుసు!
మీ గురించి ఎవరికి బాగా తెలుసు అని ఎవరైనా అడిగితే ఏం చెబుతారు? అమ్మకో, నాన్నకో, జీవిత భాగస్వామికో, ఆప్త మిత్రుడికో అని చెబితే.. అది కచ్చితంగా అబద్ధమే. ఎందుకంటే.. ఇప్పుడు మీ గురించి అందరికన్నా మీరు వాడే ఫోన్కు లేదంటే ల్యాప్టాప్కే బాగా తెలుసు. మీరు కాదన్నా అదే నిజం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా మీకు ఇష్టమైన రంగు.. ఇష్టమైన చిరుతిళ్లు.. ఇష్టమైన బట్టలు.. ఇలా అన్నింటిని గురించి ముందే తెలుసుకుంటున్నాయి సోషల్మీడియా సంస్థలు. ఇది గతంలోనూ ఉన్నప్పటికీ ఏఐ వచ్చాక వాణిజ్య ప్రకటనల స్వరూపమే మారిపోతోంది. ఈ రంగంలో ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా తీసుకొచ్చిన ‘ఆండ్రోమెడా’ఇప్పుడు సరికొత్త సంచలనం.అంతా మార్చేసిన ఏఐఫేస్బుక్ ఓపెన్ చేస్తే మీకు కావాల్సిన ప్రొడక్టులే ముందుగా కనిపిస్తున్నాయా? ఇన్స్ట్రాగామ్లో స్క్రోల్ చేస్తుంటే.. మీకు నచ్చే డ్రెస్ యాడ్ టెంప్ట్ చేస్తుందా? ఇదేమీ యాదృచ్ఛికం కాదు. మీకు ఎలాంటి ప్రకటనలు చూపించాలో ముందే మెటా సంస్థ నిర్ణయిస్తోంది. మన ‘సోషల్’లైఫ్లో యాడ్స్ తీరును పూర్తిగా మార్చేస్తోంది. మనల్ని ఏఐ పూర్తిగా చదివేస్తోంది. దీంతో మనకు నచ్చే ఉత్పత్తులే మన ముందు ప్రత్యక్షమవుతున్నాయి.మెటా అభివృద్ధి చేసిన ఆండ్రోమెడా అనే కొత్త ఏఐ టెక్నాలజీనే ఇందుకు కారణం. ఈ సిస్టమ్ రోజుకు కోట్ల యాడ్స్ను విశ్లేషిస్తుంది. యూజర్కు ఏ ప్రకటన చూపించాలో నిర్ణయిస్తుంది. నిజానికి ఇది కొత్తదేమీ కాదు. గతంలోనూ మనం ఫోన్ ద్వారా నెట్లో ఏదైనా వెదికితే.. దానికి సంబంధించిన అంశాలు మన సోషల్మీడియా ప్లాట్ఫామ్పై వరుసగా వచ్చేవి. ఇప్పుడు ఆ విధానం మరింత కొత్తరూపు సంతరించుకుంది.ఇన్ఫ్లుయెన్సర్లతో కలిసి యాడ్స్కంపెనీలు తమ ఉత్పత్తుల్ని ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రమోట్ చేయడం చూస్తున్నాం. వీడియో మొత్తం చూశాక.. వీడియోల డిస్క్రిప్షన్లోని లింకులను ఓపెన్చేసి నచ్చితే ఆర్డర్ పెట్టేస్తున్నాం. ఇకపై అంత కష్టపడక్కర్లేదు. యూట్యూబర్, ఇన్స్టాగ్రామ్ స్టార్ ఓ ప్రొడక్ట్ గురించి చెప్తే.. వెంటనే దానికి సంబంధించిన యాడ్ మీకు కనిపిస్తుంది. పాపులర్ క్రియేటర్లతో కలసి బ్రాండ్లు తమ ఉత్పత్తులను కొత్తగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ఇదో చక్కని అవకాశమని కంపెనీలు చెబుతున్నాయి.ఇన్ఫ్లుయెన్సర్ వీడియోను చూస్తూనే.. కింద కనిపించే సంబంధిత పాపప్స్ను సెలక్ట్ చేసుకుని ఆర్డర్ పెట్టేయొచ్చన్నమాట. ఒకే ప్రకటనలో యూజర్కు నచ్చే మరొక ఉత్పత్తిని కూడా చూపించే అవకాశం ఇవ్వనుంది మెటా. అంటే.. ఒక కంపెనీ సమ్మర్ స్పెషల్ కలెక్షన్స్ను చూపిస్తూనే.. వచ్చే వర్షాకాలం సీజన్కు సరిపడే జాకెట్లను కూడా ప్రమోట్ చేస్తుంది. ఇలా యాడ్స్ ప్రదర్శించినప్పుడు విక్రయాల్లో 14 శాతం పెరుగుదల కనిపించిందని మెటా చెబుతోంది.మీరే మోడల్ఆన్లైన్లో డ్రెస్సులు కొనడం మామూలే. కానీ, మీరే మోడల్గా మారి ఆయా డ్రస్సులను ధరించి చూసుకుని కొనుగోలు చేయటం ఇప్పుడు కొత్త ట్రెండ్. ఏఐ ఆధారంగా వర్చువల్ మోడల్స్ను చూపించే ఫీచర్ను మెటా పరీక్షిస్తోంది. యూజర్ శరీరాకృతికి తగిన డ్రెస్సులను ఎలా ధరించాలో చూపించే ప్రయత్నమిది. ఈ విధానం ఇప్పటికే ఆస్ట్రేలియా, తైవాన్లో ప్రయోగాత్మకంగా పరిశీలనలో ఉంది. అంతా బాగానే ఉందిగానీ.. నాకు ఆఫ్లైన్లో షాపింగ్ చేయడం ఇష్టం అంటారా? అలాంటి వారి కోసం చుట్టు పక్కల మాల్స్లోని షాపింగ్ అనుభవాన్ని దగ్గర చేసే ప్రయత్నం చేస్తోంది మెటా.అందుకు తగిన యాడ్స్ను వినియోగదారులకు పరిచయం చేస్తోంది. అవే ‘ఓమ్నీ చానల్’యాడ్స్. మీరు ఆన్లైన్లో చూసిన వస్తువు.. మీ సమీపంలోని షాపుల్లో ఉందా? ఎంత ధర? ఎక్కడ కొనాలి? ఇలా అన్నీ చూపించే విధంగా ప్రాంతీయ యాడ్స్ వస్తున్నాయి. దుకాణాల లొకేషన్, డిస్కౌంట్ కోడ్స్ వంటి వివరాలను ఆ యాడ్స్లో కనిపిస్తాయి. ఈ యాడ్స్ వాడిన బ్రాండ్లకు 12 శాతం విక్రయాలు పెరిగినట్లు మెటా తెలిపింది.నోటిఫికేషన్లోనూ యాడ్స్ ఇదో సరికొత్త ప్రయోగం. ఫేస్బుక్, ఇన్స్టాను ఓపెన్ చేయగానే నోటిఫికేషన్స్ కనిపిస్తాయి. వాటిలో ఇప్పటివరకు ఏ ఫ్రెండ్ రిక్వెస్ట్ లేదంటే కామెంట్స్, లైక్లు కనిపిస్తున్నాయి. ఇకపై ఆ నోటిఫికేషన్స్లో యాడ్స్ కూడా ఉండొచ్చు. ఆ యాడ్స్ గతంలో మీరు వెతికిన ఉత్పత్తులవే అయి ఉంటాయి. మీరు మళ్లీమళ్లీ వెతికే పని లేకుండా మీ నోటిఫికేషన్కు తీసుకొచ్చేస్తోంది మెటా.కొన్ని డిస్కౌంట్ యాడ్స్ను కొత్తగా మార్చేస్తోంది. ‘డిస్కౌంట్ పొందాలంటే మీ ఈమెయిల్ ఇవ్వండి’అని నేరుగా అడుగుతుంది. మీరు మెయిల్ అడ్రస్ ఇచ్చి డిస్కౌంట్ ఆఫర్ పొందొచ్చు. దీంతో బ్రాండ్లు తమ కస్టమర్ల లిస్టును పెంచుకోగలుగుతాయి. ఈ మార్పుల ద్వారా మెటా వాణిజ్య ప్రకటనలకు సరికొత్త నిర్వచనం ఇస్తోంది. యాడ్స్ను చూడడం టైమ్పాస్ కాదు.. టైమ్ను సేవ్ చేయడం అని చెబుతోంది. -
అకాల వర్షాన్ని ఒడిసిపడితే.. బోరులోనూ జలహోరు!
తెలుగు రాష్ట్రాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్లు నోరెళ్ల బెడుతున్నాయి. పంటలు, తోటలు కళ్లు తేలేస్తున్నాయి. మరో మూడు నెలలు ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ చెబుతూనే ఉంది. ఈ కష్టకాలంలో అడపాదడపా పలకరించే అకాల వర్షాలు రైతులకు కొంత మేరకు ఉపశమనం కలిగిస్తున్నాయి. రెండు రోజులు గడిస్తే నీటికష్టాలు షరా మామూలే. అయితే, ఈ అకాల వర్షపు నీటిని పొలాల్లో ఎక్కడికక్కడే ఒడిసిపట్టి భూమిలోకి ఇంకింపజేసుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎండిపోయిన /ఎండిపోతున్న బోర్ల చుట్టూ ఇంకుడు గుంతలు కట్టుకుంటే ఆ బోర్లు ఎండిపోకుండా ఉంటాయి. అవి తిరిగి జలకళను సంతరించుకుంటాయి. వర్షం కురిసిన రోజే ఆ బోర్లలో అప్పటికప్పుడే నీటిలభ్యత పెరుగుతుందని సీనియర్ హైడ్రాలజిస్ట్, సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాటర్ అండ్ లైవ్లీహుడ్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్వి.రాంమోహన్అనుభవపూర్వకంగా చెబుతున్నారు. పన్నెండేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో వేలాది బోర్లను రీచార్జ్ చేసిన అనుభవంతో ఆయన ‘సాక్షి సాగుబడి’కి అనేక విషయాలు చెప్పారు. – సాక్షి, స్పెషల్ డెస్క్ఏమిటి?గ్రామీణ ప్రాంతాల్లో వేలాది వ్యవసాయబోర్లు ఎండిపోయి ఉన్నాయి. కొన్నిచోట్ల తక్కువ నీటిని పో స్తూ ఉన్నాయి. కొత్త బోర్లు తవ్వకుండా ఇప్పటికే ఉన్న ఎండిపోయిన లేదా ఎండిపోతున్న బోరుబా వుల చుట్టూ వాననీటి రీచార్జ్ కట్టడాలు నిర్మించాలి. తద్వారా చిన్న, సన్నకారు రైతులకు అందుబా టు ఖర్చుతోనే నీటి భద్రత కల్పించొచ్చు. ఎప్పుడు? బోరు లోపలికి ట్యాంకర్తో తెచి్చన నీటిని పోసి.. దానికి వాననీటిని ఇంకింపజేసుకునే సామర్థ్యం ఉందో లేదో టెస్ట్ చేయాలి. దీన్నే ట్యాంకర్ టెస్ట్ అంటారు. కేవలం కొన్ని వందల రూపాయల ఖర్చుతో రైతులు సొంతంగా తమ బోరుబావులను పరీక్షించుకోవచ్చు. వానాకాలం ప్రారంభం కాక ముందు ఫిబ్రవరి–మే నెలల మధ్య రోజులు ఇందుకు అనువైన కాలం. ఎక్కడ?కొన్ని పొలాల్లో ఒకటి కన్నా ఎక్కువ బోర్లు ఉండొచ్చు. అలాంటప్పుడు అన్ని బోర్లకు ‘ట్యాంకరు టెస్ట్’చేయాలి. వాటి వాస్తవిక రీచార్జ్ సామర్థ్యం ఎంత అనేది కచ్చితంగా తెలుస్తుంది. లోతు తక్కువ ఉన్న బోరుబావిని రీచార్జ్ కోసం ఎంపిక చేసుకుంటే రీచార్జ్ కట్టడం ద్వారా ఆ పక్కనున్న ఇతర బోరుబావుల్లో కూడా నీరు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు? వర్షాధార వ్యవసాయ ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయిన ప్రతిసారీ కొత్త బోర్లు వేయటం ఆర్థికంగా కష్టంతో కూడుకున్న పని. అందుకని బోరుబావులకే వాననీటిని తాపే పనిచేయడం ఉత్తమం. ఇందుకోసం బోరుబావుల చుట్టూ వాన నీటి రీచార్జ్ కట్టడాలు నిర్మించుకోవాలి. ఇవి దీర్ఘకాలం (కనీసం 8–10 ఏళ్లు) పాటు రైతులకు ప్రయోజనాలు అందించగలుగుతాయి. బోరు రీచార్జ్ సాంకేతికతను ఉపయోగించి, రెండు వానాకాలపు సీజన్లలోనే ఎండిపోయిన బోరు బావులను పునరుద్ధరించుకోవచ్చు. ఎలా? బోరు రీచార్జ్ నిర్మాణానికి స్థానికంగా దొరికే రాళ్లు, ఇసుక, సిమెంట్ వంటి సామగ్రిని వాడుకొని 7–10 రోజుల్లోనే నిర్మాణాన్ని పూర్తి చేయొచ్చు. కొత్తగా బోరుబావి తవ్వడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే.. తక్కువ ఖర్చులోనే ఎండిన బోరుబావులను పునరుద్ధరించొచ్చు. కొత్తగా తవ్వే బోరు పడకపోతే ఆ ఖర్చు అంతా వ్యర్థమే. ఎగువన ఉండే నీటి పరీవాహక ప్రాంతాల నుంచి సంగ్రహించే వాననీటిలో గరిష్టంగా 50% నీరు రీచార్జ్ అవుతుంది (చెక్డ్యాం, నీటికుంటల ద్వారా 10–15% నీరు మాత్రమే భూమిలోకి ఇంకుతుంది). ఈ పద్ధతిలో వాననీటిని రీచార్జ్ చేస్తూనే ఆ బోరుబావి నుంచి నీటిని పంటలకు వాడుకునే వెసులుబాటు ఉంది. ఎవరు?బోరుబావి ద్వారా వాననీటిని నేలలోకి ఇంకించి భూగర్భ నీటిని మరింతగా రీచార్జ్ చేసే సాంకేతిక ప్రక్రియలో ఆర్వి.రాంమోహన్ది అందెవేసిన చేయి. 2012 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో నీటి కష్టాలకు పరిష్కారంగా బోరుబావుల చుట్టూ రాళ్లు రప్పలు, గులక రాళ్లు, ఇసుకతో ఇంకుడు గుంతలు నిర్మించుకోవటంలో రైతులకు, పట్టణవాసులకు చేదోడుగా ఉంటున్నారు. ఇప్పటికి వెయ్యి బోర్ల రీచార్జ్కు ఇంకుడుగుంతలను నిర్మించటంలో ప్రత్యక్షంగా తోడ్పాటునందించారు. మరో మూడు, నాలుగు వేల బోరు రీచార్జ్ పిట్ల నిర్మాణానికి పరోక్షంగా సాంకేతికతంగా సాయపడ్డారు. ఈ క్రమంలో రైతుల అభిప్రాయాలు, సలహాలు సూచనల మేరకు ఈ సాంకేతికతలో ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేశారు. ఈ అనుభవ జ్ఞానంతో ‘గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బోరుబావుల పునరుద్ధరణ (అక్విఫెర్ రీచార్జ్)’పేరిట శిక్షణ కరదీపికను ప్రచురించారు. -
చలో మైదాన్
‘మావాడు ఇంట్లో సెల్ఫోన్కు బానిసయ్యాడు. ఏమాత్రం శారీరక శ్రమ లేక బరువు కూడా బాగా పెరిగాడు. ముందు మావాడి ఫిజికల్ యాక్టివిటీ పెంచండి. ఆ తర్వాత ఆట నేర్పించండి. అప్పుడైనా సెల్ఫోన్కు దూరంగా ఉంటాడు.’ ఇటీవల హిట్కొట్టిన ఓ సినీ హీరో కుమారుడి పరిస్థితిపై క్రీడా కోచ్కు బాలుడి తల్లి చేసిన వినతి ఇది.హైదరాబాద్లో ఓ చార్ట్టర్డ్ అకౌంటెంట్ తన కుమారుడిని క్రికెట్కు అంకితం చేశారు. డ్రైవర్తో పాటు కారు, అన్ని వసతులు సమకూర్చారు. స్కూల్ నుంచి ప్రత్యేక పర్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడా కుర్రాడు ఏజ్ గ్రూప్లో సెంచరీల మీద సెంచరీలు కొడుతూ అండర్–19 జాతీయ జట్టుకు ఎంపికయ్యేలా ఎదిగాడు.నేటి ఆధునిక జీవనశైలి (Life Style) కారణంగా శారీరక శ్రమకు దూరం కావడంతోపాటు సెల్ఫోన్ (Cellphone) వ్యసనానికి బానిసలవుతున్న పిల్లలను గాడినపెట్టేందుకు ఇటీవల కాలంలో తల్లిదండ్రులు వారిని క్రీడల వైపు మళ్లిస్తున్నారు. శారీరక, మానసిక వికాసం కోసం వారిని మైదానాల బాట పట్టిస్తున్నారు. అల్లరి మాన్పించేందుకు కొందరు.. ఊబకాయం వంటి అనారోగ్య సమస్యల నుంచి దూరం చేసేందుకు మరికొందరు, క్రీడలనే కెరీర్గా మలుచుకొనేలా చూసేందుకు ఇంకొందరు తమ పిల్లలను స్పోర్ట్స్ క్లబ్లకు తీసుకెళ్తున్నారు.సంపన్నులతోపాటు మధ్యతరగతి, కొందరు కిందిస్థాయి ఉద్యోగులు, చిరు వ్యాపారులు సైతం పిల్లలను ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో చేరుస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి తర్వాత ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన పెరగడంతో పిల్లలను ఏదో ఒక క్రీడలో శిక్షణ ఇప్పించాలనే కోరిక తల్లిదండ్రుల్లో కలుగుతోంది. దీంతో మూడేళ్ల నుంచి మైదానాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. రోజువారీ శిక్షణ కోసం గ్రామాల నుంచి జిల్లా కేంద్రాలు, పట్టణాలకు వస్తున్న వారూ ఉంటున్నారు.చదువును నిర్లక్ష్యం చేయకుండానే.. పిల్లలకు నచ్చిన క్రీడలో ప్రవేశం కల్పించి వారు అందులో రాణిస్తుంటే భవిష్యత్ను తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. హైదరాబాద్ వంటి చోట్ల భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే పిల్లల కెరీర్ కోసం వర్క్ ఫ్రమ్ హోం చేస్తూనో లేదా ఒకరు జాబ్ వదిలేయడమో చేస్తున్న ఉదాహరణలు కూడా ఉంటున్నాయి. పిల్లలు చదువును నిర్లక్ష్యం చేయకుండానే క్రీడల్లో వారు పాల్గొనేలా చూసుకుంటున్నారు. ఒకవేళ ఏదో ఒకటి తేల్చుకోవాల్సి వస్తే క్రీడల వైపే మొగ్గుచూపుతున్న వారూ ఉన్నారు. ఉన్నతవిద్యా కోర్సుల్లో క్రీడా కోటా ఉండటమే దీనికి కారణం. క్రీడల్లో సత్తాచాటి సర్టీఫికెట్ సాధిస్తే ఎంబీబీఎస్, ఇంజనీరింగ్తోపాటు అన్ని ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాల్లో 0.5 శాతం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్ ఉంది.వెంటనే అద్భుతాలు ఆశించొద్దు.. జట్టు క్రీడాంశాల్లో విజయం దక్కాలంటే సమష్టి ప్రదర్శన కీలకం. అందుకని తల్లిదండ్రులు వ్యక్తిగత క్రీడాంశాల వైపు మొగ్గుచూపుతున్నారు. అందరి దృష్టిలో పడేందుకు, ఆటతీరు బేరీజు వేసుకొని మెరుగుపర్చుకొనేందుకు వ్యక్తిగత క్రీడాంశాలైతే పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే ఏ రంగంలోనైనా లక్ష్య సాధనకు సరైన కార్యాచరణ రూపొందించుకోవడం.. పక్కా ప్రణాళికతో అమలు పరచడం ముఖ్యం. క్రీడలూ దీనికి మినహాయింపు కాదు. పిల్లలు వెంటనే అద్భుతాలు చేయాలని ఆశించకుండా కావాల్సినంత సమయం ఇవ్వాలి. ⇒ ప్రతిరోజూ సగటున పిల్లలు 5–7 గంటలు స్క్రీన్ ముందు గడుపుతున్నారు. క్రీడల ద్వారా ఈ స్క్రీన్ టైమ్ను తగ్గిస్తే పిల్లల్లో దృష్టి సమస్యలు, మానసిక ఒత్తిడి తగ్గి మనోవికాసం మెరుగుఅవుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.⇒ నాన్ డిజిటల్ గేమ్స్ ఆడేవారిలో జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుందని అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి.⇒ క్రీడలు ఆడే వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. సానుకూల దృక్పథం, క్రమశిక్షణ, పట్టుదల ఏర్పడతాయి. గెలుపోటములను సమానంగా స్వీకరించే తత్వం అలవడుతుంది.⇒ పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు..⇒ఆటలు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. వ్యక్తిగా ఎదిగేందుకు దోహదపడతాయి.‘మావాడు ఇంట్లో సెల్ఫోన్కు బానిసయ్యాడు. ఏమాత్రం శారీరక శ్రమ లేక బరువు కూడా బాగా పెరిగాడు. ముందు మావాడి ఫిజికల్ యాక్టివిటీ పెంచండి. ఆ తర్వాత ఆట నేర్పించండి. అప్పుడైనా సెల్ఫోన్కు దూరంగా ఉంటాడు.’ ఇటీవల హిట్కొట్టిన ఓ సినీ హీరో కుమారుడి పరిస్థితిపై క్రీడా కోచ్కు బాలుడి తల్లి చేసిన వినతి ఇది.ఆటలు.. అంకెలు⇒ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకారం పిల్లలకు కనీసం రోజుకు 60 నిమిషాల శారీరక శ్రమ (ఫిజికల్ యాక్టివిటీ) తప్పనిసరి.⇒ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం భారత్లో 90% పిల్లలు సిఫార్సు చేసిన శారీరక వ్యాయామాన్ని పాటించట్లేదు.⇒ ఆస్ట్రేలియా జనాభాలో 71.8%, జపాన్లో 60.3% స్పోర్ట్స్ ఆడుతున్నారు. ఇండియాలో వీరు 6% మాత్రమే.బుమ్రా స్టయిల్.. హార్దిక్ ఆటిట్యూడ్ కొందరు పిల్లలపై భారత జాతీయ క్రీడాకారుల ప్రభావం చాలా ఉంటోంది. క్రికెట్ అకాడమీల్లో పదేళ్ల వయసు పిల్లలు టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్రీ్పత్ బుమ్రా డిఫరెంట్ బౌలింగ్ స్టయిల్ను ప్రాక్టీస్ చేస్తున్నారు. మరికొందరు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఆటిట్యూడ్ను ఫాలో అవుతున్నారు. మాజీ క్రికెటర్ మిథాలీరాజ్ జీవిత కథ ఆధారంగా నిర్మించిన ‘శభాష్ మిథు’వంటి సినిమాలు చూసి స్ఫూర్తి పొంది గ్రౌండ్కు వెళ్తున్న బాలికలూ ఉండడం గమనార్హం. మరికొందరు అమ్మాయిలైతే బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును ఆరాధిస్తున్నారు. మైదానాల్లో పెరిగిన పిల్లల సంఖ్య ⇒ హైదరాబాద్ యూసుఫ్గూడలోని ఓ ప్రైవేటు క్రికెట్ కోచింగ్ సెంటర్లో రెండేళ్ల కిందటి వరకు 20 మంది పిల్లలు కూడా ఉండేవారు కాదు. ఇప్పుడు వారి సంఖ్య 80కి పెరిగింది.⇒ మహబూబ్నగర్ మెయిన్ స్టేడియంలో వాలీబాల్, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, ఆర్చరీ, బ్యాడ్మింటన్లో దాదాపు 200 మంది శిక్షణ తీసుకుంటున్నారు. ఖేలో ఇండియా ఫుట్బాల్ సెంటర్లోనే 35 మంది ఉన్నారు. 30 నుంచి 40 మంది కరాటే మాస్టర్లు వందలాది మందికి శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో 200మంది దాక చిన్నారులు తైక్వాండో శిక్షణ పొందుతున్నారు.⇒ నల్లగొండ అవుట్డోర్ స్టేడియంలో హాకీ, క్రికెట్లో ప్రత్యేక శిక్షణకు వందల మంది వెళ్తున్నారు.⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మార్షల్ ఆర్ట్స్, క్రికెట్, యోగా, స్విమ్మింగ్ శిక్షణ కోసం విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.సెల్ఫోన్ నుంచి చెస్ వైపు.. మంచిర్యాల పట్టణానికి చెందిన అరుకల వేణుగోపాల్, కీర్తన దంపతులు తమ పిల్లలు అక్షయ (14), జశ్విత్(12)లు సెల్ఫోన్, టీవీ చూడడం తగ్గించేందుకు చెస్ నేర్పించడం మొదలుపెట్టారు. రెండేళ్లుగా చదరంగంలో ప్రావీణ్యం సంపాదించారు. రాష్ట్రస్థాయి టోరీ్నలో ఆడుతున్నారు. చదువులోనూ రాణిస్తున్నారు.ఒకే సెంటర్లో 30 మంది అమ్మాయిలు సంగారెడ్డిలోని ఓ క్రికెట్ కోచింగ్ సెంటర్లో 85 మంది శిక్షణ పొందుతుంటే వీరిలో 30 మంది అమ్మాయిలు గ్రామీణ ప్రాంతాలవారే కావడం గమనార్హం. పరిసర గ్రామాలకు చెందిన వీరు నిత్యం 20 కి.మీ. ప్రయాణించి కోచింగ్ తీసుకుంటున్నారు.ఆటో డ్రైవరే అయినా.. ఆటలను వదల్లేదు మహబూబ్నగర్కు చెందిన ఈ బాలిక పేరు సాయి వైష్ణవి. అథ్లెటిక్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. ఆమె అన్న మూడేళ్ల క్రితం స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్లో సత్తాచాటి హైదరాబాద్ శివార్లలోని హకీంపేట స్కూల్లో ప్రవేశం పొందాడు. 8వ తరగతి చదువుతూ ఫెన్సింగ్లో శిక్షణ తీసుకుంటున్నాడు. తండ్రి రాములు ఆటో డ్రైవర్. సాయి వైష్ణవి తండ్రి రాములు మూడుసార్లు ఆర్మీ, నాలుగుసార్లు పోలీస్ ఉద్యోగ పరీక్షలకు వెళ్లి ఉత్తీర్ణత కాలేకపోయాడు. దీంతో పిల్లలను క్రీడల్లో ఉన్నతస్థానాల్లో చేర్చాలనే లక్ష్యంతో శిక్షణ ఇప్పిస్తున్నాడు. జిల్లా, రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్లో సాయి వైష్ణవి ఎంపికయ్యేలా రోజూ స్టేడియానికి తీసుకెళ్లి శిక్షణ ఇప్పిస్తున్నాడు.శారీరకంగా, మానసికంగా ఎదిగేందుకు నా కూతురు యోధ రెండో తరగతి చదువుతోంది. భర్త బాలునాయక్ సూర్యాపేట రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆయన నిత్యం బిజీగా ఉంటారు. పిల్లలు ఇంటి నుంచి వచ్చాక సెల్ఫోన్లు చూసేందుకే మక్కువ చూపుతున్నారు. ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో రాణించేలా చేయాలని భావించా. తనకు ఏది ఇష్టమో అడిగితే క్రికెట్ అని చెప్పింది. దీంతో కోచింగ్ ఇప్పిస్తున్నా. – రోజా, విద్యార్థిని తల్లి, సూర్యాపేటఅమ్మ ప్రోత్సాహంతో.. జీవితంలో ఎదగాలంటే ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నది మా అమ్మ ఆకాంక్ష. ఆమె ప్రోత్సాహంతో రెండేళ్లుగా కరాటేలో శిక్షణ తీసుకుంటున్నా. పది వరకు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాను. ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోగలననే ఆత్మవిశ్వాసం నాకు ఏర్పడింది. – ఇ.ప్రణీష, హనుమకొండఅమ్మాయి బలంగా ఎదిగేలా.. రెండేళ్లుగా మా అమ్మాయికి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇప్పిస్తున్నా. లెక్చరర్గా విధులు నిర్వర్తిస్తూనే పాపను ఉదయం, సాయంత్రం ట్రైనింగ్ క్లాసులకు తీసుకెళ్తున్నా. శారీరక, మానసిక దృఢత్వంతోపాటు అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. – అనిత, అధ్యాపకురాలు, హనుమకొండపిల్లల్ని అథ్లెటిక్స్లో చేర్పించి..డోర్నకల్కు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు మాలోతు రామ్కుమార్, రైల్వే ఉద్యోగి రోజా దంపతులకు ఇద్దరు పిల్లలు కీర్తన (మూడో తరగతి), దామోదర్ (నాలుగో తరగతి). కరోనా వేళ ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లల చేతికి సెల్ఫోన్లు ఇవ్వాల్సి రావడంతో ఇతర విషయాలపై వారికి ఆసక్తి పెరిగింది. దీంతో కీర్తనను అథ్లెటిక్స్లో చేరి్పంచారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో సీటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. -
భారతీయులే లక్ష్యంగా ట్రంప్ మరో బాంబు
అమెరికాలోని మనోళ్లపై తెంపరి ట్రంప్ మరో బాంబు పేల్చారు. గ్రీన్కార్డు, హెచ్1బీ వీసాలపై అక్కడ చట్టబద్ధంగా నివసిస్తున్న భారతీయులే లక్ష్యంగా మరో వేధింపుల పర్వానికి తెరతీశారు. వాళ్లు నిరంతరం తమ ఐడీ కార్డును విధిగా వెంట ఉంచుకోవాల్సిందేనని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కఠిన నిబంధనను శుక్రవారం (ఏప్రిల్ 11) నుంచే అమల్లోకి తెచ్చింది. లేదంటే జరిమానాలతో పాటు కఠినచర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇంకా ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోని అక్రమ వలసదారులను గుర్తించడంలో ప్రభుత్వానికి దోహదపడుతుందంటూ అక్కడి న్యాయస్థానం కూడా ఈ కఠిన నిబంధనకు పచ్చజెండా ఊపింది. అమెరికా పౌరసత్వంలేని 18 ఏళ్లు నిండిన వారంతా తమ చట్టబద్ధ నివాసానికి సంబంధించిన ఐడీ కార్డును 24 గంటలూ వెంట ఉంచుకోవాల్సిందేనని కొత్త నిబంధన సూచిస్తోంది. విదేశీయుల నమోదు చట్టం (1940)లోని ఈ విదేశీయుల నమోదు ఆవశ్యకత (ఏఆర్ఆర్) నిబంధనలు గతంలో ఉన్నవే. కానీ వాటిని ఏనాడూ అమలుచేయలేదు. కోర్టు అనుమతితో కోట్ల మంది అక్రమవలసదారులే లక్ష్యంగా ఈ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టీ నోయెమ్ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ మేరకు వెల్లడించారు. అమెరికాలో ప్రస్తుతం దాదాపు 54 లక్షల మంది భారతీయులున్నారు. 2022 గణాంకాల ప్రకారం 2.,2 లక్షల మంది భారతీయులు అక్కడ అక్రమంగా నివసిస్తున్నారు. అయితే మొత్తం అక్రమ వలసదారుల్లో వీరు కేవలం 2 శాతమేనని సమాచారం. ఏమిటీ నిబంధనలు ? అక్రమంగా వలస వచ్చిన విదేశీయులు, చాన్నాళ్లుగా అమెరికాలో అక్రమంగా ఉంటూ ఇప్పటిదాకా వివరాలు నమోదు చేసుకోని వలసదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరించడమే లక్ష్యంగా ఈ కఠిన నిబంధనలను తెచ్చారు. వాటి ప్రకారం అమెరికాకు వచ్చి 30 రోజులకు మించి ఉండాలనుకునే వాళ్లు తమ వీసా, ఐడీ కార్డులను కచి్చతంగా అనుక్షణం వెంట ఉంచుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో అధికారులు సోదాలు, తనిఖీల వేళ ప్రశ్నిస్తే వెంటనే వాటిని చూపించాలి. లేదంటే జరిమానాలు, ఇతర కఠిన చర్యలను ఎదుర్కోక తప్పదు. దీని ప్రకారం అమెరికా పౌరసత్వం లేని 18 ఏళ్లు నిండిన వాళ్లంతా ఐడీ కార్డును వెంటే ఉంచుకోవాలి. అమెరికా పౌరులు కాని 14 ఏళ్లు నిండిన టీనేజర్ వివరాలను విధిగా నమోదు చేయించుకోవాలి. 14వ పుట్టినరోజుకు ముందు నమోదు చేసినా మళ్లీ కొత్తగా నమోదు చేసుకుని మరోసారి వేలిముద్రల వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు టీనేజర్ 325ఆర్ దరఖాస్తు సమరి్పంచాలి. వారి తల్లిదండ్రులు సైతం 30 రోజుల్లోపు కచి్చతంగా నమోదు చేయించుకోవాలి. ..అయినా ఉండనివ్వరు మరోసారి నమోదు చేసుకున్నా వారిని అమెరికాలో ఉండనిచ్చే ప్రసక్తే లేదని ట్రంప్ సర్కారు స్పష్టం చేసింది. అక్రమవలసదారుల వాస్తవిక సంఖ్యను తేల్చడం, వారిని కనిపెట్టి వెళ్లగొట్టడమే రీ రిజి్రస్టేషన్ లక్ష్యమని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు చెప్పారు. తాజాగా నమోదు సమయంలో కొత్త అడ్రస్, వ్యక్తిగత, కుటుంబ వివరాలు తెలపాల్సి ఉంటుంది. వాటిని కావాలని మార్చి రాస్తే స్వదేశానికి బదులు జైలుకు పంపవచ్చని కూడా తెలుస్తోంది. కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాక కూడా పేర్లను నమోదు చేయనివారు సోదాలు, తనిఖీల్లో దొరికితే భారీ జరిమానా, ఆర్నెల్ల దాకా జైలుశిక్ష వేస్తారు. అడ్రస్ అప్డేట్ చేయకుంటే 5 వేల డాలర్ల జరిమానా గ్రీన్కార్డు, వీసాదారులు మరో చోటుకు మారితే కొత్త చిరునామాను ప్రభుత్వానికి కచ్చితంగా తెలియజేయాలి. 10 రోజుల్లోపు తెలపని పక్షంలో 5,000 డాలర్ల జరిమానా విధిస్తారు. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక గ్రీన్కార్డు, హెచ్–1బీ వీసాదారులు తమ సమాచారాన్ని మరోసారి నమోదు చేయించుకోవాల్సిన పనిలేదు. కాకపోతే గ్రీన్కార్డ్, హెచ్1బీ ఐడీ కార్డును మాత్రం ఎప్పుడూ విధిగా వెంట ఉంచుకోవాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మామిడి.. భరోసా కొరవడి
సాక్షి ప్రతినిధి,ఏలూరు: మామిడి సాగుకు నూజివీడు ఖ్యాతిగాంచింది. దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా నూజివీడు మామిడికి మంచి పేరుతో పాటు డిమాండ్ ఉంది. అలాంటి మామిడి సాగు పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుంది. అకాల వర్షాలు, తెగుళ్లతో దిగుబడులు గణనీయంగా పడిపోయి రైతులకు ఏటా కన్నీళ్లే మిగులుతున్నాయి. ఈ తరుణంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నూజివీడు నియోజకవర్గంలో పర్యటించిన క్రమంలో మామిడి రైతుల్లో ఆశల రేకెత్తాయి. ప్రాసెసింగ్ యూనిట్లు, పరిశోధనా స్థానాన్ని అభివృద్ధి చేయడం వంటి హామీలతో పాటు రైతులకు నష్టపరిహారం ప్రకటిస్తారేమోనని అందరూ ఆశగా ఎదురుచూసి భంగపడ్డారు. 6 గంటల సీఎం పర్యటనలో మామిడి రైతుల గురించి కనీసం ప్రస్తావన లేకపోవడం గమనార్హం. కనీస చర్చ కూడా లేకుండానే.. ఏలూరు జిల్లాలోని నూజివీడు, చింతలపూడి నియోజకవర్గాల్లో మామిడి సాగు గణనీయంగా ఉంది. పదేళ్ల క్రితం వరకు సుమారు 80 నుంచి లక్ష ఎకరాల్లో విస్తరించిన మామిడి వరుస నష్టాలతో విస్తీర్ణంగా తగ్గుతూ వస్తోంది. ఆ స్థానంలో ఆయిల్పామ్, కోకో తోటలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 45 నుంచి 50 వేల ఎకరాల్లో మాత్రమే మామిడి సాగు ఉంది. గతేడాది నవంబర్, డిసెంబర్లో పూత బాగున్నా నల్లతామర తెగులుతో 70 శాతం దిగుబడి తగ్గిపోయింది. జిల్లాలో ప్రధానంగా బంగినపల్లి, తోతాపురి, చిన్నరసాలు, పెద్దరసాలతో పాటు మరికొన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి. మామిడికి అనుసంధానంగా ఎటువంటి పరిశ్రమలు లేకపోవడం, తెగుళ్ల నివారణను సమర్థంగా ఎదుర్కోవడానికి సాంకేతిక సహకారం, నిపుణుల సూచనలు లేకపోవడంతో ఏటా రైతులకు నష్టాలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఆగిరిపల్లి మండలంలో ముఖ్యమంత్రి పర్యటించారు. ఆయనకు స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం బొకేలు బదులు మామిడి పండ్లు బహూకరించారు. అయినా సీఎం పర్యటనలో మామిడికి సంబంధించి ఎలాంటి చర్చ జరగని పరిస్థితి. గత ప్రభుత్వంలో రూ.275 కోట్లతో యూనిట్ మామిడి సాగు పరిరక్షణకు, రైతులకు మేలు చేసేలా నూజివీడులో మామిడి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ 20 ఏళ్లుగా ఉంది. జ్యూస్ పరిశ్రమ, పల్ప్ పరిశ్రమ, మామిడి తాండ్ర పరిశ్రమలు ఏర్పాటు చేస్తే స్థానికంగా ధరలు బాగుండటంతో పాటు విస్తీర్ణం కూడా పెరుగుతుందనే వాదన ఉంది. ఈ క్రమంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.256 కోట్లతో నూజివీడులో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 2023 నవంబర్లో జరిగిన సభలో ప్రకటించి వెంటనే నూజివీడు మండలంలోని సిద్ధార్ధనగర్లో 25 ఎకరాల భూమిని కూడా సేకరించి డీపీఆర్ను సిద్ధం చేసి బ్యాంకర్లకు పంపారు. అనంతరం ఎన్నికల కోడ్ రావడంతో ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఊసే ఎత్తని పాలకులు చంద్రబాబు మొదలు లోకేష్ వరకూ మామిడికి అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల సభల్లో పలుమార్లు చెప్పినా ఆ దిశగా అడుగులు కూడా పడలేదు. నూజివీడులో వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా మామిడి పరిశోధనా కేంద్రం ఉన్నా పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేవు. పరిశోధనా స్థానం 18 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా 70 నుంచి 100 ఎకరాలు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అలాగే ముగ్గురు శాస్త్రవేత్తలు అందుబాటులో ఉన్నా సీజన్ పూర్తయిన తర్వాతే హార్టీకల్చర్, పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంత్రి పార్థసారథి మామిడి పరిశ్రమను అభివృద్ధి చేస్తామని పలుమార్లు ప్రకటించినా ఆ దిశగా క్షేత్రస్థాయిలో పట్టించుకున్న దాఖలాలు లేవు. అప్పులు పాలయ్యాం గత డిసెంబర్లో మామిడి పూతలు బాగా వచ్చాయి. జనవరి నెలాఖరుకు పూతంతా తెగుళ్లు, పురుగులతో మాడిపోయింది. కనీసం 20 శాతం కూడా పిందె కట్టలేదు. పూత నిలుపుకోవడం కోసం పది నుంచి 15 సార్లు పురుగు మందులు చల్లించి అప్పులపాలయ్యాం. ఇప్పుడు చూస్తే తోటల్లో కాయ కూడా లేదు. –డి.నాగమల్లేశ్వరరావు, సుంకొల్లు, నూజివీడు మండలం నల్లతామర నుంచి రక్షించాలి మూడేళ్లుగా తోటలు నల్లతామర బారిన పడుతున్నాయి. దీంతో రైతులు నిండా మునిగిపోతున్నారు. నల్లతామర వల్ల పూతంతా మాడిపోయి పిందె తయారు కావడం లేదు. దీంతో మామిడి రైతులు మూడేళ్లుగా నష్టాల పాలవుతున్నారు. ఈ ఏడాది మరింతగా నష్టాల్లో మునిగిపోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి. –పల్లే రవీంద్రరెడ్డి, తూర్పు దిగవల్లి, నూజివీడు -
షేర్ చేసుకుందాం... కేర్ తీసుకుందాం
మెనోపాజ్ గురించి ఎంత మాట్లాడితే అంత అర్థమవుతుంది.. అర్థమైతేనే దాని మేనేజ్మెంట్ తెలుస్తుంది! అందుకే మెనోపాజ్ ఎక్స్పీరియెన్స్ను షేర్ చేసుకోవడానికి ముందుకొచ్చారు టాలీవుడ్ ప్రముఖ నటి ప్రగతి.. ప్లాట్ఫామ్ దొరికినప్పుడల్లా మెనోపాజ్ గురించి మాట్లాడుతూంటే అది చర్చగా మారుతుంది. అవగాహన కలుగుతుంది. ఆడవాళ్ల పట్ల కేర్ పెరుగుతుంది అంటున్నారు...నిజంగా చెప్పాలంటే ఇది నేను ఎక్స్పీరియెన్స్ చేస్తున్న ఫేజ్. మానసికంగా ఇదెంత ప్రభావం చూపుతోందంటే.. కోపం.. బాధ.. దుఃఖం.. ఆవేశం.. ఇలా ఎమోషన్స్ ఏవీ మన కంట్రోల్లో ఉండవు. దేనికి ఎలా రెస్పాండ్ అవుతున్నామో తెలియదు. ఒకరకమైన అలజడి. వణుకు తెప్పిస్తుంది. భయపెడుతుంది. మనల్ని మనమే గుర్తుపట్టలేని పరిస్థితిని కల్పిస్తుంది.గట్టి దెబ్బే కొడుతుంది.. దీన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఈ మూడ్ స్వింగ్స్ వల్ల మనమేం చేస్తున్నామో మనకే తెలియదు. ఆ సమయంలో మన పనులు డ్యామేజింగ్గా కూడా ఉండొచ్చు. అది ఎదుటి వ్యక్తులను హర్ట్ చేయొచ్చు. మన ఈ ప్రవర్తన ఇంట్లో వాళ్లకూ అర్థమవడం కష్టం. ఫ్రెండ్స్కి చెప్పుకుందామనుకుంటే.. ఎక్కడి నుంచి .. ఎలా మొదలుపెట్టాలో తెలియదు. అసలు ఇది షేర్ చేసుకునే విషయమేనా అనే సంశయం. ఇలా అన్నిరకాలుగా ఇది మనల్ని ఒంటరిని చేస్తుంది. మానసికంగా గట్టి దెబ్బే కొడుతుంది.ముందు మనల్ని మనం.. ఈ ఫేజ్ను డీల్ చేస్తూ నేను తెలుసుకున్నదేంటంటే.. డైట్, మెడిసిన్ అంతగా హెల్ప్ చేయవని. ఫిజికల్ యాక్టివిటీ మాత్రమే ఈ మానసిక ఒత్తిడి నుంచి రిలీఫ్నిస్తుందని. అందుకే ఎక్సర్సైజ్, యోగాను లైఫ్ స్టయిల్ లో భాగం చేసుకోవాలి. ట్రావెల్ లేదా మనకు నచ్చిన పనితో మనల్ని మనం ఎంగేజ్ చేసుకోవాలి. నేను నేర్చుకున్నది ఇదే! దీన్ని ఫాలో అవుతూ నా ప్రొఫెషనల్ లైఫ్ ప్రభావితం కాకుండా చూసుకుంటున్నాను. ఎందుకంటే అదే ఇన్కమ్ సోర్స్ కాబట్టి. అంతేకాదు మన వ్యక్తిగత సమస్యలు వర్క్ ప్లేస్లో చర్చకు తావు ఇవ్వకూడదు! ఇంకో విషయం ఏంటంటే.. మన మూడ్స్వింగ్స్ నేరుగా ప్రభావం చూపించేది కుటుంబం మీదనే. ఎంత ఇబ్బంది అయినా వర్క్ ప్లేస్లో ఒక ఎరుకతో ఉంటాం.. ఉండాలి కూడా! అందుకే ముందు మనల్ని మనం మేనేజ్ చేసుకోవడం తెలుసుకోవాలి. ఇంట్లో వాళ్లతో మన పరిస్థితిని వివరించి.. వాళ్ల సపోర్ట్ కూడా తీసుకోవాలి. దీనివల్ల వర్క్ ప్లేస్లో డీల్ చేయడమూ తేలికవుతుంది. సందర్భం దొరికినప్పుడు.. ఈ ఫేజ్లోని ఆడవాళ్లకు కచ్చితంగా సపోర్ట్ కావాలి. ఆల్రెడీ ఆ ఫేజ్ను అధిగమించిన వాళ్లు తమ అనుభవాలను, డీల్ చేసిన తీరును షేర్ చేసుకోవడం వల్ల ఆ ఫేజ్లోకి ఎంటర్ అయిన మహిళలు ధైర్యం తెచ్చుకుంటారు. ఈజీగా మేనేజ్ చేయగలమనే భరోసా వస్తుంది. దీనివల్ల సిస్టర్హుడ్ డెవలప్ అవుతుంది. అంతేకాదు ఇలాంటి సందర్భం, ప్లాట్ఫామ్ దొరికినప్పుడల్లా సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన మహిళలు దీనిగురించి మాట్లాడటమో.. తమ అనుభవాన్ని పంచుకోవడమో చేస్తే.. మెనోపాజ్ మీద అందరికీ అవగాహన కలుగుతుంది. ఆడవాళ్ల సమస్యలు, బాధలు అర్థమవుతాయి. ఇంటా, బయటా కూడా సపోర్ట్ అందే ఆస్కారం పెరుగుతుంది. నార్మలైజ్ చేయాలి‘మెనోపాజ్ను అనకూడని, వినకూడని మాటలా భావిస్తారు మన సమాజంలో! దీని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే.. ఎంతగా చర్చిస్తే అంతగా అవగాహన పెరుగుతుంది.. అంత ఎక్కువగా మహిళలకు మద్దతు అందుతుంది. సమాజం మీద సెలబ్రిటీల ప్రభావం ఎక్కువ కాబట్టి ఈ బాధ్యతలోనూ వాళ్లు ముందుండాలి. మెనోపాజ్ గురించి మాట్లాడుతూ దాన్ని నార్మలైజ్ చేయాలి!’– లారా దత్తా, బాలీవుడ్ నటి.– శిరీష చల్లపల్లి -
ఆంధ్రలో 85 వేలు.. తెలంగాణలో 75 వేల కేసుల నమోదు
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘క్షయవ్యాధితో దేశవ్యాప్తంగా 2023లో మూడు లక్షల మంది మృతి చెందారు. ప్రపంచంలోనే అత్యధిక కేసులు భారత్లో నమోదవుతున్నాయి. క్షయ వ్యాధిని ముందే గుర్తిస్తే మరణాలను నివారించవచ్చు. సవాల్గా మారిన క్షయ వ్యాధి నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా పని చేయాలి’... (హైదరాబాద్ సీసీఎంబీలో జరుగుతున్న రీజినల్ ప్రాస్పెక్టివ్ అబ్జర్వేషనల్ రీసెర్చ్ ఫర్ టీబీ (రిపోర్టు) ఇండియా 14వ సదస్సులో పరిశోధకుల సూచనలివి.) ఈ ఫొటోలోని వ్యక్తి పేరు ఎట్టి కృష్ణారావు. ములుగు జిల్లా వాజేడు మండలం నాగారం గ్రామం. టీబీ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు.. కాగా పెద్ద కొడుకు పెళ్లి చేసుకొని వేరుగా ఉంటున్నాడు. కూతురికి, మరో కొడుక్కి పెళ్లి కావలసి ఉంది. ఉన్న అరెకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, కూలి పనులకు వెళ్లి భార్య సత్యమ్మ, కొడుకు, కూతురితో కలిసి కుటుంబాన్ని పోషిస్తోంది. ట్యూబర్ క్యులోసిస్ (Tuberculosis) (క్షయ వ్యాధి) మళ్లీ విస్తరిస్తోంది. కనీస జాగ్రత్తలు తీసుకోని అనేక మందిని కబళిస్తోంది. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఈ వ్యాధి ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం.. 2023–24లో దాదాపు 24.25 లక్షల మంది కొత్తగా టీబీ బారిన పడగా, 2024–25లో ఆ సంఖ్య 25,34,112కు చేరింది. ఈ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా చూస్తే టీబీ కేసుల్లో భారత్లోనే 26% ఉన్నాయని ఆ శాఖ అంచనా వేసింది. కాగా దేశవ్యాప్తంగా ట్యూబర్ క్యులోసిస్ (టీబీ) నిర్మూలనకు.. ప్రభుత్వం ఏటా సగటున సుమారు రూ. 2వేల కోట్ల చొప్పున.. ఐదేళ్లలో రూ.10,032.75 కోట్లు ఖర్చు చేసింది. అయినప్పటికీ చాపకింద నీరులా టీబీ వ్యాధి విస్తరిస్తూనే ఉంది. మొదటిస్థానంలో ఉత్తరప్రదేశ్ క్షయ వ్యాధి (టీబీ) దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. 2023–24లో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో 6,13,851 మందికి టీబీ వ్యాధి సోకగా 5,66,490 మందికి విజయవంతంగా చికిత్స చేశారు. 2024–25కు వచ్చేసరికి ఆ సంఖ్య 6,70,590లకు చేరింది. ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర 2,05,909 కేసుల నుంచి 2,14,670 కేసులతో నిలిచింది. బిహార్లో 2023–24లో 1,84,706 మందికి టీబీ సోకగా, 1,55,580 మందికి వైద్యసేవల ద్వారా నయం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024–25లో ఆ రాష్ట్రంలో టీబీ సోకిన వారి సంఖ్య 2,03,853లుగా సర్వేలో తేలింది. గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్లోనూ వ్యాధి తీవ్రత ఉంది. లక్షద్వీప్లో అతితక్కువగా 2023–24లో 13,2024–25లో 14 కేసులు నమోదవగా.. లద్దాఖ్లో 328 నుంచి 318 కేసులకు తగ్గగా, అండమాన్ నికోబార్లో 488 కేసుల నుంచి 533కు పెరిగాయి.డయ్యూ డామన్లో 822 కేసుల నుంచి 790కు తగ్గగా, గోవాలో 1,823 కేసుల నుంచి 1,973కు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్లో 2023–24లో 86,033 కేసులు నమోదు కాగా, ఆ ఏడాది 82,225 కేసులకు విజయవంతంగా చికిత్స చేయగా.. 2024–25లో 81,804 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 72,100లో 66,459 మందికి చికిత్స చేయగా, కొత్తగా 74,711 మంది టీబీ నిర్ధారణయింది. మొత్తంగా దేశవ్యాప్తంగా 2023–24లో 24,25,550 కేసులను గుర్తించి చికిత్స అందించి 21,60,483 మందికి నయం చేయగా, 2024–25లో నిర్వహించిన సర్వే, పరీక్షల్లో 25,34,112 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్దారించి.. వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నివేదికలో వెల్లడించింది. క్షయవ్యాధి విస్తరిస్తుందిలా.. క్షయ.. మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా సంభవించే అంటువ్యాధి. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేయడంతో పాటు ఇతర అవయవాలకు కూడా సోకుతుంది. టీబీ గాలి ద్వారా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపిస్తుంది. ఊపిరితిత్తుల టీబీ ఉన్నవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా ఉమ్మి వేసినప్పుడు, అవి టీబీ క్రిములను గాలిలోకి పంపుతాయి. అయితే ఈ వ్యాధి సోకితే సాధారణ లక్షణాలలో బరువు తగ్గడం, రెండోది దీర్ఘకాలిక దగ్గు, అలసటలు ఉంటాయి. ఛాతీ ఎక్స్–రే, ఇతర పరీక్షల ద్వారా టీబీని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది గుర్తిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో టీబీ వ్యాధి వ్యాప్తిపై ఇంటింటి సర్వే నిర్వహించి స్ఫుటమ్ (కఫం) సేకరించి పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్గా గుర్తించిన వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు మందులు, నాణ్యమైన ఆహారాన్ని అందజేస్తున్నారు. కాగా 2025 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతుండగా, టీబీ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.తండ్రి మరణంతో ఇబ్బందులు టీబీ వ్యాధి నిర్ధారణయ్యాక.. వైద్య పరీక్షలు చేసుకుని మందులు వాడినా.. మా తండ్రి ఎట్టి కృష్ణారావు నాలుగేళ్ల క్రితం మృతి చెందారు. నాతో పాటు అమ్మ, అన్న, చెల్లి ఉన్నారు. పెద్దదిక్కుగా ఉన్న మా నాన్న మృతితో ఇబ్బందుల్లో పడ్డాం. అరెకరం భూమితో పాటు కూలి చేసుకుంటూ అమ్మ, మేము బతుకుతున్నాం. ప్రభుత్వం మా కుటుంబాన్ని ఆదుకోవాలి. – ఎట్టి బాలకృష్ణ, (టీబీ మృతుడుకృష్ణారావు కుమారుడు), నాగారం, ములుగు జిల్లావిరివిగా కఫం పరీక్షలు.. చికిత్స ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఏటా టీబీ సోకిన వారిని గుర్తించేందుకు స్పుటమ్ (కఫం) పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈసారి 6,315 పరీక్షలు నిర్వహించి.. 402 మందిని జిల్లాలో గుర్తించి వారికి వైద్య సేవలు అందిస్తున్నాం. వైద్య శిబిరాల్లో రోగులను గుర్తించి టీబీ నివారణ చికిత్స అందిస్తున్నాం. నిక్షయ్ పోషణ్ కింద చికిత్స పూర్తయ్యే వరకు నెలకు రూ.1,000 వారి ఖాతాలో జమ చేస్తున్నాం. – ఎ.అప్పయ్య, డీఎంహెచ్వో, హనుమకొండ జిల్లా -
రామయ్య హరిత యజ్ఞం, ఎంత మేలు చేసిందో తెలుసా?
వృక్షో రక్షతి రక్షితః అనే సందేశమే వనజీవి రామయ్య జీవిత సారాంశం. చెట్ల ఆవశ్యకత చెప్పిన నిజమైన పర్యావరణ యోధుడాయన. వనజీవి రామయ్య చూపిన మార్గం భావితరాలకు ప్రేరణ కూడా. ఇంతకీ ఆయన ఏళ్ల తరబడి కొనసాగించిన హరిత యజ్ఞతం భవిష్యత్తు తరాలకు ఎంత మేలు అందించిందో తెలుసా?చిన్నప్పుడు బడిలో సర్ చెప్పిన పాఠాలే దరిపల్లి రామయ్య ఆకుపచ్చ కలకు స్ఫూర్తినిచ్చాయి. దశాబ్దాల పాటు శ్రమించి కోటికి పైగా మొక్కలు నాటేలా చేశాయి. ఇన్నేళ్లలో ఆయన నాటిన ఎన్నో వేల, లక్షల మొక్కలు మహావృక్షాలుగా ఎదిగాయి. స్వయంగా ఆయన నాటివే కాకుండా.. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మరెందరో మొక్కలు నాటి ఈ మహా యజ్ఞంలో భాగం అయ్యారు.చెట్లు కార్బన్ డైయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ను విడుదల చేస్తాయని తెలిసిందే. గాల్లోని హానికారక సల్ఫర్ డైయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లనూ ఫిల్టర్ చేస్తుంటాయి. కడదాకా ఆయన కొనసాగించిన హరిత యజ్ఞంతో.. కాలుష్యం తగ్గి గాలి స్వచ్ఛత పెరిగింది.ఏడాదిలో ఒక చెట్టు సగటున 48 పౌండ్ల(22 కేజీలు) కార్బన్ డైయాక్సైడ్ను పీల్చుకుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బదులుగా ఏడాదికి ఇద్దరికి సరిపడా ఆక్సిజన్ను విడుదల చేస్తుందట. రామయ్య నాటింది కోటి మొక్కలకు పైనే. అంటే.. 218 మిలియన్ కేజీల Co2ను పీల్చుకునే అవకాశం ఉంది. ఏడాదికి 47 వేల కార్లు రోడ్డు మీద తిరిగితే వెలువడే కాలుష్యానికి ఇది సమానం. పోనీ కోటికి పైగా మొక్కల్లో లక్షల, వేల మొక్కలు వృక్షాలుగా ఎదిగి ఉన్నా.. ఆ మహానుభావుడి కృషి భావితరాల్లో ఎంత మందికి ప్రాణవాయువు అందిస్తుందో అర్థం చేసుకోవచ్చు. -
విదేశీ విద్యార్థులపై... ఎందుకీ కత్తి?
విదేశీ విద్యార్థుల వీసాలను ట్రంప్ సర్కారు ఎడాపెడా రద్దు చేస్తుండటాన్ని అమెరికన్లు కూడా హర్షించడం లేదు. ఈ ధోరణి అంతిమంగా అమెరికాకే తీవ్ర నష్టం చేకూరుస్తుందన్న ఆందోళన నానాటికీ తీవ్రతరమవుతున్నాయి. ఈ విషయమై అక్కడి విద్యా సంస్థలే గళమెత్తుతున్నాయి. అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎడ్యుకేషన్ (ఏసీఈ)తో పాటు మరో 15 సంస్థలు బాధిత విదేశీ విద్యార్థుల తరఫున రంగంలోకి దిగాయి. ఏ కారణాలూ చూపకుండా వారి వీసాలను రద్దు చేయడం, సంబంధిత యూనివర్సిటీలకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే వారి స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సి స్టం (సెవిస్) రికార్డులను గల్లంతు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. దీనిపై తక్షణం వివరణ ఇవ్వాలంటూ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) వి భాగానికి సంయుక్తంగా ఓ లేఖ రాశాయి. డీహెచ్ఎస్ మంత్రి క్రిస్టీ నోయెమ్తో పాటు విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు కూడా లేఖ ప్రతిని పంపాయి. విద్యార్థి వీసాల రద్దుకు సంబంధించి పూర్తి వివరాలు బయట పెట్టాల్సిందేనని ఏసీఈ అధ్యక్షుడు టెడ్ మిషెల్ డిమాండ్ చేశారు. ‘‘స్వీయ డీపో ర్టేషన్ ద్వారా దేశం వీడండంటూ విద్యార్థులకు వస్తున్న ఈ మెయిళ్లు, మెసేజీల ద్వా రా మాత్రమే విషయం తెలుస్తోంది. అందుకు కారణాలైనా చెప్పకపోవడం మరీ దారుణం. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. అభ్యంతరకర సోషల్ మీడియా కార్యకలాపాలకు, డాక్యుమెంటేషన్ తప్పిదాలకు, చివరికి ట్రాఫిక్ ఉల్లంఘనలకు కూడా వీసాలు రద్దు చేస్తున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న తప్పిదాలకు కూడా ఇంతటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం దారుణం’’అంటూ ఆయన ఆక్షేపించారు. ‘‘మీ తీరుతో అమెరికావ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇది మన దేశానికి కూడా మంచిది కాదు’’అని ఆవేదన వెలిబుచ్చారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జాతీయ భద్రత పేరిట విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా అత్యంత కఠినంగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. ఇప్పటిదాకా కనీసం 300 మందికి పైగా పాలస్తీనా సానుభూతిపరులైన విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్టు రూబి యో ఇటీవల వెల్లడించారు. గతంలో ఏ కారణంతోనైనా విద్యార్థి వీసాలను రద్దు చేసినా విద్యాభ్యాసం పూర్తయ్యేదాకా అమెరికాలో ఉండేందుకు వీలుండేది. ఇప్పుడు మాత్రం వీసా రద్దుతో పాటు సెవిస్ రికార్డులను కూడా శాశ్వతంగా తుడిచిపెడుతుండటంతో బాధిత విద్యార్థులు తక్షణం అమెరికాను వీడటం తప్ప మరో మార్గం లేకుండా పోతోంది. వర్సిటీల్లోనూ ఆందోళన విద్యార్థి వీసాల రద్దు అమెరికా యూనివర్సిటీలను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. చాలాసార్లు ఈ ఉదంతాలు తమ దృష్టికి కూడా రావడం లేదని ప్రఖ్యాత హార్వర్డ్ వర్సిటీ పేర్కొంది. ‘‘మేం స్వయంగా పూనుకుని మా విద్యార్థుల రికార్డులను పరిశీలించాల్సి వస్తోంది. మా వర్సిటీకీ చెందిన ముగ్గురు విద్యార్థులతో పాటు ఇటీవలే విద్యాభ్యాసం ముగించుకున్న మరో ఇద్దరి వీసాలను రద్దు చేసినట్టు తెలియగానే వారికి న్యాయ సాయాన్ని సిఫార్సు చేశాం’’అని వెల్లడించింది. అరిజోనా స్టేట్ వర్సిటీలో 50 మంది విదేశీ విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదరైంది. వారి వీసాల రద్దుకు కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. నార్త్ ఈస్టర్న్ వర్సిటీలోనూ 40, కాలిఫోర్నియా వర్సిటీలో 35 మంది విద్యార్థుల వీసాలు కూడా రద్దయ్యాయి. ఇలాంటి పరిస్థితులను గతంలో ఎన్నడూ చూడలేదని మసాచుసెట్స్ వర్సిటీ చాన్స్లర్ వాపోయారు. విదేశీ విద్యార్థులే కీలకం అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో విదేశీ విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024లో వారినుంచి అమెరికాకు ఏకంగా 4,380 కోట్ల డాలర్ల మేరకు ఆదాయం సమకూరినట్టు ‘ఓపెన్ డోర్స్’నివేదిక పేర్కొంది. అమెరికా వర్సిటీల్లో ఉన్నతవిద్య పూర్తి చేసుకుంటున్న విదేశీ విద్యార్థులను, ముఖ్యంగా భారతీయులను అమెరికా ఐటీ సంస్థలు కళ్లు చెదిరే వేతనాలిచ్చి మరీ తీసుకుంటున్నాయి. కొన్నేళ్లలోనే ఆ సంస్థలకు వాళ్లు వెలకట్టలేని ఆస్తిగా మారుతున్నారు. ‘అమెరికా ఫస్ట్’పేరిట విదేశీ విద్యార్థులపై వేధింపులు ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాల నుంచి అగ్ర రాజ్యానికి దశాబ్దాలుగా కొనసాగుతున్న మేధో వలసకు అడ్డుకట్ట పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది అంతిమంగా అమెరికాకే తీవ్ర నష్టమని అక్కడి విద్యా సంస్థలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సరిగ్గానే దిద్దుతున్నారా?
