90
జేఎన్టీయూ (ఏ) పరిధిలో అనుబంధ కళాశాలలు
అనంతపురం: ఇంజినీరింగ్ కష్టమనే అపోహను విద్యార్థుల్లో తొలగిపోయేలా మానసికంగా సంసిద్ధం చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆదేశించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. కాగా, ఐఐటీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో చోటు చేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యలను పరిగణనలోకి తీసుకుని గత రెండేళ్లుగా ఏఐసీటీఈ జరిపిన అధ్యయనాల్లో బోధనా ప్రణాళికతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్న విషయం వెల్లడైంది. జాతీయ విద్యా విధానంలో వస్తున్న మార్పులపై తొలి దశలోనే అవగాహన కల్పించకపోవడమే ఇందుకు కారణంగా గుర్తించి ప్రాక్టికల్ నాలెడ్జ్తో కూడిన విధానం అందుబాటులోకి తెచ్చేలా మార్గదర్శకాలను జారీ చేశారు. ఇంజినీరింగ్ రెండో ఏడాది నుంచే పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో పాఠ్య ప్రణాళికలో మార్పు చేశారు. దీంతో ఇంజినీరింగ్ విద్యార్థులు మూస విధానం నుంచి బయటపడి స్వతహాగా ఆలోచించే విద్యా విధానంలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైంది. అయితే ఇది కూడా మానసిక ఒత్తిళ్లకు కారణమవుతోందని ఏఐసీటీఈ జరిపిన మరో అధ్యయనంలో తేలింది. దీంతో తరగతుల ప్రారంభానికి ముందే అన్ని విధాలుగా విద్యార్థులను సంసిద్ధులను చేసే దిశగా చర్యలు తీసుకున్నారు.
బ్యాక్లాగ్స్ భారమై..
ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు కేవలం 18 నుంచి 20 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు. సింహభాగం విద్యార్థులు మొదటి సంవత్సరంలోనే ఫెయిల్ అవుతున్నారు. ఇంటర్మీడియట్ విద్యా ప్రణాళిక, బీటెక్ విద్యా ప్రణాళిక విభిన్నంగా ఉండడమే ఇందుకు కారణం. ఇంటర్మీడియట్ వరకు బట్టీ పద్ధతిలో చదువుతున్నారు. ఇంజినీరింగ్లో బట్టీ విధానం ఉండదు. కంప్యూటర్ సైన్స్లో గణితం ఒక్కసారిగా మారిపోతుంది. రెండో ఏడాదికి వచ్చే సరికి అనేక కంప్యూటర్ లాంగ్వేజ్లను విద్యార్థులు నేర్చుకోవాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ప్రయోగాత్మకంగా ఫలితాలూ సాధించాల్సి ఉంటుంది. సివిల్, మెకానికల్లోనూ ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తిగతంగా స్కిల్ పెంచుకుంటే తప్ప ముందుకెళ్లని పరిస్థితి. ఈ కారణంగా బీటెక్ మొదటి, రెండో సంవత్సరాల విద్యార్థులకు బ్యాక్లాగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఇదే వారి మానసిక ఒత్తిళ్లకు కారణమవుతోంది.
అధునాతన కోర్సులకు అధ్యాపకుల కొరత..
పోటీ ప్రపంచానికి దీటుగా కంప్యూటర్ సైన్సెస్ కోర్సు, దాని అనుబంధ కోర్సులకు విపరీతమైన క్రేజీ ఏర్పడింది. గత మూడేళ్లుగా డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ కోర్సులు భోదించే అధ్యాపకుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఈ అంతరాన్ని పూడ్చడానికి రెండో ఏడాది నుంచే సంబంధిత రంగాల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేలా ప్రాజెక్ట్లు పూర్తి చేయాలనే నిబంధన విధించారు. దీంతో ఏటా మార్కెట్లోకి వస్తున్న విద్యార్థుల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే నైపుణ్యత కలిగి ఉంటున్నారని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఫలితంగా ప్రతి ఆరు నెలలకోసారి విద్యార్థి మానసిక ధోరణిని పరిశీలించాలని ఏఐసీటీఈ సూచించింది.
విద్యార్థుల శ్రేయస్సుపై ప్రత్యేక దృష్టి
విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఇంజినీరింగ్ విద్యా ప్రణాళికపై తరగతుల ప్రారంభానికి ముందే వారిలో అవగాహన పెంచేలా చర్యలు తీసుకున్నాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అన్ని విధాలుగా విద్యార్థులను తీర్చిదిద్దుతాం.
– హెచ్.సుదర్శనరావు, వీసీ, జేఎన్టీయూ(ఏ)
ఇంటర్, బీటెక్ విద్యా ప్రణాళికలు విభిన్నం
దీంతో ఇంజినీరింగ్ కష్టమనే అపోహ
అపోహలు తొలగిపోయేలా
విద్యార్థులకు ముందస్తుగా కౌన్సెలింగ్
క్యాంపస్ కళాశాలలో సీట్ల పెంపుదలకు కసరత్తు
జేఎన్టీయూ(ఏ) క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రస్తుతం ఒక్కో బ్రాంచ్కు 60 సీట్లు ఉండగా, వీటిని 120కు పెంచేలా పాలక మండలి సభ్యులు ఆమోదం తెలిపారు. సోమవారం వర్సిటీ వీసీ ప్రొఫెసర్ హెచ్ .సుదర్శనరావు అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరిగింది. అలాగే స్నాతకోత్సవం నిర్వహణపై కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది. పులివెందుల కళాశాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు వర్సిటీనే నిధులు అందించేలా చర్యలు తీసుకున్నారు.
90
90


