
తిరుమలలో నిర్మాణాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా పలు మఠాలు నిర్మాణాలు చేపట్టాయని.. వాటిపై చర్యలు తీసుకునేలా అధికారులు ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలైంది.
సాక్షి, అమరావతి: తిరుమలలో నిర్మాణాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా పలు మఠాలు నిర్మాణాలు చేపట్టాయని.. వాటిపై చర్యలు తీసుకునేలా అధికారులు ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై బుధవారం.. హైకోర్టు విచారణ జరిపింది. తిరుమలలో నిర్మాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీని హైకోర్టు హెచ్చరించింది.
ఎంతో సుందరమైన తిరుమలను కాంక్రీట్ జంగిల్ కాకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీకి హైకోర్టు తేల్చి చెప్పింది. తిరుమలలో నిర్మాణాలను ఇలానే కొనసాగిస్తే కొంతకాలం తర్వాత తిరుమల అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తిరుమల వ్యవహారంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. తిరుమలలో ధార్మిక సంస్థలు, మతం పేరుతో ఎలా పడితే అలా నిర్మాణాలు చేస్తామంటే కుదరదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
ఇప్పటికే ఒక మఠం చేపట్టిన నిర్మాణాలపై చర్యలకు ఆదేశించామని పేర్కొన్న హైకోర్టు.. తిరుమలలో నిర్మాణాలు చేసిన పలు మఠాలకు నోటీసులు జారీ చేసింది. దేవాదాయ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవో, టీటీడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్కు నోటీసులిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మే 7 తేదీకి కోర్టు వాయిదా వేసింది.