సాక్షి, ఎడ్యుకేషన్రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది విద్యార్థులు పోటీపడే ఉద్యోగ నియామక పరీక్షల్లో జవాబు పత్రాల మూల్యాంకనం మెరుగ్గానే ఉందా? వాటిని సరిగానే దిద్దుతున్నారా?అంటే.. లేదనే సమాధానమే వస్తోంది. పలు పోటీ పరీక్షల మూల్యాంకనంపై సవాలక్ష సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యంగా ఏళ్ల తరబడి చదివి పరీక్ష రాస్తే, ఆ జవాబు పత్రాలు దిద్దే నిపుణుల అర్హత, అనుభవంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలను బలపర్చేలా ఇటీవల గ్రూప్–1 పరీక్షలో వచ్చిన ఫలితాలు ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణులు అంటున్నారు. ‘కీ’ పాయింట్లకే పరిమితమై...పోటీ పరీక్షల్లో లక్షల మంది భవిష్యత్తును నిర్ణయించేది మూల్యాంకనమే. ఇంతటి కీలకమైన మూల్యాంకనాన్ని సరిగ్గా నిర్వహించే అనుభవజు్ఞలైన ఫ్యాకల్టీ లేరనే వాదన బలంగా వినిపిస్తోంది. అందుబాటులో ఉన్నవారితోనే మమ అనిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జవాబు పత్రాలు దిద్దేవారికి అధికారులు నాలుగైదు ‘కీ’పాయింట్లు ఇస్తారు. అయితే, అభ్యర్థి అంతకంటే మంచి పాయింట్లతో సమాధానం రాసినా, ఫ్యాకల్టీ ఆ కీ పాయింట్ల అన్వేషణకే పరిమితమై తగిన మార్కులు ఇవ్వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.దీంతోపాటు వేర్వేరు సబ్జెక్టులు ఉండే పేపర్ను ఒక్కరితోనే మూల్యాంకనం చేయిస్తున్నారు. ఇది కూడా ఫలితాలపై ప్రభావం చూపుతోంది అని నిపుణులు చెబుతున్నారు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, డిగ్రీ లెక్చరర్ పోస్ట్లు రెండు రాష్ట్రాల్లో భారీగా ఖాళీగా ఉండటమే సమస్యకు మూలకారణమని అభ్యర్థులు అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే సమస్య నెలకొందని చెబుతున్నారు. ఇవీ కొన్ని సమస్యలు.. ⇒ గ్రూప్–1 మెయిన్స్లో ఉండే పాలిటీ, గవర్నెన్స్, సొసైటీ పేపర్ను పరిగణనలోకి తీసుకుంటే.. పాలిటీ వరకు మాత్రమే అకడమిక్స్లో ఉంటుంది. మూల్యాంకనం చేసే అధ్యాపకులకు ఇండియన్ సొసైటీ, గవర్నెన్స్ గురించి అంతగా అవగాహన ఉండదు. దీంతో వారు కీ షీట్పైనే ఆధారపడి మూల్యాంకనం చేస్తున్నారు. ⇒ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో బయాలజీ, ఫిజిక్స్, సమకాలీన సాంకేతిక రంగానికి సంబంధించిన అంశాల ఉంటాయి. కానీ, డిగ్రీ స్థాయిలో కోర్ సైన్స్ సబ్జెక్టులే ఉంటాయి. కరెంట్ టాపిక్స్ ఉండవు. దీంతో ఎవాల్యుయేటర్స్ కరెంట్ టాపిక్స్పై అవగాహన లేకుండానే మూల్యాంకనం చేస్తున్నారు. ⇒ జనరల్ ఎస్సే పేపర్లో హిస్టరీ, కల్చర్, ఎకనమీ, పాలిటీ, కరెంట్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. వీటిని మూల్యాంకన చేయాలంటే ఒక్కో ప్రశ్నకు ఒక్కో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ను నియమించాలి. కానీ.. అలా జరట్లేదని అభ్యర్థులు అంటున్నారు. ⇒ వేర్వేరు సబ్జెక్టులు కలిపి ఉండే పేపర్ల విషయంలో సెక్షన్ వారీగా వేర్వేరు సబ్జెక్టు నిపుణులతో మూల్యాంకనం చేయిస్తేనే అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. ⇒ రెండు తెలుగు రాష్ట్రాల్లో యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టులు 75 శాతం ఖాళీగా ఉన్నాయి. ఏపీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 4,330 ఉంటే.. 1,048 మంది మాత్రమే ఉన్నారు. వీరిలోనూ గత నెలలో దాదాపు 150 మంది పదవీ విరమణ చేశారని సమాచారం. తెలంగాణలో 2,825 పోస్టులకు గాను 873 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. మిగిలిన పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ⇒ డిగ్రీ లెక్చరర్ పోస్టులు కూడా దాదాపు 40 శాతం మేరకు ఖాళీగా ఉన్నాయి. ఫ్యాకల్టీ కొరతతో బోధన ప్రమాణాలు తగ్గడమే కాకుండా.. పరీక్షల నిర్వహణలో ప్రొఫెసర్ల భాగస్వామ్యం లేక లోపాలు చోటుచేసుకుంటున్నాయి. అనువాదం కూడా సమస్యే పోటీ పరీక్షల విషయంలో ప్రశ్నల అనువాదం కూడా ప్రధాన సమస్యగా మారుతోంది. ప్రశ్న పత్రాన్ని ముందుగా ఇంగ్లిష్లో రూపొందించి తెలుగులోకి అనువాదం చేస్తున్నారు. ఇందుకోసం అఫీషియల్ ట్రాన్స్లేటర్స్ను నియమిస్తున్నారు. వారు ప్రశ్న భావాన్ని అర్థం చేసుకోకుండా మక్కీకి మక్కీ (ట్రూ ట్రాన్స్లేషన్) అనువాదం చేస్తున్నారు. దీనివల్ల తెలుగు మీడియం అభ్యర్థులు నష్టపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు.. సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ను (శాసన ఉల్లంఘన ఉద్యమం) పౌర అవిధేయత ఉద్యమం అని అనువాదం చేస్తుండటంతో అదేమిటో తెలుగు మీడియం అభ్యర్థులకు అర్థమే కావటంలేదు. ప్రశ్న పత్రం అనువాద ప్రక్రియలో ఆయా సబ్జెక్టులకు సంబంధించి కనీసం ఏడెనిమిది మందిని భాగస్వాములను చేస్తే సమస్య పరిష్కారమవుతందని నిపుణులు చెబుతున్నారు. సమయాభావం పోటీ పరీక్షల్లో ఎదురవుతున్న మరో సమస్య సమయాభావం. అభ్యర్థులకు మొత్తం ప్రశ్న పత్రాన్ని చదివేందుకు కూడా కొన్ని సందర్భాల్లో సమయం సరిపోవడం లేదు. గ్రూప్–1 ప్రిలిమ్స్లో 150 ప్రశ్నలకు 150 నిమిషాల్లో సమాధానం ఇవ్వాలి. ప్రశ్న పత్రం రూపొందించిన వారికి సైతం 150 ప్రశ్నలను 150 నిమిషాల్లో చదవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభ్యర్థులు కనీసం 30 నుంచి 40 ప్రశ్నలు చదవకుండానే సమాధానాలు గుర్తించాల్సి వస్తోంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్లోని సీశాట్లో 80 ప్రశ్నలకు 120 నిమిషాల సమయం ఇస్తారు. మెయిన్స్ను కూడా ఆబ్జెక్టివ్ చేయాలా? గ్రూప్–1 మెయిన్స్ ప్రశ్న పత్రం రూపకల్పన, మూల్యాంకన సమస్యల నేపథ్యంలో మెయిన్స్ను కూడా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే విషయంలో సంబంధిత సబ్జెక్టులో పూర్తి పరిజ్ఞానం ఉన్న అభ్యర్థికి మాత్రమే సాధ్యమయ్యే రీతిలో ప్రశ్న పత్రం రూపొందించొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మూడో వ్యక్తితో మూల్యాంకనం చేయించాలి గ్రూప్–1లో కచ్చితంగా ఇద్దరు నిపుణులతో మూల్యాంకనం చేయించాలి. మొదటి, రెండో మూల్యాంకనాల్లో మార్కుల మధ్య 5 శాతం వ్యత్యాసం ఉంటే మూడో వ్యక్తితో మూల్యాంకనం చేయించాలి. అప్పుడు ఎలాంటి పొరపాట్లు లేకుండా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. యూపీఎస్సీలో ఇదే విధానం అమలవుతోంది. రెండు, మూడు సబ్జెక్టుల సమ్మిళితంగా ఉన్న పేపర్ల విషయంలో.. సెక్షన్ వారీగా సంబంధిత సబ్జెక్టు నిపుణులతో మూల్యాంకనం చేయించాలి. తెలుగు మీడియం అభ్యర్థులకు అర్థమయ్యే రీతిలో ప్రశ్నపత్రం అనువాదం ఉండాలి. – ప్రొఫెసర్. వై.వెంకటరామిరెడ్డి, యూపీఎస్సీ మాజీ సభ్యుడు, ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ యూపీఎస్సీ తరహాలో చేయాలిగ్రూప్–1 మెయిన్స్ మూల్యాంకనం కూడా యూపీఎస్సీ సివిల్స్ మూల్యాంకనం మాదిరిగా ఒక నిర్దిష్ట విధానంలో చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూపీఎస్సీలో పోస్టుల సంఖ్యకు అనుగుణంగా మెయిన్స్కు 1:13 (ఒక్కో పోస్టుకు 13 మంది చొప్పున) ఎంపిక చేస్తారు. మూల్యాంకనానికి దేశవ్యాప్తంగా నిష్ణాతులైన ప్రొఫెసర్లను ఎంపికచేస్తారు. వేర్వేరు సబ్జెక్టులు ఉండే పేపర్ల మూల్యాంకనానికి సెక్షన్ వారీగా వేర్వేరు నిపుణులను నియమిస్తారు. యూపీఎస్సీ మూల్యాంకనంలో కీ పాయింట్లను కేటాయించినప్పటికీ.. సమాధానంలో అదనపు సమాచారం ఉంటే.. వాటికీ మార్కులు ఇస్తారు. రాష్ట్రాల స్థాయిలో ఈ విధానం లేదు. -
విద్యుత్ ఆదా చేద్దామిలా
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా 40 ఏళ్లకు మాత్రమే సరిపడా విద్యుత్ ఉత్పత్తి వనరులు అందుబాటులో ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వేసవిలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. తద్వారా బిల్లులు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్ను ఆదాచేసే స్టార్ రేటెడ్ ఉపకరణాలను వాడటంతో పాటు పొదుపు కోసం పాటించాల్సిన విధానాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఏసీ పెంచేయొద్దు రాష్ట్రంలో ప్రతి 100 ఇళ్లల్లో 24 ఇళ్లకు ఏసీలున్నట్టు ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఇటీవల వెల్లడించింది. రాష్ట్రంలో ఏసీలకు ఏటా దాదాపు 3 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఖర్చవుతోంది. ఇది రాష్ట్రం మొత్తం విద్యుత్ వినియోగంలో 5 శాతం. ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్కు పెట్టుకుంటే దేశంలో ఏటా రూ.10 వేల కోట్ల విలువైన దాదాపు 20 బిలియన్ యూనిట్ల విద్యుత్ను ఆదా చేయవచ్చని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) నివేదికలో పేర్కొంది. ఉష్ణోగ్రతలో 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుదల వల్ల విద్యుత్తులో 6 శాతం ఆదా చేయవచ్చని అధ్యయనంలో తేలింది. ఎల్ఈడీలు మేలు ఎల్ఈడీ బల్బుల్లో విద్యుత్ సామర్థ్యం ఎక్కువ. అధిక నాణ్యతతో దీర్ఘకాలం మన్నుతాయి. ప్రకాశించే బల్బులతో పోలి్చనప్పుడు 88 శాతం తక్కువ విద్యుత్ను వినియోగిస్తాయి. ఎల్ఈడీల లైటింగ్ టెక్నాలజీ సాధారణంగా ప్రకాశించే లైటింగ్ కంటే 25 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ బల్బు వల్ల ఏడాదికి 73.7 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని ఆంధ్రా విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా చేసిన అధ్యయనంలో తేలింది. స్టార్ రేటింగ్ చూసి కొనండి విద్యుత్ ఉపకరణాలు స్టార్ రేటెడ్వి వాడితే మరింతగా విద్యుత్ను ఆదా చేయవచ్చనే ఉద్దేశంతో స్టార్ లేబులింగ్ ప్రోగ్రామ్(ఎస్ఎల్పీ)ను 2006లో బీఈఈ ప్రారంభించింది. ఇంధన సామర్థ్యం ఆధారంగా ఎల్రక్టానిక్ ఉపకరణాలకు స్టార్ రేటింగ్ను (1–5 స్టార్లు) కేటాయిస్తుంది. 5 స్టార్ రేటింగ్ లేబుల్ ఉంటే అత్యంత సమర్థవంతమైన మోడల్గా సూచిస్తుంది. 5 స్టార్ రేటింగ్ పరికరాలు విద్యుత్ బిల్లులను ఆదా చేయడమే కాకుండా పర్యావరణానికి కూడా ప్రయోజనం చేకూర్చేందుకు దోహదపడతాయి. – మిలింద్ డియోరా, సెక్రటరీ, బీఈఈవిద్యుత్ ఆదాకు మరిన్ని చిట్కాలు» పగటిపూట కర్టెన్లు తెరిచి, లైట్లకు బదులు సూర్యకాంతిని వినియోగించుకోండి. » ఏసీ ఆన్లో ఉన్నప్పుడు కిటికీలు, తలుపులు తెరిచి ఉంచవద్దు. » ఎండగా ఉన్నప్పుడు, డ్రైయర్ని ఉపయోగించకుండా దుస్తులు ఆరు బయట ఆరబెట్టుకోవాలి. » లేత రంగు, వదులుగా ఉండే కర్టెన్లను ఉపయోగించాలి. పగలు కిటికీలు తెరిచి ఉంచాలి. సన్ ఫిల్మ్లు, కర్టెన్లు ఉన్న కిటికీలు ఉండాలి. » ఎలక్ట్రిక్ ఐరన్, సీలింగ్ ఫ్యాన్ల కోసం సంప్రదాయ రెగ్యులేటర్లకు బదులు ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్లను వాడాలి. » సీలింగ్ ఫ్యాన్ల కంటే ఎక్కువ ఎత్తులో ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఇన్స్టాల్ చేయండి. » ఏసీతో పాటు ఫ్యాన్ని ఆన్లో ఉంచండి. రూఫ్ గార్డెన్ ఎయిర్ కండీషనర్పై భారాన్ని తగ్గిస్తుంది. » ఎలక్ట్రిక్ వాటర్ హీటర్కు బదులు సోలార్ వాటర్ హీటర్ ఉపయోగించండి. » నియాన్ సైన్ బోర్డులకు బదులు పెయింట్ చేసిన సైన్ బోర్డులను ఉపయోగించండి. » వ్యవసాయ బోర్లకు వాడే త్రీఫేజ్ మోటార్ టెర్మినల్స్ వద్ద షంట్ కెపాసిటర్లను అమర్చాలి. » ఇంటి పైభాగంపై కూల్ సర్ఫేస్ పెయింట్ వేస్తే ఇంట్లో వేడితో పాటు ఏసీ వినియోగం తగ్గుతుంది. బీఎల్డీసీ ఫ్యాన్లు వాడండి సాధారణ ఫ్యాన్లతో పోలిస్తే బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంటు (బీఎల్డీసీ) టెక్నాలజీతో పని చేసే సూపర్ ఎఫిషియెంట్ ఫ్యాన్లు దాదాపు సగం విద్యుత్ మాత్రమే వినియోగిస్తాయి. బీఎల్డీసీ ఫ్యాన్ 28 నుంచి 38 వాట్ల విద్యుత్ను మాత్రమే వినియోగిస్తుండగా.. సాధారణ సీలింగ్ ఫ్యాన్ 75 వాట్ల విద్యుత్ తీసుకుంటుంది. ఈ ఫ్యాన్ 9 నెలల పాటు రోజుకు 7 గంటల చొప్పున వినియోగిస్తే ఏడాదికి 81 యూనిట్లు ఆదా చేస్తుంది. -
కంచకు చేరని కథ
ప్రకృతి నడుమ ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అలజడి రేగింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై వివాదం రేగింది. విద్యార్థులందరూ ఏకమై ఉద్యమం చేపట్టారు. విద్యార్థి సంఘాలు, విపక్షాలు వీరికి మద్దతు పలకడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. చివరికి సుప్రీం కోర్టుకు చేరింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర సాధికార కమిటీ హెచ్సీయూలో వివాదాస్పద భూముల పరిశీలనకు వచ్చిన నేపథ్యంలో అసలు గతంలో ఏం జరిగింది? ఈ వివాదమెందుకు వచ్చింది? విద్యార్థుల నిరసనలకు కారణమేంటి? ప్రభుత్వం వాదనేంటి? వర్సిటీ వర్గాల కౌంటరేంటి? ఈ మొత్తం వ్యవహారంపై ‘సాక్షి ఇన్డెప్త్’ స్టోరీ మీకోసం.. గతంలో ఏం జరిగిందితెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన తొలి దశ ఉద్యమం, ఆ తర్వాత జై ఆంధ్ర ఉద్యమాల నేపథ్యంలో 1970వ దశకం ప్రారంభంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1974లో హెచ్సీయూను ఏర్పాటు చేశారు. తొలుత నాంపల్లి స్టేషన్ రోడ్డులోని సరోజినీ నాయుడు ఇల్లు ‘గోల్డెన్ థ్రెషోల్డ్’లో ఇది ప్రారంభమైంది. ప్రస్తుత రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని కంచ గచ్చిబౌలి గ్రామం సర్వే నంబర్ 25లో ఉన్న 2,324 ఎకరాలను కేటాయించిన తర్వాత అక్కడ పెద్ద క్యాంపస్ ఏర్పడింది. అప్పట్లోనే ఆ భూమి చుట్టూ ప్రహరీ గోడను కూడా కట్టారు. అప్పట్నుంచీ ఆ భూములన్నీ వర్సిటీ ఆధ్వర్యంలోనే ఉన్నా.. అధికారికంగా యూనివర్సిటీ పేరిట మాత్రం భూముల బదలాయింపు జరగలేదు. అంటే అధికారికంగా యూనివర్సిటీ పేరిట ఒక్క ఎకరా కూడా లేదన్నమాట. అయితే ఉమ్మడి ఏపీలో 2012 నవంబర్ 20వ తేదీనే అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఈ భూముల బదలాయింపునకు సంబంధించిన ప్రతిపాదనలు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయానికి వెళ్లాయి. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ప్రతిపాదనలు పరిష్కారానికి నోచుకోకపోవడం గమనార్హం. నాడు చంద్రబాబు చేసిన నిర్వాకం ఏమిటి? హెచ్సీయూకు కేటాయించిన భూముల్లోని ఈ 400 ఎకరాలూ వివాదాస్పదం కావడానికి ఆద్యుడు 2004లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి నైతికంగా వీల్లేకపోయినా.. క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసమంటూ పెద్దగా ఊరూ పేరూ లేని ఐఎంజీ భారత అనే సంస్థకు మొత్తం 850 ఎకరాలను చంద్రబాబు కేటాయించారు.అందులో 400 ఎకరాలు హెచ్సీయూ కింద ఉన్న కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25 లోనివి కాగా, మరో 450 ఎకరాలను మామిడిపల్లిలో కేటాయించారు. అవగాహన ఒప్పందాలు, కేటాయింపు ఉత్తర్వులు, రిజిస్ట్రేషన్ కూడా ఆగమేఘాల మీద చేసేశారు. 2004 ఫిబ్రవరి 10వ తేదీన ఆ భూమి ఐఎంజీ పేరిట రిజిస్ట్రేషన్ అయ్యింది.వాస్తవానికి ఆ సమయంలో మొత్తం 534.28 ఎకరాలను వర్సిటీ నుంచి తీసుకున్న బాబు.. 400 ఎకరాలు ఐఎంజీ భారత్కు, 134.28 ఎకరాలు ఏపీఎన్జీవోలకు కేటాయించారు. ఐఎంజీ భారత్ పేరుతో బిల్లీరావు అనే వ్యక్తికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఈ భూ పందేరాన్ని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. వైఎస్సార్ ఏం చేశారు? వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2006లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తెచ్చి మరీ ఆ భూములను వెనక్కు తీసుకుంది. దీనిపై ఐఎంజీ సంస్థ హైకోర్టుకు వెళ్లింది. 24781/2006 నంబర్తో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. రోశయ్య, కిరణ్కుమార్రెడ్డిల పాలనలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, కేసీఆర్ హయాంలోని తెలంగాణ రాష్ట్రంలోనూ కలిపి 18 ఏళ్ల పాటు విచారణ నడిచింది. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాత ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుందంటూ 2024 మార్చి 7న ఈ కేసులో హైకోర్టు తీర్పునిచ్చిoది. దీన్ని ఐఎంజీ సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) 9266/2024 దాఖలు చేసింది. ఈ కేసు కూడా రెండు నెలల్లోనే ముగిసింది. ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానివేనంటూ 2024 మే 3వ తేదీన సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చిoది. దీంతో ఆ 400 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానికి దఖలు పడ్డాయి. ఈ భూములను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీజీఐఐసీ)కు బదలాయించేందుకు గత ఏడాది జూన్ 6వ తేదీన పరిశ్రమల శాఖ సిఫారసు చేసింది. ఇందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 2024 జూలై 1న పంచనామా నిర్వహించి 400 ఎకరాలను టీజీఐఐసీకి అప్పగించారు. ఇప్పుడు ఆ భూములను పరిశ్రమలకు కేటాయించేందుకు వీలుగా చెట్లు, రాళ్లు చదును చేసే పనిలో టీజీఐఐసీ పడింది. ఇదే వివాదానికి దారితీసింది. ప్రభుత్వం ఏమంటోంది?ఈ భూమి హెచ్సీయూది కాదని, మొత్తం 400 ఎకరాల్లో అంగుళం కూడా వర్సిటీ పరిధిలోనికి రాదనేది రాష్ట్ర ప్రభుత్వం వాదన. ‘సర్వే నంబర్ 25లో ఉన్న భూమి కంచ పోరంబోకు. చట్టప్రకారం అటవీ భూమి కూడా కాదు. ఈ 400 ఎకరాలను తీసుకున్నందుకు ప్రత్యామ్నాయంగా గోపన్పల్లి గ్రామంలోని సర్వే నంబర్ 36లో 191–36 ఎకరాలు, 37లో 205–20 ఎకరాలు కలిపి మొత్తం 397 ఎకరాలు వర్సిటీకి కేటాయించారు. ఈ 397 ఎకరాలను తీసుకోవడం ద్వారా ఆ 400 ఎకరాల భూమిపై వర్సిటీ హక్కులు వదులుకుంది. వర్సిటీ పరిధిలోని భూముల నుంచి ఈ 400 ఎకరాలను వేరు చేసేందుకు గాను 2017 జనవరి 2న రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. అయితే ఈ మెమోను సవాల్ చేస్తూ వర్సిటీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ (816/2021)ను హైకోర్టు కొట్టివేసింది. తర్వాత ఈ భూములను డీమార్క్ చేసేందుకు 2024లోనే యూనివర్సిటీ వర్గాల అంగీకారంతోనే సర్వే కూడా నిర్వహించి సరిహద్దులను గుర్తించాం. 2010– 2020ల్లో గూగుల్ మ్యాప్ ద్వారా 400 ఎకరాలు పరిశీలిస్తే అంతా బంజరు భూమి. రాళ్లతో కూడి ఉంది. ఎలాంటి పచ్చదనం లేదు. 2006–2024 వరకు నిర్లక్ష్యంగా ఆ భూములను వదిలేయడంతో చెట్లు, పొదలు మాత్రమే పెరిగాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు చుట్టుపక్కల ఉన్న ఈ భూముల్లో ఐటీతో పాటు ఇతర రంగాల అభివృద్ధికి మంచి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయి. రూ.50 వేల కోట్ల వరకు పెట్టుబడులతో పాటు 5 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. ఈ భూముల్లో అభివృద్ధి జరగడం ద్వారా హైదరాబాద్ లంగ్స్పేస్ దెబ్బతింటుందనేది వాస్తవం కాదు. ఈ భూమి చుట్టూ 5 కిలోమీటర్ల వ్యాసార్థంలో పెద్ద పెద్ద లంగ్స్పేస్లు అభివృద్ధి అయ్యాయి. 274 ఎకరాల విస్తీర్ణంలో కేవీబీఆర్ బొటానికల్ గార్డెన్ ఈ భూమికి 2 ఏరియల్ కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అలాగే ఈ భూమిలోని రాతి అమరికలను ప్రభుత్వం ధ్వంసం చేయదు. అక్కడ ఉన్న చెరువును కూడా కాపాడుతుంది..’ అని ప్రభుత్వం చెబుతోంది. వర్సిటీ వర్గాలు ఏమంటున్నాయి?యూనివర్సిటీ వర్గాలు మాత్రం భిన్నమైన వాదనలు విన్పిస్తున్నాయి. ఈ భూమి ఎవరిదన్న అంశం జోలికి వెళ్లకుండా.. ‘యూనివర్సిటీకి ఒకసారి కేటాయించిన భూములను రాష్ట్రపతి నియమించే ఆరుగురు సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం మేరకు మాత్రమే ఎవరికైనా కేటాయించాల్సి ఉంటుంది. ఆ భూమిలో ప్రభుత్వం చెపుతున్నట్టు 2024లో ఎలాంటి సర్వే జరగలేదు. యూనివర్సిటీ భూముల నుంచి ఆ 400 ఎకరాలను వేరు చేయలేదు. ఈ భూమి భౌగోళిక స్థితిపై ప్రాథమిక పరిశీలన మాత్రమే జరిగింది. 400 ఎకరాలను వేరు చేసేందుకు వర్సిటీ అంగీకరించలేదు. అసలు ఆ భూములను వేరుచేస్తామనే సమాచారమే మాకు ప్రభుత్వం నుంచి అందలేదు. యూనివర్సిటీ ఏర్పాటై 50 ఏళ్లు గడుస్తున్న స్వర్ణోత్సవ సమయాన మాకు ఇచ్చిన భూములను పూర్తిస్థాయిలో అధికారికంగా బదలాయించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. ఈ ప్రాంత పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని కోరుతున్నాం..’ అని చెబుతోంది. అయి తే యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఆ భూములు సెంట్రల్ వర్సిటీవేనని ఘంటాపథంగా చెబుతున్నాయి. గతంలో భూములను ఎవరికి ఇచ్చారు?ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి యూనివర్సిటీకి భూముల బదలాయింపు జరగకపోవడంతో రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడా యూనివర్సిటీ పేరు కనిపించడం లేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఈ భూములపై యూనివర్సిటీకి శాశ్వత, స్పష్టతతో కూడిన హక్కులు లేకపోవడంతోనే రాష్ట్ర ప్రభుత్వాలు భూములను పందేరం చేశాయి. జవహర్ నవోదయ, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఈబీ, రంగారెడ్డి హెడ్క్వార్టర్స్, మున్సిపల్, ఎమ్మార్వో ఆఫీసులు, టెలీకాం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ, హాకీ స్టేడియం, మిలటరీ గేమ్స్, షూటింగ్ రేంజ్, ఐఎంజీ భారత్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ... ఇలా ఇప్పటివరకు 1105.37 ఎకరాలను అనేక సంస్థలకు కట్టబెట్టాయి. ఇందులో ఎక్కువసార్లు చంద్రబాబు ప్రభుత్వంలోనే ఇతర సంస్థలకు భూములు అప్పజెప్పారని రికార్డులు చెబుతున్నాయి. ఈ భూములు వర్సిటీ పేరిట లేకపోవడంతో సదరు సంస్థలకు భూముల బదలాయింపు ప్రభుత్వాలకు సులువుగా మారింది. యూనివర్సిటీ నుంచి అనుమతి తీసుకున్నట్టు సంతకాలు పెట్టించుకోవడం, పంచుల చేత దస్తూరి చేయించుకోవడంతోనే వర్సిటీకి కేటాయించిన భూములను ఇతర సంస్థలకు పందేరం చేసేశారు. పేరుకే కేటాయింపా? ఇప్పటివరకు హక్కు లేదా? సెంట్రల్ వర్సిటీకి 2,324 ఎకరాలు కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారు కానీ ఆ భూములను యూనివర్సిటీ పేరిట ప్రభుత్వాలు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేయలేదు. కేవలం అప్పట్లో వచ్చిన ఉత్తర్వుల ఆధారంగా సర్వే చేసి చుట్టూ ప్రహరీగోడను నిర్మించారు. అయితే ఎన్ని ఎకరాల వ్యాసార్థంలో గోడ నిర్మించారో స్పష్టత లేకపోగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ గతంలో ఇచ్చిన ఓ నివేదికలో మాత్రం హెచ్సీయూ 1800 ఎకరాల్లో విస్తరించి ఉందని పేర్కొంది. తాజా వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భూముల అలినేషన్పై వివరణ ఇచ్చింది. ఇప్పటివరకు వర్సిటీకి భూముల బదలాయింపు జరగలేదని, వర్సిటీ భూములు అన్యాక్రాంతం కాకూడదనేదే ప్రభుత్వ ఉద్దేశమని, వర్సిటీ యంత్రాంగం ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే ఆ భూములను వర్సిటీ పేరిట బదలాయిస్తామని ఇటీవల విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. మరోవైపు భూముల బదలాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నట్టుగా ఈ వివాదం తలెత్తిన తర్వాతే యూనివర్సిటీ వర్గాలు కూడా బహిర్గతం చేశాయి. 400 ఎకరాలతో ‘రుణా’నుబంధం ప్రస్తుతం టీజీఐఐసీ అదీనంలో ఉన్నట్టుగా చెబుతున్న సుమారు 400 ఎకరాలకు పైగా భూమిని వేలం వేయడం ద్వారా రూ.25 వేల కోట్ల మేర రాబడి సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. వాస్తవానికి ఈ 400 ఎకరాల భూమిని గ్యారంటీగా చూపి 9.6 శాతం వడ్డీపై ఐసీఐసీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది రూ.10 వేల కోట్ల రుణం తీసుకుంది. అయితే రూ.20 వేల కోట్లకు పైగా విలువ కలిగిన ఈ భూములను సెక్యూరిటీగా పెట్టి కేవలం రూ.10 వేల కోట్ల రుణమే తీసుకోవడంపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. వీటి వేలం ద్వారా రూ.25 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశముండటంతో అభివృద్ధి పనులు ప్రారంభించింది. అయితే తమకు సెక్యూరిటీగా పెట్టిన భూముల వేలం ఆలోచనపై ఐసీఐసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ రూ.10 వేల కోట్ల రుణానికి గాను ప్రభుత్వం ప్రతి నెలా రూ.100 కోట్ల కిస్తీ (ఈఎంఐ)చెల్లిస్తున్న నేపథ్యంలో వచ్చే రెండేళ్ల పాటు చెల్లించాల్సిన కిస్తీల మొత్తం సుమారు రూ.2,500 కోట్లు ముందస్తుగా చెల్లిస్తే బాండ్లు తిరిగి ఇస్తామని చెప్పింది. ఇందుకు అంగీకరించిన ప్రభుత్వం భూమిని చదును చేసే ప్రక్రియను చేపట్టింది. ఆ 397 ఎకరాలకూ పొజిషన్ ఇవ్వలేదా? ఐఎంజీ భారత్కు కేటాయించిన 400 ఎకరాల స్థానంలో 397 ఎకరాలు గోపన్పల్లి రెవెన్యూ పరిధిలో వర్సిటీకికేటాయించారు. కానీ ఆ భూముల పొజిషన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వకపోవడం గమనార్హం. కాగా అసలుఆ ప్రత్యామ్నాయ భూములు ఎక్కడ ఉన్నాయో కూడా వర్సిటీ యంత్రాంగం గుర్తించలేని పరిస్థితుల్లో ఉండడం విశేషం. ఈ భూములు ఎందుకు ప్రత్యేకం? ఎందుకీ నిరసనలు?విద్యార్థులకు తాము చదువుకునే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలన్నా, వాటికి చెందినభూములన్నా సాధారణంగా మక్కువ ఉంటుంది. తాము చదువుకునే సంస్థ భూముల జోలికి వెళితే విద్యార్థి లోకం అస్సలు సహించదు. ఇక ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడే విశ్వవిద్యాలయాల్లో ప్రకృతికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలోని ల్యాండ్స్కేప్ ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు హెచ్సీయూ విషయంలోనూ అదే జరిగింది. జీవ వైవిధ్యం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం వర్సిటీ ఆధ్వర్యంలో ఉన్న భూమిలో 455 జాతుల వృక్ష, జంతుజాలాలున్నాయని అంటున్నారు. నెమళ్లు, జింకలు, పెద్ద పెద్ద చెరువులు, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాళ్ల అమరికలతో రమణీయంగా కనిపించే ఈ భూములు ఎక్కడ ప్రైవేటు వ్యక్తులు, సంస్థల పాలవుతాయోనన్న ఆందోళన విద్యార్థులతో పాటు సామాన్య ప్రజల్లో కూడా కలగడంతోనే ఈ భూముల విషయంలో ఇంతటి అలజడి కనిపిస్తోంది. మరి ఈ కంచ గచి్చ»ౌలి భూముల కథ ఏ కంచకు చేరుతుందో వేచి చూడాల్సిందే. -
అమిత ప్రతిభ
అడ్వర్టైజింగ్, సినిమా ఫీల్డ్ల గురించి అమ్మాయిలకు ఆసక్తి ఉంటే...‘అడ్వర్టైజింగ్ ఫీల్డ్కు వెళతావా! సినిమా ఫీల్డ్కు వెళతావా!!’ అని ఆశ్యర్యపోయే కాలం అది. అలాంటి కాలంలో అడ్వర్టైజింగ్ ఆ తరువాత ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ముంబైకి చెందిన అమిత మద్వాని.‘ఏం తెలుసు అని ఇక్కడికి వచ్చావు!’ అని ఒకరు వెటకారం చేశారు. ‘తెలుసుకుందామనే ఇక్కడికి వచ్చాను’ అని సమాధానం ఇచ్చింది అమిత.అవును... ఎన్నో దశాబ్దాలుగా ఆమె నేర్చుకుంటూనే ఉంది. ఆ నిరంతర ఉత్సాహమే అమితను అడ్వర్టైజింగ్, ఫిల్మ్ ఇండస్ట్రీలో విజయ కేతనం ఎగరేసేలా చేసింది.తన కమ్యూనిటీలోని సాంస్కృతిక వేడుకలు, మారాఠీ నాటకరంగ ప్రభావం కళల పట్ల అమితలో ఆసక్తిని పెంచింది. 1980 దశకంలో అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఉన్న కాలంలో ఆమె తన కెరీర్ను మొదలు పెట్టింది. ‘ఇది నువ్వు ఎంచుకోవాల్సిన రంగం కాదు’ అంటూ కొద్దిమంది ఆమెను వెనక్కిలాగే ప్రయత్నం చేశారు. అయితే ఆమె ఉత్సాహంలో ఎలాంటి మార్పూ లేదు.‘ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదుర్కొంటాను’ అంటూ ముందుకు కదిలింది. నేర్చుకోవాలనే కుతూహలం ఆమె వేగంగా నడిచేలా చేసింది. ప్రారంభ రోజులు... కష్టపడడంలో ఉన్నప్రాముఖ్యత గురించి చెప్పాయి. ‘నేను ఎంచుకున్న ప్రయాణం అడుగడుగునా సవాలుతో కూడుకున్నదనే విషయం తెలిసినా రాజీ పడలేదు. సినిమా సెట్లో బ్యాగులు ΄్యాకింగ్ చేయడం దగ్గర్నుంచి 35 ఎం.ఎం. సినిమా ఎడిటింగ్ మెళకువలను అర్థం చేసుకోవడం వరకు ఎన్నో నేర్చుకున్నాను’ అంటుంది అమిత.ఒగిల్వి, లియో బర్నెట్లాంటి అడ్వర్టైజింగ్ దిగ్గజ సంస్థలలో పనిచేయడం ఆమె అనుభవ జ్ఞానాన్ని విస్తృతం చేసింది. సినీ పరిశ్రమను అడ్వెర్టైజింగ్ ఏజెన్సీల కోణం నుంచి చూడడానికి ఆమెకు ఉపకరించాయి. క్యాంపెయిన్ బిల్డింగ్, క్లయింట్ సర్వీసింగ్, క్రియేటివ్, ప్రొడక్షన్ బృందాల మధ్య సమన్వయం.... ఇలా ఎన్నో విషయాలలో నైపుణ్యాన్ని సాధించింది.ఈ అనుభవ, నైపుణ్యజ్ఞానంతో ‘ఈక్వినాక్స్ ఫిలిమ్స్’లో కో–వోనర్, నిర్మాతగా ప్రయాణం ప్రారంభించింది. మంచి పేరు తెచ్చుకుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో వచ్చిన విరామంలో...‘ఏం చేస్తున్నాం? ఏం చేయకూడదు’ అనే కోణంలో ఆలోచించి సరికొత్త నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి... స్టోరీ టెల్లింగ్, డిజిటల్–ఫస్ట్ స్ట్రాటజీలను ఒకే వరుసలోకి తీసుకురావడం. భారీ బడ్జెట్తో కూడిన టెలివిజన్ వాణిజ్య ప్రకటనల నుంచి రీల్స్, డిజిటల్ ప్రకటనల ప్రస్తుత యుగం వరకు మన ప్రకటనల రంగంలో నాటకీయ మార్పులను అమిత ప్రత్యక్షంగా చూసింది.‘విజయపథంలో ప్రయాణించాలంటే కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. మరింత నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉండాలి. వర్తమానం గురించే కాదు భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని కూడా ఆలోచనలు చేయాలి. నేను ఎంచుకున్న పని నన్ను ఎక్కడికి తీసుకువెళుతుందో తెలియదు. అయితే ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండేదాన్ని. మారుతున్న కాలానికి అనుగుణంగా నాలోని నైపుణ్యాలకు పదును పెట్టాను’ అంటుంది అమిత మద్వాని.ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా...మనం ఎంచుకున్న మార్గం కఠినం, సవాళ్లతో కూడుకున్నది అయినప్పటికీ... నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనే తపన ఉంటే విజయం సాధించవచ్చు. నేను అడ్వర్టైజింగ్, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు ఏమీ తెలియదు. చాలా ఓపికగా నేర్చుకున్నాను. పది సెకన్ల డిజిటల్ స్పాట్ అయినా, మూడు గంటల ఫీచర్ ఫిల్మ్ అయినా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చూడడమే ప్రధానం. సోషల్ మీడియా ఫ్రెండ్లీ ఫార్మట్లను ఏకీకృతం చేయడం ద్వారా, ప్రేక్షకులకు ఎండ్–టు–ఎండ్ పరిష్కారాలను అందించడం ద్వారా ఈక్వినాక్స్ ఫిల్మ్స్ ముందంజలో ఉంది. టీమ్ అంకితభావం మా విజయానికి కారణం.– అమిత మద్వాని -
Menopause: పాజ్ కాదు..కొత్త ఫేజ్...!
మార్పును అంగీకరిస్తేనే మనోనిబ్బరం, శక్తి తెలుస్తాయి.. స్త్రీలకు మెనోపాజ్ అలాంటి మార్పే! దాన్ని అంగీకరిస్తూ జీవితాన్ని రీస్టార్ట్ చేసుకోవాలి! అలా అంగీకరించాలంటే ఆ దశ మీద ముందు అవగాహన రావాలి. అవగాహన రావాలంటే మౌనం వీడాలి! ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టడానికి ప్రముఖ గాయని సునీత ముందుకు వచ్చారు.పాజ్ కాదు.. కొత్త ఫేజ్!‘‘మెనోపాజ్ మనకు చాలా దూరం అనుకునేవాళ్లలో నేనూ ఒకదాన్ని. కానీ అది మన శరీరంలో ఓ వలయంలా తిరుగుతూ మెల్లగా మన జీవితాన్నే ఎఫెక్ట్ చేస్తుంది. ఒకరోజు హఠాత్తుగా మనలో చిత్రమైన ఒత్తిళ్లు మొదలవుతాయి. మూడ్ మారిపోవడం, అసహనం, చర్మం ముడతలు పడటం, నిద్రలేమి, ఒంటరితనపు వేదన.. ఇవన్నీ ఓ పెద్ద సవాలుగా మారుతాయి. అదే మెనోపాజ్. పైకి ఉచ్చరించలేని మౌనంగా భరించే మార్పు. అదొక భయంకరమైన ప్రయాణం. మన చేయిపట్టుకునే వాళ్లు లేక ఒంటరితనం ఆవహిస్తుంది. దిగులు తోడవుతుంది.అదృష్టమే.. కాని అరుదు!మెనోపాజ్ దశకు చేరేప్పటికి జీవితం నెమ్మదిస్తుంది. పిల్లలు సెటిలవుతారు. భర్తా బిజీ అయిపోతాడు. మన ఉద్యోగంలో పెద్దగా మార్పు కనపడదు. వీటన్నిటికి తోడు మెనోపాజ్ ఇబ్బందులు.. అంతా అయిపోయిందనే భావన. మనల్ని మనమే సహించలేని రోజులు, భర్తకు చెబితే అసహనంగా చూసే క్షణాలుంటాయి. పిల్లలతో షేర్ చేసుకోనివ్వని బిడియం. స్నేహితులతో మాట్లాడదామంటే వారు ఇంకా ఆ దశకు చేరనివారే! అమ్మ కూడా అర్థంచేసుకోలేదేమో అనిపిస్తుంటుంది.. ‘మా రోజుల్లో..’ అంటూ అసలు విషయాన్ని పట్టించుకోకుండా నాస్టాల్జియాలోకి వెళ్లే ఆమె మాటలను వింటుంటే! మెనోపాజ్ స్టేజీని అర్థం చేసుకుని అండగా నిలబడే వాళ్లుంటే అదృష్టమే! కాని అది అరుదు! అందుకే మనల్ని మనమే సముదాయించుకోవాలి.. మోటివేట్ చేసుకోవాలి. డాక్టర్ను సంప్రదించి అవసరమైన మెడికేషన్ తీసుకోవాలి. మెనోపాజ్ను కొత్త ఫేజ్గా భావించాలి. అప్పటిదాకా నిర్వర్తించిన బాధ్యతల నుంచి వెసులుబాటు దొరికిందని ఆనందపడాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఆ స్వేచ్ఛను ఆస్వాదించాలి. మన శక్తిసామర్థ్యాలకు ఓ అవకాశం అనుకోవాలి. ఫిజికల్ ఫిట్నెస్, మెడిటేషన్, అభిరుచులు, ఆసక్తులతో జీవితాన్ని రీస్టార్ట్ చేయాలి. కొత్త విషయాలను నేర్చుకుంటూ జీవితం పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలి. వదిలేయకండి.. ఎంత సెల్ఫ్మోటివేషన్తో ఉన్నా కుటుంబం, ఫ్రెండ్స్ నుంచి ఆమెకు సపోర్ట్ అవసరమవుతుంది. ముఖ్యంగా ఇంట్లో వాళ్లు తనతో మాట్లాడాలి.. తను అనుభవిస్తున్న స్థితి గురించి అడగాలని కోరుకుంటుంది. తనను వినాలని ఆశపడుతుంది. అందుకే ఆమెతో మాట్లాడాలి.. ఆమెను వినాలి.. ఆత్మీయంగా హత్తుకోవాలి. ఇవన్నీ ఆమెకు దివ్యౌషధాలు. కుటుంబ సభ్యులు ఆమెను వినడం వల్ల వాళ్లకు మెనోపాజ్ దశ పట్ల అవగాహన పెరిగి.. వర్క్ప్లేస్లోని మహిళలను అర్థంచేసుకుని సహానుభూతి చూపించగలుగుతారు. దీనివల్ల ఆడవాళ్లలో బిడియం పోయి.. ధైర్యం వస్తుంది. తమ ఇబ్బందుల గురించి చెప్పగలుగుతారు. ఆ స్టేజ్ ఎలా ఉంటుందో అమ్మాయిలూ గ్రహించగలుగుతారు. అప్పుడు ఆటోమేటిగ్గా మెనోపాజ్ పట్ల ఉన్న సైలెన్స్ బ్రేక్ అయ్యి అవేర్నెస్ పెరుగుతుంది. అందుకే ఆ దశను అనుభవిస్తున్న ఆడవాళ్లను ఒంటరితనానికి వదిలేయకండి. అప్పటిదాకా ఇంటిని.. ఇంట్లో మిమ్మల్ని కంటికి రెప్పలా కాచుకున్న ఆమెకు తోడుగా నిలబడండి. ఈ ప్రయాణం మనది అనే భరోసానివ్వండి!’’ అంటూ ముగించారు సునీత. మెనోపాజ్ అనేది స్త్రీ జీవితంలో సహజమైన దశ. ఆ సమయంలో ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యల గురించి తరచూ మాట్లాడుతూ.. చర్చిస్తూ ఉంటేనే దానిపట్ల అవగాహన పెరుగుతుంది. మెనోపాజ్ను అనుభవిస్తున్న మహిళే కాదు కుటుంబ సభ్యులూ దాన్ని అంగీకరించాలి. ఆమె దైనందిన జీవితం సాఫీగా సాగడానికి తగిన సపోర్ట్ అందించాలి. మహిళలు కూడా తమ పట్ల వ్యక్తిగత శ్రద్ధను మరచిపోవద్దు. – జూహీ చావ్లా, నటి, పర్యావరణ ప్రేమికురాలు.మెనోపాజ్ అనేది సహజమైన స్థితి. దాన్ని అంగీకరించి.. కొత్త అభిరుచులు, కొత్త అవకాశాలు, కొత్త పనులతో ఆ దశలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవాలి. ఈ ట్రాన్సిషన్తో సరికొత్త జీవితాన్ని ఆరంభించాలి తప్ప అంతా అయిపోయిందనే నిరాశకు లోనుకాకూడదు. – నటి నీనా గుప్తా ఆటోబయోగ్రఫీ ‘సచ్ కహూ తో’లోంచి!– శిరీష చల్లపల్లి -
మరీ ఇంత మతిమరుపా!
ఎయిర్పోర్టుకు వెళ్లినప్పుడు పాస్పోర్ట్. రోజంతా కష్టపడి షాపింగ్ చేశాక ఇంటికొచ్చే దారిలో పెళ్లి చీర. కష్టించి సంపాదించిన డ బ్బుతో కొన్న బంగారు బిస్కెట్. ఇలాంటివన్నీ క్యాబ్లో మర్చిపోతే! అంత విలు వైన వస్తువులు ఎవరైనా మర్చిపోతా రా అని కొట్టిపారేయకండి. భారతీయులు ఉబర్ క్యాబ్ల్లో మర్చిపోయిన వస్తువుల్లో ఇవి కొన్ని మాత్రమే. ఉబెర్ 9వ ‘లాస్ట్ అండ్ ఫౌండ్ ఇండెక్స్’విడుదల చేసిన గణాంకాల్లో ఇ వన్నీ ఉన్నాయి. భార త్లో అత్యంత మతిమరుపు నగరంగా ముంబై నిలిచిందని నివేదిక తేల్చింది. బ్యాగులు, పర్సులు, తాళాలు, కళ్లద్దాలు, ఇయర్ ఫోన్స్ వంటివాటిని మర్చిపోవడం పరిపాటే. కానీ కొందరు మాత్రం మతిమరుపును మరో లెవల్కు తీసుకెళ్లారు. వీల్ చైర్, 25 కిలోల నెయ్యి డబ్బా, యజ్ఞకుండం, పెళ్లి చీర, బంగారు బిస్కెట్ల వంటివాటిని కూడా క్యాబ్లో మర్చిపోయారు. వినియోగదారులు కోల్పోయిన వస్తువులను గుర్తించే ఇన్–యాప్ ద్వారా ఆయా వస్తువులను ఉబర్ వారికి తిరిగి చేర్చిందన్నది వేరే విషయం. 2024లో అత్యంత ’మతిమరుపు’ నగరాల జాబితాలో ముంబై తర్వాత ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. అత్యధిక ‘మతిమరుపు’నగరాల్లో పుణే, బెంగళూరు, కోల్కతా కూడా ఉన్నాయి. హైదరాబాద్ మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ప్రయాణికులు వస్తువులను మర్చిపోయింది చాలా తక్కువట. 2024లో అత్యధిక మతిమరుపు రోజులు→ ఆగస్టు 3 (శనివారం, శివరాత్రి), సెపె్టంబర్ 28 (శనివారం), మే 10 (శుక్రవారం, అక్షయ తృతీయ) మరిచిన టాప్ 10 వస్తువులు → బ్యాక్ ప్యాక్/బ్యాగ్, ఇయర్ ఫోన్స్/స్పీకర్, ఫోన్, వాలెట్/పర్స్, కళ్లద్దాలు/సన్ గ్లాసెస్, తాళంచెవులు, బట్టలు, లాప్టాప్, వాటర్ బాటిల్, పాస్పోర్ట్ మర్చిపోయిన అరుదైన వస్తువులు→ విగ్, టెలిస్కోప్, గ్యాస్ బర్నర్ స్టవ్, 25 కిలోల నెయ్యి, వీల్చైర్, పిల్లనగ్రోవి, పెళ్లి చీర, గోల్డ్ బిస్కెట్, కుక్కలు మొరగకుండా నియంత్రించే పరికరం, యజ్ఞకుండం శనివారం జాగ్రత్త శనివారం ప్రయాణాల్లో ఇకపై మరింత అప్రమత్తంగా ఉండండి. వారంలో అత్యంత మతిమరుపు రోజు ఇదేనని ఉబర్ నివేదిక తేల్చింది. అందులోనూ శనివారం సాయంత్రాలు మతిమరుపు పీక్స్లో ఉంటోందట. ప్రయాణికులు అత్యధికంగా వస్తువులను క్యాబ్ల్లో మర్చిపోయింది ఆ రోజే. ఈ విషయంలో పండగ రోజులూ తక్కువేమీ కాదు. పర్వదినాల్లో కూడా ప్రయాణికులు ఉబర్లో అత్యధికంగా వస్తువులు మరిచిపోయారు. ‘‘మర్చిపోయిన వస్తువులను సులభంగా తిరిగి పొందేందుకు ఉబర్ క్యాబ్ల్లో ఇన్–యాప్ ఆప్షన్ ఇచ్చాం. అయినా ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలి’’అని ఉబర్ ఇండియా దక్షిణాసియా కన్జ్యూమర్ అండ్ గ్రోత్ డైరెక్టర్ శివ శైలేంద్రన్ సూచించారు. వస్తవులన్నింటినీ ఒకే బ్యాగ్లో వేసుకోవడం, క్యాబ్ దిగేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం మేలని చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జీవితాలే బెట్.. మాఫియా క్రికెట్
ఫోర్ కొడితే చప్పట్లు.. సిక్స్ కొడితే కేకలు.. వికెట్ పడితే అరుపులు.. గెలుపు ఓటములపై ఉత్కంఠ..! ఇవీ సాధారణంగా క్రికెట్ మ్యాచ్లో ఆస్వాదించే అంశాలు.. అయితే, ఇదంతా తెర ముందు దృశ్యం..! మరి తెరవెనుకో..? టాస్కు ముందు.. పరుగు తీస్తే.. ఫోర్ కొడితే.. సిక్స్ బాదితే.. మ్యాచ్లో ఉత్కంఠ పెరుగుతున్న కొద్దీ బెట్టింగ్..! బెట్టింగ్..! అంతగా ఈ మాఫియా వికటాట్టహాసం చేస్తోంది. చివరికి ఏ టీమ్ మ్యాచ్ గెలిచినా ఓడేది మాత్రం కచి్చతంగా పందెం కాసినవారే. అది ఎంతగా అంటే..? బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి.. అప్పులు అమాంతంగా పెరిగి ఆస్తులు పోతున్నాయి. కొన్నిసార్లు ఒక్క మ్యాచ్ తోనే జీవితం తలకిందులైపోతోంది. సాక్షి, అమరావతి: వేసవి వచ్చిందంటే ఐపీఎల్ (IPL) సందడితో పాటు.. దేశంలో క్రికెట్ బెట్టింగ్ మాఫియా ఇన్నింగ్స్ కూడా మొదలవుతోంది. ఆట పట్ల సగటు భారతీయుడి వ్యామోహమే పెట్టుబడిగా ఊబిలోకి లాగుతోంది. చివరికి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి దిగజారుస్తోంది. డిజిటల్ ఇండియా ఫౌండేషన్ తాజా నివేదిక ప్రకారం ఒక్క ఐపీఎల్ సీజన్లోనే దేశంలో వంద బిలియన్ డాలర్ల (రూ.8,500 కోట్లు పైగా) బెట్టింగ్ దందా సాగుతోంది. గత 17 సీజన్లను విశ్లేషించి ఈ సంస్థ నివేదిక రూపొందించింది. ఏటా బెట్టింగ్ దందా 30 శాతం చొప్పున పెరుగుతోందని తెలిపింది. ప్రస్తుత 18వ సీజన్లో బెట్టింగ్ అత్యంత గరిష్ఠానికి చేరుతుందని అంచనా వేసింది. రూ.10 వేల కోట్ల మార్కు దాటడం ఖాయమని స్పష్టం చేసింది. ఏటా ఐపీఎల్ సీజన్లో 34 కోట్లమంది బెట్టింగ్లో పాల్గొంటున్నారని ఇండియా ఛేంజ్ ఫోరం అనే సంస్థ పేర్కొంది. ప్రధాన బెట్టింగ్ యాప్ల డేటాను విశ్లేషించి ఈ అంచనాకు వచ్చింది.ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఏజెంట్లుదేశంలో వ్యవస్థీకృతమైన మాఫియా పకడ్బందీగా బెట్టింగ్ దందా సాగిస్తోంది. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఏజెంట్ల వ్యవస్థను నెలకొల్పింది. ప్రత్యేకంగా రూపొందించిన యాప్లు, ఆన్లైన్ ద్వారా పల్లెలకు కూడా ఈ రాకెట్ విస్తరించింది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ లేని ఉత్సుకతను పెంచేలా దందాను నడుపుతోంది. టాస్తో మొదలుపెట్టి.. బంతి బంతికి బెట్టింగ్ నిర్వహిస్తోంది. ఒక్కో పందెం రూ.500 నుంచి రూ.10 వేల వరకు ఉంటోంది. కొన్నేళ్ల క్రితం క్లబ్బులు, పబ్బులు, హోటళ్లు, లాడ్జిలలో ముందుగా డబ్బులు పెట్టి బెట్టింగ్ కాసేవారు. డిజిటల్ చెల్లింపుల యుగంలో బెట్టింగ్ దందా మరింత సులభతరమైంది.అత్యాధునిక టెక్నాలజీ..బెట్టింగ్ మాఫియా 5జీ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ (Cloud Computing) ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వాడుతూ యాప్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నాయి. స్పోర్ట్స్ రాడార్, బెట్ 365 వంటివి మ్యాచ్ల రియల్ టైమ్ డేటా ఫీడ్ను సెకనులో వెయ్యో వంతు (మిల్లీ సెకన్) సమయంలో అప్డేట్ చేస్తున్నాయి. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ టూల్స్తో బెట్టింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. తద్వారా ప్రతి బాల్కు దేశవ్యాప్తంగా అత్యంత వేగంతో భారీగా బెట్టింగులు కాసేలా చేస్తున్నారు.పుట్టుగొడుగుల్లా యాప్లు.. సోషల్ మీడియాతో వలదందా టర్నోవర్కు తగ్గట్టే దేశంలో బెట్టింగ్ యాప్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సోషల్ మీడియా (Social Media) విస్తృతి పెరిగాక బెట్టింగ్ మాఫియా దందాకు అడ్డే లేదు. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్లలో బెట్టింగ్ యాప్ల ప్రకటనలు ముంచెత్తుతున్నాయి. మెగాపరి, మోస్ట్బెల్, పరిసేస, పర్ మ్యాచ్, బీసీ డాట్గేమ్, 22 బెట్స్, 10సీ సీఆర్ఐసీ, మెల్బెట్, మేట్బెట్, 1 ఎక్స్బెట్, రాజా బెట్స్, స్టేక్ డాట్కామ్, డఫ్పా బెట్ ఇలా ఎన్నో యాప్ల ప్రకటనలు వరదలా వచ్చి పడుతున్నాయి. కొన్నయితే ఇన్ఫ్లుయెన్సర్లతో వల విసరుతున్నాయి. రూ.100 పెడితే రూ.వేయి ఇస్తాం అంటూ.. కొత్త కస్టమర్లకు రూ.100 నుంచి రూ.500 వరకు డిస్కౌంట్లు ఇస్తూ ఊబిలోకి గుంజుతున్నాయి. ఐపీఎల్ సీజన్లో దాదాపు 75 యాప్లు బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నట్టు డిజిటల్ ఇండియా ఫౌండేషన్ వెల్లడించింది.కమీషనే రూ.వెయ్యి కోట్లుభారీగా డబ్బు రొటేషన్ అవుతుంది తప్ప.. ఐపీఎల్ బెట్టింగ్ల ద్వారా సామాన్యులు డబ్బు సంపాదించిన దాఖలాలు లేవన్నది నిజం. నిర్వాహకులు మాత్రం పందెం మొత్తంపై కనీసం 10 శాతం నుంచి 25 శాతం వరకు కమీషన్ దండుకుంంటున్నారు. ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ దందా టర్నోవర్ రూ.10 వేల కోట్లు అనుకుంటే యాప్ల నిర్వాహకులు కమీషన్ల రూపంలోనే రూ.వెయ్యి కోట్లు వెనకేస్తున్నారు.అంతా మనోళ్లే.. చూసీ చూడనట్లు పొండిప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ మాఫియా చెలరేగుతోంది. ఎంపిక చేసిన హోటళ్లు, లాడ్జీలు, అపార్టుమెంట్ల కేంద్రంగా చేసుకుని దందా సాగిస్తోంది. టీడీపీ కూటమిలోని కీలక నేతల ప్రధాన అనుచరులే జిల్లాల్లో బెట్టింగ్ దందాకు సూత్రధారులు. ⇒ గుంటూరు, ఎన్టీఆర్, తిరుపతి, వైఎస్సార్ కడప, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి ఎమ్మెల్యేల కార్యాలయాలు బెట్టింగ్ మాఫియాకు అనుకూలంగా పోలీసులపై ఒత్తిడి తెస్తుండడం గమనార్హం.⇒ విజయవాడ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ టీడీపీ నేత పోలీసులకు ఫోన్ చేసి ‘అదంతా మనవాళ్లదే’ అని చెప్పడంతో వారు ఏమీ చేయలేకపోతున్నారు. ⇒ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో కూటమి ప్రజాప్రతినిధి సోదరుడే బెట్టింగ్ మాఫియాకు కింగ్ పిన్.⇒ ఏలూరు జిల్లాలో కోడి పందేల నిర్వాహకుడిగా గుర్తింపు పొందిన టీడీపీకి చెందిన సీనియర్ ప్రజాప్రతినిధి వర్గం ప్రస్తుతం బెట్టింగ్ దందాను సాగిస్తోంది.⇒ వైఎస్సార్ కడప జిల్లాలో అత్యంత వివాదాస్పదుడైన కూటమి ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు బెంగళూరులోని బెట్టింగ్ రాకెట్తో మిలాఖత్ అయి.. జిల్లాలో దందా నడుపుతున్నారు. ఈ సీజన్లో రాష్ట్రంలో రూ.500 కోట్ల దందా వీరి లక్ష్యం కావడం గమనార్హం.పందెంరాయుళ్లు కాదు.. బాధితులేక్రికెట్ బెట్టింగ్లో ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వ్యాపారుల నుంచి మెకానిక్లు, హోటళ్లలో పనిచేసే యువకులు, చిన్నచిన్న పనులు చేసుకునేవారు చివరకు కనీస సంపాదన లేని విద్యార్థులు కూడా బాధితులే. చేతిలోని డబ్బే కాదు.. అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకుని మరీ బజారున పడుతున్నారు. బెట్టింగ్ కోసం కాల్ మనీ రాకెట్ నుంచి అధిక వడ్డీలకు అప్పులు చేసి, తీర్చలేక తీవ్ర అవమానం, ఇబ్బందులు పడుతున్నవారూ భారీగా ఉన్నారు.n మార్చి నెలలో శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో అన్నదమ్ములు సూర్యనారాయణ, ఉమామహేశ్ రూ.45 లక్షలు కోల్పోయారు. అప్పులు తీర్చలేమని గ్రహించి వేర్వేరుగా ఆత్మహత్యకు యత్నించారు. సూర్యనారాయణ చనిపోగా అపస్మాకర స్థితిలో ఉన్న ఉమామహేశ్ను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.n హైదరాబాద్లో బెట్టింగ్లో డబ్బు పోగొట్టుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.n బిహార్లో వ్యాపారి బెట్టింగ్లో రూ.2 కోట్ల విలువైన విల్లాను కోల్పోయాడు.n కర్ణాటకలో ఓ వ్యక్తి రూ.కోటి నష్టపోగా.. అతడి భార్య తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకుంది.n తమిళనాడు కోయంబత్తూరులో రూ.90 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి జీవితాన్నే బలి తీసుకున్నాడు.బలహీన చట్టాలతో చెలరేగుతున్న మాఫియాదేశంలో జూదం, ఆన్లైన్ బెట్టింగ్లో అధికారికంగా, అనధికారికంగా బరి తెగిస్తున్న మాఫియాను కట్టడి చేసేందుకు సరైన చట్టాలు లేవని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ను నిషేధించింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల నుంచి నిర్వహణ సాగిస్తున్న మాఫియాకు అడ్డుకట్ట వేయాలంటే కేంద్రమే ఏకీకృత చట్టం చేయాల్సిన అవసరం ఉంది.జూదానికి అడ్డుకట్ట వేసేందుకు దేశంలో ఉన్న చట్టాలు.. వాటి లోపాలు..జూద కార్యకలాపాల నిరోధక చట్టం–1867: బ్రిటీష్ కాలంలో చేసిన ఈ చట్టం జూద గృహాలను నిషేధిస్తోంది. కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకంగా చట్టాలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. దాంతో దేశవ్యాప్తంగా అమలు చేయడం సాధ్యం కావడం లేదు. ఆన్లైన్ జూదాలు, ఇతర అంశాలు కూడా ఈ చట్టం పరిధిలోకి రావు.రాష్ట్రాల ప్రత్యేక చట్టాలు: సిక్కిం, గోవా, నాగాలాండ్ వంటి రాష్ట్రాలు కొన్ని జూదానికి అనుమతిస్తూ ప్రత్యేక చట్టాలు చేశాయి. ఈ రాష్ట్రాల్లో లైసెన్సు తీసుకుని దేశవ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ దందా నడిపిస్తున్నారు. దీంతో కట్టడి చేసేందుకు సాంకేతికంగా అడ్డంకులు ఏర్పడుతున్నాయి.ఐటీ చట్టం 2000: సైబర్ నేరాలను నిరోధించేందుకు ఉద్దేశించినది. దీంతో ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ను నిరోధించడం సాధ్యమా కాదా అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ సైబర్ నేరాల పరిధిలోకి వస్తాయా రావా అని స్పష్టత లేకపోవడమే అందుకు కారణం.బెట్టింగా..!? స్కిల్ గేమా...!?ఆన్లైన్ బెట్టింగ్ అన్నది జూదమా కాదా అన్న అంశంపై దేశంలో ఎన్నో ఏళ్లుగా చర్చ సాగుతోంది. ‘గేమ్ ఆఫ్ స్కిల్’ అన్నది ఒక క్రీడగా భావించాలి తప్ప జూదంగా కాదని ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు వాదిస్తున్నారు. ఆ మేరకు ‘గేమ్ ఆఫ్ స్కిల్’గా పేకాట క్లబ్బులకు అనుమతిస్తూ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను ఉటంకిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ స్కిల్ గేమ్ అని వాదిస్తూ తమపై నిషేధం చెల్లదని న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. దాంతో ఆన్లైన్ బెట్టింగ్ను నిరోధించే అంశం న్యాయ వివాదాల్లో చిక్కుకుంది. కఠిన చట్టమే పరిష్కార మార్గం...ఆన్లైన్ బెట్టింగ్ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణం సమగ్ర చట్టాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ‘బెట్టింగ్– గ్యాంబ్లింగ్ రెగ్యులేషన్ బిల్లు’ పెండింగులో ఉంది. దీనిపై మరింత న్యాయ సలహాలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ నిర్వచనం, బిల్లులోని అంశాల పరిధి, న్యాయ సమీక్షకు నిలవడంపై మరింత లోతుగా సమాలోచనలు జరపాలని చూస్తోంది. పకడ్బందీ చట్టంతోనే బెట్టింగ్ మాఫియాకు అడ్డుకట్ట సాధ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
రసాయనాలు కుమ్మరిస్తున్నారు!
కర్నూలు(అగ్రికల్చర్): రసాయన ఎరువుల ఎక్కువ వినియోగంతో ఎన్నో అనర్థాలు ఉన్నాయనే విషయాన్ని చాలా మంది రైతులు గుర్తించలేకపోతున్నారు. వివిధ పంటల్లో ఉత్పాదకతను పెంచుకునేందుకు విచ్చలవిడిగా వాడుతున్నారు. దీంతో భూమి స్వభావం దెబ్బతింటోంది. చాలా చోట్ల పొలాలు చౌడుబారుతున్నాయి. పర్యావరణం కూడా కలుషితం అవుతోంది. పంట ఉత్పత్తుల్లో కెమికల్స్ అవశేషాలు ఉండటంతో మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించని పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లాలో 2023–24లో 2,04,318 టన్నుల రసాయన ఎరువులు వాడగా.. 2024–25లో 2,34,144 టన్నులు వినియోగించారు. మొత్తం 29,826 టన్నుల వినియోగం పెరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. రైతులకు అవగాహన కల్పించడం.. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహాలు పెంచడం... తదితర విషయాలపై దృష్టిసారించడం లేదు. ఎకరాకు 185 కిలోల రసాయన ఎరువులురాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 96 వేల ఎకరాల్లో మిర్చి సాగైంది. పత్తి కూడా జిల్లాలో అత్యధికంగా సాగు అవుతోంది. 2024 ఖరీఫ్లో 10,55,517 ఎకరాలు, రబీలో 2,14,692 ఎకరాలు ప్రకారం మొత్తంగా 12,70,209 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. నీటిపారుదల కింద సాగు చేసే పంటలకు విపరీతంగా రసాయన ఎరువులు వినియోగిస్తున్నారు. సగటున ఎకరాకు 160 కిలోల వరకు రసాయన ఎరువులు వాడవచ్చు. అయితే 2024–25లో ఎకరాకు సగటున 185 కిలోల రసాయన ఎరువులు వినియోగించారు. 2024–25లో భూసార పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహించి.. వాటి ఫలితాలను రైతులకు అందచేసినప్పటికీ రసాయన ఎరువుల వినియోగం పెరిగిపోయింది. ఖర్చు తడిసి మోపెడురసాయన ఎరువుల వినియోగం భారీగా పెరుగుతుండటంతో వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. వివిధ కంపెనీలు రసాయన ఎరువుల ధరలు ఇష్టానుసారంగా పెంచుతున్నాయి. 10–26–26, 12–32–16 రసాయన ఎరువుల 50కిలోల బస్తా ధర రూ.1,720 ఉందంటే ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో తెలుస్తోంది. దీంతో రైతులకు ఖర్చు తడిసిమోపెడు అవుతోంది. మిర్చి, వరి సాగులో అడ్డుగోలుగా రసాయన ఎరువులను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పండించిన పంటల్లో కూడా కెమికల్స్ అవశేషాలు ఉంటున్నట్లుగా శాస్త్రీయంగా నిర్ధారణ అవుతోంది.‘ప్రకృతి’సాయం కరువే!రసాయన ఎరువుల వినియోగం లేకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తే ప్రజారోగ్యానికి పెద్దపీట వేసినట్లే. అయితే జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. కాగితాల్లో వేలాది ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం కనిపిస్తోంది. 2024–25లో 50 వేల ఎకరాలకుపైగా ప్రకృతి వ్యవసాయం చేసినట్లు లెక్కలు ఉన్నప్పటికీ వాస్తవం నామమాత్రమే. స్వచ్ఛందంగా ప్రకృతి వ్యవసాయం చేసేవారు జిల్లాలో 70 నుంచి 80 మంది వరకు ఉన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహించకపోవడం, విరివిరిగా సాయం అందించడం.. తదితర కారణాలతో చాలా మంది రైతులు ముందుకు రావడం లేదు. గ్యాప్..తూచ్రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ (గ్యాప్) కింద ప్రతి మండలంలో పొంలబడి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చేసిన సిఫార్సుల మేరకే కెమికల్స్ వాడాలి. ప్రతి మండలంలోని 50 నుంచి 100 ఎకరాల వరకు ‘గ్యాప్’కింద ఆహార పంటలు సాగు చేశారు. ప్రతి వారం పొలంబడి కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చినప్పటికీ రసాయన ఎరువులు వాడకం తగ్గలేదు. పలు పంటల శ్యాంపుల్స్లో కెమికల్స్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.చర్యలు తీసుకుంటున్నాం2024–25 సంవత్సరంలో సాగు విస్తీర్ణం పెరిగినందున రసాయన ఎరువుల వినియోగం పెరిగింది. 2023–24 సంవత్సరంతో పోలిస్తే దాదాపు 30 వేల టన్నులు అదనంగా వినియోగించారు. కెమికల్స్ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ కింద రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు పొలంబడి నిర్వహిస్తున్నాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయఅధికారి, కర్నూలువినియోగంలో దేశంలో రెండో స్థానంరసాయన ఎరువుల వినియోగంలో నంద్యాల జిల్లా రికార్డుల్లోకి ఎక్కింది. 2024–25 వ్యవసాయ సంవత్సరంలో రాష్ట్రంలోనే ఎరువుల వినియోగంలో మొదటి స్థానంలో నిలిచింది. మరో విశేషమేమిటంటే దేశంలోనే ఎరువుల వినియోగంలో నంద్యాల జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ మంత్రి జేపీ నడ్డా పార్లమెంటు వేదికగా ఇటీవల ప్రకటించారు. ఈ జిల్లాలో ప్రధానంగా వరి సాగు చేస్తారు. కాగా యూరియా 3 బస్తాల వేయాల్సి ఉండగా... 10 బస్తాల వరకు వినియోగించారు. రికార్డు స్థాయిలో నంద్యాల జిల్లాలో 3.75 లక్షల టన్నులు వినియోగించిట్లు సమాచారం. ఎరువులు ఈ స్థాయిలో వినియోగించారంటే ఆహార పంటల్లో కెమికల్స్ అవశేషాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇవీ నష్టాలు..» మిర్చి, పత్తి, వరి, మొక్కజొన్న, వివిధ కూరగాయల పంటలకు రసాయన ఎరువుల వాడకం ఎక్కువగా ఉంటోంది. దీంతో ఈ పంట ఉత్పత్తుల్లో కెమికల్స్ అవశేషాలు ఉంటున్నట్లు తెలుస్తోంది. » కెమికల్స్తో పండించిన ఆహార ఉత్పత్తులు తీసుకుంటే ప్రజలు పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. » గతంలో పశువుల ఎరువులు వాడేవారు. అలాగే పొలాల్లో నాలుగైదు రోజుల పాటు గొర్రెల మందను ఉంచేవారు. కెమికల్స్ లేని ఆహారం తీసుకోవడంతో అప్పటి వారు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంటున్నారు.» ప్రస్తుతం పలు రసాయన ఎరువులతో, మందులతో పండించిన ఆహారం తీసుకుంటుండటంతో జబ్బులు పెరిగిపోతున్నాయి. -
రక్షణ కవచం.. విధ్వంసం
ప్రకృతి ప్రసాదించిన మడ అడవులు తుపానులు, సునామీల వంటి విలయాల్ని అడ్డుకుంటాయి. సముద్రంలో విరుచుకుపడే కెరటాలను చిన్నపాటి అలలుగా మార్చి విపత్తులను ఆపేస్తాయి. తీరానికి సహజ రక్షణ కవచంగా నిలుస్తూ.. పర్యావరణాన్నిపరిరక్షిస్తాయి. అంతటి విశిష్టత గల మడ అడవులు మచిలీపట్నం తీరంలో భారీగా నాశనమవుతున్నా పట్టించుకునే నాథుడు కనిపించడం లేదు. సాక్షి, అమరావతి: కృష్ణా అభయారణ్యం పరిధిలో మడ అడవులు అత్యంత వేగంగా నాశనమవుతున్నాయి. సముద్ర తీరానికి సహజ రక్షణ కవచాలుగా నిలిచే మడ అడవులు కళ్లముందే ధ్వంసమవుతున్నా అటవీ శాఖ పట్టించుకోవడం లేదు. మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో కేవలం రెండు, మూడు నెలల వ్యవధిలోనే 3 వేల ఎకరాలకుపైగా మడ అడవి నాశనమైనట్టు పర్యావరణవేత్తలు గుర్తించారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని నెలల్లోనే అభయారణ్యంలోని అడవి మొత్తం కనుమరుగవుతోందని పర్యావరణవేత్తలు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మచిలీపట్నం తీరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న భారత్ సాల్ట్స్ రిఫైనరీస్ వ్యర్థ జలాల వల్ల మడ అడవి నాశనమవుతున్నట్టు తేలింది. ఆ పరిశ్రమ వ్యర్థ జలాలను భారీఎత్తున మడ అడవిలోకి వదిలేస్తుండటంతో మడ చెట్లు చనిపోతున్నాయి. గతంలో ఆరోపణలు వచ్చినప్పుడు పరిశ్రమ వ్యర్థ జలాలు మడ అడవిలోకి రాకుండా చర్యలు తీసుకున్నారు. దానివల్ల కొంతమేర రక్షణ ఏర్పడింది. కానీ.. కొన్ని నెలల నుంచి ఆ చర్యలు లేకపోవడంతో పరిశ్రమ నుంచి వ్యర్థ జలాలు నేరుగా మడ అడవిలోకి వదిలేస్తున్నారు. ఫలితంగా వేలాది ఎకరాల అడవి చూస్తుండగానే నాశనమైంది. ఇది తెలిసినా అటవీ శాఖాధికారులు పట్టించుకోకపోవడంతో రానున్న రోజుల్లో మడ అడవి మొత్తం కనుమరుగయ్యే పరిస్థితి ఉందని చెబుతున్నారు. నిబంధనల ఉల్లంఘన అభయారణ్యంలో పరిశ్రమలకు అనుమతి ఇవ్వకూడదని చట్టం చెబుతున్నా.. 20 ఏళ్లుగా భారత్ సాల్ట్స్ పరిశ్రమ అక్కడ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పోలాటితిప్ప, పల్లెతుమ్మలపాలెం తీర ప్రాంతంలో చెన్నైకి చెందిన భారత్ సాల్ట్స్ రిఫైనరీస్ లిమిటెడ్కు 2001లో 6,500 ఎకరాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం లీజుకు ఇచ్చిoది. ఎకరం రూ.50 చొప్పున కారు చౌకగా కట్టబెట్టింది. నిజానికి అటవీ ప్రాంతంలో పరిశ్రమల స్థాపన, నిర్మాణాలను అనుమతించకూడదు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్) నిబంధనల ప్రకారం.. తీరానికి 3 కిలోమీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదు. ఒకవేళ భూమిని ఇవ్వాల్సి వస్తే అక్కడ ఎంత భూమి పరిశ్రమకు ఇచ్చారో దానికి రెట్టింపు భూమి మరోచోట అడవి ఏర్పాటుకు ఇవ్వాలి. కానీ.. భారత్ సాల్ట్స్ అధికారులను ప్రలోభపెట్టి ఎక్కడా భూమి ఇవ్వకుండానే వేల ఎకరాలను చేజిక్కించుకుని ఉప్పు పరిశ్రమ నిర్వహిస్తోంది. నిజానికి 2022లోనే లీజు గడువు ముగిసిపోయింది. లీజు గడువు ముగిసినా పరిశ్రమ యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంతటితో ఆగకుండా వ్యర్థ జలాలను వదులుతుండటంతో మడ అడవి నాశనమవుతోంది. మడ అడవులు తగ్గిపోవడానికి కారణాలు » అక్రమంగా మడ అడవులను నరికేయడం »తీరంలో చేపల చెరువుల్ని విస్తరించడం » పరిశ్రమల వ్యర్థ జలాలను సముద్రంలోకి నేరుగా వదిలేయడం » కృష్ణా అభయారణ్యం మొత్తం విస్తీర్ణం 194.81 చ.కి.మీ» ఇందులో మడ అడవులు 15 వేల ఎకరాలు » ఇందులో మచిలీపట్నం అటవీ విభాగం పరిధిలో మడ అడవులు 7 వేల ఎకరాలు » ఇందులో నాశనమైపోయిన మడ అడవులు 3 వేల ఎకరాలకు పైగామడ అడవులు లేకపోతే జరిగే అనర్థాలు» జీవ వైవిధ్యం మనుగడకు ముప్పు » పర్యావరణ వ్యవస్థకు ముప్పు ఏర్పడుతుంది » మత్స్య సంపద తగ్గిపోతుంది » తుపానుల నుంచి తీర ప్రాంతానికి రక్షణ లేకుండా పోతుంది -
శిక్ష కాదు.. శిక్షణ..!
