-
నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు
మునుగోడు : ఎరువులు, విత్తనాల వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని మునుగోడు ఏడీఏ ఎల్లయ్య హెచ్చరించారు. పలువురు వ్యాపారులు డిమాండ్ కలిగినా పత్తి విత్తనాలను రైతులకు అధిక ధరలకు విక్రయించేందుకు బ్లాక్ చేస్తుండగా శనివారం ‘సాక్షి’లో ‘విత్తనాలు బ్లాక్ చేసి దందా’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన వ్యవసాయ అధికారులు ఏడీఏతో పాటు మునుగోడు ఏఓ శ్రీనివాస్గౌడ్, టెక్నికల్ ఏఓ, పలువురు సిబ్బంది ఫర్టిలైజర్ దుకాణాల్లో తనఖీలు చేశారు. ప్రధానంగా డిమాండ్ కలిగిన పత్తి విత్తనాల డీలర్ షిప్ ఉన్న దుకాణంలో ఆ షాపుకు ఏఏ విత్తనాలు ఎప్పుడు వచ్చాయి.. అందులో రైతులకు ఎన్ని, ఎంత ధరకు విక్రయించారు.. అలాగే మిగిలిన వ్యాపారులకు ఎన్ని విత్తనాలు అమ్మారు అనే వివరాలను సేకరించారు. అంతే కాకుండా ఆ దుకాణంలో ప్రత్యేకంగా ఓ ఏఈఓని ఉంచి సీజన్ పూరైయ్యే వరకు అతని సమక్షంలోనే విత్తనాలు విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ ఎల్లయ్య మాట్లాడుతూ విత్తనాలు, ఎరువుల విక్రయంలో వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. విత్తనాలు బ్లాక్ చేసిన విషయంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి జేడీఏకి నివేదిక అందజేస్తామన్నారు. -
నిరుద్యోగులను మోసగిస్తున్న కాంగ్రెస్
నార్కట్పల్లి : ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులు, నిరుద్యోగులను మోసగిస్తుందని జెడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. శనివారం నార్కట్పల్లిలో వారు విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. బెదిరింపులకు పాల్పడే కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సమావేశంలో రేగట్టె మల్లికార్జున్రెడ్డి, ఎంపీటీసీ లింగయ్య, వాజిద్, బైరెడ్డి కరుణాకర్రెడ్డి, దోసపాటి విష్ణుమూర్తి, అశోక్రెడ్డి, శేఖర్రెడ్డి, శ్రీను, రవికుమార్, నరేష్, వెంకట్, ఎల్లేష్, మహేష్ ఉన్నారు. ఫ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి -
రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం
నల్లగొండ: కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ప్రకారం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శనివారం నల్లగొండలో నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ప్రకటించి అన్నీ అమలు చేసుకుంటూ పోతుందన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా విస్మరించబోమని, అన్నీ అమలు చేసి తీరుతామన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నను గెలిపించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీన్మార్ మల్లన్న పోరాటం చేశాడని, దీంతో ఆయనపై ఎన్నో అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. నల్లగొండ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి మాట్లాడుతూ మల్లన్న ఓటమికి అన్ని పార్టీలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తనకు అవకాశం ఇస్తే రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకొస్తానన్నారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయకపోతే తాను గెలిచినా రాజీనామా చేస్తానన్నారు. కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలు బయటపెడితే తనపై కేసులు పెట్టారని చెప్పారు. పట్టభద్రులు ఆలోచించి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మలమోహన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్గౌడ్, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ మనిమద్దె సుమన్, సీపీఎం నాయకులు ఎండీ.సలీం, సయ్యద్ హశం, బషీర్, ఎంఏ.ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల -
మున్నూరుకాపులు సంఘటితంగా పోరాడాలి
హాలియా : సమస్యల పరిష్కారానికి మున్నూరుకాపులు సంఘటితంగా పోరాడాలని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పేర్కొన్నారు. శనివారం హాలియా పట్టణంలో ఆయన మున్నూరుకాపు చైతన్య కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. అనంతరం పట్టణ మున్నూరుకాపు అధ్యక్షుడు గోపిశెట్టి నరసింహ ఆధ్వర్యంలో దేవయ్యను సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వాసుదేవుల వెంకట నరసయ్య, నాగార్జున సాగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆకుల శ్రీనివాస్, మున్సిపాలిటీ అధ్యక్షుడు గోపిశెట్టి నరసింహ, నాయకులు నల్లగొండ సుధాకర్, ఆవుల జనార్ధన్, చాపల వెంకన్న, గోపిశెట్టి మధు పాల్గొన్నారు. -
43 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో శనివారం 43 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ కె. నరేష్ తెలిపారు. ఉట్లపల్లి గ్రామానికి చెందిన బొల్లెద్దు పాపయ్య ఇంట్లో పీడీఎస్ బియ్యం నిల్వ ఉంచినట్లు పక్కా సమాచారం అందడంతో అతడి ఇంటిపై దాడి చేసి 43 క్వింటాళ్ల(86 బస్తాలు) బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. రేషన్ లబ్ధిదారుల నుంచి అతడు తక్కువ ధరకు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. సివిల్ సప్లయ్ ఆర్ఐ ఠాగూర్ సురేందర్సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుత్ సిబ్బందిపై దాడి.. కేసు నమోదుగుండాల: కరెంట్ లైన్లు సరిచేస్తున్న విద్యుత్ సిబ్బందిపై దాడి చేసిన వారిపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ యాకన్న తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం సాయంత్రం విద్యుత్ సిబ్బంది కరెంట్ లైన్లు సరిచేస్తుండగా.. అదే కాలనీకి చెందిన అన్నెపర్తి ప్రసాద్, అన్నెపర్తి ప్రమోష, అన్నెపర్తి సాయిలు తమపై దాడి చేశారని ఆర్టిజన్ మొలకల మధు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. తాటిచెట్టు పైనుంచి పడి గీతకార్మికుడికి గాయాలు తుంగతుర్తి: తాటిచెట్టు పైనుంచి పడి గీతకార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో శనివారం జరిగింది. వివరాలు.. గొట్టిపర్తి గ్రామానికి చెందిన గీతకార్మికుడు బాలగాని మల్లయ్య రోజుమాదిరిగా శనివారం కూడా గ్రామ పరిధిలో కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కుతుండగా.. మోకు జారి కిందపడ్డాడు. దీంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు గమనించి అతడిని చికిత్స నిమిత్తం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు. -
