
సాక్షి, హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాలపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయని ఎమ్మెల్యే రోజా అన్నారు. మంగళవారం ప్రజాసంకల్పయాత్ర చిత్తూరుజిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి నగరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. వైఎస్ జగన్ పాదయాత్రలో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ..చిత్తూరు జిల్లాకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు అందరం సిగ్గుపడుతున్నామని విమర్శించారు. ‘బాబు పుణ్యమా అని ఇక్కడి చక్కెర ఫ్యాక్టరీలు మూత వేయించారు. జన్మభూమి కమిటీల పేరుతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.
చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన 600 హామీలు తుంగలో తొక్కారు. అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబుపై పీకల దాకా కోపంతో ఉన్నారు. ఎన్నికలు వస్తున్నాయని అరకొరగా ఇల్లు మంజూరు చేస్తున్నారు. అది కూడా తెలుగు తమ్ముళ్లకు మాత్రమే. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా వైఎస్ జగన్ కూడా నవ రత్నాల ద్వారా అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తున్నారు. వైఎస్ఆర్ కుటుంబం ఒక్క మాట ఇస్తే మడమ తప్పరని ప్రజలు విశ్వసిస్తున్నారు. పిల్లలను చదవించే బాధ్యత వైఎస్ జగన్ తీసుకుంటున్నారు. మద్యం వల్ల చాలా కుటుంబాలు నాశనమవుతున్నాయి.ఇ ఎక్కడపడితే అక్కడ చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు.’ అని విమర్శించారు.