Standard deduction
-
రాబడిపై పన్ను సున్నా...
కొత్త బడ్జెట్లో ఆదాయపన్ను మినహాయింపు రాయితీలను గణనీయంగా పెంచడంతో మధ్యతరగతికి పెద్ద ఊరట లభించింది. వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్తో కలుపుకుని రూ.12.75 లక్షలు, ఇతరులకు రూ.12 లక్షల ఆదాయం ఉన్నా కానీ కొత్త విధానంలో రూపాయి పన్ను లేకుండా చేశారు ఆర్థిక మంత్రి. ఇప్పటికీ అధిక ఆదాయ పరిధిలో ఉండి, పన్ను ఆదా పెట్టుబడుల కోసం అన్వేషించే వారికి మెరుగైన మార్గం ఒకటి ఉంది. పన్ను ఆదా చేసే ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవడమే. వీటి నుంచి వచ్చే రాబడిపై ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఇందులో ఉండే ప్రయోజనాలు, ఎలా ఇన్వెస్ట్ చేయాలి? తదితర వివరాలతో కూడిన కథనమే ఇది... బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు), చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులపై వచ్చే రాబడికి ఎలాంటి పన్ను ఆదా ప్రయోజనం లేదు. దీంతో రూ.12 లక్షలకు పైన ఆదాయం ఉన్న వారికి పన్ను ప్రయోజనం పరంగా ఇలాంటివి మెరుగైన సాధనాలు కాబోవు. ఎందుకంటే వీటిపై వచ్చే రాబడి పన్ను చెల్లింపుదారు వార్షిక ఆదాయానికి కలుస్తుంది. దాంతో చెల్లించాల్సిన పన్ను భారం పెరిగిపోతుంది. ఫలితంగా నికర ఆదాయం రూ.12.75 లక్షలకు మించిపోవచ్చు. దీనివల్ల పన్ను ఆదా రాయితీని కోల్పోవాల్సి వస్తుంది. కనుక అధిక ఆదాయం పరిధిలో ఉన్న వారికి అందుబాటులో ఉన్న మెరుగైన సాధనం ట్యాక్స్ ఫ్రీ బాండ్లే. ఎందుకంటే ఈ బాండ్లపై వచ్చే రాబడి ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలవదు. దీంతో ఈ మేరకు ప్రయోజనం పొందొచ్చు. ముఖ్యంగా రూ.12 లక్షల స్థాయిలో ఆదాయం కలిగిన వృద్ధులు (సీనియర్ సిటిజన్లు/60 ఏళ్లు నిండిన వారు) తమ రిటైర్మెంట్ నిధిలో కొంత మొత్తాన్ని ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయమే అవుతుంది. తద్వారా వారి పన్ను వర్తించే ఆదాయం రూ.12 లక్షలకు మించకుండా చూసుకోవచ్చు. పలు సంస్థల నుంచి బాండ్లు.. గతంలో పలు ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన ట్యాక్స్ ఫ్రీ బాండ్లు ప్రస్తుతం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ ఎక్సే్ఛంజ్లలో క్యాష్ విభాగంలో ట్రేడ్ అవుతున్నాయి. వీటిల్లో కొన్నింటిలో మెరుగైన లిక్విడిటీ (కొనుగోళ్లు, అమ్మకాల పరిమాణం)ని గమనించొచ్చు. ఇంకా 11 ఏళ్ల కాల వ్యవధితో బాండ్లు లభిస్తున్నాయి. ప్రస్తుతం వీటిల్లో పన్ను రహిత రాబడి రేట్లు 5.5–5.9 శాతం మధ్య ఉన్నాయి. పెట్టుబడికి రక్షణ, అదే సమయంలో స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఇవి మెరుగైన ఆప్షన్ అని విశ్లేషకులు చెబుతున్నారు. 2012 నుంచి 2016 మధ్య కాలంలో 14 ప్రభుత్వరంగ ఇన్ఫ్రా ఫైనాన్స్ కంపెనీలు (ఎన్హెచ్ఏఐ, ఐఆర్ఎఫ్సీ, పీఎఫ్సీ తదితర) సెక్యూర్డ్ (రక్షణతో కూడిన) ట్యాక్స్ ఫ్రీ బాండ్లను జారీ చేశాయి. వీటి కాల వ్యవధి 10, 15, 20 ఏళ్ల చొప్పున ఉంది. ఈ బాండ్లలో పెట్టుబడులపై రాబడి చెల్లింపులు ఏడాదికోసారి చేస్తారు. వీటికి అధిక భద్రతను సూచించే ‘ఏఏఏ’ రేటింగ్ను క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చాయి. గతంలో జారీ చేసిన అన్ని ట్యాక్స్ ఫ్రీ బాండ్ల సిరీస్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ అయి ఉన్నాయి. ఇప్పటి వరకు 193 ఇష్యూలు రాగా, అందులో 57 బాండ్ల మెచ్యూరిటీ (కాలవ్యవధి) ముగిసిపోయింది. మిగిలిన ట్యాక్స్ ఫ్రీ బాండ్లు ప్రస్తుతం స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో ట్రేడ్ అవుతున్నాయి. వీటి మెచ్యూరిటీ సగటున 11 ఏళ్ల వరకు ఉంది. ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన ఈ బాండ్లలో రిస్క్ చాలా చాలా తక్కువ. ఒక విధంగా ఉండదనే చెప్పుకోవాలి. దీనికితోడు పన్ను ప్రయోజనం కూడా ఉండడం అదనపు ఆకర్షణ. తక్కువ ఆదాయం ఉన్న వారికి..? ఆదాయపన్ను పరిధిలో లేకుండా.. ఆదాయం తక్కువగా ఉన్న వారు ప్రత్యామ్నాయాలను పరిశీలించొచ్చు. ‘ఏఏఏ’ రేటెడ్ కార్పొరేట్ బాండ్లలో రిస్క్ కొంత తక్కువగా ఉంటుంది. వీటిల్లో ఈల్డ్స్ 7.4 శాతం మేర ఉన్నాయి. అలాగే, వృద్ధులకు బ్యాంక్ ఎఫ్డీలపై 8 శాతం వరకు వడ్డీ రేటు ప్రస్తుతం లభిస్తోంది. కానీ, కార్పొరేట్ బాండ్లు, బ్యాంక్ ఎఫ్డీలపై వచ్చే రాబడి పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. మెచ్యూరిటీతో సంబంధం లేకుండా ఆయా పెట్టుబడులపై ఏటా వచ్చే రాబడిని ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అధిక ఆదాయపన్ను శ్లాబు రేటులో ఉన్న వారికి పన్ను చెల్లింపులు పోగా మిగులు నికర రాబడి 4.6–5.1 శాతం మించదు. అయితే, తక్కువ ఆదాయ శ్లాబుల్లో ఉన్న వారు, పన్ను వర్తించేంత ఆదాయం లేని వారికి.. కార్పొరేట్ బాండ్లు, బ్యాంక్ ఎఫ్డీలు తదితర సాధనాలను పరిశీలించొచ్చు. ఎందుకంటే వీటి నుంచి వచ్చే వడ్డీ రాబడి కలిసిన తర్వాత కూడా వారి ఆదాయం పన్ను పరిధిలోకి రాదు. ఎంపిక ఎలా..? ఈ బాండ్ల ఎంపిక అంత కష్టమైన విషయం కాదు. ముఖ్యంగా చూడాల్సింది లిక్విడిటీయే. అంటే ఆయా బాండ్లు రోజువారీగా ఎక్సే్ఛంజ్లలో ట్రేడ్ అవ్వడంతోపాటు, తగినంత ట్రేడింగ్ వ్యాల్యూమ్ కూడా ఉండాలి. దీనివల్ల కొనుగోలు, విక్రయం సులభంగా మారుతుంది. ఆ తర్వాత చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం బాండ్ ఈల్డ్స్ టు మెచ్యూరిటీ (వైటీఎం). అంటే ఆయా బాండ్పై మిగిలి ఉన్న కాలానికి ఎంత రాబడి వస్తుందో ఇది తెలియజేస్తుంది. అధిక లిక్విడిటీ ఉన్న బాండ్ను మెరుగైన ధరపై కొనుగోలు చేసుకోవచ్చు. అదే లిక్విడిటీ తగినంత లేని చోట (అమ్మకాలకు ఎక్కువ మంది లేనప్పుడు) బాండ్ కొనుగోలు వ్యయం పెరిగిపోతుంది. దీనివల్ల ఈల్డ్ తగ్గిపోతుంది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ డేటా ప్రకారం ప్రస్తుతం స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో ట్రేడ్ అవుతున్న వాటిల్లో 20 బాండ్లలో మెరుగైన లిక్విడిటీ ఉంటోంది. ఉదాహరణకు ‘ఆర్ఈసీ బాండ్ ‘871ఆర్ఈసీ28’ను 2014లో 8.71 శాతం వార్షిక రేటుపై జారీ చేయగా.. గత నెలరోజులుగా రోజువారీ ట్రేడింగ్ వ్యాల్యూమ్ ఇందులో 1,534గా ఉంటోంది. ఈ బాండ్లో ఇటీవలి వైటీఎం 5.9 శాతంగా ఉంది. ఇది అనుకూల తరుణం.. ఆర్బీఐ ఇటీవలే రెపో రేటును పావు శాతం తగ్గించింది. రానున్న రోజుల్లో మరో 50 బేసిస్ పాయింట్ల వరకు (0.50 శాతం) రేట్లు తగ్గుతాయని విశ్లేషకుల అంచనాగా ఉంది. ఇప్పటికీ దీర్ఘకాల డెట్ సాధనాలపై రాబడులు మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కనుక డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే వారికి ప్రస్తుతం అనుకూల సమయం. పన్ను లేకపోవడం, పెట్టుబడులపై గరిష్ట పరిమితి లేకపోవడంతో ట్యాక్స్ ఫ్రీ బాండ్లు అధిక ఆదాయ వర్గాలకు మెరుగైన సాధనం అవుతుంది. పైగా ట్యాక్స్ ఫ్రీ బాండ్ల జారీ నిలిచిపోయింది. అంటే కొత్తగా బాండ్ల ఇష్యూలు రావడం లేదు. కనుక వీటిల్లో పెట్టుబడులు పెట్టుకోవాలంటే సెకండరీ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న వాటి నుంచే ఎంపిక చేసుకోవాలి. ఇన్వెస్టర్లు ఇక్కడి నుంచి ఎంత కాలానికి పెట్టుబడులు పెట్టుకోవాలని అనుకుంటున్నారో.. అంత కాలంలో మెచ్యూరిటీ తీరిపోయే ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. రిటర్నులు ఆకర్షణీయం సెకండరీ మార్కెట్లో ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో పెట్టుబడులు పెట్టే వారు మార్కెట్ రేటు కంటే ప్రధానంగా ఈల్డ్స్ టు మెచ్యూరిటీ (వైటీఎం)పైనే దృష్టి సారించాలి. ఇన్వెస్టర్ ఒక బాండ్ను కొనుగోలు చేసిన దగ్గర్నుంచి, అది మెచ్యూరిటీ అయ్యే వరకు ఏటా వచ్చే రాబడిని వైటీఎం సూచిస్తుంది. 