
రాత్రి గజగజ
పగలు భగభగ..
విభిన్న వాతావరణం
సాక్షి,పాడేరు: జిల్లాలో భానుడి ప్రతాపంతో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉదయం తొమ్మిది గంటలు దాటితే ప్రధాన కూడళ్లు జనసంచారం లేక బోసిపోతున్నాయి. మరో వైపు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో చలి వణికిచేస్తోంది. ఉదయం 8 గంటల వరకు దట్టంగా పొగమంచు కురుస్తోంది. వేసవి కాలంలోను పొగమంచు కురుస్తుండడంతో సూర్యోదయం అయ్యేంత వరకు ఆహ్లాదకర వాతావరణంతో జిల్లా వాసులు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఉదయం 9 గంటల నుంచే సూర్యుడి భగభగలతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. మైదాన ప్రాంతాలను తలపిస్తూ వడగాడ్పులు వీస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం ఎండ చుర్రుమంటుండడంతో జిల్లా కేంద్రం పాడేరుతో పాటు అన్ని మండల కేంద్రాల్లోని రోడ్లపై జనసంచారం తక్కువగా ఉంటోంది. ఎండను తాళలేక వ్యవసాయ, కూలి పనులకు వెళ్లే గిరిజనులు మధ్యాహ్నానికే ఇంటికి చేరుకుంటున్నారు. వారపు సంతలపైన ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. జిల్లాలో చాలా ప్రాంతాల్లో 36 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు : చింతూరులో 37.7 డిగ్రీలు, మారేడుమిల్లిలో 37.7, వై.రామవరంలో 37.6, పాడేరులో 37, డుంబ్రిగుడలో 37, కొయ్యూరులో 36.7, రాజవొమ్మంగిలో 36.6, కూనవరంలో 36.5, రంపచోడవరంలో 36.1 అడ్డతీగల 36.1, ముంచంగిపుట్టులో 35.4, పెదబయలులో 35, హుకుంపేటలో 34.9, అరకులోయలో 34, అనంతగిరిలో 33.3, జీకే వీధిలో 33, చింతపల్లిలో 32.5, జి.మాడుగులలో 32.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉష్ణోగ్రతలు మరింతపెరుగుతాయి
ఈఏడాది జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. పాడేరు డివిజన్ కంటే రంపచోడవరం, చింతూరు డివిజన్లలో ఎండలు మరింత విజృంభించనున్నాయి. అధిక ఎండలు,గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మిరియాలు, పసుపు, పిప్పళ్ల పంటల సేకరణలో గిరిజన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
– డాక్టర్ అప్పలస్వామి, ఏడీఆర్,
చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం
ఉదయం 8గంటల వరకు
పొగమంచు
ఉదయం 9 గంటల తరువాత చుర్రుమనిపిస్తున్న సూరీడు
సాయంత్రం వరకు వడగాడ్పులు
అధిక వేడితో ఇబ్బందులు
డుంబ్రిగుడ: మండలంలో విభిన్న వాతావరణం నెలకొంది. ఉదయం మంచు కురుస్తుండడంతో పాటు రాత్రి చలిగాలలు వీస్తున్నాయి. మంచు ఎక్కువగా కురుస్తుండడంతో దారి సరిగా కనిపించక వాహనచోదకులు లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉండంతో మండల వాసులు అల్లాడిపోతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందడానికి గిరిజన చిన్నారులు సమీప గెడ్డలు, చాపరాయి వద్ద జలకాలాటలాడుతున్నారు. అధికంగా కురుస్తున్న మంచు వల్ల మామిడి పూతకు నష్టంవాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

రాత్రి గజగజ

రాత్రి గజగజ

రాత్రి గజగజ