-
విద్యార్థులు మరింతగా రాణించాలి
కొత్తగూడెంటౌన్: విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని, భవిష్యత్లో మరింతగా రాణించాలని ఎస్పీ రోహిత్రాజ్ ఆకాంక్షించారు. కొత్తగూడెంలోని ఐఎంఏ హాల్లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులైన 35 మంది విద్యార్థులను శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించాలని, తద్వారా తల్లిదండ్రులతో పాటు తమ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని పిలుపునిచ్చారు. పోలీసు శాఖలో అహర్నిశలూ కష్టపడి విధులు నిర్వహిస్తున్న తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. పట్టుదలతో సాధిస్తే సాధ్యం కానిది ఏదే లేదన్నారు. ఇంటర్, డిగ్రీ చదివే దశలోనే విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని, ఈ సమయంలోనే సన్మార్గంలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ విక్రాంత్సింగ్, కొత్తగూడెం, ఇల్లెందు డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, చంద్రభాను, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, ఎంటీఓ సుధాకర్, హోంగార్డ్ ఆర్ఐ నర్సింహారావు పాల్గొన్నారు. ఎస్పీ రోహిత్రాజ్ -
ఇంటిని మరిపించేలా పాఠశాలలు
అశ్వారావుపేటరూరల్/దమ్మపేట : గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలను ఇంటిని మరిపించేలా సిద్ధం చేస్తున్నట్లు ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ తెలిపారు. అశ్వారావుపేట మండలం భీమునిగూడెం ఆశ్రమ పాఠశాలను, దమ్మపేట మండలంలోని అంకంపాలెం, పార్కలగండి, పెద్దగొల్లగూడెం, చీపురుగూడెం అశ్రమ పాఠశాలలను శనివారం ఆయన తనిఖీ చేశారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పాఠశాలల ఆవరణల్లో పచ్చదనాన్ని మరింతగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల వసతి గదులను పరిశీలించి మంచాలు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు సరిపడా ఉన్నాయా లేవా అని ఆరా తీశారు. పాఠశాలల పునః ప్రారంభం నాటికి విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించాలని హెచ్ఎంలను ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఓ ఉదయ్భాస్కర్, డీఈ రామి రెడ్డి, ఏటీడీఓ చంద్రమోహన్, ఏఈ సుబ్బరాజు, పాఠశాలల హెచ్ఎంలు పద్మ, తోలెం వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, భద్రమ్మ, ధర్మ పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్ -
గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్
పాల్వంచరూరల్: ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల బాలుర కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు పాల్వంచ మండలం కిన్నెరసానిలో శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 350 మంది విద్యార్థులు హాజరుకాగా, అర్హులకు కృష్ణసాగర్, దమ్మపేట, కిన్నెరసాని, గుండాల, సింగరేణి, తిరుమలాయపాలెం కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లు కేటాయించనున్నట్లు ఆర్సీఓ వెంకటేశ్వరరాజు తెలిపారు. కౌన్సెలింగ్లో కళాశాలల ప్రిన్సిపాళ్లు గోవర్ధన్, హరిసింగ్, జాన్నాయక్, పుల్ల య్య, మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో ఇద్దరు మృతి
గుండాల: గుండెపోటుతో శనివారం ఇద్దరు మృతి చెందారు. మండలంలోని మామకన్ను గ్రామానికి చెందిన గొగ్గెల సత్యనారాయణ(35) నిద్రనుంచి లేచి ఆరు బయట మంచంలో కూర్చొని ఉండగా గుండెలో నొప్పి వస్తుందని చెప్పుతూనే ఒక్కసారిగా మంచంలో పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు వచ్చి చూడగా మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మండలంలోని ముత్తాపురం గ్రామానికి చెందిన పూనెం పాపయ్య(55) శనివారం ఉదయాన్నే గుండెపోటుతో మృతి చెందాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి..దమ్మపేట: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ముష్టిబండ గ్రామ శివారులో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ముష్టిబండ గ్రామానికి చెందిన కోలేటి ధర్మరాజు(41) శనివారం తెల్లవారుజామున గ్రామశివారులో కాలకృత్యాలు తీర్చుకుని తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్లో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుడి తండ్రి పెద్ద వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. భార్య మృతి చెందిన నెలరోజులకే..అనారోగ్యంతో భర్త మృతి ఇల్లెందు: పట్టణంలోని ఎల్బీఎస్ నగర్కు చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు కటకం లక్ష్మీనారాయణ(65) శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నెలరోజుల క్రితం లక్ష్మీనారాయణ భార్య కళావతి గుండెపోటుతో మృతి చెందింది. భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. దీంతో ఆరోగ్యం క్షీణించింది. శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. విద్యుదాఘాతంతో మూడు గేదెలు మృతిమణుగూరు టౌన్: తెగిపడ్డ విద్యుత్ వైర్లకు తగిలి విద్యుదాఘాతంతో మూడు గేదెలు మృతి చెందాయి. ఈ సంఘటన మండలంలోని రామానుజవరం గ్రామ పంచాయతీలో శనివారం జరిగింది. ఎల్లమాటి వెంకట్రావు పొలం వద్ద విద్యుత్ వైర్లు తెగి పడి ఉండగా, అటు వైపు వెళ్లిన గేదెలు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాయని బాధిత రైతు తెలిపాడు. గమనించిన స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. -
ఆగి ఉన్న కారును ఢీకొట్టిన డీసీఎం