నేరం చేసిన వ్యక్తిలో పరివర్తన తీసుకురావటమే జైలు శిక్ష ప్రధాన ఉద్దేశం. ఈ లక్ష్యాన్ని ‘అక్షరాలా’నిజం చేస్తోంది తెలంగాణ జైళ్లశాఖ. దారితప్పిన వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ‘శిక్ష’ణ ఇస్తోంది. నిరక్షరాస్యులుగా జైలుకు వచ్చే ప్రతి ఖైదీ కనీసం తన పేరు రాయటం నేర్చుకుని సంతకం పెట్టేలా విద్య నేర్పుతున్నారు. ఆసక్తి ఉన్న ఖైదీలను పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ వరకు పూర్తిచేసేలా ప్రోత్సహిస్తున్నారు.తెలంగాణ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ అధికారి సౌమ్యా మిశ్రా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఖైదీల విద్యాభ్యాసానికి కీలక చర్యలు చేపట్టారు. ఖైదీలు పాఠశాల స్థాయి విద్యను పూర్తిచేసేలా మొదటిసారి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్)తో ఇటీవలే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. థంబ్ ఇన్...సైన్ ఔట్..జైలుకు వచ్చే ప్రతి ఖైదీ కనీస విద్య నేర్చుకోవాలన్న ఉద్దేశంతో జైళ్లశాఖ ‘థంబ్ ఇన్..సైన్ ఔట్’కార్యక్రమాన్ని చేపట్టింది. నిరక్షరాస్యులైన ఖైదీలకు చదవడం, రాయడం నేర్పడం దీని ప్రధాన ఉద్దేశం. వేలిముద్ర వేసే స్థితిలో జైలుకు వచ్చే ఖైదీ.. శిక్ష పూర్తిచేసుకొని వెళ్లేటప్పుడు సంతకం పెట్టి వెళ్లాలనేది ఈ కార్యక్రమ లక్ష్యం. ప్రతి ఖైదీ జైలు లోపలికి రాగానే అడ్మిషన్ (జైలులో చేర్చే సమయం) సమయంలో వారి వివరాలు నమోదు చేస్తారు. ఆ రికార్డుల్లో ఎవరైనా ఖైదీ వేలిముద్ర వేస్తే.. వెంటనే వారి వివరాలు ప్రత్యేకంగా నమోదు చేసుకుని థంబ్ ఇన్..సైన్ ఔట్లో చేర్చి విద్య నేర్పుతారు. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో కలిపి 2024లో 15,896 మంది ఖైదీలు ఈ ప్రాథమిక విద్యా కార్యక్రమం నుంచి ప్రయోజనం పొందారు. ఎన్ఐఓఎస్ కింద 106 మందికి శిక్షణ ఐదు, ఆరో తరగతి తర్వాత చదువు మానేసిన ఖైదీలు 10వ తరగతి పూర్తి చేసేలా ఎన్ఐఓఎస్లో శిక్షణ ఇస్తున్నారు. వారికి పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ అన్నీ జైళ్లశాఖనే సమకూరుస్తోంది. కనీసం రెండేళ్ల శిక్షాకాలం ఉన్న ఖైదీలకు పదో తరగతి పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. ఎన్ఐఓఎస్ కింద చర్లపల్లి, నిజామాబాద్ సెంట్రల్ జైళ్లు, మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లా జైళ్లు, హైదరాబాద్ మహిళా ప్రత్యేక జైలులో సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 106 మంది ఖైదీలకు ఎస్ఎస్సీ బోర్డు పరీక్షలు రాసేలా శిక్షణ కొనసాగుతోంది. - సాక్షి, హైదరాబాద్ప్రత్యేక టీచర్లతో తరగతులు జైళ్లలో ఖైదీలకు చదువు చెప్పేందుకుప్రత్యేక టీచర్లను నియమించారు. చర్లపల్లి,చంచల్గూడల్లో ఒక్కరు చొప్పున రెగ్యులర్ టీచర్లు ఉన్నారు. జిల్లా జైళ్లలో స్థానిక కలెక్టర్ల సహకారంతో ఔట్ సోర్సింగ్ విధానంలో టీచర్లను నియమించారు. జీవిత ఖైదు, ఎక్కువ కాలం శిక్ష పడిన ఖైదీల్లో డిగ్రీ, ఆపై విద్యార్హతలుఉన్నవారితో కూడా ఇతర ఖైదీలకుశిక్షణ ఇస్తున్నారు. అందుబాటులో గ్రంథాలయాలు విద్యార్హత, శిక్షా కాలాన్ని బట్టి ఖైదీలు వారికి నచ్చిన కోర్సులు చేసేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. డిగ్రీ, పీజీ కోర్సులను అందించేందుకు చర్లపల్లి సెంట్రల్ జైలులో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ప్రత్యేక అధ్యయన కేంద్రాన్ని స్థాపించారు. బీఏ, ఎంఏ, ఎంఎస్సీలో విద్య అందిస్తున్నారు. జైళ్లలోనే వారికి పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని జైళ్లలోగ్రంథాలయాలు సైతంఅందుబాటులో ఉన్నాయి. రోజులో కొంత సమయం పుస్తకాలు చదివేందుకు ఖైదీలకు అవకాశం కల్పిస్తున్నారు. ఖైదీల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకే.. జైలుకు వచి్చన తర్వాత ఖైదీలు ఖాళీగా ఉంటే వారిలో డిప్రెషన్, నేర ఆలోచనలు పెరుగుతాయి. అందుకే వారి దృష్టిని చదువు వైపు మళ్లిస్తున్నాం. విద్యార్హత పెంచుకోవడంతో ఖైదీల్లోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చదువు వారిలో మెంటల్ కంట్రోల్ పెంచుతుంది. తప్పుచేసి జైలుకు వచ్చినా.. విద్యార్హత కలిగిన మంచి పౌరులుగా తిరిగి సమాజంలోకి వెళతారు. ఏదైనా ఉపాధి దొరికేలా ఇది ఉపయోగపడుతుంది. –సౌమ్యా మిశ్రా, డీజీ, జైళ్లశాఖ2014 నుంచి ఇప్పటివరకుజైళ్లలో ఖైదీల చదువు వివరాలు:బీఏ 118 ఎమ్మెస్సీ సైకాలజీ 35 ఎంఏ 16 -
యంగ్ ఇండియా పోలీసు స్కూల్ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని మంచిరేవులలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా పోలీసు స్కూల్ (వైఐపీఎస్) సిద్ధమైంది. దీన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయగా, ప్రస్తుతం ఏడు ఎకరాల్లో కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ఈ స్కూల్లో మొత్తం 200 సీట్లు ఉంటాయి. వీటిలో 100 పోలీసు అధికారులు, ఉద్యోగుల పిల్లలకు, మరో 100 సాధారణ పౌరుల పిల్లలకు కేటాయించారు. ప్రస్తుతానికి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రవేశాలు జరుగుతున్నాయి. మార్చి మొదటి వారంలో అందుబాటులోకి వచ్చిన వైఐపీఎస్ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి అర్హులను ఎంపిక చేశారు. ఒక్కో తరగతిలో 40 మంది చొప్పున ఐదు క్లాసుల్లో కలిపి మొత్తం 200 మంది విద్యార్థులు ఉంటారు. ఇప్పటి వరకు 83 మంది పోలీసు, నలుగురు సాధారణ పౌరుల పిల్లలకు అడ్మిషన్లు ఇచ్చారు. భవిష్యత్తులో 5 వేల మందికి అడ్మిషన్లు ఇస్తారు. విద్యార్థుల కోసం 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,750 పడకలతో హాస్టల్ను నిర్మిస్తారు.ప్రతిభగల ప్రైవేట్ టీచర్ల ఎంపికఈ స్కూల్లో పని చేయడానికి ప్రతిభ గల ప్రైవేట్ టీచర్లను ఎంపిక చేసుకున్నారు. విద్యాభ్యాసంతోపాటు విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి యంగ్ ఇండియా పోలీసు స్కూల్ (Young India Police School) కృషి చేస్తుంది. త్వరలో ఉత్తమ క్రీడా శిక్షకులను ఎంపిక చేయనున్నారు. ఏడుగురు సభ్యులతో కూడిన గవర్నింగ్ సొసైటీ ఆధ్వర్యంలో వైఐపీఎస్ నడుస్తుంది. దీనికి రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రెసిడెంట్గా, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) వైస్ ప్రెసిడెంట్గా, గ్రేహౌండ్స్ విభాగం అదనపు డీజీ ఎం.స్టీఫెన్ రవీంద్ర సెక్రటరీగా ఉంటారు. మరో నలుగురు సభ్యులు ఉన్నారు. విద్యార్థుల కోసం మూడు డిజైన్లతో కూడిన యూనిఫామ్స్ ఖరారు చేశారు.వైఐపీఎస్ నుంచి ప్రతి విద్యార్థి పరిపూర్ణ వ్యక్తిత్వంతో బయటకు వెళ్తాడు. అందుకే విద్య, క్రీడలతోపాటు అన్ని అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. పోలీసు విభాగంలో కిందిస్థాయి ఉద్యోగులు పని ఒత్తిడి కారణంగా తమ పిల్లల బాగోగుల కోసం సమయం ఇవ్వలేరు. పెద్దపెద్ద స్కూళ్లలో చేర్చాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని సీట్ల రిజర్వేషన్, ఫీజులు నిర్ధారించాం. – సీవీ ఆనంద్, పోలీసు కమిషనర్, హైదరాబాద్ -
పాపికొండల్లో అలుగుల సందడి
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని పాపికొండల అభయారణ్య ప్రాంతంలోని అడవుల్లో అరుదైన అడవి అలుగులు సంచరిస్తున్నాయి. వీటిని పాంగోలియన్ అని కూడా పిలుస్తారు. చైనీస్ పాంగోలియన్, ఆసియా పాంగోలియన్, సుండా పాంగోలియన్, పాతమాన్ పాంగోలియన్ (Pangolin) అని నాలుగు రకాలు అలుగులు ఉంటాయి. ఈ అలుగు సుమారు 20 ఏళ్లు బతుకుతాయి. చీమలు, పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. ఈ జీవికి పొడవైన నాలుక ఉంటుంది. ఎక్కువ శాతం దట్టమైన అటవీ ప్రాంతాల్లో, అధికంగా వర్షాలు కురిసే ప్రాంతాలతో పాటు ఎడారి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా జీవిస్తుంటాయి. 1821లో తొలిసారిగా ఈ జంతువుల సంచారాన్ని గుర్తించినట్లు వైల్డ్లైఫ్ అధికారులు చెబుతున్నారు. ఈ జీవులకు భయపడితే ముడుచుకుపోయి తమను తాము రక్షించుకుంటాయి. వీటి చర్మంపై ఉండే పెంకులు చాలా దృఢంగా ఉంటాయి. అరుదైన ఈ వన్యప్రాణులు పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సుమారు 25 నుంచి 30 పైగా సంచరిస్తున్నట్లు వైల్డ్లైఫ్, ఫారెస్టు అధికారులు తెలిపారు. రాత్రి వేళ సంచారం అలుగులు పగలు కంటే రాత్రి సమయంలోనే ఎక్కువగా సంచరిస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. పగటిపూట గోతుల్లో, తొర్రల్లో, చెట్ల పైన దాగి ఉంటాయి. రాత్రి సమయాల్లో ఆహారం కోసం అన్వేషిస్తాయి. తెల్లవారేసరికి తొర్రల్లోకి చేరుకుంటాయి. ఈ అలుగు రెండు సంవత్సరాలకు ఒకసారి పిల్లలకు జన్మనిస్తుందది. కోతి (Monkey) మాదిరిగానే తాను జన్మనిచ్చిన పిల్లలను వీపుపై ఎక్కించుకుని ఆహార అన్వేషణ సమయంలో తిప్పుతుందని చెబుతున్నారు. అలుగులు సంచరిస్తున్న సమయంలో ఎలాంటి అలికిడి విన్నా బెదిరిపోయి బంతిలాగా ముడుచుకుపోతాయి. కదలకుండా గట్టిగా ముడుచుకుని ఉండిపోతాయి. అలుగులకు ఎదురు దాడి చేసే గుణం కూడా ఉంటుందని వైల్డ్లైఫ్ (Wild Life) అధికారులు చెబుతున్నారు. ఈ అలుగుల వీపుపై ఉండే పెంకులు కత్తిలాగా పదునుగా ఉంటాయి. ఇవి సింహం కూడా తినలేనంత గట్టిగా ఉంటాయి. ఈ అలుగు సంతతి పాపికొండల అభయారణ్యంలో ఎక్కువగా ఉన్నట్లు వైల్డ్లైఫ్ అధికారులు తెలిపారు. అలుగులపై స్మగ్లర్ల కన్ను ఏజెన్సీ ప్రాంతంలోని అభయారణ్యంలో సంచరిస్తున్న అలుగులపై స్మగ్లర్ల కన్ను పడింది. అరుదైన అలుగు జంతువు వీపుపై ఉండే పెంకులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ పెంకుల విలువ రూ.లక్షల్లో ఉంటుందని అంటున్నారు. అలుగు పెంకులను చైనాలోని మందుల తయారీలో ఉపయోగిస్తారని సమాచారం. గతంలో అలుగును బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు రూ.20 లక్షలకు విక్రయిస్తామని ఫేస్బుక్లో వీడియో అప్లోడ్ చేసినట్లు అధికారులు తెలిపారు. చదవండి: మూగ జీవాలకూ రక్షణ ఇద్దాం!ఆ సమయంలో తమ ఉన్నతాధికారులు ఆ వీడియోను చూసి స్మగ్లర్లను పట్టుకునేందుకు ఆదేశాలు ఇవ్వడంతో అలుగు అమ్మకానికి పెట్టిన ఇద్దరు వ్యక్తులను వలపన్ని చాకచక్యంగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు వైల్డ్లైఫ్ అధికారులు తెలిపారు. అరుదైన వన్య ప్రాణులను వేటాడి విక్రయించాలని చూస్తే ఏడేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని, అలాగే రూ.5 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారని అధికారులు పేర్కొన్నారు. -
‘ఎర్ర గుంటూరు’ సాగు.. ఎంతో బాగు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పసుపు పంట కొనుగోళ్లలో రాష్ట్రంలోనే 70 శాతం వాటా కలిగిన నిజామాబాద్ మార్కెట్ యార్డుకు ప్రత్యేకత ఉంది. కానీ ఇక్కడికి వచ్చే పసుపు రకాల విషయానికి వస్తే 99 శాతం ‘ఎర్ర గుంటూరు’(ఆర్మూర్ రకం) ఉండటం విశేషం. నిజామాబాద్ జిల్లా తరువాత.. పసుపు ఎక్కువగా సాగు చేస్తున్న జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో సైతం ఎర్రగుంటూరు రకం వంగడాన్నే అత్యధిక శాతం రైతులు సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని ‘దుగ్గిరాల ఎరుపు’రకం వంగడాన్ని తీసుకొచ్చి కమ్మర్పల్లి పరిశోధన కేంద్రంలో మరింత అభివృద్ధి చేశారు. అప్పటినుంచి దీన్ని ఎర్ర గుంటూరు (ఆర్మూర్ రకం)గా పిలుస్తున్నారు. ‘ఎర్ర గుంటూరు’రకం వంగడం ఇక్కడి నేలకు సరిపోయిందని రైతులు చెబుతున్నారు. ఇందులో కర్కుమిన్ 3 శాతం లోపే ఉంటోంది. కాగా కర్కుమిన్ శాతం ఎక్కువగా ఉండే సోనాలి, రాజేంద్రసోని (బిహార్), పీతాంబర్ (ఉత్తరప్రదేశ్) రకాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. రైతులు మాత్రం స్థానికంగా అభివృద్ధి చేసిన ‘ఎర్ర గుంటూరు’రకం వైపే మొగ్గు చూపుతున్నారు. కేవలం 6 నెలల్లోనే పంట వచ్చే ప్రగతి, ప్రతిభ (కేరళ) పొట్టి రకాలను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ, ఈ రకాల్లో పసుపు బరువు ఎక్కువగా రావడం లేదని రైతులు ఆసక్తి చూపడం లేదు.చూసేందుకు మంచిగా, ధర ఎక్కువగా పలికే ‘ఎర్ర గుంటూరు’రకమే మేలని రైతులు అంటున్నారు. దుంప ఎక్కువగా వచ్చే తమిళనాడు సేలం రకం వంగడాన్ని సైతం నామమాత్రంగానే సాగు చేస్తున్నారు. అయితే చాలా తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న రాజాపురి, సేలం, పీతాంబర్ రకాలను రైతులు ఎక్కువగా మహారాష్ట్రలోని సాంగ్లి మార్కెట్కు తీసుకెళ్లి అమ్ముతున్నారు. ఈ రకాల్లో కర్కుమిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాగా ‘ఎర్ర గుంటూరు’రకం పసుపును దేశీయంగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నిజామాబాద్ పసుపు బంగ్లాదేశ్, ఇరాన్, అరబ్ దేశాలకు సైతం ఎగుమతి అవుతోంది. 13 రకాలపై పరిశోధన రాష్ట్రంలో ఏకైక కమ్మర్పల్లి పసుపు పరిశోధన కేంద్రంలో ప్రస్తుతం 13 రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. అధిక కర్కుమిన్, దిగుబడి ఎక్కువ, తెగుళ్ల నివారణ, కీటకాలు, పురుగు నివారణ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలు చేస్తున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడుస్తున్న కమ్మర్పల్లి పసుపు పరిశోధన కేంద్రంలో.. పరిశోధనలకు భారత సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్) నుంచి సూచనలు వస్తాయి. కేరళలోని ఆలిండియా కో–ఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ స్పైసెస్ (ఏఐసీఆర్పీ)తో సమన్వయం చేసుకుంటూ.. కొన్ని పరిశోధనలు, రాష్ట్ర ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో మరికొన్ని పరిశోధనలు ఇక్కడ చేస్తున్నారు. 40 శాతం సాగు నిజామాబాద్ జిల్లాలో.. రాష్ట్రంలో అత్యధికంగా 40 శాతం నిజామాబాద్ జిల్లాలో సాగవుతోంది. తరువాత స్థానాల్లో జగిత్యాల, నిర్మల్, వరంగల్, వికారాబాద్, మహబూబాబాద్, హనుమకొండ, భూపాలపల్లి, ఆదిలాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. నిజామాబాద్ మార్కెట్కు 2019–20లో 10,78,821 క్వింటాళ్ల పసుçపు వచ్చింది. 2020–21లో 8,55,516 క్వింటాళ్లు, 2021–22లో 8,38,932 క్వింటాళ్లు, 2022–23లో 7,49,072 క్వింటాళ్లు, 2023–24లో 7,23,470 క్వింటాళ్ల పసుపు వచ్చిoది. ఈ ఏడాది జనవరి చివరి వారంలో సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 6,74,055 క్వింటాళ్ల పసుపు నిజామాబాద్ మార్కెట్కు వచ్చిoది. గత ఏడాది కంటే 1.50 లక్షల క్వింటాళ్లు అధికంగా పసుపు రానుందని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరుకు మరో 50 వేల క్వింటాళ్లు, ఏప్రిల్లో 85 వేల క్వింటాళ్లు, మే నెలలో మరో 65 వేల క్వింటాళ్ల పసుపు ఇక్కడి మార్కెట్కు రానున్నట్లు అధికారుల అంచనా. గత ఏడాది రాష్ట్రంలో సగటున ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చిoది. ఈ ఏడాది దుంపకుళ్లు సోకక పోవడంతో ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో సాగు చేయగా, ఇందులో నిజామాబాద్ జిల్లాలో 22 వేల ఎకరాల్లో పసుపు సాగు చేశారు. -
కార్నియా.. త్రీడీ ప్రింటింగ్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కంటిలో కీలకభాగమైన కార్నియా లోపంతో చూపును కోల్పోతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎవరైనా కళ్లు దానమిస్తే.. ఆ కంటిని అవయవ మార్పిడి చేసి కార్నియాతో చూపు కోల్పోయిన వారికి వైద్యులు చూపును ప్రసాదిస్తారు. ఇప్పుడు కళ్లను దానం చేసే వారిసంఖ్య పరిమితంగా ఉండగా, కార్నియా అవసరమున్న రోగుల సంఖ్య ఎక్కువగా పెరుగుతోంది. ఈ సమస్యలను అధిగమించడమే లక్ష్యంగా ఐఐటీ హెచ్లో (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్)లో ప్రత్యేక పరిశోధన ప్రాజెక్టు కొనసాగుతోంది. త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో ఈ కార్నియాను బయోప్రింటింగ్ చేయడంపై పరిశోధనలు చేస్తున్నారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, సీసీఎంబీ (ది సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మోలిక్యులర్ బయోలజీ)లతో కలిసి ఐఐటీహెచ్లోని బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం ఈ పరిశోధన ప్రాజెక్టును చేపట్టింది. ఇది సత్ఫలితాలిస్తుందని ఐఐటీహెచ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగ ఫ్రొఫెసర్ డాక్టర్ ఫాల్గుణి పఠి ‘సాక్షి’కి తెలిపారు. ఈ పరిశోధనల్లో రూపుదిద్దుకున్న త్రీడీ బయో ప్రింటింగ్ కార్నియాను ముందుగా జంతువులపై ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే కుందేళ్లపై చేసిన ప్రయోగం మంచి ఫలితాలిచ్చిoది. రానున్న రోజుల్లో ఈ త్రీడీ బయో ప్రింటెడ్ కార్నియాను మనుషులపై ప్రయోగించనున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందనున్నారు. బయోఇంక్తో త్రీడీ ప్రింటింగ్ రోగుల కళ్ల నుంచి బయోఇంక్ (జెల్ లాంటి పదార్థం)ను సేకరిస్తారు. దీనికి కొన్ని రకాల సెల్లను యాడ్ చేసి త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి కార్నియాను ప్రింట్ చేస్తున్నారు. సాధారణంగా కార్నియా అనేది 10.8 మిల్లీమీటర్ల నుంచి 12.8 మిల్లీ మీటర్ల సైజులో ఉంటుంది. ఇటీవల కాలంలో 3డి ప్రింటింగ్ టెక్నాలజీ ప్రాధాన్యం పెరుగుతోంది. భవనాలతోపాటు, జ్యువెలరీ, మానవులు, ఇతర జీవుల అవయవాలు.. ఇలా అనేక రకాల వస్తువులను త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే సూక్ష్మస్థాయిలో 10 మి.మీల నుంచి 12 మిల్లీమీటర్ల సైజులో ఉండే ఈ అతి చిన్న మానవ అవయవాన్ని ఇదే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా రూపొందించడం గమనార్హం. 4.9 బిలియన్ మందికి అంధత్వం ప్రపంచంలో సుమారు 4.9 బిలియన్ మంది అంధత్వంతో బాధపడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో నాలుగో వంతు కంటిలోని కార్నియాలోపంతోనే అంధత్వం వస్తున్నట్టు తేలింది. ఈ సమస్యకు కంటి దానమే ఇప్పటి వరకు ఉన్న పరిష్కారం. అయితే కళ్లను దానం చేసేవారు తక్కువగా ఉంటున్నారు. అవసరమున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో చాలామంది చూపు లేకుండానే జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఈ సమస్యలను అధిగమించడమే లక్ష్యంగా ఈ పరిశోధనలు చేస్తున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. కళ్ల సేకరణలో ఇబ్బందులు కళ్లు దానమిచ్చిన వారినుంచి కంటి సేకరణ ప్రస్తుతం క్లిష్టతరంగా ఉంది. చనిపోయిన వ్యక్తి శరీరం నుంచి నిరీ్ణత సమయంలో కళ్లను సేకరించాలి. సేకరించిన కళ్లను భద్రపరచడం వంటి ప్రక్రియ కొంత వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. తగిన వైద్య నిపుణుల అవసరం ఉంటుంది. ఈ క్రమంలో వివిధ కారణాలతో ఒక్కోసారి సేకరించిన కళ్లు పాడైపోయి.. వృథాగా పోతున్న ఘటనలు కూడా ఉంటున్నాయి. ఇలాంటి సవాళ్లకు ఈ పరిశోధనలు కొంత మేరకు పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.కార్నియా దెబ్బతినడానికి ఇవీ కారణాలు..» ప్రధానంగా ఏమైనా ప్రమాదాలు జరిగి కంటికి గాయాలైతే ఈ కార్నియా దెబ్బతింటుంది. » కంటి ఇన్ఫెక్షన్తో కూడా కార్నియా చెడిపోతుంది. » షుగర్ వ్యాధిగ్రస్తులతోపాటు, బీపీ ఉన్న వారికి కూడా క్రమంగా కార్నియాపై ప్రభావం పడుతుంది. దీంతో చూపుమందగించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. -
మూగజీవాలకూ రక్షణ ఇద్దాం!
(సాక్షి స్పెషల్ డెస్క్) : చిన్న, సన్నకారు రైతులు పశుపోషణ ద్వారా సమకూరే ఆదా యంపైనే ఎక్కువగా ఆధారపడతారు. అయితే, ఈ ఏడాది మార్చి నుంచే సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమో దవుతున్నాయి. దీంతో పాడి ఆవులు, గేదెలు, గొర్రె లు, మేకలు, కోళ్ల సంరక్షణ రైతులకు కత్తి మీద సాము లా మారింది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా మామునూరులోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అనుబంధ ఐసీఏఆర్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత డాక్టర్ ఎన్. రాజన్న, శాస్త్రవేత (ఎల్పీఎం) డాక్టర్ సాయి కిరణ్, ‘ఐసీఏఆర్–అటారి’ (జోన్–10) డైరెక్టర్ డాక్ట ర్ షేక్.ఎన్.మీరా రైతులకు సూచనలు ఇస్తున్నారు. ఈ వేసవి మనుషులతోపాటు పశువులకూ గడ్డు కాలమే. తెలంగాణలో సుమారు 3.26 కోట్ల పశు వులు ఉన్నాయి. ఇందులో 42.3 లక్షల ఆవులు 42.26 లక్షల గేదెలు, 1.90 కోట్ల గొర్రెలు, 49.35 లక్షల మేకలు 1.78 లక్షల పందులతోపాటు 7.99 కోట్ల కోళ్లు ఉన్నాయి. రైతులు తగు జాగ్రత్తలు తీసు కుంటే వేసవిలో పాలు, మాంసం ఉత్పత్తి తగ్గకుండా కాపాడుకోవొచ్చు. విదేశీ జాతి, సంకర జాతి ఆవులు 24–27 డిగ్రీల సెల్సియస్ (డి.సె.), దేశీ ఆవులు 33 డి.సె.లు, గేదెలు 36 డి.సె.లు, కుందేళ్లు 30 డి.సె.ల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. ఎండ దెబ్బ లక్షణాలు..నాడి వేగంగా, బలహీనంగా కొట్టుకుంటుంది. హృదయ స్పందన రేటు, శ్వాసక్రియ రేటు, పేడ ఉష్ణోగ్రత పెరగడం, అసాధారణంగా సొంగ కారటం, మైకం/అపస్మారక స్థితికి చేరటం, చర్మం చల్లగా, నిస్తేజంగా మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక తాపం వల్ల సంకర జాతి ఆవుల్లో 15–20%, గేదెల్లో 10–15% పాల దిగుబడితోపాటు వెన్న శాతం పడిపో తుంది. ఉష్ణ తాపానికి గురైన పశువుకు చూలు నిలవదు. ఉదయం 6 –11 గంటలలోపు.. సాయంత్రం 4–6 గంటల మధ్యలోనే మేతకు వదలాలి. పచ్చిమేతతోపాటు దాణాను పగలు, ఎండు గడ్డిని రాత్రి పూట వేయాలి. రోజుకు 100 గ్రా. చొప్పున పొటాషి యం అధికంగా ఉండే ఖనిజ లవణాల మిశ్రమం ఇవ్వాలి. షెడ్ల ఎత్తు కనీసం 9 అడుగులు పశువుల షెడ్లను తూర్పు–పడమర దిశలో 9 అడుగుల ఎత్తున నిర్మించాలి. పాకల చుట్టూ అవిశె, మునగ, సుబాబుల్ చెట్లు పెంచాలి. షెడ్ల పైకప్పులకు తెల్లని రంగువేసి, ఆపైన గడ్డి, తాటి/ కొబ్బరి /పామాయిల్ ఆకుల్ని కప్పాలి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గంటకొకసారి చల్లని నీటితో పశువుల ఒళ్లు తడపాలి. పాకల చుట్టూ గోనె సంచులు/ 20% షేడ్ నెట్ కట్టి, తడుపుతూ ఉండాలి. అధికంగా పాలిచ్చే ఆవులు, ముర్రా గేదెల కోసం ఫ్యాన్ బిగించాలి. గోనె సంచులను నడుముపైన కప్పి, 2–3 సార్లు తడపాలి. షెడ్లపైన స్ప్రింక్లర్లు బిగించాలి. వేసవిలో పశువులకు దాదాపుగా రెట్టింపు తాగునీరు అవసరం. ఈ జాగ్రత్తలు తీసుకోండి..పశువుల ఆరోగ్యం, ఆహారం, నీటిసరఫరా, శరీర పరిస్థితులను ప్రతిరోజు పర్యవేక్షించాలి. ఎండదెబ్బ తగిలిన పశువును చల్లని ప్రదేశానికి తరలించి, చల్లటి నీటితో స్నానం చేయించాలి లేదా తడి దుప్పట్లలో చుట్టి, ఫ్యాన్ గాలి అందేలా చూసుకోవాలి. గొర్రెలు, మేకలకు సరైన నట్టల మందులు ఎంచుకోవాలి. వేసవి వ్యాధుల నుంచి రక్షణకు వ్యాక్సిన్లు వేయించాలి. చల్లటి నీటితో స్నానాలు చేయించాలి. చల్లని తాగునీటిని అందించాలి. కోళ్ల పెంపకంలో వేసవి జాగ్రత్తలు..» కోడి శరీరం చలిని తట్టుకునే విధంగా పూర్తిగా ఈకలతో నిండి ఉంటుంది. వాటి శరీరంలో చమట గ్రంధులు లేవు. సాధారణ శరీర ఉష్ణోగ్రత 107 డిగ్రీల ఫారెన్ హీట్ కంటే బయటి ఉష్ణోగ్రత పెరిగితే తట్టుకోలేవు. » వేడి ఒత్తిడికి గురైన కోడి పిల్లలు నీరస్తాయి. విరేచనాలవుతాయి. నిలబడ లేవు. వణుకుతుంటాయి. ఈ లక్షణాలుంటే మందులు వేయించాలి. కోళ్లు మెడలు వాల్చి, సన్నగా మూలుగుతూ, కళ్ల నుంచి నీరు కార్చుతున్న కోళ్లను వెంటనే ఇతర కోళ్ల నుంచి వేరుచేసి సరైన చికిత్స అందించాలి. » షెడ్డు ఎత్తు 10 అడుగులుండాలి. దాణా తెల్లవారుజాము, రాత్రి వేళల్లో ఇవ్వాలి. దాణాలో అవసరమైన మోతాదులో విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండాలి. మాంసకృత్తులు కొంతమేర తగ్గించాలి. సి–విటమిన్ ఎక్కువగా ఇవ్వాలి. » ఒక టన్ను దాణాలో 100 గ్రాముల విటమిన్–సి, 50 గ్రాముల విటమిన్–ఇ ఇస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మితియోనైన్ అనే అమైనోఆమ్లం దాణాలో కలిపి ఇవ్వాలి. అమ్మోనియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్ 0.25 శాతం ఇస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. » వేసవిలో దాణా, నీటిని 1:2 నిష్పత్తిలో ఇవ్వాలి. ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు 1:4 నిష్పత్తిలో ఉండాలి. నీటిలో ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు వంటివి కలిపితే అవి ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి. వీలైనంత వరకు చల్లని నీటినే ఇవ్వాలి. షెడ్డుపైన గడ్డి కప్పి, స్ప్రింక్లర్లు అమర్చి.. షెడ్డు లోపల ఫాగర్స్తో ఎండవేళల్లో అర గంటకొకసారి నీళ్లు చల్లాలి. -
జగిత్యాలకు ఐకాన్ ఈ ‘ఖిల్లా’
జగిత్యాల: ఈ ఖిల్లా జగిత్యాలకే ఐకాన్. దాదాపు 20 ఎకరాల స్థలంలో ఫ్రెంచ్ ఇంజనీర్ల పర్యవేక్షణలో ఈ కోటను నిర్మించినట్లు చెబుతుంటారు. నక్షత్రాకారంలో నిర్మించిన ఈ కోట చుట్టూ కందకాలను తవ్వారు. శత్రువులు కోటపై దాడిచేస్తే అడ్డుకునేందుకు దాదాపు వందకు పైగా ఫిరంగులు (Cannons) ఏర్పాటు చేశారు. సైనికుల కోసం ప్రత్యేక గదులు, అలాగే ఫిరంగులు, ఆయుధాల నిల్వ కోసం కూడా ప్రత్యేకమైన గదులు, తాగునీటి కోసం నిర్మించిన బావి, కోనేరు సైతం ఇందులో ఉన్నాయి. దాదాపు మూడు వందల సంవత్సరాలు గడుస్తున్నా ఈ కోట ఇంకా చెక్కు చెదరకుండా ఉంది.1930 వరకు జగిత్యాల (Jagtial) రెవెన్యూ కార్యాలయాలు ఈ కోటలోనే ఉండేవని చెబుతుంటారు. ఎలగందుల కోట పాలకులైన జుల్ముల్క్ జాఫరుద్దౌలా, మీర్జా ఇబ్రహీంఖాన్లు ఈ కోటను నిర్మించినట్లు చెబుతుంటారు. ఫ్రెంచ్ ఇంజనీర్లు దీనిని ప్రత్యేకంగా నిర్మించారు. దీనిని పైనుంచి చూస్తే తప్ప ఇది నక్షత్రాకారంలో ఉన్నట్లు తెలియదు. చెక్కుచెదరని గోడలు.. కందకాలు.. వందల సంవత్సరాల కిందట నిర్మించిన ఈ ఖిల్లా ముఖద్వారం గానీ, సైనికుల కోసం ఏర్పాటు చేసిన గదులు గానీ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. శత్రువులు కోటలోనికి రావాలంటే లోతైన ఆ కందకాన్ని దాటి రావాల్సి ఉంటుంది. అప్పట్లో ఆ కందకంలో మొసళ్లను కూడా పెంచేవారని చెబుతుంటారు. సైనికులు రాకపోకలు సాగించడానికి కొన్ని చోట్ల కందకాల వద్ద చెక్క తలుపులు ఉండేవి. అవసరం ఉన్నప్పుడు వారు బయటకు వెళ్లేవారు. కోటలో ఏనుగులు (Elephants) కూడా ఉండేవని చెబుతుంటారు. అలాగే ఇప్పటికీ ప్లస్ ఆకారంలో నిర్మించిన కోనేరులో ఎంత ఎండలు మండినా నీరు ఎండిపోదు. ఈ కోట నుంచి ఒక సొరంగం కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని ఎలగందుల కోటకు సైతం వెళ్తుందని చరిత్రకారులు చెబుతుంటారు. పట్టించుకోని పురావస్తు శాఖ.. ఈ ఖిల్లాను అభివృద్ధి చేస్తే మంచి పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. పురావస్తు శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. జగిత్యాల జిల్లాగా ఏర్పాటైన అనంతరం అప్పటి కలెక్టర్ శరత్.. జగిత్యాల ఖిల్లాలోనే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. దీంతో ఖిల్లాకు పూర్వ వైభవం వచ్చింది. చదవండి: శామీర్పేట్ కారిడార్పై పీటముడి.. హెచ్ఎండీఏ తర్జనభర్జనఈ వేడుకలకు ఖిల్లాను పూలు, మొక్కలతో ఎంతో అందంగా తీర్చిదిద్దేవారు. అయితే కరోనా (Corona) వచ్చినప్పటి నుంచి వేడుకలను ఇందులో నిర్వహించడం బంద్ చేశారు. మళ్లీ ఖిల్లా పూర్వ వైభవం కోల్పోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి దానిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. -
ఏఐకి మానవమేధ
మానవునికి మాత్రమే సాధ్యమయ్యే అపార మేధస్సును త్వరలోనే కృత్రిమమేధ సాధించనుందని గూగుల్ సంస్థ సంచలన అంచనాకొచ్చింది. సృజనాత్మకత, మానవీయత, ఉద్వేగాలు మనిషికి మాత్రమే సొంతమని, మరమనుషుల్లాంటి కృత్రిమ మేధకు ఇవి సాధ్యం కాదని ఇన్నాళ్లూ శాస్త్రవేత్తల్లో ఉన్న అభిప్రాయాలు త్వరలో పటాపంచలు కాబోతున్నాయని గూగుల్ అనుబంధ డీప్మైండ్ సంస్థ సహ వ్యవస్థాపకుడు షేన్లెగ్ ఒక అంచనాకొచ్చారు. షేన్లెగ్ సహ రచయితగా సేవలందించిన ఒక విస్తృతస్థాయి నూతన పరిశోధన పత్రంలో సంబంధిత వివరాలున్నాయి. మానవాళికి కృత్రిమమేధ పెనుముప్పుగా పరిణమించనుందని అధ్యయనం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఏజీఐతో వినాశనం కృత్రిమ మేధ మానవ స్థాయి మేధస్సును సాధించడాన్ని ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అంటారు. 2030 ఏడాదికల్లా ఏజీఐ సాకారమవుతుందని పరిశోధనా పత్రం అంచనా వేసింది. అసాధారణ ప్రజ్ఞాపాటవాలున్న ఏజీఐ సృష్టించే పెనుమార్పులకు మానవాళి వినాశనం చెందే ప్రమాదముందని అభిప్రాయపడింది. ‘‘ఏజీఐ ఎంతటి తీవ్రమైన హాని కల్గిస్తుందనే విషయం కంటే ఆ హాని తాలూకు దుష్పరిణామాలను సమాజం ఏ మేరకు తట్టుకోగలదు, ఎంతమేరకు కోలుకుని మనుగడ సాగించగలదనేవే ఇక్కడ ప్రధానం’’ అని పరిశోధన పత్రంలో అధ్యయనకారులు వ్యాఖ్యానించారు. అయితే మానవాళికి ఏజీఐ ఏ రకమైన హాని తలపెడుతుంది, వాటి తీవ్రత ఎంత ఉండొచ్చనే వివరాలను మాత్రం పేర్కొనలేదు. కాకపోతే ఏజీఐ ముప్పును ఎదుర్కొనేలా మానవాళి ఇప్పటినుంచే సంసిద్ధం కావాల్సిన అవసరం చాలా ఉందని నొక్కిచెప్పారు. గూగుల్, ఇతర కృత్రిమమేధ రంగ సంస్థలు కలిసి ఈ సమస్యకు ఉమ్మడి పరిష్కారం కనిపెట్టాలని సూచించారు. అంతా అస్తవ్యస్తం అందుబాటులో ఉన్న సమాచారంతో ఏజీఐ చాలా గిమ్మిక్కులు చేయొచ్చు. డేటాను తమకు అనుకూలంగా మార్చేయొచ్చు. దురి్వనియోగం చేయొచ్చు. తప్పులతడకగా డేటాలో మార్పులు చేయొచ్చు. డేటా ప్రాథమిక లక్ష్యాన్నే ఏమార్చొచ్చు. ఇతరులకు హాని తలపెట్టేందుకు ఇప్పటికే కొందరు ఏఐను విస్తృతంగా దురి్వనియోగం చేస్తున్న నేపథ్యంలో ఏజీఐ ఇంకెంత హాని తలపెట్టొచ్చనే అంచనాలను పరిశోధన పత్రం ప్రస్తావించింది. ‘‘వచ్చే పదేళ్లలో ఏజీఐ అందుబాటులోకి రావొచ్చు. అది మానవమేధను మించిపోవచ్చు. అప్పుడది సొంతంగా ఆలోచిస్తూ తనకు నచ్చిన ఫలితాలనే ఇవ్వొచ్చు’’ అని డీప్మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్ ఫిబ్రవరిలో ఆందోళన వ్యక్తంచేయడం తెలిసిందే. ఏజీఐలను సహేతుకతతో మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడేలా, వినాశనానికి తావులేకుండా అభివృద్ధి చేయాలని, సంబంధిత సంస్థలన్నింటిపై అజమాయిïÙగా ఐరాస వంటి నియంత్రణ వ్యవస్థ ఉండాలని ఆయన కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. ‘‘ఏజీఐ అత్యంత సురక్షిత వ్యవస్థగా మాత్రమే ఉండేలా, సంఘవ్యతిరేక శక్తుల చేతుల్లో పడకుండా పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ప్రపంచ దేశాల్లో ఏజీఐల కోసం ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయనే దానిపై నిఘా ఉండాలి. మానవాళికి సురక్షితం కాని ప్రాజెక్టులపై కన్నేసి ఉంచేలా పెద్దన్న వంటి పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి’’ అని డెమిస్ గతంలో అన్నారు.ఏమిటీ ఏజీఐ? కృత్రిమమేధ (ఏఐ) మరో ముందడుగు వేస్తే అదే ఏజీఐ. ఏఐ మనమిచ్చిన పనులు, టాస్క్లను మాత్రమే పూర్తి చేస్తుంది. అంతకుమించి సొంతంగా ఆలోచించదు. కానీ ఏజీఐ అలా కాదు. ఇచ్చిన పనిని ఎందుకిచ్చారు, అందులో ఎంత చేయాలి, ఆ పని అసలు నాకెందుకిచ్చారు, ఇచ్చిన డేటాలో భవిష్యత్తులో నా సొంతానికి పనికొచ్చేవి ఏమేమున్నాయి వంటివాటిని స్వీయసమీక్ష చేసుకోగలదు. అంటే సొంతంగా ఆలోచించగలదు. తుది ఫలితం పొందడం కోసం మనం ఏజీఐకు ఏదైనా సమాచారమిస్తే అది డేటాను అర్థంచేసుకుని, వాటి నుంచి కొత్త విషయాలను నేర్చుకుని, తనకు అన్వయించుకుని తుది ఫలితాన్నిస్తుంది. ఆ వివరాలను శాశ్వతంగా గుర్తుంచుకుంటుంది. దాంతో భవిష్యత్తులో మానవులు అడిగే, కోరే, అభ్యర్థించే విషయాలపై ఏఐ సైతం సొంత నిర్ణయం తీసుకున్నాకే పని మొదలుపెడుతుందని సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మానవమేధను ఔపోసన పట్టే ఏజీఐ మనిషి దైనందిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే చర్చ ఇప్పుడు మొదలైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
World Health Day: వీళ్ల ఆరోగ్యమే.. దేశానికి మహాభాగ్యం!
రాజకీయ నాయకుల ప్రధాన విధి.. ప్రజలకు సేవ చేయడం. ఆ బాధ్యత సక్రమంగా నిర్వహించాలంటే.. వాళ్లూ ఆరోగ్యంగా ఉండాల్సిందే. అప్పుడే పరిపూర్ణంగా.. విరామం ఎరగకుండా తమ కర్తవ్యాలను నిర్వర్తించగలుగుతారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం(World Health Day) సందర్భంగా.. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ముఖ్య కారణాలు.. ఇంతకీ వీళ్ల ఆరోగ్యం దేశానికి ఎలా మహాభాగ్యమో ఓసారి పరిశీలిద్దాం..బిజీ షెడ్యూల్: నాయకులు రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి శ్రమిస్తుంటారు. అలాగని.. ఆరోగ్యంగా ఉంటేనే వారు దీర్ఘకాలం సేవ చేయగలుగుతారు.నిరంతర ప్రయాణాలు: స్థల మార్పులు, వేళకి తగినపుడు ఆహారం పొందకపోవడం ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. సరైన జీవనశైలి పాటించడం(టైం టు టైం తినడం లాంటివి..) ద్వారా దీన్ని నివారించగలుగుతారు.ఇమ్యూనిటీ బూస్ట్: రాజకీయ నేతలు ఎడతెరిపిలేని పర్యటనల్లో పాల్గొంటారని చెప్పుకున్నాం కదా. ఈ క్రమంలో రకరకాల వ్యాధుల బారిన పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి మంచి ఆహారం.. ఆరోగ్యపు అలవాట్లు పాటిస్తే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.మానసిక ఒత్తిడి: ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక నిర్ణయాలు తీసుకోవడం అంటే.. తీవ్ర ఒత్తిడికి గురైనట్లే. ధ్యానం, యోగా ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ప్రధాన ఆరోగ్య సమస్యలుగుండె సంబంధిత వ్యాధులు: అధిక ఒత్తిడి కారణంగా గుండెపోటు సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి.మధుమేహం : భోజన అలవాట్ల వల్ల మధుమేహం రిస్క్ పెరుగుతుంది.హైపర్టెన్షన్ (అధిక రక్తపోటు): చురుకైన రాజకీయ జీవితం వల్ల అధిక రక్తపోటుకి గురవుతారు.నిద్రలేమి: నిత్యం మీటింగులు, ప్రణాళికలు కారణంగా తగిన నిద్ర పొందలేక సమస్యలు ఉత్పన్నమవుతాయి.ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు..ఆహార నియంత్రణ : అధిక పిండి పదార్థాలు, కొవ్వు తగ్గించి.. శరీరానికి అవసరమైన పోషకాలు తీసుకోవడం.నియమిత వ్యాయామం : రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం, యోగా చేయడం.ఆరోగ్య పరీక్షలు: ప్రతి ఆరునెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్ష చేయించుకోవడం.నిద్ర-విశ్రాంతి: రోజుకు 7-8 గంటల నిద్ర పోవడం.. వీలు చిక్కినప్పుడు విశ్రాంతి తీసుకోవడం. మరీ వీలైతే కుటుంబ సభ్యులతో సమయం గడపడం.ఒత్తిడి నిర్వహణ : ధ్యానం, యోగా, స్మార్ట్ డిజిటల్ డిటాక్స్(స్మార్ట్ ఫోన్లకు కొంతకాలం దూరంగా ఉండడం) వల్ల ఒత్తిడి తగ్గుతాయి.నేతలు తమ ఆరోగ్యం కాపాడుకోవడం.. వాళ్ల సామాజిక బాధ్యత. ఆరోగ్యమున్న నాయకులే సమర్థవంతంగా దేశానికి సేవ చేయగలరు. అదే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే.. అది ప్రభుత్వ విధానాల మీద ప్రతికూల ప్రభావం చూపించగలదు. ఆరోగ్యం మంచిగా ఉంటేనే ప్రజలకు శ్రద్ధగా సేవ చేయగలరు. ఆరోగ్యమే నిజమైన సంపద.. ఈ సందేశాన్ని ఈ World Health Day 2025 సందర్భంగా ప్రతీ నాయకుడు గుర్తించాలి!. -
స్మార్ట్ గా చెడగొడుతున్నాయ్!
ఇప్పుడంతా గూగుల్ తల్లి మాయ.. తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కొత్తపుంతలు తొక్కుతున్న స్థితిలో మనం ఉన్నాం. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచం అంతా మన చేతిలో ఉంటోంది. సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, యువత వీటి ప్రభావానికి లోనై బానిసలవుతున్నారు. ఇప్పుడుగనుక తల్లిదండ్రులు మేల్కొనకపోతే భవిష్యత్లో పిల్లలు చెడుదారులు పట్టే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కందుకూరు రూరల్: యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ఒక వీడియోను ఓపెన్ చేస్తే చాలు ముందు వచ్చేది యాడ్స్. ఆ యాడ్స్ కూడా ఆశ్లీలంగా ఉంటాయి. ఆసక్తి కలిగించేలా థంబ్ నెయిల్ టైటిళ్లు ఉంటాయి. ఉదాహరణకు.. లవ్, ఫ్యాషన్, సెక్స్ గురించి మాట్లాడుకోవడం లేదా తెలుసుకోవడంలో తప్పేముంది. వెంటనే ఈ యాప్ డౌన్లోన్ చేసుకోండని ఒక యాడ్. మీకు గార్ల్ ఫ్రెండ్.. బాయ్ఫ్రెండ్ లేదని బాధపడుతున్నారా... ఒంటరిగా ఫీలవుతున్నారా.. ఇంకెందుకు ఆలస్యం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి.. ఇది మరో యాడ్. దారుణంగా థంబ్ నెయిల్యూట్యూబ్ వీడియోలో థంబ్ నెయిల్ టైటిల్స్ మరీ దారుణంగా ఉంటున్నాయి. వయస్సులో ఉన్నవాళ్లు ఈ వీడియోను ఒంటరిగా చూడండి. చిన్నపిల్లలకు దూరంగా ఉండి ఈ ఆడియోను వినండి. పెళ్లిలో శృంగారం పాత్ర ఎంటీ? ఇలా రకరకాలుగా పిల్లలను ఆకర్షించే విధంగా టైటిళ్లు పెడుతున్నారు. అవి చూసిన పిల్లలు తెలిసీ తెలియక ఈ వీడియో ఎంటి ఇలా ఉంది డాడీ అని ఒకరు. శృంగారం అంటే ఎంటీ మమ్మి ఒక పాప.. ఈ వీడియోలో చిన్న చిన్న బట్టలు వేసుకున్నారెంటమ్మా అని మరొకరి ప్రశ్న. ఇలా తల్లిదండ్రులకు పిల్లల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నా పిల్లల అల్లరిని తట్టుకోలేక స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారు. గతంలో వీడియో గేమ్స్కు ఎక్కువగా పిల్లలు ఆకర్షితులు అవుతున్నారని గేమ్లు డౌన్లోన్ చేయడం లేదు. అయితే నేరుగా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు ఓపెన్ చేసి వీడియో చూస్తుండు అని తల్లిదండ్రులు చెప్పి వారి పని వారు చేసుకుంటున్నారు. కానీ ఆ వీడియో చూస్తూ ఉన్న సమయంలో మధ్య మధ్యలో ఆశ్లీల యాడ్స్ వస్తున్నాయి. వాటిని చూసిన పిల్లల ఆలోచనా సరళి మారిపోతోంది. తల్లిదండ్రులే కారణమా..? యూట్యూబ్లో తల్లిదండ్రులు ఏ విధమైన వీడియో చూస్తున్నారో ఆ అంశాలకు అనుగుణంగానే ఆ తర్వాత వచ్చే వీడియోలు డిస్ప్లే అవుతుంటాయి. తండ్రి లేక తల్లి ఎలాంటి వీడియో చూస్తున్నారో అదే ఫోన్ పిల్లలు చూస్తుంటే అలాంటివే తిరిగి మీకు ముందుగా ఓపెన్ అవుతుంటాయి. యూట్యూబ్లోనే స్క్రోలింగ్ వీడియో చూసి ఏ వీడియోకి అయితే లైక్ కొడతామో అలాంటి రిలేటెడ్ వీడియోలే తిరిగి వస్తుంటాయి. ఇలా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో వీడియోలు వస్తున్నాయి. తల్లిదండ్రులు తమ ఫోన్ పిల్లలకు ఇస్తున్నారంటే మీరు ఎలాంటి వీడియో చూస్తున్నారో వారికి కూడా అర్థమవుతుంది. వాటినే పిల్లలు చూసేలా మీరే పరోక్షంగా కారణం అవుతున్నారు. గమనించకపోతే అంతే సంగతులు.. ఇది ఇలా ఉంటే ప్రాథమిక స్థాయి విద్యార్థులకు హోమ్ వర్క్ ఇస్తున్నారు. ఇంటి వద్ద వర్క్ చేసేటప్పుడు అర్థం కాకపోతే తల్లిదండ్రులను అడగండి లేదా రేపు స్కూల్కు వచ్చిన తర్వాత ఆ వర్క్ చేయండని ఉపాధ్యాయులు చెప్పాలి. కానీ ప్రస్తుతం ఉపాధ్యాయులు ఆ ప్రశ్న అర్థం కాకపోతే గూగుల్లో కొట్టండి లేదా యుట్యూబ్లో చూడండని చెప్తున్నారు. ఇళ్లకు వచ్చిన పిల్లలు మా సార్ ఫోన్లో చూసి ఈ లెక్కలు చేయమన్నాడని తల్లిదండ్రులను అడుగుతున్నారు. ఇక ఫోన్ వాళ్ల చేతికి పోతుంది. ఆ విద్యార్థి లెక్కలు చేస్తున్నాడా... ఇకేమైనా చూస్తున్నాడా అనేది ఆ తల్లిదండ్రులకు అర్థం కాదు. ఇలా ఓ తండ్రి కుమారుడికి ఫోన్ ఇస్తే లెక్కలకు బదులు ఏమి చూస్తున్నాడో గమనించాడు. తరువాత ఉపాధ్యాయుని వద్దకు వెళ్లి మీరు పిల్లలకు ఫోన్లు చూసి వర్క్ చేయమని చెప్పడం ఏమిటని ప్రశ్నించాడు. కానీ ఇలా అందరు పేరెంట్స్ అడగలేరు కదా. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి ఆధునిక ప్రపంచంలో సామాజిక మాధ్యమాల అవసరం ఉన్నప్పటికీ.. వాటి వినియోగంలో పరిపక్వతను, విజ్ఞతను పాటించాల్సిన అవసరం ఉంది. సామాజిక మధ్యమాలు, మొబైల్ గేమ్స్కు బదులు పిల్లలు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలి. మొబైల్ ఫోన్లకు పిల్లలను దూరంగా ఉంచాలి. చిన్న పిల్లలు అల్లరి చేస్తున్నారని మీ ఫోన్ పిల్లలకు ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ పి.పాపారావు, ఆల్ ఇండియా సైకలాజికల్ అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి స్మార్ట్ఫోన్లతో అనర్థాలు స్మార్ట్ఫోన్ల వల్ల అనర్థాలు జరుగుతున్నాయి. కళాశాలల్లో ఫీజులు చెల్లించేందుకు ఇబ్బందులు పడే విద్యార్థులు కూడా వేల రూపాయల మొబైల్స్ వాడుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆన్లైన్ తరగతులు ఉంటాయి. కానీ ఎంత వరకు ఉపయోగించాలో అంతే ఉపయోగించాలి. అది కాస్తా వీరే కార్యకలాపాలకు దారి తీస్తున్నాయి. కళాశాలలకు ఫోన్లు తీసుకురావడం నిషేధించేందుకు ప్రయత్నించాలి. – డాక్టర్ ఎం.రవికుమార్, టీఆర్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ స్మార్ట్ ఫోన్లతో నష్టమే.. స్మార్ట్ ఫోన్లతో ఎంత మేలు ఉందో... అంతే చెడు కూడా ఉందని మానసిక వైద్య నిపుణులు చెప్తూనే ఉన్నారు. కానీ ప్రస్తుతం ఫోన్లు లేని విద్యార్థులు ఉండడం లేదు. పదో తరగతికి వచ్చారంటే ఫోన్ కచ్చితంగా ఉండాల్సిందే. ఇంటర్మీడియట్ చదివే పిల్లలను కాలేజీలకు ఫోన్లు తీసుకురావద్దన్నా వినడం లేదు. కందుకూరులోని కళాశాల సంక్షేమ హాస్టళ్లలోని అబ్బాయిలు, అమ్మాయిలు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. ఈ ఫోన్ల వల్ల ఏ విద్యార్థి కూడా సమయానికి నిద్ర పోవడం లేదు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లలో వీడియోలు ఓపెన్ చేసి చూస్తుంటే ఎప్పుడు ఆపుతారో కూడా తెలియని పరిస్థితి. దీని వల్లనే గాఢ నిద్ర లేక మానసికంగా యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్రీడా మైదానాల్లో ఉండాల్సిన విద్యార్థులు ఫోన్లు పట్టుకొని చెట్ల కింద, రూమ్లలో ఉండిపోతున్నారు. -
రుణ వేధింపులకు చెక్ పెడదాం..!
ఢిల్లీకి చెందిన అనుజ్ (35) వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. తాను తీసుకున్న వ్యక్తిగత రుణం ఈఎంఐలను సకాలంలో చెల్లించలేకపోయాడు. దాంతో రుణ వసూళ్ల ఏజెంట్ల బృందం ఆయన ఇంటి ముందు వాలిపోయింది. నినాదాలూ చేస్తూ, ఆ దారిలో వెళ్లే ఒక్కొక్కరిని పిలిచి అనుజ్ రుణం ఎగ్గొట్టాడంటూ దు్రష్పచారం మొదలు పెట్టారు. తద్వారా అనుజ్కు పరువుపోయినట్టయింది. ఇది అనుజ్ ఒక్కడి సమస్యే అనుకుంటే పొరపాటు. ఏటా లక్షలాది మంది ఇలా రుణ రికవరీ ఏజెంట్ల వేధింపులకు గురవుతున్నవారే. వీటిని భరించలేక బలవన్మరణానికి పాల్పడిన వారూ ఉన్నారు. రుణ గ్రహీతలకూ కొన్ని హక్కులు ఉన్న విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. రుణం చెల్లించకపోతే వసూలు చేసుకునే విషయంలోనూ బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు/వాటి ఏజెంట్లకూ నిర్దేశిత నిబంధనలు, పరిమితులు ఉన్నాయి. వాటిని హద్దుమీరి వ్యవహరిస్తుంటే సహించక్కర్లేదు. అనుచిత చర్యల నుంచి రక్షణ కోరడమే కాదు, ఉపశమనం పొందొచ్చు. ఈ విషయమై సమాచారం అందించే కథనమే ఇది. గతంతో పోల్చితే నేడు రుణాలు ఎంతో సులభంగా లభిస్తున్నాయి. దీంతో రుణ ఎగవేతలు కూడా పెరిగాయి. సూక్ష్మ రుణాలు, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు రుణాల్లో ఇటీవలి కాలంలో చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. కొన్ని వర్గాల రుణ గ్రహీతలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల ప్రభావం బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల రుణ వసూళ్లపై ప్రభావం చూపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలల పాటు వసూలు కాకుండా ఉండిపోయిన రుణాలను మొదట బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు తమ రుణ రికవరీ బృందాలకు అప్పగిస్తాయి. లేదా రుణ రికవరీ ఏజెన్సీలకు అప్పగిస్తుంటాయి. ఫలితం లేకపోతే అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు (ఏఆర్సీలు) విక్రయిస్తాయి. రుణ రికవరీ ఏజెన్సీలు రుణం వసూలు చేసినందుకు ఇంత చొప్పున తీసుకుంటాయి. ఏఆర్సీలు అయితే మొండి బాకీలను తక్కువ రేటుకు కొనుగోలు చేసుకుని, వాటిని వసూలు చేసుకునేందుకు చర్యలు మొదలు పెడతాయి. ఇక్కడ ఎక్కువ సందర్భాల్లో కనిపించేది.. రుణం తీసుకున్న వారిని నయానో, భయానో నానా రకాలుగా వెంటపడి, వేధించి వసూలు చేసుకోవడమే ఏజెంట్ల పని. స్పష్టమైన నిబంధనలు రుణ వసూళ్లకు రుణదాతలు కఠిన చర్యలకు పాల్పడుతున్న విషయం ఆర్బీఐ దృష్టికి రావడంతో.. రుణ రికవరీ ఏజెంట్ల నియంత్రణ విషయమై, వారి నడవడికపై లోగడే సమగ్రమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ తర్వాత పలు విడతలుగా వాటిని మెరుగుపరుస్తూ నోటిఫికేషన్లను జారీ చేసింది. రుణ గ్రహీతలకు ఉన్న హక్కులను గౌరవిస్తూనే, నైతిక విధానాల్లో వసూలుకు నిబంధనలు అమల్లో పెట్టింది. వీటి ప్రకారం.. రుణాన్ని పారదర్శకమైన విధానాల్లోనే వసూలు చేసుకోవాలి. మాటలతో లేదా చేతలతో వేధింపులకు దిగకూడదు. రుణానికి సంబంధించి, రుణ గ్రహీతకు సంబంధించి గోప్యత, గౌరవాన్ని కాపాడాలి. వారి పరువు నష్టానికి భంగం కలిగించకూడదు. బెదిరించకూడదు. రుణం చెల్లించలేదంటూ నోటీసు జారీ చేసి చట్టబద్ధమైన మార్గాల్లోనే వసూలుకు చర్యలు తీసుకోవాలి. అంతేకాదు రుణ గ్రహీతకు కాల్స్ చేయడం కూడా ఉదయం 8 గంటల తర్వాత, రాత్రి 7గంటల్లోపేనని నిబంధలు చెబుతున్నాయి. రుణం చెల్లింపులు ఆగిపోయిన అన్ని కేసుల్లోనూ ఉద్దేశపూర్వకమని చెప్పలేం. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవడం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు ఎదురుకావడం వంటివి చోటు చేసుకోవచ్చు. కనుక చెల్లింపులు చేయని రుణ గ్రహీతలు అందరినీ ఒకే గాటన కట్టడాన్ని సమర్థించలేం. గుర్తింపును ధ్రువీకరించుకోవాలి..నేడు సైబర్ మోసాలు పెరిగిపోయాయి. తమకు వస్తున్న కాల్స్ అన్నీ రుణం వసూలు కోసమని భావించడానికి లేదు. అందులో సైబర్ మోసగాళ్ల కాల్స్ కూడా ఉండొచ్చు. అందుకని రుణం విషయమై వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అవతలి వ్యక్తి బ్యాంక్ అదీకృత ఉద్యోగియేనా? లేదంటే సంబంధిత వ్యక్తికి బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ ధ్రువీకరణ ఉందా? అన్నది నిర్ధారించుకోవాలి. వారి గుర్తింపు కార్డ్ను చూపించాలని కోరాలి. ఆ ఐడీ కార్డ్ మీరు రుణం తీసుకున్న బ్యాంక్ లే దా ఎన్బీఎఫ్సీ జారీ చేసిందేనా? అని పరిశీలించాలి. సరైనదని భావిస్తేనే వారితో వివరాలు పంచుకోవచ్చు. లేదంటే నేరుగా బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ సిబ్బందితోనే డీల్ చేసుకుంటామని తెగేసి చెప్పేయాలి.నిబంధనలు పాటించాల్సిందే.. ఆర్బీఐ నియంత్రణలోని బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లు, కోపరేటివ్ బ్యాంక్లు అన్నీ కూడా ఆర్బీఐ ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాల్సిందే. ఈ విషయంలో ఏజెంట్లకు సరైన శిక్షణ ఇవ్వాలని, వారి ప్రవర్తనకు బ్యాంక్లే బాధ్యత వహించాలని ఆర్బీఐ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. బ్యాంక్లు తమ వెబ్సైట్లలో రికవరీ ఏజెన్సీల వివరాలను వెల్లడించాలి. ఫలానా రికవరీ ఏజెంట్ లేదా ఏజెన్సీకి రుణ వసూలు బాధ్యత అప్పగించామని రుణగ్రహీతకు బ్యాంక్ ముందస్తు సమాచారం ఇవ్వాలి. బ్యాంక్ అదీకృత లేఖ, బ్యాంక్ నోటీసును ఏజెంట్లు చూపించాలి. ఒకవేళ ఏజెంట్ల నుంచి అనుచిత, అనైతక తీరును ఎదురైతే అప్పుడు రుణ గ్రహీతలు తమ హక్కులను కాపాడుకునేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కాల్స్ చేసి వేధించినట్టయితే కాల్ రికార్డులను భద్రపరుచుకోవాలి. ఈ మెయిల్స్, ఎస్ఎంఎస్ల రూపంలో వేధిస్తే వాటిని సైతం జాగ్రత్త పరుచుకోవాలి. ఇంటికొచ్చి వేధిస్తుంటే వీడియో తీసి సేవ్ చేసుకోవాలి. ముందుగా సంబంధిత బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలి. స్పందన లేకపోతే అప్పుడు ఆర్బీఐని ఆశ్రయించొచ్చు.ఇలా చేస్తే నయం.. → ఆర్బీఐ రిజిస్టర్డ్ సంస్థల నుంచే రుణాలను తీసుకోవాలి. ఒకవేళ సమస్య ఎదురైతే పరిష్కరించుకోవడం సులభం. → రుణాన్ని సకాలంలో చెల్లించలేకపోవడానికి సహేతుక కారణాలను బ్యాంక్ సిబ్బందికి తెలియజేసి, తగిన సమయం కోరొచ్చు. రుణాన్ని తిరిగి చెల్లించే ప్రణాళికను సమరి్పంచొచ్చు. → రుణం తీసుకునే ముందు ఒప్పందం నిబంధనలను, తమ హక్కుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వేధింపులపై చర్యలు → రుణ రికవరీ ఏజెంట్ల వేధింపులు, బెదిరింపులకు సంబంధించి ఆధారాలను సేకరించాలి. వీటిని బ్యాంక్ లోన్ ఆఫీసర్ లేదా నోడల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లాలి. → స్పందన లేకపోతే, వేధింపులు ఆగకపోతే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి. → బ్యాంక్ సేవలపై కన్జ్యూమర్ కోర్టులో ఫిర్యాదు దాఖలును పరిశీలించొచ్చు. → వేధింపుల నుంచి ఉపశమనం కోసం స్థానిక కోర్టులో సివిల్ వ్యాజ్యం దాఖలు చేసి ఇంజంక్షన్ ఉత్తర్వులు పొందొచ్చు. → తమ ఆందోళనలను బ్యాంక్ పట్టించుకోకపోతే అప్పుడు ఆర్బీఐ అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేయొచ్చు. ప్రతీ ప్రాంతానికి ప్రత్యేక అంబుడ్స్మన్ ఉంటారు. వారి చిరునామా, కాంటాక్ట్ వివరాలను ఆర్బీఐ వెబ్సైట్ నుంచి పొందొచ్చు. → వేధింపులకు సంబంధించి ఆధారాలకు దొరకకుండా ఉండేందుకు రికవరీ ఏజెంట్లు గుర్తించడానికి వీల్లేని ఫోన్ నంబర్లు లేదా వాట్సాప్ ద్వారా సంప్రదింపులు చేసే అవకాశం లేకపోలేదు. అలా గుర్తించినట్టయితే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. → రికవరీ ఏజెంట్లు రుణ గ్రహీత కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితుల నంబర్లకు కాల్ చేసి బెదిరిస్తున్న ఘటనలు కూడా చూస్తున్నాం. ఇలా చేసినా లేదా పనిచేసే కార్యాలయం, నివాస సమీపంలో సమస్యలు సృష్టించినట్టయితే వారిపై పరువునష్టం కేసు దాఖలు చేయొచ్చు. → అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించినట్టయితే కోర్టులో కేసు వేయొచ్చు. → రుణ రికవరీ ఏజెంట్ల వేధింపులపై న్యాయ నిపుణులతో చర్చించి వారి సలహా మేరకు సరైన చర్యలు చేపట్టొచ్చు.ఆర్బీఐ కఠిన చర్య హెచ్డీఎఫ్సీ బ్యాంక్పై ఆర్బీఐ ఇటీవలే రూ.కోటి జరిమానా విధించింది. రికవరీ ఏజెంట్లకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలడంతో కఠినంగా వ్యవహరించింది. అది కూడా నిర్దేశించిన వేళల్లో (ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటలు) కాకుండా ఇతర సమయంలో కాల్స్ చేసి రుణ గ్రహీతలను వేధించినట్టు బయటపడింది. రుణ వసూళ్లలో పేరున్న సంస్థలు సైతం ఎలా వ్యవహరిస్తున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. కఠిన చట్టాలు...సూక్ష్మ రుణ గ్రహీతల కోసం కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే ఓ సంచలనాత్మక చట్టాన్ని తీసుకొచ్చింది. వేధింపులు, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు, శిక్షలకు ఇందులో చోటు కల్పించింది. రాష్ట్రంలో రుణ వసూళ్ల ఆగడాలు పెరిగిపోవడంతో ఇలాంటి చర్యకు దిగింది. సూక్ష్మ రుణ సంస్థల నుంచి రుణాలు తీసుకున్న వారి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఆర్బీఐ నిర్దేశించిన రుణ వసూలు నిబంధనలను ఉల్లంఘించే రుణ రికవరీ ఏజెంట్లు, ఫైనాన్స్ కంపెనీ యజమానులపై సుమోటో కేసులు నమోదు చేసేందుకు, హెల్ప్లైన్ ఏర్పాటుకు ప్రతి జిల్లా స్థాయిలో చర్యలకు ప్రభుత్వం ఆదేశించడం గమనార్హం. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
యూఎస్ ప్లస్ నినాదంతో ముందుకు!
