-
ప్రారంభమైన సప్లిమెంటరీ పరీక్షలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగగతి, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. టెన్త్ విద్యార్థులకు తొలి రోజు కాంపోజిట్ తెలుగు పేపర్–1 నిర్వహించారు. ఈ పరీక్షకు 2,215 మంది దరఖాస్తు చేసుకోగా 1,135 మంది హాజరయ్యారు. 1080 మంది పరీక్ష రాయలేదు. ఆర్జేడీ నాగమణి 2, డీఈఓ రమేష్ 5 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అలాగే, ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం తెలుగు–1, హిందీ–1, సంస్కృతం–1 పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 3,732 మంది హాజరవగా 249 మంది గైర్హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం నిర్వహించిన తెలుగు–2, హిందీ–2, సంస్కృతం–2 పరీక్షలకు 572 మంది హాజరవగా 59 మంది గైర్హాజరయ్యారు. ప్రశాంతంగా ఏపీ డీసెట్కంబాల చెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ఇయాన్ డిజిటల్ జోన్లో ఏపీ డీసెట్ శుక్రవారం ప్రశాంతంగా జరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరరావు తెలిపారు. స్థానిక లూథర్ గిరిలోని ఇయాన్ పరీక్ష కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరీక్షకు 539 మందికి గాను 460 మంది హాజరయ్యారని, 79 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షలను అర్బన్ డీఐ బి.దిలీప్కుమార్ పర్యవేక్షించారు. -
పోలీసుల మాక్ డ్రిల్
కాకినాడ క్రైం: వచ్చే నెల 4న జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జిల్లా పోలీసు శాఖ కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. అల్లరి మూకల నియంత్రణ, అవాంఛనీయ సంఘటనల నివారణకు ప్రత్యేక దళాలను సిద్ధం చేసింది. ఈ దళాలు శుక్రవారం మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించాయి. జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆధ్వర్యాన ఈ బృందాలు కాకినాడలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్నాయి. శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతున్న సున్నిత సందర్భాల్లో ఈ దళాలు రంగ ప్రవేశం చేస్తాయి. 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసులు చేపట్టవలసిన చర్యలు, గుమిగూడిన జన సమూహాలను చెదరగొట్టే విధానం, టియర్ గ్యాస్ ప్రయోగం, పోలీసులపై దాడులను తిప్పికొట్టడం, లాఠీచార్జి, వాటర్ కెనాన్ ప్రయోగం, ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్, అల్లరిమూకలను, ఆందోళనకారుల్ని అడ్డుకోవడం తదితర అంశాలపై 100 మందితో కూడిన క్విక్ రియాక్షన్ టీం సభ్యులు, ఆర్మ్డ్ రిజర్వు, శాంతిభద్రతల పోలీసులు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. అదనపు ఎస్పీ సత్యనారాయణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పిడుగు పడి గేదె మృతి
పిఠాపురం: మండలంలోని గోకివాడ ఏలేరు కాలువలో శుక్రవారం పిడుగు పడడంతో కాలువలో ఉన్న ఒక పాడి గేదె మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. ఉదయం ఎండ కాయగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి ఈదురు గాలులతో వర్షం కురవడంతో పాటు పిడుగులు పడ్డాయి. పిఠాపురం మండలం జములపల్లికి చెందిన రాయుడు శ్రీను అనే కల్లుగీత కార్మికుడికి చెందిన గేదె కాలువలో ఉండగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీని విలువ సుమారు రూ.50వేలు ఉంటుందని స్థానిక రైతులు తెలిపారు. పారుపాక మాజీ సర్పంచ్ ఆత్మహత్య రౌతులపూడి: మండలంలోని పారుపాక మాజీ సర్పంచ్ గాడి నూకరాజేశ్వరరావు గ్రామం శివారున కోడూరు వెళ్లే రహదారిలోని నూతిలో పడి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రౌతులపూడి ఎస్ఐ అబ్దుల్ నబీ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రౌతులపూడి మండలం పారుపాక మాజీ సర్పంచ్ గాడి నూకరాజేశ్వరరావు కొంతకాలంగా వైఎస్సార్ సీపీలో ఉంటున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన పరిణామాల్లో గ్రామంలో రాజకీయంగా తలెత్తిన వివాదాలతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు మరణ వాంగ్మూలంలో పేర్కొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రికి తరలించామని ఎస్ఐ అబ్దుల్ నబీ తెలిపారు. తాటాకిల్లు దగ్ధం సీతానగరం: నాగంపల్లిలో మొలపర్తి వెంకటేశులు చెందిన తాటాకిల్లు శుక్రవారం కాలిపోయింది. ఇంటిలో వంట గ్యాస్ నుంచి వచ్చిన మంటలతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో స్థానికులు వాటిని అదుపు చేశారు. అప్పటికే వంట సామగ్రి, మంచాలు, ఫ్యాన్లు, టీవీ, దుస్తులు కాలిబూడిదయ్యాయి. వ్యవసాయ కూలి అయిన వెంకటేశులతో పాటు ఆయన భార్య, కుమార్తె, మనవలు ఆ ఇంటిలో ఉంటున్నారు. ఈ ప్రమాదంలో రూ.2 లక్షల ఆస్తినష్టం సంభవించిందని అంచనా వేస్తున్నారు. బాధితులకు తక్షణ సహాయంగా 25 కిలోల బియ్యాన్ని ఆర్ఐ లక్ష్మి అందించారు. ప్రత్యేక అవసరాల పిల్లల స్పెషల్ డ్రైవ్ కంబాలచెరువు(రాజమహేంద్రవరం): సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో 2024 – 25 విద్యా సంవత్సరానికి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సర్వే, ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా సమగ్ర శిక్షా అడిషనల్ కో ఆర్డినేటర్ ఎస్.సుభాషిణి తెలిపారు. స్థానిక గంటాలమ్మగుడి వీధిలో శుక్రవారం నిర్వహించిన డ్రైవ్లో ఆమె పాల్గొని తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ డ్రైవ్లో 192 మంది విద్యార్థులను గుర్తించడం జరిగిందన్నారు. సర్వేలో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ కనకబాబు, ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ రాణి, స్థానిక ఐఈఆర్పీలు డి.చిట్టి, మేరీ పాల్గొన్నారు. కోడ్ ఉల్లంఘనపై విచారణ కడియం: ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ కడియం ఎంపీపీ పుట్టిన రోజు వేడుకలను ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించడంపై వివరణ ఇవ్వాలని ఎంపీడీవో రాజ్ మనోజ్ను జేసీ తేజ్భరత్ ఆదేశించారు. దీనిపై విచారణ చేసి ఎంపీడీవో నివేదిక ఇవ్వనున్నారు. అయితే మండల స్థాయి ప్రభుత్వ అధికారులే శుభాకాంక్షలు తెలిపారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో తిరిగి మండల స్థాయి అధికారినే నివేదిక ఇవ్వాలని కోరడం పట్ల పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
గురుకులాల్లో 28 నుంచి స్పాట్ అడ్మిషన్లు
కాకినాడ సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఐదో తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ప్రవేశ పరీక్ష నిర్వహించి, మెరిట్ ప్రాతిపదికన అడ్మిషన్లు కల్పిస్తున్నామని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సమన్వయాధికారి జి.వెంకటరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా మిగిలిన ఖాళీల భర్తీకి ప్రవేశ పరీక్ష రాసి సీటు పొందని, ప్రవేశ పరీక్ష రాయని విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పి.వెంకటాపురంలోని గురుకుల పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశానికి బాలురకు ఈ నెల 28న, బాలికలకు 29న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వివరించారు. అలాగే, కాకినాడ సాంబమూర్తి నగర్లోని గురుకుల కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు బాలురకు ఈ నెల 30న, బాలికలకు 31న కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థినీ విద్యార్థులు ఆధార్, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇంటర్లో ప్రవేశాలకు టెన్త్ మార్కుల జాబితాతో ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు. ఉదయం 10 గంటల తర్వాత వచ్చే విద్యార్థులను కౌన్సెలింగ్కు అనుమతించబోమని వెంకటరావు స్పష్టం చేశారు. ఘనంగా చండీహోమం అన్నవరం: రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఘనంగా చండీహోమం నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు పండితులు వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చండీహోమం ప్రారంభించారు. పూర్ణాహుతి ఘనంగా నిర్వహించి, అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, ప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, సూపరింటెండెంట్ ఐవీ రామారావు, వేద పండితులు, వ్రత పురోహితులు తదితరులు హోమం, ఇతర పూజలు నిర్వహించారు. మరోవైపు సత్యదేవుని ప్రధానాలయంలో అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, కొండ దిగువన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అర్చకుడు కంచిభట్ల సాయిరామ్ ఆధ్వర్యాన కుంకుమార్చనలు నిర్వహించారు. నేడు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రాత పరీక్ష కాకినాడ సిటీ: డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ శనివారం నిర్వహిస్తున్న రాత పరీక్షకు ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్లూ చేయాలని ఏపీపీఎస్సీ పరీక్షల జిల్లా నోడల్ అధికారి, డీఆర్ఓ డి.తిప్పేనాయక్ అధికారులను ఆదేశించారు. ఈ పరీక్ష నిర్వహణపై సమన్వయ శాఖల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకూ జరిగే ఈ పరీక్షకు జిల్లాలో 1,120 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వీరి కోసం ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అభ్యర్థులను ఉదయం 7.30 నుంచి 8.30 గంటల్లోపు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. అభ్యర్థులు నిర్ణీత సమయం కంటే ముందుగానే ఆయా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ, ఆదిత్య కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, ఆదిత్య కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ప్రగతి ఇంజినీరింగ్ కాలేజీ, కాకినాడ అచ్యుతాపురం రైల్వే ట్రాక్ వద్ద ఉన్న ఐయాన్ డిజిటల్ జోన్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఆయా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు, వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని డీఆర్ఓ కోరారు. సమావేశంలో ఏపీపీఎస్సీ పరీక్షల అసిస్టెంట్ సెక్రటరీ సీహెచ్ సాయి ప్రకాష్, సెక్షన్ అధికారి ఎన్.శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు, డీఐఓ కె.రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వేస్టేషన్లో వ్యక్తి మృతి