●బాలుడి మృతి, మరో ఏడుగురికి గాయాలు ●హైదరాబాద్లో ఔటర్ రింగ్రోడ్పై ఘటన భద్రాచలంఅర్బన్: హైదరాబాద్లోని ఔటర్ రింగ్రోడ్డుపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. అతని తల్లిదండ్రులు, సోదరితోపాటు మరో నలుగురు బంధువులు గాయపడ్డారు. భద్రాచలంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన వెంకటగోపి తన కుటుంబ సభ్యులతో కలిసి వేసవి సెలవులకు హైదరాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం వెంకటగోపి, అతని భార్య దీప్తి, కూతురు వేదశ్రీ, కుమారుడు పూజిత్రామ్(13) మరో నలుగురు బంధువులు కలిసి కారులో కూకట్పల్లి నుంచి బీబీ నగర్కు ఔటర్ రింగ్రోడ్డు మీదుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో దీప్తి, వేదశ్రీ, పూజిత్ రామ్, బంధువు రమాదేవిలకు వాంతులు కావడంతో కారును రోడ్డు పక్కన నిలిపారు. ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం అదుపు తప్పి కారును ఢీకొట్టింది. దీంతో పూజిత్ రామ్(13) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఏడుగురికి గాయాలయ్యాయి. వెంకటగోపి హైదరాబాద్(తిరుమలగిరి)లోనే మరో బంధువు శ్రీపాద నూతన్కు సమాచారం అందించగా, అతను సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 అంబులెన్స్లో సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా పూజిత్రామ్ సారపాక బీపీఎల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. గాయపడ్డవారిలో ఆరు నెలల బాబు కూడా ఉన్నాడు. -
విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
అశ్వారావుపేటరూరల్: విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని డీఎల్పీవో రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన మండలంలోని అచ్యుతాపురం, నారంవారిగూడెం, నారంవారిగూడెం కాలనీ గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలతోపాటు హరితహారం నర్సరీలను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను ప్రతీ రోజు పరిశీలించాలని చెప్పారు. గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చూడాలన్నారు. జేపీఎస్లు వై.వెంకటేశ్వర్లు, బిట్టా.వెంకటేశ్వర్లు, వెంకటమ్మ ఉన్నారు. కారుణ్య కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శకొణిజర్ల: భద్రాచలంలో నర్సింగ్ చదువుతూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పి.కారుణ్య మృతదేహం వద్ద వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ శనివారం నివాళులర్పించారు. ఆమె స్వగ్రామమైన కొణిజర్ల మండలం సిద్ధిక్నగర్లో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థిని కుటుంబీకులను పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మార్క్ఫెడ్ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, నాయకులు కోసూరి శ్రీను, రాయల పుల్లయ్య, శేషగిరిరావు, నారాయణరావు, హరినాద్, మోష, కృష్ణారావు, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు, నేలకూలిన భారీ వృక్షంములకలపల్లి: కొద్ది రోజులుగా కురుస్తున్న ఈదురుగాలులతో కూడిన వర్షాలకు మండల పరిధిలోని కొత్తగంగారం అటవీప్రాంతంలో సుమారు వందేళ్ల వయసున్న చింత చెట్టు నేలకూలింది. పాల్వంచ– మందలపల్లి ఆర్అండ్బీ రహదారికి అడ్డంగా పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఎస్సై రాజమౌళి ఆధ్వర్యంలో తొలగింపు చర్యలు చేపట్టారు. కట్టర్ సహాయంతో చెట్టును ముక్కలుగా కోసి తొలగించి, రాకపోకలను పునరుద్ధరించారు. -
పనస లోడ్లో గంజాయి..
●కాయల మధ్యలో ప్యాకెట్లు పేర్చి తరలింపు ●3.59 క్వింటాళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అశ్వారావుపేట: పనసకాయల లోడ్లో తరలిస్తున్న గంజాయిని శనివారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ శ్రీరాముల శ్రీను కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు పట్టణంలోని సాయిబాబా ఆలయం వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయంలో బొలెరో వాహనం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా దారకొండ నుంచి హైదరాబాద్లోని దూల్పేటకు పనసకాయల లోడ్తో వెళ్తోంది. ఆపి తనిఖీ చేయగా, పనసకాయల మధ్యలో 165 ప్యాకెట్ల గంజాయి లభ్యమైంది. హైదరాబాద్కు చెందిన చింతమన్ సంతోష్ సింగ్, రామ్పురి గోపి సింగ్ల సూచన మేరకు అదే ప్రాంతానికి చెందిన విక్రమ్సింగ్, శైలేందర్ సింగ్లు దారకొండలో గంజాయి కొనుక్కుని వస్తున్నారు. తిరుగుప్రయాణంలో రాజమండ్రి వద్ద సంతోష్సింగ్, గోపిసింగ్ వాహనం ఎక్కారు. అశ్వారావుపేట మీదుగా హైదరాబాద్ వెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. హైదరాబాద్లోని ఆదిత్యసింగ్, మహేందర్సింగ్లకు అమ్మేందుకు గంజాయి తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు రూ. 89,83,000 విలువైన 3.59 క్వింటాళ్ల గంజాయి, బొలెరో వాహనం, ఐదు సెల్ఫోన్లు, పనసకాయలను సీజ్ చేశారు. పట్టబడ్డ నలుగురు నిందితులతోపాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న చింతమన్ దీపిక, దారకొండకు చెందిన కోమిటి, సీలేరుకు చెందిన మూడ్ లక్ష్మణ్, ఒడిశా మల్కన్గిరి జిల్లా చిత్రకొండకు చెందిన రాజయ ముడా, హైదరాబాద్కు చెందిన ఆదిత్య సింగ్, మహేందర్ సింగ్, ఆదిలాబాద్ జిల్లా తోసమ్కు చెందిన కోట్నక్ రమేష్తో కలిపి మొత్తం 11 మందిపై కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ నలుగురిని రిమాండ్కు తరలించామని, మిగతా ఏడుగురు పరారీలో ఉన్నారని ఎస్ఐ తెలిపారు. భద్రాచలంలో భారీగా స్వాధీనం? భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో శనివారం పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నట్లు సమాచారం. ఓ వాహనాన్ని ఎస్కార్ట్గా ఉపయోగిస్తూ మరో