15 ట్యాక్స్ ఫ్రీ బాండ్ల సిరీసీస్లలో ప్రస్తుతం వైటీఎం 5.5 శాతం నుంచి 5.9 శాతం మధ్య ఉంది. ఇవి గమనించాలి.. → 30 శాతం ఆదాయపన్ను పరిధిలో ఉన్న వారికి 6 శాతం పన్ను రహిత రాబడి నిజంగా ఎంతో మెరుగైనది. పన్ను ప్రయోజనం కూడా కలుపుకుంటే 8.5 శాతం రాబడి వచి్చనట్టు. → 20 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి సైతం 7.5 శాతం రాబడి వచి్చనట్టు అవుతుంది. → 10 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి దక్కే ప్రయోజనం తక్కువే. → కార్పొరేట్ బాండ్లతో పోల్చితే ట్యాక్స్ ఫ్రీ బాండ్లు అధిక రేటింగ్ కలిగినవి. ఈ బాండ్లను జారీ చేసేవి ప్రభుత్వరంగ సంస్థలే కనుక డిఫాల్ట్ దాదాపుగా ఉండదు. → ఇన్వెస్టర్ తనకు వీలైనంత ఇందులో పెట్టుబడి పెట్టుకోవచ్చు. గరిష్ట పరిమితి ఉండదు. → స్వల్పకాల లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులకు వీటిని ఎంపిక చేసుకోవడం సరికాదు. → వీటిల్లో ఒక్కోసారి లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. కనుక కాల వ్యవధి ముగిసేంత వరకు కొనసాగే వెసులుబాటు ఉన్న వారే వీటిని ఎంపిక చేసుకోవాలి. → కేవలం పన్ను ప్రయోజనం కోసమే వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం అనిపించుకోదు. రిస్క్ తీసుకునే వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇంతకంటే ఎక్కువ రాబడినే (పన్ను పోను) ఇస్తాయి. పోర్ట్ఫోలియోలో పెట్టుబడుల వైవిధ్యం కోసం డెట్ విభాగం కింద ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవచ్చు. → అధిక లిక్విడిటీ, మెరుగైన వైటీఎం ఉన్న వాటికే పరిమితం కావాలి. –సాక్షి, బిజినెస్డెస్క్ -
వేతన జీవులకు నిర్మలా సీతారామన్ భారీ షాక్!
అడగనిదే అమ్మయినా పెట్టదంటారు. అందుకని వేతన జీవులు తమ వేదనలను వెలిబుచ్చుతూ ఎన్నో విన్నపాలు వినవలె అంటూ విన్నవించుకున్నారు. కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిగి రాలేదు. చలించలేదు. పెడచెవిన పెట్టారో .. శీతకన్ను వేశారో .. మొత్తానికి చిన్న చూపే చూశారనే చెప్పాలి. కరోనా నేపథ్యంలో ఆర్థిక స్థితి బాగులేదని సరిపెట్టుకుందామనుకున్నా ముందు రోజు విడుదల చేసిన ‘ఆర్థిక సర్వే‘ ఎంతో ఆశాజనకంగా ఉంది. స్టాండర్డ్ డిడక్షన్ పెరుగుతుందని ఆశించారు. కానీ పెంచలేదు. సెక్షన్ 80సిలో సేవింగ్స్ లిమిట్ పెరుగుతుందనుకున్నారు. పిల్లల స్కూలు ఫీజుకు ఎక్కువ మినహాయింపు లభిస్తుందనుకున్నారు. ఇంటి లోన్ మీద వడ్డీకి మినహాయింపు పెరుగుతుందని అనుకున్నారు. కానీ.. భారతదేశాన్ని ’డిజిటల్’ భారతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో నీతిగా, నిజాయితీగా క్రమం తప్పకుండా పన్నులు చెల్లించే వేతనజీవులకు ఎటువంటి వెసులుబాటు లభించలేదు. నిన్న, మొన్నటి వరకూ ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడి అందరూ రిటర్నులు వేశారు. వెబ్సైట్లో దురదృష్టవశాత్తూ ఏర్పడ్డ స్వాభావిక ఇబ్బందుల వల్ల తుది గడువును పలు మార్లు పొడిగించి చివరికి మమ అనిపించింది. ఇప్పుడు కొత్త ఫెసిలిటీ ఇస్తారట. అది అమల్లోకి వచ్చినప్పటి మాట. ఫెసిలిటీ ఇవ్వడమనేది ఎటువంటి ఉపశమనం కాదు. అది బాగా పనిచేస్తే త్వరితగతిన ఫైలింగ్ చేసుకోవచ్చు. శ్లాబ్రేట్లు యథాతథం.. బేసిక్ లిమిట్ పెంచలేదు. శ్లాబ్ రేట్లు యథాతథంగా ఉంచారు. రేట్లలో మార్పు లేదు. పైపెచ్చు పెంచకపోవడమే