భారత్ నుంచి గత ఏడాది 87.4 బిలియన్ డాలర్ల విలువైన వస్తు, సేవలు అమెరికాకు ఎగుమతి అయ్యాయి. అయితే, ఈ కాలంలో అమెరికా నుంచి భారత్కు అయిన దిగుమతులు 41.8 బిలియన్ డాలర్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే అగ్రరాజ్యంతో వ్యాపారంలో మనదే పైచేయి అన్నమాట. యూఎస్లో పాగా వేసిన భారత్.. ప్రస్తుత మార్కెట్లలో మరింత చొచ్చుకుపోవడంతోపాటు కొత్త మార్కెట్లకు విస్తరించే సమయం ఆసన్నమైంది.అయితే ట్రంప్ ప్రతీకార సుంకాలు ప్రపంచ వాణిజ్యాన్ని ఒక కుదుపు కుదపడం.. అమెరికాలో ఆర్థిక మాంద్యం తప్పదన్న అంచనాల నేపథ్యంలో భారత్ ముందు సవాళ్లు లేకపోలేదు. ఈ సవాళ్లను అవకాశంగా మలుచుకోవాలని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనికోసం యూఎస్ ప్లస్ నినాదాన్ని అందిపుచ్చుకొని ప్రపంచ మార్కెట్కు నమ్మదగిన ఆకర్షణీయ, ఆర్థిక భాగస్వామిగా అవతరించాలని అంటున్నాయి. - సాక్షి, స్పెషల్ డెస్క్చూపు భారత్ వైపు.. రిస్క్ ను తగ్గించడానికి లేదా కొత్త మార్కెట్ల కోసం చూస్తున్న గ్లోబల్ కంపెనీలు సుంకం లేని లేదా తక్కువ సుంకం కలిగిన కేంద్రంగా భారత్లో ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. చైనా ఉత్పత్తులపై అధిక సుంకం కారణంగా భారత్కు అతిపెద్ద ప్రయోజనం చేకూరవచ్చని బోరా మల్టీకార్ప్ ఎండీ ప్రశాంత్ బోరా తెలిపారు. అలాగే, వియత్నాం, బంగ్లాదేశ్, ఇండోనేషియా వంటి దేశాలపై అమెరికా విధిస్తున్న పరస్పర సుంకాలు భారత ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తాయని అంటున్నారు. వచ్చే 2–3 ఏళ్లలో భారతీయ ఎగుమతిదార్లకు 50 బిలియన్ డాలర్లకుపైగా అదనపు వ్యాపార అవకాశాలు లభిస్తాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ అంచనా వేస్తోంది. విశ్వసనీయ భాగస్వామిగా.. భారత్ త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందనే వాస్తవాన్ని చాలా మంది విస్మరిస్తున్నారు. అపార దేశీయ వినియోగం, బలమైన స్వ దేశీ సరఫరా వ్యవస్థ దృష్ట్యా మన దేశం సా పేక్షంగా మంచి స్థానంలో ఉంది. ట్రంప్ సుంకాలు భారత్కు అపార అవకాశాలను తేవొచ్చు. పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉ న్న దేశాలకు అత్యంత విశ్వసనీయ ఆర్థిక భాగస్వామిగా మా రడానికి గల అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవడాని కి వేగంగా అనుసరించాల్సిన విధానాలను రూపొందించాలి. – ఆనంద్ మహీంద్రా, చైర్మన్, మహీంద్రా గ్రూప్ వ్యూహాత్మక స్థానంగా.. ప్రతీకార సుంకాల నేపథ్యంలో కంపెనీలు తమ దృష్టిని భారత్పైకి మళ్లించవచ్చు. భారీ, పెరుగుతున్న వినియోగదారుల కేంద్రంగా విదేశీ సంస్థలకు వ్యూహాత్మక స్థా నంగా మన దేశం మారొచ్చు. వివిధ దేశాలకు విస్తరించాలని చూస్తున్న కంపెనీలకు ఆకర్షణీయ ప్రత్యామ్నాయంగా భారత్ నిలుస్తుంది. ప్రపంచ ఎల్రక్టానిక్స్ తయారీదారులకు ప్రాధాన్యత గమ్యస్థానంగా మారే చాన్స్ ఉంది. ఏఐ, పునరుత్పాదక శక్తి వంటి విభాగాల్లో ఆవిష్కరణ, ఆర్అండ్డీ కేంద్రంగా అవతరించడానికి భారత్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. – డి.విద్యాసాగర్, ఎండీ, ఎస్ఈసీ ఇండస్ట్రీస్ప్రత్నామ్నాయం లేదు.. జనరిక్ డ్రగ్స్ విషయంలో భారత్కు ప్రత్నామ్నాయ దేశం లేదు. టారిఫ్లకు సంబంధించి అమెరికాతో బ లంగా చర్చించే స్థానంలో ఉన్నాం. యూఎస్ తన ఆర్థిక బలాన్ని ప్రద ర్శిస్తే.. జనరిక్స్లో యూఎస్కు అతిపెద్ద సరఫరాదారుగా మన స్థానాన్ని మనం ఉపయోగించుకోవాలి. అలాగే పూర్తిగా అమెరికా మార్కెట్పై ఆధారపడకుండా దీర్ఘకాలంలో కొత్త మార్కెట్లకు విస్తరించాలి. ఇందుకు యూఎస్ ప్లస్ విధానం సరైన పరిష్కారం. – రవి ఉదయ్ భాస్కర్మాజీ డైరెక్టర్ జనరల్, ఫార్మెక్సిల్ కొత్త మార్కెట్లకు విస్తరించాలి.. ఇప్పటివరకు వివిధ దేశాలు చైనాపై ఆధారపడకూడదని చైనా ప్లస్ నినాదం అందుకున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎగుమతుల విషయంలో యూఎస్ ప్లస్ నినాదంతో ముందుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. 2024లో భారత్ నుంచి ఎగుమతులు 5.58 శాతం ఎగిసి 814 బిలియన్ డాలర్లకు చేరుకోగా.. ఇందులో యూఎస్ వాటా 10.74 శాతం మాత్రమే. అంటే సింహభాగం ఎగుమతులు ఇతర దేశాలకు జరుగుతున్నాయన్న మాట. ఎగుమతుల పరంగా యూఎస్పై ఆధారపడటం తగ్గించి కొత్త మార్కెట్లకు విస్తరించాలని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. అలాగే ప్రపంచ మార్కెట్లు అంత మెరుగ్గాలేవని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునే పనిలో దేశాలు నిమగ్నమవుతాయి. నాణ్యమైన వస్తువులు తక్కువ ధరకు లభించే మార్కెట్వైపు దృష్టిసారిస్తాయి. ఈ పరిస్థితిని భారత్ అవకాశంగా మలుచుకోవాలి. దీర్ఘకాలంలో భారత్ తన ఉత్పాదకతను మెరుగుపరచాలి. డిమాండ్ పెంచేందుకు తయారీ ఖర్చులను తగ్గించాలి. భారత్లో ఉత్పత్తులు ఖరీదు ఎక్కువన్న భావన తొలగేలా చేయాలి. దీనికోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాన్ని బలోపేతం చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం సూచించింది.2024లో భారత్ –అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ: 129.2 బిలియన్ డాలర్లుభారత్ నుంచి యూఎస్కు ఎగుమతులు: 87.4 బిలియన్ డాలర్లు. వృద్ధి 4.5 శాతం యూఎస్ నుంచి భారత్కు దిగుమతులు: 41.8 బిలియన్ డాలర్లు. వృద్ధి 3.4 శాతం వాణిజ్య లోటు: 45.7 బిలియన్ డాలర్లు. వృద్ధి 5.4 శాతం 2005తో పోలిస్తే ప్రపంచ ఎగుమతుల్లో భారత్ వాటా 2023 నాటికి రెండింతలై 2.4 శాతానికి చేరిక -
హెల్దీ పునాదితో భవిష్యత్తు బంగారం
సాక్షి, స్పెషల్ డెస్క్: దేశ పురోగమనానికి సూచనగా మన దేశవాసుల ఆరోగ్య పరిస్థితులూ క్రమంగా మెరుగుపడుతున్నాయి. 2024 లెక్కల ప్రకారం ఒక వ్యక్తి సగటు ఆయుఃప్రమాణం 70.62 ఏళ్లు. 2023తో పోలిస్తే ఇది 0.29 శాతం ఎక్కువ. ఒక అంచనా ప్రకారం 2030 నాటికి మహిళల ఆయుఃప్రమాణం 75.7 ఏళ్లకూ, పురుషులు 72 ఏళ్లకూ.. అదే 2050 నాటికి మహిళల ఆయుఃప్రమాణం 79.8 ఏళ్లకూ, పురుషులు 76.2 ఏళ్లకు చేరుతుందని అంచనా. అయినా ప్రపంచ సగటు 73.7 ఏళ్లతో పోలిస్తే ప్రస్తుత భారత్లోని వ్యక్తుల ఆయుఃప్రమాణం తక్కువే. ఈ ఏడాది వరల్డ్ హెల్త్ డే థీమ్ ‘హెల్దీ బిగినింగ్స్.. హోప్ఫుల్ ఫ్యూచర్స్’.. అంటే ఓ చిన్నారి తాలూకు బాల్యం ఆరోగ్యంగా ఉంటే ఆ చిన్నారి భవిష్యత్తు సైతం ఆశాజనకంగా ఉంటుందనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వ్యాఖ్యానం. రేపటి మన పౌరుల భవిష్యత్తు మంచి ఆశారేఖలతో వెలగాలంటే.. చిన్నప్పట్నుంచి అంటే ‘బిగినింగ్స్’ ఆరోగ్యంగా ఉండటమెలాగో చూద్దాం. ఆరోగ్యం కోసం బ్యాలెన్స్డ్ ఆహారం ఎంత ముఖ్యమో వ్యాయామాలూ అంతే అవసరం. వీటిల్లో ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు, ఏరోబిక్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలు, కోర్ ఎక్సర్సైజెస్.. ఇవన్నీ చేస్తుండటం వల్ల బరువు పెరగకుండా ఉండటంతో పాటు ఫిట్గా, చురుగ్గా, ఆకర్షణీయంగా కనిపించవచ్చు.ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు.. వీటినే స్ట్రెచింగ్ వ్యాయామాలు అని చెప్పవచ్చు. కాళ్లు, చేతులు వేగంగా కదలడంతో కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. అసలు వ్యాయామానికి ముందుగా ఈ స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం అవసరం. స్ట్రెంగ్త్ ట్రైనింగ్.. ఎక్సర్సైజ్ రెజీమ్లో ఆసక్తి ఉండి, బరువులు ఎత్తుతూ చేసేవి. వీటిల్లో బరువులతో చేసే వాటితో పాటు పుషప్స్, పులప్స్, అబ్డామినల్ క్రంచెస్, లెగ్ స్క్వాట్స్ వంటివి ఉంటాయి. వ్యాయామం ప్రధానం ఏరోబిక్స్.. వీటినే కార్డియో వ్యాయామాలనీ, ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్లనీ అంటారు. వీటి వల్ల ఊపిరితిత్తుల నిండా ఆక్సిజన్, గుండె వేగం పెరుగుతాయి. దాంతో ప్రతి కణానికీ, కండరానికీ అందే ఆక్సిజన్, పోషకాలతో సామర్థ్యం పెంపొందుతుంది. చాలాసేపు పనిచేసినా అలసట రాదు. వేగంగా నడక, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్, వాటర్ ఏరోబిక్స్ ఇవన్నీ ఏరోబిక్స్ ప్రక్రియలే. పై వ్యాయామాలతో పాటు మానసిక ఆరోగ్యం కోసం యోగా చేస్తూ, మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి ధ్యానం (మెడిటేషన్) చేయాలి. ఎముకలకు అత్యంత అవసరమైన విటమిన్ డీ అందేలా సూర్యకాంతిలో నడవాలి. పొగ తాగడం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ రోజూ ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు కంటినిండా నిద్రపోవాలి. 0 నుంచి ఐదు నెలల వరకు.. చిన్నారుల ఆరోగ్య సంరక్షణ తమ తల్లి గర్భం నుంచే మెుదలైతే.. వాళ్ల ఆరోగ్య పునాదులూ పటిష్టంగా ఉంటాయి. కాబోయే తల్లి తన ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న మూడు నెలల ముందు నుంచే తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకుంటూ ఉండాలి. ఐరన్ టాబ్లెట్లు, ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే పుట్టబోయే చిన్నారి ఆరోగ్యంగా బాగుండటమే కాకుండా స్పైనా బైఫిడా వంటివి నివారితమవుతాయి. పిల్లలు పుట్టాక కనీసం ఆర్నెల్ల పాటు వారికి తల్లిపాలే తాగించాలి. ‘యూనివర్సల్ ఇమ్యూనైజేషన్’ కార్యక్రమంలో అన్నిరకాల టీకాలు, వ్యాక్సిన్లు ఇప్పించడం ద్వారా వాళ్లు సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండేలా చూడాలి. ఆర్నెల్ల తర్వాత ఘనాహారం పిల్లలను ఘనాహారం వైపు మళ్లించడాన్ని వీనింగ్ అంటారు. ఘనాహారం వైపునకు మళ్లించేందుకు మార్కెట్లోని ఖరీదైన ఆహారాలు కాకుండా ఇంట్లోనే లభ్యమయ్యే పదార్థాలతో పుష్టికరమైన ఆహారాన్ని అందించవచ్చు. ఆర్నెల్లప్పుడు బియ్యంతో మెత్తగా వండిన పదార్థాలు పెట్టొచ్చు. 6 నుంచి 8 నెలల వయసులో గుజ్జులా ఉడికించిన కూరగాయలు, ఆకుకూరలతో పాటు తాజా పండ్లు ఇవ్వాలి. 8 నుంచి 10 నెలల వయసులో మాంసాహారం తినేవారైతే గుజ్జుగా ఉడికించిన మాంసం, చికెన్, చేపలు, గుడ్డు పెట్టొచ్చు. శాకాహారులైతే తృణధాన్యాలు ఉడికించి ఇవ్వొచ్చు. 11–12 నెలల వయసులో కూరగాయల ముక్కలను ఉడికించి పెట్టొచ్చు. ఇలా అన్ని పోషకాలు ఉన్న ఆహారం వైపునకు మళ్లించాలి.ఇవి మాత్రం వద్దు చక్కెర ఎక్కువగా ఉండేకాఫీ, టీ, శీతల పానీయాలు, కోలా డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోకపోవడమే మంచిది. బేకరీ ఫుడ్స్, పిట్జా, బర్గర్ల వంటి ప్రాసెస్డ్ ఆహారాల్లో పోషకాలు తక్కువ. నూనెలు, వేపుళ్లు, చిప్స్, ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు వాడే మార్జరిన్లో ట్రాన్స్–ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. వీటికి దూరంగా ఉండాలి. ఏడాది నుంచి 12 ఏళ్ల వరకు.. ఏడాది నుంచి 12 ఏళ్ల వరకు పిల్లలు ఎదుగుతుంటారు కాబట్టి ఈ సమయంలో అన్ని రకాల పోషకాలు, విటమిన్లూ, మినరల్స్, మైక్రో న్యూట్రియెంట్స్... పుష్కలంగా ఉండే పదార్థాలు తినిపించాలి. ఇవన్నీ ఒకే భోజనంలో దొరకవు కాబట్టి.. రకరకాల ఆహార పదార్థాలు తినేలా చూడాలి. అంటే... వాళ్ల ఆహారంలో పొట్టుతో ఉండేæ గోధుమ, జొన్న, మెుక్కజొన్న, రాగులతో చేసిన పదార్థాలు ఇవ్వాలి. ఎముకల ఆరోగ్యం కోసం క్యాల్షియం అందేలా చూడాలి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తప్పనిసరిగా ఇవ్వాలి. పిల్లలకు ఇష్టం లేని ఆహారాలను వాళ్లు ఇష్టంగా తినేలా ఇవ్వాలి. ఉదాహరణకు పండ్లు తినకపోతే వాటిని ఫ్రూట్ సలాడ్స్గా, కస్టర్డ్తో కలిపి ఇవ్వవచ్చు. పాలు తాగకపోతే మిల్క్õÙక్గా ఇవ్వడం లేదా పాలతో తయారైన స్వీట్లు పెట్టడం చేయాలి. తల్లులు తమ పిల్లలకు వెన్న, నెయ్యి ఎక్కువగా పెడుతుంటారు. ఈ శాచ్యురేటెడ్ కొవ్వులు అంత మంచివి కాదు. అందుకే వాటిని రుచి కోసం చాలా పరిమితంగా తీసుకోవాలి. కౌమార యువత నుంచి మధ్య వయసు వచ్చే వరకు... 16 ఏళ్లు దాటాక.. యవ్వనంలో, ఆపైన కూడా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలే తీసుకుంటూ ఉండాలి. మన ప్రధాన ఆహారమైన బియ్యం విషయానికి వస్తే దంపుడు బియ్యం, కూరల్లో ముదురాకుపచ్చ రంగులో ఉండే గ్రీన్లీఫీ వెజిటబుల్స్ మంచివి. మాంసాహారంలో చేపలు మంచి ఆహారం. రెడ్ మీట్ కంటే కొవ్వు తక్కువగా ఉండే చికెన్ వంటివి తీసుకోవాలి. అరటి, నారింజ వంటి పండ్లలో విటమిన్లతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. పీచు ఎక్కువగా ఉండే జామ, బొప్పాయి, పుచ్చకాయతోపాటు డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి. వృద్ధాప్యం తొలి దశలో పరీక్షలు కీలకం ఇక వృద్ధాప్యపు తొలి దశ అయిన 60–68 ఏళ్ల మధ్య చాలా మందిలో డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు పరీక్షలతో వీటిని ముందస్తుగానే గుర్తించి సత్వర వైద్యం పొందాలి. 50–60 ఏళ్ల మధ్య మహిళల్లో హార్మోన్ మార్పులు, రుతుక్రమంలో మార్పులు, ఒక వయసు దాటాక రుతుక్రమం ఆగిపోయే మెనోపాజ్ వంటివి కనిపిస్తుంటాయి. ఈ దశలో తమ సమస్యలకు తగిన మందులతో పాటు 68 ఏళ్ల నుంచి 70 ఏళ్లు దాటాక ఏ టైమ్లో తీసుకోవాల్సిన వ్యాక్సిన్లను ఆ టైమ్లో (ఉదా: నిమోకోకల్ వ్యాక్సిన్) తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలతో పాటు డాక్టర్ల సూచనలు పాటిస్తుంటే అందరూ జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. –డాక్టర్ ఉషారాణి, సీనియర్ ఫిజీషియన్ -
టాలెంట్ను ట్రంప్ కూడా ఆపలేడు
ఇప్పుడు ఏటా 3.40 లక్షల మంది భారతీయ విద్యార్థులు వస్తున్నారు.వీళ్లల్లో ఐఐటీ, ఎన్ఐటీల్లో చదివేవాళ్లు చాలా తక్కువ. ఇండియాలో ఏ ఉద్యోగం రాని వాళ్లు, నాణ్యతలేని కాలేజీల్లో నైపుణ్యం లేకుండా ఇంజనీరింగ్ చేసినవాళ్లే వస్తున్నారు. ఇండియాలోనే ఉద్యోగం రానప్పుడు అమెరికాలో ఎలా వస్తుంది?అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. ఆ దేశంలోని విదేశీ ఉద్యోగులు, విద్యార్థులకు గడ్డుకాలం మొదలైందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరిమేస్తున్న ట్రంప్ యంత్రాంగం.. విదేశీ విద్యార్థులపై కఠిన ఆంక్షలు పెడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే వృత్తి నిపుణులకు అమెరికా ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుందని, నైపుణ్యం లేనివారు ఏ దేశంలోనూ ముందుకెళ్లలేరని చెబుతున్నారు అమెరికాలో 30 ఏళ్లుగా ప్రొఫెసర్గా పనిచేస్తున్న ప్రవాసాంధ్రుడు వెంకట్ ఇక్కుర్తి (Venkat Ikkurthy). నైపుణ్యం ఉన్న ఎవరినీ ట్రంప్ కాదుకదా.. ఎవ్వరూ అడ్డుకోలేరని, నైపుణ్యం లేనివారిని ఎవ్వరూ రక్షించలేరని చెబుతున్నారాయన. గుంటూరు జిల్లాకు చెందిన వెంకట్కు డేటా సైంటిస్టుగా, అమెరికన్ యూనివర్సిటీల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా 30 ఏళ్ల అనుభవం ఉంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక అమెరికాలో తాజా పరిస్థితి, భారత విద్యార్థుల స్థితిగతుపై ‘జూమ్ ఇన్’లో ‘సాక్షి’ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ట్రంప్ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ట్రంప్ కొత్తగా తీసుకున్న నిర్ణయాలేమీ లేవు. అమెరికన్ చట్టాలనే కఠినంగా అమలు చేస్తున్నారు. తన దేశానికి మేలు చేయాలన్నదే ఆయన ఆలోచన. టారిఫ్లు వేయడం సర్వ సాధారణ విషయమే. కాకపోతే దీన్ని ప్రతీకార చర్యగా భావిస్తున్నారు. భారత విద్యార్థులను అక్కడ వేధిస్తున్నారా? భారత్ నుంచి అమెరికాకు ఏటా 3.42 లక్షల మంది చదువుకోవడానికి వస్తున్నారు. ఇందులో సగం మంది తెలుగు విద్యార్థులే. భారత విద్యార్థులంతా తెలివైన వాళ్లే. కాకపోతే నిబంధనలు వదిలేస్తారు. ఇప్పుడదే సమస్యగా మారింది. నిజానికి అమెరికావాళ్లు భారత పౌరులను గౌరవిస్తారు. గోల్డెన్ హ్యాండ్స్ (Golden Hands) అంటారు. అలాంటి వాళ్లు విద్యార్థులను ఎందుకు వేధిస్తారు. యూనివర్సిటీల్లో పార్ట్టైం జాబ్ చేసే ఎవరినీ ఏమీ అనడం లేదు. అడ్డదారిలో మాల్స్, హోటల్స్, ఇళ్లల్లో పనిచేయడాన్ని అడ్డుకుంటున్నారు. అమెరికాకు వచ్చేది దీని కోసమా? అసలు సమస్య ఏంటి? 2016లో అమెరికాకు వచ్చిన భారతీయులు (Indians) 40 వేలకు మించి లేరు. వీళ్లతా ఐఐటీ, ఎన్ఐటీ, పేరున్న వర్సిటీల్లో చదివిన వాళ్లే. ఎంఎస్ పూర్తయిన తర్వాత వాళ్లల్లో సగం మందిని అమెరికా మంచి ఉద్యోగాలిచ్చి ఉంచేసుకుంది. ఇప్పుడు వీళ్లే అమెరికాకు గొప్ప ఆస్తి. నైపుణ్యం ఉన్న విద్యార్థులను అమెరికా ఎప్పుడూ వదులుకోదు. కానీ ఇప్పుడు ఏటా 3.40 లక్షల మంది భారతీయ విద్యార్థులు వస్తున్నారు. వీళ్లల్లో ఐఐటీ, ఎన్ఐటీల్లో చదివేవాళ్లు చాలా తక్కువ. ఇండియాలో ఏ ఉద్యోగం రాని వాళ్లు, నాణ్యతలేని కాలేజీల్లో నైపుణ్యం లేకుండా ఇంజనీరింగ్ చేసినవాళ్లే వస్తున్నారు. ఇండియాలోనే ఉద్యోగం రానప్పుడు అమెరికాలో ఎలా వస్తుంది? ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకే 295 జీఆర్ఈ స్కోర్ వస్తోంది. కానీ వీళ్లు 325 స్కోర్ తెచ్చుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యం? కన్సల్టెన్సీలు తప్పుడు మార్గంలో జీఆర్ఈ రాయిస్తున్నాయి. వీటిని అమెరికా అధికారులు గుర్తించలేరా? మెక్సికో లాంటి ప్రాంతాల నుంచి లేబర్ వీసాలపై వచ్చే నల్ల జాతీయుల ఉద్యోగాలు కూడా మనవాళ్లు చేస్తామని ముందుకొస్తున్నారు. కాల్పుల ఘటనలకు ఇవే ప్రధాన కారణాలవుతున్నాయి. అమెరికా విద్యలో నాణ్యత ఉందా? అమెరికాలో 25 వేల విశ్వవిద్యాలయాలున్నాయి. దాదాపు ఇవన్నీ ప్రైవేటువే. వీటిల్లో నాణ్యత ఉన్నవి కొన్నే. మిగతా వర్సిటీలు కన్సల్టెన్సీల ద్వారా విద్యార్థులను మభ్యపెట్టి చేర్చుకుంటున్నాయి. కొన్ని వర్సిటీలు ఫీజుల్లో 40 శాతం కన్సల్టెన్సీలకు ఇస్తున్నాయి. దీంతో కన్సల్టెన్సీలు విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నాయి. ఈ వర్సిటీలు విద్యార్థులు చదివినా చదవకపోయినా డిగ్రీలు ఇస్తున్నాయి. అమెరికాలో ఉండే ఒక వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్లు 26 చోట్ల వాడారు. దీన్ని అమెరికా అధికారులు ప్రశ్నించారు. తన బంధువు కోసం ఇచ్చిన డాక్యుమెంట్లను కన్సల్టెన్సీలు ఇలా దుర్వినియోగం చేశాయి. నాణ్యత లేని వర్సిటీల్లో నెలకు ఒక క్లాస్ జరుగుతోంది. మిగతా రోజుల్లో మనవాళ్లు చట్ట విరుద్ధంగా డబ్బుల కోసం పని చేస్తున్నారు. ఒక హోటల్లో గంటలకొద్దీ పనిచేసే విద్యార్థి ఎంఎస్ ఎలా చదువుతాడు? అతడికి నైపుణ్యం ఎందుకు ఉంటుంది? అమెరికాలో ఉద్యోగం ఎందుకు వస్తుంది? అమెరికన్లు పనిచేయరు.. భారతీయులను ట్రంప్ అడ్డుకుంటున్నారు.. ఎలా? నిజమే.. అమెరికన్లు రెస్టారెంట్లు, ఇళ్లలో పనిచేయరు. భారతీయులూ అలా చేయరనేది అమెరికన్ల నమ్మకం. అందుకే మెక్సికన్లకు ఈవీ–1 వీసా (అగ్రికల్చర్ లేబర్) ఇస్తారు. ఆ జాబితాలో భారత్ లేనేలేదు. అలాంటప్పుడు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయడం మంచిదేనా? కరోనా తర్వాత యాంత్రీకరణ పెరిగింది. దీంతో హోటళ్లు, పెట్రోల్ బంకులు సహా అన్నింటిలోనూ రోబోలు వస్తున్నాయి. ముందుముందు మనవాళ్లు పోటీపడే పార్ట్టైం ఉద్యోగాలు ఉండవు. ఇంకా చెప్పాలంటే స్కిల్ ఉద్యోగాలు కూడా కష్టమే. ఇప్పుడు ఉద్యోగాల మాటేమిటి? నైపుణ్యం ఉన్నవాళ్లను ఎవరూ అడ్డుకోలేరు. అది లేనివాళ్లను ఎవరూ రక్షించలేరు. 2016కు ముందు వచ్చిన భారతీయుల పిల్లలకు ఇక్కడ పౌరసత్వం వచ్చింది. వాళ్లిప్పుడు ఉద్యోగాల వేటలో ఉన్నారు. కొత్తగా ఇండియా నుంచి వచ్చే పిల్లలకు అమెరికన్లు పోటీనే కాదు. పౌరసత్వం పొందిన భారత సంతతికి చెందిన వాళ్లే పోటీ. కాబట్టి నైపుణ్యం లేకుండా, డబ్బు సంపాదనే ధ్యేయంగా అమెరికా వస్తే ఇబ్బంది పడతారు. అమెరికా (America) వచ్చే ముందు ఒక్కసారి మీ నైపుణ్యం ఏమిటో? దేనికి సరిపోతారో బేరీజు వేసుకోండి. నైపుణ్యం పెరగాలంటే ముందుగా భారత విద్యా విధానంలో మార్పులు తేవాలి. ఇది అభివృద్ధి చెందిన దేశాల అవసరాలు తీర్చేలా లేదు. ఇంటర్వ్యూ: వనం దుర్గాప్రసాద్ -
వినువీధిలో వింత వలయాలు
ఈ ఫొటోలోని వింత వలయాలను చూశారుగా! ఎస్ ఆకారంలో మొదలై క్రమంగా వలయాలుగా మారుతూ కొట్టొచ్చినట్టుగా కన్పించాయి. గత వారం యూరప్లో పలు ప్రాంతాల నుంచి ఆకాశ వీధిలో కనువిందు చేశాయి. జనమంతా వాటిని ఆసక్తిగా వీక్షించారు. ఇందులో వింతేమీ లేదని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘ఉపగ్రహ ప్రయోగాల సందర్భంగా ఇలాంటివి మామూలే. గత వారం యూరప్లో కన్పించిన ఆ వలయాలకు స్పేస్ ఎక్స్ తాలూకు ఫాల్కన్ 9 ఉపగ్రహ ప్రయోగమే కారణం’’ అని వారు వివరించారు. ‘‘అమెరికా సైనిక నిఘా ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన అనంతరం ఫాల్కన్ వాహకనౌక తాలూకు శకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించి సురక్షితంగా సముద్రంలో పడిపోయాయి. అంతరిక్షం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించే క్రమంలో వాహక నౌక తనలో మిగిలిపోయిన ఇంధనాన్ని భద్రతా కారణాల రీత్యా విడుదల చేసేస్తుంది. ఆ క్రమంలో అది ఒక్కసారిగా వలయాకృతిలో సుడులు తిరుగుతుంది. ఫాల్కన్ వాహకనౌక విషయంలోనూ అదే జరిగింది’’ అని నాసా సైంటిస్ట్ మెక్డొవెల్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీతారాముల కల్యాణము చూతము రారండి!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: శ్రీరామ నవమి రోజున ఆగమ శాస్త్ర పద్ధతిని అనుసరిస్తూ భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మిథిలా స్టేడియంలో నేడు సీతారాముల కల్యాణం జరగనుంది. ఆ వివాహ వేడుక వివరాలు.. భజంత్రీలు, కోలాటాలతో స్వాగతం..ఉదయం 9:30 గంటల తర్వాత శంఖు, చక్ర, ధనుర్బాణాలను ధరించి సీతమ్మతో కూడిన రాముడి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకీలో వెలుపలకు తీసుకొస్తారు. కల్యాణ వేదిక మీదకు వెళ్తున్న సీతారాములకు భజంత్రీలు, కోలాటం, సంప్రదాయ నృత్యాలతో భక్తజనం స్వాగతం పలుకుతారు. జై శ్రీరామ్ నినాదాల నడుమ మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి స్వామి, అమ్మవార్లు చేరుకుంటారు. మండప శుద్ధికల్యాణ మండపానికి చేరుకున్న సీతారాములు, లక్ష్మణుడిని అక్కడ వేంచేపు చేస్తారు. కల్యాణ వేడుకలకు ఎలాంటి విఘ్నాలు రాకుండా ముందుగా విశ్వక్సేన పూజ నిర్వహిస్తారు. పుణ్యాహవచన మంత్రాలతో కల్యాణ వేడుకలకు ఉపయోగించే స్థలం, వస్తువులు, ప్రాంగణం, వేడుకలో పాల్గొనే వారిని మంత్ర జలంతో శుద్ధి చేస్తారు.రాముడి ఎదురుగా సీతమ్మ..శ్రీయోద్వాహము నిర్వహించి అప్పటివరకు మండపంలోనే ఉన్న సీతమ్మను శ్రీరాముడికి ఎదురుగా కూర్చుండబెడతారు. శ్రీరాముడు సింహాసనంపై ఆసీనులు కాగా సీతమ్మ గజాసనంపై ఆసీనులవుతారు. సీతారాముల వంశగోత్రాల ప్రవరలు చెబుతారు.సీతారాములు ఎదురెదురుగా కూర్చున్న తర్వాత ద్వాదశ దర్భలతో తయారుచేసిన యోక్త్రంతో సీతమ్మకు యోక్త్రా బంధనం చేస్తారు. ఇలా చేయడం వల్ల గర్భస్థ దశలో కలిగే దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. మరోవైపు శ్రీరాముడు గృహస్థాశ్రమంలోకి వెళ్తున్నాడనే దానికి సూచనగా యజ్ఞోపవీతధారణ చేస్తారు. యజ్ఞోపవీతధారణ, యోక్త్రాబంధన కార్యక్రమాలు జరిగిన తర్వాత శ్రీరాముడి పాదప్రక్షాళనతో వరపూజ నిర్వహిస్తారు.అలంకరణలుకల్యాణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రాలను సీతారాములకు ధరింపజేస్తారు. అనంతరం రామదాసు చేయించిన చింతాకు పతకం సీతమ్మకు, పచ్చలహారం రామయ్యకు అలంకరిస్తారు. లక్ష్మణుడికి రామమాడను ధరింపజేస్తారు. సీతారాములకు తేనె, పెరుగు కలిపిన మధుపర్కంతో నివేదన చేస్తారురాష్ట్ర ప్రభుత్వం తరఫున, శృంగేరీ పీఠంలతో పాటు భక్తరామదాసు, తూము నర్సింహదాసు వంశస్తుల తరఫున వధూవరులకు పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది.కన్యాదానంవేదమంత్రాలను ఉచ్ఛరిస్తూ కన్యాదానం సందర్భంగా భూదానం, గోదానం చేస్తారు. అనంతరం మహాసంకల్పం, చూర్ణిక పఠనం గావిస్తారు. మంగళాష్టకాలు జపిస్తూ శ్రీరాముడికి సంబంధించి ఎనిమిది శ్లోకాలను, సీతమ్మకు సంబంధించి ఎనిమిది శ్లోకాలను పఠిస్తారు. ఈ మంగళాష్టకంలో వధూవరులకు సంబంధించిన ఏడు తరాల వివరాలను, ఘనతలను తెలియజేస్తారు. అభిజిత్ లగ్నంలో..చైత్రశుద్ధ నవమి నాడు అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి కల్యాణం నిర్వహించడం ఆచారంగా వస్తోంది, సాధారణంగా నవమి రోజున అభిజిత్ లగ్నం మధ్యాహ్నం 12 గంటలకు కాస్త అటుఇటుగా రావడం పరిపాటి. ముహూర్త లగ్నం రాగానే వధూవరులైన సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచుతారు. ఆ తర్వాత శ్రీరామదాసు చేయించిన మూడు తాళిబొట్లు ఉన్న మంగళసూత్రానికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం మూడు బొట్లు ఉన్న తాళిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కల్యాణ వేడుకలో కీలక ఘట్టం ముగుస్తుంది.భద్రాచల వీధుల్లో వధూవరుల ఊరేగింపు..తలంబ్రాల కార్యక్రమం ముగిసిన సీతారాములకు తర్వాత తాత్కాలిక నివేదన చేయిస్తారు. నివేదన అనంతరం సీతమ్మ చీరకు, రామయ్య పంచె/«ధోతితో కలుపుతూ బ్రహ్మముడి వేస్తారు. అనంతరం మంగళ హారతి అందిస్తారు. బ్రహ్మముడి అనంతరం కల్యాణం ముగించుకున్న సీతారాములను వేడుకగా పల్లకీలో భద్రాచల వీధుల్లో ఊరేగిస్తూ ఆలయంలోనికి తీసుకెళ్తారు. తలంబ్రాలు..ముత్యాలు కలిపిన, గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోస్తారు. సాధారణంగా తలంబ్రాలు పసుపురంగులో ఉంటాయి. కానీ భద్రాచల రామయ్య కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు గులాబీ రంగులో ఉంటాయి. ఇక్కడ తలంబ్రాల తయారీలో పసుపుతో పాటు గులాల్ను కూడా ఉపయోగించడం తానీషా కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది.సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకమ్ము!ఆలయ నిర్మాణం సహా సీతారాములకు ఆభరణాల తయారీమ్యూజియంలో కంచర్ల గోపన్న ఆభరణాలుభద్రాచలం: హస్నాబాద్ (పాల్వంచ) తహసీల్దార్గా పనిచేసిన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీసీతారాముల ఆలయం నిర్మించాడని తెలిసిందే. అయితే, ఆయన ఆలయాన్ని నిర్మించడమే కాకుండా.. సీతారామ లక్ష్మణులకు పలు ఆభరణాలను ఆ సమయంలోనే తయారు చేయించాడు. వీటిని ఆలయ ప్రాంగణంలోని మ్యూజియంలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ప్రధాన ఉత్సవాలైన ముక్కోటి, శ్రీరామనవమి రోజుల్లో ఈ ఆభరణాలను మూలవరులు, ఉత్సవ విగ్రహాలకు అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.భద్రశిల మహత్మ్యం భద్రగిరిపై శ్రీ సీతారామచంద్రస్వామి వారి కరుణా కటాక్షాల కోసం భద్ర మహర్షి కఠోర తపస్సు చేశాడు. రామాలయం ప్రాంగణంలో గర్భగుడి వెనుక ఇప్పటికీ భద్రుని శిల.. చరిత్రకు నిదర్శనంగా దర్శనమిస్తోంది. ఆ మహర్షి కఠోర తపస్సుకు సంతుష్టుడైన శ్రీరామన్నారాయణుడు.. శంఖుచక్రాలతో సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడి అవతారంలో సాక్షాత్కరించిన తపో భూమి భద్రాచలమని భక్తులు భావిస్తారు. ఇంతటి చారిత్రక నేపథ్యం గల ఈ శిలను తాకేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తారు. భద్రుడికి గుడి కట్టించి పూజలు సైతం నిర్వహిస్తున్నారు. అందుకే ఈ క్షేత్రం తొలుత భద్రగిరి, అనంతరం భద్రాచలంగా ప్రఖ్యాతి గాంచింది. అదరహో... శిల్పకళా నైపుణ్యంజగదభిరాముడికి భద్రాచలంలో జరిగే కల్యాణం ఎంతో ప్రత్యేకమైంది. ఈ కల్యాణం నిర్వహించే మండపం మొత్తాన్ని శిలతోనే నిర్మించారు. దీనిపై రామాయణ ఇతివృత్తాలకు చెందిన అనేక అపురూప శిల్పాలను చెక్కారు. ఈ శిల్పాలను నాటి మద్రాస్, ప్రస్తుత చెన్నైకి చెందిన గణపతి స్థపతి నేతృత్వంలో చెక్కారు. శ్రీరామనవమి రోజు ప్రత్యేకంగా అలంకరించి కల్యాణాన్ని ఇదే వేదికపై జరుపుతారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణాన్ని.. మొదట్లో ఆలయంలోని పొగడ చెట్టు ముందున్న రామకోటి స్తూపం వద్ద నిర్వహించేవారు. ఆ తర్వాత చిత్రకూట మండపంలో వేదిక నిర్మించి కల్యాణం జరిపేవారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరగడంతో.. రామాలయానికి సమీపంలో 1960 మే 30న ప్రస్తుత కల్యాణ మండపానికి అప్పటి దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కల్లూరి చంద్రమౌళితో శంకుస్థాపన జరిగింది. దీన్ని 1964 ఏప్రిల్ 6న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డితో ప్రారంభించి.. అదే రోజు స్వామివారి కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. ఆ తర్వాత మహాసామ్రాజ్య పట్టాభిషేకం సందర్భంలో.. 1988లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కల్యాణ మండపం ప్రాంగణంలో.. స్టేడియం మాదిరిగా గ్యాలరీలు ఏర్పాటు చేసి మిథిలా స్టేడియంగా నామకరణం చేశారు. ఈ స్టేడియంలో ప్రస్తుతం 35 వేలమంది భక్తులు కూర్చుని స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం ఉంది.సుదర్శన చక్ర దర్శనం.. సర్వ పాపహరణంభద్రగిరిపై కొలువుదీరిన మూలమూర్తులకు ఎంతటి ప్రత్యేకత ఉందో.. ప్రధాన ఆలయంపైనున్న గోపురంపై సుదర్శన చక్రానికీ అంతే ప్రత్యేకత ఉంటుంది. భక్త రామదాసు రామాలయాన్ని ప్రత్యేక రాతి శిల్పాలతో నిర్మించాక.. ఆలయ శిఖరంపై విమాన ప్రతిష్ట కోసం సుదర్శన చక్రం తయారు చేయించాలని నిర్ణయించారు. ఇలా సుదర్శన చక్రాన్ని ఎంతమందితో తయారు చేయించినప్పటికీ అది భిన్నం (ముక్కలు) అయిపోయేదట. భక్త రామదాసు చివరకు రామయ్య తండ్రిని ప్రార్థించగా.. స్వామివారు స్వప్నంలో కనిపించి మానవుడు నిర్మించిన ఏదీ ఇందుకు పనికిరాదని, గోదావరి నదిలో సుదర్శన చక్రం ఆవిర్భవించి ఉందని చెప్పినట్లు పురాణం చెబుతోంది. దీంతో నాలుగు వందల మంది గోదావరి నదిలో దానికోసం వెతికినా.. కనిపించలేదు. రామదాసు భక్తి శ్రద్ధలతో సీతారామచంద్రస్వామి వారిపై కీర్తనలు ఆలపించగా.. సుదర్శన చక్రం గోదావరి నదిలో దొరికిందట. ఇలా గోదావరి నదిలో దొరికిన సుదర్శన చక్రాన్ని ఆలయ గర్భగుడిపై భక్త రామదాసు ప్రతిష్టించారు.రాములోరి మొదటి కల్యాణం గర్భగుడిలోనే..నేడు తెల్లవారుజామున రెండు గంటలకే పూజలు మొదలుభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో సాధారణ రోజుల్లో తెల్లవారుజామున నాలుగు గంటల తర్వాత సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పుతారు. ఆ తర్వాత తిరువారాధన, మంగళాశాసనం, అభిషేకం తదితర పూజలు నిర్వహిస్తారు. కానీ శ్రీరామనవమిని పురస్కరించుకుని గర్భగుడిలో ఉన్న సీతారాములను రాత్రి రెండు గంటల సమయంలోనే మేల్కొల్పుతారు. ఆ తర్వాత నిత్యం నిర్వహించే పూజా కార్యక్రమాలు చేపడతారు. అనంతరం ఉదయం ఎనిమిది గంటల సమయంలో భద్రాచలం ఆలయం గర్భగుడిలో ఉన్న మూల విరాట్లకు శాస్త్రోక్తంగా లఘు కల్యాణం జరుపుతారు. 40 నిమిషాల వ్యవధిలోనే ఈ తంతును ముగిస్తారు.ఆ రోజుల్లో పొగడ చెట్టు నీడలో..శ్రీరామదాసు కాలంలో భద్రాచలం ఆలయ ప్రాంగణంలో ఉన్న పొగడ చెట్టు నీడలో సీతారాముల కల్యాణం నిర్వహించేవారు. ఆ తర్వాత భక్తుల సంఖ్య పెరగడంతో పొగడ చెట్టు నుంచి బేడా మండపంలోకి పెళ్లి వేదికను మార్చారు. గోదావరిపై వంతెన నిర్మాణం పూర్తయ్యాక భద్రాచలం వచ్చే భక్తుల సంఖ్య వేలల్లోకి చేరుకుంది. బేడా మండపంలో అంతమంది వీక్షించే పరిస్థితి లేకపోవడంతో ఆలయ ప్రాంగణం నుంచి బయట కల్యాణం జరిపించాలని నిర్ణయించారు. దీంతో ఉత్తర ద్వారానికి ఎదురుగా నవమి కల్యాణం కోసం ప్రత్యేకంగా మండపాన్ని 1964లో నిర్మించారు. సుమారు రెండు దశాబ్దాలపాటు ఎత్తైన కల్యాణ మండపంలో పెళ్లి తంతు జరుగుతుండగా చుట్టూరా భక్తులు చేరి చూసేవారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1988లో కల్యాణ మండపం చుట్టూ భక్తులు కూర్చుని చూసేందుకు వీలుగా మిథిలా స్టేడియాన్ని నిర్మించారు.పెళ్లి పెద్దలుగా..శ్రీరామదాసు కాలం నుంచి భద్రాచలంలో నిత్య పూజలు, శ్రీరామనవమి, పట్టాభిషేకం తదితర వేడుకలు నిర్వహించేందుకు తమిళనాడులోని శ్రీరంగానికి చెందిన వేద పండితులను భద్రాచలం తీసుకువచ్చారు. ఇలా తీసుకువచ్చిన వారిలో కోటి, అమరవాది, పొడిచేటి, గొట్టుపుళ్ల, తూరుబోటి ఇంటిపేర్లు గల కుటుంబాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఆ కుటుంబాలే వంశపారంపర్యంగా, వంతుల వారీగా నవమి వేడుకల బాధ్యతలను నిర్వర్తిస్తున్నాయి. శ్రీరామ నవమికి మిథిలా స్టేడియంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలలో కీలక పాత్ర పోషించేది ఆచార్య. ఇతని చేతుల మీదుగానే కల్యాణం మొత్తం జరుగుతుంది. ఆయనకు సూచనలను అందించే వ్యక్తిని బ్రహ్మగా పేర్కొంటారు. వీరిద్దరికి సహాయకులుగా ఇద్దరు చొప్పున నలుగురు రుత్వికులు ఉంటారు. పూజా సామగ్రి అందించేందుకు నలుగురు పరిచారకులు ఉంటారు. ప్రస్తుతం ఆలయంలో ప్రధాన అర్చకులైన ఇద్దరు వీరందరికీ అధర్వులుగా వ్యవహరిస్తారు. మొత్తంగా 12 మంది సీతారాముల పెళ్లి వేడుకలో కీలకంగా వ్యవహరిస్తారు. వీరందరిని ఉత్సవాలలో భాగస్వామ్యం చేస్తూ కల్యాణ తంతు శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా జరిగేలా స్థానాచార్యులు స్థలశాయి పెద్దన్న పాత్రను నిర్వర్తిస్తారు. -
దక్షిణ అయోధ్యలో ‘పంచారామ క్షేత్రాలు’
భద్రాచలం: దేశంలో దక్షిణ అయోధ్యగా విరాజిల్లు తున్న భద్రాచలం.. భద్రుని తపో ఫలంతో ఆవిర్భా వమైన పుణ్యక్షేత్రం. భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్న పంచారామ క్షేత్రాల వివరాలు..వైకుంఠ రాముడు (భద్రాచలం)పంచారామ క్షేత్రాలలో మొదటిది భద్రాచలంలో ఉన్న సీతారామచంద్రస్వామి దేవస్థానం. దక్షిణ అ యోధ్యగా పిలుచుకునే ఈ క్షేత్రంలోని శ్రీరాముడిని భోగరాముడుగానూ పిలుస్తారు. చతుర్భుజాలతో శ్రీరాముడు దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం ఇది. భక్తరామదాసుగా పేరు తెచ్చుకున్న కంచర్ల గోపన్న ఈ ఆలయాన్ని నిర్మించడంతో పాటు పూజాధికాలను ఏర్పాటు చేశారు. నేటికీ ఈ క్షేత్రంలో ఇంచుమించుగా అవే పూజలు కొనసాగుతున్నాయి.శోకవిరాముడు (పర్ణశాల)తులసీదాసు రచించిన రామచరిత మానస్లో సీతారాములు వనవాసం (11మాసాల 10 రోజులు) చేసిన ప్రదేశాన్ని పర్ణశాలగా పేర్కొంటారు. ఇక్కడ పంచవటి కుటీరం, సీతమ్మను అపహరించిన ప్రాంతం, మాయలేడి పాదముద్రలు, శూర్పణఖ దాగి.. వేషాన్ని మార్చుకున్న చుప్పనాతి చెట్టు గల ప్రాంతం, సీతమ్మ పసుపు కుంకుమలుగా వాడుకున్న పసుపురాళ్లు. కుంకుమరాళ్లు, నారచీరలు ఆరవేసుకున్న చారబండలు, సీతారాములు ఆడుకున్న వామనగుంటలు, కందమూలాలను ఆరగించిన రాతి కంచాలు, సీతమ్మ ప్రత్యేక దినములలో స్నానం చేసిన పద్మసరస్సు (సీత వాగు) ఆమెకు రక్షణగా శ్రీరాముడు కూర్చున్న రాతి సింహాసనం వంటి గుర్తులు కనిపిస్తాయి. సీతాపహరణం తర్వాత శ్రీరాముడు శోకించిన ప్రాంతం కావడంతో ఇక్కడున్న రాముడిని శోకవిరాముడిగా పేర్కొంటారు.ఆత్మారాముడు (దుమ్ముగూడెం)ముక్కు, చెవులు కోసిన తర్వాత తన అన్నదమ్ము లైన ఖర–దూషణ, త్రిశిర తదితర 14 వేలమంది రాక్షసులతో శూర్పణఖ మొరపెట్టుకుంది. దీంతో వారంతా రాముడిపైకి యుద్ధానికి వచ్చారు. ఈ యుద్ధంలో వారంతా రాముడి చేతిలో అంతమయ్యారు. 14 వేలమందితో రాముడొక్కడే యుద్ధం చేస్తున్నా... రాక్షసులకు ఒక్కొక్కరితో ఒక్కో రాముడు తలపడినట్లుగా యుద్ధం సాగిందని, రాముడొక్కడే అంతమందిగా అత్మస్వరూపంతో యుద్ధం చేసినందున ఇక్కడి రాముడిని ఆత్మారాముడని అంటారు. ఇక్కడే రాక్షసులకు రాముడికి దొమ్మి(యుద్ధం) జరిగిన ప్రాంతం కావడం వల్ల దొమ్మిగూడెం గాను, క్రమేణా దుమ్ముగూడెం గానూ మారినట్లు స్థానిక చరిత్ర చెబుతోంది. యోగరాముడు (శ్రీరామగిరి క్షేత్రం)ఇది గోదావరి, శబరి నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రాంతం. నిండుగా ప్రవహించే గోదావరి నదీతీరాన ఎత్తయిన కొండపై నెలకొన్న క్షేత్రానికి శ్రీరామగిరి అని పేరు. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాంతం ఏపీలోకి వెళ్లింది. ఈ కొండపై శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై చాతుర్మాస్యవ్రతాన్ని ఆచరించాడని స్థలపురాణం. పర్ణశాలలో సీతాపహరణం తర్వాత శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తూ వనక్షేత్రం చేరి, సేదతీరి మళ్లీ సీతమ్మను వెదుకుతూ ఈప్రాంతానికి చేరుకున్నారు. ఇది అప్పుడు మాతంగముని ఆశ్రమ ప్రాంతం. ఇక్కడే శబరిని కలసి ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆ తల్లికి ముక్తిని ప్రసాదించాడని పురాణ కథనం. ఈ విధంగా శ్రీరామాయణ కథకు సన్నిహిత సంబంధం గల పవిత్ర ప్రాంతమిది. ఈ ప్రాంతానికి సమీపంలో రేఖపల్లిలో (రెక్కపల్లి) (జటాయువు యొక్క రెండో రెక్క పడిపోయిన చోటు) జటాయువును చూశారు. రామలక్ష్మణులు జటాయువు ద్వారా సీత వృత్తాంతాన్ని తెలుసుకుని, మరణించిన జటాయువుకు శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు చేశారు. గోదావరి తీరంలో ఓ పెద్దశిలపై దానికి పిండ ప్రదానం చేసినట్లు స్థల చరిత్ర చెబుతోంది. ఈ కొండపై శ్రీరాముడు యోగం చేయడం వల్ల ఇక్కడి రాముడిని ఈ ప్రాంతవాసులు యోగరాముడుగా పిలుస్తారు. జటావల్కలధారిగా ఉండే ఈ స్వామికి సుందరరాముడు అని కూడాపేరు. ఎక్కడా లేనివిధంగా ఇక్కడ లక్ష్మణస్వామి అంజలి ఘటిస్తూ ఉంటాడు. తొలుత ఈ కొండపై రామలక్ష్మణుల విగ్రహాలు, ఆ తరువాత మాతంగి మహర్షి వంశీయ మహర్షులు సీతమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు స్థల చరిత్ర చెబుతోందివన రాముడు (దండకారణ్య భాగం) దండకారణ్య భాగం భద్రాచలం క్షేత్రానికి తూర్పు ఆగ్నేయ దిశలో శబరి నది దాటగానే ఉన్న వరరామచంద్రపురానికి (వీఆర్పురం) 23 కి.మీ. దూరంలో ఉంది (ప్రస్తుతం ఇది ఏపీలో ఉంది). ఇక్కడికి కాలిబాట తప్ప మరో మార్గం లేదు. సీతాపహరణం జరిగిన తర్వాత బాధలో ఉన్న శ్రీరాముడిని లక్ష్మణుడు ఓదార్చిన ప్రాంతమని భక్తుల విశ్వాసం. ఇక్కడి రాముడిని ఒక వృక్షరూపంలో ఆరాధిస్తారు. కొన్ని వందల ఏళ్లకు ముందు నుంచి ఇక్కడున్న రెండు భారీ టేకు, మద్ది చెట్లను ఆ ప్రాంత గిరిజనులు కొలుస్తున్నారు. అటవీశాఖ వారు కూడా చాలాకాలం క్రితమే వాటిని పురాతన వృక్షాలుగా గుర్తించి, ఆ రెండు చెట్లకు రామ, లక్ష్మణ వృక్షాలని పేరు పెట్టారు. ఆ రెండింటినీ దండకారణ్య వృక్షాల ప్రతినిధులుగా భావిస్తారు. ఆ ప్రాంతాన్ని వన రామక్షేత్రంగా సంబోధిస్తున్నారు. -
హ్యాండ్షేక్.. షాక్
మీరెప్పుడైనా నిలబడి సరదాగా అప్పటిదాకా మాట్లాడుతున్న వ్యక్తితో వీడ్కోలు చెప్పబోతూ కరచాలనం ఇస్తే చేతికి షాక్ కొట్టిందా?. ఎవరో కూర్చున్న కుర్చిని వెనక్కో ముందుకో లాగబోతూ పట్టుకుంటే టప్పున షాక్ కొట్టిందా?. గుండ్రంగా వెండిరంగులో మెరిసే డోర్నాబ్ను పట్టుకోగానే చిన్నపాటి షాక్కు గురయ్యారా?. ఈ కరెంట్ ఎక్కడి నుంచి వచ్చిందనే డౌట్ మీలో ఉండిపోతే అలాంటి సైన్స్ ప్రియుల కోసం పరిశోధకులు కొన్ని సమాధానాలను సిద్ధంచేశారు. చదివేద్దామా మరి !! ఉపరితలం చేసే మేజిక్కుప్రతి వస్తువులో కణాలకు విద్యుదావేశశక్తి దాగి ఉంటుంది. అయితే ఆయా వస్తువుల ఉపరితలాల ఎలక్ట్రిక్ స్థిరత్వం అనేది వాతావరణాన్ని తగ్గట్లు మారతుంది. అంటే గాలిలో తేమ పెరగడం, తగ్గడం, ఎండాకాలం, వర్షాకాలం వంటి సందర్భాల్లో వస్తువుల ఉపరితల ఎలక్టిక్ స్థిరత్వం దెబ్బతిని అసమతుల్యత ఏర్పడుతుంది. ఉదాహరణకు ఒక ప్లాస్టిక్ కుర్చిని తీసుకుంటే దాని ఉపరితల ఎలక్టిక్ ఛార్జ్ అనేది ఎండాకాలంలో ఒకలా, చలికాలంలో మరోలా ఉంటుంది. అదే సమయంలో పాలిస్టర్, ఉన్ని ఇలా విభిన్న వస్త్రంతో తయారైన దుస్తులు ధరించి మనిషి శరీర ఉపరితల ఎలక్ట్రిక్ చార్జ్ సైతం భిన్నంగా ఉంటుంది. చలికాలంలో వాతావరణం చల్లబడటంతో గాలిలో తేమ శాతం తగ్గుతుంది. చల్లటి గాలి అధిక తేమను పట్టి ఉంచలేదు. దీంతో చల్లటి గాలి తగిలిన ప్లాస్టిక్ కుర్చీ ఉపరితలంలో అసమాన ఎలక్ట్రిక్ చార్జ్ ఉంటుంది. దీనిని విభిన్న ఎలక్టిక్ ఛార్జ్ ఉన్న మనిషి హఠాత్తుగా పట్టుకుంటే సమస్థాయికి తీసుకొచ్చేందుకు అత్యంత స్వల్పస్థాయిలో విద్యుత్కణాలు అటుఇటుగా రెప్పపాటు కాలంలో ప్రయాణిస్తాయి. ఉపరితలంలో కదిలే ఆ విద్యుత్ కణాల ప్రవాహ స్పర్శ తగిలి మనం షాక్ కొట్టిన అనుభూతిని పొందుతాం. మనిషి, ఇంకో మనిషికి షేక్ హ్యాండ్ ఇచి్చనప్పుడు కూడా ఇదే భౌతిక శాస్త్ర దృగ్విషయం జరుగుతుంది. అందుకే కొందరు మనుషుల్ని పొరపాటున పట్టుకున్నా మనకు వెంటనే షాక్ కొడుతుంది. అంతసేపు ఒకరు కూర్చున్న ఛైర్ను పట్టుకున్నా షాక్ రావడానికి అసలు కారణం ఇదే. చలికాలంలోనే ఎక్కువ! మిగతా కాలంతో పోలిస్తే చలికాలంలో వాతావరణంలో గాలిలో తేమ మారుతుంది. ముఖ్యంగా మనం కొద్దిసేపు ఆరుబయట గడిపి లోపలికి రాగానే అంతసేపు పాలిస్టర్, నైలాన్ వంటి సింథటిక్ దుస్తుల ధరించిన మన శరీర ఉపరితల చార్జ్ అనేది ధనావేశంతో లేదా రుణావేశంతో ఉంటుంది. గదిలోకి వచ్చి వెంటనే అక్కడి మనుషుల్ని, ఛైర్, డోర్నాబ్ వంటి వాటిని పట్టుకుంటే అవి అప్పటికే వేరే గాలి వాతావరణంలో భిన్నమైన ఆవేశంతో ఉంటాయి కాబట్టి మనకు షాక్ కొట్టే అవకాశాలే ఎక్కువ. తేమలేని గాలిలో చలికాలంలో ఈ షాక్ ఘటనలు ఎక్కువగా, తేమ అధికంగా ఉండే ఎండాకాలంలో ఈ షాక్ ఘటనలు తక్కువగా చూస్తుంటాం. దీనిని మనం పట్టుకునే, తగిలి, ముట్టుకునే వస్తువుల ఉపరితల ధనావేశం, రుణావేశమే కారణం. దీనిని తప్పించుకోలేమా? ఈ తరహా పరిస్థితుల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. మన శరీర ఉపరితల అత్యంత సూక్ష్మస్థాయి విద్యుత్స్థాయిలు ఒకేలా ఉండేలా చర్మానికి లోషన్ లాంటివి రాసుకోవచ్చు. సింథటిక్ వస్త్రంతో చేసిన దుస్తులకు బదులు సహజసిద్ధ కాటన్ దుస్తులు ధరించడం మంచిది. నేల, గడ్డిపై నడిచేటప్పుడు స్టాటిక్ విద్యుత్కు గురికాకుండా ఉండాలంటే చెప్పులు, షూ లాంటివి ధరించకుండా చెప్పుల్లేకుండా నడవండి. ఇకపై మీరెప్పుడైనా ఇంట్లో సాధారణ పరిస్థితుల్లో ఇలాంటి షాక్కు గురైతే సరదాగా తీసుకోండి. అద్భుత, విచిత్ర సైన్స్కు మీరూ సాక్షీభూతంగా నిలిచామని సంబరపడండి. స్టాటిక్ షాక్ ప్రమాదమా? స్థిర విద్యుత్తో మని షికి దైనందిన జీవితంలో ఎలాంటి ప్రమాదంలేదు. సెకన్ వ్యవధిలో షాక్ అనుభూతి వచ్చి పోతుంది. కానీ మండే స్వభావమున్న వస్తువుల సమీపంలో, అత్యంత సున్నితమైన ఎల్రక్టానిక్ వస్తువుల వద్ద మనిషికి స్టాటిక్ విద్యుత్ ప్రాణహాని కల్గించే అవకాశాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా గ్యాస్ స్టేషన్లు, కంప్యూటర్ చిప్ తయారీ కర్మాగారాల్లో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ చాలా ప్రమాదకరం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అల.. ఏకశిలానగరిలో..
రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట రామాలయం టీటీడీలోకి విలీనమైంది. టీటీడీ ఏటా బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తోంది. ఈ ఏడు కూడా శనివారం నుంచి ఈ నెల 15 వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా నిర్వహించనున్నారు. తొలిరోజున అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. ఈనెల 11న రాములోరి కల్యాణం కన్నుల పండువగా చేయనున్నారు. ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈసందర్భంగాఒంటిమిట్ట రామయ్య క్షేత్రం ప్రత్యేక కళను సంతరించుకుంది. ఒంటిమిట్ట (రాజంపేట): ఒంటిమిట్టలోని కోదండరామాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. ఈ నెల 5వ తేదీ నుంచి 15 వరకు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో విశేష పూజలు చేపట్టనున్నారు. రోజుకొక అలంకారంలో రామయ్య భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ప్రధాన విశేషం.. సీతారామలక్ష్మణులు కొలువుదీరిన ఏ ఆలయంలో అయినా హనుమ కూడా దర్శనమిస్తారు. అయితే ఒంటిమిట్ట గుడిలో సీతారామలక్ష్మణులు మాత్రమే ఏకశిలపై దర్శనమిస్తారు. ఆంజనేయుడి విగ్రహం లేదు. అయితే ఆలయ తూర్పు గాలిగోపురానికి తూర్పుగా రథశాల పక్కనే సంజీవరాయుడుగా వెలసిన ఆంజనేయస్వామి గుడి నిర్మించారు. త్రేతాయుగంలో సీతారామలక్ష్మణ నివాసం.. త్రేతాయుగంలో సీతారామలక్ష్మణులు ఈ ప్రాంతంలో కొంతకాలం నివసించారని పురాణ కథనం. అప్పుడు సీతమ్మకు దప్పిక అయింది..రాముడు బాణం సంధించి భూమిలోకి వదిలాడు. నీరుపైకి ఎగజిమ్మింది. సీతమ్మ దప్పిక తీరింది. లక్ష్మణుడు అన్న అనుజ్ఞతో తాను ఒక బాణం వదిలాడు. నీరుపైకి వచ్చింది. ఆ నీటిబుగ్గలనే నేడు రామతీర్థం..లక్ష్మణతీర్థం అని పిలుస్తున్నామనే కథ పురాణాల ద్వారా తెలుస్తోంది. ధర్మ సంస్థాపన కోసం ఒంటిమిట్ట గుడి.. రాముడిక్కడ కోదండం ధరించి ఉన్నాడు. కోదండం ధర్మరక్షణకు ప్రతీక. అలనాడు శ్రీరామచంద్రుడు అడవుల్లో తిరుగుతూ నార వస్త్రాలు ధరించినా కోదండాన్ని విడువలేదు. అది ధర్మరక్షణ కోసమే. బుక్కరాయులు తర్వాత సిద్దవటం మట్లిరాజులు ఆలయాన్ని అత్యంత వైభవోపేతంగా తీర్చిదిద్దారు. అనంతరాజు, తిరుమలరాయలు, తిరువెంగళనాథరాజు, కుమార అనంతరాజులు ఒంటిమిట్ట కోవెలను తీర్చిదిద్దారు. ఉన్నతమైన ప్రాకారకుడ్యాలు సమున్నతమైనగోపుర శిఖరాలు రంగమంటపాల్లో అద్భుత శిల్పవిన్యాసాలు కనిపిస్తాయి. ఏకశిలానగరానికి ఎలా చేరుకోవాలంటే.. చెన్నై–ముంబాయి రైలుమార్గంలోని ఒంటిమిట్ట రైల్వేస్టేషన్లో దిగి ఒంటిమిట్ట(ఏకశిలానగరం)కు చేరుకోవచ్చు. కడప నుంచి రేణిగుంట తిరుపతికి వెళ్లే బస్సు మార్గంలో , కడప నుంచి 25కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట వస్తుంది. ఆలయ చరిత్ర.. విజయ నగర స్రామాజ్యంలో క్రీ.శ 1340లో ఉదయగిరి పాలకుడు కంపరాయలు ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించారు. ఆయన కొంతపరివారాన్ని వెంటబెట్టుకొని వచ్చాడు. ఈ అడవుల్లో ఇద్దరు బోయలు ఉండేవారు. వారే వంటడు, మిట్టడు. వీరు రాజుగారికి సేవలందించారు. ఈ సమయంలో సమీపంలో గుట్టమీద చిన్నపాటి గుడి ఉంది. జాంబవంతుడు నిలిపిన శిలలో సీతారామలక్ష్మణులని భావించి దండం పెట్టుకొంటున్నారని, అక్కడ గుడి కట్టి పుణ్యం కట్టుకోమన్నారు. సీతమ్మను వెతుకుతూ ఒకనాడు జాంబవంతుడు ఈ గుట్టమీద విశ్రమించాడని, ఆరాత్రి అక్కడే నిద్రించాడని ఉదయం తిరిగి వెళ్తూ ఆ శిలలో సీతారామలక్ష్మణులను భావించుకొని నమస్కరించుకొని వెళ్లాడట. వంటడు..మిట్టడు చెప్పిన మేరకు కంపరాయులు గుడి, చెరువు నిర్మించేందుకు అంగీకరించారు. ఆ బాధ్యత బోయలకే అప్పగించారు. కాగా.. ఒంటడు.. మిట్టడు.. ఆలయ నిర్మాణంలో భాగం అయ్యారు గనుకనే ఈ ఆలయానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందనే పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. ఏకశిలా నగరంగా.. ఒంటిమెట్ట మీద నిర్మించిన ఆలయం ఉన్న ప్రదేశం ఒంటిమిట్ట అయింది. ఒంటిమిట్ట గుడికి అనురూపంగానే ఏర్పడిన మరోపేరు ఏకశిల. ఒకేశిలలో సీతారామలక్ష్మణ విగ్రహాలు నిర్మితమై ఉన్నాయి. ఇది అరుదైన సంగతి. జాంబవంతుడు ముగ్గుర్ని ఒకే శిలలో భావించుకొన్నాడు. ఆ తర్వాత కాలంలో కంపరాయలు, బుక్కరాయలు అదే సంప్రదాయంతో ఏకశిలలో ముగ్గురు మూర్తులు ఉండేటట్లు నిర్మాణం చేయించారు. బహుశా ఒకే శిలలో ముమ్మూర్తులను నిలిపిన సంఘటన ఒంటిమిట్టలో మొదటిగా ఆవిష్కృతమైంది. అరుదుగా కొలవైన ఏకశిలావిగ్రహ ప్రాంతాన్ని ఏకశిల అని భక్తితో అన్నాడు పోతన. రాత్రిపూటే కల్యాణం.. ఒంటిమిట్ట స్వామివారి కల్యాణం రాత్రిపూట నిర్వహిస్తారు. చతుర్ధశినాటి రాత్రి వివాహమహోత్సవం, కళాపూర్ణుడైన చంద్రుడు సీతారామ కల్యాణాన్ని పరమానందంతో తిలకిస్తాడని పురాణకథ చెపుతోంది. కాగా రాత్రి కల్యాణం సంప్రదాయం ఇప్పటిదికాదు. అది ఒంటిమిట్ట ఆలయం ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇలాగే జరుగుతోంది. అన్ని రామాలయాలలో నవమిరోజున కల్యాణం నిర్వహిస్తారు. అది పగటిపూట. ఒక్క ఒంటిమిట్ట కోదండరామాలయంలోనే రాత్రి పూట రాములోరి కల్యాణం జరుగుతుంది. ఈ నెల11న రాత్రి 8–10 గంటలలోపు స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. రామయ్య సేవలో కవులుఒంటిమిట్ట కోదండరామాలయంలో వెలసిన రఘురాముడిని సేవిస్తూ కవులెందరో తరించారు. వారిలో అయ్యలరాజు తిప్పయ్య, బమ్మెర పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగొండూరు వెంకట కవి, వరకవి నల్లకాల్వ అయ్యప్ప, వాసుదాసు వావిలికొలను సుబ్బారావులు తమతమ స్థాయిలో కోదండరామునిపై సాహిత్యం, కీర్తనలు, రచనలుతోపాటు ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారు.ఆలయ నిర్మాణం ఇలా..విజయ నగర సామా్రజ్య చక్రవర్తి బుక్కరాయలు ఒంటిమిట్ట గుడిలో ఏకశిలా విగ్రహం నిలిపిన నాటికి గర్భాలయం, అంతరాళం, చిన్నగోపురం ఉండేవి. మొదటి దశ నిర్మాణమిది. మూడవ దశలో మహా మంటపం (రంగ మంటపం), మహా ప్రాకారం, తూర్పు, ఉత్తర , దక్షిణ గాలిగోపురాలు, మహా ప్రాకారం లోపల నైరుతి దిక్కున కళ్యాణ మంటపం, ఆగ్నేయ దిశలో పాకశాల, ప్రాకారంలోపల ఉత్తరం వైపు తూర్పున, పడమర ఎదుర్కోలు మంటపాలు, రామలింగదేవుని గుడి (1966)లో లింగాన్ని నిలిపారు. సంజీవరాయస్వామి, రథం, రథశాలను ఏర్పాటుచేశారు. అనంతరం అనంతరాజు గుడిని విస్తరించాడు. మహామంటపం, మహాప్రాకారం, గాలిగోపురాల నిర్మాణాలు చేపట్టారు. తెలుగురాష్ట్రాలలో ఒంటిమిట్ట గాలిగోపురాల తరహాలో మరెక్కడా కనిపించవు. ఈ ఆల యాన్ని దర్శించిన టావెర్నియర్ అనే యాత్రికుడు ఎత్తయిన గోపురాలు చూసి విస్మయం చెందాడు. రామయ్యకు బ్రహ్మోత్సవ శోభ ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలతో ఏకశిలానగం శోభాయమానంగా వెలుగొందనుంది. ఇప్పటికే కళ్యాణవేదిక ముస్తాబు, భక్తుల కోసం గ్యాలరీలు చకచకా ఏర్పాటుచేశారు. 60 గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. వీవీవీఐపీ, వీఐపీ, సాధారణ భక్తులును దృష్టిలో ఉంచుకొని గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. దాశరథి కల్యాణానికి వచ్చే భక్తులకు తోపులాట వాతావరణం లేకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. రేపటి నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు దాదాపు పూరికావస్తున్నాయి. దాశరథి కోవెలలో నవమి ఏర్పాట్లు... ఒంటిమిట్టలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆరోజున ఆలయంలో పోతన జయంతి కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించనున్నది. కవిసమ్మేళనం నిర్వహిస్తారు. నవమి సందర్భంగా భక్తులు పెద్దఎత్తున రానున్నారు. -
వెండితెరకు మిస్టర్ భారత్
‘ఈ దేశం నీకేమిచ్చిందనేది కాదు... ఈ దేశానికి నువ్వేమిచ్చావ్ అనేది చూడాలి’ అన్నారు నెహ్రూ. ‘జై జవాన్ జై కిసాన్ ’ అన్నారు లాల్బహదూర్ శాస్త్రి. ఈ దేశానికి ప్రధానులైన వారు ప్రజలను దేశం వైపు చూసేలా చేయగలిగారు. ఈ స్ఫూర్తిని సినిమా రంగంలో మొదటగా అందుకున్న హీరో మనోజ్ కుమార్ (Manoj Kumar). సినిమాల్లో తన పాత్రకు ‘భారత్’ అని పేరు పెట్టుకుని అందరి చేత ‘మిస్టర్ భారత్’ అనిపించుకున్నాడు. శుక్రవారం మరణించిన ఈ దేశభక్త నటుడికి నివాళి1974.‘రోటీ కపడా ఔర్ మకాన్’ రిలీజైంది. జనం మొదటిరోజు మొదటి ఆటకు వెళ్లారు. ఫస్ట్సీన్... జేబులో డిగ్రీ పెట్టుకుని రోడ్ల మీద బేకార్గా తిరుగుతున్న హీరో ఒకచోట ఆగిపోయాడు. కారణం... పోలీస్ ఒకతనిపై తుపాకీ ఎక్కుపెట్టి ‘చెప్పు... ఎవరు నువ్వు’ అని అడుగుతున్నాడు. ‘నేనా... ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ని’... ‘ఏం దొంగిలించుకుని వెళుతున్నావ్?’ ‘చూస్తావా...’ కోటు చాటున ఉన్న వస్తువు చూపించాడు. రొట్టె ముక్క.ఈ సీన్తోనే ఆనాటికి దేశంలో పేరుకొని పోయిన ఆకలిని, నిరుద్యోగాన్ని చూపించి ప్రేక్షకుల గుండెలను గట్టిగా చరుస్తాడు మనోజ్ కుమార్. ఆ తర్వాతి సీను కప్పుకోవడానికి గుడ్డలేని పేద స్త్రీలు... నిలువ నీడలేని నిరుపేద కూలివాళ్లు. దర్శకుడు తీసిన కథ తమ కష్టాల గురించే అని జనం అర్థం చేసుకున్నారు. సినిమా సూపర్ హిట్ అయ్యింది.‘సినిమా అనేది సందేశాలివ్వడానికి కాదు అని కొందరు అంటారు... అనుకుంటారు. కాని నేను తీసేది మాత్రం ఏదో ఒక సందేశం (Message) ఇవ్వడానికి. సమాజం నుంచి ఎంతో పొందాం... బదులుగా మంచి మాట చెప్పడానికి ఏమిటి కష్టం’ అంటాడు మనోజ్ కుమార్.బాధ చూసినవాడు బహుశా బాధ్యతగా ఉంటాడు. పదేళ్ల వయసులో ఉండగా దేశ విభజన చూశాడు మనోజ్ కుమార్. నేటి పాకిస్తాన్లో ఉన్నా అబ్తాబాద్ నుంచి అతడి కుటుంబం ఢిల్లీకి వచ్చేసింది. రెఫ్యూజీ క్యాంప్లో ఉంటూ చదువుకున్నాడు. ఆ కష్టాలను మర్చిపోవడానికి అప్పుడప్పుడు మేనమామ వచ్చి సినిమాకు తీసుకెళ్లేవాడు. పన్నెండేళ్ల మనోజ్ చూసిన మొదటి సినిమా ‘జుగ్ను’. ఇందులో దిలీప్ కుమార్ హీరో. సినిమా చివరలో చనిపోతాడు. తర్వాత మనోజ్ మరో సినిమా చూశాడు. ‘షహీద్’. ఇందులో కూడా దిలీప్ కుమార్ హీరో. సినిమాలో చనిపోతాడు. మనోజ్ చాలా విస్మయం చెంది ఇంటికొచ్చి తల్లిని అడిగాడు ‘అమ్మా.. ఒక మనిషి ఎన్నిసార్లు చనిపోతాడు?’. ‘ఒకసారే’. ‘మరి రెండుసార్లు చనిపోతే?’... ‘అలాంటి వాళ్లు దేవదూతలై ఉంటారు’ అంది. ‘అంటే సినిమా హీరోకు మరణం లేదన్నమాట. నేను హీరోను అవుతాను. దిలీప్ కుమార్లాంటి హీరో’ అనుకున్నాడు మనోజ్ కుమార్. అంతే కాదు దిలీప్ కుమార్ నటించిన ‘షబ్నమ్’ చూసి అందులో దిలీప్ పేరు ‘మనోజ్’ అని ఉంటే ‘నేను పెద్దయ్యి హీరో అయ్యాక ఆ పేరే పెట్టుకుంటాను’ అనుకున్నాడు. అనుకున్నట్టుగానే హీరో అయ్యాడు. అదే పేరుతో విఖ్యాతం అయ్యాడు. ఎంతగా అంటే అతని అసలు పేరు హరికిషన్ గిరి గోస్వామి (Harikrishna Giri Goswami) అని ఎవరికీ తెలియనంత!ఢిల్లీ నుంచి బాంబే వచ్చి సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు మనోజ్ కుమార్. వాళ్ల నాన్న కవి. ఇతనికి కూడా రాయడం వచ్చింది. కొన్నాళ్లు ఘోస్ట్ రైటర్గా పని చేశాడు. సినిమాల్లో ‘ఎక్స్ట్రా’గా కూడా కనిపించాడు. దిలీప్ కుమార్ను ఇమిటేట్ చేస్తూ ఇతను చేస్తున్న నటన ఖరీదైన దిలీప్ కుమార్ను బుక్ చేసుకోలేకపోయేవారిని ఆకర్షించింది. మెల్లగా అవకాశాలు వచ్చాయి. 1960లో వచ్చిన ‘కాంచ్ కీ గుడియా’తో తొలిసారి హీరోగా కనిపించాడు. సినిమా ఫ్లాప్ అయ్యింది. మరికొన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. అదే సమయంలో హీరో అవకాశాలు పొందడానికి డింకీలు కొడుతున్న ధర్మేంద్ర, శశి కపూర్లతో దోస్తీ కట్టి ఎక్కే స్టూడియో దిగే స్టూడియోగా ఉండేవాడు. ముగ్గురి జాతకం బాగుంది... ముగ్గురూ పెద్ద హీరోలయ్యారు. కాని మిగిలిన ఇద్దరి కంటే మనోజ్ ఎక్కువ నైపుణ్యాలు ప్రదర్శించాడు. నటుడు, రచయిత, ఎడిటర్, నిర్మాత, దర్శకుడు... అన్నింటికి మించి దేశభక్తి అనే అంశాన్ని సినిమాకు ఫార్ములాగా మార్చగలిగిన మేధావి అయ్యాడు.పెద్ద హీరోల రొమాంటిక్ సినిమాల హవా నడుస్తున్న రోజుల్లో డాన్స్ ఏ మాత్రం చేయలేని, లిమిటెడ్ బాడీ లాంగ్వేజ్ ఉన్న మనోజ్ కుమార్ సీరియస్ సబ్జెక్ట్స్ తనను గట్టెక్కిస్తాయని భావించాడు. భగత్సింగ్లాంటి కేరెక్టర్ తన ఇమేజ్ను పెంచుతుందని ఆ సినిమా చేయాలనుకున్నాడు. కాని భగత్ సింగ్కు సంబంధించి సినిమా తీసేంత సమాచారం ఆ రోజుల్లో లేదు. మనోజ్ కుమారే నాలుగేళ్లు తిరిగి సమాచారం సేకరించి కథ తయారు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. 1965లో వచ్చిన ‘షహీద్’... భగత్ సింగ్ మీద వచ్చిన తొలి భారతీయ సినిమా. పెద్ద హిట్ అయ్యింది. అంతేకాదు ‘నర్గిస్దత్ జాతీయ పురస్కారం’ గెలుచుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీకి వెళ్లినప్పుడు నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సినిమాను చూశారు. మరుసటిరోజు టీకి ఆహ్వానించి మనోజ్తో ‘నేను జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చాను కదా. నువ్వు ఆ నినాదం పై సినిమా తీయరాదూ’ అని అడిగారు. దేశ ప్రధాని కోరిన కోరిక మనోజ్ను సూటిగా తాకింది. ఒక నోట్బుక్, పెన్ను పట్టుకుని ఢిల్లీలో రైలెక్కి ముంబైలో దిగేలోపు ‘ఉప్కార్’ స్క్రిప్ట్ రాశాడు. దర్శకుడు కావాలనే కోరిక అప్పటి వరకూ మనోజ్కు లేదు. కాని ప్రధానిని ఇంప్రెస్ చేసేలా సినిమా తీయాలంటే తానే దర్శకుడిగా మారక తప్పదు అనుకున్నాడు. అంటే ఒక ప్రధాని వల్ల దర్శకుడైన ఏకైన వ్యక్తి మనోజ్. భారతదేశంలో రైతుకు ప్రాధాన్యం ఇవ్వాలని, సైనికులకు బాసటగా నిలవాలని మనోజ్ తీసిన ‘ఉప్కార్’ అతణ్ణి అంబరంలో కూచోబెట్టింది. అవార్డుల రాసి పోసింది. ‘మేరే దేశ్ కీ ధర్తీ’ పాట జనాన్ని ఊపేసింది. సినిమాలో పాత్రకు పెట్టిన పేరు భారత్ (Bharat) మనోజ్ కుమార్ నిక్నేమ్ అయ్యింది. ‘మిస్టర్ భారత్’.పాశ్చాత్య సంస్కృతి చెడ్డది కాకపోయినా దానిని చెడ్డగా ఇమిటేట్ చేస్తున్న వారిపై ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ తీశాడు మనోజ్. మన సంస్కృతి మనకు ముఖ్యం అని చాటాడు. ఇక దేశంలో నిరుద్యోగం, యువకుల్లో పేరుకుపోతున్న అనిశ్చితి పై ‘రోటీ కపడా ఔర్ మకాన్’ తీశాడు. నేటికీ ప్రభుత్వాలు ఈ మూడూ అందించడానికి ఆపసోపాలు పడుతూనే ఉన్నాయి. ఇక బ్రిటిష్ వారు ఆక్రమించుకున్న చిన్న సంస్థానాల నుంచి వారిపై సాయుధ పోరాటం చేసిన వారి కథతో తీసిన భారీ చిత్రం ‘క్రాంతి’ సూపర్డూపర్ హిట్ అయ్యి భాష తెలియని ప్రాంతాల్లో కూడా పెద్ద కలెక్షన్లు రాబట్టింది. కార్మికుల సమస్యలతో ‘షోర్’ తీశాడు. చిరుద్యోగుల తరఫున ‘క్లర్క్’ తీశాడు. ఆకాంక్షలో స్వచ్ఛత, ప్రయత్నంలో శ్రమ ఉంటే విజయం వరిస్తుందనడానికి మనోజ్ కుమార్ జీవితం ఒక ఉదాహరణ. ఏ హీరోని అయితే చూసి హీరో అయ్యాడో ఆ దిలీప్ కుమార్తో ‘ఆద్మీ’లో నటించగలిగాడు మనోజ్ కుమార్. అదే దిలీప్ కుమార్ను డైరెక్ట్ చేసి ‘క్రాంతి’గా సూపర్హిట్ సాధించగలిగాడు. తగిన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేక ముఖాన్ని చేతుల్లో దాచుకునే మేనరిజంతో ఫేమస్ అయిన మనోజ్ను అప్పుడప్పుడు కళాకారులు అదే మేనరిజంతో ఆటపట్టించడం కద్దు. షారూక్ ఖాన్ ‘ఓమ్ శాంతి ఓమ్’లో మనోజ్ను ఇమిటేట్ చేసి ఆయనకు కోపం తెప్పించాడు. పరువు నష్టం దావా వేసే వరకూ వ్యవహారం వెళ్లి తర్వాత సద్దుమణిగింది.చదవండి: అసహ్యించుకుంటూనే.. చివరికి నటినయ్యామనోజ్ కుమార్ నిజమైన దేశ ప్రేమికుడు. తన సినిమాల్లో అన్ని మతాల, వర్గాల వారి పాత్రలు సృష్టించి దేశమంటే మనుషులోయ్ అని చూపించినవాడు. నేటి హేట్ ఫిల్మ్స్ మధ్యలో మనోజ్ భావధార వెనుకబడ్డట్టు అనిపించిన అంతిమంగా గెలవబోయేది అదే. ఎందుకంటే విలువల వరుసలో మానవత్వం ముందు ఉండి తర్వాతే కదా మతం ఉండేది. సెల్యూట్ మిస్టర్ భారత్.హోమియోపతి డాక్టర్మనోజ్ కుమార్ మంచి హోమియోపతి డాక్టర్. అతనికి ఒకసారి చెంప మీద సర్పి వచ్చింది. అల్లోపతిలో ఎన్ని వైద్యాలు చేసినా పని చేయలేదు. నటుడికి ముఖాన సర్పి చాలా ప్రమాదం. ఆ సమయంలో మద్రాసులో షూటింగ్లో ఉండగా హోమియోపతిప్రాక్టీసు చేసే నటుడు అశోక్ కుమార్ (Ashok Kumar) ఒక డోస్ మందు వేశాడు. వారంలో సర్పి మాయమైంది. మనోజ్కు ఇది ఎంతగా ఆసక్తి రేపిందంటే అతడు హోమియోపతి డాక్టర్ల కంటే ఎక్కువగా హోమియోపతి (Homeopathy) చదివి ఆ వైద్యం ప్రాక్టీసు చేయడానికి సర్టిఫికెట్ పొందాడు. చాలామందికి హోమియోపతి వైద్యం చేశాడు.తెలుగు సినిమాల్లో మనోజ్ కుమార్మనోజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు తెలియకుండా తెలుగు సినిమాల్లో ఉన్నాడు. ఆయన తీసిన ‘ఉప్కార్’ తెలుగులో కృష్ణ హీరోగా ‘పాడిపంటలు’గా రీమేక్ అయ్యి హిట్ అయ్యింది. మరో సూపర్హిట్ ‘రోటీ కపడా ఔర్ మకాన్’ తెలుగులో శోభన్ బాబు హీరోగా ‘జీవన పోరాటం’ పేరుతో రీమేక్ అయ్యింది. హిందీలో అమితాబ్ వేసిన పాత్రను తెలుగులో రజనీకాంత్ చేశాడు. మనోజ్ కుమార్ నటించిన ‘ఓ కౌన్ థీ’ తెలుగులో జగ్గయ్య, జయలలిత కాంబినేషన్లో ‘ఆమె ఎవరు’గా వచ్చింది. ‘హిమాలయ్ కీ గోద్ మే’ శోభన్ బాబు హీరోగా ‘డాక్టర్ బాబు’గా వచ్చింది. ‘దస్ నంబరీ’ పెద్ద హిట్ కావడంతో ఎన్టీఆర్ (NTR) హీరోగా ‘కేడీ నంబర్ 1’ పేరుతో రీమేక్ చేశారు. చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘మగ మహారాజు’ సినిమాలో ఏడు రోజులు సైకిల్ తొక్కే సన్నివేశం ఒరిజినల్ మనోజ్ కుమార్ నటించిన ‘షోర్’లో ఉంది.మనోజ్ కుమార్ కన్నుమూతసుప్రసిద్ధ సినీనటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చాలాకాలంగా వెన్నునొప్పితోనూ, వయసు సంబంధమైన ఇతర రుగ్మతలతోనూ బాధపడుతున్న మనోజ్కుమార్ ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. కునాల్, విశాల్. వీరిలో కునాల్ హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. దేశభక్తి సినిమాలతో ఖ్యాతి పొందిన మనోజ్కుమార్ను 1992లో పద్మశ్రీ, 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు వరించాయి. షహీద్, ఉప్కార్, పూరబ్ ఔర్ పశ్చిమ్, క్రాంతి తదితర సూపర్హిట్ సినిమాలు మనోజ్ దర్శకత్వంలో రూపొందాయి. -
ప్రీ వెడ్డింగ్ షూట్.. ‘గిరిజన పల్లె’ ముస్తాబు..
ఆదివాసీ సంప్రదాయ దుస్తులు, కొమ్ముకోయ తలపాగ, వాయిద్యాలు.. ఇలా గిరిజన పల్లెను ప్రతిబింబించే థీమ్తో భద్రా చలంలోని గిరిజన మ్యూజియం ప్రాంగణంలో ఓ సెట్ రూపుదిద్దుకుంటోంది. హంగూ ఆర్భాటాలకు దూరంగా పూర్తిగా ఆదివాసీల జీవితాన్ని పరిచయం చేయబోతున్నారు. నిర్మాణ దశలో ఉండగానే ఈ పల్లెకు ఆదరణ వస్తున్న నేపథ్యంలో మరిన్ని సదుపాయాల కల్పనకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.గిరిజన సంస్కృతికి ప్రాచుర్యం కలి్పంచడమే ప్రధాన లక్ష్యం కావడంతో నామమాత్రపు రుసుముతోనే పర్యాటకులు, ఫొటో, ప్రీ వెడ్డింగ్ షూట్లకు వచ్చే వారికి ప్రవేశం కల్పించనున్నారు. భద్రాచలంలో సీతారాముల దర్శనానికి వచ్చే భక్తులకు గోదావరి తీర ప్రాంత గిరిజన సంప్రదాయాలను పరిచయం చేయాలనే ఆలోచనతోనే శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం వచ్చే సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఈ మ్యూజియం, గిరిజన పల్లెను ప్రారంభించేలా ఐటీడీఏ పీఓ రాహుల్ నేతృత్వాన ఏర్పాట్లు ముమ్మరం చేశారు. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంముక్కోటితో మొదలుజనవరిలో భద్రాచలంలో జరిగిన ముక్కోటి సందర్భంగా ‘ఏరు’పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా గడ్డి గుడిసెలు, మంచె, మట్టి ఇళ్ల నమూనాలను ఐటీడీఏ క్యాంపస్లో ఉన్న ట్రైబల్ మ్యూజియం ఆవరణలో నిర్మించారు. భద్రాచలం వచి్చన భక్తులను ఈ గడ్డి గుడిసెలు ఆకట్టుకున్నాయి. వీటి ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. దీంతో ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న గిరిజన మ్యూజియాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.ఆబాల గోపాలంగిరిజన మ్యూజియం ఆవరణలో పిల్లల కోసం ప్రత్యేకంగా బోటింగ్, ప్లే ఏరియా, యువకుల కోసం బాక్స్ క్రికెట్, శాండ్ వాలీబాల్, ఆర్చరీ గేమ్, ఓపెన్ జిమ్లు నిర్మించారు. ఆదివాసీ రుచుల నుంచి చైనీస్ వంటకాలతో కూడిన ఫుడ్ కోర్టు కూడా రెడీ చేశారు. మరోవైపు మ్యూజియాన్ని గిరిజనుల పండుగలు, వేటలో ఉపయోగించే ఆయుధాలు, ఇళ్లలో వినియోగించే పనిముట్లు, కళాకృతులు, వాయిద్యాల థీమ్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వెరసి మూడు నెలల్లోనే గిరిజన మ్యూజియం ‘మినీ స్టూడియో’గా మారిపోయింది. ఓవైపు నిర్మాణ పనులు జరుగుతుండగానే.. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం కాబోయే వధూవరులు, బర్త్డే పారీ్టల కోసం గ్రూపులు గ్రూపులుగా స్థానికులు ఇక్కడికి రావడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే వెడ్డింగ్ షూట్ నిర్వహించుకునేలా మరిన్ని సదుపాయాలు జత చేయాలని నిర్ణయించారు. ఇక గిరిజన మ్యూజియం చూడాలనుకునే విద్యార్థుల కోసం స్కూలు మొత్తానికి కేవలం రూ.500 ఎంట్రీ ఫీజుగా నిర్ణయించారు. -
సెల్యూట్ పైలట్ సిద్ధార్థ్!
అంతా బాగున్నప్పుడు కాదు, ప్రమాదపుటంచున ఉన్నప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన వ్యక్తిత్వానికి కొలమానంగా నిలుస్తుంది. బుధవారం రాత్రి గుజరాత్లోని జామ్నగర్లో కూలిపోయిన భారత వైమానిక దళ జాగ్వార్ ఫైటర్ జెట్ పైలట్ సిద్ధార్థ్ యాదవ్ అలాంటి గొప్ప వ్యక్తిత్వమున్న వారి కోవకే వస్తారు. సాంకేతిక లోపాలతో విమానం కుప్పకూలనుందని అర్థమైంది. 28 ఏళ్ల యువకుడు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. పైగా 10 రోజుల కిందే నిశ్చితార్థం కూడా అయింది. కో పైలట్తో కలిసి సురక్షితంగా ఎజెక్టయ్యే అవకాశముంది. అయినా సిద్ధార్థ్ తన ప్రాణాల కోసం పాకులాడలేదు. ప్రజల భద్రత గురించే ఆలోచించారు. విమానంజనావాసాల్లో పడకుండా జాగ్రత్తపడ్డారు. సురక్షితంగా మైదానంలో కూలిపోయేలా చూశారు. తద్వారా ఎంతోమంది పౌరుల మరణాలను నివారించారు. ఆ క్రమంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయినా తన సాటిలేని త్యాగంతో జాతి గుండెల్లో చిరంజీవిగా మిగిలిపోయారు. కో పైలట్ సురక్షితంగా ఎజెక్టయినా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. చివరి క్షణాల్లోనూ... బయల్దేరిన కాసేపటికే విమానంలో సాంకేతిక వైఫల్యం తలెత్తింది. విమానాన్ని నియంత్రించడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. ప్రమాదం తప్పదని స్పష్టమైంది. దాంతో పైలెట్లిద్దరూ ఎజెక్షన్ ప్రారంభించారు. అంతటి క్లిష్ట సమయంలోనూ ముందు కో పైలట్ సురక్షితంగా బయటపడేలా సిద్ధార్థ్ జాగ్రత్త తీసుకున్నారు. తర్వాత కూడా విమానాన్ని వెంటనే వదిలేయకుండా నివాస ప్రాంతాలకు దూరంగా తీసుకెళ్లారు. ఆ క్రమంలో ప్రాణాలనే పణంగా పెట్టారు. కుటుంబమంతా దేశ సేవలోనే.. ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ స్వస్థలం హరియాణాలోని రేవారీ. వారిది తరతరాలుగా సైనిక కుటుంబమే. ఆయన ముత్తాత బ్రిటిష్ హయాంలో బెంగాల్ ఇంజనీర్స్ విభాగంలో పనిచేశారు. తాత పారామిలటరీ దళాల్లో సేవలందించారు. తండ్రి కూడా వైమానిక దళంలో పనిచేశారు. సిద్ధార్థ్ 2016లో వైమానిక దళంలో చేరారు. రెండేళ్ల సర్వీసు తర్వాత ఫ్లైట్ లెఫ్టినెంట్గా పదోన్నతి పొందారు. మార్చి 23నే నిశ్చితార్థం జరనిగింది. నవంబర్ 2న పెళ్లి జరగాల్సి ఉంది. మార్చి 31 దాకా కుటుంబీకులతో గడిపి ఇటీవలే విధుల్లో చేరారు. ఆయన మరణవార్తతో కుటుంబం, స్నేహితులే గాక పట్టణమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. విమానంలో ప్రయాణించాలని, దేశానికి సేవ చేయా లని సిద్ధార్థ్ ఎప్పుడూ కలలు కనేవాడని చెబుతూ తండ్రి సుజీత్ యాదవ్ కన్నీటిపర్యంతమయ్యారు. ‘‘సిద్ధార్థ్ తెలివైన విద్యారి్థ. తనను చూసి ఎప్పుడూ గర్వపడేవాళ్లం. ప్రజల ప్రాణాలు కాపాడుతూ తన ప్రాణాలర్పించాడు. నా కొడుకును చూసి చాలా గర్వపడుతున్నా. మాకు ఒక్కగానొక్క కొడుకు తను’’అంటూ గుండెలవిసేలా రోదించారు. సిద్ధార్థ్ పారి్థవదేహం శుక్రవారం రేవారీకి చేరింది. పూర్వీకుల గ్రామం భలాకి మజ్రాలో పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లక్ష కోట్లు ఒక్కరోజే చెల్లించారు
సాక్షి, స్పెషల్ డెస్క్: స్మార్ట్ఫోన్ల వాడకంలో, డేటా వినియోగంలోనే కాదు.. డిజిటల్ చెల్లింపుల్లోనూ మనవాళ్లు తగ్గేదేలే అంటున్నారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారిత చెల్లింపుల్లో తాజాగా సరికొత్త రికార్డు ‘టచ్’ చేశారు. ఒక్కరోజే లక్ష కోట్లకు పైగా చెల్లింపులు జరిపారు.2025 మార్చి 1న దేశవ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్ యాప్స్ ద్వారా రూ.1,01,627.92 కోట్ల విలువైన లావాదేవీలు నమోదు చేసి వాడకం మామూలుగా లేదనిపించారు. తొమ్మిదేళ్ల యూపీఐ చరిత్రలో ఈ స్థాయి లావాదేవీలు జరగడం ఇదే తొలిసారి. ఇక సంఖ్య పరంగా ఈ ఏడాది అత్యధికంగా మార్చి 13న గత రికార్డుకు చేరువగా 64.2 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఇప్పటివరకు 2024 అక్టోబర్ 31న అత్యధికంగా 64.4 కోట్ల లావాదేవీలు జరిగాయి. కొనసాగుతున్న రికార్డులు..యూపీఐ లావాదేవీల విలువ, సంఖ్య విషయంలో రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. అత్యధికంగా 2025 మార్చిలో రూ.24,77,221.59 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. లావాదేవీల సంఖ్య గత నెలలో 1,830 కోట్లకు చేరింది. విలువ, పరిమాణం పరంగా ఒక నెలలో ఇప్పటివరకు ఇవే అత్యధికం. సగటున రోజుకు లావాదేవీల విలువ రూ.79,910 కోట్లకు, లావాదేవీల సంఖ్య 59 కోట్లను తాకింది. ఇక దేశంలో 661 బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, పేమెంట్ యాప్స్ యూపీఐ సేవలను అందిస్తున్నాయి. మార్చి నెల విలువలో వ్యక్తుల నుంచి వ్యక్తులకు 73 శాతం, వ్యక్తుల నుంచి వర్తకులకు 27 శాతం లావాదేవీలు జరిగాయి. అలాగే సంఖ్యలో వ్యక్తుల నుంచి వర్తకులకు 63 శాతం, వ్యక్తుల మధ్య 37 శాతం నమోదయ్యాయి. -
ఏఐకి అంతా చెప్పేస్తున్నారా?
సాక్షి, స్పెషల్ డెస్క్: కొత్త వస్తువైనా, టెక్నాలజీ అయినా కంటపడితే దాని అంతుచూడందే కొందరికి నిద్ర పట్టదు. ప్రస్తుతం ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలోనూ చాలామంది పరిస్థితి ఇలాగే ఉంది. చాట్జీపీటీ, జెమినీ, గ్రోక్ వంటి ఏఐ టూల్స్తోనే ఎక్కువ సమయం గడుపుతున్నవాళ్లు చాలామందే ఉన్నారు. పనులు చక్కబెట్టుకోవటం కోసం, నాలెడ్జ్ కోసం వీటిని వాడుకోవటం మంచిదే. కానీ, విచక్షణ లేకుండా వీటిని మన వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని నిపుణులు సూచిస్తున్నారు.ఈ ఏఐ టూల్స్కు ఏ సమాచారం ఇవ్వచ్చో.. ఏది మన సమాచారంతోనే ఎల్ఎల్ఎం టైనింగ్ టీచర్ల బోధన, పాఠ్యపుస్తకంలోని పాఠాలు, గైడ్లు, నిజ జీవిత అనుభవాలన్నింటి సాయంతో ఎలాగైతే విద్యార్థులు నేర్చుకుంటారో.. లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లు (ఎల్ఎల్ఎం) కూడా అందుబాటులో ఉన్న సమాచారం, మనం వేసే ప్రశ్నల సాయంతో కొత్త విషయాలు నేర్చుకుంటాయి. దీన్నే ట్రైనింగ్ అని పిలుస్తుంటారు. చాట్జీపీటీ వంటివాటికి నిత్యవ్యవహారాల తాలూకు సమాచారం అందుబాటులో ఉంటే.. డాలీవంటి ఇమేజ్ జనరేటర్లకు వేల, లక్షల ఫొటోలు అందించి శిక్షణ ఇస్తుంటారు.ఈ శిక్షణ ఎంత ఎక్కువ ఉంటే, వచ్చే ఫలితాలు అంత కచ్చితంగా ఉంటాయి. అయితే, ఈ శిక్షణ సందర్భంగా వ్యక్తుల వ్యక్తిగత సమాచారం కూడా లభిస్తే దాన్ని కూడా అవి ఎక్కడో ఒకచోట వాడుకుంటాయి. కాబట్టి భవిష్యత్తులో మనకు ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే చాట్జీపీటీ, జెమినీ లాంటి ఎల్ఎల్ఎంలు ‘మీ సంభాషణల్లో సున్నితమైన సమాచారం లేకుండా చూసుకోండి’అని, ‘మీకు మాత్రమే తెలిసిన సమచారాన్ని పంచుకోవద్దు’అని చెబుతుంటాయి. 1, మీ ఇంటి అడ్రస్ లేదా ఫొన్ నంబర్, ఆధార్, ఓటర్ ఐడీ, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎల్ఎల్ఎంలతో అస్సలు పంచుకోవద్దు. 2023లో చాట్జీపీటీ కోడ్లో చిన్న పొరబాటు దొర్లింది. ఫలితంగా ఇతరులు అడుగుతున్న ప్రశ్నలు అందరికి కనిపించడం మొదలైంది. హ్యాకర్లు ఈ సమాచారం చూస్తే ఇక అంతే సంగతులు. 2, పాస్వర్డ్లు, లాగిన్ వివరాలను ఎల్ఎల్ఎంలతో పంచుకోవడం ఏమంత మంచిది కాదు. పడకూడని వారి చేతుల్లో పడితే ఈ సమాచారంతో మీ జేబులు ఖాళీ కావచ్చు. పాస్వర్డ్ మేనేజ్మెంట్ టూల్స్ మాదిరిగా ఎల్ఎల్ఎంలలో ఈ వివరాలు సంకేత భాషలో స్టోర్ కావు. మోడల్ను రివ్యూ చేసేవారికి అందుబాటులో ఉంటాయి. లేదా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎల్ఎల్ఎంలు పొరపాటుగానైనా ఈ సమాచారాన్ని పంచుకునే అవకాశం ఉంది. 3, ఎల్ఎల్ఎంలతో పంచుకోకూడని మరో అంశం వృత్తిపరమైన సమాచారం. దీనివల్ల మనం పనిచేసే సంస్థలకు నష్టం జరగవచ్చు. 4, వైద్యులు, లాయర్ల వద్ద ఏదీ దాచకూడదని చెబు తారు. కానీ, ఎల్ఎల్ఎంల వద్ద మాత్రం వైద్య సమాచారం అస్సలు పంచుకోకూడదు. ఎల్ఎల్ఎంలకు వైద్యపరమైన సమాచారాన్ని భద్రపరిచే చట్టాలు వర్తించకపోవచ్చు. ఫలితంగా మనం ఇచ్చే సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంటుంది. విరుగుడు మంత్రాలు ఎల్ఎల్ఎంలలో మన సంభాషణలు రికార్డు కాకుండా కొన్ని చిట్కాలున్నాయి.⇒ చాట్జీపీటీ 4.0లో సంభాషణలను టెంపరరీ మోడ్లో ఉంచుకోవచ్చు.⇒ డక్.ఏఐని వాడుకుంటే మన పేరు వివరాలు లేకుండా చేస్తుంది.⇒ మైక్రోసాఫ్ట్ కో–పైలట్, గూగుల్ జెమినీలోసంభాషణలను రికార్డు చేస్తారు కానీ సెట్టింగ్స్లో మార్పులు చేసుకుని దాన్ని గోప్యంగా ఉంచుకోవచ్చు.⇒ మన సంభాషణలను అప్పుడప్పుడూ డిలీట్ చేస్తుండటం ద్వారా సమాచార దుర్వినియోగాన్ని నివారించవచ్చు.⇒ చైనీస్ ఏఐ డీప్సీక్ మాత్రం మీ సంభాషణలన్నీ రికార్డు చేసి ట్రెయినింగ్ కోసం వాడుకుంటుంది. మార్పులు చేసుకునే, తప్పించుకునే అవకాశాల్లేవు. -
మనసు నిండుగా.. మురి'పాల' పండుగ
సృష్టిలో అమ్మ స్థానం అత్యున్నతం. అమ్మ గొప్పతనం వర్ణనాతీతం.. అమ్మ త్యాగం అనన్యసామాన్యం.. పురిటి నొప్పులను సైతం పంటి బిగువున భరిస్తూ బిడ్డకు జన్మనిస్తుంది. కంటికి రెప్పలా కాపాడుకునేందుకు ప్రాణం పెట్టేస్తుంది. అందుకే అమ్మను మించిన దైవం ఉండదు అంటారు. అయితే కొంతమంది తల్లులు అనివార్యకారణాలతో శిశువుకు ముర్రెపాలు అందించలేక తల్లడిల్లిపోతున్నారు. అలాంటి సమయంలో బిడ్డ ఆకలి తీర్చడమే కాకుండా రోగనిరోధకశక్తిని పెంచే తల్లిపాలను అందించేందుకు కొందరు అమ్మలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అమ్మతనానికి మరింత వన్నె తీసుకువస్తున్నారు. ఈ ప్రక్రియకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు.తిరుపతి తుడా : తల్లి పాలు అవసరం ఉన్న నవజాత శిశువులకు అవసరమైన పాలను మదర్ మిల్క్ బ్యాంకు అందిస్తుంది. అమ్మపాలు శిశువు ఎదుగుదలకు, సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో కీలకం, తల్లి పాల ప్రాధాన్యత తెలియకపోవడంతో కొందరు పిల్లలకు పాలిస్తే తమ శరీర ఆకృతి పాడైపోతుందని ఆవు, గేదె పాలను, మిల్క్ పౌడర్ను బాటిల్స్తో పట్టిస్తుంటారు. మరికొందరు బాలింతల విషయంలో శిశువుకు తగినంత పాలు లేకపోవడం, తల్లి అనారోగ్యం కారణంగా పాల వృద్ధి క్షీణిస్తుంది. ఇటువంటి వారికోసం మదర్ మిల్క్ కేంద్రం ఓ వరంగా పనిచేస్తోంది. 247లీటర్ల సేకరణ తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోని తల్లి పాల కేంద్రంలో ఏడాదిగా సుమారు 247లీటర్ల పాలను సేకరించి సుమారు 3,475మంది శిశువులకు అందించారు. ప్రతి నెల సుమారు 23 నుంచి 25 లీటర్ల పాలను డోనర్స్ నుంచి సేకరిస్తున్నారు. పాలు డొనేట్ చేసిన తల్లులకు సుమారు 6రకాల డ్రైఫ్రూట్స్ అందించి ప్రోత్సహిస్తున్నారు. మదర్ మిల్క్ కావలసిన వారు, డోనర్స్ 8919469744 నంబర్లో సంప్రదించవచ్చు. ఎలాంటి శిశువులకు అందిస్తారంటే... డెలివరీ అయిన వెంటనే తల్లి చనిపోయిన శిశువులకు, 2కేజీల కంటే బరువు తక్కువగా పుట్టిన పిల్లలకు, తల్లి ఆరోగ్యంగా ఉండి చనుపాల ద్వారం (నిప్పిల్స్) మూసుకుపోయిన పాలు రాని పరిస్థితి ఏర్పడిన శిశువులకు, తల్లిపాలు పడని బిడ్డలకు, దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న బాలింతల పిల్లలకు పాలు అందిస్తున్నారు. ఒక్కో ఫీడింగ్కు 30ఎమ్ఎల్ చొప్పున రోజుకు 12సార్లు పాలు ఇస్తారు. ఇలా ఒకటి నుంచి 6నెలల వరకు శిశువుకు పాలు అందిస్తారు. సేకరణ ఇలా... స్వచ్ఛందంగా వచ్చే డోనర్స్ నుంచి తల్లి వయసు, డెలివరీ, ఆధార్కార్డుతో పూర్తి వివరాలను దరఖాస్తు రూపంలో నమోదు చేసుకుంటారు. అనంతరం తల్లి ఆరోగ్య సమాచారం సేకరించి అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తారు. తల్లి శరీరంపై టాటూస్ (పచ్చ»ొట్టులు) ఉన్నా, బ్రెస్ట్ సమీపంలో మచ్చలు, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బాలింతల నుంచి పాలు సేకరించరు. సంపూర్ణ ఆరోగ్యవంతులైన తల్లుల నుంచి మాత్రమే పాల సేకరణ చేస్తున్నారు. ప్రధానంగా హెచ్ఐవీ, హెచ్సీవీ, హెచ్బీఎస్ఏజీ, వీడీఆర్ఎల్ పరీక్షలు ప్రతి తల్లికీ తప్పని సరిగా చేసి నెగటివ్ రిపోర్టు ఉంటేనే పాల డొనేషన్కు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలింతలు తమ బిడ్డకు సరిపోగా మిగులు పాలను మాత్రమే డొనేట్ చేయాల్సి ఉంటుంది.స్టోరేజ్ ఇలా...ఆరోగ్యవంతులైన తల్లుల నుంచి సుమారు 200ఎమ్ఎల్కు పైబడి ఒక సిట్టింగ్లో పాలు సేకరిస్తారు. ఇందులో 10ఎమ్ఎల్ శాంపిల్ పాలను పరీక్షల నిమిత్తం మైక్రోబయోలజీ విభాగానికి పంపుతారు. మిగిలిన పాలను మిక్స్ చేసి రిఫ్రిజిరేటర్లో భద్రపరుస్తారు. అనంతరం యూవీ రేస్లో ఉంచి పూలింగ్ ప్రక్రియ కొనసాగిస్తారు. సుమారు 3గంటల పాటు శుద్ధి చేసి 62.4 టెంపరేచర్లో వేడి చేస్తారు. అనంతరం సుమారు అరగంట పాటు కూలింగ్ ప్రాసెసర్లో ఉంచుతారు. సుమారు ఆరు నెలలపాటు పాలు సురక్షితంగా ఉండేందుకు మిల్క్ బ్యాంకు అధికారులు. సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. శిశు మరణాల నివారణకే.. శిశు మరణాలను తగ్గించాలనే సంకల్పంతోనే హ్యూమన్ మిల్క్ బ్యాంకుకు శ్రీకారం చుట్టాం. సుమారు రూ.35లక్షల వ్యయంతో ఏర్పాటు చేశాం. చాలా మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 3,475 మంది పసికందుల గొంతు తడిపాం. వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేశాం . – టి.దామోదరం,మిల్క్ బ్యాంక్ ప్రాజెక్ట్ చైర్మన్, తిరుపతి తల్లిపాలే తొలి వ్యాక్సిన్ నవజాత శిశువుకు తొలి వ్యాక్సిన్ తల్లి పాలే. గైనకాలజిస్టా్గ తల్లిపాల శ్రేష్టతపై స్పష్టమైన అవగాహన ఉంది. నేను ఇప్పటివరకు 34 లీటర్లకు పైగా పాలను మిల్క్ బ్యాంకుకు అందించా. బాలింతలు తమ మిగులు పాలను ఇచ్చేందుకు ముందుకు రావాలి. పసికందుల ప్రాణరక్షణకు సహకారం అందించాలి. – డాక్టర్ సోనా తేజస్వి, గైనకాలజిస్ట్ -
హలో అంటే చాలు.. పట్టేస్తారు!
సాక్షి, హైదరాబాద్: టార్గెట్ చేసిన వ్యక్తులకు కనిపించకుండా ఆన్లైన్లోనే అందినకాడికి దండుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. ఏళ్లుగా జరుగుతున్న సెక్స్టార్షన్ క్రైమ్కు తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను జోడిస్తున్నారు. ఫలితంగా తప్పు చేయకున్నా చేసినట్లు ఆడియోలు, వీడియోలు సృష్టిస్తూ.. బెదిరింపులకు దిగుతున్నారు. వాటిని సోషల్మీడియాలో పోస్టు చేస్తామంటూ బాధితులనుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ప్రస్తుతం ఈ తరహా సైబర్ నేరాలు ఉత్తరాదిలో ఎక్కువగా జరుగుతున్నాయని, అపరిచిత కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు, సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.ఈ నేరాలు ఒకప్పుడు ఇలా.. వాస్తవానికి సెక్స్టార్షన్ నేరం చాలాకాలంగా జరుగుతోంది. 2022–23లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదైనా.. ఆ తర్వాత కొంత వరకు తగ్గాయి. అందమైన యువతుల ఫొటోలను వాట్సాప్ డీపీలుగా పెట్టుకునే సైబర్ నేరగాళ్లు.. ఎంపిక చేసిన నంబర్లకు సందేశాలు పంపేవాళ్లు. వాటికి స్పందించిన యువకులు, పురుషులతో చాటింగ్ చేస్తూ సన్నిహితంగా మెలిగేవారు. ఆపై విషయాన్ని వీడియో కాల్స్ వరకు తీసుకువెళ్లే వాళ్లు. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా సదరు యువతే నగ్నంగా ఉండి కాల్ మాట్లాడుతున్నట్లు చేసేవారు. ఆ తర్వాత అసలు కథ మొదలుపెట్టే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసిన వ్యక్తి సైతం నగ్నంగా కాల్ చేసేలా ప్రేరేపించేవారు. ఆ కాల్ను రికార్డు చేసి, అతడికే షేర్ చేసి బెదిరించి, తాము అడిగినంత ఇవ్వకుంటే సోషల్మీడియాలో పోస్టు చేస్తామంటూ దండుకునేవారు. ఇప్పుడు ఏఐ వాడుతూ.. తాజాగా ‘ఈ–కేటుగాళ్లు’సైతం ఏఐని గణనీయంగా వినియోగిస్తున్నారు. ఎంపిక చేసుకున్న ఫోన్ నంబర్లకు వాయిస్, వీడియో కాల్స్ చేస్తున్నారు. ఆ వ్యక్తి వాటికి ఆన్సర్ చేస్తూ ‘హలో’, ‘ఎవరు’వంటి పదాలు వాడితే చాలు.. ఆ వాయిస్, వీడియోలను రికార్డు చేసుకుంటున్నారు. వీటిని ప్రత్యేక ఏఐ సాఫ్ట్వేర్స్లో పొందుపరిచి.. సదరు వ్యక్తి యువతితో అశ్లీలంగా, అసభ్యంగా సంభాషిస్తున్నట్లు, ఏకాంతంగా గడుపుతున్నట్లు ఆడియో, వీడియోలు సృష్టిస్తున్నారు. వీటిని టార్గెట్ చేసిన వ్యక్తికి పంపి బెదిరింపులకు దిగుతున్నారు. ఆ యువతితో ఫిర్యాదు చేయిస్తామని, సోషల్మీడియాలో పోస్టు చేస్తామని, కుటుంబీకులకు పంపిస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఆ ఆడియో, వీడియోలతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిసినప్పటికీ.. తీవ్ర ఆందోళన చెందే బాధితులు ప్రత్యామ్నాయాలు ఆలోచించట్లేదు. సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేసిన మొత్తం చెల్లించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అపరిచిత కాల్స్కు స్పందించొద్దు..ఇలాంటి నేరాల్లో బాధితులు తమ పరువు పోతుందనే ఉద్దేశంతో సైబర్ నేరగాళ్లు అడిగిన మొత్తం చెల్లించడానికే మొగ్గు చూపుతున్నారు. అయితే ఆ కేటుగాళ్లు ఒకసారి డబ్బు తీసుకుని వదిలిపెడతారనే గ్యారంటీ లేదు. అనేక ఉదంతాల్లో పదేపదే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. బాధితులు నగదు చెల్లించకుండా, ధైర్యం చేసి ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తేనే ఫలితాలు ఉంటాయి. వీలున్నంత వరకు అపరిచిత నంబర్ల నుంచి వచ్చే ఫోన్, వీడియో కాల్స్కు స్పందించకపోవడం ఉత్తమం. – ఎన్.ఆర్.ప్రభాకర్రెడ్డి, సైబర్ క్రైమ్ నిపుణుడు -
బుల్లి పేస్ మేకర్
ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మమైన, బియ్యం గింజ కంటే కూడా బుల్లి పేస్ మేకర్ను అమెరికా పరిశోధకులు అభివృద్ధి పరిచారు. నార్త్వెస్ట్ర్న్ యూ నివర్సిటీకి చెందిన ఇంజనీర్లు గుండెను కృత్రిమంగా పనిచేయించే ఈ చిన్న పరికరాన్ని రూపొందించారు. ఉపయో గం తీరాక శరీరంలోనే కలిసిపోవడం దీని మరో ప్రత్యేకత. శరీరంపై గాటు పెట్టాల్సిన అవసరమేమీ లేకుండా ఇంజెక్షన్ ద్వారానే దీనిని లోపలికి పంపించేయొచ్చు. జర్నల్ నేచర్లో ఈ వివరాలు తాజాగా ప్రచురితమయ్యాయి. తాత్కాలిక అవసరాలు కలిగిన శిశువులకు ఇది ఎంతో ఉపయోగకరమని నిపుణులు అంటున్నారు. ‘మేం రూపకల్పన చేసిన ఈ డివైజ్ ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన పేస్ మేకర్గా భావిస్తున్నాం’అని నార్త్వెస్టర్న్ బయో ఎల్రక్టానిక్స్ నిపుణుడు, బృంద సారథి జాన్ ఎ.రోజెర్స్ చెప్పారు. ‘ముఖ్యంగా పీడియాట్రిక్ గుండె సర్జరీలకు సూక్ష్మంగా ఉండటం ఎంతో కీలకం. పేస్ మేకర్ ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది’అని ఆయన చెప్పారు. చిన్నారులను దృష్టిలో ఉంచుకునే ఈ డివైజ్ను రూపొందించామని నార్త్వెస్టర్న్ కార్డియాలజిస్ట్ ఇగోర్ ఎఫిమోవ్ చెప్పారు. ‘దాదాపు ఒక శాతం శిశువులు పుట్టుకతోనే గుండె సంబంధ లోపాలతో ఉంటున్నా రు. సర్జరీ తర్వాత వీరికి తాత్కాలిక పేస్ మేకర్ అవసరమవుతుంది. దాదాపు వారం పాటు వీరి గుండెలు సొంతంగా రిపేర్ చేసుకుంటాయి. ఆ కీలకమైన సమయంలో ఈ చిన్న పేస్ మేకర్ వారికి సహాయకారిగా ఉంటుంది. ఆ తర్వాత అది శరీరంలో కలిసిపోతుంది. దీనిని తొలగించడానికి మరో సర్జరీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు’అని ఎఫిమోవ్ వివరించారు. ఇదెలా పని చేస్తుందంటే..? ఛాతీపైన అమర్చే చాలా చిన్నగా ఉండే ఫ్లెక్సిబుల్, వైర్లెస్ ప్యాచ్లో ఈ పేస్ మేకర్ ఉంటుంది. గుండె స్పందనలు క్రమం తప్పినట్లు గుర్తించిన వెంటనే పేస్ మేకర్కు ఈ ప్యాచ్ సిగ్నల్ పంపించి, దానిని యాక్టివేట్ చేస్తుంది. ఇది ఇచ్చే సున్నితమైన స్పందనలు శరీరం, కండరాల ద్వారా అంది గుండె లయను క్రమబద్ధం చేస్తాయి. ఇందులోని అత్యంత సూక్ష్మమైన బ్యాటరీ శరీరంలోని ఫ్లూయిడ్లను ఉపయోగించుకుని విద్యుత్ శక్తిని తయారు చేస్తుంది. దీనికి సాధారణంగా ఉండే ఎలాంటి వైర్లు అవసరం లేదు. దీని వల్ల ఇది చాలా సురక్షితంగా ఉంటుంది. సులభంగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు తయారైన పేస్ మేకర్లు రేడియో సిగ్నళ్లపై ఆధారపడగా, ఈ కొత్త డివైజ్ కేవలం కాంతిని ఉపయోగించుకుని గుండె లయను నియంత్రించ గలుగుతుందని రోజెర్స్ చెప్పారు. జంతువులపైన, దాతల ద్వారా అందిన గుండెలపైన చేసిన ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చాయని చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రతీకారం తప్పదు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తాజా టారిఫ్లపై ప్రపంచ దేశాలన్నీ మండిపడుతున్నాయి. ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెర తీశారంటూ దుయ్యబడుతున్నాయి. ప్రతీకారం తప్పదని ఆయా దేశాల అధినేతలు స్పష్టం చేశారు. వాణిజ్య యుద్ధాలు ఇరు పక్షాలను దెబ్బతీస్తాయని జర్మనీ హెచ్చరించింది. తమపై ట్రంప్ విధించిన 10 శాతం సుంకాన్ని ఎదుర్కోవడానికి లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రెజిల్ బుధవారం ఒక చట్టాన్ని ఆమోదించింది. దెబ్బకు దెబ్బ: ఈయూ యూరోపియన్ యూనియన్పై 20 శాతం సుంకాలను యూరప్ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. ఇది పూర్తిగా అన్యాయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘‘అమెరికా వస్తువులకు ఈయూ అతి పెద్ద మార్కెటని ట్రంప్ మర్చిపోయినట్టున్నారు. యూఎస్పై ప్రతీకార సుంకాలు విధిస్తాం’’అని హెచ్చరించాయి. ‘‘ఈయూ ఉక్కుపై అమెరికా సుంకాలకు ప్రతిస్పందనగా ప్రతీకార ప్యాకేజీని ఖరారు చేస్తున్నట్టు ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాండడెర్ లెయన్ ప్రకటించారు. చర్చలు విఫలమైతే తమ ప్రయోజనాలను, వ్యాపారాలను రక్షించుకోవడానికి మరిన్ని ప్రతీకార సుంకాలు తప్పవని స్పష్టం చేశారు. అయితే ఈ సుంకాల యుద్ధంతో అంతిమంగా నష్టపోయేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ...సమరమే: కెనడా ప్రపంచ వాణిజ్య వ్యవస్థనే అతలాకుతలం చేసే ట్రంప్ సుంకాలపై పోరాడతామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రతిజ్ఞ చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే కెనడాపై తాజా టారిఫ్ల ప్రభావం పరిమితమే. అయినా ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్స్పై అమెరికా సుంకాలు లక్షలాది కెనడియన్లను నేరుగా ప్రభావితం చేస్తాయని కార్నీ ఆక్షేపించారు. ఈ సుంకాలను ప్రతిదాడులతో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. మంచిది కాదు: బ్రిటన్ వాణిజ్య యుద్ధం ఎవరికీ మంచిది కాదని బ్రిటన్ ప్రధాని కియిర్ స్టార్మర్ వ్యాఖ్యానించారు. ‘‘అన్ని పరిస్థితులకూ మేం సిద్ధంగా ఉన్నాం. ప్రతిస్పందనగా మావైపు నుంచి ఏ చర్యలనూ తోసిపుచ్చలేం’’అని పార్లమెంటుకు చెప్పారు. విచారకరం: జపాన్ ఈ దిగుమతి సుంకాలు చాలా విచారకరమని జపాన్ వ్యాఖ్యానించింది. అవి ప్రపంచ వాణిజ్య సంస్థ, యూఎస్–జపాన్ ఒప్పందాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. అమెరికా తమపై విధించిన 36 శాతం సుంకంపై చర్చలు జరుపుతామని అయితే థాయిలాండ్ తెలిపింది. సుంకాల ప్రకటనకు ఒక రోజు ముందే.. అమెరికా దిగుమతులపై ఇజ్రాయెల్ అన్ని సుంకాలను రద్దు చేసినా.. ఫలితం లేకపోయింది. ఇజ్రాయెల్ వస్తువులపై ట్రంప్ 17 శాతం సుంకాలను విధించడంపై ఆ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భారీ మూల్యం తప్పదు: ఆ్రస్టేలియా ఆ్రస్టేలియా గొడ్డు మాంసంపై ట్రంప్ కఠిన ఆంక్షలు దారుణమని ప్రధాని ఆంటోనీ అల్బనీస్ విమర్శించారు. ఇందుకు అమెరికా ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అయితే, ‘‘మేం పరస్పర సుంకాలకు దిగబోం. అధిక ధరలకు, ఆర్థిక మందగమనానికి దారితీసే రేసులో చేరబోం’’అని స్పష్టం చేశారు. కంపెనీలను కాపాడుకుంటాం: స్పెయిన్ దేశీయ కంపెనీలను, పరిశ్రమలను, మొత్తంగా ఆర్థిక రంగాన్ని ఈ సుంకాల ప్రభావం బారినుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుని తీరతామని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ప్రకటించారు. స్వేచ్ఛా వాణిజ్య ప్రపంచమే తమ లక్ష్యమన్నారు. గొడవలొద్దు: స్వీడన్ వాణిజ్య అడ్డంకులను కోరుకోవడం లేదని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్ అన్నారు. ‘‘మాకు వాణిజ్య యుద్ధం వద్దు. అమెరికాతో కలిసి వాణిజ్యం, సహకార మార్గంలో పయనించాలని, తద్వారా ఇరు దేశాల ప్రజలు మెరుగైన జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాం’’అని చెప్పారు. హానికరమైన సుంకాలు: ఇటలీ ట్రంప్ సుంకాలను ఆయన మిత్రురాలు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఘాటుగా విమర్శించారు. ఈ సుంకాలు హానికరమని హెచ్చరించారు, ‘‘వాణిజ్య యుద్ధాన్ని నివారించాలి. అది తీవ్రతరం కాకముందే పరిష్కారం కోసం అమెరికా ప్రయతి్నంచాలి’’అని సూచించారు. ఆర్థిక సంక్షోభం: ఫ్రాన్స్ ట్రంప్ సుంకాలు అతి పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తాయని ఫ్రాన్స్ ఆందోళన వెలిబుచి్చంది. ఫ్రెంచ్ వైన్, స్పిరిట్స్ ఎగుమతులపై ఇవి గణనీయ ప్రభావం చూపుతాయని ప్రభుత్వ ప్రతినిధి సోఫీ ప్రైమాస్ వ్యాఖ్యానించారు. తక్షణం రద్దు చేయాలి: చైనా ఏకపక్ష టారిఫ్లను అమెరికా తక్షణం రద్దు చేయాలని చైనా డిమాండ్ చేసింది. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఇవి గొడ్డలి పెట్టని అభిప్రాయపడింది. అమెరికా ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ సరఫరా గొలు సులను కూడా దెబ్బతీస్తాయని హెచ్చరించింది. విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికాకు సూచించింది.చర్చలే మార్గం: దక్షణ కొరియా ఈ సమస్యకు చర్చలే మార్గమని ద క్షణ కొరియా అభిప్రాయపడింది. ప్రపంచ వాణిజ్య యుద్ధం వాస్తవ రూపం దాల్చిందని తాత్కాలిక అధ్యక్షుడు హాన్ డక్ సూ అన్నారు. ఆర్థిక మంత్రి, ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష జరిపారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి శక్తి సామ ర్థ్యాలన్నింటినీ ధారపోద్దామని చెప్పారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
గాజాలో ఆకలి కేకలు: పిండీ లేదు.. తిండీ లేదు
రంజాన్ పండుగతో పాటే ప్రపంచవ్యాప్తంగా ముస్లింల ఉపవాస దీక్షలు ముగిసినా గాజాలో మాత్రం పాలస్తీనియన్లకు నిత్య ఉపవాసాలే కొనసాగుతున్నాయి. తినడానికి ఏమీ లేక ఖాళీ జనం డొక్కలెండుతున్నాయి. గాజాకు మానవతా సాయాన్ని, ఆహార సరఫరాను ఇజ్రాయెల్ పూర్తిగా అడ్డుకోవడంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఐరాసతో పాటు అంతర్జాతీయ సమాజం భారీ పరిమాణంలో పంపిన ఆహార నిల్వలన్నీ సరిహద్దుల వద్దే కుళ్లిపోతున్నాయి. గాజా ఏమో నిస్సహాయ స్థితిలో ఆకలితో యుద్ధం చేస్తోంది. రంజాన్ పండుగ సందర్భంగా కూడా కనీసం రొట్టెముక్కయినా దొరకని కుటుంబాలెన్నో...! ఇది చాలదన్నట్టు పిండి నిల్వలు కూడా పూర్తిగా నిండుకోవడంతో తాజాగా గాజాలో బేకరీలన్నీ మూతబడ్డాయి!!ఈద్. పవిత్ర రంజాన్ మాసానికి ముగింపు. సాధారణంగా అయితే గాజావాసులకూ వేడుకే. కుటుంబాలన్నీ కలిసి ఆనందంగా పండుగ జరుపుకొంటాయి. కానీ గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అక్కడ ఈద్ పాలస్తీనావాసుల ఆకలి కేకలు, ఇజ్రాయిల్ బాంబు దాడుల నడుమే ముగిసింది. యుద్ధం దెబ్బకు గాజా ఆహారోత్పత్తి సామర్థ్యం పూర్తిగా పడకేసింది. దాంతో తిండికి కూడా అంతర్జాతీయ సాయంపైనే ఆధారపడుతోంది. ఇజ్రాయెల్ మాత్రం తమ బందీల విడుదల కోసం హమాస్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా మార్చి నుంచే గాజాకు ఆహారం, మానవతా సాయం సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. దాంతో సహాయక ట్రక్కులు గాజాలో అడుగు పెట్టి మూడు వారాలు దాటింది. 18 నెలల క్రితం యుద్ధం మొదలైనప్పటి నుంచీ గాజాకు ఇంతకాలం పాటు ఎలాంటి ఆహార సరఫరాలూ అందకపోవడం ఇదే తొలిసారి. దాంతో ఇంధనం తదితరాల కొరత తారస్థాయికి చేరింది. అంతేకాదు, కనీసం పిండి నిల్వలు కూడా లేని పరిస్థితి! దాంతో బుధవారం గాజాలోని బేకరీలన్నీ మూతబడ్డాయి. స్థానిక బేకరీ యజమానుల సంఘం చీఫ్ అబ్దెల్ నాసర్ అల్–అజ్రామి ఈ మేరకు ప్రకటించారు. ‘‘గిడ్డంగుల్లో పిండి పూర్తిగా అయిపోయినట్టు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్పీ) మాకు తెలిపింది. ఇజ్రాయిల్ రఫా క్రాసింగ్ తదితరాలను తెరిచి సహాయక సామగ్రి, మానవతా సాయాలను తిరిగి గాజాలోకి అనుమతించేదాకా బేకరీలు పనిచేయబోవు’’అని వెల్లడించారు. అబద్ధాలతో నిద్రపుచ్చుతూ... పాలస్తీనియన్ల ఆకలిని తీరుస్తున్న ప్రధాన వనరు రొట్టె మాత్రమే. చికెన్, మాంసం, కూరగాయలు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. అందుబాటులో ఉన్న ఇతర ఆహార పదార్థాలను రొట్టెను తింటూ రోజులు వెళ్లదీస్తున్నారు. ‘‘పరిస్థితి వివరించలేనంత దారుణంగా ఉంది. నా కుటుంబసభ్యులకు బ్రెడ్ కోసం ఉదయం 8 గంటల నుంచీ వెతుకుతున్నాను. డెయిర్ అల్–బలాహ్లోని అన్ని బేకరీల చుట్టూ తిరిగా. ఒక్కటి కూడా పనిచేయడం లేదు. పిండి లేదు. కట్టె లేదు. ఏమీ లేవు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవు. ఇంత దారుణం చూస్తామని ఎన్నడూ అనుకోలేదు’’అని ఇబ్రహీం అల్ కుర్ద్ అనే స్థానికుడు వాపోయాడు. ‘‘పిల్లలు రాత్రి భోజనం చేయకుండానే పడుకుంటున్నారు. ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టండి, ఉదయాన్నే పిండి తెచ్చుకుందామని వారికి అబద్ధాలు చెబుతూ నిద్రపుచ్చుతున్నాం’’అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. రఫా తదితర క్రాసింగ్లను తిరిగి తెరిచేలా ఇజ్రాయెల్పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలని ఆయన వేడుకుంటున్నాడు. చుక్కల్లో పిండి ధరలు... రొట్టెతో పాటు గాజావాసులకు వంట కోసం గ్యాస్ను కూడా బేకరీలే అందించేవి. అవి మూతబడటంతో తిండి వండుకోవడానికి కలపనే ఆశ్రయిస్తున్నారు. కానీ దానికీ తీవ్ర కొరతే ఉంది. కలపను బ్లాక్ మార్కెట్లో అడ్డగోలు ధరలకు అమ్ముతున్నారు. దాంతో అదీ జనానికి అందుబాటులో లేకుండా పోయింది. నూనె, ఈస్ట్ వంటి బేకింగ్ పదార్థాలు కూడా కొనలేని పరిస్థితి! బేకరీలు మూతబడటంతో పిండి ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. ఒక్క సంచీ ఏకంగా 400 షెకెల్స్ (115 డాలర్ల)కు అమ్ముతున్నారు. యుద్ధానికి ముందు 25 షెకెల్స్ ఉండేది. గత జనవరిలో స్వల్పకాలిక కాల్పుల విరమణ సందర్భంగా కూడా 35 షెకెల్స్కు దొరికేది. ‘‘ప్రజలు ఇప్పుడు యుద్ధ భయాన్ని, బాంబు దాడులను, వలస కష్టాలను, అన్నింటినీ మర్చిపోయారు. వారి ఆలోచనలన్నీ ఏ పూటకు ఆ పూట పిండి ఎలా దొరుకుతుందా అన్నదాని మీదే ఉన్నాయి’’అని ఉత్తర గాజాకు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అహ్మద్ డ్రెమ్లీ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘యుద్ధం మొదలైనప్పుడు ప్రజలు ఆరోగ్యంగా, దేన్నయినా తట్టుకునే సామర్థ్యంతో ఉన్నారు. ఇప్పుడంతా మారిపోయింది. రొట్టెకు కూడా దిక్కు లేదు! దాంతో జనం ఏది దొరికినా తిని కడుపు నింపుకుంటున్నారు. కానీ కొద్ది రోజులుగా చాలామందికి తినేందుకు ఏమీ దొరకడం లేదు. బియ్యం కొనడానికి అప్పు చేస్తున్నారు. ఇంట్లో ఉన్నవన్నీ అమ్ముకుంటున్నారు. చాలామంది పాలస్తీనియన్లు రద్దీగా ఉన్న గుడారాల్లో బతుకీడుస్తున్నారు. కొందరైతే వీధుల్లోనే నిద్రపోతున్నారు. తిండి వండుకునే పరిస్థితులు కూడా లేవు’’అంటూ గాజాలోని దైన్యాన్ని ఆయన వివరించారు. దారుణ సంక్షోభం: ఐరాస ‘‘కాల్పుల విరమణ సమయంలో గాజాలోకి రోజుకు 500 నుంచి 600 ట్రక్కుల్లో సహాయక సామగ్రి వచ్చేది. ఇప్పుడన్నీ ఆగిపోయాయి. కాల్పుల విరమణ ముగిసి యుద్ధం తిరిగి మొదలైనప్పటినుంచీ ఘోరమైన మానవతా సంక్షోభం నెలకొంది. మార్చి 2 నుంచి గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా ఆపేసింది. ముఖ్యంగా బేకరీల మూతతో ఆహారం కోసం కేవలం వాటిపైనే ఆధారపడ్డ లక్షలాది మంది అల్లాడుతున్నారు. దిగ్బంధాన్ని తక్షణం ఎత్తేయకపోతే గాజాలో త్వరలోనే మరణమృదంగం తప్పదు’’అని ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) కమిషనర్ జనరల్ ఫిలిప్ లజారి హెచ్చరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వరమివ్వని ఉద్యానం
‘గ్రోత్ ఇంజిన్లు’గా చెప్పుకునే అరటి, చీనీ, టమాట, మిర్చి, మామిడి ఈ ఏడాది ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. లక్షలాది రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పంటలు కన్నీళ్లే మిగిల్చాయి. పంట పండితే ధరలు లేవు, ధరలుంటే పంటలు పండవు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. గతంలో ఎన్నడూ లేనంతగా అరటి, మిర్చి, టమాట రైతులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉద్యాన రైతులకు ఎక్కడా ఊరట లభించడం లేదు. అరటి రైతులైతే ఈ ఏడాది దారుణంగా దెబ్బతిన్నారు.పెట్టుబడులు పెరగడం, ధర తగ్గడంతో నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఒక దశలో రూ. 25 వేలు పలికిన టన్ను అరటి.. నేడు రూ.11 వేలు కూడా లేదు. రైతులేమో ఎకరాకు రూ. లక్షన్నర వరకూ పెట్టుబడి పెట్టారు. చాలా చోట్ల దిగుబడి బాగా వచ్చినా ధరల్లేక నిరాశే మిగులుతోంది. వాస్తవానికి జిల్లాలో పండే ‘గ్రాండ్ నైన్ అరటి’కి అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర లభిస్తున్నా ఎగుమతి సౌకర్యం లేకపోతోంది. మిరప, టమాట రైతుల కన్నీళ్లు మిరప, టమాట రైతులను కదిలిస్తే కన్నీటి గాథ బయటికొస్తోంది. మార్కెట్లో ప్రస్తుతం పచ్చి మిర్చి కేజీ రూ.20 లేదా రూ.30 కంటే ఎక్కువ లేదు. కేజీ కనీసం రూ.40 పలికితేనే రైతుకు గిట్టుబాటవుతుంది. రిటైల్ మార్కెట్లోనే రూ.20 ఉంటే రైతు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక టమాట రైతులకు అప్పులే మిగులుతున్నాయి. గడిచిన నాలుగు నెలలుగా కిలో టమాట రూ.10 కంటే ఎక్కువ పలకడం లేదు. ఎరువులు, పురుగుమందు ఖర్చులు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. చీనీ రైతులకూ చేదు గుళికలే.. రాష్ట్రంలోనే అత్యధికంగా చీనీ దిగుబడి జిల్లాలో ఉంటుంది. చీనీ టన్ను ఇటీవల కాలంలో రూ.20 వేలు మించి పలకడం లేదు. 2021 కరోనా అనంతరం టన్ను లక్ష రూపాయలు అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది నేడు రూ.20 వేలు ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వేయొచ్చు. మరోవైపు.. మామిడి ప్రస్తుతానికి పూత, పిందె వస్తున్నా.. వచ్చే రోజుల్లో నిలబడగలదా అన్న భయం రైతుల్లో నెలకొంది.ప్రభుత్వమే ఆదుకోవాలి రెండు ఎకరాల్లో టమాట పంటను సాగు చేశా. సుమారు రూ. లక్ష పెట్టు బడి పెట్టా. «గిట్టుబాటు ధర లేకపోవటంతో పంటను తోటలోనే వదిలేశా. టమాట పంటకు మద్దతు ధర ప్రకటించి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.– బసవరాజు, దొడగట్ట, కళ్యాణదుర్గంమార్కెటింగ్ సౌకర్యం లేదు2 ఎకరాల్లో అరటి సాగు చేశా. ఎకరాకు రూ. లక్ష చొప్పున రెండు లక్షల వరకూ పెట్టుబడి పెట్టా. పంట ఉత్పత్తుల ఎగుమతులకు సరైన సౌకర్యం లేకపోవడంతో గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. – నాగరాజు, పెద్దజలాలపురం గ్రామం, శింగనమల, మండలం -
బిల్లుపై ఎవరి వాదనేమిటి?