రూ.10లక్షల విలువైన చేపలు మృత్యువాత
చివ్వెంల: మండలంలోని కుడకుడ గ్రామ శివారులో గల గుండ్లకుంట చెరువులో శనివారం రూ.10లక్షల విలువైన చేప పిల్లలు, చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ సందర్భంగా మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు కొన్నబోయిన వెంకన్న విలేకరులతో మాట్లాడుతూ.. గుండ్లకుంట చెరువును అదే గ్రామానికి చెందిన షేక్ ఖలీల్, మరో వ్యక్తి రెండేళ్ల క్రితం చేపల పెంపకానికి లీజుకు తీసుకున్నారని పేర్కొన్నారు. లీజు గడువు మరో 15 రోజుల్లో ముగియనుండడంతో కాంట్రాక్టర్ షేక్ ఖలీల్ శుక్రవారం వచ్చి రాత్రి వరకు చేపలు పట్టాడని, మిగిలిన చేపలు పట్టేందుకు చెరువులో బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేశాడని వివరించారు. మోతాదుకు మించి బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేయడంతో శనివారం తెల్లవారుజామున చేపలు మృత్యువాత పడ్డాయని అన్నారు. రూ.10లక్షల విలువైన చేప పిల్లలు, చేపలు మృత్యువాత పడ్డాయని, దీనికి కారణమైన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఇదేమిటని కాంట్రాక్టర్ను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడని ఆరోపించారు. ఈ ఘటపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో మత్స్యకార సంఘం సభ్యులు కోనెబోయిన పున్నయ్య, ఈదయ్య, శ్రీను, నాగరాజు, ఉప్పలయ్య, సత్యనారాయణ, భారతమ్మ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
తిరుమలగిరి (తుంగతుర్తి): ఆటోను లారీ ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం తిరుమలగిరి మండలం తొండ గ్రామ శివారులో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన మహెమూద్ ఆదివారం గృహప్రవేశం చేస్తుండడంతో శనివారం ఆయన పెద్ద కుమారుడు అమీర్(17) తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి వెళ్లి ఆటోలో గొర్రెలను తీసుకొని తిరుమలగిరికి వస్తున్నాడు. ఈ క్రమంలో తొండ గ్రామ శివారులో తిరుమలగిరి నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న లారీ ఆటోను ఢీకొట్టడంతో అమీర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు ఇంటర్ పూర్తిచేశాడు. మృతుడి తండ్రి మహెమూద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం మిర్యాలగూడ అర్బన్: నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ఏపీలోని పల్నాడు జిల్లా శావల్యాపురం మండల కేంద్రానికి చెందిన కొందరు వ్యక్తులు నకిలీ పత్తి విత్తనాలను ఆరు బస్తాల్లో నింపుకుని ఓ వాహనంలో మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడకు తెచ్చారు. వాటిని మరో వాహనంలో ఎక్కించేందుకు సన్నద్ధ అవుతుండగా అదే సమయంలో వాహనాల తనిఖీ కోసం వచ్చిన వన్టౌన్ పోలీసులకు ఆ బస్తాలు అనుమానాస్పదంగా కనిపించడంతో వాటిపై ఆరా తీశారు. వ్యవసాయ అధికారి సరితను అక్కడికి రప్పించి వాటిని పరిశీలించగా అవి నకిలీ పత్తి విత్తనాలుగా గుర్తించారు. దీంతో వాటిని పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా ఆ నకిలీ విత్తనాలు మంచిర్యాలకు తరలిస్తున్నట్లు గుర్తించామని 260 కిలోల నకిలీ పత్తి విత్తనాల విలువ రూ.5 లక్షలు ఉంటుందని, వ్యవసాయ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ పోలీసులు పేర్కొన్నారు. కాగా నకిలీ విత్తనాల కేసులో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
రాష్ట్రపతి ప్రసంగంలో ‘రావి’ పేరు ప్రస్తావించాలి
భువనగిరి రూరల్: 18వ లోక్సభ జూన్లో ఏర్పాటవుతున్న సందర్భంగా సభను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించే ప్రసంగంలో రావి నారాయణరెడ్డి పేరు ప్రస్తావించాలని రావి నారాయణరెడ్డి సేవా సంస్థ అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్ అన్నారు. శనివారం భువనగిరి పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రావి నారాయణరెడ్డి దేశంలోనే అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలుపొందాడని అన్నారు. అంతేకాకుండా అప్పట్లో పార్లమెంట్ భవనాన్ని రావి నారాయణరెడ్డ్డే ప్రారంభించారని పేర్కొన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి పేరును 18వ లోక్సభ ఏర్పాటవుతున్న సందర్భంగా రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయానికి లేఖను పంపించారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి రావి సుఖేష్రెడ్డి, ఉపాధ్యక్షుడు పడాల భాస్కర్, కోశాధికారి తిరుమణిదాస్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
భువనగిరి క్రైం: బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఆటో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామ శివారులో శనివారం జరిగింది. వివరాలు.. భువనగిరి మండలం పచ్చర్లబోడుతండాకు చెందిన మెగావత్ రమేష్ పని నిమిత్తం బైక్పై భువనగికి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అనాజిపురం గ్రామ శివారులో గల దివ్యబాల స్కూల్ సమీపంలో వెనుక నుంచి అతివేగంగా ఆటో వచ్చి బైక్ను ఢీకొట్టడంతో రమేష్కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం అతడిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బైక్ అదుపుతప్పడంతో.. మర్రిగూడ: బైక్ అదుపుతప్పడంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మర్రిగూడ మండలం రాజాపేటతండా సమీపంలో శనివారం జరిగింది. వివరాలు.. మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లికి చెందిన కొప్పుల శివ, ఐతగోని ఉపేందర్ పని నిమిత్తం బైక్పై మర్రిగూడకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. రాజాపేటతండా మూలమలుపు వద్ద వారి బైక్ అదుపుతప్పడంతో కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో వారిద్దరి తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి మర్రిగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం మాల్కు తరలించారు. -
సేంద్రియ ఎరువులే పంటకు బలం
