కామారెడ్డి క్రైం: జిల్లాలో రెండు రోజుల పాటు కొనసాగిన హోం ఓటింగ్ ఆదివారం ముగిసింది. 85 ఏళ్ల పైబడిన వృద్ధులతోపాటు దివ్యాంగులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటివద్దే వినియోగించుకున్నారు. ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారి, మైక్రో అబ్జర్వర్, పోలీస్ కానిస్టేబుల్తో కూడిన బృందం ఓటర్ల ఇంటికి వెళ్లి గోప్యంగా ఓటు నమోదు చేయించారు. కార్యక్రమాన్ని వీడియోగ్రఫీ చేయించినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్..
ఎన్నికల విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, పోలీసు అధికారులు పలువురు ఆదివారం రెండో రోజు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాకు చెందిన 4,546 మంది ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, పోలీస్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు. వీరికోసం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంతోపాటు మద్నూరు, ఎల్లారెడ్డి తహసీల్ కార్యాలయాల్లో ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. శని, ఆదివారాలలో పీవోలు, ఏపీవోలు, పోలీసు అధికారులు ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఇతర పోలింగ్ సిబ్బంది సోమ, మంగళ వారాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.