ఊరట అన్నారు మంత్రి. మిగతా రంగాల్లో గ్రామీణం, వ్యవసాయం, ఇళ్లు, ఇన్ఫ్రా, కరోనా నివారణ, క్యాపిటల్ ఖర్చులు .. వీటి ద్వారా పరోక్షంగా ప్రయోజనం ఉంటుందని ముందు ముందు ఎటువంటి ఆశలకు తావు ఇవ్వకుండా అడ్డుకట్ట వేశారు. ‘విభిన్న సామర్థ్యం‘ ఉన్నవారికి ఇచ్చిన .. లేదా పొందుపర్చిన ఉపశమనం నామమాత్రమే. చాలా కొద్ది మందికే ఇది లభిస్తుంది. ఇదొక మంచి అవకాశం అని చెబుతున్నారు. రిటర్నుల్లో సవరణలు చేసుకోవచ్చని అంటున్నారు. అయితే, రివైజ్ చేసినప్పుడు ఆదాయం పెరిగితే .. సహజంగానే పన్నుభారం పెరుగుతుంది. వడ్డీలు కూడా కట్టాలి. కొత్త మార్పుల ప్రకారం అయితే.. మొదటి సంవత్సరం లోపల మార్పులు చేసుకుంటే 25 శాతం అదనం .. రెండో సంవత్సరం మొదలై పూర్తయ్యేలోపల 50 శాతం అదనం కట్టాల్సి ఉంటుంది. దీనితో ఎటువంటి ప్రయోజనమూ లేదు. -
బడ్జెట్ 2022-23: టాక్స్ పేయర్లకు ఊరటనా..లేదా బాదుడేనా..?
కొత్త ఏడాది వచ్చేసింది. 2022 మార్చి 31తో FY21 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. త్వరలోనే కేంద్ర బడ్డెట్ 2022-23ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న రానున్న బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. కాగా బడ్జెట్ 2022-23లో భాగంగా ముఖ్యంగా ఆదాయపు పన్నుకు సంబంధించిన వాటి కోసం టాక్స్ పేయర్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గత బడ్జెట్లో ఆదాయపు పన్నుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెద్దగా ఎలాంటి ప్రయోజనాలను ప్రకటించలేదు. కాగా టాక్స్ పేయర్లకు ఈ బడ్జెట్లో ఉపశమనం కల్గించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు...! రాబోయే బడ్జెట్లో వేతనం పొందే టాక్స్ పేయర్లకు, పెన్షనర్లకు అందుబాటులో ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని 30 శాతం నుంచి 35 శాతంకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆదాయపు పన్ను స్లాబ్స్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చునని సమాచారం. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.50,000గా ఉంది. అయితే దీనిని పెంచాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఇప్పటికే వ్యక్తిగత పన్నులపై పరిశ్రమ నుంచి పలు సూచనలు వచ్చాయి. కోవిడ్-19 రాకతో ముఖ్యంగా వైద్య ఖర్చులు పెరిగాయని, ద్రవ్యోల్భణం వంటి అంశాలు భారీగా పెరిగాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. దీంతో కేంద్రం ఈ విషయంపై సానూకూలంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఆర్ధికశాఖకు సూచనలు..! ప్రతి సంవత్సరం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పునఃపరిశీలించడాన్ని ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో చేయాలని బిగ్ ఫోర్ అకౌంటింగ్ సంస్థ డెలాయిట్ భాగస్వామి సుధాకర్ సేతురామ కేంద్రానికి విన్నవించారు. పెరిగిన ద్రవ్యోల్భణం, వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఖర్చులు పెరిగాయని, ఇందుకు అనుగుణంగా కనీసం 25 శాతం వరకు పరిమితిని పెంచాలని సూచించారు. 2019లో రూ.50,000కు పెంపు 2018లో స్టాండర్డ్ డిడక్షన్ రూ.40,000గా ఉంది. గతంలో దీని పరిమితిని 2019లో రూ.50,000కు పెంచారు. ఇప్పుడు మరోసారి దీనిని పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే తాజా పన్ను వసూళ్ల పరిస్థితిని బట్టి ప్రతిపాదన తుది ఆమోదానికి లోబడి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు అందుబాటులో లేదు. అసలు ఏంటి స్టాండర్డ్ డిడక్షన్ ఒక వ్యక్తి లేదా సంస్థ ఆదాయంపై విధించిన పన్ను, వారి ఆదాయ లేదా లాభాలను బట్టి మారుతుంది. చట్ట