విభజనపై సీమాంధ్ర ప్రజల అభ్యర్థనలను పరిశీలించేవరకు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు తమకు అధిష్టానం సంకేతాలిచ్చిందని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ బుధవారం ప్రకటించారు.
సాక్షి, న్యూఢిల్లీ: విభజనపై సీమాంధ్ర ప్రజల అభ్యర్థనలను పరిశీలించేవరకు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు తమకు అధిష్టానం సంకేతాలిచ్చిందని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ బుధవారం ప్రకటించారు. ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నామని అన్నారు.
రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సీవూంధ్ర ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఆ ప్రాంత నేతలు లగడపాటి ఇంట్లో సమావేశమై మరోమారు చర్చించారు. ఓ వైపు తెలంగాణపై వెనక్కి వెళ్లేది లేదని పార్టీ పెద్దలు స్పష్టం చేస్తుండటం, మరోవైపు పదవులకు రాజీనామాలు చేసి ఆందోళనలో పాల్గొనాలని ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో వారంతా ఆయోమయంలో పడ్డారు. భేటీకి ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్, బాపిరాజు, మాగుంట శ్రీనివాసులరెడ్డి, హర్షకుమార్తో పాటు మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళీ, శైలజానాథ్లు హాజరయ్యారు.