-
AP: ఆరోగ్యశ్రీ ఆగలేదు.. అయినా అసత్య ప్రచారమే!
సాక్షి, విజయవాడ: ఏపీ వ్యాప్తంగా డా.వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగుతున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయినా కూడా నిలిచిపోయాయంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ఇస్తోంది. రెండు రోజుల క్రితం నెట్ వర్క్ ఆసుపత్రులకి 200 కోట్ల బకాయిలు విడుదల చేసింది. మిగిలిన బకాయిల విడుదలపై ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి, వైద్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సిఈవో లక్ష్మీ షాతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే.. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.3566 కోట్లు చెల్లించింది. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో నెట్ వర్క్ ఆసుపత్రులకు తొలి రెండు నెలలలో రూ.366 కోట్ల చెల్లింపులు చేసింది. ఇక ఏడాది కాలంగా రోజుకి సరాసరిన 5349 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు జరిగాయి. మొన్న(మే 22, బుధవారం) 6718 మందికి.. నిన్నన(మే 23, గురువారం) 7118 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు అందాయి. ఈ విషయాన్ని ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మీ షా తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలిగించవద్దన్న పిలుపుకి నెట్ వర్క్ ఆసుపత్రులు సహకరిస్తున్నాయని ఆయన వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలలోనూ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయని.. ఆరోగ్యశ్రీ సేవలకు ఎక్కడా అంతరాయం లేదని లక్ష్మీషా స్పష్టం చేశారు. -
ఐఎఫ్ఎస్కు రంగన్నగూడెం యువకుడు
హనుమాన్జంక్షన్ రూరల్: యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్–2023లో బాపులపాడు మండలం రంగన్నగూడెంకు చెందిన యువకుడు తుమ్మల కృష్ణ చైతన్య జాతీయ స్థాయిలో 74వ ర్యాంకు సాధించాడు. కృష్ణ చైతన్య తండ్రి వీర రాజారావు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉద్యోగి కాగా, తల్లి గృహిణి. ప్రాథమిక స్థాయి నుంచి మెరిట్ విద్యార్థిగా ఉన్న కృష్ణ చైతన్య 2008లో పదో తరగతి పరీక్షల్లో 528 మార్కులు, 2010లో ఇంటర్మీడియెట్ పరీక్షల్లో 937 మార్కులు సాధించి, ఆ తర్వాత ఎంసెట్లో అత్యుత్తమ ర్యాంకుతో జేఎన్టీయూ అనంతపురం క్యాంపస్లో సీటు సాధించాడు. కెమికల్ ఇంజినీరింగ్లో పట్టభద్రుడైన కృష్ణ చైతన్య చిన్నతనం నుంచి సివిల్ సర్వీసెస్పై ఉన్న మక్కువతో ప్రిపరేషన్ మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే 2018లో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్–2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన కృష్ణ చైతన్య ప్రస్తుతం ఏపీ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్–2023కు దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులు హాజరు కాగా, వివిధ దశల్లో యూపీఎస్సీ ఎంపిక చేసిన 150 మందిలో తుమ్మల కృష్ణ చైతన్య 74వ ర్యాంకు సాధించటం విశేషం. ఐఎఫ్ఎస్కు ఎంపిక అయినప్పటికీ సివిల్ సర్వీసెస్ సాధించాలనే పట్టుదలతో కృషి చేస్తున్నట్లుగా కృష్ణ చైతన్య చెప్పారు. ఐఎఫ్ఎస్కు ఎంపికై న తుమ్మల కృష్ణ చైతన్యను గ్రామానికి చెందిన ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, సర్పంచ్ కసుకుర్తి రంగామణి, ఎంపీటీసీ సభ్యుడు పుసులూరి లక్ష్మీనారాయణ, పీఏసీఎస్ మాజీ చైర్మన్ తుమ్మల దశరథరామయ్య అభినందించారు. -
కమనీయం.. నరసింహుని కల్యాణం
జగ్గయ్యపేట అర్బన్: నరసింహుని కల్యాణోత్సవం నయనానందకరంగా సాగింది. వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ వందలాది భక్తుల సమక్షంలో కల్యాణ వేడుక అంబరాన్నంటింది. వేదాద్రిలో వేంచేసియున్న యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి తిరుకల్యాణ మహోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి 12 గంటలకు నరసింహ స్వామి వారి కల్యాణం నిర్వహించారు. మేళతాళాలతో, భక్తుల జయజయధ్వానాల నడుమ స్వామి వారి ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకులు పరాంకుశం వాసుదేవాచార్యులు, యోగానందాచార్యులు, శ్రీధరాచార్యులు పర్యవేక్షణలో వేద పండితులు, అర్చకుల వేద మంత్రోచ్ఛరణలతో స్వామి వారి కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కల్యాణార్థం స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహించినట్లు వేద పండితులు తెలిపారు. సుమనోహర దృశ్యం.. కృష్ణా నది ఒడ్డున ఆలయం ఉండటంతో పండు వెన్నెల్లో భక్తుల హర్షధ్వానాల మధ్య దాదాపు రెండు గంటల పాటు స్వామి వారి కల్యాణం నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్వకర్త వెలగపూడి ఇందిరా దత్ ఆలయ సంప్రదాయం ప్రకారం పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆలయ ఈఓ హేమలతాదేవి పర్యవేక్షణలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. అదే విధంగా బాలాత్రిపుర సుందరీ అమ్మవారి ట్రస్ట్, కేసీపీ, హేమాద్రి, రామ్కో సిమెంట్స్, ఆధ్వర్యంలో భక్తులకు తాగునీరు, మధ్యాహ్నం అన్నదానం ప్రసాదాలు పంపిణీ చేశారు. సీఐ జానకీరామ్ పర్యవేక్షణలో మూడు మండలాల ఎస్ఐలు పాల్గొని పోలీస్ బందోబస్తు నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సతీమణి విమలాభాను పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
27న ఓట్ల లెక్కింపుపై శిక్షణ..