ప్రకారం వ్యక్తులు లేదా సంస్థలు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్కు మినహాయింపు ఉంటుంది. ఆదాయపు పన్ను ప్రకారం మినహాయించడం లేదా వ్యక్తి పెట్టిన పెట్టుబడి స్టాండర్డ్ డిడక్షన్. స్టాండర్డ్ డిడక్షన్ అనేది స్థిర మినహాయింపు సంస్థతో ఉన్న స్థానంతో సంబంధం లేకుండా వేతనం నుంచి తీయడం జరుగుతుంది. కాబట్టి, ఇది పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గిస్తుంది. పన్ను చెల్లించిన మొత్తం కూడా తగ్గిపోతుంది. జీతం ఉద్యోగి మరియు పింఛనుదారుడు స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చు చదవండి: కంపెనీలో ఫుడ్ సర్వ్ చేసేవాడు..! ఇప్పుడు ఆ ఒక్కటే అంబానీనే దాటేలా చేసింది...! -
ఈ పొరపాట్లు చేయొద్దు.. ఫారం 16ని చెక్ చేయండి
ఐటీ రిటర్నులు వేస్తున్నాం.. పన్నులు కట్టేస్తున్నాం కదా అని మనలో మనం సంబరపడుతుంటాము. కానీ కొన్ని తప్పులు కూడా చేస్తుంటాం. ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో బైటపడ్డ నిజాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మనం చేసే తప్పుల గురించి తెలుసుకుందాం.. ► ఒక ఉద్యోగి ఒక సంవత్సరకాలంలో రెండు చోట్ల ఉద్యోగం చేసినప్పుడు .. ఇద్దరూ ఫారం 16 జారీ చేసి ఉంటారు. ఇద్దరూ స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ ఇస్తారు. ఇద్దరూ సెక్షన్ 80సి మినహాయింపులూ ఇస్తారు. కానీ ఉద్యోగి ఎన్ని ఉద్యోగాలు చేసినా ఒకసారే మినహాయింపు వస్తుంది. రెండు సార్లు రాదు. స్టేట్మెంట్ తయారు చేసినప్పుడు ఆదాయంలో మార్పు రాదు. కానీ మినహాయింపులు, సగానికి తగ్గుతాయి. ఫలితంగా పన్నుభారం పెరుగుతుంది. ఈ విషయం అర్థం కాక పన్ను భారం పెరిగిపోయిందో అని ఆందోళన .. కాస్సేపు బాధ .. కాస్సేపు బెంగ వస్తాయి. ఇవన్నీ సర్దుకునే సరికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి ఫారం 16ని చెక్ చేయండి. ఇటువంటి పరిస్థితి ఏర్పడితే సరిదిద్దుకోండి. ► కొన్ని ఆదాయాలను పరిగణనలోకి తీసుకోరు. బ్యాంకు డిపాజిట్ మీద వడ్డీ, సేవింగ్స్ ఖాతాలో జమయ్యే వడ్డీ, ఆన్సర్ పేపర్లు దిద్దితే వచ్చే డబ్బు, ఇన్విజిలేషన్ వల్ల వచ్చే డబ్బు, నగదు రూపంలో వచ్చే ట్యూషన్ ఫీజులు, ఇంటద్దెలు, గార్డియన్గా పిల్లలకు వచ్చిన ఆదాయం, జీవిత భాగస్వామికి వచ్చే ఆదాయం.. ఇవన్నీ చూపించాలి. ఎటువంటి రిస్కు తీసుకోవద్దు. ► పన్ను భారం ఉండని ఆదాయాన్ని.. అంటే.. మినహాయింపు లభించే ఆదాయాలను కూడా రిటర్నులో డిక్లేర్ చేయాలి. ఇలా చేయడం వల్ల పన్ను భారం ఉండదు. భవిష్యత్తులో ‘‘సోర్స్’’ వివరణ ఇచ్చినప్పుడు ఎంతో ఉపశమనంగా ఉంటుంది. ► బ్యాంకుల మీద వచ్చే వడ్డీ కేవలం 10 శాతం టీడీఎస్కి గురి అవుతుంది. మీ నికర ఆదాయంపై 10 శాతం, 20 శాతం లేదా 30 శాతం వర్తించవచ్చు. 20 శాతం, 30 శాతం రేటు పడినప్పుడు వడ్డీ మీద టీడీఎస్ సరిపోదు. పది శాతం పన్ను పడుతుంది. అలా తెలియగానే ఎంతో బాధ.. ఏదో తప్పు జరిగిందని ఆవేదన, ఆలోచన వస్తాయి. మిగతా మొత్తం చెల్లించక్కర్లేదు అనుకోవడం తప్పు. ► నికర ఆదాయం నిర్దేశించిన పరిమితి దాటితే స్థూల పన్ను భారంలో 10 శాతం సర్చార్జి పడుతుంది. సర్చార్జి మీద 4 శాతం సెస్సు అదనం. ముందుగా ఏ ఆదాయానికి ఆ ఆదాయం విడిగా లెక్కించి, అజాగ్రత్త వలన నికర ఆదాయం తక్కువగా అనిపించి సర్చార్జీని పరిగణనలోకి తీసుకోరు. కానీ అన్నీ కలిపేసరికి నికర ఆదాయం కోటి రూపాయలు దాటితే సర్చార్జి కరెంటు షాకులాగా తగులుతుంది. తప్పు .. తప్పని తేలకపోతే ఫర్వాలేదు. కానీ తేలితే మళ్లీ బెంగ.. భయం.. పైగా పన్నూ తప్పదు. కాబట్టి ఇలా ఎన్నో తప్పులు దొర్లవచ్చు. కనుక తస్మాత్ జాగ్రత్త వహించండి. -
ఆదాయం 5 లక్షలు దాటకపోతేనే...
