
సాక్షి, విజయవాడ : ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభను చూసి టీడీపీ నేతలకు చెమటలు పడుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జి నందిగం సురేశ్ విమర్శించారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, ఆయన మంత్రులు వైఎస్ జగన్ పాదయాత్ర మీద అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని తప్పుబట్టారు. చంద్రబాబు ఎలా పాదయాత్ర చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసునని, ఆయన రాత్రిపూట కిలోమీటరు నడిస్తే.. ఆరు కిలోమీటర్లు బస్సు ఎక్కేవారని, టీడీపీ వైఖరి దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఉందని ఎద్దేవా చేశారు.
మంత్రి దేవినేని ఉమాకి వైఎస్ జగన్ పాదయాత్ర గురించి మాట్లాడే అర్హత ఉందా? అని నిలదీశారు. చంద్రబాబుని ప్రజలను నమ్మరని తెలిసి.. ఇపుడు వైఎస్ జగన్ మీద ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో నిజాలు బయటకొస్తాయనే ఎన్ఐఏ విచారణకు భయపడ్డారని, ఇప్పుడు హైకోర్ట్ ఆదేశాలు ఇవ్వడంతో టీడీపీ నేతలు ఇంకా భయపడిపోతున్నారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని విషయంలో చంద్రబాబు పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుని మరో నాలుగు నెలల్లో ఇంటికి పంపబోతున్నారని, 2019 ఎన్నికలే టీడీపీకి చివరి ఎన్నికలు అని పేర్కొన్నారు.