ఈనెల 27వ తేదీన ఓట్ల లెక్కింపుపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. నోవా, నిమ్రా కళాశాలలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన పార్లమెంట్, అసెంబ్లీ ఓట్ల లెక్కింపునకు కౌంటింగ్ హాల్స్లో పార్లమెంట్, అసెంబ్లీకి వేర్వేరుగా 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాయింట్ కలెక్టర్, మైలవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి. సంపత్ కుమార్, డీఆర్వో వి. శ్రీనివాసరావు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి, డీఆర్డీఏ పీడీ కె. శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
No Headline
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది తొలి విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు తెలిపారు. గురువారం కలెక్టరేట్ చాంబర్లో జూన్ 4వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపులో పాల్గొనే కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విజయవాడ పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నామన్నారు. కౌంటింగ్ ప్రక్రియకు 403 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, 504 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 364 మంది మైక్రో అబ్జర్వర్లు మొత్తంగా 1271 మంది కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ను ఎన్ఐసీ సాఫ్ట్వేర్ ఉపయోగించి పారదర్శకంగా ఆన్లైన్లో పూర్తిచేశామని వివరించారు. జేసీ పి. సంపత్ కుమార్, డీఆర్వో వి. శ్రీనివాసరావు, ఎన్ఐసీ డీఐఓ రేవతి, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ ఎం. దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. అమరేశ్వరుని సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అమరావతి: అమరావతిలోని బాలచాముండికా సమేత అమరేశ్వరుడిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.టి రవికుమార్ గురువారం దర్శించుకున్నారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరి అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి రవికుమార్ దంపతులకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి శేషవస్త్రంతోపాటు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక న్యాయమూర్తులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ
గుడివాడటౌన్: ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో తమ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి పతకాలు సాధించినట్లు ఎన్టీఆర్ స్టేడియం మేనేజర్ ఎం. సత్యనారాయణ గురువారం తెలిపారు. ఈనెల 20వ తేదీ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగిన ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి పోటీలలో తమ క్రీడాకారులు ఎం.కుమార్ రాజా 59 కిలోల విబాగంలో 367.5 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం సాధించాడు. అలాగే కె.వరుణ్ రుత్విక్ 66 కిలోల విభాగంలో 208 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం, వి. రాజా 59 కిలోల విభాగంలో 310 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం, ఎం. సాయి 85 కిలోల విభాగంలో 310 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం అందుకున్నాడు. వి. భగత్ బాలాజి 74 కిలోల విబాగంలో 365 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం, ఎం. అజయ్దేవాన్ 83 కిలోల విభాగంలో 435కిలోల బరువును ఎత్తి బంగారు పతకం, వి. లక్ష్మణ్బాబు 105 కిలోల విభాగంలో 475 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం, నక్కా వీరనాగు అను 47 కిలోల విభాగంలో 210 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం, పి. స్వాతిశ్రీ 84 కిలోల విభాగంలో 197.5 కిలోల బరువును ఎత్తి బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా క్రీడాకారులతో పాటు జిమ్ కోచ్ మారెళ్ల వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ కోచ్ జంపా ఉషాకుమారిలను స్టేడియం యాజమాన్యం అభినందించింది. -
మీ అనుమతితో మీకే టోపీ!