తుని: స్థానిక రైల్వేస్టేషన్లో వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్టు జీఆర్పీపీ ఎస్సై షేక్ అబ్ధుల్మారూఫ్ శుక్రవారం తెలిపారు. విశాఖపట్నం కురుపాం మార్కెట్ ప్రాంతానికి చెందిన ముదుపాక భాస్కరరావు కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి వెళ్లడానికి తనతో పనిచేస్తున్న వర్కర్తో కలిసి రైలులో ప్రయాణిస్తూ అస్వస్థతకు గురయ్యాడు. ప్రయాణికుల సహాయంతో తుని రైల్వేస్టేషన్లో ఒకటో నంబర్ ప్లాట్ఫారంపై దిగి కొద్దిసేపటికే మృతి చెందాడు. పోస్టమార్టం అనంతరం శవాన్ని బంధువులకు అప్పగించినట్లు జీఆర్పీపీ ఎస్సై మారూఫ్ తెలిపారు. తాడి చెట్టు నుంచి పడి ...మలికిపురం: మండలంలోని గుడిమెల్లంక గ్రా మంలో శుక్రవారం తాడి చెట్టుపై ముంజెకాయలు కొడుతూ ప్రమాదవశాత్తూ కింద పడి దింపు కార్మికుడు పిండ్రాల పోశయ్య (40) మృతి చెందాడు. మృతుడి స్వస్థలం ప్రత్తిపాడు. ఉపాధి కోసం ఇక్కడకు ఏడాది క్రితం వచ్చినట్టు స్థానికులు తెలిపారు. భార్య దుర్గ మలికిపురంలో పనస తొనల ను అమ్ముకుంటూ కుటుంబ పోషణ చేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. భార్య దుర్గా ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై సంపత్కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు ఆయన వివరించారు. రైలు ప్రమాదంలో... తుని: రైలు నుంచి వ్యక్తి జారిపడి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక జీఆర్పీ ఎస్సై షేక్ అబ్ధుల్ మారూఫ్ శుక్రవారం తెలిపారు. గుల్లిపాడు–తుని రైల్వేస్టేషన్ల మధ్య పాయకరావుపేట హైవే బ్రిడ్జి వద్ద విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే రైలుబండి నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి 40 సంవత్సరాల వ్యక్తి మృతి చెందాడు. మృతుడు స్కైబ్లూ జీన్ప్యాంటు, స్లీవ్లెస్ బనియన్ ధరించి ఉన్నాడు. మృతుడి దగ్గర లభించిన ఆధార్కార్డు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని తుని ఏరియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 94906 19020 నంబరులో సంప్రదించాలన్నారు. -
విషాదం నింపిన విహారం
● గోదావరి నదిలో స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి ● స్నేహితులతో కలిసి స్నానానికి దిగి నీట మునక ● మృతుడు తాడేపల్లిగూడెం వాసి కొవ్వూరు: విజేశ్వరం ఆనకట్ట వద్ద సరదాగా స్నేహితులతో గోదావరి నదిలో స్నానాలు చేస్తూ ప్రమాదవశాత్తు నీటమునిగి తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ఎస్కే సత్తార్ (31) మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం ఎస్కే మదీన్షా, ఎస్కే అబ్ధుల్ రెహమాన్లతో కలిసి సరదాగా విజ్జేశ్వరం ఆనకట్ట వద్దకు వచ్చారు. బ్యారేజీ దిగువన స్నానాలకు దిగారు. కాలు జారడంతో నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు రక్షించి ఒడ్డుకు చేర్చగా అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. రూరల్ ఎస్సై కె.సుధాకర్కి సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు తాడేపల్లిగూడెంలోని తొమ్మిదో వార్డు పరిఽధిలోని సాలిపేటకి చెందిన వాడని ఎస్సై తెలిపారు. పట్టణంలో మటన్ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్సై తెలిపారు. -
బాధ్యత ఏజెంట్లదే
ట్యాంపరింగ్ జరిగితే.. కంట్రోల్ యూనిట్ టేబుల్ పైకి రాగానే అభ్యర్థి సీలింగ్ సెక్షన్ సక్రమంగా ఉందో లేదో కౌంటింగ్ ఏజెంట్లు, పరిశీలకులు చూసుకోవాలి. రిజల్ట్ సెక్షన్పై ఉన్న స్ట్రిప్ సీల్, గ్రీన్ పేపర్ సీల్ సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలి. సీరియల్ నంబర్లు ఫారం–17సీలో నమోదు చేసినవే ఉండాలి. కంట్రోల్ యూనిట్ పేపర్ సీళ్లు, అడ్రస్ ట్యాగ్ల ట్యాంపరింగ్ జరిగాయని గుర్తిస్తే పరిశీలకులు ఆ విషయాన్ని రిటర్నింగ్ అధికారి, అబ్జర్వర్ల దృష్టికి తీసుకెళ్లాలి. ట్యాంపరింగ్ జరగని కంట్రోల్ యూనిట్లను మాత్రమే లెక్కించాలి. ● ఓట్ల లెక్కింపులో వీరు కీలకం ● ఫారం–17సీ ఎంతో ముఖ్యం ● నిబంధనలు తెలియకుంటే అయోమయమే కాకినాడ సిటీ: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశ ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు చాలా కీలకం కానున్నారు. లెక్కింపు సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు ఏజెంట్లకు పూర్తి స్థాయిలో తెలియకుంటే కౌంటింగ్ ప్రక్రియ గందరగోళంగా మారే ప్రమాదం ఉంది. సార్వత్రిక ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో ఫారం–17సి పార్టు–2 ఎంతో కీలకమైంది. ప్రతి కౌంటింగ్ ఏజెంట్, పరిశీలకులు, సహాయ పరిశీలకులు దీనిపై అవగాహన కలిగి ఉండాలి. కంట్రోల్ యూనిట్లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారం–17సీలో పొందుపరిచిన మొత్తం ఓట్లు సరిపోల్చి చూడాలి. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గం నంబర్, పోలింగ్ కేంద్రం పేరు, ఆ పోలింగ్ కేంద్రం వినియోగించిన కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ల గుర్తింపు నంబర్లను ఆ ఫారంలోనే నమోదు చేస్తారు. ఆ పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల సంఖ్య, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రంలోకి వచ్చాక ఓటు వేయడానికి నిరాకరించి వెళ్లిపోయిన వారు, ఓటు వేసేందుకు పీవో అనుమతించని వారి సంఖ్య, ఓటు వేయడానికి వచ్చిన వారి సంఖ్య, ఓటింగ్ యంత్రంలో నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య ఫారం–17సీలో ఉంటాయి. టెండర్ బ్యాలెట్లు, సరఫరా చేసిన పేపర్ సీళ్లు (ఓటరుకు పోలింగ్ కేందంలో ఇచ్చే రెండు రంగుల స్లిప్లు), సీరియల్ నంబర్లు, ఎన్ని పేపర్లు వినియోగించారు. వినియోగించని పేపరు సీళ్లు ఎన్ని తిరిగి రిటర్నింగ్ అధికారికి వెళ్లాయి? పాడైపోయిన పేపర్ సీళ్లు, సీరియల్ నంబర్ల వంటి వివరాలు ఇందులో ఉంటాయి. కౌంటింగ్లో ఫారం–17సీ ఏజెంట్లకు ఎంతో ఉపయోగపడుతుంది. తేడా వస్తే.. కౌంటింగ్ సమయంలో టేబుల్ వద్దకు కంట్రోల్ యూనిట్తో పాటు ఫారం–17సీ, పార్టు–1 తప్పనిసరిగా తీసుకువస్తారు. ఆయా అభ్యర్థులకు సంబంధించి కౌంటింగ్ ఏజెంట్లు అంతా ఫారం–17సీలో ఉన్న వివరాలను రాసుకోవాలి. కంట్రోల్ యూనిట్ డిస్ప్లే సెక్షన్లో చూసిన పోలైన మొత్తం ఓట్లు, ఫారం–17సీలో నమోదు చేసిన ఓట్ల సంఖ్య సమానంగా ఉండాలి. క్లరికల్ తప్పిదం, మరే కారణంతో కానీ కంట్రోల్ యూనిట్ ఫారం–17లో ఓట్ల సంఖ్యలో తేడాలు వస్తే అది వివాదాస్పదంగా మారుతుంది. అలాంటి కంట్రోల్ యూనిట్లు పక్కన ఉంచి సమాచారాన్ని రిటర్నింగ్ అధికారి ఎన్నికల కమిషన్కు పంపుతారు. కంట్రోల్ యూనిట్ టేబుల్పైకి రాగానే ఏజెంట్ల పరిశీలనకు ఉంచుతారు. ఆ కంట్రోల్ యూనిట్ ఏ పోలింగ్ కేంద్రానికి చెందినదో ఏజెంట్లు నిర్ధారించుకోవాలి. వరుస క్రమంలో లెక్కింపు ● కౌంటింగ్ ఒక రౌండ్ పూర్తయిన వెంటనే అందులోని రెండు కంట్రోల్ యూనిట్లను జనరల్ అబ్జర్వర్ తన టేబుల్ వద్దకు తెప్పించుకుంటారు. అదనపు పరిశీలకులతో ఓట్లను లెక్కిస్తారు. కంట్రోల్ యూనిట్లోని ఓట్ల సంఖ్యకు ఫారం–17సీ, పార్టు–2లో కౌంటింగ్ సూపర్వైజర్ నమోదు చేసిన ఓట్ల సంఖ్య సమానంగా ఉంటే ఇబ్బంది లేదు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే పరిశీలకుడు తనిఖీ చేసిన మిగిలిన కంట్రోల్ యూనిట్లంన్నిటినీ జనరల్ అబ్జర్వర్ మరోసారి లెక్కిస్తారు. ● వివరాలు తప్పుగా నమోదు చేసిన కౌంటింగ్ పరిశీలకునిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అసాధారణంగా ఇద్దరు అభ్యర్థులకు కౌంటింగ్లో ఓట్లు సమానంగా వస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రిటర్నింగ్ అధికారి లాటరీ ద్వారా ఫలితాన్ని ప్రకటిస్తారు. ఆ లాటరీలో ఎవరు గెలుపొందితే వారినే విజేతగా ప్రకటిస్తారు. -
ఎన్ఎల్ఎస్ పొగాకుకు అంతర్జాతీయంగా డిమాండ్
● బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ ● వేలం కేంద్రాల సందర్శన దేవరపల్లి: అంతర్జాతీయ మార్కెట్లో భారత దేశ పొగాకుతో పాటు తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో పండిస్తున్న ఉత్తర తేలిక నేలల (ఎన్ఎల్ఎస్) పొగాకుకు మంచి డిమాండ్ ఏర్పడిందని భారత పొగాకు బోర్డు చైర్మన్ జి.యశ్వంత్ కుమార్ తెలిపారు. దేవరపల్లి వేలం కేంద్రాన్ని శుక్రవారం సందర్శించిన ఆయన పొగాకు కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పొగాకు మార్కెట్లో ఈ ఏడాది రైతులకు అద్భుతమైన ధర లభిస్తోందని అన్నారు. రెండు మూడేళ్ల సగటు ధరను తీసుకుంటే ఈ ఏడాది మార్కెట్ రికార్డు స్థాయికి చేరుకుందన్నారు. కిలో సగటు ధర రూ.298 పలుకుతోందని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని, మరింత వేగంగా పొగాకు అమ్ముకోవాలని సూచించారు. మనకు పోటీగా ఉన్న జింబాబ్వే, బ్రెజిల్లో వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో ఆ దేశాల్లో సుమారు 200 మిలియన్ల పొగాకు కొరత ఏర్పడిందన్నారు. ఈ అవకాశాన్ని మన దేశ రైతులు, కొనుగోలు సంస్థలు అందిపుచ్చుకున్నాయని చెప్పారు. మార్కెట్ ఎప్పుడూ ఒకే విధంగా ఉండదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లు ప్రారంభించి దాదాపు 70 రోజులైందని, రైతులు మంచి ధర పొందగలిగారని, కొనుగోలు సంస్థలు కూడా వేలంలో ఉత్సాహంగా పాల్గొంటున్నాయని తెలిపారు. లో గ్రేడ్ పొగాకు మార్కెట్ కొంత మందకొడిగా ఉన్నప్పటికీ రైతులు నెల రోజులుగా అవకాశాలను అందిపుచ్చుకుని చాలా తెలివిగా అమ్ముకుంటున్నారని యశ్వంత్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో పొగాకు బోర్డ్ రీజినల్ మేనేజర్ ఎం.ఆదిశేషయ్య, దేవరపల్లి వేలం కేంద్రం అధికారి జీఎల్కే ప్రసాద్, సీనియర్ గ్రేడింగ్ అధికారి హేమస్మిత, రైతు సంఘం అధ్యక్షులు కరుటూరి శ్రీనివాస్, రైతు సంఘం ప్రతినిధులు సత్తి జగదీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్త వంగడాలు సరఫరా చేయండి అధిక దిగుబడులు వస్తున్న కొత్త పొగాకు వంగడాలను సీటీఆర్ఐ ద్వారా సరఫరా చేయాలని చైర్మన్ యశ్వంత్ కుమార్కు పొగాకు రైతులు వినతిపత్రం అందజేశారు. సీటీఆర్ఐ తయారు చేసిన ఎ–3, 1353, 1350 వంగడాలు అధిక దిగుబడులు వస్తున్నాయని, ఈ వంగడాలను ఆరేళ్లుగా బయటి వ్యక్తుల నుంచి తీసుకువచ్చి తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నామని తెలిపారు. సీటీఆర్ఐ ఆమోదం ఇవ్వకపోవడంతో ఈ కొత్త వంగడాలు దొరకడం లేదని, అనుమతులు ఇప్పించి, అవసరం మేరకు విత్తనాలు సరఫరా చేయాని కోరారు. దీనిపై బోర్డు, సీటీఆర్ఐ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని చైర్మన్ హామీ ఇచ్చారు. -
కరుణించిన వరుణుడు
● జిల్లావ్యాప్తంగా దంచికొట్టిన వాన ● లోతట్టు ప్రాంతాలు జలమయం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రోహిణీ కార్తె వచ్చేస్తుంది.. వేడిగాలులు, ఎండ తీవ్రత ఏవిధంగా ఎదుర్కొనాలనుకుంటూ ఆందోళన చెందుతున్న ప్రజలపై వరుణుడు హఠాత్తుగా కరుణ వర్ష ధారలు కురిపించాడు. శనివారం నుంచి రోహిణీ కార్తె ప్రారంభం కానున్న తరుణంలో.. తీవ్ర ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్న జిల్లా ప్రజలకు శుక్రవారం కాస్త ఊరట లభించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వేడిగాలులు, ఉక్కపోతతో అవస్థలు పడిన జనం.. హోరున వర్షం కురవడంతో ఒక్కసారిగా సేద తీరారు. సుమారు మూడు గంటలకు హోరుగాలి, ఉరుములతో మొదలైన వర్షం సాయంత్రం 4.30 అయినా కురుస్తూనే ఉంది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచే 36 డిగ్రీలు పైగా నమోదైన ఉష్ణోగ్రతలు.. మే మొదటి వారంలో 40 డిగ్రీలకు పైగా చేరడంతో అల్లాడిపోయారు. ఉదయం పది గంటలు దాటితే బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉండేది. ఇటువంటి తరుణంలో ఒక్కసారిగా కుండపోతగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది. సాయంత్రం నుంచి రాత్రి వరకూ చిలు జల్లులు పడుతూనే ఉన్నాయి. జిల్లా కేంద్రమైన కాకినాడతో పాటు తుని, అన్నవరం, పిఠాపురం, జగ్గంపేట, సామర్లకోట తదితర ప్రాంతాల్లో హోరున వర్షం కురిసింది. సాయంత్రం నుంచి వీచిన పెను గాలులకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాకినాడలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులకు చెట్లు నేలకు ఒరిగిపోవడం వలన కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నేలకొరిగిన చెట్లను ఆ శాఖ సిబ్బంది తొలగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు. మామిడి రైతుకు తప్పని అవస్థలు పెను గాలుల తాకిడికి పెద్దాపురం, జగ్గంపేట, శంఖవరం, తుని, కోటనందూరు వంటి ప్రాంతాల్లో మామిడి కాయలు నేల రాలిపోవడంతో రైతులు డీలా పడ్డారు. తయారైన మామిడి కాయలు కోసి, మార్కెట్కు తరలిద్దామనుకున్న తమ ఆశలు అడియాసలయ్యాయని వారు గగ్గోలు పెడుతున్నారు. -
ఖరీఫ్కు వేళాయె..
సాగు ఏర్పాట్లలో రైతన్నల తలమునకలు వాతావరణ మార్పులతో కొద్ది రోజులుగా పలు ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు వేసవి దుక్కులు చేసుకుంటూ భూమిని సాగుకు సిద్ధం చేసుకుంటున్నారు. బంగాళాఖాతంలో తుపాను ఏర్పడి.. వరుసగా నాలుగైదు రోజులు వర్షాలు కురిస్తే సాగు పనుల్లో మరింతగా తలమునకలు కానున్నారు. మెట్ట ప్రాంతంలో గోదావరి కాలువతో పాటు పిఠాపురం బ్రాంచి కెనాల్ (పీబీసీ), ఏలేరు, పంపా, తాండవ జలాశయాలు, పుష్కర ఎత్తిపోతల పథకంపై ఆధారపడిన రైతులు సాగునీటి కోసం మరో వారం పది రోజులు నిరీక్షించాల్సిందే. తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లోని రైతులు మెట్ట దుక్కులకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. రబీ పంట ముగిసిన నేపథ్యంలో ఆ భూములను ట్రాక్టర్లతో దున్ని ఖరీఫ్ సాగుకు సిద్ధం చేస్తున్నారు. వర్షాలు పడిన వెంటనే మరోసారి దుక్కి దున్నుకునే ఏర్పాట్లలో ఉన్నారు. ● ముందస్తుకే మొగ్గు ● తుపానుల నుంచి గట్టెక్కేలా ప్రణాళిక ● సాగు లక్ష్యం 2.43 లక్షల ఎకరాలు ● లక్ష ఎకరాల్లో వెదజల్లు విధానం ● మెట్టలో దుక్కులు దున్నుతున్న రైతులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రకృతి విపత్తుల నుంచి గట్టెక్కే లక్ష్యంతో జిల్లాలోని రైతులు ఖరీఫ్ ముందస్తు సాగుకు సన్నద్ధమవుతున్నారు. సానుకూల వాతావరణం, ప్రభుత్వ తోడ్పాటు ఫలితంగా రబీలో రైతుల పంట పండింది. ఎకరాకు 50 బస్తాలు పైనే దిగుబడి రావడంతో వారు ఖరీఫ్ సాగుకు సంతోషంగా సిద్ధమవుతున్నారు. సాధారణంగా మన రాష్ట్రంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో తరచుగా వాయుగుండాలు, తుపాన్లు వస్తూంటాయి. వీటి ప్రభావంతో కురిసే అధిక వర్షాలు, ఈదురు గాలులతో చేతికందే వేళ వరి పంట నేలనంటి, నీళ్లల్లో నానిపోయి, దెబ్బ తింటోంది. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సాగు నీరు సకాలంలో విడుదల చేసేవారు కాదు. దీనికి వర్షాభావం వంటి పరిస్థితులు తోడయ్యేవి. ఫలితంగా అప్పట్లో ఖరీఫ్ సాగులో తీవ్ర జాప్యం జరిగేది. ఒక్కోసారి ఆగస్టు నెలాఖరుకు కూడా వరి నాట్లు వేసిన సందర్భాలున్నాయి. దీంతో ఖరీఫ్ పంట చేతికందే దశలో తుపానులు, వరదలతో రైతులు ప్రతిసారీ నష్టపోయేవారు. ముందస్తు సాగుతో మేలు ఈ సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించారు. ఖరీఫ్ చివరి దశలో రైతులు పంట నష్టపోకుండా ఉండాలంటే రైతులు ముందస్తుగా సాగు చేయడం మేలని భావించారు. దీనివలన ఖరీఫ్, రబీ సాగు సకాలంలో పూర్తయ్యి, మూడో పంటకు కూడా రైతులకు అవకాశం కలుగుతుంది. ఇది వారికి ఆర్థికంగా కూడా మేలు చేస్తుందని గుర్తించారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏటా జూన్ ఒకటో తేదీనే కాటన్ బ్యారేజీ నుంచి పంట కాలువలకు సాగునీరు విడుదల చేస్తున్నారు. ముందస్తుగా ఖరీఫ్ సాగు చేసేలా వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఇది విజయవంతం కావడంతో ఈ సీజన్లో కూడా జూన్ ఒకటో తేదీ నుంచి పంట కాలువలకు సాగునీరు విడుదల చేసేందుకు జలవనరుల శాఖ ఆధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో వచ్చే భారీ వర్షాలు, వాయుగుండం, తుపానుల వంటి విపత్తులతో పంట నష్టం జరగకుండా రైతులను ప్రభుత్వం ముందస్తు సాగుకు సన్నద్ధం చేస్తోంది. అక్కరకొచ్చిన ఇన్పుట్ సబ్సిడీ గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో మిచాంగ్ తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సకాలంలో పరిహారం విడుదల చేసేందుకు యత్నించగా.. ఎన్నికల కోడ్ పేరుతో టీడీపీ అండ్ కో మోకాలడ్డింది. ఈ నెల 13న పోలింగ్ ముగియడంతో రైతులకు మేలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం.. ఎన్నికల కమిషన్ అనుమతితో అర్హులైన వారి ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ సొమ్ములు యుద్ధప్రాతిపదికన జమ చేసింది. ఈవిధంగా జిల్లావ్యాప్తంగా 29,739 మంది రైతులకు రూ.23.11 కోట్ల మేర పరిహారం అందించింది. ఈ సొమ్ములు రానున్న ఖరీఫ్లో సాగు పెట్టుబడిగా ఉపయోగపడతాయని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం అందించిన పరిహారంతో ఖరీఫ్ పెట్టుబడికి అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పోయిందని అంటున్నారు. ఇదీ ఖరీఫ్ ప్రణాళిక ● ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా 2,79,672 ఎకరాల్లో వివిధ పంటల సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో 2.43 లక్షల ఎకరాల్లో వరి, 5 వేల ఎకరాల్లో మినుములు, 2,100 ఎకరాల్లో మొక్కజొన్న, 16,672 ఎకరాల్లో పత్తి, 12 వేల ఎకరాల్లో చెరకు, 900 ఎకరాల్లో రాగులు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ● జిల్లాకు 68,280 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరమవుతాయని నిర్ధారించారు. వీటిని ఈ విత్తనాలను రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) సిద్ధంగా