నడిగూడెం: సేంద్రియ ఎరువులతో పంటకు ఎక్కువ బలం చేకూరడంతో పాటు దిగుబడి పెరుతుంది. రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో కోదాడ ఇన్చార్జి ఏడీఏ ఎం. రాజగోపాలరావు సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే.. పశువుల ఎరువు.. రైతులు అనాదిగా వినియోగిస్తున్న ఎరువే ఇది. అయితే రానురాను వ్యవసాయంలో యాంత్రీకరణ చొరబడడంతో పశుసంతతి తగ్గి పశువుల ఎరువు అందుబాటులో లేకుండా పోయింది. పంటలకు ఉపయోగించే ఎరువుల్లో ఇది చాలా ముఖ్యమైంది. ప్రాథమికంగా ఈ ఎరువు ఏ పంట సాగులోనైనా వేసి తీరాల్సిందే. పంటలకు పోషకాలను అందించడంతో పాటు పొలంలో కురిసిన వాన నీటిని ఒడిసిపట్టి పంటలకు అందించడంలో పశువుల పేడ కీలకపాత్ర పోషిస్తుంది. మిగతా ఎరువులను పంటకు అందించాలన్నా ఈ ఎరువు తరువాత ఏదైనా పొలంలో ఒక వరుస మట్టి, ఆ తరువాత పశువుల ఎరువు మరో పొర మట్టి, పశువుల ఎరువు ఇంకో పొర ఆకులు, అలమలు, పశువుల మేత వేయగా తొక్కి పడేసిన చెత్త చెదారాలను తొలకరి వర్షాలు కురవగానే వెంటనే ఆ కుప్పలోని ఎరువు మట్టిని చిన్న చిన్న కుప్పలుగా పోసి పొలమంతా చల్లితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేసి, పొలంలో వేయడం వల్ల పోషకాలు సమృద్ధిగా తయారై పంటకు కావాల్సి న బలాన్ని అందిస్తుంది. కంపోస్టు ఎరువు గ్రామాల్లో లభ్యమయ్యే చెత్త, రాలిన ఆకులు, పార్దీనియం, ఇతర కలుపు మొక్కలు, కుళ్లిన కూరగాయలు, వేరుశనగా కాయల పొట్టును కలిపి పశువుల పేడ, మూత్రంతో కుప్పగా వేసి కుళ్లింపజేస్తే తయారయ్యే ఎరువే కంపోస్టు ఎరువు. దీనిని కూరగాయ పంటలకు, ఇతర పంటలకు వేస్తే మొక్కలు ఏపుగా పెరగడంతో పాటు, చీడ, పీడలు లేకుండా ఆశించిన దిగుబడి వస్తుంది. కోళ్ల ఎరువు కోళ్లఫారాల్లో లభ్యమయ్యే ఎరువు కోళ్ల కింద వేసిన పొట్టు, మల మూత్రాలతో సేంద్రియ ఎరువు తయారవుతుంది. దాదాపు 40 కోళ్ల నుంచి ఏడాదికి టన్ను ఎరువు వస్తుంది. ఈ ఎరువులో 3 శాతం నత్రజని, 2 శాతం భాస్వరం, 2 శాతం పొటాష్ ఉంటుంది. తేమ తగ్గే కొద్దీ పోషక శాతం పెరుగుతుంది.ఉపయోగాలు ఇవే.. సేంద్రియ ఎరువుల వినియోగంతో భూమికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సేంద్రియ పదార్థం భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తుంది. బరువు నేలలు గుళ్లబారి వేర్లు చక్కగా పెరగడానికి సహాయపడుతుంది. నీరు కూడా ఇంకుతుంది. ఇసుక నేలల్లో మట్టి రేణువుల అమరికను క్రమబద్ధీకరిస్తుంది. నీటిని గ్రహించి తేమను ఎక్కువగా కాలం పట్టి ఉంచుకొని పంటను బెట్టకు గురికాకుండా చేస్తుంది. అలాగే నీటి ఎద్దడిని తట్టుకొనే శక్తి పెరుగుతుంది. నేలలోని పోషకాలను మొక్కలు గ్రహించేందుకు తోడ్పడే సూక్ష్మ జీవులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. కోదాడ ఇన్చార్జి ఏడీఏ రాజగోపాలరావు -
‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
నల్లగొండ: ‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి వచ్చేనెల 26 వరకు ఆసక్తి గల మహిళలకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిక్షణ ఇస్తారు. ఇక్కడ త్రెడ్డింగ్, వ్యాక్స్, సెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్, డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ఫాల్ ట్రీట్మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, డై అప్లికేషన్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్, ఫేషియల్స్ తదితర వాటిల్లో శిక్షణ ఉంటుంది. శిక్షణ కోసం ఈనెల 27 వరకు నల్లగొండ పట్టణంలోని శివాజీనగర్ లో గల సాహితీ బ్యూటీ పార్లర్ అండ్ ట్రైనింగ్ సెంటర్లో రూ.3వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు అందజేస్తారు. ఇతర వివరాల కోసం 9666013544, 80747 42864 సెల్నంబర్లలో సంప్రదించాలి.వడదెబ్బతో వృద్ధుడు మృతిఆత్మకూర్ (ఎస్): మండల పరిధిలోని కోటపహాడ్ గ్రామంలో శనివారం వడదెబ్బతో వృద్ధుడు మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటపహాడ్ గ్రామానికి చెందిన కొత్తపల్లి వెంకన్న(75) బుధవారం ఉపాధి హామీ కూలీ పనికి వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. అప్పటి నుంచి వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతూ స్థానికంగానే చికిత్స పొందుతున్న ఆయన శనివారం మృతిచెందాడు. మృతుడి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కందాల వెంకటరెడ్డి పరామర్శించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. పాల వ్యాన్ ఢీకొని వ్యక్తి దుర్మరణం నల్లగొండ క్రైం: బైక్పై వెళ్తున్న వ్యక్తిని పాల వ్యాన్ ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో శనివారం జరిగింది. వన్టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో సాయినగర్కు చెందిన ఆంథోని(50) బైక్పై ఇంటికి వెళ్తుండగా.. దేవరకొండ నుంచి నల్లగొండ పట్టణంలోకి వస్తున్న పాల వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఆంథోనిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య మేరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. యువకుడి అదృశ్యం సూర్యాపేట: ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. వివరాలు.. కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన నందికొండ వెంకన్న అలియాస్ వెంకటేష్ సూర్యాపేట పట్టణంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ సూర్యాపేట మండలం పరిధిలోని టేకుమట్ల తన చిన్నమ్మ ఇంట్లో ఉంటున్నాడు. గురువారం ఉదయం సూర్యాపేటకు వెళ్లిన వెంకన్న తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన బంధువులు శనివారం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే సూర్యాపేట మండలం రాయినిగూడెం రాజుగారి తోట హోటల్ సమీపంలో వెంకన్న ద్విచక్ర వాహనాన్ని గుర్తించిన బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాహనం అక్కడ వదిలి వెళ్లడంతో వెంకన్నను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నీటి బకెట్లో పడి బాలుడు మృతి