విజయవాడ స్పోర్ట్స్: విజయవాడ లబ్బీపేటకు చెందిన 16 ఏళ్ల కుర్రాడికి ఆన్లైన్ గేమ్స్ ఆడడం హాబీ.. వారం రోజులుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఫోన్ చేసిన వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్లో పాల్గొనాలని, లోన్ యాప్స్లో డబ్బులు ఇస్తామని, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని.. ఇలా పలు ఆకర్షణలతో వంచించడానికి ప్రయత్నించారు. తెలివిగా ఆలోచించి, తనకు ఈ ఫేక్ కాల్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయా? అని ఆరా తీశాడు. దాదాపు 15 యాప్స్ వరకు తనకు తెలియకుండానే తన మొబైల్లో ఇన్స్టాలై ఉన్నాయి. ఈ యాప్స్ ఇన్స్టాల్ సమయంలో తానిచ్చిన పర్మిషన్స్తోనే ఫోన్లోని కాల్ డేటా, కాంటాక్ట్ లిస్ట్, కెమెరా యాక్సెస్, లొకేషన్ పూర్తిగా యాప్ నిర్వాహకుల చేతిలోకి వెళ్లిపోయిందని, యాప్ నిర్వాహకులు.. మొబైల్లో నిక్షిప్తమైన వివరాలను పలు కంపెనీలకు విక్రయించారని పోలీసుల ద్వారా తెలుసుకుని కంగుతిన్నాడు. సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లకుండా ముందుగానే తేరుకుని ఫోన్లో అవసరం లేని యాప్స్ను వెంటనే అన్ఇన్స్టాల్ చేశాడు. అప్రమత్తంగా లేకుంటే సమస్యలే.. మొబైల్ అప్లికేషన్స్కు ఇచ్చే అనుమతుల విషయంలో అప్రమత్తంగా లేకుంటే చాలా ఇబ్బందులు తలెత్తుతాయని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. యాప్స్కు పర్మిషన్స్ (లొకేషన్, కాల్ డేటా, కాంటాక్ట్స్, గ్యాలరీ, మైక్రోఫోన్, కెమెరా) ఇవ్వడం ఇబ్బందులను కొని తెచ్చుకోవడమేనని.. వ్యక్తిగత సమాచారాన్ని నేరగాళ్లు, సంఘ విద్రోహ శక్తులు, స్వార్థ పరులకు ఇస్తున్న విషయాన్ని గుర్తించాలని హెచ్చరిస్తున్నారు. కెమెరా, మైక్రో ఫోన్ పర్మిషన్ అన్నింటికంటే ప్రమాదకరమని పోలీసులు చెబుతున్నారు. లోన్ యాప్స్ సృష్టించిన విధ్వంసం ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. ఆర్బీఐ గుర్తింపు లేని 150కి పైగా లోన్ యాప్స్ చేసిన మోసానికి, తెగబడిన బెదిరింపులకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. యువత అమితంగా డౌన్లోడ్ చేసుకుని వాడుతున్న డేటింగ్ యాప్స్ దోపిడీకి పాల్పడుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటించండి.. కొన్ని యాప్స్కు ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ ఉండదు. అలాంటి యాప్స్ను వాడే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్గా వాడని యాప్స్కు ఉన్న పర్మిషన్స్ను తొలగించాలి. లేదంటే యాప్స్ను అన్ ఇన్స్టాల్ చేయాలి. అవసరం లేకపోయినా గ్యాలరీ పర్మిషన్ అడిగినప్పుడు ‘డినై’ చేయాలి. డినై చేసిన తరువాత ఆ యాప్ పని చేయలేదంటే.. మిమ్మల్ని మోసం చేసేందుకు యాప్ సిద్ధంగా ఉందని అర్థం చేసుకోవాలి. కొంపముంచుతున్న యాప్ పర్మిషన్స్ వివిధ యాప్ల ద్వారా మీ ఫోన్ యాక్సెస్ పొందుతున్న నేరగాళ్లు వ్యక్తిగత సమాచారం మొత్తం చోరీ మన అజ్ఞానమే సైబర్ నేరగాళ్ల వంచనావకాశం యాప్స్ పట్ల అప్రమత్తత లేకుంటే అనర్ధాలే!అప్రమత్తంగా ఉండాలి.. అవసరం లేని యాప్స్ మీ ఫోన్లో ఎన్నో ఉంటాయి. వాటిని ఎందుకు ఇన్స్టాల్ చేసుకున్నారో.. మీకే తెలీదు. అలాంటి వాటితోనే చిక్కులు వస్తుంటాయి. ఆ యాప్స్ చేసే మానిటరింగ్తో మీ డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని గుర్తించండి. అనాలోచితంగా మీరు ఇచ్చే సమాచారంతోనే సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి మీ నంబర్లు, మీ వ్యక్తిగత సమాచారం చేరుతుంది. దాని ఆధారంగానే నేరగాళ్లు ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారు. కొందరు నేరగాళ్లు.. మీతోనే మీ న్యూడ్ వీడియో తీయించి బ్లాక్మెయిల్కు తెగబడుతున్నారు. – కోమాకుల శివాజీ, సీఐ, సైబర్ క్రైం, విజయవాడ -
ఓట్ల లెక్కింపునకు అన్ని విధాలా సన్నద్ధం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వచ్చే నెల 4న జరగనున్న ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఢిల్లీరావు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. సాధారణ ఎన్నికలలో భాగంగా కౌంటింగ్ కేంద్రాలలో చేపట్టవలసిన ఏర్పాట్లపై సచివాలయం నుంచి గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని క్యాంప్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ జూన్ 4వ తేదీన చేపట్టనున్న ఓట్ల లెక్కింపునకు అన్ని విధాల సన్నద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల నిఘాతో నిరంతరం అప్రమత్తంగా ఉన్నామన్నారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు ఉన్న నోవా, నిమ్రా ఇంజినీరింగ్ కళాశాలల వద్ద ఒక కంపెనీ సెంట్రల్ రిజర్వుడ్ పోలీస్ ఫోర్స్, 156 మంది స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, 477 మంది సివిల్ పోలీస్ ఫోర్స్ విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. 149 సీసీ కెమెరాలను మోనిటరింగ్ రూమ్కు అనుసంధానం చేసి రోజు వారీ నిరంతర పర్యవేక్షణతో భద్రత కల్పించామన్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు వీలుగా మీడియా సెంటర్తో పాటు, అభ్యర్థులు, ఏజెంట్లకు తెలిపే విధంగా పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల కౌంటింగ్నకు అడిషనల్ ఏఆర్వోలు, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు.ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఢిల్లీరావు -
