● వరంగల్ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య
కాళోజీ సెంటర్ : పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని ఒక గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు వరంగల్ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
కేజీబీవీలో అడ్మిషన్లు
ప్రారంభం
జనగామ రూరల్: జిల్లాలోని కేజీబీవీ పాఠశాల, ఇంటర్మీడియట్లో అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయని డీఈఓ కె. రాము ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఇంటర్, పదో తరగతి ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించారన్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సుల్లో అడ్మిషన్లు ఉన్నాయన్నారు. 6వ తరగతిలో అడ్మిషన్లు తీసుకోవాలని పరిమిత సీట్లు ఉన్నాయని, కావాల్సిన విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవాలని కోరారు.
బీజేపీకి పెరుగుతున్న
ఆదరణ
జనగామ: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీకి చాపకింద నీరులా ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. నెల్లుట్లలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. నేడు(సోమవారం) భువనగిరి పార్లమెంట్ పరిధిలోని చౌటుప్పల్లో ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ తరఫున ప్రచారం చేసేందుకు జరిగే భారీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. జనగామ నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.
మీ ఇంటి ఆడబిడ్డగా
కావ్యను గెలిపించండి
చిల్పూరు: మీ ఇంటి ఆడబిడ్డగా వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలని టీపీసీసీ కార్యదర్శి సింగపురం ఇందిర, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని పల్లగుట్ట గ్రామంలోని చిల్పూరు ఆలయ శాశ్వత అభివృద్ధి దాత పొట్లపల్లి శ్రీధర్రావు ఇంటి ఆవరణలో ఆదివారం పల్లగుట్ట క్లస్టర్ గార్లగడ్డతండా, ఫత్తేపూర్, పల్లగుట్ట, దేశాయితండా గ్రామాలకు చెందిన కార్యకర్తల సమావేశం పార్టీ మండల అధ్యక్షుడు గడ్డమీది సురేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని కేంద్రంలోనూ అధికారంలోకి వస్తే తెలంగాణను మరింత అభివృద్ధి చేసుకోగులుగుతామని, అందుకు కావ్యను గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి కావ్య మాట్లాడుతూ మీఅందరి ఆశీర్వాదాలతో గెలిపిస్తే మీరు అనుకున్నదానికన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తానన్నారు. మండలంలోని మల్కాపూర్, చిఅల్పూరు, చిన్నపెండ్యాల గ్రామాల్లో కార్నర్ మీటింగ్లను నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈవీఎంల పరిశీలన
పాలకుర్తి టౌన్: ఈ నెల 13న జరుగనున్న పార్లమెంట్ ఓటింగ్ ఈవీఎంలను జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్యలు పరిశీలించారు. ఆదివారం స్ట్రాంగ్ రూంలను చెక్ చేశారు. మిషన్లు పనితీరు సవ్యంగా ఉందన్నారు. ప్రతీ పోలింగ్ స్టేషన్కు ఇవ్వాల్సిన ఈవీఎంలను చెక్ చేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి తహసీల్దార్ వెంకటేశం, సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ ప్రసన్న కుమార్లు ఉన్నారు.