ఉంచారు. ● ఖరీఫ్లో రైతులు సన్న రకాల వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. అత్యధికంగా స్వర్ణ రకం (ఎంటీయూ–7029) సాగుకు సిద్ధపడుతున్నారు. దీంతో పాటు ఎంటీయూ–1318 రకంపై కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. రైతుల ఆసక్తికి తగినట్టుగానే స్వర్ణ రకం వరి వంగడాలను అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సంపద (ఎస్పీ–9558), ఎంటీయూ–1064, ఆర్పీ బయో–226, ఆర్జీఎల్–2537, ఎంటీయూ–1061 రకాలను సైతం రైతులు సాగు చేయనున్నారు. మరోవైపు పలువురు రైతులు ఖరీఫ్లో సొంతంగా విత్తనాలు తయారు చేసుకోవడానికి కూడా ఎక్కువగా ఇష్టపడతారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఏ ప్రాంతంలో ఏ రకం సాగు చేస్తారనే అంచనాలతో విత్తనాలు సిద్ధం చేసే పనిలో వ్యవసాయ శాఖ నిమగ్నమైంది. ● వ్యవసాయ, ఉద్యాన పంటలకు కలిపి ఖరీఫ్లో అన్ని రకాలూ కలిపి 90 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశారు. రైతులకు ముఖ్యంగా యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు అవసరం. ఇప్పటికే ఆర్బీకేల్లో 23 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచారు. నారుమడులకు అవసరమైన ఎరువులు పుష్కలంగా ఉన్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ● జిల్లావ్యాప్తంగా గత ఖరీఫ్లో 35 వేల ఎకరాల్లో మాత్రమే వెదజల్లు సాగు చేపట్టగా, ఈసారి దీనిని లక్ష ఎకరాలకు పెంచేలా రైతులను వ్యవసాయ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. తద్వారా కూలీల కొరతను అధిగమించవచ్చని అవగాహన కల్పిస్తున్నారు. తుని మండలం ఎస్.అన్నవరంలో ట్రాక్టర్తో వేసవి దుక్కులు చేస్తున్న రైతు ముందస్తు సాగును ప్రోత్సహిస్తున్నాం గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఖరీఫ్ సాగుకు జూన్ మొదటి వారంలోనే సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. జూన్ 15 లోగా రైతులు నారుమడులు వేసుకోవాలి. అలా వీలు లేని రైతులు వెదజల్లు సాగు చేసుకోవాలి. జూన్ 30లోగా వరి నాట్లు పూర్తి చేసుకునేలా రైతులు సన్నద్ధం కావాలి. – ఎన్.విజయ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి, కాకినాడ -
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్యాయత్నం
గొల్లపుంత లే అవుట్లో పెట్రోలు పోసుకుని నిప్పు మండపేట: ప్రేమించిన అమ్యాయి కాదన్నదని ఓ యువకుడు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో జరిగింది. స్థానికులు బాధితుని స్నేహితులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.. మండపేట మండలం ఏడిద సీతానగరం గ్రామానికి చెందిన బోణం రవి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఈ నేపథ్యంలో పది రోజులుగా మతిస్థిమితం లేనివాడిలా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గొల్లపుంత రోడ్డులోని ఓ ప్రైవేటు లేవుట్లోకి వచ్చాడు. కాసేపటికి ఎర్రటి మంటలు ఎగసిపడగా బాబోయ్ బాబోయ్ అంటూ కేకలు వినిపించాయి. దీంతో చుట్టుపక్కల వారు చూసి వెంటనే స్పందించారు. పరుగెత్తుకుంటూ వెళ్లి మంటలను ఆర్పారు. అప్పటికే ఆ యువకుడి శరీరం కాలి పోయింది. బైక్పై ఎక్కించుకుని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ యువకుడు వారం క్రితం నిద్ర మాత్రలు కూడా మింగినట్టు స్నేహితులు చెబుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొంది బయటకు వచ్చాక మళ్లీ ఈ పనికి ఒడిగట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను శ్రీసాక్షిశ్రీ టౌన్ సీఐ షేక్ అఖిల్ జమకు వివరించగా ఆయన వెంటనే స్పందించి ప్రభుత్వాసుపత్రికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని తెలిపారు. -
విద్యార్థిని పీహెచ్డీకి మానవత ఆర్థిక సాయం
రాజమహేంద్రవరం ిసటీ: సమాజంలో అర్హులైన పేదలకు విద్య, వైద్యం తదితర విషయాల్లో సహాయ సహకారాలు అందించేందుకు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ నిరంతరం సిద్ధంగా ఉంటుందని ఆ సంస్థ రీజినల్ చైర్మన్, సీపీ మోటార్స్ అధినేత చింతా ప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం రాజమహేంద్రవరం మానవత శాఖ మెరిట్ స్కాలర్ షిప్ పథకం ద్వారా పి.భాను దీపిక అనే విద్యార్థినికి రూ.20,906 ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. ఆమె ఆఽంధ్రా యూనివర్సిటీలో బీటెక్ ఓషనోగ్రఫీలో ప్రథమధమ స్ధానంలో నిలిచి అదే విభాగంలో గోవాలో పీహెచ్డీ చదువుతోంది. ఈ సందర్భంగా ప్రసాద రెడ్డి మాట్లాడుతూ మానవత సేవా సంస్థ ద్వారా అర్హులను గుర్తించి సహయం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. చింతా ప్రభాకరరెడ్డి, బూరగడ్డ మురళి, కేవీఎస్ గాంధీ పాల్గొన్నారు. -
మభ్యపెట్టి రూ.6 లక్షల దోపిడీ
పిఠాపురం: బ్యాంకులో డబ్బు డ్రా చేసుకుని బయటకు వస్తున్న వ్యక్తిని మరో ఇద్దరు వ్యక్తులు కలిసి మీ డబ్బు కింద పడిపోయిందని అని చెప్పగా కింద ఉన్న నోట్లు తీసుకునే లోపు అతని వద్ద నగదుతో ఉన్న బ్యాగ్ను లాక్కెళ్లి పోయారు దుండగులు. పిఠాపురం స్టేట్బ్యాంకు వద్ద శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పిఠాపురం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... పిఠాపురం పట్టణం కొండప్ప వీధికి చెందిన నందిపాటి నారాయణమూర్తి ధాన్య కమీషన్ వ్యాపారం చేస్తుంటాడు. ఇటీవల అమ్మిన ధాన్యానికి సంబంధించి మిల్లు యజమాని బ్యాంకులో వేసిన సొమ్ము తెచ్చుకునేందుకు పిఠాపురం స్టేట్బ్యాంకు వద్దకు వెళ్లాడు. బ్యాంకులో తన ఖాతాలో ఉన్న రూ.6 లక్షలు తీసుకుని, తన కూడా తెచ్చుకున్న బ్యాగ్లో పెట్టుకుని బయటకు వచ్చాడు. తన మోటారు సైకిల్ వద్దకు వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి మీ డబ్బు కింద పడిపోయిందంటూ కింద పడి ఉన్న రూ.50 నోట్లు చూపించారు. దీంతో బ్యాగ్ ఒక చేత్తో పట్టుకుని కిందకు వంగి మరో చేత్తో కింద పడిఉన్న రూ.50 నోట్లను తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఇదే అదనుగా భావించిన ఆ ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నారాయణమూర్తి వద్ద డబ్బుతో ఉన్న బ్యాగ్ను ఒక్క ఉదుటున లాక్కుని పరారయ్యారు. హఠాత్ పరిణామం నుంచి తేరుకుని గట్టిగా కేకలు వేసినా ఫలితం లేక పోవడంతో బాధితుడు పిఠాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కనుల నిండుగ.. విరుల పండగ
● వైభవంగా సత్యదేవుని శ్రీపుష్పయాగం ● సుగంధ సుమాలతో పరిమళించిన కల్యాణ మంటపం ● సుమధుర ఫలాలు, పిండివంటలు స్వామివారికి నివేదన అన్నవరం : సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీపుష్పయాగం నిత్య కల్యాణ మంటపంలో కన్నుల పండువగా జరిగింది. ఒకవైపు కల్యాణ మంటపంలో అలంకరించిన పుష్పమాలికలు...ఇంకొకవైపు రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులు ఆకట్టుకున్నాయి. నూతన పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలు ధరించి కల్యాణ శోభతో ప్రకాశిస్తున్న శ్రీసత్యదేవుడు, అమ్మవారి శ్రీపుష్పయాగ మహోత్సవాన్ని వేలాది మంది భక్తులు తిలకించారు. రాత్రి 7–30కి మొదలైన వేడుక పెళ్లి పెద్దలు సీతారాములు వెంట రాగా, నవ దంపతులు సత్యదేవుడు, అమ్మవార్లను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి కల్యాణ మంటపానికి రాత్రి ఏడు గంటలకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. నిత్యకల్యాణ మంటప వేదికపైగల వెండి సింహాసనంపై స్వామి అమ్మవార్లను, ఆ సింహాసనం పక్కనే గల మరో ఆసనంపై పెళ్లిపెద్దలు సీతారాములను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి 7–30 గంటలకు పండితుల మంత్రోచ్ఛారణతో శ్రీపుష్పయోగం కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత విఘ్నేశ్వర పూజ చేశారు. అనంతరం పుణ్యాహవచనం మంత్రాలను పఠించారు. తరువాత పండితులు గర్భాదానం కార్యక్రమానికి సంబంధించిన పూజలు నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవార్లకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె.రామచంద్రమోహన్ దంపతులు నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం పండితులు ప్రత్యేక పూజలు చేశారు. పండితులు వేదాశీస్సులు అందజేశారు. శాస్త్రోక్తంగా పవళింపు సేవ తరువాత సర్వాంగ సుందరంగా అలంకరించిన ఊయలలో ఉంచి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అలంకరణలో గల సత్యదేవుడు, అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో పూజించారు. తొమ్మిది రకాల పిండివంటలను నివేదించి పండితుల మంత్రోచ్ఛాటన మధ్య స్వామి, అమ్మవార్లు ఉన్న ఊయలను మూడు పర్యాయాలు ఊపారు. భక్తులు ఊయలకు ఎదురుగా ఉంచిన అద్దంలో స్వామి, అమ్మవార్ల ప్రతిబింబాలను తిలకించారు. కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ జాకెట్టు ముక్కలను, భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, చిట్టి శివ, యనమండ్ర శర్మ, గంగాధరబట్ల గంగబాబు, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి, కోట సుబ్రహ్మణ్య శర్మ, అర్చకులు ఇంద్రగంటి వేంకటేశ్వర్లు, కంచిభట్ల రామ్కుమార్, సుధీర్, దత్తాత్రేయశర్మ, వైదిక కమిటీ సభ్యుడు ఛామర్తి కన్నబాబు నిర్వహించారు. రెండేళ్ల అనంతరం భక్తుల సమక్షంలో వైభవంగా జరిగిన స్వామివారి కల్యాణ మహోత్సవాలు శ్రీపుష్పయాగంతో ముగిశాయి. -
వంగా గీత బలం.. ప్యాకేజ్ స్టార్ బలహీనతలు ఇవే!
