
సాక్షి, వైఎస్సార్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఏపీలో వైఎస్సార్సీపీ కేడర్ వినాశమే టార్గెట్గా అధికారులు పని చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి వైఎస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఎవరినీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటాం అని హెచ్చరించారు.
కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషాను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల ఆయన సోదరుడు అహ్మద్ భాషా ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంజాద్ భాషాను పరామర్శించి, ధైర్యంగా ఉండాలని, పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం, అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోంది. అభివృద్ధిపై కాకుండా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులే లక్ష్యంగా పెట్టుకున్నారు.
మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష సోదరుడు అహ్మద్ భాషాపై అక్రమ కేసు నమోదు చేశారు. తీవ్రవాది మాదిరి ముంబై వెళ్ళి అహ్మద్ భాషాను అక్రమ అరెస్టు చేసి అత్యుత్సాహంగా కడపకి తెచారు. ఆయన అరెస్ట్ తర్వాత అంజాద్ భాషా ఇంటి సమీపంలో టీడీపీ నాయకులు సంబరాలు చేయడం దారుణం. కడపలో టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడటం దారుణం. ఎమ్మెల్యే మాధవి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి దగ్గర మెప్పు పొందడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ కేసులు, వేధింపులకు గురిచేస్తున్న ఎవరినీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటాం’ అని హెచ్చరించారు.