బంగారు తాపడం పనులకు విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ ఆలయ బంగారు తాపడం పనులకు గురువారం హైదరాబాద్కు చెందిన భక్తులు రూ. 2 లక్షల విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్ మేడ్చల్ చెంగిచర్లకు చెందిన అనంతాల శంకర్ గురువారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కేఎస్ రామరావును కలిసి బంగారు తాపడం పనులకు విరాళాన్ని అందించారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఈవో రామరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. -
ఎంఈవో పుష్పలత అవినీతిపై విచారణ
ఇబ్రహీంపట్నం: ఎంఈవో సీహెచ్ పుష్పలతపై వచ్చిన అవినీతి ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాల విద్యాశాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ (సర్వీసెస్) జి.రాజేశ్వరి గురువారం ఎంఈవో కార్యాలయంలో విచారణ జరిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఎంఈవో పుష్పలత ఐదు మండలాలకు ఇన్చార్జ్గా ఉన్న సమయంలో ఉపాధ్యాయులు ఇన్కామ్ ట్యాక్స్ చెల్లింపులు ఈ–ఫైలింగ్ చేసే నిమిత్తం డబ్బులు డిమాండ్ చేసినట్లు వివిధ యూనియన్ నాయకులు జగ్గయ్యపేట ప్రాంతంలో ఓ పత్రిక ద్వారా వెలుగులోకి తెచ్చారు. అప్పట్లో దీనిపై విచారణ చేపట్టిన నందిగామ డీవైఈవో వెంకటసుబ్బయ్య జిల్లా విద్యాశాఖ అధికారులకు నివేదిక అందించారు. డీవైఈవో నివేధికపై విచారణ అధికారిగా జిల్లా విద్యాశాఖ డైరెక్టర్ రాజేశ్వరితో మరోసారి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకుల సమక్షంలో విచారణ చేపట్టిన రాజేశ్వరి పూర్తి నివేదిక జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు. ఎంఈవో పుష్పలత ఏపని చేయాలన్నా డబ్బులు ఇవ్వనిదే చేయదని ఉపాధ్యాయులు బహిరంగా చెప్పడం గమనార్హం. -
ఉరేసుకొని లారీ డ్రైవర్ ఆత్మహత్య
షేర్మహ్మద్పేట క్రాస్ రోడ్(జగ్గయ్యపేట అర్బన్):చెట్టుకు ఉరి వేసుకొని లారీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జగ్గయ్యపేట పట్టణ సమీపంలోని షేర్మహ్మద్పేట క్రాస్ రోడ్ రావికంపాడు రెవెన్యూ పరిధిలోని పొలంలో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు తెలియజేసిన వివరాల ప్రకారం... షేర్మహ్మద్పేట క్రాస్ రోడ్లో నివాసం ఉంటున్న యలక గోపిరెడ్డి (35) లారీ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. బుధవారం రాత్రి డ్యూటీకి అనిచెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చిన గోపిరెడ్డి షేర్ మహ్మద్పేట అడ్డరోడ్డు సమీపంలోని రావికంపాడు రెవెన్యూ పరిధిలోని పొలంలో ఉన్న వేపచెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందాడు. గురువారం ఉదయం పొలం సమీపంలోని వారు చూసి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోపిరెడ్డి మృతికి గల కారణాలు తెలియరాలేదు. భార్య విజిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కృష్ణానదిలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
మద్దూరు వద్ద ఏటిపాయలో ఘటన కంకిపాడు: కృష్ణానది ఏటిపాయలో సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థుల్లో ఓ విద్యార్థి విగతజీవిగా మారాడు. నీట మునిగిపోతున్న చిన్నారులను అక్కడే ఉన్న స్థానికులు కొందరు రక్షించారు. అప్పటికే నీటిలో మునిగిపోయిన ఓ చిన్నారి ఏటిపాయలో మునిగి మృత్యువాత పడ్డాడు. కళ్లెదుటే తమ స్నేహితుడు నీట మునిగి మృతి చెందటంతో తోటి వారంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. హృదయ విదారక ఘటన మండలంలోని మద్దూరు గ్రామంలోని ఏటిపాయలో గురువారం చోటుచేసుకుంది. ఘటనపై స్థానిక పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ డి.సందీప్ తెలిపిన కథనం మేరకు...పెనమలూరు మండలం తాడిగడప గ్రామానికి చెందిన కారాణి పళని కార్తీక్ (13) ఆరో తరగతి చదివాడు. వేసవి సెలవులు నిమిత్తం ఈనెల 19న మద్దూరు గ్రామంలోని అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చాడు. గ్రామానికి చెందిన నలుగురు స్నేహితులతో కలిసి మద్దూరు ఏటిపాయలో సరదాగా ఈతకు వెళ్లాడు. అందరూ సరదాగా స్నానాలు చేసే సమయంలో ప్రమాదవశాత్తూ నీటమునిగిపోతూ పెద్దగా కేకలు వేయటంతో అక్కడే గేదెలు మేపుతూ, చేపల వేటకు వెళ్లిన కొందరు నీట మునిగిపోతున్న చిన్నారులను గుర్తించి అతికష్టం మీద నలుగురుని రక్షించారు. విద్యార్థులు స్నానానికి దిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో పళని కార్తీక్ మృతదేహం తేలింది. దీంతో స్నేహితులు అంతా బిగ్గరగా రోదించారు. విగతజీవిగా మారిన స్నేహితుడిని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. విషయం తెలుసుకుని పళని కార్తీక్ కుటుంబ సభ్యులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి తండ్రి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. -
దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):మల్లేశ్వరస్వామి వారి సన్నిధిలో దక్షిణామూర్తికి గురువారం విశేష పూజలు నిర్వహించారు. దక్షిణామూర్తి విగ్రహానికి పంచామృత అభిషేకాలు, విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో కెఎస్.రామరావు పాల్గొన్నారు. వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో నిర్వహించిన పూజల్లో పలువురు ఉభయదాతలు, భక్తులు పూజలు జరిపించుకున్నారు. వైశాఖ పౌర్ణమి నేపథ్యంలో గురువారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో నిర్వహించిన చండీ హోమానికి రద్దీ పెరిగింది. పలువురు ఉభయదాతలు, భక్తులు చండీ హోమంలో పాల్గొని తమ నామగోత్రాలతో పూజలు జరిపించుకున్నారు. అనంతరం ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో సర్వ దర్శనంతో పాటు రూ. 100, రూ.300, రూ. 500 టికెటు క్యూలైన్లు కిటకిటలాడాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ ఏఈవో ఎన్. రమేష్బాబు క్యూలైన్లను పర్యవేక్షించారు. అమ్మవారి దర్శనం త్వరతిగతిన అయ్యేలా క్యూలైన్లు నడిపించారు. చండీ హోమానికి పెరిగిన రద్దీ -
బావిలో దిగి యువకుడి మృతి
బలుసుపాడు(జగ్గయ్యపేట అర్బన్): స్నేహితులతో కలసి సరదాగా ఈత కొడదామని చెప్పి ఓ యువకుడు వ్యవసాయ బావిలోకి దిగి ఊపిరాడక మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. చిల్లకల్లు ఎస్ఐ సతీష్ కథనం మేరకు.... పెనుగంచిప్రోలు మండలం, ముచ్చింతాల గ్రామానికి చెందిన జూపూడి కార్తీక్ (18) ఇద్దరు స్నేహితులతో కలసి బలుసుపాడు గ్రామానికి వచ్చారు. మొత్తం నలుగురు కలసి అన్నవరం రోడ్లో ఉన్న ఒక వ్యవసాయ బావిలోకి సరదాగా ఈత కొట్టేందుకు దిగారు. ఈ క్రమంలో బావిలోకి దిగిన వారు ఈత కొడుతూ ఉండగా, కార్తీక్ ప్రమాదవశాత్తు బావిలోని లోతులోకి వెళ్లి ఊపిరాడక మృతి చెందాడు. మృతుడి తండ్రి రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా చీకటి పడినప్పటికీ బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ ప్రయత్నంలో పోలీస్ కానిస్టేబుల్తో పాటు బలుసుపాడు గ్రామానికి చెందిన ఓర్సు రాముడు అనే యువకుడు బావి అడుగు భాగానికి వెళ్లి మృతదేహాన్ని తీసుకొచ్చారు. రాముడుని స్థానికులు, పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు. -
మాతా శిశు మరణాల నియంత్రణపై ప్రత్యేక ప్రణాళిక
వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ ఎస్.డిల్లీరావు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో మాతా, శిశు మరణాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు జరిగిన మరణాలను సమగ్రంగా విశ్లేషించి వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో కలెక్టర్ ఢిల్లీరావు జిల్లాలో చోటుచేసుకున్న మాతా శిశు మరణాలపై వైద్య, ఆరోగ్యశాఖ జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు జిల్లాలో జరిగిన మాతా శిశు మరణాలకు సంబంధించిన నివేదికలను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన మాతా, శిశు మరణాలకు కారణాలను విశ్లేషించి, ఇటువంటి మరణాలు సంభవించకుండా భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేయాలని కోరారు. ప్రతి మరణంపైనా సంస్థాగత, డీఎంహెచ్వో, జిల్లా స్థాయిలో సమగ్ర విశ్లేషణ, తద్వారా రూపొందించిన ప్రణాళికలతో మరణాలను నూరు శాతం నివారించేందుకు వీలవుతుందని తెలిపారు. ప్రతి మరణాన్ని శాసీ్త్రయ దృక్పథంతో విశ్లేషించాలని చెప్పారు. పోషకాహార, జన్యు లోపాలు, సామాజిక కారణాలు, అవగాహన లోపాలు తదితర కారణాలను విశ్లేషించాలని స్పష్టం చేశారు. గర్భిణులు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేయించుకునేలా గ్రామ స్థాయిలో ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు అవగాహన కల్పించాలని సూచించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది తరచూ గర్భిణుల ఇళ్లను సందర్శించి రక్తహీనత సమస్య ఏర్పడకుండా పౌష్టికాహారం తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకునేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యం. సుహాసిని, డీసీహెచ్ఎస్ డాక్టర్ బి.సి.కె నాయక్, ఐసీడీఎస్ పీడీ జి. ఉమా దేవి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి అమృత, డెప్యూటీ డీఎంహెచ్ఓ ఇందుమతి, టి.బి వైద్యాధికారి పద్మావతి, డిస్ట్రిక్ పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ లిడియా, సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, పర్యవేక్షకులు, ఏఏన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎంఈవోతో పాటు హెచ్ఎం సస్పెన్షన్