ఏపీలో పోలింగ్ ముగిసి పది రోజులు గడిచింది.. కాని ఇప్పటికీ అందరి చూపూ పిఠాపురం నియోజకవర్గం మీదే ఉంది. కారణం అక్కడ ప్యాకేజీ స్టార్గా పేరు తెచ్చుకున్న పవన్ కల్యాణ్ పోటీ చేయడమే. దత్త తండ్రి పచ్చ పార్టీని గెలిపించడానికి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఈసారి పిఠాపురంలో ఎలాగైనా గెలవాలని పడరాని పాట్లు పడ్డారు. ఇక్కడ పవన్ ప్రత్యర్థి వంగా గీత అత్యంత ఆదరణ కలిగిన ప్రజా నాయకురాలు. పిఠాపురంలో పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత బలం ఏంటి? ప్యాకేజీ స్టార్ బలహీనతలు ఏంటి? పిఠాపురం ఓటర్లు ఎవరి పక్షాన నిలిచారు? కారణాలు ఏంటి?2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ .. ఈసారి కాపులు అత్యధికంగా ఉన్నారన్న కారణంతో పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తానని ప్రకటించక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతా విశ్వనాధ్ ను పిఠాపురం ఇంఛార్జిగా ప్రకటించి..బరిలో నిలిపింది. గత ఎన్నికల్లో కంటే ఈసారి పిఠాపురంలో అదనంగా 6 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో పోలింగ్ సరళిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ .. జనసేన పార్టీలు అంచనాలు వేసుకుని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.వాస్తవంగా చూస్తే గతంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్గా, పిఠాపురం ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యురాలిగా, ప్రస్తుతం లోక్సభ ఎంపీగా ఉన్న వంగా గీత ఉన్నత విద్యావంతురాలు. న్యాయశాస్త్ర పట్టభద్రురాలు. ప్రజాసేవలో దశాబ్దాల అనుభవం గడించి, ప్రజల ఆదరణ చూరగొన్న వంగా గీతతో టెన్త్ క్లాస్ చదివిన పవన్కల్యాణ్కు ఏమాత్రం పోలిక లేదు. అసలు పవన్కల్యాణ్ పార్ట్టైమ్ పొలిటీషియన్ అనే విషయం అందిరికీ తెలుసు. పైగా రాష్ట్రంలో ఏ జిల్లా గురించీ అవగాహన లేదు. గతంలో రెండు జిల్లాల నుంచి పోటీ చేసి ఓడిపోయి..ఈసారి మరో జిల్లానుంచి పోటీ చేస్తున్నారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ త్యాగం చేస్తే పవన్ కు పిఠాపురం నుండి పోటీ చేసే అవకాశం కలిగింది. తన గెలుపు కోసం వర్మ మీద ఆధారపడిన పవన్..ఒక దశలో ఆయన్ను నమ్మలేదు. చివరికి టివి, సినిమా నటులతో తన కోసం పిఠాపురంలో ప్రచారం చేయించుకున్నాడు పవన్. మెగా కుటుంబాన్ని సైతం తన తరపున ప్రచారానికి పిఠాపురం తెచ్చుకుని గెలుపు కోసం పడరాని పాట్ల పడ్డాడు.ఎలాగైనా గెలవాలని ఇన్ని పాట్లు పడినా..ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే పవన్ తమకు అందుబాటులో ఉండరని ప్రజలకు తెలిసొచ్చింది. ఎందుకంటే పవన్ ప్రచారం కోసం పిఠాపురం వచ్చిన కొత్తలో చిన్నపాటి జర్వానికి రాత్రుళ్లు ప్రత్యేక హెలికాప్టర్, విమానాల్లో హైదరాబాదు వెళ్లి వచ్చేవారు. దీంతో పవన్పై పిఠాపురం ప్రజల్లో నమ్మకం పోయింది. అందువల్ల అందరికి అందుబాటులో ఉండే వంగా గీతా పిఠాపురంకు ఎమ్మెల్యే ఐతే బెటర్ అని ప్రజలు నమ్మారు. ఇక పిఠాపురంలో కాపుల్లో మెజార్టీ పవన్ వైపు ఉన్నా...వంగా గీతను కూడా అభిమానించే కాపులు అధికంగానే ఉన్నారు. అంతేకాదు బీసీ, ఎస్సీ, మైనార్టీలు వంగా గీతకు ఏకపక్షంగా మద్దతు పలికారు.2009లో వంగా గీత పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచాక..అనేక అభివృద్ది పనులను చేసి ప్రజల విశ్వాసం పొందారు. కాకినాడ ఎంపీగా కూడా జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. గొల్లప్రోలు, పిఠాపురం వద్ద రైల్వే అండర్ పాస్లు నిర్మించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. యూ.కొత్తపల్లి మండలంలోని సెజ్ లో ప్రతిష్టత్మక ఐఐఎఫ్టీ విద్యా సంస్దను తీసుకువచ్చారు. కాకినాడలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించి కార్మికులకు అండగా నిలిచారు. మరోవైపు యూ.కొత్తపల్లి మండలంలో సీఎం జగన్ జగన్ చోరవతో రూ.400 కోట్లతో ఫిషింగ్ హర్బర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురికాకుండా జియో ట్యూబ్ నిర్మాణం కోసం వంగా గీత కేంద్రానికి ప్రతిపాదన పంపించారు.ఇలా చెప్పుకుంటే కాకినాడ జిల్లాకు ప్రత్యేకించి పిఠాపురంకు వంగా గీత చేసిన సేవలు చాలా ఉన్నాయి. అందుకే ఇక్కడి ప్రజలకు గీత అంటే నమ్మకం. ప్రజల్లో ఆదరణ ఉన్నందునే సీఎం జగన్ పిఠాపురం ప్రచార సభలో మాట్లాడుతూ.. వంగా గీతను డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఇక్కడ ప్రజలు ఇది తమకో వరమని భావించారు. అందుకే అటు అభివృద్ది.. ఇటు సంక్షేమం కలిపి పిఠాపురంలో ఓటింగ్ శాతం భారీగా పెంచాయని అర్దమవుతోంది. మొత్తం మీద వంగా గీతకే విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
పారదర్శకంగా ఓట్ల లెక్కింపు
● ఏజెంట్ల వివరాలు మూడు రోజుల ముందే ఇవ్వాలి ● రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ నివాస్ కాకినాడ సిటీ: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామని, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, కాకినాడ ఎంపీ అభ్యర్థులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రం వద్ద నిరంతర నిఘా, ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా అభ్యర్థులు, ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏజెంట్ల వివరాల నమోదు, కౌంటింగ్ కేంద్రాల్లో విధివిధానాలు తదితర అంశాలపై చేసిన ఏర్పాట్లను కలెక్టర్ నివాస్, జిల్లా ఎస్పీ ఎస్,సతీష్ కుమార్ వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు మూడు రోజుల ముందే కౌంటింగ్ ఏజెంట్ల వివరాలు అందజేయాలని కలెక్టర్ కోరారు. వచ్చే నెల 4వ తేదీ ఉదయం 8 నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 6 గంటలకే వారి కేంద్రాలకు చేరుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి అభ్యర్థులు, ఏజెంట్లతో ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ఫోన్ అనుమతించబోమని స్పష్టం చేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకూ అనుమతి లేదని కలెక్టర్ నివాస్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీఆర్ఓ తిప్పేనాయక్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. ముగిసిన ఏపీ ఈఏపీ సెట్ బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశాలకు ఎనిమిది రోజులుగా నిర్వహిస్తున్న ఏపీ ఈఏసీ సెట్ ఆన్లైన్ పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన మూడు కేంద్రాల్లో ఇంజినీరింగ్ విభాగానికి 8,306 మంది హాజరు కాగా 270 మంది గైర్హాజరయ్యారు. అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగాలకు సంబంధించి 3,336 హాజరుకాగా 347 మంది పరీక్ష రాయలేదు. గురువారం ఉదయం పరీక్షకు 895 హాజరవగా 35 మంది గైర్హాజరయ్యారని సెట్ కన్వీనర్ వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది రోజుల్లో ఇంజినీరింగ్ విభాగంలో 2,58,373 హాజరు కాగా 15,840 మంది పరీక్ష రాయలేదన్నారు. అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగంలో 80,766 హాజరవగా 7,872 మంది గైర్హాజరయ్యారని వివరించారు. విజయవంతంగా నిర్వహణ అత్యంత కీలకమైన ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం ఈ ఏడాది తమ వర్సిటీకి అప్పగించిందని సెట్ చైర్మన్, జేఎన్టీయూకే ఉప కులపతి డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు. ఈ పరీక్షలు విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. పరీక్షలు పూర్తయిన సందర్భంగా సెట్ కార్యాలయంలో కన్వీనర్ వెంకటరెడ్డి సమక్షంలో కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించామన్నారు. తమకు సహకరించిన పోలీస్, రెవెన్యూ తదితర విభాగాలతో పాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ సుమలత, డీఈ బాలకృష్ణ, డైరెక్టర్ రవీంద్ర, టీసీఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
సప్లిమెంటరీకి సర్వం సిద్ధం
● నేటి నుంచి టెన్త్, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ● 31 వరకూ ఇంటర్ ● వచ్చే నెల 3 వరకూ పదో తరగతి పరీక్షలు ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగంబాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి, ఇంటర్మీడియెట్ రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31 వరకూ ఇంటర్, వచ్చే నెల మూడో తేదీ వరకూ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ నెలలో రెగ్యులర్ పరీక్షల ఫలితాలు వెల్లడించిన రోజునే ప్రభుత్వం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని కూడా రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణించనున్నారు. టెన్త్కు 7,915 మంది దరఖాస్తు జిల్లాలో ఈ ఏడాది మార్చి 18 నుంచి జరిగిన పదో తరగతి పరీక్షలకు 27,671 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 22,993 మంది ఉత్తీర్ణత సాధించారు. గతంలో ఫెయిలైన విద్యార్థులతో పాటు అన్ని సబ్జెక్టులకూ కలిపి ఈసారి 7,915 మంది సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 29 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులను ఆయా పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకూ అనుమతిస్తారు. ఇప్పటికే విద్యార్థుల హాల్ టికెట్లను ఆయా పాఠశాలలకు పరీక్షల విభాగం పంపించింది. ఆ హాల్ టికెట్లను ఆయా ప్రధానోపాధ్యాయులు డౌన్లోడ్ చేసి విద్యార్థులకు ఇచ్చే పనిలో ఉన్నారు. సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు గత ఏడాది మాదిరిగానే ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు ప్రతి రోజూ ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులకు మెళకువలను నేర్పించారు. ఇంటర్కు 22,379 మంది.. ఈ ఏడాది మార్చి 1 నుంచి 20వ తేదీ వరకూ ఇంటర్ రెగ్యులర్ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను గత నెల 12న విడుదల చేశారు. వీటిల్లో ఫెయిలైన విద్యార్థులకు, బెటర్మెంట్కు దరఖాస్తు చేసిన వారికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫస్టియర్ జనరల్ 14,600, ఒకేషనల్ 906, సెకండియర్ జనరల్ 6,293, ఒకేషనల్ 580 కలిపి జిల్లావ్యాప్తంగా మొత్తం 22,379 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 16 ప్రభుత్వ, 2 ఎయిడెడ్, 11 ప్రైవేటు అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలు రెండు సెషన్లుగా నిర్వహిస్తున్నారు. ఫస్టియర్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ జరగనున్నాయి. విద్యార్థులు వారికి కేటాయించిన కేంద్రానికి అరగంట ముందుగా చేరుకోవాల్సి ఉంటుంది. విస్తృతంగా ఏర్పాట్లు టెన్త్, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకుని వెళ్లకూడదు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి, పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసు అధికారులతో 4 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లను పరీక్ష సమయంలో మూసివేయాలని ఇప్పటికే అధికారులు ఆదేశించారు. అన్ని కేంద్రాల్లో తాగునీరు, ప్రథమ చికిత్స అందుబాటులో ఉంచుతున్నారు. పరీక్ష సమయంలో అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా ఉండేలా ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరేందుకు వీలుగా ఆయా రూట్లలో బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఇప్పటికే కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు.ఏర్పాట్లు పూర్తి చేశాం విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నాం. ముఖ్యంగా మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాం. అన్ని శాఖలనూ సమన్వయం చేసుకుంటూ పరీక్షలు విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. – జీజీకే నూకరాజు, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి, కాకినాడ ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాం. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలూ తీసుకుని రాకూడదు. కలెక్టర్ ఆదేశాల మేరకు నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించాం. రెగ్యులర్ పరీక్షల మాదిరిగానే సప్లిమెంటరీ పరీక్షలు కూడా పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. – పిల్లి రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ -
ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు
● ఈ నెల 27, వచ్చే నెల 3న ఉద్యోగులకు శిక్షణ ● ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లు ● పకడ్బందీగా 144 సెక్షన్ అమలు కాకినాడ సిటీ: సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలకమైన కౌంటింగ్ ప్రక్రియకు జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. వచ్చే నెల 4వ తేదీన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ క్రమంలో అధికారులు కౌంటింగ్కు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు విధులకు హాజరయ్యే ఉద్యోగులకు ఈ నెల 27, వచ్చే నెల 3 తేదీల్లో రెండు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. కౌంటింగ్ ఏర్పాట్లు ఇలా.. ● కాకినాడ జేఎన్టీయూలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ● తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 7 హాళ్లలో ఒక్కో దానికి 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. అలాగే, కాకినాడ లోక్సభ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మరో 14 టేబుళ్లు కలిపి ఒక్కో నియోజకవర్గానికి మొత్తం 28 టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. మొత్తం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి 210 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ● ఒక్కో టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్తో పాటు ముగ్గురు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. ● ఈవిధంగా ఒక్కో టేబుల్కు నలుగురు చొప్పున 967 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమిస్తున్నారు. ● పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు, 86 మంది సిబ్బందిని, అసెంబ్లీల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు 32 టేబుళ్లు, 118 మంది సిబ్బందిని నియమిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 18,470 చొప్పున పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ● కౌంటింగ్ ప్రక్రియను చూడటానికి రాజకీయ పార్టీల ఏజెంట్లను కూడా అనుమతిస్తారు. ● ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 15 నుంచి 19 రౌండ్లు నిర్ణయించారు. పెద్దాపురం 15, తుని 16, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ 17, పిఠాపురం, జగ్గంపేట 18, కాకినాడ రూరల్ 19 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు. ● ఎంపీ ఎన్నికకు 13,12,255 మంది, ఏడుగురు ఎమ్మెల్యేల ఎన్నికకు 13,12,293 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పటిష్ట బందోబస్తు వచ్చే నెల 4న జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ నివాస్ అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపుపై జాయింట్ కలెక్టర్, పిఠాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) ఎస్.రామ్సుందర్రెడ్డి, జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్, వివిధ నియోజకవర్గాల ఆర్ఓలు, పోలీస్, ట్రాఫిక్, ఆర్అండ్బీ అధికారులతో కలెక్టరేట్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్ల లెక్కింపు జరిగే కౌంటింగ్ రోజున ప్రణాళిక ప్రకారం ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని ఆదేశించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, జేఎన్టీయూకేలోని ఈవీఎంల స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణకు కార్యాచరణ సిద్ధం చేశామని చెప్పారు. తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, జగ్గంపేట నియోజకవర్గాల అభ్యర్థులు, ఏజెంట్లకు వాహనాల పార్కింగ్కు జేఎన్టీయూకే ఎదురుగా ఉన్న ఐటీఐ, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోను, పెద్దాపురం నియోజకవర్గానికి జిల్లా క్రీడా మైదానంలోను ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఓట్ల లెక్కింపు రోజు ఉదయం జేఎన్టీయూకే చుట్టూ ఉన్న రోడ్లలో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టామన్నారు. భానుగుడి జంక్షన్ నుంచి నాగమల్లితోట జంక్షన్ వరకూ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించామని చెప్పారు. అభ్యర్థులు, ఏజెంట్లు, మీడియా ప్రతినిధులు వెళ్లేందుకు జేఎన్టీయూకే ప్రధాన ద్వారం వద్ద ఒక గేటు, ఎన్నికల పరిశీలకులు, ఎన్నికల అధికారులు, ఓట్ల లెక్కింపు సిబ్బంది వెళ్లేందుకు మరో గేటు వినియోగిస్తామని తెలిపారు. భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి, పాస్లు ఉన్న వారిని మాత్రమే లోపలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణపై ఆయా కూడళ్లలో డిస్ప్లే బోర్డులు, మైక్ అనౌన్స్మెంట్లు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ రోజున కాకినాడ నగరంలో ట్రాఫిక్ మళ్లింపునకు సంబంధించిన రూట్ మ్యాప్, బందోబస్తు, బారికేడ్ల ఏర్పాటు వంటి అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్పీ వివరించారు. సమావేశంలో డీఆర్ఓ డి.తిప్పేనాయక్, తుని, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, జగ్గంపేట ఆర్ఓలు కేవీ రామలక్ష్మి, ఎ.శ్రీనివాసరావు, ఇట్ల కిషోర్, జె.వెంకటరావు, ఎం.శ్రీనివాసరావు, డీఎస్పీ కె.హనుమంతరావు, ఆర్అండ్బీ ఎస్ఈ జి.కాంత్, ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం.. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతున్నామని కలెక్టర్ నివాస్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్కుమార్ మీనా విజయవాడ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి ఆయన, వివిధ నియోజకవర్గాల ఆర్ఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ, స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. మూడంచెల భద్రత, సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు సమర్థవంతంగా నిర్వహించేందుకు కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్, ఫెన్సింగ్, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్, పిఠాపురం ఆర్ఓ రామ్సుందర్రెడ్డి, డీఆర్ఓ డి.తిప్పేనాయక్, ఆయా నియోజకవర్గాల ఆర్ఓలు, సీీపీఓ పి.త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
నవధాన్యాలతో జవసత్వాలు
పిఠాపురం: అధునాతన వ్యవసాయంలో మితిమీరిన రసాయనాలు వాడడం వల్ల పసిడి పంటలు పండే భూములు సహజ శక్తిని కోల్పోయాయి. అలాంటి పరిస్థితుల్లో నేలలను పునరుజ్జీవింప చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూములను సారవంతం చేసే దిశగా అడుగులు వేయాలని, ఎరువులు.. పురుగు మందులకు చెక్ పెట్టి ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.దీంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ భూసారం సాధించే దిశగా నవ ధాన్యాల సాగుకు ప్రభుత్వం తోడ్పాటు ఇచ్చే చర్యలు తీసుకుంది. పచ్చి రొట్ట సాగుతో పచ్చని పంటలు పండే విధంగా ప్రకృతి వ్యవసాయంపై అధికారులు రైతుల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. నవ ధాన్యాల సాగుతో భూసారం పెంపువివిధ కారణాలతో క్రమంగా భూములు తమ బలాన్ని కోల్పోతున్నాయి. దీంతో సూక్ష్మ పోషక లోపాలు బయటపడుతున్నాయి. ఫలితంగా భారీ పెట్టుబడులు పెట్టినా ఆశించిన దిగుబడులు రాని పరిస్థితి నెలకొంది. పెట్టుబడులు పెరిగి గిట్టుబాటు కాక రైతులు నష్టపోతున్నారు. రానున్న రోజుల్లో భూసారం లేక ఏ పంటలు వేసినా పండని పరిస్థితులు నెలకొననున్నాయి. వాటిని అధిగమించడానికి నవ ధాన్యాల సాగు చేపట్టారు. వీటిని సాగు చేసి భూమిలో కలియ దున్నడం వల్ల భూమిలో సూక్ష్మ పోషక విలువలు వృద్ధి చెంది, భూసారం పెరిగి ఏది సాగు చేసినా బాగా పండుతుంది.భూమి సారవంతంగా ఉండేందుకు దోహద పడే సూక్ష్మ జీవులు వృద్ధి చెంది నత్రజని స్థిరీకరణ జరిగి మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెరిగి భూసారాన్ని మరింత పెంచుతాయి. చౌడు సమస్యను నివారించడంతో పాటు నేల నుంచి వచ్చే తెగుళ్లను సైతం ఈ పైర్లు అరికడతాయి. నవ ధాన్యాలు సాగు చేసి దున్నిన భూమిలో పండించిన ధాన్యంలో పోషకాల విలువలు పెరిగినట్టు శాస్త్రవేత్తల పరిశోధనలో నిర్ధారించారు. నవ ధాన్యాల సాగునవ ధాన్యాలు అంటే నవగ్రహాల పూజలకు వాడే ధాన్యాలుగానే చాలామందికి తెలుసు. కేవలం దైవ పూజలకు మాత్రమే వాడే నవ ధాన్యాలు ఇప్పుడు రైతుకు వరంగా మారాయి. గోధుమలు, వరి, కందులు, పెసలు, మినుములు, శనగలు, బొబ్బర్లు, నువ్వులు, ఉలవలు వంటి తొమ్మిది రకాల నవ ధాన్యాలు ఇప్పుడు భూసార పెంపులో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. వీటితో పాటు మరో 22 రకాల ధాన్యం రకాల విత్తనాలను ప్రభుత్వం రైతులకు పంపిణీ చేస్తోంది.పశువుల ఎరువు, వర్మీకంపోస్టు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు తదితర సహజంగా లభించే ఎరువులు సామాన్య రైతుకు లభ్యం కావడం భారంగా మారింది. వాటి స్థానంలో ప్రతీ రైతుకు అందుబాటులో ఉండే సహజ సిద్ధ ఎరువుల తయారీకి నవ ధాన్యాల సాగు ఒక వరంగా మారింది. జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చి రొట్ట సాగుతో పాటు నవ ధాన్యాల సాగుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తొమ్మిది రకాల ధాన్యాలను రబీకి చివరిలో జల్లుకుని కోతలు పూర్తయ్యాక వాటిని కలియదున్నడం ద్వారా భూసారాన్ని పెంచుకోవచ్చు. ఈ విషయంలో అధికారుల సూచనలు, సలహాలతో రైతులు నవ ధాన్యాల సాగు చేపట్టారు.కాకినాడ జిల్లాలో నవ ధాన్యాల సాగు లక్ష్యం– 53,253 ఎకరాలుసాగు చేయడానికి నిర్ణయించిన రైతుల సంఖ్య– 49,895 ఇప్పటి వరకు సాగయిన భూములు – 26,846 ఎకరాలువిత్తనాలు తీసుకున్న రైతులు – 26,680 మందిపంపిణీ చేసిన విత్తనాలు – 26 టన్నులుసాగు చేసిన రైతులు – 26,564 మంది పంపిణీ చేస్తున్న విత్తనాలు – 31 రకాలుమంచి ఫలితాలు కనిపిస్తున్నాయిగత ఏడాది అధికారులు ఇచ్చిన విత్తనాలు చల్లి కలియ దున్నడం వల్ల చాలా వరకు ఎరువుల వాడకం తగ్గింది. పూర్వం పశువుల పెంటతో పాటు పచ్చిరొట్ట ఎరువులు వాడే వారు. రానురాను వాటిని మానేసి రసాయనిక ఎరువులు వాడడం ప్రారంభించాక పెట్టుబడులు పెరిగిపోయాయి. మళ్లీ ఇప్పుడు నవధాన్యాలు నాటి దున్నడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయంలో ప్రభుత్వం రైతులకు మంచి అవకాశాలు కల్పిస్తోంది.