హుజూర్నగర్: నీటి బకెట్లో పడి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన హుజూర్నగర్ పట్టణంలో శనివారం జరిగింది. బాలుడి బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద గల మోడల్ కాలనీలో సతీ సంతోష్సింగ్, సతీ కవితకౌర్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కుమారుడు రాజ్కుమార్సింగ్(2) శనివారం ఆడుకుంటూ వెళ్లి బాత్రూంలో ఉన్న నీటి బకెట్లో పడిపోయాడు. కొంతసేపటికి గమనించిన తల్లిదండ్రులు అతడిని బయటకు తీసి హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
వలిగొండ: అప్పుల బాధతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వలిగొండ మండలంలోని పులిగిళ్ల గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పులిగిళ్లకు గ్రామానికి చెందిన దివ్యాంగుడైన బుగ్గ బీరప్ప(47) గతంలో సాక్షర భారత్ కేంద్ర నిర్వాహకుడుగా పనిచేశాడు. ప్రభుత్వం దాన్ని రద్దు చేయడంతో కిరాణా దుకాణం నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం క్రితం అతడికి గుండె జబ్బు రావడంతో వైద్య ఖర్చుల నిమిత్తం అప్పులు చేశాడు. అప్పుల బాధ తట్టుకోలేక జీవితంపై విరక్తితో శుక్రవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. అపస్మారకస్థితిలో ఉన్న బీర్పను భార్య నిర్మల చుట్టుపక్కల వారి సహాయంతో 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేందర్ లాల్ తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నాడు. -
ఈదురుగాలుల బీభత్సం
భూదాన్పోచంపల్లి: మండలంలోని ధర్మారెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులకు దెబ్బతిన్న ఇళ్లను శనివారం తహసీల్దార్ శ్రీకాంత్రెడ్డి, ఎంఆర్ఐ వెంకట్రెడ్డి పరిశీలించారు. ధర్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గంగపురం వెంకటయ్య ఇంటిపై రేకులు పగిలి ఇంటి లోపల పడటంతో ఫ్రిజ్, బీరువా, ఇతర వస్తువులు ధ్వంసమయ్యాయి. పలువురి ఇళ్లలో బియ్యం తడిసిపోయాయి. ఈదురుగాలుల వలన రెండు ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, 15 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తహసీల్దార్ పేర్కొన్నారు. అదేవిధంగా 15 కరెంట్ స్తంభాలు, పలు చెట్లు నేలకూలాయన్నారు. కరెంట్ స్తంభాలు నేలకూలడంతో గ్రామంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. కాగా ట్రాన్స్కో ఏఈ క్రాంతి కూలిన స్తంభాలను తిరిగి నాటి కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు. ఆస్తి నష్టం వివరాలను నమోదు చేసుకొని నివేదికను ప్రభుత్వానికి పంపించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చౌటుప్పల్లో.. చౌటుప్పల్: మండల పరిధిలోని పెద్దకొండూరు గ్రామ పంచాయతీ మధిర నక్కలగూడెం గ్రామంలో గుండెబోయిన అంజయ్యయాదవ్ ఇంటి పైకప్పు శుక్రవారం అర్ధరాత్రి వీచిన ఈదురుగాలులకు పూర్తిగా ధ్వంసమైంది. తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. భువనగిరి మండలంలో.. భువనగిరి రూరల్: మండలంలోని ఆకుతోటబావితండా, కాండ్లకుంటతండా, పచ్చర్లబోడుతండా, సూరెపల్లి గ్రామాల్లో శుక్రవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు సుమారు 15 ఇళ్ల పైకప్పులు, రేకులు నేలకొరగగా పెంకుటిళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆయా గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి రోడ్లకు అడ్డంగా పడిపోవడంతో భారీ నష్టం ఏర్పడింది. ట్రాన్స్కో సిబ్బంది శనివారం విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. కాగా ఈదురుగాలులతో తీవ్రంగా నష్టపోయిన తమకు న్యాయం చేయాలంటూ ఆకుతోటబావితండా వాసులు తహసీల్దార్ అంజిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో ధరావత్ పద్మ, కేతావత్ హరి, రమేష్, బాష, మంజ్యా తదితరులు ఉన్నారు. ఫ ధ్వంసమైన ఇళ్ల పైకప్పులు ఫ పలు గ్రామాల్లో విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు -
తప్పులకు ఆస్కారం ఉండొద్దు
నల్లగొండ : వరంగల్– ఖమ్మం –నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్లో ఎలాంటి తప్పులకు ఆస్కారం ఉండొద్దని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున బ్యాలెట్ పేపర్ ఎలా మడత పెట్టాలో తెసుకోవాలని సూచించారు. 800 పైబడి ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలకు 2 బ్యాలెట్ బాక్సులు ఇస్తామని తెలిపారు. ఇటీవలే పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించినందున.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేయి మధ్య వేలికు సిరా గుర్తు పెట్టాలని సూచించారు. ఎన్నికల సంఘం సరఫరా చేసిన వాయిలెట్ స్కెచ్ పెన్ ద్వారా మాత్రమే ఓటర్లు ఓటు వేయాలన్నారు. ఓటు వేసిన తర్వాత ఎవరైనా ఫొటో తీస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ప్రిసైడింగ్ అధికారులు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలను వివరించారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నటరాజ్, ఆర్డీవోలు, మాస్టర్ ట్రైనర్ బాలు పాల్గొన్నారు. ఫ పోలింగ్ సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ హరిచందన -
‘ఎమ్మెల్సీ’ ప్రచారానికి నేటితో తెర
సాక్షి ప్రతినిధి నల్లగొండ: వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన నాటి నుంచి ప్రధాన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పెద్దఎత్తున ప్రచారం చేశారు. ఇక చివరి అంకమైన పోలింగ్ ఈనెల 27వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. దీంతో శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రచారానికి తెర పడనుంది. ఇప్పటి వరకు సభలు, సమావేశాలతో నిర్వహించగా.. ఇక ఓటర్లను ఆకర్షించేలా గిఫ్టులు, డబ్బు పంపిణీపై పార్టీలు దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఇంటింటి ప్రచారం కూడా.. జిల్లాలో 15 రోజులుగా అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు పెద్దఎత్తున ప్రచారం చేశారు. ఇంటింటికి, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వద్దకు వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించారు. నేటి సాయంత్రం 4 గంటల నుంచి ఇంటింటి ప్రచారానికి కూడా తెరపడనుంది. మద్యం దుకాణాలు బంద్ పోలింగ్ సందర్భంగా మద్యం దుకాణాలు కూడా మూత పడనున్నాయి. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం పోలింగ్ మూసిసే వరకు మద్యం షాపులు పూర్తిగా బంద్ కానున్నాయి. దీంతో మద్యం ప్రియులు మందుగానే కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. బరిలో 52 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 52 మంది పోటీలో ఉన్నారు. దీంతో పెద్ద బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. ఇందుకోసం జంబో బ్యాలెట్ బాక్సులను ఉపయోగిస్తున్నారు. ముందు రోజే సిబ్బంది ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఇప్పటికే బీఎల్ఓలు పట్టభద్రుల ఇళ్లకు వెళ్లి పోల్ చిట్టీలు అందజేస్తున్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 12 కొత్త జిల్లాల పరిధిలో పోలింగ్ జరగనుంది. 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫ సాయంత్రం 4 గంటలకు ముగింపు ఫ తుది అంకానికి చేరిన ఎన్నికల ప్రక్రియ ఫ ప్రలోభాలకు సిద్ధమవుతున్న పార్టీలు -
