
వక్ఫ్ ఆస్తులు కాజేసే కుట్రే
పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం
విపక్షాలు, ముస్లిం సంఘాలు
మెరుగైన నిర్వహణ కోసమే: కేంద్రం
వక్ఫ్. కొద్ది రోజులుగా దేశమంతటా చర్చనీయంగా మారిన అంశం. ఇస్లాం సంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ ఆస్తులన్నీ అల్లాకు చెందుతాయని భావిస్తారు. కనుక వాటి అమ్మకం, ఇతర ప్రయోజనాలకు వాడకం పూర్తిగా నిషిద్ధం. మసీదులు, మదర్సాలు, శ్మశానవాటికలు, అనాథాశ్రమాల నిర్మాణ నిర్వహణ తదితరాల నిమిత్తం ఉపయోగించాలి.
భారత్లో వక్ఫ్ సంప్రదాయం 12వ శతాబ్ధంలో దిల్లీ సుల్తానుల హయాంలో మొదలైంది. స్వాతంత్య్రానంతరం 1954లో కేంద్ర వక్ఫ్ చట్టం వచ్చింది. దాని స్థానంలో 1995లో తెచ్చిన కొత్త చట్టం ద్వారా వక్ఫ్ బోర్డులకు మరిన్ని అధికారాలు దఖలు పడ్డాయి. వాటిని అపరిమితంగా పెంచుతూ యూపీఏ ప్రభుత్వం 2013లో మరిన్ని సవరణలు చేసింది. దేశవ్యాప్తంగా 8.7 లక్షలకు పైగా వక్ఫ్ ఆస్తులున్నాయి! వీటన్నింటికీ కలిపి 9.4 లక్షల ఎకరాలున్నాయి!
ఆ లెక్కన వక్ఫ్ బోర్డులు దేశంలో మూడో అతి పెద్ద భూ యజమానులుగా అవతరించాయి. వాటి భూముల మొత్తం విలువ కనీసం రూ.1.2 లక్షల కోట్ల పై చిలుకేనని అంచనా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 వక్ఫ్ బోర్డులున్నాయి. వాటిలో అవినీతి తీవ్ర సమస్యేనని ముస్లిం సంఘాలు కూడా అంగీకరిస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశవ్యాప్తంగా 60 వేలకు పైగా వక్ఫ్ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. 13 వేలకు పైగా ఆస్తులు కోర్టు వివాదాల్లో ఉన్నాయి.
ఇక 4.35 లక్షల ఆస్తుల గురించి సమాచారమే లేదు! వక్ఫ్ భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని అన్యాక్రాంతం చేస్తోందని సచార్ కమిటీ ఆక్షేపించింది కూడా. అయితే తీవ్ర వాద వివాదాల నడుమ వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభ బుధవారం ఆమోదించింది. కేంద్ర వక్ఫ్ మండలి, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల ఏర్పాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. ఈ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నది విపక్షాల ఆరోపణ. దీన్ని వక్ఫ్ భూములను ముస్లింల నుంచి లాక్కునేందుకు మోదీ సర్కారు కుట్రగా మజ్లిస్ వంటి పార్టీలు అభివర్ణిస్తున్నాయి.
ఇందులోని పలు ప్రతిపాదనలు 14, 26, 26, 29 తదితర ఆర్టికల్స్కు పూర్తిగా విరుద్ధమని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వక్ఫ్ రగడపై ఇండియాటుడే న్యూస్ చానల్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ బుధవారం చర్చా కార్యక్రమం నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా, వ్యతిరేకంగా పలు పార్టీల నేతలు తదితరులు, నిపుణులు వాదనలు విన్పించారు. వక్ఫ్ ఆస్తులు అంతిమంగా పేద ముస్లింల అభ్యున్నతికి దోహదపడాలన్నదే తాజా బిల్లు ఉద్దేశమని ప్రభుత్వం చెబుతుండగా అందులోని ప్రతిపాదనలను అంశాలవారీగా విపక్షాలు దుయ్యబట్టాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్