ఏడు నెలలు.. మద్యం ఏరులు | - | Sakshi
Sakshi News home page

ఏడు నెలలు.. మద్యం ఏరులు

Apr 20 2025 2:04 AM | Updated on Apr 20 2025 2:04 AM

ఏడు నెలలు.. మద్యం ఏరులు

ఏడు నెలలు.. మద్యం ఏరులు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి సర్కారు పుణ్యమా అని ఉమ్మడి అనంతపురం జిల్లా మద్యం మత్తులో ఊగిపోతోంది. పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా మద్యం దుకాణాల వద్ద మందుబాబులతో జాతర వాతావరణం తలపిస్తోంది. రోడ్డుమీదే తాగుతూ చిందులేస్తున్నారు. పట్టణాల్లో పర్మిట్‌ రూములు, పల్లెటూళ్లలో బెల్టుషాపులు.. ఇదీ దుస్థితి. నాలుగు వందల జనాభా ఉన్న గ్రామంలో కూడా రెండు, మూడు బెల్టుషాపులు పెట్టి రేషన్‌ బియ్యం తరహాలో ఇంటింటికీ మద్యం అమ్ముతున్నారు. టీడీపీ నేతల ఆధ్వర్యంలో అడ్డూ అదుపు లేకుండా జరుగుతున్న మద్యం వ్యాపారంతో వేల కుటుంబాలు వీధిన పడుతున్నాయి.

ఏడు నెలల్లో 1.16 కోట్ల లీటర్ల మద్యం..

కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో ఎప్పుడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. గత ఏడాది సెప్టెంబర్‌ 15 నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 15 వరకూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1.16 కోట్ల లీటర్ల మద్యం తాగించేశారు. దీన్ని ఐదు వేల లీటర్ల నీటి ట్యాంకర్లతో పోలిస్తే 2,337 ట్యాంకర్ల మద్యం తాగినట్టు లెక్క కావడం గమనార్హం. రోజుకు సగటున రెండు జిల్లాల్లో 55,658 లీటర్ల మద్యం వినియోగమవుతోంది. ఇదికాకుండా ఏడు నెలల్లో 39 లక్షల లీటర్ల బీర్లు తాగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రోజు రోజుకూ మద్యానికి అలవాటు పడుతున్న యువకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

నేతల షాపులపై కన్నెత్తి చూడరు..

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 230 వరకూ మద్యం షాపులున్నాయి. వీటిలో మెజారిటీ షాపులు టీడీపీ ఎమ్మెల్యేలవే. ఈ దుకాణాలకు అనుబంధంగా బెల్టుషాపులు కూడా నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎకై ్సజ్‌ అధికారులు వాటి వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎవరైనా అటువైపు వెళితే బదిలీ చేస్తామని ‘పచ్చ’ నేతలు బెదిరిస్తున్నారు. సాధారణంగా ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకే మద్యం షాపులను ఓపెన్‌ చేయాలి. కానీ రాప్తాడు, రాయదుర్గం లాంటి నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకే తెరుస్తున్నా పట్టించుకునే దిక్కులేదు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే మద్యం దుకాణాల వద్ద పర్మిట్‌ రూములు ఏ సమయంలో చూసినా జనంతో కిక్కిరిసి ఉంటు న్నాయి. యథేచ్ఛగా సాగుతున్న మద్యం అమ్మకాలతో సామాన్య కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. మద్యం కారణంగానే ఇటీవల కుటుంబ తగాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తోంది.

1.16 కోట్ల లీటర్ల మద్యం తాగేశారు

రోజుకు సగటున

55 వేల లీటర్లకు పైగా వినియోగం

మరో 39 లక్షల లీటర్ల బీర్లు కూడా..

పల్లెటూళ్లలో బెల్టుషాపులు..

పట్టణాల్లో పర్మిట్‌ రూములు

విచ్చలవిడి మద్యం అమ్మకాలతో

వీధిన పడుతున్న పేదల కుటుంబాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement