పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో సోమవారం బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈమేరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్కు మద్దతుగా ప్రచారం చేసేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారు. సభా ఏర్పాట్లు తదితర కార్యక్రమాలను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్కుమార్, రాష్ట్ర నాయకులు చిలారపు పర్వతాలు, గొట్టిముక్కుల సురేశ్రెడ్డి, పోచయ్య తదితరులు ఆదివారం పర్యవేక్షించారు.
ఓటు వేసిన పోలీసు అధికారులు
జ్యోతినగర్(రామగుండం): పోలీసు అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో గోదావరిఖని ఏసీపీ రమేశ్, రామగుండం సీఐ అజయ్బాబు, ఎస్సైలు ఉదయ్కిరణ్, సతీశ్, వెంకటస్వామి ఆదివారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ రమేశ్ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బంది అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు.
బీఆర్ఎస్తోనే మెరుగైన పాలన
జ్యోతినగర్(రామగుండం): బీఆర్ఎస్తోనే మెరుగైన ప్రజాపాలన సాధ్యమని, మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ రెండో డివిజన్ ఇందిరమ్మకాలనీ, న్యూపీకేరామయ్య కాలనీ, సిక్కువాడలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యేందుకు పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని ఆయన అన్నారు. ఇందుకోసం కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, కార్పొరేటర్ ఎన్వీ రమణారెడ్డి, నాయకులు రాంమోహన్రావు, నారాయణదాసు మారుతి తదితరులు పాల్గొన్నారు.
చాలీసా పారాయణం
రామగుండం: పట్టణంలోని శ్రీభక్తాంజనేయస్వామి దేవాలయంలో ఆదివారం హనుమాన్ మాలాధారణ చేసిన స్వాములు చాలీసా పారాయం గావించారు. పట్టణానికి చెందిన కౌశిక వెంకటరమణ–విజయ దంపతులు దీక్షాపరులకు అన్నదానం చేశారు. రాబోయే హనుమాన్ పెద్ద జయంతి వరకు మాలాధారణ స్వాములకు రోజుకొకరు దాతలు అన్నదానం చేస్తుండడంపై హర్షం వ్యక్తమవుతోంది.
ప్యాక్స్ ఉద్యోగుల జిల్లా కార్యవర్గం
సుల్తానాబాద్రూరల్: ప్రాథమిక సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా కెశెట్టి విక్రమ్(ఎలిగేడ్)ను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా దాసరి ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా సురేశ్, గౌరవ అధ్యక్షుడిగా గొళి అంజిరెడ్డి, క్యాషియర్గా శ్రీనివాస్, ముఖ్య సలహాదారుగా మదన్మోహన్, రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితుడిగా వల్లకొండ రమేశ్, ప్రచార కార్యదర్శిగా ప్రభంజన్, డైరెక్టర్లుగా ఏపీ రాజు, కల్వల కిరణ్, రమణ, అశోక్, శంకర్ ఎన్నికయ్యారు. అనంతరం రాష్ట్ర యూనియన్ అధ్యక్షుడు బొంగొని శంకర్గౌడ్ నూతన కమిటీని సన్మానించి అభినందించారు.