నవ ధాన్యాల సాగు రైతులకు చాలా మంచిది. వీటి వల్ల పెట్టుబడులు తగ్గడంతో పాటు రసాయనిక ఎరువులు లేని పంటలు అందుబాటులోకి వస్తాయి. నేను రెండు ఎకరాల్లో నవ ధాన్యాల సాగు చేశాను. ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు ఇవ్వడంతో పాటు ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఇవి సాగు చేయడం వల్ల భూమి సారవంతం కావడంతో ఎరువులు పెద్దగా వేయాల్సిన అవసరం లేకుండా తక్కువ పెట్టుబడితో నాణ్యత గల పంటలు వస్తున్నాయి. – వారణాశి కామేశ్వరశర్మ, నర్శింగపురం, పిఠాపురం మండలంజిల్లాలో 53 వేల ఎకరాల్లో నవ ధాన్యాల సాగు లక్ష్యంజిల్లాలో ఈ ఏడాది సుమారు 53 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ శాఖ ద్వారా నవ ధాన్యాల సాగుకు లక్ష్యంగా నిర్ణయించాం. ఇప్పటికే 26 టన్నుల విత్తనాలు పంపిణీ చేయగా 26 వేల మంది రైతులు తమ పొలాల్లో 25 వేల ఎకరాల్లో విత్తనాలు వేసుకుని నవ ధాన్యాల సాగు చేపట్టారు. రబీ పంట చివరిలో నవ ధాన్యాలను చల్లి మొక్కలు ఏపుగా పెరిగిన తరువాత ఖరీఫ్కు ముందు కలియ దున్నడం వల్ల భూముల్లో పోషక విలువలు వృద్ధి చెంది భూసారం పెరుగుతుంది. తద్వారా రసాయనిక ఎరువుల వాడకం తగ్గడంతో పాటు తక్కువ పెట్టుబడితో నాణ్యమైన పంటలు పండించగలుగుతారు.ఇలా నాలుగు సంవత్సరాలు నవ ధాన్యాలు సాగు చేసి దున్నడం వల్ల భూసారం సహజ సిద్ధంగా పెరిగి రసాయనిక ఎరువుల అవసరం లేకుండా పంటలు పండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే అన్ని గ్రామాల్లోను రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా చైతన్యం తీసుకువచ్చాం. ప్రభుత్వం విత్తనాల పంపిణీ చేస్తుండడంతో రైతుల ముందుకు వస్తున్నారు. త్వరలోనే లక్ష్యం పూర్తి చేస్తాం. ఎకరానికి 10 కేజీల చొప్పున విత్తనాలు రైతులకు పంపిణీ చేస్తున్నాం. – ఎలియాజరు, జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారి, కాకినాడ -
వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు అభ్యర్థికి త్రుటిలో తప్పిన ప్రమాదం
పిఠాపురం/ఏలేశ్వరం: కాకినాడ జిల్లా పిఠాపురం రాపర్తి సెంటర్ వద్ద 216 జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. బెండపూడి నుంచి వస్తున్న ఒక కారు రాపర్తి సెంటర్ వద్దకు వచ్చేసరికి గేదెలు అడ్డంగా వచ్చాయి. దీంతో ఆ కారు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న వరుపుల సుబ్బారావు కారు ముందున్న కారును బలంగా ఢీకొంది. రెండు కార్లూ దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన వెంటనే వరుపుల సుబ్బారావు ఉన్న కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నాయి. దీంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. అనంతరం సుబ్బారావు మరో కారులో కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి నుంచి స్వగ్రామమైన ఏలేశ్వరం మండలం, లింగంపర్తి చేరుకున్నారు. కాగా, ఈ ప్రమాదంలో ముందున్న కారులో ఉన్న వారికి కూడా ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు చెప్పారు. -
సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి రూ.10 లక్షల విరాళం
అన్నవరం: సత్యదేవుని నిత్యాన్నదాన పఽథకానికి విజయవాడ, కరెన్సీనగర్కు చెందిన కేతినేని రత్నాకరరావు, లక్ష్మీ శమంతకమణి దంపతులు రూ.పది లక్షల విరాళాన్ని బుధవారం సమర్పించారు. ఆ మేరకు దేవస్థానం ఈఓ కె. రామచంద్రమోహన్కు విరాళం లేఖతో బాటు చెక్కును పోస్టు ద్వారా పంపించారని అధికారులు తెలిపారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా ఫిబ్రవరి ఏడో తేదీన నెక్కింటి ధర్మరాజు, సరస్వతమ్మ దంపతుల పేర్ల మీద అన్నదానం చేయాలని కోరినట్టు అధికారులు తెలిపారు. ప్రశాంతంగా ఈఏపీ సెట్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లాలో ఏర్పాటు చేసిన మూడు కేంద్రాలలో ఏపీఈఏపీ సెట్ బుధవారం ప్రశాంతంగా జరిగింది. ఈ ఆన్లైన్ పరీక్షకు ఉదయం పరీక్షకు 887 మంది హాజరుకాగా 40మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 913 మంది హాజరుకాగా 21మంది గైర్హాజరయ్యారని సెట్ కన్వీనర్ వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 28,203 హాజరుకాగా 1,970 మంది రాయలేదని వివరించారు. నేటితో ముగియనున్న పరీక్షలు ఏపీ ఈఏపీ సెట్ 8వ రోజులో భాగంగా గురువారం ఉదయం సెషన్తో ముగుస్తున్నట్లు సెట్ చైర్మన్ జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుంచి అగ్రికల్చరల్, ఫార్మశీ, ఇంజినీరింగ్ విభాగాల ప్రవేశాలకు సంబంధించి అన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించామని, పరీక్షలు అన్ని కేంద్రాలలో ప్రశాంతంగా నిర్వహించామని తెలియజేశారు. ప్రభుత్వం దృష్టికి ఆసుపత్రుల సమస్యలు కాకినాడ సిటీ: జిల్లాలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ప్రైవేట్ ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానిని, ప్రజలకు సేవలను యథావిధిగా కొనసాగించాలని కలెక్టర్ జె నివాస్ కోరారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా కలెక్టర్ నివాస్ జిల్లాలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆరోగ్య సేవలు అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తమకు బిల్లుల చెల్లింపు పెండింగ్లో పడినందున ఆర్థిక భారం కారణంగా ఆరోగ్య శ్రీ పథకం కింద సేవలు నిలిపివేయాలని ప్రైవేట్ ఆసుపత్రులు నిర్ణయించిన నేపథ్యంలో ఆయన ఈ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద సమారు 3,250 చికిత్సలను పేదలకు ఉచితంగా అందిస్తూ సాలినా రూ.3 వేల కోట్లు వెచ్చిస్తూ దేశంలోనే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. ఈ కృషిలో ప్రైవేటు నెట్ ఆసుపత్రులు కీలక భూమిక వహిస్తున్నాయని అభినందించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన ప్యాకేజీ చెల్లింపులను ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు అందిస్తోందన్నారు. బిల్లుల సత్వర చెల్లింపులకు ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఇప్పటికే ఇంటెర్మ్ చెల్లింపు జారీ చేసిందన్నారు. ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ పి.రాధాకృష్ణ, డీఎంఅండ్హెచ్వో డాక్టర్ జె.నరసింహనాయక్, ఐఎంఎ ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రజా తీర్పును శిరసా వహించాలి
కాకినాడ క్రైం: కౌంటింగ్ వేళ నడచుకోవలసిన తీరును వివరించడానికి జిల్లా ఎస్పీ సతీష్కుమార్ వివిధ పార్టీల నేతలతో కాకినాడలోని సూర్యకళామందిర్లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 4వ తేదీన జరగాల్నిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం అన్ని వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో సున్నితమైన అంశాల పట్ల నేతలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. గెలుపు ఎవరిది అయినా ప్రజాతీర్పును శిరసావహించాలని కోరారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో గుంపులుగా తిరగడం, ర్యాలీలు నిర్వహించడం, బాణసంచా, తీన్మార్లతో భారీ శబ్దాలు చేస్తూ విజయోత్సవాలు నిర్వహించడం నిషేధమన్నారు. ఎదుటి వర్గాలను రెచ్చగొట్టే చర్యలు, వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యకర్తలు, అభిమానులు చట్టబద్ధంగా వ్యవహరించే బాధ్యతను నాయకులు తీసుకోవాలన్నారు. జూన్ 4నే కౌంటింగ్ ముగిసినా కోడ్ అమలుతో పాటు సెక్షన్ 144, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ జూన్ 6వ తేదీ వరకు అమలులో ఉంటాయని అన్నారు. కౌంటింగ్ రోజున అనవసరంగా రోడ్లపై సంచరించడంపై నియంత్రణ ఉందన్నారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కేసులను ఎన్నికల కమిషన్ ద్వారా నియమితమైన ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తాయని వెల్లడించారు. ప్రజలు సంయమనంతో మెలగాలని ఎన్నికల వేళ తలెత్తే అలజడులు కేవలం తాత్కాలికమని, వీటి కోసం స్నేహాల్ని, బంధుత్వాలను విచ్ఛిన్నం చేసుకోవద్దని హితవు పలికారు. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల నేతలతో పాటు అనుచరులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలు సెక్షన్ 144, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా.. వివిధ పార్టీ నేతలు, అనుచరులతో ఎస్పీ సతీష్కుమార్ -
ఖరీఫ్ సాగు లక్ష్యం 97,543 హెక్టార్లు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లావ్యాప్తంగా రానున్న ఖరీఫ్లో 97,543 హెక్లార్లలో వివిధ పంటలు సాగు చేయాలనేది లక్ష్యమని జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.విజయ్ కుమార్ తెలిపారు. ఖరీఫ్ ప్రణాళికపై కాకినాడ కృషి భవన్లో మంగళవారం జరిగిన ఒక రోజు శిక్షణలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ పంట కాలంలో రైతులకు మరింత మేలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ఈ శిక్షణ ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా పలు వ్యవసాయ సబ్ డివిజన్లలో నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారులు వివరించారు. మార్టేరు వ్యవసాయ పరిశోధన సంస్థ, పెద్దాపురం డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ఖరీఫ్లో ఏయే పంటలు సాగు చేయాలి, ఆయా పంటల సాగులో తీసుకోవలసిన మెళకువలు, ఎరువుల యాజమాన్యంపై వివరించారు. అనంతరం ప్రత్తిపాడు, కాకినాడ, కరప సబ్ డివిజన్ అధికారులు సేంద్రియ వ్యవసాయం, పొలంబడి, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల చట్టాలపై వ్యవసాయ శాఖ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో రైతు శిక్షణ కేంద్రం డీడీ బీవీఎస్సీ హరి, ఆత్మ పీడీ జ్యోతిర్మయి పాల్గొన్నారు. హింసకు తావు లేదు.. ఆ ప్రచారంలో నిజం లేదు కాకినాడ క్రైం: ఓట్ల లెక్కింపు వేళ కాకినాడ, పిఠాపురాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ వెల్లడించిందన్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హింసకు ఏ మాత్రం తావు లేదని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు, సాయుధ దళాల భద్రత కట్టుదిట్టంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. శాంతిభద్రతల విఘాతానికి పాల్పడే అవకాశం ఉన్న పలువురిని ఇప్పటికే బైండోవర్ చేసి, ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. తాము తీసుకుంటున్న చర్యల ఆధారంగా కౌంటింగ్ రోజున అవాంఛనీయ సంఘటనలకు ఏమాత్రం ఆస్కారం లేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిని ఐటీ ప్రత్యేక బృందం గుర్తిస్తుందని తెలిపారు. ప్రజలను భయాందోళనలకు గురి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈఏపీ సెట్కు 97.43 శాతం హాజరు బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): జిల్లాలో ఏర్పాటు చేసిన మూడు కేంద్రాల్లో ఏపీ ఈఏపీ సెట్ మంగళవారం ప్రశాంతంగా జరిగింది. ఈ ఆన్లైన్ పరీక్షకు ఉదయం 581 మంది హాజరు కాగా 16 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 897 మంది హాజరు కాగా 23 మంది గైర్హాజరయ్యారని సెట్ కన్వీనర్ వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 28,087 హాజరు కాగా 1,817 మంది పరీక్ష రాయలేదని వివరించారు. -
కానుకలో 8 రకాల వస్తువులు
రెండు మూడు రోజుల్లో.. ఇండెంట్ పెట్టిన అన్ని వస్తువులూ రెండు మూడు రోజుల్లో జిల్లాకు చేరనున్నాయి. అన్ని వస్తువులనూ మండల కేంద్రాల్లో క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత కిట్గా తయారు చేసి, పాఠశాలలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలు తెరిచే నాటికి వీటిని పంపిణీ చేసేలా శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇప్పటికే పాఠ్య, నోట్ పుస్తకాలు అన్ని రకాల వచ్చాయి. మిగిలినవి రెండు మూడు రోజుల్లో వస్తాయి. – చామంతి నాగేశ్వరరావు, సీఎంఓ, సమగ్ర శిక్ష అభియాన్ బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): పాఠశాలలు పునఃప్రారంభించే సమయానికి ప్రతి విద్యార్థి చేతిలో పాఠ్య పుస్తకం ఉంచేందుకు పాఠశాల విద్యాశాఖ మార్చి నుంచే చర్యలు ప్రారంభించింది. పాఠ్య పుస్తకాల పంపిణీలో ఎటువంటి పొరపాట్లకూ తావు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు దఫాలుగా జగనన్న విద్యా కానుకను విజయవంతంగా, నాణ్యతతో విద్యార్థులకు అందజేశారు. అదే ఒరవడిలో పాఠశాల ప్రారంభం రోజునే పాఠ్య, నోట్ పుస్తకాలతో పాటు యూనిఫాం, బెల్టులు, బూట్లు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, బ్యాగ్తో కూడిన విద్యాకానుక కిట్లు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విద్యా శాఖ అడుగులు వేస్తోంది. ఇప్పటికే జిల్లాలో గుర్తించిన స్టాక్ పాయింట్లలో జగనన్న విద్యాకానుక వస్తువులను నిల్వ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కొత్తగా అడ్మిషన్లు పొందిన వారికి సైతం తొలి రోజే కానుక పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ముద్రణ, సరఫరా ప్రారంభించారు. పాఠ్య, నోట్ పుస్తకాలను ఏప్రిల్లోనే జిల్లా గోదాముకు చేర్చడం ప్రారంభించారు. ఒకటి నుంచి పదో తరగతి వరకూ ప్రతి పాఠ్య పుస్తకం కవర్ పేజీలో మార్పులు చేసి, విద్యార్థిని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. పాఠ్య పుస్తకంలో క్యూఆర్ కోడ్ కూడా ముద్రించారు. దీని ద్వారా పాఠ్యాంశానికి సంబంధించిన అదనపు సమాచారం పొందవచ్చు. 111 టైటిల్స్ పాఠ్య పుస్తకాలు పుస్తకాల బరువుతో విద్యార్థుల వెన్నెముకపై భారం పడకుండా ఉండేందుకు దశల వారీగా సెమిస్టర్ విధానాన్ని అమలు చేశారు. గత విద్యా సంవత్సరంలో 1 నుంచి 9వ తరగతి వరకూ ఈ విధానం అమలు చేయగా, ఈ ఏడాది పదో తరగతికి కూడా అమలు చేశారు. గణితం, సైన్స్ సబ్జెక్టులను రెండు సెమిస్టర్లుగా విడదీశారు. సిలబస్ మొత్తాన్ని జూన్ నుంచి అక్టోబర్ వరకూ సెమిస్టర్–1, నవంబర్ నుంచి మార్చి వరకు సెమిస్టర్–2గా విభజించారు. 1 నుంచి 10 తరగతుల పాఠ్య పుస్తకాలను బైలింగ్వల్ విధానంలో ముద్రించారు. ఒక పేజీలో ఇంగ్లిషు, మరో పేజీలో తెలుగులో పాఠ్యాంశాన్ని ముద్రించి ఇవ్వడం వల్ల విద్యార్థులు సులువుగా అర్థం చేసుకుని చదువుకునే వీలుంటుంది. 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు 111 టైటిల్స్ పాఠ్య పుస్తకాలు సరఫరా చేస్తున్నారు. రెండు విధాలుగా.. గత విద్యా సంవత్సరం వరకూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ధవళేశ్వరంలో ఉన్న పుస్తకాల గోదాముకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ప్రింటింగ్ ప్రెస్ల ద్వారా పాఠ్య పుస్తకాలు సరఫరా చేసేవారు. అక్కడి నుంచి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలకూ పంపిణీ చేసేవారు. అయితే ఈసారి పాఠ్య పుస్తకాలను రెండు విధాలుగా సరఫరా చేస్తున్నారు. 1 నుంచి 7 తరగతులకు నేరుగా పాఠ్య పుస్తకాలు, వర్క్బుక్లను పుస్తక గోదాము నుంచి మండల స్టాక్ పాయింట్లకు పంపిస్తున్నారు. 8 నుంచి 10 తరగతులకు ప్రభుత్వ అనుమతి పొందిన ప్రింటింగ్ ప్రెస్ల నుంచి నేరుగా మండల స్టాక్ పాయింట్లకు సరఫరా చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 21 మండల కేంద్రాల్లో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 1 నుంచి 7 తరగతులకు సంబంధించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు 14,97,436 పుస్తకాలు సరఫరా కావాల్సి ఉండగా, 6,54,000 సరఫరా అయ్యాయి. అక్కడి నుంచి ఆర్టీసీ కార్గో సర్వీసు ద్వారా మండల స్టాక్ పాయింట్లకు సరఫరా కావాల్సి ఉంది. ఇదిలా ఉండగా మండల స్టాక్ పాయింట్లకు 8 నుంచి 10 తరగతుల పాఠ్య పుస్తకాల సరఫరా ప్రారంభమైంది. ఫ రెడీ అవుతున్న జగనన్న విద్యా కానుక ఫ ఇప్పటికే జిల్లాకు చేరిన 9,45,652 నోట్ పుస్తకాలు ఫ 30 శాతం వరకూ వచ్చిన పాఠ్య పుస్తకాలు ఫ ఒకటి రెండు రోజుల్లో మిగిలిన వస్తువుల రాక ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ పొందే విద్యార్థి చదువుకు అవసరమయ్యే అన్ని రకాల సామగ్రినీ ఉచితంగా అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. విద్యార్థులకు అందిస్తున్న జగనన్న విద్యా కానుక కిట్లో 8 రకాల వస్తువులు ఉంటాయి. మూడు జతల యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, ఇంగ్లిష్ డిక్షనరీ, ఒక బెల్ట్, బూట్లు, రెండు జత సాక్స్ బ్యాగ్లో పెట్టి విద్యార్థులందరికీ అందించనున్నారు. జిల్లాకు సంబంధించి 9,45,652 నోట్ పుస్తకాలకు ఇండెంట్ పెట్టగా 100 శాతం జిల్లాకు చేరుకున్నాయి. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు 6,50,366 పాఠ్య పుస్తకాలకు ఇండెంట్ పెట్టగా వీటిలో 30 శాతం ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. బెల్టులు 90,896, బూట్లు 1,38,074, బ్యాగులు 1,38,074, యూనిఫాం 1,38,074, వర్క్స్ బుక్స్ 1,80,300, డిక్షనరీలు 6,820, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు 15,983 త్వరలో రానున్నాయి. కానుకలోని అన్ని వస్తువులనూ మండల కేంద్రాల్లో ఒకచోట ఉంచి, నాణ్యతను ముందుగానే తనిఖీ చేసి, బ్యాగుల్లో పెట్టి కిట్ రూపంలో సిద్ధం చేయడానికి సీఆర్పీలను వినియోగిస్తున్నారు. ఈ విధులు నిర్వహించే వారికి అదనపు రుసుం చెల్లించనున్నారు. -
భద్రత వెరీ స్ట్రాంగ్
నిత్యం స్ట్రాంగ్ రూముల పరిశీలన జిల్లాలోని కాకినాడ లోక్సభ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామగ్రిని కాకినాడ జేఎన్టీయూలో భద్రపరచిన విషయం తెలిసిందే. ఈ స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ సతీష్ కుమార్ నిత్యం ఆయా రిటర్నింగ్ అధికారులతో కలసి సందర్శిస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు శాంతిభద్రతల పరిరక్షణలో అధికార యంత్రాంగానికి ప్రజలు సహకారం అందించాలని వారు కోరుతున్నారు. స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని, వారి వాహనాలను సైతం సీజ్ చేస్తామని హెచ్చరించారు. కాకినాడ సిటీ: పోలింగ్ ముగిసి పది రోజులైంది. కౌంటింగ్కు మరో 13 రోజుల సమయం ఉంది. ఆ క్షణాలు దగ్గరవుతున్నకొద్దీ సర్వత్రా ఉత్కంఠ నెలకొంటోంది. ఈ క్రమంలో జిల్లాలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు ముందస్తుగా పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు. వచ్చే నెల 1న ఎగ్జిట్ పోల్స్, 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకూ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందు గానీ, తరువాత గానీ గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, స్టేజ్ ప్రోగ్రాంలకు ఎటువంటి అనుమతులూ లేవని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రజలను రెచ్చగొట్టేలా రాజకీయ నాయకులు సందేశాలు ఇవ్వడం, నిరాధార ఆరోపణలు చేయడం, రచ్చబండ చర్చలు, సోషల్ మీడియాల్లో ప్రచారం వంటి వాటిని నేరంగా పరిగణిస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు. పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో పోలింగ్ అనంతరం హింస చెలరేగిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ముందు జాగ్రత్త చర్యగా పెట్రోలు బంకుల్లో లూజుగా పెట్రోలు, డీజిల్ అమ్మకాలను తాత్కాలికంగా నిషేధించారు. బాణసంచా విక్రయాలపై ఆంక్షలు విధించారు. ధాబాలు, హోటళ్లు, పాన్షాప్లలో అక్రమ మద్యం, సారా అమ్మకాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. జూదం, కోడిపందాలు, కాయిన్ గేమ్, బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సారా, మద్యం అక్రమ రవాణా జరగకుండా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. లాడ్జీలు, సత్రాలు, కల్యాణ మండపాల వంటి చోట్ల అపరిచిత, అనుమానిత వ్యక్తులను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు, ఆర్మ్డ్ రిజర్వు, సివిల్ పోలీసులతో భద్రత కల్పించారు. దీంతో పాటు సీసీ కెమెరాలతో 24 గంటలూ నిఘా పెట్టి, పర్యవేక్షిస్తున్నారు. గ్రామాల్లో సమావేశాలు ఇన్స్పెక్టర్లు, ఎస్హెచ్ఓ స్థాయి పోలీసు అధికారులు గ్రామాల్లో ఆయా రాజకీయ పార్టీల నేతలు, వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ రోజున ఫలితాలు వెల్లడించే సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) ఉల్లంఘనకు పాల్పడితే తీసుకునే కఠిన చర్యలను వివరిస్తున్నారు. గ్రామాల్లో పోలీసు పికెట్లు, పెట్రోలింగ్ చెక్పోస్టులను ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేస్తున్నారు. అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించే వారు, ప్రజలను ఇబ్బంది పెట్టే వారిని గుర్తించి, ముందస్తుగా బైండోవర్ చేస్తున్నారు. గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్లు, అనుమానాస్పద గ్రామాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు చేపడుతున్నారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పాత నేరస్తులు, రౌడీ షీటర్ల కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వారికి పోలీస్ స్టేషన్ల వద్ద ముందస్తుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. వారిలో ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని, జిల్లా నుంచి బహిష్కరిస్తామని ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఇప్పటికే హెచ్చరించారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికలు, 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో నేరాలకు, తగాదాలకు పాల్పడిన వారిపై నిఘా ఉంచారు. అభ్యర్థుల గెలుపు, ఓటములపై బెట్టింగ్లు నిర్వహించేవారు, పాల్గొనే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారు.ఫ జూన్ 4న ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పోలీసుల అప్రమత్తం ఫ జిల్లాలో 24 గంటలూ నిఘా ఫ గ్రామాల్లో గొడవలు జరగకుండా 144 సెక్షన్ ఫ రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక దృష్టి
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
- బిస్కెట్ ప్యాకెట్ల బరువు తగ్గింది.. భారీ జరిమానా పడింది!
- సినిమాలకు దూరం : కానీ ఈ స్టార్కిడ్ నెట్వర్త్ తెలిస్తే ఆశ్చర్యపోతారు
- సన్రైజర్స్ కాదు..ఐపీఎల్ టైటిల్ కేకేఆర్దే: ఆసీస్ లెజెండ్
- మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!
- Mangalagiri: రెండోసారి ఓటమికి సిద్ధమైన లోకేష్!
- డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ
- హార్దిక్ పాండ్యా విడాకులు?.. భరణం కింద ఏకంగా అంత మొత్తమా?
- చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
- TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
Advertisement