
సాక్షి, న్యూఢిల్లీ : దేశమంతా కరోనా మహమ్మారిపై పోరులో నిమగ్నమగా ఇదే అదనుగా పాక్ భారీ కుట్రలకు తెరలేపుతోంది. సరిహద్దుల్లో ఉగ్ర పొగపెడుతూనే భారీ దాడులతో తీవ్ర అలజడి రేపేందుకు స్కెచ్ వేస్తోంది. గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం సహకారంతో జమ్ము కశ్మీర్ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కుట్ర పన్నింది. దావూద్తో లష్కరే ఉగ్రమూక చేతులు కలిపిందని ఓ వార్తాసంస్థ వెల్లడించింది. పాక్ ఐఎస్ఐ బృందంతో కలిసి లష్కరే నేతలతో సంప్రదింపులు జరిపేందుకు ఇస్లామాబాద్లోని తన ఫాంహౌస్ నుంచి దావూద్ ఆదివారం బయలుదేరి వెళ్లారని తెలిపింది. (కరోనా క్యాబ్లు వచ్చేశాయ్!)
కోవిడ్-19 మహమ్మారితో భారత్ పోరాడుతున్న క్రమంలో దేశంలో దొంగదెబ్బ తీయాలని ఐఎస్ఐ ప్రణాళికలు రూపొందిస్తోందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు పవిత్ర రంజాన్ మాసంలో సోమవారం పదకొండవ రోజున జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు భారీ దాడికి తెగబడవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో కశ్మీర్లోయలో భద్రతను కట్టుదిట్టం చేశారు. గతంలో ఇదే రోజున పలుమార్లు ఉగ్రవాదులు భద్రతా దళాల కీలక స్ధావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయని అధికారులు వెల్లడించారు. కాగా హంద్వారాలో జవాన్లపై దాడికి తమదే బాధ్యతని ప్రకటించిన నూతన ఉగ్ర సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) సైతం మరిన్ని దాడులతో విరుచుకుపడవచ్చని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. చదవండి : కరోనా కాలంలో పాక్ కుట్రలు