వాహనాంలో ప్లైవుడ్ మాటున గంజాయిని తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిందితుల్లో ఐదుగురు సంగారెడ్డికి చెందినవారని, మిగిలిన ఇద్దరు మల్కన్గిరి, బీదర్కు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రామయ్యకు వైభవంగా సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి శనివారం వైభవంగా సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వారాంతపు సెలవురోజులు కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నృసింహునికి తెప్పోత్సవంభద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ యోగా నంద లక్ష్మీనరసింహ స్వామి వారికి శనివారం తెప్పోత్సవం, దొంగల దోపు ఉత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారి తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా అలంకరించిన స్వామి, అమ్మవార్లను పల్లకీ సేవగా గోదావరి తీరానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత లాంచీలో జలవిహారం గావించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి● జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక ఆల సూపర్బజార్(కొత్తగూడెం): వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేశామని, 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని జిల్లా ఎన్ని కల అధికారి డాక్టర్ ప్రియాంక ఆల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటుహక్కు ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకునేందుకు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ప్రైవేట్ యాజమాన్యాలు, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల్లో పనిచేసే వారు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు విధులకు ఆలస్యంగా వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని, లేదంటే వారు పని చేసే షిఫ్టులను సవరించాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేందుకు యాజమాన్యాలు సహకరించాలని కోరారు. ‘పద్మ’ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానంకొత్తగూడెంటౌన్: 2025 సంవత్సరానికి గాను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులకు దరఖాస్తులు అహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి పి.పరంధామరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి వచ్చే జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రదానం చేస్తుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసేందుకు నియమ, నిబంధనల వివరాలు hhhtp;//padmaawards.gov.in ద్వారా పొందవచ్చని తెలిపారు. కళలు, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్ ఆఫైర్స్, సైన్స్తో పాటు వివిధ రంగాల్లో సాధించిన లక్ష్యాలు, చేసిన కృషిని 800 పదాలకు మించకుండా సంబంధిత పత్రాలను జతపరిచి email id: dysobhadradri@gmail.comనకు పీడీఎఫ్ పార్మట్లో సాఫ్ట్ కాపీలు పంపించాలని కోరారు. మూడు జతల హార్డ్ కాపీలను తమ కార్యాలయానికి ఈనెల 31లోగా పంపాలని సూచించారు. వనరులు వినియోగించాలిఇల్లెందురూరల్: పల్లె ప్రగతి పేరుతో గ్రామాలకు సమకూర్చిన వనరులు వినియోగంలో ఉండేలా చూడాలని జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి సూచించారు. మండలంలోని బొజ్జాయిగూడెం గ్రామపంచాయతీలో పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన నర్సరీ, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డు షెడ్, ఎవెన్యూ ప్లాంటేషన్ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయా నిర్మాణాల్లో ఏ ఒక్కటీ నిరుపయోగంగా మారకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీఓ చిరంజీవి, కార్యదర్శి రజియాబేగం తదితరులు పాల్గొన్నారు. -
ప్రచారానికి తెర
ఉమ్మడి జిల్లాలో హోరెత్తించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ● చివరి రోజున ఆత్మీయ సమ్మేళనాలు ● ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి ● అధిక సంఖ్యలో పట్టభద్రులు ఉన్న ప్రాంతాలపై నజర్ఆదివారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2024సాక్షిప్రతినిధి, ఖమ్మం: నల్లగొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారానికి శనివారం తెరపడింది. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈసారి అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బరిలో ఉన్న అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల అగ్రనేతలు ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బలపరచిన తీన్మార్ మల్లన్న, ఏనుగుల రాకేష్రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి మధ్య ప్రధాన పోటీ ఉంటుందని తెలుస్తోంది. ఇదే సమయాన ఒకరిద్దరు స్వతంత్ర అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థి, ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత పాలకూరి అశోక్కుమార్ మూడు ఉమ్మడి జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ప్రచారం ముగియడంతో పట్టభద్రులను ప్రసన్నం చేసుకోవడంపై పార్టీలు దృష్టి సారించాయి. సాధారణ ఎన్నికలను తలపించేలా.. సాధారణ ఎన్నికలను తలపించేలా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సాగింది. ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడం, మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉండడం.. ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండోస్థానంలో నిలవడం.. మరోపక్క ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ భావిస్తుండడంతో ప్రచారం రసవత్తరంగా సాగింది. కాంగ్రెస్ తరఫున మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ అభ్యర్థి నామా, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. ఇక బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, రంగాకిరణ్, కిసాన్మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి ప్రచారం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత పాలకూరి అశోక్కుమార్ సైతం బీఆర్ఎస్, కాంగ్రెస్ వైఫల్యాలను వివరిస్తూ ప్రచారం చేయగా.. ఆయనకు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు, నిరుద్యోగులు పలువురు మద్దతుగా నిలిచారు. ఓటర్ల ప్రసన్నం కోసం.. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టారు. ఓటర్లను నేరుగా కలిసేందుకు ప్రాధాన్యం ఇస్తూనే ఫోన్ చేయడమే కాక వాయిస్ మెసేజ్లు పంపిస్తున్నారు. పట్టభద్రుల నియోజకవర్గం మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉండడంతో అభ్యర్థులు స్థానిక నేతలకు బాధ్యతలు అప్పగించి చివరిరోజు ప్రచారం చేయించారు. ఇప్పటి వరకు అగ్రనేతలు ప్రచారం చేసినా, చివరిరోజు స్థానిక నేతలు పట్టభద్రులతో భేటీలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి తమ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఇక మూడు ఉమ్మడి జిల్లాల్లో పర్యటించలేని స్వతంత్ర అభ్యర్థులు వాయిస్ మెసేజ్లపైనే దృష్టి పెట్టారు. ఈ నేపథ్యాన అభ్యర్థుల వాయిస్ మెసేజ్లతో పట్టభద్రుల సెల్ఫోన్లు మార్మోగాయి. అమల్లోకి 144 సెక్షన్ ఎమ్మెల్సీ పోలింగ్ సమీపించడంతో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఇది అమల్లో ఉండనున్నందున ఒక ప్రాంతంలో ఎక్కువ మంది గుమికూడడాన్ని నేరంగా పరిగణిస్తారు. కర్రలు, జెండాలు, టపాసులు, ఇతర ఆయుధాలతో సంచరించడం, పోలింగ్ స్టేషన్కు కిలోమీటర్ పరిధిలో సమావేశాలు నిర్వహించడంపై నిషేధం విధించారు. ఇక ఎన్నికల రోజున పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టనున్నారు. న్యూస్రీల్ఆ ప్రాంతాలే లక్ష్యంగా.. ఎక్కువ మంది పట్టభద్ర ఓటర్లు ఉన్న ప్రాంతాలను అభ్యర్థులు గుర్తించారు. ఆయా ప్రాంతాలే లక్ష్యంగా ఇప్పటికే ప్రచారం చేయగా, మిగిలిన సమయంలోనూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటికీ వెళ్లాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఓటర్ల జాబితా ఆధారంగా పార్టీల నాయకులు ఇంటింటికీ తిరగడం మొదలుపెట్టారు. ఎక్కువ మంది ఓటర్లు ఉన్న ఖమ్మం, ఖమ్మంరూరల్, సత్తుపల్లి, నేలకొండపల్లి, వైరా, కొత్తగూడెం, ఇల్లెందు తదితర ప్రాంతాలపై అభ్యర్థులు ఎక్కువగా దృష్టి సారించి నేరుగా కలిసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన నాటి నుంచి హోరాహోరీగా, గతంలో ఎన్నడూ లేనట్టుగా పట్టభద్రుల ఎన్నిక ప్రచారం జరగడం ఆసక్తి కలిగిస్తోంది. -
ఓబీ కార్మికులకు వేతన ఒప్పందం
మణుగూరు టౌన్: సింగరేణి మణుగూరు ఏరియాలో మట్టివెలికితీత(ఓబీ) పనులు నిర్వహిస్తున్న మహాలక్ష్మి ఇన్ఫ్రా కంపెనీ యాజమ్యాంతో కార్మికులకు వేతన ఒప్పందం కుదిరింది. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చొరవతో ఐఎన్టీయూసీ మధ్యవర్తిత్వంతో ఒప్పందం కుదిరినట్లు ఐఎన్టీయూసీ అనుబంధ ఓబీ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు సిల్వేరు గట్టయ్య తెలిపారు. శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. ప్రస్తుత వేతనానికి అదనంగా రూ.1900 బేసిక్ పెంచినట్లు తెలిపారు. ప్రత్యేక చొరవ చూపి కాంట్రాక్ట్ కార్మికుల వేతన ఒప్పంద సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి కార్యదర్శి సూరపాక రాములు, ఏరియా ప్రాతినిధ్య సంఘం ఉపాధ్యక్షుడు వత్సవాయి కృష్ణంరాజు, నాయకులు జీవరత్నం, మహాలక్ష్మి యాజమాన్య ప్రతినిధులు జేస్ పాండే, ఓబీ వర్కర్స్బ్రాంచి కమిటీ సభ్యులు, ఐఎన్టీయూసీ అనుబంధ ఓబీ వర్కర్స్ మహాలక్ష్మి ప్రతినిధులు పాల్గొన్నారు. -
నేడు సీనియర్ నెట్బాల్ జట్టు ఎంపిక పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి సీనియర్ పురుషులు, మహిళల నెట్బాల్ జట్ల ఎంపికకు ఆదివారం ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు నెట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎన్.ఫణికుమార్ తెలిపారు. హాజరయ్యే క్రీడాకారులు వయసు ధృవీకరణ పత్రాలతో ఉదయం 8గంటలకు రిపోర్టు చేయాలని కోరారు. ఇక్కడ ఎంపిక చేసే జట్లు ఈనెల 30నుంచి హైదరాబాద్లోని దోమలగూడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. సైబర్ క్రైం కేసులు నమోదుపాల్వంచరూరల్: ముగ్గురు ప్రైవేటు ఉద్యోగులు సైబర్ మోసానికి గురైన సంఘటనలపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచ పట్టణంలోని మంచికంటినగర్కు చెందిన ప్రైవేటు ఉద్యోగి కృష్ణతేజ వాట్సాప్నకు ఓ లింక్ రాగా ఓపెన్ చేసి ఆన్లైన్ ట్రేడింగ్లో రూ.86 వేల పెట్టుబడి పెట్టాడు. అయితే రూ.2 లక్షల పెట్టుబడి పెడితే రెట్టింపు నగదు వస్తుందని చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాంకుమార్ అనే మరో ప్రైవేటు ఉద్యోగి మరో యాప్లో రూ.30 వేలు పెట్టుబడి పెట్టి మోసపోయాడు. నవభారత్ ఏరియాకు చెందిన ఎండీ నయీముద్దీన్ చైన్లింక్ యాప్ను ఓపెన్ చేసి రూ.2.17 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ లింకు ఓపెన్ కాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మూడు ఘటనలపై సైబర్ క్రైం కేసులు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై రాఘవ తెలిపారు. చోరీ కేసు.. పట్టణ పరిధిలోని కాంట్రాక్టర్స్ కాలనీలో శనివారం చోరీ జరిగింది. కాలనీకి చెందిన దేవినేని రోజా హైదరాబాద్ వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు పగులగొట్టి ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి రూ.5 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు చోరీ చేశారని ఫిర్యాదు చేయగా, పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ ప్రారంభం