వక్ఫ్. కొద్ది రోజులుగా దేశమంతటా చర్చనీయంగా మారిన అంశం. ఇస్లాం సంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ ఆస్తులన్నీ అల్లాకు చెందుతాయని భావిస్తారు. కనుక వాటి అమ్మకం, ఇతర ప్రయోజనాలకు వాడకం పూర్తిగా నిషిద్ధం. మసీదులు, మదర్సాలు, శ్మశానవాటికలు, అనాథాశ్రమాల నిర్మాణ నిర్వహణ తదితరాల నిమిత్తం ఉపయోగించాలి. భారత్లో వక్ఫ్ సంప్రదాయం 12వ శతాబ్ధంలో దిల్లీ సుల్తానుల హయాంలో మొదలైంది. స్వాతంత్య్రానంతరం 1954లో కేంద్ర వక్ఫ్ చట్టం వచ్చింది. దాని స్థానంలో 1995లో తెచ్చిన కొత్త చట్టం ద్వారా వక్ఫ్ బోర్డులకు మరిన్ని అధికారాలు దఖలు పడ్డాయి. వాటిని అపరిమితంగా పెంచుతూ యూపీఏ ప్రభుత్వం 2013లో మరిన్ని సవరణలు చేసింది. దేశవ్యాప్తంగా 8.7 లక్షలకు పైగా వక్ఫ్ ఆస్తులున్నాయి! వీటన్నింటికీ కలిపి 9.4 లక్షల ఎకరాలున్నాయి! ఆ లెక్కన వక్ఫ్ బోర్డులు దేశంలో మూడో అతి పెద్ద భూ యజమానులుగా అవతరించాయి. వాటి భూముల మొత్తం విలువ కనీసం రూ.1.2 లక్షల కోట్ల పై చిలుకేనని అంచనా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 వక్ఫ్ బోర్డులున్నాయి. వాటిలో అవినీతి తీవ్ర సమస్యేనని ముస్లిం సంఘాలు కూడా అంగీకరిస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశవ్యాప్తంగా 60 వేలకు పైగా వక్ఫ్ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. 13 వేలకు పైగా ఆస్తులు కోర్టు వివాదాల్లో ఉన్నాయి. ఇక 4.35 లక్షల ఆస్తుల గురించి సమాచారమే లేదు! వక్ఫ్ భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని అన్యాక్రాంతం చేస్తోందని సచార్ కమిటీ ఆక్షేపించింది కూడా. అయితే తీవ్ర వాద వివాదాల నడుమ వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభ బుధవారం ఆమోదించింది. కేంద్ర వక్ఫ్ మండలి, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల ఏర్పాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. ఈ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నది విపక్షాల ఆరోపణ. దీన్ని వక్ఫ్ భూములను ముస్లింల నుంచి లాక్కునేందుకు మోదీ సర్కారు కుట్రగా మజ్లిస్ వంటి పార్టీలు అభివర్ణిస్తున్నాయి. ఇందులోని పలు ప్రతిపాదనలు 14, 26, 26, 29 తదితర ఆర్టికల్స్కు పూర్తిగా విరుద్ధమని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వక్ఫ్ రగడపై ఇండియాటుడే న్యూస్ చానల్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ బుధవారం చర్చా కార్యక్రమం నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా, వ్యతిరేకంగా పలు పార్టీల నేతలు తదితరులు, నిపుణులు వాదనలు విన్పించారు. వక్ఫ్ ఆస్తులు అంతిమంగా పేద ముస్లింల అభ్యున్నతికి దోహదపడాలన్నదే తాజా బిల్లు ఉద్దేశమని ప్రభుత్వం చెబుతుండగా అందులోని ప్రతిపాదనలను అంశాలవారీగా విపక్షాలు దుయ్యబట్టాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
చాక్లెట్ పంట.. ధరలేక తంటా
సాక్షి, అమరావతి: చాక్లెట్ పంట అన్నదాతకు చేదును పంచుతోంది. కంపెనీలు సిండికేట్గా మారి కోకో గింజల ధరల్ని అమాతం తగ్గించేయడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. కష్టకాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం కంపెనీలకు కొమ్ముకాస్తూ తమని పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో 1.12 లక్షల ఎకరాల్లో కోకో తోటలు ఉండగా.. ఎకరాకు 3–4 క్వింటాళ్ల చొప్పున ఏటా 12 వేల టన్నుల గింజల దిగుబడి వస్తోంది. ఇందులో 80 శాతం గింజల్ని క్యాడ్బరీ, మిగిలింది నెస్లే, క్యాంప్కో, లోటస్ (Lotus) తదితర కంపెనీలు సేకరిస్తున్నాయి. కోకో పంటకు నవంబర్ నుంచి జూన్ వరకు సీజన్. జూలై నుంచి అక్టోబర్ వరకు అన్ సీజన్. దిగుబడిలో రెండొంతులు సీజన్లోనూ, ఒక వంతు అన్ సీజన్లోనూ చేతికొస్తుంది. గతంలో సీజన్, అన్ సీజన్ అనే తేడా లేకుండా గింజలన్నింటినీ ఒకే రీతిలో అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా కంపెనీలు కొనుగోలు చేసేవి. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. గతేడాది కిలో గింజల ధర రూ.1,050 గతేడాది ఇదే సమయంలో కిలో కోకో గింజలకు రూ.1,050 ధర లభించింది. ఈ ఏడాది కంపెనీలు సిండికేట్గా మారి అనూహ్యంగా ధరలు తగ్గించేయడంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో కిలో గింజల ధర రూ.770కి పైగా పలుకుతుండగా, కంపెనీలు మాత్రం నాణ్యమైన (ప్రీమియం) గింజలకు సైతం రూ.400–450 మధ్య చెల్లిస్తున్నాయి. అన్సీజన్ గింజల్ని కొనేందుకు కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు కిలో రూ.200–250 మధ్య కొనుగోలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రస్తుతం కోతకు వచ్చిన సీజన్ పంటకు సైతం కంపెనీలు గిట్టుబాటు ధర చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. కోతకు సిద్ధంగా ఉన్న పంట కాకుండా రైతుల వద్ద దాదాపు 1,500 టన్నులకు పైగా కోకో గింజల నిల్వలున్నాయి. దిగుమతుల వల్లే.. ఈ ఏడాది చాక్లెట్ కంపెనీలు విదేశాల నుంచి కోకో గింజలు, పొడి, బటర్ దిగుమతి చేసుకోవడంతో ఇక్కడి రైతులు పండించిన పంటకు డిమాండ్ లేకుండాపోయింది. కోకో రైతుల్లో అత్యధికులు కౌలుదారులే. ఎకరాకు రూ.1.10 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు కౌలు చెల్లిస్తుంటారు. తెగుళ్లు, చీడపీడలు, యాజమాన్య పనుల కోసం ఏటా రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడి పెడుతుంటారు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక సతమతమవుతున్న రైతులు కంపెనీల మాయాజాలం వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. సీజన్, అన్సీజన్తో సంబంధం లేకుండా అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా కోకో గింజల్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా.. ప్రభుత్వం జోక్యం చేసుకుని కంపెనీల మాయాజాలాన్ని అడ్డుకోవాలని ఏపీ కోకో రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ధరల స్థిరీకరణ నిధి పథకాన్ని కోకో రైతులకూ వర్తింప చేయాలని కోరారు. కోకో రైతులను ఆదుకోకపోతే ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ప్రభుత్వం స్పందించడం లేదుఎకరాకు రూ.1.40 లక్షల చొప్పున చెల్లించేలా 60 ఎకరాలను కౌలుకు తీసుకుని కోకో సాగు చేస్తున్నా. ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడులు అవుతున్నాయి. అన్సీజన్కు సంబంధించి 7 టన్నుల గింజలు ఉండగా.. కిలో రూ.330 చొప్పున 2.50 టన్నులు అమ్మాను. మిగిలిన 4.50 టన్నులు అమ్ముదామంటే కొనేవారు లేదు. సీజన్కు సంబంధించి 7 టన్నుల గింజల్ని కిలో రూ.550 చొప్పున కొన్నారు. ఇంకా 4 టన్నులు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు కిలో రూ.450కు మించి కొనలేమని చెబుతున్నారు. మరో రెండు టన్నుల వరకు పంట రావాల్సి ఉంది. ఈ ఏడాది పెట్టుబడులు కూడా వచ్చేలా కనిపించడం లేదు. లీజుకు చెల్లించాల్సిన మొత్తం నష్టపోయినట్టే. పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఏమాత్రం స్పందించలేదు.రూ.45 లక్షలకు పైగా నష్టపోతున్నా ఈ రైతు పేరు అవర్ని అనిల్కుమార్. ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాయన్నపాలేనికి చెందిన ఈయన 150 ఎకరాలను కౌలుకు తీసుకుని.. ఎకరాకు రూ.1.40 లక్షల చొప్పున కౌలు చెల్లిస్తూ కోకో సాగు చేస్తున్నారు. ఎకరాకు రూ.40 వేల చొప్పున పెట్టుబడి అవుతోంది. ఎకరాకు 3.50 క్వింటాళ్ల చొప్పున కోకో గింజల దిగుబడి వచ్చింది. అన్ సీజన్(వర్షాకాలం)లో తీసిన పంటను కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. బతిమాలుకుంటే కిలోకు రూ.200–250 మించి ధర ఇచ్చేది లేదంటున్నారు. చదవండి: భోజనం లేదు.. పుస్తకాల్లేవు!గతేడాది ఇదే సమయంలో సీజన్, అన్ సీజన్తో సంబంధం లేకుండా కిలో గింజలకు రూ.1,050 చొప్పున ధర దక్కింది. ఈ ఏడాది అమాంతం ధర తగ్గిపోవడంతో ఎకరాకు రూ.30 వేల చొప్పున మొత్తంగా తాను రూ.45 లక్షల మేర నష్టపోతున్నట్టు రైతు అనిల్కుమార్ ఘొల్లుమంటున్నారు. కోకో గింజల్ని కొనుగోలు చేసే కంపెనీలు సిండికేట్గా మారి ధరల్ని దారుణంగా తగ్గించేయడంతో కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. -
ఆటిజం.. అర్థం చేసుకుందాం
సుధ (పేరు మార్చాం) ఇద్దరు పిల్లల తల్లి. పిల్లలకు ఏడాదిన్నర వయసు నుంచి మారాం చేసినా, అన్నం తినకపోయినా సెల్ఫోన్లో వీడియోలు పెట్టి చూపించడం అలవాటు చేసింది. ఐదేళ్ల వయసుకు వచ్చినా ఇద్దరు పిల్లలకు మాటలు సరిగా రాలేదు. ఎవరు ఏం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితి లేదు. వైద్యులను సంప్రదిస్తే ఆటిజం అని చెప్పారు.రాజ్యలక్ష్మికి నెలలు నిండకుండానే ముగ్గురు పిల్లలు పుట్టారు. ఇద్దరు కుమారుల్లో ఒకరికి రెండేళ్లు వచ్చే వరకు నడక రాలేదు. వైద్యుల వద్దకు వెళ్లగా ఆటిజం ఉన్నట్టు తేల్చారు. రెండో బాబుకు సమస్య పాక్షికంగా ఉన్నట్టు చెప్పారు.ఇదో జబ్బు అని చెప్పలేం. బుద్ధి మాంద్యతా అంటే అదీ కాదు. మానసిక వైకల్యం అనీ అనలేం. ఏదో పెద్ద లోపంగా పరిగణించలేం. ప్రత్యేకంగా మందులంటూ ఏమీ లేవు. ఎందువల్ల దీని బారిన పడతారనే దానికి స్పష్టమైన కారణాలూ ఇప్పటివరకు తెలియవు. థెరపీలు, తల్లిదండ్రులకు అవసరమైన కౌన్సెలింగ్ మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం. అదే ఆటిజం (సాధారణ పిల్లల్లా లేకపోవడం). ఇది చిన్న పిల్లల్ని పీడించే ఓ రుగ్మత..ఓ సమస్య అని మాత్రమే చెప్పగలమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ ఆటిజంతో బాధ పడుతున్న కొందరిలో తెలివితేటలు (ఇంటెలిజెన్స్ కోషియంట్– ఐక్యూ) ఒకింత ఎక్కువగా ఉండటం గమనార్హం. కాగా ఇలాంటివారిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోపగించుకోవడం కానీ వేరుగా చూడడం కానీ చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లల్లో ఉండాల్సిన సహజ చురుకుదనం లేమి కారణంగా తల్లిదండ్రులను ఎంతో వేదనకు గురిచేసే ఆటిజంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం మీ కోసం..ఏంటీ ఆటిజం.. ?ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన రుగ్మత. అంటే న్యూరలాజికల్ డిజార్డర్గా భావించవచ్చు. అంతేగానీ ఓ జబ్బుగా పరిగణించడానికి వీల్లేదు. ఒకే రకమైన/నిర్దిష్ట లక్షణాలుండవు. ఏ ఇద్దరు పిల్లల్లోనూ ఒకేలా ఉండవు. లక్షణాల విస్తృతి చాలా ఎక్కువ. అందుకే దీనిని స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన రుగ్మత) లేదా ఆటిజమ్ స్పెక్ట్రమ్ అని చెబుతుంటారు. ఎలాంటి లక్షణాలుంటాయి?» చూడటానికి సాధారణ పిల్లల్లాగే కన్పిస్తుంటారు. కానీ.. » వయసుకు తగిన వికాసం లోపించిందా? అన్పించవచ్చు. » సాధారణ చిన్నారుల్లా ప్రతిస్పందించకపోవచ్చు. పేరు పెట్టి పిలుస్తున్నా పలుకకపోవచ్చు. » ఇతరులతో సమాచారం పంచుకోవడం (కమ్యూనికేషన్లో ఇబ్బంది), సంభాషిoచడంలో ఇబ్బంది పడుతుండొచ్చు. ఎదుటివారి కళ్లలో కళ్లు కలిపి చూస్తూ మాట్లాడలేరు. ఎంత పిలిచినా పలకకుండా వినికిడి లోపం ఏదైనా ఉందేమో అనిపించేలా ప్రవర్తిస్తారు. » దాదాపు 25 శాతం మంది చిన్నారులు మాటల్ని సరిగా పలుకలేరు. మాటలు రావడంలో ఆలస్యం అవుతుంది. » ఏదో లోకంలో ఉన్నట్టుగా ఉంటుండొచ్చు లేదా పలికిన మాటే పదే పదే పలుకుతూ ఉండవచ్చు. » యాస్పర్జస్ డిజార్డర్ ఉన్న పిల్లల్లో తెలివితేటలు ఒకింత ఎక్కువగా ఉండి, కొన్ని పనుల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. » కుదురుగా ఉండకుండా ఎప్పుడూ పరుగెడుతూ, గెంతుతూ ఉంటారు.» నీట్గా ఉండకపోవడం. చక్కగా డ్రస్ చేసుకోడానికి,సమయానికి హెయిర్ కట్ చేయించుకోడానికి నిరాకరించడం.» చేసిన పనులే పదే పదే చేస్తుండటం (రిపిటేటివ్ బిహేవియర్). కొత్త పనులపై ఆసక్తి చూపకపోవడం. ఎప్పుడూ తమకు ఇష్టమైన ఆట వస్తువునో మరొకటో పట్టుకుని ఉండటం. » గోడలపై ఉన్న సున్నం నాకడం లేదా తినడానికి యోగ్యం కాని పదార్థాలను తినడానికి యత్నించడం (పేపర్లు, షర్ట్ కాలర్ వంటి వాటిని నోట్లో పెట్టుకుని తినడానికి ప్రయత్నించడం లాంటి డిజార్డర్లు). » పిల్లలు సాధారణంగా చేసే గీతలు గీయడం, రాయడం, కత్తెర వంటి పనిముట్లను ఉపయోగించడం, నమలడం కూడా సరిగా చేయకపోవడం » సంతోషం, బాధ వంటి భావనలను త్వరగా అర్థం చేసుకోలేరు. వాటిని అర్థమయ్యేలా చెప్పలేరు. » తలను గోడకు లేదా నేలకేసి బాదుకోవడం, ఇతరులను బలంగా ఢీకొట్టడం,వస్తువులను విసిరేయడం వంటి దురుసు ప్రవర్తనలు కనబరచడం.రకరకాల థెరపీలతోనే చికిత్సచిన్నారుల వ్యక్తిగత లక్షణాలూ, భావోద్వేగ పరమైన అంశాలను బట్టి న్యూరో స్పెషలిస్టులు, సైకాలజిస్టులు, స్పీచ్ థెరపిస్టులు, బిహేవియరల్ థెరపిస్టులు ఇలా అనేక మంది స్పెషలిస్టుల సహాయంతో, సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ వంటి ప్రక్రియలతో సమీకృత చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలకు అవసరమైన విద్య అందించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సికింద్రాబాద్లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజెబిలిటీస్’(ఎన్ఐఈపీఐడీ) వంటి సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ చిన్నారుల కనీస స్వావలంబన కోసం పలు సామాజిక సంస్థలు, ఎన్జీవోలు కూడా పనిచేస్తున్నాయి. అటిజమ్ ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారుతోంది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు కావడం, పిల్లలతో గడిపే తీరిక లేకపోవడం, ఎక్కువగా స్క్రీన్కు అడిక్ట్ కావడం వంటివి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. చదవండి: టీకాలతో ఆటిజం వస్తుందా? అసలు చికిత్స ఉందా? -
ఓరుగల్లు సిగలో లోహవిహంగ నగ
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ మామునూరు విమానాశ్రయానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. సుమారు 44 ఏళ్ల క్రితం మూతపడిన ఈ విమానా శ్రయం నుంచి మళ్లీ విమానం ఎగిరేందుకు కార్యా చరణ సిద్ధమైంది. ఈ విమానాశ్రయం పునరుద్ధ రణతో హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే అతి పెద్ద నగరంగా పేరున్న వరంగల్ అభివృద్ధిలో మరింత ప్రగతి సాధించనుంది. కాకతీయ మెగా జౌళిపా ర్కు, ఐటీ పరిశ్రమలు ఏర్పడటం.. యునెస్కోతో రామప్ప అంతర్జాతీయ పర్యాటక కేంద్రం కావడం.. ఇలా ఒక్కొక్కటిగా వస్తున్న ప్రాజెక్టులు ఓరుగల్లు ప్రతిష్టను పెంచుతున్నాయి. సుమారు 44 ఏళ్ల తర్వాత తెలంగాణలో రెండో ప్రాంతీయ విమా నయాన కేంద్రంగా రూపుదిద్దుకోబోతుండగా.. భవిష్యత్ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. అర్ధ శతాబ్దం, ఆకాశయానం... 1930లో మామునూరు ప్రాంతంలో నిర్మించిన ఈ విమానాశ్రయం, నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆధ్వర్యంలో ప్రారంభం కాగా.. సోలాపూర్ వ్యాపార అభివృద్ధి, సిర్పూర్ కాగజ్నగర్ కాగిత పరిశ్రమ, వరంగల్ అజంజాహీ మిల్స్ అవసరాలకు సేవలు అందించేది. 1981 వరకు.. సుమారు అర్ధశతాబ్దం అనేక మంది ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు తమ పర్యటనలకు ఈ విమానాశ్రయాన్ని ఉపయోగించుకున్నారు. ఇండో–చైనా యుద్ధ సమయంలో ఢిల్లీ విమానాశ్రయాన్ని శత్రువులు లక్ష్యంగా చేసుకున్న సమయంలో కూడా, ఈ విమానాశ్రయం ప్రయాణికులకు సేవలు అందించింది. అయితే 1981లో వివిధ కారణాలతో ఈ విమానాశ్రయం మూత పడింది. మళ్లీ తెరిచేందుకు ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకపోగా.. సీఎం రేవంత్రెడ్డి చొరవతో మామునూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధ రణకు లైన్క్లియర్ అయ్యింది. ఇంతకాలం అడ్డంకిగా ఉన్న హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే జీఎంఆర్ గ్రూప్ నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (ఎన్ఓసీ) ఇవ్వడంతో మార్గం సుగమం అయ్యింది. పున రుద్ధరణకు విమానాశ్రయం డీపీఆర్ను సిద్ధం చేసే పనిలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిమగ్నమైంది. కొత్త ఎయిర్పోర్టులో ఇవీ..ఎయిర్బస్ ఎ–320, బోయింగ్ బీ–737 వంటి వైడ్–బాడీ విమానాలను ఉంచడానికి కొత్త రన్వే నిర్మించనున్నారు. విమానాశ్రయాన్ని సిగ్నల్ టవర్, భద్రతా వ్యవస్థలు, ఇతర కీలకమైన మౌలిక సదుపాయాలతో అప్గ్రేడ్ చేస్తారు. ఈ విమానాశ్రయం ప్రారంభంలో ముంబై, ఢిల్లీ, తిరుపతి, బెంగళూరు, విజయవాడ వంటి నగరాలకు దేశీయ మార్గాలను అందిస్తుంది. భవి ష్యత్తు ప్రణాళికల్లో భాగంగా ఈ విమానాశ్రయం చివరికి అంతర్జాతీయ ప్రయా ణికులు, కార్గో సేవలను అందిస్తుంది. కాగా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు దగ్గరగా ఉండటం వల్ల ఇతర జాతీయ, అంతర్జాతీయ ఎయిర్పోర్టుల కనెక్టివిటీ, తద్వారా ఆర్థిక వృద్ధికి అవకాశాలు మెండు. రద్దీగా ఉండే హైదరాబాద్ నగరంపై ఒత్తిడిని తగ్గించడానికి కూడా వరంగల్ను అభివృద్ధి చేయడం ఒక మార్గంగా ప్రభుత్వాలు భావి స్తున్నాయి. అంతేగాకుండా వరంగల్ చారిత్రక ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి, స్థిరమైన అభివృద్ధి సాధనకు ప్రభుత్వం వరంగల్ను సుందర నగరం (స్మార్ట్సిటీ), హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన (హృదయ్) వంటి పథకాల అమలు.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), కాకతీయ యూనివర్సిటీ (కేయూ), కాళోజీ హెల్త్ యూనివర్సిటీ (కేఎన్ఆర్)లున్న వరంగల్లో విద్య, వైద్యం, ఐటీ, పరిశ్రమల రంగాల అభివృద్ధికి ఎయిర్పోర్ట్ మరింత దోహదపడుతుంది.మున్ముందు ఎన్నో ప్రయోజనాలు.. వచ్చే 20 ఏళ్లలో మామునూరు విమానాశ్రయం తెలంగాణలో ఒక ముఖ్యమైన విమానయాన కేంద్రంగా మారడంతోపాటు.. వరంగల్, సమీప ప్రాంతాల్లో పెట్టుబడులను పెంచుతుంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, మద్రాస్ మహానగరాల్లో ఉన్న కంపెనీలు తమ బ్రాంచీలను ఏర్పాటు చేసేందుకు ఉపయోగంగా ఉంటుంది. మహానగరాలతో పోల్చుకుంటే లివింగ్ కాస్ట్ ఇక్కడ తక్కువగా ఉండడం వల్ల ఐటీ ఉద్యోగులు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉంటాయి. గుజరాత్లోని రాజ్కోట్ వరంగల్ పట్టణం కంటే చిన్నది. అయినప్పటికి అక్కడ ఎయిర్పోర్టు ఉండడం వల్ల పట్టణానికి చుట్టూ స్పిన్నింగ్ మిల్లులు ఏర్పాటయ్యాయి. అదే విధంగా ముంబై, గుజరాత్, కోల్కతా, కోయంబత్తూరు లాంటి నగరాలకు చెందిన వస్త్ర పరిశ్రమలకు చెందిన వారు ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. వరంగల్ చారిత్రాత్మకంగా గుర్తింపు పొందడంతోపాటు రామప్ప, మేడారం, లక్నవరం, తాడ్వాయి అభయారణ్యం ఉన్నందున టూరిజం పెరుగుతుంది. దేశ విదేశాలకు చెందిన పర్యా టకులు ఇక్కడకు వచ్చి సందర్శించే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వేలాది మంది స్థానికులు విద్య, ఉద్యోగాల పరంగా అనేక దేశాల్లో ఉంటున్నారు. వారు తక్కువ సమయంలో వచ్చివెళ్లేందుకు ఎయిర్పోర్టు ఎంతో ఉప యోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా హోట ళ్లు, ఇతర సంస్థలు ఏర్పాటు కావడం వల్ల స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది.‡ వరంగల్ కాటన్, చిల్లీస్కు గుర్తింపు పొందినందున ఎయిర్పోర్టు ఉంటే ఫుడ్ ఆధారిత కంపెనీలు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి.మామునూరు ఎయిర్పోర్టుతో మహర్దశహైదరాబాద్ తర్వాత వరంగల్లో ఐటీ సెక్టార్ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందుకు వస్తున్నందున పలు కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎయిర్పోర్టు ప్రారంభమైతే ఎంతో బిజీగా ఉండే ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీఈవోలు, ఇంటర్నేషనల్ సెక్టార్లకు చెందిన సీఈవోలు వచ్చి పోయేందుకు అనుకూలం. అందువల్ల ఇక్కడ కంపెనీలు పెట్టే అవకాశాలు ఉంటాయి. వరంగల్ కాటన్, చిల్లీస్కు గుర్తింపు పొందినందున ఎయిర్పోర్టు ఉంటే ఫుడ్ ఆధారిత కంపెనీలు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తులు, గ్రానైట్ తదితర ఉత్పత్తులు అంతర్జాతీయంగా ఎగుమతులు అయ్యేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. – బొమ్మినేని రవీందర్రెడ్డి, అధ్యక్షుడు, వరంగల్ కామర్స్ ఆఫ్ ఇండస్ట్రీ, తెలంగాణ రాష్ట్ర కాటన్ వెల్ఫేర్ అసోసియేషన్మెడికల్ ఎమర్జెన్సీ, పరిశోధనలకు అవకాశం..వరంగల్లో ఎయిర్పోర్ట్ రాకతో విద్యార్థులకు ఏరోనాటి కల్ విభాగంలో నూతన ఆవిష్క రణ లకు, పరిశోధనలకు అనువై న అవకాశం లభిస్తుంది. వ్యాపా ర, వాణిజ్య, రియల్ ఎస్టేట్, టూరిజం రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రోపాలిటన్ నగరాలకు వెళ్లేందుకు ప్రయాణసమయాన్ని ఆదా చేసుకోవచ్చు. విపత్తు, ఆపద సమయాల్లో మెడికల్ ఎమర్జెన్సీని త్వరితగతిన అందించవచ్చు. – పి.రామ్లాల్, ప్రొఫెసర్, ఎన్ఐటీ, వరంగల్ఐటీ సంస్థలు ఎక్కువగా వస్తాయి..మామునూర్కు ఎయిర్ పోర్టు రావడం వల్ల ఐటీ సంస్థలు వరంగల్కు రావ డానికి అవకాశం ఉంది. దీంతో జిల్లాలోని నిరు ద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరగ నున్నాయి. గతంలోకన్నా ఎక్కువగా ఐటీ సంస్థలు రావడానికి అవకాశాలు పెరగ నున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా యువ కులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. – దార ధనుంజయ్, ఐటీ ఉద్యోగి, మడికొండ, గ్రేటర్ వరంగల్నిట్ ‘దాసా’ విద్యార్థులకు ప్రయాణం ఈజీ..ఎన్ఐటీ వరంగల్లో విద్యనభ్యసిస్తున్న డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్రోడ్ స్కీం (దాసా) విద్యార్థులు తమ గమ్యాన్ని చేరేందుకు మంచి అవకాశం. హైదరాబాద్లోని రాజీవ్గాంధీ ఎయిర్పోర్ట్కు వెళ్లకుండా మామునూర్లో ప్రారంభమయ్యే విమానాశ్రయం నుంచి ప్రయాణ అవకాశం పొందవచ్చు. వరంగల్ నగరాన్ని ఆర్థికంగా ఉన్నతస్థాయిలోకి చేర్చేందుకు ఉపయోగపడుతుంది. యువత ఉపాధికల్పనకు తోడ్పడుతుంది. – మహ్మద్ శార్జిల్, ఎంబీఏ విద్యార్ధి, ఎన్ఐటీ, వరంగల్ -
Ghibli ఫొటోలు ట్రై చేస్తున్నారా?.. ఇది మీకోసమే!
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్.. ఇలా ఏ సోషల్మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఫీడ్ మొత్తం జిబ్లీ(Ghibli) ఫొటోలతో నిండిపోతోంది. సామాన్యులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు.. ఇలా అంతా కార్టూన్ తరహా ఫొటోలను పంచుకుంటూ మురిసిపోతున్నారు. ఎడాపెడా ఫొటోలు అప్లోడ్ చేస్తుండడంతో.. నెట్టింట ఈ నయా ట్రెండ్ ఊపేస్తోంది. అయితే అలా అప్లోడ్ చేసే ముందు ఇది ఎంతవరకు సురక్షితం అనే ఆలోచన మీలో ఎంతమంది చేస్తున్నారు?.. ఏఐ బేస్డ్ చాట్బాట్ యూజర్లను ఆకర్షించేందుకు ఆయా కంపెనీలు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే.. ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల చాట్జీపీటీలో (ChatGPT) జిబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టింది. తమకు కావాల్సిన ఫొటోను ఎంచుకుని.. ఫలానా స్టైల్లో కావాలని కోరితే చాలూ.. ఆకర్షనీయమైన యానిమేషన్ తరహా ఫొటోలను సృష్టించుకోవచ్చు. ఈ ట్రెండ్ విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడంతో ఇతర ఏఐ ప్లాట్ఫామ్లు సైతం ఇవే సదుపాయాన్ని అందిస్తున్నాయి. అయితే ఆ వాడకం పరిధి దాటి శ్రుతిమించి పోతోంది. ఎంతవరకు సురక్షితం?ఏదైనా మనం ఉపయోగించినదాన్ని బట్టే ఉంటుంది. అది సాంకేతిక విషయంలో అయినా సరేనని నిఫుణులు తరచూ చెబుతుంటారు. అలాగే జిబ్లీ స్టైల్ ఏఐ ఇమేజ్ జనరేటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సృజనాత్మకత మరీ ఎక్కువైపోయినా.. భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. మరోవైపు వ్యక్తిగతమైన ఫొటోలను ఏఐ వ్యవస్థల్లోకి అడ్డగోలుగా అప్లోడ్ చేస్తే.. అవి ఫేషియల్ డాటాను సేకరించే ప్రమాదమూ లేకపోలేదని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఇలాగే కొన్ని కంపెనీలు వ్యక్తిగత డాటాను తమ అల్గారిథమ్లలో ఉపయోగించుకుంటున్న పరిస్థితులను నిపుణులు ఉదాహరిస్తున్నారు.అలాంటప్పుడు ఏం చేయాలంటే..వ్యక్తిగత ఫొటోలను అప్లోడ్ చేసేటప్పుడు.. ఆ జనరేటర్ను క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రైవసీ పాలసీల విషయంలో నమ్మదగిందేనా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోండి. అందుకోసం సదరు జనరేటర్ గురించి నెట్లో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దానికి యూజర్లు ఇచ్చే రివ్యూలను చదవాలి. అన్నికంటే ముఖ్యమైన విషయం.. సున్నితమైన అంశాల జోలికి పోకపోవడం. చిన్నపిల్లల ఫొటోలను ప్రయత్నించకపోవడమే మంచిది. మరీ ముఖ్యమంగా ప్రముఖుల ఫొటోలను ప్రయత్నించకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇది చట్టపరమైన చర్యలకు అవకాశం కూడా ఇచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ప్రస్తుతానికి.. ఛాట్జీపీటీ, గూగుల్ జెమినీ, ఎక్స్ గ్రోక్, డీప్ఏఐ, ప్లేగ్రౌండ్ఏఐలు.. పరిమితిలో ఉచితంగా,అలాగే పెయిడ్ వెర్షన్లలోనూ రకరకాల ఎఫెక్ట్లతో ఈ తరహా ఎఫెక్ట్లను యూజర్లకు అందిస్తున్నాయి. వీటితో పాటు జిబ్లీ ఏఐ కూడా స్టూడియో జిబ్లీస్టైల్ ఆర్ట్ వర్క్తో ఫొటోలను చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. నోట్: పర్సనల్ డాటా తస్కరణ.. సైబర్ నేరాలు పెరిగిపోతున్న రోజుల్లో ఏ టెక్నాలజీని అయినా.. అదీ సరదా కోణంలో అయినా ఆచితూచి.. అందునా పరిమితంగా వాడుకోవడం మంచిదనేది సైబర్ నిపుణుల సూచన. -
చేవ కలిగిన చేప!
సాక్షి, అమరావతి: చేపలు సాగు చేసే రైతులకు శుభవార్తే. వ్యాధులు సోకని హై గ్రోత్ చేపలు మార్కెట్లోకి రాబోతున్నాయి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ (సిఫా) అభివృద్ధి చేసిన ఈ చేప విత్తనాలు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వ్యాధుల నియంత్రణకే ఖర్చెక్కువ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో 5.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా, దాంట్లో, 2.30 లక్షల ఎకరాల్లో చేపలు (Fishes) సాగవుతున్నాయి. మరోవైపు ఇన్ల్యాండ్ పబ్లిక్ వాటర్ బాడీస్లో కూడా చేపలు సాగవుతుంటాయి. ప్రధానంగా బొచ్చె (కట్ల), రాగండి (రోహు), మోసులు, రూప్ చంద్, ఫంగస్, పండుగప్ప, కొర్రమేను, తలాపియా వంటి వివిధ రకాల చేపలు సాగులో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా కట్ల, రోహూ రకాల చేపలే ఎక్కువగా సాగులో ఉన్నాయి. ఏటా 45 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అవుతుండగా, 70 నుంచి 80 శాతం ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకే ఎగుమతి అవుతుంటాయి.1980వ దశకంలో అభివృద్ధి చేసిన ఈ రకాలు దాదాపు 40 ఏళ్లుగా సాగులో ఉండడం, వీటిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడంతో పాటు ఏటా పెరుగుతున్న వ్యాధులు రైతులకు పెనుసవాల్గా మారాయి. పేను, రెడ్ డిసీజ్, గిల్ ఫ్లూక్స్, ఆర్గులస్ (ఫిష్లైస్) వంటి వివిధ రకాల వ్యాధుల నియంత్రణకు ఏటా లక్షలాది రూపాయలు ఖర్చుచేస్తున్నారు. లీజుతో కలిపి ఎకరాలో చేపలసాగుకు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంటే దాంట్లో రూ.30 వేల నుంచి రూ.40వేల వరకు ఈ వ్యాధుల నియంత్రణకే ఖర్చుచేయాల్సి వస్తుంది. పదేళ్ల కృషి ఫలితం వ్యాధులను సమర్ధవంతంగా ఎదుర్కొనే ప్రత్యామ్నాయ రకాల అభివృద్ధి కోసం దశాబ్ద కాలం పాటు సిఫా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలించాయి. వ్యాధులు దరిచేరని ఐదో తరానికి చెందిన అమృత బొచ్చె, జయంతి రాగండి రకాలను అభివృద్ధి చేశారు. క్షేత్రస్థాయి పరీక్షల అనంతరం పలుచోట్ల ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయవంతం చేశారు. చేపల ఉత్పత్తిలో దేశంలోనే ఆగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఈ చేపల విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సీడ్ పునరుత్పత్తి కోసం బాపట్లకు చెందిన హేచరీతో అవగాహనా ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న బొచ్చె, రాగండి చేపలు 10–12 నెలలకు కిలో నుంచి కిలోన్నర పెరిగితే, అమృత బొచ్చె, జయంతి రాగండి చేపలు కేవలం 6–8 నెలల కాలంలోనే కిలోకి పైగా ఎదుగుతాయి. అదే ఏడాది పాటు సాగు చేస్తే 2–2.5 కేజీల పెరుగుదలతో 30–40 శాతం హై గ్రోత్ కలిగి ఉంటాయి. సంప్రదాయ చేపలకు ఎక్కువగా సోకే రెడ్ డిసీజ్, పేను వ్యాధులు వీటికి సోకవు. ఈ కారణంగా ఎకరాకు మందులకు ఉపయోగిస్తున్న వ్యయాలు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు ఆదా అవుతుంది. పైగా 6–8 నెలల్లోనే పట్టుబడికి రావడంతో సమయం కలిసొస్తుంది. అంటే సగటున రెండేళ్లకు మూడు పంటలు వేయొచ్చు. లేదంటే ఏడాది పాటు పెంచితే, వీటి గ్రోత్ కారణంగా 30–40 శాతం అదనంగా ఆదాయం వస్తుంది. ఇవి చూడడానికి గులాబీ రంగులో ఉంటాయి. పొడవు ఎక్కువగా, వెడల్పు తక్కువగా ఉంటాయి. బాణం ఆకారంలో నోరు కలిగి ఉంటుంది. సాధారణ బొచ్చె, రాగండి చేపల కంటే చాలా పెద్ద సైజులో ఉంటాయి. పాలీకల్చర్కు ఎంతో అనువైనవి.చదవండి: గడ్డి భూముల్లో హాయ్, హాయ్నాణ్యమైన సీడ్ అందించాలి.. నేను మూడు దశాబ్దాలుగా దాదాపు 150 ఎకరాల్లో చేపల సాగులో చేస్తున్నా. ప్రస్తుతం సాగులో ఉన్న కట్ల, రోహూ రకాలు దాదాపు 40 ఏళ్లపాటు సాగులో ఉండడం, పిల్లల ఉత్పత్తిలో ఇన్బ్రీడింగ్ వల్ల వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోయింది. ఏటా వీటికి సోకే వ్యాధుల నియంత్రణకు వాడే మందుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనితో పెట్టుబడి భారం పెరుగుతోంది. వీటికి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన అమృత కట్ల, జయంతి రోహూ రకాలను సాధ్యమైనంత త్వరగా అందించగలిగితే చేప రైతులు నిలదొక్కుకోగలుగుతారు. జెనెటికల్లీ ఇంప్రూవ్డ్ బ్రూడర్స్ ద్వారా నాణ్యమైన సీడ్ ఉత్పత్తికి సిఫా తోడ్పాటు అందించాలి. – పి.బోసురాజు, కార్యదర్శి ఏపీ ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ చేప రైతులకు నిజంగా వరం సిఫా అభివృద్ధి చేసిన అమృత కట్ల, జయంతి రోహు రకాలు చేపల రైతులకు నిజంగా వరం. ఇవి ఐదో తరానికి చెందిన రకాలు. జెనెటికల్లీ ఇంప్రూవ్డ్ రకాలు కావడంతో వ్యాధులు దరిచేరవు. ఆ మేరకు పెట్టుబడి ఆదా అవుతుంది. ఇప్పటికే బాపట్లలోని హేచరీలకు బ్రూడర్లు అందించాం. వచ్చే సీజన్ నుంచి ఈ చేప పిల్లలు పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి వస్తాయి. – డాక్టర్ రమేష్ రాథోడ్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ సిఫా -
ట్రంప్ మూడో ముచ్చట తీరేనా?
‘మూడోసారి కూడా అధ్యక్షుడు కావాలనుకుంటున్నా. నేనేమీ జోక్ చేయడం లేదు. సీరియస్గానే చెప్తున్నా. నన్ను మూడోసారి కూడా అధ్యక్షునిగా చూడాలని అమెరికన్లలో చాలామంది కోరుకుంటున్నారు’ – రెండోసారి అధ్యక్షుడై మూడు నెలలైనా నిండకముందే డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. మూడో టర్ము గురించిన ఆకాంక్షలను వెలిబుచ్చడం ఆయనకు ఇది తొలిసారేమీ కాదు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం గత జనవరిలో కూడా, ‘ఒకట్రెండు సార్లు మాత్రమే కాదు, మూడు, ఇంకా చెప్పాలంటే నాలుగుసార్లు కూడా దేశానికి సేవ చేయడం నాకు అత్యంత గౌరవప్రదమైన విషయం’అని చెప్పుకొచ్చారు. రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టేందుకు అమెరికా రాజ్యాంగం అనుమతించదని తెలిసీ ట్రంప్ ఎందుకిలాంటి ప్రకటన చేశారన్నది ఆసక్తికరం. మనసుంటే మార్గముంటుందన్నట్టు, ‘మూడో’ముచ్చట తీర్చుకునేందుకు ట్రంప్కు అవకాశముందని అభిమానులు చెబుతున్నారు. అందుకే అంత బాహాటంగా ఆ ప్రకటన చేశారంటున్నారు. అదెంతవరకు సాధ్యమన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అంతేగాక ట్రంప్ యోచనకు అనుకూలంగా, వ్యతిరేకంగా కూడా పలు వాదనలు తెరపైకి వస్తున్నాయి. అవేమిటంటే...రాజ్యాంగాన్ని సవరించాలి అమెరికా రాజ్యాంగానికి చేసిన 22వ సవరణ ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టడానికి వీల్లేదు. అంతేకాదు. ఏ కారణాలతోనైనా రెండేళ్లు, అంతకంటే ఎక్కువకాలం అధ్యక్షునిగా చేసినా సరే, ఈ సవరణ ప్రకారం వారు మరొక్కసారి మాత్రమే తిరిగి ఎన్నిక కావచ్చు. ఈ లెక్కన ట్రంప్ కోరిక నెరవేరాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. కానీ అది అత్యంత కష్టసాధ్యం. ఎందుకంటే ఆ సవరణను కాంగ్రెస్ ఉభయ సభలూ మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించాలి. ఆ మీదట మూడొంతుల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదముద్ర వేయాలి. కానీ అధికార రిపబ్లికన్లకు కాంగ్రెస్లో అంతæ మెజారిటీ లేదు. పైగా 50 రాష్ట్రాల్లో 18 విపక్ష డెమొక్రాట్ల చేతుల్లోనే ఉన్నాయి.‘ఉపాధ్యక్ష’దారిలో... అధ్యక్ష పదవికి రెండుకంటే ఎక్కువసార్లు ‘ఎన్నిక’కావడాన్ని మాత్రమే 22వ సవరణ నిషేధిస్తోంది. వారసత్వంగా ఆ పదవిని పొందే విషయంపై మాత్రం అందులో ఎలాంటి ప్రస్తావనా లేదు. దీన్ని ట్రంప్ తనకు అనుకూలంగా వాడుకోనున్నట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు! ‘‘ఏ కారణంతోనైనా అధ్యక్షుడు రాజీనామా చేస్తే నిబంధనల ప్రకారం ఆ పదవి ఉపాధ్యక్షునికే దక్కుతుంది. కనుక 2028లో ట్రంప్ ఉపాధ్యక్ష బరిలో దిగుతారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తారు. గెలిస్తే వెంటనే రాజీనామా చేస్తారు. తద్వారా ట్రంప్ ఆటోమేటిగ్గా మూడోసారి అధ్యక్షుడైపోతారు’’అంటున్నారు. ఈ ఆలోచన తన మనసులో ఉందని ట్రంప్ అంగీకరించారు కూడా. కానీ దీనిపై భిన్న వాదనలున్నాయి. ఇది అసాధ్యమని యూనివర్సిటీ ఆఫ్ నోర్టెడామ్లో ఎన్నికల నిబంధనల నిపుణుడైన ప్రొఫెసర్ డెరెక్ ముల్లర్ చెబుతున్నారు. ‘‘అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అర్హత లేని వ్యక్తి ఉపాధ్యక్ష పదవికి కూడా పోటీ పడేందుకు కూడా అనర్హుడేనని 12వ రాజ్యాంగ సవరణ స్పష్టం చేస్తోంది. 2028లో అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడు గనుక ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కూడా అనర్హుడే అవుతారు’’అని ఆయన స్పష్టం చేశారు. ఇవన్నీ కాకుండా ఒకవ్యక్తి మూడుసార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అనుమతిస్తూ రాజ్యాంగాన్ని సవరించాలని రిపబ్లికన్ నేత ఆండీ ఓగ్లెస్ గత జనవరిలో ప్రతిపాదించారు. అంతగా అయితే ఆ మూడుసార్లు వరుసగా కాకుంటే చాలంటూ ఓ నిబంధన విధిస్తే సరిపోతుందని సూచించారు.9 మంది గెలవకుండానే అధ్యక్ష పీఠమెక్కారుఅమెరికా చరిత్రలో ఏకంగా 9 మంది ఉపాధ్యక్షులు ఎన్నికల పోరులో గెలవకుండానే అత్యున్నత పీఠమెక్కారు. అధ్యక్షుని మరణం, లేదా రాజీనామా వల్ల తాము అధ్యక్షులయ్యారు. వయసు అనుమతించేనా? మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు వయసు కూడా ట్రంప్కు అడ్డంకిగానే మారేలా కన్పి స్తోంది. ఆయనకిప్పటికే 78 ఏళ్లు. ఆ లెక్కన ఈ పదవీ కాలం ముగిసేసరికి 82 ఏళ్లకు చేరుకుంటారు. ఆ వయసులో తిరిగి ఎన్నికల బరిలో దిగాల్సి ఉంటుంది. అదెంత వరకు సాధ్యమన్నది కాలం గడిస్తే గానీ తేలదు.వద్దే వద్దు: డెమొక్రాట్లు ట్రంప్ మూడో టర్ము వ్యాఖ్యలను విపక్ష డెమొక్రాటిక్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ‘‘ఇటువంటి ఆలోచనలతో ప్రజాస్వామ్యానికి ఆయన మరింతగా తూట్లు పొడుస్తున్నారు. రెండోసారి అధ్యక్షుడైతేనే ప్రపంచమంతటినీ ఇంతటి గందరగోళంలోకి నెట్టేస్తున్న ఆయన మూడోసారి గద్దెనెక్కేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. కాంగ్రెస్లోని రిపబ్లికన్ ప్రతినిధులకు రాజ్యాంగంపై ఏమాత్రం విశ్వాసమున్నా ట్రంప్ మతిలేని మూడో టర్ము ఆకాంక్షలను తక్షణం బాహాటంగా ఖండించాలి’’అని డిమాండ్ చేసింది. రిపబ్లికన్లలో కూడా కొందరు మూడో టర్ము సరైన యోచన కాదంటున్నారు. ఈ ఆలోచనకు తానసలే మద్దతివ్వబోనని ఓక్లహామీ సెనేటర్ మార్కవైన్ ములిన్ ఇటీవలే చెప్పారు.రూజ్వెల్ట్ నాలుగుసార్లు! రెండు కంటే ఎక్కువసార్లు అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన ఏకైక నేతగా ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ నిలిచిపోయారు. 32వ అధ్యక్షునిగా 1933లో తొలిసారి గద్దెనెక్కిన ఆయన 1945లో మరణించేదాకా పదవిలోనే కొనసాగారు! అత్యధిక కాలం పాటు అధ్యక్షునిగా కొనసాగిన రికార్డు కూడా ఆయనదే. అధ్యక్ష పదవిని రెండుసార్లకు మించి చేపట్టరాదన్న సంప్రదాయాన్ని అమెరికా మొదటినుంచీ పాటిస్తోంది. దీనికి బాటలు వేసింది తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టనే. ఆయన వరుసగా రెండుసార్లు గెలిచారు. మూడోసారీ అధ్యక్షుడు కావాలని దేశమంతా కోరినా సున్నితంగా నిరాకరించి తప్పుకున్నారు. అప్పటినుంచి అందరు అధ్యక్షులూ అనుసరిస్తూ వస్తున్న ఆ సంప్రదాయాన్ని రూజ్వెల్ట్ మాత్రం అతిక్రమించారు. రెండో ప్రపంచ యుద్ధాన్ని, హిట్లర్ సారథ్యంలో నాజీల దూకుడును బూచిగా చూపిస్తూ 1940, 1944 అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా మరో రెండుసార్లు పోటీ చేసి గెలిచారు. అయితే 1944లో నాలుగోసారి బరిలో దిగేనాటికే రూజ్వెల్ట్ ఆరోగ్యం క్షీణించింది. 1945లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే మరణించారు. అనంతరం రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టకుండా 1951లో 22వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచి్చంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
5 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగింది
అపారమైన మంచు నిల్వలకు గ్రీన్లాండ్ ఆలవాలం. ప్రపంచంలోని మొత్తం మంచినీటిలో 8 శాతం అక్కడే ఉందని అంచనా. అలాంటి గ్రీన్లాండ్లో మంచు శరవేగంగా కరిగిపోతోంది. ఎంతగా అంటే ఏటా సగటున 5,500 కోట్ల టన్నుల మేరకు! 1992లో మొదలైన ఈ ధోరణి ఏటా అంతకంతకూ పెరుగుతూనే వస్తోందట. ఆ లెక్కన గత 28 ఏళ్లలో అక్కడ ఏకంగా 5 లక్షల టన్నుల మంచు మాయమైపోయిందట! గ్రీన్లాండ్పై గ్లోబల్ వార్మింగ్ ప్రభావంపై చేపట్టిన అధ్యయనంలో సైంటిస్టులు ఈ మేరకు తేల్చారు. ఇది ఒక్క గ్రీన్లాండ్కే పరిమితం కాదని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) తెలిపింది. ‘‘మొత్తమ్మీద ధ్రువాల వద్ద మంచు కరుగుదల ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇది చాలా ఆందోళనకర పరిణామం’’అని ఆందోళన వెలిబుచి్చంది. అక్కడ మంచు ఈ స్థాయిలో కరిగిపోవడానికి నిర్దిష్ట కారణాలేమిటో తేల్చే పనిలో పడింది. అక్కడినుంచి ఆవిరవుతున్న నీరు ఎటు వెళ్తోందో తెలియడం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు అక్కడి నీటి ఆవిరిని డ్రోన్ల సాయంతో సేకరించి పరిశోధిస్తున్నారు. ఇందుకోసం భూ ఉపరితలం నుంచి 5,000 అడుగుల ఎత్తు దాకా వివిధ స్థాయిల్లో నీటి ఆవిరిని పలు దఫాలుగా సేకరించారు. ‘‘ఆవిరయ్యే నీటిలో ఎంతోకొంత తిరిగి మంచుగా మారి అక్కడే పడుతుంది. కానీ చాలావరకు మాత్రం గ్రీన్లాండ్ జలవ్యవస్థకు శాశ్వతంగా దూరంగా వెళ్లిపోతోంది. ఇదే ఆందోళన కలిగించే విషయం’’అని అధ్యయనానికి సారథ్యం వహించిన కెవిన్ రోజి్మయారెక్ వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈసారి ఎండలు ఎక్కువే!
న్యూఢిల్లీ: ఈసారి ఎండల భగభగ తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఎండలు సాధారణానికి మించిన తీవ్రతతో ఉండొచ్చని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. మధ్య, పశ్చిమ, వాయవ్య భారతం మైదాన ప్రాంతాల్లో వడగాడ్పులు ఎక్కువ రోజులు కొనసాగే అవకాశముందని కూడా అంచనా వేసింది. తూర్పు, పశ్చిమ భారతం మినహా దేశంలోని మిగతా అన్ని ప్రాంతాల్లోనూ ఈసారి సాధారణ గరిష్ట స్థాయికి మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. తూర్పు, పశ్చిమ భారత్లో సాధారణ ఉష్ణోగ్రతలే కొనసాగుతాయంది. అత్యధిక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగతలు సైతం సాధారణ స్థాయికి మించి ఉండే అవకాశముందని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర సోమవారం వర్చువల్ మీడియా సమావేశంలో వివరించారు. ‘ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉత్తర, తూర్పు, మధ్య భారతదేశం, వాయవ్య భారతంలోని మైదాన ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు నుంచి నాలుగు రోజులు అధికంగానే వడగాడ్పులు వీచే అవకాశముంది. మామూలుగా, ఈ కాలంలో నాలుగు నుంచి ఏడు రోజులు మాత్రమే వడగాడ్పులు వీస్తుంటాయి’అని ఆయన తెలిపారు. వడగాడ్పుల తీవ్రత తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో రాజస్తాన్, గుజరాత్, హరియాణా, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్లతోపాటు కర్ణాటక తమిళనాడుల్లోని ఉత్తర ప్రాంతాల్లో ఎక్కువగానే ఉంటుందని ఐఎండీ పేర్కొంది. -
గడ్డిభూముల్లో హాయ్.. హాయ్
సఫారీ.. ఈ మాట వింటే ఠక్కున గుర్తొచ్చేది దక్షిణాఫ్రికా. సవన్నాలుగా పిలిచే విశాలమైన పచ్చిక భూముల ప్రాంతం క్రూర మృగాలు, వన్యప్రాణుల ఆవాసం. కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రాంతంలో విహరిస్తుంటే ఆ ఆనందమే వేరు. అందుకే ఆ దేశం పర్యాటకానికి ప్రాధాన్యమిస్తోంది. తద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలను సృష్టిస్తోంది. ఈ విషయంలో భారత్ సైతం ఇప్పుడిప్పుడే చొరవ కనబరుస్తోంది. గడ్డిభూములున్న ప్రాంతాలను గుర్తించి పర్యావరణ, పర్యాటకాన్ని ద్విగుణీ కృతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇంతకీ ఆ గడ్డిభూములు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? అక్కడి విశేషాలేంటి?మహారాష్ట్ర మొదటగా..పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా పుణే(మహారాష్ట్ర) లోని అటవీ శాఖ షోలాపూర్లో గ్రాస్ ల్యాండ్ సఫారీ (గడ్డి భూముల్లో విహారయాత్ర)కి శ్రీకారం చుట్టింది. ఇక్కడి బోరామణి గ్రామ గడ్డి భూముల్లో తాజాగా ఈ ప్రక్రియను చేపట్టింది. ఈ భూములు కృష్ణ జింకలు, తోడేళ్ళు, బెంగాల్ నక్కలు, అడవి పందులు, రంగురంగుల సీతాకోకచిలుక జాతులకు ఆవాసాలు. ముఖ్యంగా అంతరించిపోతున్న అరుదైన బట్టమేక పక్షి (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్) ఉనికి ఇక్కడ కనిపిస్తుంది. వాటి సహజ ఆవాసాలను వాహనాల్లో సంచరిస్తూ వీక్షించే అవకాశాన్ని అటవీశాఖ కల్పిస్తోంది.రోజుకు రెండు సార్లు మాత్రమే..ఈ గ్రాస్ల్యాండ్ సఫారీ రెండు విడతల్లో ఉంటుంది. ఉదయం 6:30 నుంచి 10:30 వరకు, మధ్యాహ్నం 3:30 నుంచి 6:30 గంటల మధ్యలో విహరించేందుకు అనుమతిస్తున్నారు. వన్య ప్రాణులు, పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగించకుండా పరిమిత సంఖ్యలో వాహనాల్లో సంచరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సందర్శకులకు మెరుగైన అనుభవాన్ని పంచడానికి అటవీ శాఖ రాత్రి పూట బసలను అందుబాటులో ఉంచింది. ఈ గడ్డిభూముల్లో సందర్శకులు సొంత వాహనాల్లో, అద్దెవాహనాల్లో విహరిస్తూ ఆస్వాదించే సౌకర్యం కల్పించింది.కర్బన శోషకాలు.. గడ్డిభూములు కర్బన ఉద్గారాలతో పాటు ఉదజని (కార్బన్ డయాక్సైడ్)ని శోషించి వాతావరణాన్ని నియంత్రించడంలో గడ్డిభూములది కీలక పాత్ర. కృష్ణ జింకలు, జింకల్లాంటి శాకాహారులు, తోడేళ్లు, నక్కల్లాంటి మాంసాహారులు పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిలో ఎనలేని పాత్ర పోషిస్తాయి. గడ్డిభూముల సంరక్షణ విషయానికి వస్తే..అడవులతో పోల్చి చూస్తే తక్కువే అని చెప్పొచ్చు. పర్యావరణ స్థిరత్వాన్ని కాపాడటంలో ఇవి ఎంతో ముఖ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రాఫర్లు, పరిశోధకులకు స్వేచ్ఛగా గడ్డిభూముల్లో విహరించే వీలు కల్పించడం ద్వారా వీటి సంరక్షణపై అవగాహన తీసుకురావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. 2024 జనవరిలో ప్రారంభంగడ్డిభూముల్లో సఫారీకి 2024 జనవరిలో పుణే, షోలాపూర్ ప్రాంతాల్లో తొలిసారిగా శ్రీకారం చుట్టారు. ఇక్కడ అటవీ రేంజ్ లోని గడిఖేల్, శిర్షుపాల్, సబ్లెవాడీ, పర్వాడీ పరిధిలో విశాలమైన పచ్చిక బయళ్లలో సఫారీ ప్రారంభించారు. ఇది విజయవంతం కావడంతో గడ్డిభూములున్న ప్రాంతాల్లో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగుతున్నారు. దీంతో స్థానికులకు ప్రత్యక్ష,ంగా, పరోక్షంగా ఉపాధి దొరికింది. శిక్షణ పొందిన స్థానిక గైడ్లకు రూ. వేలల్లో ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. -
పొమ్మనకుండా పొగ.. సీనియర్లకు లోకేశ్ సెగ
టీడీపీలో సీనియర్ నేతలు ఒక్కొక్కరికీ వరుసగా తలుపులు మూసుకుపోతున్నాయి. మంత్రి లోకేశ్ అభీష్టం మేరకు.. తనకు బాగా సన్నిహితులైనవారిని కూడా సీఎం చంద్రబాబు దూరం పెట్టేస్తున్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం సీనియర్లకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్గజపతిరాజు, కంభంపాటి రామ్మోహనరావు వంటి వారిని ఇప్పటికే దాదాపు రిటైర్ చేశారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, మాగంటి బాబు వంటి పలువురు నేతలకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలుగా ఉన్నా కొందరి పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైంది. గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ప్రస్తుతం మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడుకు పారీ్టలో ఎటువంటి ప్రాధాన్యం లేకుండా ఉన్నారు. – సాక్షి, ప్రత్యేక ప్రతినిధిమిగిలిన సీనియర్లకూ అదే గతి..చంద్రబాబు సమకాలీకుడైన అశోక్గజపతిరాజు కుమార్తె అదితి విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నారనే సాకుతో ఆయనకు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అవకాశాలు కల్పించలేదు. కేంద్ర మంత్రిగా, రాష్ట్రంలో పలుసార్లు మంత్రిగా పనిచేసిన అశోక్ అనుభవం, రాజకీయ నైపుణ్యాలను పట్టించుకోలేదు. దీంతో ఆయన ఇప్పుడు పారీ్టకి దూరంగా ఉంటున్నారు. అదితి కుమార్తె ఎమ్మెల్యేగా విజయనగరానికి పరిమితమయ్యారు.⇒ కంభంపాటి రామ్మోహనరావు ఒకప్పుడు చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడు. ఢిల్లీలో చంద్రబాబు తరఫున అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఇప్పుడు అవసరం లేకపోవడంతో కంభంపాటి ప్రాధాన్యత తగ్గిపోయింది. మరోసారి రాజ్యసభ సీటు ఇవ్వాలని ఆయన ప్రయత్నించినా పరిగణనలోకి తీసుకోలేదు.⇒ గోరంట్ల బుచ్చయ్యచౌదరి చిరకాల స్వప్నం మంత్రికావడం. కానీ, క్యాబినెట్లోకి తీసుకోలేదు. సొంత నియోజకవర్గంలో ఆయన చెప్పినవారికి పోస్టింగ్లూ ఇవ్వడం లేదు. ⇒ మాజీ హోం మంత్రి చినరాజప్పదీ ఇదే పరిస్థితి. ఉమ్మడి పశ్చిమలో ఒకప్పుడు చక్రం తిప్పిన మాగంటి బాబుకు అసలు సీటే ఇవ్వలేదు. ఇలా టీడీపీలో చాలామంది సీనియర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ⇒ పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న సీనియర్లకు లోకేశ్ జమానాలో తమకు అవకాశాలు వస్తాయా? అనే అనుమానాలు బలంగా మెదులుతున్నాయి. గత ఏడాది ఎన్నికల్లో బలమైన హామీలు పొందిన పిఠాపురం వర్మ వంటివారికీ నిరాశా నిస్పృహలు తప్పడం లేదు.యనమల.. సాగనంపారిలా..టీడీపీలో అత్యంత సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. స్పీకర్, ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అయితే, ఆయన కుమార్తె, తుని ఎమ్మెల్యే యనమల దివ్య అవినీతి వ్యవహారాలపై లీకులిచి్చ.. తద్వారా యనమల రాజకీయ భవిష్యతుకు చంద్రబాబు తెరదించారనే తీవ్ర చర్చ పార్టీ ముఖ్యుల్లో జరుగుతోంది. 2 నెలల కిందట రాజ్యసభకు వెళ్లే చాన్స్ను, 2 వారాల కిందట ఎమ్మెల్సీగా కొనసాగించడానికి వచి్చన అవకాశాన్ని నిరాకరించి రామకృష్ణుడికి దారులను శాశ్వతంగా మూసేయడంలో చంద్రబాబు కృతకృత్యులయ్యారనేది పరిశీలకుల విశ్లేషణ.తన కూతురు దివ్య, అల్లుడు వెంకట గోపీనాథ్ అవినీతిని సాకుగా చూపి.. తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ వ్యూహాత్మకంగా పావులు కదిపారని యనమల తన అంతరంగీకుల వద్ద వాపోతున్నారని సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుకు ముందు దివ్య, గోపీనాథ్ అవినీతిపై ఎల్రక్టానిక్, సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో దుమారం రేగింది. దివ్య తొలిసారి ఎమ్మెల్యే అయినా అవినీతి, అక్రమాలలో స్మార్ట్గా దూసుకుపోతూ తన పేరు బయటకు పొక్కకుండా అనుభవజు్ఞరాలిగా సెట్ చేసుకుంటున్నారంటూ పరోక్షంగా రామకృష్ణుడిని తాకేలా తూర్పారపట్టారు. స్వపక్షీయులకు చెందిన మద్యం షాపులు, బెల్టు షాపులు, అనుమతుల్లేని బార్లు, పేకాట క్లబ్బుల నిర్వాహకుల ద్వారా నెలకు రూ.కోటి, మట్టి, గ్రావెల్ దందా ద్వారా రూ.రెండు కోట్లు వెనకేసుకుంటున్నారని, తుని సమీపంలో విమానాశ్రయం ప్రతిపాదనలో భాగంగా 700 ఎకరాలలో సుమారు 300 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ కన్వర్షన్కు గాను ఇప్పటికే రూ.12 కోట్లు వెనకేసుకున్నారనేది పబ్లిక్ టాక్. రామకృష్ణుడు, దివ్య ఎక్కడా సీన్లో కనిపించకుండా వారి దగ్గరి బంధువు యనమల రాజేష్ ద్వారా అన్నీ నడిపిస్తున్నారని టాక్ నడుస్తోంది. హైదరాబాద్లో ఐఆర్ఎస్ అధికారైన దివ్య భర్త వెంకట గోపీనాథ్ ప్రతి శని, ఆదివారాలు తునిలో ఉంటూ అవినీతికి మార్గ నిర్దేశం చేస్తున్నారని చెబుతున్నారు. 2014–19 మధ్య డిప్యుటేషన్పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో పని చేసినప్పుడు నిధులు దారిమళ్లించడంతో పాటు అవినీతికి పాల్పడ్డారని అంటున్నారు. యనమలను పక్కన పెట్టేయడంలో బాబు, లోకేశ్ తప్పులేదని సమర్థించుకునేందుకు ఇప్పటికీ టీడీపీ అనుకూలురు, వారి సోషల్ మీడియాలో పై అంశాలతో కూడిన వీడియోలు హల్చల్ చేయిస్తుండటం గమనార్హం. యనమల కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా, మరో కుమార్తె భర్త పుట్టా మహే‹Ùయాదవ్ ఏలూరు ఎంపీగా, వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారని గుర్తుచేస్తూ.. పార్టీ ఏమైనా యనమల కుటుంబ ప్యాకేజీనా అనే కామెంట్లను టీడీపీ వారిచేతే గుప్పిస్తున్నారు. ఇక పార్టీ ఉన్నత స్థాయి ప్రణాళికల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయనే అనుమానాలు యనమల వర్గీయుల్లో బలంగా ఉన్నాయి. -
ట్రంప్ టారిఫ్ల టెన్షన్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార టారిఫ్ల అమలుకు డెడ్లైన్ అయిన ఏప్రిల్ 2 దగ్గరపడటంతో ఎగుమతి సంస్థల్లో గుబులు, గందరగోళం నెలకొంది. ఏయే రంగాలపై ఎంతెంత వేస్తారు, ఏయే రంగాలను వదిలేస్తారు అనే అంశాలపై అందరిలోనూ అయోమయం నెలకొంది. వాణిజ్య ఒప్పందాలపై సంప్రదింపులు జరిపే దేశాల జాబితాలో భారత్ని కూడా అమెరికా చేర్చడంతో ... టారిఫ్లపై బేరసారాలు చేసేందుకు అవకాశం దొరకవచ్చని, కొన్నాళ్లయినా సుంకాలు వాయిదా పడొచ్చేమోనని ఆశాభావం నెలకొంది. ఈ నేపథ్యంలో టారిఫ్లు, ఏయే రంగాలపై ప్రభావం పడొచ్చనే అంశాలను ఒకసారి చూస్తే.. – న్యూఢిల్లీఅమెరికా ప్రణాళిక ఏంటంటే..వివిధ దేశాలతో తమకున్న వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు వాటి నుంచి తమకు వచ్చే దిగుమతులపై అమెరికా సుంకాలను విధించడం / పెంచడం వంటి చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన ప్రతిపాదన ఇది. అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపై ఇతర దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్నాయని, అవరోధాలు ఏర్పరుస్తున్నాయనేది ట్రంప్ ఆరోపణ. దీని వల్ల 1 లక్ష కోట్ల డాలర్ల మేర వాణిజ్య లోటు ఉంటోందని, దీనితో అమెరికన్ పరిశ్రమలు, వర్కర్లపైనా ప్రతికూల ప్రభావం పడుతోందనేది ఆయన వాదన.2021–22 నుంచి 2023–24 మధ్య కాలంలో భారత్కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశంగా ఉంది. భారత్ ఎగుమతుల్లో 18 శాతం, దిగుమతుల్లో 6.22 శాతం, అన్ని దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్యంలో 10.73 శాతం వాటా అమెరికాది ఉంది. 2023–24లో భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 119.71 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇందులో భారత్ నుంచి 77.51 బిలియన్ డాలర్ల ఎగుమతులు, అమెరికా నుంచి 42.19 బిలియన్ డాలర్ల దిగుమతులు ఉన్నాయి. దీంతో వాణిజ్య మిగులు భారత్ పక్షాన సుమారు 35.31 బిలియన్ డాలర్లుగా నమోదైంది.భారత ఎగుమతులపై ప్రతీకార టారిఫ్లు ఏ స్థాయిలో ఉండొచ్చంటే..ప్రస్తుతానికి టారిఫ్లను ఏ విధంగా విధిస్తారనేది, అంటే ప్రోడక్టు స్థాయిలోనా, లేదా రంగాలవారీగానా, లేదా దేశ స్థాయిలోనా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..అమెరికా నుంచి దిగుమతులపై భారత్ విధించే సుంకాలు, నిజానికి ఆరోపిస్తున్న దానికంటే చాలా తక్కువ స్థాయిలోనే ఉంటున్నాయని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. అమెరికా గానీ సహేతుక వాణిజ్య విధానాన్ని అవలంబిస్తే, పెద్దగా అవాంతరాలు లేకుండా భారత పరిశ్రమలు ఎగుమతులను కొనసాగించవచ్చని, ఇరు దేశాల మధ్య మరింత సమతూకమైన, స్థిరమైన విధంగా వాణిజ్య బంధం బలోపేతం కావచ్చని పేర్కొన్నారు. నాలుగు స్థాయిల్లో టారిఫ్ల ప్రభావాలను జీటీఆర్ఐ అంచనా వేసింది.దేశ స్థాయిలో: భారత్ నుంచి అన్ని ఎగుమతులపై ఒకే రకంగా టారిఫ్లు విధించడం: ఒకవేళ ఈ విధానాన్ని అమలు చేస్తే మన ఎగుమతులపై అదనంగా 4.9 శాతం భారం పడుతుంది. ప్రస్తుతం అమెరికా ఉత్పత్తులపై మన దగ్గర టారిఫ్లు సగటున 7.7 శాతంగా ఉండగా, మన ఎగుమతులపై అక్కడ సగటున 2.8 శాతంగా ఉంటోంది. ఆ విధంగా రెండింటి మధ్య 4.9 శాతం వ్యత్యాసం ఉంది.వ్యవసాయం, పరిశ్రమల స్థాయిలో: ఈ విధానాన్ని అమలు చేస్తే వ్యవసాయోత్పత్తులపై అదనంగా 32.4 శాతం, పారిశ్రామికోత్పత్తులపై 3.3 శాతం భారం పడొచ్చు. ప్రస్తుతం అమెరికాకు భారత వ్యవసాయోత్పత్తులపై 5.3 శాతం సుంకాలు ఉండగా, అక్కడి నుంచి దిగుమతులపై అత్యధికంగా 37.7 శాతంగా (వ్యత్యాసం 32.4 శాతం) ఉంటోంది. మరోవైపు పారిశ్రామికోత్పత్తుల విషయానికొస్తే.. అమెరికా నుంచి దిగుమతులపై సగటున 5.9 శాతం, మన ఎగుమతులపై కేవలం 2.6 శాతం (వ్యత్యాసం 3.3 శాతం) ఉంటోంది.రంగాల స్థాయిలో: వివిధ రంగాల్లో ఇరు దేశాల ఉత్పత్తులపై టారిఫ్ల మధ్య వ్యత్యాసాలు వివిధ రకాలుగా ఉన్నాయి. రసాయనాలు..ఫార్మాలో 8.6 శాతం, ప్లాస్టిక్స్లో 5.6 శాతం, టెక్స్టైల్స్పై 1.4 శాతం, వజ్రాలు.. బంగారం మొదలైన వాటిపై 13.3 శాతం, ఇనుము..ఉక్కుపై 2.5 శాతం, మెషినరీ .. కంప్యూటర్స్పై 5.3 శాతం, ఎలక్ట్రానిక్స్పై 7.2 శాతం, ఆటోమొబైల్స్ .. ఆటో విడిభాగాలపై 23.1 శాతం వ్యత్యాసం ఉంటోంది. ఇది ఎంత ఎక్కువగా ఉంటే, సదరు రంగంపై ప్రభావం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. భారత్ ఎగుమతులు 30 కేటగిరీలుగా ఉంటున్నాయి. ఇందులో వ్యవసాయంలో ఆరు, పరిశ్రమల్లో 24 ఉన్నాయి.వ్యవసాయం⇒ అత్యధికంగా చేపలు, మాంసం, ప్రాసెస్డ్ సీఫుడ్పై ప్రభావం ఉంటుంది. దాదాపు 2.58 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులపై టారిఫ్ల వ్యత్యాసం 27.83 శాతం ఉంటోంది. ⇒1.03 బిలియన్ డాలర్లుగా ఉంటున్న ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర, కోకో ఎగుమతులపై ఏకంగా 24.99 శాతం మేర టారిఫ్లు పెరగొచ్చు. దీంతో అమెరికాలో భారతీయ స్నాక్స్ ఖరీదు మరింత పెరగొచ్చు. ⇒ చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలపై వ్యత్యాసం (1.91 బిలియన్ డాలర్ల విలువ) 5.72 శాతంగా ఉంటోంది. బియ్యం మొదలైన ఎగుమతులపై ప్రభావం పడొచ్చు.⇒ 181.49 మిలియన్ డాలర్ల విలువ చేసే డెయిరీ ఉత్పత్తులపై ఏకంగా 38.23 శాతం టారిఫ్ వ్యత్యాసం ఉంటోంది. దీంతో నెయ్యి, వెన్న, పాల పొడిలాంటివి రేట్లు పెరిగి, మన మార్కెట్ వాటా పడిపోవచ్చు.⇒ 199.75 మిలియన్ డాలర్ల విలువ చేసే వంటనూనెల ఎగుమతులపై 10.67 శాతం మేర టారిఫ్ పెరగవచ్చు.⇒ సుమారు 19.20 మిలియన్ డాలర్ల ఎగుమతులే అయినప్పటికీ ఆల్కహాల్, వైన్లపై అత్యధికంగా 122.10 శాతం సుంకాలు విధించవచ్చు.పారిశ్రామిక ఉత్పత్తులు⇒ 12.72 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటున్న ఫార్మా ఉత్పత్తులకు సంబంధించి టారిఫ్ వ్యత్యాసం 10.90 శాతం మేర ఉంటోంది. ఇది విధిస్తే, జనరిక్ ఔషధాలు, స్పెషాలిటీ డ్రగ్స్ రేట్లు పెరిగిపోతాయి.⇒ 14.39 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎలక్ట్రికల్, టెలికం, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులపై 7.24 శాతం టారిఫ్లు పడొచ్చు.⇒ మెషినరీ, బాయిలర్, టర్బైన్, కంప్యూటర్ ఎగుమతుల విలువ 7.10 బిలియన్ డాల ర్లుగా ఉంటోంది. వీటిపై 5.29 శాతం టారిఫ్ల పెంపు అవకాశాలతో భారత్ నుంచి ఇంజనీరింగ్ ఎగుమతులపై ప్రభావం ఉండొచ్చు.⇒ 5.71 బిలియన్ డాలర్ల విలువ చేసే రసాయనాల ఎగుమతులపై (ఫార్మాను మినహాయించి) 6.05 శాతం, 1.71 బిలియన్ డాలర్ల సెరామిక్, గ్లాస్, స్టోన్ ఉత్పత్తులపై 8.27 శాతం, 457.66 మిలియన్ డాలర్ల ఫుట్వేర్పై 15.56 శాతం ఉండొచ్చు. టెక్స్టైల్స్, ఫ్యాబ్రిక్స్, కార్పెట్లు మొదలైన వాటి ఎగుమతులు 2.76 బిలియన్ డాలర్లుగా ఉండగా వీటిపై సుమారు 6.59 శాతం; 1.06 బిలియన్ డాలర్లుగా ఉన్న రబ్బర్ ఉత్పత్తులపై (టైర్లు, బెల్టులు సహా) 7.76 శాతం; పేపర్ .. కలప ఉత్పత్తులపై (969.65 మిలియన్ డాలర్లు) 7.87 శాతం మేర టారిఫ్ల ప్రభావం ఉండొచ్చు.పెద్దగా ప్రభావం / అసలు ప్రభావమే ⇒ ఉండని రంగాలు3.33 బిలియన్ డాలర్ల విలువ చేసే ముడి ఖనిజాలు, పెట్రోలియం ఎగుమతులపై టారిఫ్లు మైనస్ స్థాయిలో (మైనస్ 4.36) ఉంటున్నాయి కాబట్టి, కొత్తగా విధించడానికేమీ ఉండకపోవచ్చు.⇒ అలాగే, 4.93 బిలియన్ డాలర్ల గార్మెంట్స్ ఎగుమతులపై, వ్యత్యాసం మైనస్ 4.62 శాతంగా ఉంది కాబట్టి టారిఫ్ల భారం ఉండకపోవచ్చు. -
వధువే వరుడై... వరుడే వధువై...
హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు మెడలో పెళ్లి కొడుకు తాళి కట్టడం సహజం. కానీ ఇక్కడ వధువే వరుడి మెడలో మూడు ముళ్లేస్తుంది. వధూవరులది ఒకే ఊరు. ఇరువురి మెడలో కరెన్సీ నోట్ల దండలు.. పెళ్లిపీటలపై కళ్లద్దాలు ధరిస్తూ దర్శనం. పెళ్లీడుకొచ్చిన అమ్మాయి, అబ్బాయిల మాటకు గౌరవమిచ్చే పెద్దలు. ఒకే ముహూర్తాన వందల సంఖ్యలో సామూహిక వివాహాలు.. దశాబ్దాలుగా ఎన్నికలెరుగని ఆ గ్రామం ఇంతకీ ఎక్కడుందంటే..? శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామం. సుమారు 12వేల జనాభా ఈ ఊరి సొంతం. స్వాతంత్య్రానికి పూర్వం నావల రేవుగా పిలిచేవారు. కాలక్రమేణా నువ్వలరేవుగా మారింది. రెవిన్యూ రికార్డుల్లో మాత్రం లక్ష్మీదేవిపేటగా కనిపించే ఆ గ్రామంలో అందరూ మత్స్యకారులే... చేపలవేట వీరి ప్రధాన జీవనాధారం. పెద్దవాళ్లు సముద్రంలో వేట సాగిస్తారు.చాటింపు వేసి.. వివరాలు సేకరించిఅంతగా ఉన్నత చదువులు లేకపోవడంతో ఈ ఊరి యువత ఉపాధి నిమిత్తం హైదరాబాద్, ముంబై, అండమాన్ ప్రాంతాలకు వలస వెళతారు. వీళ్లలో పెళ్లీడుకొచ్చిన యువకులను రెండేళ్లకోసారి గుర్తించి వారి జాబితాను సిద్ధం చేస్తారు. ఆ ఏడాదికి పెళ్లికి సిద్ధమయ్యేవారు ఎవరున్నారన్న సమాచారాన్ని ముందుగా చాటింపు వేయించి వారి వివరాలను సేకరిస్తారు. అలా ఎంపికైన వారందరికీ ఒకే ముహూర్తాన సామూహిక వివాహాలను జరిపిస్తారు.వధూవరులది ఒకే ఊరు గతంలో మూడేళ్లకోసారి ఈ పెళ్లిళ్లు చేసేవారు. కానీ ఇప్పుడు యువత సంఖ్య పెరగడంతో రెండేళ్లకోసారి ఈ తంతు జరిపిస్తున్నారు. వరుడికి కావాల్సిన వధువు కోసం ఎక్కడో అన్వేషించరు. ఉన్న ఊరిలోనే వరసకు వచ్చిన అమ్మాయితో నిశ్చయిస్తారు. సామూహిక వివాహ ప్రక్రియలో కులపెద్దలదే కీలక భూమిక. పెళ్లిళ్లన్నీ వారి పర్యవేక్షణలోనే జరుగుతాయి. ముహూర్తాలు నిశ్చయించిన వేళ పెళ్లీడుకొచ్చిన యువతీ యువకులను మరోసారి పెద్దలు పిలుస్తారు. వారి మనసులో ఎవరైనా ఉన్నారా... అని అడిగి తెలుసుకుంటారు. అలా ఇష్టపడినవారికి ఇచ్చి పెళ్లిచేయడంతో ఆ జంటల్లో ఆనందం రెట్టింపవుతుంది. నువ్వలరేవులో బైనపల్లి, బెహరా, మువ్వల అనే ఇంటి పేర్లున్న కుటుంబాలే అధికంగా ఉంటాయి. పెళ్లిళ్లన్నీ ఈ కుటుంబాల మధ్యే జరుగుతాయి.మూడు రోజుల పెళ్లి పండగసామూహిక వివాహ వేడుకను మూడురోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి రోజు పందిరిరాట వేస్తారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంంతో కేరింతలు కొడతారు. రెండోరోజు ప్రధాన ఘట్టం. అదే మాంగల్యధారణ. అయితే ఇక్కడ తాళికట్టేది వరుడు మాత్రమే కాదు. పెళ్లికూతురు సైతం వరుడి మెడలో తాళి కట్టడం విశేషం. మూడోరోజు వధువు పుట్టింటి నుంచి వరుడి ఇంటికి సారె వస్తుంది. ఈ సందర్భంగా పెళ్లి పందిరిలో ఆ సారెను అందరికీ చూపిస్తారు. గ్రామంలోని బంధావతి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాక పెళ్లి వేడుక ముగుస్తుంది. జిల్లాలో సాధారణంగా వరుడి ఇంటివద్ద పెళ్లి జరిపిస్తారు. కానీ నువ్వలరేవులో మాత్రం వధువు ఇల్లే పెళ్లి వేదిక కావడం విశేషం.ఊరంత కుటుంబం వధూవరులిద్దరిదీ ఒకే గ్రామం కావడంతో ఊరంతా ఒకరికొకరికి ఏదో బంధుత్వం ఉండటం ఇక్కడి వారి సొంతం. పెళ్లి విందుకు బంధువులందరినీ ఆహ్వానించరు. ఏ ఇంటి పెళ్లి విందుకు ఎవరు వెళ్లాలన్నది గ్రామ పెద్దలే నిర్ణయిస్తారు. అలా ఆహార పదార్థాలను వృథా చేయకుండా, అనవసర ఖర్చులను నియంత్రిస్తూ జాగ్రత్తపడతారు.వరకట్నానికి దూరం నువ్వలరేవులో వరకట్నం అనే మాట వినిపించదు. పెళ్లికయ్యే ఖర్చును వధూవరులిద్దరి కుటుంబాలు సమానంగా భరిస్తాయి. ఆడపిల్లను పుట్టినింటి నుంచి మెట్టినింటికి పంపడమే మహాభాగ్యంగా మగపెళ్లివారు భావిస్తారు. పెళ్లిపీటలపై ఆసీనులైన వధూవరులిద్దరూ నల్లకళ్లజోడు ధరిస్తారు. ఇద్దరి మెడలో కరెన్సీ నోట్ల దండలు వేస్తారు. ఈ సామూహిక వేడుకను తిలకించేందుకు పరిసరప్రాంతాల ప్రజలు తరలి వస్తారు. దీంతో మూడురోజుల పాటు నువ్వల రేవులో తిరునాళ్ల సందడి కనిపిస్తుంది. నువ్వలరేవులో సామూహిక వివాహాలే కాదు, శ్రీరామనవమి ఉత్సవాలను సైతం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.ముందు వరుడు.. ఆ తర్వాత వధువు పెళ్లిలో ముందుగా వరుడు వధువు మెడలో తాళికడతాడు. అనంతరం వధువు వరుని మెడలో తాళి కడుతుంది. దీన్నే స్థానికులు దురషం అని వ్యవహరిస్తారు. ఈ సాంప్రదాయం నువ్వలరేవు ప్రత్యేకం. ఇలా ఒకరికి ఒకరు తాళికట్టడంతో ఒకరికొకరు ఆజన్మాంతం రక్షగా ఉంటారన్నది ఇక్కడి వారి విశ్వాసం. అలాగే ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువనే భావన తమలో ఉండదని, అమ్మాౖయెనా, అబ్బాౖయెనా సమానంగానే భావిస్తామని గ్రామపెద్దలు చెబుతారు.– గుంట శ్రీనివాసరావు, సాక్షి, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం -
దత్తత పర్వంలో... దారుణ కోణం!
దత్తత మాటున దారుణాలు. కొరియా యుద్ధం తాలూకు విషాదంలో మరో చీకటి అధ్యాయం. దీనికి సంబంధించి తాజాగా బహిర్గతమైన విషయాలు విస్మయం కలిగిస్తున్నాయి. 1950ల్లో యుద్ధం కారణంగా దక్షిణ కొరియా పేదరికంలో కూరుకుపోయింది. జనం తమ సంతానాన్ని పోషించుకోలేని దుస్థితికి దిగజారడంతో వారిని ఆదుకునే సాకుతో ప్రభుత్వం తెచ్చిన పథకం అక్రమాలకు నెలవుగా, అంతులేని విషాదానికి చిరునామాగా మారింది. తొలుత ప్రశంసలు అందుకున్నా విదేశీ దత్తత పథకంలోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ఎన్నో అక్రమాలు జరిగాయని, లక్షలాది మంది చిన్నారులు సొంతవారికి దూరమై విదేశాల్లో కష్టాల పాలయ్యారని దీనిపై విచారణకు నియమించిన కమిషన్ కుండబద్దలు కొట్టింది. ‘‘ఇది పిల్లల భవిష్యత్తులో క్రూర చెలగాటం. దీనికి ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి’’ అని సిఫార్సు చేసింది. దత్తత పేరుతో దూర దేశాలకు తరలిపోయిన తమ చిన్నారుల కన్నీటి గాథలు దక్షిణ కొరియన్లను కంటతడి పెట్టిస్తున్నాయిప్పుడు...! విదేశాల్లో మొదలైన కష్టాలు దత్తత తీసుకున్న తల్లిదండ్రుల చెంత హాయిగా పెరిగిన పిల్లలు కొందరే. అత్యధికులు బానిసలుగా బతికారు. సరైన పోషణ, సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హింస, వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. దత్తత తండ్రుల చేతుల్లో అత్యాచారాలకు బలైన అమ్మాయిలు కోకొల్లలు. దత్తత సమయంలో తప్పుడు ఊళ్లు, పేర్లు, అన్నీ మార్చేసిన కారణంగా అసలు తమ కన్న తల్లిదండ్రులు ఎవరనేదీ పెద్దయ్యాక ఆ పిల్లలకు తెలీకుండా పోయింది. నార్వేలో జీవిస్తున్న 60 ఏళ్ల ఇంగర్ టోన్ ఉయిలాండ్ షిన్ కన్నీటిగాథ ఇలాంటిదే. ‘‘13 ఏళ్ల వయసులో నన్ను దత్తత తీసుకుని నార్వేకు తీసుకొచ్చారు. తిండి, వాతావరణం ఏదీ నాకు సరిపడలేదు. పెంపుడు తండ్రి లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. నాకన్నా పెంపుడు కుక్కనే బాగా చూసుకునేవాళ్లు. చేసిన నేరానికి శిక్ష అనుభవించకుండానే వాళ్లు చనిపోయారు. నేను మాత్రం ఇలా మిగిలిపోయా. చిన్ననాటి జ్ఞాపకాలు, అందమైన బాల్యం, సర్వం కోల్పోయా’’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. అమెరికా, ఆ్రస్టేలియాతో పాటు యూరప్లోని ఎన్నో దేశాలకు దత్తు వెళ్లిన ఆయిలాండ్ వంటి చిన్నారుల కన్నీటిగాథలు కోకొల్లలని ‘ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్’ పేర్కొంది. మూడేళ్ల దర్యాప్తు తర్వాత బుధవారం సమగ్ర నివేదిక సమర్పించింది. అంతర్జాతీయ దత్తత చట్టాలు, చిన్నారుల పరిరక్షణపై ‘ది హేగ్ ఒడంబడిక’ను దక్షిణ కొరియా ప్రభుత్వం తుంగలో తొక్కిందని కమిషన్ చైర్పర్సన్ పార్క్సన్ యంగ్ మండిపడ్డారు.ఎందుకీ దుస్థితి? 1950వ దశకంలో కొరియా ద్వీపకల్పంలో మొదలైన యుద్ధమే ఈ దత్తత దారుణాలకు ప్రధాన కారణం. దేశ భూభాగంలో ఉత్తరభాగం డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (డీపీఆర్కే)గా, దక్షిణభాగం రిపబ్లిక్ ఆఫ్ కొరియాగా రెండు ముక్కలైంది. ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించినాసరే అమెరికాసహా 17 దేశాలు ద.కొరియాకు మద్దతు ప్రకటించాయి. చైనా, రష్యాలు ఉత్తరకొరియాకు అండగా నిలబడ్డాయి. చాన్నాళ్లు కొనసాగిన ఈ యుద్ధంలో ఒక్క దక్షిణకొరియాలోనే దాదాపు 2,00,000 మందికిపైగా మహిళలు తమ భర్తలను కోల్పోయి వితంతువులుగా మిగిలిపోయారు. మరో 1,00,000 మంది చిన్నారులు అనాథలయ్యారు. వితంతులు తమ పిల్లలను పెంచే స్తోమతలేక అనాథాశ్రమాల్లో చేర్పించారు. దీంతో దేశవ్యాప్తంగా అనాథాశ్రయాల్లో చిన్నారుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. యుద్ధంకారణంగా పేదరికం కోరల్లో చిక్కుకుపోయిన ద.కొరియా సర్కార్కు వీళ్ల పోషణ పెద్ద భారంగా తయారైంది. యుద్దంలో ద.కొరియాకు సాయంగా దేశంలో తిష్టవేసిన అమెరికా సైనికులు స్థానిక మహిళలతో సంబంధాలు పెట్టుకోవడంతో లక్షలాది మంది చిన్నారులు జని్మంచారు. ఇలాంటి వాళ్లకు సమాజంలో ఆదరణ కరువైంది. ఛీత్కారాలను ఎదుర్కొన్నారు. వితంతువుల పిల్లలు, అమెరికన్ల పిల్లలు, అనాథాశ్రయాల్లోని చిన్నారుల బాగోగులు చూసేందుకు ప్రభుత్వం విదేశీ దత్తత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వీళ్లను దత్తత తీసుకునేందుకు పశ్చిమదేశాల్లోని జంటలు తెగ ఆసక్తి చూపించారు. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్లోని కొన్ని దేశాల నుంచి దత్తత డిమాండ్లు అధికమయ్యాయి. 1954లో ఈ ధోరణి ఊపందుకుంది. 1948 నుంచి 1960 వరకు సింగ్మాన్ రీ పాలనకాలంలో, తర్వాత పార్క్ చుంగ్ హీ హయాంలో 1961నుంచి 1979 కాలంలో ఈ పోకడ విపరీతంగా పెరిగిపోయింది.వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు దత్తత ప్రక్రియ పూర్తి లోపభూయిష్టమని, తమను అన్యాయంగా, అక్రమంగా విదేశాలకు తరలించారని చాలామంది చిన్నారులు పెద్దయ్యాక ఫిర్యాదులు చేశారు. వాటిపై కమిషన్ దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘దత్తత ప్రక్రియ తప్పులతడకగా సాగింది. పేర్లు మార్చేయడం, తల్లిదండ్రులున్నా అనాథ అని పేర్కొనడం వంటి ఎన్నో అక్రమాలు వెలుగు చూశాయి. విదేశీ జంటలకు అప్పగింతపై నెలవారీ పరిమితి ఉన్నా ఆ కోటాను ప్రభుత్వమే తుంగలో తొక్కింది. అలా ప్రైవేట్ ఏజెన్సీలు దశాబ్దాలుగా లక్షలాది మంది చిన్నారులను విదేశాలకు తరలించాయి. ఉచితంగా జరగాల్సిన దత్తత ప్రక్రియలో అడుగడుగునా భారీగా నగదు చేతులు మారింది’’ అని కమిషన్ పేర్కొంది. ఎట్టకేలకు 2023లో దత్తత ప్రక్రియలో కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చారు. ఇకపై ప్రైవేట్ ఏజెన్సీలకు బదులు విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో దత్తత కార్యక్రమం నడుస్తుందని ప్రకటించింది. కానీ కమిషన్ వెల్లడించిన కఠోర వాస్తవాలపై మాత్రం ప్రభుత్వం పెదవి విప్పలేదు. తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని తేలినా క్షమాపణ చెప్పలేదు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దారి తప్పిన పథకంపశ్చిమ దేశాల జంటలకు అనాథలను దత్తతనిచ్చే కార్యక్రమం మొదట్లో సవ్యంగా సాగినా రానురాను ఇది అక్రమాలకు నెలవుగా తయారైంది. దత్తత ప్రక్రియ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించి చేతులు దులుపుకుంది. దీంతో ఈ ఏజెన్సీలు పశ్చిమదేశాల జంటల నుంచి అత్యధిక మొత్తాలను వసూలుచేసి వాళ్లకు నచ్చిన పిల్లలను విదేశాలకు తరలించడం మొదలెట్టాయి. ఇందుకోసం ఏజెన్సీలు ఎన్నో అక్రమ మార్గాలను ఎంచుకున్నాయి. అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు పిల్లల అసలు పేర్లను మార్చేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించేవారు. కుటుంబాలతో ఉంటున్న అందంగా, పుష్టిగా ఉన్న చిన్నారులు కొందరిని కిడ్నాప్ చేసి మరీ విదేశాలకు తరలించారు. కుటుంబాలకు చెందిన పిల్లలను అనాథలుగా ముద్రవేసి విదేశీ జంటలకు అప్పగించారు. ఇలా లక్షలాది మంది చిన్నారులను దేశం దాటించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆదిమ గెలాక్సీ చిక్కింది
అనంత విశ్వంలో మనకు అత్యంత సుదూరంలో ఉన్న ఒక నక్షత్ర మండలాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. దీన్ని అత్యంత ఆదిమ గెలాక్సీల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఎదుకంటే విశ్వావిర్భావానికి మూల కారణమని భావిస్తున్న బిగ్బ్యాంగ్ జరిగిన కేవలం 33 కోట్ల ఏళ్లకే అది పురుడు పోసుకుంది! విశ్వం వయసు 1,380 కోట్ల ఏళ్లని అంచనా. ఈ లెక్కన ఈ గెలాక్సీ ఎంత పురాతనమైనదో అర్థం చేసుకోవచ్చు. దీనికి జేడ్స్–జీఎస్–జెడ్13–1గా సైంటిస్టులు నామకరణం చేశారు. భూమి వయసు 450 కోట్ల సంవత్సరాలన్నది తెలిసిందే. అయితే, ‘‘జేడ్ గెలాక్సీ కేవలం 230 కాంతి సంవత్సరాల విస్తీర్ణంలోనే వ్యాపించింది. ఆ లెక్కన మన పాలపుంత కంటే ఇది వందలాది రెట్లు చిన్నదే’’ అని సైంటిస్టులు వివరించారు. కానీ దీని గుర్తింపుకు ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. చీకట్లను చీల్చుకుని...మనకు ఇప్పటిదాకా తెలిసిన అత్యంత పురాతన గెలాక్సీల్లో జేడ్స్ నాలుగోది. కానీ వాటన్నింట్లోకీ ఇది అత్యంత ప్రకాశవంతమైనది మాత్రం ఇదే. తద్వారా అయానీకరణ దశకు జేడ్స్ తొలి రుజువుగా నిలిచిందని ఈ అధ్యయనంలో పాల్గొన్న సైంటిస్టుల బృందం సంబరపడుతోంది. బిగ్బ్యాంగ్తో పురుడు పోసుకున్న విశ్వం క్షణాల వ్యవధిలోనే శరవేగంగా, అనంతంగా విస్తరించడం మొదలు పెట్టిందన్నది సైంటిస్టుల భావన. నవజాత దశను దాటి కాస్త చల్లబడ్డాక చాలాకాలం పాటు వైశ్విక అంధకార యుగం కొనసాగిందని చెబుతారు. ఆ దశలో విశ్వం మొత్తాన్నీ హైడ్రోజన్ వాయువు దట్టంగా కప్పేయడమే ఇందుకు కారణం. ‘‘దాంతో విశ్వమంతా కేవలం హైడ్రోజన్, హీలియం, కృష్ణరాశితో కూడిన ముద్దగా మిగిలిపోయింది. ఆ తర్వాత విశ్వపు తొలి తారలు, కృష్ణబిలాలు, గెలాక్సీలు పురుడుపోసుకున్నాయి. వాటినుంచి నుంచి అతి శక్తిమంతమైన పరారుణ కాంతి ఉద్గారాలు వెలువడ్డాయి. విశ్వాన్ని చిరకాలంగా కప్పి ఉంచిన తటస్థ హైడ్రోజన్ వాయు మండలాన్ని ఛేదించాయి. తొట్టతొలి వెలుగు కిరణాలుగా నిలిచిపోయాయి’’ అని పెన్హెగన్యూనివర్సిటీ కాస్మిక్ డాన్ సెంటర్కు చెందిన ఆస్ట్రో ఫిజిసిస్టు జోరిస్ విట్స్కాక్ వెల్లడించారు. తాజా అధ్యయనానికి ఆయనే సారథ్యం వహించారు. ‘‘అలా విశ్వం అయానీకరణ దశలో తొలిసారిగా వెలుగులు విరజిమ్మడం మొదలైంది. అందుకే దీన్ని విశ్వానికి పొద్దుపొడుపుగా చెబుతుంటారు. జేడ్స్ గెలాక్సీ సరిగ్గా ఆ పరివర్తన దశకు చెందినదని తేలింది’’ అని విట్స్కాక్ వివరించారు. ‘‘ఇప్పటిదాకా మనకు చిక్కిన ఇతర సుదూర గెలాక్సీలకు భిన్నంగా జేడ్స్ అత్యంత స్పష్టంగా కని్పస్తుండటం వెనక కారణం కూడా ఇదే. అందులో అత్యంత శక్తిమంతమైన పరారుణ రేడియేషన్ వంటిది ఉందనేందుకు ఇది నిదర్శనం. అయానీకరణం చెందిన హైడ్రోజన్ దాని చుట్టూ భారీగా పరుచుకుని ఉంది’’ అని చెప్పుకొచ్చారు. ఈ అధ్యయన వివరాలను జర్నల్ నేచర్లో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గెలుపు ఎర వేస్తారు.. తర్వాత ఓడిస్తారు: వీసీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ‘బెట్టింగ్ యాప్స్ ప్రభావం ఎక్కువగా యువత పైనే ఉంటోంది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అనేకమంది వీటికి బలవుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఈ వ్యసనానికి బానిసలుగా మారుతున్నారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్లకు భిన్నంగా ఈ బెట్టింగ్ యాప్స్ యువతనే టార్గెట్గా చేసుకుని దోచుకుంటున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ఎలాగైనా ఎదుటివాళ్లు ఓడిపోయే విధంగానే డిజైన్ చేసి ఉంటాయి. ఒకటీ రెండుసార్లు డబ్బు వచ్చినా అది కేవలం దోచుకోవడానికి ఎర అనే విషయం తెలుసుకోవాలి..’ అని సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ పేరుతో సజ్జనార్ ప్రారంభించిన అవగాహన కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రాన్నీ కదిలించింది. తెలంగాణ సర్కారు వీటిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. గతంలో మల్టీ లెవల్ మార్కెటింగ్ దందాల పైనా ఇలానే పోరు కొనసాగించిన సజ్జనార్.. వాటికి సంబంధించి ప్రత్యేక చట్టం రావడానికి కారణమయ్యారు. తాజాగా బెట్టింగ్ యాప్స్పై యుద్ధం ప్రకటించిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. అవగాహన పెంచేందుకే ‘సే నో టు బెట్టింగ్ యాప్స్’ యువత ప్రాణాలు తీసుకోవడం కదిలించింది. బెట్టింగ్ యాప్ల బారినపడ కుండా వారిని కాపాడటం కోసం, వారిలో అవగాహన కల్పించడానికి ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ ప్రారంభమైంది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది సెర్చ్ చేశారు. క్యాంపెయినింగ్ మొదలైన తర్వాత ‘ఎక్స్’ను 1.2 కోట్లు మంది, ఇన్స్ట్రాగామ్ను 85 లక్షలు మంది వీక్షించారు. ప్రస్తుతం అనేక మంది సెలబ్రెటీలు, ఇన్ఫ్లూయెన్సర్లతో పాటు ప్రముఖులు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీళ్లు ఆయా ప్రకటనలు చేసేప్పుడు తదనంతర పరిణామాలను ఊహించలేదు. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సైబర్ టెర్రరిజం కిందికే వస్తుంది. మన పోలీసులు ఆది నుంచీ ముందున్నారు సమాజంలో జరుగుతున్న వివిధ రకాలైన ఆర్థిక దోపిడీలను అడ్డుకోవడంలో మన పోలీసులు ఎప్పుడూ ముందుంటున్నారు. ఒకప్పుడు ఎంఎల్ఎం స్కామ్స్, ఆపై మైక్రో ఫైనాన్స్ దుర్వినియోగాలను పకడ్బందీగా కట్టడి చేశారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వంతు వచ్చింది. అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి కేవలం పాత్రధారులనే కాదు సూత్రధారులకూ చెక్ చెప్పే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చట్టాన్ని కూడా కఠినంగా అమలు చేయాలి. అన్నివర్గాల్లో అవగాహన కల్పించాలి. బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయడం, ప్రమోటర్లతో పాటు నిర్వాహకుల పైనా చర్యలు తీసుకోవడం అవసరం. ఈ బెట్టింగ్ ప్రకటనలను అనుమతించిన మీడియా ప్లాట్ఫామ్లూ బాధ్యత వహించేలా చేయాలి. లావాదేవీలను సులభతరం చేసే చెల్లింపు గేట్వేల లైసెన్స్లు రద్దు చేయాలి. అడ్డుకట్ట వేయకపోతే ఓ తరాన్ని ఫణంగా పెట్టాల్సిందే.. బెట్టింగ్ నెట్వర్క్లు విదేశాల నుండి పనిచేస్తుంటాయి. అందువల్ల వీరిని కనిపెట్టి, కట్టడి చేయడం కష్టసాధ్యమైన అంశం. అందువల్ల అంతా ముందుకు వచ్చి అందరిలోనూ అవగాహన కల్పించడం ద్వారా ఈ ఉచ్చు నుంచి యువతను తప్పించాలి. పోలీసులు సైతం ఎప్పటికప్పుడు బెట్టింగ్ దందాలపై అవరసమైన చర్యలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లూయెన్సర్లు అనేక కుటుంబాలు కుప్పకూలడానికి కారణం అవుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ ఆర్థిక ఉగ్రవాదంతో సమానం. ఇప్పటికైనా దీనికి అడ్డుకట్ట వేయకపోతే దానికి ఓ తరాన్ని ఫణంగా పెట్టాల్సి వస్తుంది. ఈ తరుణంలో అందరం కలిసి ముందుకు వెళితేనే మన సమాజాన్ని కబళిస్తున్న బెట్టింగ్ భూతానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టగలం. యువతరాన్ని రక్షించుకోగలం. తల్లిదండ్రుల అప్రమత్తతా కీలకం బెట్టింగ్ యాప్ల విషయంలో తల్లిదండ్రులూ అప్రమత్తంగా ఉండాలి. ఈ భూతాన్ని పూర్తిగా పారద్రోలాలంటే తల్లిదండ్రుల సహకారం అనివార్యం. ప్రతి ఒక్కరూ తమ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. సోషల్మీడియా వినియోగదారుల్లో 16–30 ఏళ్ల మధ్య వయసు్కలే ఈ యాప్ల టార్గెట్గా ఉంటున్నారు. ఇక తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న ఎందరో విద్యార్థులు తమ చదువుకు ఉద్దేశించిన డబ్బును బెట్టింగ్లో పోగొట్టుకుని విద్యకు దూరమైన ఉదంతాలు ఉన్నాయి. యువత అనేకమంది అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి ఇవి ఆత్మహత్యలు కాదు.. బెట్టింగ్ యాప్స్, వాటిని ప్రమోట్ చేసే వాళ్లు చేసిన హత్యలు. -
మన దగ్గరే 'బంగారు' కొండ
సాక్షి, స్పెషల్ డెస్క్: సుమారు 25,000 టన్నులు.. భారతీయుల వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలు ఇవి. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా.. బంగారం అంటే మన వాళ్లకు అమితపైన ప్రేమ ఉంది కాబట్టి ఆ మాత్రం ఉండొచ్చు అనే కదా మీ ఆలోచన. అసలు విషయం చెబితే నోరెళ్లబెట్టాల్సిందే. ప్రపంచంలో ఉన్న 10 ప్రధాన కేంద్ర బ్యాంకుల (ఆర్బీఐలాంటి సెంట్రల్ బ్యాంక్స్) వద్ద ఉన్న మొత్తం పసిడి నిల్వల కంటే మన భారతీయుల వద్ద ఉన్న బంగారమే ఎక్కువని హెచ్ఎస్బీసీ గ్లోబల్ తాజా నివేదికలో వెల్లడించింది. భారతీయుల కుటుంబాల్లో ఉన్న ‘బంగారు కొండ’ ఏపాటితో దీనిని బట్టి అర్థం అవుతుంది. తరతరాలుగా సంపదను సంరక్షించుకోవడం, భద్రత కోసం బంగారాన్ని ఒక ప్రాధాన్య ఆస్తిగా మనవారు ఆధారపడిన విధానాన్ని ఈ కొండ నొక్కి చెబుతోంది. భారతీయులు పసిడిని ఇలా విస్తారంగా కూడబెట్టుకోవడం దేశ ఆర్థిక, సాంస్కృతిక నిర్మాణంలో పుత్తడికి ఉన్న ప్రాముఖ్యతకు నిదర్శనం.ప్రత్యామ్నాయంగా పుత్తడి..యూఎస్ఏ, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, భారత్, జపాన్, తుర్కియే దేశాలు ఈ టాప్–10 జాబితాలో ఉన్నాయి. ఈ దేశాల సెంట్రల్ బ్యాంకుల మొత్తం బంగారం నిల్వలను మించి భారతీయుల వద్ద పసిడి ఉందంటే.. పొదుపు, పెట్టుబడి వ్యూహం విషయంలో భారతీయుల్లో ఈ యెల్లో మెటల్ ఎంతటి కీలకపాత్ర పోషిస్తోందో అవగతం అవుతుంది. భారతీయ కుటుంబాలకు బంగారం ప్రాధాన్యత కలిగిన ఆస్తిగా ఉందనడంలో సందేహం లేదు. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి, కరెన్సీ విలువల హెచ్చుతగ్గులకు దీనిని ఒక విరుగుడుగా ప్రజలు భావిస్తున్నారు. వివాహాలు, పండగలు, మతపర వేడుకలు గోల్డ్ డిమాండ్ను గణనీయంగా పెంచుతున్నాయి. బ్యాంకుల్లో పొదుపు చేస్తే వచ్చే వడ్డీ కంటే బంగారం కొనుగోలు ద్వారా దీర్ఘకాలంలో అధిక ఆదాయం పొందవచ్చన్నది ప్రజల మాట. అందుకే అత్యధిక కుటుంబాల్లో బ్యాంకు డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా పుత్తడి అవతరించింది. సెంట్రల్ బ్యాంక్స్ సైతం..ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా, చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా భారత్ నిలిచింది. పుత్తడి దిగుమతులు సైతం భారత వాణిజ్య లోటు పెరగడానికి కారణం అవుతున్నాయి. అయితే కుటుంబ సంపద పరిరక్షణలో పసిడి ఇప్పటికీ ముఖ్యమైన భాగంగా ఉంది. భారతీయ కుటుంబాలు వ్యక్తిగతంగా బంగారాన్ని దాచుకోవడంలో ముందంజలో ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా ఇటీవలి కాలంలో పుత్తడి కొనుగోళ్లను పెంచాయి. ఆర్థిక అస్థిరతల నుంచి రక్షణ ఇచ్చే సాధనం బంగారమేనని ఇవి భావిస్తుండడమే ఇందుకు కారణం. ఈ ప్రపంచ ధోరణులకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన బంగారు నిల్వలను క్రమంగా పెంచుకుంటోంది. 2024 డిసెంబర్ నాటికి ఆర్బీఐ వద్ద 876.18 టన్నుల నిల్వలు పోగయ్యాయి. తొలిస్థానంలో ఉన్న యూఎస్ఏ 8,133 టన్నులు, రెండోస్థానంలో ఉన్న జర్మనీ వద్ద 3,352 టన్నుల నిల్వలు ఉన్నాయి. -
రాబడిపై పన్ను సున్నా...
కొత్త బడ్జెట్లో ఆదాయపన్ను మినహాయింపు రాయితీలను గణనీయంగా పెంచడంతో మధ్యతరగతికి పెద్ద ఊరట లభించింది. వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్తో కలుపుకుని రూ.12.75 లక్షలు, ఇతరులకు రూ.12 లక్షల ఆదాయం ఉన్నా కానీ కొత్త విధానంలో రూపాయి పన్ను లేకుండా చేశారు ఆర్థిక మంత్రి. ఇప్పటికీ అధిక ఆదాయ పరిధిలో ఉండి, పన్ను ఆదా పెట్టుబడుల కోసం అన్వేషించే వారికి మెరుగైన మార్గం ఒకటి ఉంది. పన్ను ఆదా చేసే ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవడమే. వీటి నుంచి వచ్చే రాబడిపై ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఇందులో ఉండే ప్రయోజనాలు, ఎలా ఇన్వెస్ట్ చేయాలి? తదితర వివరాలతో కూడిన కథనమే ఇది... బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు), చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులపై వచ్చే రాబడికి ఎలాంటి పన్ను ఆదా ప్రయోజనం లేదు. దీంతో రూ.12 లక్షలకు పైన ఆదాయం ఉన్న వారికి పన్ను ప్రయోజనం పరంగా ఇలాంటివి మెరుగైన సాధనాలు కాబోవు. ఎందుకంటే వీటిపై వచ్చే రాబడి పన్ను చెల్లింపుదారు వార్షిక ఆదాయానికి కలుస్తుంది. దాంతో చెల్లించాల్సిన పన్ను భారం పెరిగిపోతుంది. ఫలితంగా నికర ఆదాయం రూ.12.75 లక్షలకు మించిపోవచ్చు. దీనివల్ల పన్ను ఆదా రాయితీని కోల్పోవాల్సి వస్తుంది. కనుక అధిక ఆదాయం పరిధిలో ఉన్న వారికి అందుబాటులో ఉన్న మెరుగైన సాధనం ట్యాక్స్ ఫ్రీ బాండ్లే. ఎందుకంటే ఈ బాండ్లపై వచ్చే రాబడి ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలవదు. దీంతో ఈ మేరకు ప్రయోజనం పొందొచ్చు. ముఖ్యంగా రూ.12 లక్షల స్థాయిలో ఆదాయం కలిగిన వృద్ధులు (సీనియర్ సిటిజన్లు/60 ఏళ్లు నిండిన వారు) తమ రిటైర్మెంట్ నిధిలో కొంత మొత్తాన్ని ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయమే అవుతుంది. తద్వారా వారి పన్ను వర్తించే ఆదాయం రూ.12 లక్షలకు మించకుండా చూసుకోవచ్చు. పలు సంస్థల నుంచి బాండ్లు.. గతంలో పలు ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన ట్యాక్స్ ఫ్రీ బాండ్లు ప్రస్తుతం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ ఎక్సే్ఛంజ్లలో క్యాష్ విభాగంలో ట్రేడ్ అవుతున్నాయి. వీటిల్లో కొన్నింటిలో మెరుగైన లిక్విడిటీ (కొనుగోళ్లు, అమ్మకాల పరిమాణం)ని గమనించొచ్చు. ఇంకా 11 ఏళ్ల కాల వ్యవధితో బాండ్లు లభిస్తున్నాయి. ప్రస్తుతం వీటిల్లో పన్ను రహిత రాబడి రేట్లు 5.5–5.9 శాతం మధ్య ఉన్నాయి. పెట్టుబడికి రక్షణ, అదే సమయంలో స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఇవి మెరుగైన ఆప్షన్ అని విశ్లేషకులు చెబుతున్నారు. 2012 నుంచి 2016 మధ్య కాలంలో 14 ప్రభుత్వరంగ ఇన్ఫ్రా ఫైనాన్స్ కంపెనీలు (ఎన్హెచ్ఏఐ, ఐఆర్ఎఫ్సీ, పీఎఫ్సీ తదితర) సెక్యూర్డ్ (రక్షణతో కూడిన) ట్యాక్స్ ఫ్రీ బాండ్లను జారీ చేశాయి. వీటి కాల వ్యవధి 10, 15, 20 ఏళ్ల చొప్పున ఉంది. ఈ బాండ్లలో పెట్టుబడులపై రాబడి చెల్లింపులు ఏడాదికోసారి చేస్తారు. వీటికి అధిక భద్రతను సూచించే ‘ఏఏఏ’ రేటింగ్ను క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చాయి. గతంలో జారీ చేసిన అన్ని ట్యాక్స్ ఫ్రీ బాండ్ల సిరీస్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ అయి ఉన్నాయి. ఇప్పటి వరకు 193 ఇష్యూలు రాగా, అందులో 57 బాండ్ల మెచ్యూరిటీ (కాలవ్యవధి) ముగిసిపోయింది. మిగిలిన ట్యాక్స్ ఫ్రీ బాండ్లు ప్రస్తుతం స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో ట్రేడ్ అవుతున్నాయి. వీటి మెచ్యూరిటీ సగటున 11 ఏళ్ల వరకు ఉంది. ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన ఈ బాండ్లలో రిస్క్ చాలా చాలా తక్కువ. ఒక విధంగా ఉండదనే చెప్పుకోవాలి. దీనికితోడు పన్ను ప్రయోజనం కూడా ఉండడం అదనపు ఆకర్షణ. తక్కువ ఆదాయం ఉన్న వారికి..? ఆదాయపన్ను పరిధిలో లేకుండా.. ఆదాయం తక్కువగా ఉన్న వారు ప్రత్యామ్నాయాలను పరిశీలించొచ్చు. ‘ఏఏఏ’ రేటెడ్ కార్పొరేట్ బాండ్లలో రిస్క్ కొంత తక్కువగా ఉంటుంది. వీటిల్లో ఈల్డ్స్ 7.4 శాతం మేర ఉన్నాయి. అలాగే, వృద్ధులకు బ్యాంక్ ఎఫ్డీలపై 8 శాతం వరకు వడ్డీ రేటు ప్రస్తుతం లభిస్తోంది. కానీ, కార్పొరేట్ బాండ్లు, బ్యాంక్ ఎఫ్డీలపై వచ్చే రాబడి పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. మెచ్యూరిటీతో సంబంధం లేకుండా ఆయా పెట్టుబడులపై ఏటా వచ్చే రాబడిని ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అధిక ఆదాయపన్ను శ్లాబు రేటులో ఉన్న వారికి పన్ను చెల్లింపులు పోగా మిగులు నికర రాబడి 4.6–5.1 శాతం మించదు. అయితే, తక్కువ ఆదాయ శ్లాబుల్లో ఉన్న వారు, పన్ను వర్తించేంత ఆదాయం లేని వారికి.. కార్పొరేట్ బాండ్లు, బ్యాంక్ ఎఫ్డీలు తదితర సాధనాలను పరిశీలించొచ్చు. ఎందుకంటే వీటి నుంచి వచ్చే వడ్డీ రాబడి కలిసిన తర్వాత కూడా వారి ఆదాయం పన్ను పరిధిలోకి రాదు. ఎంపిక ఎలా..? ఈ బాండ్ల ఎంపిక అంత కష్టమైన విషయం కాదు. ముఖ్యంగా చూడాల్సింది లిక్విడిటీయే. అంటే ఆయా బాండ్లు రోజువారీగా ఎక్సే్ఛంజ్లలో ట్రేడ్ అవ్వడంతోపాటు, తగినంత ట్రేడింగ్ వ్యాల్యూమ్ కూడా ఉండాలి. దీనివల్ల కొనుగోలు, విక్రయం సులభంగా మారుతుంది. ఆ తర్వాత చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం బాండ్ ఈల్డ్స్ టు మెచ్యూరిటీ (వైటీఎం). అంటే ఆయా బాండ్పై మిగిలి ఉన్న కాలానికి ఎంత రాబడి వస్తుందో ఇది తెలియజేస్తుంది. అధిక లిక్విడిటీ ఉన్న బాండ్ను మెరుగైన ధరపై కొనుగోలు చేసుకోవచ్చు. అదే లిక్విడిటీ తగినంత లేని చోట (అమ్మకాలకు ఎక్కువ మంది లేనప్పుడు) బాండ్ కొనుగోలు వ్యయం పెరిగిపోతుంది. దీనివల్ల ఈల్డ్ తగ్గిపోతుంది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ డేటా ప్రకారం ప్రస్తుతం స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో ట్రేడ్ అవుతున్న వాటిల్లో 20 బాండ్లలో మెరుగైన లిక్విడిటీ ఉంటోంది. ఉదాహరణకు ‘ఆర్ఈసీ బాండ్ ‘871ఆర్ఈసీ28’ను 2014లో 8.71 శాతం వార్షిక రేటుపై జారీ చేయగా.. గత నెలరోజులుగా రోజువారీ ట్రేడింగ్ వ్యాల్యూమ్ ఇందులో 1,534గా ఉంటోంది. ఈ బాండ్లో ఇటీవలి వైటీఎం 5.9 శాతంగా ఉంది. ఇది అనుకూల తరుణం.. ఆర్బీఐ ఇటీవలే రెపో రేటును పావు శాతం తగ్గించింది. రానున్న రోజుల్లో మరో 50 బేసిస్ పాయింట్ల వరకు (0.50 శాతం) రేట్లు తగ్గుతాయని విశ్లేషకుల అంచనాగా ఉంది. ఇప్పటికీ దీర్ఘకాల డెట్ సాధనాలపై రాబడులు మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కనుక డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే వారికి ప్రస్తుతం అనుకూల సమయం. పన్ను లేకపోవడం, పెట్టుబడులపై గరిష్ట పరిమితి లేకపోవడంతో ట్యాక్స్ ఫ్రీ బాండ్లు అధిక ఆదాయ వర్గాలకు మెరుగైన సాధనం అవుతుంది. పైగా ట్యాక్స్ ఫ్రీ బాండ్ల జారీ నిలిచిపోయింది. అంటే కొత్తగా బాండ్ల ఇష్యూలు రావడం లేదు. కనుక వీటిల్లో పెట్టుబడులు పెట్టుకోవాలంటే సెకండరీ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న వాటి నుంచే ఎంపిక చేసుకోవాలి. ఇన్వెస్టర్లు ఇక్కడి నుంచి ఎంత కాలానికి పెట్టుబడులు పెట్టుకోవాలని అనుకుంటున్నారో.. అంత కాలంలో మెచ్యూరిటీ తీరిపోయే ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. రిటర్నులు ఆకర్షణీయం సెకండరీ మార్కెట్లో ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో పెట్టుబడులు పెట్టే వారు మార్కెట్ రేటు కంటే ప్రధానంగా ఈల్డ్స్ టు మెచ్యూరిటీ (వైటీఎం)పైనే దృష్టి సారించాలి. ఇన్వెస్టర్ ఒక బాండ్ను కొనుగోలు చేసిన దగ్గర్నుంచి, అది మెచ్యూరిటీ అయ్యే వరకు ఏటా వచ్చే రాబడిని వైటీఎం సూచిస్తుంది. 15 ట్యాక్స్ ఫ్రీ బాండ్ల సిరీసీస్లలో ప్రస్తుతం వైటీఎం 5.5 శాతం నుంచి 5.9 శాతం మధ్య ఉంది. ఇవి గమనించాలి.. → 30 శాతం ఆదాయపన్ను పరిధిలో ఉన్న వారికి 6 శాతం పన్ను రహిత రాబడి నిజంగా ఎంతో మెరుగైనది. పన్ను ప్రయోజనం కూడా కలుపుకుంటే 8.5 శాతం రాబడి వచి్చనట్టు. → 20 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి సైతం 7.5 శాతం రాబడి వచి్చనట్టు అవుతుంది. → 10 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి దక్కే ప్రయోజనం తక్కువే. → కార్పొరేట్ బాండ్లతో పోల్చితే ట్యాక్స్ ఫ్రీ బాండ్లు అధిక రేటింగ్ కలిగినవి. ఈ బాండ్లను జారీ చేసేవి ప్రభుత్వరంగ సంస్థలే కనుక డిఫాల్ట్ దాదాపుగా ఉండదు. → ఇన్వెస్టర్ తనకు వీలైనంత ఇందులో పెట్టుబడి పెట్టుకోవచ్చు. గరిష్ట పరిమితి ఉండదు. → స్వల్పకాల లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులకు వీటిని ఎంపిక చేసుకోవడం సరికాదు. → వీటిల్లో ఒక్కోసారి లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. కనుక కాల వ్యవధి ముగిసేంత వరకు కొనసాగే వెసులుబాటు ఉన్న వారే వీటిని ఎంపిక చేసుకోవాలి. → కేవలం పన్ను ప్రయోజనం కోసమే వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం అనిపించుకోదు. రిస్క్ తీసుకునే వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇంతకంటే ఎక్కువ రాబడినే (పన్ను పోను) ఇస్తాయి. పోర్ట్ఫోలియోలో పెట్టుబడుల వైవిధ్యం కోసం డెట్ విభాగం కింద ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవచ్చు. → అధిక లిక్విడిటీ, మెరుగైన వైటీఎం ఉన్న వాటికే పరిమితం కావాలి. –సాక్షి, బిజినెస్డెస్క్ -
రష్యా, ఫ్రాన్స్, జర్మనీ బెస్ట్
ఐదు దశాబ్దాలుగా భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికా, బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియా వంటి దేశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఇటీవల యువత ధోరణి మారుతోంది. ఇప్పుడు వారి దృష్టి రష్యా, ఫ్రాన్స్, జర్మనీ అలాగే న్యూజిలాండ్ వంటి దేశాలకు మళ్లుతోంది. తమ చక్కటి భవిష్యత్ కోసం ఈ దేశాలను ఎంపిక చేసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. వీసా విధానాలు, వ్యయాలు, ఉద్యోగ అవకాశాలు వంటివి ఇందుకు కారణం. భారతీయ విద్యార్థులు కొత్త విదేశీ విద్యా గమ్యస్థానాలను ఎందుకు ఎంచుకుంటున్నారు... ఈ దేశాలు అందించే ప్రయోజనాలు ఏమిటి అన్న విషయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్యూఎస్,యూకేల్లో కఠిన విధానాలుఅమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఇప్పుడు విద్యార్థుల ఆకర్షణ క్రమంగా కోల్పోతుండడానికి ఆయా దేశాలు అనుసరిస్తున్న కఠిన వీసా విధానాలు, అధిక ఫీజులు, విద్యను అభ్యసించిన తర్వాత ఉపాధి అవకాశాలు పరిమితం కావడం వంటి పలు అంశాలు కారణంగా ఉన్నాయి. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ రెండవ సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో విద్య, ఉపాధి అవకాశాలు పొందుదామనుకున్నవారి సంఖ్య గణనీయంగా పడిపోతున్న విషయం జగద్విదితమే. ఇక కెనడాకు విద్యార్థుల ఎన్రోల్మెంట్లు తగ్గడానికి దౌత్యపరమైన ఉద్రిక్తతలు ప్రధాన కారణం. ఇప్పటికీ అగ్ర దేశాలే.. కానీ.. అయితే రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, న్యూజిలాండ్ వంటి దేశాలు బలమైన ప్రత్యామ్నాయాలుగా ఎదుగుతున్నాయి తప్ప కెనడా, అమెరికా, బ్రిటన్లను అవి అధిగమించేశాయని భావించడం సరికాదు. గత మూడు సంవత్సరాల్లో (2022–2024) భారీ సంఖ్యలో భారతీయ విద్యార్థులు విదేశాలలో చదివేందుకు ఎంపిక చేసుకున్న దేశాల జాబితాలో అగ్ర స్థానంలో కెనడా, అమెరికా, బ్రిటన్లున్నాయి. అయితే ఈ దేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో రష్యా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే వారి సంఖ్య పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ ఎందుకు?⇒ రష్యా: రష్యా విశ్వవిద్యాలయాలు పాశ్చాత్య దేశాలతో పోల్చితే తక్కువ ట్యూషన్ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ముఖ్యంగా వైద్య విద్య విషయంలో రష్యా తన ప్రత్యేకతను చాటుతోంది. అమెరికా, బ్రిటన్లలో పోల్చితే రష్యాలో ప్రవేశ ప్రక్రియ సైతం సరళంగా ఉంటోంది. అలాగే ప్రవేశ పరీక్షల సంఖ్య కూడా తక్కువ. ఇక ఆయా దేశాలతో పోల్చితే రష్యాలో జీవన వ్యయాలూ చాలా తక్కువగా ఉంటున్నాయి. ⇒ జర్మనీ: ఉచిత లేదా తక్కువ ఖర్చుతో విద్యావకాశాలు జర్మనీ ప్రత్యేకత. దీనితోపాటు జర్మనీ సమృద్ధిగా అభివృద్ధి చెందిన ఆరి్థక వ్యవస్థను కలిగి ఉంది. 4.92 ట్రిలియన్ డాలర్లతో దేశం ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత మూడో అతిపెద్ద ఆరి్థక వ్యవస్థగా ఉంది. అంతర్జాతీయ విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. జర్మన్ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయంగా విద్యా ప్రమాణాలకు ప్రసిద్ధి. ⇒ ఫ్రాన్స్: అమెరికా, బ్రిటన్లతో పోల్చితే ఫ్రాన్స్ తక్కువ ఖర్చుతో విద్యను అందిస్తోంది. పెద్ద సంఖ్యలో ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఇంగ్లీషులో కూడా కోర్సులను అందిస్తున్నాయి. దీంతో భారతీయ విద్యార్థులకు అక్కడ చదవడం సులభమవుతోంది. పట్టభద్రులయ్యాక అంతర్జాతీయ విద్యార్థులు ఫ్రాన్స్లో ఉండి పనిచేసేందుకు అవకాశం ఉంది. ⇒న్యూజిలాండ్: ఈ దేశం భారత్ విద్యార్థులకు ప్రాచుర్యం పొందిన మరో దేశంగా మారింది. అనుకూలమైన వీసా నియమాలు, పనిచేయడానికి సులభమైన అవకాశాలు దీనికి ఒక కారణంకాగా, దేశంలోని విశ్వవిద్యాలయాలు మంచి విద్య, పరిశోధన అవకాశాలను అందిస్తున్నాయి. వీటన్నింటికీ మించి న్యూజిలాండ్ ప్రపంచంలోని అత్యంత సురక్షిత దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందడం గమనార్హం. ఆయా అంశాలు ఈ దేశాన్ని విద్యార్థులకు గమ్యస్థానంగా మారుస్తున్నాయి. ⇒ పోలాండ్, ఇటలీ, స్వీడన్ : పోలాండ్ తక్కువ వ్యయంతో విద్యా అవకాశాలు అందిస్తోంది. ఇటలీ విషయానికి వస్తే స్కాలర్షిప్లు ఇస్తూ ట్యూషన్ ఫీజుల వెసులుబాటును కల్పిస్తోంది. ఇక స్వీడన్లో ఇంగ్లీషులో బోధించే అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలూ లభిస్తున్నాయి. -
ప్రేమను పంచే శుభదినం ఈద్
ఈదుల్ ఫిత్ర్ లేక రంజాన్ పర్వదినం ప్రపంచంలోని ముస్లిం సమాజానికి అత్యంత పవిత్రమైన, ఆనందకరమైన వేడుక. అత్యంత ఉత్సాహంగా, ఆనందంగా వారు ఈవేడుకను జరుపుకుంటారు. ఈ పర్వదినాన్ని ‘ఈద్’ అని కూడా పిలుస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ ను అనుసరించి రంజాన్ నెల ముగిసిన మరునాడు దీన్ని జరుపుకుంటారు.రంజాన్, ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదవ నెల. ఇది ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంలో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నెలలో ముస్లింలు ప్రత్యేకంగా ఉపవాసం (సియామ్) పాటిస్తారు, అంటే ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు భోజనం, పానీయాలు, ఇతర శరీర సంబంధిత అవసరాలన్నీ త్యజిస్తారు. ఉపవాసం ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఒక శుద్ధి ప్రక్రియగా భావించ బడుతుంది, ఇది స్వీయ నియంత్రణ, ప్రేమ, దయ, జాలి, క్షమ, సహనం, పరోపకారం, త్యాగం లాంటి అనేక సుగుణాలను పెంపొందించడానికి సహాయపడుతుంది. ఈ సందర్భంగా వారు వారి దైనందిన సేవాకార్యక్రమాలను మరింత విస్తరించుకొని, నైతికంగా, ఆధ్యాత్మికంగా తమ వ్యక్తిత్వాలను నిర్మించుకొని దేవుని కృపా కటాక్షాలు పొందడానికి ప్రయత్నిస్తారు. ఈదుల్ ఫిత్ర్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని, సమాజంలో పేదరికాన్ని తొలగించే ప్రయత్నం కూడా ఎంతోకొంత జరుగుతుంది. దాతృత్వం, సామాజిక సేవలకుప్రాధాన్యం ఇవ్వడం ఈ పండుగ ప్రధాన లక్ష్యం. ప్రతి ఒక్కరూ తమ తోటి సోదరులకు సహకరిస్తూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోడానికి ప్రయత్నిస్తారు. సదఖ, ఫిత్రా, జకాత్ ల ద్వారా అర్హులైన అవసరార్థులకు ఆర్థిక సహాయం అందిస్తారు.ఈదుల్ ఫిత్ర్ పర్వదినం సమస్త మానవాళి, సర్వ సృష్టిరాశి సుఖ సంతోషాలను కాంక్షించే రోజు. ఆనందం, శాంతి, సంతోషం, సమానత్వం, క్షమ, దయ, జాలి, పరోపకారం, సామాజిక బాధ్యతలను ప్రతిబింబించే ప్రత్యేకమైన రోజు. ఇది కేవలం ఒక ఆథ్యాత్మిక క్రతువు కాదు. సమాజంలో ప్రేమ, సహకారం, పరస్పర మైత్రి, బాధ్యత, ఆనందాలను పంచుకునే వేడుక. రంజాన్ నెల రోజుల శిక్షణ ద్వారానూ, ఈద్ పండుగ ద్వారానూ సమాజం ఆధ్యాత్మికతను, మానవతా విలువలను పునరుద్ధరించుకుంటుంది.పండగ తర్వాత కూడా...ఈద్ తో రోజాలకు వీడ్కోలు పలికినప్పటికీ, నెలరోజులపాటు అది ఇచ్చినటువంటి తర్ఫీదు అనంతర కాలంలోనూ తొణికిస లాడాలి. పవిత్ర రంజాన్ లో పొందిన దైవభీతి శిక్షణ, దయాగుణం, సహనం, సోదరభావం, పరస్పర సహకార, సామరస్య భావన, ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలు పంచుకునే గుణం, పరమత సహనం, సర్వ మానవ సమానత్వం లాంటి అనేక సదాచార సుగుణాలకు సంబంధించిన తర్ఫీదు ప్రభావం మిగతా పదకొండు నెలలకూ విస్తరించి, తద్వారా భావి జీవితమంతా మానవీయ విలువలే ప్రతిబింబించాలి. సమస్త మానవాళికీ సన్మార్గభాగ్యం ప్రాప్తమై, ఎలాంటి వివక్ష, అసమానతలులేని, దైవభీతి, మానవీయ విలువల పునాదులపై ఓ సుందర సమ సమాజం, సత్సమాజ నిర్మాణం జరగాలి. ఇహపర లోకాల్లో అందరూ సాఫల్యం పొందాలి. ఇదే రంజాన్ ధ్యేయం.ఈ రోజు ముస్లింలు ఉదయాన్నే నిద్రలేచి పరిశుభ్రతను పొందుతారు. ఈద్ నమాజ్ /ప్రార్థన ఆచరించి కుటుంబంతో, స్నేహితులతో కలిసి పండుగను జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ ఈ రోజున వారి వారిస్థోమత మేరకు కొత్త దుస్తులు ధరించి, పలు రకాల తీపి వంటకాలు ముఖ్యంగా సేమియా/షీర్ ఖుర్మా తీసుకుంటారు. ఈదుల్ ఫిత్ర్ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, సమాజంలో నైతిక, ఆధ్యాత్మిక, మానవీయ సుగుణాలను పునరుధ్ధరించే మహత్తరమైన రోజు. ఈ పండుగ రోజున ముస్లిం సమాజం జకాతుల్ ఫిత్ర్ అనే దానం కూడా ఇస్తారు. పేదసాదలను గుర్తించి వారికి ఫిత్రా దానాలు చెల్లించడం ద్వారా తమ దాతృత్వాన్ని చాటుకోవడం కాకుండా తమ బాధ్యతను నెరవేర్చామని భావిస్తారు.రంజాన్ నెల ముగియగానే, షవ్వాల్ నెల మొదటి రోజు ముస్లిం సోదరులు ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినం జరుపుకుంటారు. ‘ఫిత్ర్’ అంటే దానం, పవిత్రత లేదా శుద్ధి అని కూడా అంటారు. ఇది ఉపవాసం,ప్రార్థనల ధార్మిక విధిని పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని దైవానికి కృతజ్ఞతలు తెలుపుకునే అపురూప సందర్భం.– మదీహా అర్జుమంద్ -
పెన్సిల్ విలేజ్ ఆఫ్ ఇండియా గురించి తెలుసా?
ఏపీ సెంట్రల్ డెస్క్: జమ్ము కశ్మీర్లోని పుల్వామా జిల్లా ఓఖూ గ్రామం పెన్సిల్ విలేజ్ ఆఫ్ ఇండియాగా వినుతికెక్కింది. దేశం నుంచి పెన్సిల్ ఉత్పత్తికి కావాల్సిన 90 శాతం ముడి కలప ఇక్కడి నుంచే కంపెనీలకు ఎగుమతవుతోంది. పెన్సిళ్ల తయారీకి అవసరమైన కలపను ఒకప్పుడు చైనా, జర్మనీ నుంచి ఇక్కడివారు దిగుమతి చేసుకునేవారు. ఇప్పుడా అవసరం లేకుండా స్థానికంగా లభించే కలపను సమర్థవంతంగా నియోగించుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తమదైన ముద్ర వేసుకుంటున్నారు. మార్చి 30 జాతీయ పెన్సిల్ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం పాఠకుల కోసం.ప్రధాని ప్రస్థానంతో వెలుగులోకి.. దేశ ప్రధాని నరేంద్రమోదీ తన మనసులోని భావాలను ఆవిష్కరించే మన్ కీ బాత్ (mann ki baat) లో పెన్సిల్ విలేజ్ ఆఫ్ ఇండియాగా ఓఖూను అభివర్ణించారు. దీంతో ఈ గ్రామం వెలుగులోకి వచ్చింది. పుల్వామా జిల్లాలోని ఈ గ్రామం పెన్సిల్ తయారీకి ప్రధాన కేంద్రంగా గుర్తింపుపొందింది. దేశాన్ని విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో పుల్వామా కీలక భూమిక పోషిస్తోందని, విద్యార్థులు తమ హోంవర్క్ చేయడం, నోట్స్ రాసుకోవడంలో పెన్సిల్ (Pencil) వినియోగించినప్పుడల్లా పుల్వామా జిల్లా స్ఫురణకు వస్తుందని మన్ కీ బాత్ ప్రసంగంలో కితాబిచ్చారు. దిగుమతుల నుంచి ఎగుమతుల దాకా.. 1960 నుంచి ఇక్కడ పరిశ్రమల ప్రస్థానం ప్రారంభమైంది. మొదట్లో పెన్సిల్ తయారీకి దియోదార్ కలపను వినియోగించేవారు. 1992లో ఇక్కడి ప్రభుత్వం దియోదార్ వినియోగాన్ని నిషేధించడంతో చైనా, జర్మనీ దేశాల నుంచి కలపను దిగుమతి చేసుకునేవారు. అయితే ఇది వ్యయ ప్రయాసలతో కూడినది కావడంతో ప్రత్యామ్నాయానికి అన్వేషించారు. అలాంటి సమయంలో ఇక్కడ లోయల్లో లభించే పోప్లర్ కలప వీరికి వరంలా మారింది. ఆ కలపతో పెన్సిల్ పలకలను తయారుచేయడం మొదలెట్టారు. పోప్లర్ కలప పెన్సిల్ నాణ్యతను పెంచడంతో దిగుమతుల దశ నుంచి ఎగుమతి చేసుకునే స్థాయికి చేరింది. యూఏఈ, మెక్సికో, నేపాల్, పోలాండ్, ఫ్రాన్స్, భూటాన్, యూకే, బెల్జియం, మారిషస్, లెబనాన్, మాల్దీవులు, గ్రీక్, శ్రీలంక, బంగ్లాదేశ్ తోపాటు 85 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. నిరుద్యోగుల కల్పతరువు... ఓఖూ ఓఖూ... పుల్వామా జిల్లాకు చెందిన ఓ మారుమూల గ్రామం. ప్రపంచ స్థాయి మార్కెట్లో ఒకటిగా వెలుగొందుతోంది. గతంలో ముడి కలపను జమ్ము, చండీగఢ్లో ముక్కలుగా చేసి తెప్పించేవారు.స్థానిక ప్రభుత్వం వీరికి ఆధునికతను అందుబాటులోకి తీసుకురావడంతో పెన్సిల్ పలకలను ఇక్కడే తయారు చేస్తున్నారు. పెన్సిల్ రూపకల్పనకు అవసరమైన పలకలను ఎండబెడతారు. ఇవి బాగా ఆరాక ఒక్కో పెట్టెలో 800 పలకల లెక్కన ప్యాక్ చేస్తారు. నటరాజ్, అప్సర, హిందూస్థాన్ పెన్సిళ్ల తయారీ కర్మాగారాలకు ఇక్కడి నుంచే కలప వెళ్తోంది. ఏనాటికైనా కశ్మీర్ లోనే పూర్తిస్థాయి పెన్సిల్ ప్లాంట్ అందుబాటులోకి రావాలని, ప్రపంచ స్థాయిలో పెన్సిల్ ఉత్పత్తిలో దేశాన్ని అగ్రగామిగా నిలపాలన్నది ఓఖూ గ్రామస్తుల ఆకాంక్ష.చదవండి: వర్క్ షేరింగ్.. హ్యాపీనెస్ లోడింగ్ -
శరణార్థులకు, నిరాశ్రయులకు జారీ చేసే గ్రీన్ కార్డులకు ఫుల్స్టాప్!