జూన్ 19న డాక్ అదాలత్
రామగిరి(నల్లగొండ) : హైదరాబాద్ చీఫ్ పోస్టాఫీస్లో జూన్ 19న ఆన్లైన్ ద్వారా జాతీయ డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు నల్లగొండ పోస్టల్ సూపరింటెండెంట్ కె.రఘునాథ స్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టల్ సర్వీసులకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే.. పోస్టల్ కవరుపై డాక్ అదాలత్ అని రాసి చీఫ్ పోస్టల్ మేనేజర్ ఎన్.రంగారావు, హైదరాబాద్ 500001 అడ్రస్కు జూన్ 7వ తేదీలోపు చేరేలా పంపాలని పేర్కొన్నారు. నేరెడుగొమ్ము ఎంపీపీగా బిక్కునాయక్ ఎన్నిక చందంపేట : నేరెడుగొమ్ము మండల ఎంపీపీగా వాంకుణావత్ బిక్కునాయక్ ఎన్నికయ్యారు. గతంలో ఇక్కడ ఎంపీపీ, వైస్ ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం నెగ్గగడంతో.. నూతన ఎంపీపీ వైస్ ఎంపీపీల ఎన్నికను శుక్రవారం నేరెడుగొమ్ము ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఎన్నికల అధికారి డీఎల్పీఓ రామ్మోహన్రావు సమక్షంలో నిర్వహించిన ఎన్నికలో కాచరాజుపల్లి ఎంపీటీసీ సభ్యుడు వాంకుణావత్ బిక్కునాయక్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీగా పేర్వాల ఎంపీటీసీ ఇస్లావత్ సరోజను ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే బాలునాయక్ సమక్షంలో వారికి అధికారులు ఎన్నిక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సరోజ, ఎంపీటీసీలు యుగేందర్రెడ్డి, రమేశ్, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ జాన్యాదవ్, జెడ్పీటీసీ బాలునాయక్, పీఏసీఎస్ చైర్మన్లు జాలె నర్సింహారెడ్డి, శ్రీశైలంయాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లోకసాని కృష్ణయ్య, నాయకులు పాపానాయక్, హరికృష్ణ, రమేష్, సుభాష్, భస్వారెడ్డి, కొండల్రెడ్డి, పాషా తదితరులు పాల్గొన్నారు. మర్రిగూడ ఎంపీపీగా రాజమణి మర్రిగూడ : ఎంపీపీగా తిరగండ్లపల్లి ఎంపీటీసీ గండికోట రాజమణిహరికృష్ణ ఎన్నికయ్యారు. డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో శనవారం నిర్వహించిన ఎన్నికకు మొత్తం 11 మంది ఎంపీటీసీ సభ్యులకుగాను ఏడుగురు హాజరయ్యారు. ఎంపీపీగా రాజమణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సీఈఓ ఆమెకు నియామకపత్రం అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. గత ఎంపీపీ మెండు మోహన్రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నూతన ఎంపీపీ ఎన్నిక జరిగింది. కార్యక్రమంలో ఎంపీడీఓ చినమునయ్య, జెడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి, ఎంపీటీసీలు తుమ్మల వరప్రసాద్, ఏర్పుల శ్రీశైలం, వెన్నమనేని శోభారవీందర్రావు, దాసరి మమతగోపాల్ పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాందాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంపీపీని సన్మానించారు. కార్యక్రమంలో వెన్నమనేని రవీందర్రావు, మాజీ జెడ్పీటీసీ మేతరి యాదయ్య, ముద్దం నరసింహాగౌడ్, జంగిలి రవి, రాములుగౌడ్ ఉన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు షురూ నల్లగొండ : ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం మొదటి సంవత్సరం పరీక్షకు మొత్తం 3,012 మంది విద్యార్థులకుగాను 2,800 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన సెకండియర్ పరీక్షకు 1,168 మందికిగాను 1,062 మంది హాజరయ్యారు. తీన్మార్ మల్లన్నకు సంపూర్ణ మద్దతు నల్లగొండ టౌన్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఇండియా కూటమిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన తీన్మార్ మల్లన్నకు మద్దతునిస్తున్నామన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడించాలన్నారు. తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, లక్ష్మీనారాయణ, పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, మల్లేష్, ప్రభావతి, తుమ్మల పద్మ, దండెంపల్లి సత్తయ్య, మంగారెడ్డి, వెంకటేశ్వర్లు, టి.రామ్మూర్తి పాల్గొన్నారు. -
పథకాల అమలు తీరు బాగుంది
నల్లగొండ : జిల్లాలో వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరు బాగుందని కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ సెక్రటేరియట్ శిక్షణ అసిస్టెంట్ సెక్షన్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని డాక్టర్ మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ నిమిత్తం వచ్చిన ఈ బృందం ఈనెల 20 నుంచి 24 వరకు జిల్లాలోని ఎంపిక చేసిన గ్రామాల్లో పర్యటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమలు చేస్తున్న పథకాలను అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్రతో సమావేశమై వారు అధ్యయనం చేసిన ప్రభుత్వ పథకాలపై అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా పలువురు శిక్షణ అధికారులు మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో అమలు చేస్తున్న మిషన్ భగీరథ, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, వైద్య సదుపాయాలు, సెగ్రిగేషన్ షెడ్లు, శ్మశాన వాటికలు, నర్సరీలు, ధాన్యం సేకరణ తదితర పథకాలు బాగున్నాయని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, శిక్షణ నిర్వాహకులు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. ఫ సెంట్రల్ సెక్రటేరియట్ శిక్షణ అసిస్టెంట్ సెక్షన్ అధికారులు -
విత్తనాలు బ్లాక్చేసి దందా..