కొత్తగూడెంఅర్బన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. ఉదయం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షకు 456 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 438 మంది హాజరయ్యారు. 18 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షకు 85 మంది హాజరు కావాల్సి ఉండగా, 76 మంది హాజరయ్యారు. 9 మంది గైర్హాజరయ్యారు. మొదటి సంవత్సరంలో మొత్తం 541 మందికి, 514 మంది హాజరు కాగా 27 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సర పరీక్ష జనరల్ సబ్జెక్ట్కు 1,157 మంది హాజరు కావాల్సి ఉండగా, 1087 మంది హాజరయ్యారు. 70 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్కు సంబంధించి 264 మంది హాజరు కావాల్సి ఉండగా, 232 మంది హాజరయ్యారు. 32 మంది గైర్హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 1,421 మందికి 1,319 మంది హాజరుకావాల్సి ఉండగా, 102 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ పర్యవేక్షణ చేపట్టిందని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి సులోచనారాణి తెలిపారు. -
ఓటింగ్లో జాగ్రత్తలు పాటించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): వరంగల్–ఖమ్మం–నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల సందర్భంగా ఓటర్లు ఓటేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె వివరాలు వెల్లడించారు. బ్యాలెట్ పేపర్పై ఎన్నికల సంఘం ద్వారా సరఫరా చేసిన వైలెట్ స్కెచ్ పెన్ను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు. అభ్యర్థులకు ఓటరు ప్రాధాన్యం ప్రకారం 1 లేదా 2 లేదా.. అంకెలు వేయాలని పేర్కొన్నారు. బ్యాలెట్ పేపర్పై ఏ ఇద్దరు అభ్యర్థులకు ఒకే నంబర్ వేయొద్దని, ఒకే అభ్యర్థికి రెండు ప్రాధాన్యతలు ఇవ్వకూడదని సూచించారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. బల్క్ ఎస్ఎంఎస్లు నిషేధం ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు రాజకీయపరమైన బల్క్ ఎస్ఎంఎస్లపై నిషేధం ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందు నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎలాంటి బల్క్ ఎస్ఎంఎస్లు పంపకూడదని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక -
పారిశుద్ధ్యం మెరుగుపర్చాలి
చంచుపల్లి/పాల్వంచరూరల్: వర్షాకాలం సమీపిస్తున్నందున గ్రామాల్లో పారిశుద్ధ్యలోపం లేకుండా చూడాలని జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆయన పాల్వంచ మండలం జగన్నాథపురం, రంగాపురం, నాగారం, నారాయణరావుపేట, చుంచుపల్లి మండలం గౌతంపూర్, బాబూక్యాంపు గ్రామపంచాయతీల్లో పర్యటించారు. నర్సరీలు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, క్రీడా ప్రాంగణం, పల్లెప్రకృతి వనాలను పరిశీలించారు. ఇంటింటి నుంచి సేకరించే తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాలన్నారు. ఈ కార్యక్రమాలల్లో డివిజన్ పంచాయతీ అధికారి రాజీవ్కుమార్, ఎంపీఓలు బి.నారాయణ, సత్యనారాయణ, సిబ్బంది సాయిరాం, మౌనిక, రాజు, ప్రవీణ్, సతీష్, జ్యోతి, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి -
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకుఏర్పాట్లు
సూపర్బజార్(కొత్తగూడెం): పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని, జిల్లాలో 6 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, కేంద్రాలకు విద్యార్థులు ముందుగానే చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలని చెప్పారు. విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉంచాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షకు సకాలంలో చేరుకునేలా అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులకు సందేహాలుంటే 89192 79238, 97018 42606 నంబర్లలో సంప్రదించాలని కోరారు. సమావేశంలో డీఆర్ఓ రవీంద్రనాధ్, డీఈఓ వెంకటేశ్వరాచారి, డీఎంహెచ్ఒ శిరీష పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్ -
అప్రమత్తంగా ఉండాలి
బూర్గంపాడు: వర్షాకాలం ఆరంభమవుతున్న తరుణంలో ప్రజారోగ్యం పట్ల వైద్యారోగ్యశాఖ మరింత అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ శిరీష ఆదేశించారు. మండల పరిధిలోని సోంపల్లి గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. గ్రామంలోని గృహాలను సందర్శించి లార్వా శానిటేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో ఇళ్లలోని పాత్రలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. పశువులు నీరు తాగేందుకు ఏర్పాటు చేసుకున్న తొట్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇళ్ల పరిసరాల్లో పాత టైర్లు, తాగిపడేసిన కొబ్బరిబొండాలు, ఇతర పాత సామగ్రి ఉంటే తొలగించాలన్నారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఇళ్లను సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో ర్యాఫిడ్ ఫీవర్ సర్వే చేపట్టి హెల్త్క్యాంపులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మోరంపల్లిబంజర పీహెచ్సీ డాక్టర్ లక్ష్మీసాహితి, సిబ్బంది జీతు, రవి, సడాలదేవి తదితరులు పాల్గొన్నారు. -
బెట్టింగ్ కోసం బురిడీ..!