గత జో బైడెన్ ప్రభుత్వం చూపించిన ఉదారవాద విధానాలను స ద్వినియోగం చేసుకుని ఇప్పటికే శరణార్థి/నిరాశ్రయుల హోదా సంపాదించిన విదేశీయులకు అందజేసే గ్రీన్కార్డుల జారీ ప్రక్రియ హఠాత్తుగా ఆగిపోయింది. తాత్కాలికంగా ఈ గ్రీన్కార్డుల జారీ ప్రక్రియను నిలిపేసినట్లు అమెరికా పౌరసత్వం, శరణార్థి సేవల విభాగం తాజాగా ధ్రువీకరించింది. దీంతో అక్రమ మార్గా ల్లో అమెరికాలోకి వచ్చి ఎలాగోలా శరణార్థి హో దా పొందిన వారికి ఇక కొత్త కష్టాలు మొదలయ్యే అవకాశముంది. శరణార్థి/నిరాశ్రయుల హోదా పొందటంతో ఏవైనా అవకతవకలు జరిగాయా లేదంటే వీళ్లంతా నిజంగానే సొంతదేశాల్లో హింస, పీడనకు గురయ్యారా? అనేది తేలాల్సి ఉంది. ఇందుకోసం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సంబంధిత పాత రికార్డులను తవ్వితీయనుందని తెలుస్తోంది. గ్రీన్కార్డు హోదా కోసం దరఖాస్తు చేసుకున్న వారి పూర్వాపరాలను సమీక్షించాకే వారికి గ్రీన్కార్డు కట్టబెట్టడంపై ముందుకెళ్లాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది. దీంతో లక్షలాది మంది శరణార్థులు/నిరాశ్రయుల గ్రీన్కార్డు కలలపై ఒక్కసారిగా నీలినీడలు కమ్ముకున్నాయి. భారతీయుల్లో 466 శాతం ఎక్కువ రెండేళ్ల క్రితం అంటే 2023 ఏడాదిలో ఏకంగా 51,000 మందికిపైగా భారతీయులు అమెరికాకు చేరుకుని శరణార్థి హోదా కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంతో పోలిస్తే ఒకేఏడాదిలో ఇంతమంది భారతీయులు శరణార్థులుగా అగ్రరాజ్యం చెంతకు చేరడం ఇదే తొలిసారి. 2018 ఏడాదిలో కేవలం 8,000 మంది భారతీయులు ఈ తరహా దరఖాస్తు చేసుకోగా 2023 ఏడాదికి వచ్చేసరికి ఏకంగా 466 శాతం అధికంగా 51,000 మంది అప్లై చేశారని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం విడుదలచేసిన గణాంకాల్లో వెల్లడైంది. అక్రమ మార్గాల్లో మెక్సికో, కెనడా సరిహద్దుల గుండా అమెరికా భూభాగంలోకి అడుగుపెడుతూ అమెరికా బోర్డర్ సెక్యూరిటీ పోలీసులకు చిక్కిన వేలాది మంది భారతీయులు శరణార్థి హోదా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకు అమెరికా ఇమిగ్రేషన్ సిస్టమ్ అనుమతిస్తోంది. శరణార్థి హోదా.. సుదీర్ఘ ప్రక్రియ బోర్డర్ వద్ద చిక్కిన వాళ్లకు వెంటనే శరణార్థి హోదా ఇవ్వరు. వాళ్లు చెప్పే వివరాలను అధికారులు నమోదుచేసుకుని దరఖాస్తు ప్రక్రియను మొదలుపెడతారు. వైద్య పరీక్షలతోపాటు ముఖాముఖి ఇంటర్వ్యూలు చేస్తారు. సంబంధిత శరణార్థి అధికారులు ఈ బాధ్యతలను నెరవేరుస్తారు. ఈ సందర్భంగా తాము స్వదేశాన్ని ఎందుకు వీడాల్సి వచ్చింది?. స్వదేశంలో తాము పడిన కష్టాలు, ఎదురైన సమస్యలు, సొంత సమాజంలో అణచివేతకు గురవడానికి కారణాలను వివరించాల్సి ఉంటుంది. వీళ్లు చెప్పే మాటలు, వివరాలను అధికారులు/ఇమిగ్రేషన్ న్యాయమూర్తులు నమ్మితే శరణార్థి హోదా వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. కార్యనిర్వాహక ఉత్తర్వుతో అడ్డుకున్న ట్రంప్ ఎలాగోలా శరణార్థి హోదా పొందిన వారికి అమెరికాలో తాత్కాలికంగా నివసించేందుకు అవకాశం చిక్కుతోంది. ఈ అవకాశం లేకుండా చేసేందుకు రెండోదఫా అధికారంలోకి వచ్చిన ట్రంప్ వెంటనే రెండు కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీచేశారు. శరణార్థులుగా వచ్చే వారిని లోపలికి రానివ్వడం ఆపేశారు. అరెస్టయి శరణార్థి శిబిరాల్లో ఉంటున్న వారు శరణార్థి హోదా దరఖాస్తు చేయకుండా నిలువరిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా–మెక్సికో సరిహద్దు వద్ద ఈ రెండు విధానాలను ట్రంప్ కఠినంగా అమలుచేస్తున్నారు. ఈ ఉత్తర్వులను ఇప్పటికే కొందరు కోర్టుల్లో సవాల్చేశారు. కొందరిని స్వదేశాలకు తిరిగి పంపడాన్ని ఇటీవల ఒక ఫెడరల్ జడ్జి తన ఉత్తర్వులతో అడ్డుకోవడం తెల్సిందే. హోదా సవరణపై ట్రంప్ సర్కార్ తీవ్ర అభ్యంతరం శరణార్థి హోదాతో చాన్నాళ్లుగా అమెరికాలో ఉంటున్న వాళ్లు ఇక శాశ్వత స్థిర నివాసం కోసం గ్రీన్కార్డుకి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ దరఖాస్తుల పరిశీలనను ట్రంప్ సర్కార్ తాజాగా ఆపేసింది. హడావుడిగా వీళ్లకు గ్రీన్కార్డు ఇచ్చేయకుండా అసలు ఈ శరణార్థుల గతచరిత్ర స్వదేశంలో ఎలాంటిది?. భవిష్యత్తులో వీళ్లు అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా మారే ప్రమాదముందా?.. ఇలా పలు అంశాల తుది నిర్దారణకు సంబంధించి ‘స్క్రీనింగ్’విధానాలను అవలంబించాలని, అందుకోసమే అప్లికేషన్ల పరిశీలనను ఆపేశామని యూఎస్ సిటిజన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐసీ) అధికారులు స్పష్టంచేశారు. మెక్సికోలో గతంలో డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్న వ్యక్తులు/కుటుంబాలు అమెరికాలో శరణార్థులుగా ఉంటే అలాంటి వారి జాబితాను ఈ గ్రీన్కార్డు దరఖాస్తుల్లో వెతుకుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Ugadi 2025: విశ్వ శ్రేయస్సే విశ్వావసు...ఉగాది
మనిషికి భవిష్యత్తు తెలుసుకోవాలని ఎప్పుడూ ఉంటుంది. ఆ భవిష్యత్తులో మంచి జరగాలనే ఆకాంక్ష ఉంటుంది. కాని భవిష్యత్తు అనేది అనిశ్చితితో నిండి ఉంటుందన్న ఎరుక కూడా ఉంటుంది. అయితే ఒక ఆశ కావాలి కదా. ఆ ఆశను ఆధ్యాత్మిక రూపంలో గ్రహాలను ఊతంగా చేసుకుని సనాతనంగా వచ్చిన గ్రహ విజ్ఞానం ఆధారంగా నిలబెట్టేదే పంచాంగ దర్శనం. మంచిని వాగ్దానం చేస్తూ చెడును హెచ్చరిస్తూ సాగే పంచాంగంలో అనూహ్యమైనది ఏదీ కనిపించకపోయినా దానిని వినడం, చదవడం, పరికించడం ఆనవాయితీ. అయితే ఈసారి ‘సామాజిక పంచాంగం’ను వినిపించాలనుకుంది ‘సాక్షి’. ఆరు కీలక రంగాలు దేశంలో, స్థానికంగా ఎలా ఉంటాయో తెలియచేశారు పండితులు. అవధరించండి.ప్రకృతికి ప్రణామంమనం ఏ శుభలేఖల్లో అయినా స్వస్తిశ్రీ చాంద్రమానేన....అని చదువుతుంటాం. అంటే చాంద్రమానం ప్రకారం జరుపుకునే పండగల్లో ఉగాది పండగది ప్రథమస్థానం. ఉగాది రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ‘ఉగాది’ అన్న తెలుగు మాట ‘యుగాది‘ అన్న సంస్కృతపద వికృతి రూపం. బ్రహ్మ ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంభించిన రోజు. మొదటి ఋతువు వసంత ఋతువులో మొదటి మాసం ( చైత్ర మాసం)లో మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రభవింపజేసాడని అర్థం. అందుకే మొదటి సంవత్సరానికి ‘ప్రభవ’ అని పేరు. చివరి అరవయ్యవ సంవత్సరం పేరు ‘క్షయ’ అంటే నాశనం అని అర్థం.ఉగాది సంప్రదాయాలుఉగాది రోజు తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, ఉగాది పచ్చడి సేవనం, ధ్వజారోహణం, పంచాంగ శ్రవణం తదితర పంచకృత్యాలను నిర్వహించాలని వ్రతగ్రంథం పేర్కొంటోంది. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తాము పండించబోయే పంటకి ఏ కార్తెలో ఎంత వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి... వంటివన్నీ శ్రద్ధాభక్తులతో అడిగి తెలుసుకుంటారు.ఉగాది పూజఅన్ని పండుగలలాగానే ఉగాది పండుగనాడు ఉదయానే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజ చేసుకొంటారు. అయితే ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ చెప్పబడలేదు గనుక ఈరోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు. ఆ తర్వాత ఏమీ తినక ముందే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు, అలాగే అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినడం వల్ల ఏడాదంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేలా చేస్తుందని వైద్యులు చెప్పేమాట. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు, అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తుంది. ఎక్కడికీ కదలలేని చెట్లు కూడా తమ ఆకులను రాల్చేసుకుని చివుళ్లు తొడిగి పూత, పిందెలతో కళకళలాడే ఈ వసంతరుతువులో మనం కూడా మనలోని చెడు అలవాట్లను, నకారాత్మక ఆలోచనలను వదిలేసి, శుచి, శుభ్రత, సంయమనం, సమయపాలన, సమయోచిత కార్యాలను ఆచరించటమనే సద్గుణాలను అలవరచుకుందాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అర్థం ఏమిటి? నేడు మనం అడుగిడుతున్న కొత్త తెలుగు సంవత్సరానికి శ్రీవిశ్వావసు నామ సంవత్సరం అని పేరు. అంటే విశ్వ శ్రేయస్సు, విశ్వ సంపద అని అర్థం. ఇది అష్టవసువులలో ఒక వసువు పేరు. ఈ సంవత్సరం అందరికీ శ్రేయోదాయకంగా... సంపద్వంతంగా ఉంటుందని ఆశిద్దాం...కొత్తదనం... పచ్చదనంఉగాది అనగానే ఏదో తెలియని కొత్తదనం సుతిమెత్తగా మనసును తాకినట్టు అనిపిస్తుంది. పచ్చదనం మనసునిండా పరుచుకుంటుంది. మామిడిపళ్లు, మల్లెమొగ్గలు, తాటిముంజలు, పుచ్చకాయలు, కోయిల గానాలు మదిలో మెదులుతాయి. చిన్నప్పుడెప్పుడో చదువుకున్నట్టుగా చెట్లు చిగిర్చి పూలు పూసే వసంత రుతువు ఇది. మనసును ఉల్లాసపరిచే కాలం ఇది. అందుకే కవులు, కళాకారులు, సాహితీవేత్తలు ఉగాదిని, వసంత రుతువును విడిచిపెట్టలేదెప్పుడూ! ఉగాది కవి సమ్మేళనాలు, ఉగాది కథలు, కవితల పోటీలు, ఉగాది కార్టూన్లు కాగితం నిండా కళ్లు చేసుకుని తొంగి చూసే ప్రయత్నం చేస్తుంటాయి.ఆర్థికంగా ముందుకు...విశ్వావసు నామ సంవత్సరంలో మంత్రి చంద్రుడు అవడం చేత, రసాధిపతి శుక్రుడు అవడం చేత, నీరసాధిపతి బుధుడు అవడం చేత వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. భారతదేశం ఆర్థిక పరంగా ముందుకు సాగుతుంది. తెలుగురాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి. పశ్చిమ దేశాల్లో యుద్ధ భయం, యుద్ధ వాతావరణాలు ఉండి ఆర్థికపరంగా పశ్చిమ దేశాలకు అనిశ్చితి ఏర్పడుతుంది. మేఘాధిపతి రవి అవడం చేత పంటలకి క్రిమి కీటకాదుల వల్ల ముప్పు ఉంటుంది. రైతులకు కొంత ఆర్థిక నష్టం జరగవచ్చు. ధనవంతులు అధిక ధనవంతులు అవుతారు. పెద్ద వ్యాపారస్తులు లాభాలు బాగా ఆర్జిస్తారు. చిన్న వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆర్థికంగా భారతదేశానికి శుభ ఫలితాలనూ, తూర్పు ప్రాంతాలకు, తూర్పు దేశాలకు అనగా చైనా, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు అభివృద్ధిని సూచిస్తోంది.ఆరోగ్యం ఫరవాలేదు...శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో నవనాయకులలో ఐదుగురు పాపులు, నలుగురు శుభులు ఉండడం చేత రాజు రవి, మంత్రి చంద్రుడు అవటం వల్ల ప్రజలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉంటారు. కొన్ని గ్రహాల స్థితిగతులు అలజడులకు, విచిత్ర రోగాలకు, సర్వత్రా ఆందోళనలకు దారి తీస్తాయి. సంవత్సరారంభం నుంచి మే 6వ తేదీ వరకూ మీనరాశిలో నాలుగు గ్రహాలు ఒకే రాశిలో కూటమి కావడం వల్ల విశేష సూర్యతాపం, అకాల మరణాలు, యుద్ధ భయాలు, ధరల పెరుగుదల వంటి ఫలితాలు చూడాల్సిన పరిస్థితి. ఏప్రిల్ 1 నుంచి 13 రోజుల పాటు మీనరాశిలోనే పంచగ్రహ కూటమి ఏర్పడనుంది. దీనివల్ల దుర్భిక్ష పరిస్థితులు, కొన్ని దేశాలలో వ్యాధుల వ్యాప్తి, జననష్టం, ప్రకృతి బీభత్సాలు వంటివి నెలకొంటాయి. జూన్ ఒకటో తేదీ నుంచి జులై 28వ తేదీ వరకూ కుజరాహువుల పరస్పర వీక్షణాల వల్ల యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు, కొన్ని వ్యాధులు వ్యాపించే సూచనలు. ఉగాది నుండి సుమారు మూడు నెలల పాటు అపసవ్య రీతిన కాలసర్పదోష ప్రభావం కారణంగా వివిధ సమస్యలు, రోగాలతో ప్రజలు అవస్థ పడతారు. జాతీయ, అంతర్జాతీయ నేతలు కొందరిపై ఆరోపణలు, అరెస్టులు, ఆందోళనలు రేకెత్తవచ్చు. – చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్తఅనుబంధాలు జాగ్రత్తఈ ఏడాది పాలకుల మధ్య గాని కుటుంబ, వ్యక్తిగత అనుబంధాలుగానీ అంత బాగుంటాయని చెప్పలేం. అందువల్ల బంధుమిత్రుల ఇళ్లకు అతి ముఖ్యమైన పని మీద వెళ్లినా, ఎక్కువ సమయం ఉండకుండా తొందరగా పని చూసుకుని రావడం మంచిది. అనుబంధాలు, మానవ సంబంధాలు బాగుండాలంటే తరచు మాట్లాడుకుంటూ ఉండటం శ్రేయస్కరం. ఆర్థికంగా అంత బాగుండని బంధువుల మీద తెలిసీ తెలియక భారం వెయ్యకుండా వారికి మీ వల్ల చేతనైన సాయం చేయడం మంచిది. అనవసరమైన, చెయ్యలేని, చేతకాని వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చలేక మాటలు పడి మానసిక ప్రశాంతతను పోగొట్టుకునే బదులు చెయ్యగలదానిని మాత్రమే చెప్పడం, చెయ్యలేని వాటిని సున్నితంగా ముందే మా వల్ల కాదని చెప్పడం వల్ల స్నేహసంబంధాలు దెబ్బ తినకుండా ఉంటాయి. బంధువులు, మిత్రుల మధ్య అనుబంధాలు బాగుండాలంటే వారితో స్నేహ సంబంధాలు కొనసాగించడం మేలు. – డా. మైలవరపు శ్రీనివాసరావు, ఆధ్యాత్మిక వేత్తఆనందానికి లోటు లేదుఈ విశ్వావసు నామవత్సరంలో పేరులోనే విశ్వశాంతి గోచరిస్తోంది. క్రోధాలు, మోసాలు, ద్వేషాలు తొలగిపోయి ప్రజలంతా ఒక్కమాటగా ఉంటారు. రాజకీయ రంగంలోని వారికి అవకాశాలు రావడం వల్ల ఆనందంగా ఉంటారు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు వచ్చి ఆనందంలో తేలుతారు, సాహిత్య, సాంస్కృతిక పర్యాటక రంగాలలోని వారికి అనుకూలంగా ఉండటం వల్ల ఆనందం కలుగుతుంది. ప్రజలంతా చేయీ చేయీ కలుపుకొని మాటా మాటా కలుపుకొని మనసులలోని శంకలు మాపుకొని ఒక్కతాటి మీద నడుస్తూ ఆనందంగా ఉంటారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరం తక్కువ ఎక్కువలనూ పేదాగొ΄్పా తారతమ్యాలను విడనాడి, దేశంలోని అన్ని రంగాలలో సమన్వయం ఏర్పడి అందరూ కలసి కట్టుగా ప్రతి నిత్యం ఆనందంతో మునిగి తేలుతూ అంబరాలనంటేలా సంబరాలను జరుపుకుంటూ జీవిద్దాం. – తాడిగడప సోదరులు: తాడిగడప సుబ్బారావు, తాడిగడప బాల మురళి భద్రిరాజు,శ్రీ వాగ్దేవి జ్యోతిష విద్యాలయం,పెద్దాపురంఅభివృద్ధికరంగా ఉంటుందిశ్రీవిశ్వావసు నామ సంవత్సరంలో దేశ అభివృద్ధి ఆశాజనకంగా ఉంది. ఈ సంవత్సరం గ్రహాలలో అత్యధిక శాతం శుభులు ఉండడం వల్ల ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. సస్యవృద్ధి, పశుసంపదకు క్షేమం, ఆయురారోగ్యం కలుగుతుంది. రాజ్యాధిపతి అనుకూలుడుగా ఉండడంవల్ల దేశాధినేతలకు పాలకులకు శుభం చేకూరుతుంది. కొన్ని రాష్ట్రాలలో అతివృషి,్ట మరికొన్ని రాష్ట్రాలలో అనుకూల వృష్టి ఉండవచ్చు. నిత్యావసర వస్తువుల ధరలు నిలకడగా ఉంటాయి. రసవస్తువుల ధరలు కొంత హెచ్చి తగ్గుతాయి. నీరస వస్తువులు ధరలు తగ్గి స్వల్పంగా హెచ్చుతాయి. పరిపాలకులు సంయమనంతో ఉంటారు. చేతివృత్తుల వారికి ఈ సంవత్సరం చేతి నిండా పని దొరుకుతుంది. దేశ రక్షణ బాధ్యతను వహించే సైనికులకు ఈ సంవత్సరం పరీక్షా సమయం అయినప్పటికీ విజయం సాధిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమంపై దృష్టి సారిస్తారు. నీటిపారుదల, పారిశ్రామిక రంగాలపై పాలకులు ్రపాధాన్యతను చూపుతారు. యువకులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి– ఓరుగంటి నాగరాజశర్మ, పుష్పగిరి పీఠ మహాసంస్థాన సిద్ధాంతి, జ్యోతిష విద్వాంసులుఆధ్యాత్మికం మిశ్రమంశ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆధ్యాత్మికంగా, సామాజిక పరంగా శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి చేయూత, పండితులకు కొంత వరకు ఆర్థికసాయం అందే అవకాశం ఉంది. గురుడు వర్ష జగ లగ్నంలో కేంద్ర గతులవడం వల్ల ధార్మిక ఆరాధనల్లో విస్తృతి పెరుగుతుంది. ముఖ్య దేవాలయాల్లో కొన్ని సంస్కరణల వల్ల హైందవ జాతికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా మతపరమైన విషయాల్లో స్వీయ మత ఎరుక పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మం అభివృద్ధికరంగా ఉంటుంది. అయితే షష్ఠగ్రహ కూటమి వల్ల బంద్లు, అధిక ఉష్ణోగ్రతల వల్ల సమాజంలో కొంత భయం ఏర్పడి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అంతరాయం కలుగవచ్చు. అలాగే మత్తు మందులు మారక ద్రవ్యాల వల్ల చెడుమార్గం పట్టే వారికి సంఖ్య పెరిగి వారికి ఆధ్యాత్మిక కట్టడి అవసరం అవుతుంది సమాజంలో ఆధ్యాత్మిక చింతనకు ధనవంతుల ఆర్థికసాయం లభించగలదు. – చింతా గోపీశర్మ, సిద్ధాంతి – డి.వి.ఆర్. భాస్కర్ -
ప్రేమ.. పరువు.. ఆత్మహత్య.. హత్య!
ప్రేమ.. త్యాగం నేర్పుతుంది అంటారు. కానీ.. యువతీ, యువకుల మధ్య చిగురించిన ప్రేమ బలికోరుతోంది. సామాజిక సమీకరణాలు కుదరక కులాల కుంపటి రాజుకుంటోంది. గ్రామాల్లో ఈ పోకడ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాము కనీ, పెంచిన పిల్లలు తమకు దక్కకుండా పోతారన్న భయం, పరువు పోతుందన్న ఆందోళనలో తల్లిదండ్రులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. .. ఇవి హత్యల వరకు దారితీస్తున్నాయి. మరోపక్క తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించన్న భయంతో ప్రేమికులు ప్రాణత్యాగాలు చేసుకుంటున్నారు. దురదృష్టవశాత్తూ ఉమ్మడి జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండగా.. సామాజిక అంతరాలకు అద్ధం పడుతున్నా యి. వేర్వేరు కులాల యువతీ, యువకులు ప్రేమించుకుంటే వారిపై దాడులు సహజమే అయినా.. అది చంపుకునేదాకా వెళ్తుండడమే ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ఉత్తరాదికే పరిమితమైన ఈ పోకడ ఉమ్మడిజిల్లాకు పాకడం గమనార్హం.పంతాలతో కుటుంబాలు నాశనంసామాజిక కట్టుబాట్లను ఛేదించలేక, అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల ప్రేమను అంగీకరించలేక పెద్దలు తీసుకుంటున్న తీవ్ర నిర్ణయాలు ఆయా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. కుటుంబ పెద్ద జైలుకు వెళ్లడంతో ఆర్థికంగా చితికిపోతున్నా యి. వాస్తవానికి ఏ సమాజంలో ఏ పరువు కోసం హత్యలు చేస్తున్నారో.. తరువాత అదే సమాజం ఆయా కుటుంబాలకు అండగా నిలబడని విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో యుక్తవయసులో ప్రేమే సర్వస్వం అంటూ జీవితంలో స్థిరపడక ముందే ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ప్రాణాలు తీసుకుని, తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు.ఉమ్మడి జిల్లాలోని పలు ఘటనలు⇒ మార్చి 27న పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటకు చెందిన సాయికుమార్ను అదే గ్రామానికి చెందిన ముత్యం సద య్య తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని గొడ్డలితో నరికి చంపడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేవలం కులాలు వేరన్న కా రణమే సాయిని చంపేలా చేసింది.⇒ ఇల్లందకుంట యువకుడు, నిర్మల్ జిల్లాకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దల ఆమోదం ఉండదన్న ఆందోళనతో మార్చి 17న జమ్మికుంట పరిధిలోని రైల్వేస్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.⇒ మార్చి 6న చొప్పదండికి చెందిన ప్రేమికులు ఇంట్లోవారు తమ ప్రేమను అంగీకరించరన్న భయంతో కరీంనగర్లో స్నేహితుడి ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.⇒ 2024 ఏప్రిల్లో తాను అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కులాంతర వివాహం చేసుకుని వెళ్లిపోయిందన్న బాధతో సిరిసిల్ల జిల్లాలో ఓ తండ్రి తన కుమార్తెకు పిండ ప్రదానం చేశాడు. తమ ఆశలను అడియాశలు చేసిన కూతురు మరణించిందని ఫ్లెక్సీ పెట్టించడం సంచలనంగా మారింది.⇒ 2023 నవంబరులో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన ప్రేమికులు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు.⇒ 2023 ఆగస్టులో కోరుట్ల పట్టణంలో తన ప్రియుడితో పరారయ్యే క్రమంలో ప్రియురాలు తన అక్కనే హత్య చేసి పరారవడం కలకలం రేపింది.⇒ 2021 ఆగస్టులో మంథనికి చెందిన ఓ ప్రేమజంటపై యువతి తండ్రి హేయంగా దాడి చేశాడు. ఈ దాడిలో ప్రేమికులు తృటిలో చావు నుంచి తప్పించుకున్నారు. ⇒ 2017లో మంథనిలో మధుకర్ అనే దళిత యువకుడి అనుమానాస్పద మరణం కూడా పరువుహత్యగా ప్రాచుర్యం పొందింది. అనుమానాస్పద మరణం అని పోలీసులు, ప్రి యురాలి బంధువులే చంపారని మధుకర్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దళితసంఘాలు ధర్నా చేయడంతో మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. అప్పట్లో ఇది జాతీయస్థాయిలో చర్చానీయాంశంగా మారింది. ఈ కేసు ఇంకా తేలాల్సి ఉంది.⇒ 2016లో తిమ్మాపూర్లోని ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకునేందుకు పీటల మీద కూర్చున్న జంటపై యువతి బంధువులు దాడి చేశారు. పెళ్లికూతురు కళ్లముందే పెళ్లి కొడుకును విచక్షణా రహితంగా పొడిచి చంపడం కలకలం రేపింది.ఆలోచన తీరు మారాలి కులం అహంకారంతో జరిగే దారుణాలతో ప్రాణాలుపోతున్నాయి. టెక్నాలజీలో ముందున్న మనం ఆధునికంగా ఆలోచించలేక పోతున్నాం. ఉన్నత చదువులు చదువుకునే..యువత కూడా ప్రేమించుకోవడం.. కాదన్నారని ప్రాణాలు తీసుకోవడం తగదు. ఈ ఘటనలకు కేవలం ఆలోచన తీరే కారణం. తీరుమారితే విపరీత ధోరణులు మారుతాయి. – ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత,సోషియాలజీ విభాగం అధిపతి, శాతవాహన వర్సిటీకుల వివక్షపై అవగాహన కల్పించాలి సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నా కుల,మత భేదాలు గ్రామాల్లో అలాగే కొనసాగుతున్నాయి. కులాల మధ్య వైరుధ్యాలు పెరిగేలా ప్రభుత్వాలు కులాల ఆధారంగా ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజల మధ్య దూరాలను పెంచుతున్నాయి. పిల్లల ప్రేమ కన్నా పరువు, పట్టింపులే ఎక్కువ అనే భావన తొలిగేలా, కులవివక్షపై ప్రజలకు అవగాహన కలిగించేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.– కల్లెపల్లి ఆశోక్, కేవీపీఎస్ :::సాక్షిప్రతినిధి, కరీంనగర్ -
ఎఫ్ఎంసీజీ దిగ్గజాల షాపింగ్
ముంబై: ఇటీవల కొద్ది నెలలుగా ఎఫ్ఎంసీజీ రంగ దిగ్గజాలు షాపింగ్లో బిజీగా కనిపిస్తున్నాయి. ఇతర సంస్థల కొనుగోళ్లకు తెరతీస్తున్నాయి. ప్రధానంగా ఆధునికతరం డిజిటల్ బ్రాండ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న చిన్నతరహా కంపెనీలు లక్ష్యంగా షాపింగ్ను చేపడుతున్నాయి. జెన్జెడ్ వినియోగదారులకు చేరువ అవుతున్నాయి. డైరెక్ట్టు కన్జ్యూమర్ బ్రాండ్స్ సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వినియోగదారులను వేగంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే పరిమిత పంపిణీ వ్యవస్థ, నిధులలేమి కారణంగా పలు కంపెనీలు కార్యకలాపాలను విస్తరించలేకపోతున్నాయి. కొనుగోళ్ల బాటలో దీంతో ఎఫ్ఎంసీజీ కంపెనీలు హెచ్యూఎల్, గోద్రెజ్ ఆగ్రోవెట్, ఐటీసీ చిన్న సంస్థలను సొంతం చేసుకుంటున్నాయి. దీంతో చిన్నతరహా సంస్థలు తమ ప్రొడక్టులను విస్తారిత మార్కెట్లో పరిచయం చేసేందుకు వీలు కలుగుతోంది. ఇటీవల స్కిన్కేర్ బ్రాండ్ మినిమలిస్ట్ను హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్యూఎల్) సొంతం చేసుకోగా.. గోద్రెజ్ ఆగ్రోవెట్.. క్రీమ్లైన్ డెయిరీను కొనుగోలు చేసింది. హెచ్యూఎల్ తెలంగాణలో పామాయిల్ క్షేత్రాన్ని కొనుగోలు చేసింది. తద్వారా సబ్బులు తదితర ప్రొడక్టుల తయారీలో పామాయిల్ అవసరాలను సర్దుబాటుచేసుకోనుంది. ఈ బాటలో తాజా గా ప్లాస్టిక్ రీసైక్లింగ్ సంస్థ.. లుక్రో ప్లాస్టిసైకిల్లో వాటా కొనుగోలు చేసింది. తద్వారా భవిష్యత్లో ఎఫ్ఎంసీజీ కంపెనీలకు తప్పనిసరికానున్న ప్లాస్టిక్ రీసైక్లింగ్ నిబంధనల అమలుకు హెచ్యూఎల్ దారి ఏర్పాటు చేసుకుంటున్నట్లు విశ్లేషకులు వివరించారు. మామాఎర్త్ లిస్టింగ్.. దశలవారీగా 100 శాతం వాటా కొనుగోలు చేస్తున్న డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ గూటికి.. ఫ్రోజెన్, రెడీటు ఈట్ ఆహార ప్రొడక్టుల కంపెనీ ప్రసుమ చేరనుంది. తొలుత 43.8 శాతం వాటాతో ప్రారంభించి మూడేళ్లలో పూర్తి వాటాను ఐటీసీ సొంతం చేసుకోనుంది. ఇప్పటికే మరో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామీ.. పురుషుల సౌందర్య పోషక సంస్థ హీలియోస్ లైఫ్స్టైల్(ద మ్యాన్ కంపెనీ)ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇదేవిధంగా చింగ్స్ సీక్రెట్, స్మిత్ అండ్ జోన్స్ బ్రాండ్ల కంపెనీ క్యాపిటల్ ఫుడ్స్ను టాటా గ్రూప్ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ చేజిక్కించుకుంది. తద్వారా ఆర్గానిక్, హెల్త్ ఫుడ్ విభాగంలో కార్యకలాపాలు విస్తరిస్తోంది. కాగా.. మామాఎర్త్ బ్రాండ్ ప్రొడక్టుల డీటూసీ కంపెనీ హోనసా కన్జ్యూమర్ డిజిటల్ మార్గంలో వినియోగదారులను ఆకట్టుకుంటున్నప్పటికీ ఆఫ్లైన్లో విస్తరించడంలో సవాళ్ల కారణంగా వృద్ధి పరిమితమవుతున్నట్లు విశ్లేషకులు వివరించారు. వెరసి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ కంటే ఎఫ్ఎంసీజీ దిగ్గజాల ద్వారా అధిక నిధులు, విస్తరణకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రీమియం ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ బ్రాండ్ ఇందులేఖను హెచ్యూఎల్ కొనుగోలు చేయడంతో పరిమితస్థాయి నుంచి బయటపడి భారీస్థాయిలో అమ్మకాలు సాధిస్తుండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ బాటలో మినిమలిస్ట్ ప్రొడక్టులు సైతం వేగవంత వృద్ధి సాధించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు కొంతకాలంగా ప్రత్యేక తరహా చిన్నకంపెనీలపై దృష్టి పెట్టాయి. డిజిటల్ బ్రాండ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న సంస్థల కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నాయి. తద్వారా జెన్జెడ్ వినియోగదారులకూ చేరువ అవుతున్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
డిజిటల్ చెల్లింపులు.. ‘ఖాతా’కు చిల్లులు!
డబ్బులు ఏట్లో పారేసినా లెక్క పెట్టి పారేయాలన్నది పెద్దల మాట. అంటే చేతితో డబ్బులు లెక్క పెట్టి పారేస్తూ ఉంటే దాని విలువ తెలుస్తుందని భావన. అలాగే మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయినీ ఏదైనా పుస్తకంలో రాసుకుంటే నెల చివరలో దేనికెంత ఖర్చు పెట్టాము.. ఎక్కడ అనవసరంగా ఖర్చు చేస్తున్నాము.. ఏ ఖర్చులు తగ్గించుకోవాలి.. ఎక్కడ మిగిలించాలనే విషయాలు తెలుస్తాయి. దీన్ని బట్టే ఫ్యామిలీ బడ్జెట్ రూపొందించుకోవచ్చు. కానీ ఇటీవల డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ కొనుగోళ్ల పుణ్యమా అని ఎంత డబ్బు వస్తున్నా ఇట్టే అయిపోతోంది. లెక్క పెట్టకుండా ఖర్చు చేయడం వల్లే ఈ సమస్య వస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.కర్నూలు(హాస్పిటల్): కర్నూలు జిల్లాలో ప్రస్తుతం అన్ని రకాల వ్యాపారాలు ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ ద్వారానే సాగుతున్నాయి. ఒకప్పుడు ఫోన్ పే, గూగుల్ పే లాంటివి ఉపయోగించాలంటే భయపడే జనం ఇప్పుడు అవలీలగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఎంతగా అంటే రూ.5 నుంచి వేల రూపాయల వరకు ఆన్లైన్లోనే చెల్లింపులు చేస్తున్నారు. ఏదైనా కొనుగోలు చేసినా, ఎవరికైనా డబ్బు పంపాలన్నా, అప్పు ఇవ్వాలన్నా, తీసుకున్న రుణం తీర్చాలన్నా, ఇతర ఎలాంటి లావాదేవీలైనా సరే డిజిటల్ పేమెంట్ తప్పనిసరి అవుతోంది.అయితే పెట్టే ఖర్చు మొత్తం బ్యాంకు ఖాతా ద్వారానే జరుగుతోంది. దీన్నిబట్టి ఎవరికి ఎంత డబ్బులు వస్తున్నా యి, ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎంత ఏఏ ఖాతాలకు మళ్లిస్తున్నారు, ఎవరెవరికి చెల్లిస్తున్నారు, వీరికి ఎవరి నుంచి డబ్బులు వస్తున్నాయనే విషయాలన్నీ బ్యాంకుల వారికి తెలిసిపోతోంది. అది చిన్న మొత్తమైనా, పెద్ద మొత్తమైనా సరే అన్ని వివరాలు ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా మనకు తెలియకుండానే బ్యాంకులకు/ప్రభుత్వానికి చెప్పేస్తున్నాయన్న మాట. కోవిడ్ తర్వాత ఊపందుకున్న పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ రూపంలో పదేళ్ల క్రితం డెబిట్, క్రెడిట్కార్డులు, గిఫ్ట్కార్డులు వచ్చాయి. కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసి వాటిని వ్యాపార దుకాణాల్లో స్క్రాచ్ చేసి డబ్బులు చెల్లించేవారు. కొంత కాలం తర్వాత ఇవే కార్డుల ద్వారా ఆన్లైన్లోనే వస్తువులను కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. కోవిడ్ అనంతరం వ్యాపార లావాదేవీల్లో మరింత సరళతరం వచ్చింది. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ల ద్వారా జనం డబ్బు చెల్లించడం, తీసుకోవడం ప్రారంభించారు. ఎంతగా అంటే రూ.5ల కొనుగోలుకు సైతం ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. మొదట్లో ఇలా డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడని వ్యాపారులు సైతం క్రమంగా అంగీకరించక తప్పని పరిస్థితి. చిల్లర కొరత కారణంగా కూడా డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాయి.» కర్నూలు నగరంలోని ఎ.క్యాంపునకు చెందిన వెంకట్ ఓ ప్రైవేటు కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. ఆయన జీతం నెలకు రూ.60వేలు. వచ్చిన జీతంతో ఇంట్లోని నలుగురు కుటుంబసభ్యులతో హాయిగా జీవిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో నెలాఖరుకు అకౌంట్లో డబ్బులన్నీ అయిపోయినట్లు గమనిస్తున్నాడు. ఇంత డబ్బు ఏమైందని పరిశీలిస్తే అదంతా డిజిటల్ పేమెంట్స్ ద్వారా తానే ఖర్చు చేసినట్లు నిర్ధారించుకున్నాడు.» ఆదోనికి చెందిన నాగేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. చిరుద్యోగమే అయినా 20 ఏళ్లకు పైగా సీనియారిటీ ఉండటంతో జీతం రూ.లక్షకు పైగా వస్తోంది. మొదట్లో తాను ఖర్చుచేసిన ప్రతిదీ ఓ పుస్తకంలో రాసుకునే అలవాటు ఉండేది. అన్ని ఖర్చులు పోను నెలకు 30శాతం దాకా మిగిలేది. కానీ ఇటీవల డిజిటల్ అకౌంట్లో ఖర్చు పెడుతూ లెక్క రాసుకోవడం మానేశాడు. నెల తిరిగేసరికి బ్యాంకు ఖాతా ఖాళీ అవుతోంది. ఎందుకిలా అని ప్రశ్నించుకుంటే ఆన్లైన్లో తెలియకుండానే తానే ఖర్చు చేస్తున్నట్లు తెలుసుకున్నాడు.లెక్కలేకుండా ఖర్చు పెట్టేస్తున్నారు ఆన్లైన్ లావాదేవీల కారణంగా బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యేవరకు మనం ఎంత ఖర్చు పెట్టామో తెలియని పరిస్థితి. దీనికితోడు ఏ వస్తువును ఎంతకు కొనుగోలు చేస్తున్నారో కూడా తెలియకుండా, బేరమాడకుండా కొనేస్తున్నారు. సాధారణంగా మనం కిరాణా దుకాణానికి వెళ్తే సరుకులకు దేనికి ఎంత బిల్లు వేశాడో చూస్తాము. కానీ డిజిటల్ పేమెంట్స్ కారణంగా ఇవేమీ పట్టించుకోవడం లేదు. షాపువారు ఎంత చెబితే అంత చెల్లించి వచ్చేస్తున్నారు. దీనివల్ల డబ్బు విలువ చాలా మందికి తెలియకుండా పోతోంది. ముఖ్యంగా ఈ తరం యువతకు అస్సలు తెలియడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్యాంకుల్లోనూ పలుచబడిన జనం ఒకప్పుడు బ్యాంకులకు వెళ్తే అక్కడ పనిపూర్తి చేసుకుని తిరిగి రావడానికి గంట నుంచి రెండు గంటల సమయం పట్టేది. కోవిడ్ తర్వాత ఈ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. అప్పటి వరకు వివిధ రకాల పథకాల సొమ్ము అకౌంట్లో ప్రభుత్వం వేస్తే దానిని తీసుకోవడానికైనా బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్లేవారు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ కారణంగా డబ్బు ఎలా వస్తుందో, ఎలా పోతుందో కూడా తెలుసుకోలేకపోతున్నారు. దాదాపుగా అన్ని చోట్లా ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రుణాలను సైతం బ్యాంకు యాప్ల ద్వారానే నిమిషాల్లో తీసుకునే సౌలభ్యం వచ్చింది. కేవలం కరెంట్ బ్యాంకు ఖాతాలు ఉన్న కొద్ది మంది వ్యాపారులు మాత్రమే పెద్ద మొత్తంలో డబ్బులు వేయడానికి, డ్రా చేయడానికి మాత్రమే బ్యాంకులకు వెళ్తుండటం గమనార్హం. ఖాతాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి, అనుమానాలు తీర్చుకోవడానికి మాత్రమే బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. ఎంత ఖర్చు చేస్తున్నామో తెలియట్లేదు గతంలో డబ్బు చేతిలో ఉంటే చూసి ఖర్చు పెట్టేవారం. నగదు రూపంలో డబ్బులు ఉండటం వల్ల దేనికెంత ఖర్చు చేస్తున్నామో తెలిసేది. కానీ ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్ కావడంతో ఎంత ఖర్చు చేస్తున్నామో అర్థంకాని పరిస్థితి. తెలియకుండానే నెలలో 20 నుంచి 30 శాతం ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం. – సాయిరామ్, ప్రభుత్వ ఉద్యోగి, కర్నూలు -
ఆ ‘క్లిక్కే’ వేరు!
సాక్షి, స్పెషల్ డెస్క్: మనతోని అట్లుంటది.. అవును ఆటైనా, పాటైనా.. ఆఖరుకు రిటైల్ అయినా రికార్డులు సృష్టించడంలో ఆ ‘క్లిక్కే’వేరు. ప్రపంచ ఆన్లైన్ రిటైల్ రంగంలో కస్టమర్ల సంఖ్య పరంగా అమెరికాను దాటి రెండవ అతిపెద్ద మార్కెట్గా భారత్ అవతరించింది. 28 కోట్ల మంది ఆన్లైన్ షాపర్స్తో రిటైల్ మార్కెట్ను మన దేశం షేక్ చేస్తోందని ఫ్లిప్కార్ట్ సహకారంతో బెయిన్ అండ్ కంపెనీ రూపొందించిన నివేదిక వెల్లడించింది. 92 కోట్ల మంది ఈ–రిటైల్ షాపర్స్తో చైనా తొలి స్థానంలో కొనసాగుతోంది. 27 కోట్ల ఆన్లైన్ షాపర్లతో అమెరికా మూడో స్థానంలో నిలిచింది. క్విక్ కామర్స్, ట్రెండ్–ఫస్ట్ కామర్స్, హైపర్–వాల్యూ కామర్స్ భారత్లో తదుపరి ఆన్లైన్ కొనుగోళ్ల వృద్ధి అధ్యాయాన్ని నిర్వచించనున్నాయి.ఐదు మించి ప్లాట్ఫామ్స్.. ఈ–రిటైల్ షాపర్స్లో జెన్–జీ తరం (1997–2012 మధ్య పుట్టినవారు) సంఖ్య దాదాపు 40% ఉంది. ప్రత్యేక షాపింగ్ అలవాట్లు వారి సొంతం. వారిలో సగం మంది ఏటా ఐదు, అంతకంటే ఎక్కువ ప్లాట్ఫామ్ల నుంచి కొనుగోళ్లు చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న ఫ్యాషన్ బ్రాండ్లపై ఇతర కస్టమర్లతో పోలిస్తే జెన్–జీ తరం మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తోంది. హైపర్ వాల్యూ కామర్స్ (అతితక్కువ ధరగల ఉత్పత్తులు) సామాన్యులను ఆకర్షిస్తోంది. ఈ–రిటైల్లో 2021లో 5% వాటా కలిగి ఉన్న ఈ విభాగం ఇప్పుడు 12% మించిపోయింది. కిరాణా, జీవనశైలి, సాధారణ వస్తువులు ఈ–రిటైల్ మార్కెట్లో 55% వాటా కలిగి ఉన్నాయి. ఇవి 2030 నాటికి మూడింట రెండు వంతులకు చేరనున్నాయి. తోడైన క్విక్ కామర్స్.. భారత్లో తలసరి జీడీపీ రూ. 2,99,950 కంటే ఎక్కువగా ఉన్న కేరళ, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, చండీగఢ్, తమిళనాడు ఇప్పటికే ఈ–రిటైల్లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే 1.2 రెట్లు అధికంగా వ్యాప్తి చెందాయి. దేశంలోని ఈ–రిటైల్ రంగంలో ప్రధానంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో వంటి సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తూ గ్రామాల వరకు వ్యాపారాన్ని విస్తరించాయి. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్స్టామార్ట్ తదితర క్విక్ కామర్స్ కంపెనీలు మొత్తం ఈ–కామర్స్ జోరుకు సహాయపడుతున్నాయి.క్విక్ కామర్స్ యాక్టివ్ కస్టమర్ల సంఖ్య 2 కోట్లు దాటింది. స్వల్పకాలిక స్థూల ఆర్థిక ఎదురుగాలులు ఉన్నప్పటికీ భారత ఈ–రిటైల్ మార్కెట్లో దీర్ఘకాలిక అవకాశాలు బలంగా ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. ట్రెండ్–ఫస్ట్ ఫ్యాషన్ (సరసమైన ధరలకు ట్రెండీ కలెక్షన్) ఒక్కటే నాలుగు రెట్లు పెరిగి 2028 నాటికి సుమారు రూ. 68,560–85,700 కోట్లకు చేరుకోనుంది. ట్రెండ్–ఫస్ట్ ఫ్యాషన్ ఆదాయంలో సగానికిపైగా ఆన్లైన్ అమ్మకాల ద్వారానే రానుంది. పెద్ద నగరాలతో సమానంగా..⇒ ఈ–రిటైల్లో 2020 నుంచి ఇప్పటివరకు నమోదైన కొత్త కస్టమర్లలో దాదాపు 60% మంది తృతీయ శ్రేణి పట్టణాలు, చిన్న నగరాలకు చెందినవారే. అలాగే 2021 నుంచి ఈ–రిటైల్ ప్లాట్ఫామ్లలో చేరిన నూతన విక్రేతలలో 60% కంటే ఎక్కువ మంది ద్వితీయ శ్రేణి, చిన్న నగరాల నుంచి ఉన్నారు. మొత్తం ఆర్డర్స్లో తృతీయ, ఆ తర్వాతి స్థాయి పట్టణాల వాటా 45% పైగా ఉంది. ద్వితీయ శ్రేణి, చిన్న నగరాల్లో వినియోగదార్ల ఈ–రిటైల్ ఖర్చు మెట్రో, ప్రథమ శ్రేణి నగరాలతో సమానంగా ఉంది. అంతేగాక వివిధ వస్తు విభాగాలలో సగటు అమ్మకపు ధరలు సమానంగా లేదా కొంచెం తక్కువగా ఉన్నాయి.పదింటిలో ఒకటి ఈ–రిటైల్కు..ఈ–రిటైల్ (ఆన్లైన్ కొనుగోళ్లు) విపణి భారత్లో 2019– 2024 మధ్య ఏటా 20% వార్షిక వృద్ధి రేటు నమోదు చేసింది. 2024లో ఈ రంగంలో రూ. 5,14,200 కోట్ల వ్యాపా రం జరిగింది. ఏటా 18% వృద్ధితో 2030 నాటికి ఇది రూ. 14,56,900–16,28,300 కోట్లకు చేరుకుంటుందని అంచనా. స్థూల ఆర్థిక కారకాలు, వినియోగం క్షీణించిన కారణంగా దేశీయ ఈ–రిటైల్ వృద్ధి గతేడాదిలో 10–12 శాతానికి మందగించినప్పటికీ తాజాగా రికార్డు సృష్టించడం విశేషం. ఒకానొక దశలో ఈరంగం 20% పైగా వృద్ధి సాధించింది.2030 నాటికి దేశంలో తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) రూ. 2,99,950– 3,42,800లకు చేరనున్న నేపథ్యంలో కస్టమర్లు రిటైల్లో 10 డాలర్లు (రూ. 857) వెచి్చస్తే ఒకటి ఈ–రిటైల్ కోసం ఖర్చు చేస్తారట. అనవసర ఖర్చుల పెరుగుదల అందుకు ఆజ్యం పోయనుందని నివేదిక వివరించింది. -
కొత్త తరానికి చెబుదాం
తెలుగువారి తొలి పండగ వచ్చేస్తోంది. నూతనోత్సాహంతో ఉగాదిని ఆహ్వానించడానికి సిద్ధమవుతున్న వేళ... కొత్త తరానికి పండగల అర్థం తెలుస్తోందా? అంటే... ‘పెద్దవాళ్లు చెబితేనే తెలుస్తుంది’ అంటున్నారు ప్రముఖ రచయితలు రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్. ఉగాది ప్రత్యేకంగా ఇంకా ఈ ఇద్దరూ చెప్పిన విశేషాలు తెలుసుకుందాం.పండగలు జరుపుకోవడం ఎవరూ మానేయలేదు. పిండివంటలు చేసుకోవడానికైనా పండగలు చేసుకుంటున్నాం. పండగ పూట తల స్నానం చేసి, ఉగాది పచ్చడి తిన్న తర్వాతే మిగతా పనులు చేయాలని పిల్లలకు పెద్దలు చెప్పాలి. ఎప్పటికప్పుడు కొత్త తరానికి పాత తరంవాళ్లు చెబుతుండాలి. ఎందుకంటే పండగలన్నీ ముందు తరంవాళ్లు చేసుకుంటూ వచ్చారు కాబట్టి చెప్పడం వారి బాధ్యత. కొత్త తరాన్ని పాజిటివ్గా స్వాగతించాలి. వారూ వెల్కమింగ్గానే ఉంటారు. మన తానులో పెరిగిన ముక్కలు వేరేలా ఎలా ఉంటారు? కొత్త తరానికి పద్ధతులన్నీ కొత్తే. పోనీ ఇవాళ్టి పాత తరం అనుకున్నవారికి ఎవరు చెప్పారు? వారి ముందు తరంవారు చెబితేనే కదా వీరికి తెలిసింది. ఇది రిలే పందెంలాంటిది. ఒక తరానికి ఒక తరానికి సక్రమంగా విషయాలను అందజేయాల్సిన బాధ్యత ముందు తరానికి ఉంటుంది. యువతని నిందించడం సరికాదు: ప్రపంచాన్ని రెండు రకాలుగా చూడొచ్చు. మంచి కోణంలో... దుర్గార్మపు కోణంలో... ఎప్పుడూ మొదటి కోణంలో చూస్తే మంచిది. అది కాదనుకుని యువత పెడదారి పట్టిందని, ఏదేదో జరిగిపోతోందని యువతరాన్ని నిందించడం సరికాదు. ఏదీ వక్రీకరించిన కోణంలో చూడొద్దు. ఫారిన్ కల్చర్ అంటున్నాం... విదేశాలు వెళ్లి చూస్తే ఇక్కడికన్నా ఎక్కువ అక్కడ పండగలు బాగా జరుపుకుంటున్నారు. అన్నమాచార్యుల కీర్తనలు కూడా పాడుతున్నారు. ఇక్కడితో పోల్చితే అమెరికా ఫాస్ట్ ఫార్వార్డ్ అనుకోవాలి కదా. కానీ అక్కడ మన సంప్రదాయాలు బతికే ఉన్నాయి. ఇక ఎప్ప టికీ ఇండియా రామని తెలిసిన కుటుంబాలు కూడా తమ పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారు... మన సంప్రదాయాల గురించి చెబుతున్నారు. పిల్లలూ నేర్చుకుంటున్నారు. యువతరం బాధ్యతగా ఉంటోంది: సారవంతమైన నేల అది (యువతరాన్ని ఉద్దేశించి). బీజం వేయడం అనేది మన చేతుల్లో ఉంది. ముందు తరం బాధ్యతగా ఉండి, తర్వాతి తరానికి దగ్గరుండి అన్నీ నేర్పించి, అన్నీ ఆచరించేలా చేయాలి. వీళ్లు పాటిస్తూ వాళ్లు పాటించేలా చేయాలి. పొద్దున్నే వీళ్లు స్నానం చేయకుండా... పిల్లలను స్నానం చేసి, పూజలు చేయమంటే ఎందుకు చేస్తారు? నువ్వు చేయడంలేదు కదా? అంటారు. ఒకవేళ మాటల రూపంలో చెప్పకపోయినా... ముందు తరం ఆచారాలు పాటిస్తుంటే వీళ్లు చూసి, నేర్చుకుంటారు... అనుసరించడానికి ఇష్టపడతారు. బోధించే విధానం సక్రమంగా ఉండాలి. ఫైనల్గా చెప్పేదేంటంటే... మనం అనుకున్నంతగా యువతరం ఏమీ దిగజారిపోలేదు. చెప్పాలంటే మనకన్నా ఇంకా బాధ్యతగా ఉంటూ, పాతా కొత్తా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్నారు. ఈ కాలపు పిల్లలు ఇంటికీ, బయటికీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తెలిసినవాళ్లు. వాళ్లలో ఏదైనా లోపం ఉందీ అంటే... చెప్పేవాళ్లదే కానీ వాళ్లది కాదు. సో... ఏ పండగని ఎందుకు జరుపుకోవాలో విడమర్చి యువతరానికి చెప్పాల్సిన బాధ్యత ముందు తరానిదే. సంవత్సరాది ఎందుకు జరుపుకుంటున్నాం? ఉగాది పచ్చడి విశిష్టత వంటివి చెప్పి, పండగ అర్థం తెలియజేయాలి.పండగ‘రుచి’చూపాలి– అనంత శ్రీరామ్పండగలు జరుపుకునే తీరు మారింది. పెళ్లిళ్లల్లో ఎప్పుడైతే మనకు లేని రిసెప్షన్ అని మొదలుపెట్టామో అలానే పండగలు జరుపుకునే తీరులోనూ మార్పు వచ్చింది. ఉగాది గురించి చెప్పాలంటే... మా ఊరులో ఐదు రోజులు ఉగాది జాతర జరుగుతుంది. మాది వెస్ట్ గోదావరి, యలమంచిలి మండలం, దొడ్డిపట్ల గ్రామం. జాతర సందర్భంగా ఊరేగింపులు అవీ చేస్తుంటారు. ఇప్పుడూ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు జాతరలో భాగంగా మేజిక్ షోస్ అంటూ వెస్ట్రన్ కల్చర్ మిక్స్ అయిపోయింది. ఉగాది అంటే కవి సమ్మేళనాలు విరివిగా జరిగేవి. ఇప్పుడలా లేదు. ఎవరైనా విద్యావంతులు లేదా శాంతి సమాఖ్యలు వాళ్లు ఏదో టౌన్ హాలులో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసినా ఓ ఇరవై ముప్పైమంది ఉంటున్నారు... అంతే. ఉగాది ప్రత్యేకం అమ్మవారి జాతర: ఇక మా ఊరి ఉగాది గురించి చెప్పాలంటే... మాణిక్యాలమ్మ మా గ్రామ దేవత. ఉగాది సమయంలో మాకు ఆ అమ్మవారి జాతర ఉంటుంది. ఉగాది ప్రత్యేకం అంటే ఆ జాతరే. ఐదు రోజులు ఘనంగా చేస్తారు. ఐదో రోజు అయితే అమ్మవారిని బాగా అలంకరించి, ఊరేగించి, తెప్పోత్సవం చేస్తారు. నేను ప్రతి ఏడాది దాదాపు మిస్ కాకుండా వెళతాను. ఈసారి కుదరదు. ఆరు రుచులను సమానంగా ఆస్వాదించాలి: ఉగాది పచ్చడిలోని షడ్రుచుల గురించి చెప్పాలంటే... నేను ‘ఒక్కడున్నాడు’ సినిమాలో ‘ఇవ్వాళ నా పిలుపు... ఇవ్వాలి నీకు గెలుపు... సంవత్సరం వరకు ఓ లోకమా...’ అని పాట రాశాను. అది పల్లవి. పాట మొదటి చరణంలో రుచుల గురించి రాశాను. ‘కొంచెం తీపి... కొంచెం పులుపు పంచే ఆ ఉల్లాసమూ... కొంచెం ఉప్పు... కొంచెం కారం పెంచే ఆ ఆవేశమూ... చేదూ వగరూ చేసే మేలూ... సమానంగా ఆస్వాదించమని ఇవ్వాళ నా పిలుపు’ అని రాశాను. ఆరు విభిన్నమైన రుచులను సమానంగా ఆస్వాదిస్తేనే జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలమని చెప్పడమే ఆ పాట ఉద్దేశం. అంటే... జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నింటినీ సమానంగా స్వీకరించగలగాలి.ఆ బాధ్యత పెద్దవాళ్లదే: ఇక నేటి తరం గురించి చెప్పాలంటే... ఇప్పుడు కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలతో హాలోవెన్ అంటూ రకరకాల వేషాలు వేయిస్తున్నారు. వేలంటైన్స్ డే అనీ ఇంకా వేరే ఎక్కడెక్కడనుంచో తెచ్చిపెట్టుకున్న పండగలను జరుపుతున్నారు. అయితే పిల్లలకు మన పండగల గురించి చెప్పాలి. వేరే సంబరాలు ఎలా ఉన్నా కూడా మన పండగలకు ఎక్కువప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా పాత తరం ఆచరిస్తే కొత్త తరానికి అర్థం అవుతుంది. వాళ్లు మన సంస్కృతీ సంప్రదాయాలను ముందుకు తీసుకెళతారు. మా గ్రామంలో ఉగాది అంటే... ఇంట్లో పిల్లలకు వేప పూత, మామిడికాయలు, చెరుకు గడలు తెమ్మని టాస్కులు ఇచ్చేవారు. అవి తెచ్చే క్రమంలో మాకు పండగలు అర్థమయ్యేవి. అలా మా ముందు తరంవాళ్లు మాకు నేర్పించారు. కొత్త తరానికి మనం అలా నేర్పిస్తే వాళ్లు పాటిస్తారు. ముందు తరాలకు సంస్కృతీ సంప్రదాయాలను నేర్పించే బాధ్యత పెద్దవాళ్లదే.– డి.జి. భవాని -
పూలతో ఘుమఘుమలు
కంచేడి పూలు... అందంగా కనిపించే వీటిని గిరిజనులు లొట్టలేసుకుని మరీ తింటారు... వాటితో ఘుమఘుమలాడే కూరలు చేసుకుని ఇష్టంగా లాగించేస్తారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో లభించే వీటికి అల్లూరి జిల్లాలో మంచి డిమాండ్ ఉంది. ఏజెన్సీ వాసులే కాకుండా ఇప్పుడు మైదాన ప్రాంతవాసులు కూడా వీటిని తినేందుకు అలవాటు పడ్డారు.సాక్షి,పాడేరు: అడవుల్లోను, గ్రామాల సమీపంలోను కంచేడి చెట్లకు మార్చి, ఏప్రిల్ నెలల్లో పూలు పూస్తాయి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న వీటిని సర్వరోగ నివారిణిగా గిరిజనులు భావిస్తారు. ఈ పూలను ఈ సీజన్లో రోజువారీ కూరగా వండుకుని ఇంటిల్లాపాదీ తింటారు. మైదాన ప్రాంత ప్రజలు కూడా కంచేడి పూల కూర తినడానికి అలవాటుపడ్డారు. అల్లూరి జిల్లాలోని వారపుసంతల్లో ఈ పూల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. శ్రీరాముడు వనవాసం చేసే సమయంలో వీటిని ఉడకబెట్టి తిన్నాడన్న పురాణగాథ కూడా ప్రచారంలో ఉంది. ఈ విరులు.. ఆరోగ్య సిరులు ఈ పూల కూర మంచి రుచికరంగా ఉండడంతో పాటు, ఔషధగుణాలు కలిగిఉండడంతో గిరిజనులు ఇష్టంగా తింటారు. రక్తహీనత, కీళ్ల సమస్య, నొప్పులు, అజీర్ణం, కంటిచూపు మందగించడం వంటి రుగ్మతలు ఉన్న వారు ఈ కూరను తింటే మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మహిళల్లో పలు శారీరక రుగ్మతలను నయం చేస్తుందని గిరిజనుల నమ్మకం. వీటితో వేపుడు, ఇగురు కూరలను వండుకుని తింటున్నారు. కొంతమంది ఎండుచేప, ఎండు రొయ్యలను కూడా కలిపి ఇగురు కూరగా తయారు చేస్తారు. మరి కొంతమంది గిరిజనులు ఈపూలను బాగా ఎండబెట్టి వరిగెలు తయారు చేసుకుని, భద్రపరుచుకుని ఏడాది పొడవునా వండుకుని తింటారు. బుట్ట కంచేడిపూలు రూ.600 నుంచి రూ.800 ధరతో అమ్ముతున్నారు. సంతల్లో చిన్న పోగులుగా వేసి వాటాను రూ.50తో అమ్మకాలు విక్రయిస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ పూలు లభిస్తాయి. అనారోగ్య సమస్యలు దూరం కంచేడిపూలను వండుకుని తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఏడాదిలో రెండు నెలల మాత్రమే పూసే కంచేడి పూలను పూర్వం నుంచి తింటున్నాం. ఈకూర రుచికరంగా ఉండడంతో పాటు శరీరంలోని అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. కంచేడి పూలను మహిళలు అధికంగా తింటారు. – చిట్టిబాబు, ఆయుర్వేద వైద్యుడు,కుజ్జెలి గ్రామం, పాడేరు మండలం -
ముందే ప్లానేద్దాం.. సమ్మర్లో టూరేద్దాం!
సాక్షి, హైదరాబాద్: సమ్మర్ వెకేషన్కు ఇప్పటినుంచే మనవారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏటేటా పెరుగుతున్న పర్యాటకుల డిమాండ్కు తగ్గట్టుగానే...దేశవ్యాప్తంగా హోటళ్లు (హోటల్ రూమ్లు), ఇతర ప్రత్యామ్నాయ విడిదుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ వేసవిలో వివాహాలకు కూడా ముహూర్తాలు ఉండటంతో హోటళ్లకు కూడా డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. గత ఏడాదితో పోల్చితే ఇప్పటికే లగ్జరీ, మిడ్–స్కేల్, బడ్జెట్ సెగ్మెంట్లలో హోటల్ గదుల రేట్లు 10 నుంచి 12 శాతం పెరిగినట్టుగా ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజమ్ అండ్ హాస్పిటాలిటీ వర్గాలు చెబుతున్నాయి. తమతమ కుటుంబ బడ్జెట్, వేసవి విడిదులకు సంబంధించి ఖర్చు చేయగలిగే స్తోమతను బట్టి దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలు, విదేశాల్లోని ప్రముఖ సందర్శన ప్రదేశాలు, మరికొందరు వీసా ఫ్రీ దేశాల్లో వేసవి పర్యటనలకు సిద్ధమవుతున్నారు. కశ్మీర్, గోవా, హిమాచల్, కేరళలకు వెళ్లేందుకు క్రేజ్ దేశీయంగా చూస్తే.. కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, కేరళ, గోవా, రాజస్తాన్లతోపాటు ఈశాన్య రాష్ట్రాలు వేసవి సెలవులకు గమ్యస్థానాలుగా అగ్రభాగాన నిలుస్తున్నాయి. వీటితోపాటు హిల్స్టేషన్లుగా పేరుగాంచిన ముస్సోరి, మనాలి, రుషికేశ్ తదితర ప్రాంతాల్లోని హోటళ్ల గదులకు డిమాండ్ అత్యధికంగా ఉన్నట్టుగా వెల్లడైంది. కూర్గ్, మహబలేశ్వర్ వంటి టూరిస్ట్ డెస్టినేషన్లకు కూడా క్రమంగా పర్యాటకులు పెరుగుతున్నట్టుగా వివిధ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రత్యేకంగా మహబలేశ్వర్లోని బీచ్కు ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నట్టుగా తెలుస్తోంది. ఉదయ్పూర్, జైపూర్లు కూడా ఈ విషయంలో ఏమాత్రం వెనుకబడి లేవు. రుషికేశ్, కాసోల్, హంపి, ముక్తేశ్వర్ వంటి పర్యాటక ప్రదేశాల్లో హాస్టళ్లకు డిమాండ్ పెరుగుతున్నట్టుగా జో వరల్డ్ సంస్థ వెల్లడించింది. టాప్ ఇంటర్నేషనల్ సమ్మర్ డెస్టినేషన్స్ ఇవే.. ఇంటర్నేషనల్ సమ్మర్ డెస్టినేషన్స్గా స్విట్జర్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, హంగేరీ, ఆ్రస్టియా, చెక్ రిపబ్లిక్, ఇతర ఐరోపా దేశాలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. వీటితోపాటు దుబాయ్, ఈజిప్ట్, జపాన్, సింగపూర్, వియత్నాం, ఇండోనేసియాలకు ఏటా డిమాండ్ పెరుగుతోందని అట్లీస్ సంస్థ వెల్లడించింది. ఇక ఈ వేసవి సీజన్లో యూఏఈ, యూఎస్ఏలకు అత్యధికంగా బుక్సింగ్ జరిగినట్టు ఈ సంస్థ తెలిపింది. ఈ దేశాల్లో పర్యటించేందుకు ముందుగానే పర్యాటకులు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా ఆ సంస్థ అంచనా వేసింది. అంటార్కిటికాలో ఐస్బ్రేకర్ క్రూయిజ్లు, ఫిన్లాండ్లో నార్తర్న్ లైట్స్ అనుభవాలు, గాజు గోపుర ఇగ్లూలు, ఆర్కిటిక్ సూట్లు మరియు ఆర్కిటిక్ ట్రీహౌస్లలో బస వంటి ప్రీమియం అనుభవాలను కూడా ప్రయాణికులు కోరుకుంటున్నారు. సౌత్ ఆఫ్రికా వైన్యార్డ్లలో కన్వర్టిబుల్ కార్లు లేదా హార్లే–డేవిడ్సన్లతో సెల్ఫ్–డ్రైవ్ సాహసాలు కూడా ప్రజాదరణ పొందుతున్నాయి.తొలిసారి విదేశీ పర్యటనలకు వెళుతున్న వారిలో ఎక్కువగా కాంబోడియా, శ్రీలంక, అజర్బైజాన్లను ఇష్టపడుతున్నారు. ఈ దేశాల సందర్శనకు సులభంగా వీసా ప్రక్రియ ఉండటంతోపాటు ఆయా సమ్మర్ ట్రిప్లకు అయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉండడమే అందుకు కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీసా అవసరం లేని ప్రాంతాలకు ఆదరణ... ఇక వీసా అవసరం లేని వివిధ పర్యాటక దేశాలు భారత టూరిస్ట్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే వీసా ఫ్రీ దేశాలు అయిన నేపాల్, భూటాన్, థాయ్లాండ్, మాల్దీవులు, మారిషస్ వంటి వాటికి భారత్ టూరిస్టుల నుంచి భారీగా డిమాండ్ పెరిగినట్టు హాలిడే, టూరిజం నిర్వాహకులు చెబుతున్నారు. ఈ దేశాలు వీసా రహిత సులభ ప్రవేశ కారణంగా గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నాయి. ఎస్ఓటీసీ ట్రావెల్ హాలిడేస్, కార్పొరేట్ టూర్స్ విభాగం నివేదిక ప్రకారం.. వీసా రహిత గమ్యస్థానాలు ప్రయాణికులకు ఖర్చులను ఆదా చేసే అవకాశాన్ని అందిస్తున్నాయని, దీనిని వారు లగ్జరీ అనుభవాల కోసం ఉపయోగిస్తున్నారని పేర్కొంది. ఉదాహరణకు థాయ్లాండ్లో ముయే థాయ్ (కిక్బాక్సింగ్) నేర్చుకోవడం, లగ్జరీ రిసార్ట్లలో డిటాక్స్ కార్యక్రమాలు, మారిషస్లో స్నార్కెలింగ్ లేదా మాల్దీవ్స్లో మిషెలిన్–స్టార్ అండర్వాటర్ డైనింగ్ వంటివి ఉన్నాయి. అదే సమయంలో ఫినామినన్–ఆధారిత ప్రయాణం ఒక కీలక ధోరణిగా ఉద్భవించిందని ఈ నివేదిక తెలిపింది. -
వధువు కావలెను
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పెళ్లి కూతుళ్లకు కొరత ఏర్పడింది. అవును.. మీరు చదువుతున్నది నిజం. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అమ్మాయి దొరకడం లేదనే మాట వినిపిస్తోంది. ఆస్తిపాస్తులు, ఉద్యోగం ఉండి కూడా అమ్మాయిల కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఆడపిల్లల జనాభా తగ్గడమేనన్నది వాస్తవం. సంప్రదాయ పెళ్లిళ్లన్నీ కులాల ప్రాతిపదికనే నడుస్తాయి. ప్రేమ వివాహాల దగ్గర మాత్రమే కుల ప్రస్తావన కనిపించదు. అయితే కొన్ని కులాల్లో ఆడపిల్లల కొరతతో చాలామంది పెళ్లి కాని ప్రసాద్లుగా మిగిలిపోతున్నారు. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ఏ కులం అమ్మాయి అయినా సరే అంటున్నారు. మరికొందరు పెళ్లి ఖర్చు భరిస్తామని, అవసరమైతే అమ్మాయి తరపు వారికి అయ్యే ఖర్చులు కూడా ఇస్తామని ముందుకొస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పెళ్లి సంబంధాల కోసం బంధువులు, తెలిసిన వారి చెవుల్లో వేస్తున్నారు. ఓ అమ్మాయిని వెతికి పెట్టండని మొర పెట్టుకుంటున్నారు. పురుషులకు దీటుగా ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. వివక్ష మాత్రం తగ్గడం లేదు. ఆడపిల్లను ఇప్పటికీ భారంగా భావిస్తున్న వారెందరో ఉన్నారు. కొందరైతే కడుపులో పెరుగుతున్నది ఆడో, మగో తెలుసుకుని.. ఆడపిల్ల అయితే కడుపులోనే తుంచేస్తున్నారు. రెండు మూడు దశాబ్దాలుగా లింగ నిష్పత్తిలో తేడా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా పెళ్లీడుకొచ్చిన అబ్బాయిలు, వారి తల్లిదండ్రులకు అమ్మాయిల కోసం వెతుకులాట తప్పడం లేదు. తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్–2024 నివేదికలో.. 2011 జనాభా ఆధారంగా రాష్ట్రంలో 2021 ప్రొజెక్టెడ్ పాపులేషన్ రికార్డులను పరిశీలిస్తే ఆడపిల్లల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నట్టు స్పష్టమవుతోంది. పదిహేనేళ్ల నుంచి 19 ఏళ్ల లోపు జనాభాలో.. మగవారి కన్నా ఆడవాళ్లు 96 వేల మేర తక్కువగా ఉన్నారు. అలాగే 20 ఏళ్ల నుంచి 24 ఏళ్ల లోపు ఆడపిల్లలు లక్షా 6 వేల మంది తక్కువగా ఉన్నారు. పాతికేళ్ల నుంచి 29 ఏళ్ల లోపు వారు 78 వేల మంది ఆడపిల్లలు తక్కువగా ఉన్నట్టు నివేదిక స్పష్టం చేస్తోంది. పెళ్లి వయసు వచ్చిన మగవారి కన్నా.. ఆడపిల్లలు దాదాపు 2 లక్షల నుంచి 2.50 లక్షల మంది తక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. మ్యారేజ్ బ్యూరోలకు చేతినిండా పని... పెళ్లికూతుళ్ల కొరత మ్యారేజ్ బ్యూరోలకు చేతినిండా పని కల్పిస్తోంది. అబ్బాయి తరపువారు అమ్మాయిల కోసం బ్యూరోలను ఆశ్రయిస్తున్నారు. తెలిసిన వారికల్లా తమ కొడుక్కి ఓ మంచి సంబంధం చూడమంటూనే మరోవైపు బ్యూరోలకు బయోడేటా, ఫొటోలు ఇస్తున్నారు. బ్యూరోల నిర్వాహకులతో ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. గతంలో ఒకటి రెండు కులాల్లో వివాహ వేదికలు ఉండేవి. ఇప్పుడు అన్ని కులాల్లో వివాహ సంబంధాలు వెతికే బ్యూరోలు వెలిశాయంటే.. అమ్మాయిల కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంటర్నెట్లోనూ పెళ్లి సంబంధాలు.. వివాహ సంబంధాలకు మ్యారేజ్బ్యూరోలు ఇంటర్నెట్లో వెబ్సైట్లు తెరిచాయి. దీంతో అబ్బాయిలు తమకు ఎలాంటి అమ్మాయి కావాలో వారి అభిప్రాయాలు, చదువు, ఉద్యోగం, కుటుంబ నేపథ్యాలను వెబ్సైట్లలో ఉంచుతున్నారు. పలు వివాహ వేదికలు నిర్వహిస్తున్న వెబ్సైట్లలో వందలు, వేలల్లో పెళ్లి సంబంధాలు నమోదు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో వివాహ పరిచయ వేదికలకు గిరాకీ పెరిగింది. వివిధ కులాలకు చెందిన పెళ్లి సంబంధాలను పరిచయ వేదికల ద్వారా వెతికే పని చేపట్టారు. ఈ వేదికలపై ఎన్నో పెళ్లి సంబంధాలు ఖాయం అవుతుండడంతో ఆదరణ పెరుగుతోంది. ఎదురు కట్నాననికి సిద్ధం వరకట్నం సమస్య అమ్మాయిల జనాభా తగ్గడానికి కారణమైన పరిస్థితుల్లో.. ఎదురు కట్నం ఇవ్వడానికి కూడా అబ్బాయిలు సిద్ధమవుతున్నారు. అమ్మాయి దొరికితే చాలు.. అంటూ అమ్మాయి తరపు వారికి ఎదురుకట్నం ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. కొన్ని కులాల్లో ఎదురుకట్నం ఇచ్చే సంప్రదాయం మొదలైంది. కొందరు పెళ్లి ఖర్చు భరిస్తున్నారు. అమ్మాయిల కొరతతో ఎందరో అబ్బాయిలు.. పెళ్లికాని ప్రసాద్లుగా మిగులుతుండడం ఆందోళన కలిగించే అంశం.