తాజా బడ్జెట్లో ఆదాయపు పన్ను పరంగా.. అనుకున్నంతగా కాకపోయినా బాగానే ఉందని చెప్పాలి. ఎక్కువగా లబ్ధి పొందింది... వార్షికా దాయం రూ.5 లక్షలు దాటనివారని చెప్పొచ్చు. నికర ఆదాయం లేదా ట్యాక్సబుల్ ఆదాయం 1–4–2019 నుంచి 31–3–2020 వరకు రూ.5 లక్షలు, ఆ లోపు ఉంటే పన్ను భారం లేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న శ్లాబులు, రేట్లు తదితరాల్లో ఎలాంటి మార్పులూ లేవు. శ్లాబులు మార్చకుండా... రేట్లలో మార్పు లేకుండా... ఇది ఎలా సాధ్యమనే సందేహం వస్తుంది. పన్ను తగ్గింపును సెక్షన్ 87ఎ ప్రకారం రిబేటు ద్వారా ఇచ్చారు. ఉదాహరణకు ఒకరి సేవింగ్స్ రూ.1,50,000 అనుకోండి. మెడిక్లెయిమ్ వార్షిక ప్రీమియం రూ.25,000 అనుకోండి. విద్యా రుణం మీద వడ్డీ రూ.1,00,000, ఇంటిమీద రుణంపై రూ.2,00,000 వడ్డీ అనుకోండి. వీటిన్నింటినీ కలిపితే మొత్తం రూ.4,75,000. ఈ మొత్తానికి రూ.5,00,000 కలిపితే మొత్తం రూ.9,75,000. తాజా బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా స్టాండర్డ్ డిడక్షన్ను కూడా రూ.40వేల నుంచి రూ.50 వేలకు పెంచారు. అయితే ఇది కేవలం ఉద్యోగస్తులకే వర్తిస్తుంది. దీనిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం రూ.10,25,000 అవుతుంది. ఆ లెక్కేంటో ఒకసారి చూద్దాం. మొత్తం జీతం – 10,25,000 స్టాండర్డ్ డిడక్షన్ – 50,000 మెడిక్లెయిమ్ – 25,000 సేవింగ్స్(80సి) – 1,50,000 విద్యారుణంపై వడ్డీ – 1,00,000 గృహరుణంపై వడ్డీ – 2,00,000 మొత్తం మినహాయింపులు – 5,25,000 నికర ఆదాయం – 5,00,000 ఇలా మిగిలిన మొత్తం రూ.5,00,000 దాటలేదు కనక ఎలాంటి పన్ను భారం ఉండదు. ప్రస్తుత సంవత్సరపు పన్ను భారంతో పోల్చి చూస్తే రూ.12,500 తక్కువ. ఈ మేరకు పన్ను భారం తగ్గినట్లే. ఇది సంతోషించవలసిన విషయం. ఉద్యోగస్తులు కాని వారికి కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. కాకపోతే స్టాండర్డ్ డిడక్షన్ అనేది మాత్రం ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ మేరకు చూస్తే పై ఉదాహరణలో స్థూల ఆదాయం రూ.10,25,000 నుంచి రూ.9,75,000కు తగ్గుతుంది. అలాంటి వారికి పన్ను భారం ఉండదు. కొసమెరుపు ఏమిటంటే... పన్ను చెల్లించాల్సిన లేదా నికర ఆదాయం రూ.5,00,000 దాటిన వారికి శ్లాబులు, రేట్లు అన్నీ యథాతథం. వీటిల్లో ఎలాంటి మార్పూ లేనందున వెసులుబాటు, ఉపశమనం వంటివేమీ లేవు. ఇది మోదీ మంత్రం. నికరాదాయం రూ.5లక్షల లోపు ఉన్నవారికే ఈ మార్పు వర్తిస్తుంది. -
ఆదాయపన్నులో.. స్టాండర్డ్ డిడక్షన్ అంటే..