అశ్వారావుపేట: అశ్వారావుపేటకు చెందిన ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారులను ఓ యువకుడు రెండ్రోజుల కిందట మోసగించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మండలంలోని గుర్రాలచెరువు గ్రామానికి చెందిన యువకుడు స్థానిక ప్రైవేట్ ఫైనాన్స్ కార్యాలయం సిబ్బంది నుంచి రూ.60 వేలు తీసుకున్నాడు. తన బంగారం వేరే బ్యాంకులో తాకట్టులో ఉందని.. అడ్వాన్స్గా రూ.60 వేలు ఇస్తే బంగారం విడిపించి తమ వద్ద తాకట్టు పెడతానని నమ్మబలికాడు. అతని ప్రతిపాదనకు ఆమోదించిన ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది తమకు ఓ ఖాతా పెరుగుతుందని.. టార్గెట్కు పనికివస్తుందని భావించి అడిగినంత డబ్బులిచ్చారు. యువకుడు బంగారంతో బ్యాంకుకు రాలేదు. నగదు లెక్క చూపకుండా కార్యాలయాన్ని మూయలేరు. ఏదోలా ఆ రాత్రికి కార్యాలయాన్ని మూసేసి ఇంటికెళ్లిన సిబ్బంది రెండో రోజు అతని కోసం వేచి చూసినా ఫలితం శూన్యం. అతని అడ్రస్ వాకబు చేసి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను ఆశ్రయించారు. జరిగిన కథంతా చెప్పగా.. ‘మా వాడు క్రికెట్ బెట్టింగ్కు అలవాటు పడ్డాడు. మీరిచ్చిన డబ్బులు మొత్తం కాజేసి ఉంటాడు. అయినా బంగారం ఇవ్వకుండా డబ్బులెలా ఇచ్చారు’ అని ప్రశ్నించారు. తెల్లమొహం వేసిన ఫైనాన్స్ సిబ్బంది ఏం చేయాలో తెలియక.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఉన్న ప్రైవేటు ఉద్యోగం కాస్తా పోతుందని గుట్టుచప్పుడు కాకుండా ఉన్నట్లు సమాచారం. ఈజీ మనీకి క్రికెట్ బెట్టింగ్లకు బానిసైన యువకుడు మోసాలకు కూడా పాల్పడుతూ చిరుద్యోగులను మోసం చేశాడు. ఫైనాన్స్ ఉద్యోగులకు యువకుడి టోకరా? -
సాగని సీతమ్మ సాగర్
ఏడాది కాలంగా నిర్మాణ పనులకు బ్రేక్ ● పర్యావరణ అనుమతులపై అభ్యంతరాలు ● గతేడాది రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసుల జారీ ● అనుమతులు వస్తేనే పనులు ముందుకుసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కేంద్ర పర్యావరణ శాఖ లేవనెత్తిన అభ్యంతరాల కారణంగా ఏడాది కాలంగా సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కేంద్రంతో చర్చించి అవసరమైన అనుమతులు సాధించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎన్జీటీ విచారణ అశ్వాపురం మండలంలో నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ నిర్మాణ పనుల కారణంగా తాము నష్టపోతున్నామని, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి సరైన అనుమతులు తీసుకోకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారంటూ ప్రాజెక్టు నిర్వాసితులు ఆందోళన చెందారు. దీంతో వారు ముందుగా హై కోర్టును, ఆ తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్టీజీ)ను ఆశ్రయించారు. నిర్వాసితులు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన ఎన్జీటీ నిర్మాణ పనులను వెంటనే ఆపేయాలంటూ 2023, మే 29న ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి నివేదిక ఇవ్వాలంటూ ద్విసభ్య కమిటీని నియమించింది. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఎన్జీటీ ఆదేశాలతో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్లో రీజినల్ డైరెక్టర్ (హైదరాబాద్), గోదావరి నదీ జలాల నిర్వహణ బోర్డులో ఎస్ఈ ర్యాంక్కు తక్కువకాని ఇద్దరు అధికారులతో కూడిన కమిటీ జూన్లో క్షేత్రస్థాయిలో పర్యటించింది. నిర్వాసితులతో మాట్లాడి, రికార్డులు పరిశీలించింది. చివరకు 2023, జూలై 15న కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా కేంద్ర పర్యావరణ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖకు 2023, సెప్టెంబరు 23న నోటీసులు జారీ అయ్యాయి. అందులో కేంద్ర పర్యావరణ శాఖ నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ (ఈసీ) రాకుండా నిర్మాణ పనులు ఎందుకు చేపట్టారో తెలపాలంటూ కోరింది. అంతర్రాష్ట్ర వివాదాలు తలెత్తే అవకాశమున్న ఈ ప్రాజెక్టు విషయంలో ఈసీ కియరెన్స్ లేకుండా 35 శాతం వరకు నిర్మాణ పనులు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగిన పనులు గత ప్రభుత్వ హయాంలో ఓవైపు నిర్మాణ పనులు చేపడుతూనే మరోవైపు కేంద్రం నుంచి ఈసీ అనుమతుల కోసం ప్రయత్నాలు జరిగాయి. 2023 జూన్ నాటికి సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణ పనులు సగానికి పైగా పూర్తి చేయాలనే లక్ష్యంతో భారీ ఎత్తున యంత్రసామగ్రి, వర్క్ఫోర్స్ను నిర్మాణ స్థలికి తరలించారు. ఇరిగేషన్ అధికారులు సమర్పించిన డీపీఆర్కు పదేపదే కేంద్రం కొర్రీలు వేయడంతో అనుమతులు రాలేదు. ఈ అంశంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో 2023, మే 29 నుంచి పనులు ఆపేశారు. నిర్మాణ స్థలం నుంచి భారీ యంత్రాలను తరలించారు. కార్మికుల కోసం ఏర్పాటు చేసి గుడారాలు ఖాళీ చేశారు. ఏడాది కాలంగా నిర్మాణ ప్రదేశంలో అటున్న ఇటుక తీసి ఇటు పెట్టలేదు. సీతారామ పూర్తయితే.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలోని 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 320 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా బహుళార్థ సాధక ప్రాజెక్టుగా సీతారామ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా అశ్వాపురం – దుమ్ముగూడెం మండలాల మధ్యన గోదావరి నదిపై సీతమ్మ సాగర్ పేరుతో బ్యారేజీ నిర్మిస్తోంది. ఎప్పుడు మొదలయ్యేనో.. సీతమ్మసాగర్ బ్యారేజీ పనులపై 2023, సెప్టెంబరు 23న రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు అందాయి. అప్పటికే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఆ తర్వాత నవంబరులో నోటిఫికేషన్ జారీ, డిసెంబరులో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖల ఫోకస్ అంతా మేడిగడ్డ బ్యారేజీలో తలెత్తిన లోపాలపైనే కేంద్రీకృతమయ్యాయి. ఈలోగా 2024, మార్చి 16న పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో మరోసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫలితంగా సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన అనుమతుల విషయంలో జాప్యం నెలకొంటోంది. మరోవైపు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి కాలువల నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. పంప్ హౌస్ల నిర్మాణం పూర్తయి రెండేళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం సీతమ్మ సాగర్కు నిర్మాణ అనుమతులు సాధించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