మునుగోడు : మునుగోడులోని పలువురు ఫర్టిలైజర్ యజమానులు డిమాండ్ కలిగిన పత్తి విత్తనాలను బ్లాక్చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిసింది. ఆ విత్తనాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.864 విక్రయించకుండా.. రూ.1200 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నట్లు పలువురు రైతులు చెబుతున్నారు. ఇదేమిటని రైతులు ప్రశ్నిస్తే ఆ విత్తనాలు అసలు దొరకడం లేదని.. తామే ఒక్కో ప్యాకెట్కు అదనంగా రూ.100 నుంచి రూ.150 చెల్లించి కంపెనీ వద్ద కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతారని రైతులు అంటున్నారు. రైతులు ఎవరైనా గట్టిగా అడిగితే ఆ కంపెనీ విత్తనాలు 5 ఫ్యాకెట్లు కొనుగోలు చేస్తే ఇతర కంపెనీలకు చెందిన మరో 10 ఫ్యాకెట్లు కొనాలని నిబంధన పెట్టి విక్రయిస్తున్నారని చెబుతున్నారు. దీంతో గత్యంతరం లేక వ్యాపారి చెప్పిన ధరకే విత్తనాలు కొనుగోలు చేస్తున్నామని రైతులు వాపోతున్నారు. అధిక దిగుబడి వస్తుందని ప్రచారం.. ఓ కంపెనీకి చెందిన విత్తనాలు అధిక దిగుబడి వస్తుందని రెండేళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ విత్తనాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది రైతులు ఫర్టిలైజర్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. కానీ ఆ విత్తనాల కంపెనీ మునుగోడులోని ఇద్దరు దుకాణాదారులకు డీలర్ షిప్ ఇచ్చినా.. వారిలో ఒక్కరికే విత్తనాలను సరఫరా చేస్తోంది. మునుగోడులో దాదాపు 30కిపైగా ఫర్టిలైజర్ షాపులు ఉన్నాయి. అయితే డీలర్షిప్ కలిగిన వ్యాపారులకు.. ఇతర దుకాణాదారులు సీజన్ ప్రారంభానికి రెండు, మూడు నెలల ముందే అడ్వాన్స్గా రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించి ఆ కంపెనీ విత్తనాలు సరఫరా చేయాలని ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ఆ విత్తనాలకు డిమాండ్ పెరగడంతో ఆ వ్యాపారులకు కూడా సరఫరా చేయకుండా డీలర్షిప్ కలిగిన వ్యాపారే అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. అంతే కాకుండా నల్లగొండ జిల్లాకు కంపెనీ కేటాయించిన విత్తనాలు ఇక్కడే విక్రయించకుండా ఇతర జిల్లాకు కూడా సరఫరా చేసి దందా కొనసాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. విత్తనాల అమ్మకాల విషయంలో ఇంత జరుగుతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా వ్యవసాయ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని డిమాండ్ కలిగిన విత్తనాలు బ్లాక్ మార్కెట్కు తరలించకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విక్రయించేలా చూడాలని కోరుతున్నారు. -
సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి
వరంగల్– ఖమ్మం– నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ సిబ్బందికి భోజనం, బ్యాలెట్ బాక్సుల తరలింపునకు వాహనాలు తదితర విషయాలపై దృష్టి సారించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన పేర్కొన్నారు. శుక్రవారం ఆమె పట్టభద్రుల ఉప ఎన్నికల పరిశీలకుడు, ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జ సమక్షంలో ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ శాసనమండలి ఉప ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. బ్యాలెట్ బాక్సులు, మెటీరియల్ అన్ని 12 జిల్లాల నుంచి నిర్దేశించిన సమయంలో నల్లగొండలోని కౌంటింగ్ కేంద్రానికి తీసుకురావాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కలెక్టర్ జె.శ్రీనివాస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
యాత్రికులను మోసం చేసిన ట్రావెల్స్ యాజమాన్యం
రామగిరి(నల్లగొండ): విహార యాత్రకు వెళ్లిన ప్రయాణికులను ట్రావెల్స్ యాజమాన్యం మోసం చేసిన ఘటన తిప్పర్తి మండలంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..తిప్పర్తి మండలంలోని మామిడాల గ్రామానికి చెందిన 70 మంది కలిసి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన రెండు బస్సుల్లో ఒక్కో బస్సులో 35 మంది చొప్పున ఈ నెల 16వ తేదీన తెలంగాణ, ఆంధ్రపదేశ్, కర్ణాటక, రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలను చూసుకుంటూ గోవా వెళ్లి వచ్చేవిధంగా ఒప్పదం చేసుకొని బయలుదేరారు. కాగా వారి ఒప్పందం ప్రకారం కాకుండా ఒకరోజు ముందుగానే యాత్రికులు నిద్రిస్తున్న సమయంలో డ్రైవర్ బస్సును హైదరాబాద్ మీదుగా వారి స్వగ్రామానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. గమనించిన యాత్రికులు ఎక్కడికి వెళ్తున్నావంటూ డ్రైవర్ను నిలదీశారు. మీ యాత్ర ముగిసింది.. ఇంతకు మించి ఇతర ప్రాంతానికి తీసుకెళ్లడం కుదరదు, మీరు ఇచ్చిన నగదు తిరిగి ఇవ్వడం కుదరదని చెప్పడంతో డ్రైవర్తో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో సదరు బస్సు డ్రైవర్లు ఇద్దరు మహబూబ్నగర్ జిల్లా సమీపంలోని జడ్చర్ల వద్ద గురువారం అర్ధరాత్రి బస్సును వదిలి వెళ్లిపోయారు. ప్రయాణికులు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఏర్పాటు చేసిన డ్రైవర్ సహకారంతో బస్సులో స్వగ్రామం మామిడాలకు చేరుకున్న యాత్రికులు ట్రావెల్స్ యాజమాన్యంపై తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫ యాత్ర ముగియకుండానే బస్సును వదిలేసి పరారైన డ్రైవర్ ఫ పోలీసుల సాయంతో స్వగ్రామానికి చేరుకున్న యాత్రికులు -