పశ్చిమగోదావరి, నిడమర్రు : ఇటీవల ప్రవేశపెట్టిన 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో ఆదాయపన్ను రిటర్న్ దాఖలు విషయంలో పన్ను శ్లాబుల్లో మార్పులేమీ చేయలేదు. కేవలం ప్రామాణిక మినహాయింపు(స్టాండర్డ్ డిడక్షన్)తో సరిపెట్టారు. 12 ఏళ్ల తర్వాత ఉద్యోగస్తులు, పెన్షనర్ల కోసం సాండర్డ్ డిడక్షన్ను తిరిగి ప్రవేశపెట్టడం ఉద్యోగస్తుల్లో కాస్త ఊరట లభించే అంశం. నూతన బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ రూ.40 వేలుగా ప్రకటించారు. అసలు ఆదాయ పన్ను లెక్కల్లో స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏమిటి..? మినహాయింపు పొందే మార్గాలు తదితర సమాచారం తెలుసుకుందాం. 12 ఏళ్ల తర్వాత స్టాండర్డ్ డిడక్షన్ ఒక ఉద్యోగి ఆఫీసుకు వెళ్లి రావడానికి అయ్యే వ్యయాలను దృష్టిలో పెట్టుకొని గతంలో స్టాండర్డ్ డిడక్షన్ కింద ఆదాయంలోంచి కొంత మొత్తాన్ని తగ్గించి మిగిలిన దానిపై పన్ను లెక్కించేవారు. కానీ దీన్ని 2006–07 అసెస్మెంట్ ఇయర్లో తొలగించారు. అప్పట్లో స్టాండర్డ్ డిడక్షన్ రూ.30 వేలుగా ఉండేది. 12 ఏళ్ల తర్వాత తిరిగి రూ.40 వేలు స్టాండర్డ్ డిడక్షన్గా ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ అంటే.. స్టాండర్డ్ డిడక్షన్ అంటే మినహాయించబడిన ఆదాయ పన్ను ప్రకారం దాని నుంచి మినహాయించడం, లేదా వ్యక్తి పెట్టిన పెట్టుబడి. ఈ ప్రయోజనం కోసం ఒక వ్యక్తి ఏదైనా పెట్టుబడి రుజువులు లేదా వ్యయం బిల్లులను బహిర్గతం చేయకూడదు. స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఒక స్టాండర్డ్ రేటులో అనుమతించబడుతుంది. స్టాండర్డ్ డిడక్షన్ అర్థం.. స్టాండర్డ్ డిడక్షన్ అనేది స్థిర మినహాయింపు. సంస్థలో ఉన్న స్థానంతో నిమిత్తం లేకుండా జీతం నుండి తీయడం జరుగుతుంది. స్థిర డబ్బు వార్షిక జీతం నుంచి తీసివేయబడుతుంది. కాబట్టి ఇది పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గిస్తుంది. అలాగే పన్ను చెల్లించిన మొత్తం కూడా తగ్గిపోతుంది. ఉద్యోగి, పింఛనుదారుడు స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చు. ఈ ప్రయోజనం కోసం, జీతం వేతనం, వార్షికం, ఎసెస్మెంట్, పెన్షన్, ఫీజు, గ్రాట్యుటీ, కమిషన్, ముందు జీతం వంటి వాటికీ, ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10 కింద తక్కువ అద్దెలు, గృహ అద్దె భత్యం, రవాణా భత్యం వంటివి ఉన్నాయి. అద్దె ఆదాయం నుంచి ప్రామాణిక మినహాయింపు భారతదేశంలో గృహ ఆస్తి నుంచి తలసరి ఆదాయం కింద వర్గీకరించబడిన అద్దె నుంచి వచ్చే ఆదాయం కోసం ప్రామాణిక మినహాయింపు అనుమతించబడుతుంది. 30 శాతం ప్రామాణిక మినహాయింపు అద్దె నుంచి ఆదాయం కోసం అనుమతించబడుతుంది. అద్దె నుంచి వచ్చే ఆదాయం సంపాదించిన వ్యక్తికి వార్షిక విలువ లేదా స్థానిక అధికారులకు చెల్లించిన పురపాలక మరియు ఇతర పన్నులను తగ్గించుకోవచ్చు ఉద్యోగులకు అందుబాటులో ఉన్న మినహాయింపులు స్టాండర్డ్ డిడక్షన్ నేపథ్యంలో ప్రస్తుతం పన్ను పరిధిలో ఉన్న రవాణా, వైద్య చికిత్స అలవెన్సుల్ని పన్ను పరిధిలోకి రూ.40 వేల వరకూ తెచ్చారు. జీతం నుంచి ఉద్యోగి ఆదాయం కింద ప్రామాణిక తగ్గింపు భాగంగా వినోదభత్యం, వృత్తి పన్ను పొందవచ్చు. ఇవే కాకుండా అనేక అంశాల్లో మినహాయింపు పొందేందుకు వీరు అర్హులు. మినహాయింపు పొందే వర్గాలు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్లో పెట్టుబడులు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్, ఐదేళ్ల టాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్, పెన్షన్ ప్లాన్స్, ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్స్, జీవిత బీమా పాలసీ, జాతీయ సేవింగ్స్ సర్టిఫికేట్స్, విద్యా రుణాన్ని తిరిగి చెల్లించడం, ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులు ఆదాయం పన్ను చట్టం కింద ఉద్యోగి ఆదాయంలో పొదుపును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆదాయం పన్ను చట్టం వ్యక్తిగత విభాగాల కింద తగ్గింపులకు అనుమతి ఇచ్చింది. విభాగం 80సీ, సెక్షన్ 80సీసీసీ, సెక్షన్ 80 సీసీడీలో పేర్కొన్న ప్రకారం ఏదైనా పెట్టుబడి పెట్టి ఉంటే, అప్పుడు మొత్తం పెట్టుబడి సంవత్సరానికి రూ.1.5 లక్షలు తగ్గించుటకు అర్హులు. దీంతో పాటు నేషనల్ పెన్షన్ పథకంలో (ఎన్పీఎస్) పెట్టుబడి పెట్టడానికి 80సీసీడీ కింద రూ.50 వేల ఆదనపు మినహాయింపు అందుబాటులో ఉంది. -
వేతన జీవులకు నిరాశే మిగిలింది...