ఆస్పత్రులకు నిరంతరం విద్యుత్
మణుగూరు రూరల్/భద్రాచలం అర్బన్ : ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని టీజీ ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ భీకంసింగ్ తెలిపారు. శుక్రవారం ఆయన మణుగురు, భద్రాచలం ఏరియా ఆస్పత్రులు, విద్యుత్ సబ్ స్టేషన్లను సందర్శించారు. ప్రభుత్వాస్పత్రుల్లో విద్యుత్ సరఫరాలో అవాంతరాలు, ట్రాన్స్ఫార్మర్, జనరేటర్లను పరిశీలించారు. వైద్యాధికారులను అడిగి విద్యుత్ సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ మణుగూరు ఆస్పత్రిలో మరో నూతన ట్రాన్స్ఫార్మర్, జనరేటర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ట్రాన్స్ఫార్మర్ను అప్గ్రేడ్ చేసుకోవాలని, 250 కేవీ జనరేటర్ను ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండదని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రికి ఇప్పటికే 11 కేవీ లైన్ నుంచి విద్యుత్ సరఫరా అవుతోందని, అదనంగా మరో 11 కేవీ లైన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. విధులు నిర్వహించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమాల్లో భద్రాచలం విద్యుత్ శాఖ ఏడీఈ వేణు, ఏఈ రాజారావు, ఎఫ్ఎం రాఘవేంద్రరావు, లైన్ ఇన్స్పెక్టర్లు సర్వేశ్వరరావు, త్రినాథ్ రెడ్డి,యుగంధర్, ఆస్పత్రుల సూపరింటెండెంట్లు సునీల, రామకృష్ణ పాల్గొన్నారు. -
కాంగ్రెస్వి మోసపూరిత వాగ్దానాలు
చుంచుపల్లి: అమలుకు సాధ్యం కానీ మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేడు అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం కొత్తగూడెంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆరు దశాబ్దాలుగా తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు చేసి, నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా 1,200 మందికి పైగా ప్రాణత్యాగాలు చేసి కేసీఆర్కు పాలన అప్పగిస్తే పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని స్కామ్లమయంగా మార్చారని విమర్శించారు. ఆ తర్వాత టక్కు టమార మాటలు, హామీలతో రేవంత్రెడ్డి అమలకు నోచుకోని వాగ్దానాలు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో ప్రజలు అధికారం ఇచ్చారని, 420 హామీలు, ఆరు గ్యారెంటీలు, యూత్ డిక్లరేషన్, యువతకు రూ.4 వేల ఉద్యోగ భృతి వంటివి పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. రైతాంగానికి అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడం లేదని, నేడు ధాన్యం కొనుగోలు విషయంలో అనేక షరతులు పెట్టి రైతులను ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలిపారు. దేశంలో నరేంద్ర మోదీ ప్రజలకు సుస్థిరపాలన అందిస్తున్నారని, బీజేపీలో కిందిస్థాయి నుంచి కార్యకర్తగా పనిచేస్తూ అనేక ఉద్యమాల్లో ముందుడి స్ఫూర్తిగా నిలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని పట్టభద్రులు, మేధావులు, ఉద్యోగులు ఆశీర్వదించాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు రంగాకిరణ్, కరగంచి రమేశ్, నంబూరి రామలింగేశ్వరరావు, గోంగూర వెంకటేశ్వర్లు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి -
‘కాంగ్రెస్ నేతల దౌర్జన్యంతోనే ఆత్మహత్యాయత్నం’
కరకగూడెం: ఉపాధి హామీ పథకంలో మేట్ బూరా రజిని ఆత్మహత్యాయత్నానికి పినపాక మండలంఏడూళ్ల బయ్యారానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకు డు, ఓ విలేకరే కారణమని ఆమె భర్త రమేశ్, బీఆర్ఎస్ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీశ్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడూళ్ల బయ్యారం గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులను అడ్డుకుంటున్న కాంగ్రెస్ నాయకులు, ఈ నెల 21న మండల పరిషత్ కార్యాలయంలో అధికారుల ముందే మేట్ రజినిపై దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు. దీంతో మనస్తాపానికి గురైన రజిని రెండు రోజుల కిందట పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలిపారు. సమయానికి స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యాన విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆత్మ చైర్మన్ భద్రయ్య, సొసైటీ చైర్మన్ రవి శేఖర్వర్మ, ఎంపీటీసీ జహంగీర్, నాయకులు భవానీశంకర్, కొండేరు రాము, దొడ్డ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జాగ్రత్తలు తీసుకోవాలి
భద్రాచలంటౌన్: ఆదివాసీ గిరిజన గ్రామాల్లో వర్షాకాలంలో ఆరోగ్యంపట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్య ఆరోగ్య శాఖ, వైద్య సిబ్బంది సూచనలు పాటించాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన పాఠశాలలు, వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జూన్ 15 నుంచి సమస్యాత్మక గ్రామాల్లో దోమల మందు పిచికారీ చేయిస్తామని, గత మూడేళ్ల డేటా ఆధారంగా మలేరియా, డెంగీ జ్వరాలు వచ్చే గ్రామాలను గుర్తించి ముందస్తు వైద్య శిబిరాలు నిర్వహించాలని వివరించారు. వలస గొత్తికోయ గ్రామాల్లో వైద్య సేవలందించాలని తెలిపారు. రక్తం తక్కువగా ఉన్న గర్భిణులకు ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వాలని, ఐదేళ్లలోపు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలను క్రమం తప్పకుండా ఇప్పించాలని కోరారు. -
