సాక్షి, పుట్టపర్తి
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాకతో శనివారం హిందూపురం మురిసి పోయింది. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరాగా పట్టణం కిక్కిరిసింది. బస్టాండు వద్ద నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు వీధులన్నీ జనంతో పోటెత్తాయి. అభిమానుల సందడితో ‘పురం’లో విజయోత్సాహం కనిపించింది.
దారి పొడవునా అపూర్వ స్వాగతం..
పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి విమానాశ్రయం నుంచి సీఎం వైఎస్ జగన్ హెలికాప్టర్లో బయలుదేరి స్థానిక ఎంజీఎం క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడ వైఎస్సార్ సీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎంజీఎం మైదానం నుంచి బస్సులో బయలుదేరిన వైఎస్ జగన్కు అభిమానులు దారిపొడవునా అపూర్వ స్వాగతం పలికారు. ఎండను సైతం లెక్కచేయకుండా రోడ్డుపైనే నిలబడి ‘జై జగన్’ అంటూ నినదించారు. కొందరు మహిళలు దూరం నుంచే సీఎం ప్రయాణించే బస్సుకు గుమ్మడికాయలతో దిష్టితీశారు. అప్పటికే అంబేడ్కర్ సర్కిల్ నుంచి మేళాపురం సర్కిల్ వరకు.. మరోవైపు పరిగి బస్టాండ్ వరకు ఇసుకేస్తే రాలనంత జనంతో రహదారులన్నీ నిండిపోయాయి. సీఎం జగన్ స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్దకు చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ‘జై జగన్.. జై జై జగన్’ అంటూ నినదించారు. మధ్యాహ్నం 12 గంటల వేళ ఎర్రటి ఎండలోనూ కట్టుకదలకుండా సీఎం ప్రసంగం విని తమ సంకల్పం ఎంత గొప్పదో చాటారు. సీఎం ప్రసంగం ఆద్యంతం ఈలలు వేస్తూ మద్దతు తెలిపారు. జగన్ ఫ్యాన్ చూపించగానే ‘ఫ్యాన్స్’ ఆనందంతో చిందులు వేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ సభలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కేవీ ఉషశ్రీచరణ్, రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్నిశ్చల్, హిందూపురం పార్లమెంటు అభ్యర్థి జె.శాంత, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి టీఎన్ దీపిక, మడకశిర అభ్యర్థి ఈరలక్కప్ప, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ఘని, హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, వైస్ చైర్మన్లు బలరామిరెడ్డి, జబీవుల్లా, నాయకులు కొండూరు వేణుగోపాల్రెడ్డి, గుడ్డంపల్లి వేణురెడ్డి, మధుమతిరెడ్డి, కొటిపి హనుమంతరెడ్డి, జనార్దన్రెడ్డి, ఆనంద్రెడ్డి, శ్రీరామిరెడ్డి, పట్టణ, మండల కన్వీనర్లు మన్సూర్, రాము, నారాయణస్వామి, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
విమానాశ్రయంలోనూ
ఘన స్వాగతం..
అంతకుముందు పుట్టపర్తి విమానాశ్రయంలో మంత్రి పెద్దిరెడ్డి, శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి తదితరులు సీఎం జగన్కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
సీఎం పర్యటన సాగిందిలా..
ఉదయం 10.50 గంటలు: సీఎం వైఎస్ జగన్ పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి విమానాశ్రయం చేరుకున్నారు.
11 గంటలు : పుట్టపర్తి నుంచి హెలికాప్టర్లో హిందూపురం బయలుదేరారు.
11.25 గంటలు : హిందూపురంలోని ఎంజీఎం మైదానంలో హెలిప్యాడ్కు చేరుకున్నారు.
12 గంటలు : అంబేడ్కర్ సర్కిల్లో బహిరంగ సభ వద్దకు వచ్చారు
12.10 గంటలు : అశేష జనవాహినిని ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగం ప్రారంభించారు.
12.50 గంటలు : ప్రసంగం ముగించారు.
1.25 గంటలు : ఎంజీఎం మైదానం నుంచి హెలికాప్టర్లో పలమనేరు బయలుదేరి వెళ్లారు.