తాజా బడ్జెట్లో ఆదాయపు పన్ను చెల్లించే వారికి నిరాశే మిగిలిందని చెప్పొచ్చు. వీరికి బేసిక్ పరిమితి సహా ఇతర అంశాల్లోనూ ఎటువంటి ప్రయోజనం కలగలేదు. బడ్జెట్లోని కొన్ని అంశాలను ఒకసారి గమనిద్దాం. ⇒ ధరల పెరుగుదలకు విలవిలలాడుతున్న సామాన్యుడికి.. అందులోనూ ప్రతి ఏడాది కచ్చితంగా పన్ను చెల్లించే వారికి బడ్జెట్లో భంగపాటే మిగిలింది. ప్రస్తుతం బేసిక్ లిమిట్ రూ.2,50,000 పరిమితిని పెంచుతారని చాలా మంది ఆశించారు. కానీ వారికి నిరాశే మిగిలింది. మిగతా శ్లాబుల్లోనూ ఎటువంటి మార్పు లేదు. అన్ని యథాతథంగా ఉన్నాయి. ⇒ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వేతన జీవులకు ఏదో ఒక తాయిలం ఇవ్వకపోతుందా? అని అందరూ అనుకున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ మళ్లీ వస్తుందని ఎదురు చూశారు. కానీ ఆ ప్రస్తావనే లేదు. ⇒ పీఎఫ్ విత్డ్రాయల్స్, వడ్డీ మీద పన్ను వేశారు జైట్లీ. ఈ చర్యపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో తిరిగి వెనక్కు తగ్గారు. ⇒ ఇది వరకు సెక్షన్ 87ఏ కింద రిబేటు రూ.2,000 ఇచ్చే వారు. దీన్ని బడ్జెట్లో రూ.5,000కి పెంచారు. రిబేటు రూ.5,000 పొందాలంటే నికర ఆదాయం రూ.5,00,000 లోపల ఉండాలి. దీని వల్ల కొంత మందికి రూ.3,000 పన్ను భారం తగ్గింది. ⇒ ఇక 80జీజీ కింద ఇంటి అద్దె చెల్లింపు పరిమితిని రూ.2,000 నుంచి రూ.5,000కి పెంచారు. దీని వల్ల ఈ పరిమితి రూ.60,000కి పెరిగింది. రూ. 36,000 పెరగడం వల్ల మీ మీ ట్యాక్స్ రేటును బట్టి 10 శాతం, 20 శాతం, 30% చొప్పున ఉపశమనం కలుగుతుంది. ⇒ చిన్న వ్యాపారస్తుల వార్షిక టర్నోవర్ రూ.కోటి లోపు ఉంటే వారి నికర ఆదాయాన్ని 8 శాతం చొప్పున డిక్లేర్ చేస్తే బుక్స్ రాయక్కర్లేదు. కొత్త ప్రతిపాదనల ప్రకారం ఈ పరిమితిని రూ.2 కోట్లకు పెంచారు. దీని ప్రకారం పన్ను భారంలో ఉపశమనం లేకపోయినా బుక్స్ నిర్వహణ తదితర వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. ⇒ కొంత శాతం దాటి నికర ఆదాయాన్ని లెక్కించడం కేవలం వ్యాపారస్తులకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ సదుపాయాన్ని వృత్తి నిపుణులకు కూడా ఇచ్చారు. ట్యాక్స్ ఆడిట్ వర్తించే పరిమితి రూ. 25,00,000 నుంచి రూ.50,00,000 దాకా పెంచారు. ఇది చాలా మంచి ఉపశమనం. అయితే నికర ఆదాయాన్ని టర్నోవర్లో 50 శాతం డిక్లేర్ చేస్తే బుక్స్, ఆడిట్ అక్కర్లేదు. కానీ అన్ని వృత్తుల్లో 50 శాతం నికరంగా మిగలదు. ⇒ నల్లధనం ప్రస్తావన ప్రత్యక్షంగా తీసుకురాకుండా.. ‘ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ 2016’ను ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ కింద వారు మొత్తం ఆదాయం/సంపద తదితర వాటిపై 45 శాతం పన్ను చెల్లిస్తే.. వడ్డీలు, ప్రాసిక్యూషన్ లేకుండా చూస్తారు. ⇒ నికర ఆదాయం రూ.1 కోటి దాటిన వారికి సర్చార్జీ 12 శాతంగా ఉండేది. ఇప్పుడు దీన్ని 15 శాతానికి పెంచారు. ⇒ ఇప్పుడు రూ.10,00,000 దాటిన డివిడెండ్ ఆదాయంపై 10 శాతం పన్ను కట్టాల్సిందే. - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు