శ్రీకాకుళం పాతబస్టాండ్:
జిల్లాలో శనివారం నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7వ తేదీ వరకు ఉండగా, తొలిరోజు ఎన్నికల విధుల్లో ఉన్న పోలింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులు తదితరులు బ్యాలెట్ ఓట్లు వేశారు. పోలింగ్ విధుల్లో ఉన్న ఉద్యోగులు జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లోనూ, ఆయా నిర్దేశిత కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలను శనివారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్, జేసీ ఎం.నవీన్, ఇతర అధికారులు, రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా తొలిరోజు 7004 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 643, పలాసలో 756, టెక్కలిలో 862, పాతపట్నంలో 760, శ్రీకాకుళంలో 1582, ఆమదాలవలసలో 988, ఎచ్చెర్లలో 630, నరసన్నపేటలో 783 ఓట్లు పడ్డాయి.