● నడ(ర)క యాతన
బండరాళ్ల మధ్య వాగు దాటుతున్న ప్రజలుములకలపల్లి మండలం ముత్యాలంపాడు శివారు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి గాను లో లెవల్ చప్టాను పూర్తిగా తొలగించి డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేశారు. అయితే, గురువారం రాత్రి కురిపిన భారీ వర్షానికి డైవర్షన్ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోగా, రాత్రి నుండి ముత్యాలంపాడు, రాచన్నగూడెం జీపీలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మారుమూల ఆదివాసీ గ్రామాలకు బయటి గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి, అయితే, శుక్రవారం అత్యవసర పనులపై వచ్చిన ప్రజలు వాగు దాటేందుకు అష్టకష్టాలు ఎదుర్కొన్నారు. ద్విచక్ర వాహనాల మాటేమో కానీ నడిచే మార్గం కూడా సరిగ్గా లేక వాగు నీళ్లలో, ఒడ్డున ఉన్న బండరాళ్ల మధ్య తిప్పలు పడుతూ వాగు దాటారు. డైవర్షన్ రోడ్డును తాత్కాలికంగా మరమ్మతు చేసేందుకు మట్టి తెప్పించినా రాత్రి వరకు రహదారి సౌకర్యం అందుబాటులోకి రాలేదు, – ములకలపల్లి -
స్వర్ణకవచధారణలో రామయ్య
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని అంతరాలయంలో శుక్రవారం మూలమూర్తులు స్వర్ణ కవచధారులై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అదేవిధంగా శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు గావించారు. నృసింహుని రథోత్సవం రామాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో తిరుకల్యాణోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రథోత్సవం కమనీయంగా జరిపారు.పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఆలయ ఈఓ సుదర్శన్, అర్చకులు భక్తులు పాల్గొన్నారు. ప్రశాంతంగా పాలిసెట్ సింగరేణి(కొత్తగూడెం): జిల్లాలో శుక్రవారం నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. ఆరు కేంద్రాల్లో 1,755 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 1,601 మంది హారయ్యారు. 154 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పరీక్షల కన్వీనర్ బి.నాగముని నాయక్ పర్యవేక్షించారు. అభ్యర్థులను పరీక్ష సమాయానికి గంట ముందే హాల్లోకి అనుమతించినట్లు కన్వీనర్ తెలిపారు. పనుల్లో వేగం పెంచాలిజెన్కో సీఎండీ ముర్తుజా అలీ మణుగూరు టౌన్: బీటీపీఎస్లో బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల్లో వేగం పెంచాలని జెన్కో సీఎండీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ ఆదేశించారు. శుక్రవారం ఆయన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. ప్లాంట్ సీఈ బిచ్చన్నతో కలిసి విద్యుదుత్పత్తి, యూనిట్ల పనితీరును పరిశీలించారు. అనంతరం ప్లాంట్ పనుల తీరుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పెండింగ్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్ పనులు చివరి దశకు చేరడంతో మిగిలిన పనుల వివరాలు అడిగి తెలుసుకుని వెంటనే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డైరెక్టర్లు అజయ్, సచ్చిదానందం, బీహెచ్ఈఎల్ జీఎం అజిత్ వర్మ, ఇంజనీర్లు, ఏజీఎం పాల్గొన్నారు. బీటీపీఎస్లో కార్మికుడికి గాయాలు బీటీపీఎస్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ కార్మికుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తొలుత కొత్తగూడెం, అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బొగ్గు కన్వేయర్ బెల్ట్ వద్ద పనిచేస్తున్న షేర్ జైపాల్కు తెల్లవారుజామున 3 గంటలకు చేయికి తీవ్ర గాయమైంది. దీంతో కార్మికుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
బీటీపీఎస్ టిప్పర్ డ్రైవర్ల నిరసన
మణుగూరుటౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా నుంచి బీటీపీఎస్కు బొగ్గు రవాణా చేస్తున్న డ్రైవర్లు.. వేతనాలు, ట్రిప్ మామూళ్లు పెంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బొగ్గు రవాణాను నిలిపివేశారు. ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ.. 24 గంటల నిరంతర బొగ్గు రవాణాతో ప్రతి రోజూ 16 వేల టన్నులు మణుగూరు నుంచి బీటీపీఎస్కు 130 టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. ఈ క్రమంలో బండికి ఇద్దరు డ్రైవర్లు ఉండగా, 24 గంటలు పనిచేస్తే రూ.వెయ్యితో పాటు ట్రిప్పుకు రూ.125 చొప్పున మామూళ్లు ఇస్తున్నారు. కాగా నెలకు రూ.18 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదని, రూ.1200 వేతనంతో పాటు 250 ట్రిప్పు మామూళ్లు ఇవ్వాలని నిరసన వ్యక్తం చేస్తూ బొగ్గు రవాణా 6 గంటలకు పైగా నిలిపివేయగా, లారీ ఓనర్లు సంప్రదింపులు జరిపి రూ.1200 వేతనంతో పాటు ట్రిప్పు మామూళ్లు రూ.160 ఇచ్చే విధంగా అంగీకరించారు. ప్రతిపాదనకు అంగీకరించిన డ్రైవర్లు బొగ్గు రవాణాను పునరుద్ధరించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
- ఐదు రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- అదిరిపోయే ఫీచర్లతో.. త్వరలో విడుదల కానున్న మరో రెడ్మీ సిరీస్ ఫోన్
- IPL 2024: ఓ పక్క స్టార్క్.. మరోపక్క అయ్యర్..!
- పోక్సో కేసు.. కర్నూలు కోర్టు సంచలన తీర్పు
- హై రిటర్న్స్ కోసం ఆశపడితే మీకూ ఇదే జరగొచ్చు..!
- శ్రీదేవికి ఇష్టమైన ఆలయంలో జాన్వీ కపూర్.. ఫోటోలు వైరల్!
- ఈవీఎం ట్యాంపర్ అయిందా? లేదా?.. చెక్ లిస్ట్తో చూసుకోండిలా..
- టార్గెట్ పిన్నెల్లి
- ముగిసిన ఖమ్మం-వరంగల్-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్
Advertisement