జగ్గయ్యపేట అర్బన్: మండలంలోని ఓ జెడ్పీ హైస్కూల్ హెచ్ఎంని లైంగికంగా వేధింపులకు గురిచేసిన ఘటనపై మండల విద్యాధికారి లావుడ్యా చిట్టిబాబును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో అవకతవకలు జరిగాయని, అవినీతికి పాల్పడ్డారని హెచ్ఎంపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు డీఈవో యూవీ.సుబ్బారావుకు ఫిర్యాదులు చేశారు. దీంతో గత నెల 30 వ తేదీన పథకం అమలు తీరు, నిర్వహణపై విచారణ చేశారు. కాగా ఇదే సమయంలో ఎంఈవో ఎల్.చిట్టిబాబు తరచూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని హెచ్ఎం లిఖితపూర్వకంగా డీఈవోకు ఫిర్యాదు చేసింది. దీనిపై కూడా డీఈవో విచారణ చేపట్టి రిపోర్టును ఆర్జేడీ జి.నాగమణి, స్కూల్ ఎడ్యుకేషన్, అధికారులకు పంపించారు. దీంతో ఇద్దరిపై చేపట్టిన విచారణలో ప్రాథమికంగా ఆధారాలు లభించడంతో ఎంఈవో చిట్టిబాబు, హెచ్ఎంను సస్పెండ్ చేసినట్లు ఆర్జేడీ నందిగామ డీవైఈవోకు ఉత్తర్వులు పంపించారు. -
కూరగాయల సాగు భళా
కంకిపాడు: కూరగాయల సాగు ఆశాజనకంగా ఉంది. ప్రస్తుత సీజన్లో కూరగాయల లభ్యత తక్కువగా ఉండటం, ధరలు హెచ్చుగా పలకటంతో రైతులు ముందు చూపుతో కూరగాయలను సాగు చేస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా సాగు పనులు చేపడుతూ లాభాలను ఆర్జిస్తున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో 2023–24 సీజన్లో 6042 ఎకరాల్లో కూరగాయల సాగు చేస్తున్నట్లు ఉద్యానశాఖ లెక్కలు చెబుతున్నాయి. పెనమలూరు, పామర్రు, గన్నవరం, గుడివాడ, అవనిగడ్డ, మొదలైన నియోజకవర్గాల్లో సాగు చేపడుతున్నారు. ప్రధానంగా మిర్చి, బెండ, వంగ, టమాటా, సొర, కాకర, బీర, మునగ, కూర అరటి, దోస, దొండ, ఆకుకూరలు, పొట్లకాయ, చిక్కుళ్లు మొదలైన పంటలను రైతులు వేస్తున్నారు. వేసవిలో లాభాలు అధికం.... వేసవిలో కూరగాయల సాగు లాభదాయకంగా ఉంటుందన్నది ఉద్యానశాఖ, రైతువారీగా చెప్పే మాటే. బోరు సదుపాయం, నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో రైతులు వేసవిలో మెట్ట భూమిని కూరగాయల సాగుకు వినియోగిస్తుంటారు. నీటి అవసరం తక్కువగా ఉండే కూరగాయలను ఎంపిక చేసుకుని సాగు చేస్తున్నారు. ఈ సీజన్లో కూరగాయల లభ్యత తక్కువగా ఉండటంతో ధరలు మార్కెట్లో హెచ్చుగా పలుకుతుంటాయి. ప్రస్తుతం రైతుబజారుల్లో కిలో టమాటా రూ.34, వంగ రూ.44, బెండ రూ. 44, మిర్చి రూ.70, దోస రూ.30, బీర రూ.40పైగా ధర పలుకుతుంది. బహిరంగ మార్కెట్లో ఈ ధరలు ఇంకా అధికంగా పలుకుతున్నాయి. మార్కెట్ ధరలను అంచనా వేస్తూ రైతులు ముందుగానే సాగుకు ఉపక్రమిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్కు పంటను చేర్చుతూ ఆశించిన ధరలను పొందుతూ లాభాలను చూస్తున్నారు. మంచి ఉత్పత్తులు వస్తాయి వేసవిలో కూరగాయల సాగు లాభదాయకంగా ఉంటుంది. నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో వేసవిలో భూమిని ఖాళీగా ఉంచకుండా స్వల్పకాలిక పంటలను ఎంపిక చేసుకుని సాగు చేయటం ద్వారా మంచి ఉత్పత్తులు సాధించొచ్చు. తద్వారా మార్కెట్లో మంచి ధరను పొందొచ్చు. సస్యరక్షణ చర్యలు సమర్థంగా తీసుకోవటం ద్వారా సాగు లాభదాయకంగా ఉంటుంది. – జోసఫ్ చందు, ఉద్యానశాఖ అధికారి, కంకిపాడు వేసవి రీత్యా రైతుల ముందు చూపు ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఆనందం -
పామర్రులో 2 కిలోల గంజాయి పట్టివేత
పామర్రు: మండల పరిధిలోని పెదమద్దాలి గ్రామంలో 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... పెదమద్దాలి గ్రామంలో గంజాయి నిల్వలపై సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో రెండు కిలోల ఎండు గంజాయిని పట్టుకోవడంతో పాటు నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసి గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అది ఎక్కడ అమ్ముతున్నారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మనోహరంగా శోభాయాత్ర
విజయవాడ కల్చరల్: అన్నమయ్య సంకీర్తనా అకాడమీ (శ్వాస), శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పద కవితా పితామహుడు అన్నమయ్య జయంతి సందర్భంగా గురువారం నిర్వహించిన శోభాయాత్ర మనోహరంగా సాగింది. సంగీత విద్వాంసుల సంకీర్తనలు పద కవితకు పట్టాభిషేకం చేశాయి. పున్నమ్మ తోటలోని టీటీడీ కల్యాణ మండపం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర బందరురోడ్డుమీదుగా లబ్బీపేటలోని వెంకటేశ్వర స్వామి దేవస్ధానం చేరుకుంది. ముఖ్యఅతిథి లబ్బీపేట వెంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ మాగంటి గోపాల్ పాల్గొని అన్నమయ్య పద శోభను వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సంగీత విద్వాంసులు పోపూరి శ్యామసుందర్, స్మితా మాధవ్, బి.చిన్నమ దేవి, మునుకుట్ల యశస్విని, చారుమతి పల్లవి, పి.హిమబిందు, చెంగల్వ రంజని, వీవీఎస్ వినోద్కుమార్, కస్తూరి గోపాలరావు, మల్లాది శ్రీరాం, మల్లాది రాం ప్రసాద్ అన్నమయ్య కీర్తనలు మధురంగా గానం చేశారు. -
ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడు: కాసు మహేష్రెడ్డి
సాక్షి, విజయవాడ: ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయని ధ్వజమెత్తారు. టీడీపీ అరాచకాలపై ఈసీకి వైఎస్సార్సీపీ నేతలు కాసు మహేష్ రెడ్డి, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.అనంతరం కాసు మహేష్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నామన్నారు. ‘‘సుమారు 60, 70 బూత్ల్లో రిగ్గింగ్ చేశారు. వెబ్ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి రీపోలింగ్ జరపాలని కోరాం. ఈసీ స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఇళ్లను సైతం టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. మహిళలు భయాందోళనలకు గురై గుడిలో తలదాచుకున్నారు. దాడులకు పాల్పడ్డ టీడీపీ నేతలపై చర్యలేవి?. మాచర్ల ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి’’ అని కాసు మహేష్రెడ్డి డిమాండ్ చేశారు.‘‘ఓటు వేసిన వారిని టీడీపీ వాళ్లు కొట్టి, చంపాలని చూస్తే పోలీసులు స్పందించలేదు. ఎన్నికలకు వారం రోజుల ముందు పోలీసులను మార్చారు. దాని వల్లనే హింస చెలరేగింది. ఈ హింసకి బీజేపీ, టీడీపీ, ఈసీ ఎవరు బాధ్యత వహిస్తారు?. ఎన్ని చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసినా ప్రజలు మాత్రం జగన్ని గెలిపించాలని నిర్ణయించారు. మాచర్లలో తుమ్రకోట, వెల్దుర్తి వంటి చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసింది. టీడీపీ రిగ్గింగ్ చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదు’’ అని కాసు మహేష్రెడ్డి పేర్కొన్నారు.‘‘సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ముందే ఈసీ దృష్టికి తీసుకుని వెళ్లామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ముందస్తు భద్రత కల్పించమని అడిగామని.. అయినా భద్రత చర్యలు తీసుకోలేదన్నారు. పురందేశ్వరి అధికారులను మార్చమని ఒత్తిడి తెచ్చారు. ఆమె చేసిన ఒత్తిడి నిర్ణయంతో హింస జరిగింది’’ అని మల్లాది విష్ణు మండిపడ్డారు. -
ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట
సాక్షి, విజయవాడ: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 6కి వాయిదా వేసింది.పిన్నెల్లితో సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో ఊరట లభించింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కేసులున్న అభ్యర్థులపై వచ్చే నెల 5వ తేదీ ఉదయం 10 గంటల వరకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది.కాగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. పిన్నెల్లి తరపున న్యాయవాది నిరంజన్రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. సంఘటన ఈనెల 13న జరిగితే.. 15న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారని పేర్కొన్నారు. ముందు ఎఫ్ఐఆర్లో గుర్తు తెలియని వ్యక్తులు అని పేర్కొన్నారని.. తర్వాత లోకేష్ ట్విట్టర్లో వీడియోను చూసి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడంపై నిరంజన్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.ట్విట్టర్లో వీడియో మార్ఫింగ్ చేసి ఉండొచ్చని.. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరిన నిరంజన్రెడ్డి.. సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ కేసులో మార్గదర్శక సూత్రాల ప్రకారం ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లు ఉంటే 41A నోటీసులు ఇవ్వాలని ఉందని పేర్కొన్నారు. -
పిన్నెళ్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటన
సాక్షి, విజయవాడ: పిన్నెళ్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటన చేశారు. ఆ వీడియోను మేము విడుదల చేయలేదని.. ఎన్నికల కమిషన్ నుండి బయటకు వెళ్లలేదు.. అది ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటామని సీఈవో ముకేష్ కుమార్ మీనా అన్నారు.‘‘దర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతినుండో బయటకు వెళ్లింది పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పీవో, ఏపీవోలను సస్పెండ్ చేశాం. మాచర్లకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదు. ఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. టీడీపీ నాయకులకు అనుమతి లేదని చెప్పాం. బయట నాయకులు ఎవ్వరూ మాచర్లకు వెళ్లకూడదు ఎవ్వరినీ ఆ గ్రామాల్లోకి వెళ్లనీయొద్దని ఆదేశించాను’’ అని సీఈవో ముకేష్ కుమార్ మీనా చెప్పారు. -