నల్లగొండ కలెక్టర్ హరిచందన పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన పేరుతో ఫేస్బుక్లో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఖాతా ఓపెన్ చేశారు. ప్రొఫైల్లో కలెక్టర్ హరిచందన ఫొటోతోపాటు బ్యాక్గ్రౌండ్లో గతంలో ఆమె చేసిన కార్యక్రమాలతో కూడిన ఫొటోలతో హరిచందన్ ఐఏఎస్ పేరుతో ఖాతాను రూపొందించి ఓపెన్ చేశారు. దీంతో కలెక్టర్కు తెలిసిన వారు ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే దానికి యాక్సెప్ట్ చేసి, ఆ ఖాతాలో ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వారికి హరిచందన ఐఏఎస్ పేరుతో కలిగిన ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతున్నారు. అది నిజమని భావించిన వారు యాక్సెస్ట్ చేయడంతో అసలు కథ అప్పుడు మొదలవుతోంది. ఫేస్బుక్ మెసేంజర్ ద్వారా చాటింగ్ మొదలు పెడుతున్నారు. తనకు సంతోష్కుమార్ అనే సీఆర్పీఎఫ్ ఆఫీసర్ ఫ్రెండ్ ఉన్నారని, ఆయనకు ట్రాన్స్ఫర్ అయిందని, తన ఇల్లును తక్కువ ధరకు అమ్ముతున్నారంటూ చాటింగ్ మొదలు పెడుతున్నారు. మీకు తెలిసిన వారికి విక్రయించి పెట్టమని, లేదంటే మీరే తీసుకోండని మాటల్లో పెట్టి, ఫోన్నెంబరు తీసుకొని మరొక నంబరుతో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేస్తూ డబ్బులు లాగే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇల్లు ఎలాగూ తీసుకుంటారని భావిస్తున్నానని, తాను ప్రస్తుతం మీటింగ్లో ఉన్నానని, అర్జంట్ అవసరం ఉందంటూ డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనను వివరణ కోరగా, తనకు ఫేస్బుక్ ఖాతా లేదని, అది ఫేక్ అకౌంట్ అయి ఉంటుందని, ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఎవరు నమ్మిమోసపోవద్దని పేర్కొన్నారు.ఫ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తూ.. మెసెంజర్లో చాటింగ్ ఫ మా ఫ్రెండ్ సీఆర్పీఎఫ్ ఆఫీసర్ ఇల్లు అమ్ముతారంటూ చాటింగ్ ఫ మీకు తెలిసిన వారికి అమ్మించమంటూ మెసేజ్లు -
కాంగ్రెస్ది మాటల ప్రభుత్వమే..
నకిరేకల్, దేవరకొండ: ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ది మాటల ప్రభుత్వమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. శుక్రవారం నకిరేకల్, దేవరకొండలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో వారొచ్చాకే హత్యా రాజకీయాలు మొదలయ్యాయని, గడిచిన ఆర్నెళ్లలో రెండు హత్యలు జరిగాయన్నారు. ఎన్నికల ముందు మార్పు తీసుకొస్తాం అని ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ నాయకులు టీఎస్ నుంచి టీజీ, 24గంటల కరెంట్ నుంచి వచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా పేదింటి ఆడ బిడ్డల పెండ్లికి రూ.లక్ష, తులం బంగారం ఇస్తానని చెప్పిన రేవంత్రెడ్డి ఎంతమందికి ఇచ్చాడని ప్రశ్నించారు. తులం బంగారం కాదు కదా.. తులం ఇనుము కూడా ఇవ్వలేదన్నారు. ఆర్నెళ్ల కింద కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేశారా.. లేదా.. అన్నది ఒక్కసారి ఆలోచించి విచక్షణతో ఓటు వేయాలని పట్టభద్రులను కోరారు. టెట్ ఫీజు ఐదు రెట్లు పెంచి నిరుద్యోగుల పొట్ట కొట్టారని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి బ్లాక్మైలర్ అని.. అతనిపై 56 క్రిమినల్ కేసులు ఉన్నాయని వాటిలో అమ్మాయిలు పెట్టినవే 10 కేసులు ఉన్నాయన్నారు. అలాంటి వ్యక్తిని చట్టసభల్లోకి రానివొద్దని కోరారు. బీజేపీతో ఒరిగిందేమీ లేదు : గుంటకండ్ల మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి మాట్లాడుతూ గడిచిన పదేళ్ల కాలంలో బీజేపీతో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఇక్కడే నోట మాట రాదని, ఆయనకు ఓటు వేసి గెలిపిస్తే ప్రయోజనం ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాదన్నారు. విదేశాల్లో స్థిర పడే అవకాశం వచ్చినా ఇక్కడి ప్రజల కోసం పని చేస్తున్న రాకేష్రెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని పట్టభద్రులంతా ఆలోచన చేసి మద్దతు ఇవ్వాలని కోరారు. ఆయా సమావేశాల్లో నల్లగొండ, యాదాద్రి జిల్లాల జెడ్పీ చైర్మన్లు బండ నరేందర్రెడ్డి, సందీప్రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, గాదరికిషోర్, గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎన్నికల ఇన్చార్జి రాంబాబు యాదవ్, నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్, డాక్టర్ నలగాటి ప్రసన్నరాజ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, కొప్పుల ప్రదీప్రెడ్డి, జెడ్పీటీసీలు మాద ధనలక్ష్మి, బలరాం, స్వర్ణలత, నాయకులు నేనావత్ కిషన్నాయక్, వడ్త్యా రమేష్నాయక్, సునితాజనార్దన్రావు, కంకణాల వెంకట్రెడ్డి, టివిఎన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.ఫ వారొచ్చాకే తెలంగాణలో హత్యా రాజకీయాలు మొదలయ్యాయి ఫ టీఎస్ను టీజీగా మార్చిడం తప్ప చేసిందేమీ లేదు ఫ పట్టభద్రులు విచక్షణతో ఓటు వేయాలి ఫ మాజీ మంత్రి కేటీఆర్ -
నకిలీలకు అడ్డుకట్ట
నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నకిలీ విత్తనాల బెడదను అరికట్టేలా వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. పత్తి విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమానికి శుక్రవారం నుంచి శ్రీకారం చుట్టింది. రైతులతో సమావేశాలను ఏర్పాటు చేసి పత్తి విత్తనాలపై అవగాహన కల్పిస్తోంది. జిల్లాలోని 140 వ్యవసాయ క్లస్టర్లలోని వ్యవసాయ విస్తరణాధికారులు తమ పరిధిలోని 5 నుంచి 7 గ్రామాల్లో రోజూ రెండు నుంచి మూడు గ్రామాల చొప్పున రైతులతో సమావేశాలను నిర్వహించనున్నారు. గ్రామంలోని కూడళ్లలో కూర్చున్న రైతులతో ఏఈఓలు మమేకమై పత్తి సాగుపై చర్చించి విత్తనాల ఎంపికపై అవగాహన కల్పించనున్నారు. ఆయా ఏఈఓల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఈ నెలాఖరు వరకు అవగాహన కార్యక్రమాలు పూర్తిచేసేలా జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళికను రూపొందించింది. దుకాణాల్లో తనిఖీలు.. గతంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు నకిలీతోపాటు లూజ్ విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేశాక దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యవసాయ శాఖ ప్రస్తుత సీజన్లో వాటిని అరికట్టేలా ముందస్తుగానే చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని విత్తనాలు దుకాణాల్లో తనిఖీలు చేయడంతోపాటు టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లాలోని విత్తనాల దుకాణాదారులతో సమావేశం ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, బ్రాండెండ్ కంపెనీల, నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని ఆదేశించింది. ఈ అంశాలపై రైతులకు అవగాహన నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండడంతో పాటు నాణ్యమైన విత్తనాల ఎంపిక, బార్కోడ్ ఉందా లేదా అనేది పరిశీలించడం, కంపెనీ పేరు, ప్యాకింగ్ తేదీ, గడువు ముగిసే తేదీ పరిశీలించడంతో పాటు ఎమ్మార్పీని పరిశీలించాల్సి ఉంటుంది. కొనుగోలు చేసి పత్తి ప్యాకెట్లకు విధిగా రశీదులను తీసుకోవాలని, రశీదును సీజన్ముగిసే వరకు భద్రపర్చుకోవాలని సూచించనున్నారు. లూజ్ విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయవద్దని, లూజ్ విత్తనాలు అమ్మేవారి సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. వీటితోపాటు పత్తి పంట సాగులో తీసుకోవాల్సిన మెళకువలు, జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలను వివరిస్తున్నారు.రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అప్రమత్తం ఫ పత్తి విత్తనాలపై అవగాహన కార్యక్రమాలు ఫ ఏఈఓ పరిధిలోని అన్ని గ్రామాల్లో సమావేశాల నిర్వహణ ఫ విత్తనాల అమ్మకంపై నిరంతరం నిఘా ప్రతి రోజూ వివరాల సేకరణ.. పత్తి విత్తనాల దుకాణాల్లో రోజు వారీగా విక్రయించే ప్యాకెట్ల వివరాలు, విత్తనాల స్టాక్ తదితర విషయాలు తెలుసుకునేందుకు ఏఈఓలు దుకాణాలను సందర్శించి ఏరోజుకారోజు జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దీంతో నకిలీ, లూజ్ విత్తనాలను అరికట్టవచ్చని వ్యవసాయశాఖ భావిస్తోంది. ఈ అవగాహన కార్యక్రమాలను మండలస్థాయిలో ఏఓలు, జిల్లా స్థాయిలో జిల్లా వ్యవసాయాధికారి పర్యవేక్షించనున్నారు. రైతులకు ఎంతో మేలు సీజన్కు ముందుగానే పత్తి విత్తనాలపై అవగాహన కల్పించడం వల్ల రైతులకు మేలు జరుగుతుంది. వ్యా పారులు చెప్పిన విధంగా కాకుండా రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుంటారు. రైతులను చైతన్యం చేయడమే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. – పాల్వాయి శ్రవణ్కుమార్, డీఏఓ -
ప్రయాణికులపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఫిర్యాదు
నకిరేకల్ : ఆర్టీసీ బస్సులో ప్రయాణికులకు, డ్రైవర్కు మధ్య వివాదం తలెత్తింది. దీంతో సదరు డ్రైవర్ పోలీస్స్టేషన్ ఎదుట బస్సును నిలిపి గొడవ చేసిన ప్రయాణికులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నార్కట్పల్లి డిపో ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు బయలుదేరింది. హైదరాబాద్లోనే మహిళా ప్రయాణికులతో బస్సు నిండిపోయింది. మార్గమధ్యలో నకిరేకల్కు చేరుకున్నాక బస్సులోనుంచి కొంత మంది ప్రయాణికులు దిగిపోయారు. అందులో నలుగురు మహిళా ప్రయాణికులు బస్సును కొద్ది సేపు ఆపండి.. తమ బంధువులు వస్తున్నారని డైవర్ను కోరారు. కొద్దిసేపు బస్సు ఆపినప్పటికీ వారు రాకపోవడంతో డ్రైవర్ బస్సును కదిలించడంతో డ్రైవర్తో మహిళా ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. డ్రైవర్కు ప్రయాణికులకు మధ్య గొడవ ముదరడంతో సదరు డ్రైవర్ బస్సును పోలీస్ స్టేషన్ దగ్గరకు తీసుకెళ్లి నిలిపివేశారు. విధి నిర్వహణకు ప్రయాణికులు ఆటంకం కలిగించారని ప్రయాణికులపై పోలీస్స్టేషన్లో డ్రైవర్ ఫిర్యాదు చేశారు. అనంతరం డ్రైవర్కు, ప్రయాణికులకు పోలీసులు సర్దిచెప్పి పంపించడంతో సమస్య సద్దుమనిగింది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- మాకంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చుంటే రాజీనామా చేస్తా
- Malaysia Masters 2024: ఫైనల్లో పీవీ సింధు
- ‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!
- Lok Sabha Election 2024: ఆరో విడతలో 61.11 శాతం
- కలిసికట్టుగా ముందుకు..
- Lok Sabha Election 2024: ముస్లింల ఓట్ల కోసం ‘ముజ్రా’
- India Meteorological Department: రాజస్తాన్లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
- సిరుల విరులు..కొండ చీపుర్లు
Advertisement