కోవూరు: ఎన్నికల్లో విజయమే పరమావధిగా టీడీపీ నెల్లూరు లోక్సభ, కోవూరు అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు డబ్బులను ఏరులై పారిస్తున్నారు. తాజాగా బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని వీఓఏలకు వీరు గాలం వేశారు. కనుపర్తిపాడులోని వీపీఆర్ ఫంక్షన్ హాల్కు వీఓఏలను ఏపీఎం లలిత ఆదివారం తెల్లవారుజామున 4.30కు తీసుకెళ్లారు. అక్కడ వీఓఏలకు రూ.25 వేల చొప్పున అందజేశారని సమాచారం. ఈ ప్రక్రియకు సహకరించిన ఏపీఎం లలితకు భారీగా ముట్టజెప్పారని తెలుస్తోంది. కాగా ఇలాంటి వారిని విధుల నుంచి వెంటనే తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
పటిష్ట భద్రత
ఏర్పాట్లు చేయాలి
నెల్లూరు(క్రైమ్): సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశించారు. నగరంలోని డీకేడబ్ల్యూ, వీఆర్ కళాశాలల్లోని పోలింగ్, ఫెసిలిటేషన్ కేంద్రాలను ఆదివారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. పోలింగ్ రోజున కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఓటర్లు మినహా ఇతరులెవరూ ఉండకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ముందస్తు భద్రత చర్యలు చేపట్టామని వివరించారు. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వీరిపై సీ విజిల్ యాప్, టోల్ ఫ్రీ నంబర్ 112 లేదా స్థానిక పోలీస్స్టేషన్లకు సమాచారం అందించాలని కోరారు. ఎస్బీ, చిన్నబజార్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణారెడ్డి, అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత ఓపీ
సేవలందించాలి
నెల్లూరు(అర్బన్): ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ప్రైవేట్ వైద్యశాలల్లో సైతం పేదలకు 20 శాతం ఉచిత ఓపీ వైద్యసేవలందించాలని డీఎంహెచ్ఓ పెంచలయ్య సూచించారు. నగరంలోని మినీబైపాస్ రోడ్డులో శారదా హాస్పిటల్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఆస్పత్రి డాక్టర్లు సుప్రజ, విజయలక్ష్మి, నిరుపమ, రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, చిన్నపిల్లల చీఫ్ కార్డియాలజిస్ట్ నాగేశ్వరరావు, ఐఎంఏ రాష్ట్ర నేత అశోక్, వైద్యులు గోవిందు, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.