27న నిధి ఆప్కే నికత్
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) ప్రాంతీయ కార్యాలయ ఆధ్వర్యంలో ఈనెల 27న నిధి ఆప్కే నికత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ ఇంద్రనీల్ ఘోష్ బుధవారం ఓప్రకటనలో తెలిపారు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఉదయం 9.30 గంటల నుంచి నిర్వహించనున్నట్టు వెల్లడించారు. యజమానులు, ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు ఇతర వాటాదారులు, లబ్ధిదారులతో పరస్పరం ముఖాముఖిగా చర్చలు జరుగుతాయని తెలిపారు. పీఎఫ్ భాగస్వామ్య యజమానులందరూ కార్యక్రమానికి విధిగా హాజరై, ఫిర్యాదులు ఉంటే వాటిని పరిష్కరించేందుకు వీలుగా ఉద్యోగులతో పాటు అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గుంటూరు కృష్ణనగర్లోని ఈఎస్ఐ ఆస్పత్రి, కృష్ణాజిల్లా నందివాడ మండలం తమిరిస గ్రామంలోని ఉమా స్పింటెక్స్ ప్రైవేటు లిమిటెడ్, ఒంగోలులోని ఈఎస్ఈసీ బ్రాంచ్, విజయవాడ గాంధీనగర్లోని ఈఎస్ఈసీ బ్రాంచ్ కార్యాలయం, బాపట్ల జిల్లా కారంచేడులోని శ్రీసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తిమ్మాపురంలోని వసంత ఇండస్ట్రీస్లో జరిగే కార్యక్రమాల్లో ఫిర్యాదులు, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. -
లైంగికదాడి కేసులో ముగ్గురు యువకుల అరెస్టు
కంకిపాడు: దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను కంకిపాడు పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీసుస్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ వి.శ్రీనివాసరావు, ఎస్ఐ డి.సందీప్ వివరాలను వెల్లడించారు. మండలంలోని దావులూరు గ్రామానికి చెందిన దివ్యాంగురాలిపై లైంగికదాడి జరిగింది. రెండు వారాలుగా తీవ్రమైన కడుపునొప్పి రావటంతో ఈనెల 20న తల్లి సీహెచ్ రేణుకమ్మ తన కుమార్తెను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. రేణుకమ్మ కుమార్తె (26)ను పరీక్షించిన వైద్యులు గర్భవతిగా తేల్చారు. దీంతో రేణుకమ్మ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పుట్టుకతోనే వైకల్యం ఉన్న యువతి (26)పై లైంగికదాడి జరిగినట్లు కేసు నమోదైంది. కేసు విచారణలో భాగంగా అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు లైంగికదాడికి కారకులుగా తేల్చారు. లైంగిక దాడికి పాల్పడ్డ నల్లమోతు వేదాంత రాజు అలియాస్ ముక్కు రాజు, చాట్ల జోజిబాబు, కొండేటి పెద్దిరాజు కారకులుగా గుర్తించి వారిని అరెస్టు చేశారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించటంతో నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ సందీప్ వెల్లడించారు. -
చెరువులో పడి బాలిక దుర్మరణం
పెనమలూరు: కానూరు చెరువులో పడి బాలిక మృతి చెందటంతో పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ టీవీవీ రామారావు తెలిపిన వివరాల ప్రకారం కానూరు పెద్దబావి సెంటర్లో ఆరేపల్లి నాగరాజు, నాగలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వీరి కుమార్తె వాగ్దేవి(8)గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతోంది. తల్లి నాగలక్ష్మి మంగళవారం మధ్యాహ్నం పనికి వెళుతూ కుమార్తె వాగ్దేవికి పచారి కొట్టు వద్ద తినుబండారాలు కొని ఇచ్చి వెళ్లింది. నాగలక్ష్మి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా వాగ్దేవి కనబడలేదు. చుట్టుపక్కల గాలించినా కనబడకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి వెతికినా బాలిక ఆచూకీ తెలియలేదు. నాగలక్ష్మి ఇంటి వెనుక చెరువు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి బుధవారం ఉదయం చెరువులో వెతికించగా వాగ్దేవి మృతదేహం దొరికింది. ఆటలాడుతూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బాలిక తల్లి నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- ఆయా బ్యాంకుల్లో లేటెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే!
- అది నిరూపిస్తే రేపే రాజీనామా చేస్తా: కేటీఆర్ సవాల్
- సెల్యూట్ కొట్టలేదని.. నెలరోజుల జీతం కోత
- కేన్స్లో రికార్డ్ క్రియేట్ చేసిన ఇండియన్ నటి.. తొలిసారి దక్కిన అవార్డ్
- మంత్రి ఉత్తమ్ కుమార్పై నమ్మకముంది: బండి సంజయ్
- ఈవీఎం ట్యాంపరింగ్పై స్పందించిన ఈసీ
- నేరేడు పండ్లు తింటే, పిల్లలు నల్లగా పుడతారా? మీరు మాత్రం బీ కేర్ఫుల్
- ఛత్తీస్గఢ్ ఘోర ప్రమాదం.. 18 మంది మృతి
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు: చిత్తూరు అరుణ్ కుమార్ అరెస్ట్
- SRH vs RR: ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం?: టీమిండియా దిగ్గజం ఫైర్
Advertisement